రెండేళ్లుగా ఇంటి పన్ను బాకీ.. జగన్ కు రూల్స్ వర్తించవా!
posted on Jul 1, 2021 @ 2:32PM
సామాన్యుల్లో ఎవరికైనా వంద లేదా 200 గజాల్లో ఇల్లు ఉండి.. దానికి ఆస్తిపన్ను సరిగ్గా కట్టకపోతే ఏం జరుగుతుంది? పెనాల్టీలు, దానిపై వడ్డీలు, చక్రవడ్డీలు వేసి వసూలు చేస్తారు. నోటీసులు అంటిస్తారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు ఆపేస్తారు. పన్ను కట్టాలంటూ ఇంటి దగ్గరకు అధికారులు వెళ్లి నానా హంగామా చేస్తారు. చెత్తను ఆ ఇంటి ముందు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అధికారుల చేసే ఈ జులూం అంతా పేదలు, మధ్య తరగతి ప్రజలపైనే కనిపిస్తుంది... పెద్దల జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు.. ఏపీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రభుత్వ పెద్దే ఇంటి పన్ను కట్టని వైనం సంచలనంగా మారింది. అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది...
ఇటీవలే జగన్ రెడ్డి సర్కార్ పన్నులు పెంచింది. అసలే కొవిడ్ తో సమస్యలు పడుతున్న జనాలకు ఇది మరింత భారంగా మారింది. పన్నులు పెంచడం సరికాదని విపక్షాలు మొత్తుకుంటున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించారు. అయితే జనాలపై ఇష్టమెచ్చినట్లుగా పన్నులు విధించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి మాత్రం.. తన సొంత ఇంటికి పన్ను కట్టడం మరచిపోయారు. ఏదో ఒక నెలో.. రెండు నెలలో కాదు.. ఏకంగా గత రెండేళ్లుగా జగన్ ఇంటికి పన్నులు కట్టడం లేదు .గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీకి జగన్ 16లక్షల రూపాయలపై పైగా బాకీ పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. తాడేపల్లి మునిసిపల్ శాఖ అధికారిక వెబ్సైట్లో ఇది స్పష్టంగా ఉంది. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు.
ముఖ్యమంత్రి జగన్కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. మునిసిపల్ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇక... ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసంఉంది. దీని డోర్ నంబర్ 12-353/2/5. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి... ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది.
మునిసిపల్శాఖ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే... మునిసిపల్ శాఖకు జగన్ రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. ఏళ్ల తరబడి పన్నులు కట్టకుండా ఉంటే మునిసిపల్ శాఖ ఊరుకోదు కదా.. ఆటోమేటిక్గా పెనాల్టీలు పడతాయి. ఆ జరిమానా రూ.2,82,103. వెరసి అసలూ, జరిమానాలు కలిపి భారతీ రెడ్డి మునిసిపల్ శాఖకు రూ.16,67,299 బాకీ పడ్డారు.
జగన్ ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే… దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ… జగన్ ఇల్లు, సీఎం క్యాంపు ఆఫీసు…ఉన్న భవనాలు ఆయన సతీమణి భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయి. రూల్స్ ప్రకారం ప్రైవేటు నివాసాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటే సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలి. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లుకు పన్ను భారతీ రెడ్డి చెల్లించాలి. సామాన్యులు ఇంటి పన్ను కట్టకుంటే నోటీసులు పంపి నానా యాగీ చేసే అధికారులు… ఇప్పటిదాకా భారతీ రెడ్డికి కనీసం నోటీసులు జారీ చేయకపోవడమే విస్మయం కల్గిస్తోంది.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఆఫీసు, ఇంటి నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను కట్టడంలేదు. సీఎం అయ్యారు కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేదని... ఆయన నివాసం, కార్యాలయానికి ప్రభుత్వమే పన్ను చెల్లించాలని ఎవరైనా అనుకోవచ్చు. కానీ... అది కుదరదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్కు వేతనం, ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఖజానా నుంచి లభిస్తాయి. ఆయన తరఫున ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లిస్తుంది. ఒకవేళ ఆయన ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే... దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ... జగన్ ఉంటున్నది ప్రైవేటు భవనాలలో. సర్కార్ నిబంధనల ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లు కొలువుదీరిన భవనాలకు వైఎస్ భారతీ రెడ్డి పన్ను చెల్లించాలి.