పెట్రోపై వ్యాట్ తగ్గిస్తావా లేదా జగన్! మంగళవారం టీడీపీ నిరసనలు..
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసనలకు పిలుపిచ్చారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెట్రోల్ బంక్ల వద్ద మంగళవారం 12 గం.ల నుంచి 1 గం. వరకు నిరసన కార్యక్రమం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపిచ్చారు.
అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేసారు. హామీ ప్రకారం పెట్రోల్పై రూ.16, డీజిల్పై రూ.17 తగ్గించాలని డిమాండ్ చేసారు. పక్క రాష్ట్రాల్లో తగ్గించినా, మన రాష్ట్రంలో మొండిచేయి చూపారన్నారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు, ఉపాధి రాదన్నారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుందన్నారు.
అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారన్నారు చంద్రబాబు. లారీల యజమానులు, కార్మికులు దెబ్బతినడమే కాక రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయన్నారు. పెట్రో భారాలకు ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు. దేశంలో అధికంగా పెట్రోల్ ధర రూ.110.98కి పెంచారు. కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.