తల్లీకూతుర్లు వేశ్యలుగా.. ఎందుకో తెలుసా ? 

కరోనా ఆ పేరు వింటే ఇప్పుడే కాదు ఎప్పటికి ఒక హడల్ అని చెప్పాలి.. ఇప్పటి వరకు మమల్ని కొట్టే వాడు లేదు అన్న మానవాళికి బోయపాటి సినిమాలో హీరో విలన్స్ కొట్టినట్లు కొట్టడానికి ఒకడు ఒకడు వచ్చాడు వాడే కరోనా అని దాదాపు గత రెండు సంవత్సరాలుగా దాని ప్రతాపం చూపిస్తూ ప్రజలను వణికిస్తుంది.. కరోనా సృష్టించిన విలయం అంత ఇంత కాదు.. కొంత మందిని భయం తో చంపేస్తే.. మరికొంత మందిని కరోనా వైరస్ చంపింది.. కానీ అందరికి ఫైనాన్సియల్ గా దెబ్బతీసింది.. చాలా మంది ఈ ప్యాండమిక్ టైం లో ఉపాధిలేక, ఉన్న జాబ్స్ పోయి రోడ్డున పడ్డారు. కొంత మందికి మూడు పూటల తినడానికి తిండిలేక కడుపు ఎండపెట్టుకుని చనిపోయారు. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు తల్లకిందులైపోయాయి. ఎందరో ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్న ఇద్దరు మహిళలు వాళ్ళ కడుపు నిముకునే  మార్గాన్ని ఎంచుకున్నారు. ఎండిన డొక్కలు నింపుకోవడానికి.. అతుక్కుని పోయిని కడుపులో పట్టెడు అన్నం వేసుకునేందుకు వేశ్యలుగా మారిపోయారు. వారిద్దరూ తల్లీకూతుళ్లు కావడం విశేషం. అది పంజాబ్‌లోని ముక్తాసర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. వేరే పనులు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాలు ఆమెను వెక్కిరించాయి.. విధి సైతం ఈ పేదవాడు భూమి మీద బతకకూడదు, నీకు బతికే హక్కులేదు చనిపోమంది.. అలాగే రోజు రోజు ఆమె బతకడానికి ఆమెకు ఆశలు కనబడకపోవడంతో పొట్టకూటి కోసం వేశ్యగా మారింది. అంతేకాదు తన కూతుర్ని కూడా వేశ్యగా మార్చేసింది. తమ ఇంట్లోనే వీరు అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి మీద దాడి చేసిన పోలీసులు తల్లీకూతుళ్లతోపాటు ఇద్దరు విటులను సోమవారం అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఆదేశానుసారం చర్యలు తీసుకోనున్నారు     వేశ్య జీవితం గురించి ప్రముఖ తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు.. తాను శవమై.. ఒకరికి వశమై.. తనువూ పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడు ఎడారై.. ఎందరికో ఒయాసిసై.. అని రాశాడు.. ఒక స్త్రీ పడకపంచుకుంటుందంటే కడుపు నిండి కాదు.. కడుపు ఎండి అని తెలుసుకోవాలి.. వాళ్ళు బతకడం కోసం వాళ్ళు ఆ పనిని ఎంచుకున్నారు.. నిజానికి వాళ్ళు కాదు సిగ్గుపడాల్సింది వాళ్ళను ఈ దారుణ స్థితిలోకి తీసుకువచ్చిన ఈ ప్రభుత్వాలది..   

శ్రీశైలంలో దూకుతా.. అందుకు ఎమ్మెల్యే రోజానే సాక్షి.. గేరు మార్చిన బండి..

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ శ్రీశైలం ప్రాజెక్టులో దూకుతాన‌న్నారు. సీఎం కేసీఆర్‌పై తాను చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని తేలితే అన్నంత ప‌ని చేస్తానంటూ స‌వాల్ చేశారు. ఒకవేళ నిజమైతే.. ముక్కును నేలకు రాసి.. పొర్లు దండాలు పెట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాక రేపారు బండి సంజ‌య్‌. తెలుగు రాష్ట్రాల జ‌ల వివాదంలో బీజేపీ దూకుడు పెంచింది. రేవంత్‌రెడ్డి ఎఫెక్టో ఏమో కానీ.. బండి సంజ‌య్ గేరు మార్చి.. స్పీడ్ పెంచారు. బాగా వ‌ర్క‌వుట్ చేసి వ‌చ్చి మ‌రీ, మీడియా ముందు కృష్ణా లెక్క‌ల చిక్కుముడులు ముందేశారు. అంతా కేసీఆరే చేస్తున్నార‌ని తేల్చి పారేశారు. కృష్ణా జలాల వివాదంలో కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తాకట్టు పెట్టారంటూ కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా వైసీపీ ఎమ్మెల్యే రోజానూ ఇన్వాల్వ్ చేయ‌డంతో బండి వ్యాఖ్య‌లు మ‌రింత ర‌క్తి క‌ట్టాయి.  "2015లో జూన్ 18, 19 తేదీలలో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీశ్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబులు మాట్లాడుకున్నారు. 299  టిఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? 811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని 12.5.2020న రజత్ కుమార్ లేఖ రాశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్. రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది." అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్‌.   "ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారు. కొత్త డ్రామాలకు తెరలేపి.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలోనే ఒప్పందం జరిగింది’’ అంటూ విరుచుకుపడ్డారు బీజేపీ అధ్య‌క్షులు.  ఇక‌, ఇటీవ‌ల కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి త‌న‌కు ఫోన్ చేశారంటూ సీఎం కేసీఆర్ అబ‌ద్ద‌లు ప్ర‌చారం చేస్తున్నారంటూ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. అస‌లు ఆనాడు ఏం జ‌రిగిందో వివ‌రించారు. ‘‘సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మిస్డ్ కాల్ చూసిన కేంద్రమంత్రి కాల్ బ్యాక్ చేశారు. దీనికి కేంద్రమంత్రే తనకు ఫోన్ చేశాడంటూ ప్రచారం చేసుకున్నారు. నోరు తెరిస్తే అబద్దాలు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేశారు. అన్యాయం చేసినోడు తెలంగాణలో బతకొద్దు. పాపం చేసినోడు వాడి పాపం వట్టిగా పోదు. నా ఆరోపణలు అబద్దమైతే శ్రీశైలం ప్రాజెక్టులో దూకి చనిపోతా. ఇదే నా సవాల్. ఒక వేళ నిజమైతే.. ముక్కును నేలకు రాసి.. పొర్లు దండాలు పెట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఆయన వందేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. పైకి మాత్రమే జ‌గ‌న్‌తో కొట్లాటలు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి’’ అంటూ కేసీఆర్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు బండి సంజయ్.   

సెల్ఫీ సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది.. 

అప్పుడప్పుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు పడుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు మన ప్రాణాలు కోలుపోవచ్చు కూడా..ఈ మధ్య కాలంలో సరదాకి వెళ్లి ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ముఖ్యంగా స్మార్ట్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. అదెలా అంటారా ? ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం.. రోడ్డు క్రాస్ చెయ్యడం. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం లాంటివి ఒక ఎత్తు అయితే సెల్ఫీ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఒక ప్రాణాలు పోవడమే కాదు.. టైం వెస్ట్ అవుతుంది. ఎనర్జీ పోతుంది.. రేడియేషన్ వస్తుంది. లేనిపోనీ రోగాలు అని ఈ స్మార్ట్ ఫోన్ తో వస్తున్నాయంటే నమ్మాల్సిందే.. తాజాగా సెల్ఫీ  సరదా ముగ్గురి ప్రాణాలను బలిగొంది.  ఓపెన్ చేస్తే.. అది తెలంగాణ. నిర్మల్‌ జిల్లా.  సింగన్‌గావ్‌ గ్రామం. ముగ్గురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ముథోల్‌ సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. సింగన్‌గావ్‌కు చెందిన ఎల్మే దాదారావు, మంగళాబాయిలకు ఒక కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు స్మిత(16), వైశాలి(14) ఉన్నారు. ఆదివారం ఆన్‌లైన్‌ క్లాసులు లేకపోవడంతో బంధువుల అమ్మాయి అంజలి (14)తో కలిసి స్మిత, వైశాలిలు చేనుకు వెళ్లారు. ఎండ ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్లాలని వారికి మంగళబాయి చెప్పింది. కొద్దిసేపు చేనులో ఉండి సెల్ఫీలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు.. ఒక్కసారిగా మార్గంమధ్యలో ఉన్న చెరువు గట్టు చూశారు. ఆ టైం లో వల్ల నేత్తిలో శని ప్రవేశింశాడు.. చెరువు వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించారు. అంతే పక్కనే యముడు పాశం వదిలినట్టు ఆ ముగ్గురు  ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. చేను నుంచి రాత్రి ఇంటికి తిరిగివచ్చిన మంగళబాయికి ముగ్గురమ్మాయిలూ కనిపించలేదు. బంధువుల ఇళ్లలో, పంట చేను సమీపంలో వెతికారు. ఎంత వెతికిన కనిపించకపోయే సరికి కరఁగారు పడిన తల్లిదండ్రులు చివరికి అర్ధరాత్రి తానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కట్ చేస్తే.. సోమవారం ఉదయం చెరువు గట్టు వద్ద చెప్పులు కనిపించాయి. అసలే రోజులు బాగాలేవు అని అనుమానం తో  ఆ చెప్పులను గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారి  సాయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. స్మిత, వైశాలిలది వ్యవసాయ కుటుంబం. తండ్రి దాదారావు ఆటో నడుపుతాడు. సోదరుడు సందీప్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. స్మిత హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్‌, వైశాలి బాసరలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. మహారాష్ట్ర ముఖేడ్‌కు చెందిన లహుబందే ప్రకాశ్‌, ప్రియాంకల కుమార్తె అయిన అంజలి అక్కడే 9వ తరగతి చదువుతోంది.        

శివసేనతో  మళ్ళీ పెళ్ళికి  బీజేపీ సిద్ధం 

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. మహారాష్ట్రలో బీజీపీ, శివసేన సుదీర్ఘకాలం పాటు మిత్ర పక్షలుగా ఉన్నాయి.. అలాగే పంజాబ్’లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ పార్టీలు రెండు దశాబ్దాలకు పైగా చెట్టాపట్టాలేసుకుని సహజీవనం చేశాయి. బీజేపీతో ఇంకా అనేక పార్టీలు చేతులు కలిపినా, శివసేన, అకాలీ దళ్ మాత్రమే కాషాయ దళం  సహజ మిత్ర పక్షాలుగా గుర్తింపు పొందాయి. అందుకే చిన్నా చితక తగవులు వచ్చినా పెద్దల జోక్యంతో అన్నదమ్ముల్లా కలిసి పోతువచ్చాయి. కానీ, ప్రధాని మోడీ, అమిత్ షా జోడీ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత, సహజ మిత్ర పక్షాలు అనుకున్న ఆ రెండు పార్టీలు ఒక దాని తర్వాత ఒకటి కమలం చేయి వదిలి రాజకీయ ప్రత్యర్దులుగా కాలు దువ్వుతున్నాయి.   అయితే, ఇపుడు గత నెల రోజులుగా సాగుతున్న పరిణామాలను గమనిస్తే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ఏర్పడిన మబ్బులు తొలిగి పోతున్నసంకేతాలు స్పష్టమవుతున్నాయి. పాత బంధాలను మళ్ళీ పునరుధరించుకునేందుకు ఉభయ పార్టీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, గత నెలలలో, (జూన్ 8న) మహా రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షడు ఉద్ధవ్ థాక్రే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో  సమావేశమయ్యారు.  40 నిముషాలకు పైగా రాష్ట్రానికి సంబందించిన అంశాలను చర్చించారు.అధికార సమావేశానికి కొనసాగింపుగా కొద్ది సేపు ఏకాంత  సమావేశం జరిపారు. ఆ  పదినిముషాలలో వారు ఏమి చర్చించారో, ఏమో కానీ, ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు ఆ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యతను జోడించాయి. ఉద్ధవ్ థాకరే  ముఖ్యంగా బీజేపీ, శివసేన  సంబంధాల కోణంలో ప్రాధాన్యతగల వ్యాఖ్యలు చేశారు. రాజ‌కీయంగా తాము ఒక‌టి కాక‌పోయినా..తమ మ‌ధ్య బంధం బ్రేక‌వ్వ‌లేద‌న్నారు. తానేమి న‌వాజ్ ష‌రీఫ్‌ను క‌లిసేందుకు వెళ్ల‌లేద‌ని, తాను ప్ర‌ధానిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసిస్తే త‌ప్పేమీ లేద‌ని అన్నారు.  ఇక అక్కడి నుంచి ఓ వంక ఊహాగానాలు ఊపందుకుంటే మరో వంక, ఇరు వైపులా నుంచి అందుకు ఊతమిచ్చే వ్యాఖ్యలు, సంకేతాలు స్పష్టమవుతున్నాయి. బీజీపీ, శివసేన బంధాన్ని తుంచడంలో కీలక పాత్ర పోషించిన, శివసేన ఎంపీ, పార్టీ అధికార పత్రిక,’సామ్నా’ సంపాదకుడు సంజయ్ రౌతు, ఉద్ధవ్ థాకరే ప్రధానిని కలిసిన రెండు రోజులకే  నరేంద్ర  మోడీని మెచ్చుకుంటూ సంపాదకీయం రాశారు. దేశంలో ఆయనే టాప్ లీడర్ అని ప్రశంసించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉద్దవ్ థాకరే, హిందుత్వం, హిందూ జాతీయ వాదం తమ పార్టీ విధానమని, ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్తం చేశారు. ఇక ఇప్పుడు తాజాగా గడచిన రెండు మూడు రోజులుగా ఉభయ పార్టీల నుంచి మరింతగా ప్రేమ పొంగులు, సంకేతాలు  కొంచెం చాల ఎక్కువగా కనిపిస్తున్నాయి.వినిపిస్తున్నాయి.శివసేనకు ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు ససేమిరా అని భీష్మించుకుని కూర్చున్న, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ స్వరంలో మార్పు వచ్చింది. శివసేన తమకు శత్రువు కాదని ఆయన అన్నారు. మరో వంక ఫద్నవీస్ ప్రేమ సందేశానికి సంజయ్ రౌత్ పాజిటివ్’గా స్పందించారు.  “మేమేమీ భారత్, పాకిస్థాన్‌లు కాదు. అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. మా సంబంధం అలాంటిదే. ఎవరి రాజకీయ మార్గాలు వారివి. కానీ మిత్రత్వం ఎప్పటిలాగే ఉంటుంది’’ అని రౌత్  స్పష్టం చేశారు. అంతే కాదు థాకరే ఫ్యామిలీతో ప్రధాని మోడీకి, రాజకీయాలకు అతీతమైన  ప్రత్యేక బంధం ఉందని అన్నారు.  ఇదలా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు, బీజేఎల్పీ నేత, మాజీ సీఎం ఫడణవీ్‌సకు మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దల స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఫడ్నవీస్’కు  చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.  అదలా ఉంటే, రాజకీయ పోత్తులకు ఉభయుల ప్రయోజనాలే ప్రమాణికం అన్న సూక్తిని గుర్తు చేస్తూ రాజకీయ పరిశీలకులు  మహారాష్ట్రలో అధికారంలో  ఉన్న మహావికాస్ అఘాడీ( ఏమ్వీఎ)లో అంతర్గత విబేధాలు ముదురుతున్న నేపధ్యంలో శివసేన, జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీ గ్రాఫ్’కు గండి పడుతున్న నేపధ్యంలో బీజేపీ, మళ్ళీ పెళ్లి (పొత్తు)కు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్నాయని అంటున్నారు. ఇద్దరికీ ఇప్పుడు ఒకరి అవసరం ఒకరికుంది.  అందుకే మళ్ళీ పెళ్ళికి అడ్డుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఫడ్నవీస్’ ను కేంద్రానికి పంపేసి, ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఉద్ధవ్‌ థాకరేను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని, బీజేపీ నుంచి ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవులు కల్పిస్తారని అంటున్నారు. అయితే, ఫడణవీస్‌ దీనిని కొట్టిపారేస్తున్నారు. తాను రాష్ట్రంలోనే ఉంటానని అంటూనే తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోడీదేనని అన్నారు. ఏమైనా,పాత ప్రేమలు ఫ్రెష్ ‘గా మళ్ళీ చిగిరిస్తున్నాయి,అంతవరకు అయితే ఎవరికీ అనుమానం లేదు ..ఆ తర్వాత కథ ఏ మలుపులు తిరుగుతుందో .. ఎక్కడ  ముగుస్తుందో బుల్లితెర మీద చూడవలసిందే, అంతవరకు సెలవు అంటున్నారు మహా విశ్లేషకులు

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్  ప్రారంభించిన కూలీ.. కేంద్రంపై కేటీఆర్ నిప్పులు..

హైద‌రాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి- బాలానగర్- సికింద్రాబాద్ రూట్ లో అతిపెద్ద సమస్యగా ఉన్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ను ప్రారంభించారు. 1. 3 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను రూ.385 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో నిర్మించారు.  ఈ బ్రిడ్జీకి.. 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబూ జగ్జీవన్‌రామ్‌ పేరు పెట్టారు. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్  ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్  ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్‌ను వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన శివ‌మ్మ‌ అనే కూలీతో చేయించారు. ఆమె గ‌త రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నుల్లో పాలు పంచుకుంది.  శివ‌మ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డంతో అంద‌రూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.ల‌క్ష‌లాది మంది కార్మికులు  ప్రాజెక్టుల్లో నిమ‌గ్న‌మై ప‌ని చేశారని వారిని గౌర‌వించుకోవాల‌నే సీఎం కేసీఆర్ సూచ‌న‌తో.. వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన‌ శివ‌మ్మ అనే కూలీతో ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్ చేయించామ‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధిలో పాలు పంచుకునే కూలీల‌ను గౌర‌వించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్‌ ఒకటన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఇప్పటికే వంతెనలు, అండర్‌పాసులు మహానగరంలో అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వ‌ర‌కు, జూబ్లీ నుంచి తుర్కప‌ల్లి(ఓఆర్ఆర్) దాకా... స్కైవేలు నిర్మించేందుకు గ‌త 4 ఏళ్ల నుంచి క‌స‌రత్తు జ‌రుగుతోందన్నారు. ర‌క్షణ రంగ సంస్థల‌కు చెందిన భూములు ఉండ‌టం వ‌ల్ల.. కేంద్రం స‌హాయ‌క నిరాక‌ర‌ణ వ‌ల్ల ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జ‌రుగుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

కేసీఆర్‌ను న‌మ్మితే న‌దిలో ముంచేస్తారు!.. జ‌గ‌న్ తుస్‌!.. అదే చంద్ర‌బాబు ఉంటేనా!

నీళ్లు, నిధులు, నియామ‌కాలు అంటూ కేసీఆర్ అంద‌లమెక్కారు. ఆ త‌ర్వాత ఆ మూడింటినీ మ‌డిచి మూల‌న ప‌డేశారు. నీళ్ల విష‌యంలో ఆయ‌న ఎప్పుడూ జిత్తుల మారే. అతిజాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం సందు చిక్కినా.. చిక్కుల్లో ప‌డేస్తారు. ఆ త‌ర్వాత గిల‌గిలా కొట్టుకుంటుంటే త‌మాషా చూస్తారు. ఈ లోగా త‌న రాజ‌కీయ ప‌బ్బం గుడ‌పుకుంటారు. ఇది చ‌రిత్ర చెబుతున్న స‌త్యమంటూ ప్ర‌తిప‌క్షాలు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నాయి. తాజాగా, తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌జ‌గ‌డం ముద‌ర‌డంతో సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిపై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.  జ‌గ‌న్ జ‌ల దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని.. కేసీఆర్‌కు తెలిసే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం క‌డుతున్నార‌ని.. అందుకు ఆయ‌న గ‌తంలోనే అంగీక‌రించారని.. ఇప్పుడు కావాల‌ని గొడ‌వ చేస్తున్నార‌నేది తెలంగాణ విప‌క్షం ఆరోప‌ణ‌.  ర‌చ్చ‌కు కార‌ణం ఆయ‌నేన‌నేది ఏపీ వాద‌న‌. శ్రీశైలం, నాగార్జున‌సాగ‌ర్‌, పులిచింత‌లలో స‌రిప‌డా నీళ్లు లేకున్నా.. ఏపీని క‌వ్వించ‌డానికే కావాల‌నే విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తూ.. ఏపీ రైతుల క‌డుపు కొడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. తెలంగాణ మంత్రులు అంత‌గా తిడుతున్నా.. పౌరుషం లేకుండా ప‌డుంటున్న ఏపీ పాల‌కుల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు. కేసీఆర్‌-జ‌గ‌న్‌లు క‌లిసి నిధులు, ఓట్లు కోసం తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌నేది ఇరురాష్ట్రాల విప‌క్షాల మాట‌. ఇలా ఇద్ద‌రు సీఎంల‌పై రెండు రాష్ట్రాల్లో విమ‌ర్శ‌ల వ‌ర్షం కుర‌వ‌డం బ‌హుషా ఇదే తొలిసారి కాబోలు.  తెలంగాణ‌ దూకుడుగా పోతున్నా.. కరెంట్ పేరుతో నీటిని స‌ముద్రం పాలు చేస్తున్నా.. సీమ ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు రాకుండా అడ్డుపుల్ల‌లు వేస్తున్నా.. ఎన్టీటీలో పిటిష‌న్‌ల‌తో బెదిరిస్తున్నా.. సీఎం జ‌గ‌న్ మాత్రం చేత‌గాక చేతులెత్తేసిన‌ట్టు లేఖ‌ల‌తో స‌రిపుచ్చుతున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు సీఎం కేసీఆర్ ఇంత‌లా గండి కొడుతున్నా.. జ‌గ‌న్ అంత ప్ర‌శాంతంగా ఎలా ఉంటున్నార‌ని.. ప్ర‌జాప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎందుకు కాంప్ర‌మైజ్ అవుతున్నార‌ని నిల‌దీస్తున్నారు ఏపీ వాసులు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హ్యాండిల్ చేయ‌డం ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చేత‌కావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ లాలూచీ ప‌డ్డారా? లేక‌, జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త‌నా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో గతాన్ని ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో.. కేసీఆర్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి.. ఏపీ ప్ర‌యోజ‌నాలను కాపాడిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చెక్ పెడితే.. జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నారు. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో అలా కాదు. చంద్ర‌బాబు చెక్ పెడితే.. కేసీఆర్ గింజుకోలేక గిల‌గిల్లాడే వాడు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో అస‌లేమాత్రం కాంప్ర‌మైజ్ కాలేదు చంద్ర‌బాబు. ఒక‌వైపు తెలంగాణ‌తో పోరాటం.. మ‌రోవైపు సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చి పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించ‌డం.. ఇంకోవైపు.. ప‌ట్టిసీమ‌తో క‌రువు సీమ‌ను జ‌ల‌సీమ‌గా మార్చిన ఘ‌న‌త.. నిస్సందేహంగా చంద్ర‌బాబునాయుడిదే.  ఇటు కేసీఆర్‌తో జ‌ల‌జ‌గ‌డాల‌కు దిగుతూనే.. అటు కేంద్ర ప‌రిధిలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా ఫైట్ చేశారు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు. ఇప్ప‌టి జ‌గ‌న్‌లా తిడితే ప‌డ‌లేదు.. ఇప్ప‌టి జ‌గ‌న్‌లా ఉమ్మ‌డి జలాల‌ను తెలంగాణ వాడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేదు.. అప్ప‌టి కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ఉమాభార‌తి ఆధ్వ‌ర్యంలో పంచాయితీ పెట్టి.. ఏపీ వాటా కోసం.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేసిన యోధుడు చంద్ర‌బాబునాయుడు. ఏపీ కోసం తెలంగాణ‌ను క‌ట్ట‌డి చేశారు కాబ‌ట్టే కేసీఆర్‌కు చంద్ర‌బాబు అంటే అంత క‌డుపుమంట‌. ఇప్ప‌టి జ‌గ‌న్‌లా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రాజీ ప‌డ‌కుండా.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే పాకులాడిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అందుకే, ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల మ‌ధ్య ఇంత‌లా జ‌ల‌వివాదం న‌డుస్తుంటే.. ఈ స‌మ‌యంలో సీఎంగా చంద్ర‌బాబు ఉండి ఉంటే.. సీన్ మ‌రోలా ఉండేద‌ని చ‌ర్చించుకుంటున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఒక్క ఛాన్స్ అని న‌మ్మి.. న‌ట్టేట మునిగామ‌ని బాధ‌ప‌డుతున్నారు. మ‌రో రెండున్న‌రేళ్లు ఎప్పుడు గ‌డుస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ చంద్ర‌న్న వ‌స్తారు.. కేసీఆర్‌కు చుక్క‌లు చూపిస్తారు.. వెయిట్ అండ్ సీ.. అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. 

వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి షాక్ తగిలింది. రాంకీ గ్రూప్ సంస్థలపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాంకీ సంస్థల అధిపతి అయోధ్య రామిరెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఐటి అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు జరుపుతున్నారు. అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంతో  పాటు గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 15 బృందాలతో వివిధ ప్రాంతల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రాంకీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది.  ఈ సంస్థపై ఇటీవల కొన్ని టివి ఛానెళ్లు భూకబ్జా ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేశాయి. పెద్దమొత్తంలో భూమిని కబ్జా చేశారని వార్తా కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వైసిపి ఎంపీపై దాడులు జరగడం ఆంధ్రాలో సైతం చర్చనీయాంశమైంది. ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతల కార్యాలయాల్లోనూ సోదాలు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

గవర్నర్ గా కంభంపాటి హరిబాబు.. హర్యానాకు దత్తాత్రేయ బదిలీ

దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు వారికి అవకాశం దక్కింది. ఏపీ బీజేపీ సీనియర్ నేత, విశాఖ పట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ గిరి పోస్టు దక్కింది. హరిబాబును మిజోరాం గవర్నర్ గా నియమించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయకు మరోసారి అవకాశం దక్కింది. అయితే దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్ గా బదిలి చేసింది కేంద్ర సర్కార్. రాజేంద్రన్ విశ్వనాథ్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా అపాయింట్ చేసింది.  కేంద్ర మాజీ మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ను కర్నాటక గవర్నర్ గా నియమించింది. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగుభాయ్ పటేల్ ను అపాయింట్ చేసింది. జార్ఖండ్ గవర్నర్ కు రమేష్ బైస్ నియమితులయ్యారు. త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ను గవర్నర్ గా పంపింది. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మెట్రో మెన్ శ్రీధరన్ పిళ్లె గోవా గవర్నర్ గా ఖరారయ్యారు. కొత్త గవర్నర్ల నియామకం, బదిలీలు, మార్పులు చేర్పులపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.   

మందు తాగిన ఎలుకలు.. కంగుతిన్న అధికారులు..

మందు.. ఆ పేరు వింటే కొందరికి నాలుక లాగుతుంది. కొందరు పండగలకు పబ్బాలకు మాత్రమే తాగుతారు. ఇంకొందరు అప్పుడప్పుడు తాగుతారు.. మరికొందరు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు.. కొందరికి అయితే టైం తో పని ఉండదు పొద్దునే వెళ్లి వైన్ షాప్ ముందు కూర్చుంటారు.. ఆ దుకాణం తెరవడంతోనే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. బెడ్ మీద పేషేంట్ కి సెలైన్ బాటిల్ ఎక్కినట్లు వాళ్లకు ఎప్పుదు మందు పొత్తనే ఉండాలి.. అందుకే వాళ్లకు ఒక పేరు ఉంది.. ఆ పేరే మందు బాబులు.. తాగుబోతులని.. మనుషులు మందు తాగడం సాధారణం.  అది అనాది నుండి వస్తున్న అలవాటు.. అప్పుడపుడు తాగడం సరదా.. ఎప్పుడు తాగడం వ్యసనం..ముందుకు బానిసలు అవ్వడం..  నేటి కాలంలో మందు లేనిదే ముద్దదిగదు.  చాలామందికి ఈ మందు బానిసలు అవుతున్నారు. కాసేపు ఈ మందు  గోల,  మానవుల గోల పక్కన పెడితే.. కొన్ని జీవరాసులు మనుషులే మందు తాగుతారా.. మేము కూడా తాగుతాం అంటున్నాయి. ఇప్పటి వరకు మందు తాగడంలో నన్ను మించినవాడు లేడు అనే మనిషికి,  ఎలుక ఏకంగా  సవాలు విసురుతున్నాయి. ఎలక ఏంటి ? మందు తాగడం ఏంటి ? మళ్ళీ మనిషికి సవాల్ విసరడం ఏంటి? అని అనుకుంటున్నారా మీరే చూడండి..  ఎలుకలు మద్యం తాగిన ఘటన మరోసారి వెలుగుచూసింది. కరోనా సంక్షోభం అనంతరం మద్యం దుకాణం తెరిచిన తమిళనాడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి షాక్‌కు గురైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గుడలూరు సమీపంలోని కదంపూజ పట్టణంలో ప్రభుత్వం మద్యం దుకాణం నడుపుతోంది. కరోనా వ్యాప్తి వల్ల విధించిన లాక్ డౌన్ తో ఈ మద్యం దుకాణాన్ని మూసిఉంచారు. దీంతో ఎలుకలు బాటిళ్ల మూతలను కొరికాయి.. వైన్ బాటిల్ లో ఉన్న వైన్ ను లాగించాయి. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దుకాణంలోని 12 క్వార్టర్ మద్యం బాటిళ్ల మూతలు ఎలుకలు కొరికి, అందులో ఉన్న మందును నీటుగా తాగమని ఎక్సైజ్ శాఖ అధికారులు కనుగొన్నారు. ఎలుకలు మద్యం తాగిన ఘటనపై సీనియర్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

సుమ‌ల‌త‌ను ప‌డుకోబెట్టాలి.. మాజీ సీఎం రాజ‌కీయ ర‌చ్చ‌..

అద్దూ అదుపూ ఉండ‌దు.. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు.. ఇంకా చెప్పాలంటే ఎంత ఘాటుగా విమ‌ర్శిస్తే అంత ప‌బ్లిసిటీ. రాజ‌కీయాల్లో ఇలా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం కామ‌నే అయినా.. అప్పుడ‌ప్పుడూ అవి కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణ‌మ‌వుతాయి. అందులోనూ మ‌హిళా నేత‌ల‌ను కామెంట్ చేసేట‌ప్పుడు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే కొంప‌లు మునిగిపోతాయి. క‌ర్ణాట‌క‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. మాజీ సీఎం కుమార‌స్వామి.. ఎంపీ సుమ‌ల‌తపై చేసిన విమ‌ర్శ ఇప్పుడు రాజ‌కీయంగా మంట రేపుతోంది.  కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్‌-కేఆర్‌ఎస్‌ జలాశయం నుంచి వాట‌ర్ లీక్ అవుతోందంటూ ఎంపీ సుమ‌ల‌త ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. కేఆర్‌ఎస్‌ జలాశయానికి పగుళ్లు ఏర్పడ్డాయని సుమలత పలుమార్లు ఆరోపించారు. దీంతో జలవనరుల విభాగం ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించింది. పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చింది. ఇదే అంశంపై మీడియా మాజీ సీఎం కుమార‌స్వామిని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేఆర్ఎస్‌ జలాశయం రక్షణను ఆమే పర్యవేక్షిస్తున్నట్లుగా బిల్డ‌ప్ కొడుతున్నార‌ని.. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలంటూ వివాదాస్ప‌ద చేశారు. ఎంపీ సుమ‌ల‌త‌ను అడ్డుగా ప‌డుకోబెట్టాలి అనే స్టేట్‌మెంట్‌పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమ‌ల‌త తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. ఆ మాట‌ల‌ను బ‌ట్టి ఆయన ఎటువంటివారో తెలుస్తోందన్నారు. ‘ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీస జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుసు’ అని సుమలత ఫైర్ అయ్యారు. విమర్శలు చేయవచ్చు కానీ, మాట్లాడేటప్పుడు అదుపు ఉండాలన్నారు. కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు సమీపంలో గనుల తవ్వకాలతో సమస్య ఏర్పడుతోందని ఆరోపించారు. లీకేజీ జరిగే చోట మాజీ సీఎం కుమార‌స్వామినే పడుకోబెడితే సరిపోతుందంటూ రివ‌ర్స్ అటాక్ చేశారు ఎంపీ సుమ‌ల‌త‌.   

రామోజీరావును కలిసిన రేవంత్ రెడ్డి.. గాంధీభవన్ లో సందడే సందడి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. బుధవారం గాంధీభవన్ లో పార్టీ పగ్గాలు తీసుకోనున్న రేవంత్ రెడ్డి.. అందుకు ముందుగానే పార్టీ నేతలందరిని ఏకం చేస్తున్నారు. అన్ని వర్గాల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. సోమవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు పలువురు నేతలను కలిశారు. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రముఖులను కలుస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి  నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.  మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిజానికి రేవంత్ ను కలవడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదని సమాచారం. అందుకే ఇతర నేతలను కలిసినప్పటికి వీళ్లిద్దరని కలవలేదు రేవంత్ రెడ్డి. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి దూతగా రంగంలోకి దిగిన మాజీ ఎంపీ మల్లు రవి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తన సోదరుడైన భట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించారు. మల్లు రవి మంత్రాంగంతో ఇద్దరు ముఖ్య నేతలు దిగిరావడంతో.. వాళ్లను కలిసేందుకు రేవంత్ రెడ్డి వస్తున్నారని చెబుతున్నారు.   పీసీసీ ఎంత ముఖ్యమో,రాష్ట్రంలో సీఎల్పీ నాయకుడు కూడా అంతే ముఖ్యమన్నారు మల్లు రవి. వీటిలో ఏ ఒకటి లేకపోయిన పార్టీ నడవదన్నారు. భట్టి కూడా పీసీసీ కోరుకున్నా దక్కలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల స్వీకరణ కు కూడా భట్టి హాజరవుతారని చెప్పారు. రేవంత్ కార్యక్రమానికి సర్కార్, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బాగుండదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దని డీజీపీ, సీపీలను కోరారు.  ఒకవేళ ఇబ్బంది పెడితే..జైలు భరో కార్యక్రమం పెడతామని హెచ్చరించారు మల్లు రవి.  మరోవైపు  పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారానికి గాంధీభవన్ ముస్తాబైంది. పార్టీ ఆఫీసులో కొన్ని మార్పులు కూడా చేశారు. గతంలో కాంగ్రెస్ లో కీలక పదవులు అలంకరించి ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్న నేతల ఫోటోలను తొలగించారు. పీసీసీ చీఫ్ లుగా పని చేసిన కేశవరావు, డీఎస్ ఫోటోలను తొలగించారు. ఇక రేవంత్ రెడ్డికి మద్దతుగా ఐదు వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించేందుకు హైదరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులు పాల్గొనాలని నిర్ణయించారు. 

కోదండకు షర్మిల ఆహ్వానం.. రేవంత్ రాకతో మారిన వ్యూహం

ఇన్నాళ్లూ ష‌ర్మిల‌ది వ‌న్ ఉమెన్  షో న‌డిచింది. ఆమె స్పీచ్‌లు ఆమె ఇచ్చుకునేది. ఆమె చేయాల‌నుకున్న‌ విమ‌ర్శ‌లు చేసేది. ఆమె పెట్టాల‌నుకున్న స‌భ‌లు పెట్టేది. ధ‌ర్నాలు, దీక్ష‌లు, ప‌రామ‌ర్శ‌లు, ఓదార్పు యాత్ర‌లు.. అంతా ఆమె ఇష్టం. ఓ మీడియా స‌హ‌కారంతో కొన్నాళ్ల పాటు మ‌స్త్ హ‌డావుడి చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఎవ‌రూ పిల‌వ‌క‌ముందే రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ మైకు ప‌ట్టుకొని ముందుకొచ్చారు. ఎవ‌రూ అడ‌గ‌క‌ముందే తాను తెలంగాణ కోడ‌లినంటూ జ‌స్టిఫికేష‌న్ కూడా చేసేసుకున్నారు. అయితే.. ఆమె ఎంత మొత్తుకుంటున్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. రివ‌ర్స్ కౌంట‌ర్లు మాత్రం ప‌డేవికావు. రాజ‌కీయాల్లో ఒక్క విమ‌ర్శ చేస్తే.. క్ష‌ణాల్లోనే ప్ర‌తివిమ‌ర్శ‌లు దాడి చేస్తాయి. అలాంటిది.. ష‌ర్మిల ఎంత‌గా గొంతు చించుకుని అరిచినా.. ఎవ‌రికీ చీమ కుట్టిన‌ట్టు కూడా అనిపించ‌లేన‌ట్టుంది. అందుకే, ఇటు టీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ.. ష‌ర్మిల రాజ‌కీయ ఉనికిని అస‌లేమాత్రం గుర్తించ‌లేదు. సో.. ఇన్నాళ్లూ తెలంగాణ పొలిటిక‌ల్ డ‌యాస్ మీద వైఎస్ ష‌ర్మిల వ‌న్ ఉమెన్ షో జ‌బ‌ర్ద‌స్త్‌గా సాగింది.  క‌ట్ చేస్తే.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కం. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిన‌ట్టు.. రేవంత్ ప‌ద‌వి ష‌ర్మిలపై పిడుగులా ప‌డింది. వ‌చ్చీ రాగానే.. రేవంత్.. కేసీఆర్‌, బండి సంజ‌య్‌లతో పాటు ష‌ర్మిల‌నూ ఓ ఆట ఆడుకున్నారు. ష‌ర్మిల పార్టీ వెనుక కేసీఆర్‌, జ‌గ‌న్‌ల కుట్ర ఉందంటూ తేల్చేశారు. టీఆర్ఎస్‌, బీజేపీలు ష‌ర్మిల పార్టీ విష‌యంలో ప‌ట్టించుకోన‌ట్టు న‌టించినా.. దాని వెనుక వారికి లాభ‌మే ఉంద‌నే లెక్కొక‌టి వినిపిస్తోంది. ష‌ర్మిల‌తో అయితే గియితే డ్యామేజీ అంతా కాంగ్రెస్‌కే జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కాంగ్రెస్‌కు న‌ష్టం అంటే.. అది రేవంత్‌రెడ్డికి మైన‌స్‌. అందుకే, ష‌ర్మిల‌కు ఆదిలోనే పుల్‌స్టాప్ పెట్టాల‌ని.. వ‌చ్చీ రాగానే వైఎస్సార్ కూతురునూ వ‌దిలిపెట్ట‌కుండా విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో ఉండే వైఎస్సార్ అభిమానులు, రెడ్డి నాయ‌కులు, సీమ వాసులు, మైనార్టీ వ‌ర్గాలు.. రేవంత్‌రెడ్డి వైపు మ‌ళ్ల‌కుండా.. వారిని ష‌ర్మిల వైపు షిఫ్ట్ చేయాల‌నే ఎత్తుగ‌డ‌తోనే కేసీఆర్‌-జ‌గ‌న్‌లు క‌లిసి ష‌ర్మిల‌తో పార్టీ పెట్టించార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. అందుకే, చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌నే సామెత ప్రకారం.. టీఆర్ఎస్‌, బీజేపీలు ప‌ట్టించుకోకున్నా.. రేవంత్‌రెడ్డి మాత్రం ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ అటాక్‌కు దిగారు.  ఇక‌, రేవంత్‌రెడ్డి వ‌స్తే తెలంగాణ‌లో త‌న కొంప కొల్లేరు అవుతుంద‌నే టెన్ష‌న్ ష‌ర్మిల‌లో పెరిగిపోయింద‌ని అంటున్నారు. అందుకే, రాజ‌కీయంగా మ‌రింత దూకుడు పెంచారు ష‌ర్మిల‌. ఆఘ‌మేఘాల మీద ప్ర‌శాంత్‌కిషోర్ శిష్యురాలు, త‌మిళ‌నాడులో ఓ మీడియా హౌజ్ న‌డిపించే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ను త‌నకు అడ్వైజ‌ర్‌గా పెట్టుకున్నారు. ఆమె స‌హ‌కారంతో రాజ‌కీయ వ్యూహాలు ర‌చించి.. తెలంగాణ‌లో ఎద‌గాల‌ని భావిస్తున్నారు. ఇటు రేవంత్‌రెడ్డితోనే ప్రాబ్ల‌మ్ ఉంద‌ని అనుకుంటుండ‌గా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ఆమెకు మ‌రింత త‌ల‌నొప్పిగా మారిందంటున్నారు. 10 రోజులుగా నానా ర‌చ్చ న‌డుస్తుంటే.. ష‌ర్మిల ఇంత వ‌ర‌కూ జ‌ల‌జ‌గ‌డంపై నోరు విప్ప‌నే లేదు. చాలా తెలివిగా.. నాలుగు నెల‌ల క్రితం మాట్లాడిన పాత‌ వీడియోలోని త‌న ప్ర‌సంగాన్ని.. ఇప్పుడు కొత్త‌గా ట్వీట్ చేస్తూ.. తాను అదే స్టాండ్‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ కోసం ఎవ‌రితోనైనా కొట్లాడ‌తా.. ఒక్క నీటి చుక్క‌నూ వ‌దులుకోమంటూ.. ట్వీట్ చేసి.. ఇక ఇప్ప‌టికింతే సంగ‌తులంటూ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు ష‌ర్మిల‌. ఆమె మౌనం.. మ‌రింత అనుమానాస్ప‌దం అవుతోంది. ఈమెక‌స‌లు తెలంగాణ‌పై చిత్త‌శుద్ధి ఉందా.. అనే డౌట్ చాలామందిలో... అందుకే, ఆ డౌట్‌ను క్లియ‌ర్ చేయాలంటే.. తాను తెలంగాణ‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌జ‌ల‌కు అనిపించేలా.. త‌న‌పై తెలంగాణ ముద్ర మ‌రింత ప‌డేలా.. త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ష‌ర్మిల‌. జులై 8న‌.. పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా.. ప‌లువురు తెలంగాణ ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి.. వేదిక‌పై వారితో క‌లిసిపోయి.. తానూ తెలంగాణ వాదినేన‌ని అనిపించేలా ప్ర‌ణాళిక‌లు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణ‌వాదానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ లాంటి వారైన కోదండ‌రాం సార్‌ను YSRTP ఆవిర్భావ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు ఆ పార్టీ ప్ర‌తినిధులు. వీరైతే బొట్టుపెట్టి మ‌రీ పిలిచారు కానీ.. మ‌రి, సార్ వ‌స్తోరో.. రారో.. వ‌స్తే మాత్రం ష‌ర్మిల‌పై తెలంగాణ‌వాదుల‌కు కాస్త న‌మ్మ‌కం ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఇలా.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్‌తో త‌న‌ను తాను తెలంగాణ‌వాదిగా.. త‌న‌కు తెలంగాణ‌పై క‌మిట్‌మెంట్‌తో ఉన్నాన‌ని.. త‌ప్ప‌క నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వైఎస్ ష‌ర్మిల‌ది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ఎంట్రీతో ముందుముందు ష‌ర్మిల‌ రాజ‌కీయం ఇంకెంత రంజుగా ఉంటుందో చూడాలి...

చాటింగ్ చేశారు అంతే.. చితకొట్టారు..

తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పెద్ద పెద్ద తప్పులు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. కోర్టులు ఉన్నాయి. గ్రామాల్లో చేసిన తప్పును శిక్షించడానికి పంచాయితీ పెద్దలు ఉంటారు. అదే ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి ముందు ఇంట్లో వాళ్ళే శిక్షిస్తారు. అది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం.. కానీ తమ మేనమామ కొడుకుతో చెల్లెల్లు మాట్లాడుతున్నారు అని ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఎవరైనా పెళ్లి చేస్తారు.. కానీ వీళ్ళు మానవత్వం మరిచి.. మృగాళ్ల ప్రవర్తించారు. ఆ ఇద్దరు అక్కచెల్లెలు రాళ్లతో కర్రలతో దాడిచేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది మంది దాకా ఆడవాళ్లపై దాడిచేశారు.. ఏం జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మొత్తం వార్త చదవండి.  వాళ్లిదరు అక్కాచెల్లెళ్లు. రెగ్యులర్ గా తమ మేనమామ కుమారుడితో బావ మరదళ్ల సరసంగా ఫోన్‌లో మాట్లాడేవాళ్లు.. తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లలను సొంత కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా చావబాదారు.  మహిళలు, పురుషులు కలిసి అమ్మాయిల జట్టు పట్టుకున్నారు.  రాళ్లు, కర్రలతో కొడుతూ దాడి చేశారు.. ఆ దెబ్బలకు భరించలేని ఆ అమ్మాయిలు తమను క్షమించండి.. అని కాళ్ళు పట్టుకున్నారు. ఆయినా వాళ్ళు వినిపించుకోలేదు,  వాళ్ళను వదలలేదు.   వారు వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. గత నెల 22న పీపల్వా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వయసు 19, 20 సంవత్సరాలు. బాధిత యువతులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. తర్వాత ఓ యువతిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం నమోదు చేశారు. వారిపై దాడి చేసి చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలోని ఓ స్కూలు వద్ద తమను అడ్డుకున్న బాబాయి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. యువతులిద్దరినీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అత్తారింటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ మహిళను చెట్టుకు కట్టేసి తల్లిదండ్రులు, సోదరులు దాడిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

ఏపీకి కేంద్రం డబుల్ షాక్.. జగన్ రెడ్డికి ఇక చుక్కలేనా..?

