విశ్వసనీయతకు పరీక్ష పెట్టిన ఎన్నికలు

  ఈరోజు సీమాంద్రాలో జరిగిన ఎన్నికలు తెదేపా, వైకాపాల మధ్యనే ప్రధానంగా జరిగాయని చెప్పవచ్చును. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి గనుక పోలింగు ముగిసే వరకు కూడా రెండు పార్టీలనేతలు, కార్యకర్తల మధ్య అనేక చోట్ల ఘర్షణలు జరిగి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఎన్నికల కమీషన్ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు చేయడంతో కొన్ని సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఈసారి దాదాపు 80 శాతం వరకు పోలింగు జరిగి ఉండవచ్చని ఎన్నికల కమీషనర్ భంవార్ లాల్ ప్రకటించారు. ఈసారి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఓటు విలువ గురించి, ఓటు వేయవలసిన ఆవశ్యకత గురించి తెలియజెపుతూ ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ స్వయంగా యువతతో అనేక సదస్సులు నిర్వహించి బాగా ప్రచారం చేసినందున ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.   ఇక ఓటింగు శాతం పెరగడానికి మరో కారణం, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే ప్రజలలో పట్టుదల, ప్రధాన పోటీదారులుగా నిలిచిన తెదేపా, వైకాపాల పట్ల కూడా తమ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయాలని ప్రజలు భావించడమే. అందువల్ల ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీల విస్వసనీయతకు పరీక్ష వంటివని కూడా చెప్పవచ్చును.   తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, వైకాప అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా షరా మామూలుగానే తామే గెలుస్తామని ప్రకటించేశారు. ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా వైకాపాకు అనుకూలంగా రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాము ఊహించిన విధంగానే ఈసారి పోలింగు శాతం గణనీయంగా పెరిగింది గనుక తప్పకుండా తమ పార్టీయే విజయం సాధిస్తుందని విస్వాసం వ్యక్తం చేసారు. ఆ రెండు పార్టీలలో ప్రజలు దేనిని విశ్వసిస్తున్నారో మరి కొద్ది రోజులలో అంటే మే-16న తేలిపోనుంది.

జగన్‌కి ఓటుతో బుద్ధి చెప్పాల్సిన తరుణమిది

      రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వచ్చిన ఈ ఎన్నికలు, ఇంతకాలం ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ, మోసగించిన రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి వీసమెత్తు విలువనీయకుండా, పార్లమెంటరీ విలువలను తుంగలో తొక్కి మరీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ తీరును అందరూ గమనించారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఆందోళన చెందిన ప్రజలకు దైర్యం చెప్పి వారికి భరోసా ఇవ్వకపోగా, అటువంటి సమయంలో కూడా వారిని నిర్లజ్జగా ఓట్లు, సీట్లు కావాలని కోరుతూ బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను ప్రజలు గమనించే ఉంటారు. చంద్రబాబుది రెండు కళ్ళు, కాళ్ళ సిద్ధాంతమని నాడు వెక్కిరించిన జగన్, షర్మిలలే ఆ తరువాత మాట మార్చి తమకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు సమానమని చెప్పిన సంగతిని ప్రజలు గమనించే ఉంటారు.     నాడు వైకాపా చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి విభజన తరువాత మళ్ళీ కొత్త నిర్వచనం చెప్పడం ద్వారా అంతకాలంగా తాము చేసిన ఆ ఉద్యమమంతా భూటకమని, అది సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి, వారి ఓట్లు రాల్చుకోవడానికేనని స్పష్టమయింది. ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, ఇతర పార్టీలలో బలమయిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడాన్ని ప్రజలు గమనించే ఉంటారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకొన్న వైకాపా ఆ తరువాత ఎన్నడూ కూడా సమైక్యాంధ్ర గురించి మాట్లాడింది లేదు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఎన్నికల గంట మ్రోగిన తరువాత ఎటువంటి పాలనానుభావం కానీ, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ జాతీయ పార్టీతో సఖ్యత గానీ లేని జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రాన్ని ఎవరూ చేయలేనంతగా అభివృద్ధి చేసి, రాజధాని నిర్మిస్తామంటూ హామీలు గుప్పించారు. ఇంతకాలంగా బూటకపు ఉద్యమాలతో ప్రజలను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఐదు సంతకాలతో వారి దశదిశ కూడా మార్చేస్తానని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన సమయంలో నిఖచ్చిగా వ్యవహరించలేకపోయారు. కానీ ఆయన రెండు ప్రాంతాలలో కూడా తన పార్టీని కాపాడుకోనేందుకే ఆవిధంగా వ్యవహరించవలసి వచ్చింది. కానీ, ఆయన కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనివార్యమని గ్రహించినందునే ఆయన సమన్యాయం చేయమని కోరుతూ పోరాడారు. అందుకే ఆయన పట్ల తెలంగాణా ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత ఉంది. అంతే కాదు, కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించగానే రాత్రికిరాత్రి తెలంగాణా నుండి వైకాపాలలాగా మూటాముల్లె సర్దుకొని బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిలాగా బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయలేదు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని హామీలు కూడా ఇవ్వలేదు. ఆయన మొదటి నుండి మాట మీదనే నిలబడి వైకాపా పెట్టిన అగ్నిపరీక్షలు ఎదుర్కొని నిలువగాలిగారు. కానీ విశ్వసనీయతకు మారుపేరని చెప్పుకొన్న వైకాపా దాని అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాగానే మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఏవిధంగా సిద్దమయిపోయారో ప్రజలే స్వయంగా చూశారు. అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు మొదటే కొంచెం ధైర్యం చేసి, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు, వారి సమస్యలు, అవసరాలు, అక్కడి రాజకీయ సమస్యలు సీమాంధ్ర ప్రజలకు వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమని నచ్చజెప్పి ఉండి ఉంటే, నేడు రెండు రాష్ట్రాలలో కూడా తేదేపాకు ఎదురే ఉండేది కాదేమో! కానీ ఆయన ఎందుకో ఆ నాడు ధైర్యం చేయలేకపోయారు. అది ఆయన బలహీనతగా భావించాల్సి ఉంటుంది తప్ప ప్రజలను మోసపుచ్చడానికి కాదని ప్రజలకూ తెలుసు. ఇక మంచికో చెడుకో, కష్టమో, నష్టమో రాష్ట్రవిభజన జరిగిపోయింది. ఇటువంటప్పుడు అన్నివిధాల అనుభవజ్ఞుడు, కేంద్రంతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తేగలవాడికే ప్రజలు ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంది. అలాకాదని ఏబీసీడీలు నేర్చుకొంటున్న వ్యక్తుల చేతికి రాజ్యాధికారం కట్టబెడితే, ఆవ్యక్తి అన్నీ నేర్చుకొనేవరకు చేసే తప్పులకు, తప్పుడు నిర్ణయాలకు ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అందువలన కులం,మతం, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగిపోకుండా సరయిన వ్యక్తికి, పార్టీ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెట్టాల్సి ఉంటుంది. అదికూడా తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పుడే కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదేళ్ళపాతు సుస్థిరమయిన పాలన జరిగి, రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలి.

తెదేపా, వైకాపాలలో ఏది బెస్ట్?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చనున్న కీలకమయిన ఎన్నికలు రేపు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పార్టీలు ఈ ఎన్నికలలో నామమాత్రపు పాత్ర పోషిస్తాయని దాదాపు స్పష్టమయింది. అందువల్ల ఇక ఈ యుద్ధం ప్రధానంగా అభివృద్ధి మంత్రం పటిస్తున్న తెదేపా, వైకాపాల మధ్యనే జరగనుంది. రెండు పార్టీలు కూడా తాము మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపగలమని, సుపరిపాలన అందించగలమని, పేదల సంక్షేమం కోసం పాటుపడగలమని, ప్రత్యర్ధపార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వాదించాయి. ప్రజలు కూడా వాటి వాదనలు ఆసాంతం విని వాటిని బేరీజు వేసుకొని రేపు తమ తీర్పు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆ రెండు ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలు మరొకసారి చూద్దాం.   తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలు: 1.చంద్రబాబు కార్యదక్షత, సమర్ధమయిన పాలన అందించగల శక్తి, అనుభవం. పార్టీలో సమర్ధులు, పరిపాలనానుభవం గల నేతలు, నిర్మాణరంగంలో ఆరితేరిన ప్రముఖ రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు కలిగిఉండటం.   2. రాష్ట్రానికి అంతులేని సంపద అందిస్తున్న అక్షయపాత్ర వంటి హై-టెక్ సిటీ నిర్మాణం చేసినందున ఇప్పుడు సీమాంద్రాకు కూడా అటువంటి సంస్థలు, పరిశ్రమలు, మౌలిక వసతులతో కూడిన నగరం నిర్మించగల అనుభవం, శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండటం.   3. విజయావకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కేంద్రానికి మద్దతు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తెచ్చుకోగల నేర్పుకలిగి ఉండటం. బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పటికీ దాని మతతత్వం మాత్రం తనకు అంటించుకోకుండా సెక్యులర్ విధానానికే కట్టుబడి ఉండటం. ముఖ్యంగా సమాజంలో అట్టడుగువర్గాలకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఈయడం.   ప్రతికూలాంశాలు: 1. సంక్షేమ పధకాలు, సబ్సీడీలు కొనసాగించడంలో అనాసక్తి. రాష్ట్రాభివృద్ధికి మూలమయిన వ్యవసాయం, కీలక పాత్ర పోషించే ప్రభుత్వోద్యోగులు పట్ల చిన్నచూపు.   2. అభివృద్దిని కేవలం పట్టణాలకే పరిమితం చేయడం. గ్రామీణాభివృద్ధి పట్ల అనాసక్తి.   3. ప్రాధమిక, మాధ్యమిక విద్యకంటే ఉన్నత విద్యలకే పెద్దపీట వేయడం. ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం. అయితే ఈ పొరపాట్లకు తెదేపా చాలా భారీ మూల్యం చెల్లించి ఇంతకాలం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది కనుక, బహుశః ఇకపై చంద్రబాబు అటువంటి పొరపాట్లు చేయరని ఆశించవచ్చును.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశాలు: 1. జగన్ యువనాయకత్వంలో సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో రాష్ట్రాన్నిత్వరితగతిన అభివృద్ధి చేయగల అవకాశం. అతని తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను కొనసాగిస్తూ, ఆయన మొదలుపెట్టిన అనేక నీటి ప్రాజెక్టులను తప్పకుండా పూర్తి చేస్తాడనే ప్రజలలో నమ్మకం.   2. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నందున ఆయా రంగాలలో త్వరితగతిన అభివృద్ధి అయ్యే అవకాశం.   3. నగరాలతో సమానంగా గ్రామీణాభివృద్ధి జరగాలనే తపన ఉన్నందున, మారుమూల పల్లెలకు అభివృద్ధి అయ్యే అవకాశాలు.   ప్రతికూలాంశాలు: 1. ఎటువంటి పరిపాలనానుభావం లేకపోవడం. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం. ఈ కారణంగా ప్రభుత్వాధికారులతో, ఉద్యోగులతో నిత్యం ఘర్షణ తప్పదు. తత్ఫలితంగా ప్రభుత్వ నిర్వహణలో వైఫల్యం చెందే అవకాశం.   2. ముఖ్యమంత్రి అయినప్పటికీ సీబీఐ కేసులు, చార్జ్ షీట్లు కారణంగా కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చును. అతని మద్దతు కేంద్రానికి అవసరం లేకపోయినట్లయితే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చును.   3. కేంద్రం ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు రాబట్టే బదులు మెడలు వంచి తీసుకు వస్తానని చెపుతున్నందున, నిత్యం ఘర్షణ పడితే కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోయే అవకాశం. తత్ఫలితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి.   4. జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే, అవినీతి, అక్రమాలు సర్వత్రా వ్యాప్తి చెందే ప్రమాదం.   సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిన సంగతి ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనంతరం ఎటువంటి ప్రధాన ఆర్ధిక వనరులు లేని ఈ పరిస్థితుల్లో కూడా లక్షల కోట్లు వ్యయమయ్యే కొత్త రాజధానిని తప్పనిసరిగా, వీలయినంత త్వరగా పునర్నిర్ముంచుకోవలసిన ఆగత్యం కూడా ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా నిత్యావసర సరుకులు ధరలు, విద్యుత్ చార్జీలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు దుర్బర జీవితం గడుపుతున్నారు. ఏవిధంగా చూసినా రాష్ట్రంలో పూర్తి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.   ఇటువంటి క్లిష్టపరిస్థితులను చక్కబెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అన్నివిధాల సమర్ధుడు, అనుభవశాలి, కేంద్రంతో సత్సంబంధాలు గల వ్యక్తినే ప్రజలు ఎన్నుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలు తమ కష్టాలకు మరొక ఐదేళ్ళు పొడిగింపు కోరుకొన్నట్లే అవుతుంది. అందువల్ల ప్రజలు అన్నిటికంటే ప్రధానంగా ‘సమర్ధత’ కే ప్రాధాన్యం ఇచ్చి సరయిన వ్యక్తిని, పార్టీనే ఎన్నుకోవలసి ఉంటుంది. అలాకాకుండా కులం వంటి బలహీనతలకు లొంగి అసమర్దుడికి పట్టం కడితే అందుకు ప్రజలు భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు. అందువల్ల చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తపడటం మేలు.

పవన్ కళ్యాణ్ వాదనతో ఆత్మరక్షణలో పడిన జగన్

  తెదేపా-బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్, మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్మోహన్ రెడ్డిలపై చేస్తున్నఆరోపణలు, చేస్తున్న వాదనలతో వైకాపా డిఫెన్స్ లో పడింది. ఇక రాష్ట్ర విభజనకు కారణం మాజీ సీయం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిల భూ, ధన, అధికార దాహమే కారణమని, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణా లో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, భూకబ్జాలు, తెలంగాణా వినాశనమే అస్క్కడి ప్రజలలో వేర్పాటువాదానికి బీజం వేసిందని, నాటి నుండే తెలంగాణా ప్రజలు సీమాంధ్ర పాలకులను, ప్రజలను కూడా అసహ్యించుకోవడం మొదలు పెట్టరని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఆ తండ్రీ కొడుకుల కబంధ హస్తాల నుండి బయటపడేందుకే తెలంగాణా ప్రజలు రాష్ట్రం నుండి విడిపోవాలని పట్టుబట్టారని పవన్ కళ్యాణ్ చేస్తున్న వాదనలు సీమంధ్ర ప్రజలనే కాదు తెలంగాణా ప్రజలను కూడా విపరీతంగా అక్కట్టుకొంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి.   పవన్ చేస్తున్న ఈ ఆరోపణలను ఖండించడానికి వైకాపా నేతలు ప్రయత్నించినా, రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి వలన అనేకమంది అధికారులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు కోర్టులు చుట్టూ నేటికీ ప్రదక్షిణాలు చేయడం ప్రజలకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. అయితే ఇదంతా కాంగ్రెస్, తెదేపాలు కలిసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు చేసిన కుట్ర అని వాదించవచ్చు. కానీ అమెరికా దర్యాప్తు సంస్థ యఫ్.బీ.ఐ., అక్కడి కోర్టులు కూడా టైటానియం కుంభకోణం కేసులో వైయస్స్ కు ఆత్మగా చెప్పుకొంటున్న కేవేపీ రామచంద్ర రావు అరెస్టు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కూడా వారి కుట్రే అని జగన్, షర్మిల అనలేరు. అదే వారి అవినీతికి ఒక నిదర్శనం.   అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు, వాదనలతో సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం ప్రభావితమయినా అది తమ తలరాతలను కూడా మార్చేసే ప్రమాదం ఉందని జగన్, షర్మిల చాలా ఆందోళన చెందడం సహజమే. అందుకే వారిరువురూ చాలా ఆవేశంతో మాట్లాడే పవన్ కళ్యాణ్ పై పిచ్చివాడి ముద్రవేసి, ఆయన మాటలను పిచ్చివాడి ప్రేలాపనలని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు.   ఆయన ఆవేశం వారికి పిచ్చితనంగా కనబడుతుంటే, ప్రజలకు మాత్రం అందులో అయన దేశభక్తి, రాష్ట్రం, దేశం బాగుపడాలనే తపన కనబడుతోంది. ఒకవేళ వారన్నట్లు ఆయన నిజంగా అర్డంపర్ధం లేకుండా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి ఉండి ఉంటే ఆయన సభలకు ఇసుకేస్తే రాలనంత జనాలు తరలి వచ్చేవారే కాదు. ఆయనను పట్టించుకొనేవారు కూడా కాదు. అనేక సీబీఐ కేసులు ఎదుర్కొంటూ, ఈ ఎన్నికలలో ఓడిపోతే జైలు పాలయ్యే ప్రమాద స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవి జీవన్మరణ పోరాటం వంటివి. మరోవిధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆయన తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న పోరాటమని చెప్పవచ్చును. అదే మాటను పవన్ కళ్యాణ్ కుండబ్రద్దలు కొట్టినట్లు చెపితే, దానిని జీర్ణించుకోవడం చాలా కష్టమే!   రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరుపేదలకు అందిన సంక్షేమ ఫలాలకు, ప్రతిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని వందల రెట్లు భారీ మూల్యం చెల్లించారు. అదంతా జగన్మోహన్ రెడ్డి వద్ద పోగుబడిందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. మరి ఇంత తార్కికంగా ఆయన చేస్తున్నఆరోపణలకు నేరుగా జవాబు చెప్పకుండా ఆయన పిచ్చివాడని ఎద్దేవా చేయడం ధనమధమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును.   జగన్మోహన్ రెడ్డి నేటికీ చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటున్నట్లు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకు సానుభూతిని, ఆయన అమలుచేసిన సంక్షేమ పధకాలను చెప్పుకొనే ప్రజలను ఓట్లు కోరుతున్నారు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా ఆయనపైనే చేస్తున్న విమర్శలు, ఆరోపణలు జీర్ణించుకోవడం వైకాపాకు కష్టమే కాదు నష్టం కూడా. జగన్ నేటికీ సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప, దైర్యంగా గుండెల మీద చేయేసుకొని తమకు ఎటువంటి అవినీతి మరకలు అంతలేదని చెప్పలేరు. ఏది ఏమయినప్పటికీ మరొక రెండు రోజుల్లో ప్రజలే అంతిమ తీర్పు చెప్పబోతున్నారు. అప్పుడే ఎవరి వాదనలలో నిజాయితీ ఉందో, ఎవరివి ఉన్మాద ప్రేలాపనలో తేలిపోతుంది.

ప్రజలను మభ్యపెడుతున్న జగన్

  ఎటువంటి పరిపాలనానుభావం లేని జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర దశదిశ మార్చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాకో విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతీ గ్రామంలో పదిమంది మహిళా పోలీసుల ఏర్పాటు, స్థానికంగా అన్ని రకాల సేవలను అందించే ఒక కార్యాలయం, కోట్లాది రూపాయలు అవసరమయ్యే అనేక సంక్షేమ పధకాలు, అన్ని ఆధునిక హంగులతో రాజధాని నిర్మాణం ఇలా చాలా ఆకర్షణీయమయిన రంగుల కల వేసి జనాలకి చూపిస్తూ తమకే ఓటువేసి గెలిపించమని కోరుతున్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితి వస్తుందని మన రాజకీయ నాయకులే స్వయంగా చెపుతున్నారు. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గుప్పిస్తున్నఈ హామీలన్నిటినీ అమలుచేసేందుకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? అని ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం కేంద్రం ఇస్తుందని. కేంద్రంలో ఏ కూటమి ఆధికారంలోకి వస్తే దానికే మద్దతు ఇచ్చి నిధులు తీసుకువస్తామని చెపుతున్న జగన్, ప్రస్తుతం అవే కాంగ్రెస్, బీజేపీలతో ఎన్నికల యుద్ధం చేస్తున్నారు.   ఆ రెండు పార్టీల నేతలు జైరామ్ రమేష్, నరేంద్ర మోడీ ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదని విస్పష్టంగా చెపుతున్నారు. విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నబీజేపీ, రాష్ట్రంలో తెదేపాతో జత కట్టినందున తమకు జగన్ మద్దతు అవసరంలేదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే అతనిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేస్తామని ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ విస్పష్టంగా ప్రకటించారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురూ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే జగన్ జైలుకి వెళ్ళడం తధ్యమని బల్లగుద్ది చెపుతున్నారు. పోనీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినా, అది ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదు. థర్డ్ ఫ్రంట్ పరిస్థితి అంతే.   మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయినట్లయితే తాను గుప్పిస్తున్న ఈ హామీలన్నిటినీ అమలుచేయడానికి అవసరమయిన లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుండి తీసుకువస్తారు? ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం మారగానే ఆయనపై సీబీఐ విచారణ మళ్ళీ మొదలయి, జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఏమి చేస్తారు? కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా రాష్ట్రంలో వరదలు, తుఫానులు వచ్చినప్పుడు కేంద్రం అరకొరగా సహాయం అందించి చేతులు దులుపుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి తనను జైలుకి పంపుదామనుకొంటున్న కేంద్ర ప్రభుత్వం నుండి జగన్ ఏవిధంగా నిధులు రాబట్టగలరు? అని ప్రశ్నిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెపుతారో?

మైనార్టీ ఓట్లకు వల వేస్తున్న కాంగ్రెస్

  “చంద్రబాబుకి ఓటేస్తే అది మోడీకి వేసినట్లే! తేదేపాకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే! తెదేపా, బీజేపీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివి కూటమి” ఇది కాంగ్రెస్ వాదన. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నప్పుడే వారే ఆవిషయం స్వయంగా దృవీకరించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పనిగట్టుకొని మళ్ళీ ఎందుకీ ప్రచారం చేస్తోందంటే, మతతత్వ బీజేపీని బూచిగా చూపిస్తూ మైనార్టీల ఓట్లు దండుకోవడానికే. వారిలో అభద్రతాభావం కల్పించి, వారిని తెదేపా నుండి దూరం చేసి తద్వారా బీజేపీని దెబ్బతీసేందుకే.   అయితే తెదేపా  బీజేపీతో అవసరార్ధం పొత్తులు పెట్టుకొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలాగే తెదేపా కూడా పూర్తి సెక్యులర్ పార్టీయేనని అందరికీ తెలుసు. అయినప్పటికీ అది బీజేపీతో పొత్తులు పెట్టుకొంది గనుక దానికీ మతతత్వ బురద పూసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇంతవరకు మైనార్టీలు తెదేపా వల్ల మతపరంగా ఎన్నడూ వివక్షకు గురి అయిన దాఖలాలు లేవు. తెదేపా హయాంలో కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యం దక్కిందేమో కానీ, మతపరంగా ఎన్నడూ వివక్ష చూపడం లేదా ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరుగలేదు. ఇప్పుడు అవసరార్ధం బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నంత మాత్రాన్న తెదేపా తన సెక్యులర్ విధానాలకు స్వస్తి చెపుతుందని అనుకోవడం అవివేకం. దేశంలో మోడీకి పెరుగుతున్న ఆదరణ, విజయావకాశాలు చూసి, బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, దానివలన రాష్ట్రంలో తమ విజయావకాశాలు కూడా మెరుగు పరుచుకోవచ్చనే ఆలోచనతో, ఆశతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలందరికీ అర్ధమయిన ఈవిషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదనుకోలేము. అయినా పనిగట్టుకొని తెదేపాకు కూడా మతతత్వ బురద పూసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది అంటే మైనార్టీ ఓట్ల కోసమే.   నిజానికి కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రచారంతో అది ముస్లిం, క్రీస్టియన్ ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తోందని అర్ధమవుతోంది. ఎందుకంటే మైనార్టీలకు ఏది సెక్యులర్ పార్టీ? ఏ పార్టీ ఎటువంటిది? అని ఆలోచించే విచక్షణా జ్ఞానం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నందునే, ఈవిధంగా ప్రచారం చేసి వారిని తనవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అనిచేప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పట్ల ఎంత చులకన భావం ఉందో ఇది పట్టి చూపుతోంది.

పవన్ కళ్యాణ్ విమర్శలతో ఓట్లు రాలుతాయా?

  నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేస్తున్న ఎన్నికల ప్రచార సభలకు విశేషంగా జనాలు తరలి వస్తున్నారు. సభకు వచ్చిన వారి నుండి మంచి స్పందన కూడా కనిపిస్తోంది. ఇంతవరకు కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చూపుతున్న ఈ తెగువ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటున్న మాట వాస్తవం. దానివలన తెదేపా-బీజేపీ కూటమికి ఓటింగ్ శాతం ఎంతో కొంత పెరగడం కూడా తధ్యం. అయితే సరిగ్గా ఇదే కారణం చేత వారి కూటమికి ఎంతో కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. అది ఆయన అభిమానులను, యువతను ముఖ్యంగా తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను కూడా చాలా ఆకట్టుకొంది. కానీ కేసీఆర్ గత పదేళ్ళుగా నిరంతర ఉద్యమాలు చేసి, చివరికి తెలంగాణా సాధించిన వ్యక్తి అని తెలంగాణా ప్రజల దృడాభిప్రాయం. అది నిజం కూడా. తెలంగాణా ప్రజల దృష్టిలో హీరోగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఏనాడు ఉద్యమాల గురించి కానీ, రాష్ట్ర విభజన వ్యవహారం గురించి కానీ నోరు విప్పని ఆంధ్రాకు చెందిన పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడం వలన తెలంగాణా ప్రజలు ఆగ్రహించడం సహజం. “మోడీ, ఇద్దరు ఆంధ్రా వాళ్ళను వెంటేసుకొని నాపై దాడి చేస్తున్నారు. అది నాపై చేస్తున్న దాడి కాదు. అది తెలంగాణా ప్రజలపై చేస్తున్న దాడి. మోడీ కూడా తెలంగాణకు శత్రువు” అని కేసీఆర్ అనడం కూడా అందుకే. పవన్ కళ్యాణ్ విమర్శల వలన ఎన్డీయే కూటమికే కాకుండా తెరాసకు కూడా ఎంత కొంత లాభపడవచ్చును. ఇరువురికీ అంతే నష్టం కూడా జరగవచ్చును కూడా. ఈ సంగతి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తేలుతుంది.   ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శల వలన కూడా అటువంటి మిశ్రమ ఫలితాలే కలగవచ్చును. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాల వలన సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు ఎంతో కొంత ప్రయోజనం పొందారు. వారందరూ ఆయన హయాంలో ఎంత అవినీతి జరిగింది? ఎవరు ఎంత దోచుకొన్నారు? వంటి విషయాల కంటే అంతవరకు తమకు ఏ ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి అందించలేని ప్రయోజనాలను నేరుగా అందించిన విషయాన్నే బాగా గుర్తు పెట్టుకొన్నారు.   ఇది గ్రహించిన జగన్ గత ఐదేళ్ళుగా తన తండ్రి నామస్మరణం చేస్తూ ప్రజలలో ఆ సానుభూతిని, ఆ పధకాలను మరుపురానీకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లనే నేటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో అంత విశేష ఆదరణ కనబడుతోంది. తెలంగాణాలో కేసీఆర్ లాగే ఆంధ్రాలో రాజశేఖర్ రెడ్డికి ప్రజలలో అంతే గౌరవం ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ ఆయనపై, ఆయనకు అసలు సిసలయిన వారసుడునని చెప్పుకొంటున్న జగన్ పై ఎంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తే ఎన్డీయే కూటమిపట్ల ప్రజలలో విముఖత ఏర్పడి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.   అక్కడ కేసీఆర్ తను చేసిన ఉద్యమాలను పేర్కొంటూ , పవన్ కళ్యాణ్ విమర్శలకు ఏవిధంగా ధీటుగా బదులిచ్చారో, ఇక్కడ సీమంద్రాలో జగన్, షర్మిల కూడా తమ తండ్రి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఉటంకిస్తూ అంతే ధీటుగా బదులిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల వలన సీమాంద్రాలో కూడా లాభమూ, నష్టమూ కూడా ఉండవచ్చును. కానీ పవన్ కళ్యాణ్ వారి అవినీతిని, వారి నిబద్దతను చాలా దైర్యంగా ప్రశ్నిస్తున్న తీరు మాత్రం యువతను,ముఖ్యంగా ఆయన అభిమానులను చాలా ఆకట్టుకొంటోంది. అది ఎన్డీయే కూటమికి ఓట్లు కురిపించే అవకాశం ఉంది.

మోడీ-రాహుల్ ప్రసంగాలలో వ్యత్యాసం

  నిన్న ఒకేసారి ఇద్దరు ప్రధాని అభ్యర్ధులు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజన, సీమాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. అయితే వారిరువురిలో రాహుల్ ప్రసంగం సగటు ఎన్నికల ప్రసంగంలాగే ఆకర్షణీయమయిన హామీలతో సాగింది. కానీ మోడీ మాత్రం చాలా నిర్మాణాత్మకంగా ప్రసంగించారు.   సీమాంధ్రకు ఉన్నఅపారమయిన సహజ వనరుల నుండి సంపద ఏవిధంగా సృష్టించుకొనే అవకాశాలున్నాయో ఉదాహరణలతో సహా విశదంగా వివరించిన మోడీ, తమకు ఓటేస్తే వాటిని వెలికి తీసేందుకు సీమాంధ్రకు తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ షరా మామూలుగా తమకు ఓటేస్తే ఆంధ్రాలో ఉన్నత విద్యాసంస్థలు నిర్మిస్తామని గాలిమేడలు కట్టి చూపించే ప్రయత్నం చేసారు. ఆయన ప్రసంగం యావత్తు మూస ఎన్నికల ప్రసంగంగానే సాగింది. కాపులను బీసీలో చేర్చడం, వాల్మీకి, వడ్డెర, రజకులను ఎస్సీలో చేర్చడం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు ఇళ్ల నిర్మాణం, వద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యాలు, పేదవారికి ఉచిత వైద్య సౌకర్యం వగైరాలనీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్న హామీలే.   తగినంత విద్యుత్ ఉత్పత్తి లేని కారణంగా పెద్ద పెద్ద పట్టణాలలో సైతం నేడు రోజుకు ఆరేడు గంటలు విద్యుతో కోతలు విధిస్తూ, మరోపక్క నిత్యం పెంచే విద్యుత్ చార్జీలతో గత ఐదేళ్ళుగా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలను చావగొడుతున్న సంగతి తెలియనట్లు, రాహుల్ గాంధీ గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇవ్వడం ప్రజలను అపహాస్యం చేయడమే.   కానీ మోడీ మాత్రం అటువంటి హామీలు ఏవీ ఇవ్వకుండా, సమర్దుడయిన చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి చేసే ప్రయత్నాలకు తాను కేంద్రం తరపున పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని చెపుతూ అందుకు మోడీ కొన్ని సూచనలు కూడా చేసారు. వాజపేయి ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రధాన నగరాలను, పట్టణాలను, పల్లెలను కలుపుతూ రోడ్లు నిర్మించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రైతులందరి పొలాలకు నీరు అందించేందుకు నదుల అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు.   ఇక మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ అధిష్టానం, జగన్మోహన్ రెడ్డిలపై తీవ్రంగా విమర్శలు గుప్పించగా, రాహుల్ మాత్రం జగన్ గురించి పల్లెత్తు మాటనకపోవడం గమనార్హం. ఇది వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణలు చేస్తున్న పవన్, చంద్రబాబు వాదనలకు బలం చేకూరుస్తోంది. తాను అధికారంలోకి వస్తే అవినీతి పరులను ఒక్కొకరినీ ఏరిపారేస్తానని మోడీ చెప్పడం, వైకాపాకు ఓటేసి రాష్ట్రాన్ని ‘స్కాం ఆంధ్రా’గా మార్చుకొంటే తను రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందించలేనని చెప్పడం ద్వారా మోడీ ఆంద్ర ప్రజలకు తన మనసులో మాటను చాల స్పష్టంగానే చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం జరగవలసి ఉన్నందున, మోడీ చెప్పిన మాటలు వైకాపాకు ఓటేద్దామని భావిస్తున్నప్రజలను పునరాలోచింపజేయవచ్చును.   మోడీ ప్రజలను ఆక్కట్టుకోనేందుకు చేసిన రాజకీయ విమర్శలను పక్కనబెట్టి చూసినట్లయితే, ఆయన ప్రసంగంలో చాల వరకు నిర్మాణాత్మకమయిన ప్రతిపాదనలే కనిపిస్తాయి. కానీ రాహుల్ తన రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేయకపోయినా, కేవలం గాలిమేడలు కట్టి చూపడం తప్ప కనీసం మోడీలా నిర్మాణాత్మకమయిన మాట ఒక్కటీ చెప్పలేకపోయారు. ఈ ఇరువురు ప్రధాని అభ్యర్దుల ప్రసంగాలు వారి మానసిక, రాజకీయ పరిపక్వత, దూరదృష్టి, ఆలోచన స్థాయిలలో వ్యత్యాసాన్ని ప్రజలకు పట్టి చూపుతున్నాయి.

తెలంగాణా ప్రజల విజ్ఞతకు పరీక్ష

  తెలంగాణా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. వారి కలలు పండించుకొనే రోజు ఇది. ఈరోజు వారు వేస్తున్న ఓటు కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం యొక్క దశ,దిశలని దానితో ముడిపడి ఉన్నతమ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతోంది. అందువల్ల ఈసారి తెలంగాణా ప్రజలు మరింత లోతుగా ఆలోచించి ఓట్లు వేయవలసి ఉంటుంది. నిజానికి ఇది వారి విచక్షణ జ్ఞానానికి రాజకీయ పార్టీలు పెడుతున్న పెద్ద పరీక్ష అని భావించి, ఓటుతో తమ సత్తా చాటి చెప్పాలి.   ఇంతవరకు వివిధ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలను గుప్పించారు. నానా రకాలుగా వారిని ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారు. పరస్పర విభిన్నమైన వాదనలు వినిపించి వారిని గందరగోళ పరిచారు. తాము మాత్రమే తెలంగాణాను అభివృద్ధి పధంలో నడిపించగలమని, తాము మాత్రమే తెలంగాణా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించగలమని అందరూ చాలా గట్టిగా చెప్పుకొన్నారు. మిగిలిన పార్టీలకు ఓట్లు వేస్తే వారు ప్రజలను దోచుకొంటారని ప్రజలకు నూరిపోసేరు.   ఇన్ని రకాల ఒత్తిళ్ళను తట్టుకొని నేడు తెలంగాణా ప్రజలు ఓటు వేయబోతున్నారు. అయితే ప్రజలకు ఈ మాటలు చెపుతున్న రాజకీయ నేతలలో చాలా మంది తెలంగాణా ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే. ఎప్పుడో అప్పుడు, ఎంతో కొంత కాలమయినా సదరు నేతలందరూ అధికారంలో ఉన్నవారే. మరి వారందరూ ఇంతకాలంగా తమ నియోజకవర్గం అభివృద్దికి, అక్కడి ప్రజల సంక్షేమానికి ఏమి చేసారని ప్రజలు ఒకసారి ప్రశ్నించుకొని మరీ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏమీ చేయని నేతలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలు కూడా తమను మభ్యపెట్టేందుకేనని గ్రహించి, అటువంటి రాజకీయ నేతలకు మంచి గుణపాటం నేర్పించాలి.   ఎన్నికల గంట మ్రోగిన తరువాత రాజకీయ నేతలందరూ తమంతట తామే తమ నిజస్వరూపాలను బయటపెట్టుకొన్నారు. వారి స్వభావం, వారి ఆలోచనలు, వారి లక్ష్యాలు, వారి నీతినిజాయితీ ఇత్యాది అంశాలన్నిటినీ ప్రజలు గమనించే అవకాశం కలిగింది. అందువలన ఎవరు ఎటువంటివారో ప్రజలు కూడా ఈపాటికే గ్రహించి ఉంటారు గనుక ఈ వాదనలకు, భావోద్వేగాలకు, ప్రలోభాలకు, హామీలకు అతీతంగా ఆలోచించి, తమకు, తమ కొత్త రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో వారినే ఎన్నుకోవడం మేలు.   ఇది రాజకీయనాయకులకి, వారి పార్టీలకి అగ్ని పరీక్ష మాత్రమే కాదు. ఈ ఎన్నికలు తెలంగాణా ప్రజల విజ్ఞతకు కూడా ఒక పరీక్ష వంటివేనని మర్చిపోకూడదు. కేవలం అధికారం, పదవుల కోసం నిత్యం రాజకీయాలు చేసే నేతలకు కాక, ప్రజాసేవ కూడా చేయగల, చేసే ఆసక్తి ఉన్న నేతలకే ఓటు వేసి ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజలు వారి నుండి ఏమయినా ఆశించే వీలు ఉంటుంది. లేకుంటే మరో ఐదేళ్ళ పాటు పదవులు, అధికారం కోసం ప్రాకులాడే తమ ప్రతినిధులను చూస్తూ అటువంటి వారికి ఓటు వేసినందుకు తాపీగా పశ్చాతాపపడవలసి ఉంటుందని మరిచిపోకూడదు.

తెలంగాణకు మేలు చేసేదెవరు?

  ఈసారి కేంద్రంలో, ఆంధ్ర, తెలంగాణాలలో ఏర్పడబోయే ప్రభుత్వాలను బట్టి ఆయా రాష్ట్రాల అభివృద్ధి ఆదారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో లేదా ఏ ఒక్క రాష్ట్రంలోనయినా తెదేపా-బీజేపీల ప్రభుత్వాలు ఏర్పడినట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహజంగానే మంచి సయోధ్య ఉంటుంది గనుక ఆ రాష్ట్రాల పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమయిన నిధులు విడుదలవుతూ త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.   ఒకవేళ తెలంగాణాలో తెరాస భారీ మెజార్టీతో  అధికారంలోకి వచ్చినా, కేసీఆర్ చెపుతున్న ‘బంగారి తెలంగాణా’ నిధుల కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో వ్యవహరిస్తున్న తీరువలన వారి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యాలే తప్ప స్నేహధర్మం పాటించడం అలవాటులేని తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా పగ్గాలు చేపడితే, తెలంగాణాకు కేంద్రం నుండి ఆశించినంతగా సహకారం ఉండదు. పైగా తమ పార్టీ గెలిస్తే ఆ రెంటికీ మద్దతు ఇవ్వనని, ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ కే మద్దతు ఇస్తానని చెపుతున్నారు. అటువంటప్పుడు ఆయన తను హామీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టుకోవడానికి నిత్యం కేంద్రంతో గొడవపడక తప్పదు. దాని వలన తెలంగాణకు లాభం కంటే మరింత నష్టమే జరిగే అవకాశం ఉంది.   ఇక కొమ్ములు తిరిగిన సిటింగ్ కాంగ్రెస్ యంపీలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులే లేరు. పైగా తెలంగాణాలో ఉన్న 17 యంపీ స్థానాలకి కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, తెరాస, మజ్లిస్ మరియు స్వతంత్ర అభ్యర్ధులు చాల మందే పోటీ పడుతున్నారు గనుక తెరాసకు మహా అయితే ఏ నాలుగయిదు యంపీ సీట్లో మాత్రమే దక్కే అవకాశముంది. ఆ నాలుగయిదు సీట్లను కేంద్రానికి ఎరగా వేసి తెరాస సాధించగలిగేదేమీ ఉండదు. అటువంటప్పుడు తెరాస చేసే డిమాండ్లను కూడా కేంద్రంలో పట్టించుకొనే వారే ఉండరు.   అదేవిధంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, లేదా కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, వారు వ్యతిరేఖించే బీజేపీ ఒకవేళ  కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఇబ్బందికరమే. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, తెలంగాణాలో కూడా ఆ పార్టీ లేదా తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మాత్రం తెలంగాణకు తప్పకుండా ఎంతో కొంత మేలు జరగవచ్చును. కానీ కేంద్రంలో కాంగ్రెస్, తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీఇబ్బందులు తప్పవు.   ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణానికే సిద్దపడినా, ఆ రెండు పార్టీలలో నేతలూ  కీలక పదవులు, అధికారాలు  తమకే కావాలని కోరుకోవడం సహజం గనుక వారిది కలహాల కాపురమే అవుతుంది. ఒకవేళ తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారం చేజిక్కించుకొన్నప్పటికీ, అప్పుడు కూడా వారి మధ్య ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్లయితే వారు కేంద్రం నుండి తెలంగాణా కోసం భారీగా నిధులు రాబట్టే అవకాశం ఉండటమే వీరికి అదనపు అర్హతవుతుంది. ఇక తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు బీజేపీ నిజంగానే చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయినట్లయితే దానివలన తెలంగాణాకు మరింత మేలే తప్ప కీడు జరుగదు. ఆయన తెలంగాణకు అవసరమయిన నిధులు విడుదల చేయించగలరు.   కేసీఆర్ తను ఉద్యమాలకు సమర్ధంగా నాయకత్వం వహించారు గనుక, ప్రభుత్వాన్ని కూడా అంతే సమర్ధంగా నడపగలనని భావిస్తున్నారు. కానీ జవాబుదారీతనం లేకుండా రోడ్లమీద ఉద్యమాలు చేయడానికి, తమను ఎన్నుకొన్న ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితిలో కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వం నడపదానికీ చాలా తేడా ఉంది. ప్రభుత్వం నడపడానికి కార్యదక్షత, పరిపాలనానుభావం, ఉద్యోగులతో, ప్రభుత్వాధికారులతో, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో మంచి సమన్వయము, సక్యత వంటి చాలా లక్షణాలు అవసరం ఉంటాయి. మరి కేసీఆర్ కి అటువంటి లక్షణాలు ఉన్నాయనుకొంటే ప్రజలు నిరభ్యంతరంగా ఆయనకే ఓటు వేసుకోవచ్చును. లేకుంటే అపార పరిపాలనానుభావం ఉన్న కాంగ్రెస్ పార్టీకో లేదా ఎంతో కొంత పరిపాలనానుభవము, తెలంగాణకు నిధులు రాబట్టగల సామర్ధ్యం ఉన్న తెదేపా-బీజేపీ కూటమికో ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంటుంది.

రాహుల్ జీ! జర సునీయే...

  రాహుల్ గాంధీ ఇదివరకోసారి మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని సమస్యలను రాత్రికి రాత్రి మటుమాయం చేసేందుకు తన వద్ద మంత్రం దండం ఏమీ లేదని అన్నారు. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోవాలని కమిట్ అయిపోయిన తరువాత దేశంలో అన్ని సమస్యలనీ చిటికవేసి పరిష్కరించేస్తానని హామీ ఇస్తున్నారు. అందువలన  ప్రజలను చిరకాలంగా వేదిస్తున్న కొన్ని ధర్మ సందేహాలకు ఆయన సమాధానాలు ఇవ్వగలిగితే చాలా సంతోషిస్తారు.   స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దాదాపు నేటి వరకు కూడా దేశాన్ని పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. అదేవిధంగా తెలంగాణా సమస్య కూడా 60 ఏళ్ల నాటిదని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. అయితే నాటి నుండి ఈ సమస్య ఉందని తెలిసి కూడా నేటివరకు దానిని పరిష్కరించకుండా ఎందుకు నాన్చవలసి వచ్చింది? అని రాహుల్ గాంధీని ఎవరూ ప్రశ్నించబోరు. కానీ 14 ఏళ్ల క్రితమే తెరాస కంటే ముందుగా తమ పార్టీ నేతలే తెలంగాణా ఇమ్మని కోరినా ఎందుకు ఇవ్వలేకపోయారు? కానీ ఇప్పుడు ఆ నేతల కోరిక మీదనే ఎందుకు ఇవ్వవలసి వచ్చింది?   పదేళ్ళ క్రితం తెలంగాణా ఇస్తామని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణా ఇచ్చారని గొప్పగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి పదేళ్ళు ఎందుకు పట్టిందో, అన్నేళ్లలో చేయలేని పనిని కేవలం ఆరేడు నెలలో ఎందుకు, ఎలా, ఎవరి ప్రయోజనం కోసం చేయగలిగారో ఆయనే స్వయంగా శలవిస్తే బాగుంటుంది.   ఈ పదేళ్ళ కాలంలో తెరాస చేసిన తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంటే, వందలాది మంది యువకులు బలిదానాలు చేస్తుంటే, అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకే నేడు తెలంగాణా ఏర్పాటు చేస్తున్నామని గర్వంగా చెప్పుకొంటున్న ఆయన, దాదాపు మూడు నాలుగు సం.లపాటు లక్షలాది తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వారి ఆకాంక్షలు ఎందుకు అర్ధం చేసుకోలేదు? అసలు అన్నేళ్ళలో ఆయన ఎన్నడు ఎందుకు స్పందించలేదు? పదేళ్ళ సుదీర్గ కాలంలో తెలంగాణా ఏర్పాటు చేయలేనప్పుడు, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇవ్వగానే ఎలా సాధ్యం అయింది? అటువంటప్పుడు ఇది ప్రజల ఆకాంక్షల మేరకే ఇస్తున్నామని చెప్పుకోవడం అబద్దం కాదా?   తమ పార్టీ ప్రజలందరినీ కలుపుకుపోతుందని సగర్వంగా చెప్పుకొన్న రాహుల్ గాంధీకి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంద్రాలో లక్షలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలల పాటు ఉద్యమాలు చేస్తుంటే వారినెందుకు కలుపుకు పోలేకపోయారు? వారి ఘోష ఎందుకు వినలేకపోయారు? అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ఏమి సమాధానం చెపుతారు?   ఇక ‘మేడ్ ఇన్ తెలంగాణా’ వాచ్ పెట్టుకోవాలని ఉందని చెపుతున్న ఆయన, ఇంతకాలంగా చైనా ఉత్పత్తులు మనదేశ ఆర్ధిక వ్యవస్థను, మన దేశీయ పరిశ్రమలను చిన్నాభిన్నం చేస్తున్నసంగతి తెలిసి ఉన్నపటికీ ఆయన ఇంత కాలం మిన్నకుండి ఇప్పుడు ఎన్నికల ముందు మేడ్ ఇన్ తెలంగాణా వాచ్ పెట్టుకోవాలని ఉందని అనడం అపహాస్యం కాదా?   కొంప అంటుకొన్నాక నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, తెలంగాణా ఏర్పాటు చేసిన తరువాత విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని ఇప్పుడు 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థాపిస్తామని ప్రకటించడం వివేకమనిపించుకొంటుందా? ఇదే పని ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారు? ఆయన జవాబు చెప్పగలిగితే ఇటువంటి అనేక యక్ష ప్రశ్నలున్నాయి.

తెలంగాణాలో అధికారం కోసం వాద ప్రతివాదాలు

  కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది తామేనని సగర్వంగా చెప్పుకొంటున్నారు. తమ వల్లనే 60 ఏళ్ల తెలంగాణా ప్రజల కల సాకారమయ్యిందని చెప్పుకొంటున్నారు. అందుకోసం తమ అధినేత్రి సీమాంద్రా(కాంగ్రెస్ పార్టీ)ను బలిపెట్టుకొందని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. తెలంగాణా ఇచ్చిన ఘనత, క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే జమ అవుతుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల తెలంగాణా ప్రజలందరూ తమకే ఓటేసి కృతజ్ఞత చాటుకోవాలని టీ-కాంగ్రెస్ నేతలు సవినయంగా ప్రజలను నిలదీసి మరీ అడుగుతున్నారు. తమను మోసం చేసిన కేసీఆర్ ఒక నమ్మక ద్రోహి అని, ఆయన తెలంగాణా కోసం చేసిందేమీ లేదని వాదిస్తున్నారు. బీజేపీ, తెదేపాలు కూడా చివరి నిమిషం వరకు తెలంగాణా బిల్లుకి అడ్డుపడ్డాయని అటువంటి పార్టీలకు మీరు ఓటేస్తారా? అని ప్రజలను నిలదీస్తున్నారు. అటువంటి వారందరికీ ఓటేసి గెలిపిస్తే మీకే నష్టమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. వారి వాదనలో బలం, వారి అభ్యర్ధనలో నిజాయితీ ఉందని కాంగ్రెస్ పార్టీని అభిమానించే వారందరూ అనుకోవడంలో తప్పులేదు.   కానీ, తెరాస వాదనలో కూడా చాలా బలముంది. తాము పదేళ్ళపాటు ఎండనక, వాననకా రోడ్ల మీద ఉద్యమాలు చేసి ఒత్తిడి తెచ్చినందునే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఇచ్చింది తప్ప లేకుంటే ఎప్పటికయినా తనంతట తానుగా తెలంగాణా ఇచ్చేదా?అని ప్రశ్నిస్తున్నారు. తాము రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే, ఇప్పుడు తెలంగాణా ఇచ్చాము, తెచ్చాము అని చెప్పుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ మంత్రి పదవులు అనుభవిస్తూ ఏసీ గదుల్లో కాలక్షేపం చేసిన మాట యదార్ధం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా కోసం 1100 మంది యువకులు బలిదానాలు చేసినా స్పందించని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణా క్రెడిట్ తమదేనని చెప్పుకొంటోందని ప్రశ్నిస్తున్నారు. ఇదే పని పదేళ్ళ క్రితమే చేసి ఉండి ఉంటే ఇంతమంది అమాయకులు ప్రాణాలు పోయేవా? తాము ఈ ఉద్యమాలు చేసే పని ఉండేదా? అని నిలదీస్తున్నారు.   అప్పుడే ఇచ్చి ఉండి ఉంటే తెరాసను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయలేదని నిలదీయవచ్చు, కానీ పదేళ్ళ కొట్లాడిన తరువాత విధిలేక ఇచ్చినప్పుడు తామెందుకు కాంగ్రెస్ లో కలవాలని తెరాస నేతల ప్రశ్న? తెలంగాణా ప్రజల ఓట్లు, అక్కడ తమ భూములు, కూడబెట్టుకొన్న ఆస్తులను కాపాడుకోవడం మీదున్న శ్రద్ధ, తెలంగాణా ప్రాంతం, ప్రజల మీద లేని ఆంధ్రా పార్టీలకు, తెలంగాణాను అడ్డుకొన్న బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెరాస ప్రశ్న. తెలంగాణావాదులు అందరూ నూటికి నూరు శాతం ఈ వాదనతో అంగీకరిస్తారు.   చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు, తెలంగాణా ఉద్యమాలు పేరు చెప్పి కేసీఆర్ కుటుంబం బలవంతపు వసూళ్లు చేసిన మాట నిజం కాదా? కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకొన్న మాట నిజం కాదా? తెలంగాణా ప్రజలను, వారి భూములను, నీళ్ళని, ఉద్యోగాలని అన్నిటినీ ఆంధ్రావాళ్ళు దోచుకొన్నారని వాదిస్తున్న, మీరు తెలంగాణా ప్రజలను ఎందుకు దోచుకొన్నారు? అసలు ఉద్యమంలో వేడి రగిల్చి నిలుపుకొనేందుకే, ఉడుకు రక్తంగల విద్యార్ధులను రెచ్చగొడుతూ బలిదానాలకు ఉసిగొల్పింది నిజం కాదా? అని ప్రత్యర్ధ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.   తెలంగాణా ఏర్పడితే దానికి కాపలా కుక్కగా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని పదేపదే చెప్పి తీరాచేసి ఇప్పుడు తెలంగాణా ఏర్పడగానే అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తున్న మీరు, ఇంతవరకు చేసిన ఉద్యమాలన్నీ అధికారం చేజ్జిక్కించుకోవడం కోసమేనా? అందుకే ప్రజలమధ్య విద్వేష భావనలు వ్యాపింపజేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారా? యువకుల బలిదానాలు, ప్రజల త్యాగాలు, ఉద్యమాలు చేస్తే దాని ఫలాలు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అనుభవిస్తారా? అని కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు నిలదీస్తున్నాయి. వీరి వాదనలోను బలముందని అర్ధమవుతోంది.   ఈవిధంగా ఈ మూడు బలమయిన వాదనలలో ఎవరు తమ వాదాన్ని అందరి కంటే గట్టిగా వినిపిస్తారో వారే ఈ ఎన్నికలలో విజేతలుగా నిలుస్తారని ఆయా నేతలు భావిస్తున్నారు. కానీ, అంతిమ నిర్ణయం మాత్రం తెలంగాణ ప్రజలదే. వారు ఎవరి వాదనలో నిజాయితీ ఉందని భావిస్తారో వారికే ఓట్లు వేస్తారు తప్ప గొంతు చించుకొని అరుస్తూ, ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించినంత మాత్రాన్నఎవరికీ గుడ్డిగా ఓట్లేయబోరని నిరూపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ లోక్ సత్తాలో చేరి ఉండాల్సిందా?

  పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నందున ముందు ప్రకటించినట్లుగా మల్కాజ్ గిరి నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న లోక్ సత్తా అభ్యర్ధి జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేనని, అయినా ఆయనంటే తనకు చాలా గౌరవమని అన్నారు.   అందుకు జయప్రకాష్ కూడా సానుకూలంగా స్పందిస్తూ “పవన్ కళ్యాణ్ నాకు నా స్వంత తమ్ముడు కంటే ఎక్కువగా సహాయపడ్డారు. నిజానికి తానే మల్కాజ్ గిరి నుండి పోటీ చేయాలని భావించారు. కానీ నేను అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలుసుకొని ఆ ఆలోచన విరమించుకొన్నారు. పవన్ నీతి నిజాయితీ గల యువకుడు. ఏ విషయాన్నయినా నిర్భయంగా చెప్పగల దైర్యం కలవాడు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో, అందుకు ఆయన ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ప్రస్తుతం మల్కాజ్ గిరిలో జరుగుతున్న ఎన్నికలు ధనానికి,ధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం వంటివి. అందులో అంతిమంగా ధర్మమే జయిస్తుందని నాకు నమ్మకం ఉంది,” అని అన్నారు.   జయప్రకాశ్, పవన్ ఇరువురి మధ్య ఇంత చక్కటి అవగాహన, అనుబంధం ఉన్నపుడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించే బదులు, భావ సారూప్యత, ప్రజలలో మంచి పేరున్న లోక్ సత్తాతో కలిసి పనిచేసి ఉండి ఉంటే నేడు ఆయనకు ఇటువంటి గందరగోళ పరిస్థితి ఎదుర్కోవలసిన సమస్య తప్పేది. జయప్రకాశ్ కూడా పవన్ కళ్యాణ్ లాగే మొదటి నుండి తెదేపా, బీజేపీలతో పొత్తులకు సిద్దమని చెపుతూనే ఉన్నారు. అవి కుదరనప్పటికీ నేటికీ ఆయన వాటికి తన మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కనీసం గతానుభవాలను దృష్టిలో ఉంచుకొనయినా, జనసేన ప్రకటించకముందు లోక్ సత్తాతో కలిసి పనిచేసే ఆలోచన చేసి ఉండి ఉంటే బాగుండేదేమో! కానీ, ఆయన తాను చాలా లోతుగా అధ్యయనం, ఆలోచన చేసిన తరువాతనే జనసేన పార్టీని స్థాపిస్తున్నానని చెప్పి, తన రెండవ సభతోనే పార్టీని అటకెక్కించి నవ్వులపాలయ్యారు.   తెదేపా అభ్యర్ధిపై పోటీ చేస్తున్న జయప్రకాశ్ కి మద్దతుగా ప్రచారం చేస్తానని వెనక్కి తగ్గడం, పొట్లూరికి టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం, ఆనక ఆయనకీ మద్దతు ఈయలేనని చెప్పడం, ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతు ఇస్తానని ప్రకటిస్తూనే అందులో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తడానికి మాత్రం ఇంకా సంకోచించడం వంటివన్నీ ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.   అదే ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు, మేధావి, నిజాయితీ పరుడని పేరున్న జయప్రకాశ్ నారాయణ్ తో చేతులు కలిపి, లోక్ సత్తా ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించి ఉండి ఉంటే బహుశః పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎదుర్కొనే ఆగత్యం ఉండేదే కాదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః లోక్ సత్తాలో చేరి వేరొకరి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే బదులు, తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి ఉండవచ్చును. కానీ దానివలన ఆయనకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. పైగా ఆయన అయోమయ స్థితి వలన ప్రజలలో చులకన అవుతున్నారు.   పవన్ కళ్యాణ్ వంటి ఒక నిజాయితీ కల వ్యక్తి నిజాయితీగా చేసిన ప్రయత్నం విఫలం అవడం, ఆయనకి ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఎదురవడం నిజంగా దురదృష్టకరమే. కానీ అందుకు ఆయనే భాద్యులని చెప్పక తప్పదు. ఆవేశానికి, ఆలోచనకి మధ్య పొంతన కుదరనప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి.

తెదేపా-బీజేపీ సభలలో ఎవరి గోల వారిదే

  నిన్న నరేంద్ర మోడీ తెలంగాణాలో నిర్వహించిన నాలుగు సభలలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కనబడుతున్నాయి. ఆయన సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గోవడం ఒక ఆసక్తికర ఆంశమనుకొంటే, అంతకంటే చాలా ఆసక్తికరమయిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి.   తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమికి ప్రధాన శత్రువులు కాంగ్రెస్, తెరాసలు. ఆ రెండు పార్టీలను నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శిస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం కాంగ్రెస్ మీద, అది కూడా సోనియా, రాహుల్ గాంధీలపైనే సాగాయి తప్ప రాష్ట్ర నేతలని, ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్ధులపై పోటీ చేస్తున్న బలమయిన కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రస్తావనే చేయలేదు. కానీ, ఆయన తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ అనే మాట పలకకుండా చాలా సున్నితంగా తెరాసను ఏదో మొక్కుబడిగా తప్పదన్నట్లు విమర్శించారు.   మొన్న రాహుల్ గాంధీ తెరాస అధినేత కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించి, అటువంటివారికి ఓటేయవద్దని ప్రజలను గట్టిగా కోరారు. కానీ నరేంద్ర మోడీ తెదేపా-బీజేపీ కూటమికి పట్టం కట్టమని కోరారే తప్ప, రాహుల్, పవన్, చంద్రబాబు మాదిరిగా తెరాసపై తీవ్ర విమర్శలు చేయకపోవడం చాలా విచిత్రం.   నిన్న జరిగిన రెండు సభలలో కూడా చంద్రబాబు మోడీ భజన చాలా గట్టిగానే చేసారు. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ మెచ్చుకొన్నారు తప్ప, చంద్రబాబు కార్యదక్షత, సమర్ధత గురించి కానీ, తెదేపా గురించి గానీ గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం మరో విశేషం.   ఇక ఒకప్పుడు తెదేపాలో చంద్రబాబుకి ముఖ్య అనుచరుడిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి, పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనను తిట్టడమే వృత్తిగా పెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి పోటీ చేస్తున్న మెహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో చంద్రబాబు పాల్గోవడం, ఆయన పక్కనే కూర్చొని ఏదో మాట్లాడటం చాలా ఆసక్తి కలిగిస్తోంది.   ఇక, మోడీతో కలిసి రెండుసభలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి ఓటేయమని కోరారు తప్ప, తెదేపాకు ఓటేయమని ఎక్కడా కోరలేదు. ఆయన రెండు ప్రసంగాలలో తెదేపా ఊసే లేదసలు. ఆయన కూడా చంద్రబాబులాగే మోడీ భజనలో తరించిపోయారు, కానీ ఎక్కడా తన ప్రసంగంలో చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు.   ఇక తెలంగాణాలో ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెలుగుజాతి ఔనత్యం గురించి, కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని ఏవిధంగా అవమానించింది వివరించి, తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా వేరయినా ఒకే జాతిగా కలిసి ఉండాలని ప్రభోదించడం కూడా కొంచెం ఆశ్చర్యకరమే. సాధారణ సమయాలలో ఇటువంటి ప్రభోదం సహజంగానే అనిపించవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావన కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ చేస్తున్న వేర్పాటువాదం గురించి పవన్ ఆయనకి చెప్పినందునే, మోడీ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ఈవిధంగా వ్యక్తపరిచారని భావించవలసి ఉంటుంది. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ లాగ కేసీఆర్ మరియు ఆయన కుటుంబసభ్యులపై ఎటువంటి విమర్శలు చేయలేదు.   ముగ్గురు ముఖ్యమయిన వ్యక్తులు చేతులు కలిపి ఒకరికొకరు అండగా నిలబడి, తమ రాజకీయ ప్రత్యర్ధులను బలంగా ఎదుర్కొంటారని అందరూ భావించారు. కానీ ముగ్గురూ కూడా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వలన, ఈసభలు వారి మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టుకొనేందుకే ఏర్పాటు చేసుకోన్నట్లుంది తప్ప, తమ ఐక్యతని చాటి చెప్పి, తమ కూటమిని బలపరుచుకొని, ప్రత్యర్ధులను గట్టిగా ఎదుర్కొనేలా మాత్రం లేదనే చెప్పక తప్పదు. (అందుకు గల కారణాలను వేరే శీర్షికలలో ప్రత్యేకంగా విశ్లేషించుకొందాము).

టీ-కాంగ్రెస్ అనైక్యతే తెరాసకు శ్రీరామరక్ష

  ఈరోజు రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ తెలంగాణా ఏర్పాటు కేవలం తన తల్లి సోనియాగాంధీ పట్టుదల, తమ పార్టీ దృడనిశ్చయం వల్లనే సాధ్యమయిందని, అందులో తెరాస, బీజేపీలకు ఎటువంటి పాత్ర, ప్రాధాన్యత లేవని చెపుతూ, తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ తమదేనని గట్టిగా పదేపదే నొక్కిచెప్పారు.   గతేడాది దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు చేప్పట్టిన తరువాత, అంతకాలంగా కేసీఆర్ చేతిలో ఉన్న తెలంగాణా అంశాన్ని, ఆయన ప్రోద్బలంతో టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా హైజాక్ చేసి తమ అధిష్టానం చేతికి అప్పజెప్పారు. నాటి నుండి కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ని పక్కన పెట్టేసి, తెలంగాణా అంశాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని చకచకా పావులు కదుపుతుంటే, అప్పుడు కేసీఆర్ కూడా ఏమిచేయాలో పాలుపోక చాలా కాలంపాటు తన ఫారం హౌసులోకి మాయమయిపోయారు.   ఆ తరువాత కొన్ని నెలలకు కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి చేస్తున్నప్పుడు మాత్రమే, ఆయనకు అందులో వేలెట్టే అవకాశం ఇచ్చింది. కానీ అందుకు ప్రతిగా తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయాలని తీవ్ర ఒత్తిడి కూడా చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కొంచెం పట్టు విడుపులు ప్రదర్శిస్తూ కేసీఆర్ ని లొంగదీయాలని గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆయన కూడా చివరి వరకు కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అనే రీతిలో వ్యవహరిస్తూ, కాంగ్రెస్ అధిష్టానాన్నినమ్మించడానికి ఎంతగా డ్రామా ఆడారంటే, ఆయన తన కుటుంబ సభ్యులందరినీ వెంటేసుకొని సోనియాగాంధీతో గ్రూప్ ఫోటో కూడా దిగారు. కానీ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందగానే, ఆయన వెంటనే హైదరాబాదు బయలుదేరి వచ్చేసారు. ఆ సందర్భంగా ఆయనకు ‘నభూతో న భవిష్యత్’ అన్నట్లుగా తెరాస ఘనంగా స్వాగతం పలికింది. ఆ క్షణం నుండే కేవలం ఆయనే తెలంగాణా రాష్ట్రం సాధించారనే ప్రచారం చాలా ఉదృతంగా సాగింది.   నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు అప్పుడే ఆవిధంగా, అదే స్థాయిలో ఉదృతంగా ప్రచారం చేసుకొనిఉండాల్సింది. కానీ వారందరూ తెరాస శ్రేణులు కేసీఆర్ ని ‘తెలంగాణా పిత’ ఇత్యాది బిరుదులతో కీర్తిస్తూ విస్తృతంగా ప్రచారం చేసుకొంటుంటే, చేతులు ముడుచుకొని కూర్చొన్నారు. అంతేగాక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, ఇతరత్రా పదవుల కోసం వారిలో వారు కుమ్ములాడుకొంటూ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగారు. ఇదే అదునుగా కేసీఆర్ ఆంధ్ర, తెలంగాణా అంటూ అగ్గి రాజేసి, పరిస్థితిని మళ్ళీ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆ తరువాతే ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా హ్యండిస్తున్నట్లు ప్రకటించేశారు.   అయితే అప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు పూర్తిగా మేల్కొనలేదు. ఈలోగా ఎన్నికల గంట కూడా మ్రోగేయడంతో, టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ తమ బంధు మిత్రులందరికీ పార్టీ టికెట్స్ సాధించే పనిలో పడిపోయారు. అయితే కేసీఆర్ కూడా ఆవ్యవహారాలతో, క్షణం తీరిక లేకపోయినప్పటికీ ఆయన వీలుచేసుకొని ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ, తెలంగాణా పునర్నిర్మాణం అంశం తెరపైకి తీసుకువచ్చి, ఆ పని కూడా తెలంగాణా సాధించిన తెరాస వల్లనే సాధ్యమని ప్రజల మనస్సులో నాటుకొనేలా గట్టిగా ప్రచారం చేయగలిగారు.   తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన నాటి నుండి నేటివరకూ కూడా కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక వైఖరి వల్లనే, టీ-కాంగ్రెస్ నేతలకి దక్కవలసిన క్రెడిట్ మొత్తం కేసీఆర్ మరియు ఆయన పార్టీ స్వంతం చేసుకోగలిగాయి. అందువల్లే నేడు రాహుల్ గాంధీ ఆ క్రెడిట్ కోసం ఇంతగా నొక్కి చెప్పుకోవలసి వస్తోంది. అయితే టీ-కాంగ్రెస్ నేతలందరూ నేటికీ ఒక్క త్రాటిపైకి రాలేకపోవడమే కేసీఆర్ మరియు తెరాసకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చును.   టీ-కాంగ్రెస్ లో ఎందరో హేమాహేమీలు ఉండగా ఊహించని విధంగా పొన్నాలకు పీసీసీ అధ్యక్షపదవి కట్టబెట్టినందుకు సీనియర్లు అందరూ ఆయనపై గుర్రుగా ఉన్నందునే ఆయనకు సహకరించడం లేదు. వారు ఆ విధంగా ఉన్నంత కాలమే తెరాస ఆటలు సాగుతాయి. బహుశః వారి మధ్య ఆ అంతరం నిలిపి ఉంచే ప్రయత్నంలోనే తెరాస నేతలందరూ కూడా పొన్నాలనే లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేలుస్తున్నారు. పొన్నాల డబ్బిచ్చి పీసీసీ అధ్యక్షపదవి కొనుకొన్నారని అందుకే కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు.   టీ-కాంగ్రెస్ నేతల అనైక్యతే తెరాసకు శ్రీరామరక్ష వంటిది. ఆ విషయం కేసీఆర్ కి తెలిసినంత బాగా టీ-కాంగ్రెస్ నేతలకి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు రాహుల్ గాంధీయే కాదు, స్వయంగా ఆ దేవుడే దిగివచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.

వేలకోట్లు తృణీకరించతరమా?

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎవరూ ఊహించలేని కొత్త కొత్త ఐడియాలతో తెలంగాణా రాజకీయాలకు అనేక ట్విస్టులు ఇస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ సెట్లర్స్ ఓట్ల కోసమే తెలంగాణా ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపించిన ఆయన, తరువాత ఆంద్ర పార్టీ నేతలు, తెలంగాణాలో ఓట్లు కోనేయడానికి డబ్బు సంచీలతో దిగుతున్నారని ఆరోపించారు. ఆ తరువాత కేవీపీ రామచంద్ర రావు దయతోనే పొన్నాల లక్ష్మయ్యకి తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, కేవీపీయే తెలంగాణా కాంగ్రెస్ నేతలందరినీ వెనుక నుండి నడిపిస్తున్నారని మరో అసంబద్దమయిన ఆరోపణ చేసారు. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా కేవీపీ తనకు కూడా వేల కోట్లు ఆఫర్ చేసారని కానీ తానే ‘చ్చీ’ పొమ్మన్నాని తాజాగా ప్రక్రటించారు.   తెరాసతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఏదోవిధంగా ప్రలోభపెట్టడానికే ప్రయత్నిస్తాయనేది ఎవరూ కాదనలేని చేదు నిజం. ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో వివిధ పార్టీల అభ్యర్ధులు తమ తమ నియోజక వర్గాలలో ఓట్ల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అర్ధం ఉంది. కానీ, సీమాంధ్రలో నేతలు తెలంగాణాలో తమ పార్టీలను, అభ్యర్ధులను గెలిపించుకోవడానికి కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు వస్తున్నారనడం చాలా అసంబద్ధంగా ఉంది. అంతకంటే, తమ రాజకీయ ప్రత్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటే అర్ధం ఉంటుంది. ప్రజలు ఆయన మాటలు నమ్మే అవకాశం ఉంటుంది.   ఇక, ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా పూర్తి స్థాయి ఎన్నికలను ఎదుర్కోవడం తెరాసకు కొత్తేమో కానీ, కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలకు కొత్తేమీ కాదు. తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ ఇటువంటి ఎన్నికలను చాలానే చూసారు. వారు గెలుపోటములు తట్టుకొని నిలబడగల సత్తా గలవారు. వారు ఎన్నికల అధికారులకు సమర్పించిన తమ ఆస్తుల వివరాల ఎఫిడవిట్లను చూసినట్లయితే వారు ఆర్ధికంగా ఎంత బలవంతులో అర్ధమవుతుంది. అటువంటి వారికి ఆంధ్రా నుండి ఎవరో డబ్బు సంచులతో వచ్చి ఆర్ధికంగా మద్దతు ఇస్తున్నారని కేసీఆర్ ఆరోపించడం హాస్యాస్పదం.   ఇక కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఏడాది అంత కష్టపడితే ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు స్వయంగా చెప్పుకొన్నారు. కొన్ని కోట్లు సంపాదించేందుకు ఆయన అంత ప్రయాసపడుతున్నపుడు, ఏమీ చేయకుండా ఉండటానికే కేవీపీ ఆయనకు వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తే దానిని తాను తిరస్కరించానని కేసీఆర్ చెప్పుకోవడం మరో పెద్ద జోక్ అని చెప్పవచ్చును. తెలంగాణా కోసం తెరాస చేసిన ఉద్యమాలను ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల బలవంతపు వసూళ్ళ గురించి బహిరంగ చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపిస్తున్న సందర్బంగా కేసీఆర్ కుమార్తె కవిత నడిపిస్తున్న తెలంగాణా జాగృతి సంస్థకు విదేశాల నుండి వచ్చిన భారీ విరాళాల గురించి ప్రశ్నించడం, మాజీ తెరాస నేత శ్రావణ్ కుమార్ కేసీఆర్ టికెట్స్ అమ్ముకొన్నారని చెపుతున్న మాటలు ఇందుకు చిన్న ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.   కేసీఆర్ పదవీ కాంక్ష వల్లనే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదన్న సంగతీ అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు, అసలు ఏ కష్టమూ లేకుండానే వేలకోట్లు కేసీఆర్ ఒళ్లో అప్పనంగా వచ్చిపడుతుంటే, తెలంగాణా కోసం దానిని తృణప్రాయంగా భావించి ‘చ్చీ కొట్టానని ఆయన చెప్పుకోవడం హాస్యాస్పదం.   ఆయనకి డబ్బు, పదవీ కాంక్ష లేనప్పుడు ముందు చెప్పినట్లుగానే, తెలంగాణా ఏర్పడగానే తెరాసను రద్దు చేసి, తెలంగాణకు కాపాలాగా నిలిచి ఉండి ఉంటే, నేడు ఆయన చెపుతున్న మాటలను ప్రజలు కూడా నమ్మి ఉండేవారేమో. ఇక మున్ముందు ఆయన ఇటువంటి కబుర్లు ఇంకెన్ని చెపుతారో మరి!

మళ్ళీ బ్యాట్ పక్కన పడేసిన సమైక్య చాంపియన్

  కిరణ్ కుమార్ రెడ్డి ఆర్నెల్లు మీన మేషాలు లెక్కించిన తరువాత జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు కానీ ఆ పార్టీ గ్రహస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదని మొదటి రోజు నుండే స్పష్టమవుతూ వచ్చింది. అయినప్పటికీ ఆ ఏకవీరుడు కాళ్ళకి బూట్లు బదులు చెప్పులు తొడుక్కొని, రెండో వైపు బ్యాట్స్ మ్యాన్ ఎవరూ లేకపోయినా ఒంటరిగా బ్యాటు పట్టుకొని సమైక్యాట మొదలుపెట్టారు. కానీ, లాస్ట్ బాల్ ఆడాల్సిన పరిస్థితి వచ్చేసరికి తన బ్యాటుని తమ్ముడు కిషోర్ రెడ్డి చేతికి అందించి ఆయన ఆట నుండి తప్పుకొన్నారు. పోటీచేసి ఓడిపోవడం కంటే, పోటీ చేయకుండా పరువు నిలుపుకోవడమే మేలని ఆయన భావించారేమో. తను అధికారంలో ఉండగా చాలా ముందు చూపుతో తన పీలేరు నియోజక వర్గానికి ఆయన వందల కోట్ల నిధులు విడుదల చేసుకొన్నపటికీ, అక్కడి నుండి పోటీ చేస్తే గెలవలేననే దృడనమ్మకం చేతనే ఆయన పోటీ చేయడం లేదు. అటువంటప్పుడు ఆయన పార్టీలో మిగిలిన అభ్యర్ధులు మాత్రం గెలుస్తారని ఎవరు మాత్రం భావించగలరు?   ఏమయినప్పటికీ తెదేపా-వైకాపాల మధ్య విజయమో వీర స్వర్గమో అన్నట్లు జరగబోతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆయన చెప్పులు అరిగేలా ఎంత ప్రచారం చేసినా గెలవడం అసంభవమని సామాన్య ప్రజలు కూడా చెప్పగలరు. మరి మూడేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ సంగతి తెలియదని ఎవరూ భావించలేరు. అందుకే ఆయన సగౌరవంగా పోటీ నుండి తప్పుకొన్నారని భావించవలసి ఉంటుంది..   ఇక ఈ ఎన్నికలలో గెలవలేనప్పుడు, మళ్ళీ ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తూ పార్టీని నడపడటం చాల కష్టం కనుక ఆయన కూడా చిరంజీవిలాగే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం తధ్యం. అయితే ఆ నాటి పరిస్థితుల్లో చిరంజీవి ఎంతో కొంత ప్రయోజనం పొందగలిగారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.   కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో కానీ, కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఒకవేళ తెలంగాణాలో అధికారంలోకి వచ్చినా, అది వేరే రాష్ట్రమయిపోతుంది గనుక ఏకవీరుడు-కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎటువంటి ప్రయోజనమూ పొందలేరు. అయితే ఒంటరిగా గోళ్ళు గిల్లుకొంటూ కాలక్షేపం చేయడం కంటే కాంగ్రెస్ లో చేరిపోవడమే మేలు. లేదా ఇదివరకు ఆయనే స్వయంగా ప్రకటించినట్లుగా రాజకీయ సన్యాసం తీసుకోవడం ఆయన ముందున్న మరో ఆప్షన్. అయితే ఆయనది రాజకీయ సన్యాసం తీసుకొనే వయసు కాదు గనుక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చును. అది చూసి ప్రజలు జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలినట్లుంది’ అని ఎకసెక్కెం చేసినా భరించక తప్పదు. పరిస్థితులు ఆలాంటివి మరి.

ఇంకా వేర్పాటువాదం అవసరమా?

  తెరాస నేతలు తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటున్నప్పటికీ, అధికారమే లక్ష్యంగా సాగే ఇతర రాజకీయ పార్టీల వలే అది కూడా ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంది. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలో, అభివృద్ధి నినాదమో మరొకటో అందిపుచ్చుకొని ఎన్నికలను ఎదుర్కొంటుంటే, తెరాస మాత్రం ప్రధానంగా తెలంగాణా సెంటిమెంటుని, దానితో ముడిపడున్న ప్రజల భావోద్వేగాలపైనే ఆధారపడి నెట్టుకొస్తోంది. అందుకు ప్రధాన కారణం గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం జరుగకపోవడమే. తెరాస తరపున పనిచేసేందుకు గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు, నాయకులతో కూడిన సరయిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వలన, ప్రజలని తనవైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వారిని తెలంగాణా పేరుతో రెచ్చగొడుతుంటారు.   ప్రతీసారిలాగే ఈసారి కూడా మాటల మాంత్రికుడు కేసీఆర్ తన మాటకారితనమంతా తెలంగాణా ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్, తెదేపా-బీజేపీలను అసలు నమ్మరాదని ప్రజలకు నూరిపోస్తున్నారు. ఇతర పార్టీలు వేటికీ కూడా తెలంగాణాతో ఎటువంటి అనుబందమూ లేదని, కేవలం తెరాస మాత్రమే తెలంగాణా ప్రజల పార్టీ అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆంధ్రా బూచోళ్ళు’ మిమ్మల్ని దోచుకోనేందుకు వస్తున్నారని ప్రజలను భయపెడుతూ వారిలో అభద్రతాభావం రేకెతిస్తూ, అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో మొత్తం యంపీ, యం.యల్యే. సీట్లన్నీతెరాసకే ఇస్తే తప్ప ప్రజలను ఆ దేవుడు కూడా ఈ ‘బూచాళ్ళ’ నుండి కాపడలేడన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. తమ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి మరీ నీళ్ళు, నిధులు తీసుకువచ్చి బంగారి తెలంగాణా నిర్మిస్తుందని కేసీఆర్ నమ్మబలుకుతున్నారు.   ప్రజలను భయపెడుతూ, రెచ్చగొడుతూ, ఊరిస్తూ కేసీఆర్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇది కూడా ఎన్నికలలో గెలిచేందుకు ఒక రకమయిన వ్యూహమేనని అర్ధమవుతోంది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని కోరిక ఉండటం తప్పు కాదు. కానీ అందుకోసం తెలంగాణా ప్రజల మనసులను ఇంకా ఈవిధంగా కలుషితం చేయడం, వారిలో విద్వేషభావాలు రెచ్చగొట్టడం చాలా హేయమయిన ఆలోచన.   నేటికీ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మరియు పార్టీ యం.యల్యేలు చాలామంది తమ తమ పదవులలోనే కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఇంతవరకు తెలంగాణా కోసం ఉద్యమాలు చేయడం, ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప తెలంగాణా ప్రజల సమస్యలను తీర్చడానికి చేసిందేమీ లేదు. ఆ సంగతి ఇతరుల కంటే తెలంగాణా ప్రజలకే బాగా తెలుసు. అయినప్పటికీ తెరాస నేతలు తాము అధికారంలోకి వస్తే ఏవో అద్భుతాలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.   ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు, పార్టీలకు కొత్తేమి కాదు గనుక, కేసీఆర్ ఆయన పార్టీ నేతలు కూడా తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రజలలో ఇంకా విద్వేష భావాలు రెచ్చగొట్టే బదులు, మిగిలిన పార్టీలు, నేతలు లాగే ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించుకొంటే కనీసం ఎవరికీ నష్టం ఉండదు.

పురందేశ్వరికి చంద్ర గ్రహణం వీడేనా

  కాంగ్రెస్ పార్టీతో చిరకాలం కొనసాగిన మాజీ కేంద్రమంత్రి డీ.పురందేశ్వరి, సీమాంద్రాలో ఆ పార్టీకి ఉన్న తీవ్ర వ్యతిరేఖతను, దేశంలో మోడీకి, బీజేపీకి అనుకూలంగా మారిన పరిస్థితులను గమనించి, దైర్యంచేసి బీజేపీలోకి మారారు. కానీ దానివలన ఆమెకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వైజాగ్ సిట్టింగ్ యంపీ అయిన ఆమె, మళ్ళీ అక్కడి నుండే పోటీ చేస్తానని చెపుతూ వచ్చారు. బీజేపీలో చేరిన తరువాత ఆమెకు ఆ సీటు తనకే ఖాయమవుతుందని భావించారు. కానీ, ఆమెతో వైరం ఉన్న చంద్రబాబు చక్రం తిప్పడంతో, ఆమె బీజేపీకి ఏమాత్రం బలంలేని కడప జిల్లా రాజంపేట లోక్ సభ సీటుకి మారవలసివచ్చింది. కానీ అక్కడా ఆమె పోటీ చేయడానికి చంద్రబాబు అభ్యంతరం చెపుతున్నారు. ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ ఆమెకు చంద్రగ్రహణం తప్పించుకోలేకపోవడం నిజంగా విచిత్రమే.   బీజేపీకి కేటాయించిన స్థానాలలో ఆ పార్టీ బలహీనమయిన అభ్యర్ధులను నిలబెట్టిందని అభ్యంతరం చెపుతున్న చంద్రబాబు, పురందేశ్వరి వంటి బలమయిన అభ్యర్ధిని ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారంటే వారి మధ్య ఉన్నవిభేదాలే కారణమని చెప్పక తప్పదు. బీజేపీ నిర్ణయం వలన రెండు పార్టీల ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదిస్తున్న చంద్రబాబు, మరి తమ వ్యక్తిగత విభేదాల కారణంగా ఖచ్చితంగా గెలవగల పురందేశ్వరిని ఈవిధంగా అడ్డుకోవడం వల్ల నష్టం కలగదా? అని ఆలోచించుకోవలసి ఉంది.   అదీగాక బీజేపీతో పొత్తులు పెట్టుకొనే ముందే సీట్ల సర్దుబాట్లపై సుదీర్గమయిన చర్చలు జరిపిన తరువాతనే, బీజేపీకి కేటాయించిన స్థానాల నుండే ఆమె పోటీకి దిగుతున్నారు తప్ప తెదేపా స్థానం నుండీ కాదు, తెదేపా టికెట్ పైనా కాదు. అటువంటప్పుడు వేరే పార్టీకి చెందిన పురందేశ్వరిని చంద్రబాబు అడ్డుకోవడం ఏవిధంగా సబబో ఆయనే చెప్పాలి. తమ ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి ప్రతీ యంపీ సీటు చాలా కీలకమని వాదిస్తున్న చంద్రబాబు, పంతాలకు పట్టింపులకీ పోయి పురందేశ్వరిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో దానివలన ఆయనకు, ఆయన ఎన్డీయే కూటమికి ఒరిగేదేమిటో ఆయనే చెప్పాలి.   ఒకవేళ బీజేపీతో పొత్తులు రద్దయితే, అప్పుడు బీజేపీ ఆమె కోరుకొన్నవిధంగానే ఆమెను  వైజాగ్ లేదా విజయవాడ నుండి పోటీకి దింపినట్లయితే, అప్పుడు చంద్రబాబే నవ్వులపాలు అవుతారు. హరికృష్ణకి టికెట్ ఈయకుండా, జూ.యన్టీఆర్ ని పార్టీకి, ప్రచారానికి దూరంగా ఉంచుతూ ఆయన ఇప్పటికే కొంత అపఖ్యాతి మూటగట్టుకొన్నారు. ఇప్పుడు నందమూరి కుటుంబానికే చెందిన పురందేశ్వరి, వేరే పార్టీలో ఉన్నపటికీ అడ్డుపడినట్లయితే, దాని వలన ఆయనకు మరింత చెడ్డపేరు రావడం ఖాయం. అది ప్రత్యర్ధులకు ఆయుధంగా మారుతుంది కూడా. అందువల్ల చంద్రబాబు అటువంటి పరిస్థితి చేజేతులా కల్పించుకొకపోతేనే మేలు.