తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు

      త్వరలో తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు రాబోతున్నాయి. త్వరలో రాబోతున్న మహంకాళి అమ్మవారి బోనాలు, రంజాన్, బతుకమ్మ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నామని మంత్రి పద్మారావు తెలిపారు. ముందుగా రాబోతున్న రంజాన్, మహంకాళీ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ పండుగలను ఘనంగా జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ఈ మూడు పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ... రంజాన్ పండుగను ప్రభుత్వం తరఫున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పండుగల సందర్భంగా జంటనగరాల్లో సీఎం పర్యటిస్తారని ఆయన చెప్పారు.

ఇరాక్‌లో భారతీయ నర్సులు భద్రం

      ఇరాక్‌లోని టిక్రిట్ నగరంలోని ఓ ఆస్పత్రిలో 44 మంది భారతీయ నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ నగరాన్ని తీవ్రవాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నర్సులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఆ నర్సులందరూ అక్కడ క్షేమంగా వున్నారని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే టిక్రిట్‌లో నర్సులు చిక్కుకుపోయారని, వారిని కాపాడాలని తమకు సందేశం వచ్చిందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి విషయాలు చెప్పారు. నర్సులు కావాలంటే భారత్ వెళ్లిపోవచ్చు గానీ, వారి భద్రతకు మాత్రం తాము ఎలాంటి హామీ ఇవ్వబోమని ఆస్పత్రి వర్గాలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం టిక్రిట్‌లో వున్న నర్సులు భద్రంగా వున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఖాయమా?

      ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలన వైపు వెళ్తోందా అనే సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను ఆపకపోగా ఈ అంశం మీద కడుపు మండే కామెంట్లు చేస్తోంది. అత్యాచారాల పరిస్థితి ఇలా వుంటే, ఉత్తర ప్రదేశ్ అంతటా పెరిగిపోయిన దొంగతనాలు, అల్లర్లు అసలు యు.పి.లో ప్రభుత్వం అనేది వుందా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పరిస్థితులన్నీ చేయి దాటిపోతూ వుండటంతో యుపిలో రాష్ట్రపతి పాలన ఖాయమన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామాలు చేస్తే మంచిదన్న అనధికార ఆదేశాలు అందడంతో చాలామంది గవర్నర్లు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందరికంటే ముందుగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేయడం త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనేదానికి సంకేతమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత యుపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫిరోజాబాద్‌లో టెర్రర్ టెర్రర్!

      ఉత్తర ప్రదేశ్ చివరికి ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు నిరాఘాటంగా జరిగిపోతూ వున్నాయి. మరోవైపు దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ అన్యాయాలన్నిటినీ చూసి తట్టుకోలేని జనం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు హిసాత్మకంగా కూడా మారుతున్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలోని రామ్‌ఘర్‌లో గత రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక దొంగల ముఠా చేతిలో హతమయ్యారు. దీనికి నిరసనగా జిల్లా ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. జనం పోలీసు అధికారులపై రాళ్లదాడికి దిగడంతో డిజిఐ విజయ్ సింగ్ మీనాతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. రెచ్చిపోయిన జనం అక్కడి వాహనాలను, షాపులను ధ్వంసం చేశారు. ఒక పోలీసు వ్యానును తగులబెట్టారు. మొత్తమ్మీద ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి చెయ్యిదాటినట్టు కనిపిస్తోంది.

రాజీనామా బాటలో యూపీఏ గవర్నర్లు

      నరేంద్రమోదీ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్‌లను మార్చాలని యోచిస్తోన్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బీఎల్‌ జోషి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. ఆయన బాటలోనే మరో ఐదుగురు గవర్నర్లు కేళర గవర్నర్ షీలా దీక్షిత్, శివరాజ్ పాటిల్, ఎంకే నారాయణ్ కూడా తమ పదవులకు రాజీనామ చేసే అవకాశాలు ఉన్నాయి.కాగా ఆంద్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత రోశయ్య తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తారా?లేక కొనసాగుతారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో సోనియా విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజకీయ లబ్ది కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇరాక్‌లో ఇరుక్కున్న తెలంగాణ బిడ్డలు

      ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇరాక్‌లో తుపాకులు, బాబులు విచ్చలవిడిగా పేలుతున్నాయి. ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బాంబులు, తుపాకులు అక్కడ పేలుతున్నప్పటికీ వాటి ప్రతిధ్వని మాత్రం ఉత్తర తెలంగాణలోని అనేకమంది గుండెల్లో వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేక మంది వివిధ పనుల నిమిత్తం వెళ్ళారు. ప్రస్తుతం ఇరాక్‌లో స్థానిక ప్రజలకే భద్రత కరువైపోయింది. ఇక వలస వెళ్ళినవారి పరిస్థితి ఊహించడానికే వీల్లేకుండా వుంది. పైగా ఇరాక్‌లో తిరుగుబాటు చేసిన వర్గాలు ఇతర దేశాలకు చెందిన వారు ఇరాక్‌ వదిలిపోవాలని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాక్‌లో వున్న తెలంగాణ వారి బంధువులు ఇక్కడ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాక్ పరిణామాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆరా తీశారు. ఇరాక్ పరిణామాలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాక్లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు.

రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ

      తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. సోమవారం జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో బతుకమ్మ పండుగతోపాటు బోనాల పండుగను కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమీక్షానంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ మీడియాకు ఈ విషయం చెప్పారు. జూలై 13 లేదా 14 తేదీల్లో సికింద్రాబాద్‌లో ప్రారంభం కానున్న బోనాల పండుగ వేడుకలు ఏడువారాలపాటు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని మంత్రి పద్మారావు తెలిపారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రానున్న బోనాలు, రంజాన్ పండుగలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రంజాన్ పండుగకు సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారన్నారు. విద్యుత్ కోతల వల్ల అంతరాయం కలగకుండా మందిరాలు, మసీదుల వద్ద మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ జనరేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు. 

డీఎంకేకు నటి ఖుష్బూ గుడ్‌బై

      ప్రముఖ సినీనటి ఖుష్బూ డీఎంకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కరుణానిధికి లేఖ పంపారు. డీఎంకేలో కొంత కాలంనుంచీ పరిస్థితులు మారిపోవడంతో నిజాయతీగల కార్యకర్తగా సహించలేక వైదొలిగానని, మరే పార్టీలోనూ చేరబోవడం లేదని తెలిపారు. పార్టీకోసం ఎంతో పాటుపడినా తనను పక్కనపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి తాను ఎంతో శ్రమించానని, ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. కలైజ్ఞర్ తనకు నాయకుడు కారని, తండ్రివంటివారని, అయినప్పటికీ పార్టీలో ఇమడగలిగే పరిస్థితులు లేనందువల్ల బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయనకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ పని సులువు చేసిన యనమల

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో విద్యాభ్యాసం చేస్తున్న ఆంధ్రా విద్యార్ధులకు పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించేందుకు విముఖత చూపిస్తుండటంతో, దానిపైనే ఆధారపడి చదువులు కొనసాగిస్తున్న అనేకమంది ఆంద్ర విద్యార్ధులు వారి తల్లితండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ కేసీఆర్ కానీ ఆయన మంత్రులెవరూ కానీ దీనిపై ఎటువంటి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది గమనించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించకపోయినట్లయితే, ఆంధ్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, అందువలన విద్యార్ధులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆయన ఆవిధంగా చొరవ తీసుకొని ప్రకటించడం చాలా హర్షణీయం. అయితే కాగల కార్యం గందర్వులే నెరవేర్చారన్నట్లు, ఆంధ్రా విద్యార్ధులకు తమ ప్రభుత్వమే పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని మంత్రి యనమల స్వయంగా ప్రకటించడంతో ఇక కేసీఆర్ కు ఎటువంటి నిందలు, అపవాదులు ఎదుర్కొనే బాధ తప్పింది. కనుక నేడో రేపో కేవలం తెలంగాణా విధ్యార్థులకు మాత్రమే తమ ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని ఆయన నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చును.

జైలులో ఎర్రచందనం స్మగ్లర్ ను కలిసిన వైకాపా యం.యల్యే

  ఎర్రచంద్రనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డి అనే వ్యక్తిని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అనేకమందిపై అనేక రకాల ఆరోపణలున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరెయ్యారు. ఇటువంటి తరుణంలో పోలీసులు అరెస్టు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుకి చెందిన వ్యక్తిని వైకాపా నేత జైలుకి వెళ్లికలవడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. అయితే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధము లేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పడం విశేషం. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగినా, దానిని అందరూ కల్లే అనుకొంటారు తప్ప పాలని ఎవరూ నమ్మరు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఆ వ్యక్తి తనకు మిత్రుడని స్వయంగా భాస్కరరెడ్డే చెపుతున్నపుడు ప్రజలకు అనుమానాలు కలగడం సహజమే. పైగా విజయానందరెడ్డి గంగాధర నెల్లూరుకు చెందిన వైకాపా కార్యకర్త అని చెవిరెడ్డి చెప్పడం వైకాపా ప్రతిష్టను మసకబారేలా చేస్తుంది. అన్ని విషయాలు స్వయంగా మీడియాకు చెప్పి, ఇప్పుడు మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని చెవిరెడ్డి బాధపడటం చాలా హాస్యాస్పదం.

బియాస్‌ దుర్ఘటన: మిస్సింగ్‌, డెత్‌ సర్టిఫికెట్లు

      బియాస్‌ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం గాలింపు కొనసాగుతుంది. లభించిన విద్యార్థుల మృతదేహాలపై డెత్‌సర్టిఫికెట్లు, మృతదేహాలు లభ్యం కాని వారిపై మిస్సింగ్‌ సర్టిఫికెట్లను బాధిత కుటుంబాలకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ సర్టిఫికెట్లపై హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర రాజముద్రలు లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సరి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు చెప్పాయి. మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు తరలిస్తామని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

టిడిపి వైపు చూస్తున్న ఆనం బ్రదర్స్

      కాంగ్రెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో తనకు వ్యక్తిగతంగా ముప్పై ఐదేళ్ల అనుబంధం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను పాలించే సత్తా బాబుకే ఉందని ఆయన చెప్పడం విశేషం. తాము టిడిపిలో చేరుతారనే ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇక్కడ తాను టిడిపిలో పనిచేశానని ఆయన గుర్తు చేయడం విశేషం. అలాగే పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలు కూడా ఆయన కొట్టిపారేయలేదు. ఎలాగో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీప భవిష్యత్తులో కూడా బాగుపడే సూచనలు లేకపోవడంతో టిడిపిలో చేరడానికి ఆనం బ్రదర్స్ బాబుకు సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తంగిరాల మృతి పార్టీకి తీరని లోటు: బాబు

      గుండెపోటుతో హఠాన్మరణం పొందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి బాధాకరమైన విషయమని, కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. దేవినేని కుటుంబం తరువాత నందిగామ నియోజకవర్గానికి తంగిరాల పేరు తెచ్చారని బాబు గుర్తుచేశారు. అందరితో కలివిడిగా ఉండే తంగిరాల మన మద్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అని, పదవులను ఆశించకుండా పని చేసిన వ్యక్తి తంగిరాలని చంద్రబాబు సంతాపం ప్రకటించారు. గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మంత్రి దేవినేని ఉమ తంగిరాల బౌతికకాయానికి నివాళులర్పించారు.

నూజివీడు-ఖమ్మం మధ్యలో కొత్త అంతర్జాతీయ విమానశ్రయం

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, రాజధానికి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజధాని నిర్మాణం కోసం తగిన స్థలం కనుగొనేందుకు వేయబడిన శివరామ కృష్ణన్ కమిటీతో మొన్న సమావేశమయిన తరువాత, బహుశః వారి సూచనలు, సలహాల ప్రకారమే తన అభిప్రాయం మార్చుకొన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి, ఆ ప్రాంతంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యా వైద్య తదితర సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు తగు చర్యలు, ప్రతిపాదనలు వీలయినంత త్వరలో సిద్దం చేయాలని చంద్రబాబు అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేసారు. ఖమ్మం-కృష్ణా జిల్లాల మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అన్ని రంగాలలో ముఖ్యంగా సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదుతో చక్కగా అనుసంధానం ఏర్పడి త్వరితగతిన అభివృద్ధి సాధించగలదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి

    కృష్ణాజిల్లా నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నందిగామలోని మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. అరుుతే 12 గంటల సమయంలో ఆయన కన్నమూశారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా ఆయన నందిగామ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం తంగిరాల ప్రభాకరరావు స్వస్థలం. ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి ఆదివారం ఉదయ పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.

షర్మిలపై విషప్రచారం దారుణం: ప్రభాస్

  వైసీపీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని కథానాయకుడు ప్రభాస్ ఖండించారు. షర్మిలను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ప్రభాస్ తాను చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి కూడా పుకార్లు వచ్చాయని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు. తాను తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో వున్నానని.. ఇలా పుకార్లను సృష్టించారని, ఆ పుకార్ల వల్ల తన కుటుంబం ఎంతో బాధపడిందని, అయినా తాను వాటిని తాను ఉపేక్షించానని, అయితే నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ తన ప్రకటనలో వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ప్రభాస్ ప్రకటించారు.

మహారాష్ట్ర బార్లలో డాన్స్‌లకు ఫుల్ స్టాప్

  ప్రస్తుతం మహారాష్ట్రలోని బార్లలో మహిళలు డాన్స్ చేసే దుష్ట సంప్రదాయం వుంది. బార్లలో యువతులతో చేయించే అశ్లీల నృత్యాలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గల కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి అనేక అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. ఎట్టకేలకు బార్లలో అశ్లీల నృత్యాలను నిషేధిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదం పొందింది. బార్లలో డాన్సులపై నిషేధం విధించేందుకు తాము కొత్త బిల్లును ఆమోదించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించారు. ఇప్పుడు మహారాష్ట్రలో బార్లలో మహిళలు, యువతులతో డాన్సులు చేయించడం నేరం. ఇదిలా వుంటే మహారాష్ట్రలోని పలు బార్ల యాజమానులు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిషేధం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతారని న్యాయస్థానానికి విన్నవించారు. మరికొంతమంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటారని కూడా కోర్టుకు తెలిపారు.

కేసీఆర్ పరిశీలనలో భూగర్భ మెట్రో రైలు

  మెట్రోరైలు అలైన్‌మెంట్ కారణంగా హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ ప్రాంతంలో చారిత్రక కట్టడాలను కోల్పోతున్నామని టీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోంది. మెట్రో రైలు ఎలైన్‌మెంట్‌ని మార్చాలని టీఆర్ఎస్ గతంలో ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెట్రోరైలు పనులను కేసీఆర్ ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి , ఎల్ అండ్ టీ ప్రతినిధులు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు డిజైన్ మార్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సుల్తాన్ బజార్ ప్రాంతంలో మెట్రో రైలు మార్గాన్ని భూ గర్భంలోనుంచి వేసే ఎలా వుంటుందన్న ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైలు అధికారుల ముందు వుంచినట్టు తెలుస్తోంది.