ali brother

అలీ తమ్ముడికి జలగండ్రి అయ్యింది

  ప్రముఖ హాస్య నటుడు అలీ తమ్ముడు, సినీ హాస్య నటుడు మహ్మద్ ఖయ్యూం పెళ్ళి జరిగింది. ఆదివారం నాడు గుంటూరులోని సన్నిధి కళ్యాణ మంటపంలో ఖయ్యూం పెళ్ళి వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ రసూల్ పెద్ద కుమార్తె ఆర్షియాతో ఖయ్యూం పెళ్ళి (అలీ భాషలో జలగండ్రి) అయింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు, రాజకీయ ప్రముఖులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, కృష్ణవంశీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఖయ్యూమ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

yoga no rape

యోగా చేస్తే మానభంగాలు జరగవట...

  యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ‘‘ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది. భావోద్వేగాలు మారిపోతాయి.ఎన్నో పనులు చేయడానికి ఈ ప్రకృతి మనకు ఈ  అమూల్యమైన శరీరాన్ని అందించింది.. ఆ పనుల వైపుగా మనిషి సాగిపోతాడు’’ అని మురళీ మనోహర్ జోషి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘ది లైంగర్ వే యోగా ఫర్ ది న్యూ మిలినీయం’ అనే అంశంపై జరిగిన సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్న మురళీ మనోహర్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా ముస్లింలు రోజుకు ఐదుసార్లు యోగా చేస్తారని అన్నారు. ముస్లిం ప్రవక్త మహ్మద్ గొప్ప యోగి అని కూడా జోషి వ్యాఖ్యానించారు.

Australia country immigration laws Prime Minister Tony Abbott

ఆస్ట్రేలియా మీద ఆశలేం పెట్టుకోవద్దు...

  ఆస్ట్రేలియాలో చదువుకుందామని అనుకుంటున్నారా? అక్కడ ఉద్యోగం చేయాలని భావిస్తునారా? ఆ దేశంలో స్థిరపడాలని అనుకుంటున్నారా? మీ కోరిక మరీ బలమైనది కాకపోతే పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం కాబోతోంది. ఆస్ట్రేలియా వలస చట్టాటు మరింత సంక్లిష్టం కానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా వలస చట్టాలు కొరకరాని కొయ్యలా వుంటాయి. వాటిని మరింత జటిలం చేసే ఆలోచనలో వున్నామని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రజల రక్షణ చర్యలు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా వలస చట్టాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. గత డిసెంబర్‌లో సిడ్నీ కేఫ్ ఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియా దేశ భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.

Airports take Robert Vadra off no frisking list goa

సోనియా అల్లుడివా? సో వాట్?

  తన అత్తగారు సోనియా గాంధీ పార్టీ అధికారంలో వుండగా మహారాజులా వైభవాన్ని అనుభవించిన రాబర్ట్ వాద్రాకి ఇప్పుడు అంత సీన్ లేకుండా పోతోంది. అధికారం పోవడంతో హోదాలు కూడా తగ్గిపోతున్నాయి. గతంలో ఎయిర్ పోర్టుల్లో ఎవరెవరిని చెక్ చేయకూడదో పెద్ద లిస్టు వుండేది, భారత రాష్ట్రపతితో మొదలయ్యే ఆ లిస్టులో చివర్లో రాబర్ట్ వాద్రా గారి పరివారం పేరు కూడా వుండేది. ఆయనకు ఏ హోదాతో ఆ అధికారం కల్పించారో అడిగినా సమాధానం చెప్పినవారు అప్పట్లో లేరు. ఇప్పుడు ఆ హోదా ఇప్పుడు పోతోంది. గోవా విమానాశ్రయంలో తనిఖీలు చేయవలసిన అవసరం లేని ప్రముఖుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగించారు. మిగిలిన విమానాశ్రయాలలో కూడా అదే జరగవచ్చని తెలుస్తోంది. వాద్రాకు ప్రత్యేకంగా ఏ అధికారిక హోదా లేకపోయినా ఆయనను భద్రత తనిఖీ నుంచి మినహాయించారు. ఇప్పుడు ఆ హోదాలు, వైభవాలు క్రమంగా పోతున్నాయి.

parliament Budget session 66 pending bills to be discussed

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

  భారత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి జరుగుతాయి. ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లులు పెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాల్సి వుంది. మత మార్పిడి బిల్లుతో సహా ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా వున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి మే 8వ తేదీ వరకు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడతగా ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్‌ 20 నుంచి మే 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. తొలి విడతలో 20 రోజులు, మలి విడతలో 13 రోజుల చొప్పున ఉభయ సభలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Nitish Kumar Takes Oath as Bihar Chief Minister

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం

  బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ త్రిపాఠీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్‌తోపాటు 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 20 మంది గతంలో మాంఝీ మంత్రివర్గంలో పనిచేసినవారే. ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో పెళ్ళి బాజా మోగుతున్నందున ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కాగా, కొత్తగా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినందుకు అలిగే గతంలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మాంఝీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన విషయం తెలిసిందే.

india won

దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం

  వరల్డ్ కప్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా మీద భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. 308 పరుగుల లక్షంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 170 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఇండియా ఓపెనర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. మరో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించాడు. దాంతో ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా వెన్నును భారత బౌలర్లు విరిచారు. దాంతో దక్షిణాఫ్రికా 40.2 ఓవర్లకు 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది.

Bangladesh Ferry Capsizes With 100 Passengers on Board

వందమందితో మునిగిన పడవ

  బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాలు సాధారణమైపోయాయి. ఇక్కడ ఎక్కువ శాతం ప్రయాణాలు పడవల ద్వారా జరుగుతూ వుంటాయి. ఇటీవలి కాలంలో ప్రయాణికులతో వున్న పడవలు మునిగిపోయిన ఘటనల్లో వందలాది మంది ప్రజలు మరణించారు. ఇప్పుడు అలాంటి ఘటన మరోటి జరిగింది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో వందమంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ ఆదివారం నాడు మునిగిపోయింది. ప్రయాణికుల పడవను ఒక కార్గో నౌక ఢీకొనడంతో పడవ మునిగిపోయింది. నది ఉద్ధృతి బాగా వుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు మృతదేహాలు బయటపడటం గానీ, ఎంతమంది చనిపోయారన్న విషయాలు గానీ వెల్లడి కాలేదు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

son kidnap drama father

వార్నీ... తండ్రితోనే కిడ్నాప్ డ్రామా

  ఈమధ్య కొంతమంది యువకులు జల్సాల కోసం ఓవర్ యాక్షన్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటి ఓవర్ యాక్షన్లలో ఒక సరికొత్త యాక్షన్ బయటపడింది. జల్సాలకు బాగా మరిగిన ఓ కుర్రాడు తనను ఎవరో కిడ్నాప్ చేశాడని తండ్రికి ఫోన్ చేసి డబ్బులు గుంజాడు. తన తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ చివరికి జైల్లో పడ్డాడు. ముంబైకి చెందిన విజయ్ రోహన్ అనే పాతికేళ్ళ కుర్రాడు బంజారాహిల్స్‌లో నివసిస్తూ, సోమాజీగూడాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బాబుగారికి ఖరీదైన హోటళ్ళలో పార్టీల్లో పాల్గొనడం, డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూ వాళ్ళతో సమానంగా డబ్బు ఖర్చుపెట్టడం, జల్సాలు చేయడం అంటే బాగా ఇష్టం. ఈయనగారి గొప్ప అలవాట్లకు సరిపడా జీతం లేకపోవడంతో ఒక అమోఘమైన ఐడియా వేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బు ఇస్తేనే వదిలిపెడతారని తన తండ్రికే ఫోన్ చేసి చెప్పాడు. కిడ్నాపర్లు తన చేత ఫోన్ చేయిస్తున్నారని అన్నాడు. ఈ విషయం పోలీసులకు చెబితే తనను కిడ్నాపర్లు చంపేస్తారని భయపెట్టాడు. ఆ తండ్రి భయపడిపోయి కొడుకు బ్యాంక్ అకౌంట్లో దాదాపు రెండు లక్షల రూపాయలు వేశాడు. ఆ డబ్బుతో వీడు బాగా ఎంజాయ్ చేశాడు. కిడ్నాపర్లు ఇంకా డబ్బు కావాలని అంటున్నారని, అర్జెంటుగా బ్యాంకులో వేయాలని తండ్రికి ఫోన్ చేశాడు. దాంతో సదరు తండ్రి హైదరాబాద్‌కి వచ్చాడు.. ఆ తర్వాత తన కొడుకు ఫోన్ల మీద అనుమానం వచ్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తే సదరు పుత్రరత్రం చేస్తున్న ఘనకార్యం బయటపడింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు. కొడుకును లోపల వేశారని ఆ పుత్రరత్నం తండ్రి ఎంతమాత్రం బాధపడటం లేదు.

actor krishnam raju ill health nims heart

కృష్ణంరాజుకు హార్ట్ ఆపరేషన్

  ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు రక్తాన్ని అందించే నాళాలు పూడుకుపోవడంతో స్టెంట్లు అమర్చామని వైద్యులు తెలిపారు. ఆయన స్వల్ప అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణించిన షాక్‌లో అందరూ వుండగానే, సినీనటుడు చంద్రమోహన్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఇలా కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు. సినీరంగ ప్రముఖులు ఇలా వరుసగా అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.

chandra babu naidu meeting with mp

కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవలసిన అవసరం వుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి దిశా నిర్దేశం చేశారు. విభజన చట్టంలోని హామీల సాధనకు కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకోవడానికి ప్రయత్నిచాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిరంతరం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిధులు రాబట్టాలని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ఒక్కో ఎంపీ కోటి రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. ఎంపీలు 24 కోట్లు ఇస్తే ప్రభుత్వం మరో 24 కోట్లు ఇస్తుందని తెలిపారు. ఈ నిధులతో గృహ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

ISIS

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మరో ఘాతుకం

  ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అకృత్యాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. నరరూప రాక్షసులా తయారయ్యి ఒళ్ళు జలదరించే విధంగా బందీలను హతమారుస్తున్నారు. ఇదివరకు తమకు పట్టుబడ్డ జోర్డాన్ పైలట్ మొవాజ్ అల్ కాసాస్బేను ఒక ఇనుప బోనులో బందించి సజీవ దహనం చేసారు. మళ్ళీ ఈసారి ఏకంగా 43 మంది ఇరాకీ ప్రజలను బందీలుగా పట్టుకొని పోయి వారినందరినీ ఇనుప బోనుల్లో బందించి సజీవంగా దహనం చేశారు. వారు స్థానిక పోలీసులో లేక ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇరాకీ ప్రభుత్వంతో కలిసి పోరాడేవారో అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. వారందరూ ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరానికి సుమారు 200 కిలోమీటర్లు వాయవ్య దిశలో అల్ బాగ్దాదీ నగరానికి చెందినవారు.   ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై సైనిక చర్య చెప్పట్టేందుకు తన ప్రభుత్వానికి అనుమతి ఇమ్మని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)ని కోరనున్నారు. అందుకోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో మంతనాలు చేస్తోంది. వారు అందుకు అంగీకరించినట్లయితే, త్వరలోనే అమెరికా సేనలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడులు చేసి వారిని తుదముట్టించే అవకాశం ఉంది. కానీ అంతవరకు ఉగ్రవాదుల చేతుల్లో ఇంకా ఎంతమంది అమాయకులయిన ప్రజలు ఈవిధంగా ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు.

కొత్తజంట కన్నుమూశారు....

  ప్రేమ ప్రాణం పోస్తుందంటారు... కానీ చాలాసార్లు ప్రేమ ప్రాణం తీస్తుందేమోనని అనిపిస్తుంది. ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడల్లా ‘ప్రేమ’ అనే పదం మీదే కోపం వస్తూ వుంటుంది. కడపలో ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కడపలోని మట్టి పెద్దపులి వీధిలో ఈ విషాదం జరిగింది. ప్రేమికులైన యువతీ యువకులు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇంకా తెలియరాలేదు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

కేసీఆర్‌కి పెళ్ళికార్డు ఇచ్చిన జయప్రద

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును సినీనటి జయప్రద శనివారం సచివాలయంలో కలిశారు. జయప్రద తన సోదరి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందచేశారు. వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఆ తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్ను కలిసినట్లు చెప్పారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని అన్నారు. జయప్రద కొద్ది రోజుల క్రితం తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలసి తనకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని కోరిన విషయం తెలిసిందే.

సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్

  కొంతమంది హీరోయిన్లు భలేవాళ్ళు... కెరీర్ బాగా నడిచినంతకాలం వెండి తెర మీద తమ అందాలను, లయలను, హొయలను, జిగిని, బిగిని ధారాళంగా ప్రదర్శిస్తారు. వీళ్ళను చూసి సన్యాసులకు కూడా సంసారం మీద ఆసక్తి పుట్టి కాషాయ వస్త్రాలకు గుడ్ బై చెప్పేస్తూ వుంటారు. ఈ హీరోయిన్లు మాత్రం కెరీర్ ముగిసిపోయిన తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తూ వుంటారు. అంతా మాయ... ఈ టాపిక్ ఎందుకంటే, లేటెస్ట్‌గా ఒక హీరోయిన్ సన్యాసం పుచ్చుకుంది. ఆమె మరెవరో కాదు... ఒకప్పుడు ఇండియాలో దుమ్ము దులిపిన నేపాల్ అమ్మాయి మనీషా కొయిరాలా. మొన్నామధ్య క్యాన్సర్ వ్యాధికి గురై, ఆ తర్వాత చికిత్సతో ఆ వ్యాధి బారి నుంచి బయటపడిన ఆమె ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంది. సాధ్వి అవతారం ఎత్తింది. హరిద్వార్‌లో వున్న పిల్టో బాబా ఆశ్రమంలో మనిషా కొయిరాలా సన్యాసం తీసుకునే కార్యక్రమం రెండ్రోజుల క్రితం జరిగింది. సినిమాల్లో వేషాలు లేవు... విలాస జీవితమూ బోర్ కొట్టేసింది. క్యాన్సర్ కారణంగా చావు వరకూ వెళ్ళొచ్చింది.... ఆ క్యాన్సర్ ఎప్పుడు తిరగబెడుతుందో తెలియదు... దానికితోడు మేడమ్ గారి పెళ్ళి కూడా పెటాకులైపోయింది. ఇక సన్యాసమే బెటరని అనుకుని వుండొచ్చు..

చేప మీద అల్లా పేరు

  నెల్లూరు జిల్లాలో ఒక చేప ఒంటిమీద ఖురాన్ సూక్తులు కనిపించడం ఆశ్చర్యానికి కారణమైంది. నెల్లూరులోని డ్రైవర్స్‌ కాలనీలో జాలరులకు ఒక విచిత్రమైన చేప దొరికింది. ఆ చేప ఒంటిమీద నలుపు, పసుపు వర్ణాలతో కూడిన డిజైన్ వుంది. అయితే ఆ డిజైన్‌ని చూసిన కొంతమంది ముస్లింలు అవి అరబ్బీ పదాలని, ఆ పదాలకు అర్థం మహ్మద్ అల్లా, సుభానల్లా అని చెప్పారు. ఈ రెండు పదాలూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పదాలు. పెన్నానదిలో ఈ చేప దొరికింది. చేపను పట్టుకున్న వ్యక్తి కూడా ముస్లిమే. అయితే ఆయనకు అరబ్బీ రాదు. దాంతో అరబ్బీ తెలిసిన కొంతమంది ముస్లింలకు చూపిస్తే వారు ఆ పదాలను చదివి ఈ విషయాన్ని చెప్పారు. ఈ చేపను దర్శించడానికి ముస్లింలు క్యూలు కట్టారు.