Rohit Sharma

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

  భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది.  భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు.  ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రోహిత్ శర్మ తల్లిదండ్రులు నేడు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. రోహిత్ శర్మతో పాటు అతడి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు మైదానం మధ్యలో నుంచి రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌లతో పాటు రోహిత్‌ సతీమణి రితికా సజ్దే పాల్గోన్నారు

CM Chandrababu Naidu

భారత సైనిక దళాలను చూస్తే గర్వంగా ఉంది : సీఎం చంద్రబాబు

    విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త 'తిరంగ యాత్రలో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు మన దేశాన్ని, మనల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆపరేషన్ సిందూర్ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.  అంతా గర్వించదగ్గ దళాలు మనకుండటం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతంవారే కావడం మన అదృష్టం. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తోంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే, టీడీపీ బీజేపీ, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.

Dhanunjaya Reddy

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు విచారణలో భాగంగా ప్రశ్నించిన అధికారులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. రేపు వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి సాయంత్రం వరకు వారిని అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు ఉండటంతో.. ఈ మూడు రోజులు వారిని సిట్ ఆఫీసులో విచారించారు. సుప్రీం విధించిన గడువు ముగియడంతో కొద్దిసేపటి క్రితం వారిని అరెస్ట్ చేశారు అధికారులు. ఈ ఉదయం వీరిద్దరు దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

CM Chandrababu

విశాఖలో యోగా డే రికార్డు సృష్టిద్దాం : సీఎం చంద్రబాబు

  విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్‌ చేసిన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని, ఆర్‌కే బీచ్‌ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.  యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..

Lecturer post

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

  ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలలు కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది.  కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, టీటీడీ పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.  

BRS Party

హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ..సడెన్‌గా అమెరికాకు కవిత గులాబీ పార్టీలో గుబులు

  బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు  నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారిద్దరూ సుమారు  2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్ రావు తండ్రి ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు.  ఈ క్రమంలో హరీశ్ రావు ఇంటికి వచ్చిన కేటీఆర్ అక్కడ సుమారు 2 గంటల పాటు హరీశ్ రావుతో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, గులాబీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత పరిస్తితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల హరీశ్ రావుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు క్లారీటీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తానని ఇటీవలే హరీశ్ రావు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.  మరోవైపు మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళనున్నారు. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కవిత సైతం సొంత పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని  కవిత  హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేటీఆర్ భేటీ కావడం పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.

ed petition to inquire rajkesireddy

రాజ్ కేసిరెడ్డి విచారణకు ఈడీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ కేసులో కింగ్పిన్ గా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డిని విచారణకు అనుమ తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇక నేరుగా రంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే  ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు సిద్ధమౌతోంది. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు  అనుమతి ఇవ్వాల్సిందిగా విజయవాడ ఏసీపీ కోర్టులో ఈబీ పిటిషన్ దాఖలు చేసింది.   మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కేశినెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (మే 16) విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన న్యాయవాది ఏకంగా కోర్టులోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కేసిరెడ్డిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కోర్టులోనే రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారన్న అభిప్రాయం పరిశీలకులలో  వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు రెడీ అవుతుండటంతో  ఇక ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో  ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనీ, సంచలన అరెస్టులు జరుగుతాయనీ అంటున్నారు.  

Tirumala

శ్రీవారికి సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల బంగారు ఆభరణాలు విరాళం

  తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇవాళ ఉదయం  సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి  శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు

cbi court rejects gali plea

ప్రత్యేక సదుపాయాలకు కోర్టు నో.. గాలి సాధారణ ఖైదీయే!

ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని  నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను  తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచల్ గూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు.   మాజీమంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే  నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందున దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దైపోయింది.  ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసి పుచ్చింది. నేరం రుజువై, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలూ కల్పించడం కుదరదని సీబీఐ కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి చెంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చెంచల్ గూడ జైలులోని ఇతర సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫారంనే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. 

CM Revanth Reddy

మంత్రులు ఎంతెంత కమీషన్ తీసుకున్నారో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి డిమాండ్

  మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని  స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వమంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  18 నెలల రేవంత్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కేంద్రమంత్రి వెల్లడించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. దాయాదుల దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.   

