పవన్ కు దీటుగా చిరంజీవి కొత్త రాజకీయం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో పెరిగిన పలుకుబడి..!
సైరా మూవీ ప్రమోషన్లో భాగంగా తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవికి పలుకుబడి పెరిగిందంటున్నారు. ఇండస్ట్రీకి సంబంధించినది ఏదైనాసరే చిరంజీవి ద్వారానే చేస్తామంటూ సీఎం జగన్ చెప్పారనే మాట వినిపించింది. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అమరావతి కోసం పోరాడుతుంటే, చిరంజీవి మాత్రం జగన్కే సపోర్ట్ ఇచ్చారు. ఇక, చిరంజీవి సైరా విడుదల, అదనపు షోస్ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించింది. అప్పట్నుంచే సీఎం జగన్ తో చిరంజీవికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... ఏకంగా చిరంజీవి ఇంటికి వచ్చి సమావేశం కావడం కీలకంగా మారింది.
చిరంజీవి, నాగార్జునతో భేటీలో సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తలసాని తెలిపారు. అయితే, ఈ భేటీలో సినీ ఇండస్ట్రీ చర్చలతోపాటు, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి పోషించబోతున్న పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పైగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే చిరంజీవితో మంత్రి తలసాని సమావేశమయ్యారన్న మాట ఉత్కంఠ రేపుతోంది. అయితే, ఇఫ్పటికే ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న చిరంజీవి... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ మెరుగైన సంబంధాలకు కోరుకుంటున్నారని, దానిలో భాగంగానే తలసాని ...మెగాస్టార్ ఇంటికి వచ్చారని అంటున్నారు.
ఇటు తెలంగాణ... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చిరంజీవి స్నేహపూరిత సంబంధాలను కోరుకోవడం వెనుక ఆయనకంటూ ఒక వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారట. అందుకే ఎప్పుడూ లేనిది ఈమధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటూ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటాననే సంకేతాలను పంపారు. తన పనేదో తాను చేసుకుపోవడం తప్పా... ఇంతకుముందెప్పుడూ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాలు, సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు అవసరమని గ్రహించిన చిరంజీవి, అటు జగన్ తోనూ... ఇటు కేసీఆర్ తోనూ... అలాగే, అధికార పార్టీల నాయకులతోనూ టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, ఇరు ప్రభుత్వాధినేతలు, అలాగే అధికార పార్టీల నేతలు కూడా చిరంజీవికి సహకరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కాపు వర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న చిరంజీవితో కలిసిమెలిసి ఉండటం లాభమే కానీ నష్టమేమీ ఉండదని అధికార పార్టీల అధినేతలు భావిస్తున్నారట. ఇరువైపులా పరస్పర అవగాహనతో సహకరించుకుంటున్నారని అంటున్నారు. అందుకే... ఇటు తెలంగాణ ప్రభుత్వంలో... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ... చిరంజీవికి పలుకుబడి ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా మారాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే తన వద్దకే రావాలని, తన ద్వారానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.