మోడీ.. యుద్దానికి సిద్దం కండి! సుభ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు 

రెండు దశాబ్దాల తర్వాత అఫ్గానిస్థాన్.లో తాలిబన్’ ప్రభుత్వం ఏర్పడింది. రక్తం చుక్క చిందకుండా తాలిబన్లు కాబూల్ ను వసపరచుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు  అష్రఫ్ ఘని దేశం విడిచిపారిపోయారు. మరో వంక ఆఫ్ఘన్ ప్రజలు దేశం వదలి పారి పోతున్నారు. భయం లేదు రండి మీ ఉద్యోగాలు మీరు, మీ వ్యాపారాలు మీరు చేస్కొండి అని తాలిబాన్ నాయకులు అభయమిచ్చినా బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని, దేశ, విదేశీ ప్రజలు చిక్కిన విమానం పట్టుకుని పరుగులు తీస్తున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది, ఈ రోజు (ఆగష్టు 17) 200 మందికి పైగా ప్రయాణీకులతో తొలి  విమానం కాబూల్ నుంచి ఆహ్మదాబాద్ చేరుకుంది.  సంచలనాలకు చిరునామాగా నిలిచే బీజేపీ ఎంపీ, సుభ్రమణ్య స్వామి ఆఫ్ఘన్’ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్’లో తాలిబన్’ రాజ్యం ఏర్పాటు  మన దేశానికి పెను ముప్పుగా పరిణమిస్తుందని స్వామి హెచ్చరిస్తున్నారు. రక్తపాత రహితంగా  అధికారం హస్తగతం చేసుకున్న తమ పాలనను ప్రపంచ దేశాలు గుర్తించాలని తాలిబన్ నాయకుల విజ్ఞప్తిని మన దేశం  నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మరోవంక పాకిస్థాన్ , చైనా తాలిబన్ ప్రభుత్వాని గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో మన దేశానికి, తాలిబన్ల నుంచి ఈరోజు కాక పొతే రేపైనా ముప్పు తప్పదని, అంతవరకు ఆగకుండా ముందుగా మన దేశమే ఆఫ్ఘానిస్థాన్/ తాలిబన్ల పై యుద్దానికి సిద్దం కావాలని స్వామి ప్రధాని మోడీకి సూచించారు. అలాగే, తాలిబన్ వ్యతిరేక శక్తులకు మన దేశం  ఆశ్రయం కల్పించి, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘ను స్వాదీన పరచుకోవడం అటు ఆఫ్ఘన్’లో తాలిబన్లను అణచివేయాలని సుభ్రమణ్య స్వామి సూచించారు. మన దేశం  ఒక్క సుభ్రమణ్య స్వామి మాత్రమే కాదు, బీజేపీ మాజీజాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ కూడా యుద్ధం ప్రస్తావన లేకుండా అఫ్గానిస్థాన్-తాలిబన్ల విషయంలో భారత ప్రభుత్వం తన వ్యూహాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, విశ్రాంత సైనిక అధికారి, ఏఆర్కే రెడ్డి, కూడా ఒక టీవీలతో మాట్లాడుతూ, కాబూల్ తాలిబన్’ వశం కావడంతో మన దేశానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. తాలిబన్ల సహాయంతో పాకిస్థాన్ మన దేశంలో అంతర్గత తీవ్ర వాదాన్ని పొంచి పోషించే ప్రమాదం ఉందని అయన అభిప్రాయ పడ్డారు.  అయితే ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడంతో పాటుగా ఆదేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఉదారంగావ్యవహరిస్తూ వచ్చిన మన దేశం తాజా పరిణామాలను,  వేగంగా మారుతున్నా పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోందని, ముందు అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్తి పెట్టిందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

గాంధీ ఆస్పత్రిలో అసలేం జరిగింది? గ్యాంగ్ రేప్ నిజమేనా? మిస్సైన మహిళ ఎక్కడ? 

తెలంగాణలో పెద్దాస్పత్రిగా పిలుచుకునే గాంధీ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెళ్లపై ఆసుపత్రిలో సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తాను గాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి ఆస్పత్రి సెల్లార్లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది.  ఈ ఘటనపై గాంధీ హాస్పిటల్ అధికారులతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునాత్ లక్ష్మారెడ్డి గాంధీ హాస్పటిల్ ను సందర్శించి వివరాలు సేకరించారు. హాస్పిటల్ సూపరింటెండ్ రాజారాను అడిగి వివరాలు తీసుకుంది. గాంధీ హాస్పిటల్ లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. గాంధీ హాస్పిటల్ లో డార్క్ రూమ్స్ లేవని, గ్యాంగ్ రేప్ జరిగే అవకాశాలు లేవని రాజారావు చెబుతున్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన నర్సింహులు మూత్రపిండాల సమస్యసతో బాధపడుతూ ఈ నెల 4వ తేదీన గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనతో పాటు భార్య ఆమె చెల్లి కూడా వెంట వచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు వాళ్ల ఊరే. అయితే అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్ మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత ట్రీట్ మెంట్ జరిగింది. కానీ తీరా అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య చెల్లెలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు నర్సింహులు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్రూమ్ అసిస్టెంట్గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు. ఈ నెల 9వ తేదీన పేషెంట్ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని తెలియడంతో వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో 11వ తేదీన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారంనాడు బాధిత మహిళ కుమారుడికి ఫోన్ చేసిన ఉమామహేశ్వర్ ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో మీపిన్ని ఉంది అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందన్నాడు. తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు. హైదరాబాద్ లో మిస్సయిన నర్సింహులు మరదలు మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తేలింది. ఏం జరిగింది అని ప్రశ్నిస్తే తనను తన అక్కను కిడ్నాప్ చేశారని కొందరు లైంగికంగా వేధించారని అత్యారానికి పాల్పడ్డారని చెప్పింది. ఏదోలా వాళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డానని ఏడుస్తూ చెప్పింది. అయితే హాస్పిటల్ లో మిస్సయిన ఆమె అక్క జాడ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్నగర్లో జీరో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి కేసును హైదరాబాద్లోని చిలకలగూడ స్టేషన్కు మార్చారు నర్సింహులు భార్యకు ఆమె చెల్లెల్లికి కల్లు తాగే అలవాటు ఉంది. ఉమామహేశ్వర్ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారని చెబుతున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. మర్నాడు వారిద్దరినీ సెల్లార్లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు ఇంకా ఎవరన్నదానికోసం ఎంక్వైరీ జరుగుతోంది.  ఇంకా జాడలేని నర్సింహులు భార్య కోసం కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 

తాలిబాన్లతో మనకు ఎంతవరకు ముప్పు?

ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాకతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. అయితే ప్రపంచ దేశాల ఆందోళన ఒక ఎత్తయితే.. భారతీయుల ఆందోళనంతా మరో ఎత్తు. ఎందుకంటే తాలిబాన్ల ప్రభావం ఇతర దేశాల కన్నా మన మీదే ఎక్కువ ఉంటుంది. దాదాపు 20 రోజుల క్రితం ఖతార్ లో జరిగిన సమావేశాల్లో అమెరికా, చైనా, రష్యా, పాక్ దేశాల స్పందనలు ఇండైరెక్టుగా తాలిబాన్లతో అనధికార సంధిలాగానే జరగడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. తమ సైన్యం కాబూల్ ను ఖాళీ చేస్తుందని, ఎవరి మీదా తుపాకులు ప్రయోగించరాదని అమెరికా చెబితే.. తాలిబాన్ల అధికారానికి తమవంతు సహకారం అందిస్తామని చైనా, రష్యాలు ప్రకటించాయి. ఇక ఆ పరిణామం పాకిస్తాన్ కైతే ఎగిరి గంతేసే వార్తలా మారింది. అయితే భారత్ మాత్రం ఎక్కడా తాలిబాన్లకు సపోర్టుగానీ, వ్యతిరేకంగా గానీ మాట్లాడలేదు. దీన్నిబట్టి తాలిబాన్ల రాకడ భారత్ మీదే ఉంటుందనేది కాదనలేని వాస్తవమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  తాలిబాన్లు పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లోంచి కాబూల్ కు రావడం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాల్లో తాలిబాన్లు సేఫ్ గా, ట్రెయినింగ్ పొందుతూ ఉండడం గమనించాలంటున్నారు. ఇప్పటివరకూ తాలిబాన్లకు మద్దతంతా పాకిస్తాన్ నుంచే జరిగింది. పాక్ లోని ఐఎస్ఐ ఏజెంట్లు, మాజీ ఆర్మీ అధికారులు, మత బోధకులు, మదరసాల్లో చదివిన కుర్రకారు, గంజాయి అక్రమ రవాణా చేసుకొనే చిల్లర గ్యాంగులు.. ఇలా వీరి నుంచే రిక్రూట్మెంట్లు జరిగాయి. శిక్షణ అందిస్తున్నది కూడా పాక్ మాజీ సైన్యాధికారులేనని గమనించాలి. ఇంతక్రితం వరకు ఆఫ్ఘనిస్తాన్ మనకు ఓ మిత్ర దేశంగానే ఉండేది. కానీ తాలిబాన్ల కైవసం అయిపోయాక మన స్టాండ్ ఏంటో మరోసారి నిర్ధారించుకోవాల్సి వచ్చింది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా తప్పుకోవడం అనేది అమెరికా ఓటమిగా కాక పాక్ గెలుపుగానే అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. అక్కడ త్వరలో ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో ఎవర్ని ఏ శాఖలో పెట్టాలో పాక్ లోనే చర్చ జరుగుతున్నట్టు అంతర్జాతీయ వేదికల ద్వారా తెలుస్తోంది. అంటే పాక్ తనకు ఏం కావాలో ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాల ద్వారా నిర్దేశించబోతోందన్నమాట. అంటే ఇప్పటిదాకా మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ రేపట్నుంచి పాక్ మిత్రదేశంగా అంటే మనకు పక్కా శత్రుదేశంగా మారబోతోందన్నమాట. ఇకపై పాక్ ద్వారా జరిగిన చొరబాట్లు రేపట్నుంచి ఆఫ్ఘనిస్థాన్ నుంచి కూడా జరుగుతాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సింది భారతే  తప్ప మరో దేశం కాదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.  ఇప్పటికే ఏ దేశంలో కన్నా భారత్ లోనే విపరీతమైన మత స్వేచ్ఛ ఉంది. ఇస్లామిక్ శక్తుల స్వైర విహారం కూడా ఇక్కడే అధికంగా ఉంది. ఫ్రాన్స్ వంటి పలు పాశ్చాత్య దేశాలు బుర్ఖా బ్యాన్ చేశాయి. మసీదుల్లోంచి ఆంప్లిఫయర్ల్ ద్వారా అజాన్ మీద కూడా నిషేధం నడుస్తోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఓ చర్చగా మారుతోంది. మరోవైపు తాలిబాన్లు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పాగా వేశారన్న విషయం గమనించాలి. 20 ఏళ్లుగా చాపకింద నీరులా తీవ్రవాదులతో కనెక్ట్ అయి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఈ మధ్యే హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. దర్భంగాలో సంభవించిన పేలుడుతో ఈ విషయం తేటతెల్లమైంది. ఆ ఇద్దరు వ్యక్తులు తాలిబాన్లతోనే కనెక్ట్ అయి ఉన్నారు. కరీంనగర్, కర్నాటక, భైంసా, దర్భంగా, సీఏఏ వ్యతిరేక ర్యాలీలు.. ఇవన్నీ తాలిబాన్ శక్తులకు ప్రోత్సాహకాలే తప్ప మరోటి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తాలిబాన్లతో చర్చలు జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ డిమాండ్ చేస్తుండడం కూడా గమనార్హమే. ప్రపంచ ప్రజలంతా తాలిబాన్ పాలనను ఈసడించుకుంటుండగా.. అసదుద్దీన్, శశిథరూర్ సహా... మేధావుల ముసుగులో ఉన్న కొందరు అతి ప్రజాస్వామికవాదులు కూడా తాలిబాన్ ఛాయలను స్వాగతిస్తుండడం భారత్ కు ప్రమాదకరమేనంటున్నారు.  రెండేళ్ల క్రితం జరిగిన 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ సంస్కరణలు అమలు చేస్తున్నారు. టూరిజాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నిర్మాతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నిర్మాతలను కూడా ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు వేడుకలు కూడా కాశ్మీర్ వ్యాలీ అంతటా ఘనంగా జరిగాయి. అయితే మన దేశంలో పెరుగుతున్న సుహృద్భావ వాతావరణాన్ని ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలు కచ్చితంగా ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఏ దిశగా అడుగులు వేస్తుందో వేచిచూడాల్సిందే.

ఇదే లాస్ట్ ఛాన్స్.. ఏపీ సర్కార్ పై సీజేఐ సీరియస్

దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన , న్యాయ వ్యవస్థను కలవరపరిచిన ధన్‌బాద్ జడ్జి హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై  ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయని రాష్ట్రాలపై లక్ష జరిమానా వేస్తామని, చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా జడ్జిలు, న్యాయవాదులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి రక్షణ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆ రాష్ట్రాలపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్‌ల దాఖలుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ ఆదేశించారు. ఇదే చివరి ఛాన్స్ అని కూడా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.   

రంగంలోకి ఇండియ‌న్ జేమ్స్‌బాండ్‌.. కాబూల్‌లో భార‌తీయులు సేఫ్‌..

తాలిబ‌న్లు అఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించేసుకున్నారు. రాజ‌ధాని కాబూల్‌ను భారీ బ‌ల‌గాలు, ఆయుధాల‌తో చేజిక్కించుకున్నారు. ప్రెసిడెంట్ ప్యాలెస్‌లోకి చొర‌బ‌డి.. తాలిబ‌న్ల రాజ్యం ప్ర‌క‌టించేసుకున్నారు. మ‌రి, కాబూల్‌లో ఉండే భార‌తీయుల ప‌రిస్థితి ఏంటి? రాయ‌బార కార్యాల‌యంతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో ప‌ని చేస్తున్న ఇండియ‌న్స్ సేఫ్‌గా తిరిగొచ్చేది ఎలా? అస‌లే, తాలిబ‌న్ల‌కు హిందువులంటే ధ్వేషం. ఆ ముష్క‌ర మూక‌లు ఎలాంటి దుందుడుకు చర్య‌ల‌కు దిగుతారేమోన‌నే భ‌యం అక్క‌డి భారతీయుల‌ను వెంటాడింది. విష‌యం తెలిసి.. ఇండియ‌న్ ట్ర‌బుల్ షూట‌ర్.. భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ వెంట‌నే రంగంలోకి దిగారు. త‌న‌దైన స్టైల్‌లో మంత్రాంగం నెరిపారు. క‌ట్ చేస్తే.. 24 గంటల్లో దాదాపు 200 మంది ఇండియ‌న్స్ అఫ్ఘ‌న్ నుంచి సుర‌క్షితంగా ఇండియాకు తిరిగొచ్చారు.  తాలిబ‌న్ల దాడితో ఆఫ్ఘ‌నిస్తాన్ ఆర్మీ చెల్లాచెదురైంది. పోలీసులు ప‌త్తా లేకుండా పోయారు. అక్క‌డ భ‌ద్ర‌తా బ‌ల‌గాల జాడే లేదు. మ‌రి, కాబూల్‌లోని భార‌తీయుల‌కు ర‌క్ష‌ణ ఎలా? ఉన్న‌ది ఒక‌టే మార్గం. కాబూల్ విమానాశ్ర‌యంలోని కొంత భాగం అమెరిక‌న్ ఆర్మీ గుప్పిట్లో ఉంది. ఆ ఒక్క పాయింట్‌ను బేస్ చేసుకొని.. అజిత్ దోవ‌ల్ ఇండియాలో ఉండి.. అమెరికాతో మాట్లాడి.. అఫ్ఘ‌న్‌లో చ‌క్రం తిప్పారు.  ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వ‌దేశానికి తీసుకురావడానికి.. భారత దేశ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సులివన్‌తో చర్చలు జరిపారు. వీరిద్దరి చర్చల అనంతరం భారతీయులను కాబూల్ విమానాశ్రయంలోని అమెరికన్ సెక్యూరిటీ జోన్‌లోకి తీసుకున్నారు,  క్షేత్ర స్థాయిలోని అమెరికన్ అధికారులతో సమన్వయం కుదుర్చుకుని, కాబూల్ విమానాశ్రయంలో భారత సీ-17 విమానాలు దిగడానికి అనుమతి పొందారు. సోమ, మంగళవారాల్లో రెండు సీ-17 విమానాలు కాబూల్ నుంచి ఇండియా వ‌చ్చాయి. 46 మందితో ఓ విమానం సోమవారమే భారత్‌కు చేరుకుంది. 120 మందితో మరొక విమానం మంగళవారం రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  సింపుల్‌గా ఉన్నా.. ఈ ఎపిసోడ్ అంతా ఉత్కంఠ‌భ‌రితంగా సాగిందంటున్నారు. స్థానిక సంక్లిష్ట ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డి.. అమెరికన్‌ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ల‌డం.. సుర‌క్షితంగా విమానం ఎక్కడం వ‌ర‌కూ.. ప్ర‌తీ ద‌శ‌లోనూ అజిత్ దోవ‌ల్ ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి వారిని గైడ్ చేస్తూ వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ క్రెడిట్ అంతా దోవ‌ల్‌కే చెందుతుంద‌ని చెబుతున్నారు. అందుకే.. అజిత్ దోవ‌ల్ భార‌త‌ ట్ర‌బుల్ షూట‌ర్‌.. ఇండియ‌న్ జేమ్స్‌బాండ్‌.

వైసీపీ ఎంపీ తండ్రిని విచారించిన సీబీఐ.. వివేకా హత్య కేసులో ట్విస్ట్ 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. రోజుకో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. రెండు రోజుల క్రితం వైఎస్ ప్యామిలీలో పెద్దగా చెప్పుకునే ప్రతాప్ రెడ్డిని విచారించింది సీబీఐ. తాజాగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ విచారించడం కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసులో మొదటి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. వాచరణలో భాగంగా 72వ రోజు మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య వెనుక ఏఏ కారణాలు ఉన్నాయని అధికారులు విచారించారు. రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు మొదటగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటి సారిగా పిలిపించారు. మొదటి నుంచి భాస్కర్ రెడ్డి విచారణకు వస్తారా, రారా.. అని ప్రజలతో పాటూ వైఎస్ సునీత కూడా భావిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో కొన్ని రోజుల నుంచి కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసులో సెంట్రల్ జైల్‌లో ఉన్న అనుమానితుడు సునిల్ నుంచి, కీలక సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. సునిల్ తమ్ముడు కిరణ్ మాట్లాడుతూ సింహాన్ని సింహమే చంపుతుంది కానీ.. చిట్టెలుకలు చంపుతాయా అని వాపోయారు. ఈ కేసు వెనుక ఉన్న పెద్దవారి పేర్లను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో సీబీఐకి చెందిన మరో విచారణ బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. వీరిలో భరత్ కుమార్ సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ కు బంధువు అవుతారు. జగదీశ్వర్ రెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు.

బండిగా, గుండుగా.. అని తిట్టినా భ‌రిస్తారా? బీజేపీలో విభేదాలా? వ్యూహాత్మ‌క మౌన‌మా?