Kakani Govardhan Reddy

కాకాణికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరణ

  క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై  ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మాజీ మంత్రి కాకాణి   కోసం పోలీసులు గాలిస్తున్నారు.  క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు.  ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

supreme court dismiss anticipatory bail petition of fhanunjatreddy

ఇక ఆ ఇద్దరూ కూడా అరెస్టే!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే  మాజీ సీఎం జగన్  మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఇప్పటి వరకూ సుప్రీం కోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ ఉంది. అయితే వారి యాంటిసిపేటరీ బెయిలును తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ సమయంలో వీరికి యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. ఇరువురి ముందస్తు బెయిలు  పిటిషన్లను కొట్టివేసింది.  దనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఈ దశలో బెయిలు ఇవ్వడం దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే అవుతుందని అభిప్రాయపడింది.   ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరిరువురూ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీంకు వెళ్లారు.  వీరి బెయిలు పిటిషన్లను శుక్రవారం (మే 16) విచారించిన సుప్రీం కోర్టు బెయిలు నిరాకరించింది.  ఇదే కేసులో గతంలో సుప్రీం కోర్టు వీరిని శుక్రవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ దర్యాప్తు సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిలు నిరాకరించడంతో  వీరి అరెస్టు తధ్యమని అంటున్నారు.  

another case on vallabhaneni vamshi

వల్లభనేని వంశీ... అయ్యో పాపం అనే నాథుడే లేడు!

  చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు వంశీ గత 95 రోజులుగా రిమాండ్ ఖైదీగగా జైలులో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో ఒకటి రెండు సార్లు జైలు నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా గురువారం (మే 16) కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన జైలుకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటి నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసు తరువాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం ఐదు కేసులలో నాని నిందితుడు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే విషం కక్కారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకే సారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదౌతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదో కొద్ది మంది అనుచరులు వినా ఆయనకు మద్దతుగా మాట్లాడే వారే కరవయ్యారు. ఇదంతా వంశీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయమే సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకూ వ్యక్త అవుతోంది.  రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్ట కాలంలో ఉండగా కాడె వదిలేసి అధికారపార్టీ పంచన చేరిన వంశీ.. అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు  తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే 2024 ఎన్నికల నాటికే ఆయన జనం మద్దతును సానుభూతినీ కోల్పోయారు. ఇక ఓటమి తరువాత నియోజకవర్గానికి ముఖం చూపిన పాపాన పోలేదు. అసలు దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లుగా ఆయన కనిపించలేదు. వినిపించలేదు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయన కటకటాల వెనుకే ఉన్నారు.  అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్య‌క్తికి సంబంధించిన ఇంటి వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. వాటితో స‌ద‌రు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు వంశీ స‌హ‌క‌రించారని కేసు న‌మోదైంది. ఇలా వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసుల్లో వంశీకి బెయిలో, ముందస్తు బెయిలో లభించింది. ఇక ఆరో కేసులో అంటే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిలు పిటిషన్ పై శనివారం ( మే 17)న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆ కేసులో కూడా వంశీకి బెయిలు వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులూ వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సపోజ్, ఫర్ సపోజ్ బెయిలు వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.   నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశిం చింది. అయితే వంశీని ఈ కేసులో శనివారమే పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు.  వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు వినవస్తున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. 

indias Homeland defense capability threataning americ

ట్రంప్ ను భయపెడుతున్న భారత్ స్వదేశీ రక్షణ సామర్ధ్యం

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్  సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.  ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పల్లో నిజముందో లేదో వేరే చెప్పవలసిన అవసరం లేదు.అగ్రరాజ్యం అధ్యక్షుడు అంతటివాడు చెప్పిన విషయాన్నే ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు అంటేనే, అందులో నిజం లేదని అర్థమౌతోందని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు.  నిజానికి  ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందే నిజం అయితే..  అందుకు సంబంధించి ఉభయ దేశాలు సంయుక్త ప్రకటన చేయాలి.  కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ అమెరికా ప్రభుత్వం అయినా ఒక అధికారిక ప్రకటన చేసిందా అంటే అదీ లేదు.  ట్రంప్  స్వయంగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో అదే స్వరం ఎత్తుకున్నారు. మరో వంక కాల్పుల విరమణకు భారత్  పాకిస్థాన్ దేశాలు రెండూ అంగీకరించినా, అమెరికా  పాత్రను ఒక్క పాక్ మాత్రమే ప్రస్తావించింది.  భారత దేశం ఆ ప్రస్తావన చేయలేదని  అమెరికా పత్రికలే పెద్ద అక్షరాల్లో రాశాయి. అవును. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన వెంటనే అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్, అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. భారత్-పాకిస్థాన్ అధికారులు కాల్పుల విరమణను ధ్రువీకరించారు. అయితే.. పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రస్తావించింది  అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అంటే  ట్రంప్  క్లెయిమ్’ ను భారత దేశం అంగీకరించలేదనే నిజాన్ని అమెరికా పత్రిక స్పష్టం చేసింది. అయినా.. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నవ్వి  పోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా పదే పదే కాల్పుల విరమణ తన ఘనతేనని చాటుకుంటున్నారు. చాటింపు వేస్తున్నారు. నిజానికి అప్పుడే కాదు, ఇప్పటికీ భారత దేశం అమెరికా మధ్యవర్తిత్వం వాదనను  ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాదు, భారత్, పాకిస్థాన్ దేశాల డీజీఎంవోల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే కాల్పుల విరమణ నిర్ణయం జరిగిందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.  అలాగే.. భారత విదేశాంగ శాఖ అధికారికంగానే జమ్మూ కశ్మీర్  విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించేది లేదని ప్రకటించింది. నిజానికి  భారత విదేశాంగ  మంత్రి జై శంకర్  పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. కుండ బద్దలు కొట్టేశారు. మరోవంక  భారత దేశం తాత్కాలిక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది. అందుకే.. ఇప్పుడు తాజాగా  కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించాలని, ఉభయ దేశాల సైనిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పొడిగింపు క్రెడిట్  కూడా అగ్ర రాజ్య అధినేత ట్రంప్   తమ ఖాతాలో వేసుకుంటే వేసుకోవచ్చును కానీ..  కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు  వ్యవహారం గానీ, సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారత  దేశం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాక్  కాళ్ళ బేరానికి వచ్చిన తీరును గానీ, గమనిస్తే ట్రంప్ సార్  గప్పాల ఘన కీర్తి ప్రపంచానికి తేట తెల్లంగా తెలిసి పోయింది.   అయినా..  భారత దేశం మాటల ద్వారా, చేతల ద్వారా ఎంతగా స్పష్టం చేసినా..  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మాత్రం అదే పాట పాడుతున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని  పదే పదే చెప్పుకుంటున్నారు. ఒకే అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అవుతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. ట్రంప్ నిరాధార ప్రకటనలతో ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. అయితే..  అగ్ర రాజ్యాధినేత  ట్రంప్ ఎందుకు ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లే వేస్తున్నారు? ఎందుకు,  ఆ క్రెడిట్ కోసం అంతలా ఆరాట పడుతున్నారు?  అంటే..  అందుకు  ట్రంప్ వ్యహార సరళి, అగ్ర రాజ్య అహంకారంతో పాటుగా వచ్చిన వ్యక్తిగత దురహంకారం  సహా  ఇతర కారణాలు కూడా ఉంటే ఉండవచ్చును.  కానీ, మూడు రోజుల మినీ వార్’ ద్వారా భారత దేశం సైనిక సామర్ధ్యాన్ని ప్రపంచం ముందుంచింది. ఆర్థిక ప్రగతితో పాటుగా భారత దేశం సైనిక శక్తిగా ఎదుగుతున్న తీరు ప్రపంచం  కళ్లారా చూసింది. స్వదేశీ సాంకేతిక, సాయుధ శక్తిని ప్రపంచాని తెలిసింది. భారత దేశం సైనిక శక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అ త్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో, రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ, శక్తి సామర్ధ్యాలు ప్రపంచం కళ్లకు సాక్షాత్కరించింది.  నిజానికి, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగలేదు. కానీ.. ఆపరేషన్ సిందూర్,  మూడు రోజుల మినీ వార్ ప్రపంచానికి  భారత దేశ శక్తి సామర్ధ్యాలను చాటి చెప్పింది. ఒక విధంగా అగ్ర రాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే..  ట్రంప్  భారత దేశం అజేయ శక్తిగా ఎదుగుతున్న నిజాన్ని జీర్ణించుకోలేక, అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా భారత రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి..  తద్వారా  భారత్ శక్తి సామర్ధ్యాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు  ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కు వంత పాడుతున్నాయి. భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.?  అలాగే ఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జైహింద్  ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే..  నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా..  మెల్ల మెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్ధ్యం, ఆధునిక సాంకేతిక సామర్ద్యాలతో  భారత్ అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఆ నిజమే అగ్రరాజ్య అధినేతను భయపెడుతోంది. అందుకే ట్రంప్  బడాయి మాటలకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

jagan purchase iphone

ఐ బాబోయ్ జగన్.. బినామీ పేరుతో సిమ్ కార్డు.. సిగ్నల్ యాప్ లో సీక్రెట్ చాట్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం.  జగన్ ఫోన్లు, యాప్ లు, గాడ్జెట్ల వాడకం తనకు ఇష్టం ఉండదని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించననీ, తేనకు అసలు ఫోనే లేదనీ, ఇక నంబర్ ఎక్కడ నుంచి వస్తుందనీ పలు సందర్భాలలో చెప్పుకున్నారు. సీఏంగా ఉన్న ఐదేళ్లూ, పరాజయం తరువాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తరువాత చాలా రోజుల వరకూ ఫోన్ జోలికి వెళ్లని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కుని దానితో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తం అవుతాయి. అలాగే వ్యక్తం అవుతున్నాయి కూడా. ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ కు ఎందుకు మారిపోయింది అంటే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తరువాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్టౌతున్నారు. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ అరెస్టయ్యారు. వీరిలో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవిత కాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్టయ్యారు. దీంతో  మద్యం కుంభకోణం తీగలు కదిలాయి.. ఇక తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడమే తరువాయి అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.  జగన్ హయాంలో సీఎంవోలో చేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా నోటీసులు అందుకుని విచారణకు హాజరౌతున్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు? అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది? ఎవరేం చెబుతున్నారు? ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరం అని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లూ లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారంటున్నారు.   భద్రతా పరంగా ఐఫోన్ మిన్న అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారనీ, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారనీ తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా చేసిన ఛాట్ నిర్దుష్ట సమయం తరువాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. పూర్తిగా ఎరైజ్ అయిపోతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరైజ్ అయిపోవాలన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఎ రకంగా చూసినా ఇది  సేఫ్ అని భావించడం వల్లనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు అవసరమై సమయంలో అవసరమైన మేరకు చాటింగ్ చేసి.. ఆ వెంటనే ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో జగన్ సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారంటున్నారు.  సిగ్నల్ యాప్ ద్వారా చేసిన చాటింగ్ ట్రేస్ చేయడానికి సాధ్యం కాదనీ, ఎక్కడా సేవ్ కాదనీ చెబుతున్నారు.  అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని మద్యం కుంభకోణం దర్యాప్తు అధికారులు కూడా ధృవీకరించారు. కేవలం సిగ్నల్ యాప్ మాత్రమే కాకుండా ఫేస్ టైం యాప్ ద్వారా కూడా జగన్ మాట్లాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జగన్ ఐఫోన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు, నిందితుల విచారణ తదితర వివరాలను మినిట్ టు మినిట్ తెలుసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ వాడుతున్న ఐఫోన్ సిమ్ కార్డు ఆయన  పేరు మీద కాకుండా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బినామీ పేరు మీద తీసుకున్నారనీ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  

టర్కీకి భారత్ ఝలక్.. సెలిబి యేవిషేషన్ భద్రతా అనుమతులు రద్దు

నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది.  ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అపత్సమయంలో ఆపన్న హస్తం అందించిన భారత్ విషయంలో టర్కీ వ్యవహరించిన తీరుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియాలో అయితే టర్కీ ఉత్పత్తులు, కంపెనీలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది.  ఇప్పుడు తాజాగా పాలు పోసిన చేతినే పాములా కాటేసిన టర్కీకి ఇండియా గట్టి గుణపాఠం చెప్పింది.  టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. టర్కీకి చెందిన సెలిబి ఏవియేషన్ సంస్థ భారత్ లోని తొమ్మిది   విమానాశ్రయాలలో  హై సెక్యూరిటీ పనులను  నిర్వహిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భద్రతా అనుమతిని భారత ప్రభుత్వం రద్దు చేసింది.  ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ చర్య తీసుకుంది. అంతే కాదు ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలను తెంచుకోబోతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తొట్టతొలిగా  జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.   1958లో స్థాపించబడిన సెలెబి కంపెనీ... టర్కీలో మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ.  ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 70 విమానాశ్రయాలలో తన సేవలను అందిస్తున్నది. భారత్ పాకిస్థాన్ మథ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో  దేశవ్యాప్తంగా    బాయ్‌కాట్ టర్కీ  అన్న నినాదం జోరందుకుంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన సెలిబి యేవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేయడం అంటే ముందు ముందు ఆ దేశంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంబంధాలనూ రద్దు చేసేకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మధ్యప్రదేశ్ మంత్రికి సుప్రీం చీవాట్లు !

విజయ్‌ షా, బీజేపీ నాయకుడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అంతే, అయితే ఆయన గురించి చెప్పుకోవలసిన అవసరం వచ్చేది కాదు.కానీ.. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశించి ఉగ్రవాదుల సోదరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టాయి. దేశానికి తలవంపులు తెచ్చాయి. అవును.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టటమే కాదు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపే సీనియర్ నాయకురాలు ఉమా భారతి అన్నట్లుగా దేశం మొత్తానికి తలవంపులు తెచ్చాయి.  రెండు రోజుల కిందట ఇండోర్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ప్రధాని మోదీపై  మంత్రి విజయ్ షా పొగడ్తల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా.. అదే క్రమంలో   పహల్గాంలో ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుట సిందూరాన్ని తుడిపి వారిని వితంతువులను చేస్తే.. ప్రధాని మోదీ వాళ్ల(ఉగ్రవాదుల)మతానికే చెందిన సోదరిని విమానంలో పంపి ఉగ్రవాదులను మట్టుబెట్టించారు  అని అన్నారు.  విజయ్‌ షా చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే రాజకీయంగానూ దుమారం సృష్టించాయి. కాంగ్రెస్ తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు కూడా ఈ అంశంపై స్పందించాయి. విజయ్‌షా వ్యాఖ్యలను క్యాన్సర్‌తో పోల్చిన హైకోర్టు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో మధ్య ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. దీంతో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ మంత్రి విజయ్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌  గురువారం (మే 15) విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంత్రిని తీవ్రంగా మందలించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కర్నల్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవిగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.  మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు?  మీరు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి అంటూ మందలించారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. అదలా ఉంటే బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడం, కనీసం సంజాయిషీ అయినా అడగక పోవడం  మరింత వివాదంగా మారింది. అంతే కాదు, ఒక్క ఉమాభారతి మినహా  మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు ఎవరూ కూడా విజయ్‌షా వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే  సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన నేపధ్యంలో  విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో విజయ్‌ షా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సోఫియా ఖురేషీని కలలో కూడా అవమానించననీ, తన సొంత సోదరి కంటే ఎక్కువుగా ఆమెను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. సోఫియా ఖురేషీ దేశానికి చేసిన సేవలకు ఆమె సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే పది సార్లు క్షమాపణ చెప్పడానికైనా తాను సిద్ధమని వివరణ ఇచ్చారు. మరోవంక కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాను ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం విజయ్ షా పై చర్యలు తీసుకుంటుందా?  లేదా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే దెశ వ్యాప్తంగా మఖ్యంగా  బీజేపీ సాధారణ కార్యకర్తలు మొదలు సీనియర్ నాయకులు వరకు ప్రతి ఒక్కరు, విజయ్ షా పై పార్టీ, ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కన్ఫూజన్ లో కాంగ్రెస్.. తప్పులో కాలేసిందా?

పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ  ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై  నిలిచింది. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ, అనంతర పరిణామాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ మద్డతు ఉంటుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ప్రకటించారు.  నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పహల్గామ్   దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్‌కు తగిన గుణ పాఠం  చెప్పవలసిన సమయం ఆసన్నమైందని తీర్మానంలో పేర్కొంది. అలాగే..  ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తీర్మానంలో పేర్కొంది. కేవలం తీర్మానం చేయడం మాత్రమే కాదు, ఆచరణలోనూ నిబద్దత చూపింది. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న  పహల్గాం దాడి  సంఘటనలో  భద్రతా లోపాలు వంటి వైఫల్యాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజ్ఞత చూపింది. సమన్వయంతో వ్యవహరించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాయి. అంతవరకు అంతా బాగుంది.  అయితే.. ఎప్పుడైతే కాల్పుల విరమణ అంశం తెరపైకి వచ్చిందో, అక్కడి నుంచి కథ అడ్డ తిరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  అతి ఉత్సాహంతో చేసిన ప్రేలాపనలు  కాంగ్రెస్ పార్టీకి  ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు అస్త్రాన్ని అందిచాయి. ఇక అక్కడి నుంచి కథ మారింది. కాంగ్రెస్ గొంతు సవరించుకుని  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఇండియా కూటమి పార్టీలు అదే దారిలోకి వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా    పాత్ర ఏమిటని నిలదీశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, భారత్-పాకిస్థాన్ దేశాలు తటస్థ ప్రదేశంలో విభిన్న అంశాలపై విస్తృత స్థాయి చర్చలకు అంగీకరించాయని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరణ కోరారు. అలాగే.. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఇచ్చిన హామీ, ఏమిటి, పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసేందుకు పాక్ అగీకరించిందా, అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే  ప్రభుతాన్ని గట్టిగానే కార్నర్  చేశారు. ఇరకాటంలోకి నెట్టారు. అయితే..  ఓ వంక పార్టీలోని ఒక వర్గం, మోదీ ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకు పడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. అలాగే  మరోవంక ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసిందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతరం మోదీ  ప్రభుత్వం ఒక దాని వెంట  ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్నచర్యలు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అలాగే..  కాల్పుల విరమణ విషయంలో మోదీ ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిత్వాన్ని తప్పు పట్టడం కూడా,తప్పే అవుతుందని కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులు పార్టీలోని కొందరు ముఖ్యనాయకులు పార్టీ స్టాండ్ ను తప్పు పడుతున్నారు. ఉభయ దేశాలూ అణ్వాయుధ దేశాలు అయినప్పుడు పట్టువిడుపులు అనివార్యమవుతాయని, అందుకే మోదీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని సీనియర్ నాయకులు అంటున్నారు.   అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం(మే12) ఆపరేషన్ సిందూర్  పై  జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా  పాక్   ప్రేరేపిత ఉగ్రవాదానికి, ఆపరేషన్ సిందూర్  ద్వారా కొత్త లక్ష్మణ గీతను గీయడంతో పాటుగా, ఆ వెంటనే బుధవారం ( మే 13) అదంపూర్ ఎయిర్ ఫోర్సు బేస్ సందర్శన ద్వారా    కొత్త సాధారణ స్థితి ని అండర్లైన్ చేయడం జరిగింది.  మరోవంక ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి  ఉన్నత స్థాయి సైనిక అధికారులు, వివిధ దేశాల సైనిక అధికారులకు వివరించడం, బీజేపీ దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర, ఇప్పడు తాజాగా  మే 24 న ముఖ్యమంత్రులు అందరూ పాల్గొనే  జాతీయ భద్రతా మండలి సమావేశం, ఆవెంటనే మే 25 న ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ, దేశంలో రాజకీయ చర్చను చాకచక్యంగా  జాతీయ వాదం వైపుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. అలాగే  ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణలో అమెరికా పాత్ర తదితర   అంశాలను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు  చేయాలని  కాంగెస్ పార్టీ చేస్తున్న  డిమాండ్ లో హేతుబద్దత ఉన్నా, మోదీ వాక్ ధాటికి తట్టుకోవడం కష్టమవుతుందనీ.. ఒక విధంగా కాంగ్రెస్ డిమాండ్ బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.   ఈ అన్నిటినీ మించి కాంగ్రెస్  పార్టీలో ఆపరేషన్ సిందూర్ విషయంలోనే కాదు..  అందుకు సంబందించిన ఏ ఒక్క వివిషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. మల్లికార్జున ఖర్గే మొదలు శశి  థరూర్ వరకు ఎవరికి తోచిన దారిలో వారు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ మరో మారు తప్పులో కాలేసిందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్త మవుతున్నాయి.