జగన్పై మాటల ‘దాడి’: పార్టీకి గుడ్ బై
posted on Jun 11, 2014 @ 11:23PM
వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు మాటల దాడి చేశారు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. విజయమ్మ గెలుపు కోసం జగన్ది నియంతృత్వ ధోరణి అని, వైసీపీ ఓటమికి కారణం కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పార్టీలో అసలు కమిటీలే లేవన్నారు. అసలు పార్టీకి విధివిధానాలే లేవని ధ్వజమెత్తారు. జగన్ పెద్ద పెద్ద మాటలు విని ఆయన మారిపోయాడని నమ్మి తాను మోసపోయానని అన్నారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.