MRO Vanajakshi Controversial Comments On Farmers

రైతులను బ్రోకర్లు అన్న ఎమ్మార్వో వనజాక్షి.. తిరగబడ్డ రైతులు!!

టీడీపీ హయాంలో చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ తో పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మార్వో వనజాక్షి నోరు జారడంతో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేయగా.. సభలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు. సభ జరుగుతున్న సమయంలో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించారు.  ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను బ్రోకర్లు అంటారా? అంటూ వనజాక్షి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. వనజాక్షి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు. ఎమ్మార్వో వనజాక్షి తీరుపై మహిళలు, రైతులు మండిపడ్డారు. ఆమెపై ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Nirbhaya Convicts To Now Hang On March 3 At 6 am

నిర్భయ దోషులు నలుగురికీ మార్చి 3న ఉరి!

ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. మార్చిన 3వ తేదీ ఉదయం ఆరు గంటలనకు దోషులైన నలుగుర్నీ ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే తాజాగా వెల్లడించిన తీర్పుతో తిహార్ జైల్లో మార్చి 3వ తేదీన నలుగుర్నీ ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్భయ కేసు ఉరిశిక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. గతంలోనే నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి1వ తేదీన ఉరి తీయాల్సి ఉంది. కానీ.. కోర్టు ఆదేశాలతో ఉరి శిక్ష అమలును నిలిపేయాలని పాటియాల కోర్టు జనవరి 31న తీర్పు చెప్పింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం హైకోర్టుకు వెళ్లగా.. ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 17వ తేదీన పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఆ దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ.. దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ... ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉందని. నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పుడు కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంతో నిర్భయ తల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

TDP MLC Buddha Venkanna Fires On YS Jagan

ఈడీ జప్తు చేసింది  కేవలం రూ.43వేల కోట్లే..ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షల కోట్లుంది!!

రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీదాడుల గురించి, గత నాలుగురోజులుగా నిర్విరామంగా దుష్ర్ఫచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా లక్షలకోట్లు పోగేసుకొని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదన్న వెంకన్న, టీడీపీపై మాత్రం విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. శ్రీనివాస్ ఇంటిలో ఏ సూట్ కేసులు దొరకలేదని ఐటీశాఖే స్పష్టంగా చెప్పిందని, రూ.2వేలకోట్లు దొరికాయని విష ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, మంత్రులు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. రూ.2వేలకోట్లు దొరికాయని, ఆ సొమ్మంతా చంద్రబాబుదేనని  గగ్గోలు పెట్టిన వైసీపీ బృందం ఆ మొత్తంసొమ్ము ఎక్కడుందో చూపాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగిల్ బెడ్ రూమ్ ఇల్లున్న శ్రీనివాస్ ఇంట్లో ఆ రూ.2వేలకోట్లు ఎక్కడ దాచారో, వైసీపీనేతలే చెప్పాలన్నారు. వైసీపీ చెబుతున్న రూ.2వేలకోట్లు ఉంచడానికి వెయ్యి సూట్ కేస్ లు కావాలని,  శ్రీనివాస్ ఇంటిలో ఐటీవారికి ఒక్క సూట్ కేస్ కూడా దొరకలేదన్నారు. లక్షరూపాయలు, కోటి రూపాయల నోట్లు ఏవైనా జగన్ ముద్రించినట్లయితే, అప్పుడు రూ.2వేలకోట్లను తేలికగా దాచవచ్చని వెంకన్న ఎద్దేవా చేశారు.   చంద్రబాబు సమాజం గురించి ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సమాజనాశనం గురించి ఆలోచిస్తూ, దాన్ని నాశనం చేసి, శ్మశానం చేయాలని చూస్తున్నాడన్నారు. జగన్ తన అక్రమ సంపాదనను ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ లలో దాచి ఉంచాడని, ఆ సొమ్ములో ఈడీ జప్తుచేసింది  కేవలం రూ.43వేలకోట్లేనని, ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షలకోట్ల వరకు ఉందన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్నవారే, ఇప్పుడు, పోవాలి జగన్... జైలుకుపోవాలి జగన్ అంటున్నారని బుద్దా ఎద్దేవాచేశారు. అడ్డగోలుగా ప్రజలసొమ్ము తినడానికే జగన్ రాజకీయపార్టీ పెట్టాడని, అధికారపీఠాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు ఎలా దోచేయాలనేదాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడని వెంకన్న విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనచూశాక పోవాలి జగన్....పోవాలి జగన్ అనే పల్లవి పాడుతున్నారని, జగన్ చేస్తున్న పనులు అలాంటి స్థితిని కల్పించాడన్నారు.  విజయ్ మాల్యా తన మనసు మార్చుకొని ప్రజలసొమ్ముని తిన్నందుకు బాధపడుతూ, దాన్ని తిరిగిచ్చేయడానికి ముందుకొచ్చాదని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లో మాత్రం ఎక్కడా మచ్చుకైనా పశ్చత్తాపం కనిపించడంలేదన్నారు. చరిత్రలో చూసినట్లయితే చాణక్య- చంద్రగుప్తులు ప్రజలకు మేలుచేయడానికి, వారి సంక్షేమం, సంతోషం కోసం పనిచేస్తే, జగన్- విజయసాయిరెడ్డి మాత్రం  రాష్ర్టాన్ని ఎలా దోచుకోవాలి.. ప్రజల్ని ఎలా నాశనం చేయాలన్నదాని గురించే నిత్యం ఆలోచిస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. తన పైశాచిక ఆనందం కోసం సమాజాన్ని భయపెట్టి, బతకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ పాలనతో విసిగి, వేసారిన జనమంతా  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశానికే ఓటేయాలనే ధ్రఢసంకల్పంతో ఉన్నారని వెంకన్న స్పష్టంచేశారు.

DMart Security Attacked A Boy For Stolen Chocolate

చాక్లెట్ దొంగతనం.. స్టూడెంట్ ప్రాణం తీసింది...

హైదరాబాద్ లోని వనస్థలిపురం డిమార్ట్ దగ్గర ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. నిన్న షాపింగ్ కి వెళ్లిన సతీష్‌(17) కి డిమార్ట్ సెక్యూరిటీకి మధ్య వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.. చాక్లెట్ దొంగతనం చేసినందుకు డీమార్ట్ సెక్యురిటీ సతీష్ అనే విద్యార్థిని గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా నేలకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అటు తల్లిదండ్రులు కొడుకు మృతితో బోరున విలపిస్తున్నారు. తమ కొడుకును అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డిమార్ట్ దగ్గర ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు అక్కడ అద్దాల్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సతీష్ ను కాలేజీ యాజమాన్యం కూడా తమ పర్మిషన్ లేకుండానే బయటకు పంపారని అంటున్నారు. సతీష్ చావుకు డీమార్ట్ సిబ్బంది.. కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని వెల్లడించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

Medchal BTech Student Jeevan Has Not Found

ఇంకా తెలియని బీటెక్ స్టూడెంట్ జీవన్ ఆచూకీ

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 11వ తేదీన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని హాస్టల్ నుంచి వెళ్లిన జీవన్ అనే విద్యార్థి తిరిగి రాలేదు. దీంతో అదేరోజు కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా జీవన్ ఆచూకీ లభ్యం కాకపోవడంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. స్టూడెంట్ తల్లిదండ్రులు.. పోలీసులు జీవన్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ.. ఆరు రోజులు దాటి పోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అలాగే పోలీసులు కూడా ఒక్కసారిగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అతను 11వ తేదీన హాస్టల్ లోపలికి వస్తున్నట్టు హరిహరా బాయ్స్ హాస్టల్ లోని సీసీ కెమెరాలో రికార్డు కావటం జరిగింది. ఆ తర్వాత మాత్రం అతను బయటకు వెళ్లే సమయంలో అక్కడ పవర్ కట్ ఉండటంతోటి అతను బయటకు వెళ్లే విజువల్స్ మాత్రం రికార్డు కాలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న పలు సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అతన్ని క్షేమంగా పట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతని వాష్ రూమ్ లో బ్లేడ్ తో పాటు రక్తపు మరకలు ఉన్నాయి. అది కూడా గోడకి మొత్తం రుద్దినట్టుగా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఏమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడా జీవన్? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జీవన్ అప్పు చేయటం జరిగిందని.. తోటి విద్యార్థులతో కలిసి బయట లోన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోన్ కి సంబంధించి వాళ్లు అతన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో పాటు వెంటనే చెల్లించాలంటూ కూడా అతని పైన ప్రెజర్ తీసుకురావటం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ తల్లితండ్రులకు ఆ విషయాన్ని చెప్పలేక హాస్టల్ నుంచి వెళ్లి పోయినట్లు కూడా అతని రూమ్ మేట్స్ చెప్తున్నారు. కాగా పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.

Vijay Sai Reddy satirical tweet on Chandrababu over IT raids

చంద్రబాబు గుట్టంతా రట్టైంది.. పీఎస్ పాస్ వర్డ్ లీక్!!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వద్ద పీఎస్ గా చేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ రైడ్స్ తాలూకూ ప్రకంపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటే.. లేదు, లేదు రూ.2లక్షల 63 వేలే దొరికాయని టీడీపీ వెల్లడిస్తుంది. ఇదే అసలు నిజం అంటూ.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ ను కూడా బయటపెట్టారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ తమ అధినేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పీఎస్.. శ్రీనివాస్ ఎపిసోడ్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంత బతుకు బతికి ఇంటెనక.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్లు.. ఐటీ దాడుల తర్వాత క్లియర్‌గా అర్థమైందని.. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశారు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి చేసిన మరో ట్వీట్ లో... 'చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ కమిట్మెంట్‌ని మెచ్చుకోవాలి.. యజమాని ప్రతిలావాదేవీనీ డైరీలో రాసుకున్నాను అని చెప్పాడు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసాడు. మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విజయసాయిరెడ్డి ట్వీట్స్ పై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ కేసుని కప్పిపుచ్చడం కోసమే ఇలా ఐటీ రైడ్స్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

Nimmagadda Shock To YS Jagan From Serbia

సెర్బియా లో 'నిమ్మ' కాయని నొక్కితే ఏపీలో 'జాం' కాయ అదిరింది!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మరియు కొందరు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దల్ని కలిశారని వైసీపీ చెప్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం తనపై ఉన్న కేసులకు భయపడి ఎన్డీయేలో చేరటానికి జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించింది. ఇలా జగన్ ఢిల్లీ టూర్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్న వేళ.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. జగన్ ఢిల్లీ టూర్ వెనుక నిమ్మగడ్డ ప్రసాద్‌ కేసు ఉందని ప్రచారం జరుగుతోంది. ఎనిమిది నెలల క్రితం రస్‌ అల్‌ ఖైమా అనే దేశం జారీ చేసిన ఇంటర్‌పోల్ నోటీసుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల్లో పెట్టుబడులంటూ.. దాదాపుగా ఎడెనిమిది వందల కోట్ల రూపాయలను రస్ అల్ ఖైమా నుంచి నిమ్మగడ్డ సేకరించారు. అయితే తరువాత ఆ ఒప్పందాలు రద్దు అయ్యాయి. అయినా, రస్ అల్ ఖైమా పెట్టిన వందల కోట్లు పెట్టుబడిని మాత్రం నిమ్మగడ్డ తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు రస్‌ అల్ ఖైమా కీలకమైన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయమై రస్‌ అల్‌ ఖైమా దేశం కేంద్రాన్ని సంప్రదించిందని కూడా సమాచారం. రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ.. అప్రూవర్ గా మారిపోయారని అంటున్నారు. తాను పాల్ప‌డిన కుంభ‌కోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు విడ‌మ‌రిచి చెప్పేశార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ వ్యక్తిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని భారత్ ప్ర‌భుత్వాన్ని కోరింద‌ని స‌మాచారం. నిమ్మగడ్డ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అందరికి తెలుసునని, ఇప్పుడు ఆ వ్యక్తే కేంద్రం దగ్గరకు వెళ్లి తనని కాపాడాలని బ్రతిమాలుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మీడియాకు, ఏపీ ప్రజలకు ఈ సెర్బియా కేసు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. ఐటీ రైడ్స్, 2000 కోట్లు అంటూ ప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. అక్కడ సెర్బియాలో నిమ్మగడ్డ తీగని పట్టుకుంటే, ఇక్కడ ఏపీలో పెద్ద తలకాయ డొంక కదులుతుందని.. ఆ భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ విషయంపై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. "నీరసం గా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే అదో ఆనందం.. కానీ ఏపీ లో ఇప్పుడు బలం గా ఉన్నవాళ్ళు.. నిమ్మ దెబ్బకి రసం కార్చుకుంటున్నారు. రస్ అల్ ఖైమా లో ఉన్న 'నిమ్మ' కాయని నొక్కితే ఆంధ్ర లో ఉన్న 'జాం'కాయ ఖైమా అయిపోతుంది. అక్కడ ప్రతీ శుక్రవారం మనకి లాగా తప్పించు కోవడం కుదరదు. ఖైమా చేసేస్తారు. అబబ్బా దీన్ని కప్పిపుచ్చడం కోసం ఢిల్లీ టూర్ లో ఆంధ్ర అభివృద్ధి, నిధులు కోసం అంటూ ఏం చెప్తిరీ. మళ్ళా దీన్ని కప్పిపుచ్చడం కోసం IT రైడ్స్ తెర పైకి తీసుకొచ్చారు. అన్నట్టు.. 'నిమ్మ' కాయ నిజమైన రసాన్ని అధికారుల ముందు కక్కేసాడు అంట కదా!.. అంతా మీరే చేశారు అనే డైలాగ్ లాగా అంతా A1 చేసాడు అన్నాడు అంట. అది తెలిసే చలి కోటు కప్పుకుని ఢిల్లీ బాట పట్టారు అంట. వామ్మో ఎన్ని చావు తెలివితేటలు రా నాయనా..! సర్లే మొత్తానికి దొరికేశారు." అంటూ బుచ్చయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YCP Group Politics In Srikakulam District

