అఖిలేష్ సర్కార్‌కి రాష్ట్రపతి పాలన గండం?

      ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా వున్న ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం వుందని, త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా తీసుకుని కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   గత కొంతకాలంగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద  కొంతమంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. రెండు మూడు రోజులకోసారి మహిళల అత్యాచారం, హత్యలు మామూలైపోయాయి. వీటిని అరికట్టాల్సిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అత్యాచారానికి గురైన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు వున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన  విధించడంతోపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాలలో ఎన్డీయే కూటమి 78 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి యు.పి.లో ఎలాంటి చర్యలు చేపట్టినా మోడీ ప్రభుత్వానికి ఎదురు వుండే అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రంగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యం చాలా తక్కువగా వుందన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి అయితే ఉత్తర ప్రదేశ్‌ని ఏకంగా 5 రాష్ట్రాలుగా విభజించాలని గతంలో యు.పి. అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేయించారు. ఇప్పుడు యుపిని మూడు రాష్ట్రాలుగా విభజించడం పరిపాలన పరంగా మేలు జరగడమే కాకుండా, యు.పి.లో అరాచకాలను సమర్థంగా నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో వాహనాలకు ఇక ‘టిఎస్’ సిరీస్!

      తెలంగాణ రాష్ట్రంలో తిరిగే వాహనాల నంబర్లు మారనున్నాయి. ఇప్పుడున్న ‘ఎ.పి.’ పేరును తొలగించి ‘టి.ఎస్.’ అని మార్చుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు బుధవారం నుంచి ‘టి.ఎస్.’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇంకా విధి విధానాలను రూపొందించాల్సి వుందని, ‘ఎ.పి.’ నుంచి ‘టి.ఎస్.’కి మారడానికి వాహనానికి ఎంత ఖర్చు అయ్యేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త వాహనాలకు మాత్రం బుధవారం నుంచి టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యలు

      పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో పదిమంది తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. భారీ భద్రత వుంటుందని తెలిసి కూడా రెండుసార్లు కరాచీ విమానాశ్రయంపై దాడి చేసి మొత్తం 27 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటన భారత ప్రభుత్వంలో కదలిక తెచ్చింది.   కరాచీ ఎయిర్‌పోర్టు మీద జరిగిన తరహాలోనే ఢిల్లీలోని విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తదితర ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఒకవేళ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా సమర్థంగా తిప్పికొట్టాలన్న అంశం మీద వ్యూహరచన ఈ సందర్భంగా చేశారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.  

గంగలో ఉమ్మితే మూడు రోజుల జైలు!

      కేంద్ర ప్రభుత్వం కొత్తరకం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ చట్టానికి రూపకర్త అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చట్టం ఏంటంటే, భవిష్యత్తులో ఎవరైనా గంగానదిలో ఉమ్మినా, చెత్త వేసినా వారికి మూడు రోజుల జైలు శిక్ష పడుతుంది.   ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే గంగానదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఆయన ఆల్రెడీ వారణాశికి ఎంపీ కావడంతో ఈ విషయం మీద చాలా సీరియస్‌గా వున్నారు. గంగా ప్రక్షాళనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ని కూడా ఆయన సిద్ధం చేశారు. గంగానదిని శుభ్రం చేయడం, ముందుముందు కలుషితం కాకుండా చూడటం అంతవరకూ ఓకే. దానిని ఎవరూ కాదనరు. ఇంకా ఇంత మంచి పని చేస్తున్నందుకు హర్షిస్తారు. అయితే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరైనా గంగానదిలో చెత్త వేసినా, కనీసం ఉమ్ము ఊసినా వారికి మూడు రోజులు జైలు శిక్ష వేయాలన్న ప్రతిపాదనని ఆమె నరేంద్రమోడీ ముందు వుంచినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమాభారతి చేసిన ప్రతిపాదనను మోడీ ఆమోదించరాదని, ఇలాంటి చట్టం తేవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశం వుందని పలువురు అంటున్నారు. పొరపాటుగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఎవరైనా గంగాస్నానం చేస్తూ గంగా నది జలాన్ని నోట్లో పోసుకుని తుపుక్కున ఊయడానికి కూడా భయపడాల్సి వస్తుంది.  గంగానదిలో స్నానం చేస్తే పాపం పోవడానికి బదులు విచిత్రమైన అవమానాలు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది.

విశాఖలో నేడు మంత్రివర్గ సమావేశం

  ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖనగరంలో గల ఆంద్ర విశ్వవిద్యాలయంలో జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొద్ది సేపటిలో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా సింహాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకొంటారు. ఆ తరువాత అక్కడి నుండి ప్రభుత్వ అతిధి గృహం చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని ఆంద్ర విశ్వవిద్యాలయంలోగల టీ.యల్.యన్. రెడ్డి సమావేశ మందిరం చేరుకొని మంత్రివర్గం సమావేశం మొదలుపెడతారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సమావేశం జరుగుతుంది. ఈరోజు సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీకి కమిటీ ఏర్పాటు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం, ప్రభుత్వపాలనా విధానం, ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనే మార్గాలు, కొత్త రాజధాని నిర్మాణం, కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని నియామకం వంటివి చర్చకు రావచ్చును. మంత్రివర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ ప్రభుత్వ అతిధి గృహానికి చేరుకొని అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి తిరిగి హైదరాబాదు చేరుకొంటారు.

పొన్నాలపై కోమటిరెడ్డి ఫైర్

  మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ కమిటీ హాల్‌లో బుధవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభం నుంచి గరమ్ గరమ్‌గా వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదును చూసుకుని టీపీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పొన్నాల సీఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించడం తాను భరించలేనని అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి విమర్శించారు. ఓటమికి బాధ్యత వహించి పొన్నాల తన పదవి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు.

గవర్నర్ ప్రసంగం చప్పగా వుంది: ప్రతిపక్షాలు

  తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చప్పగా వుందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ ప్రసంగం, కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేలా లేవని ప్రతిపక్షాలు విమర్శించాయి. కెజి నుండి పిజి వరకు విద్యపై మార్గదర్శకాలు లేవన్నారు. గవర్నర్ ప్రసంగంతో రైతులకు నిరాశే అన్నారు. రుణమాఫీ పైన నిర్దిష్ట ప్రణాళికలు లేవన్నారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలనే గవర్నర్‌తో మరోసారి చదివించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రకటనలపై స్పష్టత వస్తుందని ఆశించామని అయితే, ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. గవర్నర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారాలా వుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదన్నారు. ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌పై మాటల ‘దాడి’: పార్టీకి గుడ్ బై

  వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు మాటల దాడి చేశారు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. విజయమ్మ గెలుపు కోసం జగన్‌ది నియంతృత్వ ధోరణి అని, వైసీపీ ఓటమికి కారణం కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పార్టీలో అసలు కమిటీలే లేవన్నారు. అసలు పార్టీకి విధివిధానాలే లేవని ధ్వజమెత్తారు. జగన్ పెద్ద పెద్ద మాటలు విని ఆయన మారిపోయాడని నమ్మి తాను మోసపోయానని అన్నారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్‌కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.

స్కాం ఇండియా నుంచి స్కిల్ ఇండియాకి: మోడీ

  ఇండియా మొన్నటి వరకూ స్కాముల మయమైపోయింది. స్కామ్ ఇండియాగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియాని స్కామ్ ఇండియా నుంచి స్కిల్ ఇండియాగా మార్చడమే తన స్వప్నమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం నాడు ఆయన లోక్‌సభలో స్ఫూర్తిదాయమైన ప్రసంగం చేశారు. యువతలో స్కిల్ పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పేదవారిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురాగలనన్న నమ్మకం తనకు వుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్‌ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

వైకాపాలో చేరినందుకు చింతిస్తున్నా: దాడి

  తెదేపాతో ముప్పై ఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచుకొని గతేడాది వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు, పట్టుమని ఏడాది తిరగకుండానే వైకాపా ను ఈరోజు వదిలించుకొని బయటపడ్డారు. వైకాపాలో చేరి ఘోర తప్పిదం చేసానని, ఇప్పుడు ఆ తప్పు సవరించుకొనేందుకే ఈరోజు పార్టీకి తను, తన కుటుంబ సభ్యులు రాజీనామా చేస్తున్నామని మీడియాకు తెలియజేసారు.   ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు. “జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు. ఆయనకి పార్టీ నేతలెవరినీ సంప్రదించే అలవాటు లేదు. ఎవరి సలహాలు వినే అలవాటు అసలే లేదు. తనకు తోచిన నిర్ణయాలు తీసుకొంటారు. నేను జైల్లో చూసిన జగన్ వేరు. ఇప్పుడు కనబడుతున్న జగన్ వేరు. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నారు గనుక ఆయనలో చాలా మార్పు వస్తుందని అందరం భావించాము. కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. జైలు నుండి వచ్చిన తరువాత కూడా ఆయన అదే అహంకారం ప్రదర్శించడం చూసి అందరం చాలా ఆశ్చర్యపోయాము."   "ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను నిర్ణయించే విషయంలో కూడా ఆయన ఎవరి మాట వినలేదు. తనకు నచ్చిన వారిని నిలబెట్టారు. జైలులో పరిచయమయిన వ్యక్తులకు టికెట్స్ ఇచ్చి తను ఎవరిని నిలబెట్టినా ప్రజలు గుడ్డిగా నమ్మి వారికే ఓటేస్తారనే అహం ప్రదర్శించారు. ఆయన తీరు చూసి పార్టీలో నేతలే కాదు ప్రజలు కూడా చాలా భయపడ్డారు. అందుకే ఎన్నికలలో వైకాపాను ఓడించారు. అటువంటి నిరంకుశుడు, అహంకారం కలవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తోంది. అందుకే ప్రజలు అయనకు ఓటేయకుండా చాలా విజ్ఞత ప్రదర్శించారు."   "నిజానికి ఆయన తన తల్లిని, చెల్లిని కూడా విశ్వసించరు. తన చెల్లి షర్మిలకు టికెట్ ఇస్తే ఆమె తనకు ఎక్కడ పోటీగా తయారవుతుందో అనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా తల్లికి ఇచ్చేరు. అయినప్పటికీ ఆయన తన తల్లి కూడా ఎన్నికలలో గెలవాలని మనస్పూర్తిగా కోరుకోలేదు, ప్రయత్నించాను లేదు. అందుకే ఆమె కూడా ఓడిపోయారు. స్వంత తల్లిని, చెల్లినే నమ్మని వ్యక్తి ఇక పార్టీలో నేతలను ఎందుకు నమ్ముతారు? అటువంటి వ్యక్తిని ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు?పార్టీలో ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయాలి తప్ప స్వంత ఆలోచనలు చేయడానికి వీలులేదు. మేము ఎన్నికల సమయంలో ఆయనకీ కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ ఆయన మా మాటలను ఎన్నడూ ఖాతరు చేయలేదు."   "అసలు పార్టీని ఎలా నడపాలో తెలియని ఆ వ్యక్తి, ఎంత కాలం పార్టీని నడుపుతారో, అసలు నడుపుతారో లేక మూసేసివెళ్లిపోతారో లేకపోతేవేరే ఏదయినా పార్టీలో కలిపేస్తారో ఎవరికీ తెలియదు. అందువల్ల పార్టీలో కార్యకర్తలు,నేతలూ అందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలని నా సలహా. నియంతృత్వ పోకడలు పోతున్న జగన్మోహన్ రెడ్డి క్రింద ఇక ఎంతమాత్రం పనిచేయడం అసంభవమని గ్రహించినందునే నేను, నా కుటుంబ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ప్రస్తుతం నేను ఏ పార్టీలోను చేరబోవడం లేదు. కొంతకాలం తరువాత తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.

కేసీఆర్ శ‌ృంగారపురుషుడు: వర్మ ట్విట్

  తన ‘ఐస్ క్రీం’ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది కదా.. అందుకే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రంగంలోకి దిగాడు. ఏదోరకంగా వార్తల్లోకి వచ్చే తన పథకంలో భాగంగా ట్విట్టర్‌లో ట్విట్లు చేయడం ప్రారంభించాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్లలో కేసీఆర్ని టార్గెట్ చేశాడు. ఆ ట్విట్లు ఎలా వున్నాయో చూడండి.   1. టీఆర్ఎస్ ఆఫీస్ అవతల కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకున్నామని చాలా మంది అమ్మాయిలు నాతో అన్నారు. రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారు.   2. అతిపెద్ద కేసీఆర్ విగ్రహాలు, హోర్డింగ్‌లతో హైదరాబాద్ పట్టణం సుందరంగా ఉంటుంది అని ఓ కాలేజీ అమ్మాయి నాతో అంది.   3. కేసీఆర్ ను మహిళలు ప్రేమించడం విషయం మీద నాకు ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. ఎక్కువ మంది మహిళలు అధికారాన్ని ప్రేమిస్తుంటారని.. అందుకే కేసీఆర్‌ని ప్రేమించి ఉంటారని అనుకుంటున్నా.   4. కేసీఆర్ అంటే తనకి చెప్పలేనంత ఇష్టమని.. హైదరాబాద్ సిటీలోనే అంత అందగాడు ఉండరని మరో అమ్మాయి నాతో అంది.   5. హైదరాబాద్‌లోని ఉద్యానవనం లాంటి అద్భుతమైన కేసీఆర్ ముఖాన్ని ఇప్పటివరకు నేను చూడలేదు. కేసీఆర్ ముఖాన్ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోరు. చివరికి గజనీ కూడా గుర్తుంచుకుంటాడు.

దేవాలయ పరిరక్షణపై లఘు చిత్రోత్సవం

  దేవాలయ పరిరక్షణ అంశంపై అంతర్జాయతీయ లఘు చలన చిత్రోత్సవం ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో జరగబోతోంది. ఈ విషయాన్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ (యుఎస్ఎ) సంస్థల ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రోత్సవం జరుగుతుందని సంస్థల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశరావు, సాంస్కృతిక ప్రచార సారథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిథిలావస్థలో వున్న దేవాలయాలను పరిరక్షించడం, సనాతన ధర్మ రక్షణ ఇలా ఎన్నో అంశాలపై ప్రజలకు అవగాహహన కల్పించే నిమిత్తం ఈ లఘు చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. చిత్రోత్సవంలో ప్రదర్శించే లఘు చిత్రం నిడివి 10 నుంచి 12 నిమిషాల మధ్య మాత్రమే వుండాలని, ఏ భాషలో నిర్మించినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరిగా వుండాలని తెలిపారు. తమకు ఎంట్రీగా వచ్చిన లఘు చిత్రాలలో 40 లఘు చిత్రాలను ఆగస్టు 22, 23, 24 తేదీలలో హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో ప్రదర్శిస్తామని చెప్పారు. ఉత్తమ లఘు చిత్రానికి లక్ష రూపాయల నగదు, బంగారు గోమాత, ద్వితీయ ఉత్తమ లఘు చిత్రానికి 75 వేల రూపాయలు వెండి గోమాత, తృతీయ ఉత్తమ లఘు చిత్రానికి 50 వేల నగదుతోపాటు కంచు గోమాతని ఇస్తామని, ఇంకా ప్రోత్సాహక బహుమతులు కూడా వుంటాయని నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం www.savetemples.orgని సంప్రదించవచ్చు.

డిప్యూటీ కూడా మాదే: కేసీఆర్ పట్టు!

  స్పీకర్ పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి ప్రతిపక్షాలు సహకరిస్తే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది సత్సంప్రదాయం. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో విపక్షాలు సహకరించాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రెండు పదవులూ తమవే అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలకు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ప్రతిపక్షాలు ముఖం పావలా అంత చేసుకున్నాయి. ఏం చేస్తారు.. టైమ్!

మహారాష్ట్ర హోం మంత్రి నోటిదురద!

  ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళని కొంతమంది దుండగులు మానభంగం చేసి చెట్టుకి ఉరివేసి చంపిన ఘటన జరిగినప్పటి నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మానభంగాల పరంపర జరుగుతూనే వుంది. మానభంగాల పరంపర సంగతి అలా వుంచితే, మానభంగాల మీద పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు కడుపు మండేలా చేస్తున్నాయి. మానభంగాలు జరగని రాష్ట్రం ఏదైనా వుందా అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా కాజువల్‌గా అనేశాడు. దాన్ని చూసి చాలామంది రాజకీయ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అధికార పార్టీ నాయకులు మానభంగాల అంశంలో మహిళలదే తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇది చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ఆయన నోటి దురద ప్రకారం మానభంగాలని ఆపడం ఎవరి తరం కాదు. ఇంటికో పోలీసుని కాపలాగా పెట్టినా అత్యాచారాలు ఆపలేమట. అంతే కాకుండా అత్యాచారాలు పెరగడానికి మహిళల అశ్లీల చిత్రాలే కారణమట. ఆర్.ఆర్. పాటిల్ చేసిన ఈ విచిత్రమైన కామెంట్ల మీద కూడా దుమారం రేగుతోంది.

సోనియాపై అమెరికా కేసు క్లోజ్!

  అధికారం పోయిన దిగులులో వున్న సోనియాగాంధీకి కొంచెం రిలీఫ్ వచ్చింది. సోనియాగాంధీ మీద అమెరికాలో నమోదైన కేసును అక్కడి కోర్టు కొట్టేసింది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించి సోనియా గాంధీకి కూడా భాగస్వామ్యం వుందని పలు ఆరోపణలు చేస్తూ సిక్కుల హక్కుల సంస్థ సోనియాగాంధీ మీద అమెరికా కోర్డులో కేసు దాఖలు చేసింది. సోనియాగాంధీ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత సోనియాగాంధీకి సంబంధించిన పాస్‌పోర్టు వివరాలు, ఆమె ఎక్కడెక్కడికి ప్రయాణించిందనే వివరాలు ఇవ్వాలంటూ ఆమధ్య అమెరికా కోర్డు సోనియాని ఆదేశించింది. దానికి సోనియా తన పాస్‌పోర్టు వివరాలు ఇవ్వలేనని, అది తన భద్రతకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం వుందని బదులు ఇచ్చారు. ఈ కేసు సోనియాని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే ఇప్పుడీ కేసును కొట్టివేస్తూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విషయంలో సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాఖలు

  నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయశాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక, ఇతరులకు కేటాయించని శాఖలు, కేఈ కృష్ణమూర్తి - ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్.చినరాజప్ప - ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ, యనమల - ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు, అయ్యన్నపాత్రుడు - పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఉపాధిహామీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - పర్యావరణ, అటవీశాఖ, సైన్స్, టెక్నాలజీ, దేవినేని ఉమామహేశ్వరరావు - భారీ నీటిపారుదల, డాక్టర్ నారాయణ - పురపాలకశాఖ, పరిటాల సునీత - పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖలు, ప్రత్తిపాటి పుల్లారావు - వ్యవసాయశాఖ, మార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, కామినేని శ్రీనివాస్ - వైద్య,ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ, గంటా శ్రీనివాసరావు - విద్యాశాఖ, పల్లెరఘునాథరెడ్డి - సమాచార, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ, పీతల సుజాత - స్త్రీ, శిశు సంక్షేమశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ, అచ్చెనాయుడు - కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ, సిద్ధా రాఘవరావు - రవాణా, ఆర్ అండ్ బీ, కిమిడి మృణాళిని - గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ పారిశుద్ధ్యశాఖలు, కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమ శాఖ, చేనేత, ఎక్సైజ్ శాఖలు, రావెల కిషోర్‌బాబు - సాంఘిక , గిరిజన సంక్షేమ శాఖలు, మాణిక్యాలరావు - దేవాదాయశాఖ.