పండిన చెట్టుకే రాళ్ల దెబ్బ‌ల‌న్న‌ట్టు.. ఈమ‌ధ్య తెలంగాణ బీజేపీపై వ‌రుస దాడులు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. మునుపు దూకుడే మంత్రంగా దూసుకుపోయిన క‌మ‌ల‌నాథులు ఈసారి వ్యూహాత్మ‌కంగా సంయ‌మ‌నం పాటిస్తున్న‌ట్టున్నారు. రెచ్చ‌గొట్టి.. సైడైపోతున్నారే గానీ.. అదే ప‌నిగా రెచ్చిపోవ‌డం లేదు. ప‌లు సంద‌ర్భాల్లో కాషాయ‌వాదుల బిహేవియ‌ర్ ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. కాస్త జాగ్ర‌త్త‌గా విశ్లేషిస్తే.. మొద‌ట్లో ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయినా.. ఆ వెంట‌నే తేరుకొని.. మ‌రింత కిరికిరి కాకుండా గ్రేట్ ఎస్కేప్ అవుతున్నార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఈ వ్యూహం బీజేపీకి బాగా క‌లిసొస్తోంద‌ని కూడా చెబుతున్నారు. తాజా, మైనంప‌ల్లి ఎపిసోడ్‌తో మ‌రోసారి క‌మ‌ల‌నాథులు చ‌ర్య‌-ప్ర‌తిచ‌ర్య‌ల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ న‌డుస్తోంది.  జెండావంద‌నానికి వ‌స్తే.. మ‌ల్క‌జ్‌గిరి బీజేపీ కార్పొరేట‌ర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు మ‌నుషులు దాడి చేసి కొట్టార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అరుపులు, కేక‌లు, కార్పొరేట‌ర్ చొక్కా చిరిగిన విజువ‌ల్స్ బాగానే వైర‌ల్ అయ్యాయి కానీ, దాడి దృశ్యాలు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం కాస్త అనుమానాస్ప‌దం. ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. ఎంత ధైర్యం మా కార్పొరేట‌ర్‌నే కొడ‌తారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వెంట‌నే మ‌ల్కాజ్‌గిరిలో వాలిపోయారు. గ‌తంలో జ‌న‌గాంలో బీజేపీ యువనేత‌ను పోలీసులు లాఠీల‌తో చిత‌క‌బాదితే కూడా వెంట‌నే జ‌న‌గాంలో ప‌ర్య‌టించి వారిలో ధైర్యం నూరిపోశారు బండి సంజ‌య్‌. దుబ్బాల ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇలానే స్పందించారు రాష్ట్ర అధ్య‌క్షుడు. బండి సంజ‌య్ వ‌చ్చాక సామాన్య‌ కార్య‌క‌ర్త‌కు సైతం ద‌ళ‌ప‌తి నుంచి బ‌ల‌మైన అండా-దండా ల‌భిస్తోంది. మ‌ల్కాజ్‌గిరిలోనూ అదే జ‌రిగింది. బీజేపీ కార్పొరేట‌ర్‌ను ప‌రామ‌ర్శించి.. ఎమ్మెల్యే మైనంప‌ల్లిపై నోరు పారేసుకున్నారు బండి. ఫాల్తుగా అని తిడుతూ.. మ‌ర్డ‌ర్‌లు, క‌బ్జాలు బ‌య‌ట‌పెడ‌తానంటూ మైనంప‌ల్లికి వార్నింగ్ ఇచ్చారు సంజ‌య్‌.  బండి ఓ మోస్తారుగా తిడితే.. జ‌గ‌మొండి మైనంప‌ల్లి ఓ రేంజ్‌లో సంజ‌య్‌పై విరుచుకుప‌డ్డారు. అరేయ్ బండిగా.. గుండుగా.. కొజ్జాగా.. వుమెనైజ‌ర్‌.. కార్పొరేట‌ర్ స్థాయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయి.. క‌రీంన‌గ‌ర్ గ‌డ్డ‌పై చూసుకుందాం.. అంటూ బండి సంజ‌య్‌పై తిట్ల‌దండ‌కం అందుకున్నారు ఎమ్మెల్యే మైనంప‌ల్లి. మామూలుగానైతే బీజేపీ అధ్య‌క్షుడిని ఈ రేంజ్‌లో కుమ్మేస్తే.. క‌మ‌ల‌నాథులు ఆ మ‌ర్నాడు అల్ల‌క‌ల్లోల‌మే చేసేవారు. అయితే.. పెద్ద‌గా ర‌చ్చేమీ జ‌రిగిన‌ట్టులేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త కౌంట‌ర్ ఇచ్చారు. మిగ‌తా బీజేపీ పెద్ద‌లెవ‌రూ పెద్ద‌గా స్పందించ‌లే. మైనంప‌ల్లిపై విరుచుకుప‌డ‌లే, త‌మ నాయ‌కుడికి మ‌ద్ద‌తుగా నోరు మెద‌ప‌లే. అక్క‌డ‌క్క‌డా జిల్లాల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లకు దిగినా.. అవి ఎదురుదాడి స్థాయిలో జ‌ర‌గ‌లే. ఇదే ఇప్పుడు అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. బీజేపీ అధ్య‌క్షుడు ఒంట‌రివాడు అయ్యారా? ఆయ‌న‌కు మిగ‌తా పార్టీ నాయ‌కులు అంత‌గా స‌హ‌క‌రిస్త‌లేరా? లోలోన మంచిగైంద‌ని ఖుషీ అవుతున్నారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు.  అయితే, బీజేపీలో అలాంటి లుక‌లుక‌లు ఏమీ లేవ‌ని అంటున్నారు. ఎందుకంటే.. మైనంప‌ల్లి విమ‌ర్శ‌ల‌పై బండి సంజ‌య్ సైతం స్పందించ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మ‌క మౌన‌మేనంటున్నారు. గ‌తంలోనూ జ‌రిగిన కొన్ని ప‌రిణామాల‌ను గుర్తు చేస్తున్నారు. ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ హిందూదేవుళ్ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిజ్ఞ చేసిన‌ప్పుడు సైతం మొద‌ట‌గా బండి సంజ‌య్ ఆరోప‌ణ‌లకు దిగారు. స్వేరోస్ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది.. ఏకంగా బండి వాహ‌నంపైనే దాడి జ‌రిగింది. అయినా, క‌మ‌ల‌నాథులు రెచ్చిపోలేదు. అప్ప‌టివ‌ర‌కూ హంగామా చేసిన బీజేపీ వెంట‌నే మౌనం పాటించింది. ఇష్యూని పెద్ద‌ది చేయ‌లేదు. దీంతో.. రెండు మూడు రోజుల్లోనే స్వేరోస్ వ‌ర్సెస్ బీజేపీ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ ప‌డింది.  అటు, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే.. బండి.. గుండు అంటూ సంజ‌య్‌పై, అర్వింద్‌పై అటాక్‌కు దిగారు. రేవంత్‌రెడ్డి ఎంత క‌వ్విస్తున్నా.. ఎక్క‌డా క‌మ‌ల‌నాథులు క‌య్యానికి కాలు దువ్వ‌డం లేదు. కామ్‌గా అన్నీ మూసుకొని బ‌రిస్తూ వ‌స్తున్నారు. ఇలా.. మైనంప‌ల్లి, స్వేరోస్‌, రేవంత్‌రెడ్డి.. ఏ ఇష్యూలోనూ బీజేపీ కానీ, బండి సంజ‌య్ కానీ మునుప‌టి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌కుండా.. చాలా వ్యూహాత్మ‌కంగా సైడ్ అయిపోతున్నారు. ఇదే కొన్ని రాజ‌కీయ వ‌ర్గాలను క‌న్ఫ్యూజ్ చేస్తోంది. దూకుడు బేస్ మీద‌నే బండిని రాష్ట్ర అధ్య‌క్షుడిని చేశారు. అలాంటిది.. బండి సంజ‌య్‌నే ప‌ట్టుకొని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు అంత తిడుతున్నా.. అటాక్ చేస్తున్నా.. మౌనం పాటించ‌డం వెనుక పెద్ద రీజ‌నే ఉందంటున్నారు.  బీజేపీ మెయిన్‌ టార్గెట్‌.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం. క‌మ‌ల‌నాథుల ప్ర‌ధాన ల‌క్ష్యం.. సీఎం కేసీఆర్‌ను రాజ‌కీయంగా దెబ్బ  తీయ‌డం. అంతేగానీ, స్వేరోస్‌తో గొడ‌వ ప‌డితే వారికొచ్చే లాభ‌మేమీ లేదు. రేవంత్‌రెడ్డి నోట్లో నోరు పెడితే..  న‌ష్ట‌మే త‌ప్ప ఉప‌యోగ‌మేమీ ఉండ‌దు. ఇక మైనంప‌ల్లి లాంటి ఎమ్మెల్యే స్థాయి లీడ‌ర్‌తో.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు త‌ల‌ప‌డితే.. అది బండి ఇమేజ్‌కే డ్యామేజ్‌. అందుకే, మైనంప‌ల్లి ప‌ర్స‌న‌ల్‌గా అంత‌గా తిట్టినా.. తుడిచేసుకొని మౌనంగానే ఉన్నారు కానీ.. మ‌ళ్లీ కౌంట‌ర్ అటాక్ మాత్రం చేయ‌లేద‌ని చెబుతున్నారు. బీజేపీ కానీ, బండి సంజ‌య్ కానీ.. నేరుగా సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీతో మాత్ర‌మే క‌ల‌బ‌డాల‌ని డిసైడ్ అయిన‌ట్టున్నారు. అందుకే, చిన్నాచిత‌కా ఇష్యూల్లో పొర‌బాటున ఎంట్రీ అయినా.. మ‌ళ్లీ వెంట‌నే సైడ్ అయిపోతున్నార‌ని అంటున్నారు. ఇదంతా బీజేపీ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా అమ‌లు చేస్తున్న ఎత్తుగ‌డ అని విశ్లేషిస్తున్నారు. కార‌ణం, అవ‌స‌రం ఏదైనా కానీ.. మైనంపల్లి అన్నేసి మాట‌లు అన్నాక కూడా క‌మ‌ల‌నాథులెవ్వ‌రూ చిన్న కౌంట‌ర్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌జ‌ల్లోకి రాంగ్ మెసేజ్ పంపుతోంద‌నే వారు కూడా ఉన్నారు. 

ప్రపంచ నేతలంతా పెన్నులతో.. వీళ్లు గన్నులతో! తాలిబన్లతో గండమేనా? 

ప్రజాస్వామ్య పరిపుష్టికి ప్రపంచ దేశాలన్నీ ఇతోధికంగా తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఉరుములతో కూడిన పిడుగులాగా ఆఫ్ఘనిస్థాన్లో తుపాకుల రాజ్యం వచ్చేసింది. 20 ఏళ్ల క్రితమే తాలిబాన్లను కాబూల్ నుంచి తన్ని తరిమేశాక.. అమెరికా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వ్యూహాత్మకంగా ఖాళీ చేశాక.. మళ్లీ పాత మోతలే వినిపిస్తున్నాయి. ఆధునిక యుగంలో పరిపాలనంతా ఏసీ ఆఫీసుల్లో ఆకుపచ్చ సిరా పెన్నులతో జరుగుతుండగా... ఆఫ్ఘన్లో మాత్రం తాలిబాన్లతో గన్నులతో జరుగుతుందంటున్నారు విశ్లేషకులు. తాలిబాన్ల రాజ్యం ఎలా ఉంటుందో ఇప్పటికే రుచిచూసిన అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అనుకుంటూ బలుసాకు వెదుక్కుంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్తున్నారు. ఇదే విషయం ప్రపంచ మేధావులను, రచయితలను కలచివేస్తోంది.  కాబూల్లోని అధ్యక్ష భవనం నుంచి అష్రఫ్ ఘనీ రహస్య మార్గం గుండా వెళ్లిపోయాడో లేదో.. ఇటు తాలిబాన్లు అదే అధ్యక్ష భవనంలో తిష్టవేశాయి. ఏమాత్రం ఆధునిక పోకడ ఆనవాళ్లు తెలియని తాలిబాన్లు అధ్యక్ష భవనాన్ని అంగడి సరుకులా మార్చేశారు. ఖరీదైన కుర్చీల్లో కాళ్లు బారచాపుకుని ఒకరు, అదే కుర్చీల్లో కాళ్లు, తుపాకులు పెట్టుకొని ఒకరు, ముందు టేబుళ్ల మీద మద్య-మాంసాలు, బిస్లరీ వాటర్ బాటిళ్లు పెట్టుకొని.. ఓ పద్ధతీ పాడూ లేకుండా ఆహారం తింటున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ విజువల్స్ చూస్తే అత్యంత జుగుప్స కలుగుతోందంటున్నారు. అడవి నుంచి వచ్చిన కోతిమూక ఊరి మీద పడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందన్న కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.  మదరసాల్లో చదువుకున్న ఇస్లాం ఛాందసవాదపు చదువులే తప్ప ఆధునిక పరిపాలనకు సంబంధించిన ఏమాత్రం వ్యవహార జ్ఞానం గానీ, కనీస అనుభవం గానీ లేని కుర్రకారుకు తుపాకులు ఇచ్చి కాబూల్ వీధుల్లోకి వదలడం అక్కడి ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. వారి పరిపాలన ఎంత ఆటవికంగా ఉంటుందో ఊహించుకొని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకూ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఉద్యోగార్హత పొందిన అనేక మంది మహిళలకు కనీస రక్షణ లేకుండాపోయింది. ఏ చిన్న నేరం చేసినా కాలో, చెయ్యో తీసెయ్యడం, నడిబజారులోనే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారెయ్యడం వంటి శిక్షలు ఆ ప్రజలకు గతానుభవాలే.  అందుకు తగినట్టుగానే తాలిబాన్లు కాబూల్ ను వశం చేసుకున్నారో లేదో... వీధుల్లో ఉన్న మహిళల సాధికారతను తెలిపే అడ్వర్టయిజ్ మెంట్లు, పరిపాలనకు సంబంధించిన వాల్ పోస్టర్లు, వివిధ కంపెనీల సైన్ బోర్డులు.. ఇలా గోడల మీద ఉన్న మహిళల ఫొటోలన్నింటినీ తొలగిస్తున్నారు. ఆ ఫొటో ఒకదాన్ని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మహిళలను కేవలం పడక సౌఖ్యం ఇచ్చే వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా చూడటమే ఇస్లాంలోని కీలకాంశమని, దాన్నే తాలిబాన్లు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆడవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తాలిబాన్లు అదే మహిళలతో శారీరక వాంఛలు తీర్చుకునేందుకు మాత్రం విపరీతంగా పోడీపడతారు. ఇరాన్, సిరియాల్లో ఐసిస్ టెర్రరిస్టులు యువతుల్ని బంధించి వారిని పొందడం కోసం టెర్రరిస్టులకు వివిధ రకాల పోటీలు పెట్టేవారు. వారిని అనుభవించాక చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపించారు. వారి చెర నుంచి బయటపడ్డ కొందరు యువతులు ఇప్పటికీ మానసిక జబ్బుల నుంచి బయట పడలేకపోతున్నారు. ఈ విషయాలే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తు చేసుకుంటోంది. అయితే అత్యంత శక్తిమంతమైన అమెరికా దళాలు, నాటో దళాలే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాక ఈ ఉగ్రమూకలకు ఇక పట్టపగ్గాలు ఉంటాయా.. అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

బండి సంజ‌య్‌కి కేటీఆర్ ఖ‌త‌ర్నాక్‌ పంచ్‌..

ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తెలంగాణ రాజ‌కీయ నేత‌ల్లో కేటీఆర్ వాడినంత‌గా ట్విట్ట‌ర్‌ను మ‌రే నేతా వాడ‌రు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తుంటారు. అప్పుడ‌ప్పుడు ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ కూడా చేస్తుంటారు. ఇటీవ‌ల క్రికెట్ మ్యాచ్‌ల‌పైనా ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, నెట్ స‌ర్ఫింగ్ చేస్తుండ‌గా.. కేటీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చిక్కారు. బండి చేసిన ఓ ట్వీట్ ఆయ‌న కంట ప‌డింది. ఇక అంతే. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా త‌న‌దైన స్టైల్‌లో బండి ట్వీట్‌కు స్ట్రాంగ్‌ కౌంట‌ర్ వేశారు కేటీఆర్‌. మంత్రి చేసిన ఆ సెటైరిక‌ల్ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.  ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘దరఖాస్తుల ఉద్యమం’ స్టార్ట్ చేశారు. సోమ‌వారం కరీంనగర్‌లో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విష‌యాన్ని, ప్ర‌జ‌ల నుంచి అప్లికేష‌న్లు స్వీక‌రించిన ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు బండి సంజ‌య్‌. ఆ ట్వీట్‌కు తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.  ‘‘ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బీజేపీ శాఖ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్‌ధన్‌ ఖాతాల్లో ధనాధన్‌ డబ్బులు పడేందుకు బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలి’’ అంటూ సెటైరిక‌ల్‌గా ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.   కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే విదేశాల్లోని బ్లాక్‌మ‌నీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ అంశంపై ప్ర‌తిప‌క్షాలు ప‌దే ప‌దే మోదీని, బీజేపీని గుచ్చి గుచ్చి అడుగుతుంటాయి. బ్లాక్‌మ‌నీ ఏమైంది? మా అకౌంట్లో 15 ల‌క్ష‌లు వేస్తాన‌న్నారుగా ఎప్పుడు వేస్తారంటూ సెటైర్లు వేస్తుంటాయి. ఇదే టాపిక్‌ను బేస్ చేసుకొని మంత్రి కేటీఆర్ సైతం.. బండి సంజయ్‌ దరఖాస్తుల ఉద్యమంపై ఇలా ఆస‌క్తిక‌రంగా కౌంట‌ర్‌ ట్వీట్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనికి బండి సంజ‌య్‌ రీకౌంట‌ర్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి...

ఆగస్టులోనే మంత్రివర్గ విస్తరణ? సంచలనం చేయబోతున్న కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ/ విస్తరణ కసరత్తు ప్రారంభించారా? త్వరలోనే ఆ ఒక్కటీ కూడా కానిచ్చి, దళిత అజెండాను సంపూర్ణం చేస్తారా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి చేయక పోగా, ఉప ముఖ్యమంత్రి పదవినీ ఊడపీకారని  విపక్షాలు చేస్తున్న విమర్శకు జవాబుగా.. మళ్ళీ మరోమారు మరో దళితనేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  ఒకప్పుడు ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలు అసలు పట్టించుకునే వారు కాదు. విపక్ష పార్టీలకు పనీపాట లేదని, అవగాహనా అసలే లేదని అందుకే పని కట్టుకుని విమర్శలు చేస్తుంటారని ముఖ్యమంత్రి పలు సంధర్భాలలో పేర్కొన్నారు. ఒక విధంగా ఆయన  విపక్షాల విమర్శలను తేలిగ్గా తీసేపారేయడం అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాదు, జాతీయ పార్టీల జాతీయ నాయకుల నుంచి కీలక పదవులలో ఉన్న ప్రాతీయ పార్టీల నాయకుల వరకు ఎవరికీ కూడా ఏమీ తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చితాభిప్రాయం. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఏది మంచో ఏది చెడో తనకు తప్ప మరొకరికి తెలుసంటే అసలే  ఒప్పుకోరు. ఆన్ని విషయాలను, శాస్త్రీయంగా అధ్యనం చేసి సమస్యలను, పరిష్కారాలను ప్యాక్ చేసి పెట్టుకున్నానని, తనకు మాత్రమే ఆ వివరాలు తెలుసుని, ఆయన  నమ్ముతారు ఇతరులు నమ్మితీరాలంటారు. అదే విషయాన్ని అయన అనేక సందర్భాలలో బహిరంగంగానే బయట పెట్టారు. నిజానికి ఇప్పటికి కూడా అయన అదే అభిప్రాయంతో ఉన్నారు.  అయితే అనవసరంగా, అనాలోచితంగా తలకు చుట్టుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కంప నుంచి బయట పడేందుకు కావచ్చు, ఇటీవల కాలంలో ఆయన తమ ఆలోచనా పంథాను కొద్దిగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. విపక్షాలను ఉపేక్షిస్తే, అసలుకే మోసం జరిగే ప్రమాదం పొంచి ఉందని గ్రహించారో ఏమో కానీ, విపక్షాల విమర్శలకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం  ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రారన్న విపక్షాల విమర్శకు జవాబుగా బయటకు వచ్చారు, ఎదో ఒక వంకన ఉరూరా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే మరిచి పోతారు, మళ్ళీ మళ్ళీ అవే హామీలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారని, ఎన్నికల తర్వాత అసలు ఆవైపు కన్నెత్తి అయినా చూడనే విమర్శకు జవాబుగా, నాగార్జున సాగర్ వెళ్లి వచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలనే మళ్ళీ పునరుద్ఘాటించి వచ్చారు.  ముఖ్యమంత్రి కార్యాలయంలో దళితులకు స్థానం లేదా?  ముఖ్యమంత్రి కార్యాలయంలోకి దళిత అధికారాలకు ప్రవేశం లేదా?  అన్న విమర్శలకు సమాధానంగా ఆగష్టు 16 న దళిత బంధు  ప్రారంభ వేదిక నుంచే, ఐఏఎస్ అధికారి  రాహుల్ బోజ్జాను, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకుంటున్నట్లు ప్రకతించారు. నిజానికి, అధికారుల నియామకాలు, బదిలీలు బహిరంగ వేదికల నుంచి ప్రకటించవలసిన ఆవసరం లేదు, అయినా ముఖ్యమంతి కేసేఆర్, రాహుల్ బొజ్జా నియామకం విషయాన్ని బహిరంగ వేదిక నుంచి ప్రకటించడమే కాకుండా, రాహుల్ తండ్రి బొజ్జా తారకాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన గుణగణాలను ప్రశంసించారు. అంటే, రాహుల్ బొజ్జా నియామకం రాజకీయ అప్పాయింట్మెంట్ అని చెప్పకనే చెప్పారు;. ఆ విధంగా ఏడేళ్ళుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో దళిత అధికారులు ఎందుకు  లేరన్న విమర్శకు సమాధానం ఇచ్చారు.  ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా విపక్షాల విమర్శలకు  మాటలతో కుండా చేతలతో సమాధానం ఇస్తూ వస్తున్న కేసీఆర్, దళిత ఉప ముఖ్యమంత్రి ఏరన్న ప్రశ్నకు, విస్తరణ ద్వారా జవాబు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అయితే, మంత్రివర్గ విస్తరణ/ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు, ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్’ కు ప్రమోషన్ ఇచ్చి సింపుల్ ‘గా  కానిస్తారా లేక పనిలో పనిగా కొత్త వారికి అవకాశం కల్పించడంతో తోపాటుగా  ప్రస్తుత మంత్రుఅలలో కొదరికి ఉద్వాసన పలకుతారా అనే విషయంలోనూ స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. అలాగే, మత్రివర్గంలో  ఉద్యమ ద్రోహులే ఎక్కువగా ఉన్నారనే విపక్షాలు, ఉద్యమ సంఘాలు చేస్తున్న మరో ప్రధాన విమర్శకు కూడా మౌనంగాగానే సమాధానం ఇస్తారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం తప్పక ఉంటుందని, దళిత ముఖ్యమంత్రి పదవి పునరుద్ధరణ కూడా తప్పక జరుగుతుందని,అది కూడా ఆగష్టు 30 లోగానే ఉంటుందని సన్నిహిత వర్గాల పక్కా సమాచారం.

అసమర్ధత బయటపడకుండా రహస్యమా? జనం నుంచి జగన్ రెడ్డి పారిపోతున్నారా? 

మాట తప్పం.. మడమ తిప్పం... చేసేదే చెబుతాం.. చెప్పింది చేసి తీరుతాం.. ఇదీ గత ఎన్నికల సమయంలో జగన్ నినాదం.. వైసీపీ నినాదం. మేము చంద్రబాబులా కాదు..  ప్రభుత్వం చేసే ప్రతిపని ప్రజలకు చెబుతాం.. చంద్రబాబు కొన్ని జీవోలు దాచిపెట్టారు.. ఇది ప్రతిపక్షంలో జగన్ చేసిన ప్రతిజ్ఝ.. కట్ చేస్తేస్వాతంత్ర దినోత్సవం ముగిసిన మరుసటి రోజునే జగన్ రెడ్డి మడమ తిప్పారు.  తన పాలన నిర్ణయాలు చూసి ప్రజలు జడుచుకుంటారేమో భయపడ్డాడోమో.. కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీవోలు ఏపీ పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని ఆదేశించారు. చంద్రబాబు ఒకటో రెండో జీవోలు దాచాడేమో.. కానీ నేను మీకు ఒక్క జీవో కూడా చూపించనంటూ నిర్ణయం తీసేసుకున్నారు. జీవోలు ఆన్ లైన్లో పెడితే గోల చేస్తున్నారు.. అసలు ఆన్ లైన్లో పెట్టకపోతే ఏం చేస్తారు అంటూ ముందుకు వెళ్లారు. జగన్ సర్కార్ నిర్ణయంతో  ఇక ఏపీలో జీవోలన్నీ ఆఫ్ లైన్ లో అధికారుల మధ్యే ఉండనున్నాయి. జీవోఐఆర్‌... అంటే, ప్రభుత్వ ఉత్తర్వుల ఇష్యూ రిజిస్టర్‌. ఇందులో అప్‌లోడ్‌ చేస్తేనే... జీవో నంబర్‌ వస్తుంది. ఒక ఉద్యోగి సర్వీసుకు సంబంధించిన ఉత్తర్వు నుంచి, ఐఏఎస్ ల బదిలీ వరకు ఏ జీవో జారీ చేసినా ఈ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ప్రజలకు ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. కొన్ని జీవోలను మాత్రం ‘కాన్ఫిడెన్షియల్‌’గా పేర్కొంటూ, అందులోని సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టరు. ఇది... వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన  పారదర్శక విధానం. ‘సమాచార హక్కు చట్టం’ అమలులోకి వచ్చిన నేపథ్యంలో... ప్రభుత్వ ఆదేశాల జారీలో రహస్యం ఉండకూడదని తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు... ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ పారదర్శక విధానానికి పాతరేశారు. ఇకపై కీలకమైన జీవోలేవీ వెబ్‌సైట్‌లో పెట్టకూడదంటూ సర్క్యులర్‌ జారీ చేశా రు. అంటే... అంతా రహస్యం. ప్రభుత్వం చెప్పాలనుకున్నదే ప్రజలకు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియడంతో పెద్ద దుమారమే చెలరేగుతోంది. జీవోలన్నీ బయటకు తెలియడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఏ విషయం కూడా అందరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొస్తూ ఎవరికి దొరకకుండా చూసుకుంటోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రహస్య జీవోల పాలన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.  బ్లాంక్ జీవోలతో రహస్య పాలన చేస్తోందని టీడీపీ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసింది. అయినా వెనక్కి తగ్గని జగన్ రెడ్డి సర్కార్.. తాజాగా పూర్తి రహస్య పద్ధతి పాటించేందుకు నిర్ణయించింది. జీవోలను ఇక పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చూడాలని సంకల్పించింది.  పలురకాల ఇక్కట్ల నుంచి తప్పించుకుని... కొన్ని విషయాల్లో పరువు దక్కించుకునేందుకే ప్రభుత్వం ‘రహస్య పాలన’కు తెరలేపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాలన, జీవోల జారీ, వాటి తయారీకి ఒక పద్ధతి ఉంటుంది. జగన్‌ సర్కారు వచ్చాక అదంతా గాడి తప్పింది. కొన్ని ఉత్తర్వులు సర్కారును అభాసుపాలు చేస్తున్నాయి. ఒక అధికారి బదిలీ, పోస్టింగ్‌పై ఉత్తర్వు ఇచ్చిన గంటల వ్యవధిలోనే మరో ఉత్తర్వు ఇవ్వడం, దాన్ని మళ్లీ సవరించడం పరిపాటిగా సాగిపోయింది. జీవోలో వాడిన భాషలోనూ తప్పులు దొర్లిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంబంధం లేకుండానే జూనియర్‌ అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కనీసం సీఎ్‌సకు సమాచారం ఇవ్వకుండా, ఫైలు పంపించకుండానే అనేక అంశాల్లో జీవోలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పారనే పేరుతో ఎవరుపడితే వారు విధానపరమైన అంశాల్లో జీవోలు ఇచ్చారు. ఇలాంటి ఉత్తర్వులతో ప్రభుత్వ అసమర్థత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో అబాసుపాలైన ప్రభుత్వం.. ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.  ప్రభుత్వ నిర్ణయంపై  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో సీక్రెట్ లు పాటిస్తూ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా చేస్తూ మోసాలకు పాల్పడుతుందని మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను ఇకపై ఆన్‌లైన్‌లో పెట్టకూడదనే ఆదేశాలు జారీ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టాలని కోరారు. జగన్ సర్కార్ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జీవోలు ఆన్ లైన్లో పెట్టకపోతే బయటకు తీయడానికి ఆర్టీఐ చట్టం ఉందన్న విషయం మరిచిపోయారు జగన్ అంటూ కొందరు పోస్టులు చేశారు. మొన్న ఇంటిపన్ను, చెత్తపన్ను, బాత్రూంపన్నులపై జీవోను పత్రికలలో సరిగా ప్రచురించకున్నా కూడా సామాన్య జనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని అధికారులను, నాయకులను నిలదీసిన సంఘటన చూసి,జీవోలు అన్లైన్ లో ఉంచకూడదని మహత్తరమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న జగనన్న అంటూ తిట్టిపోస్తున్నారు. 

కేసీఆర్ పోతే పీసీఆర్‌.. ఓట‌మిపై క్లారిటీ ఇచ్చేశారా?

"ఒక్క‌సారి కాదు.. రెండుసార్లు కాదు.. నాలుగు సార్లు నేనే ముఖ్య‌మంత్రిగా ఉంటా. 20 ఏళ్లు ప‌రిపాలిస్తా. ఇప్ప‌టికి రెండుసార్లు గెలిచా. మ‌రో రెండు ప‌ర్యాయాలు నాదే విజ‌యం. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. కేటీఆర్ కాదు వ‌చ్చేసారి కూడా నేనే సీఎం. ఇందులో ఎలాంటి డౌట్ అవ‌స‌రం లేదు." ఇదీ ప‌లు సంద‌ర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన డైలాగ్స్‌. త‌న గెలుపుపై అంత ధీమాగా ఉండేవారు కేసీఆర్‌. తెలంగాణ త‌న సొత్తు అన్న‌ట్టు మాట్లాడేవారు. ఎక్క‌డా, ఏ కోశానా కాన్ఫిడెన్స్ లూజ్‌ అయ్యేవారు కాదు. తెలంగాణ‌ను 20ఏళ్లు పాలించ‌డ‌మే ఆయ‌న టార్గెట్‌. కానీ...... ఇదంతా ఓ ఏడాది ముంద‌రి మాట‌. కొంత‌కాలంగా తెలంగాణ రాజ‌కీయం వేగంగా మారిపోతోంది. కీల‌క నేత‌ల కార‌ణంగా అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది. మాట‌ల గారెడీ మిన‌హా.. చేసిందేమీ లేద‌నే అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. డ‌బుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, రేష‌న్‌కార్డులు, పింఛ‌న్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రజాగ్ర‌హంతో ఇన్నాళ్లూ త‌న‌దే హ‌వా అనుకున్న గులాబీ బాస్‌కు దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌లు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాయి. బీజేపీ బండి య‌మ జోరు మీదుంది. అంత‌లోనే తేరుకున్న కేసీఆర్‌.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జున సాగ‌ర్ గెలుపుతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు. ఇక బిందాస్ అనుకుంటుండ‌గా.. ఈట‌ల రాజేంద‌ర్ కిరికిరి స్టార్గ్ అయింది. అదే స‌మ‌యంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో మ‌రో ఉప్పెన ముంచెత్తింది.  అస‌లే బీజేపీ దూకుడు మీదుంది. క‌మ‌ల‌నాథుల‌కు ఈట‌ల రాజేంద‌ర్ రూపంలో మ‌రో ఆయుధం చేతికొచ్చింది. అప్ప‌టి నుంచి ఈట‌ల‌తో కేసీఆర్‌పై ఈటెలు ప్ర‌యోగిస్తోంది బీజేపీ. ఈట‌ల‌ మాట‌ల దాడి త‌ట్టుకోలేక‌.. కేసీఆర్ ఏళ్లుగా చేయ‌ని ప‌నుల‌న్నీ వ‌రుస‌బెట్టి చేసుకొస్తున్నారు. రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు, గొర్రెలు పంచుతున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. త‌న‌ను తాను కొత్త‌గా మ‌లుచుకుంటున్నారు.  ఈట‌ల‌ను కాచుకోవ‌డ‌మే క‌ష్ట‌మవుతుంటే.. ఇక ఈ రేవంత్‌రెడ్డి ఒకడు.. ఓ ప‌ట్టాన ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదు. విమ‌ర్శ‌ల‌తో కుళ్ల‌బొడుస్తూనే.. ద‌ళిత‌-గిరిజ‌న దండోరాతో దండ‌యాత్ర చేస్తున్నాడు. తెలంగాణ‌లో బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్నా.. ఇన్నాళ్లూ బ‌ల‌మైన నాయ‌కుడు లేక స్త‌బ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. పీసీసీ చీఫ్‌ రేవంత్ నాయ‌క‌త్వంలో క‌ద‌నోత్సాహంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వైపు క‌దులుతున్నారు. ఇటు కాంగ్రెస్ దండోరాలు.. అటు బీజేపీ పాద‌యాత్ర‌ల‌తో కేసీఆర్‌కు క‌ష్ట‌కాలం దాపురించింద‌ని అంటున్నారు.  ఎవ‌రో అన‌డం కాదు.. కేసీఆర్‌కు సైతం కాస్త క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టుంది. ఈసారి త‌న గెలుపు అంత ఈజీ కాద‌ని అనిపిస్తున్న‌ట్టుంది. అందుకే కాబోలు.. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఉన్నా.. తాను పోయి ఏ పీసీఆరో సీఎం అయినా.. తాను తీసుకొచ్చిన ప‌థ‌కాలు మాత్రం ఆగ‌బోవంటూ.. భ‌విష్య‌త్‌పై ఓ ర‌క‌మైన నిర్వేదం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. లేదంటే.. 20 ఏళ్ల పాటు తెలంగాణ‌ను పాలిస్తానంటూ గ‌తంలో ధీమా వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. తాజాగా హుజురాబాద్ స‌భ‌లో కేసీఆర్ పోయి పీసీఆర్ వ‌స్తే.. అంటూ త‌న‌ అధికారం శాశ్వ‌తం కాద‌నేలా మాట్లాడ‌టం ఆయ‌న‌లో ఉన్న ఓట‌మి భ‌యానికి ప‌రోక్ష సంకేతమంటున్నారు. మ‌రి, ఆ పీసీఆర్ ఎవ‌ర‌నేది కాల‌మే డిసైడ్ చేస్తుంది... ఆ పీసీఆర్ కూడా కేసీఆరే అవుతారా? లేక‌, ఏ రేవంత్‌రెడ్డో, బండి సంజ‌యో అవుతారా అనేది ముందుముందు తెలుస్తుంది...   

గొడ్డు చాకిరీ.. నేతల దౌర్జన్యాలు! ప్రాణాలు తీసుకుంటున్న వాలంటీర్లు 

వాలంటీర్ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటోంది ఏపీలోని జగన్ రెడ్డి ప్రభుత్వం. మహాత్మ గాంధీ కలను సాకారం చేశామని చెబుతోంది. రెండు లక్ష ల మందికి పైగా ఉపాధి కల్పించామని ప్రచారం చేసుకుంటోంది. ఇందతా ఒకవైపు అయితే మరోవైపు మాత్రం గ్రామ‌, వార్డు వాలంటీర్ల వ్య‌వ‌స్థ మేడిపండు లాంటిద‌ని తేలుతోంది. చాలీ చాలనీ వేతనం, గొడ్డు చాకిరీ, వైసీపీ నేతల దౌర్జన్యాలతో వాలంటీర్లు నలిగిపోతున్నారని తెలుస్తోంది. వైసీపీ నాయ‌కుల పెత్త‌నం ఎక్కువైంద‌ని, వాలంటీర్ల‌ను కూలీలకంటే హీనంగా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు అధికారులు, మ‌రోవైపు అధికార‌పార్టీ నాయ‌కులు.. పెద్ద‌ల ఒత్తిళ్ల వ‌ళ్ల వాలంటీర్లు శారీర‌కంగా, మాన‌సికంగా కుంగిపోతున్నారు. కొంద‌రు ఉద్యోగాలు వదిలేస్తుండగా.. మరి కొందరు ఆత్మ‌హ‌త్యకు పాల్పడుతుండటం క‌ల‌క‌లం రేపుతోంది.  అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ మ‌హేశ్ ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే.. కర్నూల్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో వలంటీరు అర్ధంతరంగా తనువు చాలించాడు. పెళ్లి చేసుకుంటే.. వలంటీరు పనికి ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోదని, మరో ఉద్యోగం వస్తుందో రాదోనన్న భయంతో సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా కోడుమూరు సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న అల్లుగుండు అబ్దుల్‌ ఖాదర్‌, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు  హబీబ్‌బాషా (26) వార్డు వలంటీర్‌.  ఇద్దరు కొడుకులకూ పెళ్లి చేయాలని ఖాదర్‌ నెల కిందట ఖాయం చేశారు. అప్పటి నుంచి హబీబ్‌ దిగాలుగా ఉంటున్నాడు. పెళ్లయితే ప్రభుత్వం ఇచ్చే రూ.5వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని, మరో ఉద్యోగం వస్తుందో.. లేదో అని తండ్రితో చెబుతూ బాధపడుతుండే వాడు. సోమవారం ఇంట్లో   హబీబ్‌ చీరతో ఉరివేసుకున్నాడు.  కొడుకు శవమై  కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  అనంతపురం జిల్లాలో సూసైడ్ చేసుకున్న వాలంటీర్ మహేష్.. త‌న‌ చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగమే కార‌ణ‌మ‌ని సూసైడ్ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్‌ నోట్‌లో రాశాడు మ‌హేశ్‌. తన లాంటి పరిస్థితి మరో వాలంటీర్‌కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో ప్ర‌దేయ‌ప‌డ‌టం సంచలనంగా మారింది. మొద‌టినుంచీ వాలంటీర్ వ్య‌వ‌స్థ వివాదాస్ప‌దంగానే ఉంది. వాలంటీర్ల‌తో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వైసీపీ నేత‌ల ఓవ‌రాక్ష‌న్‌ను, టార్చ‌ర్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని అనేక‌మంది ఆరోపిస్తున్నారు. జగన్ రెడ్డి సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థ.. ప్రాణాలు తీసేలా తయారైందని మండిపడుతున్నారు. 

గో బ్యాక్ ఆంధ్రా.. జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో షాక్‌..

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా అడ్డంకులే. ఏ ప‌ని చేసినా ఏదో ఒక కొర్రీనే. ఇప్ప‌టికే అప్పుల‌తో ఖ‌జానా ఖాళీ చేసేశారు. కొత్త అప్పులు ముట్ట‌క తెగ ఇబ్బందులు ప‌డుతున్నారు. అడ్డ‌గోలు అప్పుల‌పై కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటున్నారు. కేంద్రంతో ఏపీకి ఏమాత్రం స‌ఖ్య‌త లేకుండాపోయింది. అటు, పాత మిత్రుడు కేసీఆర్‌తో కొత్త‌గా వైరం పెట్టుకున్నారు. జ‌ల‌జ‌గ‌డాన్ని తెగేదాక లాగుతూ పొరుగురాష్ట్రంతో ఫైటింగ్ చేస్తున్నారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ‌.. ఈ రెండూ చాల‌వ‌న్న‌ట్టు.. తాజాగా ఒడిశాతో స‌రిహ‌ద్దు వివాదాన్ని మ‌రింత కెలుకుతున్నారు. చిన్న స్టేట్ అయిన ఒడిశా.. జ‌గ‌న్ స‌ర్కారుకు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇస్తోంది. సీఎం జ‌గ‌న్ విధానాల‌తో ఏపీ ప‌రువంతా పోతోందని అంటున్నారు.  ఏపీ, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మరోసారి వివాదం త‌లెత్తింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రామాలైన పట్టుచెన్నూరు, పగులుచెన్నూరుల్లో జగనన్న పచ్చతోరణం, ప్రభుత్వ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ వెళ్లాల‌ని భావించారు. విషయం తెలుసుకున్న ఒడిశా ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీల‌కు అతీతంగా త‌ర‌లివ‌చ్చి మ‌న‌వారిని అడ్డుకున్నారు. ఒడిశాకు చెందిన‌ ఎమ్మెల్యే, ఎంపీ, ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు, పోలీసులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. సరిహద్దులోని హర్మాడగి ద‌గ్గ‌ర రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి.. గో బ్యాక్‌ ఆంధ్రా.. అంటూ నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు.   ఏపీ అధికారుల‌ను ఒడిశా నాయ‌కులు, ఆఫీస‌ర్లు అడ్డుకున్నారు. రెండు గ్రామాల కార్య‌ద‌ర్శులు, వీర్వో, ఇద్ద‌రు ఐటీడీఏ వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు విలేజ్‌లోకి రాకుండా వ్య‌తిరేకించారు. చేసేది లేక అధికారులంతా తిరిగి సాలూరు చేరుకున్నారు.  ఘ‌ట‌న‌పై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర స్పందించారు. సరిహద్దులో ఒడిశా నాయకులు, పోలీసులు మోహరించి త‌మ‌ను అడ్డుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. అయితే, జిల్లా కలెక్టర్‌, ఎస్పీల సూచ‌న‌తో త‌మ కొఠియా గ్రామాల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నామ‌ని తెలిపారు.   

తాలిబన్ల చేతికి అత్యాధునిక యూఎస్ వెపన్స్.. ప్రపంచానికి గండమేనా? 

అప్ఘనీస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లలో ప్రపంచానికి కొంత గండం రాబోతోందా? రాబోయో రోజుల్లో విధ్వంసం తప్పదా? అంటే అవుననే భయాందోళనే ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతోంది. తాలిబన్ల చేతికి అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు దక్కడమే ఈ ఆందోళనకు కారణం.  కేవలం ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్థాన్ ను గజగజలాడించిన చరిత్ర తాలిబన్లది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్థాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల సొంతమయ్యాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.  గత 20 ఏళ్లలో దాదాపు  89 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆప్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ... తాలిబన్లతో పోరాడలేక వారు పారిపోయారు. దాంతో గత రెండు దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.మెత్తం మీద 211 విమానాలు, హెలికాప్టర్లకు గాను 167 పనిచేసే స్థితిలో ఉన్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో తాలిబన్లకు అవగాహన లేదు. వీటికి పైలట్లు, టెక్నీషియన్లను గుర్తించడం తాలిబన్లకు కఠినమైన పరీక్షే. అంతేకాదు వీటి విడిభాగాలను సేకరించడం కూడా చాలా కష్టమైన పనే. అయితే ఈ కష్టాలను అధిగమిస్తే మాత్రం తాలిబన్లకు ఒక అత్యాధునికమైన వైమానిక దళం ఉన్నట్టే. తాలిబన్ల వశమైన ఆయుధ సంపత్తి వివరాలు: ఏ-29 తేలికపాటి విమానాలు - 6 వేగంగా కదిలే బహుళ ప్రయోజన హమ్వీ వాహనాలు - 174 2.75 అంగుళాల హై ఎక్స్ ప్లోజివ్ రాకెట్లు (గగనతలం నుంచి భూతలంపై దాడికి ఉపయోగించే రాకెట్లు)  -  10 వేలు పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు - 9 లక్షలు 40 ఎంఎం హై ఎక్స్ ప్లోజివ్ తూటాలు - 60 వేలు 7.62 ఎంఎం తూటాలు - 20 లక్షలు యూహెచ్ 60 బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు - 45 ఎండీ 530 హెలికాప్టర్లు- 50 ఎంఐ 17 హెలికాప్టర్లు - 56 ఏ 29 సూపర్ తుకానో ఫైటర్లు - 23 సి 130 హెర్క్యులస్ రవాణా విమానం - 1 సీ 208 విమానం - 1 ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితుల భయానకంగా మారాయి. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరి కాకుండా, మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెపుతున్నప్పటికీ... వారి మాటలను ఆఫ్ఘన్ ప్రజలు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో... కాబూల్ లోని ఎంబసీని ఇండియా ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్ కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్ కు అత్యవసరంగా వెళ్లింది. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్ లోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను ఇండియాకు తీసుకొస్తున్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆఫ్ఘన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తో చర్చించానని తెలిపారు. కాబూల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చేస్తున్న కృషి చాలా గొప్పదని కితాబునిచ్చారు.

నేరస్తుడి పాలనలో నేరగాళ్లదే రాజ్యం! 

గుంటూరులో దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య ఘటన, పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ రెడ్డి పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, మహిళలకు రక్షణే లేకుండా పోయిందని మండిపడ్డారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే వరుసగా దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  దిశా చట్టంలో ఎంతమంది మృగాళ్లను శిక్షించారని చంద్రబాబు ప్రశ్నించారు.  మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేళ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో పట్టపగలు నడిరోడ్డుపై దళిత యువతిని దారుణంగా హతమార్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని నిలదీశారు. నేరస్తుడు రాజ్యమేలితే నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష్యంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే  లక్ష్యంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చీకటి జీవోలు ఇచ్చుకుంటూ, అవినీతి నోట్ల కట్టలు లెక్కపెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారన్నారు. నిందితులకు వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి శిక్షించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. రెండేళ్లలో మహిళల భద్రత కోసం గాలి మాటలు, గాలికబుర్లు మినహా ఈ గాలి ముఖ్యమంత్రి చేసింది ఏమిలేదన్నారు. మహిళలపై 500కి పైగా జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు వైసీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోందని చంద్రబాబు అన్నారు. అన్యాయంగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత,  మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన మహిళల ఘోష ముఖ్యమంత్రికి వినపడటం లేదా? అని చంద్రబాబు  ప్రశ్నించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేరని ఆందోళన వ్యక్తం చేశారు.  పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నియంత్రృత్వ పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్‌లో దళితులు, మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలపై అమెరికా మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేయటం వైసీపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు చంద్రబాబు. టీడీపీ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను దిశా స్టేషన్లుగా మార్చి ప్రచారార్బాటం చేశారన్నారు. గోడకు కొట్టిన బంతిలా కేంద్రం దగ్గర నుంచి దిశా బిల్లు తిరిగొచ్చిందన్నారు. దిశా పోలీసులు జాడ లేదన్నారు. ముఖ్యమంత్రి ఇంటి వెనుక అత్యాచారం జరిగితే ఇంతవరకూ నిందితులను పట్టుకోలేదని చెప్పారు. షాడోల చేతిలో డీజీపీ, మహిళా హోంమంత్రులను డమ్మీలుగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  బాధిత మహిళలకు టీడీపీ అండగా పోరాటం చేస్తోందన్నారు చంద్రబాబు. 

ఏపీ అంటే అప్పు చేసి పప్పు కూడు.. జగన్ కు జైలు ఖాయమేనట?

ఆంధ్రప్రదేశ్ ను ఏపీ అని పిలుస్తారు. ఏ అంటే ఆంధ్ర పీ అంటే ప్రదేశ్. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే అప్పటి సీఎం చంద్రబాబు ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని తరుచూ చెబుతూ ఉండేవారు. ఏపీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పేవారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు తమకు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఏపీ అని అంటుండేవారు చంద్రబాబు. ఇక జగన్ రెడ్డి పాలనలో సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఏపీ అప్పులమయంగా మారిపోయింది. దేశంలో అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. పరిమితికి మించి ఏపీ అప్పులు తీసుకుందని, రాష్ట్ర ఆర్ఠిక పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీ ఖజానా ఖాళీగా ఉంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న ప్రతినెలా అప్పులు తెవాల్సిన పరిస్థితిలో ఉంది. జగన్ సర్కార్ ఆర్థిక విధానాల వల్లే పరిస్థితి ఇంతగా దిగజారిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని...అప్పుచేయొద్దని చెబితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నట్టా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేవారని, ఇప్పుడు ఏపీ అంటే అప్పుచేసి పప్పుకూడని అంటున్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని  చక్కగా అమలు చేస్తున్నామని సీఎం అన్నారని, మరి మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ రాజు. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉందన్నారు. జగనన్న విద్యాకానుక పథకమే కాకుండా టీచర్ల కొరతపై కూడా దృష్టి పెట్టాలని రఘురామ సూచించారు. రాష్టంలో కేవలం 30 నుండి 32 శాతం మాత్రమే వాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. ఒక్కరోజు 10 లక్షల టీకాలు పేరు మీద హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, పాఠశాలల ప్రారంభంపై సీఎం ఆలోచన చేయాలన్నారు. పథకాలకు సీఎం తండ్రిపేరు, ఆయన సొంత పేరు తప్ప ఇతరులు లేరా? అని ప్రశ్నించారు. పథకాలకు సీఎం సొంత పేర్లు పెట్టుకుంటే ప్రజలలో ఏహ్యభావం కలుగుతుందన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పైనా రఘురామ రాజు స్పందించారు. ఈ నెల 25న సీబీఐ కోర్టులో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. కోర్టులో తమ లాయర్లు సమర్ధవంతంగా వాదనలు వినిపించారని చెప్పారు. వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలని, పదాలను జాగ్రత్తగా వాడాలని సూచించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై ఇటీవలే సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 25న తీర్పు రాబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. 

హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలతో పారిపోయిన ఆప్ఘన్ అధ్యక్షుడు! 

అఫ్ఘనిస్థాన్‌ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆప్ఘన్లు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. కొందరు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.అక్కడి మహిళలు తమకు బానిసత్వం తప్పదని భయపడిపోతున్నారు. తాలిబన్లు దేశసరిహద్దులను మూసివేయడంతో..వారు కాబూల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానాలు పట్టుకుని వేళాడుతూ అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదకర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు.అప్గానిస్తాన్ కాస్తా తాలిబన్ స్తాన్ గా మారిపోయినట్లే. దేశాధ్యక్షుడు గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. తాపీగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి.. మారణహోమం ఇష్టం లేకనే తాలిబన్లతో పోరాడలేదని సెలవిచ్చారు.  తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు తమను వదిలేసి దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓ రష్యా వార్తా సంస్థ తాజాగా సంచలన విషయాన్ని ప్రచురించింది. అఫ్ఘాన్ అధ్యక్షుడు..తన వెంట నాలుగు కార్లు, పెద్ద హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలు తీసుకుని దేశం నుంచి పారిపోయారని ప్రచురించింది. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాల్ని వెల్లడించినట్టు పేర్కొంది. హెలికాఫ్టర్‌లో జాగా సరిపోకపోవడంతో కొంత డబ్బును అఫ్ఘానిస్థాన్‌లోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని కూడా  తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌లో ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేకపోయినప్పటికీ అక్కడ మరికొంత కాలం పాటు పరిమిత స్థాయిలో దౌత్యసిబ్బందిని కొనసాగించేందుకు రష్యా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  అఫ్గానిస్తాన్ మొత్తంలో ఒక్క కాబూల్ ఎయిర్ పోర్టు తప్పించి మిగిలిన ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోఉంది. దీంతో.. ఎయిర్ పోర్టుకు రావటంతో తమ ప్రాణాల్ని దక్కించుకోవాలన్న అత్రుతతో పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకుప్రజలు పోటెత్తుతున్నారు. వీరిని కంట్రోల్ చేయటం సాధ్యం కాని అమెరికన్ సైనికులు గాల్లో కాల్పులు జరుపుతున్నారు. ఏదోలా విమానంలో ప్రయాణించి విదేశాలకు పారిపోవాలని భావిస్తున్న వారి కారణంగా ఇప్పటివరకు ఏ ఎయిర్ పోర్టులో చూడని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒక విమానంలో గుంపులు గుంపులుగా ఎక్కేసి.. నిలుచోవటానికి జాగా దొరికితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న వారి తీరు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

ప్ర‌భుత్వ ఉద్యోగమున్నా ద‌ళితబంధు.. బెంజ్ కారున్నా రైతుబంధు.. కేసీఆర్ మార‌రా?

కాంగ్రెస్‌ను ఎవ‌రూ ఓడించ‌లేరు. త‌న‌ను తానే ఓడించుకుంటుంది.. అనేది హ‌స్తం పార్టీపై త‌రుచూ వినిపించే సామెత‌. అలాంటిదే.. కేసీఆర్‌ను ఉద్దేశించి మ‌రో కామెంట్ ప్ర‌చారంలో ఉంది. కేసీఆర్‌ను ఎవ‌రూ ప్ర‌త్యేకంగా విమ‌ర్శించ‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌నకు ఆయ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసుకుంటారు.. అని అంటున్నారు. అందుకు రైతు బంధు, ద‌ళిత బంధునే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు.  రైతు బంధు అద్బుత ప‌థ‌కం. ఇందులో ఎవ‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేదు. ఎక‌రానికి 5వేలు చొప్పునా.. ఏటా రెండుసార్లు.. అంటే ఏటేటా 10వేలు రైతుల‌కు ఆర్థిక‌ సాయం చేయ‌డ‌మే రైతు బంధు. ఇక రైతు భీమా అద‌నం. ఎక‌రాకు 5వేలు అంటే మంచి అమౌంటే. అందుకే, గ‌త ఎన్నిక‌ల్లో రైతులు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నారు. అంతా బాగానే ఉందిగానీ, వంద ఎక‌రాలు ఉన్న ఆసామికి కూడా ఏటా ఎక‌రానికి 10వేలు చొప్పున ఇవ్వ‌డంపైనే చాలామందికి అభ్యంత‌రాలు. పంట పండించినా, పండించ‌క‌పోయినా.. వ్య‌వ‌సాయ భూమి ఉంటే చాలు 10వేలు ఇచ్చేస్తున్నారు. అందుకే, కొంద‌రు బ‌డాబాబులు పోగేసుకున్న భూముల‌కు ఏటేటా ల‌క్ష‌ల్లో రైతు బంధు అందుతోంది. కొంద‌రు ల‌గ్జ‌రీ కార్ల‌లో వ‌చ్చి ల‌క్ష‌ల్లో రైతు బంధు తీసుకెళ్లుతుండ‌టం స‌న్న‌కారు రైతుల‌కు క‌ళ్ల‌మంట‌గా ఉంది. ఇక‌, క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే కౌలురైతుకు పైసా కూడా రాక‌పోవ‌డం రైతుబంధులో మ‌రో లోపం. అందుకే, సంప‌న్న రైతుల‌కు రైతు బంధు ఇవ్వొద్ద‌నే సూచ‌న‌లు ఎప్ప‌టినుంచో వినిపిస్తున్నా.. కేసీఆర్ వింటేగా. ఇచ్చేది త‌న జేబులోనుంచి కాద‌నేమో.. భూమున‌ర్న‌ రైతులంద‌రికీ అమ‌లు చేస్తూ రైతుబంధును కొంచెం ఇష్టం.. కొంచెం క‌ష్టంగా మార్చేశారు.  రైతుబంధును ముందస్తు క‌స‌ర‌త్తు లేకుండా మొద‌లెట్టేశారు.. మ‌రో ప‌థ‌కంలో ఇలాంటి పొర‌బాట్లు లేకుండా చూసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ, తానేమీ మార‌లేద‌ని.. త‌న‌తీరే ఇంత‌నేలా.. ద‌ళిత బంధునూ మ‌ళ్లీ రైతు బంధు త‌ర‌హాలోనే అమలు చేస్తామంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించేశారు. ఎస్సీల‌యితే చాలు.. పేద‌-ధ‌నిక అనే తేడా లేకుండా ద‌ళిత బంధు ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయారు. చివ‌రాఖ‌రికి కుటుంబంలో ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్నా స‌రే.. ద‌ళిత బంధు వ‌ర్తింస్తుంద‌ని హుజురాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించేశారు సీఎం కేసీఆర్‌. కాక‌పోతే, చిన్న కండిష‌న్‌. ముందుగా పేద‌ల‌కు ద‌ళిత బంధు ఇచ్చి, ఆ త‌ర్వాత లాస్ట్‌ను ప్ర‌భుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాల‌కు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.  ప్ర‌భుత్వ ఉద్యోగం ఉన్నా ద‌ళిత బంధు ఇవ్వ‌డంపై అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌లైపోయాయి. వెన‌క‌బ‌డిన కుటుంబాల‌ను పైకి తీసుకురావాల‌నే స‌దుద్దేశ్యం ఇలాంటి చ‌ర్య‌ల‌తో త‌ప్పుదారి ప‌డుతుంద‌ని అంటున్నారు. అస‌లే ద‌ళిత బంధుకు అవ‌స‌ర‌మ‌య్యే లక్షా 70వేల కోట్లు ఎక్క‌డి నుంచి తీసుకొస్తారో తెలీని ప‌రిస్థితి. అలాంటి ఆర్థిక సంక్లిష్ట‌త‌ల మ‌ధ్య‌.. ఇలా అంద‌రికీ 10 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేయ‌డం క‌రెక్ట్ కాద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే సొమ్ము.. ప్ర‌భుత్వ ఉద్యోగం ఉన్న వారికి కాకుండా.. వెనుక‌బ‌డిన‌ వేరే వ‌ర్గాల‌కు సాయం చేస్తే బాగుంటుందిగా అంటున్నారు. ఆ.. కేసీఆర్ ఇచ్చేదీ లేదు.. మ‌రో నాలుగేళ్లు ద‌ళిత బంధు అమ‌ల‌య్యేది లేదు.. లాస్ట్ వ‌ర‌కూ చూసుకోవ‌చ్చులే అనుకొని ఉంటారు.. అందుకే, ప్ర‌భుత్వ ఉద్యోగం ఉన్నా అంద‌రికీ ద‌ళిత బంధు ఇస్తానంటున్నార‌నే వారూ లేక‌పోలేదు. కార‌ణం ఏదైనా.. సంప‌న్నుల‌కు రైతు బంధు ఇవ్వ‌డం ఎలాగో.. గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్ హోల్డ‌ర్స్‌కు సైతం ద‌ళిత బంధు ఇస్తామ‌నే నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా,  కేసీఆర్ తాను ఒక్క‌సారి క‌మిటైతే త‌న‌మాట తానే విన‌నంటున్నారు. రైతులంద‌రికీ రైతు బంధులానే, ద‌ళిత కుటుంబాలన్నిటికీ 10 ల‌క్ష‌ల చొప్పున ద‌ళిత బంధు ఇచ్చి తీరుతానంటున్నారు. ఖ‌జానా ఖాళీ అయితేనేం.. ఓట్లు భారీగా ప‌డ‌తాయిగా అన్న‌ట్టు ఉంది కేసీఆర్ నైజం అంటున్నారు. ఏం చేద్దాం.. మ‌నం క‌ట్టే ప‌న్నుల‌ను.. త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చుచేసే అధికారం ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ చేతిలో ఉందిగా.. విమ‌ర్శించ‌డం మిన‌హా.. ఇంత‌కుమించి ఇంకేం చేయ‌లేమంటూ విసుక్కుంటున్నారు ప్ర‌జ‌లు.