కేంద్ర‌మంత్రికి జ‌గ‌న్ స‌ర్కారు షాక్‌.. బీజేపీకీ ఏపీ పోలీసులు ఝ‌ల‌క్‌..

ఏపీలో పోలీసుల రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లవుతోంద‌నే ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌. వ‌రుస ఘ‌ట‌న‌లు అందుకు ఎప్పటిక‌ప్పుడు బ‌లం చేకూర్చుతున్నాయి. రెండేళ్లుగా టీడీపీపై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. పాల‌కుల‌కు పోలీసులే ఆయుధం. నోరున్న టీడీపీ నేత‌లంతా వారి టార్గెట్‌. ఎవ‌రు ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తే.. వారిపైనే ముంద‌స్తు ప్ర‌తాపం. ఏపీ టీడీపీ అధ్య‌క్షులు అచ్చెన్నాయుడి ద‌గ్గ‌ర నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా వ‌ర‌కు.. ప‌దుల సంఖ్య‌లో తెలుగుదేశం నేత‌లపై కుట్ర‌లు, కేసులు, అరెస్టుల‌తో విరుచుకుప‌డుతోంది ప్ర‌భుత్వం. ఇక సొంత‌పార్టీ ఎంపీ ర‌ఘురామ‌నూ వ‌ద‌లిపెట్ట‌లేదు. సీఐడీని ఉసిగొల్పి.. ర‌ఘురామ‌ను అరెస్ట్ చేసి.. క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే ఆరోప‌ణ ఉంది. ఇక‌, ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ నేత‌ల అరెస్టులతో రెచ్చిపోతున్న పోలీసులు.. ఏకంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌నూ అరెస్ట్ చేసేవ‌ర‌కూ వ‌ద‌ల‌లేదు. ఏపీ ప్ర‌భుత్వం, పోలీసుల తీరు ప‌దే ప‌దే విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. తాజాగా, ఏపీ పోలీసులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీని అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు కిష‌న్‌రెడ్డి. ఎనికేపాడు ద‌గ్గ‌ర‌ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు వాగ్వాదం జ‌రిగింది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో మిగ‌తా కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఏపీలో జరగనున్న ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొంటారు.

ఎన్ని పథకాలు తెచ్చినా లాభం లేదా.. కేసీఆర్ ఆశలు వదిలేసుకుంటున్నారా? 

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడమే, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందుకోసంగానే గడచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అందరినీ పరుగులు తీయిస్తునారు. ఆయన నిద్ర పోవడం లేదు, ఇంకొకరిని నిద్రపోనీయడం లేదు. నిజానికి, జనం తెరాసకు బ్రహ్మరధం పట్టేందుకు, ముఖ్యమంత్రి ఇంతగా ఆగం కావలసిన అవసరం లేదు. దూరం నుంచి పరిణామాలను గమనిస్తున్న వారికి ఒక్క దళిత బంధు పథకం చాలు, జనం చేత ముఖ్యమంత్రికి జై కొట్టించడానికి, హుజూరాబాద్ లో తెరాస అభ్యర్ధిని గెలిపించేందుకు, అనిపించవచ్చును. అయితే ముఖ్యమంత్రిలో మాత్రం ఆ విశ్వాసం లేదు,ఆ భరోసా కనిపించడం లేదని, పార్టీ నాయకులు కొందరు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.   రేషన్ కార్డుల మొదలు దళిత బంధు వరకు ప్రజలకు మేలుచేసే పథకాలను ఒక దాని వెంట ఒకటిగా  పరుగులు పెట్టిస్తున్నా, ముఖ్యమంత్రికి  హుజూరాబాద్ లో గెలుపు మీద విశ్వాసం ఏర్పడడం లేదు.  ఓటమి భయం వదలడం లేదు. కుటుంబానికి పదిలక్షల రూపాయలు చేతిలోపెట్టే, ఉత్తమోత్తమ ఓట కొనుగులు పథకం దళిత బందు పథకం ప్రారంభ  సమయంలోనూ ముఖ్యమంత్రి మాటల్లో  భయంబేలతనమే వ్యక్తమయ్యాయని  అంటున్నారు.  అందుకే ముఖ్యమత్రి మాటల్లో ఇంత బేలతనమా? ఎప్పుడైనా చూశామా? ఎప్పుడైనా విన్నామా? అని తెరాస నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఉపన్యాసాని బట్టిచూస్తే, ముఖ్యమంత్రి ఓడిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లేనా, అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి భయానికి బలమైన కారణమే ఉంటుందని, లేదంటే, భయమన్నదే ఎరుగని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతలా ఎందుకు షేక్ అవుతారని తెలంగాణ భవన్ సాక్షిగానే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.   నిజానికి దళిత బంధు పథకం ప్రారంభ వేదిక నుంచి చేసిన ఉపన్యాసంలోనే ముఖ్యమంత్రిని వెంటాడుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి భయం, బేలతనం బయట పడ్డాయని, ఇందుకు ప్రధాన కారణం, సర్వే ఫలితాలు అయితే, ఇంతవరకు ఎప్పుడు అంతగా పట్టించుకోని విశ్వసనీయత కోల్పోయిన వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కొంచెం ఆలస్యంగానే అయినా  గుర్తించారని, అందుకే అంతగా ఆందోళన చెందుతున్నారని అంటునారు. ఈ నేపధ్యంలోనే, పార్టీ నాయకుడు ఒకరు, అసలు రహస్యాన్ని బయట పెట్టారు. “నిజానికి ముఖ్యమంత్రి  భయానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై స్పష్టత రావడం ఒక్కటే, కాదు, మొత్తానికి పార్టీ భవిష్యత్ విషయంలోనే కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు” అని ఆయన అన్నారు.నిజమే కావచ్చును ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎంత పెద్ద వాగ్దానం చేసేందుకు అయినా, అయన ఒక్క క్షణం అలోచించరు. క్షణాల్లో చిటికెల పందిళ్ళు వేస్తారు.అంతే స్పీడ్’ గా అట్టు తిరగేస్తారు. ఓడ మల్లయ్యను బోడి మల్లయ్యను చేస్తారు. ఆ రకంగా ఆయన అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక సందర్భంలో, బుట్టలో వేసుకున్నారు. చేసిన వాగ్దానాలను ఇంచక్కా తుడిచేశారు.  దళితుల విషయంలో డోసు కొంచెం ఎక్కు వైంది. ఓ వంక ఇచ్చిన మాట ఏదీ నిలుపుకోలేదు, మరోవంక దళిత ఉప ముఖ్యమంత్రికి ఉద్వాసన పలకడం, వంటి అవమానాలకు గురి చేశారు.  ముఖ్యమంత్రి పదవి మొదలు, కుటుంబానికి మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి అనేక వాగ్దనాలు చేసినా విషయాన్నీ కేసీఆర్ మరించి పోయారు. ఆ విధంగా దళితులే కాదు అందరి విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కోల్పోయారు. అంటే కాదు, దళితులను దగ్గరకు తీసుకుని చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేక పోతున్నామో చెప్పీ దళితలను విశ్వాసంలోకితీసుకునే ప్రయత్నం చేయలేదు, అందుకే అయన అందరి విశ్వాసాన్ని కోల్పోయారు. అదే ఇప్పుడు ఆయనను శాపమై వెంటాడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి భయం నిజంగానే భయం అయితే, అందుకు ఇంకా కారణాలున్నా, విశ్వసనీయత కోల్పోవడం ఒక ప్రధాన కారణమని విశ్లేషుకులు భావిస్తున్నారు.

తెలంగాణలో సెకండ్ వేవ్ ముగిసిందట.. ఇక స్కూల్స్ తెరుస్తారా? 

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ సృష్టించిన ప్రళయ ఉదృతి సర్దుకుంది. కొంత ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసులు తగ్గాయని, ఆర్‌నాట్‌ వ్యాల్యూ 0.7 శాతంగా ఉందని ఆయన తెలిపారు.ఆర్‌నాట్‌ వ్యాల్యూ 1 దాటితేనే వైరస్‌ తీవ్రత ఉన్నట్లుగా గుర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 0.5శాతమే ఉందన్నారు. మూడోవేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు 25వేల పడకలు సిద్ధంగా ఉంచామని, అదనంగా మరో 10వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  అయితే ఒక ఉపద్రవం తప్పిందని అనుకుంటే, రాష్ట్రంలో చాలా చోట్ల కురుస్తున్న వర్షాలతో,  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 1200 డెంగీ కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది కంటే డెంగీ కేసులు పెరిగినా, ఆందోళనకర పరిస్థితులేమీ లేవని ఆహికరులు ఆయన చెప్పారు.సీజనల్‌ వ్యాధుల కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.  మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డెంగీ, మలేరియా కిట్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లోనూ సీజనల్‌ వ్యాధుల నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయని  వెల్లడించారు.  ప్రజల ఆరోగ్యం వారి చేతిలోనే ఉందని, ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలన్నీ కొవిడ్‌తో వచ్చేవి కావని పేర్కొన్నారు. కరోనా జ్వరంగా భావించి, సొంత వైద్యం చేసుకోవద్దని, ముఖ్యంగా గూగుల్‌, యూట్యూబ్‌ వైద్యంపై ఆధారపడొద్దని హితవు చెప్పారు.   అయితే ఓ వంక చాలా వరకు ప్రజలు కనీసం మాస్క్ అయినా లేకుండా, యధేచ్చగా తిరుగుతుండే సీజనల్ వ్యాదులకు గురయిన ప్రజలు కరోనా ఏమోఅని కంగారు పడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరో వంక రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, అనే విషయమ్లో ఇంకా స్పష్టత రాలేదు, రాష్ట్ర విద్యా శాఖ, సెప్టెంబర్ 1 నుంచి 8 వ తరగతి ఆ పై తరగతుల విద్యార్ధులకు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించి, నివేదిక సిద్దం చేసింది. అయితే, నివేదిక సమర్పించి సుమారు వరం రోజుల పైనే అయినా ముఖ్యమంత్రి కేసీఆర్  అనుమతి  కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

వీడిన గాంధీ ఆస్ప‌త్రి రే*ప్ మిస్ట‌రీ.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్‌..

అంతా మిస్ట‌రీ. అక్కాచెల్లెల్లపై ఘాతుకం. అది కూడా హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో. అత్యా*చారం జ‌రిగిందంటూ ఓ బాధితురాలు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు. త‌న సోద‌రి క‌నిపించ‌డం లేదంటూ కంప్లైంట్‌.  ల్యాబ్ టెక్నీషియ‌న్‌పై అనుమానం. నిందితుడిని విచారిస్తే ఎలాంటి స‌మాచార‌మూ లేదు. ఇటు, గాంధీ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ ఏమో త‌మ ఆస్ప‌త్రిలో అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌న్నారు. మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ సైతం గాంధీ ద‌వాఖాన‌కు వ‌చ్చి ఆరా తీశారు. పోలీసులు ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలా, కొన్ని రోజులుగా గాంధీ ఘ‌ట‌న‌పై ఫుల్ హ‌డావుడి నెల‌కొంది. మిస్ట‌రీగా మారిన ఆ ఉదంతం ప్ర‌స్తుతం కీల‌క మ‌లుపు తిరిగింది. మొద‌టి నుంచీ అనుమానిస్తున్న ల్యాబ్ టెక్నీషియ‌న్ కాకుండా.. సెక్యూరిటీ గార్డే అస‌లు నిందితుడ‌ని తేల్చారు పోలీసులు.  గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్టు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు.  మహబూబ్‌నగర్‌ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చారు. వారికి తెలిసిన వ్య‌క్తి గాంధీలో ప‌ని చేస్తున్నారు. గాంధీ హాస్పిట‌ల్ సిబ్బందిలో కొంద‌రు ఆ ఇద్ద‌రిని గ‌దిలో బంధించి అత్యా*చారం చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వారి  చెర నుంచి త‌ప్పించుకొని పాల‌మూరు వ‌చ్చిన ఓ బాధితురాలు అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగుచూసింది. మ‌రో బాధితురాలి ఆచూకీ ఆ రోజు నుంచీ ల‌భించ‌లేదు.  తాజాగా, ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ సైతం లభ్యమైంది. హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకొని ఘటనపై విచారించారు.   

గోరంట్ల రాజీనామాపై సస్పెన్స్.. టీడీపీని వీడబోరన్న అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో సీనియర్ నేత రాజీనామా వార్తలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత,  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని,  కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే రాజీనామా వార్తలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం స్పందించలేదు. దీంతో ఆయన నిజంగానే టీడీపీని వీడనున్నారా లేక ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనా అన్నది తేలడం లేదు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి. గోరంట్ల అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఆయనకు ఫోన్‌ చేశారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని.. అన్నీ సర్దుకుంటాయని  బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారు. తనను కించపర్చడమే కాకుండా తన ఇంటికి వచ్చిన వారిని కూడా దూషిస్తున్నారంటూ చంద్రబాబుకు బుచ్చయ్య చెప్పారని తెలుస్తోంది.  పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనపట్ల ఇలా ప్రవర్తించడమేంటి..? అని హైకమాండ్‌తో పాటు కొందరు నేతలపై బుచ్చయ్య తీవ్ర ఆవేదనను బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనయ్యారని ఆయన అనచరులు అంటున్నారు. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా చంద్రబాబు,  లోకేష్ అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలు మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయడం లేదని చెబుతున్నారు. గోరంట్ల ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి. సమావేశం తర్వాత మాట్లాడిన నల్లమిల్లి.. గోరంట్ల రాజీనామా చేయడం లేదని చెప్పారు. పార్టీలో చిన్న చిన్న అసంతృప్తు సహజమని, త్వరలోనే అన్ని సర్ధుుకుంటాయని తెలిపారు. గోరంట్లతో చంద్రబాబు నాయుడు మాట్లాడారని, త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడదామని చెప్పారని నల్లమిల్లి తెలిపారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గోరంట్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఎవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుదామని చెప్పారని తెలుస్తోంది. గోరంట్ల టీడీపీలోనే ఉంటారనే ధీమా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉంటారని, ఆయనెప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోరని మాజీ మంత్రులు చిన్నరాజప్ప, జవహర్ చెప్పారు. 

ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌ట్లేదు.. కేంద్రమంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీ. అభివృద్ధిలో తిరోగ‌తి. అప్పులే గ‌తి. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాలంటే అప్పు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే అప్పు. ఆఖ‌రికి పెన్ను, పేప‌రు కొనాల‌న్నా అప్పు..అప్పు..అప్పు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల ప్ర‌దేశ్‌గా చేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్‌కే ద‌క్కుతుందంటారు. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేసేసి.. అభివృద్ధిని అట‌కెక్కించేసి.. ఉన్న  ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోయేలా చేసి.. కేవ‌లం సంక్షేమం అంటూ ప్ర‌జ‌ల‌కు ప‌ప్పు-బెల్లాలు పంచేసి.. రాష్ట్రాన్ని అథోగ‌తి పాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తోంది. అయితే, తాజాగా కేంద్ర‌మంత్రి చేసిన కామెంట్లు ఏపీ ప‌థ‌కాల డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెడుతోంది. సంక్షేమం పేరుతో సొంత‌డ‌బ్బా కొట్టుకుంటున్న జ‌గ‌న్ స‌ర్కారుకు చెంప‌పెట్టుగా మారుతోంది.   కేంద్ర పథకాలు మినహా ఏపీలో అభివృద్ధి జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీలో ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న కాస్తోకూస్తో అభివృద్ధి కూడా కేంద్రం వ‌ల్లే జ‌రిగింద‌ని చెప్పారు.  ఏపీకి అనేక విద్యాసంస్థ‌ల‌ను మంజూరు చేసిన‌ట్టు.. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను డెవ‌ల‌ప్ చేసింది కూడా కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పారు కిష‌న్‌రెడ్డి. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపించింద‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైనా కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి స్పందించారు. తెలుగు స్టేట్స్ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన అన్నారు.   

ఇలా చేస్తే 32 రూపాయలకే లీటర్ పెట్రోల్!  

దేశంలో చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న రేట్లతో లీటర్ పెట్రోల్ రేట్ ఎప్పుడో సెంచరీ దాటేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు దగ్గరలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ రేటు కూడా సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఆగకుండా పెరుగుతున్న ధరల వల్ల బంకు వెళ్లిన ప్రతీసారీ సామాన్యుడు బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు చమురు ధరల పెరుగుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  పెట్రోల్ ధరలపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. గత యూపీఏ  ప్రభుత్వానిదే పాపమని చెప్పారు. యూపీఐ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని  తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కౌంటరిచ్చారు. అంతేకాదు ఎలా చేస్తే పెట్రోల్ రేట్ తగ్గుతుందో కూడా చెప్పారు చిదంబరం. పెట్రోల్ పై విధిస్తున్న సెస్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని చిదంబరం తెలిపారు. సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని అన్నారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్ లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్ లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ. 32కే అందుబాటులోకి వస్తుందన్నారు చిదంబరం.  మరోవైపు ఇటీవలే త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం  తీపి క‌బురు చెప్పింది. పెట్రోల్‌ పై విధించే రాష్ట్ర ప‌న్నును త‌గ్గించ‌నున్న‌ట్లు ఆర్థిక మంత్రి పీ తియ‌గ రాజ‌న్ తెలిపారు. ఈ విధానాన్ని అమ‌లు చేసిన త‌ర్వాత లీట‌రు పెట్రోల్ ధ‌ర‌పై మూడు రూపాయ‌లు త‌గ్గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తమిళనాడు సర్కార్ నిర్ణయంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వాలు పన్నులను తగ్గించుకుని వాహనదారులపై భారం తగ్గించాలని జనాలు కోరుతున్నారు. కేంద్ర సర్కార్ కూడా పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లీటర్ పెట్రోల్ 32 రూపాయలకే అందించవచ్చంటూ చిదంబరం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఎంత మంది మతం మారారు ! ఎస్సీ కమిషన్ ఆదేశాలతో ఏపీ సర్కార్ సర్వే..

ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే  రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందనే విమర్శలూ మొదలయ్యాయి. అందులో ప్రధానమైనది ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఆర్థిక క్రమశిక్షణ గాలికి వదిలేసి, పంపకాలు, పందారాలకే పరిమితం కావడంతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అందుకే ఆర్థిక వ్యవహరాలలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్జే విమర్శ బలంగా వినవస్తోంది. నిజానికి ఇది విమర్శ కాదు వాస్తవం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ( 2021-22)  చివరి నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,87,125.39 కోట్లకు చేరుకుంటాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలోనే సెలవిచ్చారు. అయితే  ఇంకా సగం సంవత్సరం అలా ఉండగానే రాష్ట్రం అప్పుల గీతను దాటేసిందనీ ఆయన గారే  అంటున్నారు. అలాగే ఒక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రజానీకం, ప్రతి ఒక్కరి తల మీద  ఇప్పటికీ రూ . 70 వేలకు పైగా అప్పుందని అంటారు. అయినా  రాష్ట్ర ప్రభుతం ఇంకా ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. మరో వంక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి చూస్తున్నాం. చివరకు మద్యం విక్రయాలపై రేపు వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి ప్రభుత్వం అప్పులు చేస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పననక్కరలేదు.  అదలా ఉంటే  ప్రభుత్వమే మత మార్పిడులను ప్రోత్సహిస్తోందనేది జగన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కుంటున్న మరో కీలక విమర్శ. నిజనికి ఇది కూడా విమర్శకాదు. ఇదీ వాస్తవమే.  జగన్ రెడ్డి ప్రభుత్వమా క్రైస్తవ మత ప్రచారాన్ని, మత మార్పిడులను ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లకు నెల నెలా జీతాలు ఇవ్వడం, ప్రభుత్వమే బహిరంగ టెండర్లు పిలిచి చర్చిల నిర్మాణం చేపడుతోంది. ఇందులో దాపరికమ లేదు. నిజమే, జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు కూడా, రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఆమాట కొస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలలో మత ప్రచారం, మత మార్పిడిలు జరుగుతున్నాయి. అయితే, ఇతర రాష్ట్రాలలో జరుగతున్న మత ప్రచార కార్యక్రమలాకు, ఏపీలో సాగుతున్న మత విద్వేష రాజకీయాలకు, కార్యక్రమాలకు మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉందనేది అందరికీ తెలిసిన నిజం.  జగన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత  రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు జోరందుకున్నాయి. రాజకీయాలలో మతం, మతంలో రాజకీయాలు కలిసి పోయాయా,అన్న రీతిలో మత ప్రచారం, మత మార్పిడులు జోరందుకున్నాయి, గ్రామాలలో  క్రైస్తవీకరణ మహా జోరుగా సాగిపోతోంది. క్రైస్తవ గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మరో వంక హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోయాయి. ఇది కంటి ముందు కనిపిస్తున్న వాస్తవం. మతం మారిన దళితులు, అటు క్రైస్తవులకు మతపరంగా వచ్చే సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారు. మరో వంక  దళితులకు అందవలసిన ఫలాలు మతం మారిన క్రైస్తవులకు దక్కుతున్నాయని, ఆ విధంగా నిజమైన దళితులకు అన్యాయం జరుగుతోందని చాలా కాలంగా విమర్శలు వినవస్తున్నాయి.నిజానికి,ఈ వివాదానికి సంబంధించి వైసేపీ తిరుగునాటు, ఎంపీ రఘురామా కృష్ణం రాజు, ఇతర వ్యక్తులు, సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకు వెళ్ళాయి. ఇప్పుడు మరోసంస్థ మరింత స్పష్టమైన ఆధారాలతో రాష్ట్రంలో భారీ ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని,దళితులకు అందవలసిన ఫలాలు క్రైస్తవులకు దక్కుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లాల వారీగా జరిగిన మత మార్పిడులు, దళితులు కోల్పోయిన ప్రయోజనాలకు సంబంధించి సేకరించిన వివరాలను కూడా, కమిషన్ కు సమర్పించింది. ఈ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.  ఈ నేపధ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం, దళితులు ఇంట్లో ఏ దేవుళ్లను ఆరాధిస్తున్నారు? ఎంత మంది మతం మారారు? వారిలో ఎంత మంది చర్చిలకు వెళ్తున్నారు? ఏ గ్రామంలో ఎన్ని చర్చిలున్నాయి? ఇలాంటి వివరాలు సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘సర్వే’ నిర్వహించాలని  నిర్ణయించింది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే మొత్తం 13 జిల్లాల అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఓ మెమో జారీచేశారు. మునిపాలిటీలలో, మండలాల్లో ఎన్ని చర్చిలున్నాయో లెక్క తీయాలన్నారు. కొన్ని ఎస్సీ కాలనీలకు వెళ్లి వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నారా... క్రైస్తవం స్వీకరించారా? తెలుసుకోవాలని... ఐదు రోజుల్లోపు ఈ నివేదికలను అందించాలని ఆదేశించారు. అయితే ఈ కసరత్తు వలన ఏమి ప్రయోజనం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇలా, చర్చిల సంఖ్య, క్రైస్తవ జనాబా వివరాలు సేకరించడం వెనక జగన్ రెడ్డి మార్క్ , ‘క్రాస్’  రాజకీయాలు ఉన్నాయని కూడా అనుమానిస్తున్నారు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని, ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో సాగుతున్న మత రాజకీయాలకు తెరదించాలని, ముఖ్యంగా దళితులకు దక్కవలసిన ప్రయోజనాలను, వారికి మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని దళిత  సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

తాలిబ‌న్ల‌తో ఓవైసీ చ‌ర్చ‌లు!.. బీజేపీ నేత సంచ‌ల‌నం..

తాలిబ‌న్‌. అఫ్ఘ‌నిస్తాన్‌. కొన్ని రోజులుగా ప్ర‌పంచ‌మంతా ఇదే ఇష్యూ. అంత‌టా తాలిబ‌న్ల గురించే చ‌ర్చ‌లు. వారి క్రూర‌త్వం, హింసపై భ‌యాందోళ‌న‌లు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు విమానం ఎక్కేందుకు పోటీప‌డుతున్న‌ అఫ్ఘ‌న్‌ల దృశ్యాలు. తుపాకుల‌తో కాబూల్ వీధుల్లో తాలిబ‌న్ల అరాచ‌కాలు. అఫ్ఘ‌నిస్తాన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను అతిక‌ష్టం మీద స్వ‌దేశానికి ర‌ప్పిస్తోంది ఇండియా. ఇలాంటి సంద‌ర్భంలో.. ఎమ్ఐఎమ్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాలిబన్లను ఇండియా గుర్తించినా గుర్తించకపోయినా వారితో చర్చలకు లాంఛనంగా మార్గాలను తెరిచి ఉంచాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇటీవ‌ల‌ వ్యాఖ్యానించారు. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే తాను ఈ సలహా ఇచ్చానని, అయితే తన సలహాను ఖాతరు చేయకపోగా విమర్శించారని ఒవైసీ అన్నారు. అఫ్గనిస్తాన్‌లో భారత్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు ఓవైసీ. అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్.. కేంద్రానికి ఉచిత సలహా ఇచ్చే బదులు కాబూల్ వెళ్లి ఆ పని ఆయనే చేస్తే బాగుంటుందంటూ సెటైర్ వేశారు. ‘భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఓవైసీపై బీజేపీ నేత‌, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. ఆ పెళ్లికూతురు ఎవ‌రో తెలుసా?

రెండు-మూడు రోజులుగా ఎక్క‌డ చూసినా అదే వీడియో. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అదే డ్యాన్స్‌. వాట్సాప్ స్టేట‌స్ల‌లోనూ అదే సాంగ్‌. అన్ని న్యూస్ ఛాన‌ల్స్‌.. అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ అదే క్రేజ్‌. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ అన్నిటికీ ల‌క్ష‌ల్లో వ్యూస్‌. లెక్క‌లేన‌న్ని లైక్స్‌, కామెంట్స్‌. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్త బా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. అంటూ ఓ బరాత్‌లో పెళ్లికూతురి చేసిన‌ డ్యాన్స్ వీడియో దుమ్మురేపుతోంది. ఆ వీడియో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. పాట అట్లే ఉంది. ఆమె డ్యాన్స్ కూడా అట్లే ఉంది. తెలంగాణ యాస‌లో సాంగ్ ఫుల్ జోష్‌లో ఉంటే.. ఆ లిరిక్‌కి త‌గ్గ‌ట్టే ఆ పెళ్లికూతురు వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. చాలా నాచుర‌ల్‌గా, సింపుల్‌గా చేసేసింది డ్యాన్స్‌. పాట‌కు త‌గ్గ‌ట్టే ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ.. అర్థానికి సింక్ అయ్యేలా మూమెంట్స్ చేస్తూ.. వ‌రుడిని ఫిదా చేసేసింది. ఆ పెళ్లికొడుకు త‌న అర్థాంగి డ్యాన్స్‌ను అలా చూస్తూ ఉండిపోయాడంతే. ఆ వీడియో చూసిన వారంతా కూడా అంతే ఫిదా అయిపోతున్నారు. ఏం డ్యాన్స్ చేసిందిరాబై అంటున్నారు. అందుకే, ఆ క‌పుల్ ఓవ‌ర్‌నైట్ పాపుల‌ర్ అయిపోయారు. ఇంత‌కీ వారెవ‌రు? ఆ పెళ్లి ఎక్క‌డ జ‌రిగింది? అనే ఎంక్వైరీ కూడా మొద‌లైపోయింది. ఇంత‌కీ ఆ కొత్త‌జంట ఎక్క‌డిదంటే.... మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక నగర్‌కి చెందిన పయ్యావుల రాము కూతురు సాయిశ్రేయకి.. గత శనివారం వరుడు అశోక్‌తో వివాహమైంది. ఆ పెళ్లి త‌ర్వాత జ‌రిగిన బ‌రాత్‌లోనే సాయి శ్రేయ ఈ డ్యాన్స్ చేసింది. భర్త ముందు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. స్నేహితులు, బంధువులు ఈ డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇప్పుడిదే ట్రెండింగ్. తమ బరాత్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంపై కొత్త జంట ఫుల్ ఖుషీ అవుతోంది. పెళ్లి తర్వాత మా వారికి గిఫ్ట్‌ ఇద్దామనే ఆ పాటకి డ్యాన్స్ చేశానంటోంది సాయి శ్రేయ‌. ఫ్రెండ్స్‌, సహోద్యోగులు ఫోన్ చేసి మరీ అడుతున్నారని పెళ్లికొడుకు అశోక్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఓవ‌ర్‌నైట్ ఇంత‌టి పాపులారిటీ రావ‌డంతో.. కొత్త జంట సెలబ్రెటీ క‌పుల్‌గా మారిపోయింది. 

చంద్రబాబు వల్లే కేటీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారా? 9 ఓట్లతో ఎలా బయటపడ్డారంటే? 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాజకీయ అడుగులపై మొదటి నుంచి వివాదాలే ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినపుడు కేటీఆర్ ఇండియాలోనే లేరు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతునప్పుడు కూడా ఆయన రాలేదు. అయితే 2008లో ఆయన ఇండియాకు వచ్చారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ మొదట తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని అంటారు. తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదు అనవసరంగా తన తండ్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కొంత మంది నేతలను ఆయన తిట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాంటి కేటీఆర్.. సడెన్ కు యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం చకాచకా జరిగిపోయాయి. కేటీఆర్ రాజకీయ అరంగ్రేటంపై ఇప్పటికి భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. తాజాగా కేటీఆర్ రాజకీయ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యే కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ బాంబ్ పేల్చారు. రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. సోమవారం గీతం యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్ ఐఏఎస్ కావాలని కోరుకున్నారని, కాని తాను ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్లపై కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రాజకీయ కాక రాజేశారు. ‘ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఐఏఎస్ అవుదామనుకుంటే ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాడంట. ఒరే సన్నాసి కేటీఆర్.. ఏం మాట్లాడుతున్నావ్. సిరిపిల్లలో మహేందర్ రెడ్డికి మీ అయ్య ద్రోహం చేసి నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? చంద్రబాబు కాళ్లుపట్టుకుంటే నిన్న టీడీపీ గెలిపించింది నిజం కాదా? ఆయన అయ్యకు తెలియకుండా ఎమ్మెల్యే.. మంత్రి అయ్యాడంట’ అంటూ  రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు కేటీఆర్. టీఆర్ఎస్ స్థాపన నుంచి ఆ నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న మహేందర్ రెడ్డి.. సిరిసిల్లలో పార్టీని బలోపేతం చేశారని చెబుతారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగా ఉండేది. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేసినా.. సిరిసిల్లలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని రాజేశ్వరరావు విజయం సాధించారు. 2004 తర్వాత నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపడింది. ఇందుకు కేకే మహేందర్ రెడ్డినే కారణం. 2009లో కేకేనే సిరిసిల్ల నుంచి పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. కాని 2008లో విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ పార్టీలో చేరారు. దీంతో కేటీఆర్ కోసం నియోజకవర్గాన్ని ఆన్వేషించిన కేసీఆర్.. పార్టీ  బలంగా ఉన్న సిరిసిల్లను ఎంచుకున్నారని అంటారు. ఇక 2009లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. సిరిసిల్లలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి... ఈ నియోజకవర్గాన్ని టీడీపీనే తీసుకుంటుందని భావించారు. కాని కేటీఆర్ కోసం కేసీఆర్ అడగడటంతో చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. అంతేకాదు కేటీఆర్ కోసం సిరిసిల్లను కేటాయించడమే కాదు.. ఆయన గెలుపు కోసం చంద్రబాబు గట్టిగా కష్టపడ్డారని అంటారు. నిజానికి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి జనాల్లో మంచి పట్టుంది. టీఆర్ఎస్ మోసం చేసిందనే సెంటిమెంట్ కూడా 2009లో జనాల నుంచి ఆయనకు వచ్చింది. దీంతో కేకే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కేకేను తట్టుకోవడం కష్టమని తేలడంతో కేసీఆర్.. చంద్రబాబును కలిసి ఎలాగైనా గెలిపించాలని అభ్యర్థించారని అంటారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా ఇవే. దీంతో సిరిసిల్లలో తొలిసారి కేటీఆర్ గెలుపుపై గతంలో జరిగిన ప్రచారమంతా నిజమేనని తెలుస్తోంది. 2009లో ఇంత చేసినా కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ కేవలం 9 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోకుంటే సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేటీఆర్ చిత్తుగా ఓడిపోయేవారని అంటారు. మొత్తానికి కేటీఆర్ సిరిసిల్ల రాజకీయం గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కేసీఆర్, కేటీఆర్ ను ఇరుకున పెడుతున్నాయి. 

అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం.. గంటలో అంత మంది చనిపోతున్నారా?

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొవిడ్ కేసులు పెరిగిపోయాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. ఇండియాను అతలాకుతలం చేసిన డెల్టా వేరియంట్ తో ఇప్పుడు కొన్ని దేశాలు అల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ తీవ్ర రూపం దాల్చింది. వణుకుపుట్టేలా అక్కడ కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో సగానికి మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తైంది. దీంతో కొవిడ్ కంట్రోల్ లోకి వచ్చిందనే అంతా అనుకున్నారు. తాజా పరిస్థితిలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. డెల్టా వేరియంట్ తో పాటు కొత్త రకాలతో వైరస్ తీవ్రత మరోసారి ఎక్కువైంది. అమెరికాలో ప్రస్తుతం రోజువారీ మరణాలు సరాసరిన వెయ్యికి పైగానే  ఉంటున్నాయని చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజులోనే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1017గా నమోదైంది. ఇవన్ని అధికారిక లెక్కలు కాగా.. అనధికారికంగా ఈ లెక్క మరింతగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తాజా మరణాలతో కలిపి అమెరికాలో కరోనా మరణాలు మొత్తం 6.22లక్షలకు చేరింది.  అమెరికాలో ప్రతి గంటకు 50 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ల తీవ్రత కూడా ఎక్కువైందని చెబుతున్నారు. కేసుల తీవ్రత మొదలైన కొద్దిరోజులకే వైరస్ లోడ్ అధికంగా ఉన్న కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. గడిచిన రెండు వారాల్లోనే ఆసుపత్రుల్లో చేరికలు 70 శాతం పెరిగినట్లుగా అమెరికా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరిస్తున్నారు. వైరస్  తీవ్రత తగ్గడంతో  అమెరికన్ ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించడం మానేశారు.  ముఖానికి మాస్కు పెట్టుకునే అలవాటును తీసేశారు. భౌతిక దూరం మాటే మరిచారు. ఇదే ఇప్పుడు కొవిడ్ తీవ్రత పెరగడానికి కారణం అయ్యాయని భావిస్తున్నారు. కొవిడ్ పై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరించటం కూడా కేసుల సంఖ్య పెరగటానికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికి టీకాలు వేయించుకోని వారికి ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

కదం తొక్కి.. పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

తెలంగాణ ప్రజల కడుపు మండుతోంది.. కండలు కరుగుతున్నయ్.. పేదలు ఆకలితో అలమటిస్తున్నారని కేసీఆర్ స‌ర్కారుపై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తొలి అడుగు ఇంద్రవెల్లిలో పెట్టినం.. మలి అడుగు మహేశ్వరంలో పెట్టినం.. ఇక మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద పెడుతాం అంటూ హెచ్చరించారు. రావిర్యాల దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్‌.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం తొక్కి.. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ద‌ళిత‌-గిరిజ‌న‌ సభ ద‌గ్గ‌ర పల్లీలు అమ్ముకునే వారు ఉన్నంత మంది కూడా.. హుజురాబాద్ సీఎం సభలో లేరని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.  బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విరుచుకుప‌డ్డారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలన్నారు. ‘‘ తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఉన్నారు. మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారు. కృష్ణానది ఉప్పొంగినట్లు కాంగ్రెస్‌ సభకు ప్రజలు వచ్చారు. సీఎం హుజూరాబాద్‌ సభకు ఎంతమంతి వచ్చారో చూశాం. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లుంది. టీఆర్ఎస్‌ ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయి’’ అని మండిప‌డ్డారు రేవంత్‌రెడ్డి.  దళిత బంధు పేరుతో ఓట్ల వేటకు బయల్దేరిన కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఏడేళ్ల పాలనలో ఎస్సీలను, ఎస్సీ అధికారులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌ .. ఎన్నికల కోసం కొత్త నాటకాలకు తెరతీశారని విమ‌ర్శించారు. దళిత బంధు కింద ఇస్తున్న రూ.10లక్షలు ఎవరి భిక్షం కాదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు బాగుపడలేదని, సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆరోపించారు. విద్య, ఉపాధి కల్పించకుండా దళితబంధు పేరుతో కొత్త మోసానికి తెరతీశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్‌ ఎన్నికలు వేదిక కావాలన్న రేవంత్‌రెడ్డి.. మోసపూరిత హామీలను నమ్మి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలను కోరారు.    

జోరు వానను లెక్కచేయన జనం.. రావిర్యాలలో రఫ్పాడించిన రేవంత్ 

అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్లాండ్ లీడర్ గా ఈ మల్కాజ్ గిరి ఎంపీకి పేరుంది. కొన్నేండ్లుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై మాట్లాడేందుకు నేతలంతా జంకుతున్నా.. తనదైన శైలిలో ఆయన విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ గా నియమించాకా మరింత జోరు పెంచారు రేవంత్ రెడ్డి. ప్రజాసమస్యలపై వరుస ఆందోళన కార్యక్రమాలతో అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలో దరువేస్తున్నారు. పంచ్ డైలాగులు, పవర్ వుల్ ఆరోపణలతో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత భారీగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పాలనపై విసిగిపోయిన జనమంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. దీంతో రోజురోజుకు ఆయన క్రేజీ పెరిగిపోతోంది. ఎంతగా అంటే ఆయన కోసం ఏదైనా చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి సభ ఉందంటే వందల కిలోమీటర్లు సొంతగానే వెళుతున్నారు. ఇటీవల ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ సభ సక్సెస్ ఇందుకు ఉదాహారణ. తాజాగా రావిర్యాలలో జరిగిన రెండో సభను జనం పోటెత్తారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారు. సభకు రావడమే కాదు రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసేవరకు అంతా కదలకుండా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి ముందే భారీగా వర్షం కురిసింది. అయినా ఎవరు కదలలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జోరు వాన పడింది. అయినా వెనుదిరగకుండా అలాగే సభలో ఉండిపోయారు జనాలు. రేవంత్ రెడ్డి విసురుతున్న డైలాగులకు జేజేలు కొడుతూ విన్నారు. రావిర్యాల సభలో వచ్చిన స్పందన చూసిన వారంతా రేవంత్ రెడ్డి మేనియాను చూసి ఆశ్చర్యపోతున్నారు. రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి తన మార్క్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. రాష్ట్ర సీఎం, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేస్తామని అన్నారు తెలంగాణ కోసం పోరాడింది ఎవరూ.. సంపదను దోచుకుంటుంది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని జనానికి పిలుపిచ్చారు. ఏడేళ్ల పాలనలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు.. ఇలా అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను పీసీసీ చీఫ్ చేయడంతో ప్రగతి భవన్ లో పిడుగు పడిందని.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని విమర్శించారు. అందుకే గత నెల రోజుల నుంచి కాళ్లు కాలిన పిల్లిలెక్క.. కల్లు తాగిన కోతిలెక్క గంతులేస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే ఒక్క నియోజకవర్గంలోని దళితులకు రూ. 10 లక్షలు ఇస్తా అంటున్నారు. వారికే కాదు జై భీమ్, జై సేవాలాల్ అన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సచ్చింది ఒకరైతే.. సంపాదన కొల్లగొట్టింది మరొకరనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రిజర్వేషన్లు, పట్టాలు, భూములు, ఇండ్లు, ఉపాధి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అందులోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకులు, కేసీఆర్ మోచేతి నీళ్లకు ఆశ పడుతారని.. కానీ, తెలంగాణ బిడ్డలు మాత్రం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారని.. ప్రజలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. గత ఏడేండ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు కానీ.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి, కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, బిడ్డకు ఎంపీ, ఎమ్మెల్సీ వస్తే.. సడ్డకుని కొడుక్కి రాజ్యసభ వచ్చింది అంటూ చురకలు వేశారు. ఈ పదవులతో కోట్లు కూడబెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. మరి అమరవీరులకు ఏం వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. త్వరలోనే గడీల పాలనకు బుద్ధి చెబుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తామంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.  

సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు.. జైలు ఖాయమేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సంస్థల విచారణ ముమ్మరమైంది. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. వరుసగా చార్జీషీట్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తాజాగా సీఎం జగన్ కు  సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.  వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డితో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్‌కూ సమన్లు జారీ అయ్యాయి.  ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 25న తీర్పు రాబోతోంది. రఘురామ పిటిషన్ లో సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తూ సీబీఐ కౌంటర్ వేసింది. బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని సీబీఐ తమ రిజైండర్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు.దీంతో జగన్ బెయిల్ రద్దు కేసులో సంచలన తీర్పు రాబోతోందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి రఘురామ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని, జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దాంతో పాటు జగన్ బెయిల్ రద్దయితే ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న అంశాలపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఆగస్టు గండంతో  జగన్ శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తాడేపల్లి క్యాంప్ వర్గాలు చెబుతున్నాయి. 

నానా పటేకర్ రాజకీయ తూటాలు.. వైరల్ చేస్తున్న జనాలు! సమాధానం చెప్పదెవరు? 

నానా పటేకర్ ఒక విలక్షణ నటుడు. సామాజిక స్పృహ కలిగిన మంచి రచయిత, కథకుడు, నిర్మాత, దర్శకుడు ... ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యమ కార్యకర్త. ఆయన తమ మనసులో మెదిలిన కొన్ని ఆలోచనలు, సంఘర్షణలకు అక్షర రూపం ఇచ్చారు ... కొనీ నిర్దిష్ట ప్రశ్నలను లేవనెత్తారు.. నిజానికి ఇవేవి కొత్తగా పుట్టుకొచ్చిన ప్రశ్నలు కాదు. మన అందరిలో రగులుతున్న అగ్నికణాలే  .. గొంతెత్తి నిలతీయాలని ... అనుకుంటూ .. అసక్తతతో గొండులోనే ఆగిపోతున్న చేదు గుళికలనే .. నానా పటేకర్ ..అక్షర తూటాలు చేసి సంధించారు ...  అవును .. మందరికీ కాకపోయినా కొందరికి అయినా, ఎప్పుడో అప్పుడు, ఇదేమిటి ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతు .. అదే పొలంలో అలా చనిపోవడం ఏమిటి, ఆ రైతు కొడుకు ఎక్కడో, దేశ సరిహద్దుల్లో, ఏ ముష్కరడో పేల్చిన తూటాకు నేల కొరగడం ఏమిటి? ఏమీ కానీ వాడు, ఏమీ చేయని వాడు ... రాజకీయ వేషం కట్టిన వాడు ఇక్కడ దేశంలో ... వాడి కడుపున  పుట్టడం తప్ప ఇంకే అర్హత, యోగ్యతా లేని, వాడి సంతానం అక్కడ విదేశాలలో అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ... విలాసవంత మైన జీవితాలను గడపడం ఏమిటి? అన్న ప్రశ్నలు వెంటాడే ఉంటాయి కదా.. అదిగో అలాంటి  ప్రశ్నలే .. నానా పటేకర్... మన ముందుంచారు ..చూడండి ..  రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. ఇదేమిటి ... ఇదెక్కడి న్యాయం ? అని పటేకర్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని అని సమాజాన్ని నిలదీస్తున్నారు.  అలాగే రాజకీయ నాయకుల విద్యార్హతలను ప్రశ్నిస్తూ .. ఓక్ చేదు నిజాన్ని పటేకర్ నినదించారు .. ఆచేదు నిజం ఏమంటే,  ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి. అలాగే తమలో నిండిన అక్రోశాన్ని వ్యక్తపరుస్తూ ...ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు నేల కొరుగుతారో .. ఏ రోజు  నేతల పంటలకు అగ్గి తగులుతుందో... ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి, అంటారు. అదే విధంగా పటేకర్ ... ఒక్క సారి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి జీవితాంతం  పెన్షన్, ఇతర సదుపాయాలు ఎందు కివ్వాలి? ప్రశ్నిస్తున్నారు.. 25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు.కానీ,ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.ఇలా ఎందుకు ఇవ్వాలి?  అలాగే పటేకర్ సంధించిన మరి కొన్ని తూటాలు .. నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.కానీ,భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.కాని,మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం. విద్యలో రాజకీయం 100% రాజకీయంలో విద్య 00% ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది.దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.నిజం, కానీ, నిజంగా చూస్తామా .. ఎప్పటికైనా అలాంటి రోజు ఒకటి వస్తుందా, అనుమానమేలేదు .. రాదు.  ₹399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?  ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా? అందరూ ఆలోచించాలి. అంతటూ నానా పటేకర్ .. తమ మనసు విప్పి మనముందు ఉంచారు.

ప్రభుత్వ జీవోలు ఎందుకు దాచేస్తున్నారు.. హైకోర్టు సీరియస్ 

ఆంధ్రపదేశ్ లో ప్రస్తుతం జీవోల రచ్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిగా బరి తెగించింది. పారదర్శకతకు పూర్తిగా పాతరేస్తూ జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లలో పెట్టకూడదని నిర్ణయించింది. పాలనకు సంబంధించిన జీవోలు ప్రజలకు తెలియకుండా ఉండాలన్న  జగన్ ప్రభుత్వం నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో రచ్చ సాగుతోంది. విశ్వసనీయత, పారదర్శకత పై పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జీవోలు రహస్యంగా ఉంచుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రహస్య జీవోలు, ఖాళీ జీవోలు, కనిపించని జీవోలు అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.  తాజాగా ఏపీ బాటలోనే తెలంగాణ సర్కార్ కూడా పారదర్శకతను తుంగలో తొక్కిన అంశాలు బయటికి వచ్చాయి. కేసీఆర్ సర్కార్  అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో లేకుండా దాచేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. తెలంగాణలో అసలు వెబ్ సైట్ లోనే జీవోలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళితబంధు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్ సైట్ లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరుఫున అడ్వొకేట్ జనరల్  ప్రసాద్ స్పందించారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్ లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్ ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది శశికరణ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని   ఘాటుగా ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. దళితబంధుపై దాఖలైన పిటిషన్ పై విచారణ ముగించింది.

బ‌ట్ట‌లు చింపి.. వంద‌లాది మంది చెర‌బ‌ట్టి.. పాక్ మ‌హిళపై మూక దాడి..

అది అఫ్ఘ‌నిస్తాన్ కాదు. వాళ్లు తాలిబ‌న్లు కూడా కాదు. కానీ, అంత‌కుమించి దారుణానికి తెగించారు పాకిస్తానీయులు. అది కూడా పాక్ ఇండిపెండెన్స్ డే రోజున‌. ఓ మ‌హిళా టిక్ టాక‌ర్ బ‌ట్ట‌లు లాగేసి.. గాల్లోకి ఎగ‌రేస్తూ.. అక్క‌డి వీధుల్లో ఊరేగించారు ఛాంద‌స‌వాదులు. పాక్ ముష్క‌ర మూక‌లు.  ఆగస్టు 14న లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్​ ద‌గ్గ‌ర‌ ఓ మహిళా టిక్​ టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో వందలాది మంది గుర్తుతెలియని దుండ‌గులు.. ఆ మహిళపై ఒక్క‌సారిగా దాడి చేశారు. పెద్ద గుంపు మీద ప‌డ‌టంతో అంతా బిత్త‌ర‌పోయారు.  ఆ లేడీ టిక్ టాక‌ర్‌ను వివస్త్రను చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె బ‌ట్ట‌లు లాగేసి గాల్లోకి ఎగరేసి పైశాచికంగా ప్ర‌వ‌ర్తించారు. మహిళపై వంద‌లాది మంది చేసిన మూక‌ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసిన వారంతా దుండ‌గుల దుశ్చ‌ర్య‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధితురాలికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.  మూక దాడి అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు.. త‌న గ్రూప్ సభ్యులనూ వేధించారని.. పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన ఒంటిపై ఉన్న బంగారం, సెల్ ఫోన్, 15వేలు నగదు లాగేసుకున్నారని కూడా కంప్లైంట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  మ‌హిళా టిక్ టాక‌ర్‌పై జ‌రిగిన‌ దారుణ ఘటనపై లాహోర్ డీఐజీ సాజిద్​ ఖియానీ స్పందించారు. దాడికి పాల్పడిన మూక‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక‌ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మ‌హిళ‌పై జ‌రిగిన పైశాచిక‌త్వంపై పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తాలిబ‌న్ల‌లా ప్ర‌వ‌ర్తించిన ఆ పైశాచిక మూక‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.   

హైకోర్టు భవన విస్తరణకు నిధులు.. కర్నూల్ కు షిప్టింగ్ లేనట్టేనా?

మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా? అమరావతిపై ఆయన మనసు మార్చుకున్నారా? అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. అమరావతి సచివాలయానికే వెళ్లడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి జగన్.. ఇకపై రెగ్యులర్ గా సచివాలయానికి వెళతానని ఇటీవలే ప్రకటించారు. ఇంతలోనే ముఖ్యమంత్రి పంద్రాగస్టు ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. తాజాగా జరిగిన మరో అంశం కూడా మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అమరావతిలోని హైకోర్టు భవన విస్తరణకు వైసీపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది.  అమరావతిలో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతకొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల్ని అంగీకరించని ప్రభుత్వం..  హఠాత్తు గా ఆమోదించింది. ఇందుకోసం రూ. 29 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది.అమరావతిలో ఇపుడున్న హైకోర్టు  భవనం హైకోర్టు పూర్తిస్ధాయి కార్యకలాపాలకు సరిపోవటంలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. తమ అవసరాలకు వెంటనే మరో భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో హైకోర్టు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇపుడున్న భవనం పక్కనే అదనంగా మరో  భవనాన్ని నిర్మించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రౌండ్+ మూడంతస్తుల భవనం నిర్మాణం 76 వేల చదరపు అడుగుల్లో ఉండనుంది. దీని నిర్మాణానికి రు. 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.  మొదట్లో 5 అంతస్తులు నిర్మించాలని అనుకున్నా ఎందువల్లో రెండంతస్తులు తీసేసి మూడంతస్తులకే పరిమితం చేశారు.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు భవనం కాదు. దాన్న జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారు. అసలు హైకోర్టు భవనానికి డిజైన్లు ఖరారు కావడం ఆలస్యం కావడంతో ముందుగా ఈ భవనాన్ని శరవేగంగా నిర్మించారు. అసలు హైకోర్టు భవనం నిర్మాణం కూడా ప్రారంభమైంది. పునాదులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం మారడంతో అన్ని అమరావతి నిర్మాణాల్లాగే వాటినీ నిలిపివేశారు. నిర్మాణం కొనసాగి ఉంటే శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయి ఉండేది. కానీ ఆ నిర్మాణం నిలిపివేయడంతో ప్రస్తుతం ఉన్న భవనం హైకోర్టు కార్యకలాపాలకి సరిపోవడం లేదు. అదనపు భవన నిర్మాణంపై హైకోర్టు నుంచిచాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. అయితే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నారో కానీ కర్నూలుకు తరలిపోయే హైకోర్టుకు అదనపు ఖర్చు ఎందుకు అనుకున్నారో కానీ హైకోర్టు ప్రతిపాదనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కారణం ఏమిటో రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు.  ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కర్నూలును న్యాయ రాజధాని గా ఏర్పాటు చేస్తామని చట్టం చేసింది. పాలనా వికేంద్రకరణ బిల్లు శాసనసభ, శాసనమండలిలో అనేక మలుపులు తిరిగినా చివరకు 2020 జూలైలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పాలన వికేంద్రీకరణ చట్టం సీఆర్డీయే రద్దు చట్టాలను పలువురు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం కోర్టు స్టే విధించడంతో ఏడాదిన్నరగా పాలనా వ్యవహారాలు అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. అదే సమయంలో రేపోమాపో రాజధాని తరలింపు అంటూ నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతలోనే అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.  ఇదంతా బాగానే ఉందికానీ కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మానవహక్కుల కమీషన్, లా కమీషన్ కార్యాలయాలను కర్నూలులోనే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇపుడున్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని అమరావతిలోనే నిర్మించటంలో అర్ధమేంటి ? అన్నదే అర్ధం కావటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్నూలుకు హైకోర్టు తరలివెళ్ళటం ఇప్పుడిప్పుడే జరిగేపని కాదా అనే డౌటు పెరిగిపోతోంది. ఆగస్టు 15 వేడుకల ప్రసంగంలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఆ తర్వాత హైకోర్టు విస్తరణకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాలతో ప్రభుత్వ విధానంపై రకరకాల చర్చలు జరగుతున్నాయి. మూడు రాజధానులపై సీఎం జగన్ వెనక్కి తగ్గారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.