ఢిల్లీ మెట్రో రైల్లో ఘోరం, విద్యార్ధి హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది, మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు, సీటు కోసం జరిగిన గొడవలో విచక్షణ కోల్పోయిన విద్యార్ధులు... పదహారేళ్ల ఇషును కత్తితో పొడిచి చంపేశారు. ఢిల్లీ కింగ్స్ వే క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో మెట్రోరైల్ ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందురోజు కూడా సీటు విషయంలో విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ గొడవను మనసులో పెట్టుకున్న కొందరు... ప్లాన్ ప్రకారం ఇషుఫై దాడికి తెగబడ్డారని, వీరంతా పదహారు, పదిహేడేళ్ల లోపు వారేనని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఐదుగురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన ఢిల్లీ ఖాకీలు...కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్ధులు...రెండు గ్రూపులుగా ఏర్పడి కొద్దిరోజులుగా దాడులు చేసుకుంటున్నారని, అదే క్రమంలో ప్లాన్ ప్రకారం ఇషుపై అటాక్ చేసి కత్తితో పొడిచి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

గవర్నర్ నరసింహన్ కు అలానే బావుందంట

  ప్రసుత్తం తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యంమంత్రులు వారి వారి పనులతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒక గవర్నర్ ఉన్నారనే సంగతి మర్చిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నా గవర్నర్ దగ్గరకు వచ్చి పరిష్కార మార్గం చూపమని కోరేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య వాదాలు ఒక రేంజ్ లో ఉండేవి. అప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అడపాదడపా గవర్నర్ దగ్గరకు రావడం వారి సమస్యలు వివరించడం జరిగేది. అయితే ఎప్పుడైతే ఓటుకు నోటు వ్యవహారం బయటపడిందో అప్పుటి నుండి గవర్నర్ కు అసలు చిక్కులు వచ్చిపడ్డాయి. ఈవిషయంపై ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు పోటాపోటీగా గవర్నర్ కు ఫిర్యాదులు చేశారు. అయితే గవర్నర్ మాత్రం ఈ విషయంలో రెండు రాష్టాలకు సరైన పరిష్కార మార్గం చూపలేకపోయారు. ఎవరిని సపోర్టు చేస్తే ఏం సమస్య వచ్చిపడుతుందో అన్న భయంతో  వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చారే తప్ప సరైన చర్యలు తీసకోలేకపోయారు. ఇక అప్పటినుండి ఇద్దురు సీఎం లు కూడా గవర్నర్ తో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య వచ్చిన కోర్టునో.. కేంద్రాన్నో ఆశ్రయిస్తున్నారే తప్ప గవర్నర్ వరకూ వెళ్లడం లేదు. దీంతో ఇద్దరు సీఎంలే కాదు.. మంత్రులు.. అధికారులు కూడా రాజభవన్ ఎక్కడుందో మరిచిపోయారంటూ.. అసలు గవర్నర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారంటూ మర్చిపోయారని కొంతమంది విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. అసలు సంగతేంటంటే గవర్నర్ కూడా ఎలాంటి తలనొప్పులు లేకుండా.. ఈజీవితమే హాయిగా ఉందని.. హాయిగా కాలం గడిపేస్తున్నారట.

ఎస్సైని కొట్టి చంపి, ఆ తర్వాత ఉరి తీశారు

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ అనుమానాస్పద మృతి... తెలంగాణలో సంచలనం సష్టిస్తోంది. ఎస్సై మృతి వెనుక మంత్రి మహేందర్ రెడ్డి, ఇసుక మాఫియా, ఇద్దరు సీఐల హస్తముందంటూ ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలోనూ ఎస్సై రమేష్ మృతదేహంపై అనేకచోట్ల గాయాలున్నాయని తేలడంతో, కొట్టిచంపి ఆ తర్వాత ఉరి వేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్సై భార్య గీత, అతని కుటుంబ సభ్యులు మొదట్నుంచీ అవే అనుమానాలు వ్యక్తంచేస్తుండగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా అలాంటి సందేహాలే వ్యక్తంచేశారు. ఎస్సై రమేష్ ను కొట్టిచంపి ఉరేశారని, ఈ కేసును కేసీఆర్ సీరియస్ గా తీసుకుని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్సై రమేష్ అంత్యక్రియల సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని పట్టుబట్టిన బంధువులు... ఎస్పీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

వరుణ్ తేజ్ ను తనకోసమే కన్నారంట..

  అందరి కంటే కాస్త భిన్నంగా సినిమాలు తీయడంలో తనదైన ప్రత్యేకతను చాటి చూపాడు విలక్షణ డైరెక్టర్ క్రిష్. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా విభిన్న కథాంశంతో కంచె సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుక రానున్నారు. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఉండే ఈ సినిమా ఫస్ట్ లుక్ కే చాలా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈసినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా డైరెక్ట్రర్ క్రిష్  మాట్లాడుతూ వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాసుకున్న పాత్రకు వరుణ్ 100 శాతం న్యాయం చేశాడని.. వరుణ్ తోపాటు యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 70 ఏళ్ల తర్వాత జరిగిన నేపథ్యం ఆధారంగా తీసిన సినిమా కాబట్టి అప్పడు వాడిన తుపాకులు.. టీకప్పులు.. ట్యాంకర్లు వాడామని.. దీనికి జార్జియా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. వరుణ్ తేజ్ లాంటి అందమైన అబ్బాయిని నాగబాబు నాకోసమే కన్నారని.. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

కొత్త ఐడియాలు కావాలంటున్న చంద్రబాబు

రైతు రుణమాఫీపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో రుణమాఫీ సక్రమంగా అమలు జరుగుతున్నా, కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని బాబు మండిపడ్డారు. కలెక్టర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రుణమాఫీపై సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు, రుణమాఫీపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్లకు ఆదేశించారు. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు... ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చినా, ఇంకా కొన్నిచోట్ల పవర్ కట్స్ జరుగుతున్నాయని మండిపడ్డారు. బోగస్ కార్డులు ఏరివేసి, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయాలని కలెక్టర్లకు బాబు దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు నిత్యం ప్రజల్లో ఉండాలన్న సీఎం, స్టేట్ డెవలప్ మెంట్ కు కొత్త ఐడియాలు ఇవ్వాలంటూ కోరారు.

ఎయిర్ బేస్ పై అటాక్ తో కంగుతిన్న పాక్ ఆర్మీ

పాకిస్తాన్ లో తరుచూ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దాయాది దేశం అదే ఉగ్రవాదానికి బలైపోతోంది. ఇప్పుడు ఏకంగా పాక్ ఎయిర్ బేస్ మీదే దాడి చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. పెషావర్ లోని వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు...17మందిని కాల్చిచంపారు. రాకెట్ లాంచర్లు, ఏకే 47 రైఫిళ్లు, భారీ పేలుడు పదార్ధాలతో విరుచుకుపడ్డ దుండగులు... మసీదులో ప్రార్థనలు జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 17మంది అక్కడికక్కడే చనిపోగా, మరో 30మంది పరిస్థితి క్రిటికల్ ఉంది.ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో 13మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రకటించింది. అయితే ఏకంగా వైమానిక స్థావరంపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో సైన్యం కంగుతింది. ఈ దాడులకు పాల్పడింది తామేనని తెహ్రీక్ ఎ తాలిబన్ సంస్థ ప్రకటించుకుంది.

కేసీఆర్ కు కొత్త గవర్నర్ గుబులు పట్టుకుందా?

  ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహాన్ స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సమస్యలు తట్టుకోలేకనో.. లేక ఇద్దరు సీఎంలు తనపై చూపిస్తున్న ప్రవర్తనకు గానో గవర్నర్ స్వచ్చందంగా తను పదవి నుండి తొలగిపోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు గాను మొదట్లో చిటీకీమాటికీ గవర్నర్ దగ్గరకి వెళ్లి ఫిర్యాదు చేసే ముఖ్యమంత్రులు ఇప్పుడు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లడం లేదు. చంద్రబాబు సంగతేమో కని ప్రతి చిన్న విషయానికి గవర్నర్ దగ్గరకు వెళ్లే కేసీఆర్ ఇప్పుడు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదట. దీనికి కారణం ఏంటంటే గవర్నర్ స్థానంలో కొత్తగా వచ్చే గవర్నర్ విషయంలో కేసీఆర్ టెన్షన్ గా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఏ క్షణంలోనైనా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకం జరగవచ్చు అనే కబురు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందట. దీంతో కేసీఆర్ అటెన్షన్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ తో అయితే కేసీఆర్ కు మంచి రిలేషన్ ఉంది. దాని కారణంగా ఆయనకు కావలసిన పనులు చేయించుకునేవారు. కాని ఇప్పుడు రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జీ సదా శివం.. ఈయనకు చట్టాలు వాటిలో ఉండే లొసుగులు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన ముందు తోక జాడించడానికి కుదరదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొత్తగా వచ్చే గవర్నర్ విషయంపై కాస్తంత టెన్షన్ గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి గవర్నర్ డీల్ చేసినట్టు కేసీఆర్ కొత్త గవర్నర్ ను డీల్ చేస్తారో లేదో చూడాలి.

టీఆర్ఎస్ vs బీజేపీ.. ఫైట్ జస్ట్ మిస్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు.. టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొట్లాట జస్ట్ మిస్ అయింది.  తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద రోడ్డు విస్తారణ పనులకు గానూ శంకుస్థాపన చేశారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ నేతలు అక్కడికి చేరుకొని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ప్రోటోకాల్ పాటించలేదని.. శిలాఫలకంపై ఆయన పేరు రాయలేదని ఆయనను నిలదీశారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై వాదనకు దిగారు. బీజేపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు. దీనికి ధీటుగా కేసీఆర్ జిందాబాద్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా ఇరువురు వాదులాడుకుంటా ఆఖరికి రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే వెంటనే  అక్కడున్న ఎంపీ జితేందర్ రెడ్డి కలుగుజేసుకొని అక్కడున్న వారికి సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేయాలంటున్న రేవంత్

పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమేనంటారు రాజకీయాల్లో తలపండిన మేధావులు, అది ఎన్నోసార్లు రుజువైంది కూడా, ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కోవడానికి ఒక్కోసారి రాజకీయ వైరాన్ని కూడా పక్కనబెట్టేస్తుంటారు.ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అలానే ఉంది. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఆపసోపాలు పడుతున్నాయ్. ప్రతిపక్షాలన్నీ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నా, పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు, ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి...విచిత్రమైన ప్రతిపాదన చేశారట. తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారట. అయితే రేవంత్ ఆలోచన బాగానే ఉన్నా, ఇప్పటికే బీజేపీతో కలిసి చేస్తూ, ఇటు టీడీపీకి, అటు భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ తో కలిసి పోరాడటం సాధ్యమయ్యే పని కాదేమో

నేతాజీ సీక్రెట్ ఫైళ్లు బయటపెట్టిన మమత

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నంత పనీ చేశారు. ఇండియన్ హిస్టరీలోనే టాప్ మిస్టరీగా, అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ వివరాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 64 ఫైళ్లను బయటపెట్టారు. ముందుగా నేతాజీ కుటుంబ సభ్యులకు ఆ పత్రాలను అందించిన బెంగాల్ సర్కార్... అనంతరం ప్రజల సందర్శనార్థం కోల్ కోతాలోని పోలీస్ మ్యూజియంలో ఉంచింది. సోమవారం నుంచి ఈ డాక్యుమెంట్లు ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 12,744 పేజీలున్న 64 ఫైళ్లను డిజిటలైజ్ చేసిన బెంగాల్ ప్రభుత్వం... వాటిని డీవీడీ రూపంలో నేతాజీ ఫ్యామిలీకి అందజేసింది. 1937 నుంచి 47వరకు నేతాజీ జీవితానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేతాజీకి సంబంధించి… కేంద్రం దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా బయటపెట్టాలని, అప్పుడే పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలుస్తాయని కుటుంబ సభ్యులు అంటున్నారు

ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఎస్సై రమేష్ మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నాయని ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. తుది నివేదికను సీల్డ్‌ కవర్‌లో పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామన్న వైద్యులు... రమేష్ తొడలు, అరికాళ్లపై రక్తం కమిలిన గుర్తులతోపాటు,కర్రలతో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. ఎస్సై మృతిపై అనుమానాలు వ్యక్తమవడంతో...తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే తన భర్తను హింసించి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని, దీని వెనుక మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఇద్దరు సీఐల పాత్ర ఉందని, సీబీఐ విచారణ జరిపించాలని రమేష్‌ భార్య గీత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది

టీ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి? ‘ఐవీఆర్ఎస్' ప్రకారం

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు టీ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ పై చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విధానం నేపథ్యంలో ‘ఐవీఆర్ఎస్'  (ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం)ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని గతంలో చంద్రబాబు తెలిపారు. దీనిలో భాగంగానే వారి ద్వారా సేకరించిన అభిప్రాయాన్ని కూడా నేతల ముందుఉంచినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల మంది కార్యకర్తలుండగా వారిలో మెజారిటీ పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం జరిగిందట. మరి కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు వారి మాట ప్రకారం రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో లేదో చూడాలి. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుత పార్టీ కార్యకలాపాలు చూస్తూ అధ్యక్షపదవి కొనసాగిస్తున్న  ఎల్.రమణనే చంద్రాబాబు మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తెలిసినా కాంగ్రెస్ ఆపదు

ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పాయింట్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శ చేద్దామా అన్నట్టు ఉంది. ఇప్పటికే అనేక విషయాల్లో నానా రకాలుగా రాద్దాంతం చేసిన కాంగ్రెస్ వాటివల్ల తమ పార్టీకి ఒరిగేదేం లేదని తెలిసినా కూడా ఏదో తమ వివాదం సృష్టించాలని కదా అని తమ పంతాలో తాము పోతున్నారు. ప్రగతి పధంలో దూసుకుపోతున్న ప్రధానిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగానే అప్పట్లో పార్లమెంట్ సమావేశాలుకూడా సరిగా జరగనివ్వకుండా రచ్చ రచ్చ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపధ్యంలో మరో కొత్త రాజకీయం చేయబోయింది. అదెలాగంటే ప్రధాని మోడీ రేడియో ద్వారా సాగించే మన్కీ బాత్ కార్యక్రమాన్ని నిషేధించాలని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నెల 20న ఈ కార్యక్రమం ఉన్నందున బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచారానికి ఉపయాగించుకున్నట్టు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈసీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతేకాదు  నియమావళి పేరు చెప్పి... ఇలాంటి కార్యక్రమాల్ని నిషేధించలేం అని.. ఆ ప్రసంగంలో.. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే దానిపై చర్య తీసుకోగలంఅని చెప్పింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దానిని వదిలిపెట్టడం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఆశ్చర్యం ఏంటంటే వాటివల్ల ఆపార్టీకి లాభం లేకపోయినా  ఏదో చేయాలి కదా అని  ఒక రాయి విసురుతోంది తప్ప.. నిజానికి ఈ ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు.

చంద్రబాబు, కేసీఆర్ కి అన్నాహాజారే ఝలక్

రైతుల రుణమాఫీపై ప్రముఖ సామాజికవేత్త అన్నాహాజారే కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీతో రైతులకు మేలు జరగదని అభిప్రాయపడ్డ ఆయన, దానివల్ల సమస్యలు పరిష్కారం కానేకావన్నారు. రుణమాఫీ కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్న అన్నాహాజారే...ఇది రాజకీయ నేతలు ఆడుతున్న ఆటంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు రుణమాఫీ చేయాలంటూ శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ రాజకీయ జిమ్మిక్కన్న ఆయన, ఈ పథకం వల్ల, ప్రజాధనం వేస్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీ పథకం వల్ల రైతులు... ఇతరులపై ఆధారపడేలా చేస్తుందని, ప్రభుత్వాలు కరువు పరిస్థితులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నా సూచించారు. అయితే అన్నా వ్యాఖ్యలు... చంద్రబాబు, కేసీఆర్ లకు కూడా ఇరుకున పెట్టేలా ఉన్నాయని, రుణమాఫీ అమలు చేస్తున్నా, ఏపీ, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు పొలిటికల్ లీడర్స్.

హైదరాబాద్ లో మళ్లీ కాల్పుల కలకలం

హైదరాబాద్ లో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ...చివరికి కాల్పుల వరకూ వెళ్లింది. హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ ఘటన పాతబస్తీ ప్రాంతంలో జరిగింది. భూవివాదం నేపథ్యంలో టోలీచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జూబేర్ పటేల్, గోల్కొండకు చెందిన ఫరీద్ లు కొద్దిరోజుల క్రితం గొడవ పడగా, పోలీసులు పిలిచి సర్దుబాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువురూ భేటీకాగా, ఇద్దరి మధ్యా మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన జూబేర్ పటేల్... తన దగ్గరున్న తుపాకితో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హైదరాబాద్ లో గన్ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతుండటంపై అటు పోలీసులు, ఇటు ప్రజలూ ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమైవుతుందో, ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదని జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

పుట్టిన ప్రతి బిడ్డపై 20 వేల అప్పు.. కేసీఆర్ అప్పుల వల్లే

  తెలంగాణ ప్రభుత్వంపై దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం లభించగా.. తెలంగాణకు మాత్రం పదమూడో స్థానం దక్కింది. ఇది ఏపీకి శుభ పరిణామం అయితే ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం చేదు వార్తనే. అయితే ఇప్పుడు మరో తెలంగాణ ప్రభుత్వం తీరు మరోసారి భయటపడింది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ రాష్ట్రానికి లోటు భారం ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మిగులు బడ్జెతో గుజరాత్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఆసంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆతరువాత తెలంగాణ ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ఎడా పెడా ఖర్చుచేసి ఆఖరికి మిగులు బడ్టెట్ ఉన్న రాష్ట్రం కాస్త నిధులు లేక అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తెలంగాణ పనితీరుపై చాలామంది విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసిన అప్పులకు గానూ ఆరాష్ట్రంలో పుడుతున్న ప్రతీ బిడ్డపై పుట్టుకతోనే  రూ. 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. తీసుకున్న అప్పులను అధిక వడ్డీతో తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని.. దీనివల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి తెలిపారు. మొత్తానికి దీనిని బట్టి కేసీఆర్ పాలనా విధానం ఎలా ఉందో ఈఫోరం బట్టే తెలుస్తోంది.  ఇప్పటికే తన ఒంటెద్దు పోకడను మాని మేల్కోకపోతే రాష్ట్రం పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధిక ఖర్చులు మాని.. పక్క రాష్ట్రంతో పోల్చుకోకుండా తమ రాష్ట్ర పరిస్థితిని..తన ప్రజల అవసరాలను తెలుసుకొని ఆదిశగా పాలనా సాగిస్తే బావుంటుందని సదరు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

నువ్వా.. నేనా.. లోకేశ్ vS జగన్

  టీడీపీ యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు యువనేతలు ఇప్పుడు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఒకరిమీద ఒకరు మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. జగన్ తో పోల్చుకుంటే లోకేశ్ కు కాస్తంత రాజకీయానుభవం తక్కువగా ఉన్నా ఈమధ్య లోకేశ్ కూడా తనదైన పంచ్ డైలగ్స్ తో జగన్ మీద బాగానే కామెంట్లు విసిరారు. ప్రస్తుతానికి మీడియాలో తమ తమ వ్యాఖ్యలతో రాజకీయ యుద్ధానికి దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హాయాంలో జగన్ ఆయన పదవిని అడ్డుపెట్టుకొని ఎన్నో కోట్లు సంపాదించారని.. ఏపీ నూతన రాజధాని అభిృద్ధి విషయంలో అడుగడుగునా అడ్డుపడుతున్నారని అన్నారు. భూసేకరణ విషయంలో కూడా ధర్నాలంటూ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యాలే చేశారు అని ఎద్దేవ చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్‌పై జగన్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. మొత్తానికి యువనేతల మధ్య రాజకీయ వేడి బాగానే రాజుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ యువనేతల మధ్య గట్టి పోటీనే ఉంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ నేతలు.

విజయవాడ మెట్రోకి కూడా కేంద్రం ఆమోదం?

  విజయవాడలో 20లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్నందున అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు లాభసాటిగా ఉండదనే కారణంతో ఆ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయలేమని తెలియజేస్తూ కేంద్రప్రభుత్వం ఒకలేఖ వ్రాసింది. కానీ నిన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాజెక్టుకి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైజాగ్, విజయవాడల మెట్రో ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రెండు ప్రాజెక్టులని కూడా 2018 డిశంబరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ప్రాజెక్టులను పర్యవేక్షించబోతున్న డిల్లీ మెట్రో ప్రాజెక్టు చీఫ్ ఈ శ్రీధరన్ కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీధరన్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నందున ఈ రెండు ప్రాజెక్టులు సకాలంలోనే పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. మిగిలిన మూడేళ్ళలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే శ్రీధరన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే ఆఖ్యాతి మొత్తం దక్కుతుంది.