జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగ సంఘాల షాక్‌.. మీటింగ్ బైకాట్‌..

పీఆర్‌సీ ఇచ్చేదాకా త‌గ్గేదే లే అంటున్నారు ఉద్యోగులు. ఇదిగో అదిగో అంటూ కాల‌యాప‌న చేస్తోంది స‌ర్కారు. అదేమంత పెద్ద విష‌యం కాదంటూ.. ఇవాళ‌-రేపు అంటూ.. మాట‌లు చెబుతున్నారే కానీ.. పీఆర్సీ మాత్రం ప్ర‌క‌టించ‌డం లేదు. ఇదేదో తేడాగా ఉంద‌ని.. ప్ర‌భుత్వ తీరు అనుమానాస్ప‌దంగా ఉందంటూ ఉద్యోగ సంఘాలు మ‌రింత‌ ఒత్తిడి పెంచుతున్నాయి. అయినా, పిల్లిమొగ్గ‌లు వేయ‌డం మాత్రం ఆప‌డం లేదు అధికారులు. అందుకు నిర‌స‌న‌గా.. పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీని పలు ఉద్యోగ సంఘాలు బైకాట్ చేసి మ‌ధ్య‌లోనే బయటికొచ్చేశాయి.  ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ భేటీలో సీఎస్‌ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరవ‌డాన్ని ఉద్యోగ సంఘాలు అంగీక‌రించ‌ లేదు. ప్రభుత్వ వైఖరిపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సమావేశంలో పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు మీటింగ్ నుంచి బయటకు వచ్చాయి. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు సమావేశానికి హాజరు కాగా.. 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.   పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ఆరోపించారు. మ‌రోసారి ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్‌సీ నివేదికపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో తాము అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్పలేదన్నారు. అక్టోబరు 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంత‌ వరకు ఇవ్వలేదని, కనీసం తాజా సమావేశంలో అయినా ఇస్తారని ఆశించామని, అయితే అలా జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు.  రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్‌ తెలిపారు. పీఆర్సీ రిపోర్ట్ ఇస్తామని నాలుగుసార్లు తిప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. గత నెలాఖరు వరకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ సలహాదారు చెప్పారన్నారు. పీఆర్సీని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోవడం తమను అవమానించడమేనని ఆయన అన్నారు.  పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని  ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇప్పుడు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 13 లక్షల మంది ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని.. నివేదిక కాలయాపన కోసమే కమిటీ వేశారని బొప్ప‌రాజు ఆరోపించారు. 

సీనియ‌ర్ల‌కు షాక్‌.. కెప్టెన్ ఛేంజ్‌.. న్యూజిలాండ్‌ టూర్‌కు న‌యా టీమిండియా..

టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో అట్ట‌ర్‌ఫ్లాప్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఫెయిల్యూర్‌. ఇక టీమిండియా ప‌నైపోయిందంటూ టాక్‌. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ త‌ప్పించుకున్నారు. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇండియన్ టీమ్‌.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు న్యూజిలాండ్ టూర్‌కు సిద్ధం కావాల్సి ఉంది. కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం కొత్త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. సీనియ‌ర్ల‌కు రెస్ట్ పేరుతో షాక్ ఇవ్వ‌గా.. యువ ఆట‌గాళ్ల‌లో టెస్టు జ‌ట్టును నింపేయ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి.  న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు.. నాన్‌స్టాప్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి లాంటి కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అంజిక రహానెకు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్పగించింది. ఛెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది. అంటే, తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు మాత్ర‌మే ర‌హానె కెప్టెన్ అన్న‌మాట‌. టీమిండియా జట్టు ఇదే...    అజింక్య రహానె (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ.  

సీఎం జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారు.. మంత్రి కామెంట్లతో కలకలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. నెలనెలా వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తోంది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేశారని కేంద్ర సర్కార్ హెచ్చరిస్తున్నా... అప్పు లేకుండా పాలన నడవలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న కొత్త రుణం తీసుకోవాల్సిందే. బ్యాంకుల నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతోంది జగన్ రెడ్డి సర్కార్.   జగన్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ భవిష్యత్ ను ఆగమాగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన  వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని చురకలు అంటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ లఫంగా, బట్టెబాజ్ గాళ్ళ కు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు ప్రశాంత్‌ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని… కేంద్రం ఒత్తిడి తో ఏపిలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టారన్నారు. దేశం మొత్తం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే మోడీ ప్రయత్నం చేస్తున్నారని… తెలంగాణ లో మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసం పై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి.

మాజీమంత్రి నారాయ‌ణ ఎక్క‌డ‌? అమ‌రావ‌తి రైతుల‌ ఆక్రంద‌న ప‌ట్ట‌దా?

చంద్ర‌బాబు-అమ‌రావ‌తి-నారాయ‌ణ‌. ఐదేళ్లు విడ‌దీయ‌లేని బంధం. న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్వ‌ప్నం కాంక్షించారు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు. ఆ స్వ‌ప్నాన్ని క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు ఆ శాఖ మంత్రి నారాయ‌ణ‌. అమ‌రావ‌తి క్రెడిట్ చంద్ర‌బాబుకు ఎంత ద‌క్కుతుందో.. అందులో ఎంతోకొంత మాజీమంత్రి నారాయ‌ణ‌కీ చెందుతుంది. అమ‌రావ‌తి క‌లగ‌న్నారు చంద్ర‌బాబు. ఆ క‌ల‌ను నిజం చేసేలా అద్భుత రాజ‌ధాని నిర్మాణానికి పూనుకున్నారు. అంత‌ర్జాతీయ స్థాయి డిజైన్ల‌తో.. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రానికి శ్రీకారం చుట్టారు. న‌వ్యాంధ్ర రాజ‌ధాని కోసం చంద్ర‌బాబు త‌న మేథ‌స్సును మ‌ద‌నం చేస్తే.. అమ‌రావ‌తికి వాస్త‌వ రూపం తీసుకొచ్చేందుకు మంత్రి నారాయ‌ణ విశేషంగా కృషి చేస్తారు. అమ‌రావ‌తికి సంబంధించిన ప్ర‌తీ ప‌నిలోనూ చంద్ర‌బాబు వెంటే నిలిచారు. రాజ‌ధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎక‌రాలు సేక‌రించే బృహ‌త్కార్యాన్ని నారాయ‌ణే చేప‌ట్టారు. సీఆర్‌డీఏ ఏర్పాటు చేసి.. రైతుల‌కు న‌చ్చ‌జెప్పి.. అమ‌రావ‌తి కోసం స్వ‌చ్ఛందంగా రైతులు భూములు ఇచ్చేలా ఒప్పించ‌గ‌లిగారు. ఇంత చేసిన నారాయ‌ణ‌.. ఇప్పుడు అదే రాజ‌ధాని రైతులు అమ‌రావ‌తి కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంటే.. అప్ప‌టి మంత్రి నారాయ‌ణ.. ఇప్పుడు అడ్ర‌స్ లేకుండా పోయారు. ఆనాడు ముందుండి అంతా తాను చూసుకుంటాన‌ని మాటిచ్చి.. ఇప్పుడు నిండామునిగాక ముఖం చాటేశార‌ని మాజీమంత్రిపై అంతా మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ క‌థ‌నం వైర‌ల్ అవుతోంది. మాజీమంత్రి నారాయ‌ణ‌.. నీవు ఎక్క‌డ? అంటూ రైతులు నిల‌దీస్తున్నార‌నేలా ఆ వార్త ఉంది. అయితే, ఈ వైర‌ల్ పోస్ట్‌ను అమ‌రావ‌తి రైతులే క్రియేట్ చేశారా? లేక‌, వైసీపీ వ‌ర్గాలు ప‌రోక్షంగా ఇలా అటాక్ చేస్తున్నారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఆ వైర‌ల్ న్యూస్ య‌ధాత‌ధంగా......   "అమరావతి భూములు సేకరించిన  మాజీమంత్రి నారాయణ నీవు ఎక్కడ? 2014 నుంచి 2019 వరకు తెల్లారేసరికి రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, ఇల్లు తిరిగి భూములు తీసుకొన్నావే. ఇప్పుడు నీవు భూములు సేకరించిన రైతులు రోడ్ల పాలైతే నీవు మాత్రం నెల్లూరు లో కూర్చుని సేద తీరుతున్నావా? నీకు అక్క,చెల్లెలు వేదన వినపడటం లేదా, ఆ కన్నీటి చుక్కల శబ్ధం నీ చెవికి చేరలేదా చెప్పు నారాయణ? నెల్లూరు నీ ఇంటికి అమరావతి రైతులు పాదయాత్రగా నిలదీశే రోజు వస్తుంది. మంత్రిగా ఎన్నిసార్లు అమరావతి లో పర్యటించావు. నీవు చంద్రబాబు కలసి చెప్పిన విషయాలు నమ్మి 33 వేల ఎకరాల డాక్యుమెంట్ లు మీకు ఇచ్చారు. పోనీ కట్టిన భవనాలను శాశ్వత భవనాలు అని చెప్పారా? లేదు. పోనీ పోలవరం కొద్దిరోజులు పక్కన బెట్టి రాజధాని శాశ్వత నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేశారా అదీ లేదు. అవన్నీ పూర్తి చేసి రైతుల ప్లాట్ లు వాళ్లకు ఇచ్చిఉంటే ఇప్పుడు రైతులు రోడ్డున పడాల్సి వచ్చేదా చెప్పు నారాయణ. పోనీ ఇదే శాశ్వత రాజధాని అనే శాసనం చేసి కేంద్రంతో రాష్ట్రపతితో ఆమోద ముద్ర కూడా వేయించలేదు. సగం బిల్డింగ్లు కట్టి వదిలితే అవి పూర్తి కావాలంటే చంద్రబాబు కు ప్రజలు తిరిగి ఓటు వేస్తారని నీవు, చంద్రబాబు ఆలోచించారు. ఒక్కనాడైనా టీడీపీ తిరిగి రాకపోతే మనల్ని మాత్రమే నమ్మి ల్యాండ్ పూలింగ్ లో వేల ఎకరాల డాక్యుమెంట్ లు మనకు (సీఆర్డీఏ)కు తీసుకొని ఇచ్చిన రైతులు ఏమై పోతారు అని ఆలోచించి ఉంటే మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పరిపాలించేవారు. నిజంగా చంద్రబాబు, నారాయణ చెప్పండి ఈ ఉసురు ఎవరిది? ఈ పాపం ఎవరిది? జగన్ లాంటి వాడు సీఎం అయితే అమరావతి, పోలవరం, పట్టిసీమ, మీరు ప్రారంభించిన ప్రతిఒక్కటి సర్వనాశనం చేస్తాడని మీకు తెలియదా? తెలుసు అయినా మీకు బాధ్యత లేదు. అధికారం ఇస్తే రోజుకు 23 గంటలు సమీక్షలు జరిపిన కాలాన్ని ప్రజలకు వెచ్చించి ఉంటే టీడీపీ కు ఈ గతి పట్టేది కాదు. అమరావతి రాజధాని శరవేగంగా పూర్తి అయ్యేది. డిజైన్లు కోసం మీరు ఎన్ని నెలలు వేస్ట్ చేశారు చెప్పండి. ఒక మంచి డిజైన్ ను ఎంచుకొని అమరావతి నిర్మాణం ప్రారంభించి ఉంటే ఇప్పుడు రైతులు ఇలా రోడ్ల వెంట కాళ్ళు పుళ్లు పడుతూ నడిచే వారా చెప్పండి. జగన్ పోలీసు బలంతో తన్నులు తినాల్సి వచ్చేదా ఆలోచించండి. ఈ రోజు అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ టీడీపీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే. నీవు కాలేజీల మీద కోట్లు వెనుకేసుకున్నావు. నీ ఇద్దరి భార్యలకు, పిల్లలకు ఏ కష్టం లేదు, రాదు. ఒక్కసారి నీ కుటుంబతో నీవు మహిళలు చేస్తున్న పాదయాత్రకు వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగినా రాజధాని నిర్మాణంకు నీవు, బాబు చేసిన పాపం ప్రక్షాళన కాదు. నిజంగా మాజీమంత్రి నారాయణ నీవు చదువుకున్న వాడివే అయితే రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొని వారి సంఘీభావం తెలుపు. లేదా రైతులు నిన్ను వదిలేసినా, దేముడు అప్ డేట్ అయ్యాడు. ఇప్పుడు పాపం ఇప్పుడే చెల్లించుకోవాల్సి వస్తుంది మాజీ మంత్రి నారాయణ."

ఇసుకతో దాడి చేసిన అధికారికి ప్రమోషన్.. జగనన్న పాలన స్పెషల్..

ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయి. దేవాదాయశాఖ ఇందుకేమీ మినహాయింపు కాదు. చిత్ర విచిత్ర ధోరణులకు దేవాదాయశాఖ ఆలవాలంగా మారిపోయింది. ఉన్నతస్థాయి అధికారిపై ఇసుక చల్లిన కిందిస్థాయి అధికారి చేతికే ఏకంగా తాళం అప్పగించిన వైనం ఇది. విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పాడికుండలాంటి ఎర్నిమాంబ ఆలయం ఈఓగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అయింది. ఈ మొత్తం వ్యవహారం వెనక అధికార పార్టీ నేత హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద అధికిరా శాంతిని అందలం ఎక్కించడంతో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార పార్టీ నేత అండదండలు ఉన్న ఏసీ శాంతి ఆపై మరింతగా చెలరేగిపోయారు. కొందరు దిగువస్థాయి సిబ్బందిపై వేధింపులకు దిగారు. ఒక ఉద్యోగిని కలెక్టరేట్ కు సరెండర్ చేశారు. మరో ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. ఏసీ శాంతి వేధింపుల కారణంగా కార్యాలయ ఉద్యోగులు, ఆలయ ఈఓలు సెప్టెంబర్ లో మూడు రోజులు సామూహిక సెలవు పెట్టారు.దీంతో రాజమండ్రి ప్రాంతీయ అధికారితో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు విచారణ చేయించారు. ఆ తర్వాత వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ అక్టోబర్ 13న శాంతికి చార్జిమెమో ఇచ్చారు. చార్జిమెమోలో కమిషనర్ అడిగిన తొమ్మిది అంశాలకు ఆమె వివరణ ఇచ్చారో లేదో గానీ.. ఆమెను నెల రోజుల్లో బదిలీ చేస్తామని కార్యాలయ సిబ్బందికి హామీ ఇచ్చారు. ఒక పక్కన శాంతి తీరుపై కిందిస్థాయి సిబ్బంది ఆందోళనలు, ఇంకో పక్కన విచారణ జరిగిన నేపథ్యంలో ఆమెకు ఎర్నిమాంబ ఆలయం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఎర్నిమాంబ ఆలయమే వివాదాలకు మూలం. ఈ ఆలయానికి ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. సంవత్సరం క్రితం అనకాపల్లి ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరాజుకు అసిస్టెంట్ కమిషనర్ శాంతి బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరాజు హయాంలో హుండీ ఆదాయం దారిమళ్లుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి రాజగోపాలరెడ్డిని కొత్త ఈఓగా నియమించారు. కోవిడ్ కారణంగా రాజగోపాలరెడ్డి 15 సెలవుపై వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన ఆర్డర్ రద్దుచేసి మళ్లీ శ్రీనివాసరాజునే ఈఓగా ఏసీ శాంతి నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరాజును డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ సస్పెండ్ చేశారు. ఇదే పోస్టులో సీతమ్మధార షిర్డీసాయి ఆలయం ఈఓ శిరీషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సెక్రటేరియట్ స్థాయిలో ప్రయత్నాలు చేసి ఎర్నిమాంబ ఆలయాన్ని శాంతి తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నానికి మంత్రి, ఇతర ఉన్నతాధికారుల వస్తుండడంతో, ఎర్నిమాంబ ఆలయం బాధ్యత తనకు అప్పగిస్తే వారి ప్రోటోకాల్ ఖర్చుల్ని తాను చూసుకుంటానని శాంతి చెప్పినట్లు తెలుస్తోంది. ఏసీ శాంతి ఇచ్చిన ఆ హామీతోనే ఎర్నిమాంబ ఆలయం బాధ్యతలను అధికారపార్టీ నేత అండదండలతో ఆమెకు అప్పగించినట్లు దేవాదాయశాఖ వర్గాల కథనం. ఇంకా ప్రొబేషన్ కూడా పూర్తవని అధికారిణి శాంతికి ఆమె కోరిన పోస్టింగ్ ఇవ్వడం వెనక అధికారపార్టీ నేత హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేత దన్నుతోనే శాంతి పై అధికారులపై ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి.

వరదల్లో స్టాలిన్..ప్యాలెస్ లో జగన్! ఏపీ ప్రజల ఖర్మ ఇంతేనా..? 

వాయుగుండం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్ష బీభత్సానికి తమిళనాడు అతలాకుతలమవుతోంది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో వరద విలయం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాల నేపథ్యంలో తమిళనాడు సర్కార్ అద్భుతంగా స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికగా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి చర్యలు కనిపించడం లేదు. వరదలతో అల్లాడిపోతున్న జనాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.  తమిళనాడులో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ గత వారం రోజుల నుంచి ఫీల్డ్‌లోనే ఉన్నారు. వర్షాల దెబ్బకు అతలాకుతలమైపోతున్న జనాన్ని ప్రత్యక్షంగా ఆదుకోవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. వరద బాధితులకు అందుకున్న ఆహారం గురించి … సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తానే స్వయంగా శిబిరాల దగ్గరకు వెళ్లి పంపిణి చేస్తున్నారు. స్థాలిన్ తీరుపై చెెన్నైలోని తెలుగువాళ్లు కూడా పోస్టులు పెట్టి అభినందిస్తున్నారు.   అయితే తమిళనాడు తరహాలోనే ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరులో పరిస్థితి దారుణంగా ఉంది. తిరుపతి వరదలో చిక్కుకుపోయింది. వందలాదీ కాలనీలు నీట ముునిగాయి. ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా.. ఏపీ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. వరద బాధితులను ఆదుకోవడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతి క్యాంపు కార్యాలయంలో కూర్చుని సమీక్షలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. బాధితులకు ఏం కావాంటే అది ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసేస్తున్నారు. కాని సీఎం చెప్పినా ఫీల్డ్ లో అందించేవారే కనిపించడం లేదు. వర్షాలు, వరదల నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వరద సహాయ చర్యల్లో స్ఠాలిన్ పని తీరు ఎలా ఉంది, ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారన్న దానిపై చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వరద్లలో తిరుగుతున్న స్టాలిన్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. రియల్ హీరో జనాల్లో ఉంటే.. జగన్ రెడ్డి మాత్రం ఆఫీసులో ఫోజులు కొడుతున్నారంటా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనంలోకి రావాలి జగన్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. స్ఠాలిన్ లాంటి లీడర్ ముఖ్యమంత్రిగా ఉండటం తమిళనాడు ప్రజల అధృష్టం.. జగన్ రెడ్డి ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ నిద్రలేవాలని, స్టాలిన్ ను చూసైనా జనంలోకి రావాలని మరికొందరు సూచిస్తున్నారు. 

RRR+R.. బీజేపీ ఎమ్మెల్యేలకి జ‌తక‌లిసే నాలుగో 'R' ఎవ‌రో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీలో RRR. బీజేపీ నుంచి ముగ్గురు మొన‌గాళ్లు. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజేంద‌ర్‌. RRR కాంబినేష‌న్‌తో ఇక సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి అసెంబ్లీలో చెడుగుడే అంటున్నారు. ఇక కాస్కో కేసీఆర్ అంటూ RRR పేరుతో క‌మ‌ల‌నాథులు ముఖ్య‌మంత్రిని పెద్ద ఎత్తున క‌వ్విస్తున్నారు. అసెంబ్లీ సెష‌న్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. సీఎంకు RRR త‌ఢాకా ఎప్పుడెప్పుడు చూపిద్దామా అంటూ బీజేపీ స‌మ‌రోత్సాహంతో ఉంది.  ఇంకా RRR కాంబినేష‌న్ అసెంబ్లీలో అడుగుపెట్ట‌క ముందే.. అప్పుడే RRR+R.. మొత్తం నాలుగు-Rల గురించి చ‌ర్చ స్టార్ట్ అయిపోయింది. ముగ్గురు Rలతోనే ఆగిపోదు.. త్వ‌ర‌లోనే న‌లుగురు Rలు అవుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి RRRకి జ‌త‌క‌లిసే ఆ నాలుగో R ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.... న‌ల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డినే అంటున్నారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కొంత‌కాలంగా కాంగ్రెస్‌పై గుర్రుగా ఉంటున్నారు. అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డికి రెబెల్‌గా మారారు. పీసీసీ చీఫ్ రాలేద‌నే అక్కసో, మ‌రే కార‌ణ‌మో తెలీదు కానీ.. వెంక‌ట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి కంట్లో న‌లుసుగా మారారు. అయితే, తాను కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ చాలా గ‌ట్టిగా చెబుతున్నారు వెంక‌ట్‌రెడ్డి. అన్న కాంగ్రెస్‌లోనే ఉంటానంటున్నా.. త‌మ్ముడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడాల‌ని ఎప్ప‌టి నుంచో ట్రై చేస్తున్నారు. స‌రైన స‌మ‌యం కోసం మాత్ర‌మే ఇన్నాళ్లూ ఆగారంటున్నారు.  ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌గోపాల్‌రెడ్డి సైతం త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆ విష‌యం ప‌దే ప‌దే చెబుతున్నార‌ట‌. అయితే, ఎందుకోగానీ ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం ఆల‌స్యం అవుతోంది. మొద‌ట్లో త‌న అన్న వెంక‌ట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేద్దామ‌ని అనుకున్నార‌ట‌. కానీ, అన్న‌కు అధిష్టానం హ్యాండ్ ఇవ్వ‌డంతో.. ఇక కాంగ్రెస్‌కు బై బై చెప్పే టైమ్ వ‌చ్చేసిందని భావిస్తున్నారు. అంత‌లోనే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరి ఉప ఎన్నిక‌కు వెళ్ల‌డంతో.. బీజేపీ ప్ర‌భావం ఏ మేర‌కు ఉందో అంచ‌నా వేసుకోవ‌చ్చ‌ని హుజురాబాద్ ఎల‌క్ష‌న్ వ‌ర‌కూ ఆగార‌ని తెలుస్తోంది. ఉప పోరులో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఇక త్వ‌ర‌లోనే రాజ‌గోపాల్‌రెడ్డి కాషాయ కండువా క‌ప్పేసుకుంటార‌ని అంటున్నారు.  తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు నల్గొండ జిల్లాలో ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో RRRతో పాటు RRRRలు వ‌చ్చే ఛాన్స్ ఉందంటూ కామెంట్ చేసి ప‌రోక్షంగా రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నార‌నే హింట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికీ రాజీనామా చేసి.. మునుగోడు నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఈ విష‌యం గురించి విన్న‌వారంతా.. మా ప్రాంతానికి ఉప ఎన్నిక రాబోతోందోచ్ అంటూ పండ‌గ చేసుకుంటున్నారు. 

యూనివర్సిటీ ఫండ్స్ నూ వదలని జగనన్న.. అప్పుల కోసం ఎందాకైనా..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది జగత్ విదిత వాస్తవం. ఈ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు. అయితే ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదనే నిజం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఓ వంక అప్పు లేనిదే పూట గడవని పరిస్థితి.  రోజువారీ చేతి ఖర్చులకు కూడా చేయి చాపక తప్పని దుస్థితి. మరో వంక ఎంతో కాలంగా ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న విధంగా, రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి దివాలా దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.అయితే ప్రభుత్వం నోటితో వాస్తవ పరిస్థితి ఇదని చెప్పక పోయినా చర్యల ద్వారా అదే నిజమని తేలుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే, రాష్ట్రం దివాలా తీసే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని అర్థమవుతోందని  నిపుణులు అంటున్నారు. అప్పుల తలుపులు ఒకటొకటిగా మూసుకు పోతున్నాయి కాబట్టే, ప్రభుత్వం ఫండ్స్ కోసం పక్క చూపులు చూస్తోంది.  గత వారం పది రోజుల్లో ప్రభుత్వం ‘అన్యధా శరణం నాస్తి’ అన్న విధంగా నియమ నిబంధనలు పక్కన పెట్టి పైసా కోసం పడరాని పాట్లు పడుతోంది. అడ్డదారులు/అక్రమ దారులు  తొక్కుతోంది. ఎక్కడ రూపాయి కనిపిస్తే అక్కడ చేతులు పెడుతోంది. నియమ నిబంధనలు, పరిపాలనా నియమావళి ఏవీ లేవన్న విధంగా ఎక్కడెక్కడి  నిధులను, సర్కార్ ఖాతాలోకి లాగేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిదులను ఉద్యోగులకు సమాచారం లేకుండానే ప్రభుత్వం లాగేసుకుంది. అలాగే, ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం కన్ను, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం మీద పడింది. అర్జెంటుగా రూ. 250 కోట్లు కావాలి ఇస్తావా చస్తావా అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, యూనివర్సిటీ అధికారుల మెడ మీద కత్తి పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. దబాయిస్తున్నారు. నిజానికి, విశ్వవిద్యాలయాల ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెద్దగా ఉండదు.నియామకాలు చేపట్టాలన్నా, నిధులు ఖర్చు చేయలన్నా, కార్యనిర్వాహక మండలి   అనుమతి అవసరం. యూనివర్సిటీ ఫండ్స్ ఒక పరిమితికి మించి అదనంగా ఖర్చు చేసే అధికారం, యూనివర్సిటీ రిజిస్ట్రార్’ కూడా ఉండదు. అయితే, గత కొంత కాలంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారుల మధ్య,రూ. 250 కోట్ల  యూనివర్సిటీ  నిధులను రాష్ట్ర అభివృద్ధి సంస్థకు బదిలీ చేయలనే విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. అయినా యూనివర్సిటీ అధికారులు ఎదో విధంగా పని కాకుండా నెట్టుకొస్తున్నారు. అయితే, గత రెండు రోజుల నుంచి సీఎంవోలో కీలక అధికారి రంగంలోకి దిగితొందర చేస్తున్నట్లు సమాచారం.  నో.. రూల్స్ నథింగ్ ఏమిచేస్తారో చేయండి, శనివారం నాటికీ, రూ.250 కోట్లు ప్రభుత్వ చేతోల్లో పెట్టవలసిందే అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వర్సిటీకి రూ.450 కోట్లు నిధులున్నాయి. జాతీయ బ్యాంకులో ఎఫ్‌డీల రూపంలో ఉన్న వీటిని బయటకు తీసుకురావడం రోజుల వ్యవధిలో ఆయ్యే పని కాదు. పైగా వర్సిటీ నుంచి రూపాయి తీసుకోవాలన్నా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) అనుమతి తప్పనిసరి. ఇదే విషయాన్ని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ అధికారులు మోర పెట్టుకుంటున్నా, ఫలితం కనిపించడంలేదని అంటున్నారు.  మరోవైపు సీఎంవోలో కీలకమైన ఐఏఎస్‌ అధికారి నేరుగా వర్సిటీ ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడుతూ మరింతగా ఒత్తిడి తెస్తున్నారు.  ఈ పరిస్థితిలో శనివారం రూ.250కోట్ల నిధులు రాష్ట్రాభివృద్ధి సంస్థకు బదలాయించడానికి ఆమోదం కోసం విశ్వవ విద్యాలయం కార్య నిర్వహక అత్యవసర సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.అంతే కాదు,సమావేశానికి ఎవరు వచ్చినా ఎవరు రక పోయినా చివరకు రిజిస్ట్రార్’రాకపోయినా, మన అనిపించి రూ. 250 కోట్లు ముడుపు కట్టి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని , ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం .   అదలా ఉంటే ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉన్న రూ.450కోట్లలో విభజన చట్టం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.170 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లు బదలాయిస్తే మిగిలేది కేవలం రూ.30కోట్లు మాత్రమే. ఈ నిధులతో వర్సిటీ నిర్వహణ కష్టంగా మారుతుందని అధికారులు అంటున్నారు.  వర్సిటీకి ఏటా దాదాపు రూ.70కోట్లు అవసరం. ఈ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి లేదు. కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు కట్టే ఫీజులు, పరీక్షల ఫీజులు, ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీతో వర్సిటీ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు రూ.250 కోట్లు తీసుకుపోవడం వల్ల ఈ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ఏటా వచ్చే వడ్డీ పరంగా కూడా వర్సిటీకి తీవ్రమైన నష్టం వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.అంతే కాదు, అవసరం అయితే ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్నఆర్ధిక అరాచకానికి అడ్డు కట్ట వేయక పోతే.. రాష్ట్రం అర్తికంగానే కాదు, అన్ని విధాల అనాధగా మిగులుతుందని నిపుణులు అంటున్నారు.

తెలంగాణలో మరో ‘జై భీమ్’ ఘటన.. పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి..?

జై భీమ్ సినిమాలో గిరిజనుడిపై పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీన్ చూసి అంతా కన్నీళ్లు కార్చారు. పోలీసులు ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా అన్న చర్చ జరిగింది. అయితే జై భీమ్ లాంటి ఘటనలే తెలంగాణలో వరుసగా వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లాలో గిరిజనుడిపై పోలీసుల దాడిని మరువకముందే, కామారెడ్డి జిల్లాలో పోలీసుల లాఠీలకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన ఒడింటి భూమాబాయి(50) దీపావళి పండుగ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ఊరిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సమీపంలోనే కొందరు పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ముందుగా హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న వారిని కొట్టారు. ఇదే క్రమంలో భూమాబాయిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయారు.  పోలీసుల దెబ్బలకు రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చావుదెబ్బలు కొట్టడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై సదరు పోలీసు స్టేషన్‌ ఎస్సై‌ను ఆరా తీయగా.. దాడి చేయలేదని, మూర్చ రావడంతో పడిపోయాడంటూ చెప్పుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలంగాణ పోలీసులు గొప్పగా ప్రచారం చేసుకుంటుండగా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలపై జనాలు తీవ్రంగా ఫైరవుతున్నారు. 

మహాత్మ గాంధీది ముష్టి పాత్ర! కంగనా కామెంట్ల రచ్చ..

మహాత్మాగాంధీ ముష్టిపాత్రలో మనకు స్వాతంత్ర్యం వచ్చిందట. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన కామెంట్ ఇది. దేశ వ్యాప్తంగా కంగనా కామెంట్ ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితమే కంగనా పద్మశ్రీ అవార్డు అందుకుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే కంగనాకు నలుగురి నుంచీ విమర్శలు ఎదుర్కోవడం మామూలైపోయింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగన ఇప్పుడు ఏకంగా భారత స్వాతంత్ర్యం పైనే తెగబడి కామెంట్ చేసింది. 1947లో మన దేశానికి వచ్చింది అసలు స్వాతంత్ర్యమే కాదట. మహాత్ముని చేతి ముష్టిపాత్రలో బ్రిటిష్ వాళ్లు వేసిన భిక్ష అని కంగనా తాజాగా వ్యాఖ్యానించింది. నిజానికి మన దేశానికి 2014లో మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని ఈ అమ్మడు సెలవిచ్చింది. అంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే ఇండిపెండెన్స్ వచ్చిందని బాలీవుడ్ భామ భ్రమిస్తోంది. గతంలో రైతును వేశ్యతో పోలుస్తూ కంగనా చేసిన దురుసు వ్యాఖ్య కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వందలాది మంది రైతులను ఉద్దేశించి కంగనా వ్యాఖ్యానించింది. కంగనా వ్యాఖ్య జాతి వ్యతిరేకం అని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ లీగల్ నోటీసు పంపించింది. హృతిక్ రోషన్, రచయిత జావేద్ అక్తర్ ను ఉద్దేశించి ‘బాలీవుడ్ లో కోటరీ వ్యవస్థా బలంగా నాటుకుపోయింది‘ అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కంగనపై జావేద్ అక్టర్ పరువునష్టం దావా వేశారు. నటుడు, గాయకుడైన దిల్జిత్ దోసాంజ్ తో అసభ్య పదజాలంతో వాదులాడి చిక్కుల్లో పడింది. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న కంగన అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్యకు బాలీవుడ్ బడాబాబులే కారణమని వ్యాఖ్యానించిన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలు కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటివారు ఓ మాఫియాలా తయారయ్యారంటూ మరో సందర్భంలో కామెంట్ చేసి కాకరేపింది. నటి ఊర్మిళకు నటన రాదని, కేవలం అంగాంగ ప్రదర్శన చేసే శృంగారతారగా మాత్రమే ఆమెకు గుర్తింపు ఉందని కంగన వ్యాఖ్యానించింది. టాలీవుడ్ జంట అక్కినేని చైతన్య- సమంత విడాకుల విషయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కీలకపాత్ర పోషించారని కంగన మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అమీర్ ఖాన్ సలహాతో చైతు విడాకులు తీసుకున్నాడని కామెంట్ పెట్టింది. చైతు- సమంత భార్యాభర్తల బంధం విడాకులకు దారి తీయడానికి కారణం కచ్చితంగా పురుషులే అని కంగన పేర్కొనడం వివాదాస్పదం అయింది. ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీరా? అంటూ కంగన చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్ర హోంమంత్రి ఘాటుగా స్పందించారు. కంగనకు ముంబైలో ఉండే హక్కు లేదని నిప్పులు చెరిగారు. తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా తాజాగా కోర్టు పనితీరుని కూడా తప్పుపట్టింది. కోర్టులు బెదిరింపులకు పాల్పడుతున్నాయంటూ ధిక్కార స్వరం వినిపించింది. కోర్టుల బెదిరింపుల కారణంగా తనకు న్యాయస్థానాలపై నమ్మకం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా పలుమార్లు కోర్టు నుంచి సమన్లు కూడా అందుకుంది. కంగనా రనౌత్ భారత స్వాతంత్ర్యంపై తాజాగా చేసిన వ్యాఖ్యలపై వరుణ్ గాంధీ విరుచుకుపడ్డారు. కంగనాది పిచ్చి అనుకోవాలా? లేక దేశద్రోహంగా పరిగణించాలా? అంటూ నిప్పులు చెరిగారు. కంగన వ్యాఖ్యలు దేశద్రోహం కిందికే వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ తూర్పారపట్టింది. కంగనకు ఈ మధ్యనే ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు కంగన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. కంగనా ఓ విలాసవంతమైన యాచకురాలు అంటూ సీపీఐ జాతీయ నేత కే.నారాయణ వేడిగా స్పందించారు.

పెళ్లికి అనుకోని అతిథిగా స‌జ్జ‌నార్‌.. ఆర్టీసీ బ‌స్ బుక్ చేస్తే స‌ర్‌ప్రైజ్‌..

వారి పెళ్లికి అనుకోని అతిథి వ‌చ్చారు. ఆయ‌నేమీ మామూలు గెస్ట్ కాదు. మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్‌, ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ స‌జ్జ‌నార్ ఆ న‌వ‌జంట‌ను ఆశీర్వ‌దించారు. మంచి బ‌హుమ‌తితో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇంత‌కీ పిల‌వ‌ని పెళ్లికి స‌జ్జ‌నార్ ఎందుకు వెళ్లిన‌ట్టు? స్పెష‌ల్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చిన‌ట్టు? ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.  ఆ పెళ్లి బృందం చేసిన ఓ ప‌నే.. స‌జ్జ‌నార్ అంత‌టి వారు వ‌చ్చేలా చేసింది. పెళ్లికి వెళ్లేందుకు ఆర్టీసీ బ‌స్ బుక్ చేసుకున్నారు వారు. యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని.. కొంపల్లిలో జ‌రిగే పెళ్లికి బంధువులంద‌రినీ తీసుకెళ్లారు. ఇలా పెళ్లి వేడుక‌ల‌కు ఆర్టీసీ బ‌స్సులు అద్దెకు తీసుకోవ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ స్వ‌యంగా ఆ మ్యారేజ్‌కి విచ్చేసి.. వ‌ధూవ‌రుల‌కు ఆ బ‌స్ డ్రైవ‌ర్‌, కండెక్ట‌ర్ చేతుల మీదుగా గిఫ్ట్ ఇప్పించారు. ఆ న‌వ‌దంప‌తులు ఆకుల భరత్‌కుమార్‌, సౌమ్యలు ఫుల్ ఖుషీ అయ్యారు.   ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్ వ‌చ్చాక సంస్థ‌కు రాబ‌డి పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రజలు తక్కువ ధరకు, ఎలాంటి డిపాజిట్‌ లేకుండా ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఆర్టీసీ సిబ్బందే ఇంటి ద‌గ్గ‌రికి వ‌చ్చి బుకింగ్ చేసుకునే విధానం తీసుకొచ్చారు. ఇలా ఆర్టీసీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసి.. రాబ‌డి పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. రెండు బ‌స్సుల‌ను బుక్ చేసుకున్న పెళ్లిబృందాన్ని, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు స‌జ్జ‌నార్‌. అంతా బాగానే ఉంది కానీ.. టికెట్ ధ‌ర‌లు పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌ట‌మే బాలేదంటున్నారు ప్ర‌యాణీకులు.   

గిరిజ‌నుల గోడు ప‌ట్ట‌దా? జ‌గ‌న్‌రెడ్డి క‌నిక‌రించ‌రా?

వాళ్లంతా గిరిజ‌నులు. అడ‌వి బిడ్డ‌లు. అందుకే కాబోలు వారంటే అంత అలుసు. ద‌శాబ్దాలుగా క‌ష్టాలు ప‌డుతున్నా.. క‌నిక‌రించే పాల‌కుడే లేకుండాపోయాడు. ప్ర‌భుత్వాలు మారినా.. పార్టీలు మారినా.. వారి క‌ష్టాలు మాత్రం మార‌డం లేదు. వారి గోడు వినేవాడు లేడు.  అర‌టి ఆకులు క‌ట్టుకొని.. న‌దిలో నిలుచొని.. నిర‌స‌న తెలుపుతున్న వీరంతా విజ‌య‌న‌గ‌రం జిల్లా గిరిజ‌నులు. వాళ్లు ఇలా నిర‌స‌న తెలుపుతున్న‌ది న‌దిపై వంత‌న కోసం. ఇదేమీ ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన డిమాండ్ కానే కాదు. కొమ‌రాడ మండ‌లం పూర్ణపాడు-లాబేసు మధ్య నాగావళి నదిలో వంతెన నిర్మాణానికి 2006లోనే శంకుస్థాపన చేశారు. శంకుస్థాప‌న అయితే చేశారు కానీ.. నేటికీ పనులు ప్రారంభించ‌లేదు. ఒక్క ఇటుకైనా వేయ‌లేదు. అందుకే.. నాగావ‌ళి న‌దిలో.. ఒంటికి అర‌టిఆకులు క‌ట్టుకొని.. ఇలా నిర‌స‌న తెలిపారు.  న‌దికి ఆవ‌ల 33 గ్రామాలున్నాయి. ఆ గ్రామ‌స్తులంతా జ‌స్ట్ 4 కిలోమీట‌ర్ల దూరంలోని కొమ‌రాడ మండ‌ల కేంద్రానికి చేరుకోవాలంటే.. చుట్టూ తిరిగి.. 40 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. అదే, న‌దిపై వంతెన క‌డితే.. 40 కి.మీ. దూరం.. 4 కి.మీ.ల‌కు త‌గ్గుతుంది. అందుకే, త‌మ క‌ష్టాలు ప్ర‌భుత్వానికి తెలిసేలా.. వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల నాయకులు అరటి ఆకులు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. మ‌రి, పాల‌కుల కంటికి వీరి క‌ష్టాలు క‌నిపిస్తాయా? గిరిజ‌నుల గోడు జ‌గ‌న్‌రెడ్డికి చెవికి చేరేనా? 

జగన్ కు గాయం.. పోలీసుల రచ్చ.. గులాబీ గర్జన.. టాప్ న్యూస్@1PM

కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. బండ శెట్టిపల్లి ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పం వచ్చి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను  వైసీపీ అమాంతం పెంచేసిందన్నారు లోకేష్.  -------- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయమైంది. ఆయన కుడి కాలుకు గాయం కావడంతో.. ఆయన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలోని ప్రత్యేక విశ్రాంతి గదిలో సీఎం  జగన్‌కు చికిత్స నిర్వహించారు డాక్టర్లు. చికిత్స ముగిసిన తర్వాత  మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.  --- ఎయిడెడ్  విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా కాకినాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. దొరికిన వారిని దొరికినట్లు విద్యార్థులను లాఠీలతో చితక్కొట్టారు. విద్యార్థులు కలెక్టరేట్ గేటును నెట్టి లోపలకు వెళ్లే ప్రయత్నం చెయ్యడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, లాఠీలతో మహిళా విద్యార్థులను కూడా పోలీసులు బాదేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ----  కేసుల ఉపసంహరణ వ్యవహారంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున  న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఉదయభాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ------- అనంతపురం జిల్లాలో గుప్తనిధుల వేటగాళ్లు అరెస్ట్ అయ్యారు. రోళ్ల మండలం హొట్టేబెట్ట సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు సాగిస్తున్న ఆరుగురు గుప్తనిధి వేటగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. --------- తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ---- కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాన్నో నిరసనలు జరిగాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్  ఇందిరాపార్క్ వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు హాజరయ్యారు.  ------------ వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వ నాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్ ఓ మెంటల్ సంజయ్ అని... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. సంజయ్ మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. ------- వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్‌ చేసుకున్న పెళ్లి జంటకు కానుకలు ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్‌ శ్రీకారం చుట్టారు. గురువారం యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న వరుడు ఆకుల భరత్‌కుమార్‌, వధువు సౌమ్యలకు డ్రైవర్లు ముత్యాల అంజనేయులు, పబ్బాటి గణేష్‌ జ్ఞాపికను బహూకరించి  ఆశీర్వదించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్వయంగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. -------- దేశ స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో లభించింది 'భిక్ష' అనీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో ఖండించారు. మలానా క్రీమ్ మత్తు బాగా తలకెక్కినట్టు కనిపిస్తోందంటూ మండిపడ్డారు. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆమె అవమానించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ----- ప్రపంచ ప్రథమ యోగా చాంపియన్‌షిప్‌కు భారత్‌ వేదిక కానుంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చాంపియన్‌షి్‌పను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు జాతీయ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఉదిత్‌ శేత్‌ వెల్లడించారు. 

