సుశాంత్‌ సింగ్‌ మృతిపై ఎయిమ్స్‌ కీలక రిపోర్టు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతి కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌ మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.     సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని తెలిపారు. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. సుశాంత్‌ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. సుశాంత్‌ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.   కాగా, సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని హత్య చేసి ఉంటారని అతని తండ్రి బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌ ది ఆత్మహత్యేనని తెలిపింది. 

రాజధాని తరలింపు ఎఫెక్ట్... 210 కోట్ల నష్ట పరిహారం కోరుతూ సినీ ప్రముఖులు హైకోర్టులో పిటిషన్ 

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చాలని నిర్ణయయించిన సంగతి తెలిసిందే. దీంతో రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ 286 రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల నుండి భూసమీకరణ చేసింది. అయితే ఇక్కడి భూమికి బదులుగా రాజధాని అమరావతిలో భూములు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే రాజధాని తరలింపు వార్త వచ్చిందో అప్పటి నుండి గన్నవరంలో భూములిచ్చిన రైతులు ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ తమ భూములలో వ్యవసాయ పనులు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే.   తాజాగా గన్నవరంలో ఉన్న తమ భూములకు తగిన నష్ట పరిహారం ఇప్పించాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్, సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద అశ్వినీదత్ భూమిని ఇచ్చారు. అశ్వినీదత్ భూసమీకరణ కింద ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్డీయే పరిధిలో ఆయనకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే ఏపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుండడంతో.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులను కూడా ఆపేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.   గన్నవరంలో తాను ఇచ్చిన భూమిని తనకు తిరిగి ఇవ్వాలని.. అలా సాధ్యం కాని పక్షంలో భూసేకరణ కింద నాలుగు రెట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. తాను ఇచ్చిన 39 ఎకరాల భూమికి రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని ప్రతివాదులుగా చేరుస్తూ అశ్వినీదత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందన్నారు. భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వినీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అశ్వినీదత్‌ తరపున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పిటిషన్‌ వేశారు.   ఇది ఇలా ఉండగా సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో తమకు చెందిన 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును కోరారు. తమ పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాల విలువను పరిగణనలోకి తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని అయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. కృష్ణంరాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మంత్రి మేకపాటి లేఖ కలకలం.. నా పరిస్ధితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటి?

నెల్లూరులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట అధికారులు వినడం లేదా? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. తాజాగా జిల్లా కలెక్టర్‌ కి ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది.    తన క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యం దారుణంగా ఉందని సిబ్బంది పలుమార్లు స్ధానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నేరుగా మంత్రే రంగంలోకి దిగారు. మంత్రి గౌతంరెడ్డి జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబుకు అధికారుల తీరుపై లేఖ రాశారు. స్ధానిక హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ తన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం లేదని ఫిర్యాదు చేశారు. గతంలో తనను వ్యక్తిగతంగా కలవాలని కోరినా కూడా అధికారి పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తన పరిస్ధితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని మంత్రి గౌతంరెడ్డి ప్రశ్నించారు.   ఇటీవల మున్సిపల్ అధికారులతో మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివ్యూ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ ప్రకటించారు. అనిల్ అలా ప్రకటన చేసి వారం తిరగక ముందే మంత్రి మేకపాటి అధికారుల తీరుపై కలెక్టర్‌ కి లేఖ రాయడం విశేషం.   మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యాన్నే అధికారులు నిర్లక్ష్యం చేయడం, సిబ్బంది నుంచి పలుమార్లు అధికారులకు ఫోన్లు వెళ్ళినా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్ధానికంగా నెలకొన్న రాజకీయాల కారణంగానే మంత్రి ఆదేశాలు కూడా లెక్కచేయకుండా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గౌతంరెడ్డికి సీఎం జగన్ మంత్రి బాధ్యతలు కట్టబెట్టడం జీర్ణించుకోలేని కొందరు సొంత పార్టీ నేతలే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గౌతంరెడ్డి మాట వినకుండా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో, మంత్రి మేకపాటి ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ పెద్దల పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు

సినీ పరిశ్రమని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణాంతరం వెలుగుచూసిన ఈ వ్యవహారం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలకు సైతం పాకింది. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోయిన్లు డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ ఉందంటూ నటి, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.   తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో సోమవారం 'తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటు' పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యవాణి మాట్లాడుతూ సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఆరోపించారు. వివిధ అవసరాల కోసం దిగజారే రకాలు సినీ రంగంలో ఉన్నారని అన్నారు.    టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో గతంలో చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యం అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? పెద్ద హీరోలతో నటించకపోవటానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి వివిధ కారణలున్నాయని అన్నారు. సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన కూతురు చదువుకుంటున్న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని దివ్యవాణి ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమని కుదిపేస్తున్న తరుణంలో దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

టీడీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత అని హోరెత్తిస్తున్న సోషల్ మీడియా.. ఖండించిన ఎమ్మెల్యే 

గత కొద్ది నెలలుగా టీడీపీ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో టీడీపీని వీడి జగన్ సారధ్యంలోని వైసిపికి మద్దతు తెలుపుతున్న సంగతి తెల్సిందే. కొద్ది రోజుల క్రితం విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా జగన్ కు జై కొట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నుండి ఎవరు ఎపుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ వైపు నుండి అధికార పక్షమైన వైసిపిని ఎదుర్కోవడంలో ముందుండే సీనియర్ నేత, ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేశారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ వెలుపల అయినా తన శక్తివంచన లేకుండా పార్టీ కోసం పోరాటం చేసే ఆయన రాజీనామా వార్తతో కొంత గందరగోళం నెలకొంది.  అయితే తాజాగా బుచ్చయ్య చౌదరి ఈ వార్త పై స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. ఇప్పటికే అందరూ అయిపోయారు.. ఇక మిగిలింది సాక్షాత్తు ప్రధాని మోదీ మాత్రమే అనుకుంటా అని బుచ్చయ్య చౌదరి సెటైర్ వేశారు. "ఇంకెందుకు లేటు. వైసీపీలోకి ప్రధాని కూడా వస్తున్నారంటూ ఆయన మీద కూడా వేసేయండి. మీరు ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా మీకు 5 రూపాయలు మాత్రమే వస్తాయి" అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనపై వచ్చిన వార్త ఫేక్ అని అయన కొట్టిపారేశారు.

విజయవాడ టీడీపీలో విచ్ఛిన్నకర శక్తులు.. సీనియర్ నేత సెన్సేషనల్ కామెంట్స్ 

ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు గాను అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురామ్ తొలి సారిగా మాట్లాడుతూ కృష్ణా జిల్లా టీడీపీ కంచుకోట అని, అయితే కొన్ని కారణాలతో పార్టీ బలహీన పడిందని.. మళ్లీ కృష్ణా జిల్లాలో పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. తాను ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని నెట్టెం రఘురామ్ అన్నారు. పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని దీంతో పార్టీ కొంత దెబ్బతిందని ఆయన సెన్సేషనల్ కామెంట్ చేశారు. 2024లో కానీ లేదా ఇంకా ముందుగానే ఎన్నికలు జరిగినా విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీని గెలిపించుకుంటామని నెట్టెం రఘురామ్ స్పష్టం చేసారు. విజయవాడ పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాలపై తనకు పూర్తి అవగాహన ఉందని త్వరలో 7 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు వంచించబడ్డారని అయన వివరించారు. టీడీపీ వచ్చాకే ఏపీలో అభివృద్ధి అనే విప్లవం వచ్చిందని రఘురామ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.   విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన నెట్టెం రఘురామ్ వస్తూనే పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని.. దీంతోనే పార్టీ దెబ్బతిందని ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ టీడీపీలో పలు గ్రూపులు ఉన్నాయని.. వారిని టార్గెట్ చేస్తూ నెట్టెం రఘురామ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డ నెట్టెం రఘురామ్ కొంతమంది నేతలను టార్గెట్ చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడంతో.. అసలు ఆయన నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళతారా లేదా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారు. బాలసుబ్రమణ్యంకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని కోరారు.   లేఖలో ఆయన పలు భాషల్లో పాడిన పాటలు, ఆయనకు వచ్చిన అవార్డుల విషయాలను జగన్ ప్రస్తావించారు. "గత 50 ఏళ్లుగా ఆయన ప్రపంచ సంగీత పరిశ్రమపై చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం. ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులు, ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. ఐదు దశాబ్ధాల పాటు సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు నివాళి అర్పించాలి." అంటూ సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.  

ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్.. ఇకనైనా సీఎం జాగ్రత్తగా ఉంటారా?

ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గత పది, పదిహేను రోజులుగా ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న, కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.   ఇదిలా ఉంటే.. మంత్రి వేణుగోపాల్‌ ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మంత్రి.. జగన్ వెంటే ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా పాల్గొన్నారు. అంతేకాదు, ఆదివారం నాడు జరిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రథం నిర్మాణ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తో కలిసి మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు. మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు.    మరోవైపు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. పైగా సీఎం ఎప్పటిలాగానే మాస్క్ ధరించకుండానే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో సీఎం హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని, ఇక నుంచైనా మాస్క్ ధరిస్తూ ఆయన జాగ్రత్తగా ఉండటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం.. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడి చేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది.    కొత్తకోటలో రామచంద్ర సరుకులు కొంటుండగా దుండగులు హత్యాయత్నం చేశారు. సూరపవారిపల్లెకు చెందిన కుమార్‌, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేసినట్లు రామచంద్ర తెలిపారు. కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు తనపై దాడిచేశారన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా వైద్యశాలకు పంపారు.   మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూరిత దాడులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. గత 16 నెలల కాలంలో 152కి పైగా దాడులు జరిగాయని ఆరోపించారు. జడ్జి కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు.   కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు.   గతంలో జడ్జి రామకృష్ణను రోడ్డుపైకి రాకుండా తహసీల్దార్‌ నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు ఆధారంగా జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బి.కొత్తకోట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారమే తనను అధికార పార్టీ నేతలు, అధికారులు అనేక రకాలుగా హింసిస్తున్నారని ఆయన అప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగా కావాలనే ఈ కేసులో మహిళలను రప్పించి అక్రమంగా కేసులు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు.    ఇప్పుడు ఏకంగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. అధికార పార్టీ తప్పుల్ని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టడం, హత్యాయత్నం చేయడం వంటివి చేస్తారా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కీలక పదవిలో ఉండి కుల రాజకీయాలా! విజయ.. ఛీయి

గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.. జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం. కులాలపై కవి గుర్రం జాషువా ఎప్పుడో చెప్పిన మాటలివి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నేతలకు ఇది అచ్చి గుద్దినట్లు సరిపోతోంది. విజ్ఞత లేనివాళ్లు..ఎటువంటి సంస్కారం లేని వాళ్లే కులం గురించి మాట్లాడుతుంటారు. ఆ కోవలో వచ్చేవారే  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఉన్నత చదువున్నా సంస్కారం లేనివాడుగా వ్యవహరిస్తున్నాడు. విజయసాయి బాటలోనే ఇతర వైసీపీ నేతలు నోరు తెరిస్తే కులాల కుంపటి రాజేస్తున్నారు.  ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కుల జడ్జీలు, కుల నాయకులు, కుల మీడియా అంటూ విద్వేష ప్రకటనలు చేస్తున్నారు. ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా నేతలకున్న సంస్కారం.. మనం ముందుకు వెళుతున్నా లేక వెనక్కి వెళుతున్నామా అన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.     కులాలు, మతాలను రాజకీయాలకు, సొంత ప్రయోజనాలకు ఆపాదించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నది ఒక ప్రాథమిక సూత్రం. అయితే  వైసీపీ నేతలు ఆ విజ్ఞతను మర్చిపోయి ప్రవరిస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే.. ఏపీలో  మాత్రం వైసీపీ నేతలు కులాల కుంపటి రాజేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా తన తీరు మార్చుకోవడం లేదు విజయసాయి రెడ్డి. ఒక వర్గం నేతలే టార్గెట్ గా ఆయన అభ్యంతరకర ప్రకటనలు చేస్తున్నారు.  తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై  ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన విజయసాయి.. జాతి పేరుతో ప్రకటన చేయడం దుమారం రేపుతోంది.    రాజధాని అమరావతి విషయంలోనూ విజయసాయి రెడ్డి ఎప్పుడూ కుల ప్రస్తావనే తెస్తారు. కమ్మని రాజధాని అంటూ ఓ కులానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. తన జాతి కోసమే చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారనే నీచమైన కామెంట్లు చేశారు. ‘కమ్మని’ అంటూ విజయసాయి రెడ్డి పరోక్షంగా కులాన్ని ప్రస్తావించడాన్ని  చాలామంది తప్పుపట్టారు. గతంలోనూ చాలా సార్లు ఆయన విపక్ష నేతలపై కులం పేరుతో కామెంట్లు చేశారు. దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుపై  కులం పేరుతోనే కామెంట్స్ చేస్తారు. అంతేకాదు చంద్రబాబు సమర్ధించేవారికి కూడా జాతి, కులం అంటగడుతూ ట్వీట్లు, ప్రకటనలు చేస్తుంటారు విజయసాయి రెడ్డి.    హైకోర్టు జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలపైనా  తీవ్రమైన ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి. కులం, జాతీ పేరుతో  వివిధ రూపాల్లో జడ్జీలపై ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లోనూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు వైసీపీ ఎంపీలు. ఏపీ హైకోర్టు జడ్జీలను ఉద్దేశిస్తూ రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడారు విజయసాయి రెడ్డి. ఏపీ హైకోర్టు జడ్జీలపై జాతి  పేరుతో విజయసాయి రెడ్డి గతంలో పలుసార్లు ట్వీట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కీలక పదవిలో ఉన్న  విజయసాయి రెడ్డి.. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతి పేరుతో చీప్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                 కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు ఎలక్షన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  అయితే  ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన కులానికి చెందిన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి  అరోపణలు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ” ఉల్లిపాయ” అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అప్పుడు కాపు కులానికి సంబంధించిన చాలా మంది ఆ వ్యాఖ్య వెనక పాతకాలం నాటి ముతక సామెత ని ప్రస్తావించే ఒక దురుద్దేశం ఉందంటూ విజయసాయిరెడ్డి మీద మండిపడ్డారు.    విజయసాయిరెడ్డి కామెంట్స్ అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ రకమైన కామెంట్స్ తో ఆ పార్టీ నాయకుల మనస్తత్వం  రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసిందని చెబుతున్నారు. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడన్న గుఱ్ఱం జాషువా గారి మాటలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు బీజేపీ నేతలు. పురేంధేశ్వరకి కీలక పదవి రావడాన్ని జీర్ణించుకోలేకే విజయసాయి రెడ్డి దిగజారే ప్రకటన చేస్తున్నారని  మండిపడుతున్నారు. పురందేశ్వరికి విజయసాయిరెడ్డి  బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగింటి ఆడపడుచుకి అధికారంలో వున్న జాతీయ పార్టీ జాతీయస్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతలు ఇస్తే అభినందించాల్సింది పోయి.. ఆమెకు జాతిని అంటగడుతూ కామెంట్స్ చేయడమేంటనీ ఏపీ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా.. తెలుగు జాతి ఆడపడుచు, జాతీయ పార్టీలో ఉన్నత స్థానం సంపాదిస్తే అభినందించాల్సింది పోయి..  ఇలా అమరావతికి, కులానికి లింక్ పెట్టి మాట్లాడటానికి సిగ్గు ఉండాలని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.    కుల, మతాల కతీతంగా పని చేస్తామని ప్రజా ప్రతినిధులు ప్రమాణం చేస్తారు. రాజ్యసభలోనూ రాజ్యాంగ స్పూర్తిని కాపాడుతానని విజయసాయి రెడ్డి ప్రమాణం చేశారు. అయితే రాజ్యాంగ ఆశయాలకు  విరుద్ధంగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అతను ప్రమాణంలో చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేంటీని ప్రజలు నిలదీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి.. కుల, తమ విధ్వేషాలు రేగేలా విద్వేష ప్రకటనలు చేస్తున్నా.. చర్య తీసుకునే అవకాశం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మన దేశ రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగిస్తున్నా,, చూస్తూ భరించాల్సిందేనా అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో కూర్చుంటూ సిగ్గు లేకుండా కులాల గురించి మాట్లాడే విజయసాయికి .. రాజ్యసభలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు.    మరోవైపు కుట్ర పూరితంగానే వైసీపీ నేతలు కులాల కుంపట్లు రాజేస్తున్నారనే ఆరోపణలు చే వస్తున్నాయి. కొందరిని , ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలను సీఎం జగన్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ నేతలను వారించడం లేదంటే ఆయన అంగీకారంతోనే నేతలు మాట్లాడినట్లు భావించాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు.

జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా.. సజ్జలకు బుద్దా స్ట్రాంగ్ కౌ?

ఏపీలో గతేడాది కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు ప్రకాశం బ్యారేజ్ నుండి నీటిని కిందికి వదలకుండా చంద్రబాబు ఇంటిని ముంచేందుకు.. అలాగే అమరావతిని ముంపు ప్రాంతంగా ప్రపంచం మొత్తానికి చూపేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా కృష్ణా నదికి మళ్ళీ వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా బాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాబును ఉద్దేశించి.. చట్టాన్ని గౌరవించాలని, ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా "చంద్రబాబు గారూ కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి. కోర్టుల ద్వారా మీరు రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?" అంటూ ట్వీట్ చేసారు.   తాజాగా సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "అయ్యా సజ్జల రెడ్డి.. చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా? ముందు దొంగ సొమ్ముతో కట్టిన రాజ భవంతులు పేదలకు పంచి, ఆ తరువాత ఇతరులను విమర్శించండి" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. అంతేకాకుండా "అవినీతి బురదలో ఉన్న సజ్జల.. వరద గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతి కట్టలతో కోటలు నిర్మించే వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగే సజ్జల గారు చంద్రబాబు గారి అద్దె ఇంటి కోసం ఆందోళన చెందటం వింతగా ఉంది" అంటూ బుద్ధా వెంకన్న తన తాజా ట్వీట్ లో తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

కేరళలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క వారంలోనే 40 వేల కొత్త కేసులు 

భారత్ లో మొట్టమొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తోలి రోజుల్లో పాజిటివ్ కేసులు అధికంగానే నమోదైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసింది. అయితే తాజాగా కేరళలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. కేరళ లో ముఖ్యమైన పండగ ఓనమ్ సందర్భంగా నిబంధనలను సడలించడం తో పాటు దేవాలయాలను తెరవడం వంటి కారణాలు, మరో పక్క ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం కేసుల పెరుగుదలకు కారణమని ప్రభుత్వ వైద్య వర్గాలు తెలిపాయి.   దీంతో వచ్చే నెలలో కేరళలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తాజాగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టెస్ట్ పాజిటివ్ రేటు సగటున 8 శాతం ఉండగా, కేరళలో మాత్రం 11.9 శాతంగా ఉందని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుండి మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, తాము తీసుకున్న చర్యలతోనే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉందని ఆమె అన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ముందుగానే అంచనా వేశామని ఆమె తెలిపారు. కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని మంత్రి శైలజ సూచించారు. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 860 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, అందులో కూడా 15 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆమె అన్నారు. అంతేకాకుండా కొంతమంది బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, దీనిపై ప్రజలు కనుక సహకరించకపోతే మరోసారి లాక్ డౌన్ విధిస్తామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఐక్యతే అసలు టార్గెట్! మణిక్కమ్‌ మేజిక్ చేసేనా? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ తన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ఠాగూర్ రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం జనం మధ్యనే ఉండాలంటూ దిశా నిర్దేశం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో అసలు సమస్య నేతల మధ్య విభేదాలే. వర్గపోరుతోనే పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాణిక్కమ్ ఠాగూర్ కి ఇది ఇప్పుడు అసలు సమస్యగా మారింది.    మణిక్కమ్‌ ఠాగూర్ కు స్వాగతం చెప్పే క్రమంలోనూ శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. రాష్ట్ర నేతలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగారు. తమ అనుచరులను భారీగా తీసుకొచ్చారు. దీంతో వచ్చిన కార్యకర్తలు తమ నాయకుడికి జై కొడుతూ హడావుడి చేశారు. ఇక ఠాగూర్ ను రిసీవ్ చేసుకునేందుకు నేతలు పోటీ పడటంతో ఎయిర్ పోర్టు దగ్గర స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుపై మాణిక్కమ్ ఠాగూర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీని ఆయన ఎలా గాడిలో పెడతారన్నది చర్చగా మారింది.   పార్టీ తనను తెలంగాణ ఇంచార్జ్ గా నియమించినప్పటి నుంచే మాణిక్కమ్ తన పని మెదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ముఖ్య నేతలతో చర్చించారట. త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఠాగూర్ సవాల్ గా తీసుకున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం మాణిక్కమ్ వ్యూహరచన సిద్ధం చేశారని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపై నేతలతో చర్చించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి నేతలంతా వెళ్లాలని ఆదేశించారట మాణిక్కమ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి.. ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమయ్యారు. ఏఐసీసీ తలపెట్టిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.     గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీతో సమావేశమైన మాణిక్కమ్.. తన స్టాండ్ క్లియర్ గా చెప్పేశారట. అందరూ క్రమశిక్షణతో ఐకమత్యంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారట. సోనియాగాంధీ త్యాగం వల్లనే తెలంగాణ ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఠాగూర్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి సోనియాకు బహుమతిగా ఇవ్వడమే మన లక్ష్యమని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. అయితే మాణిక్కమ్ ఠాగూర్ చర్యలతో కాంగ్రెస్ లో వర్గ పోరు ఎంతవరకు సమసి పోతుందో ఇప్పుడే చెప్పలేం. నేతలంతా విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే తప్ప పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు రావని కాంగ్రెస్ కార్యకర్తలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఏకతాటి పైకి తీసుకురావడంలో మణిక్కమ్ ఠాగూర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరీ.

జవాన్లను బలితీసుకుంటున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో భయబ్రాంతులను సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా కేంద్ర పోలీస్ బలగాలపై పంజా విసురుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఎన్‌ఎస్‌జీ, సీఐఎస్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్‌లోని  సిబ్బందికి కరోనా సోకింది. ఇప్పటికే దాదాపు 36 వేల మందికి ఈ మహమ్మారి బారిన పడగా వారిలో 128మంది మరణించారు. ఇంకా ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే  బీఎస్ఎఫ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి  కరోనా సోకింది. ఈ వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది మరణించారు. కరోనా సోకిన వారందరికీ సైనిక వైద్యఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయినా వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

నిన్న ఒక్కరోజే హుండీ కలెక్షన్ 2.34కోట్లు   కరోనా కారణంగా స్తంభించిపోయిన ప్రజాజీవనం మెల్లమెల్లగా కరోనాతో సహవాసానికి అలవాటు పడుతుంది. లాక్ డౌన్ లతో ఇంటికే పరిమితమైనా కరోనా మహ్మమారి విజృంభన ఏ మాత్రం తగ్గకపోవడంతో క్రమంక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నెలల తరబడి మూతపడిన ఆలయాలు తెరుచుకోవడంతో సందర్శకుల సంఖ్యనానాటికీ పెరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.  దాంతో తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. ఆదివారం ఒకరోజే 12వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.34కోట్ల రూపాయలు వచ్చింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇంత ఆదాయం వచ్చినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నెలలో దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయగా, ఇప్పటికే అన్ని అయిపోయాయి.   లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత రవాణా సదుపాయాలు ఎక్కువగా లేకపోవడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. చాలావరకు సొంత వాహనాల్లో వచ్చేవారు మాత్రమే ఏడుకొండస్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం భారీగా పడిపోయి 50లక్షలు మించలేదు. ప్రసుత్తం రవాణా సదుపాయాలు పెరగడంతో అక్టోబర్ లో స్వామివారి దర్శనం కోసం ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్నవారి సంఖ్య పెరిగింది. తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అన్న ఆశాభావాన్ని టిటిడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్.. తిరుమలలో సీఎం వెంటే ఉన్న మంత్రి

ఏపీలో కరోనా వ్యాప్తి విఐపిలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాకు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. తాజాగా ఈ వైరస్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా తాకింది. రెండు రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌నిపించడంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.   ఇటీవ‌ల తిరుమ‌లలో జరిగిన బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజులు పాటు తిరుమ‌ల‌లోనే ఉన్నారు. అలాగే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే దగ్గర నుండి కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంతో పాటు.. చివరకు హైదరాబాద్ కు బయలుదేరేవరకు అయన సీఎం జగన్ తోనే వున్నారు. దీంతో సీఎం ఆరోగ్యం ప‌ట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

బాలు కోసం వెంకయ్య హోమం.. అందుకే ప్రకటన ఆలస్యం?

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎస్పీ బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. తెలుగు సినీ లోకమైతే ఎస్పీ బాలు మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.    ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది ఆయన అభిమానులు పూజలు చేశారు. సినీ తారలు బాలు క్షేమం కోసం ప్రత్యేక హోమాలు, వ్రతాలు చేశారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎస్పీ బాలు కోలుకోవాలని ఎంతో తపించారు. ఆయన కోసం పూజలు చేశారు. ఇక బాలు ఆరోగ్యం క్షిణించదన్న వార్తతో వెంకయ్య నాయుడు తీవ్ర మనో వేదనకు గురయ్యారట. బాలు కోసం ఆయన శుక్రవారం రోజున ప్రత్యేక హోమం చేశారని తెలుస్తోంది. అందుకే బాలసుబ్రమణ్యం మరణవార్తను అధికారికంగా ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలసుబ్రమణ్యంను రక్షించడం ఇక కష్టమని డాక్టర్లు చెప్పినా.. వెంకయ్య నాయుడు హోమం చేస్తుండటంతో కొన్ని గంటల పాటు అందరూ వెయిట్ చేశారని తెలుస్తోంది. చివరకు రెండు గంటలు ఆలస్యంగా బాలు చనిపోయారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారని చెబుతున్నారు. బాలు ఆరోగ్యం క్షేమం కోసం వెంకయ్య నాయుడు ప్రత్యేక హోమం చేశారంటే.. ఆయనపై వెంకయ్యకు ఎంతో అప్యాయత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత!!

అధికార పార్టీలోకి వలసలు సహజం. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని తెలుస్తోంది. కాగా, మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్న వేళ.. టీడీపీలో వలసలు ఊపందుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అదీగాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎల్బీనగర్‌ కు చెందిన నేత పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరడం.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టిదెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమరావతికి పట్టిన పీడ విరగడైందట.. జీవీఎల్ పై నెటిజన్ల సెటైర్లు 

బీజేపీ అధిష్టానం కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలనుండి డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్ పుత్రిక పురందేశ్వరి ఉన్నారు. అయితే ఇప్పటివరకు వివిధ పదవులలో ఉన్న రామ్ మాధవ్, మురళీధర్ రావులకు మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ప్రస్తుతానికి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజా లిస్ట్ లో జీవీఎల్ పేరు కనిపించకపోవడం తో సోషల్ మీడియాలో దీని పై అపుడే పెద్ద చర్చ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ ఉన్న సమయంలో ఇసుక పాలసీ నుండి.. అమరావతి వరకు అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వం పై అయన ఇలా విమర్శలు చేయగానే అలా డీల్లీనుండి ప్రత్యక్షమై అబ్బే అలాంటిదేం లేదు.. జగన్ ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తోంది.. అసలు తప్పంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే అంటూ విరుచుకుపడిన సీన్లు గుర్తుకు తెచ్చుకుని మరీ హమ్మయ్య అమరావతికి పట్టిన పీడా విరగడైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమరావతి విషయంలో అయన వ్యవహరించిన తీరుతో ఏపీ ప్రజలలో బీజేపీకి ఉన్న కాస్త సపోర్ట్ కూడా పోయి.. ఆ స్థానంలో ద్వేషం ఏర్పడేలా చేయడంలో అయన సక్సెస్ అయ్యారని కూడా సెటైర్లు పడుతున్నాయి. జీవీఎల్ తెలుగువారైనా యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ.. తాజాగా స్పైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన విషయం తెల్సిందే. దీంతో ఇప్పటి నుండి అయన ఏపీ పైన పెద్దగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని దీంతో ఏపీలో బీజేపీ కూడా కోలుకునే అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో కొందరు ఆశావహుల అభిప్రాయం.