జాబితా ఇవ్వకుండానే ఏకగ్రీవ ప్రకటనా..! నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు వాయిదానేనా?
posted on Nov 8, 2021 @ 6:49PM
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నామినేషన్ల నుంచే మొదలైన వైసీపీ అక్రమాలు.. స్క్రూటీనీలో హద్దు మీరాయనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా బెదిరించడం వంటి ఘటనలు జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. నామినేషన్ల పరిశీలనలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రకటించకుండానే ఏకగ్రీవమైనట్లు నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడంలేదా? అని ప్రశ్నించారు.
విపక్ష నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారని తెలిపారు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, దినేశ్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.