1,246 కోట్ల క్విడ్ప్రోకో నిజమే.. జగన్-హెటిరో కేసులో సీబీఐ స్ట్రాంగ్ వాదనలు..
posted on Nov 9, 2021 @ 9:47AM
అవును, జగన్రెడ్డి, విజయసాయిరెడ్డిలు పక్కాగా స్కెచ్ వేశారు. అక్రమ మార్గంలో వేల కోట్ల పెట్టుబడులు లాగేశారు. జగతి పబ్లికేషన్స్లో జగన్రెడ్డి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు.. హెటిరో డ్రగ్స్ మాత్రం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇది పక్కా క్విడ్ప్రోకో అంటూ సీబీఐ తేల్చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులను పెట్టుబడుల రూపంలో స్వీకరించారని తెలిపింది. అదే విషయం హైకోర్టులో విచారణ సందర్భంగా సూటిగా వాదించింది. సీబీఐ వాదనలతో జగన్రెడ్డి, విజయసాయిరెడ్డిల మెడకు అక్రమాస్తుల కేసు ఉచ్చు మరింత బిగిసినట్టే అంటున్నారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతో పాటు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం ద్వారా జగన్ అక్రమ లబ్ధి పొందారని సీబీఐ తరఫు లాయర్ వాదించారు. ‘పిటిషనర్లు పెట్టుబడులు, భూకేటాయింపులను వేర్వేరుగా చెబుతున్నారు. అది సరికాదు. ఆ రెండింటిలోని అంశాలను కలిపి చూసినపుడే కుట్ర బయటపడుతుంది. ఇందులో హెటిరో కంపెనీ, ఎండీల పాత్రలను వేర్వేరుగా చూడలేం. బలమైన అనుమానాలున్నందునే సీబీఐ ముందుకెళ్లింది అని తెలిపారు.
హెటిరో హెల్త్కేర్లో కేంద్రం తనిఖీ చేసి ఇచ్చిన నివేదికలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలున్నాయి. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. వాటాలను విక్రయించుకోలేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్ ఏసియా, సండూర్ పవర్ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయి. అందులోనూ ఈ కేసు ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్ల దశలోనే ఉంది. సీబీఐ పూర్తి విచారణ జరిపితేనే.. ఆధారాలతో కేసును రుజువు చేయగలదు. హెటిరో పెట్టిన పెట్టుబడులను సమర్థించుకోవడానికి వీలుగా విజయసాయిరెడ్డి డెల్లాయిట్ నుంచి పాత తేదీతో వాల్యుయేషన్ నివేదిక తెప్పించారు. వాటాల విక్రయానికి అవకాశం లేదని, లాభాలు లేవని.. అన్నీ తెలిసే ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి’ అని సీబీఐ న్యాయవాది వాదించారు.
‘భూకేటాయింపుల్లో పరిణామాలను బట్టి.. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి. 2006 నవంబరులో రూ.2 కోట్లు, 2007 మార్చిలో హెటిరో రూ.3.88 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తదనుగుణంగా ఆ సంస్థకు 50 ఎకరాల భూకేటాయింపు జరిగింది. 2008లోనూ పెట్టుబడులు పెట్టిన తర్వాతే 75 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వంలో ఫైళ్ల కదలికను బట్టి పెట్టుబడులు వెళ్లాయి’ అని వాదించారు. హెటిరో కంపెనీ వ్యవహారాలతో.. డైరెక్టర్గా తన బాధ్యత లేదన్న శ్రీనివాసరెడ్డి వాదనను సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. డైరెక్టర్లందరినీ నిందితులుగా చేర్చలేదని, కీలక పాత్ర పోషించిన వ్యక్తినే చేర్చామన్నారు. నిబంధనల ప్రకారమే సీబీఐ కోర్టు అభియోగ పత్రాన్ని విచారణకు పరిగణించిందని, అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తామని హెటిరో తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టును కోరారు.