జస్టిస్ రమణపై.. బాబు స్పందించరేం?

బీజేపీ మదిలో సీజేగా మరో ప్రముఖుడు? అయినా ఇంకా బీజేపీ పల్లకీ మోస్తారా? అధినేత తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి అప్ప ఆర్భాటమే తప్ప బావబతికుంది లేదన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత తాపత్రయపడినా, తల్లకిందులు తపస్సు చేసినా.. ‘కమలం క వల నేతలు’ ఆయనను దగ్గరకు రానీయరు. ఇది ఇప్పటి పరిణామాల బహిరంగ రహస్యం. తాజాగా జస్టిస్ రమణకు వ్యతిరేకంగా.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, ఇప్పటివరకూ బాబు స్పందించకపోవడమే ఆశ్చర్యం. చిన్న చిన్న అంశాలకే ప్రకటనలు, ట్వీట్ల ద్వారా  స్పందించే చంద్రబాబు- ఆయన తనయుడు లోకేష్.. అత్యంత కీలకమైన ఈ అంశంపై మాత్రం మౌనం వహించడం విశేషమే కాదు. ఆశ్చర్యమే!  దానితో ఆయన జస్టిస్ రమణ వ్యవహారంలో,  ఎటు వైపున్నారన్న సందేహం తెరపైకొచ్చింది.  మరికొద్ది నెలల్లో జస్టిస్ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తూ.. సుప్రీంకోర్టు సీజేకి ఇచ్చిన ఫిర్యాదు, దేశంలో సంచలనం సృష్టించింది. దానిపై అన్ని వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. పైగా చంద్రబాబు.. జస్టిస్ రమణ ద్వారా, హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య వంటి సీనియర్లు స్పందించారు. జైలుకు వెళ్లొచ్చిన ఒక నిందితుడు, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం ఏమిటని నిప్పులు చెరిగారు. కానీ, ఈ అంశంపై అటు చంద్రబాబు గానీ, ఆయన తయుడయిన లోకేష్ గానీ ఎక్కడా స్పందించకపోవడం, పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ప్రతి అంశంపై రోజుకు రెండు మూడు ట్వీట్లు, ప్రకటనలు చేసే ఆ ఇద్దరు.. జిస్టిస్ రమణ వ్యవహారంపై, మౌనంగా ఉండటమే నేతలను విస్మయపరుస్తోంది. పోనీ.. అది న్యాయవ్యవస్థకు సంబంధించినది కాబట్టి మౌనంగా ఉన్నారనుకున్నా.. సీఎం ఫిర్యాదులో బాబు ప్రస్తావన కూడా ఉంది. కనీసం దానిపై కూడా స్పందించకుండా, బాబు మౌనంగా ఉండటంపై తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తమ అధినేత లక్ష్యంగా జరుగుతున్న పరిణామాలని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి ఢిల్లీకి గురిపెట్టారని తెలిసి కూడా, బాబు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఈ వ్యవహారంలో.. కేంద్రంలోని బీజేపీ జోక్యం ఉందని భావిస్తున్నందుకే, బాబు మౌనంగా ఉంటున్నారన్న మరికొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పైగా..చీఫ్ జస్టిస్ పదవికి బీజేపీ పరిశీలనలో రమణ కాకుండా, మరో ఒకరిద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ సమాచారం తెలిసిన బాబు.. అందుకే  ఈ వ్యవహారంపై స్పందించకుండా, వ్యూహత్మకంగా మౌనంగా ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ తాను స్పందిస్తే.. కచ్చితంగా రమణకు అనుకూలంగా-జగన్‌కు వ్యతిరేక ంగానే గళం విప్పాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీకి అది మరో ఆయుధమవుతుంది. ఇన్ని కోణాలు పరిశీలించిన తర్వాతనే, బాబు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. ఆరోపణల నేపథ్యంలో రమణ అవకాశం కోల్పోతే, అది ఒక తెలుగువాడికి దూరమయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ తెరవెనుక చక్రం తిప్పుతోందన్న చర్చ జరుగుతోంది. అయినా, ఒక రాజకీయపార్టీ అధినేతగా స్పందించాల్సిన చంద్రబాబు, మౌనంగా ఉండటం కేవలం బీజేపీకి భయపడేనంటున్నారు. గతంలో సుప్రీంకోర్డు జడ్జీలు ప్రెస్‌మీట్ పెట్టిన అంశం, ఆ తర్వాతి పరిణామాలపై కాంగ్రెస్ స్పందించిన విషయాన్ని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో మావోయిస్టుల అలజడి! పాత రోజులు రాబోతున్నాయా?

తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారా? కేసీఆర్ సర్కార్ కు, పోలీసులకు సవాల్  విసరబోతున్నారా?. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో జనాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలపై దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు, పోలీసుల హడావుడితో మావోయిస్టుల బలోపేతంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.  పోలీసుల కూంబింగ్ తో  కొన్ని రోజులుగా ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయినా మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటం ఏజెన్సీలో అలజడి రేపుతోంది.  పోలీసుల కూంబింగ్ సాగుతుండగానే ములుగు జిల్లాలో తాజాగా మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట గోడలకు ఈ వాల్ పోస్టర్లు  అంటించారు. కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని లేఖల్లో ఆరోపించారు మావోలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ . అక్రమ కేసులు పెడుతూ  కేసీఆర్ ప్రజలను బలి చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.                         తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు ల ఏరివేతకు  పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని లేఖలో  డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకుంటె టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే పడుతుందని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనం లో పోలీసులను తిప్పడం పద్ధతి కాదని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే ఆయనకు ప్రజల చేతులో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. మూడు రోజుల క్రితమే  ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండలం భోదాపురంలో టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వర్ రావును హతమార్చారు.  భీమేశ్వర్ ఇంటిపై దాడి చేసిన మావోయిస్టులు కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి ఆయనను హత్య  చేశారు.  టీఆర్ఎస్ నేతను హత్య చేసిన అనంతరం అక్కడ లేఖ వదలి వెళ్లారు మావోయిస్టులు. తమ ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్ నేతను చంపినా ములుగు జిల్లాలోనే తాజాగా మావోయిస్టులు మరోసారి వార్నింగ్ లేఖ వదలడం పోలీసు వర్గాలను మరింత కలవరపరుస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు కనిపించింది. కేసీఆర్ సర్కార్  పాలనలో తొలి ఐదేండ్లు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదు. కాని ఇటీవల తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. మావోల పేరుతో గ్రామాల్లో వాల్ పోస్టులు, కరపత్రాలు విడుదలయ్యాయి.  వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. జూలై 12న ఆసీఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకు పోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలోనూ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే ఎదురు కాల్పుల సమయంలో పోలీసులకు దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు 600 మంది పోలీసు బలగాలతో తిర్యాణి అటవీ ప్రాంతాన్ని దాదాపుగా అష్టదిగ్భంధనం చేశారు.మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.  డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. జూలై , సెప్టెంబర్ లో  రెండు సార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించారు డీజీపీ. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీశారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడం ఆసక్తి రేపింది. అక్టోబర్ తొలి వారంలోనూ  ములుగు జిల్లా వెంకటాపురంలో డీజీపీ మహేందర్‌రెడ్డి  పర్యటించారు. సీఆర్పీఎఫ్‌ డీజీ ఆనంద్‌ ప్రకాష్‌ మహేశ్వరి, తెలంగాణ నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు చేపట్టనున్న వ్యూహా ప్రణాళికపై చర్చించారు. సంయుక్తంగా నక్సల్‌ కదలికలను నియంత్రించాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారని సమాచారం.  ఇక  ఇటీవలే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుపోతున్నారనే ప్రచారం జరిగింది.గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ జరిగింది. గణపతి తర్వాత మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే డీజీపీ మహేందర్ రెడ్డి రెండు సార్లు ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడంతో గణపతి లొంగుబాటుపై చర్చేందుకే వెళ్లారని కూడా భావించారు. కాని అలాంటిదేమి జరగలేదు. గణపతి లొంగుబాటు వార్తలను ఖండిస్తూ మావోయిస్టులు లేఖను కూడా విడుదల చేశారు. గణపతి లొంగుబోతున్నారని ప్రభుత్వమే కట్టుకథ అల్లిందని అందులో ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేతలెవరు లొంగిపోయే పరిస్థితి లేదని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు.  పోలీసుల కూంబింగ్, డీజీపీ పర్యటన తర్వాత మావోయిస్టులు మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. నెల రోజులుగా ఎక్కడో ఓ చోట మావోయిస్టుల కదలికలకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. తెలంగాణ బార్డర్  లో మావోల కదలికలు పెరిగాయని కేంద్ర ఇంటలిజెన్స కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ నుంచి భారీగా మావోియిస్టులు తెలంగాణకు వచ్చారని అలర్ట్ చేసిందని తెలుస్తోంది. ఇటీవలే మావోయిస్తులు గుంపులు గుంపులుగా తెలంగాణ వైపు వస్తున్నట్లుగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. ఏజెన్సీలో పోలీసులు అమర్చిన నిఘా కెమెరాల్లో  మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం దిశగా వస్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. పోలీసులే ఆ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మావోయిస్టుల గుంపు భారీగా ఉండటం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేసిందని చెబుతున్నారు.   వందలాది మంది పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ములుగు జిల్లాలో జరుగుతున్న మావోయిస్టుల వరుస చర్యలతో ఏజెన్సీలో భయాందోళన నెలకొంది. భీమేశ్వరరావు హత్యతో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు భయంభయంగా బతుకున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న పార్టీల కార్యకర్తలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో గడుపుతున్నారట. మొత్తంగా ఏజెన్సీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో మళ్లీ పాత రోజులు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయని గిరిజనులు, ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల కవాతులు, బుల్లెట్ల శబ్దాలు మళ్లీ వినాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొలం కంచెగా బతుకమ్మ చీరలు! కేటీఆర్ ఇలాఖాలోనే! నాసిరకమే కారణమా?

దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తోంది. నాలుగేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం.. ఈసారి కూడా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి జరుగుతోంది. బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్..  దసరాకు ఇచ్చే కానుకగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. బతుకమ్మ చీరల పంపిణి సీఎం కేసీఆర్ కు కూడా చాలా ఇష్టమైన పథకమని చెబుతారు. అందుకే కేటీఆర్ కూడా చీరల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఏటా బతుకమ్మ చీరల డిజైన్లను పెంచుతున్నారు. ఈసారి నాలుగు వందలకు పైగా వివిధ డిజైన్లలో బతుకమ్మ చీరలను సిద్ధం చేసినట్లు చేనేత శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశామని చెప్పారు.   అయితే కేసీఆర్ సర్కార్, కారు పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న బతుకమ్మ చీరలే  వారికి అప్రతిష్టను తీసుకొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా  గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. బతుకమ్మ చీరలన్ని సిరిసిల్ల జిల్లాలోనే తయారవుతున్నాయి. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేసే బతుకమ్మ చీరలు.. ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే పొలానికి కంచెగా మారడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.  మొదటి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణి సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వడంతో తీసుకోవడానికి మహిళలు ఇష్టపడ్డారు.  బతుకమ్మ చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. మహిళలను అదుపు చేసేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఊహించినట్లుగా చీరలు లేకపోవడం, నాసిరకంగా ఉండటంతో బతుకమ్మ చీరలపై మహిళల ఆసక్తి పోయినట్లు చెబుతున్నారు. అందుకే రెండో సంవత్సరం నుంచి బతుకమ్మ చీరల క్రేజీ తగ్గిపోయిందని తెలుస్తోంది. గత సంవత్సరం చాాలా బతుకమ్మ చీరలు పంచకుండా మిగిలిపోయాయని అధికారుల లెక్కల్లో తెలుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మిగిలిపోయిన చీరలు కట్టలుగా ఉన్నట్లు చెబుతున్నారు.  ఈసారి అయితే పరిస్థితి మరి దారుణంగా తయారైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు తీసుకునేందుకు మహిళలు ముందుకు రాకపోవడంతో  పంపిణి కేంద్రాలు వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాల్లో చీరలు తీసుకునేందుకు రావాలంటూ గల్లిగల్లీ తిరిగి అధికారులు చాటింపు వేయించారని చెబుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో రండమ్మ రండి అని సిబ్బంది అరిచినా .. చీరల పంపిణి కేంద్రాల వైపు ఎవరూ రాలేదని చెబుతున్నారు. మహిళలు రాకపోవడంతో చేసేది లేక కొన్ని గ్రామాల్లో అధికారులే ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటమే మహిళల నిరాసక్తతకు కారణమంటున్నారు. బతుకమ్మ చీరల నాాణ్యతపై మహిళలు బహిరంగగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. చీరలు పంచేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ. ఎమ్మెల్యేలతో కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. నాసిరకం చీరలు మాకు అవసరం లేదంటూ వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తారు. మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికార పార్టీ నేతలు చీరల పంపిణికి వెళ్లడం లేదని సమాచారం. దీంతో గతంలో  గ్రామాల్లో సందడిగా సాగిన బతుకమ్మ చీరల పంపిణి.. ప్రజాప్రతినిధులు రాకపోవడంతో ఈసారి అధికారులు, స్థానిక నేతలే సాదాసీదాగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణి చేస్తుందని, నాసిరకంగా ఉన్నయంటూ చీరలపై రాద్ధాంతం చేయడం సరికాదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు గులాబీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకునే, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించే బతుకమ్మ చీరలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం అధికార పార్టీకి  నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్.. తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక తీపి కబురు అందించారు. వచ్చే ఏడాది ఆరంభం లోనే కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలనే దానిపై నిపుణులు ప్రస్తుతం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన తయారీ కోసం ఇప్పటికే ప్రపంచంలోని పలు సంస్థలు తీవ్ర పరిశోధనలు చేస్తున్నాయి. కాగా కొన్ని సంస్థల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు కూడా చేరుకొన్నాయి. మరో పక్క భారత్ కు చెందిన భారత్ బయోటెక్, కాడిలా సంస్థలు కూడ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోదనలు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ కు చెందిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది .   ఇది ఇలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 72 లక్షలకు చేరుకొంది. గడచిన 24 గంటలలో 66,732 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా కరొనతో 816 మంది చనిపోవడంతో... దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,09,150కి చేరింది. దేశంలో గత 24 గంటల్లో 71559 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఎపి సీఎం హద్దులు దాటారు.. చర్యలు తీసుకోండి.. సుప్రీం కోర్టులో పిటిషన్

ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ జస్టిస్ రమణతోపాటు, ఎపి హైకోర్టు న్యాయమూర్తుల పై చీఫ్ జస్టిస్ బాబ్డే కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను ప్రెస్ మీట్ లో వెల్లడించడాన్ని తప్పు పడుతూ ఎపి సీఎం జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టులో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేసారు. మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని లాయర్ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాకుండా న్యాయవ్యవస్థను తప్పుబడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నా సీఎం జగన్ అడ్డుకోవడంలేదని... ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ ఆ పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా చూడాలని.. ఈ చర్యలకు కారణమైన సీఎం జగన్ పై ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్ కోరారు.  న్యాయస్థానాలను కించపర్చేలా వ్యవహరించినందుకు ఏపీ సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ సుప్రీం కోర్టు ను కోరారు. న్యాయమూర్తులను భయాందోళనకు గురిచేసేలా జగన్, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ చర్యల వల్ల న్యాయస్థానాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం వుందన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థను కాపాడాలని...భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్‌ కుమార్ సింగ్ తన పిటిషన్ లో కోరారు. ఈ నెల 10న ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశాన్ని ఆయన తన పిటిషన్ లో ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ ఓ లేఖ రాశారని, అందులో తదుపరి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న మరో న్యాయమూర్తి ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేశారని అయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీల పై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సునీల్ కుమార్ సింగ్ తెలియజేశారు. తన చర్యల ద్వారా వైఎస్ జగన్ "దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని" చూస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. 

విజయవాడలో దారుణం.. ప్రేమించలేదని యువతిని సజీవ దహనం

  విజయవాడ నగరంలో నిన్న రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. విజయవాడలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించడం లేదని, అంతేకాకుండా తనపై పోలీసులకు కంప్లెయింట్ చేసిందని.. నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై ఆ ఉన్మాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే నిందితుడికి సైతం మంటలు అంటుకోవడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి (24) విజయవాడలోని ఓ కరోనా కేర్ సెంటర్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తనతో పాటు కలిసి పనిచేసే యువతులతో కలిసి ఆస్పత్రికి దగ్గరలోనే ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే గత కొద్ది రోజులుగా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆ యువతి చుట్టూ తిరుగుతూ తనను ప్రేమించాలని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.   అయితే కొద్ది రోజులుగా అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడిని పిలిసి వార్నింగ్ ఇవ్వడంతో.. ఆమె జోలికి వెళ్లనని అతను లిఖితపూర్వకంగా తెలిపినట్లు సమాచారం. దీంతో ఆ యువతి కూడా తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని నాగభూషణం.. నిన్న రాత్రి డ్యూటీ అనంతరం యువతి ఒంటరిగా నడుచుకుంటూ రూముకు వెళ్తుండగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి నడుమ వాగ్వాదం జరిగింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నాగభూషణం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆ యువతిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆ యువతి మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో నిందితుడికి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే తీవ్రగాయాలైన అతడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతడిని అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న గవర్నర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్! రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయిట్మెంట్ ఖరారైందని ఇంకా పీఎంవో ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ రెండో సారి కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.   వారం రోజుల్లోనే రెండోసారి జగన్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి, ప్రధానిని  కలిసి జగన్ ఏం చర్చించబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలు, రాజకీయ విషయాలపై ప్రధాని, రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని, రాష్ట్రపతితో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను రాష్ట్రపతి, ప్రధానికి జగన్ ఇస్తారని చెబుతున్నారు. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపై మోడీతో చర్చించనున్నట్టు సమాచారం.   ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే జగనే ఢిల్లీ వెళ్తున్నారా..? అనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సర్కార్ నేరుగా తీవ్రమైన ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ విషయంపై జగన్ తో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పిలిచి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.

మండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు! టీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు ఉండబోతున్నారా? మండలి ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ అక్రమాలు చేస్తోందా?. తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ చర్చగా మారింది. టీఆర్ఎస్ పార్టీ నకిలీ ధ్రువపత్రాలు పెట్టి బోగస్ ఓట్లు నమోదు చేయిస్తుందని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన బుద్దభవన్ లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కొన్ని డాక్యుమెంట్లు, ఫోన్ కాల్స్ , చిత్రాలను కూడా తన ఫిర్యాదుకు జత చేశారు. సీనియర్ అడ్వకేట్ ఉమేశ్ చంద్రతో కలిసి వచ్చి ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు తన ఫిర్యాదును అందించారు తీన్మార్ మల్లన్న. మంత్రి మల్లారెడ్డి కాలేజీల కేంద్రంగా అక్రమ బాగోతం నడుస్తుందని ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు వివరించారు.    తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 1 నుంచి ఆ ఆరు జిల్లాల్లో ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇక్కడే అధికార పార్టీ కుట్రలకు తెరలేపినట్లు తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మండలి ఎన్నికలు లేని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పట్టభద్రులతో ఇక్కడ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్శిటీలు, కాలేజీల కేంద్రంగా  అక్రమ బాగోతం జరుగుతుందని తెలిపారు. మల్లారెడ్డి కాలేజీలో పనిచేసే సిబ్బందిని ఇందుకు వినియోగిస్తున్నారంటూ.. కొందరు పట్టభద్రులతో వారు మాట్లాడిన ఆడియో కాల్స్ ను వినిపించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మండలి ఓటరుగా ఉన్నవారితోనే ఇక్కడ అప్లయ్ చేయిస్తున్నట్లు ఆ ఆడియాలో స్పష్టంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్ లో అప్లయ్ చేస్తే.. నిజామాబాద్ లో ఓటు పోతుంది కదా అని ఒకరు అనుమానం వ్యక్తం చేయగా..  అలాంటేదేమి ఉండదు.. అంతా మేము చూసుకుంటామంటూ మల్లారెడ్డి మనుషులు చెప్పడం ఆడియాలో ఉంది. ఈ ఆడియోలను కూడా ఎన్నికల అధికారికి సమర్పించారు తీన్మార్ మల్లన్న.   ఇతర జిల్లాల వారితో ఫేక్ ఓటర్లు నమోదు చేయించడమే కాదు.. మరింతగా మంత్రి మల్లారెడ్డి బరి తెగించారని మల్లన్న ఆరోపిస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు కూడా మల్లారెడ్డి కాలేజీలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ గ్రాడ్యూయేట్ సర్టిఫికేట్లతోనూ ఓటర్లను నమోదు చేయిస్తున్నారంటూ .. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను  ఎన్నికల అధికారికి ఇచ్చారు.  రెండు నియోజకవర్గాల్లో కలిసి రెండు లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు నమోదు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని నవీన్ కుమార్ ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీల్లోనే ఇదంతా జరుగుతుందని, ఇందు కోసం ప్రత్యేకంగా కొందరిని నియమించారని చెప్పారు. లోకల్ ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని శశాంక్ గోయెల్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు మల్లన్న.    ఎమ్మెల్సీ ఎలక్షన్ ల కు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, అతని యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న, ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయిస్తున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసానని చెప్పారు . అడ్డ దారిన ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ గుర్తింపును  రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు మల్లన్న.   వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉండబోతున్నారు తీన్మార్ మల్లన్న. ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అక్రమ ఓటర్ల సమాచారం తనకు చేరడంతో.. లోతుగా అధ్యయనం చేసినట్లు.. అందులో అదికార పార్టీ ఫేక్ బండారం బయటపడినట్లు మల్లన్న అనుచరులు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నిక్లలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మండలి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లేదా హైదరాబాద్ ఏదో ఒక స్థానం నుంచి రాజశేఖర్ రెడ్డి బరిలో ఉండటం ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెబుతున్నారు.    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెాజార్టీ ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు వివిధ సర్వేల్లోనూ తేలింది. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే అధికార పార్టీగా ఉండి మండలి ఎన్నికల్లో ఓడిపోతే.. పరువు పోతుందనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే అడ్డదారిలో గెలిచేందుకు ఇలా బోగస్ ఓటర్లను స్పష్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఎన్నికల అధికారులు పారదర్శకంగా, కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

జడ్జీలను దూషించిన కేసు సీబీఐకి.. ఇకనైనా సైలెంట్ అవుతారా.. మరింత రెచ్చిపోతారా..

