congress leader ponnala on kcr areal survey

ఏరియల్ సర్వే కాదు.. రియల్ సర్వే చేయాలి...

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమధ్య కాలంలో నాలుగైదుసార్లు వివిధ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలు కాకుండా రియల్ సర్వేలు చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. ఏరియల్ సర్వేల ద్వారా కాకుండా ప్రజల మధ్యకి వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయని ఆయన అన్నారు. గగనతల పర్యటనలు తప్ప ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని అన్నారు. కేసీఆర్ తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పొన్నాల దుయ్యబట్టారు. సీఎం వరంగల్ పర్యటన చేసిన సందర్భంగా ఎవరినీ కలవకుండా ఆంక్షలు అమలు చేయడం సరికాదని అన్నారు.

andhra pradesh low pressure cyclone

త్వరలో వానలు కురుస్తాయి...

  రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో మంగళవారం సాయంత్రంలోగా అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశ: వున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తీరప్రాంత గ్రామాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి.

talasani resignation ganta tdp eamcet narasimhan

తలసాని... ఎంసెట్.. ఛలో గవర్నర్...

  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలసి ఫిర్యాదు చేశారు. తలసాని శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని, అలా కాకుంటే ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు గవర్నర్ని కోరారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు గవర్నర్ని కలిసిన వారిలో వున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఎంసెట్ నిర్వహణ వివాదం గవర్నర్ వద్దకి చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్‌ని కలసి ఎంసెట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకే వస్తుందని విన్నవించారు.

nandi awards name change ekasila awards

‘నంది’ కాదు.. ‘ఏకశిల’ అవార్డులు?

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఆరునెలల కాలంలో ఆయన అద్భుతమైన పరిపాలనా శైలిని ప్రదర్శిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి రచించిన ప్రణాళికలు ప్రతి ఒక్క హైదరాబాద్ వాసినీ ఆనంద డోలికల్లో ఓలలాడేలా చేస్తున్నాయి. హుస్సేన్ సాగర్‌ని ఖాళీచేసి మంచి నీటి చెరువుగా మార్చే ఆలోచనగానీ, హుస్సేన్ సాగర్ చుట్టూ వందల అంతస్తుల భవనాలు నిర్మించే విషయంలోగానీ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, పెద్దపెద్ద రోడ్లు నిర్మించే విషయంలోగానీ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు శభాష్ అనిపించుకునేలా వున్నాయి. అలాగే తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ ఆయన ఇప్పటి వరకు అమల్లో వున్న పలు పేర్లను మార్చే పనిలో వున్నారు. అది కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఆయన తెలుగు సినిమా, టీవీ, నాటక రంగాలకు ఇచ్చే నంది అవార్డుల పేర్లను కూడా మార్చే ఆలోచనలో వున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప ఆలోచన. భవిష్యత్తులో ‘నంది’ అవార్డులకు బదులుగా ‘ఏకశిల’ అవార్డులను ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ‘నంది’ని ‘ఏకశిల’గా మారడం వల్ల తెలంగాణ కళాకారుల్లో ఉత్సాహాలు వెల్లువెత్తి మరిన్ని మంచి సినిమాలు, టీవీ కార్యక్రమాలు, నాటకాలు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ నేపథ్యంలో ‘నంది’ పేరు మార్చాలని సంకల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు, అభినందనలు.

tollywood film actress heroine molested

టాలీవుడ్ హీరోయిన్‌పై రేప్ అటెంప్ట్...

  ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ మీద పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో అత్యాచారయత్నం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సదరు హీరోయిన్ తన ఇంటి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ హీరోయిన్ ఇంటి సమీపంలోనే అత్యాచారయత్నం జరిగింది. తాను తన ఇంట్లోకి వెళ్ళబోతూ వుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనను పట్టుకుని లాగబోయాడని, తాను గట్టిగా అరవబోవడంతో ఆ వ్యక్తి తన దగ్గర్నుంచి తన సెల్‌ఫోన్‌ని లాక్కుని పారిపోయాడని ఆ హీరోయిన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆ హీరోయిన్ పేరును అధికారికంగా వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా వుంటూ, కోల్‌కతాలో నివాసం ఉండే హీరోయిన్ ఎవరో పాఠకులే ఆలోచించుకుని నిర్ణయించుకోవాలన్నమాట. ఇంతకీ ఆ ఆగంతుక వ్యక్తి సదరు హీరోయిన్ ఫిర్యాదు చేసినట్టుగా అత్యాచారం చేయడానికి వచ్చాడా.. లేక సెల్‌ఫోన్ దొంగా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Elephants farmer killed women killed kuppam area chittoor

మనుషుల ప్రాణాలతో ఏనుగుల చెలగాటం

  చిత్తూరు జిల్లాలో ఏనుగులు జనాన్ని వణికిస్తున్నాయి. గత కొంతకాలంగా అడవుల్లోంచి బయటకి వచ్చిన ఏనుగు మందలు ఊళ్ళమీద పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటల మీద పడి సర్వనాశనం చేస్తున్నాయి. అడవుల్లోంచి బయటకి వచ్చిన ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపడానికి జనం నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ ఏనుగులు విద్వంసంతో ఆగకుండా మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వి.కోట మండలం కారగల్లులో ఒక రైతు మీద ఏనుగులు దాడి చేసి చంపేశాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం  ఏనుగులు మరోసారి విధ్వంసం సృష్టించి ఒక మహిళను చంపేశాయి. కుప్పం పట్టణ సరిహద్దుల్లో ఏనుగులు జరిపిన దాడిలో ఓబమ్మ (50) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. పశువులను కాయడానికి వెళ్తుండగా ఏనుగులు అకస్మాత్తుగా దాడి జరిపాయి.

three road accidents eight people death

ఎనిమిది నిండు ప్రాణాలు...

  మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది మంది మరణించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వాడపల్లికి చెందిన ఎం.డి. ఖలీం తన కుటుంబ సభ్యులతో కలసి కారులో నల్గొండ నుంచి వాడపల్లికి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖలీం (35), రిజ్వానా (30), సైదయ్య (38)తోపాటు మరో ఇద్దరు మరణించారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం యువజన కాలనీకి చెందిన రవి (18), నాగవేణి (35) మరణించారు. రవి అనే యువకుడు తన పిన్నితో కలసి దిచక్ర వాహనం మీద గుత్తిలోని ఓ దేవాలయానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి - దేవరకొండ రహదారి మీద కల్వర్టు వద్ద వరికోత యంత్రం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ వాహనం డ్రైవర్ రాము (30) వరికోత యంత్రంలో చిక్కుకున్నాడు. పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకుని రామును బయటకి తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

sainik school

మీ పిల్లల్ని సైనిక స్కూల్లో చేర్పించాలని వుందా?

  మీ పిల్లల్ని సైనిక స్కూల్లో ఆరు, తొమ్మిదివ తరగతుల్లో చేర్చాలనుకుంటే ఈ క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.   జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. గణితం (100 మార్కులు), లాంగ్వేజీ ఎబిలిటీ (100 మార్కులు) పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ఇంటిలిజెన్సీ (100 మార్కులు) పరీక్ష జరుగుతుంది.   తొమ్మిదో తరగతికి జనవరి 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గణితం (200 మార్కులు), సైన్స్ (75 మార్కులు), మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇంగ్లీషు (100 మార్కులు), సోషల్ స్టడీస్ (75 మార్కులు) పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది అదనంగా కలికిరి, విజయవాడ, రాజమండ్రిలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 08922- 246119, 246168 ఫోన్ నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు.   ప్రవేశ పరీక్ష నిర్వహించే కేంద్రాలు...   గుంటూరు - శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్, బ్రాడీపేట,   హైదరాబాద్ - కీస్ గర్ల్స్ హైస్కూల్, సికింద్రాబాద్,   కరీంనగర్ - గవర్నమెంట్ హైస్కూల్, సుభాష్‌నగర్,   తిరుపతి - శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదురుగా,   విజయనగరం - సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కంటోన్మెంట్,   విశాఖపట్నం - ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్, సీతమ్మధార,   విజయవాడ - జెడ్పీ హైస్కూల్ (బాలుర), పటమట,   కడప - నాగార్జున మోడల్ స్కూల్, జిల్లా కోర్టు వెనుక, మారుతీనగర్,   కర్నూలు - మాంటిసోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, ఎ-క్యాంప్,   రాజమండ్రి - ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాయికృష్ణా థియేటర్ దగ్గర,   కలికిరి - సైనిక్ స్కూల్, కలికిరి, చిత్తూరు జిల్లా.

Thulluru

అధికార, ప్రతిపక్షాల మధ్య రగులుతున్నపంటల మంటలు

  రాజధానికి భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కొన్ని గ్రామాలలో అరటి తోటలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కొన్ని షెడ్లు ఎవరో గుర్తు తెలియని దుండగులు తగులబెట్టడం సహజంగానే అనేక అనుమానాలకు, వాద ప్రతివాదాలకు అవకాశం కల్పిస్తోంది.   రాజధానికి భూములు ఇచ్చేందుకు ఆ గ్రామాల రైతులు నిరాకరిస్తున్నందున వారిని భయాందోళనలకు గురిచేసేందుకే అధికార పార్టీ నేతలు అటువంటి హేయమయిన పనికి పూనుకొని ఉంటారని వైకాపా అధికార ప్రతినిది పార్దసారధి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.   అందుకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అంతే ధీటుగా బదులిచ్చారు. అటువంటి నేర చరిత్ర జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకే ఉందని, వారే అటువంటి కుట్రకు పాల్పడి స్థానిక ప్రజలను రెచ్చగొట్టి తద్వారా అక్కడ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారనే అనుమానాలు తమకున్నాయన్నారు. హమ ప్రభుత్వం తప్పకుండా ఆ కుట్రను చేదించి ఈ దురాఘతానికి పాల్పడినవారిని వారి వెనుక ఉన్న నేతలను కూడా బయటపెడతామని హెచ్చరించారు.   రెండు పార్టీలు ఎదుటవారి మీద ఇంత తీవ్రమయిన ఆరోపణలు చేస్తున్నందున దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి నిందితులను ప్రజల ముందు నిలబెట్టడమే అన్ని విధాలమంచిది. అప్పుడు ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు.

Botsa Satyanarayana

బీజేపీలో నన్నెందుకు చేర్చుకొంటారు? బొత్స

  చాలా మంది రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడుతుంటారు. అటువంటి వారు మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్టేట్మెంటులను జాగ్రత్తగా గమనిస్తుంటే ఇబ్బందికర పరిస్తితులలో ఏవిధంగా లౌక్యంగా జవాబు చెప్పవచ్చో తెలుసుకోవచ్చును. ఎన్నికలలో తను, తన పార్టీ ఓడిపోయినప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన, బీజేపీలో చేరబోతున్నట్లు మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఏనాడు వాటిని నిర్ద్వందంగా ఖంచలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ఆయన ఓడిపోయుంటే తప్పకుండా ఖండించేవారేమో? వచ్చేనెల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణతో సహా అనేకమంది బీజేపీలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.   మళ్ళీ చాలా రోజుల తరువాత ఈరోజు ఆయన మీడియాకు ఎదురుపడ్డప్పుడు ముందుగా ఆయన ఎదుర్కొన్న ప్రశ్న అదే. అయితే దానికి ఆయన ఏ మాత్రం తడబడకుండా బీజేపీలో చేరుతున్నాను అని కానీ లేదా అటువంటి ఆలోచనలో ఉన్నానని గానీ లేదనిగానీ చెప్పకుండా “ఎన్నికలలో ఓడిపోయిన నా వంటి వారిని బీజేపీ ఎందుకు చేర్చుకొంటుంది?” అని గడుసుగా ఎదురు ప్రశ్నించారు. పైగా “ఇంతవరకు ఆ పార్టీనేతలెవరూ నన్ను సంప్రదించలేదని” చెప్పడం గమనిస్తే, తనకు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ వారే చొరవ చూపలేదన్నట్లుంది. అయితే ఈ మధ్యనే బీజేపీ నేత సోము వీర్రాజు ఆయనను కలిసినట్లు దృవీకరించారు. సమర్దులయిన కాంగ్రెస్ నేతలెవరయినా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపితే వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని కూడా చెప్పారు.   బొత్స సత్యనారాయణతో సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరే విషయాన్నీచివరి నిమిషం వరకు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే తెదేపా లేదా స్థానిక బీజేపీ నేతలు వారు పార్టీలో చేరకుండా అడ్డుపడతారనే భయం కావచ్చును లేదా మరేదయినా కారణం కావచ్చును.   ఆయన చాలా కాలంగా సోనియా, రాహుల్ గాంధీల భజన చేయడం కూడా పూర్తిగా మానేశారు. బీజేపీలో చేరే ఉద్దేశ్యం ఉన్నప్పుడు యధావిధిగా సోనియా, రాహుల్ గాంధీల భజన చేస్తుంటే పార్టీలోకి ఎంట్రీ దొరకడం కష్టమని ఎవరయినా చెప్పగలరు. బహుశః బీజేపీలో చేరే ఉద్దేశ్యంతోనే ఆయన తన భజన కార్యక్రమాన్ని పూర్తిగా మానుకొని ఉండవచ్చును. ఏమయినప్పటికీ వచ్చే నెల ఏడెనిమిది తేదీల వరకే ఈ సస్పెన్స్ కొనసాగించవచ్చును. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరెవరు బీజేపీ కండువాలు కప్పుకొంటారో అంతా తేటతెల్లం అయిపోతుంది.

Pre marital sex not shocking every breach of promise to marry is not rape Bombay HC

అది రేప్ కాదు.. అంగీకార శృంగారం...

  యువతీ యువకులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాక ఆమె అతనిపై రేప్ కేసు పెట్టడం సరి కాదని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదులా భత్కల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులలో అది రేప్ కాదని.. పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారంగానే దాన్ని పరిగణించాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో చాలామంది చదువుకున్న అమ్మాయిలు పెళ్ళికి ముందే పరస్పర అంగీకారంతో తమ బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొనడం, ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్ తనను రేప్ చేశాడని కేసు పెట్టడం చేస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ధోరణి సరైనది కాదని అన్నారు. ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు ప్రేమించుకున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా వారిద్దరి మధ్య శారీరక సంబంధం వుంది. వారిలో అతను ఇటీవల వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. అతను ఇన్నేళ్లుగా తనను ‘రేప్’ చేస్తున్నాడని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు.

kcr talking little bit

కేసీఆర్... ముక్తసరిగా...

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగాలు చేయడంలో నేర్పరి. ప్రసంగాలను సుదీర్ఘంగా చేయడం మాత్రమేకాదు.. తన ప్రసంగంలో చురకలు, చెణుకులు, విమర్శలు, జోకులు, పిట్టకథలను కలిపి జనరంజకంగా మాట్లాడ్డంలో ఆయనకి ఆయనే సాటి. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగే సమాయంలో ఆయన చేతికి మైకు అందిందంటే ఆయన మాటల ప్రవాహానికి ఆనకట్ట వుండేది కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అనేక సందర్భాలలో భారీ ప్రసంగాలు చేశారు. అయితే ఎవరైనా సూచించారో లేక ఆయనే అనుకున్నారోగానీ, ఆయన భారీ స్పీచ్‌లు ఇవ్వడం మానేశారు. ఈమధ్య అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ముక్తసరిగా రెండు ముక్కలు మాట్లాడేసి తన ప్రసంగాన్ని ముగిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు హాజరైన జనం ఇప్పుడు కేసీఆర్ భారీగా మాట్లాడతారని ఎదురుచూసి నిరాశకు గురవుతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన క్రైస్తవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ ప్రసంగం కోసం చెవులు రిక్కించి కూర్చున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ‘‘మాటలు అనవసరం చేతలు ముఖ్యం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని తన ప్రసంగాన్ని ముగించి అందరూ అవాక్కయిపోయేలా చేశారు. గతంలో కొత్త సంవత్సరం డైరీల విడుదల కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్ ఇప్పుడు డైరీల ఆవిష్కరణ లాంటి కార్యక్రమాలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. సరే, కేసీఆర్ ముక్తసరిగా మాట్లాడే విషయాన్ని అలా వుంచితే, ఇతరులను కూడా తన దగ్గర ఎక్కువగా మాట్లాడనివ్వట్లేదు. ఈమధ్య మెదక్‌లోని ప్రఖ్యాత చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చికి సంబంధించిన ఒకాయన కేసీఆర్ దగ్గరకి వచ్చి ‘‘ఈ మెదక్ చర్చి ప్రాముఖ్యత ఏంటంటే...’’ అని చెప్పడం మొదలుపెట్టగానే కేసీఆర్ అతన్ని కట్ చేశారట. ‘‘నువ్వేం చెప్పక్కర్లేదు ఈ చర్చి హిస్టరీ మొత్తం నాకు తెలుసు. నేను చాలాసార్లు వచ్చాను’’ అన్నారట. మొత్తానికి ప్రసంగాల విషయంలో కేసీఆర్‌లో కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది.

telangana minister ktr abscand

అజ్ఞాతవాసం వీడిన కేటీఆర్

  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. మొన్నామధ్య మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత మంత్రివర్గమంతా గవర్నర్‌తో గ్రూప్ ఫొటో దిగింది. ఆ ఫొటోలో కూడా కనిపించలేదు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కేటీఆర్ జాడ కనిపించలేదు. అంతకుముందే విదేశలకు వెళ్ళొచ్చిన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నందున్న రాలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పినప్పటికీ కేటీఆర్ గైర్హాజరు మీద రకరకాల కామెంట్లు వినిపించాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారికి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, తాను సూచించిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వల్ల కేటీఆర్ అలిగారని అందుకే ఎక్కడా కనిపించడం లేదన్న వార్తలు వచ్చాయి. బయట ఎక్కడా కనిపించని కేటీఆర్ చివరికి తన కార్యాలయానికి కూడా రావడం మానేశారు. ఒక దశలో కేటీఆర్ ఎక్కడున్నారన్న విషయం కూడా ఆయన కార్యాలయ సిబ్బందికి కూడా తెలియకుండా పోయింది. ఆ సిబ్బందిని కేటీఆర్ ఎక్కడున్నారని అడిగితే, మాకు కూడా తెలియదు.. ఒకవేళ మీకు తెలిస్తే మాకూ చెప్పండి ప్లీజ్ అనేవరకూ పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రెండ్రోజుల నుంచి మళ్ళీ తన కార్యాలయానికి రావడం ప్రారంభించారు. ఇంతకాలం ఎక్కడకి వెళ్ళారు సార్ అని మీడియావాళ్ళు ప్రశ్నిస్తే దానికి కేటీఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు. నేను ఆమధ్య ఐటీ సమావేశాల్లో, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో గంటలు గంటలు మాట్లాడితే ఏవో నాలుగు లైన్లు రాసి వదిలేశారు. అదే నేను నాల్రోజులు కనిపించకపోయేసరికి పేరాలు పేరాలు రాసేశారు. దీనిమీద వున్న శ్రద్ధ దానిమీద చూపిస్తే బాగుంటుంది కదా అన్నారు. అంతే మీడియావాళ్ళు కిక్కురుమంటే ఒట్టు.

Air Asia

ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభ్యం?

  ఇండోనేసియా సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కనిపించకుండా పోయిన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ దొరికినట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ విమానానికి సంబంధించిన శకలాలు జావా సముద్రంలో గుర్తించినట్లు తెలుస్తోంది. విమానంలోని మొత్తం 162 మంది మరణించారని ఆ కథనాలు పేర్కొన్నాయి. 155 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది వున్న ఎయిర్ ఏషియా విమానం - క్యూజెడ్ 8501 ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ తర్వాత ఆ కొద్ది సేపటికే ఇండోనేసియా విమానాశ్రయంలోని ఏసీటీ కేంద్రం నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ గల్లంతయి 24 గంటలు గడచినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో ప్రయాణికుల బంధువులు రోదిస్తున్నారు. విమానం ఆచూకీ కోసం నాలుగు దేశాలకు చెందిన బృందాలు సముద్రంలో, గగనమార్గం ద్వారా అన్వేషణ జరుపుతున్నాయి. అయితే మీడియాలో విమానం శిథిలాలు దొరికినట్టు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

గాలిలో తిరుగుళ్ళు.. గాలి మాటలు...

  పదునైన మాటలతో తన రాజకీయ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేసే భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. ఆయన ఇప్పుడు తన వాగ్బాణాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంధించారు. ‘‘కేసీఆర్ గాలిలో తిరుగుతూ గాలి మాటలు చెబుతూ ప్రజలను ఊహల్లో విహరింపజేస్తున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఒకవైపు రైతులకు, మరోవైపు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. తెలంగాణలో విపరీతమైన కరవు వుంటే దాని గురించి ముఖ్యమంత్రి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతవరకూ కరవు మండలాలను కూడా ప్రకటించలేదంటే ముఖ్యమంత్రిని ఏమనాలి?’’ అని నాగం ప్రశ్నించారు.

‘నంది’ అవార్డుల పేరు మారుస్తాం

  తెలుగు సినిమా రంగానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న నంది అవార్డుల పేరు మార్చనున్నామని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసానీ శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో మూడు పేర్లు వున్నాయని ఆయన చెప్పారు. తెలుగు సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. సోమవారం సచివాలయంలో తలసాని శ్రీనివాసయాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ సినిమా పరిశ్రమతోపాటు ఇతర పరిశ్రమల గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ఆరు నెలల పాలన తర్వాత వ్యాపారుల్లో విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. కాకపోతే బంగారం, వెండి ఆభరణాల వ్యాపారులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో బంగారు దుకాణాలు అధికంగా ఉన్న అబిడ్స్, ప్యాట్నీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సారీ చెప్పిన ఫేస్‌బుక్

  ఫేస్‌బుక్ తన వినియోగదారులకు సారీ చెప్పింది. కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా ఫేస్‌బుక్ యూజర్లు ఉపయోగించిన ఫొటోలు, పంపిన సందేశాలను క్రోడీకరించి ఫేస్‌బుక్ వారి అకౌంట్లలలో ఒక పోస్టు ఆటోమేటిగ్గా పెడుతోంది. ఆ సంవత్సరం వారు చేసిన కొన్ని పోస్టులు అందులో కనిపిస్తాయి. ఫేస్‌బుక్ పంపిన పోస్టులో పైన ఈ సంవత్సరం అద్భుతంగా గడిచిందనే అర్థం వచ్చే మాట పెట్టింది. అయితే పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు తమకు సంతోషం కలిగించిన అంశాలతోపాటు తమకు ఇష్టమైనవారు చనిపోవడం లాంటి బాధాకరమైన అంశాలను కూడా పోస్టు చేస్తూ వుంటారు. వాటిని కూడా ఫేస్‌బుక్ తన పోస్టులో వచ్చేలా చూసింది. దానివల్ల తమ జీవితంలో జరిగిన విషాదానికి ఫేస్‌బుక్ వినియోగదారులు ఆనందిస్తున్నట్టుగా అర్థం మారిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారులు మనసు కష్టపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకురావంతో ఫేస్‌బుక్ నిర్వాహకులు జరిగిన పొరపాటును గ్రహించి నాలుక కరచుకున్నారు. ఫేస్‌బుక్‌ ఈ పోస్టును ఆటోమేటిగ్గా క్రియేట్ చేయడం వల్ల ఏది సంతోషకరమైన పోస్టో, ఏది బాధాకరమైన పోస్టో గ్రహించలేకపోయామని వివరణ ఇచ్చారు. ఈ పొరపాటుకు సారీ కూడా చెప్పారు.

వెలగా వెంకటప్పయ్య కన్నుమూత

  అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ‌రాష్ట్రంలో గ్రంథాలయోద్యమ సారధి, తన జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన వెలగా వెంకటప్పయ్య సోమవారం నాడు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. వెంకటప్పయ్య స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. శాఖ గ్రంథాలయంలో చిన్న ఉద్యోగిగా చేరిన ఆయన తెలుగునాట గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచారు. బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందారు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశారు. మరుగున పడిన రచనలు, ముఖ్యంగా బాల సాహిత్యంలో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందుపరిచారు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంధాలయ విజ్ఞానానికి సంబంధించి ఆయన రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. ఆయన రాసిన పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాల గౌరవాన్ని పొందాయి. వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు.