electric shock agriculture field man die andhra pradesh

కరెంటు ఉచ్చు... యువకుడి బలి

  పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచెనగూడెంలో మంగళవారం రాత్రి ఒక ఘోరం జరిగింది. ఈ గ్రామం సమీపంలోని పొలాల్లో వేటగాళ్ళు అడవి జంతువుల కోసం పెట్టిన కరెంటు తీగల ఉచ్చు తగిలి అదే గ్రామానికి చెందిన నున్నా అరుణ్ కుమార్ (30) అనే యువకుడు మరణించాడు. ఈ ప్రాంతంలోని పొలాల్లో కొంతమంది వేటగాళ్ళు అడవి పందులు, దుప్పుల కోసం కరెంటు తీగలు అమరుస్తూ వుంటారు. తన పొలంలో పశుశువుల మేత కోసం అరుణ్ కుమార్ వెళ్తుండగా అతని కాళ్ళకు కరెంటు తీగలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తాము పన్నిన కరెంటు ఉచ్చులో పడి యువకుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న వేటగాళ్ళు ఈ నేరం తమ మీదకు రాకుండా వుండాలన్న ఉద్దేశంతో అరుణ్ కుమార్ మృతదేహాన్ని అక్కడి నుంచి దూరంగా ఈడ్చుకుని వెళ్ళి వదిలేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వేటగాళ్ళు కరెంటు ఉచ్చులు పెట్టకుండా నిరోధించాలని ఎప్పటి నుంచో రైతులు పోలీసులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

swine flu Hyderabad telangana cm kcr

స్వైన్ ఫ్లూ... కేసీఆర్ సీరియస్

  హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఒక్క మంగళవారం నాడే నలుగురు వ్యక్తులు మరణించారు. అనేకమంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు. చికిత్స చేస్తున్న జూనియర్ వైద్యులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాఖాధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్ఫ్లూ అంశం మీద చర్చించడానికి బుధవారం సాయంత్రం కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న స్వైన్ ఫ్లూ పరిస్థితిపై కేసీఆర్... ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి వివరించారు. వైద్య సాయం కోసం వైద్య బృందాలను పంపాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. స్వైన్ ఫ్లూ విషయంలో ఆరోగ్య శాఖ అధికారులు తమకు ఎంతమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కేసీఆర్ భావిస్తూ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద సమీక్ష జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ని ఆదేశించారు. మరో 20 రోజులపాటు చలిగాలుల తీవ్రత వుండే అవకాశం వుంది కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని కేసీఆర్ సూచించారు.

Alcohol Former MP Son

అసలే మాజీ ఎంపీ కొడుకు... పైగా తప్పతాగాడు...

  చాలామంది ప్రజా ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాలు తప్పతాగి గొడవలకు దిగడం ఈమధ్య కాలంలో మామూలైపోయింది. చేతినిండా డబ్బు, ఊరు నిండా అధికారం.. ఇక చెప్పేదేముంది... భావిభారత రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సంఘటన మంగళవారం నాడు కూడా జరిగింది. ఓ మాజీ ఎంపీ కుమారుడు మంగళవారం అర్ధరాత్రి తప్పతాగి హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో హడావిడి చేశాడు. తప్పతాగి ఓ హెటల్‌కి వచ్చిన అతను బిర్యానీ పార్సిల్ విషయంలో హోటల్ సిబ్బందితో గొడవ పడ్డాడు. గొడవ ముదిరిపోవడంతో మద్యం బాటిళ్ళతో హోటల్ సిబ్బంది మీద దాడి చేశాడు. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికొచ్చిన పోలీసులు అతన్ని అదుపు చేయబోగా, పోలీసుల మీద కూడా దాడి చేశాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తర్వాత ఏం జరుగుతుంది? పొలిటికల్ ప్రెజర్లు వస్తాయి.. అతన్ని విడిచిపెట్టేస్తారు. జనం టైమ్ బ్యాడ్ అయితే ఫ్యూచర్లో అతగాడు ఎంపీ కూడా అవుతాడు.

cho ramaswamy health serious

చో రామస్వామికి సీరియస్

  ప్రముఖ తమిళ జర్నలిస్ట్, నటుడు, రాజకీయ నాయకుడు, న్యాయవాది, ‘తుగ్లక్’ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చో రామస్వామి వయసు 80 సంవత్సరాలు. ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ అనే నాటకాన్ని తమిళనాడు అంతటా ప్రదర్శించడం ద్వారా పాపులర్ అయిన ఆయన అనేక సినిమాల్లో కూడా నటించారు. ‘తుగ్లక్’ పేరుతో పత్రికని స్థాపించి రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా నామినేట్ అయ్యారు. తమిళనాడులో రాజకీయ దిగ్గజాలయిన అందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. చో రామస్వామి మరెవరో కాదు.. హీరోయిన్ రమ్యకృష్ణకి స్వయానా మేనమామ.

The musicians were sentenced to 90 lashes each religious police in Bujaq ISIS

సంగీత కళాకారుల్ని చావబాదారు

  శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసం ఫణిః అన్నారు. అంటే శిశువులు, పశువులు, చివరికి పాములు కూడా సంగీతాన్ని ఇష్టపడతాయని అర్థం. అయితే ప్రస్తుతం ప్రపంచానికి దడ పుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు మాత్రం సంగీతం అంటే ఎంతమాత్రం ఇష్టం ఉన్నట్టు లేదు. సిరియాలోని బుజాక్ నగరంలో 15 మంది సంగీత కళాకారులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చుట్టుముట్టి బెత్తంతో చావబాదారు. ఒక్కో కళాకారుడికి 90 చొప్పున బెత్తం దెబ్బలు కొట్టారు. దెబ్బలు తిన్న సంగీత కళాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కళాకారుల పరిస్థితి అయితే విషమంగా మారింది. ఇంతకీ ఈ తీవ్రవాదులు సంగీత కళాకారుల్ని కొట్టడానికి కారణమేమింటే, వాళ్ళు ఇస్లాం సంప్రదాయ బద్ధమైన సంగీత పరికరాలు కాకుండా కీబోర్డు, గిటార్, వయొలిన్ లాంటి ఇస్లామేతర సంగీత పరికరాలు వాయిస్తున్నారట. ఈ నెపం మీద ఆ కళాకారుల్ని చావబాదడంతో పాటు వారు ఉపయోగిస్తున్న సంగీత పరికరాలను ధ్వంసం చేశారు. ఇంతకంటే అన్యాయం మరోటి వుంటుందా?

hitec city cab driver she team cell phone video

యువతిని వీడియో తీసిన డ్రైవర్

  అప్పుడెప్పుడో ఉండేవారని చెప్పుకునే రాక్షస జాతి ఇప్పుడు కొంతమంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల రూపంలో ఇప్పటి సమాజంలో తిరుగుతోందా అనే సందేహాలు కలుగున్నాయి. ఇటీవలి కాలంలో క్యాబ్, ఆటో డ్రైవర్లు దేశవ్యాప్తంగా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడటం, అవమానించడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. మొన్నీమధ్యే జూబిలీహిల్స్‌లో నలుగురు ఆటో డ్రైవర్లు ఒక మైనర్ బాలికను మానభంగం చేశారు. ఇదిలా వుంటే, మంగళవారం నాడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక ఉద్యోగిని క్యాబ్ ఎక్కింది. ఆ సమయంలో క్యాబ్‌లో ఆమె ఒక్కతే వుంది. కాస్త అలసటగా వుండటంతో ఆమె క్యాబ్‌లో నిద్రపోయింది. అయితే ఆ క్యాబ్‌ని డ్రైవ్ చేస్తున్న రషీద్ అనే డ్రైవర్ నిద్రపోతున్న ఆ యువతిని సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. దాదాపు ఎనిమిది నిమిషాలపాటు ఆమెను వీడియో తీశాడు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసు ‘షీ’ టీమ్‌లు ఈ డ్రైవర్ పద్ధతి అనుమానంగా అనిపించి, క్యాబ్ ఆపి చెక్ చేస్తే అతను చేసిన నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం సదరు డ్రైవర్ కటకటాల వెనుక వున్నాడు.

coal scam ex prime minister manmohan cbi

మన్‌మోహన్‌సింగ్‌ని ప్రశ్నించిన సీబీఐ

  బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్ని సీబీఐ విచారించింది. హిందాల్కో సంస్థకు కేటాయించిన బ్లాక్లకు సంబంధించి సింగ్ గారిని విచారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ప్రత్యేక సీబీఐ కోర్టుకు నివేదిక అందజేయవలసి వుంది. దాంతో పెండింగ్ ఉన్న పెద్దమనుషులందర్నీ విచారించాలని భావించిన సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం మన్మోహన్ సింగ్ను ఆయన నివాసంలో విచారించినట్టు సమాచారం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వున్న సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన అధీనంలోనే ఉండేది. ఆ సమయంలో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని హిందాల్కోకు కేటాయించటంపై ఆయనను సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది.

Sivananda Swami

శిష్యురాలి నిప్పు కౌగిలి.. స్వామీజీ బలి...

  ఈరోజుల్లో స్వామీజీ అంటే ఆయనకో శిష్యురాలు వుండటం, ఆ శిష్యురాలితో సదరు స్వామీజీకీ ఏదేదో ఉండటం మామూలైపోయింది. ఇలాంటి స్వామీజీల వల్ల ఉత్తములైన స్వామీజీలను కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నాటకలోని యలబుర్గి తాలూకాలో వున్న మటికట్ట అనే ఊళ్ళో కొప్పళ మఠం పేరుతో ఒక మఠం వుంది. దీనికి శివానంద స్వామీజీ అనే స్వామీజీ అధిపతి. ఆయనకు తన దగ్గర వుండే శిష్యురాలితో సంబంధం వుందన్న విషయం ఎప్పటినుంచో ప్రచారంలో వుంది. కాగా, మఠంలో తనకూ వాటా ఇవ్వాలని సదరు శిష్యురాలు గత కొంతకాలంగా స్వామీజీని వేధిస్తోంది. దానికి స్వామీజీ నో చెప్పడంతో ఆమె పగ పెంచుకుంది. దాంతో సోమవారం నాడు శివానంద స్వామీజీ పూజలో వుండగా సదరు శిష్యురాలు ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ తర్వాత కాలిపోతున్న ఆమె పూజలో కూర్చునివున్న స్వామీజీ దగ్గరకి పరుగు పరుగున వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుంది. దాంతో శివానంద స్వామీజీ కూడా మంటలపాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ మరణించారు.

Philippine Police Arrest

జోకేసినందుకు లోపలేశారు....

  సాధారణంగా ఎవరైనా జోకేస్తే ఎదుటివాళ్ళు నవ్వుతారు. కానీ ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు కుర్రాళ్ళు జోకేసిన పాపానికి జైల్లో పడ్డారు. ఇంతకీ వాళ్ళు జోకు చేసింది ఎవరితోనో కాదు.. సాక్షాత్తూ పోలీసులతో. ఎంత పోలీసులైతే మాత్రం జోకు వేసినంత మాత్రాన అరెస్టు చేస్తారా అనే సందేహం రావొచ్చు.. కానీ వాళ్ళు వేసిన జోక్ ఏంటనుకుంటున్నారు... ఒక పెద్ద సభలో బాంబు పెట్టామని పోలీసులతోనే అన్నారు. పోలీసులు బిత్తరపోతే, ఊరికే జోక్ చేశాం అని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వినకుండా ముగ్గుర్నీ మడతపెట్టి లాకప్పులో వేశారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి పోప్ వచ్చిన సందర్భంగా 60 లక్షల మంది క్రైస్తవులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం బందోబస్తు చూస్తున్న పోలీసుల దగ్గరకి వెళ్ళిన ఈ ముగ్గురు యువకులు ఈ సభలో బాంబు పెట్టాం అని, ఆ తర్వాత జోకేశాం అని నవ్వేశారు. పోలీసులు వీళ్ళని అరెస్టు చేసి, ఆ విషయాన్ని పోప్ వెళ్ళిపోయిన తర్వాత బయటపెట్టారు. ఆ యువకులు జోకు వేశారని మాకు తెలుసు. అయితే 60 లక్షల మంది వున్న సభలో ఈ మాట బహిరంగంగా అంటే భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగే ప్రమాదం వుంది. అందుకే అలాంటి కుళ్ళు జోకు వేసిన వారిని అరెస్టు చేశాం అని చెప్పారు. ఓ నాలుగైదు రోజులు వాళ్ళని కుళ్ళబొడిచి మరోసారి ఇలాంటి కుళ్ళు జోకులు వేయకూడదని బుద్ధి వచ్చేలా చేసి వదిలిపెట్టేస్తామని పోలీసులు తెలిపారు.

Youth arrested 545 SIM cards

545 సిమ్ కార్డులతో పనేంటి?

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని ఒక ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అన్ని ఇళ్ళలో చెక్ చేసినట్టుగానే ఒక ఇంటి తలుపు కొట్టారు. ఆ ఇంటి తలుపును ఓ పెద్దమనిషి తీశాడు. పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఒక్కసారి అంతా పరికించి చూశారు. అక్కడ అనుమానించదగ్గ వస్తువులేవీ కనిపించలేదు. ఏదో మధ్యతరగతి మానవుల ఇల్లు అనుకున్న పోలీసులు ఆ ఇంట్లోంచి బయటకి నడుస్తుండగా, ఆ ఇంట్లో ఒక మూల కంప్యూటర్ ఆపరేట్ చేస్తు్న్న ఓ కుర్రాడు కనిపించాడు. ఎవరా కుర్రాడు అని ఆ ఇంటి తలుపు తీసిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. మా అబ్బాయే అని అతను చెప్పాడు. పోలీసులు ఆ కుర్రాడి దగ్గరకి వెళ్ళి కంప్యూటర్ టేబుల్ దగ్గర యథాలాపంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన వస్తువులు చూసి బిత్తరపోయారు. అక్కడ ఒకటి కాదు రెండు కాదు.. పోనీ వంద కాదు... ఏకంగా 545 సిమ్ కార్డులు వున్నాయి. ఇన్ని సిమ్ కార్డులు మీకెందుకని ప్రశ్నిస్తే ఆ తండ్రీ కొడుకుల నుంచి సమాధానం రాలేదు. ఇన్ని సిమ్ కార్డులతో ఏదో తేడా వ్యవహారమే చేస్తున్నారని అర్థం చేసుకున్న పోలీసులు ఆ సిమ్ కార్డులతోపాటు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.

ISIS

ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెరలో ఇద్దరు జపనీయులు

  ఇరాక్, సిరియా దేశాలలో తిష్ట వేసిన ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెరలో ఇద్దరు జపనీయులు బందీలుగా చిక్కారు. వారిరువురితో కూడిన ఒక వీడియో క్లిప్పింగును ఆ సంస్థకు చెందిన అల్-ఫుర్ఖాన్ అనే వెబ్ సైటులో పెట్టింది. వారిరువురు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలంటే 72 గంటలలోగా జపాన్ ప్రభుత్వం తమకు $200 మిలియన్లు చెల్లించాలని షరతు విధించింది. గడువు ముగిసిన వెంటనే వారిరువురినీ హతమారుస్తామని ఐ.యస్.ఐ.యస్. హెచ్చరించింది. ఇంతకు ముందు ఐ.యస్.ఐ.యస్. తనకు బందీలుగా చిక్కిన వివిధ దేశస్థులను అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి, దానిని చిత్రీకరించి తన వెబ్ సైటులో పెడుతుండేది. ఈసారి కూడా తనకు బందీలుగా చిక్కిన కెంజి గోటో జోగో మరియు హరున యుకావలకు కాషాయ రంగు దుస్తులను ధరింపజేసి, ఒక ఎడారి ప్రాంతంలో వారిరువురిని మోకాలుపై కూర్చోబెట్టి వారిరువురి మధ్య నల్లదుస్తులు, మొహానికి నల్లముసుగు ధరించిన ఒక ఉగ్రవాది చేసిన హెచ్చరికను చిత్రీకరించి ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్ సైటులో ఉంచింది.   అందులో నల్ల ముసుగు ధరించిన ఉగ్రవాది నేరుగా జపాన్ ప్రధాన మంత్రి షినాజో అబేని ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ దేశం మా ఇస్లామిక్ స్టేట్ కి 8500 కిమీ దూరంలో ఉన్నప్పటికీ, మీరు పనిగట్టుకొని మాపై దాడులలో పాల్గొనేందుకు ముందుకు వచ్చేరు. మా మహిళలు, పిల్లలను హతమార్చేందుకు మీరు చాలా ఉదారంగా $ 100 మిలియన్లు విరాళం ఇచ్చేరు. కనుక ఇప్పుడు మీ ఇద్దరి పౌరుల ప్రాణాలు కాపాడుకోవాలనుకొంటే 72 గంటలలో $200 మిలియన్లు చెల్లించాలి.” అని హెచ్చరించాడు.   ఇంతకు ముందు ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు చాలా మందిని అతికిరాతకంగా హతమార్చారు. కానీ ఏనాడు ఈవిధంగా డబ్బు కోసం డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటి సారిగా $ 400 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. బందీలను విడిపించుకొనేందుకు అంత భారీ మొత్తాలు వారికి ముట్టజెప్పడం మొదలుపెడితే ఆ డబ్బుతో వారు మరిన్ని ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసి మరింత బలవంతులవుతారు. కనుక జపాన్ ప్రభుత్వం వారి షరతుకి లొంగకపోవచ్చును. కానీ ఉగ్రవాదుల చెర నుండి 72 గంటలలో వ్యవధిలో బందీలను విడిపించడం కూడా అసాధ్యమే. కనుక ఆ ఇద్దరు బందీలు కూడా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువ. ఇది మనసుని కలిచివేసే చేదు నిజం.

Transplant first Organ donation from UK newborn

చిన్నారి అవయవదాత

  అవయవ దానం మీద ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. నేత్రదానం, రక్తదానం తర్వాత అవయవదానం అంత గొప్పదన్న విషయాన్ని ఇప్పుడు చాలామంది గుర్తిస్తున్నారు. ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే, వారి శరీరంలో పనికివచ్చే అవయవాలను అవసరం వున్నవారికి దానం చేయడం, మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆ గొప్ప పనిని కేవలం ఆరు రోజుల వయసున్న బాలిక ద్వారా జరిగింది. బ్రిటన్‌లోని ఓ మహిళకు ఆరు రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. పుట్టినప్పటి నుంచే ఆ పాప గుండెలో నయం కాని సమస్య వుందని వైద్యులు అర్థం చేసుకున్నారు. ఆమె ఎక్కువకాలం బతకదని నిర్ధారించారు. ఆ విషయం తెలిసిన ఆ పాప తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. అయితే వారి పాపకు మరో జీవితాన్నిచ్చే ప్రతిపాదనను డాక్టర్లు చేశారు. ఆ పాప శరీరంలో కిడ్నీలు, లివర్, ఇతర కొన్ని ఉపయోగపడే భాగాలను అవి అవసరమైన పిల్లలకు దానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దానికి ఆ పాప తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ తర్వాత వైద్యులు ఆ పాప నుంచి ఆ అవయవాలను సేకరించి వాటి అవసరం వున్న అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియాలోని చిన్నపిల్లలకు వాటిని పంపించారు. ఈ అవయవాల ద్వారా ఆ మూడు దేశాల్లో వున్న పిల్లలకు కొత్త జీవితం వస్తుందన్న ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు. ఆ చిన్నారి అవయవదాతకి, ఆమె తల్లిదండ్రులకి సెల్యూట్.

మనిషి కడుపున ఏనుగు పిల్ల?

  ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. అది నార్వేలో ఒక మహిళ కడుపున బుజ్జి ఏనుగుపిల్ల పుట్టిందని. ఈ వార్తకు సాక్ష్యంగా ఒక పసికందు ఫొటో కూడా కనిపిస్తోంది. ఆ ఫొటోలో వున్న పసికందుకు బుజ్జి తొండం వుంది. చిన్నచిన్న కాళ్ళు చేతులు కూడా ఏనుగు కాళ్ళను పోలి వున్నాయి. నార్వేకి చెందిన అలెగ్జాండర్, లోలా అండర్సన్ అనే దంపతులకు ఈ శిశువు పుట్టాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తను చాలామంది విశ్వసించడం లేదు. ఇది ఫొటోషాప్ మాయాజాలంలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న వార్తలో సదరు ఎలిఫెంట్ బోయ్ ఫొటో ఒకే పోజులో వున్నది కనిపిస్తోంది. మరో పోజుగానీ, వీడియోగానీ కనిపించడం లేదు. దాంతో ఈ వార్తను చాలామంది విశ్వసించడం లేదు.

కేసీఆర్ హనీమూన్ పూర్తయింది

  ముఖ్యమంత్రి కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాంఛి రసికుడైన దిగ్విజయ్ సింగ్ ఏ మాట మాట్లాడినా అందులో కాస్తంత రసికత్వం వుంటుంది. కేసీఆర్ హనీమూన్ ముగిసిందంటే అర్థం... కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఎనిమిది నెలలు అవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలదొక్కుకోవడానికి కొంత కాలం పడుతుంది కదా.. ఆ కొంత కాలాన్ని పొలిటికల్‌గా ‘హనీమూన్’ అంటారన్నమాట. ఈ సమయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరన్నమాట. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలం పూర్తయింది కాబట్టి ఆ ‘హనీమూన్’ పీరియడ్ ముగిసిపోయిందని దిగ్విజయ్ సింగ్ ఉద్దేశం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం హనీమూన్ కాలం ముగిసింది కాబట్టి ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటామని డిగ్గీ రాజా ఆవేశంగా చెప్పారు.

గనుల గాలి జనార్దనరెడ్డికి బెయిల్

  గాలిని ఎవరూ బంధించలేరంటారు. అయితే 41 నెలలుగా గాలి జైల్లోనే బందీ అయింది... గాలి అంటే, ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇరుక్కున్న గనుల ఘనుడు గాలి జనార్దన రెడ్డి. ఎప్పటి నుంచో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఆయనకి ఒక కేసు తర్వాత ఒక కేసులో బెయిల్ డైలీ సీరియల్‌లాగా వచ్చింది. ఎన్నిసార్లు బెయిల్ వచ్చినా జైల్లోనే ఉండాల్సినన్ని కేసులు ఆయన మీద వున్నాయి. చివరికి బెయిల్ కోసం జడ్జికి లంచం ఇచ్చిన కేసు కూడా ఆయన మెడకి చుట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. గాలికి బెయిల్‌ మంజూరు చేస్తే తమకు అభ్యంతరంలేదని సీబీఐ పేర్కొనడంతో సుప్రీం కోర్టు మంగళవారం  బెయిల్‌ మంజూరు చేసింది. తనపై వున్న అన్ని కేసులలో బెయిల్‌ మంజూరు కావడంతో మరో రెండు రోజుల్లో గాలి జైలు నుంచి బయటకు రానున్నారు.