రాజ‌కీయ మేథావి మోదీ!.. పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించింది అందుకేనా?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతుల్లో ఉండే వజ్రాయుధం ‘ఓటు’ హక్కు. ప్రజలు  ఆ అస్త్రాన్ని సక్రమంగా సంధిస్తే,ఇక తిరుగుండదు. ఎదురులేదు తిరుగులేదు అనుకున్న మోడీ అయినా ఇంకెవరు అయినా, గింగరాలు తిరుగుతూ దిగిరావల్సిందే. ఇంచుమించుగా గత ఐదారు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పైపైకి పరుగులు తీస్తూనే ఉన్నాయి. సెంచరీ కొట్టాయి. అక్కడితోనూ ఆగలేదు. అయినా, ప్రభుత్వం వెనుతిరగలేదు. ఇంకా స్కోర్ పెంచుకుంటూనే పోయింది. ప్రతిపక్షాలు విమర్శల గుప్పించినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా, బందులు చేసినా చేసినా, జనం గగ్గోలు పెట్టినా,‘తగ్గేదే లేదు’ అన్నట్లు ప్రభుత్వం ముందుకు దూసుకు పోయింది.  కానీ, ఓటు తూటా పేలే సరికి దిగివచ్చింది. ఎప్పుడైతే, 13 రాష్ట్రల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజక వర్గాలకు అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో, అప్పుడు కమల దళానికి ఇక దిగిరాక తప్పదనే, జ్ఞానోదయం అయింది. మోడీ ప్రభుత్వం మెట్టు దిగి వచ్చింది .ఒక్క సారిగా,పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఉప ఎన్నికల్లోనే ఇంతలా షాక్ ఇచ్చిన జనం రేపటి ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకెంతగా కొర్రుకాల్చి  వాత పెడతారో  అనే భయంతో కావచ్చును, దీపావళి కానుక అంటూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు కాసింత ఊరట కలిగించింది. ముందు ముందు ఇంకొంత తగ్గించ వచ్చని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇంకా తగ్గించవచ్చని అంటున్నారు.  అదలా ఉంటే కేంద్రంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వాలు,ముఖ్యంగా బీజేపీ/ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు వరసపెట్టి ఒకటొకటిగా దిగివస్తున్నాయి. ఉతర ప్రదేశ్, సహా చాలా రాష్ట్రాలు  వ్యాట్‌ను తగ్గించాయి  అసోం, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, మధ్య ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు వ్యాట్‌లో కోత విధించాయి.అయితే, ఇంతవరకు వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల మోతతతో ఉప ఎన్నికలలో ప్రయోజనం పొందిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అదే విధంగా తెరాస, వైసీపీ వంటి ప్రాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో  మాత్రం స్పందించ లేదు. ముఖ్యంగా హుజూరాబాద్  ఉపఎన్నికలలో వంట గ్యాస్’తో పాటుగా పెట్రోల్,డీజిల్ ధరలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్న తెరాస ప్రభుత్వం వ్యాట్ తగ్గించక పోవడం గమనార్హం. కాగా, కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన  వెంటనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ తమ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై  రూ. 7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోల్‌ రూ.12, డీజిల్‌ రూ.17 మేర తగ్గుతోంది.అలాగే, అస్సాం పౌరుగు రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ సైతం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా మరో బీజేపే పాలిత రాష్ట్ర   కర్ణాటక ముఖ్యమంత్రి  బసవరాజ్‌ బొమ్మై పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అదే బాటలో  గోవా సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తమ రాష్ట్రంలోనూ  రూ.7చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.12, డీజిల్‌ ధర రూ.17 మేర తగ్గనుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ నేతృత్వంలోని బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది.ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్‌పై ఎలాంటి ఊరటా ఇవ్వలేదు. మరో వంక పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ రూ.12 మేర తగ్గనుంది.గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది.పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హరియాణా ప్రభుత్వం తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో రెండూ రూ.12మేర తగ్గనున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తూ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్’ను నలుగు శాతం తగ్గించింది. అయితే, అన్ని రాష్ట్రాల కంటే కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.10 రూపాయలు తగ్గించింది. ఇక ధనిక రాష్ట్రం అని ఒకరు సంక్షేమ ప్రభువులం అంటూ ఇంకొకరు జబ్బలు చరచుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన రెడ్డి  మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మ‌హా పాద‌యాత్ర‌కు మ‌హా మ‌ద్ద‌తు.. ప్ర‌ముఖుల సంఘీభావం...

అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు వివిధ పార్టీలు, వ‌ర్గాల నుంచి భారీ మ‌ద్ద‌తు వ‌స్తోంది. పాద‌యాత్ర ఏప్రాంతానికి చేరితే.. ఆ ప్రాంతంలో అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ.. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో రైతులు చేస్తున్న పాద‌యాత్ర ఐదో రోజుకు చేరింది.  ఐదోరోజు ప్రత్తిపాడులో రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. స్థానికులు ఎద్దులతో రైతులకు స్వాగతం పలికారు. జై అమరావతి నినాదాలు చేస్తూ.. దారి పొడ‌వునా స్కూల్ స్టూడెంట్స్ పాద‌యాత్ర‌కు ఉత్సాహం నింపారు.  అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులతో కలసి ధూళిపాళ్ల పాదయాత్ర చేస్తున్నారు.  మ‌రోవైపు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సైతం మ‌హా పాద‌యాత్ర‌లో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. అమరావతి కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడ్డి ఉందని  జేడీ శీలం తెలిపారు. 

హరీష్ రావుపై ఈటల యుద్ధం.. సిద్దిపేటలో దళిత గర్జన సభ?

హుజురాబాద్ ఉప సమరం ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దమే సాగింది. పార్టీలు అనే కంటే సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య పోరాటం అని చెప్పాల్సిందే. ఈటలను ఓడించేందుకు అన్ని శక్తులు బయటికి తీశారు కేసీఆర్. అటు గులాబీ పార్టీకి తన సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డారు రాజేందర్. అయితే కేసీఆర్ ఆదేశాలతో అంతా తానే వ్యవహరించారు మంత్రి హరీష్ రావు. మూడు నెలల పాటు హుజురాబాద్ లోనే మకాం వేశారు. గతంలో తనకు అత్యంత సన్నిహితింగా ఉన్న ఈటలను ఓడించేందుకు శ్రమించారు. అంతేకాదు ప్రచారంలో రాజేందర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు హరీష్ రావు. హుజురాబాద్ ప్రచారంలో తనను టార్గెట్ చేసిన హరీష్ ను మొదట కార్నర్ చేయలేదు ఈటల. కాని హరీష్ దూకుడు పెంచడంతో రాజేందర్ కూడా నోటికి పని చేప్పారు. ఈ నేపథ్యంలో హరీష్, ఈటల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు మిత్రుల మధ్య సాగిన సమరంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. మామ ఆదేశాలతో హరీష్ ఒకింత దూకుడుగా వెళ్లారని, తనతో చాలా కాలం పనిచేసిన రాజేందర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వచ్చాయి. రాజేందర్ కూడా హరీష్ రావు పని పడతానని ప్రకటించారు. హుజురాబాద్ లో జయకేతనం ఎగురవేసిన ఈటల ఇప్పుడు తనదైన శైలిలో మాటలు పేల్చుతున్నారు. ఆయన చెప్పినట్లే ముందుగా హరీష్ రావునే టార్గెట్ చేశారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న రాజేందర్... మధ్యలో సిద్ధిపేట వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావుపై  ఫైర్ అయ్యారు ఈటల.  సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. రాజేందర్ ప్రకటనలో త్వరలోనే ఆయన సిద్ధిపేటలో పర్యటిస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి చేయాల్సిన అన్ని కుట్రలను హరీష్ రావు చేశారని భావిస్తున్న ఈటల రాజేందర్.. సిద్ధిపేట నుంచే తన పోరాటం మొదలుపెట్టపోతున్నారని చెబుతున్నారు. 

దీపావళిపై వివక్ష.. వసూల్ రెడ్డి నిద్రలేవడా.. హరీష్ పై ఈటల యుద్ధం.. టాప్ న్యూస్@ 7PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు... గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు.  ------ గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే గురువారం దీపావళి పండుగ అయినా నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీపావళి పండుగ రోజున ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.  ---- వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడని ఆయన నిలదీశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయని గుర్తు చేశారు ---------- ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? అని ప్రశ్నించారు. రైతు సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చే తీరు సరికాదన్నారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్.సి.ఎస్. చక్కెర కర్మాగారం దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని, ప్రభుత్వం సరిగా స్పందించలేదని తప్పుబట్టారు.  ----- రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నాల్గవ రోజు పాదయాత్రలో  హైకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు మహిళలు హరతులు ఇచ్చారు. న్యాయవాదులే దేవుళ్లు అంటూ మహిళలు హరతులు ఇచ్చారు. అమరావతి మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజు కొనసాగింది.  ------ ప్రముఖ దేవాలయం చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గవర్నర్‌ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గవర్నర్‌ తమిళిసై, ఆమె భర్త సౌందర రాజన్‌తో కలిసి ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ట్రస్టీ శశికళ తదితరులు స్వాగతం పలికారు. ఈసందర్భంగా గవర్నర్‌ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.  ------ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -----------  వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మర్రిగూడ సమీపంలో బస చేస్తున్నారు. క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు. ఈ విషయం షర్మిల దృష్టికి రాగానే ఆమె స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. తన కాన్వాయ్‌లోని అంబెలెన్స్‌‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -------- దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ-వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్థాన్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ------- దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న భారత జవాన్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మాతృభూమి రక్షణ కవచాలు మన వీర జవాన్లని అభినందించారు. భారత సైనికులు కంటికి రెప్ప వేయకుండా దేశాన్ని కాపాడుతున్నందువల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. జమ్మూకశ్మర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.  

వసూల్ రెడ్డి నిద్ర లేవరా.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించరా!

దీపావళి కానుకగా వాహనదారులకు ఊరటనిస్తూ చమురు ధరలపై భారీగా ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో లీటర్ పెట్రోల్  ధర 5 రూపాయలు, లీటర్ డీజిల్ ధర10 రూపాయలు తగ్గింది. ఎక్సైజ్ పన్ను తగ్గించడమే కాదు రాష్ట్రాలు కూడా తాము విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని కేంద్రం సూచించింది. కేంద్రం ప్రకటనతో గుజరాత్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురుపై కొంత వ్యాట్ తగ్గించాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఎక్కువగా ఉంది. దీంతో వ్యాట్ తగ్గించాలని వైసీపీ ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడని ఆయన నిలదీశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.07, డీజిల్‌పై రూ.11.75 తగ్గించిందని అన్నారు నారా లోకేష్.  గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని లోకేష్ తెలిపారు. వసూల్‌రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించడానికి మనసు రావడంలేదని ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడుతో జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని విమర్శించారు. దేశమంతా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రజలపై వసూల్‌రెడ్డి కరుణ చూపాలని నారా లోకేష్ సూచించారు. 

ఇలా జరిగితేనే టీమ్ ఇండియాకు సెమీస్ బెర్త్..! 

దుబాయ్ లో జరుగుతున్న టీట్వంటీ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లు ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తైంది. పాక్ తో ఘోర ఓటమిని ఫ్యాన్స్ మరిచిపోకముందే న్యూజీలాండ్ చేతిలో పరాజయం పాలైంది. రెండు వరుస ఓటములతో గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరే అవకాశాలను భారత్ క్లిష్టతరం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ లో మాత్రం ఆప్ఘనీస్తాన్ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ లో కోహ్లీ సేనకు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే అందుకోసం కొన్ని అద్భుతాలు జరగాల్సి ఉంది.  సెమీస్ పోటీలో నిలవాలంటే తప్పక గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అప్ఘన్ పై అదరగొట్టింది. గతరెండు మ్యాచ్‌ల్లాగే మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన.. ఈసారి 210/2 భారీ స్కోర్‌ సాధించింది.   ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించడంతో గ్రూప్‌-2 పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగు పర్చుకొని నాలుగో ప్లేస్‌లో నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. మ్యాచ్ కు ముందు మైనస్ లో ఉన్న రన్ రేట్ ప్లస్ కి వచ్చింది,  దీంతో ఇప్పుడందరూ టీమ్‌ఇండియా సెమీ ఫైనల్‌ చేరాలని కోరుకుంటున్నారు.   కోహ్లీసేన ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే అంత తేలికేం కాదు. అయితే టీ20 క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. న్యూజిలాండ్‌ తన ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా టీమ్‌ ఇండియాకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మన జట్టు మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో స్కాట్లాండ్‌, నమీబియాలపై నెగ్గి రన్‌రేట్‌ను (అఫ్గాన్‌ కన్నా 1.481 ప్రస్తుతం) మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియా ప్రస్తుత రన్‌రేట్‌ 0.073. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు ఈజీనే. కానీ  కివీస్‌ ఆ రెండు జట్లతో ఓడాలంటే మాత్రం అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ప్రధానంగా అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పైనే పడ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్‌ ఓటమిపాలై భారత్‌ ముందుకు సాగాలని ఆశిస్తున్నారు. అదే జరగాలని మనమూ ఆశిద్దాం.     

ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్! జగన్ కు చంద్రబాబు వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్ లో గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధికార పార్టీకి మద్దతుగా కొందరు అధికారులు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు... గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని అన్నారు. ఫిర్యాదులు ఉన్న అధికారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు సహకరిస్తోందని... ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకని తీరుతామని స్పష్టం చేశారు.  నామినేషన్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు.  ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలను కూడా ఫాలో కావడం లేదని చంద్రబాబు అన్నారు.  నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని... ఆర్వోలు డ్రామాలు ఆడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని... వెంటాడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించటంతో పాటు స్కాన్ చేసిన ప్రతిని ఆర్వోకు ఈమెయిల్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరామని తెలిపారు. కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు. అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు ముందు.. తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని టీడీపీ అధినేత అన్నారు. ఎన్నికలు పకడ్బంధీగా జరిగితే వైసీప గెలవలేదన్నారు చంద్రబాబు. డబ్బులు కూడా కొంతమేర పనిచేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించారని విమర్శించారు. ఉన్మాదులు తప్ప ఎవ్వరూ చేయని రీతిలో వ్యవహరించారన్నారు. ఈసారైనా ఎన్నికల ప్రక్రియ పకడ్బంధీగా జరగాలని ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాని అన్నారు. 16 పాయింట్లతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇచ్చిందని చెప్పారు. దొంగ ఓట్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

దీపావళి రోజున నామినేషన్లా.. క్రిస్మస్ ఉంటే పెట్టేవారా! ఇదేందయ జగనన్నా..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచింది. గత ఏప్రిల్ లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే వివిధ కారణాలతో కొన్నింటికి జరగలేదు. గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే గురువారం దీపావళి పండుగ అయినా నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీపావళి పండుగ రోజున ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.  దీపావళి సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని విమర్శించారు. దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోబావాలను దెబ్బతీయటమే అన్నారు చంద్రబాబు. ఇదే రోజు క్రిస్మస్ ఉంటే నామినేషన్ల ప్రక్రియ పెట్టేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హిడన్ అజెండాలో భాగంగానే దీపావళి రోజున ఎన్నికల నామినేషన్ పెట్టారని టీడీపీ అధినేత మండిపడ్డారు. పీకమీద కత్తిపెట్టినట్లు దీపావళి రోజున నామినేషన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమ నేతలను ఈటల ఏకం చేస్తారా? టీఆర్ఎస్ పార్టీని చీల్చబోతున్నారా?

ఒక పోరాటం ముగిసింది. హుజూరాబాద్ ఉపన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్  తv మంత్రి వర్గం నుంచి వెలివేసిన మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ విజయ బావుటా ఎగరేశారు.ఒక విధంగా ఉద్యమ జెండాను మరోమారు ఎగరేశారు. అయితే ఇక్కడితోనే అంతా అయిపోయినట్లు కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇది ఇక్కడితో ఆగే పోరాటం కాదు. నిజానికి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఈటల గెలుపు మాత్రమే కాదు,.ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచిన ఉద్యమకారులు, ప్రస్తుత  తెరాస పాలనతో విసిగి పోయిన యువత, నిరుద్యోగులు, ఇతర ఉపేక్షిత వర్గాలు, తెరాస పాలనను ఉద్యమ ద్రోహుల పాలనగా భావిస్తున్న విభిన్న వర్గాలు ఆ పాలన నుంచి సంపూర్ణ  విముక్తిని కోరుకుంటున్నారు. ఈటల గెలుపు ద్వారా అదే ఆకాంక్ష మరోమారు స్పష్టమైందనే అభిప్రాయం కూడా రాజకీయ, మీడియా చర్చల్లో వ్యక్తమవుతోంది.“ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే బొంద పెట్టాలి” అంటూ మహా కవి కాళోజీ ఎప్పుడో ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఉద్యమ నేతల నోట పదే పదే వినిపిస్తోంది. అందుకోసంగా  ఉద్యమ నాయకులు అందరూ ఏకం కావలన్న ఆకాంక్ష అటు ప్రజల్లో, ఇటు నాయకుల్లో  వ్యక్త మవుతోంది. నిజానికి ఇందుకోసమే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఈటలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ ను ఓడించిన ఈటల రాజేందర్ ఇప్పుడు తెరాస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ నాయకులను ఏకం చేస్తారా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే  ఉద్యమ నాయకులు ఏకమై ఉమ్మడి పోరాటం చేయవలసిన అవసరాన్ని, గుర్తించిన నాయకులు కూడా, అది ఆశించినంత సులభంగా అయ్యే పని కాదని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యమకాలంలో లేని రాజకీయ  విబేధాలు ఇప్పుడు ఉద్యమ నాయకుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్ గా బీజేపీతో కలిసి పనిచేసిన కోదండ రామ్ వంటి వారు ఈటల బీజేపీలో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఉప ఎన్నికలకు ముందు ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న తమ అభిప్రాయం ఇప్పటికీ అదేనని కోదండ రామ్ తాజాగా చెప్పు కొచ్చారు.  తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఉద్యమ నాయకులను ఏకం చేసి ఒక ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక పార్టీ  ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్న చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు బహిరంగ మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అయితే, ఆయన కూడా, ఈటల ఎంచుకున్న రాజకీయ పంథాతో విభేదిస్తున్నారు. రాష్ట్రంలో ఉంటే రెండు జాతీయ పార్టీలు, లేదంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని, అప్పుడే రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా సాగుతుందనే అభిప్రాయం విశ్వేశ్వర రెడ్డి వ్యక్త పరుస్తున్నారు. ఇక కాంగ్రెస్, వామపక్షాలలో ఉన్న ఉద్యమకారులు బీజేపే నేత  ఈటల వెంట నడిచే అవకాశం లేదు. సో... ఎప్పుడైతే ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో అప్పుడే, ఆయన ఉద్యమ నేతలకు కొంత దూరమయ్యారు. అయితే ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఉప ఎన్నికలో తెరాస బహిష్కృత నేతగా ఈటలను సమర్ధించిన ఉద్యమ నాయకులు ఇప్పడు బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు అదే విధంగా సమర్ధించక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కాబట్టి ఉద్యమ నాయకులను ఈటల ఏకం చేయడం భవిష్యత్ లో ఏమో కానీ, ఇప్పటికిప్పుడు మాత్రం అయ్యే పని కాదని విశేషకులు భావిస్తున్నారు.

సీజేఐ జస్టిస్ రమణకు విద్యార్థి లేఖ.. ఆగమేఘాల్లో గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక..

ఆ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆమెది పల్లెటూరు కావడంతో హైస్కూల్ కోసం పక్క గ్రామానికి వెళ్లాలి. కాని కోవిడ్ సమయంలో వాళ్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు బంద్ అయింది. ఇప్పటికి రావడం లేదు. దీంతో బడికి వెళ్లేందుకు ఆ చిన్నారి చాలా కష్టపడుతున్నది. తన సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోయింది. ఆయన ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆ చిన్నారి కోరిక తీర్చి హాయిగా బస్సెక్కి బడికి పోయేలా చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతున్నది. 9 వ తరగతి చదివే తమ్ముడితో కలిసి నిత్యం 6 కిలో మీటర్ల దూరంలోని స్కూల్‌కు వెళ్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ విధించడానికి ముందు చీదేడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. ఈ బస్సును తిరిగి పునరుద్దరించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీరి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వీరిద్దరూ స్కూల్‌కెళ్లేందుకు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటర్‌ చదువుతున్న వీరి అక్క కూడా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి వస్తున్నది. ఆమె కూడా బస్సు లేక ఆటోలో వెళ్తూ ఇబ్బంది పడుతున్నది. తండ్రి ఇటీవల కరోనాకు గురై గుండెపోటుతో చనిపోయాడు. తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఈ దశలో నిత్యం ఆటోలకు రూ.150 వరకు చెల్లించే స్థోమత లేని ఈ చిన్నారులు.. చదువు మానుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే  చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టే బదులుగా సమస్యను పరిష్కరించుకోవాలని యోచించిన చిన్నారి వైష్ణవి.. తమతో పాటు ఇతర విద్యార్థులు పడుతున్న కష్టాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రూపంలో తెలిపింది.  ఆయన ఆ ఉత్తరాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు పంపి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చీదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్దరించారు. ఎప్పటిమాదిరిగా బస్సులు నడుస్తుండటంతో స్కూల్‌కెళ్లి బాగా చదువుకోవచ్చని ఆ చిన్నారి సంతోషం వ్యక్తం చేసింది. తమకు సహకరించిన ఎన్వీ రమణతోపాటు సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 

హైదరాబాద్ ప్రత్యేకం సదర్.. దున్నపోతుల విన్యాసాలు అదుర్స్..

సదర్ పండుగ వచ్చిందో పట్నంలో మన వాళ్లు డప్పుల దరువు వేసుకుంటూ కోలాటాలు ఆడతారు.. ఇదీ పవన్ కల్యాణ్ సినిమా పాటలోని ఓ చరణం. సదర్ పండుగ విశిష్టతను ఆ పాటలో అద్భుతంగా చెప్పారు. దీపావళి పండుగకు హైదరాబాద్ లో నిర్వహించే సదర్ పండుగకు ఎంతో చరిత్ర ఉంది.  సదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి.  సదర్‌’ అంటే తెలియని హైదరాబాదీ ఉండడు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 ఏండ్లకు పూర్వమే ఈ సదర్‌ వేడుకలు ఉన్నవని శాసనాల ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా దినదినాభివృద్ధి చెందుతున్నదో, సదర్‌ ఉత్సవం కూడా అలానే ప్రాచుర్యం పొందుతున్నది. దీపావళి పండుగ తర్వాత రెండో రోజు యాదవులు ఈ ‘సదర్‌’ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. 'సదర్‌' అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం 'ప్రధానమైనది' అని అర్థం. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం.  పురాణేతిహాసాల ప్రకారం యాదవ కులస్థులు శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకొంటారు. శ్రీకృష్ణుడు ఆలమందలను (పశువుల సంపదను) పెంచిపోషించాడు. మానవ జీవితంలోనూ కొన్ని సామాజిక తరగతులకు, కులాలకు పశువులను పెంచడం ఒక వృత్తిగా మారింది. యాదవ కులస్థులూ పశు సంపదను పెద్ద ఎత్తున కలిగి ఉంటారు. తమ వృత్తి నుంచి ఆవిర్భవించిన ఉత్సవం నేడు క్రమ క్రమంగా సదర్‌ ఉత్సవంగా ఆదరణ పొందుతున్నది. ద్వాపరయుగంలో యాదవుల కుటుంబాల్లో శ్రీకృష్ణుడి బాల్యం గడిచింది. అలా యాదవుల్లో శ్రీకృష్ణుడికి విశిష్టమైన స్థానం ఉన్నది. యాదవులు ఆ కాలం నుంచే యుద్ధ విన్యాసాల్లో, ధైర్య సాహసాల్లో పెట్టింది పేరుగా ఉండేవారు. మరోపక్క జంతువుల సంరక్షణ చేసేవారు. ఆలమంద (గేదె, అవు, గొర్రె, మేక)లను సొంత కుటుంబసభ్యుల వలె పెంచేవారు. అప్పటి వ్యాపార సముదాయాల్లో బియ్యం, పప్పు దినుసులు, ఆల మందలు మొదలైనవాటికి బాగా విలువ ఉండేది. అప్పట్లో డబ్బు ఉండేది కాదు. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అప్పట్లో పశువులకు మంచి డిమాండ్‌ ఉండటం వల్ల ఒకచోట నుంచి మరోచోటికి వస్తువు మార్పిడి జరిగేది. ఆ రోజుల నుంచి కాలక్రమేణా నాణేల మార్పిడి వరకు ముఖ్యమైన ప్రదేశాల్లో వ్యాపార సముదాయాల లావాదేవీల కేంద్రాలను సదరు అని పిలిచేవారు. అలా అది సదర్‌ ఉత్సవంగా మారింది. హైదరాబాద్‌లో తప్ప స‌ద‌ర్ పండ‌గ దేశంలో మరే ఇత‌ర ప్రాంతాల్లో జ‌ర‌గ‌దు. తమ జీవ‌నాధార‌మైన మేక‌లు, గొర్రెలు, ఆవులు, గేదెల‌ను కూడా వేడుక‌లు జ‌రిగే ప్రాంతాల‌కు తీసుకువస్తారు. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్‌ పల్లి, చప్ప ల్‌బజార్‌, మధురాపూర్‌, కార్వాన్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్‌ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం నేపథ్యంలో 2009 నుండి ఈ ఉత్సవాలు కొత్త పుంతలను తొక్కాయి. ఇందుకోసం ఉత్త‌ర‌ భార‌త‌దేశం లోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శ‌రీరం క‌లిగిన దున్న‌పోతుల‌ను న‌గ‌రానికి తీసుకువ‌స్తారు. పండగకోసం అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పెకెత్తి యువకుడిపైకి ఉరికి వస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన అది తప్పించుకుపోయే అవకాశం ఉండదు. కొన్నింటిని సుతారంగా గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ, బస్తీల్లో గానీ ఈ వేడుకలను నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్‌ డాన్స్‌లతో హోరెత్తిస్తారు యాదవులు ఈ పండగను దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలలముందు ‘ముర్రా జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్‌, జింద్‌, హిస్సర్‌, కురుక్షేత్ర లాంటి ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. ఈ ముర్రా జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలుంటాయి. వాటిలో హైదరాబాద్‌ షెహెన్‌షా, రుస్తుం, యువరాజు, ట్రంప్‌ దూడ, మహారాజ మొదలగువాటిని సదర్‌కు ముస్తాబు చేస్తారు.ఈ దున్నల ఖరీదు సుమారుగా రూ.15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుంది. వీటికి ప్రతిరోజూ 50 లీటర్ల పాలు, వందల సంఖ్యలో ఆపిల్‌, బాదం, పిస్తా, కాన్బెర్రా, బ్లూబెర్రీ ఆహారంగా ఇస్తారు. వైన్‌, విస్కీ కూడా వీటికి తాగిస్తారు. ఒక్కోదానికి నలుగురు సంరక్షకులు ఉంటారు. ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయిస్తారు! ఒక మనిషికి అవసరమైనట్లుగా వీటికి కూడా ప్రత్యేక గది, అందులో ఫ్యాన్‌ ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఆయిల్‌ మసాజ్‌ చేస్తారు. పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతుల శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారుచేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడుతారు. నెమలీకలను అమర్చుతారు. అలంకరించిన తర్వాత సుగం ధ ద్రవ్యాలను చల్లుతారు. అలంకరించిన దున్నపోతులతో ఉత్సాహం కలిగిన యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టుకొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరికాళ్లను పైకెత్తి యువకులతో సమానంగా డ్యాన్స్‌ చేస్తుంది. అయితే భారీ శరీరం కావడంతో దున్నలను జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్నింటిని గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో, ఖాళీ ప్రదేశంలో, బస్తీల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్‌ డాన్స్‌లతో హోరెత్తిస్తారు. ఈ ఉత్సవాలు ‘బఫెలో కార్నివాల్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ పేరుతో ఘనంగా జరుగుతాయి. రచయిత: పి కృష్ణ యాదవ్ 

భారత్ సెమీస్ ఆశలు సజీవం.. ఆప్ఘనీస్తాన్ పై ఘన విజయం

టీట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పేలవమైన ఆట తీరుతో వరుస రెండు పరాజయాలతో అప్రతిష్ట మూటగట్టుకున్న కోహ్లీసేన.. ఆఫ్ఘనిస్థాన్‌  మ్యాచ్‌లో  విశ్వరూపం ప్రదర్శించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆప్ఘనీస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత జట్టు.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది. షమి, బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఓపెనర్లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ పంపారు. అశ్విన్ మిడిలార్డర్ పనిపట్టారు. దీంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది ఆప్ఘన్ జట్టు. చివరి ఓవర్లలో నబీ కొంత దూకుడుగా ఆడటంతో ఆప్ఘన్ స్కోర్ 130 పరుగులు దాటింది.  టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించారు నబీ.  కాసేపటికే ఆ నిర్ణయం ఎంత తప్పో తెలిసిపోయింది. కోహ్లీసేన  బ్యాట్‌తో నిప్పులు చెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు రాహుల్, రోహిత్ చెలరేగిపోయారు, ఇద్దరూ ఎడాపెడా షాట్లు కొడుతూ తొలి వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు. రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు.  రాహుల్, రోహిత్ అవుటైన  తర్వాత వచ్చిన రిషభ్ పంత్ కూడా చెలరేగిపోయాడు. రిషబ్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27 పరులుగు చేశాజు. ఇక హార్దిక్ పాండ్యా ఆప్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35  పరుగులు చేశాడు. దీంతో భారత స్కోరు జెట్ స్పీడుతో పరిగెత్తి 210 పరుగులకు చేరింది. ఆప్ఘనీస్తాన్ తో ఘన విజయం సాధించడంతో గ్రూప్ 2లో భారత్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 

ఉప ఎన్నికలతో కాంగ్రెస్ కు బూస్ట్.. అసెంబ్లీ సమరంలో కలిసొచ్చేనా? 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ  విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కట్ చేస్తే, దేశంలో హుజూరాబాద్’ తో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని మరో 29 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ  బొక్కబోర్లా పడింది. నిజమే కావచ్చును, వేర్వేరు రాష్టాల్లో జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్ సభ  ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశం మొత్తంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడం అంత సరైన పద్దతి కాకపోవచ్చును. కాకపోతే బీజేపీ పాలిత హిమాచల్ ప్రదేశ్, హర్యాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ బీజేపీ సీట్లను ఎగరేసుకు పోవడం, అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్’లో ఏకంగా మూడవ స్థానానికి పడిపోవడం, కమల నాదులను కలవర పెట్టే అంశమే.  ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ సహా ఐదు  రాష్ట్రాలలో మరికొద్ది నెలలలో ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా సాగుతున్న ఆందోళన కలవర పెడుతున్న సమయంలో, రాష్ట్రాలలో ఫలితాలు తిరగబడటం, బీజేపీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి, ఇప్పటికే కమల నాధులు ప్రమాద ఘటికలను పసికట్టారు. అందుకే, 2019 ఎన్నికల తర్వాత తొలిసారిగా, పార్టీ కీలక నిర్ణాయక కమిటీ నేషనల్ ఎగ్జికూటీవ్ కమిటీ (ఎన్ ఈసీ) సమావేశం నవంబర్ 7వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలతో పాటుగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చిస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.ముఖ్యమంగా బీజేపీ పాలిత హిమాచల్ ప్రదేశ్లో మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థాన్నాన్ని బీజేపీ నుంచి కైవసం చేస్కోవడంతో కాంగ్రెస్ నేతల్లో  జోష్ పెరిగింది. హిమాచల్’ తో పాటుగా కర్ణాటక లోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిట్టింగ్ సీటును సొంత చేసుకుంది. ముఖ్యమంత్రి బొమ్మై సొంత జిల్లాలో బీజీపీ సిట్టింగ్  సీటు హంగల్ సీటును కాంగ్రెస్ కైవాసం చేసుకుంది. అలాగే రాజస్థాన్ లో బీజేపీ ఏకంగా మూడవ స్థానలోకి నెట్టివేయబడింది. అయితే అస్సాం, మధ్య ప్రదేశ్,మేఘాలయలో కాంగ్రెస్ రాష్ట్రానికి రెండు వంతున ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఓడి పోయింది. హుజూరాబాద్ సహా  ఏడు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది .. ఓవరాల్ ట్యాలీ చూసినా, పది నుంచి ఎనిమిదికి పడిపోయింది. అయినా హిమాచల్, గెలుపుతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ముఖ్యంగా బీజేపీతో ముఖాముఖీ పోరు జరిగిన హిమాచల్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విశ్వాసాన్ని పెంచింది. సాగు చట్టాలు,పెట్రోల్, డీజిల్, గ్యాస ధరల విషయంలో మోడీ ప్రభుత్వం అనిసరిస్తున్న మొండి వైఖరి కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ భావిస్తోంది. ముందు ముందు మోడీ ఇదే మోడీ వైఖరి కొనసాగిస్తే, అది తమకు మరింత మంచి చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

గెల్లుకు ఎమ్మెల్సీ.. కౌశిక్ రెడ్డికి మొండి చేయి! హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ నయా ప్లాన్..

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. ఓటమిపై పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్.. ఎక్కడ తేడా కొట్టింది, ఎవరు హ్యాండిచ్చారు, ఓటర్లు ఏం ఆలోచించారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారట. విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లును.. ఈటల రాజేందర్ పై బరిలోకి దింపి అతన్ని బలి పశువు చేశారనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయని కొందరు టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హుజురాబాద్ లో ఓడిపోతామని ముందే కేసీఆర్ కు తెలుసని, అందుకే ప్రచారానికి ఆయన రాలేదని, కేటీఆర్ ను కూడా పంపలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తమ రాజకీయ క్రీడలో బీసీ నేతైన గెల్లును పావుగా వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తుండటంతో గులాబీ బాస్ కొత్త ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. బీసీ వర్గాలను కూల్ చేసేలా హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయినా అతనిని శాసనమండలికి  పంపాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఆరు సీట్లు టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఆరు పోస్టుల్లో ఒకటి బీసీ కోటాలో గెల్లుకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. గెల్లు ఓటమితో యాదవ సామాజిక వర్గంతో పాటు మరికొన్ని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. గెల్లును మండలికి పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గెల్లును మండలికి పంపించడం ద్వారా ఆ వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో వీలుకాకపోతే గవర్నర్ కోటాలోనూ గెల్లు శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తున్నట్లు గతంలో కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ లోనూ తీర్మానం చేసి గవర్నర్ కు పంపారు. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ ను గవర్నర్ పెండింగులో పెట్టారు. కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయని గవర్నర్ కు ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. దీంతో గవర్నర్ కోటాలో నేర చరిత్ర ఉన్నవారిని అపాయింట్ చేయకూడదనే భావనతోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును తమిళి సై హోల్ట్ లో పెట్టారని అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పై ప్రభుత్వం కూడా తర్వాత స్పందించలేదు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డికి ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ  పోస్టును గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో భర్తీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. గెల్లు గెలుపు కోసం కౌశిక్ రెడ్డి మనస్పూర్తిగా పని చేయలేదని స్థానిక నేతలు పార్టీ పెద్దలకు చెప్పారని సమాచారం. ఈసారి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న‌కే టికెట్ ఇస్తారు కాబ‌ట్టి.. కౌశిక్‌రెడ్డి ముందుచూపుతో గెల్లు గెలుపు కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌లేదని కూడా స్థానికంగా టాక్ న‌డుస్తోంది. ఇలా అన్ని అంశాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. కౌశిక్ రెడ్డికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారని తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను మండలికి పంపిస్తే ఉద్యమకారుడికి సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని ,అది కూడా తమకు కలిసివస్తుందని గులాబీ బాస్ లెక్కలు వేస్తున్నట్లు చెబుతున్నారు. 

జగన్ కు వాళ్లంటే భయమా.. పవన్ పై పాల్ ఫైర్.. కేసీఆర్ కు శాపనార్ధాలు.. టాప్ న్యూస్@7PM

అమరావతి కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న ఈ పాదయాత్రకు అండగా తెలుగు యువత కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించి.. వాళ్లతో సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరులో మూడో రోజు పాదయాత్ర కొనసాగుతోంది.  -------- మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మహామహులున్నారని, వారిని తొలగిస్తే జగన్‌కు సమస్యలు తప్పవని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల మహాపాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని చెప్పారు. -------- రుషికొండలో హరిత రిసార్ట్స్ కూల్చివేసి అక్కడ ఏం నిర్మించాలనుకున్నారో సీఎం జగన్ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రుషికొండలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనుల వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విడిది కోసమే అక్కడ నిర్మాణం చేపడుతున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ------ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆందోళన వ్యక్తంచేశారు.ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్‌, బూత్‌ల స్వాధీనం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. 600 బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లోను ఇదే జరుగుతుందని మాధవ్ హెచ్చరించారు. --- జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పవన్ సినిమా డ్రామాలు ఆపాలన్నారు. ఓటు బ్యాంక్ కోసమే పవన్ స్టీల్‌ప్లాంట్ దగ్గర డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ‘‘చిత్తశుద్ధి ఉంటే నా దగ్గరకు రా.. కలిసి పోరాడుదాం.’’ అని సూచించారు. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీకి సపోర్టు చేస్తూ డ్రామాలా? అని ప్రశ్నించారు, -------- ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ప్రజలు దీపావళి పండగను దేశీయ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దీపావళి పండగ సందర్బంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు గ్రీటింగ్స్ చెప్పారు. దీపావళి పండగ చెడుపై మంచి సాధించిన విజయంగా, విజయానికి ప్రతీక దీపావళి పండగ అని అన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.  -------- ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, తనపై కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమైపోతారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన  కష్టం శత్రువుకు కూడా రావద్దన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రెండు గుంటల మనిషి 400 కోట్లు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో కేసీఆర్‌ అహంకారంపై ప్రజలు గెలిచారని తెలిపారు.  -------- హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు, అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పంట పొలాల్లో సభను నిర్వహించవద్దంటూ ఆందోళన చేపట్టారు.టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించేందుకు వరంగల్‌లో భారీ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ------- 'యావత్ దేశం మీతో ఉంది'' అని బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు అతని తండ్రి షారూక్‌ ఖాన్‌కు సినీ పరిశ్రమ దిగ్గజాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని అధికార శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి మద్దతు లభించింది. -------- రామజన్మభూమి ట్రస్టు నిధులు రూ.3,000 కోట్లు దాటడంతో లెక్కల నిర్వహణ బాధ్యతను ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ట్రస్టు అప్పగించింది. లెక్కల నిర్వహణ కోసం అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. భూముల ఒప్పందాలపై ఇటీవల వివిదాలు తలెత్తిన క్రమంలో నిధుల నిర్వహణ బాధ్యతను టీసీఎస్‌కు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

డెంగీ డేంజ‌ర్ బెల్స్‌.. 9 రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్‌..

క‌రోనా ప్ర‌మాదం ఇంకా పూర్తిగా పోనేలేదు. మూడో ముప్పు తొలిగి పోలేదు. ఉన్నవి స‌రిపోన‌ట్టు.. కొత్త‌గా పాత రోగం డెంగీ విజృంభిస్తుండ‌టం ఆందోళ‌న‌క‌రంగా మారింది. సైలెంట్‌గా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా డెంగీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఒక్క‌సారిగా డెంగీ దోమ‌లు రెచ్చిపోతున్న‌ట్టున్నాయి. ఇటీవ‌ల భారీగా డెంగీ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో కేంద్రం సైతం ఉలిక్కిప‌డుతోంది. కొవిడ్ క‌ట్ట‌డిపై అంతా ఫోక‌స్ చేస్తున్న స‌మ‌యంలో.. చాప‌కింద నీరులా డెంగీ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.    దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డెంగీ కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హరియాణ, పంజాబ్‌, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతకొన్ని రోజులుగా ఢిల్లీ, యూపీ, హరియాణలో డెంగీతో చిన్నారులు చ‌నిపోతుండ‌టం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఒక్క అక్టోబర్‌ నెలలోనే 1200 కేసులు వెలుగు చూశాయి.  అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి.  జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తో పాటు నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.   ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను గుర్తించారు. డెంగీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. వేగంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సూచించనున్నాయి.  

నీలోఫర్ హాస్పిటల్ కు కేటీఆర్.. హుజురాబాద్ దెబ్బకు మైండ్ బ్లాంక్! 

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తుందా? గులాబీ లీడర్ల మైండ్ బ్లాంక్ అయిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మొదటి నుంచి తమకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలవకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఢీలా పడిపోయారు. కౌంటింగ్ తర్వాత ఏ కారు పార్టీ లీడర్ ను చూసినా అదే పరిస్థితి కనిపించింది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఓ పని కూడా ఇందుకు బలాన్నిస్తోంది. జర్మనీ పర్యటన నుంచి తిరిగొచ్చిన కేటీఆర్.. తన వైఖరికి భిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా పరామర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ దూరంగా ఉంటారన్న వాదన ఉంది. అయితే బుధవారం నీలోఫర్ హాస్పిటల్ వెళ్లారు మంత్రి కేటీఆర్. అక్కడ చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మీద టీఆర్ఎస్ కు చెందిన స్థానిక నేత ఒకరు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాపకు వైద్యం చేయటానికి స్థానిక ఆసుపత్రి సిబ్బంది నిరాకరించటం.. దీనిపై విమర్శలు రావటంతో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం బాధితురాలు  హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన కాసేపటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి.. బాధిత పాపను పరామర్శించారు. చిన్నారి పాప బంగారు భవిష్యత్తును నాశనం చేశారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.  అత్యాచార ఘటన జరిగింది మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దీంతో విమర్శలకు అవకాశం ఇవ్వకుండా కేటీఆర్  పరామర్శకు వెళ్లారని అంటున్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అంతేకాదు హుజూరాబాద్ ఫలితాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావన కలిగేలా మంత్రి కేటీఆర్ తీరు ఉందంటున్నారు.  కేటీఆర్ తీరుతో  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ అధినాయకత్వం మైండ్ సెట్ ను మారుస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఆరేళ్ల బాలికకు పరామర్శ కంటే కూడా.. ఆరోపణలు ఉన్న సొంత పార్టీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫ‌స‌క్‌!.. కేసీఆర్ లెక్క త‌ప్పిందా? ఆయ‌న వ‌ల్లే ఓట‌మా?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో నెంబ‌ర్ 1 బ‌క‌రా హ‌రీశ్‌రావు అయితే.. బ‌క‌రా నెంబ‌ర్ 2 కౌశిక్‌రెడ్డినే అంటున్నారు. అవును మ‌రి, ఎన్నిక‌ల ముందు అంత‌న్నారు..ఇంత‌న్నారు.. టీఆర్ఎస్‌ను ఒంటి చేత్తో గెలిపించే స‌త్తా ఉంద‌న్నారు. మందీమార్బ‌లాన్ని పోగేసుకొచ్చి.. తెలంగాణ భ‌వ‌న్‌లో అట్ట‌హాసంగా గులాబీ కండువా క‌ప్పుకున్నారు. న‌గ‌ర‌మంతా త‌న‌ ఫ్లెక్సీలు క‌ట్టించుకొని.. ఫైన్లు కూడా క‌ట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తాను గెల‌వ‌కున్నా.. ఈసారి టీఆర్ఎస్‌ను గెలిపిస్తానంటూ ఫోజులు కొట్టారు. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డినే స‌వాల్ చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఘోర ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకున్నారు. ముఖం చూపించలేక హైద‌రాబాద్ పారిపోయార‌ని అంటున్నారు. ఇదంతా స‌రే.. మ‌రి, కౌశిక్‌రెడ్డి భ‌విత‌వ్యం ఏంటి? ఆయ‌న ఎమ్మెల్సీ ప‌రిస్థితేంటి? కేసీఆర్ ట్రాప్‌లో అంద‌రిక‌న్నా ముందు చిక్కింది కౌశిక్‌రెడ్డినే. ఎమ్మెల్సీ ఇస్తాన‌నగానే.. అంత‌కంటే మ‌హాభాగ్య‌మా అన్న‌ట్టు ఎగిరెగిరి ప‌డ్డారు. ఎలాగూ తాను ఎమ్మెల్యేగా గెలిచేది లేదు కాబ‌ట్టి.. క‌నీసం ఎమ్మెల్సీగానైనా అధ్య‌క్షా అందామ‌నుకున్నారు. అందుకే, ఉన్న‌ట్టుండి గోడ దూకేసి.. రేవంత్‌రెడ్డిని ధిక్క‌రించేసి.. గులాబీ గూటిలో చేరిపోయారు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో కారు గుర్తు కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. టీఆర్ఎస్ ఓట‌మితో ఇప్పుడు కౌశిక్‌రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డింద‌ని అంటున్నారు. కేసీఆర్‌ను న‌మ్మి కౌశిక్‌రెడ్డి న‌ట్టేట్లో మునిగార‌ని చెబుతున్నారు. ఇటు ఆయ‌న‌కు రావల‌సిన ఎమ్మెల్సీ పోస్టును గ‌వ‌ర్న‌ర్ తొక్కిపెట్టారు. అటు హుజురాబాద్‌లో ఓట‌మితో కేసీఆర్ ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఇటు, అటు, ఎటూ కాకుండా పోయారు కౌశిక్‌రెడ్డి.  మ‌రోవైపు, కౌశిక్‌రెడ్డి విష‌యంలో కేసీఆరే లెక్క త‌ప్పార‌నే వాద‌నా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి 60వేల‌కు పైగా ఓట్లు సాధించారు. లోక‌ల్‌గా బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరుంది. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌.. హ‌స్తం గుర్తు వ‌ల్లే.. ఆయ‌న‌కు అన్ని ఓట్లు వ‌చ్చాయి. అదే కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డం.. ఆయ‌న నేరుగా కేండిడేట్‌గా లేక‌పోవ‌డం.. అధికార‌పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త.. అంతా క‌ల‌గ‌లిసి కారును గ్యారేజ్‌కి పంపించేశారు.  అదే, కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే.. ఆయ‌న హ‌స్తం గుర్తుపై పోటీ చేసి ఉంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ ఓటు ఈట‌ల రాజేంద‌ర్‌, కౌశిక్‌రెడ్డిల మ‌ధ్య చీలిపోయి ఉండేద‌ని.. ఆ మేర‌కు టీఆర్ఎస్‌కు లాభం జ‌రిగుండేద‌నే విశ్లేష‌ణ కూడా వినిపిస్తోంది. ఈ లెక్క‌న కౌశిక్‌రెడ్డి విష‌యంలో కేసీఆర్ లెక్క త‌ప్పింద‌ని అంటున్నారు. మ‌రోవైపు, ఈసారి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న‌కే టికెట్ ఇస్తారు కాబ‌ట్టి.. కౌశిక్‌రెడ్డి ముందుచూపుతో గెల్లు గెలుపు కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌లేదని కూడా స్థానికంగా టాక్ న‌డుస్తోంది. ఏదిఏమైనా హుజురాబాద్ ఓట‌మితో బ‌లిప‌శువు అయ్యే వారి జాబితాలో కౌశిక్‌రెడ్డినే నెంబ‌ర్ 2 అంటున్నారు. ఇక‌, నెంబ‌ర్ 1 బ‌లిప‌శువు హ‌రీశ్‌రావునే అని అంతా భావిస్తున్నారు.