ఏపీలో న్యాయవ్యవస్థ పై, అలాగే న్యాయమూర్తుల పై అటు సోషల్ మీడియాలోను ఇటు మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దీని పై విచారణను ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విషయంలో సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.    రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్న కారణంతో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తుల పైన దాడికి దిగిన సంగతి తెల్సిందే. మరో పక్క ఆ పార్టీకి చెందిన మంత్రులు… ఎంపీలతో పాటు, స్పీకర్ కూడా మీడియా ముందు న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు మరింత బరి తెగించి.. న్యాయమూర్తుల్ని చంపుతాం.. నరుకుతాం అని సోషల్ మీడియాలో బెదిరింపులతో కూడిన పోస్టింగ్‌లు పెట్టారు. అయితే వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ అప్పట్లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే తాము అలాంటి పోస్టింగ్‌లు పెట్టిన వారందరికీ అండగా ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అదే సమయంలో బహిరంగంగా ప్రకటించారు.   కారణమేదైనా కానీ.. సీఐడీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంత వరకూ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు సరికదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దీంతో సీఐడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి అర్థరాత్రిళ్లు వెళ్లి మరీ అరెస్ట్ చేస్తున్నారు. అదే న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం సీఐడీ పట్టించుకోలేదు. అసలు హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పడేశారంటే.. ఏపీ పోలీస్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ నందిగం సురేష్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.   అంతేకాకుండా సామాజిక మాధ్యమాలలో తాజాగా జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆదేశింది. ఇప్పటికే రెండు విడతలుగా 93 మందికి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు తాజా ఆదేశాలతో ఇపుడు మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటికే న్యాయవ్యవస్ధపై సీఎం జగన్ యుద్ధం ప్రకటించారు. న్యాయమూర్తుల పేర్లు తీసుకుని మరీ రచ్చ చేస్తున్నారు. పార్టీ నాయకులే ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే.. ఇంకా కింద స్థాయి కార్యకర్తలు ఇంకా చెలరేగిపోఏ అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి వారికి బహిరంగంగానే భరోసా ఇవ్వడంతో పాటు మరోపక్క సీఎం జగన్, మోదీల మధ్య స్నేహం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు తేలుతుందో వేచి చూడాలి.

అది ‘కమ్మ’రావతి కాదు.. అమరావతే!

300 రోజుల ఉద్యమంలో మెరుపులు- మరకలు   కమలం కప్పగంతులకు తెరపడేదెన్నడు?   రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఏపీలో... రాజధాని నగరంగా అమరావతి నగరాన్ని ఎంపిక చేశారు. దాని శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అంటే ఇంతమంది వచ్చినందున, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరయినా రాజధాని నగరం అక్కడే ఉంటుందనుకోవడం సహజం. అంతకుముందు విపక్షనేతగా ఉన్న జగన్ కూడా, అమరావతిలోనే రాజధానిని స్వాగతిస్తున్నామని నిండు సభలో స్పష్టం చేశారు. ఆ తర్వాత కొత్త నగర నిర్మాణానికి కేంద్రం కూడా నిధులిచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ భ వనాలు, ప్రైవేటు యూనివర్శిటీలకూ స్థలం కూడా మంజూరు చేశారు. అందులో కొన్ని ప్రైవేటు యూనివర్శిటీలూ వచ్చాయి. హైకోర్టు, సచివాలయం-అసెంబ్లీ- ఉద్యోగుల క్వార్టర్లు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలన్నీ ప్రభుత్వం భూసేకరణలో కొనుగోలు చేసినవి కాదు. రైతుల నుంచి సేకరించినవి. దానికోసం వారికి కొన్ని రాయితీలు ఇచ్చింది. ప్రతి ఏటా కౌలుకు నిధులు కూడా కేటాయించింది. ఇదీ స్ధూలంగా అమరావతి నగర నిర్మాణ కథ!   అమరావతిలో రాజధానిని స్వాగతించిన వైసీపీ- దాని అధికార మీడియా, మరోవైపు అందులోని అక్రమాలను ప్రస్తావించింది. అందులో తప్పులేదు. అది రాజకీయపార్టీగా దాని హక్కు. మంత్రులు-టీడీపీ ఎమ్మెల్యేలు-వారి బంధువులు బినామీల పేరుతో, రైతుల నుంచి తక్కువ ధరకు వందల ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ-దాని మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. రాజధాని ఎక్కడో ముందే తెలుసుకుని, బినామీలతో భూములు కొనుగోలు చేయించిందని ఆరోపించింది.  సాక్షిలో అయితే సర్వే నెంబర్లు సహా ప్రచురించింది. వాటిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.   నిజంగా బినామీల పేర్లతో, భూమలు కొనుగోలు చేసి ఉంటే వారు శిక్షార్హులే. ఆ అక్రమార్కుల సంగతి తేల్చాల్సిందే.  అయితే ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ రేట్లకు అమ్మిన అవే భూములు, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కారుచౌకగా ఇచ్చారని, అందులో కమ్మ వర్గానికి చెందినవే ఎక్కువ ఉన్నాయన్న వైసీపీ ఆరోపణలను మాత్రం,  టీడీపీ ఖండించలేకపోయింది. న్యాయమూర్తులకు తక్కువ ధరకు ఇచ్చారన్న, వైసీపీ ఆరోపణల్లో పెద్దగా పస కనిపించలేదు. ఎందుకంటే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సహా ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లకూ ప్రభుత్వం భూమి కేటాయించింది.   సరే.. అక్కడ ఇంత జరిగిన తర్వాత రాజధాని అమరావతి బదులు, విశాఖలో ఉండాలన్న జగన్ ప్రభుత్వ ప్రయత్నాలపై, అమరావతి రైతులు 300 రోజుల నుంచి వివిధ రూపాల్లో శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అక్కడి రైతులను మంత్రులు బూతులు తిడుతున్నా, పెయిడ్ ఆర్టిస్టులని దూషిస్తున్నా రైతులు సహనం పాటిస్తున్నారు. బీజేపీ కూడా రైతుల ఆందోళనలో పాల్గొంది. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ పార్టీ తీర్మానం కూడా చేసింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాతనే ఆ పార్టీ పిల్లిమొగ్గలు వేస్తోంది. జీవీఎల్ అయితే, అమరావతిపై నిర్ణయం కేంద్ర పరిథిలో లేదని చాలాసార్లు చెప్పగా.. కన్నా-పురందీశ్వరి లాంటి నేతలు మాత్రం పార్టీ వైఖరికే కట్టుబడ్డామని చెప్పారు. ఇప్పుడు అమరావతి రైతుల ఆందోళనలో కమలదళాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఆ పార్టీ, మొహమాం ముసుగు ఎప్పుడు తీస్తుందన్నది వేరే కథ.   ఇక ఇప్పుడు అమరావతి చుట్టూ అల్లుకున్న కులం కథలోకి వెళ్దాం. సంఖ్యాబలం తక్కువయినప్పటికీ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కమ్మవారి పట్టు-ప్రభావం ఎక్కువ కాబట్టి, టీడీపీ రాజధానిని అక్కడే ఎంచుకున్నది వైసీపీ-దాని సోషల్ మీడియా దళాల అసలు అనుమానం. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా కమ్మ వర్గం నడిపిస్తుందే తప్ప, అందులో మిగిలిన వారెవరూ లేరన్నది మరో ప్రచారం. తెరపైకి వస్తున్న నాయకులంతా ఆ వర్గానికి చెందిన వారే కాబట్టి, అలాంటి ప్రచారం జరగడం సహజం. కానీ, రాజధాని కోసం భూములిచ్చిన వారిలో కమ్మ వారి శాతం తక్కువ కాగా, కమ్మేతరులు ఇచ్చిన భూములే ఎక్కువ న్న వాస్తవం, బయట ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ.   ఇప్పుడు రాజధాని నగరం.. అక్కడ ఉండదంటున్న ప్రభుత్వం ముందు, రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులకు, ప్రభుత్వం ఆర్ధికంగా బాగానే లబ్థి చేకూర్చింది. నిజానికి కర్నూలు రాజధాని నగరంగా ఏర్పడినప్పుడు గానీ, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందు గానీ, అంత భారీ ప్యాకేజీ ఇచ్చిన చరిత్ర లేదు. ఆ విషయంలో అమరావతి రైతులు వందరెట్ల మేళ్లు పొందారు. అందుకే ... రైతులు భూములు ఉచితంగా ఏమైనా ఇచ్చారా? భారీ ప్యాకేజీ, కమర్షియల్ ప్లాట్లు, కౌలు తీసుకుంటున్నారు కదా? ఇన్ని తీసుకుని ఏదో త్యాగం చేశామని ఆందోళనలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలను,  వైసీపీ వర్గాలు విస్తృతం చేస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదు.   కానీ, రాజధానిగా ప్రకటించకముందే అక్కడ భూములకు మంచి గిరాకీ ఉంది. పైగా రాజధానికి భూములిచ్చిన తర్వాత, ప్రభుత్వం వాటిని చదును చేసింది. ఇప్పుడు ఏ భూమి ఎవరిదో తేల్చుకోవడం అసంభవం. ఇప్పుడు అక్కడ రాజధాని నగరం లేదంటే, భూములిచ్చిన రైతుల జీవనాధారం ఏమిటన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఏ కులానికి చెందిన రైతులయినా, భూములిచ్చింది చంద్రబాబునాయుడుకో, లోకేష్‌కో, హెరిటేజ్‌కో కాదు. ప్రభుత్వానికి!  ఒప్పందం జరిగింది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి-రైతులకే తప్ప.. పార్టీలకూ రైతుల మధ్య కాదన్నది, మనం మనుషులం అన్నంత నిజం. పాలకుల ఆలోచనా విధానం-నిర్ణయాలు కూడా ఆ కోణంలేనే ఉండాలి.   ఆ కోణం లేకపోగా, కులం కోణాన్ని తెరపైకి తీసుకురావడమే వివాదానికి కారణం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన అమరావతిని.. ‘కమ్మరావతి’గా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ  మైండ్‌గేమ్ ఎన్నికల ముందు, ఆ తర్వాత చాలాకాలం పనిచేసింది. భూములన్నీ కమ్మవారికి దోచిపెట్టడానికే.. అక్కడ రాజధానిని తీసుకువచ్చారన్న ప్రచారాన్ని గురజాల నుంచి ఇచ్చాపురం వరకూ.. అనంతపురం నుంచీ నెల్లూరు వరకూ తీసుకువెళ్లడంలో, వైసీపీ వ్యూహబృందం విజయం సాధించింది. దానిని తిప్పికొట్టడంలో టీడీపీ వైఫల్యం చెందింది. వైసీపీ ఆరోపణలకు తగ్గట్లుగానే టీడీపీ సర్కారు కూడా, తన కులానికి చెందిన వారికే అన్ని రంగాల్లో పట్టం కట్టింది. ఫలితంగా వైసీపీ వ్యూహబృందం ఆరోపణలను, ఇతర ప్రాంతాలకు ప్రజలు సులభంగా నమ్మేశారు. మిగిలిన కులాలలో కమ్మ వ్యతిరేక భావన నాటేందుకు వైసీపీ వ్యూహబృందం ఆ రకంగా విజయం సాధించింది.   నిజానికి అమరావతి రాజధాని కోసం భూములిచ్చినవారిలో కమ్మేతరులే ఎక్కువ. ఇటీవల దీనిపై దళిత సంఘాలు, ఆ వివరాలను కోర్టుకూ సమర్పించాయి. అమరావతిలో రాజధానికి భూములిచ్చిన వారిలో.. దళితులు-గిరిజనులు  32 శాతం మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానం రెడ్లది.  రాజధాని కోసం రెడ్లు ఇచ్చిన భూములు 23  శాతం. కమ్మ వారిది ఆ తర్వాత స్థానం. వారు ఇచ్చిన భూములు 18 శాతం. బీసీలు 14, కాపులు 9, మైనారిటీలు 3, ఇతరుల ఒక్క శాతం భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ఎక్కువ భూములిచ్చి నష్టపోయింది.. దళిత-గిరిజనులేనన్నది సుస్పష్టం పైగా 95 శాతం చిన్న కారు రైతులే, సర్కారుకు భూములిచ్చారన్నది మరో నిజం. కేవలం ఒక్క ఎకరం ఉన్న  20,490 మంది రైతులు, 10,035 ఎకరాల భూమిని సర్కారుకు ఇచ్చారు. 20-25 ఎకరాలున్న 12 మంది రైతులు, 269 ఎకరాలిచ్చారు. ఇక 25 ఎకరాలకు పైనున్న ఐదుగురు రైతులు మాత్రమే, 151 ఎకరాలు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టి చిన్నకారు, మధ్య తరహా రైతులే ఎక్కువ భూములివ్వగా, భూస్వాముల సంఖ్య కేవలం 17 మాత్రమేనని స్పష్టమవుతోంది.   అందులో కూడా ప్రచారంలో ఉన్న, కమ్మ వర్గం ఇచ్చిన భూములు కేవలం 18 శాతమే. దీన్నిబట్టి ఇప్పుడు జరుగుతున్నది ‘కమ్మ’రావతి ఉద్యమం కాదని, అమరావతి ఉద్యమమేనని.. మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అయితే, ఈ అంశంలో వస్తున్న ఆరోపణలను ఖండించి, వాస్తవాలు వెల్లడించడంలో కమ్మ వర్గంతోపాటు, ఆ కులానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ కూడా  విఫలమయింది. ఎంతసేపూ ఒక నారాయణ, మరో పుల్లారావు, ఇంకో సుబ్బారావును కాపాడే ప్రయత్నమే చేసింది. ఫలితంగానే అది ‘కమ్మరావతి’ అన్న ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టయింది. ప్రస్తుతం అమరావతి కథకు సంబంధించిన పరిణామాలన్నీ.. కేవలం చంద్రబాబునాయుడు లక్ష్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తుండటం, అమరావతి అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేయడం వల్ల జగన్ సర్కారు.. అమరావతి కోసం ఏం చేసినా దాని వచ్చే కీర్తి అంతా బాబు ఖాతాకే వెళుతుందన్న రాజకీయ కోణంలో మౌనంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అంటే అమరావతి అంశానికి.. చంద్రబాబు కొంత మైనస్- మరికొంత ప్లస్‌గా మారారన్నది అర్ధమవుతూనే ఉంది.     ఇప్పుడు  రాజధాని కోసం భూములిచ్చిన వారిలో... కమ్మ రైతుల కంటే రెడ్లే ఎక్కువ ఉన్నందున, మరి దానిని రాజకీయ రొచ్చు భాషలో ‘రెడ్లావతి’ అని అనలేం. ఎందుకంటే వారికంటే, దళిత-గిరిజన రైతులు ఎక్కువ శాతం భూములిచ్చారు కాబట్టి! సరే.. భూములకు- కులాలకు సంబంధం లేదు కాబట్టి.. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సింది పాలకులే కాబట్టి, ఈ చచ్చు పుచ్చు ఇచ్చకాలకు తెరదించి, పాలకులు వారికి న్యాయం చేసే పని మొదలుపెట్టడం మంచిది. -మార్తి సుబ్రహ్మణ్యం

పుస్తకాలు, బెల్ట్ పై పార్టీ రంగులు! గుండు పిన్నును వదలరా అంటూ సెటైర్లు

ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసేది అదే. అది వాళ్ల బాధ్యత కూడా. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం.. బాగా అతి చేస్తోంది. ప్రభుత్వంగా చేయాల్సిన చిన్న చిన్న పనులను కూడా గొప్పగా చెప్పుకుంటోంది. అంతటితో ఆగకుండా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు అందించే ప్రతి వస్తువుపైనా పేర్లు ముద్రించుకుంటూ చీఫ్ పబ్లిసిటీ చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.      జగనన్న విద్యాకానుకతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. వందల కోట్ల రూపాయలతో జాతీయ మీడియా ఛానెళ్లలోనూ ప్రకటనలు ఇచ్చింది. అయితే జగనన్న విద్యాకానుకలో అందించిన వస్తువులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు అందించిన వివిధ రకాల వస్తువులపై వైసీపీ జెండాను పోలిన రంగులను ముద్రించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.    విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌పై జగనన్న విద్యాకానుక అని ముద్రించారు. బెల్ట్ ను కూడా వదలకుండా పార్టీ జెండా రంగులు ముద్రించారు. పుస్తకాల్లోనూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సిలబస్ పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వస్తున్నాయి. గుండు పిన్నును కూడా వదలవా ముఖ్యమంత్రి జగన్ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు   జగనన్న విద్యాకానుక పథకంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రన్న కానుక , చంద్రన్న తోఫా అంటూ తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పేరు మార్చి జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. అయినా విద్యార్థులకిచ్చే పుస్తకాలు, బెల్టులపై పార్టీ జెండా రంగులు ముద్రించడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తమ హయాంలో చాలా పథకాలు అమలు చేశాం.. కాని ఏనాడు ఇలాంటి చిల్లర పనులు చేయలేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇలాగే ఆలోచిస్తే రాష్ట్రంతా ఎల్లో రంగులోనే కనిపించేదంటున్నారు టీడీపీ నేతలు. విద్యార్థులకు ఇచ్చిన వస్తువులపైనా పార్టీ జెండా రంగులు వేయడంపై ఇతర విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.    ఇటీవలే వైఎస్సార్ జలకళ పేరుతో కొత్త స్కీం తెచ్చారు. ఇందు కోసం బోరు బండ్లను కొనుగోలు చేశారు. ఆ లారీలకు కూడా వైఎస్సార్ పార్టీ జెండా పోలేలా కలర్స్ వేశారు. దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రంగుల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టింది. గ్రామ సచివాలయాలకు మొత్తం పార్టీ జెండా రంగులు వేశారు. ఇందు కోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. సచివాలయాలకు వెసిన రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. జగన్ సర్కార్ నిర్ణయం వల్ల రంగులు వేయడానికి ..మళ్లీ తొలగించడానికి.. తిరిగి కొత్త రంగులు వేయడానికి నాలుగు, ఐదు వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతున్నారు.    ప్రభుత్వానికి పాలనపై దృష్టి ఉండాలి కాని రంగులపై ఏంటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. అన్ని పథకాలకు ఇలా రంగులు వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మంచివైతే .. అవే ప్రజల్లోకి వెళతాయని.. వాటి కోసం ప్రత్యేకంగా ఇలా పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.  

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ   హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో వచ్చేనెల 9న విచారణ   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణపై నిర్ణయం తీసుకోనున్న కోర్టు   హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది.   అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు. అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మంత్రి బొత్స కళ్ళు దొబ్బాయా అంటూ రాజధాని రైతుల తీవ్ర వ్యాఖ్యలు 

ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధానిని అమరావతి నుండి తరలించాలని నిర్ణయించి దానికి తగినట్లుగా అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ ఆందోళనలు ప్రారంభమై 300 రోజులు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ తీరుకి నిరసనగా రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి‌ వదిలారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణాయపాలెంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్, గల్లా జయదేవ్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు.    ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమానికి పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ఇస్తున్నందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పార్టీ పేరులో సైతం రైతు అని పెట్టుకున్న వైఎస్సాఆర్ సిపి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ముందుగా పార్టీ పేరులో ఉన్న రైతు అనే పదం పీకేయండని రైతులు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అమరావతిలో పండుగ చేసుకుంటున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆయన కళ్లు ఏమైనా దొబ్బాయా అని ఆ రైతులు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ‘‘మమ్మల్ని లకారాలతో మాట్లాడుతున్న వారు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. మేము కూడా మాట్లాడగలం.. కానీ మాకు మా పెద్దలు సంస్కారం నేర్పారు. రైతు అనే వాళ్లు లేకుంటే... మీకు భవిష్యత్తు లేదనేది గుర్తించండి. రైతులను కన్నీళ్లను పెట్టించిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ మీ మోనార్క్ పాలన ఆపకపోతే.. బుద్ధి చెబుతాం. మేము పెయిడ్ ఆర్టిస్టులమా... లేక డబ్బులు తీసుకుని మాట్లాడే మీరా... పెయిడ్ ఆర్టిస్టులు? ఆనాడు వైసీపీకి మద్దతు ఇస్తే మహిళా రైతు అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ తప్పును ప్రశ్నిస్తే.. మేము పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నామా? సీఎం జగన్ మనసు మార్చుకో.. అమరావతినే రాజధానిగా కొనసాగించు’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

అంధకారంలో ముంబై.. ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. నగరానికి విద్యుత్ ను అందించే టాటా పవర్ యూనిట్ దెబ్బతినడంతో సమస్య మొదలైంది. దీంతో ఒక్కసారిగా మహా నగరంలో కరెంటు పోయింది. ఎక్కడికక్కడ ప్రజా రవాణా ఆగిపోయింది. రైళ్లు నడవట్లేదు. పనులన్నీ నిలిచిపోయాయి. రోడ్డు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక పోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలబడిపోయింది. ముంబై నగరానికి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లోని విద్యుత్ జనరేషన్ యూనిట్ నుంచి పవర్ సప్లై అవుతుంది. అయితే దాన్లో టెక్నికల్ సమస్యలు రావడంతో... ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో సగానికి పైగా నగరం ఇప్పుడు కరెంటు లేక అల్లాడిపోతోంది. దీంతో ప్రజలు ఈ ఉదయం నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్య రావడంతో... పవర్ సప్లై జరిగే చాలా ఫీడర్లను కంపెనీ స్విచ్ఛ్ ఆఫ్ చేసింది. దాంతో... కరెంటు సరఫరా ఆగిపోయింది.   ఇదిలా ఉండగా ముంబైకి విద్యుత్ ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని, మరికాసేపట్లో సమస్య పరిష్కారం కావచ్చని అధికారులు వెల్లడించారు.   ముంబై నగర ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని, సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో విభాగాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.   ఇదిలావుండగా, టాటా తరువాత ముంబైకి అత్యధిక విద్యుత్ ను సరఫరా చేస్తున్న అదానీ ఎలక్ట్రిసిటీ స్పందించింది. ప్రస్తుతం అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరాను తాము పునరుద్ధరించామని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరింది. కాగా, విద్యుత్ నిలిచిపోగానే, వేలాది మంది సామాజిక మాధ్యమాల్లో తమ కామెంట్లు పెట్టారు. ప్రభుత్వం విఫలమైందని, ఆర్థిక రాజధానిలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరి ఇంట్లోనైనా కరెంట్ ఉందా?అని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.   టాటా పవర్ వద్ద సమస్య కారణంగా... నగర పశ్చిమ శివారు ప్రాంతాల్లో పవర్ సప్లై చేసే రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌కి కూడా సమస్యలు తలెత్తాయి. టాటా పవర్ వల్ల తమ ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కి కూడా కరెంటు సప్లై సమస్యలు తలెత్తినట్లు రిలయన్స్ తెలిపింది. జరిగిన దానికి చింతిస్తున్నాం. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు టాటా పవర్ వారితో టచ్‌లో ఉంటున్నాం అని రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘనవిజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికలో ఒక అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, ఆమెకు అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే కవిత విజయం పక్కా  అని తేలింది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం ఇక్కడ 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. పోలైన మొత్తం 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఏకంగా 728 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన ఓట్లు కాంగ్రెస్, బీజేపీకి పోల్ అయ్యాయి. దీంతో మరికొద్ది సేపట్లో తన గెలుపుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అధికారుల నుండి కవిత అందుకోనున్నారు.

కరోనా సోకిన వారికి ఆ లక్షణాలు ఉంటే లక్కీనే.. లేటెస్ట్ స్టడీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. సామాన్య ప్రజల నుండి సీఎం లు, పీఎం లు, దేశాధ్యక్షులు దీని బారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు రెండు వారాల తరువాత కోలుకుంటుండగా మరి కొంత మంది ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని గుర్తించడానికి జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు వాసనలను గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయట పడతాయి. అయితే తాజాగా దీని పై ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారం.. మిగిలిన లక్షణాల సంగతి ఎలా ఉన్నా... వాసనలు గుర్తించలేకపోయే వారికి మాత్రం కరోనా పెద్దగా హాని చేయకుండానే తగ్గిపోతోందని తేలింది. అంతేకాకుండా ఈ వాసనలను గుర్తించలేకపోవడం అనే లక్షణం కరోనా వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత కనిపిస్తోంది. దీనిని వెంటనే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి ఎటువంటి హాని లేకుండా తేలికగానే తగ్గిపోతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు   కరోనా బారిన పడిన వారిలో.. ఎవరైతే వాసన కోల్పోతున్నారో వారు త్వరగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్నిఇరాన్‌లోని టెహ్రాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు, అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థలు చేసిన అధ్యయనాల్లో కూడా ఈ విషయమే తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) గుర్తించిన జామా జర్నల్‌... అక్టోబరు 8న రిలీజ్ చేసిన పరిశోధనా పత్రంలోకూడా ఈ విషయాన్ని చెప్పింది.

జడ్జి రమణపై…జగన్ ‘జంగ్’!

‘సుప్రీం’ సీజే కాకుండా అడ్డుపడటమే జగన్ ధ్యేయమా?   సర్కారు ‘అధికార సమరాని’కి అదే సంకేతమా?   బీజేపీ అనుమతితోనే జగన్ తెగిస్తున్నారా? ‘‘జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకే, సీఎం జగన్ కోర్టులపై చాలకాలం నుంచి యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు వల్ల న్యాయమూర్తి అయిన జస్టిస్ రమణ సీజే అయితే జగన్‌కు ఇబ్బందులు తప్పవు’’- ఇది నిన్నటి వరకూ రాజకీయ వర్గాలు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియాను ఫాలో అయ్యే వర్గాలందరూ జనాంతికంగా చర్చించుకున్న మాట! కానీ దానిని ఇప్పుడు జగన్ నిజం చేశారు. ముసుగులో గుద్దులాటకు తెరదించారు. మొహమాటాలు పక్కనపెట్టి, మనసులో మాట బయటపెట్టారు. సుప్రీంకోర్టు జడ్జితో తాడోపేడో తేల్చుకునేందుకే జగన్ సిద్ధమవుతున్నారు. జగన్ అసలు లక్ష్యం అదే. ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి మీడియా ముందుకొచ్చి చదివిన ప్రకటన సంకేతం కూడా అదే.   జగన్ సామాన్యుడు కాదు. పులివెందుల పగ-ప్రతీకారం- పోరాటం-మొండితనానికి నిలువెత్తు నిదర్శనం. అవును.. ఏపీ సీఎం జగ న్మోహన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నూతలపాటి వెంకటరమణపై, నేరుగా యుద్ధం ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు శరపరంపరగా ఇస్తున్న ప్రభుత్వ వ్యతిరేక తీర్పుల వెనుక, జస్టిస్ రమణ ఉన్నారన్న విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి నోటి నుంచి చెప్పించారు. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో ప్రభుత్వం ఇచ్చిన జీఓపై జస్టిస్ సోమయాజులు స్టే ఇచ్చారు. మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో, హైకోర్టు ఏకంగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీజే బోబ్డేకి అక్టోబర్ 8న ఫిర్యాదు చేశాం’- ఇదీ సలహాదారు కల్లంరెడ్డి మీడియా ముందుకు వచ్చి, ప్రభుత్వం తరఫున చేసిన అధికారిక ఆరోపణ.   అంతేనా?.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరిని, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారన్న మరో బాంబు పేల్చారు. ‘ ‘జస్టిస్ రమణ జోక్యం తర్వాత, హైకోర్టులో పరిణమాలు మారిపోయాయి. చంద్రబాబు కోరుకున్నట్లుగా కీలకమైన కేసులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్, జస్టిస్ కె.లలిత బెంచ్‌కు మారిపోయాయ’ని ఆరోపించారు. ఈ వివరాలన్నీ ఆధారాలతో సహా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చామని కల్లం రెడ్డి వెల్లడించారు. ఎన్‌వి రమణను అడ్డుపెట్టుకుని, చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారన్న మరో తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.   ప్రభుత్వం తరఫున సలహాదారు చేసిన ఆరోపణలు చూస్తే.. జగన్మోహన్‌రెడ్డి నేరుగా జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధానికి తెరలేపినట్లేనన్నది విస్పష్టం. కల్లంరెడ్డి ఆరోపణలు పరిశీలిస్తే.. జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రాకేష్‌కుమార్ వంటి వారిని మినహాయిస్తే.. రోజువారీ కేసులలో తీర్పులిస్తున్న, కీలకమైన న్యాయమూర్తులందరిపైనా ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతూనే ఉంది. తమ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరైతే తీర్పులిస్తున్నారో, వారందరి పేర్లు ఉటంకించడం ప్రస్తావనార్హం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో… జస్టిస్ రమణ ఆస్తుల లావాదేవీలు, 2013-2016 మధ్య కాలం నాటి ఆస్తుల వివరాలు కూడా పేర్కొనడం బట్టి.. జస్టిస్ రమణనే లక్ష్యంగా చేసుకుని, సీఎం జగన్మోహన్‌రెడ్డి దేనికయినా తెగించేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది.   నిజానికి జస్టిస్ రమణపై గతంలో విద్యార్ధి నేతగా ఉన్నప్పటి కేసు, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయి సందర్భంలో ఇచ్చిన, సెల్ఫ్ డిక్లరేషన్ వివాదమయింది. కానీ అవి కోర్టులో నిలబడలేదు. ఇక అప్పటి నుంచీ చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం, పరోక్షంగా రమణను దృష్టిలో పెట్టుకుని పరోక్ష ప్రచారం కొనసాగిస్తూనే ఉందన్నది బహిరంగ రహస్యమే. అయితే, ఈ రకంగా నేరుగా జిస్టిస్ రమణ పేరు పెట్టి ఆరోపించిన వారెవరూ లేరు. ఆ ధైర్యం చేసిన సీఎంగా జగన్మోహన్‌రెడ్డి, న్యాయచరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటివరకూ తమకు గిట్టని జడ్జిలపై, ఆకాశరామన్నల పేరుతో ప్రధాన న్యాయమూర్తులకు, లేఖ రూపంలో ఫిర్యాదు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రే స్వయంగా, సుప్రీంకోర్టు జడ్జిపై చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేయడం దేశంలో ఇదే తొలిసారి.   అయితే.. జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు జడ్జి రమణను ఎందుకు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయ, న్యాయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీనియరయిన, జస్టిస్ రమణకు సీజే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఆ పదవిలో 18 నెలలు ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ ఆయన చీఫ్ జస్టిస్ అయితే, జగన్మోహన్‌రెడ్డికి కష్టకాలమేనని వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఆందోళన కూడా!   ఎందుకంటే.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ 9 నెలల్లో తేల్చాయాల్సి ఉంది. వాటిని రోజువారీ విచారణ ద్వారా పూర్తి చేయాలని, సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించింది. అందులో భాగంగానే.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ- ఈడీ కేసులు మళ్లీ విచారణకు వచ్చాయి. ఈ కేసుల్లో ప్రస్తుతానికి జగన్‌కు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ వాటిని 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.   ఒకవేళ జస్టిస్ రమణ సీజే అయిన పక్షంలో.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులలో వ్యతిరేక తీర్పులు వచ్చి, మళ్లీ ఆయన జైలులు వెళతారన్న ఆందోళన, ఆ కోణంలో చర్చ వైసీపీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది. అదే జస్టిస్ రమణను సీజే కాకుండా నిలువరించినట్టయితే.. జగన్ బయటపడతారన్న భావన కూడా, ఆ పార్టీ వర్గాల్లో ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణాలతోనే జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటినుంచే జస్టిస్ రమణపై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.   ఇప్పటికే హైకోర్టు తీర్పులపై.. స్పీకర్ నుంచి ఎమ్మెల్యే-ఎంపీల వరకూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వైనంపై, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు జగన్ సర్కారు-వైసీపీ నేతలు కూడా.. జస్టిస్ రమణ రిటైరయ్యే వరకూ, ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందన్న మానసిక పరిస్థితికి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా అజయ్‌కల్లం రెడ్డి ప్రెస్‌మీట్ పరిశీలిస్తే.. జగన్ కేసులపై ముందస్తు వ్యూహానికి తెరలేచినట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రేపు కోర్టులు.. సీబీఐ-ఈడీ కేసులలో, జగన్‌కు వ్యతిరేక తీర్పు ఇస్తే, ఫలానా వ్యక్తి కారణంగానే జగన్ జైలుకెళ్లారన్న ప్రచారానికి, ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకున్నట్లు, వైసీపీ వ్యూహం అర్ధమవుతోంది. ఇదంతా వైసీపీ సహజ మైండ్‌గేమ్‌లో భాగంగానే కనిపిస్తోందని, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే..కేంద్రంలోని బీజేపీ మద్దతు లేకుండా, జగన్ ఇంత పెద్ద సాహసానికి ఒడిగడతారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జగన్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో జగన్.. జస్టిస్ రమణపై ఫిర్యాదు చేయగా, వ్యవస్థల జోలికి వెళ్లవద్దని అమిత్‌షా మందలించినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. దానిపై సమాచార శాఖ కమిషనర్ ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. అది వేరే విషయం! నిజంగా అమిత్‌షా సీఎం జగన్‌కు నచ్చచెప్పి ఉంటే, జగన్ ఇంత సాహసానికి శ్రీకారం చుట్టే ధైర్యం చేయరు. తర్వాత జగన్ ప్రధాని మోదీని కలిసినప్పుడూ, జస్టిస్ రమణ వ్యవహారంపైనే ఫిర్యాదు చేశారని, ఆయనతోపాటు హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపైనా ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాతనే ఏపీ హైకోర్టు సీజేను బదిలీ చేస్తారన్న ప్రచారం మొదలవడం గమనార్హం.   నిజంగా న్యాయవ్యవస్థ జోలికి వెళ్లవద్దని బీజేపీ నేతలు, జగన్‌ను హెచ్చరించి ఉంటే.. జగన్ ఇప్పుడు జస్టిస్ రమణపై ఆరోపణలు ఎందుకు ఎక్కుపెట్టారన్నది ప్రశ్న. ఒకవేళ బీజేపీ నాయకులు జగన్‌ను హెచ్చరించి ఉంటే, జగన్ అంత ధైర్యం చేసేవారు కాదన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అంటే దీన్నిబట్టి.. ఈ వ్యవహారంలో బీజేపీ సహకారం లేదని భావించడం కష్టమేనని, రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. బీజేపీ దృష్టిలో.. ప్రధాన న్యాయమూర్తి పదవి ఎంపికలో, మరొకరు ఉండివచ్చన్న విషయాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే, కాగల కార్యాన్ని జగన్మోహన్‌రెడ్డితో కానిస్తున్నారన్న మరో చర్చ కూడా జరుగుతోంది. నిజం నరేంద్రుడికెరుక? -మార్తి సుబ్రహ్మణ్యం

సెంటిమెంటే ఆశ.. సెంటిమెంటే భయం! కారుకు కొత్తటెన్షన్ 

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సెంటిమెంట్ రాజకీయాల చుట్టే తిరుగుతోంది. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో .. అధికార పార్టీ నుంచి ఆయన సతీమణి సుజాత పోటీ చేస్తోంది. రామలింగారెడ్డి చనిపోయారన్న సానుభూతి తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ఆయనపై కూడా ప్రజల్లో సెంటిమెంట్ ఉందని కమలం కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. తన తండ్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి పేరుతో ప్రచారం చేస్తూ సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారు. మంత్రిగా ముత్యం రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనులు తనకు ప్లస్ అవుతుందని శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ పండిస్తూనే ప్రచారం చేస్తున్నాయి.   సోలిపేట రామలింగారెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతి తమకు లాభిస్తుందని చెబుతున్న అధికార పార్టీని మరో సెంటిమెంట్ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత పరిణామాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయలేదు. చనిపోయిన నేతల కుటుంబ సభ్యులు పోటీ చేసినా ప్రత్యర్థి పార్టీనే గెలిచింది. నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్‌ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్‌ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్‌ పార్టీపై రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది.   ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నికలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్‌ పోటికి పెట్టింది. సెంటిమెంట్ ను కాదని తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్‌ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు.‌    దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ కావొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. టీఆర్‌ఎస్‌ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది.టీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుజాత గెలిచినా నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగం ఉండదనే ప్రచారాన్ని విపక్ష పార్టీలు నియోజకవర్గంలో జోరుగా నిర్వహిస్తున్నాయి. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్‌ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తుండటంతో విజయంపై టీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.

భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జయరాం బాధితుడా... లేక..?

ఏపీ మంత్రి జ‌య‌రాంకు సంబంధించి గత కొద్ది రోజులుగా పలు వివాదాస్పద వ్యవహారాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయన భూముల కొనుగోలు అంశం రాజకీయంగా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతోంది. ఇప్పటికే ప్ర‌తిప‌క్ష నేత‌లు దీని పై ఆధారాల‌తో స‌హా ఆరోప‌ణ‌లు చేయ‌గా… నిన్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలు నిగ్గు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఈ అంశం మ‌రో కీలక మ‌లుపు తిరిగింది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో తమ‌ను మోసం చేశారంటూ మంత్రి జ‌య‌రాం భార్య రేణుక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీకి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు. అయితే మంజునాథ్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి తప్పుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ లెటర్ తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు కూడా రిజిస్టర్ చేసేశారు.   అయితే ఇప్పుడు మంత్రిగారు భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో.. మొత్తం వ్యవహారం అంతా రివర్స్ అయింది. అంత పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని.. అలాగే కొత్తగా వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసేటపుడు పెద్ద మొత్తంలో క్యాష్ చెల్లించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒక పక్క మంత్రి గారు దొంగ పత్రాలతో బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తానే ఒక బాధితుడినన్నట్లుగా చెపుతూ.. మోసపోయానని ఫిర్యాదు చేశారు.   ఇది ఇలా ఉండగా.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ ఆ భూముల్ని తనకు కూడా అమ్మిందంటూ కరణం పద్మనాభరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు విక్రయించిన పొలాన్నే మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఇట్టినా కంపెనీ ఎండీ, మాజీ డైరెక్టర్‌ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   ఇంతకూ మంత్రి గారికి నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేశారా.. లేకపోతే బెదిరించి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారా అన్నది పొలిసు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఏడాదికి కేవలం మూడు లక్షల ఆదాయం ఉన్న మంత్రి జయరాం, పదవి చేపట్టిన కొంత కాలానికే.. అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఇప్పటికే టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం వైపు నుండి మాత్రం కనీస స్పందన కూడా లేదు. అయితే దీని పై.. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ.. మొత్తం కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి.