is kia moving out of andhra pradesh

నిప్పు లేనిదే పొగ రాదు... కియా రగడకు అసలు కారణమిదే?

దక్షిణ కొరియా దిగ్గజ కార్ల కంపెనీ కియా మోటార్స్ ...ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం... ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాయిటర్స్ కథనంతో జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన మీడియా ముందుకొచ్చిన మంత్రి బుగ్గన.... కియా ఎక్కడికి తరలిపోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ కావాల్సినవన్నీ ఇస్తున్నామని, తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కియా యాజమాన్యం పూర్తి సంతృప్తితో ఉందన్నారు. అయితే, కియాతోపాటు ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని బుగ్గన అన్నారు. అయితే, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల కంపెనీగా పేరుగాంచిన కియా మోటార్స్... భారత్‌లోకి ఎంట్రీ ఇస్తూ తన తొలి ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పింది. పరిశ్రమ ఏర్పాటుకు అనంతపురం జిల్లాను ఎంచుకున్న కియా.... రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత...  గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. దాదాపు 14వేల కోట్ల రూపాయల వ్యయంతో, ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన అనంతపురం ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. అయితే, ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే కియాకు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. స్థానికంగా నిపుణులు లేకపోతే 75శాతం ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమంటూ కియా అభ్యంతరం చెప్పిందని, ఇదే వివాదానికి కేంద్ర బిందువైందని అంటున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కియా మోటార్స్ కూడా జగన్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయే అలాంటి ఆలోచనకు వచ్చేరేమోనంటూ తెలుగుదేశం లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కియా వివాదంపై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవాలనుకుంటోందని... కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సభ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, రామ్మోహన్ నాయుడు స్పీచ్‌కు అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు.... కియాపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ కౌంటరిచ్చారు. అయితే, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.... రామ్మోహన్ నాయుడు సీటు దగ్గరకు వెళ్లడంతో సభలో కలకలం రేగింది. స్పీకర్ వారించడంతో మాధవ్ తిరిగి తన సీట దగ్గరికి వచ్చి కూర్చున్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఖండించారు. కియా పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడం లేదని... తెలుగుదేశం నేతలు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా రాయిటర్స్ కథనంపై స్పందించారు. కియా తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. కియా మోటార్స్ తరలిపోతోందన్న వార్తల్లో అస్సలు నిజం లేదన్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయంటూ మంత్రి గౌతమ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా స్థానికులకు 75శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనతోనే జగన్ ప్రభుత్వానికి, కియా యాజమాన్యానికి మధ్య రగడ మొదలైందని తెలుస్తోంది. అయితే, కియా తరలిపోనుందా? అంటూ కథనం రాసిన రాయిటర్స్ కూడా ఆషామాషీ సంస్థ కాదు. అందుకే, ఆగమేఘాల మీద రాయిటర్స్ కథనంపై మంత్రులు, వైసీపీ ఎంపీలు, ముఖ్యనేతలు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

Hajipur Serial killer Srinivas Reddy sentenced to death

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష... హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు....

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు బాలికలపై పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా అత్యంత కిరాతంగా చంపేసి బావిలో పాతిపెట్టిన నరరూప రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించింది. హాజీపూర్ హర్రర్ కేసుల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు... మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, బ్లడ్ టెస్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్... ఇలా అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సమర్పించడంతో తప్పించుకోలేకపోయాడు. పోలీసులు అందజేసిన ఎవిడెన్స్ ఆధారంగా ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. మొత్తం 101మంది సాక్షులను సుదీర్ఘంగా విచారించిన కోర్టు... శ్రావణి, కల్పన, మనీషా కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది. అయితే, మూడు కేసుల్లోనూ నేరం రుజువైందంటూ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి న్యాయమూర్తి తెలియజేయగా, తనకేం సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ జడ్జికి విన్నవించుకున్నాడు. తన తల్లిదండ్రులను తానే పోషించాలని... తన ఇల్లు కూల్చేశారంటూ న్యాయమూర్తికి తెలియజేశాడు. భూతగాదాలతోనే తనను ఈ కేసుల్లో ఇరికించారంటూ న్యాయమూర్తికి చెప్పుకున్నాడు. అయితే, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అంటూ శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చాడు. మొత్తానికి హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై బాధితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వెంటనే ఉరిశిక్ష అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.

coronavirus case in Andhra Pradesh

ఏపీలో కరోనా వైరస్... రాజధాని ప్రజలారా అప్రమత్తం కండి!!

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్ ని తాకిందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకరికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో ఒకరు హాస్పిటల్ లో చేరగా, కరోనా సోకినట్లు నిర్దారించారని తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదు అయినట్లుగా.. హాస్పిటల్ సూపరింటెండెంట్ అంగీకరించారని వార్తలొస్తున్నాయి.  చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న అవనిగడ్డకి చెందిన ఓ స్టూడెంట్ కి కరోనా లక్షణాలు ఉన్నాయని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడలో నమోదైన కేసు, అవనిగడ్డ స్టూడెంట్ ఒక్కరేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ వర్గాలు మాత్రం.. ఈ వార్తల్లో నిజంలేదు అంటున్నాయి. ఇంతవరకు కరోనా కేసు నిర్దారణ కాలేదు అని చెప్పుకొస్తున్నాయి. నిజంగానే కరోనా కేసు నమోదు కాలేదా? లేక ప్రజలు భయబ్రాంతులకు గురవుతారని ప్రభుత్వం నిజం దాస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అమరావతి పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

tamil nadu govt about ap kia issue

'కియా'తో మేం సంప్రదింపులు జరపలేదు: తమిళనాడు!!

కియా మోటార్స్‌ ఏపీ నుండి తమిళనాడుకు తరలిపోతుందని 'రాయిటర్స్‌' సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయి అంటూ.. విపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. కియా మోటార్స్‌- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే, కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని, వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. 

council chairman shariff announced the two select committees

సెలక్ట్ కమిటీలను నియమించిన మండలి చైర్మన్.. వైసీపీ దూరం!!

సెలెక్ట్ కమిటీల విషయంలో ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోని ఆయన.. గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నియమితులయ్యారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి నారా లోకేష్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్‌, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఇదిలా ఉంటే సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ మండలి చైర్మన్‌ షరీఫ్ కు వైసీపీ లేఖ రాసింది. కమిటీల్లో తాము భాగస్వాములు కాబోమని లేఖలో పేర్కొంది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని, మండలి రద్దు బిల్లు సైతం పార్లమెంటులో పెండింగ్ లో ఉందని, ఇలాంటి సమయంలో పేర్ల ప్రకటన అవసరం లేదంటూ.. మండలి చైర్మన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్‌, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు. అయితే, కమిటీల ఏర్పాటుపై తన విచక్షణాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరని మండలి చైర్మన్ షరీఫ్ అన్నట్లు తెలుస్తోంది. సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యుల పేర్లను సూచిస్తూ.. లేఖలు ఇవ్వడంతో చైర్మన్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. మరోవైపు, సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోనని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్దంటున్నా మండలి చైర్మన్ పట్టుదలతో సెలెక్ట్ కమిటీలను ప్రకటించడంతో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

nellore extra court sensational judgment on murder case

న్యాయం గెలిచింది... ఇంతియాజ్ కి ఉరిశిక్ష

నెల్లూరు ఎనిమిదవ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా హరనాథపురం తల్లీకూతుళ్ళ హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12 న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. ఇద్దరు తల్లి కూతుర్లు దారుణమైన హత్యకు గురైన సమయంలో భార్గవి తండ్రి దయాకర్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బ్రతికాడు. ఈ కేసుకు సంబంధించి ఇంతియాజ్ అనే నిందితుడికి ఉరిశిక్షను అమలు చేసింది ధర్మాసనం. భార్గవి వాళ్ళ కుటుంబం ఇళ్ళు కడుతుండగా దానికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ కోసం పని చేయడానికి వచ్చిన ఇంతియాజ్ ఇంటిలో డబ్బు, నగలు ఎక్కువగా ఉన్నాయని గమనించాడు. వాటిని దొంగలిద్దామన్న నేపధ్యంలో వారి పై దాడికి ప్రయత్నించగా ఆ దాడిలో భార్గవి మరియు తన తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మాత్రం తీవ్ర గాయల పాలయ్యాడు. ఇంతియాజ్ కు సహాయ పడిన ఇద్దరు మైనర్లకు కోర్ట్ గతంలోనే శిక్షను విధించగా, నేడు నెల్లూరు కోర్ట్ ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.  

ycp activists attack on tdp supporter

రక్తంతో తడిసిన చొక్కాతో చంద్రబాబుని కలిశాడు

టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ బాధితుడు కలిశాడు. టీడీపీకి మద్దతుగా ఉన్నందుకు తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ వాపోయాడు. మాచర్లకు చెందిన దండు పెద వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో వెంకయ్య టీడీపీ కార్యాలయానికి వెళ్లి, పార్టీ అధినేతతో తనపై జరిగిన దాడి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రక్తంతో తడిసిన చొక్కాతో వెంకయ్య రావడంతో.. అతడిని చూసి చంద్రబాబు చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడి కోసం వచ్చి తనపై దాడి చేశారని వెంకయ్య భోరున విలపించాడు. టీడీపీకి మద్దతుగా ఉన్నందుకే దాడి చేశారని వెంకయ్య వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారనే ఉద్దేశంతోనే.. వెంకయ్యపై దాడి చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసుంటారని అంటున్నారు. కాగా, బాధితుడికి ప్రాథమిక చికిత్స చేయించి.. డీజీపీ, ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లాలని వర్ల రామయ్యకు చంద్రబాబు సూచించారు.

ias posts vacancy in andhra pradesh

ఏపీలో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీ!!

ఆంధ్రప్రదేశ్‌లో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్ల ద్వారా ఏపీలో 239 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 181 మాత్రమే ఉంది. ఈ విషయాన్ని కేంద్రం ధృవీకరించింది. రాజ్యసభలో గురువారం వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌.. ఏపీలో 58 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడించారు. ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం నిరంతరం ప్రక్రియ అని మంత్రి చెప్పారు. కాలానుగుణంగా ఐఏఎస్‌ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అలాగే స్టేట్‌ కేడర్‌ అధికారులకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.  వివిధ రాష్ట్రాలలో ఏళ్ళ తరబడి భర్తీ కాకుండా మిగిలిపోతున్న ఐఏఎస్‌ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అదనంగా 1000 ఐఏఎస్‌లను నియమిస్తుందా అన్న మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ అలాంటి ఆలోచన లేదని చెప్పారు. కేడర్‌ మేనేజ్‌మెంట్‌లో సమన్వయం పాటించడం, ఐఏఎస్‌ అధికారుల భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను మాత్రమే రిక్రూట్‌ చేసుకోవాలన్నది ప్రభుత్వ విధానం అని చెప్పుకొచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఏటా 180 ఐఏఎస్‌లను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఏపీకి 2017లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 6, ప్రమోషన్ల ద్వారా 6.. 2018లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 12, ప్రమోషన్ల ద్వారా 21.. 2019లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 11, ప్రమోషన్ల ద్వారా 6 చొప్పున ఐఏఎస్‌ పోస్టుల భర్తీ జరిగినట్లు మంత్రి వివరించారు.

Buggana Rajendranath Reddy Gives Clarity About Kia Motors Shifting

టీడీపీ హయాంలో పెట్టుబడులు వచ్చిన మాట నిజమే: బుగ్గన

కియా మోటార్స్ తరలింపు వార్తలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. రాయిటర్స్ సంస్థ పబ్లిష్ చేసిన కథనం వాస్తవం కాదని.. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కియా పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటును విస్తరణకు ప్రణాళికలు చేస్తుంటే, ఇక తరలిపోయే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. అదేవిధంగా, విశాఖలోని మిలేనియం టవర్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఓ ఐటీ సంస్థను ప్రభుత్వం అదేశించినట్టుగా జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు.  మా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం అన్నారు. 2019 అక్టోబర్ వరకు పెట్టుబడులు వచ్చాయి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెబుతోందని తెలిపారు. గతంలోను వచ్చాయి.. మొత్తం మేము క్రెడిట్ తీసుకోవాలని కూడా భావించటం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగ్ లో పెట్టారు. 3 వేల కోట్ల బకాయిలు పెట్టేసి వెళ్లారని ఆరోపించారు. తమ హయాంలో, 1051 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. జూన్ 2019 నుంచి 15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరో 8 వేల కోట్ల  మేర కంపెనీలు ఉత్పత్తి కి సిద్ధంగా ఉన్నాయి. అయినా మేము ప్రచారం చేసుకోడానికి విరుద్ధమని బుగ్గన చెప్పుకొచ్చారు.

Millennium Towers Companies Recieved Notices

తరలిపోతున్న ఐటీ కంపెనీలు.! జగన్ సర్కారు నిర్ణయంతో 18వేల ఉద్యోగాలు మటాష్.! 

కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  

alla ramakrishna reddy fires on chandrababu

జయభేరి కోసం రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు!!

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు సీఎం జగన్ ని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా పూలింగ్‌ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారు. వాటికి సమీపంలో ఈస్ట్‌ ఫేస్‌తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్‌లో పెట్టారని ఆరోపించారు. స్దానికంగా 600 ఎకరాల రైతులకు అన్యాయం చేయలేదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారని ఆరోపించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.

one week deadline for nirbhaya convicts

నిర్భయ దోషులకు డెడ్ లైన్... ఇక మిగిలింది ఒకే ఒక్కడు...

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షమాభిక్ష అండ్ క్యురేటివ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిర్భయ దోషుల ఉరిపై జనవరి 31న పాటియాలా కోర్టు స్టే విధించడంతో నిలిచిపోయిన శిక్ష అమలు మళ్లీ ఎప్పుడనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, పాటియాలా కోర్టు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం... అలాగే, ఢిల్లీ సర్కారు సవాలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు సంచలన తీర్పు వెలువరించింది. పాటియాలా కోర్టు తీర్పును సమర్ధిస్తూనే... న్యాయ ప్రక్రియను ముగించుకునేందుకు నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. న్యాయ ప్రక్రియను ముగించి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని చెప్పింది. అయితే, న్యాయ ప్రక్రియ ముగించుకోవడానికి నిర్భయ దోషులకు వారం రోజులు గడువిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయడానికి ఆదేశాలు ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అలాగే, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంలో కేంద్రం సవాలు చేసింది. ఇదిలాఉంటే, నిర్భయ దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దాంతో, నలుగురు నిర్భయ దోషుల్లో ఇఫ్పటికే ముగ్గురు మెర్సీ పిటిషన్లపై నిర్ణయం పూర్తయింది. ఇక, ఒకే ఒక్కడు మిగిలున్నాడు. అయితే, నిర్భయ దోషులకు ఢిల్లీ హైకోర్టు... వారం రోజుల గడువు ఇవ్వడంతో.... ఇక, మిగిలిన ఒకే ఒక్కడు పవన్ గుప్తా....ఈలోపే మెర్సీ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల గడువులోగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకుంటే రాష్ట్రపతి కూడా వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇఫ్పటికే ముగ్గురు దోషుల మెర్సీ పిటిషన్స్ ను రిజక్ట్ చేసి ఉండటంతో... ఒకవేళ పవన్ గుప్తా క్షమాభిక్ష కోరినా తిరస్కరించే అవకాశమే కనిపిస్తోంది.

ys jagan about introducing english medium in schools

ఇంగ్లీష్ లెక్చరర్ అవతారమెత్తిన జగన్... స్టూడెంట్స్ గా మారిపోయిన విద్యావేత్తలు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్‌ అవతారమెత్తారు.  విజయవాడలో నిర్వహించిన... ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ప్రవేశపెట్టారో వివరించారు. మన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. అంతేకాదు, ఎడ్యుకేషన్‌లో ప్రపంచ దేశాలతో భారత్‌‌ను... ఆంధ్రప్రదేశ్‌ను పోల్చుతూ లెక్కలతో సహా వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుంటే... సదస్సుకు హాజరైనవారంతా స్టూడెంట్స్ లా మారిపోయి... శ్రద్ధగా విన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడని, అయితే ఒక తండ్రిగా నా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటానని, అందుకే.... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు. పేద విద్యార్ధులకు కూడా ఇంగ్లీష్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏలుతుందన్న జగన్మోహన్ రెడ్డి... ఇంగ్లీష్ లాంగ్వేజ్ లగ్జరీ కాదని... అందరికీ నెస్సస్సరీ లాంగ్వేజ్ అన్నారు. అయితే, పేద విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదని, అందుకే... తాము ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అదే సమయంలో, మాతృభాషకు అన్యాయం జరగకుండా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేశామని జగన్ గుర్తుచేశారు. తాము తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్ధులు సైతం ప్రపంచంతో పోటీపడగలరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. 99శాతం ప్రైవేట్ స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండగా, పేద పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో ఎందుకు చదవాలని జగన్ ప్రశ్నించారు. మీరైనా, నేనైనా మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలమా అన్నారు. కేవలం, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేస్తూ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు జగన్ తెలిపారు. నాడు నేడుతో పాఠశాల రూపురేఖలే మార్చేయబోతున్నామని జగన్ వెల్లడించారు. నాణ్యమైన విద్యతోపాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

War Of Words Between TRS And BJP Leaders Over Turmeric Board

తెలంగాణలో పసుపు యుద్ధం... స్పైసీ వద్దంటోన్న గులాబీ నేతలు...

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పసుపు యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ గా గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానంటూ రైతులను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన అర్వింద్... ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శిస్తున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్న ధర్మపురి అర్వింద్... ఇప్పుడు స్పైస్ సెంటర్ పై ప్రకటన చేయించి ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటుతో రైతులకు ఒరిగేదేమీ ఉండదని విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇఛ్చినట్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పసుపునకు మద్దతు ధర కల్పించి కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ నేతలు, అలాగే ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పినట్లుగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా... కేవలం ఇద్దరు అధికారులతో స్పైస్ సెంటర్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగమంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరంగల్‌‌లో ఉన్న స్పైస్ బోర్డును కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదని టీఆర్ఎస్ హెచ్చరించింది. మరోవైపు, నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటులో అర్వింద్ పాత్రేమీ లేదంటున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. మాజీ ఎంపీ కవిత కృషి వల్లే నిజామాబాద్లో స్సైస్ బోర్డు ఏర్పాటవుతోందని అంటున్నారు.

is kia motors moving to tamilnadu

కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోనుందా? జగన్ ప్రభుత్వంతో కియాకి పడటం లేదా?

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలువురు పారిశ్రామికవేత్తలు సైతం వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందంటూ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్‌దాస్ పాయ్ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తన ప్లాంట్ ను తరలించాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతోంది. 1.1 బిలియన్ డాలర్లతో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల ప్లాంట్ ను తమిళనాడుకు తరలించే సాధ్యాసాధ్యాలపై కియా మోటార్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ప్రతినిధులు ఇఫ్పటికే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. దాంతో, రాయిటర్స్ కథనంపై ఏపీలో కలకలం రేగుతోంది.  ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కారు మార్కెట్ కలిగివున్న కియా మోటార్స్... భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తొలి ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పింది. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. అయితే, చంద్రబాబు హయాంతో రాష్ట్రానికొచ్చిన కియా మోటర్స్.... జగన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు రుజువుగా, అసెంబ్లీ సాక్షిగా కియాకి చంద్రబాబు కల్పించిన రాయితీలు, సౌకర్యాలపై మంత్రి బుగ్గన తప్పుబట్టారు. దాంతో, కియా మోటార్స్ తో జగన్ ప్రభుత్వానికి సఖ్యత లేదనే మాటలు వినిపించాయి. ఇఫ్పుడు, రాయిటర్స్ కథనంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతలైతే జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వంటి వారైతే.. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఈ శిక్ష అనుభవించాలి, ఏపీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, రాయిటర్స్ కథనాన్ని ఏపీ అధికారులు ఖండిస్తున్నారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమంటున్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఏపీ ఇండస్ట్రీస్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించారు. ఏపీ నుండి కియా తరలిపోతుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్ కియాతో సంఖ్యతగా ఉన్నారని, రాష్ట్రంలో కియా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని విజయసాయి చెప్పుకొచ్చారు. అసలు రాయిటర్స్ లాంటి సంస్థ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కియా తరలిపోతుందన్న అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో.. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయితే, రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ స్పందించాల్సి ఉంది. అలాగే, ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే అనుమానాలు కంటిన్యూ కావడం ఖాయం.

పవన్ బాటలో రజనీ... ఇద్దరి అజెండా ఒక్కటే...

ఒకరు తమిళ సూపర్ స్టార్... మరొకరు టాలీవుడ్ పవర్ స్టార్... ఇద్దరూ ఇద్దరే... వీళ్లిద్దరూ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే.... ఎందుకంటే వీళ్ల మాటలు అంత పవర్ ఫుల్ గా జనాల్లోకి దూసుకెళ్తాయి. అయితే, దేశంలో అలజడి రేపుతున్న సీఏఏకి మద్దతు పలకడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమాన మేఘాలు తొలగకపోయినా.... దానికి వకాల్తా పుచ్చుకుని, మోడీ సర్కారుకు బాకా ఊదుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే పవన్ కమలంతో కలిసి నడుస్తుండగా... రజనీ కూడా కాషాయ బాటలోనే వెళ్లాలనుకుంటున్నారని అంటున్నారు. అందుకే, రజనీ కూడా బీజేపీ భాషలోనే మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీతో కలిసి ముందుకు సాగుతోన్న జనసేనాని పవన్ కల్యాణ్... సీఏఏకి మద్దతు ప్రకటించారు. బీజేపీతో స్నేహం కుదిరిన నాటినుంచి మోడీ ప్రభుత్వంపై పవన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే సీఏఏకు మద్దతివ్వడమే కాకుండా అపోహలు అవసరమే లేదంటూ కామెంట్ చేశారు. ఇక, ఇప్పుడు రజనీకాంత్ కూడా పవన్ బాటలోనే నడిచారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని తలైవా హామీ ఇచ్చారు. దేశ విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజనీ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు ఆ అవకాశం ఇవ్వరాదని రజనీ సూచించారు. అయితే, దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి. రజనీ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీకి బాకా ఊదడటమే రజనీ పనయ్యిందన్నాయి. సీఏఏతో ముస్లింలు అభద్రతాభావానికి గురవుతున్నారని... షహీన్‌బాగ్‌ ఆందోళనలు... రజనీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే.... రజనీకాంత్, పవన్‌లు అదేపనిగా మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం, హిందూత్వ భావజాలంలో మాట్లాడటం వెనుక వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా వీళ్లిద్దరూ తమ రాజకీయ ఎదుగుదలకు, పోరాటానికి బీజేపీ బలం అవసరమని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ వంటి బీజేపీ దళాలు తోడ్పడుతాయని, రజనీ, పవన్‌లు ఆశిస్తున్నారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ మన్ననలు పొందేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు  జరుగుతున్నా, వీరు మాత్రం, ప్రశంసలు కురిపించడం వెనుక మతలబు ఇదేనంటున్నారు. మొత్తానికి మొన్న పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ మన్ననలు పొందే ప్రయత్నం చేసిన రజనీ.... ఇప్పుడు ఇద్దరూ పౌరసత్వ సవరణ చట్టమైన సీఏఏకు మద్దతిచ్చి, తమిళనాట సరికొత్త చర్చకు తెరలేపారు.

ఉపముఖ్యమంత్రిగా కేటీఆర్.! ఆ తర్వాత నేరుగా సీఎం కుర్చీయే.!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ దాదాపు ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు సైతం ఈమధ్య కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరేనంటూ ప్రకటనలు కూడా చేశారు. ఐటీ అండ్ మున్సిపల్ మంత్రిగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్న కేటీఆర్... ఏదోఒక రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు ముగిశాక మంచిరోజు చూసుకుని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ఖండించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కొట్టిపారేశారు. అయితే, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేటీఆర్ కోసం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేశారట. ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకుండా.... ఉపముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యనేతలతో తన మనసులో మాటను కేసీఆర్ బయటపెట్టారని అంటున్నారు. కేటీఆర్ ను డిప్యూటీ సీఎంను చేస్తే ఎలాగుంటుందంటూ అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ప్రభుత్వంలో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్... రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవరికీ డిప్యూటీ సీఎమ్ లుగా అవకావమివ్వలేదు. అయితే, ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకంగా తీసుకునే కేసీఆర్.... ఈసారి ఉపముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ కోసం రిజర్వు చేశారని అంటున్నారు. ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఇప్పుడు కేటీఆర్ ను ఉపముఖ్యమంత్రిని చేయనున్నారని అంటున్నారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం హోదాలో కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ముఖ్యమంత్రి లేనిసమయంలో అవసరమైతే మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించవచ్చని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని కీలక ఫైల్స్ పై సంతకాలు చేసే అధికారం ఉంటుందని అంటున్నారు. ఈవిధంగా పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ కేటీఆర్ ను కీలకం చేయడం వల్ల కేటీఆరే ఫ్యూచర్ సీఎం అంటూ అటు పార్టీని, ఇటు ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేయబోతున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే, ఎవరేమనుకున్నా డేంట్ కేర్ అంటూ కేటీఆర్ ను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేసే అధికారం కేసీఆర్ కు ఉంది. కానీ, ఉన్నట్టుండి కేటీఆర్ ను సీఎంను చేస్తే కొందరు సీనియర్ల నుంచి వ్యతిరేకత రావొచ్చు. అది చివరికి ఎటువైపైనా దారి తీయొచ్చు. అందుకే, కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తనయుడు కేటీఆర్ ను ఒకేసారి ముఖ్యమంత్రిని చేయకుండా ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి, త్వరలోనే కేటీఆర్... డిప్యూటీ సీఎం హోదాకి ప్రమోషన్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. అలా, కొన్నాళ్లు ఉపముఖ్యమంత్రి పదవి నిర్వహించాకే... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశముందంటున్నారు.  

పవన్ కు దీటుగా చిరంజీవి కొత్త రాజకీయం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో పెరిగిన పలుకుబడి..!

సైరా మూవీ ప్రమోషన్లో భాగంగా తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవికి పలుకుబడి పెరిగిందంటున్నారు. ఇండస్ట్రీకి సంబంధించినది ఏదైనాసరే చిరంజీవి ద్వారానే చేస్తామంటూ సీఎం జగన్ చెప్పారనే మాట వినిపించింది. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అమరావతి కోసం పోరాడుతుంటే, చిరంజీవి మాత్రం జగన్‌కే సపోర్ట్ ఇచ్చారు. ఇక, చిరంజీవి సైరా విడుదల, అదనపు షోస్ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించింది. అప్పట్నుంచే సీఎం జగన్ తో చిరంజీవికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... ఏకంగా చిరంజీవి ఇంటికి వచ్చి సమావేశం కావడం కీలకంగా మారింది.  చిరంజీవి, నాగార్జునతో భేటీలో సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తలసాని తెలిపారు. అయితే, ఈ భేటీలో సినీ ఇండస్ట్రీ చర్చలతోపాటు, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి పోషించబోతున్న పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే చిరంజీవితో మంత్రి తలసాని సమావేశమయ్యారన్న మాట ఉత్కంఠ రేపుతోంది. అయితే, ఇఫ్పటికే ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న చిరంజీవి... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ మెరుగైన సంబంధాలకు కోరుకుంటున్నారని, దానిలో భాగంగానే తలసాని ...మెగాస్టార్ ఇంటికి వచ్చారని అంటున్నారు. ఇటు తెలంగాణ... అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో చిరంజీవి స్నేహపూరిత సంబంధాలను కోరుకోవడం వెనుక ఆయనకంటూ ఒక వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారట. అందుకే ఎప్పుడూ లేనిది ఈమధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటూ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటాననే సంకేతాలను పంపారు. తన పనేదో తాను చేసుకుపోవడం తప్పా... ఇంతకుముందెప్పుడూ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాలు, సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు అవసరమని గ్రహించిన చిరంజీవి, అటు జగన్ తోనూ... ఇటు కేసీఆర్ తోనూ... అలాగే, అధికార పార్టీల నాయకులతోనూ టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, ఇరు ప్రభుత్వాధినేతలు, అలాగే అధికార పార్టీల నేతలు కూడా చిరంజీవికి సహకరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కాపు వర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న చిరంజీవితో కలిసిమెలిసి ఉండటం లాభమే కానీ నష్టమేమీ ఉండదని అధికార పార్టీల అధినేతలు భావిస్తున్నారట. ఇరువైపులా పరస్పర అవగాహనతో సహకరించుకుంటున్నారని అంటున్నారు. అందుకే... ఇటు తెలంగాణ ప్రభుత్వంలో... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ... చిరంజీవికి పలుకుబడి ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా మారాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే తన వద్దకే రావాలని, తన ద్వారానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్న ఏపీ టిడిపి..కళా వెంకట్రావు స్థానంలో వచ్చేదెవరు..?

ఏపి టిడిపిలో జోష్ నింపడానికి భారీ మార్పులకు రెడీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్ర అధ్యక్షుడ్ని త్వరలోనే మార్చబోతున్నారు అనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో తిరుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కళా వెంకట్రావు స్థానంలో వచ్చే ఆ నేత ఎవరు, రాష్ట్ర కమిటీ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుంది. ఏపి టిడిపిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించారు. తరువాత ఆయన కేబినెట్ లోకి తీసుకున్నారు కానీ, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న నిస్సత్తువను పోగొట్టేందుకు సమూల మార్పులు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే కళా వెంకట్రావు స్థానంలో మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోనే టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఆ పని పక్కన పడింది. అయితే ఇప్పటికే ఆలస్యం అవడంతో ఈ నెలాఖరు లోగా పార్టీ కమిటీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. పార్టీ అధ్యక్ష మార్పు జరిగితే శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.  దీంతో అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు స్థానంలో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచే అధ్యక్షుడిని తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటే అచ్చన్నకే ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక కోణంలో చూసుకున్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అధ్యక్ష పదవి అచ్చెన్నకిచ్చిన, రవిచంద్రను ఎంపిక చేసిన కలిగే లాభ నష్టాలపై పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినప్పటికీ మరోవైపునుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఒకవేళ అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆయన స్థానంలో వేరేవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కమిటీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.