తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్.. ఎందులోనే తెలుసా?
posted on Jun 29, 2021 @ 6:12PM
తెలంగాణ రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది.యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇది గత ఏడాది కొనుగోళ్ల కంటే 28 లక్షల టన్నులు అధికమని సివిల్ సప్లయ్ అధికారులు చెప్పారు. 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17 వేల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. 23 జిల్లాల్లో అంచనాలకు మించి వందశాతంపైగా కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. గత ఏడేళ్లల్లో ఒక్క యాసంగిలోనే ధాన్యం కొనుగోళ్లలో 594 శాతం పెరుగుదల సాధించామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ. 84వేల కోట్లు విలువ చేసే 4 కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మారెడ్డి చెప్పారు. “ఇదివరకు యాసంగిలో కంటే వానాకాలంలో ఎక్కువ పంటలు పండేవి ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వానాకాలంలో పండిన పంట కంటే కూడా యాసంగిలో అధిక పంటలు పండుతున్నాయి. దీనికి ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి… కొనుగోళ్లే నిదర్శనం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది 2014 – 15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నేడు 2021 యాసంగిలో 92లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం….అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయి, ఇదీ యావత్తు తెలంగాణ రైతాంగం యొక్క విజయమని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కొరకు 6, 968 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం, దాదాపు రెండున్నర నెలలపాటు కొనుగోళ్ల ప్రక్రియను నిర్విరామంగా సాగించి రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్లు విలువ చేసే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో రాష్ట్రంలోని 6,968 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. గత ఏడాది యాసంగి కంటే 28 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు (13 శాతం) అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 17,300 కోట్లు కాగా రవాణా, గన్నీ సంచులు, సోసైటీ కమీషనకు అదనంగా దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు.
23 జిల్లాల్లో ముందస్తు అంచనాలకు మించి వంద నుంచి 225 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. అత్యధికంగా గద్వాల్ లో 125 శాతం, నారాయణపేటలో 95 శాతం, రంగారెడ్డిలో 83 శాతం, నిర్మల్ లో 44 శాతం, వరంగల్ రూరల్ లో 64శాతం, సంగారెడ్డి, 32 శాతం, భూపాలపల్లిలో 33, వికారాబాద్ లో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయన్నారు. సమైక్య రాష్ట్రంలో మన అవసరాలకు, పేదలకు రేషన్ బియ్యం ఎక్కడో పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి. అవి కూడా తినడానికి అంత అనువుగా ఉండేవి కావు… కాని నేడు మన రాష్ట్రంలో పండిన బియ్యాన్ని మనం తినడమే కాకుండా దేశానికి కూడా అందిస్తున్నాం. గత ఏడాది భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో తెలంగాణ వాట 55 శాతం ఉంటడం మన అందరికి గర్వకారణమన్నారు మారెడ్డి .
రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలు మెట్రిక్ టన్నులు
నల్లగొండ 7,83,574
నిజామాబాద్ 7,55,819
సూర్యా పేట 6,49,192
జగిత్యాల 5, 52,794
సిద్దిపేట 5,40,049
కామారెడ్డి 4,51,154
మెదక్ 4,41,130
కరీంనగర్ 4,14,859
యాదాద్రి 4,06859
పెద్దపల్లి 3,89,601