hero pawan kalyan srikakulam rajam gmr hospital

సిక్కోలులో పవన్ కళ్యాణ్

  శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో మంగళవారం ఉదయం సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రి, నైరెడ్, జీఎంఆర్ ఐటీలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. కేర్ ఆస్పత్రిలోని రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో వున్న అత్యాధునిక వైద్య సేవల గురించి జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు పవన్ కళ్యాణ్‌కి వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో వున్న ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. తర్వాత నైరెడ్‌లో స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ని చూడటానికి ఈ ప్రాంతలోని ఆయన అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు.

five doctors swine flu

డాక్టర్లకూ స్వైన్ ఫ్లూ...

  తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినప్పటికీ అదేంటోగానీ స్వైన్ ఫ్లూ తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం నాడు స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు మరణించడంతో అధికారిక లెక్కల ప్రకారమే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. మొత్తమ్మీద జనవరి నెలలో 1050 మంది రోగులకు స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది. కేవలం ఒక్క సోమవారం నాడే 105 మందికి పరీక్ష చేయగా 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. వీరిలో ఐదుగురు డాక్టర్లు కూడా వుండటం గమనించాల్సిన అంశం. ఇంతకుముందు నలుగురు జూనియర్ డాక్టర్లకు కూడా స్వైన్ ఫ్లూ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పిల్లలకు కూడా స్వైన్ఫ్లూ సోకింది.

Haryana 12 killed as train rams into vehicle at unmanned crossing

రైలు ప్రమాదం.. 12 మంది మృతి

  హర్యానాలోని హిస్సార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. కాపలా లేని క్రాసింగ్ వద్ద వాహనాన్ని రైలు ఢీకొనడంతో 12 మంది మరణించారు. చండీగఢ్ - హిస్సార్ మార్గంలో సోమవారం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో సర్సొడ్ గ్రామం దగ్గర కాపలా లేని రైలు క్రాసింగ్‌ని దాటుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ధూరి - సిర్సా ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులందరూ ప్రమాద స్థలానికి సమీపంలోని పంఘాల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పొగమంచు కారణంగా వాహనం డ్రైవర్‌కి రైలు కనిపించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

RK Lakshman

ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి

  ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలం అనారోగ్యంతో ఉన్న ఆయన పూణే నగరంలో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ క్రమంగా పరిస్థితి విషమించి చివరికి ఈరోజు సాయంత్రం కన్నుమూసారు. ఆర్కే లక్ష్మన్ అనగానే మొట్ట మొదట గుర్తుకు వచ్చేది ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ చిత్రమే. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో ఆయన దాదాపు ఐదు దశాబ్డాలపాటు ‘ది కామన్ మేన్’ ‘యూ సెడిట్’ పేరిట సమకాలీన రాజకీయాలపై గీసిన రాజకీయ వ్యంగ చిత్రాలు యావత్ భారతావనిలో ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన స్పూర్తితో ఎంతో మంది రాజకీయ కార్టూనిస్టులుగా పత్రికా రంగంలో ప్రవేశించారు కూడా. ఆయన భార్య కమల మంచి రచయిత్రిగా పేరు సంపాదించుకోగా, వారి కుమారుడు శ్రీనివాస్ జర్నలిస్టుగా పనిచేసారు.

republic day celebrations

తెలంగాణ రాష్ట్ర రిపబ్లిక్ వేడుకలు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత 66వ గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్పీకర్ వేణుగోపాలాచారి పాల్గొన్నారు. సమయభావం వల్ల శకటాల ప్రదర్శనను రద్దు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పేదల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడులను ఆహ్వానించేందుకు కొత్త ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.

Republic day Celebrations

విజయవాడలో ఏపీ గణతంత్ర వేడుకలు

  నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గణతంత్ర వేడుకలు విజయవాడలో జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ 66 వ రిపబ్లిక్ వేడుక జరిగాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు దగ్గరవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. మిషన్ అప్రోచ్ తో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఆయన అన్నారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గణతంత్ర వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు తదితరులు పాల్గొన్నారు.

republic day

న్యూఢిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు

  భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాతో కలసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట రాజ్‌పథ్‌లో అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమవారం ఉదయం నుంచీ ఢిల్లీలో మంచు వర్షంలా కురుస్తోంది. దాంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొంత ఇబ్బందిపడ్డారు. అయినప్పటికీ మంచులో తడుస్తూనే గణతంత్ర వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను దివంగత సైనికాధికారుల సతీమణులకు అందించారు.

నన్ను క్షమించండి.. మాజీ మంత్రి రాజయ్య

  తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరి మనసులనైనా గాయపరచి వుంటే క్షమించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజయ్య పార్టీ మారబోతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆయన తన కుటుంబ సభ్యులతో సమావేశమై, టీఆర్ఎస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రాజయ్య మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని, తనకు ఊహించని రీతిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూలీగా పాల్గొంటానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలోనే వుంటానని ఆయన స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నానని రాజయ్య చెప్పారు.

మంచు మనోజ్ పెళ్ళి.. ఖరారు...

  నటుడు మోహన్‌బాబు కుమారుడు, ప్రముఖ కథానాయకుడు మంచు మనోజ్ ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడని రెండ్రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మోహన్‌బాబు ధ్రువీకరించారు. త్వరలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చదివి, అమెరికాలో చార్డెడ్ అకౌంటెంట్‌ కోర్సు చదవిన ప్రణతిరెడ్డి మంచు విష్ణు భార్య వెరోనికాకు స్నేహితురాలు. ఈ ప్రేమ వివాహానికి ప్రణతిరెడ్డి తల్లిదండ్రులు కూడా అంగీకరించారని, త్వరలో తాంబూలాలు తీసుకుంటామని తెలిపారు. అందరి ఆశీస్సులతో వివాహం జరుగుతుందని చెప్పారు. అలాగే మంచు మనోజ్ కూడా తనకు పెళ్ళి కుదిరిన విషయాన్ని సోషల్ మీడియాలో కన్ఫమ్ చేశాడు.

అద్వానీ, దిలీప్ కుమార్, అమితాబ్‌లకు పద్మవిభూషణ్

  కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ, బాలీవుడ్ నటులు దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించారు. అలాగే ప్రకాష్ సింగ్ బాదల్, కొట్టాయం కె.వేణుగోపాల్, కరీం హుస్సేనీ ఆగాఖాన్‌లకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే, ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాం, క్రీడాకారిణి పి.వి.సింధు, నటుడు కోట శ్రీనివాసరావు, క్రీడాకారిణి మిథాలి రాజ్, డాక్టర్ మంజుల అనగానిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.