Boy Enters Girls Hostel And Stays For One Day In Nuzvid IIIT

నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్లో రోజంతా యువకుడు.. ఆరుగురు విద్యార్దినుల సస్పెన్షన్

కృష్ణాజిల్లా ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు మరోసారి బయటప్డాయి. నిన్న సెక్యూరిటీ కళ్లుగప్పి విద్యార్ధినుల హాస్టల్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. హాస్టల్ కిటికీ ఊచలు వంచి అతడు లోపలికి ప్రవేశించాడు. అంతే కాదు రోజంతా అక్కడే ఉన్నాడు. చివరికి విద్యార్ధినులు అతడిని ఓ గదిలో బంధించి సెక్యూరిటీకి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆగంతకుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో స్పందించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. గతంలోనూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల వ్యవహారాలు రచ్చకెక్కాయి. పలువురు విద్యార్ధులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. వరుస వివాదాలకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వైఖరే కారణమనే విమర్శలు ఉన్నాయి. విద్యార్ధులకు సంబంధించిన సున్నితమైన అంశాలను సైతం యాజమాన్యం పట్టించుకోవడం లేదని గతంలో ఆందోళనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ఏకంగా ఓ విద్యార్ధి తనకు సంబంధం లేని విద్యార్దినుల హాస్టల్లోకి చొరబడటం, అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, బాధ్యులుగా ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయటంతో ఈ మొత్తం వ్యవహారం సంచనలంగా మారింది. విద్యార్ధినుల సస్పెన్షన్ ను బట్టి చూస్తుంటే వారే సదరు విద్యార్ధిని లోపలికి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు విద్యార్ధికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

3350 tonne goldmine found in Uttar Pradesh

యూపీలో పసిడి పంట.. 3,500 టన్నుల బంగారు గనులు!!

దేశంలోనే అతి పెద్ద బంగారు గనిని ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో గుర్తించారు. ఈ జిల్లాలోని సోన్ పహాడీ ప్రాంతంలో 2,700 టన్నులు, హార్ది ప్రాంతంలో మరో 650 టన్నుల బంగారం కలిపి మొత్తంగా 3,350 టన్నుల బంగారు నిక్షేపాలు గుర్తించినట్టుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లోని కొండల దిగువన.. బంగారంతోపాటు ఇనుము, పొటాషియం వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 'ఉత్తరప్రదేశ్‌ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్' వారితో కలిసి ఎన్నో ఏళ్లుగా బంగారు గనుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే వారి శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం లభించింది. సోన్ భద్ర జిల్లాలో 3,350 టన్నుల బంగారు ఖనిజాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో బంగారు ఖనిజాలున్నట్టు 2012 లోనే శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ అది ఇప్పుడు నిజమైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ మైనింగ్ ఆఫీసర్ కె.కె.రాయ్ నిర్ధారించారు. ప్రభుత్వం ఈ బంగారు గనులను మైనింగ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కాగా, మన దేశంలో ప్రస్తుతం నాలుగు బంగారు గనులు ఉన్నాయి. అందులో మూడు కర్ణాటకలో ఉండగా, ఒకటి జార్ఖండ్ లో ఉంది. తాజాగా యూపీలో గుర్తించిన గని.. వాటన్నింటికన్నా చాలా పెద్దది. ఆ నాలుగు బంగారు గనులు కలిపినా కూడా.. ఇప్పుడు యూపీలో గుర్తించిన గనిలోనే ఎక్కువ బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Indian Navy oppose Executive Capital in Vizag

విశాఖలో రాజధాని వద్దు: భారీ ట్విస్ట్ ఇచ్చిన ఇండియన్ నేవీ

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ కేంద్రంగా ఉన్న మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్‌కు నేవీ తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని లేఖలో పేర్కొంది. విశాఖను ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. మిలీనియం టవర్స్‌లో విభాగాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో నేవీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యంగా ఉందని, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో నేవీ అధికారులు తెలిపారు. కాబట్టి దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు సలహా ఇస్తున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది. కాగా.. ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది. మే నెల తర్వాత విశాఖకు పాలనా రాజధానిని తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు సీఎం జగన్ తాజాగా డిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతోనూ చర్చలు జరిపారు. శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చే నెలలో పార్లమెంటు ఆమోదముద్ర కూడా పడుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖలో రాజధాని నిర్ణయానికి నేవీ అభ్యంతరాలు చెప్పిందన్న వార్తలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. విశాఖ కేంద్రంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు ఉన్నా రాజధాని విషయంలో నేవీ అభ్యంతరాలు చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. అదే నిజమైతే విశాఖలోనే ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా లేక పూర్తిగా విశాఖను వదిలి మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నేవీ రాసిన లేఖపై ప్రభుత్వం నంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు. నేవీ లేఖపై మాట్లాడేందుకు ప్రభుత్వ వర్గాలు కూడా నిరాకరిస్తున్నాయి.

ycp strategies to trouble tdp leaders

ఏపీలో వరుస విచారణలు.. స్ధానిక ఎన్నికల వేళ టీడీపీని బదనాం చేసేందుకేనా?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత టీడీపీ సర్కారులో తీసుకున్న నిర్ణయాలపై వరుసగా విచారణకు ఆదేశించడం నిజంగా వారి మెడకు చుట్టుకుంటుందా? లేక కేవలం ప్రజల్లో టీడీపీని పలచన చేయడమే వాటి అంతిమ లక్ష్యమా అన్న చర్చ మొదలైంది. వైసీపీ అధికారం చేపట్టి 9 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏ ఒక్క దర్యాప్తులోనూ టీడీపీ నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గతేడాది జూన్ నెలలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించింది. ఏకంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కేంద్రంగా వాడుకున్న ఉండవల్లి కరకట్ట ప్రజావేదికను అక్రమ కట్టడంగా గుర్తిస్తూ రాత్రికి రాత్రే కూల్చివేసింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. విశాఖలోని టీడీపీ కార్యాయానికి కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. మిగతా చోట్ల ఒకటీ అరా కట్టడాల కూల్చివేతలు చేపట్టారే కానీ వాటిని ఆ తర్వాత కొనసాగించలేదు. అదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో పాటు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. కానీ సంచలన అంశాలేవీ లేకపోవడంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. ఆ తర్వాత రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అధికారంలోకి వచ్చాక తీవ్రంగా పరిగణించి విచారణ జరిపిస్తుందేమోనని అంతా ఆశించారు. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించే ఆధారాలేవీ పకడ్బందీగా దొరక్కపోవడంతో సీఐడీ కూడా నోటీసులతోనే సరిపెట్టింది. చివరకు దాన్ని మరింత లోతుగా విచారించేందుకు అంటూ ఈడీ, ఐటీకి అప్పచెప్పారు. ఇదే కోవలో ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అక్రమంగా భద్రతా పరికరాలు కొన్న వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వం గట్టిగా ముందుకెళ్లలేని పరిస్ధితి. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాల నుంచి నిఘా పరికరాలు కొనే ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందించారని, తన కుమారుడి సంస్ధకు మేలు చేశారని, పై అధికారుల అభ్యంతరాలను పట్టించుకోలేదని పలు ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కానీ అంత తీవ్రత ఉన్న అంశాన్ని కేంద్రానికి ఎందుకు రిఫర్ చేయలేదంటే జవాబు లేదు. చివరికి క్యాట్ ఇదే ప్రశ్న వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తెల్లమొహం వేయాల్సిన పరిస్ధితి. తాజాగా ఈఎస్ఐ స్కామ్ లోనూ ఇదే తంతు. ఈఎస్ఐకు చెందిన పలువురు డైరెక్టర్ స్ధాయి అధికారులు చెల్లింపులు జరిపారంటూ ఆరోపించిన ప్రభుత్వం... అందులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఓవైపు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మరోవైపు కొనుగోళ్లకు ఆయన ఆదేశించారని నిరూపించే ఆధారాలేవీ బయటపెట్టలేకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్ధితిగా మారింది. ఇదే కోవలో మంత్రివర్గ ఉపసంఘం అప్పుడెప్పుడో గత ప్రభుత్వ నిర్ణయాల ద్వారా చోటుచేసుకున్న అక్రమాలపై ప్రారంభించిన దర్యాప్తు 9 నెలల తర్వాత ఇప్పటికి పూర్తి చేస్తే ప్రభుత్వం చివరికి సిట్ కు అప్పగించింది. ఇందులోనూ అదే డొల్లతనం. రాజధాని భూములతో పాటు విశాఖ భూములపై విచారణ, ఎర్రచందనం వంటి పలు అంశాలను ఇందులో ప్రస్తావించినా అందులో అక్రమాలను మంత్రివర్గ ఉపసంఘం నిరూపించిందా అంటే అధీ లేదు. దీంతో ఈ వరుస విచారణల పర్వం కేవలం టీడీపీ నేతలను ప్రజల్లో పలుచన చేయడమే లక్ష్యంగా సాగుతున్నట అర్ధమవుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో విపక్షాన్ని సాధ్యమైనంత అప్రతిష్ట పాలు చేయాలనేదే ఇందులో లక్ష్యంగా కనిపిస్తోంది.

reason behind ap ias officers delhi visit

హస్తిన చుట్టూ ఏపీ ఐఏఎస్ అధికారుల ప్రదక్షిణలు.. ఏం జరుగుతోంది?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ నుంచి హస్తినకు ఐఏఎస్ అధికారుల టూర్లు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయి. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలతో పాటు మూడు రాజధానుల వ్యవహారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అధికారులు కేంద్రంతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీల నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల కోసమే ఐఏఎస్ లు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఏపీలో మే నెల తర్వాత మూడు రాజధానుల ప్రక్రియను అమల్లో పెట్టాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం అందుకు తగినట్లుగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. ఆ మేరకు తన మనసులో మాటను వారి చెవిన వేయడం దానికి గ్రీన్ సిగ్నల్ లభించడం జరిగిపోయాయి. ఢిల్లీ నుంచి తిరిగివచ్చాక సీఎం జగన్ తో భేటీ అయిన పలువురు అధికారులు, వైసీపీ పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ముఖ్యమంత్రి అనుకున్నవన్నీ జరిగేలా కేంద్రం నుంచి గట్టి హా్మీ లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా తదుపరి ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తున్న జగన్ తన ప్రబుత్వంలోని కీలకమైన ఐఏఎస్ అధికారులను ఢిల్లీలోని సంబంధిత శాఖల వద్దకు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలను గమనించినా ఐఏఎస్ అధికారులు హస్తినకు క్యూ కట్టిన విషయం ఇట్టే అర్ధమవుతుంది. మోడీ, అమిత్ షా ఇచ్చిన హామీల్లో మొదటిది శాసనమండలి రద్దు కాగా రెండోది కర్నూలుకు హైకోర్టు తరలింపు, విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి నిధులు ఇతర హామీలు. అయితే వీటిలో మొదటిదైన శాసనమండలి రద్దుకు వచ్చే నెల 2న ప్రారంభమయ్యే బడ్జెట్ రెండో విడత సమావేశాలు వేదిక కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు కేంద్రం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందని ఢిల్లీ సర్కిల్స్ లోనూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు తరలింపునకు సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర న్యాయశాఖ అనుమతి తప్పనిసరి. కేంద్ర న్యాయశాఖ నుంచి అనుమతి లభిస్తే తరలింపునకు అవసరమైన మిగతా ప్రక్రియను సుప్రీంకోర్టు చేపట్టడం లాంఛనమే అవుతుంది. కాబట్టి న్యాయశాఖ వర్గాల వద్ద ఏపీ ఐఏఎస్ లు ఈ అంశంపైనా లాబీయింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సర్కారు తరహాలోనే ఐఏఎస్ అధికారులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న జగన్ సర్కారు... కేంద్రంతో లాబీయింగ్ లోనూ వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అదే సమయంలో గతంలో కేంద్రంలో పనిచేసిన రాష్ట్రానికి చెందిన కొందరు ఐఏఎస్ ల పరిచయాలను కూడా వాడుకోవడం ద్వారా కేంద్రం ఇస్తున్న హామీలను తమకు అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

army jawan shoots lover mother for not accepting marriage

గుంటూరులో కలకలం.. ప్రేమను ఒప్పుకోలేదని ఆర్మీ జవాన్ కాల్పులు!

గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్‌ కాల్పులు జరపడం కలకలం రేపింది. నాటు తుపాకీతో అతను కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడింది. కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్‌ బాలాజీ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేయాలనీ అంటూ బాలాజీ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ.. ఉదయం ఆమె ఇంటికి వెళ్లి.. నాటు తుపాకీతో కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు. అయితే ఆమె చాకచక్యంగా కాల్పుల నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసి, ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. కాల్పుల శబ్దం విని.. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో.. బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు.

bonda uma slams ys jagan over nimmagadda issue

'రస్ ఆల్ ఖైమా'కు రూ. 800 కోట్లతో వైసీపీ ఎంపీలు.. త్వరలో జగన్ జైలుకి!!

రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే జగన్ సర్కార్ అమరావతి భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారో జగన్ చెప్పాలని బోండా ఉమా నిలదీశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ఏం మాట్లాడారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. రస్ ఆల్ ఖైమా కేసు విషయంలో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు జగన్.. వైసీపీ ఎంపీలను ఆ దేశం పంపారని ఆరోపించారు. నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని అన్నారు. ఈ కేసుల నుంచి బయటపడేయాలని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని వేడుకున్నారని బోండా ఉమా ఆరోపించారు. 

Andhra Pradesh Assembly Budget Sessions

ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాలు వారం రోజులే?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి కారణం స్ధానిక సంస్ధల ఎన్నికలే. ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రిజర్వేషన్ల వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చే తీర్పు ఆధారంగానే స్ధానిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ రానుంది. ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. అయితే అసెంబ్లీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన కీలక బిల్లులు ఆమోదం పొందినా శాసనమండలిలో మాత్రం చుక్కెదురైంది. ఓవైపు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయో లేదో తెలియక సాధారణ జనం గందరగోళంలో మునిగిపోతే ప్రభుత్వం మాత్రం బిల్లులు ఆమోదం పొందాయని చెప్పుకుంటోంది. మండలి ఛైర్మన్ గవర్నర్ కు చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం గవర్నర్ కోర్టులోకి వెళ్లినట్లయింది. అధికార విపక్షాల విమర్శనాస్త్రాల సంగతి ఎలా ఉన్నా కేంద్రంతో సీఎం జగన్ నెరుపుతున్న సంబంధాల పుణ్యమాని శాసనమండలి రద్దుకు అడుగులు వేగంగా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న పార్లమెంటు తిరిగి ప్రారంభం కాగానే ఏపీ మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా కేంద్రం నుంచి జగన్ కు హామీ లభించినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రం ఏపీ శాసనమండలి రద్దుకు ఆమోద ముద్ర వేస్తే మాత్రం మూడు రాజధానుల ప్రక్రియ జోరందుకోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లోపే స్ధానిక సంస్ధల ఎన్నికలను కూడా పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై తుదితీర్పు ఇచ్చిన వెంటనే స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు శరవేగంగా స్ధానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయబోతోంది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ను బట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. స్ధానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఆలస్యమైతే మాత్రం బడ్జెట్ సమావేశాలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయనుంది. అదే జరిగితే ఈసారి వారం రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా స్ధానిక సంస్ధల రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో వాయిదా పడుతూ పోతే మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయి. అదే జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం మార్చి మొదటి వారంలోనే నిర్వహించే ఛాన్సుంది. అలా అయినా సరే బడ్జెట్ సమావేశాలను వారంలో ముగించి స్ధానిక ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే పంచాయతీ రాజ్ చట్టం సవరణపై జారీ చేసిన ఆర్డినెన్స్ స్ధానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. దీంతో పాటు కేంద్రం మండలి రద్దుపై నోటిఫికేషన్ జారీ చేస్తే మూడు రాజధానులపై తదుపరి ప్రక్రియ కూడా మొదలు కానుంది. అప్పుడు మూడు రాజదానులపై అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.

war of words between tdp and ycp over veligonda project

వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై వైసీపీ, టీడీపీ మాటలయుద్ధం.. అసలు వాస్తవాలివే...

ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు (పూలసుబ్బయ్య ప్రాజెక్టు) పనుల పురోగతి, ఎవరి హయాంలో ఎంతశాతం పూర్తి చేశారు. అందులో అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా గత ఏడాది కాలంలో జరిగిన పనులు, వాటిలో చోటుచేసుకున్న అవినీతి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనాల సవరణ, అవినీతి ఆరోపణల్లో నిజమెంతో మీరే చూడండి.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో 4.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ఫ్లోరైడ్, కరవు బాధిత ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు 2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అఫ్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 18.8 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వి 43.5 టీఎంసీల కృష్ణానది వరద నీటిని శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోని నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలించడం దీని లక్ష్యం. దీని ప్రకారం మొదటి సొరంగం పనులను 2018 ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని గడువు పెట్టిన ప్రభుత్వం... సాబిర్ స్యూ అండ్ జేవీ ప్రసాద్ సంస్ధకు పనులను అప్పగించింది. ఈ సొరంగం తవ్వకం, ఇతర పనుల కోసం 626.60 కోట్లు కేటాయిస్తూ 2005 ఆగస్టు 20న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రెండో సొరంగం పనుల కోసం హెచ్.సి.సి. సంస్ధకు కాంట్రాక్టు అప్పగిస్తూ 735 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 2019 మే 31 లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాలేదు. ఆలోగా వైఎస్ మరణం, ప్రభుత్వాలు మారిపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులు మరో ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. 2017 డిసెంబర్ 20న ప్రభుత్వం ముందుకు కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. 2018 మార్చి 22న మొదటి సొరంగంలో 15.2 కి.మీ నుంచి 18.8 కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించారు. వీటిని పూర్తి చేయాలంటే 116.447 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. చివరికి సవరించిన అంచనాల ప్రకారం 292.15 కోట్లు విడుదల చేస్తూ టీడీపీ సర్కారు 2018లో ఉత్తర్వులు ఇచ్చింది.. అంటే మొదటి సొరంగంలో కేవలం 3.6 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తేలింది. రెండో సొరంగంలో 10.7 కిలోమీటర్ల నుంచి 18.7కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని పూర్తి చేసేందుకు 299.48 కోట్ల నుంచి 720.26 కోట్లకు అంచనాలు పెంచుతూ నిధుల విడుదలకు అనుమతించింది. అంటే రెండో సొరంగంలో 8 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు లెక్కించారు.. 2018 ఆగస్టులో మొదలైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందుల వల్ల టీడీపీ హయాంలో పనులు ఆలస్యమైనట్లు అధికారులు కూడా చెబుతున్నారు. తిరిగి 2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై సమీక్షలు జరిపి పనుల వేగం పెంచింది. చివరికి తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించడానికి సీఎం జగన్ పర్యటించిన సందర్భంగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పనులు తిరిగి ప్రారంభమైన 2018ఆగస్టు నుంచి ఇప్పటివరకూ మొదటి సొరంగం 2 కిలోమీటర్లు, రెండో సొరంగం 600 మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. మొదటి సొరంగం పనుల్లో జరిగిన రెండు కిలోమీటర్ల పనుల్లో 1.4 కిలోమీటర్ల మేర పనులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగాయని అధికారులు తాజాగా నివేదించారు. అంటే అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 600 మీటర్లు మాత్రమే జరిగినట్లు. ఇప్పుడు దీనిమీదే అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. అంటే టీడీపీ హయాంలో సవరించిన అంచనాల ప్రకారం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించే నాటికి మొదటి సొరంగంలో 80 శాతం, రెండో సొరంగంలో 57 శాతం పనులు పూర్తయినట్లు అర్ధమవుతోంది. తాజాగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపిన వివరాలను బట్టి చూస్తే మొదటి సొరంగం పనులు మరో రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని 94 శాతానికి చేరాయి. అలాగే రెండో సొరంగం పనులు ఇరు ప్రభుత్వాల హయాంలో కలిపి కేవలం 600 మీటర్లు అంటే 60 శాతం మాత్రమే పూర్తయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వివరాలను క్రోడీకరిస్తే టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్ పనులు 600 మీటర్లు మాత్రమే పూర్తికావడం వాస్తవమే అని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం సాంకేతిక కారణాలే అని అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా అంచనాల పెంపులో 414 కోట్ల అవినీతి ఆరోపణలు మాత్రం నిర్ధారణ కాలేదు.

who is behind botsa satyanarayana comments

బొత్సతో లీకులు ఇప్పిస్తున్నదెవరు? జగనా? విజయసాయిరెడ్డా?

జరిగింది చెబుతారు... జరగబోయేది చెబుతారు... లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు... ఏదో చెబుతూ కనికట్టు చేస్తారు... ఏం మాట్లాడుతున్నారో అసలు అర్ధమే కాదు... కానీ, కీలక వ్యాఖ్యలే చేస్తారు... ఈ మాటలన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? మీరు గెస్ చేసేశారు? అవును బొత్స సత్యనారాయణ గురించే. జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే, పరిపాలనాపరమైన అంశాలతోపాటు  రాజకీయంగా వైసీపీ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్నీ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్తున్న బొత్స, తిరిగి వెనువెంటనే వాటిని ఖండించడం రొటీన్ గా మారింది. అయితే, రాజధాని అమరావతి వివాదం దగ్గర్నుంచి... బీజేపీ-వైసీపీ పొత్తు వరకు బొత్స చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. అందుకే, విపక్ష నేతలతోపాటు, కేంద్ర ప్రభుత్వంపై బొత్స చేస్తున్న కామెంట్స్ పై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే, మొదటి నుంచి బొత్స చేస్తున్న ప్రతి ప్రకటన వెనుకా, బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే, ప్రభుత్వం తీసుకునే ప్రతి వివాదాస్పద కీలక నిర్ణయాలన్నీ ముందుగా బొత్సతోనే చెప్పిస్తున్నారు. ఆవిధంగా రాజధాని మార్పునకు సంబంధించి మొదట హింట్‌ ఇచ్చింది కూడా బొత్స సత్యనారాయణే. డైరెక్టుగా రాజధాని తరలింపు ఉంటుందని చెప్పకపోయినా, అమరావతిలో ఏముందంటూ కామెంట్ చేశారు. అప్పుడు చేసిన కామెంట్... ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అతికినట్టు సరిపోతోంది. అలాగే మరోసారి అమరావతిలో శ్మశానం తప్ప ఏముందని కామెంట్ చేసినప్పుడే, రాజధానిని ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదన్న అంశం అర్థమైపోయింది. మంత్రిస్థాయిలో బొత్స చేసిన వ్యాఖ్యలు అమరావతిలో అలజడులు, ఆందోళలకు కారణమయ్యాయి. అయితే, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించిన బొత్స, తరువాత తీరిగ్గా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ కట్టుబడి ఉన్నానంటూ కామెంట్ చేస్తారు. ఇలా కొన్ని  ఔననీ, ఇంకొన్ని కాదని చేస్తున్న వ్యాఖ్యల వెనుక, బొత్స ఒక్కరే లేరని, ఆయనతో ఎవరో అలా మాట్లాడిస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు బొత్స కామెంట్స్ వెనుక పొలిటికల్‌ గేమ్‌ ఉందంటున్నారు. రాజధాని విషయంలో అనేక వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన బొత్స, ఇప్పుడు ఎన్డీయేతో పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవసరమైతే ఎన్డీయేలో కలుస్తామంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. అయితే, బొత్స డైరెక్టుగా ఆ మాట అనకపోయినా... ఏపీ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం...ఎంతమంది గడ్డాలైనా పట్టుకుని బతిమలాడతాం అంటూ కామెంట్ చేశారు. జగన్‌ ఢిల్లీ టూర్‌లో ప్రధానిని, అమిత్‌షాను, కేంద్ర పెద్దలను కలిసి తరువాత.. వెంటనే బొత్స నుంచి ఈ కామెంట్ రావడంతో కేంద్రంలో వైసీపీ చేరడం ఖాయమనే చర్చ పెద్దఎత్తున జరిగింది. అమరావతి విషయంలో మొదటి నుంచి బొత్స చెప్పిందే జరిగిందంటున్న విపక్ష నేతలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమని, అందుకే బొత్సతో  లీకులు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగింది. బొత్స వ్యాఖ్యల ప్రకంపనల ప్రభావంతో, ఏకంగా జనసేన అధినేత పవన్‌ స్పందించాల్సి వచ్చింది. బీజేపీ-వైసీపీ పొత్తు ఉంటే, తాము బీజేపీకి దూరం జరుగుతామన్నారు. బొత్స మాటల సునామీకి పవన్ కామెంట్లే ఎగ్జాంపుల్‌. బొత్స మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నవి కాదన్నది మాత్రం తెలుస్తోంది. తెర వెనుక ఉండి, ఎవరో బొత్సతో మాట్లాడిస్తున్నారన్న విషయం, అర్థమవుతోందన్న మాటలు వినపడ్తున్నాయి. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న బొత్స, ఆలోచన లేకుండా చెయ్యరని, పొలిటికల్ మైండ్ గేమ్‌లో భాగంగా, ఆయనతో ప్రకటనలు చేయిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా బొత్సతో మాట్లాడిస్తున్నారని, అది చర్చనీయాంశం అయ్యేలా చూస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. బొత్సతో లీకులిప్పించి, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి, రాజధాని మార్పు నుంచి ఎన్డీయేలో వైసీపీ చేరడం గురించి, ఆయన లీక్స్‌ చేశారో, ఏదో అలా మాట్లాడారో తెలియదు కానీ, ఆ మాటలు మాత్రం సంచలనం అవుతున్నాయి. ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో, ఆయన  ప్రస్తుతం చెబుతున్నవి కూడా రేపు నిజమవుతాయన్న చర్చ జరుగుతోంది.

BJP MLA Raja Singh Sensational Comments

హిందూ జాతి నిర్మూలనకు కుట్ర... రాజాసింగ్ సంచలన కామెంట్స్...

తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. హిందూ సంతతి పెరగకుండా ఇతర మతస్థులు, విదేశీయులు ... ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్నారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ తినడం వల్లే హిందువుల్లో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదన్న రాజాసింగ్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియాలో హిందువనే వాడే లేకుండా, మొత్తం హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని రాజాసింగ్ హెచ్చరించారు. హిందువుల సంతతి పెరగకుండా విదేశాలు, ఇతర మతస్థులు... ఫుడ్ ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ కలుపుతున్నారంటూ రాజాసింగ్ చేసిన ఆరోపణలు దేశంలో కొత్త చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న ఆహార ఉత్పత్తులపై రాజాసింగ్ అనుమానాలు వ్యక్తంచేశారు. జంక్ ఫుడ్స్ కారణంగా సంతానలేమి సమస్య ఏర్పడుతోందంటూ వైద్యులు సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Amulya Has Link With Naxals Says CM Yediyurappa

అమూల్యపై యడియూరప్ప సంచలన ఆరోపణలు... దేశ ద్రోహం కింద కేసు-14రోజుల రిమాండ్

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరు సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య వ్యవహారం ముదురుతోంది. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టడంతో పాటు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ బెంగళూరు సభలో నినాదాలు చేసిన అమూల్యకు గతంలో మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలుండేవని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోపించారు. అమూల్య వెనుక కొన్ని శక్తులు పనిచేస్తూ, అలాంటివారిని పెంచి పోషిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు రిపీటవుతూనే ఉంటాయని యడియూరప్ప అభిప్రాయపడ్డారు. అమూల్య వెనుక మావోయిస్టులు ఉన్నారేమోనన్న కోణంలో విచారించాలని, అప్పుడే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన సభలో అమూల్య పాకిస్థాన్‌ అనుకూలంగా నినాదాలు చేసింది. అమూల్య వ్యాఖ్యలకు షాకైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ... మైక్‌ లాక్కుందామని ప్రయత్నించినా, ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దాంతో, అమూల్య బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. 14రోజులపాటు  జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. దాంతో, అమూల్య చిక్కుల్లో పడింది.

Ex Minister Atchannaidu role in AP ESI scam

కావాలనే అచ్చెన్నను ఇరికిస్తున్నారా? ఈఎస్ఐ స్కామ్ లో అసలు నిజమేంటి?

తెలంగాణ ఈఎస్‌ఐ స్కామ్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ కుంభకోణం బయటపడింది. ఏపీలో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న నిజాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో కేసు పూర్వాపరాలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.  మెడిసిన్స్, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్స్, ఫర్నీచర్, ఈసీసీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ తేల్చింది. వాస్తవ ధర కంటే 132శాతం ఎక్కువ ధరకు మందుల కొనుగోళ్లు చేశారని గుర్తించింది. ఒక్కో బయోమెట్రిక్ వాస్తవ ధర 16వేలు కాగా.... 70వేలకు వాటిని కొనుగోలు చేసినట్లు బయటపెట్టింది. నకిలీ కంపెనీల పేరుతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్టు గుర్తించింది. మెడికల్ కోసం ప్రభుత్వం 293 కోట్లు ఈఎస్ఐకి కేటాయించగా.... అధికారులు 698కోట్ల బిల్లులు సృష్టించినట్టు తేల్చింది. ఈ స్కామ్‌లో ముగ్గురు డైరెక్టర్లతోపాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్దతిలోనే చేపట్టాలన్న నిబంధన ఉంది. అయితే అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతి లేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్దతిలో 51కోట్ల మెడిసిన్ కొనుగోళ్లు చేశారని నివేదికలో పొందుపరిచారు. టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ రాసినట్టు తేల్చారు. విజిలెన్స్ శాఖ ఈ స్కామ్‌పై ప్రభుత్వానికి నివేదిక అందచేయడంతో.... దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈఎస్ఐ స్కాంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనన్నారు. ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మొత్తానికి ఏపీలో బయటపడిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో... రాజకీయంగా ఇది ఏ మలుపు తీసుకుంటుందన్న చర్చ బలంగా నడుస్తోంది. దాదాపు 400కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లు గుర్తించగా, ఈ కుంభకోణం వెనుక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందన్న ప్రచారంతో రాజకీయ దుమారం రేగుతోంది.

All Set For Araku Utsav 2020

అరకు అందాలపై ఓ లుక్కేయండి... ఉత్సవాలకు ముస్తాబవుతోంది...

ఆంధ్రా ఊటీ అరకు లోయ... ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ప్రకృతి అందాల స్వర్గథామం అరకులో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అరకు అందాలతోపాటు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పేలా డిఫరెంట్స్ థీమ్స్‌‌‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పర్యాటకులను అలరించేవిధంగా అరకు వ్యాలీని మరింత అందంగా మెరుగులు దిద్దుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం... పచ్చని కొండలు... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... చూడచక్కని సముద్ర తీరం... కళ్లు చెదిరే ప్రకృతి అందాలు... ఇలా చెప్పుకుంటేపోతే అరకు అందాలకు లెక్కే ఉండదు... అంత అత్యద్భుతంగా ఉంటుంది అరకు లోయ... అందుకే, పర్యాటకులు అరకుకు క్యూ కడుతూ ఉంటారు.... సహజసిద్ధ ప్రకృతి అందాలను చూస్తూ మైమరిపోతుంటారు... అరకు అందాలు ఎంతగా మురిపిస్తాయో... అంతే అమాయకంగా పర్యాటకుల మనసు దోచుకుంటారు అక్కడి గిరిజనులు.... గిరిజనుల జీవనశైలి.... వారి సంస్కృతి సంప్రదాయాలను పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి... అందుకే, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించేలా ప్రతి ఏటా అరకు ఉత్సవ్ నిర్వహిస్తుంటారు.  ఫిబ్రవరి 29, మార్చి ఒకటిన రెండ్రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవ్‌కు అరకు ముస్తాబైంది. గిరిజనుల సంప్రదాయ నృత్యం థింసా... అలాగే, కొమ్ము డ్యాన్సులతోపాటు అటవీ ఉత్పత్తులను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. అలాగే, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే, అరకు ఉత్సవ్‌లో గతేడాది నిర్వహించిన హాట్ బెలూన్ ఫెస్టివల్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈసారి కూడా డిఫరెంట్స్ థీమ్స్‌‌తో పర్యాటకులను అలరించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అరకు ఉత్సవ్‌ కేవలం టూరిజం ప్రమోషన్స్‌... కోసమే కాకుండా.... గిరిజనులకు ప్రయోజనకరంగా... అలాగే, అడవి బిడ్డల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అలాగే, అరకు ఉత్సవ్ పేరుతో కేవలం దేశ విదేశీయులకు ప్రాధాన్యత కల్పించకుండా, ఉత్సవానికి కారకులైన గిరిజనులకు పెద్దపీట వేస్తూ వాళ్లు లబ్ది జరిగేలా అన్ని విభాగాల్లో చోటు కల్పించాలని కోరుతున్నారు.

AP govt sets up SIT to probe Amaravati land deals

జగన్ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. చంద్రబాబు నిర్ణయాలపై సిట్ దర్యాప్తు...

అమరావతి భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో 10మంది సభ్యులతో సిట్‌‌ను నియమించారు. రాజధాని భూ-లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వడంతో... ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ జరపనుంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందంటూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తిరగదోడేందుకు జగన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పొరేషన్ల వ్యవహారాలు సిట్‌ పరిధిలోకి వస్తాయంటూ జీవోలో స్పష్టం చేసింది. అమరావతిలో చోటుచేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై విచారించనుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్‌కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడేందుకు సిట్‌ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

జగన్ బాటలో యడ్యూరప్ప.. కర్నాటలోనూ పాలనా వికేంద్రీకరణ

ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసనలు భగ్గుమంటున్న వేళ కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించింది. అయితే రాజధానులను మార్చకుండానే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పలు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్న సీఎం యడ్యూరప్ప కర్నాటక అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా తీర్మానం కూడా ఆమోదింపజేశారు. ఏపీలో మూడు రాజదానుల వ్యవహారం ఓవైపు కాకరేపుతుండగానే పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం ఇదే బాటలో పయనిస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాలనా వికేంద్రీకరణలో జగన్ బాటనే అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ అనుభవాల నేపథ్యంలో ఒకటికి మించి రాజధానులు కాకుండా బెంగళూరును మాత్రమే రాజధానిగా ఉంచి అక్కడి నుంచి కొన్ని రాష్ట్రస్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. దీంతో పాలనా వికేంద్రీకరణ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కర్నాటలో స్ధానికంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న కారణంతో అక్కడి యడ్యూరప్ప ప్రభుత్వం వికేంద్రీకరణకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి తీసుకున్న సీఎం యడ్యూరప్ప వివిధ రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను పాలనా వికేంద్రీకరణ పేరుతో తరలించేందుకు కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేశారు. కర్నాటక ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం త్వరలో బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలు తరలిపోనున్నాయి. వీటిలో నీటిపారుదలశాఖకు చెందిన కృష్ణభాగ్య జల నిగమ్, కర్నాట నీరవరి నిగమ్, పవర్ లూమ్ కార్పోరేషన్, షుగర్ డైరెక్టరేట్, షుగర్ కేన్ డెవలప్ మెంట్ కమిషనర్ కార్యాలయం, కర్నాటక మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఉప లోకాయుక్త కార్యాలయం ఉన్నాయి. వీటిని బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు తరలించనున్నట్లు యడ్యూరప్ప ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. వీటిని ఎప్పటి కల్లా తరలించాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానం మేరకు త్వరలోనే వీటి తరలింపు ఉంటుందని మాత్రం మంత్రులు చెబుతున్నారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అనుసరించడం కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వానికి ఇదే తొలిసారి కాదు. జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే తీసుకున్న పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని ఇప్పటికే యడ్యూరప్ప సర్కారు నిర్ణయించింది. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా రాష్ట్రంలో పలు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స్ధానిక కోటాను అనుకూలంగా కొందరు ఆందోళనకారులు ఏపీ టూరిజం బస్సుపై దాడికి కూడా పాల్పడ్డారు. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. రాజధానుల విస్తరణ పేరు వాడకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

తెలంగాణ తరహాలో ఏపీలోనూ 51 కోట్ల ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు పాత్ర!!

ఏపీలోనూ తెలంగాణ తరహాలో భారీగా ఈఎస్ఐ స్కామ్ జరిగింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దర్యాప్తులో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆరేళ్లుగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమార్కులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో రేట్ కాంట్రాక్టులో లేని సంస్ధలకు సైతం ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం మందుల కొనుగోళ్ల కోసం మొత్తం 89 కోట్లు చెల్లించగా.. అందులో 38 కోట్లు నిబంధనల ప్రకారం చెల్లించినట్లు, మరో 51 కోట్లు మాత్రం అక్రమార్కులు మింగేశారు. అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడికీ ఇందులో పాత్ర ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కొన్నినెలల క్రితం చోటుచేసుకున్న ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ మరకవకముందే ఏపీలోనూ అదే తరహా అవినీతి చోటుచేసుకున్నట్లు తాజాగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో కీలకంగా ఉన్న పలువురు అధికారులు కుమ్మక్కై దాదాపు 51 కోట్ల మేర అక్రమ కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్టులో ఉన్న సంస్ధల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. అందులో లేని సంస్ధల నుంచి కూడా 51 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసి మందులు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అదీ వాస్తవ ధర132 శాతం అధికంగా చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ విచారణ నివేదికలో తెలిపింది. ఈ మొత్తం స్కామ్ లో కీలక పాత్ర పోషించిన సరఫరాదారులు తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ లో నిందితులుగా ఉన్నవారే కావడం ఇక్కడ మరో విశేషం. ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో అప్పట్లో డైరెక్టర్లుగా వ్యవహరించిన రవికుమార్, విజయ్ కుమార్ తో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ ను అధికారులు బాధ్యులుగా తేల్చారు. వీరిపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు గా వ్యవహరించిన సమయంలో 975 కోట్ల రూపాయల మందుల కొనుగోలు చేస్తే, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఈ ముగ్గురు డైరెక్టర్లు 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగేలా వ్యవహరించారు. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలే రెండు రాష్ట్రాల్లో భారీగా ఈఎస్ఐ స్కామ్ కు పాల్పడ్డాయి. ఈ మూడు సంస్థలకు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్ల రూపాయలను అక్రమంగా చెల్లించినట్లు తేలింది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ల్యాబ్ పరికరాల కోసం ఎలాంటి టెండర్లు లేకుండానే 2 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇడెంట్లు సృష్టించారని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. 2018 19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉం టే , అందులో కేవలం 8 కోట్లు మాత్రమే వాస్తవ ధర అయితే 10 కోట్లు అదనంగా నిధులు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టు కూడా విజిలెన్స్ నివేదికలో తేలింది. ఒక్కో బయోమెట్రిక్ మిషన్ వాస్తవ ధర 16,000 అయితే ఏకంగా 70 వేల చొప్పున ఇండెంట్లు సృష్టించినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. జర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే నకిలీ సంస్థను సృష్టించి కందుల కొనుగోలు పేరుతో నిధులు మళ్లించినట్లు తేలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందదని విజిలెన్స్ నివేదికలో తేల్చారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ పద్ధతిలో ఆర్డర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించిట్లు నివేదిక తెలిపింది.

హైదరాబాద్ బస్టాప్ ల్లో ఆర్టీసీ గైడ్స్... అడిగిమరీ బస్సెక్కిస్తారు... 

50రోజుల ఆర్టీసీ సమ్మెతో యాజమాన్యం భారీ గుణపాఠాన్నే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సమూల ప్రక్షాళన చేపట్టిన యాజమాన్యం... సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల దగ్గర మార్పులకు శ్రీకారం చేపట్టారు. బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారం అందించేందుకు మెగాఫోన్ వ్యవస్థను మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా, ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది... ఏ సమయంలో వస్తుంది... ఏ నెంబర్ బస్సు ఎక్కడి వెళ్తుంది... ఇలా, ప్రయాణికులకు సమాచారం అందించడానికి, ప్రతి బస్టాండ్‌లో గైడ్స్‌‌ను ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్లంతా మెగా ఫోన్ల ద్వారా... ఆయా బస్సుల వివరాలు అందిస్తూ ప్రయాణికులకు సహాయపడేలా చర్యలు చేపట్టారు.  ఒకవేళ బస్సుల్లో తగినంతమంది ప్రయాణికులు లేకపోతే ప్రీక్వెన్నీ నియంత్రిస్తూ ఓఆర్ పెంచేందుకు రెండుమూడు నిమిషాలు నిలిపి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత చేపట్టిన చర్యలతో సంస్థ మెల్లమెల్లగా గాడిలో పడుతోందని అంటున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణతో నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఆర్టీసీ కార్మికులు బోనస్ తీసుకునేలా సకల చర్యలు చేపడుతున్నారు. మరి, తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందా?

ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.