new zealand win cricket world cup 2015

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

  ప్రపంచ కప్ 2015 లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్‌లన్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 124 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ రెండు కోల్పోయి 12.2 ఓవర్లలోనే చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 123 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ కివీస్ బౌలర్ సౌతీ చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పిట్టల్లా రాలిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. చివరి 20 పరుగులు సాధించడానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్ సౌతీ వికెట్లు నేలకూల్చాడు. సౌతీ 7/33 గణాంకాన్ని నమోదు చేశాడు. కివీస్ బ్యాటింగ్ ప్రారంభించాక అలాగే కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లీషు బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 18 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసేశాడు. 77 పరుగుల దగ్గర ఔటయ్యాడు. మొత్తానికి ఈ మ్యాచ్ న్యూజిలాండ్ వైపు ఏకపక్షంగా సాగింది. England 123 (33.2 ov), New Zealand 125/2 (12.2 ov)

bihar cm manjhi resignation resign

బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ రాజీనామా

  బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం నాడు ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షకు నిలవాల్సి వుంది. నిన్నటి వరకూ బలపరీక్షకు సిద్ధంగా వున్నానని చెబుతూ వచ్చిన ఆయన, శుక్రవారం ఉదయం బల పరీక్షకు ముందే రాష్ట్ర గవర్నర్ని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. మోడీ మీద అలిగి గత ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. మనోడే కదా అని మాంఝీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అయితే ఆ తర్వాత మాంఝీ ఏకు కాస్తా మేకు అయి కూర్చున్నాడు. తనను అందలం ఎక్కించిన ఎవర్నీ పట్టింటచుకోకుండా వ్యవహరించారు. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తూ ఇష్టానుసారం వ్యవహరించారు. దాంతో జేడీయు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. న్యాయంగా అయితే మాంఝీ అప్పుడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ అలా చేయకుండా రాజకీయాలు ప్రదర్శించారు. బీజేపీ మద్దతులో ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశించారు. బీజేపీ కూడా మద్దతు ఇచ్చే విధంగానే కనిపించింది. అయితే ఏ తేడా వచ్చిందోగానీ మాంఝీ రాజీనామా చేసేశారు.

cricket world cup 2015

ఇంగ్లాండ్ స్కోరు ఘోరం

  ప్రపంచ కప్ క్రికెట్ 2015లో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 123 పరుగులకు 32.2 ఓవర్లలోనే ఆల్ ఔట్ అయింది. క్రికెట్‌ని ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు ఒకప్పుడు విశ్వవిజేతగా వున్న ఇంగ్లండ్‌కి ఇది ఘోర అవమానం కిందే లెక్క. న్యూజిలాండ్ బౌలర్ కివీస్ బౌలర్ సౌతీ చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పిట్టల్లా రాలిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. చివరి 20 పరుగులు సాధించడానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్ సౌతీ 7/33 గణాంకాన్ని నమోదు చేశాడు. పరిస్థితిని చూస్తే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి డిసైడ్ అయిపోయినట్టే. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే అది మరో ప్రపంచ వింత.

Pet monkey

కోతి.. కోతీశ్వరుడు

  కోతీశ్వరుడు.. ఇది అచ్చుతప్పు కాదు.. కోతిగనుక కోటీశ్వరుడు అయితే ఇలా పిలవటం బెటరేమో అనేది కవి హృదయం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఓ కోతి.. సారీ.. ఓ కోతిగారు (డబ్బున్నవాళ్ళని గౌరవిస్తే మంచిది కదా) కోట్లకు అధిపతి కాబోతోంది. యూపీలో సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలీలో సబిష్ట అనే మహిళా న్యాయవాది వున్నారు. ఆమె భర్త శ్రీవాస్తవ. ఆమె న్యాయవాదిగా రెండు చేతులతో సంపాదిస్తుంటే, ఆమె భర్త వ్యాపారాలు చేస్తూ నాలుగు చేతులతో సంపాదిస్తున్నాడు. వీళ్ళకి కోట్ల ఆస్తి వుందిగానీ, వాటిని అనుభవించే వారసులు మాత్రం లేరు. అందుకే వీళ్ళు పదేళ్ళ క్రితం నుంచి ఒక కోతి పిల్లను పెంచుకోవడం మొదలుపెట్టారు. దానికి ‘చున్‌మున్’ అని పేరు పెట్టారు. దాన్ని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. దాని వైభవం చూడాలంటే రెండు కళ్ళు చాలవు. కొంతకాలం తర్వాత తాము చనిపోతే, ఆ కోతిని ఎవరు చూసుకుంటారని వాళ్ళకి సందేహం వచ్చింది. అందుకే తమకున్న ఆస్తి మొత్తాన్నీ ఆ కోతి పేరిట రాసేయాలని డిసైడ్ అయ్యారు. తాము ఉన్నంతవరకూ తామే చున్‌మున్‌ని చక్కగా చూసుకుంటామని, ఒకవేళ తమకు ఏదైనా అయితే ఆస్తి మొత్తం తనకే దక్కేట్టుగా ఏర్పాట్లు చేశామని వాళ్ళు చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూడా తమ చున్‌మున్ ‘కోతీశ్వరుడే’నని అంటున్నారు.

mim mp asaduddin

అసదుద్దీన్‌ భాయ్‌కి నోటీసులు

  ఎం.ఐ.ఎం. పార్టీ నాయకులు, సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రసంగాలు చేయడంలో స్పెషలిస్టులనే విషయం తెలిసిందే. వీళ్ళు ఎక్కడైనా బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి కామెంట్లు చేస్తారో అని పోలీసులు అదిరిపోతూ వుంటారు. వీళ్ళ సభలకు అనుమతులు నిరాకరిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగుళూరులో ఈనెల 21వ తేదీన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. అయితే బెంగళూరు పోలీసు అధికారులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. ఆ విషయాన్ని అసదుద్దీన్‌కి బుధవారం నాడు నోటీసుల ద్వారా తెలియజేశారు. తమరు బెంగళూరులో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వడం లేదంటూ ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ వెరైటీ ఏమిటంటే, తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసులకు అసదుద్దీన్ గులాబీలు ఇచ్చి పంపించారు.

cricket  Kumble

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌... అనిల్ కుంబ్లే

  మాజీ ఇండియన్ క్రికెటర్ అనిల్ కుంబ్లేని అరుదైన గౌరవం వెతుక్కుంటూ వచ్చింది. కుంబ్లే త్వరలో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం స్వీకరించనున్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా ఆదివారం నాడు జరిగే ఇండియా - దక్షిణాఫ్రియా మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ కుంబ్లేకు హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యత్వాన్ని అందించనుంది. అనిల్ కుంబ్లే ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోని సభ్యుల సంఖ్య 77కి చేరనుంది. గతంలో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్ నుంచి చోటు దక్కిన వారిలో బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు. తన కెరీర్లో అనిల్ కుంబ్లే సాధించిన రికార్డుల ఆధారంగా ఆయనకు ఈ గౌరవం దక్కనుంది.

 female cartoonist ragati pandari

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి మృతి

  ప్రముఖ మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గురువారం నాడు విశాఖలో కన్నుమూశారు. ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి రాణించారు. రాగతి పండరి అవివాహిత. బాల్యంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డారు. అయినప్పటికీ కార్టూనిస్టుగా రాణించారు. చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆమె కార్టూన్లు గీసేవారు. ఆమె గీత తెలుగు పాఠకులకు సుపరిచితం. రాగతి పండరికి శ్రద్ధాంజలి.

andhra cm chandra babu proclainer jcp drive neeru chettu

సీఎం చంద్రబాబు... ప్రొక్లెయినర్ డ్రైవర్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొక్లెయినర్ నడిపారు. గురువారం నాడు ఆయన ప్రొక్లెయినర్ నడుపుతూ చెట్టు - నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లోనుంచి హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి. కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామంలో నీరు - చెట్టు పైలాన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రొక్లెయినర్ నడుపుతూ ‘నీరు - చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, బొజ్జల తదితరులు పాల్గొన్నారు.

telangana ministers fear

మంత్రుల మీటింగ్‌లో పేలుడు

  ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఐటీడీఏ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలువురు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూర్చుని సమావేశం జరుపుకుంటూ వుండగా అకస్మాత్తుగా పెద్ద పేలుడు ధ్వని వినిపించింది. దాంతో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నారు. ఏదైనా బాంబుగానీ, గన్‌గానీ పేలిందని భావించారు. భయంతో వణికిపోయారు. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, హై ఓల్టేజీ కారణంగా సమావేశం హాల్లోని ట్యూబ్ లైట్లు ఒక్కసారిగా పేలాయి. దానివల్లే అంత శబ్దం వచ్చింది. అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకుంటూ మళ్ళీ సమావేశాన్ని కొనసాగించారు.

d ramanaidu passes away

డి.రామానాయుడు అంత్యక్రియలు పూర్తి

  బుధవారం నాడు కన్నుమూసిన ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు అంత్యక్రియలు గురువారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. రామానాయుడు స్వగృహం నుంచి రామానాయుడు స్టూడియోస్ వరకు నిర్వహించిన అంతిమయాత్ర, రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించిన రామానాయుడు అంత్యక్రియలలో సినీ రంగ ప్రముఖులతోపాటు వేలాది మంది ప్రజలు పాల్గొని రామానాయుడికి అంతిమ నివాళులు అర్పించారు. రామానాయుడు చితికి ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిప్పంటించారు. అంతకుముందు రామానాయుడు భౌతిక కాయాన్ని  సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు, సినిమా పరిశ్రమకు చెందిన వారు, ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు.

telangana hyderabad settlers kcr promise no discrimination

ఇకపై ప్రాంతీయ వివక్ష వుండదట...

  మొన్నటి వరకూ 1956 అంశం మీద పట్టుదలగా వ్యవహరించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఈమధ్య ఆ పట్టు సడలించారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంతం మీద ప్రేమ కురిపిస్తున్నారు. ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రాంతీయ వివక్ష అనేదే వుండదని హామీ ఇచ్చారు. తాను కూడా హైదరాబాద్‌లో పుట్టలేదని, మెదక్ జిల్లాలో పుట్టిన తాను హైదరాబాద్‌లో స్థిరపడ్డానని చెప్పారు. కూకట్‌పల్లికి చెందిన కొందరు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ చల్లటి కబుర్లు చెప్పారు. ఆంధ్ర ప్రాంతవాసుల విషయంలో ఇక ఎలాంటి వివక్ష వుండదని కేసీఆర్ అన్నారు. అసలు హైదరాబాద్‌లో సెటిలర్లు అనేవాళ్ళు ఎవరూ లేరని, హైదరాబాద్‌ నగరంలో స్థిరపడినవాళ్ళందరూ హైదరాబాదీలేనని నొక్కి చెప్పారు. మళ్ళీ ఆయనే సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానని నమ్మకంగా చెప్పారు. అన్నట్టు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

ఒంటిమిట్ట రామయ్యకి ఏపీ అధికార లాంఛనాలు

  అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో వైభవంగా జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాద్రి రామయ్యకి ప్రభుత్వ లాంఛనాలు అందేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న సందేహం నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, శ్రీరామ భక్తులు, అధికార వర్గాల్లో వుండేది. ఇప్పుడు ఆ సందేహం తొలగిపోయింది. కడప జిల్లాలో, కడపకు చాలా సమీపంలో వున్న ఒంటిమిట్ట ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి ఒంటిమిట్ట కోదండరాముడికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఫైలు మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం కూడా చేసేశారు.

జింబాబ్వే విజయం

  ప్రపంచ కప్‌ 2015 లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) - జింబాబ్బే జట్ల మధ్య గురువారం నాడు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ మీద జింబాబ్వే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట యూఏఈ 285 పరుగులు చేసి, 286 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు వుంచింది. జింబాబ్వే ఈ లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి వుండగానే చేరుకుని విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో యూఏఈ జింబాబ్వేకి గట్టి పోటీ ఇచ్చినట్టే భావించాలి. సుదీర్ఘ కాలంగా క్రికెట్ రంగంలో వున్న జింబాబ్వే యూఏఈ భారీ స్కోరు చేయడానికి ఛాన్స్ ఇచ్చింది. అలాగే ఆ స్కోరును ఛేదించడానికి 48 ఓవర్లపాటు శ్రమించింది.

ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు

  ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సినీరంగానికి ఎనలేని కృషి చేసిన రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు కూడా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నానక్‌రామ్ గూడా రామానాయుడు స్టూడియోలో రామానాయుడి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఉంచిన రామానాయుడు భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.