తెలంగాణఫై చంద్రబాబు లేఖ అపర చాణక్యం

చంద్రబాబు అపర చాణక్యాన్ని ప్రదర్శించారు. కర్రా విరగకుండా పామూ చావకుండా ఉండే మార్గాన్ని తెలంగాణ విషయంలో అవలంబించారు. ప్రస్తుతానికి అసలు తమ వైఖరేంటో చెప్పకపోయినా నెపాన్ని కాంగ్రెస్ మీదికి నెట్టిపారేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల ఆయనకు రెండు లాభాలు. ఒకటి తెలంగాణ కోసం లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్న తెలుగుదేశంలోని తెలంగాణావాదుల్ని సంతృప్తి పరచడం మొదటిదైతే, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ఉండడంవల్ల సీమాంధ్ర ప్రాంతం నేతల అభిమానాన్ని కూడా చూరగొనడం రెండో లాభం. రేపటికి రాజెవడో రెడ్డవడో..? అయ్యేది కాకమానదు. జగబోయేదాన్ని ఎలాగూ అపలేం.. కానీ మన చేతుల్లో ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదన్న సత్యం చంద్రబాబుకి ఇప్పటికి స్పష్టంగా బోధపడినట్టుగా అనిపిస్తోంది. అటు సీమాంధ్ర నేతలకూ, ఇటు తెలంగాణ నేతలకూ పార్టీలో సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రేపన్న రోజు ఏం జరిగినా ఇద్దరి మద్దతూ తనకుంటుందన్న ధోరణిలో చంద్రబాబు శరవేగంతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర చేపట్టిన నేపధ్యంలో బాబు లేఖ ఓ రకంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి వీఐపీ పాస్ లా పనికొస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. కేసీఆర్ లాంటివాళ్లో, లేక ఆవేశం చల్లారక ఎగిరెగిరిపడే కొందరు తెలంగాణ నేతలో విమర్శలు గుప్పించినంత మాత్రాన లేఖ విషయంలోగానీ, మరే ఇతర విషయాల్లోగానీ చంద్రబాబుకి వచ్చిన నష్టమేమీ లేదు. పైగా “గోపి” ధోరణివల్ల లాభాలే తప్ప అణువంతైనా నష్టం లేదుగాకు లేదు. కేవలం చంద్రబాబు వల్లే తెలంగాణ వెనక్కి పోయిందని ఆరోపిస్తున్న కేసీఆర్ మాటల్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ గోల కాంగ్రెస్ దే. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు రాబట్టుకోవాలా అన్న అంశంమీదే ఇప్పుడు బాబు పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న సామెతను నిజంచేస్తూ కాంగ్రెస్, వైకాపాల మధ్య రగులుతున్న ( అంతా పైపైకేలా అనే వాళ్లూ కొందరున్నారు) చిచ్చుని తెలుగుదేశం ఓటుబ్యాంక్ కిందకి మార్చుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. చూద్దాం.. ఏం జరుగుతుందో..

హస్తినలో గవర్నర్ కీలక మంతనాలు

రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయ్. ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఓ పక్క జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు రక్షణ కల్పించాలి. మరో పక్క తెలంగాణ మార్చ్ గొడవ. ఇంకోవైపు గణేష్ నిమజ్జనోత్సవాలు. ప్రభుత్వం కోదండరామ్ ని గెడ్డం పట్టుకుని బతిమిలాడినా మార్చ్ ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం గడగడలాడుతోంది. ఏం జరిగినా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనుక భద్రత విషయంలో కాంప్రమైజ్ కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రిసహా మంత్రులందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నరసింహన్.. రాష్ట్రపతి ప్రణబ్, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం లను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణ విషయంలో ఓ ప్రకటన చేస్తేనే తప్ప మార్చ్ ని విరమించుకునేది లేదని తెలంగాణ వాదులు భీష్మించుక్కూర్చున్న విషయాన్నికూడా నరసింహన్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనికితోడు ఘనత వహించిన ఓ వలసదొరకూడా తన మనుగడకోసం హస్తినలో మకాం వేసి ఏదో ఒక ప్రకటన చేయమని కాంగ్రెస్ అధిష్టానాన్ని బతిమిలాడుకుంటున్నారన్న వార్తలుకూడా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో ఓ ప్రకటన చేయబోతోందన్న ఆశలకు ప్రాణం పోస్తున్నాయి.  

రాహుల్‌ అంతర్జాతీయనేత..! సోనియా విశ్వమాత...!

ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో ఎవరికెవరూ తీసిపోరని మోడీ. రాహుల్‌ స్థాయిల విషయంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం రసపట్టుగా మారింది! వ్యక్తి పూజకే అగ్రతాంబూల మిచ్చే కాంగ్రెస్‌లో పొగడ్తలు శృతి మించిపోతున్నాయ్‌! బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్‌ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన బి.జె.పి అంటే కాంగ్రెస్‌ నేతలు గుర్రుగానే ఉన్నారన్నది నిజం! తమ నాయకుల మనసులో చెలరేగిపోతున్న అలజడిని గమనించిన కొందరు కార్యకర్తలు ఆ కచ్చను గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిపై వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తూ తమ నేత రాహుల్‌ గాంధీ జాతీయ నాయకుడైతే, మోడీ కేవలం ప్రాంతీయ నాయకుడంటూ తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు! అందుకు మోడీ స్పందిస్తూ `తాను నిజంగానే ప్రాంతీయ నాయకుడినేనని ఒప్పేసుకుంటూ రాహుల్‌ గాంధీ మాత్రం అంతర్జాతీయ నాయకుడనీ, ఆయన ప్రపంచంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారనీ, అవసరమైతే ఇటు భారత్‌, అటు ఇటలీ ఎన్నికల్లోనూ పోటీ చేసెయ్యగల రంటూ సెటైర్‌ విసిరారు! ఆ వ్యాఖ్యకు ఎలాస్పందించాలో ఆర్థం కాక తల నెరసిన పెద్ద నాయకులు తలలు పట్టుకుకూర్చుంటే `ఛోటా నాయకులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై స్పందించకపోతే తమ పరువేంగావాలనుకున్నారో ఏమో గానీ `రాహుల్‌ గాంధీ ప్రపంచ దేశాలను ప్రభావితం చెయ్యగల అంతర్జాతీయ నాయకుడేనని చెప్పేస్తున్నారు! ఇంతటితో వీళ్ళు ఊరుకుంటారా...? లేక మరో అడుగు ముందుకేసి సోనియమ్మ విశ్వమాతంటూ కితాబిచ్చి `ఆమె ఏ గ్రహంలోనైనా పోటీ చేసేస్తారంటూ చెప్పేస్తారో వేచిచూడాల్సిందే!  ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు మోడీపై చెళుకు లెయ్యాలని ప్రయత్నిస్తే సోనియా విదేశీయత వివాదం మరోసారి తెరమీదికి తెస్తున్నట్లవుతోంది కదూ...!  

సంక్షోభంలో యుపిఎ సర్కార్‌

అనుకున్నంతా జరిగింది....! ఆడ్డగోలు నిర్ణయాలతో ప్రజాజీవనాన్ని కష్టాల్లోకి యుపిఎ సర్కార్‌ నెట్టేస్తోందంటూ కళ్ళెర్రజేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్‌కు తన మద్దతు పూర్తిగా ఉపసంహరించుకుంది. డీజిల్‌ ధరను బాగా పెంచడంతో బాటు భారత్‌ భావిప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ ఎఫ్‌డిఐకి అనుమతి ఇవ్వడంపట్ల మమత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిని మరిన్ని సమస్యలకు గురి చేస్తాయనీ, కాబట్టి ఎఫ్‌డిఐకి అనుమతి ఇచ్చే విషయాన్ని పూనరాలోచించి తక్షణమే ఆ నిర్ణయాలను రద్దు చేసుకోవాలంటూ మమత హెచ్చరించింది. భాగస్వామ్య పార్టీలు హఠం చేసినప్పుడ్‌ల్లా నిర్ణయలు మార్చుకోటే పరసతి పోతుందనుకున్న సర్కార్‌ తన నిర్ణయానికే కట్టుబడిరది. అంతేకాకుండా పార్లమెంటులో తృణమూల్‌కు ఉన్న బలం 19 మంది ఎంపిలు కాగా, వీరు వైదొలగినా తమకు 307 మంది ఎంపిల బలం ఉంటుంది కాబట్టి తమ సర్కార్‌ కొచ్చిన ఇబ్బందేంలేదని యుపిఎ భరోసాగా ఉంది. నిజానికి 276 మంది ఎంపిలు కాంగ్రెస్‌ బలంకాగా, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్‌ సెక్యులర్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ బలం 307 అవుతుంది. ఇది అధికారంలో కొనసాగేందుకు అవసమైన ఎంపీల సంఖ్యకంటే 35 ఎక్కువ. కాబట్టి తమ సర్కార్‌కు ఢోకాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు పైకి చెబ్తున్నా రాజకీయ చదరంగంలో అద్భుతంగా పావులు కదపగలిగే మేధాశక్తి ఉన్న మమత మళ్ళీ ఏం ఎత్తులు వేస్తుందో అనుకుంటూ భయంభయంగానే ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేతల భయాలను నిజం చేస్తున్నట్లుగా` మమతా బెనర్జీ ఇప్పటికే యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో సంవత్సరకాలంలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మద్దతు పలికితే అందుకు పరిహారం వచ్చే ఎన్నికల్లో మనం చెల్లించుకోవలసి వస్తుందంటూ మమత హెచ్చరిస్తున్నారట ! ఇది నిజమేనని అంగీకరించిన ఇతర భాగస్వామ్య పక్షాలు మమతతో చేతులుకలిపి మద్దతు ఉపసంహరణ దిశగా ఆలోచనలు సారిస్తున్నట్లు  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినా తమకే లాభం అనుకుంటూ బిజిపి పక్షాలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి !