1. గాంధీజీ... 2. మండేలా... 3. కేసీఆర్...
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నాడు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ బర్త్డేని వైభవంగా జరుపగా, ప్రస్తుతం ముంబై పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడ రాజ్ భవన్లో బర్త్ డే కేక్ కట్ చేశారు. కేసీఆర్కి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ని గాంధీజీ, నెల్సన్ మండేలాతో పోల్చారు. గాంధీజీ, నెల్సన్ మండేలా తర్వాత అహింసా మార్గంలో తాను అనుకున్నది సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ఈ సందర్భంగా మంత్రిగారు చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరబోతోందని వార్తలు వస్తున్నాయని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదని, ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన వివరించారు.