కేసీఆర్ కు కేంద్ర మంత్రి దిమ్మతిరిగే కౌంటర్.. 

వరసగా రెండు రోజులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా ఏకి పారేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వమో, ఎంత చేతకాని సర్కారో చక్కగా ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేల్చి పారేశారు. అంతే కాదు, తమంతటి నీతి వంతుడు, నిజాయతీపరుడు ఇంకెవరూ లేరని, నిటారుగా నిలబడ్డామని, సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చి, పుచ్చుకున్నారు. ఏ విచారణ చేస్తారో చేసుకోవాలని కేంద్రానికి సవాలు విసిరారు. అంతలోనే కేంద్ర ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అదే సమయంలో తమ ఫార్మర్ హౌస్, రైతు భవంతి వైపు కన్నెత్తి చూస్తే  ఆరు ముక్కలుగా నరుకుతానని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్’ని, సంస్కార వంతమైన భాషలో హెచ్చరించారు.   అంతేకాదు ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇక రోజూ కేంద్ర ప్రభుత్వ బండారాన్ని బయట పెడతానని అన్నారు. జర్నలిస్టులకు ఇక రోజు ప్రగతి భవన్’లోనే లంచ్  ఉంటుందని నోరూరించే ప్రామిస్ కూడా చేశారు. అయితే, కారణం ఏమిటో కానీ, మూడో రోజు ... నుంచి ప్రగతి భవన్ ఉలుకు పలుకు లేకుండా మూగబోయింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులు వినిపించిన, ‘పచ్చినిజాలు’ ఒకటొకటిగా పచ్చి అబద్ధాలుగా తెలిపోతున్నాయని, సోషల్ మీడియా కోడై కూస్తోంది. అప్పుడు ఇప్పుడు అంటూ పరువు తీస్తోంది. ఈ నిజాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించడం వల్లనే ముఖ్యమంత్రి, డైలీ సీరియల్’ కి బ్రేక్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.   రాష్ట్రం విడిపోయి, ఏడు సంవత్సరాలు అయినా, ఇతవరకు కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణకు,కొంచెం ఆలస్యంగానే అయినా కేంద్ర జలవనరుల శాఖ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమాధానం ఇచ్చారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణ, కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణ రెంటినీ పరిశీలిస్తే, ఇద్దరు చెప్పిందీ ఒకటే. వడ్ల గింజలో బియ్యపు గింజ ఇద్దరి మాటల్లో పెద్దగా తేడాలేదు. అయితే, కేసీఆర్ వడ్ల గింజ చూపితే, షెకావత్ పొట్టుతీసి బియ్యపు గింజను బయట పెట్టారు.   2014జూన్ రెండవ తేదీన రాష్ట్ర విభజన జరిగింది.ఆ తర్వాత కొద్ది నెలలకే,2015లోనే తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నెలరోజుల క్రితం వరకు కేసు’ సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. ఇది సుప్రీం కోర్టు సాక్షిగా ఎవరూ కాదనలేని నిజం.అయినా, ముఖ్యమంత్రి, ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీరు అవసరం లేదా? న్యాయం చేయరా? తెలంగాణ భూములను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఎండ పెట్టాలనుకుంటోందని, సెంటిమెంట్’ను రంగరించి ఆరోపించారు.    ముఖ్యమంత్రి ఆరోపణపై స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్, అదే స్థాయిలో కేసీఆర్’కు  కౌంటర్ ఇచ్చారు. కొత్త ట్రైబ్యునల్‌  ఏర్పాటుపై,  మీరే సుప్రీం కోర్టును ఆశ్రయించారనే విషయాన్ని కేసీఆర్’కు గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం జరగడానికి, ఇది కాదా కారణమని నిలదీశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, అనే విషయం రాష్ట్రాన్ని పాలిస్తున్న మీకు తెలియదా, అంటూ చురకలు అంటించారు. అంతే కాదు, రెండ్రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని మాటిచ్చిన  కేసీఆర్‌ ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8నెలలు ఎందుకు పట్టిందని, ఈ జాప్యానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. నెల రోజుల క్రితం పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని వివరించారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు  ఏడేళ్లు ఆలస్యం కావడానికి నేను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తాం’ అంటూ కేంద్ర మంత్రి బంతిని, కేసీఆర్ కోర్టులోకి నెట్టారు.   పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, నెలరోజుల క్రితం వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే, కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం, కేసు ఉప సంహరించుకోమని కేంద్రం సూచించిన తర్వాత ఎనిమిది నెలలు ఏ నిర్ణయం తీసుకోకుండా నానబెట్టింది, కేసీఆర్ ప్రభుత్వం,ఇందులో ఎవరికీ ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పింది పచ్చి అబద్ధం.. ఎవరి మాటలు పచ్చి నిజాలు అనేది ..ఎవరికి వారు తేల్చుకోవలసిందే ... అంటున్నారు విశ్లేషకులు.

టీ20 వరల్డ్ కప్ లో పాక్ కు షాక్.. కివీస్ తో ఆసీస్ ఫైనల్ పోరు...

టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ సమరం ఎవరి మధ్యే తేలింది. కివీస్ తో ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా  తలపడనుంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆసీస్  విజయం సాధించింది. పాకిస్తాన్ విధించిన 177 పరుగులను చివరి ఓవర్ లో సాధించింది ఆసిస్. ఆరో వికెట్ కు స్టయినిస్, వేడ్ అద్బుతంగా ఆడి ఆసిస్ కు సంచలన విజయం అందించారు. తొలి ఓవర్ లో ఫించ్ డకౌట్ అయ్యాడు. తర్వాత వార్నర్ , మార్ష్ స్లోగా ఆడారు. ఐదో ఓవర్ లో ఫోర్ , సిక్సర్ తో దూకుడు పెంచాడు. దీంతో ఆరో ఓవర్ లో 50 పరుగులు దాటింది ఆసీస్ స్కోర్. ఏడో ఓవర్ లో మార్ష్ అవుట్ కావడంతో పాక్ పట్టు సాధించింది. తొమ్మిది ఓవర్ లో వార్నర్ సిక్సర్ బాదగా.. అదే ఓవర్ లో స్మిత్ అవుట్ కావడంతో ఆసీస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. 11 ఓవర్ లో 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర వార్నర్ కూడా అవుట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.  96 పరుగుల దగ్గర మాక్స్ వెల్ ను అవుట్ చేసి మ్యాచ్ పై మరింత పట్టు సాధించింది పాకిస్తాన్.  పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసిస్ టార్గెట్ రన్ రేట్ పెరుగుతూ పోయింది. స్ఠయినిస్ ధాటీగా ఆడటంతో ఆసిస్ కు మళ్లీ అవకాశాలు కన్పించాయి. 17 ఓవర్ లో స్టయినిస్ సిక్సర్, ఫోర్ కొట్టడంతో పాక్ శిబిరం డీలా పడింది.  18 ఓవర్ లో వేడ్ సిక్సర్ బాది ఆసిస్ ను విజయానికి చేరువ చేశాడు. 19 ఓవర్ లో స్టయినిస్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ విడిచిపెట్టాడు. తర్వాత వేడ్ మూడు వరుస సిక్సర్లు కొట్టి  మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.  అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన మూడో ఓవర్‌లో చెరో ఫోర్‌ కొట్టగా.. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్‌ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్‌ అజామ్‌.. వార్నర్‌కి చిక్కాడు. తర్వాత రిజ్వాన్ జోరు పెంచాడు.  జంపా వేసిన వేసిన 12 ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్‌ ఫోర్‌, సిక్సర్‌ బాదగా.. జమాన్‌ కూడా సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్‌.. స్మిత్‌కి చిక్కాడు. అదే ఓవర్లో జమాన్‌ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్‌లో అసిఫ్‌ అలీ (0), చివరి ఓవర్‌లో షోయబ్‌ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫకార్‌ జమాన్‌ రెండు సిక్స్‌లు బాదడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది.  ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్‌, జంపా తలో వికెట్ తీశారు.  

ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి? ఉద్యమ నేతలకా? ఉద్యమ ద్రోహులకా?

ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. అందులో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు. మరో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లు. ఒకటి గవర్నర్ కోటా నామినేటెడ్‌ సీటు. బహుశా ఇటీవల కాలంలో ఒకేసారి ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇలా ఒకటి తక్కువ 20 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగడమే ఒక విశేషం అనుకుంటే, అన్ని స్థానాలు, ఏదో జరగరానిది జరిగితే తప్పించి ఖాయంగా అధికార తెరాస ఖాతాలో చేరే స్థానాలే కావడం మరో విశేషంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవంక ఈ సారి టికెట్ మిస్ అయితే రానున్న రెండేళ్ళల్లో మరో అవకాశానికి ఆస్కారం లేదని అధికార పార్టీ అశావహులు బావిస్తున్నారు. పార్టీ టిక్కెట్ కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తెరాస ముఖ్యనాయకులు ఎక్కడికెళితే అక్కడ ఆశావహులు ప్రత్యక్ష మవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చావైనా, సంబురం అయినా సందర్భం ఏదైనా, ఎక్కడికి వెళ్ళినా, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ఆశావహులు వెంటపడుతున్నారట‌. ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వంటి పలువురు ప్రముఖులతో పాటుగా, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అంతకు ముందు ఎమ్మెల్సీ బిస్కెట్ వేసి పార్టీలోకి తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి, ఎల్.రమణ వంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. అలాగే, ఉద్యమాకాలం నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు దేవీశ్రీ ప్రసాద్’వంటి ఉద్యమ నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరో వంక దేవీశ్రీ ప్రసాద్’కు టికెట్ ఇవ్వాలని, బ్రాహ్మిణ్ ఆఫిషియల్స్ అండ్ ప్రోఫీషియల్స్  వెల్ఫేర్ అసోసియేషన్’ ముఖ్యమంత్రి కేసీఆర్’కి విజ్ఞప్తి చేసింది.    ముఖ్యమంతి కేసీఆర్ అభ్యర్దుల ఎంపికఫై గట్టి కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపిక విషయంలో అన్ని కోణాలలో అలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఈసారి ఒకరిద్దరు తప్ప పాతవారికి అవకాశం ఉండక పోవచ్చని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రత్యేకంగా పైకొచ్చిన, ఉద్యమ నాయకులు వర్సెస్’ ఉద్యమ ద్రోహులు చర్చకు సమాధానంగా.. ఉద్యమ నాయకులకు ఈసారి పెద్ద పీట వేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, చివరకు ఏమి జరుగుతుంది? ఎవరిని అదృష్టం వరిస్తుంది? అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోనుంది. 

జగన్‌రెడ్డి ఒరిస్సా టూర్ వెనుకు ఇంత స్కెచ్ ఉందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్’ తో భేటీ అయ్యారు. అధికారికంగా ముఖ్యమంత్రి ఒరిస్సా వెళ్ళింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసింది, ఉభయ రాష్ట్రాల సాగు నీటి సమస్యలు, రెండు రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యలపై చర్చించేందుకే కావచ్చును, కానీ, అది నిజామా అంటే, కాదంటున్నారు. సహజంగా నీటి సమస్యలు, జల వివాదాలు లేదా కొన్ని పత్రికలలో వచ్చిన గంజాయి లింకుల వ్యవహారమే అయినా లేక మావోల సమస్య మరో సమస్య అయినా నేరుగా ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగవు. ముందు వివిధ స్థాయిల్లో అధికారుల మధ్య, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరాఖరులో, అవసరం అనుకుంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. కానీ, ఇక్కడ అదేమీ లేదు. ముఖ్యమంత్రుల భేటీకి ముందు ఏ స్థాయిలోనూ ఎలాంటి చర్చలు జరగలేదు. అధికారుల స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన సమాచారం కూడా ఉన్నట్లు  లేదు. ఒక్క సారిగా, ముఖ్యమంత్రి ప్రత్యేక ఫ్లైట్ ఎక్కి భువనేశ్వర్’లో దిగారు. అఫ్కోర్స్ ముందుగా ఒరిస్సా సీఎం అప్పాయింట్మెంట్ తీసుకోవడం, ఇతర ప్రోటోకాల్ ఫాలో అయ్యారు అనుకోండి, అయినా జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన పూర్తిస్థాయి అధికార పర్యటన అయితే కాదనే, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా చక్కబెట్టుకునే ఉద్దేశంతోనే, జగన్ రెడ్డి ఒరిస్సా వెళ్లి వచ్చారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అంతే కాదు, స్వామి కార్యం, స్వకార్యంతో పాటుగా, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూతగానూ జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన సాగిందని అటు అమరావతి ఇటు హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఉభయ తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటీవల కాలంలో కేంద్రంతో కాలు దువ్వేందుకు ఉబలాట పడుతున్నారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏమి చేస్తుందో, అనే భయంతో షేక్ అవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే, రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కేసీఆర్, రక్షణ కవచం ఏర్పరచుకునే ప్రయత్నాలలో పడ్డారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్  వరసగా రెండు రోజులు.. గంటలకు గంటలు ప్రెస్మీట్లు పెట్టి, ఎదో చేద్దామని ప్రయత్నించారు. అది కాస్తా బూమ‌రాంగ్ అయింది. అలాగే ఇప్పుడు ఉత్తరాది - దక్షిణాది విబేధాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాల ప్రధాని అభ్యర్ధిగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరును తెర మీదకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్డం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, కేసీఆర్ ఒకే పడవలో ప్రయాణిస్తున్న మంచి మిత్రుడు జగన్ రెడ్డిని తమ దూతగా ఒరిస్సా పంపారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రెండు రోజుల మారథాన్ ప్రెస్ మీట్’ లో చూచాయగా ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేయడం, అలాగే, రాయలసీమ పట్ల ప్రేమను వొలక పోయడం, చేపల పులుసు సంగతులు గుర్తు చేసుకోవడంవంటి ఉదంతాలను విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇదంతా  కేసీఆర్ ఆత్మ రక్షణ వ్యూహంలో భాగంగా తెర మీదకు తెస్తున్న ‘ఫ్రంట్’కు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్, జగన్ రెడ్డి నైజం తెలిసిన నవీన్ పట్నాయక్, కేసీఆర్ దూతగా జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని భువనేశ్వర్ నుంచి వ‌స్తున్న‌ సమాచారం.  

జ‌గ‌న్ ఫేక్ సీఎం.. పీఆర్సీపై జేఏసీ యాక్ష‌న్‌.. ప్ర‌భాక‌ర్‌కు సీబీఐ పంచ్‌.. టాప్‌న్యూస్ @7pm

1. జగన్‌రెడ్డి ఒక ఫేక్‌ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అభ్యర్థులు కోర్టుకెళ్తే సీఎం, మంత్రులు జైలుకెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని.. ప్రశ్నించే వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ ద‌గ్గ‌ర‌ రైతుల మహా పాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిప‌డ్డారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు.  3. అసలు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే నివేదిక కాపీ ఎందుకు ఇవ్వడంలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ప్రశ్నించారు. పీఆర్సీలో కొన్ని శాఖలకు అన్యాయం జరిగితే గతంలో మరో కమిటీ వేయించుకున్న చరిత్ర ఉందన్నారు. ప్రభుత్వంతో శుక్రవారం నాటి సమావేశంలో నివేదిక కాపీ కోసం పట్టుపడతామని చెప్పారు.  4. సీఎం జగన్‌కు ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు? అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించమంటే జీతం ఇస్తున్నాం కదా అని మాట్లాడతారా అని నిలదీశారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, డీఏ బకాయిల హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము దారి మళ్లింపు సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. 5. మెడికల్ కాలేజీ విషయంలో కేంద్ర‌మంత్రి కిషన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ కోసం 24 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. వరి, సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీవి అబద్ధాలేనని చెప్పారు. దుష్ప్రచారంలో బీజేపీ నేతలు గోబెల్స్‌ను మించిపోతున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. 6. మద్యపాన నిషేధంపై సీఎం జగన్‌ క్లారిటీ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. మద్య నిషేధం చేయక పోతే ఓట్లు అడగనని ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నారని విమర్శించారు. ఎయిడెడ్‌ స్కూళ్లపై వైసీపీ నేతల వింత పోకడలు పోతున్నారని తప్పుబట్టారు. సంఖ్యాబలం లేకపోయినా సీపీఐ, టీడీపీ నేతల పోరాటం చిరస్మరణీయమని రఘురామ కొనియాడారు. 7. హైద‌రాబాద్ ఇందిరాపార్కు ద‌గ్గ‌ర‌ వైఎస్ షర్మిల త‌ల‌పెట్టిన‌ 72 గంటల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ స్థ‌లంలో శుక్ర‌వారం టీఆర్ఎస్ దీక్షకు ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చామ‌ని పోలీసులు చెప్పారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు దీక్ష చేయనున్నారు ష‌ర్మిల‌.  8. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.  ప్రచారానికి అనుమతులు తీసుకోవాలంటూ ఆంక్షలు పెట్టి టీడీపీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ సర్క్యులర్‌, ఆంక్షలపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలయింది. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంపై అక్కడ డీఎస్పీ విధించిన ఆంక్షలపై హైకోర్టు సీరియస్‌ అయింది. డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేసింది.  9. పంచ్‌ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. అతిత్వ‌ర‌లోనే  ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్  చేసే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు, ఏపీ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.  10. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14.2 కేజీల డ్రగ్స్‌‌ను పోలీసులు సీజ్‌ చేసారు. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను ముఠా తరలిస్తున్నది. ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్‌ను దాచి ముఠా పార్శిల్‌ చేసింది. బేగంపేట ఇంటర్‌ నేషనల్‌ పార్శిల్స్‌ ఆఫీస్‌లో డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.   

ఉద్యోగుల జేబులకు సర్కారు చిల్లు.. జ‌గ‌న‌న్న దోపిడీ మామూలుగా లేదుగా...

దాచుకున్న సొమ్మును దోచుకుంటారా? ఇది ఎవరు, ఎవరిని ఆడుగుతున్న ప్రశ్నో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. ఎందుకంటే, ఈ ప్రశ్న అడుగు తున్నది, ఏ ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీనో కాదు, అడుగుతున్నది చట్టాల గురించి తెలియని సామాన్యులు కాదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇంకా కొంచెం క్లియర్’గా చెప్పాలంటే, ఉద్యోగుల జేబుల్లో వైసీపీ ప్రభుత్వం చేతులు పెట్టిందని, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజం. ఓ వంక పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో దాగుడుమూతలు ఆడుతున్న ప్రభుత్వం, గుట్టు చప్పుడు కాకుండా, ఉద్యోగుల జీపీఎఫ్ కింద దాచుకున్న సొమ్ములో కొంత తీసుకుని వాడేసుకుంది. సరే, జగనన్న ఏ వైఎస్సార్ పథకం మీట నొక్కేందుకో అవసరమై ప్రభుత్వం ఉద్యోగుల జేబులు కత్తిరించిందే అనుకుందాం, కానీ, అదే విషయం ఉద్యోగ సంఘాలకు ముందుగా  చెప్పి వారి అనుమతితో తీసుకుంటే అదో రకం, కానీ అదేమీ లేదు. అక్టోబర్ 28-30 తేదీలలో జీపీఎఫ్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకున్నట్లు ‘మెసేజ్’లు వస్తే కానీ, ఉద్యోగులకు ఆ విషయమే తెలియదు.  ఇది ఇంకెవరో చెబితే, ఇంకెవరో ఆరోపిస్తే  ఏమో కానీ, స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు, కే ఆర్ సూర్యనారాయణ, సంఘం కార్యవర్గ సమావేశం వేదిక నుంచి చేసిన ఆరోపణ. కాదుకాదు వ్యక్తపరిచిన ఆవేదన.  దేశంలో ఎక్కడా లేని వింతలూ విడ్డూరాలు ఏపీలో మాత్రమే జరుగుతున్నాయి ఇది మరొక ఉదాహరణగా నిలుస్తుందని ఉద్యోగ సంఘల నాయకులు అంటున్నారు. అలాగే, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డదారులు తొక్కేందుకు సిద్ధంగా ఉందనేందుకు కూడ, ఈ జేబు కత్తెర ఉదంతం మరో ఉదాహరణగా నిలుస్తుందని, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. నిజానికి ఇది, ఆర్థిక శాఖ, సీఎంఎఫ్ఎస్ అధికారాలు చేసిన ఆర్ధిక నేరంగా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సుర్యనారాయణ  ప్రభుత్వం మీద తీవ్రమైన అభియోగం మోపారు. అంతే కాదు, ఇందుకు బాధ్యులైన సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని లేదంటే, తామే పోలీసు కంప్లైంట్ ఇస్తామని హెచ్చరించారు. అలాగే, ఉద్యోగులకు తెలియకుండా వారి జీపీఎఫ్ ఖాతాలోంచి ఒక్క రూపాయి తేసుకున్నా ఆది బ్రీచ్ అఫ్ ట్రస్ట్ కింద నేరం అవుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాల్లో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వం మీద విశ్వాసంతో దాచుకున్న సొమ్మును ప్రభుత్వమే దోచుకోవడం అంటే, కంచే చేను మేయడంతో సమానమని అంటున్నారు. కాగా, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సుర్యనారయణ, జీపీఎఫ్ నుంచి తీసుకున్న సొమ్మును తక్షణం డిపాజిట్ చేయాలని, అదే విధంగా జీపీఎఫ్ ను ప్రభుత్వం ప్రత్యేక అకౌంటులో చూపించాలని డిమాండ్ చేశారు.   అదలా ఉంటే, గడచిన రెండున్న‌ర ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏవీ పరిష్కరించకపోగా, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తోందని నేతలు అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చకుండా, ఇదిగో అదిగో అంటూ దాటవేత ధోరణి అవల్బిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నరు. మరోవైపు, అధికారులలో కూడా రాజకీయ నాయకత్వం పట్ల అసంతృప్తి క్షణక్షణాభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన తప్పులకు తాము కోర్టులకు సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం అధికారులు ఆవమానంగా భావిస్తున్నారు. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిపాలన మరింతగా అస్తవ్యస్తం మయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అంతే కాకుండా అధికార యంత్రాంగంల అసంతృప్తి ఆందోళన రూపం దాల్చే ప్రమాదం కూడా కొట్టి వేయలేమని అంటున్నారు.

పంచ్ ప్ర‌భాక‌ర్‌పై సీబీఐ యాక్ష‌న్‌.. ఇంట‌ర్‌పోల్ బ్లూ నోటీస్‌..

పంచ్ ప్ర‌భాక‌ర్‌కు స్ట్రాంగ్‌ పంచ్ ప‌డే టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. విదేశాల్లో న‌క్కి.. నోటికొచ్చినట్టు కూసినందుకు త‌గిన శాస్త్రి జ‌రిగే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఏకంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను, జ‌డ్జిల‌ను కించ‌ప‌రిచేలా పంచ్ ప్ర‌భాక‌ర్ చేసిన కామెంట్లుకు క‌ఠిన శిక్ష ప‌డే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. ప్ర‌భాక‌ర్‌ను ప‌ట్టుకోచ్చి.. కోర్టు బోనులో నిల‌బెట్ట‌డంలో ఇన్నాళ్లూ ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన సీబీఐకి ఇటీవ‌ల హైకోర్టు గ‌ట్టిగా మొట్టికాయ‌లు వేయ‌డంతో.. సీబీఐ దారికొచ్చింది. వెంట‌నే సీరియ‌స్ యాక్ష‌న్‌లోకి దిగిపోయింది. పంచ్ ప్ర‌భాక‌ర్‌ను ఫారిన్ నుంచి ర‌ప్పించేలా.. ప‌క‌డ్బందీ ఉక్కు బిగించింది.  పంచ్‌ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. అతిత్వ‌ర‌లోనే  ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్  చేసే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త విచార‌ణ సంద‌ర్భంగా పంచ్ ప్ర‌భాక‌ర్‌ను పది రోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. ఆలోగా అరెస్టు చేయకపోతే.. విచారణ కోసం సీబీఐకి సంబంధంలేకుండా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. ఆ డెడ్‌లైడ్ ముగియక ముందే.. ఇంట‌ర్‌పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసులు పంపించ‌డంతో ప్ర‌భాక‌ర్‌కు పంచ్ ప‌డటం ఖాయంగా క‌నిపిస్తోంది.  మ‌రోవైపు, ఏపీ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై విడివిడిగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 

రైతుల‌పై 'లాఠీ' కావ‌రం.. ఇదేమి రాజ్యం.. పోలీస్ రాజ్యం..

అమ‌రావ‌తి కోసం మేముసైత‌మంటూ త‌ర‌లివ‌చ్చారు వారంతా. రాజ‌ధాని రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు సంఘీభావంగా వేలాది మంది దండు క‌ట్టారు. అమ‌రావ‌తి రైతుల‌తో క‌దం క‌దం క‌దిపారు. జై అమ‌రావ‌తి.. జైజై అమ‌రావ‌తి.. నినాదాల‌తో హోరెత్తించారు.  మ‌హా పాద‌యాత్ర‌కు ఇలా పెద్ద ఎత్తున ప్ర‌జాద‌ర‌ణ వెల్లువెత్త‌డాన్ని చూసి పాల‌కులు త‌ట్టుకోలేక‌పోయారు. పోలీసుల‌ను ప్ర‌జ‌ల మీద‌కు ఉసిగొల్పారు. పై నుంచి ఆదేశాలు అందిన‌ట్టున్నాయి.. ఖాకీలు రంగంలోకి దిగిపోయారు. ఎల‌క్ష‌న్ కోడ్‌.. అదీ ఇదీ అంటూ రూల్స్ పేరుతో క‌ఠిన ఆంక్ష‌లు విధించారు. పాద‌యాత్ర‌లో 157 మంది అమ‌రావ‌తి రైతులు మిన‌హా.. బ‌య‌టి వారెవ‌రూ పాల్గొన వ‌ద్దంటూ.. ఎవ‌రూ సంఘీభావం తెలుపొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్ర‌జా ఉద్య‌మాన్ని ఆంక్ష‌ల‌తో అడ్డుకోగ‌ల‌రా? ఖాకీల బ‌లగంతో రైతుల‌ను ఏకాకులు చేయ‌గ‌ల‌రా? అది ముమ్మాటికీ అసాధ్యం. అందుకే, రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా పెద్ద సంఖ్య‌లో స్థానికులు త‌ర‌లివ‌చ్చారు. అది చూసి ఓర్వ‌లేని ఖాకీలు.. అదే అద‌నుగా.. లాఠీల‌కు ప‌ని చెప్పారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడను ర‌ణ‌రంగంగా మార్చేశారు.  ప్ర‌జా దండుపై లాఠీఛార్జి చేశారు. బారికేడ్ల‌తో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసు వ‌ల‌యాన్ని చేధించుకుంటూ స్థానికులు ముందుముందుకు క‌దిలారు. పోలీసులు లాఠీల‌తో దొరికిన వారిని దొరికిన‌ట్టు చిత‌క‌బాదారు. మ‌హిళ‌ల‌నూ వ‌ద‌ల‌కుండా లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు. ఖాకీల దెబ్బ‌ల‌కు ఆళ్ల నాగార్జున చెయ్యి విరిగిపోయింది. హాస్పిట‌ల్‌కి తీసుకెళితే.. చెయ్యంతా సిమెంట్ ప‌ట్టీలు వేశారు. దెబ్బ‌లు బాగా త‌గిలాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు. పోలీసులు ఇంత‌లా కొట్ట‌డ‌మేంట‌ని చికిత్స చేసిన వైద్యులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  ఏపీలో ప్ర‌జాస్వామ్యం ప‌త్తా లేకుండా పోయింద‌ని.. రెండేళ్లుగా అంతా పోలీస్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగ‌మే న‌డుస్తోంద‌ని మ‌రోసారి తేలిపోయింది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమంటున్నారు. హైకోర్టు ప‌ర్మిష‌న్‌తో అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హా పాద‌యాత్రను నీరుగార్చ‌డానికే ఇలా స్థానికుల‌పైకి ఖాకీల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిప‌డుతున్నారు.  న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ..  రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హా పాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ట్టుంది. అందుకే పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించే కుట్ర‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని సైతం అడ్డుకుంటుండ‌టం.. పాల‌కుల అభ‌ద్ర‌తాభావానికి నిద‌ర్శ‌నం. ప్ర‌కాశం జిల్లా చ‌ద‌వ‌ల‌వాడలో పోలీసులు సృష్టించిన బీభ‌త్సం.. లాఠీల‌తో విరుచుకుప‌డ‌టం.. చెయ్యి విరిగేలా చిత‌క‌బాద‌డం చూసి.. ఏపీలో పోలీస్ రాజ్యం అమ‌లు చేస్తున్నారంటూ అంతా మండిప‌డుతున్నారు.  అంత దారుణంగా కొట్టి.. ఖాకీలు సాధించిందేంటి? జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం మిన‌హా చేసిందేంటి?  రైతుతో క‌న్నీళ్లు పెట్టించిన ఏ పాల‌కుడూ బాగుప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు. రైతుల‌పై ప‌డిన ప్రతీ లాఠీ దెబ్బ‌కు స‌మాధానం చెప్పాల్సిన‌.. శిక్ష అనుభ‌వించాల్సిన రోజు త‌ప్ప‌క వ‌స్తుంది. కాకపోతే కాస్త ఆల‌స్యం అవుతుంది కావొచ్చు అంతే. చ‌ద‌ల‌వాడ‌లో ఖాకీల ఓవ‌రాక్ష‌న్ మిన‌హా జ‌రిగిందేమీ లేదు. అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర అంతే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.. స్థానికులు వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చి రాజ‌ధాని రైతుల‌కు సంఘీభావం చెబుతూనే ఉన్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మం ఆగేది కాదు. పోలీసుల సాయంతో ఆప‌గ‌లిగేది అంత‌క‌న్నా కాదు. జై అమ‌రావ‌తి.. జైజై అమ‌రావ‌తి. 

మ‌ద్యంతో ‘రెండు ముక్కలాట’.. అప్పుల కోసం జ‌గ‌నన్న‌ కొత్త ఎత్తులు!

అప్పు.. రెండక్షరాల ఈ చిన్న పదమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తారక మంత్రం. ఓ వంక ఆర్ధిక మంత్రి ఢిల్లీలో తిష్ట వేసి, అప్పు కోసం నానా తిప్పలు పడుతున్నారని వార్తలొస్తున్నాయి. మరోవంక, రాష్ట్ర ప్రజల తాగుడు సామర్ధ్యాన్ని, దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ముందుగానే, తాకట్టు పెట్టి తెచ్చుకున్నఅప్పు కిస్తీ కట్టేందుకు, అదే దారిలో కొత్త అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త దారులు వెతుక్కుంటోంది. రేపన్న ఆలోచన లేకుండా ఈ పూటగడిస్తే చాలన్న రీతిలో ఆర్థిక, పన్ను విధానాలను ‘తత్కాల్’ ప్రాతిపదికన తిరగ రాస్తోంది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వ్యాట్ ఆదాయాన్ని వ్యూహాత్మకంగా కొత్త అప్పు, పద్దులోకి సర్దు బాటు చేసే, టక్కరి విద్యను చూపుతోంది.  ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9న రెండు జీవోలు (312, 313) విడుదల చేసింది. సహజంగానే, ఆచారంగా కీలక జీవోలను దాచి పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఈ జీవోలను కూడా మూడో కంటికి కనిపించకుండా దాచిపెట్టింది. అయితే, ఎలాగో, ఈ చీకటి జీవోలు వెలుగులోకి వచ్చాయి. అలా వెలుగులోకి వచ్చిన ఈ సీక్రెట్ జీవోల సారాశం చూసి, ఆర్థిక నిపుణులే ఆశ్చర్య పోతున్నారు.  ఇక విషయంలోకి వస్తే, అప్పుల చేయండంలో అన్ని విధాలా ఆరితేరిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికే రాబోయే పాతిక సంవత్సరాల పాటు  మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. అయితే, తెచ్చిన అప్పులు తెచ్చినట్లుగా బటన్ నొక్కి  పందేరం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని అప్పులు తెచ్చినా, ఎప్పుడు పరకడుపే. సో కొత్త అప్పుల కోసం జగన్ సర్కార్, మేదస్సునంతా ఉపయోగించి, వింత ఆలోచన ఆలోచన అనాలో వికార, వికృత ఆలోచన అనాలో తెలియదు గానీ, ఒక  మోసపూరిత, కొత్త ఆలోచన అయితే చేసింది.   ఆర్థిక నిపుణలకు కూడా అంతు చిక్కని ఈ వింత ఆలోచన పర్యవసానంగా మద్యంపై విధిస్తున్న ‘వ్యాట్‌’ ఆదాయాన్ని ప్రభుత్వం ముక్కలు చేసింది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వాటాకు గండి కొట్టి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయం పెంచే విధంగా వ్యాట్ ఆదాయాన్ని పంకాలు చేసింది. ఇప్పుడు.. జారీ చేసిన జీవో నెంబర్‌ 312, 313 ద్వారా మద్యంపై వచ్చే వ్యాట్‌ ఆదాయంలో  చిన్న ముక్క ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. పెద్ద ముక్క ఆదాయం మాత్రం ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో జమ అవుతుంది. చిన్న ముక్కకు ‘వ్యాట్‌’ అనే పేరును కొనసాగిస్తున్నారు. పెద్ద ముక్కను ‘స్పెషల్‌ మార్జిన్‌’లో కలిపేశారు. గతంలో 0.5 శాతం మాత్రమే ఉన్న స్పెషల్‌ మార్జిన్‌ ద్వారా రూ.60 కోట్లు మాత్రమే బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు దక్కేవి. ఇప్పుడు మారిన పద్ధతిలో అది కాస్తా రూ.6వేల కోట్లకు చేరనుంది. ఇలా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు కొత్తగా వస్తున్న ఆదాయాన్ని చూపించి... బ్యాంకుల నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకుంటారన్న మాట! ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా 2022 మార్చిలోగా, అంటే రాబోయే నాలుగు నెలల్లో రూ.25,000 కోట్ల అప్పుగా తెచ్చుకునేందుకే ఈ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆ వినూత్న ‘రెండు ముక్కలాట’లో మద్యం అమ్మకాలపై వచ్చే వ్యాట్‌ ఆదాయం ఇక బక్కచిక్కనుంది. ఆ గణాంకాలు చూస్తే... 2020-21లో మద్యంపై సుమారు రూ.12,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను (ఏఆర్‌ఈటీ) రూ.3,000 కోట్లు. ఇది నేరుగా ఏపీఎ్‌సడీసీకి చేరి అక్కడి నుంచి అప్పుల అసలు, వడ్డీ చెల్లింపుల కింద బ్యాంకులకు వెళ్లిపోతుంది. మిగిలిన రూ.9,000 కోట్లలో 3 వేల కోట్లు మాత్రమే ఖజానాకు వెళుతుంది. మిగిలిన రూ.6,000 కోట్లు బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు దక్కుతుంది. ఈ ఆదాయం ద్వారా భారీగా అప్పు తెచ్చుకోవచ్చని జగన్ ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.   ఇప్పటి వరకు స్పెషల్‌ మార్జిన్‌ కింద మొత్తం ఎక్సైజ్‌ ఆదాయంలో 0.5 శాతం మాత్రమే బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి దక్కేది. అంటే...  2020-21లో రూ.60 కోట్లు స్పెషల్‌ మార్జిన్‌ కింద అందాయి.  ఇప్పుడు ఈ రెండు జీవోలతో స్పెషల్‌ మార్జిన్‌ రూ.60 కోట్ల నుంచి ఏకంగా రూ.6,000 కోట్లకు పెరిగింది. నిబంధనల ప్రకారం...  స్పెషల్‌ మార్జిన్‌ ఆదాయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. కొత్తగా అప్పులు తెచ్చుకోవడం కోసం కాదు. మరోవైపు... వచ్చిన ఆదాయంలో రెండు వంతులను స్పెషల్‌ మార్జిన్‌ కింద కార్పొరేషన్‌కు జమ చేయడం రాజ్యాంగ విరుద్ధం. సిబ్బంది జీతాలు, నిర్వహణకు, భవనాల అద్దెలు, ఇతర ఖర్చుల కోసం ఎక్సైజ్‌ ఆదాయంలో 6 శాతాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అందిస్తుంది. అది కూడా ఆదాయం మొత్తం తొలుత రాష్ట్ర ఖజానాకు వచ్చిన తర్వాత మాత్రమే! అంతే తప్ప, కార్పొరేషన్‌ నేరుగా మినహాయించుకోవడానికి వీల్లేదు. అంటే, ఈ జంట జీవోల పుణ్యాన మద్యం పై వ్యాట్ తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ, తగ్గదు. మందు బాబులు, నిన్న ఎంత చెల్లించారో ఈరోజు, రేపు కూడా  అంతే చెల్లించక తప్పదు. అయినా, ప్ర‌భుత్వ‌ ఖజానాకు వచ్చే ఆదాయంమాత్రం తగ్గిపోతుంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయం పెరుగుతుంది.. ఆ ఆదాయం తాకట్టు పెట్టి ప్రభుత్వం మరింత అప్పు తెచ్చుకుటుంది.. సంక్షేమం బటన్ నొక్కి  ఓట్లు కొనుక్కుంటుంది. అప్పు తడిసి మోపెడై రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇదొక విష వలయం.. జగనన్న సృష్టిస్తున్న విష వలయంలో చిక్కుకున్న రాష్ట్రం ఇంకా మిగులున్న జగన్ రెడ్డి పాలనలో ఏ తీరాలకు చేరుతుందో.. ఎంత అప్పులో కూరుకుపోతుందో ఉహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.

షర్మిల 72 గంట‌ల‌ దీక్ష‌కు నో ప‌ర్మిష‌న్‌.. అయినా, త‌గ్గేదే లే..

వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌.. ప్ర‌జా ప్ర‌స్థాన యాత్ర చేస్తున్నారు. తెలంగాణ‌లో సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టారు. ఊరూరా ప్రజా స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. నేనున్నానంటూ ధైర్యం చెబుతున్నారు. ఓవైపు పాద‌యాత్ర చేస్తూనే.. ప్ర‌తీ మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్షకు కూర్చొంటున్నారు. తాజాగా, రైతుల ప‌క్షాన 72 గంట‌ల దీక్ష‌కు దిగుతాన‌ని ప్ర‌క‌టించారు. ష‌ర్మిల ప్ర‌క‌ట‌న.. కేసీఆర్ స‌ర్కారును షేక్ చేసిన‌ట్టుంది. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ష‌ర్మిల త‌ల‌పెట్టిన 72 గంట‌ల దీక్ష‌కు అనుమ‌తి నిరాక‌రించారు. పోలీసులు కొర్రీలు పెట్టినా.. షర్మిల మాత్రం త‌న పంతం వీడ‌లేదు. దీక్షా స్థ‌లం మార్చేశారు అంతే.  వైఎస్ షర్మిల 72 గంటల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటలపాటు దీక్ష చేయడానికి నిర్ణయించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేయాలనుకున్నారు. ఇందిరా పార్క్ వేదికగా తలపెట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వ‌లేదు. ఎందుకంటే.. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర‌ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేయ‌నున్నారు. టీఆర్ఎస్ దీక్ష‌కు అనుమతి ఇచ్చినందున‌.. షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో దీక్షా వేదిక మార్చేశారు ష‌ర్మిల‌. కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేయాల‌ని నిర్ణయించారు.

మహా పాదయాత్రలో లాఠీఛార్జ్.. రైతుల‌కు గాయాలు.. లోకేశ్ ఫైర్‌

ఇదేమి రాజ్యం.. పోలీస్ రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం.. అనే విష‌యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హా పాద‌యాత్ర‌లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి మొద‌టి నుంచీ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. తాజాగా ఎల‌క్ష‌న్ కోడ్ పేరుతో క‌ఠిన ఆంక్ష‌లు విధించారు. పాద‌యాత్ర‌లో అమ‌రావ‌తి రైతులు మిన‌హా మ‌రెవ‌రూ హాజ‌రుకావొద్ద‌ని.. వారికి సంఘీభావం తెలుపొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్ర‌జా ఉద్య‌మాన్ని ఆంక్ష‌ల‌తో అడ్డుకోగ‌ల‌రా?  పాద‌యాత్ర‌లో అదే జ‌రిగింది. రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా పెద్ద సంఖ్య‌లో స్థానికులు త‌ర‌లివ‌చ్చారు. ఇదే అద‌నుగా.. పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పి.. తీవ్ర ఉద్రిక్త‌త రాజేశారు. అస‌లేం జ‌రిగిందంటే... ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో జరుగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు.  పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ ద‌గ్గ‌ర‌ భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురుకి గాయాల‌య్యాయి. ఓ రైతు చేయి విరిగిన‌ట్టు తెలుస్తోంది.  చదలవాడ ద‌గ్గ‌ర‌ రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్‌పై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిప‌డ్డారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని లోకేశ్ అన్నారు. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో? అని నిలదీశారు. క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారని అడిగారు. పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని తీవ్రంగా ఖండించారు నారా లోకేశ్‌. 

పోలీస్‌ కస్టడీ హింసపై హైకోర్టులో పిల్.. జ‌గ‌న్ స‌ర్కారుకు షాక్‌..

గ‌తంలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. క‌స్ట‌డీలో త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ర‌ఘురామ అన్నారు. ఇటీవ‌ల టీడీపీ నేత ప‌ట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయ‌న ఇంటికి వెళ్లారు. క‌స్ట‌డీలో త‌న‌ను కొడ‌తార‌నే భ‌యంతో బ‌ట్ట‌లిప్పేసి మ‌రీ త‌న శ‌రీరంపై ఎలాంటి గాయాలు లేవ‌ని వీడియో రిలీజ్ చేశారు. ప్ర‌ముఖుల ప‌రిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల దుస్థితి చెప్పేదేముంది? అంత‌కుముందు.. ఓ ద‌ళితుడికి స్టేష‌న్లో గుండు కొట్టించిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఇలా, గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ఏపీలో పోలీస్ క‌స్ట‌డీ హింస‌పై అనేక వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌త్య‌ర్థులపై పోలీసుల‌ను ప్ర‌యోగిస్తూ.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీట‌న్నిటి నేప‌థ్యంలో తాజాగా హైకోర్టులో ఓ కీల‌క వ్యాజ్యం దాఖ‌లైంది. అరెస్ట్ చేసిన నిందితులకు ముందుగా వైద్య పరీక్షలు చేయించాలని, ఆ తర్వాతే వారిని స్టేషన్ కు తీసుకెళ్లేలా పోలీసులను ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్ హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది పీవీజీ ఉమేష్ చంద్ర వాద‌న‌లు వినిపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు 54, 57 సీఆర్పీసీ సెక్షన్లకు విరుద్ధంగా ఉందని లలిత్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సీఆర్పీసీలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించాలని పిల్ లో లలిత్ కుమార్ అభ్యర్థించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచార‌ణ‌కు స్వీక‌రించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏపీ వైద్య మండలి చైర్మన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని, కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.  పిటిషనర్ లలిత్ కుమార్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర హైకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించారు. ఏపీ పోలీసు అధికారులు సీఆర్పీసీ 54, 57 సెక్షన్లలోని అంశాలను అనుసరించడంలేదని కోర్టుకు తెలిపారు. పోలీసులు సీఆర్పీసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. విచారణ నెపంతో కస్టడీలో ఉన్నవారిని పోలీసులు హింసిస్తున్నారని హైకోర్టు దృష్టికి లాయ‌ర్‌ ఉమేష్ చంద్ర తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన నిందితుడ్ని పోలీసులు 24 గంటలకు మించి స్టేషన్ లో నిర్బంధించకూడదన్నారు. అయితే.. పోలీసులు ఈ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఇలాంటి కస్టడీ హింస సంఘటనలు వెలుగు చూశాయని హైకోర్టుకు విన్నవించారు. ఏపీలో ఇంకా మరెన్నో కస్టడీ హింస ఘటనలు జరుగుతున్నాయని లాయర్ ఉమేష్ చంద్ర హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం పోలీసులు మూడు పనులు చేయాల్సి ఉంటుందని న్యాయవాది ఉమేష్ చంద్ర‌ ధర్మాసనం ముందు వాదించారు. సీఆర్పీసీ సెక్షన్ 54 ప్రకారం నిందితుడ్ని అరెస్ట్ చేసిన వెంటనే వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ నిర్వహించాలని, తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపట్టాలని హైకోర్టుకు తెలిపారు. కానీ.. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించకుండానే పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించడం సీఆర్పీసీ రూల్స్ కు విరుద్ధం అని వాదించారు. పోలీసు హింసకు నిందితుడు గురికాకుండా సీఆర్పీసీ సెక్షన్ 57 రక్షణ కల్పిస్తోందని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుల అరెస్ట్, రిమాండ్ లాంటి విషయాల్లో పోలీసులు, కొందరు మేజిస్ట్రేట్లు చట్ట నిబంధనలను పాటించడం లేదన్నారు.  న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఏపీ మెడికల్ కౌన్సిల్ కు ప్రత్యేకంగా నోటీసు ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. త‌దుప‌రి విచార‌ణ వాయిదా ప‌డింది. హైకోర్టులో దాఖ‌లైన ఈ పిల్ జ‌గ‌న్ స‌ర్కారుకు షాకింగ్ ప‌రిణామ‌మే అంటున్నారు. 

కోహ్లి డాట‌ర్‌కి రే*ప్ వార్నింగ్‌.. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్ట్‌..

వాడో వెద‌వ‌. వెద‌వ‌న్న‌ర వెద‌వ‌. ఐఐటీలో చ‌దువుకున్నాడు. అయితేనేం. నీచంగా మాట్లాడాడు. చీప్‌గా వ్య‌వ‌హ‌రించారు. వాడి పేరు రామ్‌న‌గేశ్‌. క్రికెట్ అంటే పిచ్చి. ఇటీవ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఓడిపోవ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. మ్యాచ్ త‌ర్వాత ట్విట్ట‌ర్‌లో అడ్డమైన కూత‌లు కూశాడు. 'క్రిక్‌క్రేజీగ‌ర్ల్' అనే పేరుతో ఉన్న ట్విట‌ర్ అకౌంట్‌లో విరాట్ కోహ్లీని బెదిరిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కోహ్లీ కూతురును అత్యా-చారం చేస్తానంటూ నీచంగా కామెంట్ చేశాడు. క్ష‌ణాల్లో ఆ ట్వీట్ వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు ఆ ట్వీట్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ట్వీట్ చేసినోడిని ఉరి తీయాలంటూ వేలమంది రీట్వీట్‌ చేశారు. ట్విట‌ర్ సైతం ఆ ట్వీట్‌ను డిలీజ్ చేసింది. ఢిల్లీ, ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎంక్వైరీ చేస్తే.. ఆ ట్వీట్ చేసిన వెద‌వ హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్టు తేలింది.  భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్‌లో బెదిరించిన యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్‌)లో అతడు ఉంటున్న క్వార్టర్‌కి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. రామ్‌నగేష్‌ తండ్రి ఓడీఎఫ్‌లో ఉద్యోగి. నిందితుడి అరెస్ట్‌ అనంతరం ఆయన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. 23 ఏళ్ల రామ్‌నగేష్‌  హైదరాబాద్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కొంతకాలం ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పనిచేసినట్లు గుర్తించారు.   

కుప్పంలో లోకేశ్.. మహా పాద‌యాత్ర‌పై లాఠీ.. సూర్యాపేట‌లో జై భీమ్.. టాప్‌న్యూస్ @1pm

1. కుప్పం రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలోకి నారా లోకేశ్ ఎంట్రీ ఇస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొంటారు. స్థానిక టీడీపీ నేతల‌కు ఎల‌క్ష‌న్ వ్యూహాల‌పై దిశానిర్దేశ్యం చేయ‌నున్నారు నారా లోకేశ్‌.  2. విశాఖలో పలు చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. మారిటైం బోర్డ్ చైర్మన్ కాయలు వెంకట్ రెడ్డి, కె.వి.ఆర్ గ్రూప్, స్కైలైన్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న వైష్ణవి బిల్డర్స్, గౌతు శివాజీ అల్లుడు, వెంకన్న చౌదరి సర్‌దాత్ నెస్ట్‌కు చెందిన రియల్ ఎస్టేట్, వారికి చెందిన కంపెనీలపై, వారి బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. 20 బృందాలు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  3. బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. కంట్రోల్‌లో ఉండవలసిన అవసరం ఉద్యోగ సంఘ నాయకులకు ఎందుకు వచ్చిందని నిల‌దీస్తోంది. సీపీఎస్ పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ ఒక్కటే కాదు 100పైగా సమస్యలకు పరిష్కారమెప్పుడో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఎయిడెడ్ ఉద్యోగుల భవితవ్యం ఏమిటో తేల్చాలంటున్నారు.  4. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు దూకుడు పెంచాయి. హెల్త్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రతో  ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ అవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఉన్న సమస్యలపై 40 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నారు. బోధన డాక్టర్లలకు పీఆర్సీ 2016 నుంచి అమలు చేయాలని, కోవిడ్ సమయంలో తీసుకున్న వైద్యులకు రెండేళ్లకే ప్రొహిబిషన్ ఇవ్వాలని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు టైం బౌండ్ ప్రమోషన్‌లు ఇవ్వాలని, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.  5. ఏపీలో ‘విద్య వద్దు - మద్యం ముద్దు’ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయంతో ఎయిడెడ్ పాఠశాలల్లో పిల్లల చదువులు రోడ్డున పడ్డాయన్నారు. సీఎంకు మద్యం దుకాణాల నిర్వాహణపై ఉన్న మక్కువ.. విద్యాలయాల నిర్వాహణపై లేదన్నారు. అదనపు అప్పు కోసం మద్యం రేట్లు పెంచి మద్యం వినియోగదారులతో ఆ అప్పు కట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 6. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి రాజధాని రైతుల పదకొండవ రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు రాజధాని రైతులను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పాదయాత్ర ఆసాంతం పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు లాఠీచార్జి చేయ‌డంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.  7. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున అమ‌రావ‌తి రైతుల మ‌హా పాదయాత్రలో ఇతరులు ఎవ్వ‌రూ పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఆ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వ‌డంపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక‌, హైకోర్టు అనుమతి ఉన్న ఈ పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌.  8. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఆసీఫ్ నగర్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ముగ్గరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ప‌ట్టుబ‌డిన డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి తీసుకొచ్చార‌నే దిశ‌గా ఆరా తీస్తున్నారు. ఏపీ నుంచి వ‌చ్చాయా?  లేక‌, స్థానికంగానే త‌యారు చేస్తున్నారా? అని విచారిస్తున్నారు. 9. జై భీమ్ సినిమా త‌ర్వాత గిరిజ‌నుల్లో కాస్త ధైర్యం వ‌చ్చింది. తాజాగా, సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ ముందు రామోజీ తండావాసుల ఆందోళనకు దిగారు. దొంగతనం అనుమానంతో రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను పోలీస్ స్టేషన్‌లో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వీరశేఖర్‌తో పోలీస్ స్టేషన్ ముందు 200 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. ఎస్ఐపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  10. అనంతపురం జిల్లా ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలకు యాజమాన్యం మరో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముందుగా రెండు రోజుల పాటు సెలవు ప్రకటించిన యాజమాన్యం.. హాలిడేస్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. ఎస్ఎస్‌బిఎన్ కళాశాల ప్రధాన గేటు ముందు స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు.   

సీఎం ఇంటిముందు ప‌ద్మ‌శ్రీ అవార్డీ ధ‌ర్నా.. ఎందుకంటే...

మంగ‌ళ‌వారం ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. బుధ‌వారం నేరుగా ముఖ్య‌మంత్రి ఇంటి ముందు ధ‌ర్నాకు దిగారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ నిర‌స‌న తెలిపారు. కేవ‌లం ప‌ద్మ‌శ్రీ అవార్డు మాత్ర‌మే కాదు.. అంత‌కుముందు అర్జున అవార్డు, ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త‌కాలూ గెలుచుకున్నారు. ఆ స్థాయి వ్య‌క్తి.. అలా సీఎం ఇంటి ముందు ధ‌ర్నా చేయ‌డం హ‌రియాణాలో క‌ల‌క‌లం రేపింది. యావ‌త్ దేశం ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... పారా రెజర్ల్‌ వీరేందర్‌ సింగ్‌. మంగళవారం రాష్ట్ర‌ప‌తి భవన్‌లో పౌర అవార్డుల ప్రదానోత్సవంలో ‘పద్మశ్రీ’ తీసుకున్నారు. బుధవారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ ఇంటి ముందు పారా అథ్లెట్లకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. తాను పొందిన అర్జున అవార్డు, పద్మ పురస్కారం, ఇతర మెడల్స్‌ని వెంట తీసుకొచ్చి సీఎం నివాసం ముందు కూర్చొని నిర‌స‌న తెలిపారు. ఆ విష‌యాన్ని ట్విట‌ర్‌లోనూ పోస్ట్ చేశారు.  ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఖట్టర్‌ గారు! కేంద్రం మాకు (పారా అథ్లెట్లకు) సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు హరియాణా ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? బధిర క్రీడాకారులకు పారా క్రీడాకారులతో సమాన హక్కులు కల్పించేంత వరకు మీ నివాసమైన ఢిల్లీ హరియాణా భవన్‌ ఫుట్‌పాత్‌ నుంచి కదలను’’ అంటూ ట్వీట్ చేశారు.   

మ‌హా పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం బ్రేకులు? ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డంకి అవుతుందా?

ఏపీకి ఏకైక‌ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ రైతులు, మ‌హిళ‌లు చేప‌ట్టిన మ‌హా పాద‌యాత్ర వైసీపీ ప్ర‌భుత్వానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు.. పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టారు. దారి పొడ‌వునా మ‌హా పాద‌యాత్ర‌కు మ‌హా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. పాద‌యాత్ర ఏ ప్రాంతానికి చేరితే ఆ ప్రాంత మ‌హిళ‌లు, రైతులు, స్థానికులు.. ఇలా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర‌కి సంఘీభావం ప‌లుకుతున్నారు. పాద‌యాత్ర చేస్తున్న‌ వారిని మ‌రింత ఉత్సాహ ప‌రుస్తున్నారు. మ‌హా పాద‌యాత్ర‌కు జ‌నం వెల్లువ చూసి.. జ‌గ‌న్ స‌ర్కారులో ఆందోళ‌న పెరుగుతోంది. అనేక జిల్లాల మీదుగా సాగే పాద‌యాత్ర‌తో అమ‌రావ‌తి నినాదం ఊరూరా మారుమోగుతుంద‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్టుంది. అందుకే కాబోలు.. యాత్ర ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచీ ఎలా ఆపాలా అనే దిశ‌గానే అనేక కొర్రీలు పెడుతోంది స‌ర్కారు. తాజాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్ కోడ్ రావ‌డంతో.. మ‌హా పాద‌యాత్ర సందిగ్థంలో ప‌డింది. అయితే, ఎన్నిక‌ల కోడ్‌.. పాద‌యాత్ర‌కు వ‌ర్తించ‌దంటోంది టీడీపీ. హైకోర్టు అనుమతితో రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర.. రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని టీడీపీ నేత దూళిపాళ్ల‌ నరేంద్ర అన్నారు. రైతులను అడుగడుగున అడ్డుకోవటం, సంఘీబావం ప్రకటిస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయటమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. హైకోర్టు అనుమతి ఉన్న ఈ పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని చెప్పారు.  మ‌రోవైపు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి రాజధాని రైతుల మహాపాదయాత్ర 11వ రోజు కొన‌సాగుతోంది. పాదయాత్రకు రాజధాని రైతులను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. పాదయాత్ర ఆసాంతం పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ బలగాల మధ్యే పాదయాత్ర కొనసాగుతోంది.

'సింగం' త‌ర‌హా పోలీస్ ఛేజింగ్‌.. రెండు కార్ల‌ను వెంటాడి.. ఏం జ‌రిగిందంటే..

పోలీసులు రోడ్డుపై వాహ‌నాలు చెక్ చేస్తున్నారు. రెగ్యుల‌ర్‌గా చేసే డ్యూటీనే. అంత‌లోనే అటువైపు రెండు కార్లు దూసుకొచ్చాయి. ఆప‌మంటే ఆప‌లేదు. మ‌రింత స్పీడ్ పెంచి.. ర‌య్‌న దూసుకుపోయారు. అప్ప‌టి వ‌ర‌కూ క్యాజువ‌ల్‌గా డ్యూటీ చేస్తున్న కాప్స్ ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యారు. ఇలాంటి ఛీజింగ్ ఛాన్స్ ఎప్పుడో కానీ రాదాయే. అప్పుడే సింగం సినిమా చూసొచ్చిన వారిలా.. పోలీస్ వెహికిల్‌కి సైర‌న్ వేసుకొని.. కుయ్ కుయ్ మంటూ ఆ రెండు కార్ల‌ను వెంబ‌డించారు. ముందు పారిపోతున్న రెండు కార్లు.. వెన‌కాలే పోలీస్ వెహికిల్‌. ఎంత స్పీడ్ పెంచినా.. ప‌ట్టుకోలేక‌పోతున్నారు. అలా అలా 15 కిలోమీట‌ర్లు వెంబ‌డించారు. అప్ప‌టికి కూడా ఖాకీలు ఆ కార్ల‌ను ఏమీ ఓవ‌ర్‌టేక్ చేయ‌లేద‌నుకోండి. పారిపోతున్న వారే పోలీసుల‌కు భ‌య‌ప‌డి.. రెండు కార్ల‌ను రోడ్డు ప‌క్క‌న ఆపేసి.. లాక్ చేసేసి.. వాటిని వ‌దిలేసి పారిపోయారు. ఇంత‌కీ.. వారెందుకు పారిపోయారు? వారు ఎవ‌రు? ఆ కారులో ఏముంది? ఈ పోలీస్ చేజింగ్ సీన్ ఎక్క‌డ జ‌రిగింది? విజ‌య‌న‌గ‌రం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట ద‌గ్గ‌ర జ‌రిగిందీ యాక్ష‌న్ ఎపిసోడ్‌. విశాఖ ఏజెన్సీ నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఒడిస్సాకు చెందిన కార్లను ఆపేందుకు పోలీసులు ప్ర‌యత్నించారు. కార్లు ఆపకపోవటంతో సుమారు 15 కిలో మీటర్ల మేర వెంబడించారు. పురిటిపెంట ద‌గ్గ‌ర‌ కార్లకు తాళాలు వేసి ముగ్గురు నిందితులు పారిపోయారు. అతిక‌ష్టం మీద ఒక‌రిని ప‌ట్టుకున్నారు.  ఆ రెండు కార్లలో బ్యాగులు ఉన్నాయి. వాటిలో గంజాయి ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై విక్టరీ

టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది న్యూజీలాండ్. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి పైనల్ లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ విధించిన 167 పరుగుల విజయ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కూడా త్వరగానే పోయింది. మూడో వికెట్ కు మిచెల్, కాన్వే మంచి భాగస్వామ్యం అందించారు. అయితే 15 ఓవర్ లో 46 పరుగులు చేసిన కాన్వే స్టంప్ అవుట్ గా అవుటయ్యాడు. తర్వాత నాలుగో వికెట్ కూడా వెంటనే పడింది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టార్గెట్ రన్ రేట్ పెరిగిపోయింది. అయితే 17 ఓవర్ లో నీషమ్ రెండు సిక్సర్లు,ఫోర్ కొట్టడంతో మ్యాచ్ మళ్లీ కివీస్ చేతుల్లోకి వచ్చింది. 18 ఓవర్ లో మరో సిక్సర్ బాదాడు నీషమ్. తర్వాత మిచెల్ కూడా సిక్సర్ కొట్టి  ఫస్ట్ టీట్వంటీ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. తర్వాత నీషమ్ అవుట్ కావడంతో మ్యాచ్ మళ్లీ రసపట్టులోకి వచ్చింది. 19 ఓవర్ లో మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో కివీస్ విజయం ఈజీగా మారింది. మిచెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గ్రూప్ 1 లో టాప్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు... గ్రూప్ 2లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన న్యూజీలాండ్ తో తలపడింది.  టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ఇంగ్లండ్‌తో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి  167 పరుగులు చేసింది.  మొయిన్ అలీ (51; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలన్‌ (41; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా.. జోస్‌ బట్లర్ (29) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, ఇష్‌ సోధీ, నీషమ్‌, టిమ్‌ సౌథీ తలో వికెట్ తీశారు.   టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్‌, జానీ బెయిర్‌ స్టో శుభారంభం అందించారు. తొలి మూడు ఓవర్లలో నెమ్మదిగా ఆడినా తర్వాత జోరు పెంచారు. ట్రెంట్ బౌల్ట్ నాలుగో ఓవర్‌లో బట్లర్‌ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఐదు ఓవర్లకు స్కోరు 37/0గా నమోదైంది. ఈ క్రమంలోనే  ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. మిల్నే వేసిన ఆరో ఓవర్‌లో జానీ బెయిర్ స్టో (13) విలియమ్సన్‌కి చిక్కాడు. తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. ఇష్ సోధీ వేసిన తొమ్మిదో ఓవర్‌లో జోస్‌ బట్లర్‌ (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత డేవిడ్ మలన్ జోరు పెంచాడు. ధాటిగా ఆడుతున్న మలన్‌ని సౌథీ వెనక్కి పంపాడు. తర్వాత మొయిన్‌ అలీ దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు.  

అమ్మ జగనన్న.. ఎయిడెడ్ స్కూల్స్ విలీనం వెనక ఇంత స్కెచ్ ఉందా? 

ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో మన బాలు (ఎస్పీ బాల సుభ్రమణ్యం) సహ  చాలామంది ప్రముఖులున్నారు. అంతమంది ప్రముఖులలో ఒక సామాన్యుడు కూడా ఉన్నారు. కర్ణాటక మంగళూరుకు చెందిన నెత్తిన బట్ పెట్టుకుని పండ్లు అమ్ముకునే 68 ఏళ్ల హరేకాలా హజబ్బ అనే పండ్ల వ్యాపారి కూడా రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మరి ఆయనకు ఎందుకు అంతటి గౌరవం దక్కిందో తెలుసా? ఆయన గ్రామీణ పిల్లలకు చదువు అందించాలనే ఆశయంతో తమ జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో మంగళూరు హరేకాలా-న్యూపడ్పు గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించారు. అందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ తో  సత్కరించింది.   ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం విలీనం పేరిట విక్రయానికి బాటలు వేస్తున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలు అన్నీ కూడా ఒకప్పుడు  ఇలాంటి పుణ్యపురుషులు స్థాపించిన సరస్వతీ  ఆలయాలే.. ప్రభుత్వం ప్రమేయం లేకుండా దాతలు ఏర్పాటు చేసినవే. అంతే కాదు,అనేక ఎయిడెడ్ విద్యాసంస్థలకు దేవాలయాలకు ఇచ్చినట్లుగా దాతలు కోట్ల రూపాయల విలువైన భూములు ఇతర స్థిరాస్తులు విరాళంగా ఇచ్చారు. అదొక పవిత్ర కార్యంగా భావించి ముందుముందు నిర్వహణ వ్యయానికి కూడా లోటు లేకుండా, ముందుస్తు ఏర్పాట్లు  చేశారు. అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన విధంగా సిబ్బంది జీతాల వరకు భరించే నెపంతో ప్రభుత్వం విద్యా సంస్థల యాజమన్య వ్యవహరాలలో వేలు పెట్టింది. నిజానికి, అప్పటి  ప్రభుత్వాలకు ముందుముందు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే కుక్కమూతి పిందెల పాలన వస్తుందని ఉహించి ఉండక పోవచ్చును. కానీ  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలపై కన్నేసింది. దాతల దాతృత్వంతో ఏర్పడిన ఎయిడెడ్‌ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,500 వరకు ఉన్నాయి. సుమారు రెండులక్షల మంది వరకు విద్యార్ధులు ఎయిడెడ్‌ స్కూల్స్ లో  చదువుతున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక వృత్తి, ప్రవృత్తికి సంబంధించిన పాఠశాలలు. విద్యాసంస్థలు ఉన్నాయి.  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జీవో. 46నుజారీచేసింది. కేవలం పాఠశాలలను మాత్రమే కాదు, పాఠశాలల ఆస్తులను కూడా ప్రభుత్వానికి అప్పగించాలని, లేకుంటే సిబ్బందిని వెనక్కి ఇచ్చేయాలని మెలిక పెట్టింది. ఒకవేళ ఉపాధ్యాయుల్ని వెనక్కి ఇచ్చేస్తే ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా మారిపోతాయి. పైగా, విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలుచేసుకోవచ్చని ప్రభుత్వమే చెప్పేసింది. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో రూ.10వేలు నుంచి మొదలుపెట్టి...నగరాల్లో రూ.15వేల వరకు వసూలుచేసుకోవాలని సూచించింది.అయితే, తరిచి చూస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం. ఓ వంక ఎప్పుడో, ఎవరో దాతలు ఇచ్చిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుంది మరో వంక ఫీజులు పెంచుకునే వెసులు బాటుకు బాటలు వేస్తోంది. అయితే కేవలం ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కబళించే ఎత్తుగడతో పాటుగా, ఇంకా  ఇతర  ఎత్తుగడలు, దుష్టపన్నాగాలు ఉన్నాయని అంటున్నారు.  ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల కోసంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమరు  రూ.680కోట్లు గ్రాంట్‌ రూపంలో ఇస్తోంది. కేవలం రూ.680కోట్ల కోసమే ప్రభుత్వం, ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం నిర్ణయం తీసుకుందని అనుకోలేము. ఈ నిర్ణయంతో సుమారు 6,954మంది ఉపాధ్యాయులు ప్రభుత్వంలో విలీనమైపోయారు. అంటే వీరికి ఎయిడెడ్‌లో ఉండగా ఇచ్చిన జీతాన్నే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసుకున్నాక ఇస్తారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ప్రభుత్వం తగ్గించుకున్న ఈ భారం...విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడుతుంది. అంతేకాదు..ఈ భారానికి మూడు, నాలుగింతలు వారిపై పడే అవకాశాలున్నాయి.  ఇలా ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్న ‘గొప్ప’ ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అంటున్నారు. అలాగే  ఇటీవల కొవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయి, చాలామంది తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలలో చేర్చారు. సుమారు సుమారు 2.6లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో గతం కంటే ఎక్కువగా చేరారని ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో షాక్‌ తిన్న పలు ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తమ పాఠశాలల్ని మూసేస్తామని ప్రకటించాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 300లకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్ని మూసేశారు. మరోవైపు విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోను పలు పాఠశాలలు మూసేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా మూసేసిన పాఠశాలల్లోని పిల్లల్ని దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామని ప్రభుత్వం అంటోంది. కానీ దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే దూరాలకు వెళ్లాల్సిందే.వాస్తవానికి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదివే లక్షలమందిని ప్రభుత్వంలో చేర్చుకునేంత సామర్ధ్యం లేదు. కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులను మెల్లగా మళ్ళీ ప్రైవేటు స్కూల్స్’కు పంపే కుట్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   ఈ  నేపధ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉపందుకున్నాయి. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేయగా నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో ఒక విద్యార్ధిని తీవ్రంగా గాయ పడ్డారు. ఈనేపధ్యంలోనే  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఎయిడెడ్‌ నిరసనల సెగ తగిలింది. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంత్రిని నిలదీశారు.మరో వంక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గాయపడిన ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు అనంతపూర్ చేరుకున్నారు.  ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరించటం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ ముఖాముఖిలో వామపక్ష పార్టీల నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. మొత్తానికి ఎయిడెడ్ వివాదం... జగన్ ప్రభుత్వం వ్యవస్థలనునాశనం చేసేందుకు సాగిస్తున్న వికృత విన్యాసాలకు మరో మచ్చు తునకగా నిలుస్తుంది.