three mps missed ap bjp state leaders meeting

బీజేపీ కీలక భేటీకి ముగ్గురు ఎంపీల డుమ్మా.. జీవీఎల్ తో విభేదాలే కారణమా?

ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుని స్ధానిక సంస్ధల ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న బీజేపీకి స్వయానా ఆ పార్టీ నేతలే షాకిచ్చారు. విజయవాడలో జరుగుతున్న బీజీపీ పదాధికారుల భేటీకి టీడీపీ నుంచి కాషాయ పార్టీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ డుమ్మా కొట్టారు. కేంద్ర బడ్జెట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోముందుగా పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్వయానా పార్టీ ఎంపీలే రాకపోవడం కాషాయదళంలో చర్చనీయాంశమవుతోంది. ఏపీ బీజేపీలో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. కేంద్ర బడ్జెట్ పై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి ఏకంగా పార్టీ ఎంపీలే డుమ్మా కొట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ తో పాటు సీనియర్ నేత పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ మాత్రం హాజరు కాలేదు. వీరు వస్తారో రారో కూడా సమాచారం లేదు. దీంతో ఈ సదస్సుకు హాజరైన బీజేపీ నేతలంతా వీరిపై చర్చించుకోవడం కనిపించింది. కేంద్ర బడ్జెట్ పై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు ముందుగా పార్టీ నేతలకు అవగాహన తప్పనిసరి. ఎంపీలకు అవగాహన ఉంటేనే వారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజలకు బడ్జెట్ లో సానుకూలతలను వివరించే అవకాశం ఉంటుంది. అలాంటిది పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎంపీలే తేలిగ్గా తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పదాధికారుల సదస్సుకు ముగ్గురు బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వర్గంతో ఉన్న విభేదాలు ఇందుకు ప్రధాన కారణం. కన్నా నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న సుజనా వర్గం కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంతో పాటు గతంలో ఆంగ్ల మాధ్యమం అమలు వంటి కీలక విషయాల్లో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో పాటు జనసేనతో పొత్తు తర్వాత పార్టీలో మారిన ప్రాధామ్యాలు, ఇతర అంశాలు కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకూ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతలకూ మధ్య దూరాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుతో ఉన్న విభేదాల వల్లే ముగ్గురు ఎంపీలు ఈ సదస్సుకు రాలేదని కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో పలు విషయాల్లో జీవీఎల్ తో ఈ ముగ్గురు ఎంపీలు విభేధించారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి పార్ట నేతలకు అవగాహన కల్పించేందుకు జీవీఎల్ ఏర్పాటు చేయించిన ఈ సదస్సుకు తాము వెళ్లడం అవసరమా అనే భావనతో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.

internal clash between guntur district ycp leaders

వైసీపీ ఎంపీ-ఎమ్మెల్యే మధ్య వర్గపోరు.. పబ్లిక్ లో ఫైట్.. ఒకరికి గాయాలు!

రాజకీయాలలో సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఈ తరం రాజకీయ నాయకులు.. భుజాన వేసుకొని మరింత ముందుకి తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యర్థుల మీద విమర్శలు, ఎప్పుడూ సొంత పార్టీ వారితో వర్గపోరుతో.. రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.  తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చిలకలూరిలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర వారు ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు ఎంపీ కృష్ణదేవరాయలు వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయులను విడదల ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక వ్యక్తికి తలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు అతి కష్టంమీద ఇరువర్గాలకు సర్ది చెప్పి.. దాదాపు గంటసేపు కష్టపడి.. ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా మర్రి రాజశేఖర్‌ను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే రజినీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సాగుతోంది. 

AP CM YS Jagan Inspects Veligonda Project Works

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం జగన్ పరిశీలించారు. గురువారం ఉదయం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌కు.. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వెలుగొండ నుంచి ఖరీఫ్ పంటలకు సాగునీరు అందిస్తామని జగన్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. మొదటి  టన్నెల్ పనులు ప్రారంభించి 15 సంవత్సరాలైంది. ఇప్పటికి 17 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 1.11 కిలోమీటర్ల తవ్వకాలు జరపాల్సి ఉంది. రెండవ టన్నెల్ పనులు 10.6 కిలో మీటర్ లు తవ్వకాలు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది కిలోమీటర్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తే ఈ యేడాదిలోగా వెలుగొండ ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీరు అందుతాయని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికీ సీఎం జగన్ పర్యటనతోనైనా వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగం అందుకుంటాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.

Nirbhaya convict Vinay Sharma attempts Suicide

తీహార్ జైలులో కలకలం.. నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

నిర్బయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నిర్భయ దోషి వినయ్ శర్మ.. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్‌ శర్మ గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు కూడా సమాచారం మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో వినయ్‌ శర్మ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఉరిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది కూడా.. వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఉరిని తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలైన ఆడేలా ఉన్నారు. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఉరి.. మార్చి 3న అయినా వారి మెడకి పడుతుందేమో చూడాలి.

modi govt to take key decision on ppas

ఓ కీలక చట్టాన్ని సవరించనున్న కేంద్రం.. జగన్ నిర్ణయమే కారణమా?

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక చట్టాన్ని సవరించనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ప్రాజెక్టు వ్యయం తాలూకు సొమ్మును రికవరీ చేసేలా, అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసేలా ఇంధన చట్టాన్ని సవరించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యుదుత్పత్తి సంస్థలు కానీ పీపీఏలను ఉల్లంఘిస్తే వాటిని విచారించేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల నుంచి గత ప్రభుత్వం అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ వాటితో కుదుర్చుకున్న పీపీఎలను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. తమ పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న ఆందోళనతో ఆయా సంస్థలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. తమ తమ దేశాల ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో కేంద్రం ఇరకాటంలో పడింది. పీపీఏల పునస్సమీక్షకు వెళ్లొద్దని జగన్ ప్రభుత్వానికి సూచించింది కూడా. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ పలుసార్లు లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు.  జాతీయ స్థాయిలో 2003 ఇంధన చట్టం అమలవుతుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టంతో పెట్టుబడిదారులకు సంపూర్ణ రక్షణ లభించటం లేదని మోదీ ప్రభుత్వం భావించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఈ చట్టాన్ని సవరించి ప్రత్యేకంగా సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంపూర్ణ భద్రత కల్పించేలా ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కొద్ది రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ విద్యుదుత్పత్తి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలూ ఒక్కసారి ఒప్పందం చేసుకున్నాక వాటిని తూచ తప్పకుండా అమలు చేయాల్సిందేనని లేదంటే ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు ట్రైబ్యునల్ రంగ ప్రవేశం చేస్తుందని ప్రాజెక్టుకైనా వ్యయం రికవరీకి రాష్ట్రాలనూ ఆదేశిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ట్రైబ్యునల్ కు కట్టబెడుతూ బిల్లు ముసాయిదా ఇప్పటికే సిద్దమైందని త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Nritya Gopal Das named chairman of Ram Janmabhoomi Trust

'రామ జన్మభూమి ట్రస్ట్' చైర్మన్ గా 'నృత్య గోపాల్ దాస్'

అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం దిశగా అడుగులు చకచకా పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో అయోధ్య రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడిగా మహంత నృత్య గోపాల్ దాస్ ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్, కోశాధికారిగా గోవింద్ గిరి నియమితులయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా రామాలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతోందన్నారు ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన మోడల్ లో టెంపుల్ ఎత్తు వెడల్పులో పెరుగుదల ఉంటుందంటున్నారు.  ఆలయ నిర్మాణంలో విరాళాల కోసం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించటానికి సమావేశంలో నిర్ణయం తీసుకుంది ట్రస్ట్. రామమందిర నిర్మాణ పనులు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ రెండువ తేదీ శ్రీరామ నవమి రోజున కానీ.. ఏప్రిల్ 26వ తేదీ అక్షయ తృతీయ రోజున గానీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముందని అన్నారు ట్రస్టు సభ్యులు. ఆలయ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసే యోచనలో ఉంది ట్రస్ట్. కాగా 15రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం కానున్న ట్రస్టు సభ్యులు.. ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీని ప్రకటించే అవకాశముంది. అలాగే.. సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వం తరపున అవినాష్ మహంతి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ జా పాల్గొన్నారు.  

Wall Street Journal trashes AP CM YS Jagan over PPAs issue

జగన్ సర్కార్ పై మరో అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం!!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు, ఏపీలో విపక్షం విమర్శలే కాకుండా అంతర్జాతీయ స్థాయి పత్రికల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి జగన్ ప్రభుత్వం విమర్శలపాలైంది. మొన్నటికి మొన్న పోలవరం పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటూ జర్మనీ కంపెనీ ఏపీ ప్రభుత్వం పరువు తీస్తే.. తాజాగా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ జగన్ ప్రభుత్వంపై పునరుత్పాదక ఇంధన శక్తి కంపెనీలు చేసిన ఆరోపణలు కాస్త అంతర్జాతీయ మీడియాకెక్కాయి. వాడుకున్న విద్యుత్ కు ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయంటూ అమెరికాలోని ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వ్యాసం రాసింది. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగంపై కథనం రాసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సందర్భంగా ఇండియాలో తాజా పరిస్థితుల గురించి కూడా చర్చించింది. దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన శక్తిపై సీరియస్ గా దృష్టి సారించిందని సౌర విద్యుత్ విషయంలో పెద్ద కలలు ఉన్నాయని చెప్పింది. 2030 నాటికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పెట్టుకుందని వివరించింది.  అయితే ఈ లక్ష్యాలను సాధించడంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్ లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. సోలార్ విద్యుత్ ను అధికంగా వినియోగించుకోవడంలోనే కాదు కంపెనీలకు బకాయిలు చెల్లించే విషయంలోనూ అగ్ర స్థానంలో ఏపీ ఉందంటూ పరువు తీసింది. ఏపీ విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ బిల్లులను సరిగ్గా చెల్లించకుండా వేధిస్తున్నాయని రాసుకొచ్చింది. తక్కువ ధరకు సరఫరా చేయకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తావించింది. ఇప్పటికే పీపీఏలు రివర్స్ టెండరింగ్ నిర్ణయాలపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలన్న నిర్ణయంపై అటు భారత ప్రభుత్వం కూడా ఏపీని తప్పుపట్టింది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని కేంద్ర పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒకటి రెండు సార్లు కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

Air Asia to withdraw its services from Visakhapatnam

రాజధాని రాక ముందే విశాఖకు ఝలక్.. ఎయిర్ సర్వీసులు రద్దు చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ప్రజా జీవనంతో పాటు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత నెలకొన్న అనిశ్చితి కారణంగా కీలకమైన పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలతో పాటు పౌర విమానయానం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ సహా దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పుడు పాలన రాజధానిగా ప్రభుత్వం చెప్పుకుంటున్న విశాఖ నుంచి కూడా తమ సర్వీసులను ఉపసంహరించుకునేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో ఎక్కువ మంది ప్రయాణికులు కలిగిన విమానాశ్రయంగా విశాఖ ఎయిర్ పోర్టుకు పేరుంది. పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఇక్కడి నుంచి నిత్యం దేశ, విదేశాలకు సర్వీసులు నడుపుతుంటాయి. రాష్ట్రంలో ఉన్నంతలో రద్దీ విమానాశ్రయంగా చెప్పుకునే విశాఖ ఎయిర్ పోర్టుపైనా తాజా పరిస్ధితుల ప్రబావం పడింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. అమరావతి నుంచి పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినా అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు నడుపుతున్న పలు ప్రైవేటు విమానయాన సంస్ధలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నిత్యం కోల్ కతాకు విమానాలు నడిపే ఎయిర్ ఏషియా సంస్ధ ప్రస్తుతం తాము నడుపుతున్న నాలుగు సర్వీసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అదే కోవలో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా చెన్నై, హైదరాబాద్ సర్వీసులను మార్చి నెల రెండో వారం నుంచి రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. మరో ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ కూడా మార్చి నెలాఖరు నుంచి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే సర్వీసును రద్దు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లే ఇండిగో సర్వీసులకు అనుమతి పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. అమరావతి అభివృద్ధి విషయంలో వైసీపీ సర్కారు వైఖరితో పాటు పారిశ్రామికంగా కూడా పురోగతి లేకపోవడంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేసుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోతుంది కాబట్టి విజయవాడ ఎయిర్ పోర్టుకు ట్రాపిక్ తగ్గడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనూహ్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ తగ్గనుండటం కచ్చితంగా భవిష్యత్తులో పెను ప్రభావం చూపే అంశమే. అసలే ఈ ఏడాది జూన్ నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు ఇప్పటికే భారీ పరిశ్రమలన్నీ రాష్ట్రం దాటి పోతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో విమానయాన సంస్ధలు కూడా తమ సర్వీసులు ఉపసంహరించుకుంటే రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వారి ద్వారా వచ్చే పెట్టుబడుపైనా తీవ్ర ప్రభావం పడనుంది. విమానయాన సంస్ధల నిర్ణయాలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  

Employees warning to mandali chairman

ఏకంగా మండలి ఛైర్మన్‌కే వార్నింగా...? సెలెక్ట్ కమిటీపై జగన్ సర్కార్ గేమ్..!

  ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య సాగుతోన్న పొలిటికల్‌ గేమ్‌లోకి ఇప్పుడు ఉద్యోగులు వచ్చిచేరారు. తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును బాధ్యతల నుంచి తప్పించాలంటూ, గవర్నర్‌కు మండలి ఛైర్మన్‌ ఫిర్యాదు చేసిన తర్వాత తర్వాతి రోజే సచివాలయ ఉద్యోగులు ఎదురుతిరిగారు. మండలి కార్యదర్శికి మద్దతుగా చీఫ్ సెక్రటరీని కలిసిన సచివాలయ ఉద్యోగులు... కౌన్సిల్ ఛైర్మన్ పై భగ్గుమన్నారు. సెలెక్ట్ కమిటీ వివాదంలో మండలి కార్యదర్శి రూల్స్ ప్రకారమే వ్యవహరించారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణమాచార్యులుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టిన ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి..... అసెంబ్లీ ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాదు, నిబంధనల ప్రకారం నడుచుకునే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తాము కూడా గవర్నర్‌‌ను కోరతామన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ షరీఫ్‌.... ఫైల్‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్‌ను తిప్పిపంపుతూ మండలి సెక్రటరీ కలకలం రేపారు. దాంతో, మరోసారి ఫైల్‌‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు ఛైర్మన్‌. అయితే, రెండోసారి కూడా ఫైల్‌ను వెనక్కి పంపడంతో... మండలి కార్యదర్శిపై... కౌన్సిల్ ఛైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తనకున్న రాజ్యాంగ అధికారాలను ప్రశ్నించడమే కాకుండా, తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే, కొత్త కార్యదర్శిగా విజయరాజును నియమించాలంటూ గవర్నర్‌ను కోరారు. దాంతో, సెలెక్ట్ కమిటీ వివాదం సెగ కాస్తా... సచివాలయం ఉద్యోగులను తాకింది.  నిబంధనలు ప్రకారం నడుచుకున్న కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు ఏకంగా మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇచ్చారు. అయితే, దీనంతటి వెనుక జగన్ సర్కారు గేమ్ ఉందనేది టీడీపీ ఆరోపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరించడం సర్వసాధారణమని, కానీ, రాజ్యాంగ పదవిలో ఉన్న  మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇవ్వడం మాత్రం ఎన్నడూ జరగలేదని అంటున్నారు.

Btech Student ganesh Suicide

యూట్యూబ్‌తో బలవన్మరణం... హైదరాబాద్‌లో వింత ఆత్మహత్య

  ఒక్క స్మార్ట్ ఫోన్ తోపాటు ఇంటర్నెట్ ఉంటే చాలు... ప్రపంచం మీ గుప్పిట్లో ఉన్నటే. అంతలా ప్రపంచాన్ని చిన్నది చేసింది స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. అయితే, ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే మంచిదే... కానీ, ఇదే టెక్నాలజీతో కొంతమంది యువత పెడద్రోవ పడుతోంది. లోక కల్యాణానికి వినియోగించాల్సిన టెక్నాలజీని స్వనాశనానికి వాడుతోంది. సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాల్సిన మేథస్సును... విధ్వంసానికి, విశృంఖలత్వానికి ఉపయోగిస్తోంది. ముఖ్యంగా యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం దారుణాలకు దారి తీస్తోంది. మనిషి ప్రాణాలను కాపాడే టెక్నాలజీతోనే తమ ఆయువును తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ బీటెక్ విద్యార్ధి ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరగనుందో తెలుసుకోవాలంటూ బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చాడు. హైదరాబాద్ ఫిలింనగర్‌లో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న తీరు... తల్లిదండ్రులనే కాదు, స్థానికులను, పోలీసులను కూడా నివ్వెరపోయేలా చేసింది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే అలాంటి సంఘటనను ప్రత్యక్షంగా చూసి ఇదేం దారుణమంటూ మాట్లాడుకున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడమే తప్పంటే, బీటెక్ విద్యార్ధి గణేష్ మాత్రం అందరిలా తానెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో ఏమో గానీ, ఎవ్వరూ ఊహించనిరీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి పాలిథిన్ కవర్‌ను చుట్టుకుని, నైట్రోజన్ ఆక్సిజన్‌ సిలిండర్ పైపులను ముక్కులో పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, గణేష్ ఆత్మహత్య చేసుకున్న తీరే విస్తుగొలిపితే, అతను రాసిన సూసైడ్ నోట్ మరింత సంచలనంగా మారింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందని, అందుకే చనిపోతున్నానంటూ అతడు రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఇక, ఆత్మహత్యకు ముందు వారం పది రోజులుగా...  ఎక్కువ బాధ లేకుండా ఈజీగా ఎలా చనిపోవాలో గణేష్‌ యూట్యూబ్‌‌లో విపరీతంగా సెర్చ్‌ చేశాడు. అయితే, ఆత్మహత్యకు పక్కాగా ప్లాన్ వేసుకున్న గణేశ్... అందుకు అవసరమైన సామాన్లను ఒక్కొక్కటికి ఇంటికి తెచ్చుకున్నాడు. ఫిబ్రవరి 14న ఎర్రగడ్డలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి మూడున్నర వేలు వెచ్చించి నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్‌‌... పైపులు... పాలిథిన్ కవర్లు కొనితెచ్చుకున్న గణేష్‌... స్టోర్ రూమ్‌లో దాచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వాటితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్యకు ముందు నేను నా రాక్షసి సినిమాలో తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలను గణేష్‌ విపరీతంగా చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి పదేపదే చూసినట్లు తెలుస్తోంది.

aadhaar uidai issues notices

మీ పౌరసత్వం నిరూపించుకోండి... హైదరాబాదీలకు ఆధార్ సంస్థ నోటీసులు

పౌరసత్వ సవరణ చట్టంపై దేశం మొత్తం అట్టుడుకుతున్నవేళ, ఆధార్ సంస్థ తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. అసలే, ఒకపక్క సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడం ప్రకంపనలు పుట్టిస్తోంది. తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డు పొందారంటూ 127మంది హైదరాబాదీలకు నోటీసులిచ్చిన ఉడాయ్‌.... పౌరసత్వం నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు తీసుకున్నారంటోన్న ఉడాయ్.... పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఒకవేళ, భారతీయులు కాకపోతే, చట్టబద్ధంగానే భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు నిరూపించుకునే డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించింది. అయితే, విచారణకు రాకపోయినా, పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే, ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని అత్యున్నత న్యాయస్థానం చెబుతుంటే, మరోపక్క ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీ చేయడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే, పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ ఇష్యూ చేసిన నోటీసులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆధార్ సంస్థ జారీ చేసిన నోటీసులకు.... కార్డెన్ సెర్చ్ లకు సంబంధం ఏమిటో తెలియదు గానీ, తెలంగాణ పోలీసుల తీరుపై అసద్ మండిపడ్డారు. అసలు, కార్డెన్‌ సెర్చ్‌లో ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారంటూ తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. ఇంటింటి తనిఖీల్లో ఆధార్ కార్డు చూపించాలని అడగటానికి తెలంగాణ పోలీసులకు ఉన్న చట్టబద్ధత ఏమిటని నిలదీశారు. ఇక, ఆధార్ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న అసదుద్దీన్‌.... నోటీసులిచ్చిన 127మందిలో ఎంతమంది ముస్లింలు, దళితులు ఉన్నారో చెప్పాలంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే, అసదుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటుగా రియాక్టయ్యారు. అసద్ కామెంట్స్... ఉగ్రవాదులను సమర్ధించేలా ఉన్నాయన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు... ఆధార్ కార్డు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. దాంతో, ఆధార్ సంస్థ నోటీసులపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించి మీ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం కలకలం రేగుతోంది. అసలే, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం... పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం మైనార్టీ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో... ఆధార్ సంస్థ ఏకంగా మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి, దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లోనే నోటీసులు జారీ చేసిందా? లేక ఇంకెక్కడైనా ఇలా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే ఫస్ట్ కేస్ అయితే, మాత్రం పౌరసత్వంపై ఆందోళన చెందుతున్న వర్గాలు మరింతగా భయాందోళనలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP CM YS Jagan Big Gift To AP People On Ugadi

నిరుపేదల భూమి కోసం ఏపీ సర్కార్ పాట్లు

  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికాకరంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉగాది నాటికి పాతిక లక్షల మందికి సెంటు చొప్పున ఇంటి స్థలాల పంపిణీ చేస్తామన్నది ప్రభుత్వ ప్రకటన. దీనికి సరిపడా ప్రభుత్వ స్థలాలు లేవు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. అందుకే గతంలో పేదలకు ఇతర వర్గాల వారికి ఇచ్చిన అసైన్డ్ భూములపైన ప్రభుత్వ కన్ను పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అసైన్డ్ భూములపై సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు. నిరుపేద, దళిత, బలహీన వర్గాల దగ్గర ఉన్న సాగు భూములు వెనక్కి లాక్కుంటున్నారు. అదేమిటీ అంటే పేదలకు ఇవ్వటానికే కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లాక్కున్నా ఏమీ చేయలేరన్న ధీమాతో పేదలు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములపై కన్నేశారు. అదేవిధంగా ఇన్నాళ్లు.. నమ్ముకున్న భూమిని వదులుకోవటానికి వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. తమ భూముల్లోకి అడుగుపెట్టొదంటూ రెవిన్యూ అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఎసైన్డ్ పేద రైతుల ఆందోళనలలే. అధికారంలోకి వచ్చీ రాగానే ఈ పథకం కోసం భూమిని సిద్ధం చేయాలి అని రెవిన్యూశాఖను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 17,000 ఎకరాలేనని ప్రైవేటుగా మరో 26,000 ఎకరాలకుపైగా సేకరించాల్సి ఉందని గత ఆగస్టులోనే ఆ శాఖ స్పష్టం చేసింది. అందుకు  కనీసం 16 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత 20 వేల ఎకరాలు సేకరిస్తే చాలని దీనికి పద్నాలుగు వేల కోట్ల వ్యయం కానుందని ఆర్థిక శాఖకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది. ఎంత ఖర్చయినా ఈ ప్రాజెక్టును పూర్తి చేద్దామని సర్కార్ గొప్పలు చెప్తుంటే ఖర్చుకు వెనకాడకుండా భూసేకరణ చేసి పేదలకు స్థలాలు ఇస్తారేమోనని అంతా అనుకున్నారు. అయితే అసలు కథ జనవరి నుంచే మొదలైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ప్రైవేటుగా చేపట్టే భూసేకరణను తగ్గించుకోవాలి అని వీలైనంత మేరకు ప్రభుత్వ భూములు గుర్తించి ఇంటి స్థలాలకు వాడుకోవాలి అంటూ సర్కార్ జనవరిలో సరికొత్తగా మార్గదర్శకాలు ఇచ్చింది. అంతే భూసేకరణ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. కొత్తగా లిటిగేషన్ భూములు తెరమీదకొచ్చాయి. ఆ భూములపై కోర్టులలో అఫిడవిట్లు వెయ్యాలని ఈలోగా వాటిని ఇంటి స్థలాలకు వాడుకోవాలి అని మార్గదర్శకాలిచ్చారు. వీలైనంత మేరకు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూమిని వాడుకోవాలి అని పేర్కొన్నారు. అయితే అందులో బాగా విలువైన భూములు మాత్రం రిజర్వు చేశారు. వీటిని బిల్డ్ ఏపీ మిషన్ కింద అమ్ముకోవాలన్నది సర్కారు వ్యూహం. ఇప్పటికే జిల్లాల వారీగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న గ్రామీణ ప్రాంతాలలో 1,181 ఎకరాలు, పట్టణాల్లో 230 ఎకరాలు ఉన్నట్టు తేల్చారు. లిటిగేషన్ లో ఉన్న భూములు 1,076 ఎకరాలు ఈ రెండు కేటగిరీల్లో నికరంగా 3.5 లక్షల మందికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 20,000 ఎకరాలు. గ్రామీణ, పట్టణాల లోని 14 లక్షల మందికి కూడా సరిపోదు. ఇంకా ప్రైవేటుగా 9,619.22 ఎకరాలు సేకరించాల్సివుంది. మరిప్పుడు ఏవిధంగానైనా సరే భూమిని సేకరించి పేదనకు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. చూడాల మరి ఏం జరగనుందో.

Sajjala Ramakrishna Reddy Praises CM Jagan

తెరముందుకు ప్రభుత్వ సలహాదారు- వైసీపీ పాలనపై మీడియా వ్యతిరేకతే కారణమా ?

గతంలో పలు మీడియా సంస్ధల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం విజయవాడలో మీడియాతో ముఖాముఖీ నిర్వహించారు. అప్పుడప్పుడూ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లలో మాత్రమే కనిపించే సజ్జల ఏకంగా మీడియాతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు మీట్ ద ప్రెస్ నిర్వహించడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవహారాల్లో గతంతో పోలిస్తే మీడియాకు ఆదరణ తగ్గింది. అంతకు ముందు ఎన్నికల్లో మీడియా తమకు అనుకూలంగా లేదని వైసీపీ భావించడం వల్లో లేక ప్రభుత్వ వ్యతిరేక వార్తల పరంపర ఆపలేకపోతున్నామన్న ఆవేదనో తెలియదు కానీ వైసీపీలో ముఖ్యులెవరూ మీడియా ప్రతినిధులపై కానీ సంస్ధలపై కానీ ఓ రకమైన వ్యతిరేక భావంతో కనిపిస్తున్నారు. దీంతో మీడియా కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న మూడు నిర్ణయాలు వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. వీటిలో ఒకటి నిరాధార, పక్షపాత, పరువుతీసే వార్తలు రాస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన 2430 జీవో. రెండవడి అసెంబ్లీ కవరేజ్ నుంచి మూడు మీడియా సంస్ధలను బహిష్కరించడం, మూడవది అమరావతి ఆందోళనల కవరేజ్ లో మహిళా కానిస్టేబుల్ వీడియోలు తీశారని కేసులు పెట్టడం. వీటిలో ముందుగా అసెంబ్లీ కవరేజ్ లో భాగంగా ప్రతిపక్ష నేతల అభిప్రాయాలను తీసుకుంటున్న మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం కొరడా ఝళిపించారు. మూడు మీడియా సంస్ధలపై అసెంబ్లీ ప్రసారాలను కవర్ చేయకుండా బహిష్కరణ వేటు వేశారు. ఇది కొనసాగుతుండగానే అమరావతి ఆందోళలు జరుగుతున్న క్రమంలో మందడంలోని ప్రభుత్వ పాఠశాలను పోలీసులు ఆక్రమించి పిల్లలను ఆరుబయట చదివిస్తున్న విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కొన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపై ప్రభుత్వం ఏకంగా ఎస్సీ, ఎస‌్టీ అట్రాసిటీ కేసులు సైతం పెట్టించింది. తాజాగా వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ రెండు వ్యవహారాలతో ప్రభుత్వానికి కాస్తో కూస్తో అనుకూలంగా ఉన్న మీడియా సంస్ధల్లోనూ ఆందోళన మొదలైంది. పరిస్ధితి చేదాటిపోతుందని అర్ధమైందో లేక, భవిష్యత్తులో మీడియా మరింత దూరమవుతుందన్న ఆవేదనో తెలియదు కానీ మీడియాకు దగ్గరవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగానే మీడియా అంటే అంటీముట్టనట్లుగా ఉండే మాజీ సీనియర్ జర్నలిస్టు సజ్జల ఏకంగా మీడియా మీట్ నిర్వహించినట్లు అర్ధమవుతోంది. సీఎం జగన్ కు రాజకీయ సలహాదారుగా ఉంటూ బ్యాక్ డోర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడతారని పేరున్న సజ్జల మీడియాతో మాత్రం ఎప్పుడూ ముభావంగానే ఉంటుంటారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. బెట్టు చేస్తే మీడియా పూర్తిగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది అందుకే వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకే సజ్జల రంగంలోకి దిగినట్లు అర్ధమవుతోంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి సచివాలయంలో మంత్రులే మీడియా ప్రశ్నలకు బెంబేలెత్తి పారిపోతున్న వేళ సజ్జల మీడియా మీట్ నిర్వహించడం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది. అదీ జగన్ కు సన్నిహితుడు, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ నిర్వహించిన పాత్రను ప్రస్తుతం పోషిస్తున్న సజ్జల మీడియాతో సఖ్యత కోసం ప్రయత్నిస్తుండటం కచ్చితంగా మార్పును సూచించే అంశంగా చెప్పుకోవచ్చు.

potluri vara prasad tweet

రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవసరం ఉంది: పీ వీ పీ

ట్వీట్ చేసి మరీ కొత్త సంక్షోభానికి తెర తీసిన వై ఎస్ ఆర్ సి పీ నేత పొట్లూరి పాలక వై ఎస్ ఆర్ సి పీ కి సంక్షోభాల మీద సంక్షోభాల తాకిడి మొదలైంది. మొన్నటి దాకా మంత్రులు కొడాలి నాని, బొత్స సత్తిబాబు కావాల్సినంత మసాలా  అందిస్తే,ఈ రోజు ట్వీట్ తో   పీ వీ పీ, అదేనం డీ,,, విజయవాడ లోక్ సభ స్థానానికి వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్థిగా నుంచుని , కేశినేని నాని చేతి లో ఓటమి పాలైన పొట్లూరి వీర ప్రసాద్ పొద్దున్నేవదిలిన ట్వీట్ బాణం ...సూటిగా జగనన్న గుండెలో దిగింది.. ఆడవారి కి ఆస్తిలో సమన హక్కు కల్పించి, తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి చాటి చెప్పిన అన్న ఎన్ టీ ఆర్ స్ఫూర్తి తో , మన తెలుగు వారు కూడా , మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారంటూ ట్వీట్ బాంబ్ పేల్చారు. వాస్తవానికి ఇక్కడ పీ వీ పీ ...సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ, బూజు పట్టిన సంప్రదాయాలను తన ట్వీట్ లో ఎండా గట్టారు. మగ ఆఫీసర్లు ఆడవారి ఆర్దర్లను తీసుకోరన్న ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి , సుప్రీమ్ కోర్టు కొత్త శకానికి నాంది పలికిందనే తన ఆనందాన్ని ఆయన తన ట్వీట్ లో పలికించటమే కాకుండా, ఆ సంబరానికి మరింత శోభ తేవటం కోసం, ఏకంగా ఈ  రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కావాలనే తన అభిలాషను చాలా ఉద్వేగం గా వ్యక్తం చేశారు..." అవకాశాల్లో సగం, ఆస్తి లో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వం లో సగం..." అంటూ తన ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు. పీ వీ పీ ట్వీట్ ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం నేతలు మాత్రం, ఆయన ఆకాంక్షకు కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయనీ, ఒక వేళ సి బీ ఐ కేసుల నేపధ్యం లో జగన్ తప్పుకుంటే, ముహ్యమంత్రి చెయిర్ లో భారతి ని కూర్చోబెట్టవచ్చుననే సంకేతం ఇవ్వటానికే, వై ఎస్ ఆర్ సి పీ నాయకుడు పీ వీ పీ ఈ రకంగా ట్వీట్ చేసి ఉంటాడని టీ డీ పీ  లీడర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు, ఈ రకమైన ఫీలర్లు వదలటం ద్వారా వై ఎస్ ఆర్ సి పీ అధిష్టానం , రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మార్పు గురించి ముందస్తుగా నే ప్రజలను సెన్సిటైజ్ చేసే కార్యక్రమం మొదలెట్టిందనీ, జగన్  మోహన్ రెడ్డి సి.బి.ఐ. కేసుల నేపధ్యం లో సి.ఎం. పదవి ని త్యజించాల్సి  వస్తే,వెంటనే ఆయన భార్య భారతి ని ముఖ్యమంత్రి ని చేయటం కోసమే వై ఎస్ ఆర్ సి పీ ఈ రకమైన వ్యూహాత్మక ప్రచారానికి దిగిందనీ తెలుగు దేశం నాలెడ్జ్ సెంటర్ ప్రముఖులు భావిస్తున్నారు.

ACB raids town planning offices across the State

ఏపీలో టాప్-5 అవినీతి శాఖలపై ఏసీబీ కన్ను.. వరుస సోదాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో లంచాల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అత్యంత అవినీతి శాఖగా పేరున్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై తొలి పంజా విసిరిన ఏసీబీ అధికారులు తాజాగా నిన్న పురపాలకశాఖ కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టారు. శాఖల వారీగా చేస్తున్న ఈ దాడులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ ఏసీబీ దాడులు తప్పవని అధికారులు తాజా దాడులతో హెచ్చరికలు పంపుతున్నారు. ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే తన కేబినెట్ లోని మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సైతం హెచ్చరికలు పంపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే సమస్యే లేదని కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు స్పష్టం చేసిన సీఎం జగన్ ఇప్పుడు దాన్ని చేతల్లో చూపుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవినీతి దర్యాప్తు విభాగాన్నిపటిష్టం చేయాలని భావించిన జగన్ అప్పటికే దాన్ని లీడ్ చేస్తున్న కుమార్ విశ్వజిత్ ను సాగనంపారు. అవినీతిని అరికట్టడంలో తన అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదని భావించడం వల్లే విశ్వజిత్ ను బదిలీ చేశారు. ఆయన స్ధానంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన సీతారామాంజనేయులును తీసుకొచ్చారు. గతంలో పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న సీతారామాంజనేయులు వచ్చీ రాగానే పని ప్రారంభించేశారు. రవాణాశాఖ కమిషనర్ నుంచి ఏసీబీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీతారామాంజనేయులు కీలకమైన రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై దృష్టిసారించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన అధికారులు అవినీతిలో మునిగి తేలడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని భావించిన ఆయన... వచ్చీ రాగానే రంగంలోకి దిగారు. అక్రమార్కులపై చర్యల విషయంలో సీఎం జగన్ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో విమర్శలకు వెరవకుండా గతేడాది 21న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, తహసీల్డార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ  సోదాలు చేపట్టింది. సిఫార్సులను సైతం లెక్కచేయకుండా అవినీతిపరుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి చేరవేసింది. ఆ తర్వాత మరో కీలక విభాగమైన పురపాలకశాఖపై ఏసీబీ దృష్టిసారించింది.  మంగళవారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. ఇందులో భారీ ఎత్తున ఆధారాలను సైతం సేకరించేంది. లెక్కతేలని నగదుతో పాటు డాక్యుమెంట్లను జప్తు చేసింది. 13 జిల్లాల్లో 14 టీమ్ లుగా విడిపోయి 100 మందికి పైగా అధికారులు చేపట్టిన సోదాల్లో పలుచోట్ల చాలా మంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. లంచాలకు కక్కుర్తి పడి సిటిజన్ ఛార్జర్ అమలు చేయకపోవడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడం, బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కేసులు నమోదు చేశారు. త్వరలో మిగిలిన విభాగాల్లోనూ సోదాలు నిర్వహించేందుకు ఏసీబీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.

యడ్యూరప్పకి మొదలైన తిప్పలు.. కమలం ఖాతా నుండి కర్ణాటక కూడా ఔటా?

కర్ణాటక బీజేపీ సర్కారుపై అసంతృప్తి మొదలైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకోవటం కలకలం రేపుతోంది. సీఎం యడ్యూరప్ప పని తీరుతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యేలు ఆనందంగా లేరని సమాచారం. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఏడాది పాటు పాలన సాగించిన కాంగ్రెస్ జెడియు సంకీర్ణాన్ని గద్దె దించి ముఖ్యమంత్రైన యడ్యూరప్పకు అప్పుడే కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచి అరవై రోజులు కాకముందే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకుంటున్నారు. సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. పార్టీని ఫిరాయించి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కడాన్ని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది సార్లు గెలిచిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి చివరి నిమిషంలో మొండి చేయి చూపారనే వాదన వినిపిస్తోంది.  మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ లో సీఎం పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు యడ్యూరప్ప వర్గీయుల సృష్టిగా చెబుతున్నా సంతకం లేని లేఖ గురించి కూడా చర్చ జరుగుతోంది. యడ్యూరప్పకి వయసు మీద పడింది అని వారసుడిగా విజయేంద్రకు పగ్గాలు ఇవ్వవలసిన సమయం వచ్చేసింది అనేది ఆ లేఖ సారాంశం. కాంగ్రెస్ మార్క్ అయిన వంశపారంపర్య రాజకీయాలకు బిజెపిలో చోటు లేదని ఓ వైపు కేంద్ర నాయకత్వం చెబుతుంటే యడ్యూరప్ప అందుకు విరుద్ధంగా కొడుకును ప్రోత్సహించే ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. బడ్జెట్ సెషన్ మొదలైన తొలి రోజే సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యేలు ముందుముందు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బిజెపిలో పరిణామాలని బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికే సీఎల్పీ భేటీ నిర్వహించింది. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మాజీ సీఎం సిద్దరామయ్య.

వారం రోజుల్లో పెళ్లి అనగా.. ప్రేమోన్మాది చేతిలో యువతి బలి

వారం రోజుల్లో పెళ్లి. ఆమెలో పెళ్లి కళ కూడా వచ్చేసింది. తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ లోగా ఘోరం జరిగి పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది దివ్య అనే యువతి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. గత రాత్రి గజ్వేల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన దివ్య.. గజ్వేల్ లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈ నెల 26వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఇదే సమయంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం నిన్న ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా తనకు బ్యాంక్ లో పనులున్నాయని వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్ళింది. ఎప్పట్లాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీ ప్రసన్న నగర్ లో తాముంటున్న ఇంటికి వచ్చింది దివ్య. తనకు కాబోయే భర్త సందీప్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. ఇంతలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడంలో ఫోన్ లో మాట్లాడుతున్న సందీప్ కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్ లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో చుట్టు పక్కలవారు తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసే సరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో విచారణ చేశారు. కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికొచ్చారు. అయితే ప్రేమోన్మాదం తమ కుమార్తె హత్యకు కారణమని బోరున విలపిస్తున్నారు. గత కొంత కాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్ లో చదువుకొనే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి నారాయణ తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు.

విద్యార్థిపై దంపతుల దాడి.. కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!

హైదరాబాద్ లోని సనత్ నగర్  ప్రభుత్వ పాఠశాల సమీపంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులపై ఓ దంపతులు దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. అమానుషంగా దాడి చేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రౌండ్ టేబుల్  ఆడుకుంటూ ఉండగా అటునుంచి ఓ జంట వెళ్తోంది. ఆడుకుంటున్న విద్యార్థులలో ఒక విద్యార్థి అనుకోకుండా వెళ్లి ఆ దంపతులకు తగిలాడు. అంతే, ఆ విద్యార్థిపై భార్యాభర్త విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఇది చూసిన విద్యార్థి  స్నేహితుడు వచ్చి కొట్ట వద్దూ ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్ళు పట్టుకున్నాడు. అయిన వారు కనికరించలేదు. కొట్టిందికాక, లేబర్ పిల్లలు.. చిల్లర గాళ్లు అంటూ పైగా విద్యార్థులపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ విజువల్స్ చూశాక పోలీసులకు అసలు విషయమేంటో అర్థమైంది. విద్యార్థులపై దాడి చేయటమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

గిఫ్టులు..రిటర్న్ గిఫ్టులతో తరిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

తెలంగాణ వారికి ఆంధ్ర సహజవనరులు అప్పనంగా దోచి పెడుతున్నారు అనటానికి స్పష్టమైన ఋజువు..ఫిబ్రవరి10 న వచ్చిన జీఓ ఎం ఎస్ 10. తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువు (మై హోమ్) జూపల్లి రామేశ్వరరావుకి చెందిన జయజ్యోతి సంస్థకి కర్నూలులో 343 ఎకరాల సున్నపురాయి గనులు 50 ఏళ్ల పాటు తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చారు.   కెసిఆర్ బర్త్ డే కి మన సహజవనరులు 50 సంవత్సరాల పాటు రాసిచ్చాడు...ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రి... వచ్చే బర్త్ డే కి బందరు పోర్ట్ రాసిస్తాడు..ఆ తర్వాత మనందరి బతుకులు కూడా రాసిచ్చేస్తాడు...అని ఆంద్రప్రదేశ్ జనాలు అనుకుంటున్నారు.  మన రాష్ట్రంలో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మంత్రి మండలిలో తీర్మానం చేసిన ప్రభుత్వం మన సహజ వనరులను మాత్రం పక్క రాష్ట్రాల వ్యాపారవేత్తలకు దారదత్తం చేయడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జగన్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గిఫ్టుగా ఇచ్చి..రిటర్న్ గిఫ్టులు బాగానే తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు.