ycp leaders unhappy with ys jagan decision over council

శాసనమండలి రద్దు నిర్ణయంతో నిరాశకు గురైన వైసిపి నేతలు!!

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లోని పలువురు నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో ఏకంగా శాసన మండలినే ఏపీ ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిక్కుముడి విప్పబోయి వంద చిక్కుముడులు వేసినట్టుగా ఉంది జగన్ తీరు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం వల్ల ఆ పార్టీలోని ఎందరో నేతల ఎమ్మెల్సీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో వారంతా పార్టీ అధినేత తీరుపై అసహనంతో ఉన్నారు.  మండలి రద్దు నిర్ణయంతో చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలు ఆశలు అడియాసలయ్యాయి. అందులో ఒకరు కె చంద్ర మౌళి కాగా రెండోవారు ఎస్సీవీ నాయుడు. తాము అధికారంలోకొస్తే ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడదే జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మండలి సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితేమిటన్నది పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరు తప్పుపట్టకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం వారు ఆక్షేపిస్తున్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కె చంద్ర మౌళి కుప్పం నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటి చేసారు. పోటీ చేసిన రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు మెజారిటీని కొంత తగ్గించగలిగారు. ఇదిలా ఉంటే కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఒకవేళ బాబుపై గెలవకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో చంద్రమౌళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనపై బాగా సానుభూతి ఏర్పడింది. వయసు రీత్యా కూడా ఇది చివరి అవకాశం అనే భావన అందరిలో ఉంది వీటికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చినందున చంద్ర మౌళికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కుప్పం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చంద్రమౌళి కూడా ఇదే ధీమాతో ఉన్నారు, మండలిలోకి చంద్రమౌళి అడుగుపెడతారని అదృష్టం కలిసొస్తే మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు తీర్మానం చేయడంతో ఈ అంశం చంద్రమౌళి పాలిట పిడుగుల మారింది.  శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాజకీయంగా అనేక పార్టీలలో కొనసాగినప్పటికీ స్థానికంగా బలమైన నేత. శ్రీకాళహస్తితోపాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తివేడులోనూ నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. గత పాతికేళ్ల నుంచి శ్రీ కాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశతో అప్పటికే తాను కొనసాగిన పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి ఈ ఆశతోనే ఆయన పలు పార్టీలు మారినట్టుగా స్థానికులు చెబుతుంటారు. 2004ఎన్నికల సమయంలో ఎస్సీవీ నాయుడు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది, తొలిసారి గెలిచి చట్ట సభలోకి అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎస్సీవీ నాయుడు తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చారు. అప్పటి నుంచి టిడిపిలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు, టికెట్ లభించకపోవడంతో టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా ఎస్సీవీ నాయుడు పట్టు ఉండటంతో ఆ మూడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేశారు. అయితే పార్టీలో చేర్చుకునే సమయంలో ఎస్సీవీ నాయుడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. వయసు రీత్యా నాయుడు కూడా ఈ ఐదేళ్ళలోనే సముచిత పదవులు పొందాలనే ఆశ పెట్టుకున్నారు. జగనిచ్చిన మాట నెరవేరుతుందని తన అనుచర వర్గంతో కూడా చెబుతూ వచ్చారు.  అయితే మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి పైనే వేటు వేశారు సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో ఎమెల్సి పదవులపై ఆశ పెట్టుకున్న నేతల్లోనే కాకుండా వారి అనుచర వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇతర పదవులేమైనా ఇస్తారని ఆశించాలన్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్ పాటించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగా మాత్రం విమర్శించటం లేదు కానీ, అంతర్గతంగా బాగా రగిలిపోతున్నారట. మండలి రద్దును స్వాగతించే వారికన్నా విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Adilabad court awards death sentence to Samatha case accused

సమత కేసులో సంచలన తీర్పు.. దోషులకు ఉరిశిక్ష

కొమరంభీం జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే.. దోషులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. తామే కుటుంబానికి ఆధారమని, శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. అయితే మీరు చేసిన నేరం చాలా ఘోరమైనదని చెబుతూ న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. తీర్పుపై సమత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. డిసెంబర్ 27న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

deputy cm alla nani insults mp raghurama krishnam raju

వైసీపీ ఎంపీలకు అవమానం? నిరూపిస్తే క్షమాపణ చెబుతానన్న మంత్రి నాని

పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశాన్ని వైసీపీ ఎంపీలు బాయ్ కాట్ చేశారు. దాంతో, ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశ మందిరానికి ముందుగా వచ్చిన ఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని... అలాగే కలెక్టర్ ముత్యాలరాజులు వేదికపై కూర్చున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వేదికపైకి వెళ్లారు. అనంతరం వచ్చిన వచ్చిన ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్ లు వేదిక ముందున్న మొదటి వరుసలో కూర్చున్నారు. అయితే, అంతకు ముందే వేదికపైకి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు హఠాత్తుగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. దాంతో, మరో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా  రఘురామకృష్ణంరాజు వెంటే బయటికి వెళ్లిపోయారు. దాంతో, సమావేశంలో కలకలం రేగింది. అయితే, వేదికపై కూర్చోకూడదని కొందరు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సూచించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బయటకు వచ్చేశారన్నది సహచరులు చెబుతున్నారు. ఇదే విషయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సమావేశం నుంచి బాయ్ కాట్ చేయగా... మరో ఎంపీ ఎంపీ మార్గాని భరత్‌ సైతం సమావేశం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తాము ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధులమనీ, వేదికపై తమకు చోటు లేకపోవడం అవమానమని అన్నారు. ఎంపీలకు ప్రొటోకాల్‌ పాటించకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, అందరికీ ప్రొటోకాల్‌ పాటిస్తూనే ఉన్నామన్నామని పశ్చిమగోదావరి జిల్లాఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్‌ పాటించలేదని ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు.    అయితే, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే తామే ఎక్కువన్నారు. దిశ కమిటీకి, లోక్‌సభలో సబ్‌ ఆర్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న తనకు డీఆర్సీ మీటింగ్ లో సముచిత స్థానం ఉంటుందని భావించానని, కానీ అలా జరగలేదన్నారు. తనకు జరిగిన ఈ అవమానం... తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానన్నారు. అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే... తాను అలాంటి మీటింగ్‌లకు ఇక మీదట వెళ్లబోమన్నారు. ఈ విషయమై జిల్లా మంత్రి ఆళ్ల నాని క్షమాపణ చెబుతారని భావిస్తున్నా అన్నారు. తదుపరి సమావేశాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నానన్నాని... ఒకవేళ అలా జరగకపోతే ఇక ముందు జరిగే మీటింగ్‌లకు వెళ్లబోమని రఘురామకృష్ణంరాజు తేల్చిచెప్పారు.

trs party to take action on rebel candidates in municipal polls

తప్పదా?.. అధిష్టానాన్ని కాదని పోటీ చేసిన అభ్యర్థులపై వేటు వేయనున్న టీఆర్ఎస్!

తెలంగాణలో కొత్త పాలక మండలి కొలువు తీరింది. అయినా టీఆర్ఎస్ లో ఆ హీట్ ఇంకా పోలేదు. ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ నేతలు కొందరు ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోటీ చేసిన వారిని వదిలిపెట్టకూడదని కోరుతున్నారు. తమ ఓటమికి కారణమైన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కొల్లాపూర్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన వారి జాబితా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఒక వైపు గులాబీ బాస్ కేసీఆర్ కూడా రెబల్స్ తో పాటు వారిని ప్రోత్సహించిన వారి పై గుర్రుగా ఉన్నారు. అయితే ఈ టైంలో వేటు వేస్తే పార్టీకొచ్చే లాభమేంటి అని ఆలోచనలో ఉంది టిఆర్ఎస్ అధిష్టానం.  ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు.. ఇప్పుడు వేటు వేస్తే లాభం లేదని.. అందుకే కొంతకాలం సైలెంట్ గా ఉండాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. మరో వైపు వేటు వేయకపోతే పార్టీలో సీరియస్ నెస్ అనేది లేకుండా పోతుందని భవిష్యత్ లో మరోసారి ఇలా పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వీరిపై వేటు వేయాలా అనే అంశంపై పార్టీ పెద్దలు తర్జన భర్జన అవుతున్నారు. నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా పార్టీ అధిష్టానం మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి కాబట్టి పార్టీ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తేనే అప్పుడు రెబల్స్ బెడద ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

indians worried about family members who are working in china

ఇంటికి రప్పించండి.. చైనాలో చిక్కుకున్న భారతీయ ఉద్యోగుల ఇళ్లల్లో ఆందోళన

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కు ఏపీ ప్రజలు భయపడిపోతున్నారు. ఇక్కడ నుంచి చైనాకి ఉద్యోగం కోసం వెళ్లిన వారి బంధువుల కోసం ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి విస్తృతం కావడంతో చైనాలోని వుహాన్ నగరంలో ఉంటున్న 58 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. చైనా వుహాన్ నగరం లోని అప్టోడిస్ ప్లే టెక్నాలజీ ప్రైవేటు కంపెనీలో 58 మంది భారతీయుల ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 23 న ఛైన్ అప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ట్రైనింగ్ లో భాగంగా 58 మంది భారతీయులను వుహాన్ సిటీకి పంపించింది సదరు కంపెనీ.  ముఖ్యంగా కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వుహాన్ సిటీకే ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడి టీసీఎల్ ఉద్యోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ కు లేఖ రాశారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సేమ్ జగన్ కు లేఖ రాశారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అక్కడి జననంతో పాటుగా వుహాన్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న 58 మంది భారతీయుల తల్లిదండ్రులను కూడా భయపెడుతోంది. తమ వాళ్లను వైరస్ బారిన పడకుండా వెంటనే స్వదేశానికి రప్పించేయాలని తలిదండ్రులు వేడుకుంటున్నారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో దుబాయి ఫ్లైట్ లో దిగిన ఒక వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో అతడికి వైద్యులు స్క్రీనింగ్ చేశారు. అక్కడి నుంచి కేజీహెచ్ కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత కరోనా వైరస్ సోకలేదని తేలడంతో డిశ్చార్జ్ చేశారు.

newly elected trs municipal members feeling crazy to take selfie with ktr

కేటీఆర్ క్రేజ్.. ఫోటో కోసం ఎగబడుతున్న నేతలు!

మునిసిపల్ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సభ్యులు యువనేత కేటీఆర్ తో ఫోటోలకు క్యూ కడుతున్నారు. కొత్తగా గెలిచిన సభ్యులతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు కేటీఆర్. వారి కోరిక మేరకు ఒక్కొక్కరితో చాలా ఓపిగ్గా వందల మందితో కేటీఆర్ ఫోటోలు దిగుతున్నారు. కేసీఆర్ తర్వాత రాష్ర్టానికి కాబోయే సీఎం కేటీఆర్ అనే వార్తలు ఈ మధ్య కాలంలో జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ తో ఫోటో అంటే టిఆర్ఎస్ సభ్యుల్లో క్రేజ్ పెరిగింది. మునిసిపల్ సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా పోటా పోటీగా ఫోటోలు దిగుతున్నారు. మూడు రోజుల పాటు దాదాపు 2000 మందితో కేటీఆర్ ఫొటోలు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.  అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఫోటోలు దిగుతున్నారు. వారిని కాదనకుండా కేటీఆర్ ఫోటోలకు ఓకే అంటే ఫోటోలు దిగిన వారు మాత్రం కాబోయే సీఎంతో ఫోటో అని సోషల్ మీడియాలో క్యాప్షన్ లు పెట్టడం మాత్రం కేటీఆర్ కు నచ్చలేదని తెలుస్తోంది. కేవలం ఓ జ్ఞాపకం కోసం మాత్రమే ఫోటోలు వాడుకోవాలి కానీ సోషల్ మీడియాలో ఫొటో అప్ లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలని కేటీఆర్ సున్నితంగా సూచన చేసినట్టు తెలుస్తోంది. కాబోయే సీఎం అంటూ క్యాప్షన్ పెట్టొద్దని సున్నితంగా నేతల్ని హెచ్చరించారు. మొత్తానికి కేటీఆర్ తో ఫోటో సెషన్ ఇప్పుడు టిఆర్ఎస్ లో క్రేజీగా మారింది.  

ys sunitha urges security

మమ్మల్నీ చంపేస్తారేమో? జగన్ చెల్లెలు ఆందోళన

వైఎస్ వివేకాను చంపిన హంతకులు తమనూ లక్ష్యంగా చేసుకునే అవకాశముందంటూ ఆయన కుమార్తె సునీత ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్ వివేకా హంతకుల నుంచి తనకు, తన భర్త రాజశేఖర్ కు ముప్పు పొంచి ఉందన్నారు. అందుకే, తమకు సాయుధ రక్షణ కల్పించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. గతేడాది నవంబరు 21న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన సునీత... తాము ఏపీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంలూ విజ్ఞప్తి చేశారు.  వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సునీత... తమకు రక్షణ కల్పించాలంటూ ఏపీ డీజీపీకి రాసిన లేఖను కూడా జత చేశారు. వైఎస్ వివేకాను అత్యంత క్రూరంగా హత్య చేశారు. దర్యాప్తు వేగంగా సాగడం కోసం నేను, నా భర్త పోలీసులకు సహకరిస్తున్నాం. అయినా హంతకులెవరో ఇప్పటివరకూ గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో నా భద్రతపైనా, నా కుటుంబ భద్రతపైనా భయం కలుగుతోందని సునీత హైకోర్టుకు విన్నవించుకున్నారు.  నా తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన వాళ్లు మమ్మల్నీ లక్ష్యం చేసుకునే అవకాశముందని అనుమానం వ్యక్తంచేశారు. అలాగే, ఈ కేసులో కీలకమైన శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో మిగతా నిందితులైన పరమేశ్వర్ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, వాచ్ మన్ రంగయ్య ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తాము భావిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు.

Adilabad Court To Deliver Final Verdict On Samatha Case Today

సమతా కేసు తుది తీర్పు నేడే...

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ అత్యాచారానికి బలైన సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమత హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలని నిర్మల్ జిల్లా గోసాన్ పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బెల్లూన్లు అమ్ముకుని జీవించే మహిళ పట్ల అత్యంత పాశవికంగా దుండగులు దారుణానికి పాల్పడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. హంతకులను కఠినం గా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆందోళనలు సాగాయి. ప్రజల ఆందోళన నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ కూడా వేగవంతంగా పూర్తి చేసింది. ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఆ ప్రాంతీయులు ధర్నాలకు దీక్షలు పాల్పడ్డారని ఇప్పుడు సరైన తీర్పు వెలువడి సమతకు న్యాయం జరగని పక్షంలో తమ ఆడబిడ్డ కోసం ఎలాంటి చర్యలకైనా పాల్పడ్డానికి సిద్ధమని,పట్టణంలో ఉన్న వారికి ఒక న్యాయం తమకో న్యాయంగా కాకుండా తమ దలిత వర్గాలకు కూడా సరైన జరిగేలా చూడాలని గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నేడు వెలువడనున్న తీర్పుతో సమతకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.

agriculture cooperative societies election to be held soon in telangana

తెలంగాణలో మరోసారి ఎన్నికల జోరు.. గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం!

మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసి టిఆర్ఎస్ కారు జోరు కొనసాగుతొంది.ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు సమాచారం. రైతులు సభ్యులుగా ఉండే సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్ లకు నియమించిన పర్సన్ ఇన్ చార్జ్ ల పదవీ కాలం ముగుస్తున్న మేరకు 3-4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.15ను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని, కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు అధికారులు.  రాష్ట్రంలోని సహకార సంఘాలకు 2018 లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ మేరకు సంఘాల పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్ చార్జి లను నియమించారు. వారి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించింది.పర్సన్ ఇన్ చార్జిల పాలన పొడిగింపునకు అవకాశం ఇవ్వకుండా ఎన్నిక లకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.రాష్ట్రంలో 584 మండలాలకు గాను 906 సహకార సంఘాలే ఉండేవి. మండలాల సంఖ్య పెరిగాక 81 మండలాల్లో ఒక్క పీఏసీఎస్ లేకుండా పోయింది. 272 మండలాల్లో ఒక్కో పీఏసీఎస్ మాత్రమే మిగిలింది. మిగిలిన మండలాల పరిధిలోకి 2 నుంచి 3 పీఏపీఎస్ లు వచ్చాయి. రాష్ట్రంలో మండలాల పునఃవ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలా లతో పాటు ప్రతి మండలం యూనిట్ గా 2 పీఏపీఎస్ లు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు 81 మండలాల్లో 2 చొప్పున 162 పీఏపీఎస్ లు కొత్తవి రాగా 272  మండలాల్లో ఒక్కో పీఏపీఎస్ ను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో కొత్తవి 434 రాగా పాతవి 906  కూడా కలుపుకుంటే మొత్తం 1340 పీఏపీఎస్ లకు తాజాగా ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సారి అయినా వాయిదా లేకుండా సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి.  

Will Nirbhaya Case Convicts Be Hanged On Feb1

నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా?

ఈసారైనా డెత్ వారెంట్ ప్రకారం నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక ఏవైనా కారణాలతో మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, నిర్భయ దోషుల ఉరితీత సమయం సమీపిస్తోన్నకొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడువు దగ్గరపడుతున్నకొద్దీ నిర్భయ దోషులు... పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ... ఉరిశిక్ష అమలును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ పిటిషన్ తో ఒకసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడగా... ఇప్పుడు, దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ... క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. అలాగే, మరో దోషి అక్షయ్ సింగ్ సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఒకవేళ అక్షయ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరిస్తే... రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్ధన పెట్టుకునే అవకాశముంది. దాంతో, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలవుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే, న్యాయవ్యవస్థలో వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనా... దారులన్నీ మూసుకుపోయినా... ఫిబ్రవరి ఒకటిన మాత్రం ఉరిశిక్ష అమలు కాకుండా పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. చివరికి క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించినా...కోర్టుల్లో పిటిషన్లను కొట్టివేసినా... మళ్లీమళ్లీ సుప్రీంను ఆశ్రయిస్తూ... ఉరిశిక్ష వాయిదా పడేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్... దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు అసలు జనవరి 22నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా... ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్థనతో వాయిదా పడింది. ఇక, ఇప్పుడు మరో దోషి అక్షయ్ సింగ్... క్యూరేటివ్ పిటిషన్ వేయడంతో... మరోసారి ఉరి అమలుపై సందిగ్ధత నెలకొంది. అయితే, జనవరి 31 అర్ధరాత్రిలోపు ఎలాంటి అడ్డంకులు రాకపోతే మాత్రం.... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయడానికి అంతా సిద్ధమైంది. మరి, ఈసారైనా ఉరిశిక్ష అమలవుతుందో లేదో చూడాలి.

telangana cid department

సీఐడీ నిర్మూలం కాబోతోందా..?

తెలంగాణలో సీఐడీ డిపార్ట్ మెంట్ మూలన పడింది. వందల కొద్దీ కేసులు సీఐడీ దగ్గర పెండింగ్ లో ఉండిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదొందల కేసులు దర్యాప్తు కొలిక్కి రాలేదు. సంచలన స్కాం ల దగ్గర నుండి సాధారణ కేసుల దాకా సీఐడీ పోలీసులు చేధించలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సీఐడీ పోలీసులు అంటే హడల్, ఒక కేసు వారి చేతిలో పడిందంటే దర్యాప్తు త్వరగా ముగుస్తుంది. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉండేవారు, చిన్న కేసుల నుంచి సెన్సేషనల్ స్కాముల వరకు సీఐడీ పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేసి నిందితులని కటకటాల వెనక్కి నెట్టేవారు కాని, కొన్ని రోజులుగా సిఐడి మూలన పడినట్లు కనిపిస్తోంది. అనేక కేసులు సీఐడీ పోలీసుల దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా దర్యాప్తు కొలిక్కి రావడం లేదు. ఈ సంచలన విషయాలన్నీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఐడీ పనితీరు మందగించింది. తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పిన తొలి కేసునే ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది సిఐడి. ఉమ్మడి ఏపీలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల స్కామ్ లు ఓ కొలిక్కి కూడా తీసుకురాలేకపోయారు. దాదాపు ఆరేళ్ళు గడుస్తున్నా ఈ కేసులో నిందితులు ఎవరో తేలలేదు. తెలంగాణలో మొత్తం 3600 గ్రామాల్లో 23000 పైగా ఇళ్లను అప్పటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో వెయ్యికి పైగా ఇండ్లు కట్టనప్పటికీ కట్టినట్టు వాటికి సంబంధించిన నిధులని మళ్ళించారంటూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన తొలి కేసిది ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అదేకాదు ఎంసెట్ స్కాం, సీఎంఆర్ఎఫ్ స్కామ్, బోధన్ స్కాం వంటి అత్యంత సంచలన కేసులని సీఐడీ నాంచుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఐడీ దగ్గర 242 కేసులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 510కి చేరింది. గతంలో వందకు పైగా కేసులని సీఐడీ డిస్పోజ్ చేసినప్పటికీ ఇంకా దర్యాప్తు చేయాల్సిన కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇవే ఆరోపణలతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని నెలల క్రితం సీఎస్ కు లేఖ రాసింది. సీఐడీ వింగ్ లో మొత్తం 820 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎడిషనల్ డిజిపి స్థాయి నుంచి ఐజీ, డీఐజీ, ఎస్పీ, బీఎస్పీ తదితర సిబ్బంది ఉన్నారు. 2014 లో సీఐడీకి కోటి రూపాయల నిధులు ఉంటే, 2017 కు నిధులు మూడు కోట్లను దాటాయ్ కానీ, కేసులు మాత్రం అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రభుత్వం ఏదైనా కేసును సీఐడీకి అప్పగిస్తే నిర్ణీత సమయంలోనే దర్యాప్తు పూర్తి చేసి న్యాయం జరిగేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం కానీ, కొన్నేళ్లుగా కేసులు చేధించకుండా తమ దగ్గరే నాంచుతూ పెట్టుకోవటం పట్ల సీఐడీ విశ్వాసం కోల్పోతుంది. సీఐడీ వ్యవస్థను సియస్ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

economic emergency in india

దేశంలో ఎకనామిక్ ఎమర్జెన్సీ..! గత పదేళ్లలోనే అత్యంత కష్టకాలం?

ఐదు శాతం వృద్ధితో జీడీపీ పదకొండేళ్ల కనిష్టానికి చేరింది... కేవలం ఒకే ఒక్క శాతం వృద్ధితో పెట్టుబడుల రంగం 17ఏళ్లనాటి స్థాయికి పడిపోయి అత్యంత నత్తనడకన సాగుతోంది. అలాగే,  తయారీ రంగం వృద్ధి 15ఏళ్ల కనిష్టానికి పడిపోగా... కేవలం రెండు శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. ఇక, వ్యవసాయంలో కూడా వృద్ధిరేటు నాలుగేళ్ల అత్యల్పానికి పతనమై 2.8శాతం వృద్ధి రేటుతో మొత్తం దేశ ఆర్ధిక పరిస్థితినే భయపెడుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో వృద్ధి రేటు పడిపోవడంతో ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం కత్తిమీదసామే అంటున్నారు విశ్లేషకులు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా బడ్జెట్‌ను ఈసారి అంత ఈజీ కానే కాదని చెబుతున్నారు. ఎందుకంటే, గత పదేళ్లలో ఎన్నడూలేనంతగా దేశంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఒకవైపు వేగంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం దేశాన్ని భయపెడుతుంటే.... మరోవైపు దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ ప్రస్తుతం భారత్‌కు ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు.... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయని అంటున్నారు. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని... దాంతో, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇక, కొనుగోళ్లు లేక జీఎస్టీ వసూళ్లు, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గడం వంటి అంశాలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి. అలాగే, గత బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు అంచనాలు తప్పాయి. దాంతో, ఆ లోటు మరింత పెరగకుండా ఇఫ్పుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే, ఆర్ధిక కష్టకాలంలో వనరులను సమీకరించుకోవడం సవాలుతో కూడుకున్న పని కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మాత్రం చాలా టఫ్ అంటున్నారు. మరి, ఈ పెను సవాలును నిర్మలమ్మ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dalai Lama Mantra to control Coronavirus

ఓం తారే...తుత్తారే...తురే సోహా... కరోనాకు విరుగుడుగా తారామంత్రం

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతోంది... కరోనా పేరు వింటేనే ఆమడదూరం జరుగుతున్నాయి... ఇక, చైనా అయితే అతలాకుతలమవుతోంది... నగరాలకు నగరాలే స్తంభించిపోతున్నాయి... కరోనా దెబ్బకు చైనీయులంతా బెంబేలెత్తిపోతున్నారు... కరోనా కారణంగా ఇప్పటివరకు 150మంది మరణించగా.... వేలాది మంది ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 70మందికి పైగా మృత్యువాత పడగా... గడిచిన 24గంటల్లో 30మంది మరణించడం చైనాను కలవరపెడుతోంది. ఇక, చైనాలో ఉన్న విదేశీయులైతే హుటాహుటిన తమ దేశాలకు పయనమవుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే.... టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాత్రం... చిన్న మంత్రం జపిస్తే చాలు... ప్రాణాంతక కరోరా దరిచేరదని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ ...తారా మంత్రం... పఠించాలంటూ చైనీయులకు సూచించారు. అంతేకాదు... ఓం తారే... తుత్తారే... తురే సోహా... అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను తన అనుచరుల కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ తారామంత్రం... కరోనా వైరస్‌ దరిచేరకుండా... వ్యాపించకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అన్నారు. అయితే, దలైలామా చెప్పిన ఈ మంత్రం ఇప్పుడు చైనాలో వైరల్ అవుతోంది.

ys jagan first step in decentralization

పట్టణీకరణపై జగన్ సర్కారు ఫోకస్... అభివృద్ధి వికేంద్రీకరణలో తొలి అడుగు...

పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమంటోన్న జగన్ ప్రభుత్వం... పట్టణీకరణపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధుల్లోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్ పరిధిలోకి కొత్తగా అమలాపురం, మండపేట, ముమ్మిడివరం, ఏలేశ్వరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను చేర్చింది. దాంతో, ప్రస్తుతం 2వేల 183 చదరపు కిలోమీటర్లున్న గోదావరి డెవలప్‌‌మెంట్‌ అథారిటీ పరిథి ఏకంగా 4వేల 396 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి రాప్తాడు నియోజకవర్గాన్ని చేర్చింది. రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఆత్మకూరు, రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు మండలాలను చేర్చడంతో... అహుడా పరిధి 6వేల 591 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి నగరి మున్సిపాలిటీతోపాటు 13 మండలాలను చేర్చడంతో... 4వేల 527 కిలోమీటర్లకు తుడా పరిథి పెరిగింది. గోదావరి అర్బన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ... తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ... అలాగే, అనంతపురం-హిందూపురం అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీలోకి... పెద్దఎత్తున మున్సిపాలిటీలను, మండలాలను తీసుకొస్తూ... పురపాలకశాఖ ఉత్తర్వులు ఇవ్వడంతో... ఒక్కసారిగా వేల చదరపు కిలోమీటర్ల పరిధి... ఈ సంస్థల నియంత్రణలోకి వచ్చాయి. అయితే, ఈ మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని భారీగా పెంచిన ప్రభుత్వం... కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధిని చేపడుతుందో చూడాల్సి ఉంది.

2020 Delhi Legislative Assembly election

గెలుపు ధీమా.. ఢిల్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటున్న ప్రధాన పార్టీలు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడి గెలుపును అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం పై జెండా ఎగుర వేసేందుకు ప్రధాన పార్టీలు వినూత్న ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్రం చిన్నది అయినా అసెంబ్లీ సీట్లు తక్కువ గానే ఉన్నా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది ఢిల్లీ. దేశ రాజధాని కావడం అందులో అన్ని వర్గాల.. రాష్ర్టాల.. ప్రజలు నివసిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో దాదాపు కోటిన్నర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేవలం నెల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పునిస్తారన్న దానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమాద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపే చేతులెత్తేసింది. తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏడు పార్లమెంటు స్థానాలకు ఏడు సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బిజెపి మాత్రం కేవలం మూడు స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికలు అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను అవకాశంగా చేసుకుని హస్తిన అసెంబ్లీలో పునః వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

లోకేష్ వర్సెస్ వంశీ.. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం!

వల్లభనేని వంశీ టీడీపీని వదలి వెళ్లిన సమయం నుండి వంశీ మరియు లోకేష్ ఒకరి పై ఒకరు సోషల్ మీడియా వేదికగా తెగ పొస్ట్ లు పెడుతున్నారు. మీడియాను ఆసరాగా చేసుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సెన్సేషనల్ గా మారారు.టీడీపీ యువనేత నారా లోకేష్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో హాట్ టాఫిక్ గా మారింది. టిడిపి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, పోతుల సునీత తదితరుల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.  నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లినప్పుడు సంతలో గొర్రెల్లా తమ ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ కొనిందని జగన్ ఆరోపించారు. ఆయన మాటలనే ప్రస్తావిస్తూ వీరి ఫోటోను జత చేసేన లోకేష్ గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కొన్నారంటూ కామెంట్లు కూడా చేశారు.దీని పై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందిస్తూ వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడారని ఎద్దెవా చేశారు.మండలి కూడా రద్దు కావడంతో లోకేష్ కు పిచ్చి పట్టి కామెంట్లు చేస్తున్నారని వంశీ విమర్శించారు. గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలకు తన దగ్గర వైద్యం ఉందని వంశీ జోడించారు. మితి మీరుతున్న వీరి కామెంట్లు ,పోస్టల పై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సారీ.. నేను రాను... సీఎం రమేష్ కుమారుడి పెళ్లికి రానని చెప్పిన జగన్!!

తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇద్దరిది ఒకే జిల్లా కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి టైం నుంచే సీఎం రమేష్ తో పొలిటికల్ రైవలరీ ఉండేది. టిడిపిలో ఉన్నంత వరకు జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు రమేష్. బిజెపిలో చేరిన తర్వాత సీఎం రమేశ్ కాస్త సైలెంట్ అయినా అప్పుడప్పుడు విమర్శల బాణాలు వేస్తూనే ఉన్నారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నేపథ్యంలో సీఎం రమేష్ ఏకంగా సీఎం జగన్ ను అమరావతి వెళ్లి కలవడం.. ముసిముసి నవ్వులు నవ్వుకోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  సీఎం రమేష్ కుమారుడి వివాహం వచ్చే నెల మొదటి వారంలో జరగబోతోంది. దుబాయి లో ఎంగేజ్ మెంట్ ను అంగరంగవైభవంగా చేశారు రమేష్ . పెళ్లి వేడుకను అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు సీఎం రమేష్. అమరావతి సచివాలయంలోని సీఎం ఆఫీసుకు కొడుకుతో పాటు సతీసమేతంగా వెళ్లి జగన్ కు ఆహ్వాన పత్రిక అందించారు. పక్కనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని పిలిచారు. కానీ సీఎం జగన్ రియాక్షన్ తో షాక్ అయ్యారట సీఎం రమేష్. పెళ్లికి రాలేనని చెప్పారట సీఎం జగన్. రావాలని పదేపదే అడిగినా జగన్ మాత్రం సారీ అన్నారని సమాచారం.  పెళ్ళికి రాలేను అని జగన్ చెప్పిన దానిపై చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లికి టిడిపి అధినేత చంద్రబాబు అలాగే ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు తన రాజకీయ ప్రత్యర్థులు వస్తారని అందుకే తాను రాలేనని సీఎం రమేష్ కు నవ్వుతూనే చెప్పారట జగన్. రాజధానుల అంశం ఇంగ్లీష్ మీడియంపై ఈ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒకే వేదికలో కూర్చోవడం మాట్లాడటం తనకే కాదు వాళ్ళకి ఇబ్బందేనని అన్నారట జగన్. అయినా రావడానికి ప్రయత్నించాలని చెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు సీఎం రమేష్ దంపతులు.  ఈ మధ్య సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారని మాటలు వినపడుతున్నాయి. కొడుకు మ్యారేజ్ కి ఆహ్వానించడమే కాదు సీఎం జగన్ శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి హాజరయ్యారు రమేష్. కడపతో పాటు అనేక చోట్ల సీఎం రమేష్ కు కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఇంకా డబ్బులు రావలసి ఉండటంతో ఇదంతా చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వ మాత్రం బిల్లులు క్లియర్ చేయటం లేదట. దీంతో జగన్ తో వైరం పెంచుకుంటే బిల్లులన్నీ మరింత కాలం పెండింగ్ లో పడతాయని భావించిన సీఎం రమేష్ వైసీపీ అధినేతతో కయ్యం కన్నా వియ్యమే మేలని ఆలోచిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం నడుపుతూ జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అధిష్టానం కూడా జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు తానెందుకు నెగిటివ్ గా ఉంటానని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రమేష్ ను మాత్రం జగన్ దూరం పెడుతున్నారు. అందుకే కొడుకు పెళ్లికి సైతం రాలేనని సున్నితంగా బదులిచ్చారు సీఎం జగన్.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఇఫ్పుడు సిట్ ఎందుకు వేశారు? జగన్ కు చెల్లెలు సూటి ప్రశ్న

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.

బీజేపీలో చేరింది.. మోదీ కే మీ ఓటు అని ప్రచారం చెయ్యనున్న సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ జనరల్ సెక్రెటరీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సైనా నెహ్వాల్ తో ఢిల్లీలో ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నట్లు సమాచారం. బిజెపి జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మోదీ దేశం కోసం పాటుపడుడుతున్న వైనం చూసి ఆయనతో పని చేయాలనే బీజేపీలో చేరినట్లు సైనా నెహ్వాల్ మీడియాతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నడ్డాతో భేటీ అయ్యారు సైనా. రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైనాతో ప్రచారం చేయించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ దేశ అభివృద్ధి కోసం, క్రీడ అభివృద్ధి కోసం పాటుపడడం చూసి కొందరు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీని కోసం ముఖ్యమైన నేతలు, సెలబ్రిటీలతో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించే వ్యూహం చేసినట్లు సమాచారం. కేంద్ర మంతి అమిత్ షా తో పాటు వివిధ ముఖ్య నేతల సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేజ్రివాల్ కు దీటుగా ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీని సైతం తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.