కరోనా మహమ్మారికి అరకోటి మంది బలి
posted on Oct 2, 2021 @ 3:04PM
ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఏమోకానీ, కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తాని గజగజ వణికిస్తోంది. చావన్నది లేని ఈ వైరస్ ఇంచు మించుగా గడచిన రెండేళ్లలో, లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ మహమ్మారి ఎన్ని ప్రాణాలను మింగేసిందో ... ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే, తాజాగా రాయిటర్స్ వార్తా సంస్థ వేర్వేరు మార్గాల్లో సేకరించి, విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. అంటే అరకోటిమందిని మిగేసింది. కరోనా తొలికేసు 2019 నవంబర్ 17 దక్షిణ చైనాలోని, హుబేలి ప్రావిన్స్’లో వెలుగు చూసింది. ఆ తర్వాత నెలరోజులకు, అదే ప్రావిన్స్ లోని వూహన్’లో డిసెంబర్ 20న శాస్త్ర వేత్తలు కరోనా వైరస్’ను గుర్తించారు. ఆ తర్వాత 2020 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనాను మహమ్మారిగా గుర్తించింది.
కాగా, ఈ ఏడాదిన్నరకు పైగా ఇచుమించుగా 115కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా వెలువడిన రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మందిని వైరస్ బలితీసుకోగా.. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో అగ్ర రాజ్యం అమెరికా సహ ఐదు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్ దేశాల్లోనూ లక్షల మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటింది. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు.
కరోనా మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.97లక్షల మంది కొవిడ్కు బలయ్యారు. ఇక భారత్లోనూ 4.48లక్షల మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 8000 కరోనా మరణాలు సంభవించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అంటే ఇప్పటికీ ప్రతి నిమిషానికి ఐదుగురు కొవిడ్తో మృత్యువాతపడుతున్నారు.అయితే, మన దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉన్నా, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగగా సాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతోంది.కానీ,ముప్పు పూర్తిగా తప్పలేదు. మూడో ఉదృతి విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. సో.. కొవిడ్ నిబంధనలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.