దువ్వాడ దూకుడుకు సీనియర్ల బెంబేలు..! జగన్ కు మొరపెట్టుకున్న నేతలు..!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో  ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ తీరు మిగతా నేతలకు తీవ్ర తలనొప్పిగా మారిందని అంటున్నారు. జిల్లాలో సీనియర్లను కూడా దువ్వాడ లెక్కచేయడం లేదని చెబుతున్నారు. తనను తాను సీఎం జగన్ ప్రతినిధిగా చెప్పుకునే దువ్వాడ... శ్రీకాకుళం జిల్లా వైసీపీలో తాను చెప్పిందే జరగాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. తాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడునని, అపాయింట్ మెంట్ లేకపోయినా నేరుగా జగన్‌ను కలిసే చనువు, తనకు ఉందని చెప్పుకునే దువ్వాడ... జిల్లాలో తాను ఎవరి మాట విననని, తనకు నచ్చిందే చేస్తానని మొండిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దువ్వాడ అనుచరుల తీరు కూడా ఇలాగే ఉందని అంటున్నారు. జిల్లాలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత దువ్వాడకు జగన్ ఇస్తున్నారని, అదీ తమ లీడర్‌ సత్తా అంటూ ఫాలోవర్స్ గొప్పగా చెబుతున్నారు. అయితే, జిల్లాలో సీనియర్ నాయకులను సైతం పట్టించుకోకుండా దువ్వాడ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోందని అంటున్నారు. ముఖ్యంగా టెక్కలిలో ఎవరు కొలువు చేయాలన్నా దువ్వాడ శ్రీనివాస్ అనుగ్రహం కావాల్సిందేనన్న హుకుం జారీ చేస్తున్నారట. అందుకు, టెక్కలి పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి విషయంలో దువ్వాడ చేసిన హంగామాయే రుజువు అంటున్నారు. వైసీపీ నేతలందరికీ నచ్చినా, కేవలం తనకు నచ్చలేదన్న కారణంతోనే టెక్కలి పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఉద్వాసన పలకాల్సిందేనని దువ్వాడ రచ్చ చేశారట. ఇదిలాగుంటే, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో సైతం దువ్వాడ జోక్యం శ్రుతి మించిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ పలాసలో వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారు. దాంతో, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకి... దువ్వాడ సోదరులకు మధ్య అంతగా పొసగాడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో దువ్వాడ సోదరుల జోక్యాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు వ్యతిరేకిస్తున్నారు. అయితే, తమకు జగన్ అండ ఉందంటూ దువ్వాడ సోదరులు దూకుడుగా వెళ్తున్నారని అంటున్నారు. ఇక, ఇచ్చాపురం విషయానికి వస్తే ఇప్పటికే ఆరు గ్రూపులు ఉన్నాయని, అందులో కొందరు ధర్మాన ప్రసాదరావును ప్రసన్నం చేసుకునే పనిలో పడగా, మరికొందరు ధర్మాన కృష్ణదాస్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారని, మరికొందరు  దువ్వాడ శ్రీనివాస్ దగ్గరకు చేరి మరో వర్గంగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు, పార్టీ సీనియర్ నాయకులైన ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావుతో... దువ్వాడ శ్రీనివాస్‌కు సత్సంబంధాలు లేవంటున్నారు. దాంతో, దువ్వాడ దుందుడుకు విధానాన్ని పార్టీ ముఖ్య నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. దువ్వాడ శ్రీనివాస్‌తో వేగలేకపోతున్నామంటూ ఏకంగా జగన్ కే ఫిర్యాదు చేశారట. ఎక్కువ చనువు ఇవ్వడం వల్ల దువ్వాడకు అడ్డుకట్ట వేయడం ఇబ్బందిగా మారుతోందని సీనియర్లంతా వాపోయారని తెలుస్తోంది. దువ్వాడ వ్యవహారంతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదని అధినేత వద్ద ప్రస్తావించారట. దువ్వాడ చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే భావనను, జగన్ వద్ద వ్యక్తపరిచారట. మరి, శ్రీకాకుళం వైసీపీ సీనియర్ల వినతులపై అధినేత జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.

AP NIT director CS Rao video goes viral on Social Media

ఏపీ నిట్ డైరెక్టర్ వీడియో లీక్.. బయటపడిన బాగోతం!

ఆంధ్రప్రదేశ్ లో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు బాగోతాలు తాజాగా వెలుగు చూశాయి. విద్యార్థునులపై లైంగిక వేధింపుల ఆరోపణ ఎదుర్కొంటున్న రమణారావుకు సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. తాను ఓ ఉమనైజర్ నని దొరికితే ఎవర్నీ వదలను అంటూ రమణారావు చెబుతున్న మాటలు అందులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. పైగా తన లైంగిక వేధింపుల విషయాలు తన భార్యకు కూడా తెలుసు అంటూ రమణరావు గర్వంగా చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు వ్యవహారంపై అధికారులు అన్నీశాఖల డీన్ లతో చర్చించారు. అకడమిక్ సెక్షన్లను, కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమార్కుల నిగ్గు తేల్చడానికి కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి ఒకటి లోగా కమిటీ నివేదిక ఇవ్వాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే మాజీ మంత్రి మాణిక్యాల రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రెండుమూడ్రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వారు విద్యార్థులను వేధించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మానవ వనరులు శాఖకు ఫిర్యాదు చేశామని కూడా వెల్లడించారు. కాగా నిట్ డైరక్టర్ సీఎస్పీ రావు వేధింపులు కొత్తేమీ కాదని... చాలా కాలం నుంచి ఆయన తీరు ఇలాగే ఉందని, బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో మరింత చెలరేగిపోతున్నారని అంటున్నారు విద్యార్థులు.

Two leaders in race for post of Telangana BJP chief

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు? సంజయ్... లేదంటే అర్వింద్..?

తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఖాయమంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో... కొత్త అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. సీనియర్లంతా లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నా, పార్టీలో రెండు ముఖ్య పదవులు హైదరాబాద్ వారికే కేటాయిస్తే జిల్లాల్లో పార్టీ నష్టపోతుందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.  హైదరాబాద్ నగరానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా, లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. దాంతో, హైదరాబాదేతర నాయకునికి పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుందట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడినందున... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, లేదా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్ల అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలకంటే, ఎంపీలే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండటంతో, వారితోనే టీఆర్ఎస్‌ను ఢీకొట్టించడానికి జాతీయ పార్టీ సైతం ఆలోచిస్తోందని అంటున్నారు. భైంసా ఘటనలో బండి సంజయ్, ఇళ్ల కేటాయింపుపై ధర్మపురి అర్వింద్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అంతేకాదు, పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎదగడానికి అవకాశమున్న తెలంగాణలో, దూకుడుగా ఉండే లీడర్‌కే పగ్గాలు అప్పగిస్తే, క్షేత్రస్థాయిలో, శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని లెక్కలు వేస్తోంది. మరోవైపు కొత్తవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పగ్గాలు వెళ్లకుండా, సీనియర్లు గట్టిగానే అడ్డుపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే కొత్త అధ్యక్షుడి ఎంపిక బీజేపీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందంటున్నారు.

Nandamuri Balakrishna Wife Vasundhara Signature Forgery

బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ నటుడు,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశారు. బంజారాహిల్స్ లోని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ లో ఈ పోర్జరీ జరిగింది. అయితే బ్రాంచ్ లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం వసుంధర సంతకాన్ని అకౌంటెంట్ కొర్రీ శివ ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల13న ఆమె ప్రతినిధి సుబ్బారావుకు ఫోన్ చేసి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్ నెంబరు కూడా చెప్పి అకౌంట్ ను యాక్టివేట్ చేయమంటారా? అని ప్రశ్నించారు. తాము మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని.. అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని ఆమె తరఫు వ్యక్తి వసుంధర దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. తాను ఎలాంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులను విచారించగా కొత్తగా వచ్చిన అకౌంటెంట్ కోర్రిశివ ఈ మధ్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇచ్చినట్టుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్ బ్యాంకింగ్ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసుకున్నట్లుగా అంగీకరించారు. కాగా కోర్రి శివపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sujaya krishna ranga rao likely to quit tdp

రాజుగారి మౌనానికి అర్ధమేంటి? ఉంటారా? పార్టీ మారతారా?

సుజయకృష్ట రంగారావు... విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీయులు... రాజరికం అంతరించిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించారు. అయితే, ఇప్పుడు, యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారు. దాంతో, రాజ్యంలో కార్యకర్తలు విలవిల్లాడిపోతున్నారు. రాజుగారి మౌనాన్ని తలచుకుని కుంగిపోతున్నారు. మళ్లీ కత్తి పట్టుకుని రాజ్యాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు. రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయకృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందాక, టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే, మంత్రి అయిన తర్వాత, సుజయకృష్ట రంగారావు నియోజకవర్గ అభివద్దికి పాటుపడలేదని, అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారని అంటారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సుజయకృష్ట రంగారావు దూరంగా ఉంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.  కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చేయాల్సిన రాజుగారు ఇలా, మౌనం దాల్చడమేంటని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. సుజయకృష్ట రంగారావుతోపాటు ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్లిద్దరూ ప్రజల్లోకి వెళ్తే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. సుజయకృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో స్తబ్దత నెలకొనడంతో ఇప్పటికే పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అంటున్నారు.  మొత్తానికి, విజయనగరంలో తెలుగుదేశాన్ని ముందుకు నడిపించే నాయకుడు లేడంటూ కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులను, బొబ్బిలి రాజుగారి మౌనం, మరింత కుంగదీసేలా ఉందని అంటున్నారు. మరి, రాజుగారి మనసులో ఏముందో... పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియాలంటే ఆయన మౌనం వీడాల్సిందే.  

BJP Leader Purandeswari gives clarity over alliance with YCP

రోజుకో మలుపు తిరుగుతున్న బీజేపీ-వైసీపీ పొత్తు కథ.. పురంధేశ్వరి రియాక్షన్!!

ఏపీలో కొంతకాలంగా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది 3రాజధానుల అంశం. మూడు రాజధానుల ప్రకటన, దానిపై కమిటీలు, శాసన మండలి రద్దు ఇలా రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు పొత్తుల వైపు టర్న్ అయ్యాయి. సీఎం జగన్ హస్తిన పర్యటనలో కేంద్ర పెద్దలతో భేటీల నేపథ్యంలో ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజెపికి అధికార పార్టీ వైసిపి దగ్గరవుతుందా అన్న వార్తలు ఏపీలో హీట్ పెంచుతున్నాయి.  ఎన్డీయేతో వైసీపీ కలుస్తుందా? బీజేపీతో కలిసి నడుస్తుందా? ఇప్పుడివే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.  ఎన్డీయేలో చేరాలని ప్రతిపాదన వస్తే వైసీపీ పరిశీలిస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే.. అసలు తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బొత్స ఖండించినప్పటికీ.. పొత్తులపై చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే దర్యాప్తు సంస్థల్లో ప్రభావితం చేసేందుకు వైసిపి బిజెపికి దగ్గరవుతోందని ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆరోపిస్తోంది. అదేవిధంగా అలాంటి పొత్తు ఏమి ఉండదని జనసేన బల్లగుద్ది చెప్తోంది. ఒకవేళ బీజేపీతో వైసీపీ కలిస్తే తాను కమలానికి దూరమవుతానని ఇప్పటికే జనసేనాని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇటు ప్రతి పక్షాలు ఏం మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా వైసిపి నేతలు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. తమకు బిజెపితో ఎలాంటి శత్రుత్వం లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అంతేకాకుండా పార్టీల పొత్తు విషయం, ఎన్డీయే ప్రభుత్వంలో కలిసే విషయాలను సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆయా నేతలు వెల్లడిస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి సఖ్యతతో పనిచేయాల్సిన అవసరముందని అన్నారు అవంతి.  రాష్ట్రంలో అధికార వైసిపితో గానీ ప్రతిపక్షం టిడిపితో గానీ తమకు ఎలాంటి పొత్తులు లేవని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ దేవదర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి చెప్పారు. వైసీపీతో పొత్తు ఉండదని జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని ఆమె చెప్పారు. రాజధాని మార్పు తొందరపాటు నిర్ణయమని మండిపడ్డారు. ప్రతిపక్షంగా టిడిపి సరైన పాత్ర పోషించడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి సీఎం జగన్ హస్తిన పర్యటనకు వెళ్ళినప్పటి నుంచి వైసిపి త్వరలోనే ఎన్డీయే సర్కారులో చేరుతుందని ప్రచారం మొదలైంది. మరి మున్ముందుకి పొత్తు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ap farmers for waiting for money

ఏపీలో నిధుల కొరత..ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా పాలన సాగిస్తుందని సర్వత్రా టాక్ నడుస్తోంది. అయితే అది మాటలకు మాత్రమే పరిమితమని కూడా కొన్ని ఘటనలను బట్టి తేటతెల్లమౌతుంది. అదెలాగంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్నదాతలకు అండగా ఉంటామని, ధాన్యమంతా కొంటామని, ప్రతి గింజ సేకరిస్తామని, డబ్బులు వెంటనే జమ చేస్తామని, ధాన్యం కొనుగోళ్లకు ముందు అమాత్యులు చేసిన ప్రకటన ఇది. ఇపుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులు డబ్బు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అక్షరాలా 2040 కోట్ల 12లక్షల రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ ధాన్యంలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా 30శాతం సొమ్ము రైతులకు చెల్లించాల్సి వుంది. ధాన్యం ఇచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా సొమ్ము కోసం ఎదురు చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులుకు అమ్ముకుంటే ఇన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉండేది కాదని రైతులు వెల్లడిస్తున్నారు. డబ్బు చేతికొస్తే రెండో పంటకు పెట్టుబడులకు ఉపయోగపడతాయని రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో 1710 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగింది. గత మూడు నెలల్లో 3 లక్షల 97 వేల 189మంది రైతుల నుంచి 40 లక్షల 80వేల 579 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ మొత్తానికి 7,421.32 కోట్లు చెల్లించాల్సి ఉండగా 5,381.20 కోట్లు జమ చేసింది. ఇంకా 2040.12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా రైతులకు అత్యధికంగా 573 కోట్లు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా రైతులకు 433 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంది. శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగాల్సి ఉండగా... అందుకు నిధుల కొరత వల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు.

Is it true that jobs in Vizag Steel are being sold for money

విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా.. స్టీల్ ప్లాంట్ లో కొలువుల పేరుతో ఘరానా మోసాలు...

విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా చెలరేగిపోతుంది. స్టీల్ ప్లాంట్ లో కొలువులు ఎరవేసి లక్షలకు లక్షలు నొక్కేస్తోంది. నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుతున్న ఈ దందాలపై సీబీఐ కన్నేసింది. మరోవైపు ఉద్యోగం కోసం ఆస్తులమ్మి బ్రోకర్ల చేతుల్లో డబ్బులు పోసిన బాధితులు కక్కలేక మింగలేక విలవిల్లాడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దళారుల రాజ్యం నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగాల పేరుతో యువకుల నుంచి ఈ ముఠాలు లక్షలు గుంజేస్తున్నాయి. ఇటీవల ఓ నిరుద్యోగి దగ్గర నుంచి పది వేలు అడ్వాన్స్ రూపంలో తీసుకుంటూ కార్మిక సంఘం నాయకుడు మంత్రి సత్యనారాయణమూర్తి సీబీఐకి చిక్కాడు. పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా మూర్తిని పట్టుకున్న సిబిఐ కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. మూర్తిని సస్పెండ్ చేసిన ఉక్కు యాజమాన్యం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కార్మిక నాయకుడు మూర్తి వ్యవహారం స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది, తీగ లాగితే ఏకంగా డొంకలు కదులుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా ఓపెన్ నోటిఫికేషన్ లేకుండా అడ్డగోలు నియామకాలు జరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలన్నీ కాంట్రాక్టర్ లు కొంతమంది కార్మిక సంఘాల నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, దళారుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది చిన్న చిన్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ను రాజస్థాన్ కు చెందిన కంపెనీకి అప్పగించారు. సంస్కరణలలో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. పరిశ్రమను దశల వారీగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు బయటపడిన కాంట్రాక్టు ఉద్యోగాల అమ్మకాల వ్యవహారం చూస్తే ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగాల దందాను గమనించి చర్యలు ప్రారంభించిందని అర్థమవుతోంది. మరోవైపు ఆస్తులు అమ్ముకొని లక్షలాది రుపాయలు దళారుల చేతుల్లో పోసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. బ్యాక్ డోర్ వ్యవహారం బయటకు వస్తే కట్టిన డబ్బులతో పాటు పరువు పోతుందన్న భయంతో ముందుకు రావడం లేదు. బ్యాక్ డోర్ వ్యవహారాలకు చెక్ పడాలంటే ఉక్కు యాజమాన్యం, నిఘా విభాగం, కేంద్ర కార్మిక విభాగం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. సీబీఐ కూడా రంగంలోకి దిగినందున స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలి, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్న భరోసా ఇస్తే మోసపోయిన వందలాది మంది బయటకు వచ్చే అవకాశముంది.  

వారణాసిలో 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ...

జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యంపై తీసుకున్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరెన్ని రకాలుగా ఒత్తడి చేసినా ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేశామని ఆలయ నిర్మాణం దిశగా ఈ ట్రస్టు వేగంగా పని చేస్తోందని పేర్కొన్నారు. అరవై ఏడు ఎకరాల భూమిని ట్రస్ట్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నిన్న (ఆదివారం) ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పన్నెండు వందల యాభై నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టనున్న యాభై ప్రాజెక్ట్ లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఐ ఆర్ సీ టీ సీ కి చెందిన మహాగాల్ ప్రైవేట్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ రైలు దేశంలోని మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలైన వారణాసి, ఓంకారేశ్వర్ లను కలుపుతూ నడవనుంది. ఇక వారణాసిలో నాలుగు వందల ముప్పై పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రధాని వారణాసిలో అడుగుపెడుతూనే శ్రీ జగద్గురు విశ్వరాజ్ గురుకుల శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతొమ్మిది భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్దాంత శిఖామణి గ్రంథాన్ని మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని డిజిటలైజేషన్ చేయటం ద్వారా యువతకు అందుబాటులోకి తీసుకురావటం, వారిలో ప్రేరణ కలిగించడం శుభపరిణామం అన్నారు.  ఇక పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ను దేశం నలుదిశలా వ్యాపింపచేసేందుకు కృషి చేస్తున్న వారిని ప్రధాని అభినందించారు. దేశ ప్రజలు భారత్ లో తయారయ్యే వస్తువులనే ఉపయోగించాలని పిలుపునిచ్చారు. గంగానది ప్రక్షాళనకు చేపట్టిన నమామీ గంగా ప్రాజెక్టు ప్రజల భాగస్వామ్యం వల్లే విజయవంతమైందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు ఏడు వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు మరో ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ హస్తకళా సంకుల్లో కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక హస్తకళల ప్రదర్శనను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఉత్తర ప్రదేశ్ నలుమూలల నుంచి పది వేల మందికి పైగా కళాకారులు రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆధిత్యనాథ్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. వారణాసిలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని అరవై మూడు అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ దయాల్ ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోందని ఆయన మనకు అంత్యోదయ మార్గాన్ని చూపించారని మోదీ అన్నారు. సమాజంలో చిట్ట చివర ఉన్న వారి అభివృద్ధే అంత్యోదయ అని దీనిని ఆచరణలో చూపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అంతర్జాతీయంగా ఏపీ పరువు గంగపాలు!!

తాము అందించిన సేవలకు డబ్బులు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందంటూ విదేశీ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ బకాయిలు రాబట్టాలి అంటూ జర్మనీకి చెందిన రెండు ప్రతిష్టాత్మక కంపెనీలు ఆ దేశ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించాయి. ఢిల్లీలో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యాలయానికి వెళ్లిన జర్మనీ రాయబారి ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన అత్యంత సాంకేతిక నైపుణ్యంతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు దక్కే గౌరవం ఇదేనా అని కేంద్రాన్ని నిలదీశారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం మండిపడింది. అంతర్జాతీయ కంపెనీల సేవలు వినియోగించుకుంటున్నప్పుడు దేశ పరువు, ప్రతిష్టలకు విఘాతం కలగకుండా చూడాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తే ఎలాగంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తూ లేఖలు రాసింది.  పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా దాదాపు 150 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్ నిర్మించటానికి ప్రపంచంలో మూడు కంపెనీలకే సామర్థ్యం ఉందని జల వనరుల శాఖ ఇంజనీర్ లు గుర్తించారు. వాటిలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ముందంజలో ఉందని తేల్చారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు వెల్లడించి, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో బావర్ కంపెనీ ఎల్ అండ్ టీ తో ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ ను నిర్మించేందుకు అవి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ తో సబ్ కాంట్రాక్టు చేసుకున్నాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు బిల్లుల చెల్లిస్తుంటే అవి సకాలంలో బావర్ కు చేరడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపి వేస్తామని ఆ కంపెనీ హెచ్చరించింది. దీంతో జల వనరుల శాఖ ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ లు తెరిచి నేరుగా సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి 422 కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం చేసుకున్నారు. బావర్ సంస్థ సకాలంలోనే పనులు పూర్తి చేసినా ఇంకా 91.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు.  దీనిపై కంపెనీ ప్రతి నిధులు పలుమార్లు జలవనరుల శాఖకు వినతిపత్రాలిచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి చెల్లింపులపై వారికి ఎలాంటి హామీ లభించలేదు, పైగా పాత కాంట్రాక్టు సంస్థలు అధిక మొత్తాలకు పనులు చేపట్టాయని, అందులో అవినీతి జరిగిందంటూ దర్యాప్తు కోసం కమిటీలు వేయడంతో ఆందోళనకు గురైన బావర్ యాజమాన్యం ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదంటూ జర్మనీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. పోలవరం ప్రాజెక్టులో బావర్ కంపెనీ చేపట్టిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ గతేడాది అక్టోబర్ లో డీపీఐఐటి సంయుక్త కార్యదర్శి రాజేంద్ర రత్నకు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిపిఐఐటి బావర్ కంపెనీకి బకాయి పడిన 91.10 కోట్లు వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ లోని ఏపీ భవన్ ప్రత్యేక రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ కు లేఖలు రాసింది. దీనిపై స్పందన లేకపోవటంతో ఈ నెల 7న గత అంశాలను గుర్తు చేస్తూ బావర్ కంపెనీకి తక్షణమే బిల్లుల చెల్లించాలంటూ మళ్లీ లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల కొరతను సాకుగా చూపుతోంది, బావర్ కంపెనీకి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఎందుకు చెల్లించలేదో తమకు తెలియదంటోంది. బావర్ ట్రాన్స్ ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగి ఎస్క్రో అకౌంట్ ఏర్పడిన విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు రీయింబర్స్ చేస్తే  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు చెల్లించాల్సిన మొత్తం నుంచి 91.10 కోట్లు ఇస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. రీయంబర్స్ చేసిన పదిహేడు వందల ఎనభై కోట్ల నుంచి ఎందుకు చెల్లించలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.  

ప్రియాంకను రాజ్యసభకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్

  ప్రియాంక గాంధీ చట్ట సభల్లో అడుగు పెట్టబోతున్నారా, పార్టీ పదవులకే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు పార్లమెంట్ లో తన వాణి వినిపించనున్నారా, ప్రియాంకను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే వారిలో ప్రియాంక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్ట సభలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతీలాల్ వోరా, మధుసూదన్ మిస్త్రీ, కుమార్ సెల్జా దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, ఎంబి రాజుగూడ వంటి సీనియర్ నేతల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్, జూన్ లో పూర్తి కానుంది. ఇందులో వోరా, సెల్జా, దిగ్విజయ్ మళ్లీ రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశముంది. అయితే ఈసారి ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, రణదీప్ సూర్జెవాలాలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏదో ఒకచోట నుంచి ప్రియాంకను రాజ్యసభకు పంపొచ్చని భావిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే నాయకులను ఈసారి ప్రమోట్ చేయాలని సోనియగాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రియాంకాగాంధీని రాజ్యసభ బరిలోకి దింప బోతున్నారనే టాక్ నడుస్తోంది. పెద్దల సభలో మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా మరికొన్ని నెలలు అరవై ఎనిమిది సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లు కోల్పోనుంది. అయితే మిత్ర పక్షాల సాయంతో వాటిలో పదింటిని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలన్నది పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.

రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా

రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టే ధర్నాకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈరోజు మధ్యాహ్నం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. అధిష్ఠానం ఇచ్చిన కార్యాచరణ కావడంతో పార్టీ అగ్రనేతలంతా సీరియస్గా తీసుకున్నారు. రిజర్వేషన్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తప్పుబడుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణా కాంగ్రెస్ ఇందిరాపార్కులో ధర్నా చేపట్టింది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నాకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో ఉదయం పది గంటల కల్లా పార్టీ నాయకులంతా ఇందిరా పార్కుకు చేరుకోవాలని పిసిసి ఆదేశించింది. పన్నెండు గంటల నుంచి ధర్నా ప్రారంభం కానుంది, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా పార్టీ ముఖ్య నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారు. రిజర్వేషన్ లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇటీవల చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వాదన మేరకే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ లు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగాలు కల్పించడంలోనే కాదు ప్రమోషన్ లలో కూడా రిజర్వేషన్ లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ విధానమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ కావడంతో ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీ ఆర్ ఎస్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలి రానున్నాయి. సుప్రీంకోర్టులో కేంద్రం తిరిగి అప్పీల్ చేయడానికంటే ముందే రిజర్వేషన్ ల వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది.