రాజస్థాన్ సీఎం రాజేకి పదవీ గండం

లలిత్ మోడీ వివాదంలో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుని మోడీ అండతో గట్టెక్కిన రాజస్థాన్ సీఎం వసుంధరరాజే మళ్లీ చిక్కుల్లో పడింది. మొన్న లలిత్ గేట్ బయటపడితే, ఇప్పుడు తాజాగా గనుల కుంభకోణం వెలుగుచూసింది, ప్రధాని కార్యాలయమే స్వయంగా కోవర్టు ఆపరేషన్ చేసి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాజస్థాన్ సీఎం వసుంధరకు కూడా మోడీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘ్వీని పీఎంవో ఆదేశాల మేరకే అరెస్ట్ చేశారట. అంతేకాదు అరెస్ట్ కు సంబంధించి ముఖ్యమంత్రికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, పైగా ఈ స్కాంలో వసుంధరరాజేతోపాటు ఆ రాష్ట్ర హోంమంత్రి కటారియా పాత్ర కూడా ఉందని పీఎంవో గుర్తించిందట . మరుగున పడిపోవాల్సిన ఈ కేసును ప్రధాని చొరవతోనే బయటికి వచ్చిందని, వసుంధరరాజేని ఎలాగైనా తప్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారని ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేసేవరకూ ఏం జరుగుతుందో కూడా సీఎం రాజేకి తెలియలేదని, చివరికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కి కూడా సమాచారం లేదని రాసుకొచ్చింది. ఒకవేళ ఆ పత్రిక కథనమే నిజమైతే, వసుంధరరాజే ప్లేస్ లో మరొకరు రావడం ఖాయం

నాపేరు వెనుక తోక లేదనేగా..

  కొత్తగా ఉన్న తలనొప్పులు సరిపోవన్నట్టు ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే అనేక విషయాల్లో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు వేస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మనిషే టీఆర్ఎస్ వైఖరిపై మండిపడుతున్నారు. అతనెవరో కాదు టీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నియోజక వర్గం నుండి పోటీ చేసి సీనియర్ నేత వివేక్ ను ఓడించిన ఎంపీ బాల్క సుమన్. ఈయనే స్వయంగా స్వయంగా పార్టీ తీరుపై ఆరోపిస్తున్నారు. తన పేరు వెనుక రెడ్డి, రావు అనే తోకలు లేవని తనను లెక్కచేయడంలేదని.. తనని చులకనగా చూస్తున్నారని.. కనీసం ఓ ఎంపీననే విషయం కూడా మరిచిపోయి పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవకుండానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇదే వైఖరి కొనసాగిస్తే పార్లమెంట్ కార్యదర్శికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా బాల్కా సుమన్ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తిలో ఒకరు. అయితే అప్పట్లో మీడియాలో ఎక్కువగా కనిపించిన బాల్క ఆతరువాత మీడియాలో పెద్దగా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల వైఖరి ద్వారా మీడియా ముందుకువచ్చారు.

రాహుల్ సభలో గన్ కలకలం

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ యువకుడు ఎయిర్ గన్ తో తిరుగుతూ తీవ్ర కలకలం రేపాడు. చంపారన్ రామ్ నగర్ లో రాహుల్ ర్యాలీ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఎయిర్ గన్ పట్టుకుని ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు, అయితే నిందితుడు తయ్యబ్ జాన్ మానసిక స్థితి సరిగా లేదని, విచారణలో వివరాలు చెప్పలేకపోతున్నాడని ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు. తయ్యబ్ నుంచి ఓ బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపిన పోలీసులు, అతను ఉద్దేశపూర్వకంగానే ఎయిర్ గన్ తో రాహుల్ సభకు వచ్చాడా లేదా అనేది తేలాల్సి ఉందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ షాక్

ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగంసిద్ధమవుతోంది. 7200కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి కావాలంటూ డిస్కంలు(విద్యుత్ పంపిణీ స్థలు)...ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ మండలి)ని కోరాయి. ఉత్పత్తి-పంపిణీ వ్యయాలు భారీగా పెరిగి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పెంపు అనివార్యమని డిస్కంలు చెబుతున్నాయి, అయితే విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఈఆర్సీ అక్టోబర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అయితే ఇంత పెద్దమొత్తంలో ప్రజలపై భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం...కొంచెం అటూఇటుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట, ఇప్పటికే ఒకసారి ఛార్జీలు పెంచి ఉన్నందున మరోసారి భారీగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ 13వ ర్యాంకు.. అందుకేనట

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలో  ఏపీ రాష్ట్రానికి 2 స్థానం.. తెలంగాణ రాష్ట్రానికి 13వ స్ఠానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదిక రాకముందునుండి పెట్టుబడులు పెట్టడానికి గాను.. పరిశ్రమల స్థాపనకు గాను అనువైన వాతావరణం కలిగి ఉన్న ప్రాంతాల్లో ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రమే అనువైనదని భావించారు. కాని ప్రపంచ బ్యాంకు తెలిపిన దానిని బట్టి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అయితే ఇప్పుడు తెలంగాణకు 13వ ర్యాంకు రావడంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ నేతలైతే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వెంకయ్యనాయుడులు కలిసి మేనేజ్ చేసి ఈ ర్యాంకు తెప్పించారని అన్నారు. అయితే దీనికి కారణం వేరే ఉంది అంటున్నారు అధికార నేతలు. రాష్ట్ర ర్యాంకింగ్లకు సంబంధించి వరల్డ్ బ్యాంకు తోపాటు మేక్-ఇండియా, కేఎంజీ, సీఐఐ లాంటి తదితర సంస్థలు రాష్ట్ర పరిస్థితి గురించి అడుగుతూ అందరితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారంట. కానీ తెలంగాణ ప్రభుత్వం నాయకులు ఆసమయంలో మొద్దునిద్రలో ఉండి వాటికి స్పందించలేదు. దురదృష్టమేంటంటే అదే టైమ్ కి కేసీఆర్ కూడా ఇక్కడ విదేశీ పర్యటనలో ఉండి ఇక్కడ లేకుండా ఉండటం మొత్తానికి రాష్ట్రానికి అనూహ్యరీతిలో ఆ ర్యాంకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కారణమేదైతే కాని ఈ ర్యాంకు విషయంలో మాత్రం ఏపీ ముందుండగా.. తెలంగాణ మాత్రం వెనుకంజలో ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణ నేతలు చేసిన పనిని పక్కనపెట్టి.. ఏపీ ర్యాంకు విషయంలో చంద్రబాబు మేనేజ్ చేశారు అని విమర్శించడం వారికే చెల్లింది.

కేసీఆర్ ఇందులో పోటీపడు

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వ విధానంపై మరోసారి మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల రుణమాపీ చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడి ఉందని అన్నారు. ఒకపక్క ఏపీ  ప్రభుత్వం చేసిన రుణమాఫీలు రైతులకు ఊరట నిస్తుంటే మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు రుణమాఫీలు లేక.. రైతులు ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి పరిస్థితి వస్తుందంటూ ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ టూర్లు అంటూ పర్యటిస్తున్నారు.. కానీ వాళ్ల గురించి ఆలోచించడంలేదని అన్నారు. కేసీఆర్ చేసిన హామీలన్నీ నెరవేర్చాలని.. రైతుల రుణమాఫీ చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఏపీ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంటే.. మరి అన్నింటిలో పోటీపడే కేసీఆర్ ఈవిషయంలో మాత్రం ఎందుకు ఎక్కువ పరిహారాన్ని ఇవ్వడంలేదు.. రైతు కుటుంబాలకు పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తమ పోరాటం వల్లే చీఫ్ లిక్కర్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.

అమ్మాయిలు రాత్రుళ్లు ఎందుకు తిరగాలి.. మంత్రి

  రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మహిళలపై వ్యాఖ్యలు చేస్తూ బుక్ అవుతూ ఉంటారు. తాజాకా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి మహేష్ శర్మ అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలకు విమర్శలు తలెత్తున్నాయి. ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన అమ్మాయిలను ఉద్దేశించి అమ్మాయిలు రాత్రిపూట తిరగడం వేరే దేశాల్లో తప్పుకాదేమో కాని అది మన సాంప్రదాయం కాదు.. భారతీయ సంస్కృతిలో మాత్రం అది భాగం కాదు'.. అసలు అమ్మాయిలు రాత్రిపూట రోడ్డుపై ఎందుకు తిరగాలి.. అసలు తిరిగే అంత అవసరం ఏముంటుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు జైనుల పండుగ సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతూ జైనులను గౌరవించేలా కొద్దిరోజులు మాంసానికి దూరమైతే తప్పేంటి.. కొన్ని రోజులు తినకుండా ఉండగలరా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. కాగా ఈయన గతంలో కూడా మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

నేనా...పార్టీ మారడమా? నో ఛాన్స్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, బతికున్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టంచేశారు. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన, ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారడం జరగదన్నారు. అయితే కొంతకాలంగా హైకమాండ్ తీరుపై కరణం బలరాం అసంతప్తితో ఉన్నారనే టాక్ వినిపించింది, పార్టీనే నమ్ముకుని ఉన్న తనను కాదని, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారట. ఈ నేఫథ్యంలోనే వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదని కరణం బలరాం తేల్చిచెప్పడంతో ఊహాగానాలకు తెరపడినట్లయింది.

చంద్రబాబు.. కేసీఆర్.. ఇద్దరూ ఒకేలా

రాష్ట్రం విడిపోకముందు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నా రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య పోరు ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటపడిందో అప్పడినుండి వీరిద్దరి మధ్య మాటల యుద్ధాలతో ఉప్పు నిప్పులాగా తయారయ్యారు. కానీ వీరిద్దరి ఆలోచన ధోరణి మాత్రం ఒకేలా కనిపిస్తుంది. సీఎం పదవిలో ఉండి తమ రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ఇద్దురూ బాగానే కష్టపడుతున్నారు.. అయితే రాష్ట్రాల అభివృద్ధిలో ఎక్కువగా సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు అయితే తను ముందునుంచే తన పరిపాలనా విధానంలో సాంకేతికకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తన పరిపాలనా కార్యక్రమాల్లో సాంకేతికతను జోడించనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జియో ట్యాగింగ్ విధానాన్ని ఉపయోగించనున్నారు. జియో ట్యాగింగ్ సాంకేతికా విధానాన్ని ముందు చంద్రబాబు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత  ఏడాది వైజాగ్ లో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ కారణంగ్ అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అందుబాటులోకి తెచ్చిందే జియో ట్యాగింగ్. ఈ పద్దతి ద్వారా సీఎం చంద్రబాబు వైజాగ్ లో జరిగిన పునరుద్దరణ పనులను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అదే జియో ట్యాగింగ్ విధానాన్ని కేసీఆర్ తన చేపడుతున్న అనేక పథకాలకు ఈ విధానాన్ని అనుసంధానం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ముందు ఈ విధానాన్ని పంచాయితీరాజ్ శాఖలో అమలు చేసి తరువాత తదుపరి ఇతర శాఖలకు అనుసంధానం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు జియోట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొత్తానికి ఇద్దరు సీఎంలు ఎలా ఉన్నా వారు ఒకే ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

డిగ్గీకి పెళ్లి తెచ్చిన కష్టాలు

  ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్న పంథాలో.. ఒక్క పెళ్లి డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్) జీవితాన్నే మార్చేసింది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పెళ్లే ఆయన పదవికి ముప్పుతెచ్చిపెట్టిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీలో యాంకర్ గా పనిచేసిన అమృతారాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే. ఇంతకాలం పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా పెద్ద పార్టీకి అత్యంత సన్నిహితుడిగా భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు డిగ్గీని పదవి నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత ఆయన పార్టీ కర్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. ఆయనను ఇంఛార్జ్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిస్థితి కూడా ఏమంత బాగా లేదని.. దీంతో ఆయనను పక్కన పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఈయన పార్టీ కార్యకలాపాలకు అంతగా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు నేరుగా రాహుల్ కే ఫిర్యాదు చేశారంట. అంతేకాదు పార్టీలోకి యువతను తీసుకోవాలనే నేపథ్యంలో కూడా డిగ్గీని పక్కన పెట్టాలని చూస్తున్నారంట.

తనపై కుట్ర జరుగుతోందంటున్న కేఈ

ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మినిస్టర్ గా ఉన్న తనను అసలు పట్టించుకోవడం లేదని, ఇటు ప్రభుత్వం, అటు పార్టీ నిర్ణయాల్లోనూ కనీసం తనను లెక్కలోకి తీసుకోవడం లేదని కేఈ వాపోతున్నారట. పైగా రెవెన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు తనను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేబినెట్ మీటింగ్స్ లోనూ, కలెక్టర్ల సమావేశాల్లోనూ...పదేపదే అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమంటూ బాధపడుతున్నారట. సీనియర్ ను అయన తన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై తాను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ నాలుగుసార్లు రద్దుచేశారని, రాజధాని భూసమీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ, మచిలీపట్నం పోర్ట్ వంటి కీలక నిర్ణయాల్లోనూ తనను పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకున్నా అదేరీతిలో అవమానిస్తున్నారని, ఇవన్నీ దేనికి సంకేతమో తెలియడం లేదని, కానీ ఆలోచించాల్సిన అవసరమైతే ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారట.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు

  ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతిపక్షనేతలు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షనేతలకి కేసీఆర్ ను ఏకేయడానికి రోజుకో పాయింట్ తో ముందుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్శిటీ విషయంలో కేసీఆర్ పై నిప్పుల చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అక్కడ వాటిని పరిశీలించిన తరువాత కేసీఆర్ పై మండిపడ్డారు. యూనివర్శిటీలోని హాస్టళ్ల మెస్ ల పరిస్థితి బాగాలేదని.. ప్రభుత్వం వాటి గురించి అస్సలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర్లంలో ఉన్నప్పుడు డైమండ్ లా ఉన్న యూనివర్సిటీల్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని.. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అన్న సందేహం వస్తుందని అన్నారు. ‘కేసీఆర్ ఒక్క 5 నిముషాలు ఓయూ హాస్టల్ గదిలో ఉండు పరిస్థితేమిటో తెలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈవిషయంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఉస్మానియా విద్యార్ధులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదే కాదని.. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ వాళ్లనే పట్టించుకోవడం లేదని.. కనీసం నీళ్లు తిండి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవ చేశారు. గత నాలుగేళ్ల నుండి కేసీఆర్ దొంగ అని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు అని అన్నారు.

కేఈ కి శాఖ మార్పు తప్పదా?

  ఏపీ ఉప ముఖ్యమంత్రి.. రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పదవికి పోటు పడేలా ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందన్న ఆరోపణలే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఈ పదవి నుండి కృష్ణమూర్తిని తొలగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏపీలో జరిగిన కలెక్టర్లు, ఉప కలెక్టర్ల బదిలీల కారణమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో 22 మంది కలెక్టర్లు, ఉప కలెక్టర్లను  కేఈ ఆదేశాలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బదలీ చేశారు. అయితే ఈ బదిలీల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన చంద్రబాబు కేఈ పై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. అంతేకాదు గతంలో కృష్ణా జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి విషయంలో కూడా కేఈ సరిగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఆయన సచివాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో చంద్రబాబు ఆయనను రెవెన్యూ శాఖ నుండి తప్పించి వేరే ఏదో చిన్న శాఖను ఆయనకు అప్పగించాలని.. అవసరమైతే ఆ శాఖను తన వద్దే ఉంచుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 17.. కేసీఆర్ కు మోడీ ఝలక్

  సెప్టెంబర్ 17 ఈ తేదీ అందరికీ అంత ముఖ్యమైన రోజు కాదు కాని తెలంగాణకు చాలా ప్రాముఖ్యం ఉన్నరోజు. హైదరాబద్ ను నిజాంలు పరిపాలిస్తున్న నేపథ్యంలో అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభ బాయ్ పటేల్ వారితో పోరాడి హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేశారు. దీనికి గాను తెలంగాణ విమోచన దినంగా పేరు పెట్టలని నాటి నేటి వరకూ అనుకుంటూనే ఉన్నారు కాని ఇంత వరకూ జరిగింది లేదు. ఈ విషయంపై కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా మార్చాలని చెప్పారు. కానీ అధికారం చేపట్టిన తరువాత ఆసంగతే పూర్తిగా మర్చిపోయారు. పైగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్2 చేస్తున్నాం కదా ఇంకా ఈ విమోచన దినం అవసరమా అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అయితే ఆరోజు కూడా మర్చిపోయినట్టున్నారు కేసీఆర్.  దాని గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే సెప్టెంబర్ 17 వ తేదీని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుంచుకొని మరీ దాని గురించి ప్రస్తావించి కేసీఆర్ కు ఝలక్ ఇచ్చారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్ ప్రస్తావించకపోయినా మోడీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్ లో విలీనం చేసే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన వారికి వందనాలు’’ అని మోడీ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇక కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్న సంబంధాలు కూడా అంతంతమాత్రమే. ఈనేపథ్యంలో మోడీ చేసిన ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఇంకో ఝలక్ తగిలినట్టయింది.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలో వైకాపాలోకి జంప్?

    మాజీ స్పీకర్  నాదెండ్ల మనోహర్ త్వరలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తాజా సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు అందరూ విభజనకు అనుకూలంగానో, వ్యతిరేఖంగానో వ్యవహరించారు. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం ఆ సమస్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడయినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా మసులుతున్నారు. ఏడాదిన్నర కాలం గడిచినా ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఆయన కూడా వైకాపాలో చేరాలని నిశ్చయించుకొన్నట్లు తాజా సమాచారం. వచ్చే నెలలో దసరా పండుగ రోజున లేదా తరువాత కానీ ఆయన వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు సింగపూరు బయలుదేరనున్న చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రేపు సింగపూర్ బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు మంత్రులు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, మునిసిపల్ శాఖా మంత్రి పి. నారాయణ, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, దాని డైరెక్టర్లు, అధికారులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు కూడా సింగపూర్ వెళుతున్నారు. వారు మూడు రోజులపాటు సింగపూరులో పర్యటించి రాజధాని అమరావతి మాష్టర్ ప్లానులో చేయవలసిన కొన్ని మార్పులు, చేర్పుల గురించి సింగపూర్ నిపుణుల బృందంతో చర్చిస్తారు. అనంతరం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ ప్రధాని లీ హ్సేయిన్ లూంగ్ ని కలిసి వచ్చేనెల 22న జరుగబోయే రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. చంద్రబాబు నాయుడు బృందం మళ్ళీ బుదవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోవచ్చును.

బీహార్ లో ఎన్డీయేకే విజయం: జీ న్యూస్ సర్వే

  అక్టోబర్ 12వ తేదీ నుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలోగా ఎలాగయినా గెలిచి బీహార్ లో కూడా అధికారం దక్కించుకొని తన సత్తా చాటాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. బీజేపీని ఒంటరిగా డ్డీ కొనలేమని గ్రహించిన ఆరు పార్టీలు కలిసి జనతాపరివార్ కూటమిగా ఏర్పడ్డాయి. దాని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఎన్నుకొన్నారు. కనుక మళ్ళీ అధికారం నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది. కనుక ఈ ఎన్నికలు ఆయన జీవన్మరణ సమస్య వంటివని చెప్పవచ్చును. సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధులు ఇంకా చాలా మంది బరిలో ఉన్నారు. కనుక ఏ పార్టీకి లేదా కూటమికి ప్రజలు పట్టం గడతారనే విషయం ఎవరూ ఊహించలేకపొతున్నారు.   జీ న్యూస్ ఛానల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనతా పరివార్, కాంగ్రెస్ పార్టీల కూటమికి కేవలం 70 స్థానాలు మాత్రమే రావచ్చని తెలియజేసింది. ఎన్డీయే కూటమికి 50.8 శాతం, జనతా పరివార్ కూటమికి 42.5 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.

బీజేపీ-ఎంఐఎం మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందా?

మజ్లిస్(ఎంఐఎం) ఎంట్రీతో ఓట్లు చీలిపోయి చివరికి బీజేపీ కూటమికి లబ్ది జరుగుతుందని గుర్తించిన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ అలయన్స్...ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. ముస్లిం ఓట్లు జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి పడకుండా, చీలిపోవాలనే కుట్రతోనే అసదుద్దీన్ ను ప్రధాని మోడీ రంగంలోకి దింపారంటూ జేడీయూ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసింది. మోడీతో అసదుద్దీన్ రహస్య భేటీ జరిగిందని ఆరోపిస్తున్న జేడీయూ... ప్రధాని సూచనతోనే ఎంఐఎం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని వ్యాఖ్యానించింది. అయితే జేడీయూ ఆరోపణలను ఎంఐఎం కొట్టిపారేయగా, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామంటూ బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాము ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయలేదని, మోడీ-అసదుద్దీన్ భేటీపై మీడియాలో కూడా వార్తలొచ్చాయని, అయినా దీనిపై ప్రధాని కార్యాలయం ఎందుకు ఖండించలేదంటూ జేడీయూ ఎదురుప్రశ్నిస్తోంది.

అసెంబ్లీలో మమ అనిపిద్దామంటున్న కేసీఆర్

రైతు ఆత్మహత్యలు, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో వరస్ట్ ప్లేస్, చైనా టూర్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్రభుత్వం...అసెంబ్లీ సమావేశాలను ఏదో తూతూమంత్రంగా మమ అనిపించాలని డిసైడయ్యిందట. ఎక్కువ రోజులు నిర్వహిస్తే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న కేసీఆర్...కేవలం ఐదురోజులు మాత్రమే జరపాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఈనెల 23నుంచి 30వరకు అంటే మధ్యలో మూడ్రోజుల సెలవులను తీసేసి... 23, 24, 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీని నిర్వహించనున్నారు. సమావేశాలు ఐదురోజులే అయినప్పటికీ, ప్రతిపక్షాలు...తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశమున్నందున... ఎదురుదాడికి దిగాలని మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.