 సీఎం జగన్ కు గాయం..హాస్పిటల్ లో చికిత్స! గెట్ వెల్ సూన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయమైంది. ఆయన కుడి కాలుకు గాయం కావడంతో.. ఆయన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలోని ప్రత్యేక విశ్రాంతి గదిలో సీఎం  జగన్‌కు చికిత్స నిర్వహించారు డాక్టర్లు. చికిత్స ముగిసిన తర్వాత  మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే సీఎం జగన్ కు కాలుకు గాయం ఎలా అయిందన్న విషయంలో మాత్రం తెలియరాలేదు. మరోవైపు సీఎం జగన్ కుడి కాలుకు గాయం జరిగిందన్న విషయంలో తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారని తెలియడంతో కొందరు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు హాస్పిటల్ దగ్గరుక ఎవరినీ రానీయలేదని తెలుస్తోంది. 

ప్రత్యేక హోదాపై జగన్ హ్యాండ్సప్.. ఢిల్లీ అంటే ఎందుకంత భయం? 

ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల వాంఛ. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదానే శరణ్యమని ప్రజలు భావిస్తున్నారు. విభజన చట్టంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. కాని ఏడున్నర ఏండ్లు ప్రత్యేక హోదాకు అతీగతీ లేదు. ఏపీ ప్రజలు ఎంతగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2017లో ప్రత్యేక హోదా డిమాండ్ తోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికి వచ్చింది. మోడీ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు చంద్రబాబు. ఇక వైసీపీ తమ ఎన్నికల ఎజెండాలో ప్రత్యేక హోదానే ప్రధానమని ప్రకటించింది. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించారు జగన్.  కాని మడమ తిప్పును... మాట తప్పను అనే జగన్.. అధికారంలోకి వచ్చాకా వరుసగా మాటలు మారుస్తూనే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ హ్యాండ్సప్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సదరన్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకహోదాను అడుగాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలూ అదే చెప్పాయి. దీంతో ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వస్తుందని అంతా భావించారు. తీరా చూస్తే.. జగన్ సర్కార్ బండారం బయటపడింది. సదరన్ కౌన్సిల్ సమావేశ ఏజెండాలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ప్రత్యేకహోదా ఎక్కడా కనిపించలేదు.  సదరన్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఏడు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినవే ఉన్నాయి. అందులో తమిళనాడు నుంచి రావాల్సిన నిధుల గురించి ఉంది కానీ కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కనీస ప్రస్తావన కూడాలేదు. తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లోకి రావడం వల్ల ఘర్షణ, కుప్పంలో పాలార్‌ ప్రాజెక్టుపై తమిళనాడు అభ్యంతరం , తెలుగుగంగ నీరిచ్చినందుకు తమిళనాడు ఇవ్వాల్సిన రూ.338 కోట్లు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు అలాగే ఏపీలో జాతీయ పోలీస్‌ అకాడమీ పెట్టాల్సిన విజ్ఞప్తులు ఎజెండాలో ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయం మాత్రం లేదు.  అమిత్ షా సమావేశంలో విభజన హామీలను ప్రస్తావిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎజెండాలో పెట్టకుండా ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఒక్క ఏపీ అంశాలపైనే సమావేశంలో చర్చ జరగదు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలన్నింటినీ చర్చిస్తారు. ఇతర రాష్ట్రాలుకూడా ఏపీ విషయంలో తమకు ఉన్న సమస్యలను ప్రస్తావిస్తారు. విద్యుత్ సమస్యలను తెలంగాణ కూడా చర్చించనుంది. దీంతో ప్రత్యేక హోదాపై మాట్లాడుతామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఉత్తవేనని తేలింది. దీంతో ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని స్పష్టమవుతోంది. కేంద్రానికి భయపడుతుండటం వల్లే ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేసుల భయంతో కేంద్రానికి ఏపీని జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. తాజా ఘటనతో అది నిజమేనని అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. 

‘కుప్పం గడ్డ.. చంద్రన్న అడ్డ’.. జ‌గ‌న్‌రెడ్డిలో ఓట‌మి భ‌యం..

కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ గొడవలు ఉండవని, ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం పోలీసుల సాయంతో కుప్పంలో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్యలు సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్‌రెడ్డిలో ఓట‌మి భ‌యం పెరిగింద‌ని.. అందుకే కుప్పంను టీడీపీ నుంచి దూరం చేసేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.  తనిఖీల పేరుతో  పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. కుప్పం వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కుప్పం వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి.. ఎక్కడికి వెళ్ళుతున్నారంటూ ఆరా తీస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కుప్పం నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఏ గడప తొక్కినా చంద్రన్న ముద్ర ఉంటుందని నారా లోకేష్ అన్నారు. గత రెండున్నారేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. ఏ రోజైనా జగన్ రెడ్డి నోటి నుంచి కుప్పం అనే పదం వచ్చిందా? అని ప్రశ్నించారు నారా లోకేశ్‌. కుప్పంలో లోకేశ్ ప్ర‌చారానికి విశేష స్పంద‌న వ‌స్తోంది. కుప్పం మ‌రోసారి టీడీపీ అడ్డ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. 

నువ్వు నాకు కావాలి.. సీఐడీ ఆఫీస‌ర్‌ లై*గిక టార్చ‌ర్!

కంచే చేను మేస్తే? తండ్రిలా కాపాడాల్సిన ఖాకీలే కబ‌ళించాల‌ని చూస్తే? ప్ర‌జ‌ల‌కు రక్ష‌ణ క‌ల్పించాల్సిన ర‌క్ష‌క‌భ‌టుడే వేధింపుల‌కు పాల్ప‌డితే? ఫ్రెండ్లీ పోలీస్ కాస్తా రొమాంటిక్ కాప్‌గా మారితే? మ‌హిళ‌ను లై*గికంగా వేధిస్తే? అంత‌కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? హైద‌రాబాద్‌లో అదే జ‌రిగింది. సీఐడీ ఉన్న‌తాధికారి ఒక‌రు యువ‌తిని టార్చ‌ర్ చేస్తున్నాడని తెలుస్తోంది. అస‌భ్య ఫోటోలు, వీడియోలు, వీడియో కాల్స్‌తో లై*గిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. ఏకంగా పోలీస్ యూనిఫాంతోనే వీడియో కాల్ చేసి.. నువ్వు నాకు కావాలంటూ బెదిరింపుల‌కు దిగడంతో ఆ మ‌హిళ భ‌య‌ప‌డిపోయింది. ఆ సీఐడీ ఆఫీస‌ర్ టార్చ‌ర్ భ‌రించ‌లేక‌.. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కంప్లైంట్ చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... నేను సీఐడీలో ఉన్నతాధికారిని.. నువ్వు ఇష్టమని చెబితే నన్నే కాదంటావా..? నువ్వు నాకు కావాలంతే.. ఇలా ఓ మహిళను లై*గికంగా వేధిస్తున్న ఘటన రాచకొండ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో జ‌రిగింది. బాధిత మ‌హిళ (30) ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మ‌హిళ‌కి గత నెల 29న ఓ కొత్త నంబర్‌ నుంచి వాట్సాప్‌లో హాయ్ అంటూ మెసేజ్ వ‌చ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అదే నెంబ‌ర్ నుంచి వీడియో కాల్ వ‌చ్చింది. నిన్ను ఓ వేడుకలో చూశా. అప్పుడే బాగా నచ్చావు. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు అంటూ అటువైపు వ్యక్తి వేధించడం స్టార్ట్ చేశాడు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. ఆ మ‌హిళ‌ చూసినట్లు డబుల్ బ్లూ టిక్స్‌ రాగానే వెంటనే డిలీట్‌ చేసేవాడు.  అవ‌త‌లి వాడి టార్చ‌ర్ భ‌రించ‌లేక అసలు నువ్వెవరు..? ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది ఆ మ‌హిళ‌. తాను సీఐడీ విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. కొంతసేపటికి పోలీస్‌ యూనిఫాంలో వీడియో కాల్‌ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత మరో నంబర్‌ నుంచి మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ రావడం మొదలైంది. నా నంబర్‌నే బ్లాక్‌ చేస్తావా..? అంటూ బెదిరింపులకు దిగడంతో ఆమె భ‌య‌ప‌డిపోయింది. వెంట‌నే పోలీసులను ఆశ్రయించింది. రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కేసు న‌మోదు చేసి అంత‌ర్గ‌త విచార‌ణ స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. 

కరోనా ముప్పు ఇంకా ఉంది.. తస్మాత్ జాగ్రత్త! కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక.. 

కరోనా కథ ముగిసి పోలేదు. వాక్సిన్ తీసుకున్నాం .. టీకా వేసుకున్నాం.. ఇక ఏమి కాదు, అనే భరోసా పనికి రాదు, ఈ మాటలన్నది, ఈ హెచ్చరిక చేసింది మరెవరో కాదు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  మన్‌సుఖ్‌ మాండవీయ. నిజం. ప్రపంచం పటం మీద కరోనా కాలు పెట్టి ఇంచు మించుగా రెండు సంవత్సాలు పూర్తవుతోంది. కానీ, ఇంత వరకు ఆ మహమ్మారి, ఆచూకీ కూడా శాస్త్రవేత్తలకు చిక్క లేదు. శాస్త్ర వేత్తలు, వైద్యులు, ప్రభుత్వాల సమిష్టి కృషితో, కరోనాను చాలా వరకు కట్టడి చేయగలిగామే కానీ, కరోనాపై పూర్తి విజయం ఇంకా సాధ్యం కాలేదు. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడమే లేదు. ఒక విధంగా కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధం, ఎప్పుడు ఎలా ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు, రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా విషయంగా హెచ్చరిస్తోంది.   కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మరోమారు ‘కరోనా మహమ్మారిపై పోరాటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయాలి’ అని  పిలుపునిచ్చారు. తద్వారా దేశంలో చివరి పౌరుడికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్‌ అందజేసేందుకు చేపడుతున్న 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమంపై కేంద్ర మంత్రి.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మనమంతా కరోనా ముగిసిందని భావించకూడదు. అప్రమత్తత అవసరం. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో 80 శాతానికి పైగా టీకాలు వేసినప్పటికీ.. వైరస్‌ విజృంభిస్తోంది’ అని గుర్తుచేశారు.  నిజానికి, అనేక ప్రపంచ దేశాలకంటే మన దేశంలో వాక్సినేషన్ కార్యక్రమం చాలా చురుగ్గా,చక్కగా సాగుతోందని, వాక్సినేషన్ అభివృద్ధి మొదలు పంపిణీ వరకు మనదేశం అనేక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని విదేశీ ప్రముఖులు కితాబు ఇవ్వవచ్చును కానీ, వాస్తవ పరిస్థితి మరీ అంట గొప్పగా ఏమీలేదని, కేంద్ర మంత్రి అందించిన గణాంకాలే చెపుతున్నాయి. ఇంతవరకు, దేశవ్యాప్తంగా 79 శాతం మంది అర్హులకు మొదటి డోసు టీకా వేసినట్లు మంత్రి వెల్లడించారు.అంటే ఇంకా 21 శాతం మందికి మొదటి డోసు కూడా పడలేదు. మరోవంక 18 లోపు పిల్లలకు ఇంతవరకు వాక్సిన్’ లేనే లేదు. అంటే ఇంచుమించుగా దేశ మొత్తం జనాభాలో సగం మందికి టీకా అందలేదు. అలాగే, టీకా వేసుకున్న పూర్తి భారోసాలేదని సింగపూర్, చైనా, బ్రిటన్, జర్మనీ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.  అందుకే కేంద్ర ప్రభుత్వం, ఇంటికే వెళ్లి టీకా వేసేందుకు, ‘హర్ ఘర్‌ దస్తక్‌’ పేరిట ఇంటింటికీ టీకా కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అర్హులందరికీ మొదటి డోస్, 12 కోట్లకు పైగా జనాభాకు రెండో డోస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల సహకారంతో కేంద్ర ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. ఈ నెల 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.  మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 110.23 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 120.08 కోట్ల డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపింది. వాటి వద్ద ఇంకా 16.74 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని, డ్రైవ్‌ను వేగవంతం చేయాలని సూచించింది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కొత్త వేరియంట్ల ప్రభావం నామమాత్రమేని.. కేవలం డెల్టా వేరియంట్‌ ప్రభావమే అధికంగా ఉన్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనపడుతోందని తాజా బులిటెన్‌లో పేర్కొంది. అయితే, ఎవరు ఎన్ని చెప్పినా కరోనా కథ ఇంకా ముగియలేదు ... సశేషంగానే ఉంది .. తస్మాత్ జాగ్రత్త.

బీజేపీకి బానిస.. విలాసవంతమైన యాచకురాలు! కంగనాపై నారాయణ హాట్ కామెంట్లు..

దేశ రాజకీయాల్లో బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారిపోయారు. రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించి ట్వీట్లు చేస్తూ ఆమె కాక రాజేస్తున్నారు. ఎలాంటి విషయంలోనైనా తను స్పందించిందంటే ఏకిపారేస్తుంటుంది. ఇదే సమయంలో తీవ్ర విమర్శలకు గురౌతుంటుంది.బీజేపీకి అనుకూలంగా ఆమె చేసే కామెంట్లపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వివాదాస్పద నటీగా పేరున్న కంగనా కొన్ని రోజుల క్రితమే పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఇది ఇప్పుడు దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. కంగనాకు పద్మశ్రీ ఇవ్వడంపై కొన్ని వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ కంగనాపై హాట్ కామెంట్స్ చేశారు.  దేశ స్వతంత్ర ఉద్యమం గురించి కంగనా కామెంట్స్ చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని అన్నారు. కంగనా చేసిన ఆ వ్యాఖ్యలపై నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు అని మండిపడ్డారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని చెప్పారు. దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత కంగనాకు లేదని, ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కూడా దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత లేదన్నారు.  నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం కంగనా బానిస మనస్తత్వానికి నిదర్శనమని నారాయణ అన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్షణమే దేశ ప్రజలకు బహిరంగంగా  క్షమాపణలు చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.