మూడు నిర్ణయాలు.. ఆరు కేసులు.. పన్నెండు ఎదురుదెబ్బలు. గత రెండేండ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ పాలన ఇలానే సాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాలతో పాలన కుంటుపడిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను న్యాయస్థానాలు రద్దు చేశాయి. జగన్ రెడ్డి సర్కార్ కు చాలా సార్లు మొట్టికాయలు పడ్డాయి. కోర్టులే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి షాకులు ఇస్తూనే ఉంది. ఏపీకి ప్రయోజనం కలిగే నిర్ణయాలేవి తీసుకుపోగా.. పాత వాటికి మంగళం పాడుతోంది. గతంలో ప్రకటించిన పథకాలను వెనక్కి తీసుకుంటోంది. తాజాగా ఒకేరోజు ఏపీకి డబుల్ షాకిచ్చింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్లు కనిపించిన  మోడీ సర్కార్.. మళ్లీ  స్పీడ్ పెంచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందడుగు వేస్తోంది. రైల్వే జోన్ కూడా వాల్తేర్ బేస్ గా ఉండబోదని సంకేతాలిచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మార్చాలని చూస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రెండు నిర్ణయాలు పెద్ద షాకే.  ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల రైల్వే జోన్. అధిక ఆదాయం.. ప్రజా రవాణా, ముడిసరుకు రవాణాలోనూ ఏ మాత్రం తీసిపోదు. పెద్ద పెద్ద నగరాలకి ధీటుగా వాల్తేర్ రైల్వే ఆదాయం ఉంటోంది. ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తరాంధ్రులు రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే.. తమ కష్టాలు తీరిపోతాయని ఉత్తరాంధ్రుల ఆలోచన. 2014లో జరిగిన ఏపీ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది విశాఖ కేంద్రంగానే ఇస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం దీనికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒడిశాలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు వేగంగా పనులు పూర్తి చేస్తోందని సమాచారం. ఏపీ కోరుకున్న విధంగా వాల్తేరు డివిజన్ కు కాకుండా రాయగడ డివిజన్ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనేదీ రాకపోయినా రాయగడ డివిజన్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే వాల్తేరుకు బదులుగా రాయగడ కేంద్రంగా ఇది ఏర్పాటు కావడం ఖాయంగా తెలుస్తోంది. రైల్వే జోన్ వల్ల ఉపయోగాలు అనేకం. కొత్త ఉద్యోగాలు.. ఇక్కడి ఆదాయం ఇక్కడే కొంత వినియోగించుకునే వెసులుబాటు.. ఇక్కడి వారికి ప్రాధాన్యత.. వంటి అనేకాంశాలు ఇక్కడ కీలకంగా చెబుతున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో కొంత భాగాన్ని, దక్షిణ మధ్య రైల్వేలో కొంత భాగాన్ని తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల ఏపీకి ఏ మేరకు న్యాయం జరుగుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. విభజన హామీల్లో ఏపీకి ఇదొక ఉపశమనంగా అంతా అనుకున్నారు. కానీ.. కేంద్రం ఒడిశా రాష్ట్రానికే ఈ జోన్ తరలిస్తే.. ఇక ఏపీకి ఏం న్యాయం జరుగుతుందని ఇక్కడి వారి ప్రశ్న. కొత్త రైల్వే జోన్ ఏర్పాటైనా ఆదాయం తిరిగి రాయగడ డివిజన్ కే వెళ్లిపోతుంది.  ఇక విశాఖ స్టీల్ అంశంలో కార్మిక సంఘాలు, ప్రజల మనోభావాలను కేంద్రం పూర్తిగా పక్కనబెట్టేసింది. స్లీట్ ప్లాంట్ కార్మికులు, విసాఖ ప్రజలు, పార్టీలు చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకుండా  స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం పై పరిశీలనకి ఇద్దరు అడ్వైజర్లను నియమిస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంత చేసి.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సలహాదారుల్ని నియమించడంతో ఏపీకి షాక్ తప్పలేదు. కేంద్రం ఎంత పక్కాగా ఉందంటే.. ఈ ఇద్దరు సలహాదారుల్లో ఒకరు లావాదేవీల సలహాదారు.. మరొకరు న్యాయ సలహాదారుగా ఉన్నారు. అంటే అన్ని విధాలా ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కేంద్రం తనపని తాను చేస్తోందన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం, వాల్తేర్ డివిజన్ లేదనే సంకేతం ఇవ్వడంతో ఉత్తరాంధ్ర జనాలు మండిపోతున్నారు. విపక్షాలు కూడా ఈ అంశాలపై మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ చేతకానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. తన కేసుల కోసం జగన్.. కేంద్రానికి సరెండర్ అయ్యారని, ఏపీకి తీరని నష్టం కల్గిస్తున్నారని విపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రులతో జగన్ మాట్లాడారని చెప్పిందంటా అసత్యమేనని తేలిందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

పదేళ్ల క్రితం చూపు పోయింది.. కొవిడ్ టీకాతో మళ్లీ వచ్చింది! మహారాష్ట్రలో అద్భుతం.. 

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి మొదట చాలా మంది భయపడినా.. ప్రస్తుతం మాత్రం ఎగబడుతున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లోని జనాలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. జ్వరం వస్తుందని కొందరు, ఇతరత్రా సమస్యలు  వస్తాయనే భయంతో మరికొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం వింత, అద్భుత ఘటన వెలుగులోనికి వచ్చింది.  మహారాష్ట్రలోని వాషిమ్ కు చెందిన 10 సంవత్సరాల క్రితం ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంతో చూపు తిరిగొచ్చింది. వాషిమ్‌లోని రిసోడ్ ప్రాంతం బందర్‌వాడిలో  నివసింతే 70 ఏళ్ల మధురభాయ్ పదేళ్ల క్రితం కళ్లలో శుక్లాలు ఏర్పడటంతో చూపు కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు తిరిగొచ్చింది. జూన్ 26 న ఈ మహిళ సమీపంలో ఉన్న సమతా ఫౌండేషన్ ప్రారంభించిన టీకా కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ మొదటి డోసును తీసుకుంది. తరువాత అకస్మాత్తుగా ఈ మహిళ రెండు కళ్ళతో చూడటం ప్రారంభించింది. గత 9 సంవత్సరాలుగా కనిపించని చూపు ఒక్కసారిగా తిరిగివచ్చినట్లు తెలిపింది. ఈ విషయం విన్న అక్కడి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.టీకా తీసుకున్న రెండవ రోజు ఒక కంటిలో 30 నుంచి 40 శాతం చూపు వచ్చిందని మధురబాయి చెప్పారు. అయితే అంతకుముందు ఆమె టీకా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. బంధువుల ఒత్తిడితో ఆమె టీకా వేసుకుంది.  అయితే కొవిడ్ టీకా తీసుకోవడం ద్వారా చూపు రావడాన్ని వైద్యులు ఖండించారు. వ్యాక్సిన్‌పై లోతైన అధ్యయనం చేస్తే కానీ నిజంగా కంటి చూపు వచ్చిందా.. రాలేదా అనేది తెలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మధురబాయి జీవితంలో కాంతి వచ్చింది. అది టీకా వల్ల వచ్చిందా లేదా మరేదైనా కారణంతో వచ్చిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ ఘటనతో స్థానికులు కూడా సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 

మాన్సస్ ఆస్తులే లక్ష్యంగా విజయసాయిరెడ్డి స్కెచ్?

తస్మదీయులను తొలగించి..అస్మదీయులను అందలమెక్కిస్తే చాలు.. మన పని అయిపోతుందనుకున్నారు. అస్మదీయురాలిని పీఠంపై కూర్చోబెట్టిన దగ్గర నుంచి..ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయి..ఏ భూములున్నాయి.. ఏవి ఎలా కొట్టేయాలి అని తెగ వ్యూహాలు రచించేశారు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లు.. న్యాయస్థానం వీళ్ల అర్ధరాత్రి జీవోలను రద్దు చేయటంతో కథ మొదటికొచ్చింది. అస్మదీయురాలు పదవి పోగొట్టుకుంది...వీరి పెత్తనం పోయింది. అందుకే ఇప్పుడు ఆఖరి అస్త్రం తీశారు. విచారణ పేరుతో ఆదేశాలిచ్చారు. అక్కడ అక్రమం జరిగింది.. ఇక్కడ జరిగిందంటూ త్వరలో రిపోర్టు వస్తుంది. మళ్లీ తస్మదీయుడిని ఆ పేరుతో తొలగించేస్తారు. అక్రమాలను సరి చేసే పేరుతో భూములను ప్రభుత్వం చేజిక్కించుకునే ప్లాన్ నడుస్తోంది. ఆ తర్వాత వాటిని తమకిష్టమైనవారికి.. తమకు ఇచ్చుకున్నవారికి లీజు మీద ఇచ్చేస్తారు. ఇదంతా మాన్సస్ ట్రస్ట్ కథ. అవును... ముందు అశోక్ గజపతిని తొలగించి..సంచయితను పదవిలో కూర్చోబెట్టి.. ఆ తర్వాత వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చునుకున్నారు. అలాగే చేశారు కూడా. అటు సింహాచలం..ఇటు మాన్సస్ ఆలయాల ఆస్తులు, ఇతర వ్యవహారాలన్నీఆరా తీశారు. సింహాచలం భూములను వేలం వేయాలనుకున్నారు.. మాన్సస్ కింద ఉన్న ఓ కాలేజీ గ్రౌండ్ ను లేపేయాలనుకున్నారు. అన్నీ వేల కోట్ల విలువైన భూములే. తామనుకున్నట్లే పని అయిపోతుందనుకున్నారు. కాని హైకోర్టు వీరి జీవోలను కొట్టేయడంతో సంచయిత పదవి కోల్పోయింది. అశోక్ గజపతి రాజు మళ్లీ పదవిలోకి వచ్చేశారు. దాంతో ప్లాన్ బీ మొదలెట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇదే పని మీద కూర్చున్నట్లు చెప్పుకుంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి అయినప్పటికి..కేవలం సంతకాలకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అంతా విజయసాయిరెడ్డే నేరుగా అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ మాన్సస్ వ్యవహారాలపై వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. లేటెస్టుగా సింహాచలం దేవస్థానంతో పాటు..మాన్సస్ కింద ఉన్న అన్నిఆస్తుల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారినే విచారణాధికారిగా నియమించారు. అంటే ఇక ఆ అధికారి కూడా ఎంపీగారు చెప్పినట్లు చేయాల్సిందేనన్న మాట.  బహుశా ఇప్పటికే నివేదిక వీళ్లే టైప్ చేసి తయారు చేసేసి ఉంటారు. ఆ అధికారితో సంతకం చేయించి రిలీజ్ చేయిపిస్తారు. ఆ తర్వాత ఇక అశోక్ గజపతి రాజును తొలగించడానికి దానిని వాడతారు..నివేదికలో భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మంచిదని చెప్పిస్తారు..ఇంకేముంది భూములన్నీ ఏపీ ప్రభుత్వం చేతికి..తర్వాత వారి ద్వారా ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి..అలా భూమిని తిప్పేస్తే..వీరి ఖాతాల్లోకి డబ్బులొచ్చి పడతాయి కదా..ఇప్పుడదే ప్లాన్ నడుస్తుందని.. కొందరు ఆరోపిస్తున్నారు.

సూప‌ర్ లీడ‌ర్ రేవంత్‌.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన వాడు.. ఇక‌ అంద‌రివాడు..

ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన వాడే అస‌లైన నాయ‌కుడు. రాజ‌కీయాల్లో ఈ ఫార్ములా ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌ని చేస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఇప్పుడ‌దే చేస్తున్నారు. నెగ్గుకొచ్చే ద‌గ్గ‌ర నెగ్గుతూ.. త‌గ్గాల్సిన చోట త‌గ్గుతూ.. అస‌లైన నాయ‌కుడిగా నిరూపించుకుంటున్నారు.   కేసీఆర్‌పై నెగ్గ‌డ‌మే రేవంత్ టార్గెట్‌. అందుకే ఆయ‌న టీడీపీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో క‌మిటెడ్‌గా ప‌ని చేసి అన‌తికాలంలోనే పీసీసీ చీఫ్‌గా ఎదిగారు. తాను ముఖ్య‌మంత్రి అవుదామ‌నే కోరిక‌ కంటే కూడా.. కేసీఆర్‌ను బ‌య‌ట‌కు గుంజాల‌నే ప‌ట్టుద‌లే ఆయ‌న‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. కేసీఆర్‌పై ఎలాగైనా నెగ్గితీరాల‌ని క‌సితో కొట్లాడుతున్నారు రేవంత్‌రెడ్డి.  ఆయ‌న ల‌క్ష్యం, గ‌మ్యం ఒక్క‌టే.. అది గులాబీ బాస్‌ను దెబ్బ‌కొట్ట‌డ‌మే. అంతే త‌ప్ప ఇక త‌న‌కు మిగ‌తా ఎవ‌రితోనూ విభేదాలు లేవు, ఉండ‌వు అంటారు రేవంత్‌. అందుకే, కాంగ్రెస్‌లో అంద‌రినీ క‌లుపుకు పోతాన‌ని.. తాను అంద‌రివాడినంటూ పీసీసీ చీఫ్ కాగానే ప్ర‌క‌టించేశారు. కోమ‌టిరెడ్డి కూడా త‌మ కుటుంబ‌మేనంటూ.. పార్టీలో త‌న‌కెవ‌రూ శ‌త్రువులు లేరంటూ తేల్చి చెప్పేశారు. జ‌స్ట్ చెప్ప‌డ‌మే కాదు.. మాట‌ల‌తో పాటు చేత‌ల‌తోనూ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన అస‌లైన లీడ‌ర్ రేవంత్‌రెడ్డి కాబ‌ట్టి.  త‌న‌ను పీసీసీ చీఫ్‌గా అధిష్టానం ప్ర‌క‌టించాక‌.. ఆయ‌న క‌లిసిన వారి లిస్ట్ చూస్తే అర్థ‌మైపోతుంది రేవంత్‌రెడ్డి ఎంత‌లా త‌గ్గారో. త‌న‌ను క‌లిసే వారితో పాటు.. తాను క‌లిసే వారి సంఖ్యా భారీగానే ఉంటోంది. వారం రోజుల నుంచి రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ కార్య‌క‌ర్త‌ల‌తో, అభిమానుల‌తో కోలాహ‌లంగా ఉంటోంది. ఆ ఇంటితో పాటు ఆ వీధి వీధంతా ఒకటే జాత‌ర‌. జై రేవంత‌న్న నినాదాలతో జూబ్లీహిల్స్ హోరెత్తుతోంది. అభిమానులు, అభినంద‌న‌ల తాకిడి త‌ట్టుకోలేక‌.. వారంలో రెండు రోజులు అదికూడా సాయంత్రం 4 త‌ర్వాతే అందుబాటులో ఉంటానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు రేవంత్‌రెడ్డి. అయినా.. ఆ అభిమాన వ‌ర‌ద ఆగితేగా.. జ‌న జాత‌ర త‌గ్గితేగా. ఇక‌, కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో పాటు వివిధ వ‌ర్గాల ప్ర‌ముఖుల‌ను క‌లుసుకుంటూ.. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండాలంటూ.. తాను అంద‌రి వాడినంటూ.. అస‌లైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ కుర‌వృద్ధుడు, త‌న ప‌ద‌వికి మొద‌టి నుంచీ అడ్డుప‌డిన వీహెచ్‌ను హాస్పిట‌ల్‌కు వెళ్లి మ‌రీ క‌లిశారంటే రేవంత్ ఎంత మారిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, ష‌బ్బీర్ అలీ, రోశ‌య్య‌.. ఇలా వెట‌ర‌న్ లీడ‌ర్స్ అంద‌రి ఆశీస్సులూ తీసుకుంటున్నారు పీసీసీ చీఫ్‌.  ఇక అస‌లైన త‌గ్గ‌డ‌మంటే ఏంటో త‌న చేత‌ల‌తో నిరూపిస్తున్నారు రేవంత్‌రెడ్డి. త‌న స్థాయి కాకున్నా.. త‌న కింద ప‌ని చేయాల్సిన వారే అయినా.. అంద‌రినీ క‌లుపుకు పోవాల‌నే సంక‌ల్పంతో.. కొండా సురేఖ‌, పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి లాంటి వారి ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసి ప‌నిచేద్దామ‌ని పిలుపు ఇస్తున్నారంటే నాయ‌కుడంటే ఇలా ఉండాలి అనిపించ‌క మాన‌దు. పీజేఆర్ త‌న‌యుడిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మ‌ర్చిపోయింది.. ప‌క్క‌న పెట్టేసింది.. కానీ, రేవంత్ గుర్తు పెట్టుకున్నారు.. త‌న‌క‌న్నా చిన్న‌వాడు అయినా.. ఆయ‌న తండ్రి మీద ఉన్న గౌర‌వంతో ఇంటికెళ్లి మ‌రీ ముచ్చ‌టించి కాంగ్రెస్‌కు స‌రికొత్త త‌న‌దైన రాజ‌కీయం నేర్పుతున్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో ఎవ‌రితో క‌ల‌వ‌కుండా త‌మ ఇలాఖాలోనే పాలిటిక్స్ చేసుకొనే కొండా సురేఖ కుటుంబాన్ని సైతం కాంగ్రెస్‌లో క‌లిసిపోయేలా చేయ‌డానికి రేవంత్ చేస్తున్న కృషి అభినంద‌నీయం అంటున్నారు. ఎవ‌రి మానాన వారే రాజ‌కీయాలు చేసుకుంటూ పోవ‌డ‌మే ఇన్నేళ్లూ కాంగ్రెస్‌కు తెలిసిన ప‌ని. రేవంత్‌రెడ్డి రాక‌తో ఆ పాత అల‌వాట్ల‌న్నీ మారిపోతున్నాయి. కాంగ్రెస్ కొంగొత్త పోక‌డ పోతోంది.  తెలంగాణ‌లోనే కాదు ప‌క్క రాష్ట్రంలోనూ త‌న ఉనికిని బ‌లంగా చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. ద‌క్షిణాదిలోనే అత్యంత బ‌ల‌మైన‌, సంప‌న్న‌మైన కాంగ్రెస్‌ నాయ‌కుడైన‌ క‌ర్నాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌ను బెంగ‌ళూరులోని ఆయ‌న ఇంటికెళ్లి మ‌రీ క‌లిశారు రేవంత్‌రెడ్డి. జులై 7న త‌న ప‌ద‌వీ స్వీకార కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. డీకేలానే రేవంత్‌రెడ్డి పార్టీ సీనియ‌ర్ల‌తో త‌ల‌ప‌డి మ‌రీ.. పీసీసీ అధ్య‌క్ష‌ ప‌ద‌వి దక్కించుకున్నారు. ఇక‌, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష‌నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గేను సైతం క‌లిసి.. హైద‌రాబాద్‌లో త‌న‌ ప్రోగ్రామ్‌కి ఆహ్వానించారు. మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే.. రేవంత్‌రెడ్డికి తెలంగాణ‌లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. బెంగ‌ళూరులోనూ అంతే ఉంది. ఆ విష‌యం రేవంత్ బెంగ‌ళూరుకు వెళ్లాకే ఆయ‌న‌కు సైతం తెలిసిన‌ట్టుంది. రేవంత్‌రెడ్డి బెంగ‌ళూర్ టూర్ ఆసాంతం ఒక్క‌టే అభిమాన కోలాహ‌లం. రేవంత్ బెంగ‌ళూరు వ‌చ్చిన విష‌యం తెలిసి.. అక్క‌డ‌ ఉండే అనేక‌మంది తెలుగువారు ఆయ‌న్ను క‌లిసేందుకు త‌ర‌లిరావ‌డం.. తెలుగువారిలో రేవంత్‌రెడ్డి సూప‌ర్ హీరోగా ఎదిగార‌ర‌డానికి నిద‌ర్శ‌ణం. అందుకే అంటున్నారంతా.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన అస‌లైన నాయ‌కుడు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌గా ఇప్పుడిక అంద‌రివాడు.. కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజే మొన‌గాడు...!

ఛీర్స్‌.. బీరు ధ‌ర త‌గ్గిందోచ్‌.. ఎందుకో తెలుసా?

పెరుగుడే కానీ త‌గ్గుడు తెలీదు.. య‌డాపెడా ప‌న్నులు బాదేయ‌డ‌మే కానీ.. త‌గ్గించిన పాపాన పోరు. మందుబాబుల నుంచి ప‌న్నుల రూపంలో పైస‌లు పిండేసుకుంటారు పాల‌కులు. నోరు తెరిచి అడ‌గ‌ర‌ని అలుసో.. ఉద్య‌మాలు గ‌ట్రా చేయ‌ర‌నే ధీమానో.. కార‌ణం ఏదైనా.. స‌ర్కారు ఖ‌జానా ఖాళీ అయిన ప్ర‌తీసారి ప్ర‌భుత్వాల‌కు గుర్తొచ్చేది మ‌ద్యం మీద బాదుడే. అందుకే, ఏటేటా లిక్క‌ర్ రేట్లు అమాంతం పెరుగుతుంటాయి. అది కూడా పెట్రోల్ రేట్లు పెంచిన‌ట్టు.. కొద్ది కొద్దిగా పైస‌ల‌ల్ల కాకుండా.. ఏక మొత్తంగా ప‌దులు, వంద‌ల‌ల్ల‌నే మ‌ద్యం ధ‌ర‌లు పెంచేస్తుంటారు. ఇన్నేళ్లుగా ఇదే తంతు. కానీ, అదేందోగానీ.. స‌డెన్‌గా తెలంగాణ స‌ర్కారు మ‌ద్యం రేట్లు త‌గ్గించేసింది. ఇక పండ‌గ చేస్తోండి అంటూ 10 రూపాయ‌లు కోత పెట్టింది. ఈ త‌గ్గింపు బ్రాంది, విస్కీ, వైన్స్ మీద మాత్రం కాదు. కేవ‌లం బీరు ధ‌ర మాత్ర‌మే త‌గ్గించింది కేసీఆర్ స‌ర్కారు. ఒక్కో బీరు బాటిల్ మీద 10 రూపాయ‌ల ప‌న్ను త‌గ్గిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బీర్ మీద విధిస్తున్న స్పెష‌ల్ సెస్ 40 రూపాయ‌లు ఉండ‌గా.. దాన్ని 30 రూపాయ‌ల‌కు త‌గ్గిస్తూ తాజాగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ అర్థ‌రాత్రి నుంచే త‌గ్గిన రేట్లకు బీర్ అందుబాటులోకి వ‌స్తుంది. మ‌హాప్ర‌భు.. సీఎం కేసీఆర్‌.. బీర్‌లానే చ‌ల్ల‌గుండాలె.. అంటూ మందుబాబులు దీవిస్తున్నారు.  ఇంత‌కీ, కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ట్టుండి బీరు మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అనే అనుమానం అంద‌రికీ రాక‌మాన‌దు. ప్ర‌భుత్వ ఖజానాకు కాసులు కురిపించే మందుబాబులంటే కేసీఆర్‌కు ఎంత ఇష్ట‌మైనా కూడా.. మ‌రీ మా మీద స‌డెన్‌గా అంత ల‌వ్ దేనికోన‌నే డౌట్‌తో ఇంకో బీరు ఎక్కువే తాగుతున్నారు. కార‌ణం ఇదీ అని స‌ర్కారు స్ప‌ష్టం చేయ‌క‌పోయినా.. అబ్కారీ అధికారుల స‌మాచారం మేర‌కు అదే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  ప్ర‌స్తుత కొవిడ్‌ కాలంలో గొంతులో ఏపాటి గ‌ర‌గ‌ర అనిపించినా.. క‌రోనా కావొచ్చ‌ని జ‌నాలు హ‌డ‌లిపోతున్నారు. చిల్ల్ బీర్ తాగితే.. గొంతు ప‌ట్టేస్తే.. కొంప‌దీసి క‌రోనా ఏందీ అని బెదిరిపోతున్నార‌ట‌. అందుకే, ఎందుకైనా మంచిద‌ని మందుబాబులు బీర్ తాగ‌డం మానేశార‌ట‌. దీంతో.. గ‌త కొన్ని నెల‌లుగా తెలంగాణ‌లో బీర్ అమ్మ‌కాలు భారీగా ప‌డిపోయాయ‌ని అధికారులు చెబుతున్నారు. స‌మ్మ‌రే బీర్ సేల్స్‌కు అస‌లైన సీజ‌న్‌. అలాంటిది వేస‌విలోనే సేల్స్ లేకపోవ‌డంతో ఖ‌జానాకు పెద్ద బొక్కే ప‌డింది. ఇక‌, ఎండాకాలం అయిపోవ‌డంతో.. బీర్‌కు డిమాండ్ మ‌రింత ప‌డిపోయింది. వానాకాలంలో బీర్ తాగే వారి సంఖ్య మామూలుగా త‌గ్గిపోతుంది. ఇటు క‌రోనా ఎఫెక్ట్‌.. అటు వానల ఎఫెక్ట్‌తో.. బీర్ అమ్మ‌కాలు బోరుమంటున్నాయి. ఆ మేర‌కు ప్ర‌భుత్వానికి ఆదాయ‌మూ త‌గ్గింది. అందుకే, ఎలాగైనా జ‌నాల‌ను బీర్ తాగేందుకు ఎంక‌రేజ్ చేయాల‌నే స‌దుద్దేశ్యంతోనే.. ఒక్కో బీర్ మీద 10 రూపాయ‌లు ట్యాక్స్ త‌గ్గిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ స‌ర్కారు. ఆ విధంగానైనా రేట్ త‌గ్గి.. సేల్స్ పెరిగి.. ఆదాయం వ‌చ్చిప‌డుతుంద‌నే దురాశ ప్ర‌భుత్వానిది అంటున్నారు. కార‌ణం ఏదైనా.. చాన్నాళ్ల త‌ర్వాత మందు ధ‌ర త‌గ్గించిన మ‌హాప్ర‌భు మా కేసీఆర్ అంటూ మందుబాబులు ఫ‌స్ట్ సిప్‌కు ముందు ఇంకో చుక్క ఎక్స్‌ట్రా ప‌డేస్తున్నారు. దండాల‌య్యా సామీ... మందుబాబుల పాలిట దేవుడివ‌య్యా నువ్వు...

కేసీఆర్ ఇక బేజార్‌.. స‌మ‌రానికి సై అంటున్న ఉద్య‌మ‌కారుల ఐక్య వేదిక‌..

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముహూర్తాన, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్’ చేశారో ఏమో కానీ, ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈటల విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది. ఆయన బీజేపీలో చేరడంతో, కథే అడ్డం తిరగింది. ఈటల మీద వేటు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగానూ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మరో వంక ఈటల హుజురాబాద్ నుంచి పూరించిన ఎన్నికల సమర శంఖం కేసీఆర్’ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈటల వెంట కదిలిన కమల దళం కేసీఆర్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.  అది చాలదన్నట్లు, కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే.. ఇక్కడ పీసీసీ చీఫ్‘గా రేవంత్ రెడ్డి ఒకడు మోపడైండు. గొంతులో పచ్చి వెలక్కాయ లెక్క రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి కూర్చున్నాడు. మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అసలే ఫైర్ బ్రాండ్ ఆపైన పీసీసీ చీఫ్‌. అందుకే కేసీఆర్ ఇప్పటికే కాలికి బలపం కట్టుకుని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 7వ తేదీన రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవచ్చును. అటు ఈటల, బండి సంజయ్.. ఇటు రేవంత్ బ్యాండ్ బజాయిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అయోమయంలో పడిపోయింది. ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు అయోమయంలో చిక్కుకు పోయారు.  అది అలా ఉంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కారులంతా ఏకమై కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన, చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు సిద్దమవుతోంది.. రాజకీయాలకు అతీతంగా, కేసీఆర్ గడీల‌ పాలన అంతమొందించడమే లక్ష్యంగా జూలై 9న హైదరాబాద్’లో ఉద్యమ కారుల ఐక్య వేదిక పురుడు పోసుకుంటోంది. నిజానికి, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంగా పక్షం రోజులకు పైగానే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ వర్గాల నేతలంతా ఏకమవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కేసీఆర్ వమ్ము చేశారని ఆరోపిస్తున్న ఉద్యమకారులు..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఉమ్మడి వేదిక నిర్మించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు  హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్’లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్’ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరిగి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉద్యమకారుల కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు.  అంతే కాదు, హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంగా వేదిక నిర్మాణం జరుగుతున్నా.. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని ఉద్యమ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి ఈటల కంటే ముందు కూడా కేసీఆర్, అనేక మంది ఉద్యమ నాయకులను కరివేపాకు లెక్క తీసి పారేసారు. అయినా, రావాల్సిన‌ స్థాయిలో ప్రజల నుంచి ప్రతిఘటన రాలేదు. ఆ  ధైర్యంతోనే కావచ్చు కేసీఆర్ ఈటలను ఎరేశారు. కానీ, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ..