తెదేపా-బీజేపీ పొత్తులు పెటాకులు కానున్నాయా?

  తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులయితే పెట్టుకొన్నాయి గానీ, అవి బలవంతపు కాపురం చేస్తున్నాయి. నేటికీ వాటి నేతల మధ్య అవసరమయిన సఖ్యత ఏర్పడలేదు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు బీజేపీ పంతం పట్టి అనేక కీలకమయిన సీట్లు దక్కించుకొంది, కానీ చాలా చోట్ల పార్టీ తరపున పోటీలో నిలబెట్టేందుకు దానికి బలమయిన, ప్రజలకు సుపరిచితులయిన అభ్యర్ధులు కూడా లేరు. అదే సమయంలో తెదేపాలో టికెట్స్ కోసం సీమాంధ్రలో నేటికీ పెద్ద యుద్దమే జరుగుతోంది.   ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొన్న తమను కాదని బీజేపీకి, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నేతలకీ టికెట్స్ కేటాయించడంపై తెలుగు తమ్ముళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో గెలుపు గుర్రాలను పక్కనబెట్టి బీజేపీకి సీట్లు కేటాయిస్తే అది అనామకులయిన అభ్యర్దులను పోటీలో దింపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము గెలవగలమనుకొంటున్న సీట్లను త్యాగం చేసి బీజేపీకి ఇస్తే అది వృధా అవుతోందని తెలుగు తమ్ముళ్ళ ఆక్రోశిస్తున్నారు. అందువల్ల బీజేపీతో పొత్తుల విషయం పునరాలోచించుకొని, మళ్ళీ తమకే ఆస్థానాలలో టికెట్స్ కేటాయించాలని వారు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించకకపోతే, స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేయడానికి కూడా వెనుకాడబోమని చెపుతున్నారు.   బీజేపీ నిలబెడుతున్న బలహీనమయిన అభ్యర్ధుల వలన బీజేపీకే కాక తేదేపాకు తీవ్ర నష్టం కలగవచ్చునని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అయితే ఇటువంటి కీలక సమయంలో బీజేపీతో పొత్తులు తెగతెంపులు చేసుకొంటే అది పార్టీపై తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన వెనుకంజ వేస్తున్నారు. కానీ ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.   ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోదని, తెదేపా, బీజేపీలకు మద్దతు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు విజయవాడతో సహా మరో ఆరు స్థానాలలో తమ పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెట్టేందుకు, కీలకమయిన మల్కాజ్ గిరి స్థానం నుండి తెదేపా అభ్యర్ధి మల్లారెడ్డితో పోటీ చేస్తున్నలోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. అందువల్ల చంద్రబాబు కూడా తన ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.   అందువలన చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తులపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తన పార్టీ ముఖ్య నేతలందరితో మాట్లాడిన తరువాత ఈవిషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ వారందరూ కూడా ఒంటరిపోరుకే మొగ్గు చూపినట్లయితే, ఈరోజు రాత్రిలోగా సీమాంధ్రలో బీజేపీకి కేటాయించిన అన్ని స్థానాలలో తమ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.   అదే జరిగితే, మొదటి నుండి తెదేపాతో పొత్తులు వ్యతిరేఖిస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు కూడా వెంటనే తెదేపాతో పొత్తులు తెంచుకోమని తమ అధిష్టానంపై ఒత్తిడి తేవడం తధ్యం. కానీ అక్కడ నామినేషన్లు దాఖలు చేయడానికి ఇప్పటికే గడువు ముగిసినందున, బీజేపీ తన అభ్యర్ధులను నిలబెట్టలేదు. కనుక అందుకు అంగీకరించక పోవచ్చును. అయితే సీమాంధ్రలో మాత్రం నామినేషన్లు వేయడానికి ఇంకా రేపు మధ్యాహ్నం వరకు గడువు మిగిలి ఉన్నందున, ఒకవేళ తెదేపా తమతో పొత్తులకు రామ్ రామ్ చెప్పేసినట్లయితే, బీజేపీ కూడా మిగిలిన స్థానాలలో తన అభ్యర్ధులను పోటీలో దింపినా ఆశ్చర్యం లేదు.   అయితే ఇరుపార్టీల అధిష్టానాలు పరిస్థితిని ఇంతవరకు రానిస్తారా లేక షరా మామూలుగానే ఇదంతా మీడియా ఊహాగానమేనని కొట్టి పారేస్తారా? అనే సంగతి ఈరోజు రాత్రిలోగానే ఖచ్చితంగా తేలిపోతుంది. ఎందుకంటే నామినేషన్లు వేయడానికి రేపే ఆఖరి రోజు గనుక. ఏమయినప్పటికీ తెదేపా-బీజేపీల పొత్తులు పెటాకులయితే మళ్ళీ రెండు ప్రాంతాలలో అన్ని పార్టీల బలబలాలు కూడా మారవచ్చును.

ఇవేమీ పొత్తులు?

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తుల వలన రెండు ప్రాంతాలలో ఆ పార్టీలు ఒకదానివలన మరొకటి చాలా లాభపడతాయని భావించాయి. తాజాగా వెలువడిన సర్వే నివేదిక సైతం అదే దృవీకరిస్తోంది. కానీ ఈ పొత్తుల కారణంగానే రెండు పార్టీలలో టికెట్స్ దొరకని నేతలు తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీలో నిలబడుతూ వాటి విజయావకాశాలను గండి కొట్టేందుకు సిద్దపడుతున్నారు. ఇక సీమాంద్రాలో బీజేపీ చాల బలహీనంగా ఉన్నపటికీ, దురాశకు పోయి కీలకమయిన కొన్ని సీట్లను దక్కించుకొంది. కానీ అక్కడ నుండి పోటీ చేస్తున్న బలమయిన ప్రత్యర్ధులను డ్డీకొని గెలిచే సత్తాగల అభ్యర్ధులు పార్టీలో లేకపోవడంతో, తన ఓటమికి తానే బాటలు పరుచుకొన్నట్లయింది.   ఇక చంద్రబాబు కూడా వ్యక్తిగత, కుటుంబ విభేదాల కారణంగా, వైజాగ్ లోక్ సభ సీటు సిట్టింగ్ యంపీ పురందేశ్వరికి దక్కకుండా చక్రం తిప్పడం వలన ఆ ప్రభావం ఆ ఒక్క లోక్ సభ సీటు మీదే కాకుండా, ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఉన్న ఏడు శాసనసభ నియోజక వర్గాల అభ్యర్దులపైనా తప్పక పడుతుంది.   వైజాగ్ సిటింగ్ యంపీ పురందేశ్వరికి తన లోక్ సభ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే అన్ని శాసనసభ స్థానాలపైనా మంచి పట్టు ఉంది. కానీ ఆమెను కాదని ఆ సీటుని బీజేపీ సీమాంధ్ర విభాగం అధ్యక్షుడు హరిబాబుకి ఇవ్వడంతో, అది వైకాపాకి సానుకూలాంశంగా మారింది. వైజాగ్ నుండి వైకాపా అభ్యర్ధిగా పోటీకి దిగుతున్న విజయమ్మను ఓడించడం అంత తేలిక కాదు. పైగా ఆమె, ఆమె పార్టీ ప్రభావం వైజాగ్ లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల మీద చాల ఉంటుంది. గనుక, అక్కడ కూడా తెదేపాకు ఎదురీత తప్పకపోవచ్చును. సులువుగా గెలుచుకోగల కొన్ని స్థానాలలో కూడా గెలుపు కోసం ఎదురీదవలసి రావడం స్వయంకృతాపరాధమే గనుక అందుకు ఎవరినీ నిందించవలసిన పనిలేదు. ఇదే పరిస్థితి 13 జిల్లాలలో మరికొన్ని నియోజక వర్గాలలో కూడా ఉంది.   ఇక రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నపటికీ, తెలంగాణాలో తెదేపా, బీజేపీ నేతలు కలిసికట్టుగా ప్రచారం చేయడానికి అయిష్టత చూపుతున్నారు. ఇంతవరకు తెలంగాణాలో చంద్రబాబు నిర్వహించిన ఏ సభలోనూ బీజేపీ నేతలు పాల్గొనలేదు. అదేవిధంగా త్వరలో నరేంద్ర మోడీ కరీంనగర్ మరియునిజామాబాద్ నగరాల్లో నిర్వహించబోయే బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గోనబోవడం లేదు. హైదరాబాదులో నిర్వహించబోయే సభలో మాత్రమే చంద్రబాబు కూడా మిగిలిన ఎన్డీయే భాగస్వాములందరితో బాటు నరేంద్ర మోడీతో వేదిక పంచుకొంటారు.   ఇంత అయిష్టంగా కలిసి పనిచేయడం వలన ఆ రెండు పార్టీలు ఆశిస్తున్న ప్రయోజనం దక్కుతుందా? లేక వారే ఆ ప్రయోజనాన్ని తమ ప్రత్యర్ధులకు బంగారు పళ్ళెంలో పెట్టి అందజేయబోతున్నారా? కాలమే చెపుతుంది.

అందరివాడు ఆ మన్మోహనుడు

  రోజుకో సర్వే చొప్పున వెలువడుతున్న నివేదికలన్నీ కూడా కాస్త అటూ ఇటుగా ‘కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు తధ్యం’ అని ఘోషిస్తుంటే కాంగ్రెస్ అధిష్టాన దేవతల సున్నితమయిన మనసులు ఎంతగా నొచ్చుకొంటాయో ఎవరికీ పట్టదు. వాటినయితే బోగస్ నివేదికలని ఎలాగో కొట్టిపారేయోచ్చును, కానీ కాంగ్రెస్ ఉప్పు తిని బ్రతికిన సంజయ్ బారు లాంటి వాళ్ళు కూడా “మా మన్మోహన్ ఒట్టి డమ్మీ క్యాండిడేట్..అంతా అమ్మగారి పెత్తనమే” అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని సమయం కాని ఇటువంటి సమయంలో బహిరంగంగా ప్రకటిస్తే అధిష్టాన దేవతలు ఇంకెవరికి మోర పెట్టుకోవాలి?   పోనీ సంజయ్ బారు ఏదో పొరపాటున నోరుజారాడని సర్ది చెప్పుకొన్నా, ఆ వెనకనే కాంగ్రెస్ మీద పగబట్టినట్లు మాజీ బొగ్గుల శాఖ కార్యదర్శి పీసీ ఫారెక్, రిటైర్ అయ్యాక మరేమీ ఊసుపోక మసిపట్టిన బొగ్గు ఫైల్స్ అన్నీ దులిపి అందులో దాగి ఉన్నకుంభకోణాల కధలన్నిటినీ ముచ్చటగా ఒక పుస్తకం రూపంలో అచ్చేసి, దానికి ‘కృసేడర్ ఆర్ కాన్స్పిరిటర్’ అనే ఆసక్తికరమయిన పేరు కూడా తగిలించేసి, సరిగ్గా ఎన్నికల సమయంలో బజారులోకి వదిలేరు.   కాంగ్రెస్ తో తిరిగితే మసిపూసుకొన్నా నాలుగు రాళ్లో, బొగ్గులో ఎలా వెనకేసుకోవాలో తెలుసుకోవాలి. అంతే కానీ ఇలా “అసలు ప్రధానికి వెన్నెముక లేదు, నోట్లో నాలుక లేదు, చేతిలో బలం లేదు” అంటూ ఏవేవో అవాకులు చవాకులు పుస్తకం నిండా వ్రాసి పడేయడం బ్రతక నేర్చినవాడి లక్షణం కాదని ప్రజలే అనేస్తున్నారు. అంతకంటే ఆయన సీమంద్రాలో కాంగ్రెస్ టికెట్ ఇమ్మని అడిగినా బాగుండేది లేకుంటే తనకీ ఓ రెండు బొగ్గు గనులు వ్రాసిమ్మని అడిగినా బాగుండేది,” అని ఉచిత అభిప్రాయాలు వ్యక్తం చేసారు.   కానీ, ఫారెక్ సాబ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా “అసలు ఆయన (మన్మోహనుల వారు) చెప్పిన మాటని కాంగ్రెస్ పార్టీలో కానీ, ఆయన మంత్రి వర్గంలో మంత్రులు గానీ, అధికారులు గానీ విననే వినరు. అంతా యంపీలది, దాసరి నారాయణ రావు వంటి బొగ్గు మంత్రులదే బొగ్గు పెత్తనమంతా...అటువంటి వారందరూ కలిసి నాబోటి నిజాయితీ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నా ఆ మన్మోహనుడు మాత్రం మా మొర వినిపించుకోకపోగా “వాసుదేవుడంతటి వాడిని నాకే తప్పలేదు ఇక మీరేపాటి?” అని నిట్టూర్పులు విడిచేవారు.   ఇక చేసేదేమీ లేక మేమూ చేతులు కట్టుకొని తరలిపోతున్న బొగ్గు లారీలను, వేగన్లను లెక్కపెట్టుకొంటూ కాలక్షేపం చేస్తూ రిటైర్ అయిపోయాము,” అని మీడియా ముందుకు వచ్చి లబలబలాడుతుంటే, ఆయననే ఓదార్చాలో, లేక కాంగ్రెస్ పార్టీనే ఓదార్చాలో లేకపోతే ఈ హాలహలం అంతా మింగి కూడా ఇంకా చిర్నవ్వులు చిందిస్తున్న ఆ మన్మోహనులవారినే ఓదార్చాలో ప్రజలు కూడా తెలియడం లేదు. మోడీ మాత్రం ‘మీరు నాకే ఓటేసి గెలిపిస్తే ఈ కాంగ్రెస్ జనాలందరినీ ఓదార్చే భాద్యత నాదే’నని హామీ ఇస్తున్నారు. ఇక ప్రజలే దేనికోడానికి డిసైడ్ అయిపోవాలి మరి.

కొత్త రాగాలు ఆలపిస్తున్న కేసీఆర్

  రాజకీయాలలో అపర చాణక్యుడని పేరుగాంచిన తెరాస అధ్యక్షుడు ఎప్పటికప్పుడు వేసే కొత్త ఎత్తులు, పన్నే సరికొత్త వ్యూహాలను పసికట్టడం ప్రత్యర్ధ పార్టీలకు కూడా సాధ్యం కాదు. ఆయన ఏ రోజు ఏమీ మాట్లాడి ఎవరి మీద ఎటువంటి బాంబులు పేలుస్తారో, ఎప్పుడు ఏ ఎత్తుగడతో ఏ దిశలో ముందుకు సాగుతారో ఎవరికీ అంతుపట్టదు. నిన్న కరీంనగర్ లో తెరాస నిర్వహించిన బహిరంగ సభలో ఎవరూ ఊహించని విధంగా ఆయన మరో సరికొత్త పల్లవి అందుకొన్నారు.   “తెరాస నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో చేతులు కలపబోమని, అదేవిధంగా బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమిలో కానీ, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిలో గానీ చేరబోమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పార్టీ థర్డ్ ఫ్రంట్ లో చేరుతుందని, ఫ్రంట్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. బీజేపీ చెప్పుకొంటున్నట్లుగా ఆ పార్టీకి కనీసం 200 సీట్లు కూడా రావని, అందువల్ల ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అసంభవమని తేల్చి చెప్పేశారు. అందుకు మంచి బలమయిన కారణం కూడా ఆయనే చెప్పారు. ఈసారి ఎన్నికలలో దేశమంతటా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని, అందువల్ల వారందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్నా థర్డ్ ఫ్రంట్ కూటమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమని” ఆయన జోస్యం చెప్పారు.   అయితే కొద్ది రోజుల క్రితమే, ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ, ఎన్నికల తరువాత ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ, ఆ తరువాత బీజేపీతో పొత్తులకు కూడా  కేసీఆర్ ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి మద్దతు ఈయబోమని చెపుతున్నారు. ఇంతవరకు తమది ఉద్యమపార్టీ అని చెప్పుకొంటున్నఆయన అకస్మాత్తుగా తమ పార్టీకి సెక్యులర్ రంగు వేసుకోవడం, బీజేపీకున్న మతతత్వ ముద్ర గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.   అయితే దేశమంతా మోడీ హవా నడుస్తున్నసంగతి కేసీఆర్ కి తెలియదని భావించలేము. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో కంటే బీజేపీతోనే ఎన్నికల పొత్తులకి ఆసక్తి చూపారు. కానీ బీజేపీ తమను కాదని తెదేపాతో పొత్తులు పెట్టుకోవడంతో సహజంగానే బీజేపీ శత్రువుగా మారింది. అందువల్లనే ఆయనకు ఇప్పుడు బీజేపీలో మతత్వం మరింత స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఇప్పుడు తెరాస ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతోంది గనుకనే ఆ రెండు పార్టీలకు మద్దతు ఈయమబోమని చెపుతూ, ప్రజలను నమ్మించేందుకు ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ గురించి చెపుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్, తెదేపా-బీజేపీ కూటమి చాలా బలంగా ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఆయన కూడా వాటిని అంతే గట్టిగా విమర్శిస్తూ ఎదిరిస్తూ మాట్లడినప్పుడే ప్రజలు తెరాసను విశ్వసించే అవకాశం ఉంది.   అయితే, ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీజేపీలలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే మడికట్టుకొని కూర్చొంటారని అనుకోనవసరం లేదు. ఇంతవరకు ఆయన అనేక చేసిన హామీలను ఏవిధంగా పక్కనబెట్టి ముందుకు సాగుతున్నారో అప్పుడు కూడా అదేవిధంగా ఏదో ఒక కుంటిసాకు చెప్పి కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానికే మద్దతు ఇవ్వడం ఖాయం.

వద్దనుకొన్నవారికే ఓటేయాల్సివస్తే...

  ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో అభ్యర్దులను బట్టి కాక పార్టీలు వాటి అధినేతలను చూసే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది. కొందరు బలమయిన అభ్యర్ధులకు ఈ విషయంలో మినహాయింపు ఉన్నపటికీ, అధిక శాతం ఓట్లు ఆయా పార్టీల పరంగానే పడే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్ధుల గుణగణాలు తదితర అంశాలు మరుగునపడి, పార్టీ పరంగా మాత్రమే చూడబడవచ్చును. ఈ కారణంగా అన్ని పార్టీలలోకి అవినీతిపరులు, అవకాశవాదులు, కేవలం ధనార్జన కోసమే రాజకీయాలలోకి వచ్చే వ్యాపారులు చొరబడే అవకాశం ఏర్పడుతుంది. అస్తవ్యస్తమయి అదుపు తప్పుతున్న రాష్ట్ర పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న ప్రజలు, కనీసం ఈసారయినా ఒక సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందించగల పార్టీకే పట్టం కట్టడం మేలని భావిస్తున్న కారణంగానే ఇటువంటి ఆవాంచనీయమయిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అలా కాదని ప్రజలు అభ్యర్ధులను చూసి ఓట్లు వేసినట్లయితే, ఏ పార్టీకి మెజార్టీ రాక రాష్ట్రంలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి రాజకీయాలు మరింత భ్రష్టు పట్టే అవకాశం ఉంది.   అయితే పార్టీలను, అధినేతలను చూసి ఓటేయాలని ప్రజలు గనుక భావిస్తే, అందరి కంటే ఎక్కువగా లాభపడేది వేర్వేరు పార్టీలలో చేరిపోయి మారు వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ఎవరికయితే గట్టిగా గుణపాటం చెప్పాలనుకొన్నారో వారికే ఓట్లు వేయవలసి రావడం నిజంగా దురదృష్టకరమే. అయితే ఇది అనివార్యమని ఇప్పటికే స్పష్టమయింది. వారిలో కొంతమంది తెదేపాలో, మరికొంతమంది వైకాపాలో ఇంకొంతమంది తెరాస పంచన చేరిపోవడంతో, ఆయా పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకొనే ప్రజలు, అయిష్టంగానయినా ఆ పార్టీలలో చేరిన కాంగ్రెస్ నేతలకే ఓట్లు వేయవలసి వస్తుంది.   కానీ వారందరూ ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకోదలిస్తే సదరు పార్టీల అధినేతలు వారిని ఆపగలరా? ఆపలేన్నపుడు అటువంటి వారిని తెచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దడం ఎందుకు? అనే ప్రశ్నకు జవాబు ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు గనుక, ప్రస్తుతం అటువంటి ప్రమాదం ఉండదని ఆశించవచ్చును.   రెండు మూడు నెలల క్రితం కాంగ్రెస్ నుండి బహిష్కరింపబడిన రాజంపేట యంపీ సాయి ప్రతాప్, వేరే పార్టీ ద్వారా తన నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ దొరకకపోవడంతో, దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయగానే మళ్ళీ పరుగున కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతే గాక కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వెనక్కి వచ్చేయమని కోరారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ నేతలు చేరిన పార్టీ ఎన్నికలలో ఓడిపోయి రాష్ట్రంలో అధికారం చెప్పట్టలేక చతికిలబడినట్లయితే, అదే సమయంలో కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే, సదరు నేతలుందరూ ఒకరొకరుగా (అధికారాన్ని వెతుకొంటూ) మళ్ళీ కాంగ్రెస్ గూటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు వారికి ఓటేసిన ప్రజలు ఎలాగు పశ్చాత్తాప పడకతప్పదు. అదేవిధంగా పార్టీ జెండాలు మోసిన స్వంత పార్టీ వారిని కాదని అటువంటి అవకాశవాదులకు టికెట్స్ ఇచ్చి మోసపోయినందుకు ఆయా పార్టీల అధినేతలు కూడా అక్రోశించకమానరు.   ఈ దుస్థితిని నివారించాలంటే అన్ని రాజకీయ పార్టీలు తమ స్వంత పార్టీ నేతలకే టికెట్స్ కేటాయించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు గనుక, చివరికి ఈ దుస్థితి కూడా అనివార్యం కావచ్చును.

కాంగ్రెస్ పార్టీని ముంచుతున్న ఆ ఇద్దరూ

  మహాభారతంలో శకుని, శల్యుడు అనే రెండు గొప్ప పాత్రలున్నాయి. వారిరువురూ కూడా కౌరవ పక్షం వహించినప్పటికీ చివరికి వారినే నాశనం చేసారు. ఇంతకీ ఇప్పుడు ఈ పురాణాలు ఎందుకు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా అటువంటి పెద్దమనుషులు ఇద్దరు కనబడుతున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ లో రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేసి, ఆ రాష్ట్రంలో అధికారాన్ని బీజేపీకి అప్పగించేసిన పెద్దమనిషి ఒకరయితే, మరోకాయన తెలంగాణాలో కూడా పార్టీని తుడిచిపెట్టేయడానికి కంకణం కట్టుకొన్నారు. వారే దిగ్విజయ్ సింగ్ మరియు జైరామ్ రమేష్ అనే ఇద్దరు పెద్ద మనుషులు.   గులాం నబీ ఆజాద్ అనే మరో పెద్దమనిషి రాష్ట్ర విభజన చేయడానికి ఏళ్ల తరబడి మీనమేషాలు లెక్కిస్తుంటే, కాలుపెట్టిన చోటల్లా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేయగల సమర్ధుడు, కాంగ్రెస్ పక్షపాతి అయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రాన్ని ‘హ్యండోవర్’ చేసుకొన్న రెండు మూడు వారాల్లోనే ఆ పని మొదలుపెట్టేసి, ఊహించినట్లుగానే సీమాంధ్రలో కూడా తమ కాంగ్రెస్ పార్టీని సమూలంగా తుడిచి పెట్టేసారు. ఇక ఎన్నికలలో రాష్ట్రాన్ని వేరే ఏదో పార్టీకి అప్పగించేయడమే మిగిలి ఉంది. ఆయన తను వచ్చిన పని పూర్తి చేయగానే మళ్ళీ బాధ్యతలను జైరామ్ రమేష్ అనే మరో మేధావికి అప్పగించి చేతులు దులుపుకొన్నారు.   ఈ జైరామ్ రమేష్ ఆయన కంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు. పైగా అనర్గళంగా ఇంగ్లీషులో ఉపన్యాసాలు దంచగలడు. ఇతను ‘శల్య సారధ్యం’ చేయడంలో మంచి దిట్ట. తెలంగాణాలో ఉన్నప్పుడు ఆంధ్రా వాళ్ళని, ఆంధ్రాలో ఉన్నపుడు తెలంగాణా వాళ్ళని తిడుతూ స్థానిక ప్రజలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తూ, కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేస్తూ దాని పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మార్చేందుకు గట్టిగా కృషి చేస్తుంటారు.   రాష్ట్ర విభజనకు పూనుకొన్న మూలపురుషులలో ఈయనదే ప్రధానపాత్ర. ఆ భుజకీర్తులు తగిలించుకొన్న కారణంగా కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఈయన కూడా తెలంగాణాలో వాలిపోయారు. ఒక్క కాంగ్రెస్ తప్ప మరే ఇతర పార్టీలు తెలంగాణా పునర్నిర్మాణం చేయలేవని, అందువలన తమ పార్టీకే ఓటేయమని చెపుతున్నారు.   ఆయన చెపుతున్న ప్రకారం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణా పునర్నిర్మాణం చేయగలదనుకొన్నా, మరి గత 5౦ ఏళ్లగా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాను ఎందుకు అభివృద్ధి చేయలేదు? చేసి ఉంటే రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు ఎందుకు జరిగాయి? ఇప్పుడు ఓటేస్తే మాత్రం చేస్తుందని నమ్మకం ఏమిటి? కనీసం పార్టీ గురించి కూడా ఆలోచించకుండా టికెట్స్ కోసం, పదవుల కోసం తన్నుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణకు మాత్రం మేలు చేస్తారని గ్యారంటీ ఏమిటి? అనే సామాన్య ప్రశ్నలకు జైరామ్ రమేష్ కనీసం ఇంగ్లీషులో జవాబులు చెప్పినా వాటిని తెలుగులోకి తర్జుమా చేయించుకొని ప్రజలు అర్ధం చేసుకోగలరు. ఏది ఏమయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో దిగ్విజయ్ సింగ్, తెలంగాణాలో జైరామ్ రమేష్ మంగళ హారతి ఇచ్చే బాధ్యతలు చేపడితే మేము మాత్రం  కాదంటామా? అని ప్రతిపక్షాలు మురిసిపోతున్నాయి.

సీమంద్రాలో తెదేపా, వైకాపా బలాబలాలు

  తెలంగాణాలో నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడందరి దృష్టి సీమాంధ్ర వైపు మళ్ళింది. తెలంగాణాలో వ్యతిరేఖ ఫలితాలు వచ్చినా వాటి వల్ల తెదేపా, వైకాపాలకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కానీ, సీమాంధ్రలో విజయం సాధించలేకపోతే మాత్రం ఆ ప్రభావం చాలా దారుణంగా ఉండవచ్చును. పదేళ్ళపాటు తెదేపా అధికారానికి దూరంగా ఉన్నపటికీ పార్టీ చెల్లాచెదురు కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చిన చంద్రబాబుకి ఈ ఎన్నికలలో తప్పని సరిగా గెలవడం అత్యవసరం. లేకుంటే మరో ఐదేళ్ళు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని కాలక్షేపం చేయడం కష్టం. అందువల్ల ఈ ఎన్నికలు ఆయన రాజకీయానుభవానికి, నాయకత్వ లక్షణాలకి కూడా ఒక అగ్ని పరీక్ష వంటివేనని చెప్పవచ్చును.   ఇక అనేక సీబీఐ కేసులలో చిక్కుకొని తీవ్రమయిన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పగల విధంగా ఈ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచినపుడే వాటి నుండి క్షేమంగా బయటగలరు. లేకుంటే ఆయనకు మళ్ళీ కేసులు, కోర్టుల సమస్యలు ఎదుర్కోక తప్పదు.   ప్రస్తుతం సీమాంధ్రలో తెదేపా, వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా కనబడుతున్నాయి. బలమయిన కాంగ్రెస్ నేతలను, బీసీ, యస్సీ, ఎస్టీ వర్గాలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా తెదేపా చాలా బలోపేతం అయింది. ఇక జాతీయ స్థాయిలో విజయావకాశాలు స్పష్టంగా కనబడుతున్న బీజేపీతో పొత్తులు పెట్టుకోవడంతో, ