diwakra reddy andhra pradesh special status vankai

జేసీ వంకాయ సామెత

  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నోరు తెరిచారంటే సీరియస్ కామెడీయే. ఆయన చాలా సీరియస్‌గా మాట్లాడతారు.. కానీ ఆ మాటల్లో కామెడీ ధ్వనిస్తుంది. కాకపోతే ఆయన నిజాలే మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అలాంటి సీరియస్ కామెడీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్లమెంట్‌లో పోరాటం చేయొచ్చు కదా అని ఎవరో అడిగితే, పోరాటమా వంకాయా అని ఒక్క మాటలో తేల్చేశారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ వున్న బీజేపీ మీద పోరాటం చేసే సీను తమకు లేదని ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. ముఖ్యమంత్రి వెంట ప్రధాని దగ్గరకి వెళ్ళి ఆయనకు ఓ నమస్కారం పారేసి రాష్ట్రం మీద దయదల్చండి మహప్రభో అని అడగటం తప్ప ఇంకేమీ చేసేంత సీను తమకు లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే ఐదేళ్ళో, పదేళ్ళో సరిపోదని... కానీ ఇంకా యాభయ్యేళ్ళు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జేసీ దివాకరరెడ్డి చెప్పారు. కురుక్షేత్రంలో దుర్మార్గులందరూ ఒక్కటై అభిమన్యుడిని ఎలా చంపారో రాష్ట్ర విభజన కూడా కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు.

parliament budget sessions

మోడీ ప్రభుత్వ హామీల లిస్టు

మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీల జాబితాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చదివి వినిపించారు.  ఆ లిస్టు ఇలా వుంది... * ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. * జనధన్ యోజనతో11  వేల కోట్లు  జమయ్యాయి. * ఉపాధికల్పన, ఉత్పత్తి పెంపు మా  ప్రభుత్వ లక్ష్యం. * పారిశుద్ధ్యం నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రాధాన్యం  * సబ్ కా  సాథ్ , సబ్ కా వికాస్  మా లక్ష్యం * 2022 నాటికి అందరికీ  గృహ వసతి * ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు * సమీకృత అభివృద్దికి కృషి.. ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యత * దేశవ్యాప్తంగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం.. * ఆడపిల్లల విద్య రక్షణ కోసం బేటీ బచావో.. బేటీ పఢావో పథకం ద్వారాకృషి. * టెక్నాలజీని వాడుకొని బ్లాక్ మనీ నిరోధానికి కృషి. * భూసేకరణలో పారదర్శకతను పాటిస్తాం. రైతులకు పెద్ద పీట వేస్తాం. * మాగ్జిమమ్ గవర్నన్స్, మినిమిం  గవర్నమెంట్.. * సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూస్తాం. * గిరిజన అభివృద్ధి వనబందు  కళ్యాణ్ యోజన్  పథకం * మంచివైద్యంకోసం  మిషన్ ఇంద్రధనుష్ * ఈశాన్యరాష్ట్రాల  విద్యాభివృద్ధికి పాటుపడతాం. * ప్రధానమంత్రి నీటి పారుదల పథకం మొదలుపెడతాం * పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం. * మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది * న్యాయ సంస్కరణలకు పెద్ద పీట వేస్తాం. * పన్నుల విధానాన్ని సరళీకరణ చేస్తాం. * మారుమూల ప్రాంతాల్లోను  మౌలిక వసతులు  కల్పిస్తాం. * కరెంటు లోటుపైనా  ప్రత్యేక దృష్టి పెడతాం. * పోర్టుల ద్వారా  రవాణాను పెంచుతాం. * ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు చర్యలు చేపడతాం.

academy oscar awards winners list

ఆస్కార్ అవార్డ్స్ విజేతల జాబితా

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 87వ ఆస్కార్ (అకాడమీ) అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తమ నటుడిగా ఎడీ రైడ్‌మైన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’  చిత్రానికి నాలుగు విభాగాల్లో, ‘వివ్‌లాష్’, ‘బర్డ్ మ్యాన్’ చిత్రాలకు మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కాయి.  అనేకమంది  అంతర్జాతీయ సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు.... ఉత్తమ నటుడు - ఎడ్డీ రైడ్‌మైన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్) ఉత్తమ నటి - జూలియన్ మోరే (స్టిల్ ఎలైన్) ఉత్తమ సహాయ నటుడు - జేకే సిమన్స్ (వివ్‌లాష్) ఉత్తమ సహాయనటి - పెట్రిసియా ఆర్కెట్ (బాయ్‌హుడ్) ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం - బిగ్ హీరో 6 (డాన్ హాల్, క్రిస్ విలియమ్స్, రాయ్ కాన్‌లీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ - బర్డ్ మ్యాన్ (ఇమ్మాన్యుల్ లుబేకీ) ఉత్తమ వస్త్రాలంకరణ - మెలెనా కనోనెరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ దర్శకుడు - అలెజాన్డ్రో జి. ఇరినాట్ (బర్డ్ మ్యాన్) ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - వివ్‌లాష్ (ట్రామ్ క్రాన్) ఉత్తమ విదేశీ చిత్రం - ఐడా (పోలండ్) ఉత్తమ ముఖ, కేశాలంకరణ - ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఫ్రాన్సిస్ హసన్, మార్క్ కౌలీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - డి గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్ హాసెన్, అనా పినాక్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - అమెరికన్ స్నైపర్ (అలన్ రాబర్ట్, ముర్రే, బబ్ ఆస్మాన్) ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - వివ్‌లాష్ (క్రేగ్‌మన్, బెన్ విల్కిన్స్, థామస్ క్యూర్‌లీ) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - ఇంటర్ స్టెల్లార్ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఐస్ హంటర్, స్కాట్ ఫిషర్) ఉత్తమ సంగీతం  (ఒరిజినల్ స్కోర్) - అలెక్సాండ్రీ డెన్‌ప్లాట్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ స్క్రీన్ ప్లే - బర్డ్ మ్యాన్ ఉత్తమ డాక్యుమెంటరీ - క్రైసిస్ హాట్ లైన్ - వెటరన్ ప్రెస్ 1 (ఎలిస్ గూసెన్‌బర్గ్ కెంట్, డానా పెర్రీ. ఉత్తమ షార్ట్ ఫిలిం - ది ఫోన్ కాల్.

parliament budget sessions

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

  భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ తన ప్రసంగంలో ఆయన శ్యామ ప్రసాద్ ముఖర్జీ వ్యాఖ్యలను కోట్ చేశారు. అంతకు ముందు భారత రాష్ట్రపతిని పార్లమెంట్‌కి ప్రధాని, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులు తోడ్కొని వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ప్రభుత్వం ముందు వున్న సవాళ్ళను, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలను ప్రస్తావించారు.

ali brother

అలీ తమ్ముడికి జలగండ్రి అయ్యింది

  ప్రముఖ హాస్య నటుడు అలీ తమ్ముడు, సినీ హాస్య నటుడు మహ్మద్ ఖయ్యూం పెళ్ళి జరిగింది. ఆదివారం నాడు గుంటూరులోని సన్నిధి కళ్యాణ మంటపంలో ఖయ్యూం పెళ్ళి వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ రసూల్ పెద్ద కుమార్తె ఆర్షియాతో ఖయ్యూం పెళ్ళి (అలీ భాషలో జలగండ్రి) అయింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు, రాజకీయ ప్రముఖులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, కృష్ణవంశీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఖయ్యూమ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

yoga no rape

యోగా చేస్తే మానభంగాలు జరగవట...

  యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ‘‘ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది. భావోద్వేగాలు మారిపోతాయి.ఎన్నో పనులు చేయడానికి ఈ ప్రకృతి మనకు ఈ  అమూల్యమైన శరీరాన్ని అందించింది.. ఆ పనుల వైపుగా మనిషి సాగిపోతాడు’’ అని మురళీ మనోహర్ జోషి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘ది లైంగర్ వే యోగా ఫర్ ది న్యూ మిలినీయం’ అనే అంశంపై జరిగిన సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్న మురళీ మనోహర్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా ముస్లింలు రోజుకు ఐదుసార్లు యోగా చేస్తారని అన్నారు. ముస్లిం ప్రవక్త మహ్మద్ గొప్ప యోగి అని కూడా జోషి వ్యాఖ్యానించారు.

Australia country immigration laws Prime Minister Tony Abbott

ఆస్ట్రేలియా మీద ఆశలేం పెట్టుకోవద్దు...

  ఆస్ట్రేలియాలో చదువుకుందామని అనుకుంటున్నారా? అక్కడ ఉద్యోగం చేయాలని భావిస్తునారా? ఆ దేశంలో స్థిరపడాలని అనుకుంటున్నారా? మీ కోరిక మరీ బలమైనది కాకపోతే పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం కాబోతోంది. ఆస్ట్రేలియా వలస చట్టాటు మరింత సంక్లిష్టం కానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా వలస చట్టాలు కొరకరాని కొయ్యలా వుంటాయి. వాటిని మరింత జటిలం చేసే ఆలోచనలో వున్నామని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రజల రక్షణ చర్యలు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా వలస చట్టాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. గత డిసెంబర్‌లో సిడ్నీ కేఫ్ ఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియా దేశ భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.

Airports take Robert Vadra off no frisking list goa

సోనియా అల్లుడివా? సో వాట్?

  తన అత్తగారు సోనియా గాంధీ పార్టీ అధికారంలో వుండగా మహారాజులా వైభవాన్ని అనుభవించిన రాబర్ట్ వాద్రాకి ఇప్పుడు అంత సీన్ లేకుండా పోతోంది. అధికారం పోవడంతో హోదాలు కూడా తగ్గిపోతున్నాయి. గతంలో ఎయిర్ పోర్టుల్లో ఎవరెవరిని చెక్ చేయకూడదో పెద్ద లిస్టు వుండేది, భారత రాష్ట్రపతితో మొదలయ్యే ఆ లిస్టులో చివర్లో రాబర్ట్ వాద్రా గారి పరివారం పేరు కూడా వుండేది. ఆయనకు ఏ హోదాతో ఆ అధికారం కల్పించారో అడిగినా సమాధానం చెప్పినవారు అప్పట్లో లేరు. ఇప్పుడు ఆ హోదా ఇప్పుడు పోతోంది. గోవా విమానాశ్రయంలో తనిఖీలు చేయవలసిన అవసరం లేని ప్రముఖుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగించారు. మిగిలిన విమానాశ్రయాలలో కూడా అదే జరగవచ్చని తెలుస్తోంది. వాద్రాకు ప్రత్యేకంగా ఏ అధికారిక హోదా లేకపోయినా ఆయనను భద్రత తనిఖీ నుంచి మినహాయించారు. ఇప్పుడు ఆ హోదాలు, వైభవాలు క్రమంగా పోతున్నాయి.

parliament Budget session 66 pending bills to be discussed

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

  భారత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి జరుగుతాయి. ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లులు పెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాల్సి వుంది. మత మార్పిడి బిల్లుతో సహా ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా వున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి మే 8వ తేదీ వరకు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడతగా ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్‌ 20 నుంచి మే 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. తొలి విడతలో 20 రోజులు, మలి విడతలో 13 రోజుల చొప్పున ఉభయ సభలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Nitish Kumar Takes Oath as Bihar Chief Minister

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం

  బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ త్రిపాఠీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్‌తోపాటు 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 20 మంది గతంలో మాంఝీ మంత్రివర్గంలో పనిచేసినవారే. ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో పెళ్ళి బాజా మోగుతున్నందున ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కాగా, కొత్తగా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినందుకు అలిగే గతంలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మాంఝీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన విషయం తెలిసిందే.

india won

దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం

  వరల్డ్ కప్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా మీద భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. 308 పరుగుల లక్షంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 170 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఇండియా ఓపెనర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. మరో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించాడు. దాంతో ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా వెన్నును భారత బౌలర్లు విరిచారు. దాంతో దక్షిణాఫ్రికా 40.2 ఓవర్లకు 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది.

Bangladesh Ferry Capsizes With 100 Passengers on Board

వందమందితో మునిగిన పడవ

  బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాలు సాధారణమైపోయాయి. ఇక్కడ ఎక్కువ శాతం ప్రయాణాలు పడవల ద్వారా జరుగుతూ వుంటాయి. ఇటీవలి కాలంలో ప్రయాణికులతో వున్న పడవలు మునిగిపోయిన ఘటనల్లో వందలాది మంది ప్రజలు మరణించారు. ఇప్పుడు అలాంటి ఘటన మరోటి జరిగింది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో వందమంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ ఆదివారం నాడు మునిగిపోయింది. ప్రయాణికుల పడవను ఒక కార్గో నౌక ఢీకొనడంతో పడవ మునిగిపోయింది. నది ఉద్ధృతి బాగా వుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు మృతదేహాలు బయటపడటం గానీ, ఎంతమంది చనిపోయారన్న విషయాలు గానీ వెల్లడి కాలేదు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

వార్నీ... తండ్రితోనే కిడ్నాప్ డ్రామా

  ఈమధ్య కొంతమంది యువకులు జల్సాల కోసం ఓవర్ యాక్షన్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటి ఓవర్ యాక్షన్లలో ఒక సరికొత్త యాక్షన్ బయటపడింది. జల్సాలకు బాగా మరిగిన ఓ కుర్రాడు తనను ఎవరో కిడ్నాప్ చేశాడని తండ్రికి ఫోన్ చేసి డబ్బులు గుంజాడు. తన తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ చివరికి జైల్లో పడ్డాడు. ముంబైకి చెందిన విజయ్ రోహన్ అనే పాతికేళ్ళ కుర్రాడు బంజారాహిల్స్‌లో నివసిస్తూ, సోమాజీగూడాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బాబుగారికి ఖరీదైన హోటళ్ళలో పార్టీల్లో పాల్గొనడం, డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూ వాళ్ళతో సమానంగా డబ్బు ఖర్చుపెట్టడం, జల్సాలు చేయడం అంటే బాగా ఇష్టం. ఈయనగారి గొప్ప అలవాట్లకు సరిపడా జీతం లేకపోవడంతో ఒక అమోఘమైన ఐడియా వేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బు ఇస్తేనే వదిలిపెడతారని తన తండ్రికే ఫోన్ చేసి చెప్పాడు. కిడ్నాపర్లు తన చేత ఫోన్ చేయిస్తున్నారని అన్నాడు. ఈ విషయం పోలీసులకు చెబితే తనను కిడ్నాపర్లు చంపేస్తారని భయపెట్టాడు. ఆ తండ్రి భయపడిపోయి కొడుకు బ్యాంక్ అకౌంట్లో దాదాపు రెండు లక్షల రూపాయలు వేశాడు. ఆ డబ్బుతో వీడు బాగా ఎంజాయ్ చేశాడు. కిడ్నాపర్లు ఇంకా డబ్బు కావాలని అంటున్నారని, అర్జెంటుగా బ్యాంకులో వేయాలని తండ్రికి ఫోన్ చేశాడు. దాంతో సదరు తండ్రి హైదరాబాద్‌కి వచ్చాడు.. ఆ తర్వాత తన కొడుకు ఫోన్ల మీద అనుమానం వచ్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తే సదరు పుత్రరత్రం చేస్తున్న ఘనకార్యం బయటపడింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు. కొడుకును లోపల వేశారని ఆ పుత్రరత్నం తండ్రి ఎంతమాత్రం బాధపడటం లేదు.

కృష్ణంరాజుకు హార్ట్ ఆపరేషన్

  ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు రక్తాన్ని అందించే నాళాలు పూడుకుపోవడంతో స్టెంట్లు అమర్చామని వైద్యులు తెలిపారు. ఆయన స్వల్ప అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణించిన షాక్‌లో అందరూ వుండగానే, సినీనటుడు చంద్రమోహన్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఇలా కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు. సినీరంగ ప్రముఖులు ఇలా వరుసగా అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.

కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవలసిన అవసరం వుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి దిశా నిర్దేశం చేశారు. విభజన చట్టంలోని హామీల సాధనకు కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకోవడానికి ప్రయత్నిచాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిరంతరం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిధులు రాబట్టాలని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ఒక్కో ఎంపీ కోటి రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. ఎంపీలు 24 కోట్లు ఇస్తే ప్రభుత్వం మరో 24 కోట్లు ఇస్తుందని తెలిపారు. ఈ నిధులతో గృహ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.