భారీ వ‌డ్డీతో మ‌రో వెయ్యి కోట్ల అప్పు.. జ‌గ‌న్‌రెడ్డి కొంప ముంచేలా ఉన్నాడే..!

ఏపీ అప్పుల రాష్ట్రం. దివాళ అంచున చేరిన రాష్ట్రం. ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖున జీతాలివ్వ‌డ‌మే క‌ష్టం. న‌వ‌ర‌త్నాల‌కు నిధులు లేక‌.. అమ్మ ఒడిని అట‌కెక్కించే ప్ర‌య‌త్నం. కార్పొరేష‌న్ల పేరున రుణాలు తీసుకొని.. ప‌క్క‌దారి ప‌ట్టించే స్కీం. ఏపీ అప్పులు చూసి.. కొత్త‌గా అప్పులిచ్చేందుకు జంకుతున్నాయి ప‌లు ఆర్థిక సంస్థ‌లు. దీంతో.. ఆర్బీఐ ద‌గ్గ‌ర సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తూ నెట్టుకొస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. ఆ బాండ్లు కూడా కొనేవారు క‌రువ‌వ‌డంతో.. భారీ వ‌డ్డీ ఆశ‌గా చూపించి.. తాజాగా మ‌రో వెయ్యి కోట్ల అప్పు చేసింది ప్ర‌భుత్వం.  ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ ద‌గ్గ‌ర‌ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ ఈ రుణాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల‌కు 500 కోట్లు, 18 ఏళ్ల‌కు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం కేంద్రం వద్ద ఆర్ధిక శాఖ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెడపై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డిఫాల్టర్‌ కత్తి వేలాడుతోంది. అప్పు అయితే చేస్తోంది కానీ.. వాటిని తిరిగి తీర్చే మార్గ‌మే క‌నిపించ‌డం లేదు. 17 ఏళ్ల కాల‌ప‌రిమితి కావ‌డంతో.. ఇప్పుడు వ‌డ్డీ క‌డితే స‌రిపోతుంది. అస‌లు ఇప్ప‌టికిప్పుడు తీర్చాల్సిన ప‌నిలేదు. దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ తాను గెలిచేది లేదు.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేదీ లేదూ.. 17 ఏళ్ల త‌ర్వాత ఎవ‌రు ఉంటారో ఏమో అనుకుంటూ.. ఏపీ ప్ర‌జ‌ల నెత్తిన వేల కోట్ల అప్పు రుద్దేస్తున్నారు. తెచ్చిన డ‌బ్బుల‌న్నీ రాష్ట్ర‌ అభివృద్ధికి కాకుండా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ప‌ప్పు-బెల్లంలా పంచేస్తుండ‌టంతో రుణాల‌న్నీ నిష్ప‌యోజ‌నంగా మారుతున్నాయి. ఏపీ మ‌రింత దివాళ తీస్తోంది..అంటున్నారు.   

బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా

అనుకున్నట్లే జరిగింది. రాజకీయ వర్గాలు అనుమానించినట్లే టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా పడింది. వరంగల్ శివారు దేవన్నపేటలో నవంబర 29న తలపెట్టిన విజయగర్జన సభకు వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఉంది దీంతో ఎన్నికల కోడ్ కారణంగా విజయగర్జన సభకు వాయిదా వేశామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.   విజయగర్జన సభే కాదు బుధవారం జరగాల్సిన కేసీఆర్ వరంగల్ నగర పర్యటన కూడా రద్దైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్  పర్యటన రద్దైందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.బుధవారం సీఎం పర్యటన కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి టీఆర్ఎస్ విజయగర్జన సభ మొదట నవంబర్15నే జరపాలని నిర్ణయించారు. తర్వాత దీక్షా దివస్ రోజున జరపాలని నిర్ణయించి నవంబర్ 29కి మార్చారు. అయితే సభ కోసం స్థలం దొరకకపోవడంతోనే 15 నుంచి 29కి మార్చారనే చర్చ వచ్చింది. దేవనపేట సభకు స్థల సేకరణ కూడా అదికార పార్టీ నేతలకు తలనొప్పిగానే మారింది. టీఆర్ఎస్ సభ కోసం తమ భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు తేల్చి చెప్పారు. సభ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన గులాబీ లీడర్లను అడ్డుకున్నారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికి కూడా సభ కోసం స్థలాన్ని టీఆర్ఎస్ నేతలు సేకరించలేదని తెలుస్తోంది. ఇది కూడా విజయగర్జన సభ వాయిదా కారణం కావచ్చని భావిస్తున్నారు. 

అమిత్ షాకు నిరసన సెగ తప్పదా? తిరుపతిలో ఏం జరగనుంది? 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఏపీలో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు జగన్ సర్కార్ మాత్రం తప్పంతా కేంద్రానిదేనని, తాము తగ్గించే ప్రసక్తే లేదని తెల్చి చెబుతోంది. పెట్రో విషయంలో బీజేపీ నేతలు జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఇలా ఏదో ఒక అంశంతో ఏపీలో ప్రతి రోజూ ఉద్రిక్తత పరిస్థితులే కనిపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటం రాజకీయ కాక రేపుతోంది. తిరుపతి క్షేత్రం వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యంత కీలకమైన భేటీని ఈ నెల 14న నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం కోమే అమిత్ షా తిరుపతి వస్తున్నారు. దీంతో చాలా కాలానికి వస్తున్న అమిత్ షా.. ఏపీకి ఏం తెస్తారు ఏమేమి  వరాలు ఇవ్వబోతున్నారని జనాలు ఆలోచిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమైనా సానుకూలత  అమిత్ షా పర్యటనలో రాష్ట్ర సమస్యలపై ఉద్యమించేందుకు కమ్యూనిస్టులు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతికి వస్తున్న అమిత్ షాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అమిత్ షా తిరుపతి టూర్ పై సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. అసలు తిరుపతితో మీకేం పని అమిత్ షా అంటూ గట్టిగానే ప్రశ్నించారు నారాయణ. నాడు ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి వచ్చిన మోడీ ప్రత్యేక హోదాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏడేళ్ళు గడిపేశారని విభజన హామీలన్నీ తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. అలాంటి తిరుపతికి ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా వస్తున్నారు అంటూ నారాయణ నిలదీస్తున్నారు.  అమిత్ షా ఊరకే వచ్చి వెళ్లిపోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు నారాయణ.  ఏపీకి ఆయన న్యాయం చేయాల్సిందే అన్నారు. అమిత్ షా రాక సందర్భంగా నల్ల జెండాలతో సీపీఐ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఏపీకి రావాల్సిన వాటి మీద జగన్ అమిత్ షా ని నిలదీయాలని నారాయణ కోరారు. గతంలోనూ అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సెగ తగిలింది. ఏపీకి న్యాయం చేయాలంటూ జనాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వామపక్షాల నిరసన పిలుపుతో ఈసారి కూడా అమిత్ షాకు తిరుపతిలో నిరసన సెగ తప్పకపోవచ్చని తెలుస్తోంది. 

లేడీ డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద‌ మృతి.. అర్థ‌న‌గ్నంగా డెడ్‌బాడీ..

ఆమె పేరు ఫాతిమా(30). ఓ ఆర్కెస్ట్రా ట్రూప్‌లో డ్యాన్స‌ర్‌. అదే ఆమెకు జీవ‌నాధారం. చాలా ఏళ్లుగా డ్యాన్స‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఏరియాలో కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అందంగానూ ఉంటుంది. క‌ట్ చేస్తే.. ఇంట్లోనే ఆమె చ‌నిపోయి ప‌డి ఉంది. డెడ్‌బాడీ అర్థ‌న‌గ్నంగా ఉంది. మృత‌దేహం ప‌క్క‌న మద్యం బాటిల్ ప‌డుంది. గొంతు నులిమిన ఆన‌వాళ్లు కూడా క‌నిపించాయి. పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు. ఆమెది హ‌త్యా? హ‌త్యాచారం కూడానా? అనే దిశ‌గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఫాతిమా మృతి కేసు స్థానికంగా క‌ల‌క‌లంగా మారింది.  హైద‌రాబాద్ పూల్‌బాగ్‌కు చెందిన షీరిన్‌ ఫాతిమా(30) భర్త నదీమ్ గ‌త ఏడాది చ‌నిపోయారు. వారికి ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఇటీవల ముస్తఫానగర్‌కు మ‌కాం మార్చింది ఫాతిమా. అయితే, పాత ఇంట్లో కొన్ని సామాన్లు స‌ర్దాలంటూ పిల్ల‌ల‌ను పుట్టింట్లో వ‌దిలి పూల్‌బాగ్ వ‌చ్చింది. రాత్రైనా ఆమె ఇంటికి రాక‌పోవ‌డంతో పిల్ల‌లు త‌ల్లిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్లారు. అక్క‌డికి వెళ్లేస‌రికి ఆ ఇంట్లో విగ‌త‌జీవిగా ప‌డుంది ఫాతిమా. ఒంటిపై బ‌ట్ట‌లు స‌రిగా లేవు. అర్థ‌న‌గ్నంగా ఉంది. ఫ‌ల‌క్‌నుమా పోలీసులకు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఫాతిమా ఎలా చ‌నిపోయిందో.. హ‌త్యాచారం జ‌రిగిందో లేదో తేల్చ‌నున్నారు పోలీసులు. 

బండి కాదు జ‌గ‌మొండే కేసీఆర్ టార్గెట్‌.. రేవంత్‌రెడ్డికి పోటీగా బీజేపీకి బూస్ట్‌..

సీఎం కేసీఆర్‌కు భ‌యం ప‌ట్టుకుంది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఫిక‌ర్ ప‌ట్టుకుంది. అందుకే వ‌రుస ప్రెస్‌మీట్లు పెట్టి గంట‌ల త‌ర‌బ‌డి చెప్పిందే చెప్పారు. బీజేపీని, కేంద్రాన్ని తిట్టిందే తిట్టారు. బండి సంజ‌య్ స్థాయిని ఓవ‌ర్‌నైట్ పెంచేశారు. కేసీఆర్ ఇంత‌లా భ‌య‌ప‌డ‌టానికి కార‌ణం బీజేపీనో, ఈట‌ల రాజేంద‌రో కానే కాదంటున్నారు. రేవంత్‌రెడ్డి భ‌యంతోనే ముఖ్య‌మంత్రి ఇలా చేస్తున్నార‌ని చెబుతున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీని, బండిని బండ‌కేసి బాదడం.. రేవంత్‌రెడ్డిని సైడ్ చేసేందుకేన‌ని అంటున్నారు. కేసీఆర్ అస‌లైన టార్గెట్‌ రేవంత్‌రెడ్డినే కానీ, బీజేపీ కానే కాద‌ని తేల్చేస్తున్నారు.   హుజురాబాద్‌లో గెలిచినంత మాత్రాన‌, ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగినంత మాత్రాన తెలంగాణ‌లో బీజేపీ ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి వ‌చ్చేంత సీన్ లేద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ, ఇవాళ అసెంబ్లీని ర‌ద్దు చేసి.. రేపు ఎన్నిక‌లు పెట్టినా.. గెలిచేంద స‌త్తా కాంగ్రెస్‌కు మాత్ర‌మే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడంతా రేవంత్‌రెడ్డి మేనియా న‌డుస్తోంది. కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడు రేవంత్‌రెడ్డినే అని ప్ర‌భుత్వ వ్య‌తిరేకులంతా బ‌లంగా న‌మ్ముతున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు పుంజుకుంది. కేడ‌ర్ ఫుల్ జోష్‌లో ఉంది. ప్ర‌జలు సైతం టీఆర్ఎస్‌కు ఆల్ట‌ర్‌నేట్.. కాంగ్రెసేన‌ని ఫిక్స్ అవుతున్నారు. అందుకే, కేసీఆర్‌లో ఇంత‌టి క‌ల‌వ‌రింత‌. అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివ‌రాఖ‌రికి రైతులు సైతం వ‌రి వేస్తే ఉరిపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఆ కేసీఆర్ వ్య‌తిరేక‌తే.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడించి ఈట‌ల‌-బీజేపీని గెలిపించింది అంటున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఎంత ఆగ్ర‌హంగా ఉన్నారో హుజురాబాద్ ఎన్నిక తేల్చేయ‌డంతో.. కేసీఆర్ ఉలిక్కిప‌డ్డారు. ఈ ప్ర‌జావ్య‌తిరేక‌త అంతా వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లో రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ వైపున‌కే షిఫ్ట్ అవుతుంద‌నే విష‌యాన్ని గులాబీ బాస్ గ్ర‌హించిన‌ట్టున్నారు. అందుకే, రేవంత్‌రెడ్డి దూకుడు ఇలానే కొన‌సాగితే.. త‌న ఖేల్ ఖ‌తం.. దుకాణం బంద్ అవుతుంద‌నే భ‌యంతో.. వెంట‌నే ఆప‌రేష‌న్ బీజేపీ అమ‌ల్లో పెట్టార‌ని అంటున్నారు.   బండి సంజ‌య్‌ది త‌న స్థాయి కాదని వ‌దిలేశానంటూ.. రెండు ప్రెస్‌మీట్లూ బండి సంజ‌య్ చుట్టూనే తిప్పేశారు. బండి సంజ‌య్‌ను త‌న స్థాయి లీడ‌ర్‌ను చేసేశారు. ఇక కేసీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్‌.. కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ.. కేసీఆర్ వ‌ర్సెస్ కేంద్రం.. అనేలా డ్రామా ర‌క్తి క‌ట్టించారు. విమ‌ర్శ‌ల‌న్నీ బీజేపీ బండి చుట్టూనే తిరిగినా.. కేసీఆర్‌ మెయిన్ టార్గెట్ మాత్రం రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్‌లే. ఒక్క హుజురాబాద్ విష‌యం వ‌దిలేస్తే.. కొన్ని నెల‌లుగా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. ద‌ళిత-గిరిజ‌న దండోరాలు, డ్ర‌గ్స్ దందాలో వైట్ ఛాలెంజ్‌లు, ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోతున్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ శ్రేణుల్లో మునుప‌టి ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. ఇప్ప‌టికీ తెలంగాణ‌లో కాంగ్రెస్ కేడ‌ర్ బ‌లంగానే ఉంది. రేవంత్‌రెడ్డి జోరు ఇలానే కొన‌సాగితే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీ అధికారం హ‌స్త‌గ‌తం చేసుకునేలా క‌నిపిస్తోందని అంటున్నారు.  అస‌లే ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ అయిన బండి సంజ‌య్‌.. కేసీఆర్ త‌న‌ను అన్నేసి మాట‌లు అంటే చూస్తూ ఊరుకుంటారా? ఆయ‌నా రెచ్చిపోయారు. పోటాపోటీ ధ‌ర్నాల‌తో ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీ రెండు పార్టీలూ క‌లిసి ర‌చ్చ రంభోలా చేస్తున్నారు. ఈ రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లో రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ సైడ్ వేస్‌లోకి వెళ్లిపోతార‌నేది కేసీఆర్ స్కెచ్ అంటున్నారు. మ‌రి, ముఖ్య‌మంత్రి మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్కవుట్ అవుతుందా? రేవంత్‌రెడ్డిని సైడ్ చేయ‌డం అంత ఈజీగా? జిత్తుల‌మారి కేసీఆర్‌ను.. జ‌గ‌మొండి రేవంత్‌రెడ్డి ఎలా డీల్ చేస్తారో చూడాలి...

షర్మిలతో కోమటిరెడ్డి బ్రదర్ మీటింగ్.. ఏంటి సంగతి?

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్ కలవడం సంచలనంగా మారింది. ప్రజా ప్రస్థానంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో షర్మిల నడుస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంతూరు బ్రహ్మణ వెల్లెంలకు ఆమె చేరుకోగానే ఆసక్తికర ఘటన జరిగింది. తమ గ్రామానికి వచ్చిన షర్మిలను కలిశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు ను పరిశీలించాలని కోరారు. చాలా సేపు షర్మిలతో మాట్లాడారు మోహన్ రెడ్డి. అంతేకాదు బ్రహ్మణ వెల్లంలలో తన అనుచరులతో ఆయన షర్మిలకు మద్దతు తెలిపారు. మోహన్ రెడ్డి సూచనతో ఉదయ సముద్రం ప్రాజెక్టును పరిశీలించారు షర్మిల.  షర్మిలను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కలవరం ఆసక్తిగా మారింది. గతంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిలకు ఓపెన్ గానే ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. షర్మిల పార్టీని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నా.. వెంకట్ రెడ్డి ఆమెకు అభినందనలు చెప్పడం అప్పట్లో కాంగ్రెస్ లో కాక రేపింది. అంతేకాదు విజయమ్మ-షర్మిల కలిసి హైదరాబాద్ లో నిర్వహించిన వైఎస్సార్ ఆత్మీయ సమావేశానికి పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా హాజరయ్యారు వెంకట్ రెడ్డి. ఇక మునుగోడు నియోజకవర్గం పుల్లెంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టగా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి ఆమెకు మద్దతు తెలిపారు. తమ నియోజకవర్గానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను కాదని షర్మిలకు వెంకట్ రెడ్డి అభినందనలు చెప్పడం.. రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలపగా.. తాజాగా కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న షర్మిల కలవరం రాజకీయంగా చర్చగా మారింది. తన సోదరుల డైరెక్షన్ లోనే మోహన్ రెడ్డి.. షర్మిలను కలిసి ఉండవచ్చని భావిస్తున్నారు. కొంత కాలంగా మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నల్గొండ జడ్పీ చైర్మెన్ పీఠం కోసం పోటీ పడ్డారు. తాజాగా షర్మిలను కలవడంతో మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో భాగంగానే ఇది జరిగిందని తెలుస్తోంది. 

చ‌ర్చిలో కామ‌క్రీడ‌.. 19మంది మ‌హిళ‌ల‌కు వ‌ల‌.. ప్లే బాయ్‌గా పియానో ప్లేయ‌ర్‌..

అత‌నో పియానిస్ట్‌. పేరు విలియ‌మ్స్‌. న‌ల్గొండ‌లోని ఓ చ‌ర్చిలో పియానో ప్లే చేస్తుంటాడు. చాలాకాలంగా అదే ప‌ని మీద ఉన్నాడు. దేవుడిపై భ‌క్తితో కాబోలు అనుకున్నారంతా. కానీ, అత‌గాడి భ‌క్తి.. ర‌క్తిగా మారింది. ద్యావుడిపై ధ్యాసను.. మ‌హిళ‌ల‌ మీద‌కు షిఫ్ట్ చేశాడు. పియానో ప్లేయ‌ర్ కాస్తా.. ప్లే మ్యాన్‌గా మారాడు. క‌ట్ చేస్తే.. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా 19మంది మ‌హిళ‌ల‌ను మోసం చేశాడ‌ని తెలుస్తోంది.  చ‌ర్చికి వ‌చ్చే యువ‌తులు, మ‌హిళ‌లే అత‌ని టార్గెట్‌. ముందు పాట‌తో ఇంప్రెష్ చేస్తాడు. పియానో వాయిస్తూ.. ఫోజు కొడ‌తాడు. ఆ త‌ర్వాత అస‌లు వాయింపు స్టార్ట్ చేస్తాడు. త‌న సంగీతంతో ప్రేమ స‌రిగ‌మ‌లు ప‌లికిస్తాడు. మాట‌ల‌తో మభ్య పెట్టి.. మ్యూజిక్‌తో మ‌తి చెద‌ర‌గొట్టి.. మెళ్లిగా అస‌లు కార్య‌క్ర‌మం మొద‌లుపెడ‌తాడు. అలా అలా.. మొత్తం 19మంది విలియ‌మ్స్ వ‌ల‌కు చిక్కారట‌. మేట‌ర్ పెళ్లి వ‌ర‌కూ రావ‌డంతో.. వాడి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. పోలీసుల ఎంట్రీతో విష‌యం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. 19మందిని ట్రాప్ చేసిన సంగ‌తి తెలిసి.. పోలీసులే అవాక్క‌వుతున్నారు.  మ‌రో ఇంట్రెస్టింగ్ మేట‌ర్ ఏంటంటే.. విలియ‌మ్స్ వివాహితుడు. వాడి ఆగ‌డాలు భ‌రించ‌లేక‌.. మొద‌టి భార్య విడాకులు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు కూడా ఆమె ఫిర్యాదుతోనే విలియ‌మ్స్ కామ‌క్రీడ వెలుగులోకి వ‌చ్చింది. 19 మంది మహిళలను మోసం చేసినట్టు ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్ర‌యత్నించగా.. తనకు గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్‌ ఆస్పత్రిలో చేరాడు.   

తాగుబోతు సీఎంను తరిమికొడదాం.. పార్టీ నేతలకు రేవంత్ సందేశం 

రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, టిఆరేస్ రెండు పార్టీలు తోడు దొంగలే అన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయిందన్నారు రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు.  ఎంత మంది నాయకులు పోయిన కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు రేవంత్ రెడ్డి. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. క్రమశిక్షణ కాంగ్రెస్ లో ముఖ్యమన్న రేవంత్ రెడ్డి.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దన్నారు. నేతలు పదవులు అనుభవిస్తున్నారంటే అందుకు కార్యకర్తలే కారణమన్నారు. రేవంత్ రెడ్డి. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమన్నారు. కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను ప్రారంభించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.  బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.  కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని చెప్పారు. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత తానే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఏపీలో అమ్మఒడి ఆగమాగం.. పట్టాభిపై దాడితో వైసీపీ డైవర్షన్ గేమ్.. 

వైయస్ జగన్ ప్రభుత్వం నిధుల లేమితో సతమతమవుతోంది. అప్పు కోసం కేంద్రం వద్దకు వెళ్లినా.. ఆర్బీఐ వద్దకు వెళ్లిన అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నవరత్నాలాంటి పథకాలకు పుల్‌స్టాప్ పెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో మొదట అమ్మఒడికి  ముఖ్యమంత్రి జగన్ చెక్ పెడదామనుకున్నారని.. అందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి అయిందని సమాచారం.  ఇప్పటికే ఈ పథకం కింద జగన్ ప్రభుత్వం రెండు విడతలుగా నిధులు విడుదల చేసింది.  ముచ్చటగా మూడో విడత నిధులు విడుదలకు వచ్చే సరికి జగన్ ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఏర్పడింది. ఆ క్రమంలోనే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి నగదు.... జూన్‌లో ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మార్చి, ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. దాంతో జూన్‌లో నగదు ఎవరికి ఇస్తారని జగన్ ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడికి నామం పెట్టే క్రమంలోనే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయితే ఇటీవల అమ్మఒడి నగదు అందుకోవాలంటే .. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అమ్మ ఒడికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో విద్యార్థులు బయోమెట్రిక్ విధానంలోకి రావాలంటే.. చాలా సమయం పడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పథకానికి గండి కట్టే క్రమంలోనే ఇలాంటివన్నీ తెరపైకీ తీసుకు వస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు.  ఇంకో వైపు అమ్మఒడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక  జగన్ ప్రభుత్వం అమ్మఒడిని అపేస్తుందంటూ బ్యానర్ ఐటమ్‌ను ప్రచురితం కావడంతో  వైయస్ జగన్ ప్రభుత్వం ‘యుద్ధ’ ప్రాతిపదికన అప్రమత్తమైంది.  జగన్ అధికారంలోకి వచ్చారంటే.. అందుకు నవరాత్నాలే కారణం.. అందునా అమ్మఒడి పథకం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్షన్ చేయడానికి అప్పటికప్పుడు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదిపింది. అయితే ఆదే రోజు సాయంత్రం టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి ప్రెస్ మీట్ పెట్టడం.. బోసడికే అనే పదాన్ని వాడడం.. ఆ తర్వాత అధికార పార్టీ కార్యకర్తలు .. పట్టాభిపై ఆయన నివాసంపై దాడి చేయడం.. టీడీపీ కార్యాలయాలపై దాడి.. అంతా కన్ను తెరిచి మూసే లోపు జరిగిపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం అమ్మఒడికి పుల్ స్టాప్ అంశం మురుగునపడిపోయింది. అధికార పార్టీ కదిపిన పావులకు.. అటు టీడీపీ చిత్తు చిత్తు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ప్రభుత్వాన్ని నడిపించే ఇం‘ధనం’ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ వద్ద లేదని... ఈ నేపథ్యంలో నవరత్నాల్లోని అన్ని పథకాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయే పరిస్థితి ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఆ క్రమంలోనే తొలుత అమ్మఒడి ఉందని.. అందుకోసం ప్రజల మైండ్ సెట్‌ను జగన్ ప్రభుత్వం ట్యూన్ చేస్తుందని  రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నగరా.. ఏపీలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నిక

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే.. స్థానిక సంస్థల కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ను సీఈసీ విడుదల చేసింది. ఏపీలో 11, తెలంగాణ 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 16న నోటిఫికేషన్‌ రానుండగా , 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 10న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 14న కౌంటింగ్‌ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఏపీకి సంబంధించి అనంతపురం జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో రెండు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో రెండు, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.    ఏపీకి సంబంధించి పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, యలమంచలి రాజేంద్ర ప్రసాద్, రెడ్డి సుబ్రమణ్యం ,అన్నం సతీష్ ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ద్వారంపూడి జగదీశ్వర్ రావు, బుద్దా నాగ జగదీశ్వర్ రావు,  చలపతి రావు, గాలి సరస్వతి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానాలు భర్తీ కానున్నాయి. వీటిలో పయ్యావుల కేశవ్, సతీశ్ ప్రభాకర్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్థానాలు 2019 జూన్ నుంచే ఖాళీగా ఉన్నాయి. ఎంపీ గెలిచిన మాగుంట, ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ అప్పుడే రాజీనామా చేశారు. అయితే స్థానిక సంస్థల ఓటర్ లిస్టు లేకపోవడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది. తర్వాత కోవిడ్ కారణంగా అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. మిగితా ఎనిమిది మంది పదవీ కాలం గత ఆగస్టులోనే ముగిసింది.  తెలంగాణ నుంచి పురాణం సతీశ్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మినారాయణ, భాను ప్రసాద్ రావు, నారదాలు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు పదవి కాలం జనవరి 4తో ముగియనుండి. ఈ స్థానాల భర్తీకి సీఈసీ షెడ్యూల్ ఇచ్చింది. 

కొడాలి పెట్రో ఫైర్‌.. దొందు దొందేన‌న్న రేవంత్‌.. అనంత అల‌జ‌డి.. టాప్‌న్యూస్ @1pm

1. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ‘‘అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి’’ అని మంత్రి ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్‌పోసి తగలబెట్టారని.. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని కొడాలి నాని అన్నారు.  2. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాలంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ ధ‌ర్నాలు చేప‌ట్టింది. తెలుగు త‌మ్ముళ్లు ఎక్క‌డిక‌క్క రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. చాలా చోట్ల వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌క్క రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో రేట్లు అధికంగా ఉండ‌టంపై మండిప‌డుతున్నారు. 3. తెలంగాణ‌ను టీఆర్ఎస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నార‌ని.. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంద‌ని రేవంత్ చెప్పారు. ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని  అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. 4. ఏపీఈఆర్సీ చైర్మన్‌ను.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కలిసి విద్యుత్ కొనుగోళ్ల‌పై మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆరా తీస్తున్నారు. సెకీ నుంచి యూనిట్ రూ.2.49లకు కొనుగోలు చేయ‌డంపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వివరణ అసమగ్రంగా ఉందని, ఏపీఈఆర్సీ అనుమతిపైనా సర్కార్ స్పష్టత లేదని, దీనిపై ఏపీఈఆర్సీ చైర్మన్‌కు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేయనున్నారు. 5. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం అనంతపురంలో పర్యటించనున్నారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. వారికి భరోసా కలిగించనున్నారు. లోకేష్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు పర్యటనలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా కట్టడి చేస్తున్నారు.  6. ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అనంత‌ ఎస్పీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల‌కు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  7. అనంత‌లో పోలీసుల‌ లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. ఆమె ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. మ‌రోవైపు, ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ యాజమాన్యం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది.  8. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు చౌడపల్లికి చేరింది. అయితే, ప్ర‌తీ మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షలో భాగంగా చౌడ‌ప‌ల్లిలో దీక్ష‌కు కూర్చున్నారు వైఎస్‌ షర్మిల.  9. గుంటూరు జిల్లాలోని దిశా పోలీసు స్టేషన్‌లో బాబు అనే నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ రేప్ కేసులో బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హజరుపరిచే సమయంలో బాబు బాత్ రూం క్లీనర్ తాగాడు. అప్ర‌మ‌త్త‌మైన‌ పోలీసులు వెంటనే అతడిని జీజీహెచ్‌కు తరలించారు.  10. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 4 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబైకి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తుండగా సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అభిజిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

మల్లన్న అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం! తీన్మార్ చరిత్ర ఏం చెబుతోంది?

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తెలంగాణలో ఈ పేరు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనుక ఎవరున్నారు..? ఏం చేశారు..? ఎంత నొక్కేశారు..? ఫుల్ డేటేల్స్ తో ప్రజల ముందు పేట్టేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా వార్తలు రాయడానికి ప్రధాన మీడియా జంకుతున్న సమయంలో... ధైర్యంగా గులాబీ బాస్ ను టార్గెట్ చేశారు. గులాబీ లీడర్లను ముప్పుతిప్పలు పెట్టించి.. మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న. అందుకే ఆయన తెలంగాణ ప్రజలు గొంతుకగా మారిపోయారు.  తీన్మార్ మల్లన్న 1982, జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్  చదివారు.  హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎన్ టీవీ ద్వారా జర్నలిస్టుగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ కుమార్... తర్వాత కొంత కాలం ఐ న్యూస్ ఛానెల్స్ లో పని చేశారు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా స్క్రీన్ మీద కనిపించారు. ఆ ప్రోగ్రామ్ హిట్ కావడంతో ఆయన  పేరు కూడా తీన్మార్ మల్లన్నగా మారిపోయింది. తర్వాత 10 టీవీలో కొంతకాలం పని చేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం క్యూ న్యూస్ ద్వారానే టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న.  ప్రజా సమస్యలపై పోరాడటంతో మొదటి నుంచి ముందున్న తీన్మార్ మల్లన్న.. రాజకీయంగా అడుగులు వేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. దాదాపు గెలిచినంత పని చేసిన తీన్మార్ మల్లన్న.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.  తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని  ప్రకటించాడు. ఆ తర్వాతే కొత్త కథ మొదలైంది. తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసుగా మారారని భావించిన కారు పార్టీ.. అతన్ని టార్గెట్ చేసింది. అప్పుడే లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకొచ్చింది. డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న  తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్న జైలులో ఉండగా ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను  కలిసి ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన జైలులో ఉండగానే అతని అనుచరులు ప్రకటించారు.  73 రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఎప్పటిలానే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బాతాల పోశెట్టి భరతం పడతానని హెచ్చరించి.. తాను ఏ మాత్రం తగ్గేది లేదని తేెల్చి చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆఖరికి బయటకొస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా.. 73 రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు లెక్కనా..? 33 కేసులు ఉన్నోడికి ఇంకో మూడు లెక్కనా..? అంటూ కేసీఆర్ కు దీటైన సమాధానం ఇచ్చారు. తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన.. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకొచ్చానని వివరించారు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందన్న మల్లన్న.. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్లు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.  దీంతో తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బీజేపీలో చేరుతారని ఆయన జైలులో ఉండగా ప్రచారం జరిగింది. మరీ ఆయన బీజేపీలో చేరి కేసీఆర్ ను ఎదుర్కొంటారా లేక ఇప్పటిలానే సొంతంగానే ముందుకు వెళతారా అన్నది చూడాలి మరీ.. 

బెజవాడ టూ జబల్పూర్.. హోంమంత్రి సుచ‌రిత‌కి ర‌ఘురామ ఖ‌త‌ర్నాక్‌ షాక్‌..

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలుసుగా. ఆయ‌న టార్గెట్ ఒక్క‌టే. త‌న పార్టీని మాగ్జిమ‌మ్ డ్యామేజ్ చేయ‌డ‌మే. జ‌గ‌న్‌కు నిద్ర లేకుండా చేసేలా కేసుల మీద కేసులు వేయ‌డ‌మే. ప్ర‌భుత్వ లోటుపాట్ల‌ను, ప‌థ‌కాల్లో డొల్ల‌త‌నాన్ని, పాల‌న‌లో త‌ప్పుడు విధానాల‌ను నిత్యం ఎండ‌గ‌ట్ట‌డ‌మే ఆయ‌న ప‌ని. జ‌గ‌న్‌కి, విజ‌య‌సాయికి, వైసీపీకి చుక్క‌లు చూపిస్తూ.. ఎక్క‌డ త‌ప్పు క‌నిపిస్తే చాలు.. ఆ పాయింట్ ప‌ట్టుకొని ఎందాకైనా వెళ‌తారు. చివ‌రి వ‌ర‌కూ పోరాడుతారు. ఓట‌మిని అస్స‌లు ఒప్పుకోరు. గ‌తంలో ఏ1, ఏ2ల బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు త‌ర‌లించాలంటూ సీబీఐ కోర్టులో కేసులు వేసి గ‌ట్టిగా ట్రై చేశారు. ఆ త‌ర్వాత‌ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇలా వ‌ద‌ల బొమ్మాళీ అంటూ వైసీపీ వెంటే ప‌డుతున్నారు ర‌ఘురామ‌. తాజాగా, ఏపీ హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రితకు ఖ‌త‌ర్నాక్ షాక్ ఇచ్చారు ర‌ఘురామ కృష్ణ‌రాజు.  ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాకర్ ఇటీవ‌ల విజయవాడ ఐటీ కమిషనర్‌గా వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్ర‌భుత్వం మ‌న‌దే.. ప‌ట్టుకునే ఐటీ అధికారీ మ‌నోడే అంటూ సంబ‌రాలు చేసుకున్నారు. ఈ విష‌యం ర‌ఘురామ‌కు తెలిసింది. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా రంగంలోకి దిగిపోయారు. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని కంప్లైంట్ చేశారు. ఆయన జాయినింగ్ రోజు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు. క‌ట్ చేస్తే.. ఐటీ క‌మిష‌న‌ర్‌ మేక‌తోటి ద‌యాక‌ర్‌ను విజ‌య‌వాడ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్పూర్‌కు బ‌దిలీ చేశారు. ర‌ఘురామ దెబ్బ‌కు వైసీపీ శ్రేణుల ఉత్సాహ‌మంతా నీరుగారిపోయింది.  కేంద్ర హోంశాఖ‌కు రూల్స్ తెలీవ‌ని అనుకోలేం. వైసీపీ పెద్ద‌ల లాబీయింగ్‌తోటే మేక‌తోటి ద‌యాక‌ర్‌ను విజ‌య‌వాడ బ‌దిలీ చేసి ఉంటార‌ని అంటున్నారు. అంత స్ట్రాంగ్ రిఫ‌రెన్స్ ఉన్నా కూడా.. ర‌ఘురామ ఎంట్రీతో అదంతా తుస్సుమందంటే మామూలు విష‌యం కాదు. అంటే, కేంద్రంలో వైసీపీ పెద్ద‌ల‌ కంటే.. ర‌ఘురామ వెయిటే ఎక్కువ అన్న‌ట్టేగా? అంతేగా..! అంతేగా...!!

లిక్కర్ తరహాలోనే పెట్రోల్ స్మగ్లింగ్! జగనన్న పాలన స్పెషల్.. 

ఆంధ్రప్రదేశ్ లో అంతా స్పెషలే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. సాగునీటి ప్రాజెక్టులు సహా అన్ని అంశాల్లోనూ అంతే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై జనాలు భగ్గుమంటున్నారు. జనాలకు ఇష్టమైన బ్రాండ్లను పక్కనపెట్టి.. నాసిరకమైన కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది.  ఏపీలో ధరలు ఎక్కువగా ఉండడం.. ప్రజలకు అలవాటైన సంప్రదాయ బ్రాండ్లు లేకపోవడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని రవాణా చేసుకుని..ఏపీలో విక్రయించే ముఠాలు ఏర్పడ్డాయి. ఏపీతో పోలిస్తే..  తెలంగాణలో మద్యం ధరలు చాలా చౌక. దీంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన మద్యం అలవాటు ఉన్న ప్రజలు.. తెలంగాణలోకి వెళ్లి మద్యం తాగి వస్తున్నారు.  కొందరు కొన్ని బాటిళ్లను కొనుగోలు చేసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తొలుత మూడు బాటిళ్లను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. అవి ఏసైజు బాటిళ్లయినా.. అనుమతించింది. గత ఏడాది చివరిలో ఈ మూడు బాటిళ్లను కూడా బ్యాన్ చేసింది. అయినా వివిధ మార్గాల్లో ఏపీకి అక్రం మద్యం బాటిళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.  లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కష్టాలు పడుతుండగా.. తాజాగా జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోల్ పై రూ. 5 డీజిల్ పై రూ.10 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం బాటలోనే వ్యాట్ తగ్గించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12.  డీజిల్ ధర రూ.17 వరకు తగ్గింది.  కానీ ఏపీ సర్కార్ మాత్రం తగ్గించలేదు. దీంతో కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర 12 రూపాయలు, డీజిల్ ధర 17 రూపాయలు ఎక్కువగా ఉంది. దీంతో కర్ణాటక సరహద్దులో ఉన్న బంకులకు ఏపీ జనాలు వెళుతున్నారు.  ఏపీ సరిహద్దుల్లోని రాళ్లబుడుగూరు ప్రాంతంలో కర్ణాటకకు చెందిన కెంపేపుర సరిహద్దు ఉంది. ఇక్కడి బంకు యజమానులు.. ఏపీలోను తమ వద్ధ ఉన్న ధరలను పోలుస్తూ..కరపత్రాలను ముద్రించారు. వీటిని తెలుగులో నే ముద్రించి.. ఏపీలో కంటే తమదగ్గరే పెట్రోల్ ధరలు తక్కువని..తమ వద్ద పెట్రోల్ కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ పెట్రో బిజినెస్ జోరుగా సాగుతోంది. గతంలో రోజుకు 3000-5000 లీటర్లు అమ్మే ఈ బంకులు.. ఇప్పుడు రోజుకు 15000 నుంచి 18000 లీటర్ల చొప్పున విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో  మొబైల్ విక్రయదారులు కూడా పెరిగిపోయారు. కర్ణాటక నుంచి తెస్తున్న పెట్రోల్ , డీజిల్ ను వారు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇది ఏపీ ఖజానాకు గండంగా మారింది.  కర్ణాటకలో ధరలు తగ్గించి.. కొంత మేరకు నష్టపోతున్నా.. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ను విక్రయిస్తూ.. ఆ నష్టాన్ని లాభాల రూపంలో మలుచుకుంటోంది.  జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కర్ణాటక బంకు యజమానులకు వరంగా మారిందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మద్యంపై నిఘా పెట్టినట్టే.. సరిహద్దుల్లో జగన్ ప్రభుత్వం పెట్రోల్ ట్యాంకులపైనా నిఘా పెడుతుందా?  పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొనేవారిపై చర్యలు తీసుకుంటుందా?అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలు.. కేవలం 10 లీటర్లకు మించి పెట్రోల్ లేదా డీజిల్ తో రాకూడదని.. జగన్ సర్కారు ఏమైనా నిబంధనలు పెడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. 

రాజన్న రాజ్యంలో బతకలేకే వలసొచ్చాం.. కర్నూల్ కూలీ మాటతో షర్మిలక్క జంప్.. 

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం తీసుకొచ్చామని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సొదరి షర్మిల.. తనకు అధికారమిస్తే తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో తిరుగుతున్న వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ ఎదురైంది. ఓ కూలి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆమె అక్కడి నుంచి జారుకోవాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. దారి మధ్యలో తనకు ఎదురైన ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు షర్మిలకు ఎదురయ్యారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు షర్మిల. ఎవరూ అధైర్య పడవద్దని, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని, మీ కష్టాలన్ని తీరుస్తానని చెప్పారు. షర్మిల మాటలకు కూలీ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మీ అన్న తెచ్చిన రాజన్న  రాజ్యంలో భతకలేకే కర్నూల్ నుంచి నల్గొండ జిల్లాకు వలస వచ్చాం అని ఆ కూలీ అనడంతో షర్మిల షాకయ్యారు. అతనికి ఏం చెప్పాలో తిెలియక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు కూలీలు కొంత కాలం క్రితం నల్గొండ జిల్లాకు పని కోసం వచ్చారు.పొలం పనులతో పాటు రోడ్డు నిర్మాణ పనులను వెళుతున్నారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కూలీలు కనిపించడంతో ఆమె వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అయితే కూలీలు కర్నూల్ జిల్లా వాసులని తెలియకపోవడంతోనే షర్మిల రాజన్న రాజ్యం ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. షర్మిలకు ఎదురైన ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

1,246 కోట్ల క్విడ్‌ప్రోకో నిజ‌మే.. జ‌గ‌న్-హెటిరో కేసులో సీబీఐ స్ట్రాంగ్‌ వాద‌న‌లు..

అవును, జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు ప‌క్కాగా స్కెచ్ వేశారు. అక్ర‌మ మార్గంలో వేల కోట్ల పెట్టుబ‌డులు లాగేశారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌లో జ‌గ‌న్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా పెట్ట‌లేదు.. హెటిరో డ్ర‌గ్స్ మాత్రం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. ఇది ప‌క్కా క్విడ్‌ప్రోకో అంటూ సీబీఐ తేల్చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులను పెట్టుబడుల రూపంలో స్వీకరించారని తెలిపింది. అదే విష‌యం హైకోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా సూటిగా వాదించింది. సీబీఐ వాద‌న‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల మెడ‌కు అక్ర‌మాస్తుల కేసు ఉచ్చు మ‌రింత బిగిసిన‌ట్టే అంటున్నారు.  జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతో పాటు డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం ద్వారా జగన్‌ అక్రమ లబ్ధి పొందారని సీబీఐ త‌ర‌ఫు లాయ‌ర్ వాదించారు. ‘పిటిషనర్లు పెట్టుబడులు, భూకేటాయింపులను వేర్వేరుగా చెబుతున్నారు. అది సరికాదు. ఆ రెండింటిలోని అంశాలను కలిపి చూసినపుడే కుట్ర బయటపడుతుంది. ఇందులో హెటిరో కంపెనీ, ఎండీల పాత్రలను వేర్వేరుగా చూడలేం. బలమైన అనుమానాలున్నందునే సీబీఐ ముందుకెళ్లింది అని తెలిపారు.   హెటిరో హెల్త్‌కేర్‌లో కేంద్రం తనిఖీ చేసి ఇచ్చిన నివేదికలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలున్నాయి. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. వాటాలను విక్రయించుకోలేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయి. అందులోనూ ఈ కేసు ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్‌ల దశలోనే ఉంది. సీబీఐ పూర్తి విచారణ జరిపితేనే.. ఆధారాలతో కేసును రుజువు చేయగలదు. హెటిరో పెట్టిన పెట్టుబడులను సమర్థించుకోవడానికి వీలుగా విజయసాయిరెడ్డి డెల్లాయిట్‌ నుంచి పాత తేదీతో వాల్యుయేషన్‌ నివేదిక తెప్పించారు. వాటాల విక్రయానికి అవకాశం లేదని, లాభాలు లేవని.. అన్నీ తెలిసే ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి’ అని సీబీఐ న్యాయవాది వాదించారు. ‘భూకేటాయింపుల్లో పరిణామాలను బట్టి.. జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి. 2006 నవంబరులో రూ.2 కోట్లు, 2007 మార్చిలో హెటిరో రూ.3.88 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తదనుగుణంగా ఆ సంస్థకు 50 ఎకరాల భూకేటాయింపు జరిగింది. 2008లోనూ పెట్టుబడులు పెట్టిన తర్వాతే 75 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వంలో ఫైళ్ల కదలికను బట్టి పెట్టుబడులు వెళ్లాయి’ అని వాదించారు. హెటిరో కంపెనీ వ్యవహారాలతో.. డైరెక్టర్‌గా తన బాధ్యత లేదన్న శ్రీనివాసరెడ్డి వాదనను సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. డైరెక్టర్లందరినీ నిందితులుగా చేర్చలేదని, కీలక పాత్ర పోషించిన వ్యక్తినే చేర్చామన్నారు. నిబంధనల ప్రకారమే సీబీఐ కోర్టు అభియోగ పత్రాన్ని విచారణకు పరిగణించిందని, అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తామని హెటిరో తరఫు సీనియర్‌ న్యాయవాది హైకోర్టును కోరారు. 

కేసీఆర్ కు సినిమా కనిపిస్తోందా? ఓటమి భయం వెంటాడుతోందా? వరుస ప్రెస్ మీట్ల పరామర్థమేంటీ.. 

తెలంగాణ ముఖ్యమంత్రిలో గతంలో ఎప్పుడు లేనంతగా భయం కనిపిస్తోందా? ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందా? అంటే కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తున్న వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ లో గుబులు పెరిగిందని అంటున్నారు. ఈటల రాజేందర్ విజయం తర్వాత మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇకపై కేసీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని చెప్పారు. సంజయ్ చెప్పినట్లే ఇప్పుడు కేసీఆర్ కు సినిమా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.   కేసీఆర్ కు ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా పేరు పడింది. ఆయన సచివాలయం అసలే వెళ్లరు. ప్రగతి భవన్ లో ఉన్నా పాలన పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతి భవన్ కంటే ఫౌంహౌజ్ లోనే ఎక్కువ ఉంటారు. అందుకే విపక్షాలు కేసీఆర్ పై ఫౌంహౌజ్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేస్తుంటారు.  అయితే రెండు రోజులుగా కేసీఆర్ రూట్ మార్చారు. నెలల తరబడి జనంలోకి వెళ్లని గులాబీ బాస్.. రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. గంటల తరబడి మాట్లాడారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  కేసీఆర్ నెలల తరబడి మీడియా ముందుకే రారు. అలాంటిది వరసుగా రెండు రోజులు... అది కూడా రెండు గంటల పాటు మీడియాతో మాట్లాడటంతో.. ఆయనలో అంత మార్పు ఎందుకు వచ్చిందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ షేకవుతున్నారని, ఆయనలో ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఓటమి నుంచి బయటపడక ముందే వరి ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కడం గులాబీ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. వరి విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే రిపోర్టులు ప్రగతి భవన్ కు వెళ్లాయంటున్నారు. ఆ నివేదికలు చూసిన కేసీఆర్ అవాక్కయ్యారని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో వారంతా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గులాబీ బాస్ ను ఆటాడుకుంటున్నారు. దీంతో నిరుద్యోగుల ఓట్లపై కారు పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఉద్యోగ వర్గాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ తన ఆశలన్ని రైతులపైనే పెట్టుకున్నారు. నిజానికి రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలు ఇప్పటివరకు కేసీఆర్ కు సానుకూలంగా ఉన్నారు. 2018లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకమే ప్రధానమని అంటారు. అలాంటిది ప్రస్తుతం రైతులు కూడా కేసీఆర్ పై రగిలిపోతుండటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులంతా కేసీఆర్ పై తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తమ పంటను మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. వారం రోజులైనా ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వరి ధాన్యం కుప్పలపైనే గుండెలు పగిలి చనిపోతున్నారు. ఇదిలా ఉండగానే యాసంగిలో వరి పంట వేయవద్దంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల్లో మంట రాజేసింది. ఏడాది క్రితం మక్కలు వద్దు వరి పండించాలని పిలుపిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వరి ధాన్యం వద్దని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వరి వద్దంటే మరీ ఏం సాగుచేయాలని నిలదీస్తున్నారు. వరికి ఉరి వేస్తే.. కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఉరి వేస్తామంటూ శపథం చేస్తున్నారు అన్నదాతలు. రైతుల ఆందోళనలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్.. ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారని అంటున్నారు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగు పడినట్లు చరిత్రలో లేదు గతంలో చాలా సార్లు చెప్పారు కేసీఆర్. ఇప్పుడే ఆయన అన్నదాతల జీవితాలతో ఆటలాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ ను టెన్షన్ పెట్టిస్తుందని అంటున్నారు. అందుకే  ఆ గండం నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.  ఓటమి భయం వల్లే ఆయనలో అసహనం పెరిగిపోయిందని చెబుతున్నారు. రెండు రోజులుగా కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను బట్టి... వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి ఖాయమని ఆయన క్లారీటికి వచ్చారని అంటున్నారు.

విరాట్ కోహ్లీకి బైబై.. వరల్డ్ కప్ లో భారత్ చెత్త షో 

టీట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఇంటికి చేరింది టీమ్ ఇండియా. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ పేలవమైన ఆట తీరుతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. టాప్ ఫెవరెట్ గా దుబాయ్ లో అడుగు పెట్టిన కోహ్లీ సేన... దాయాది పాకిస్తాన్ చేతిలో తొలి మ్యాచ్ లోనే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తర్వాత కివీస్ తోనూ పరాజయం పాలై సెమీస్ ఆశలు చేజార్చుకుంది. చివరి మూడు మ్యాచ్ ల్లో పసికూనలపై ఘన విజయాలు సాధించింది కోహ్లీసేన. ట్వీటంటీ వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన టీమ్ ఇండియా.. ఇద్దరు ప్లేయర్లకు వీడ్కోలు పలికింది.  టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలింగ్‌లో ఆధిపత్యం కనబరిచిన భారత్‌ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా సెమీస్‌ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్‌-2 నుంచి పాక్‌, కివీస్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన కోహ్లీకి, హెడ్‌ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది.   నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియాను భారత్‌ బౌలర్లు 132/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగుల చేసి విజయం  గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 56,  కేఎల్‌ రాహుల్ 54 పరుగులు చేశారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు అర్ధశతక (86) భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైనా.. పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. అనంతరం సూర్యకుమార్ తో  కలిసి రాహుల్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. నమీబియా బౌలర్‌ ఫ్రైలింక్‌ ఒక వికెట్ తీశాడు.   నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్‌ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్‌ నికోల్‌ 5, స్మిత్ 9, ఫ్రైలింక్‌ 15*, రుబెన్ 13* పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు

తీన్మార్ మల్లన్నను జైలులో చంపాలని చూశారా? 

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పేరు హాట్ టాపిక్. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. గులాబీ లీడర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనుక ఎవరున్నారు..? ఏం చేశారు..? ఎంత నొక్కేశారు..? ఫుల్ డేటేల్స్ తో ప్రజల ముందు పేట్టేవాడు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ టీఆర్ఎస్ నేతలకు కంట్లో నలకలా చుక్కలు చూపించాడు. అంతేకాదు  నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి.. దాదాపుగా గెలిచినంత పని చేశారు తీన్మార్ మల్లన్న.  తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసుగా మారారని భావించిన కారు పార్టీ.. అతన్ని టార్గెట్ చేసింది. అప్పుడే లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకొచ్చింది. డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టులో మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్న జైలులో ఉండగా ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. ఆయనకు బెయిల్ రావడం కొత్త కేసులో మళ్లీ జైలుకు వెళ్లడం జరుగుతోంది. మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.  తాజాగా మరోసారి మల్లన్నకు బెయిల్ మంజూరైంది. 73 రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. జైలులో తనని చంపాలని చూశారని అన్నారు. చంచల్ గూడ జైలులో సీఎం కేసీఆర్ బాధితులు 500 మంది వరకు ఉన్నారని పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి ప్రశ్నించే గొంతుకను 73 రోజులు జైలులో పెట్టారని అన్నారు మల్లన్న. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆఖరికి బయటకొస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా.. 73 రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు లెక్కనా..? 33 కేసులు ఉన్నోడికి ఇంకో మూడు లెక్కనా..? అంటూ దీటైన సమాధానం ఇచ్చారు. తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన.. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకొచ్చానని వివరించారు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందన్న మల్లన్న.. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్లు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. తాను బయటకు రావాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారిపక్షాన పోరాడతానని చెప్పారు. ఎప్పటిలాగే క్యూన్యూస్ లో మార్నింగ్ న్యూస్ ప్రోగ్రాం చేస్తానని స్పష్టం చేశారు  తీన్మార్ మల్లన్న.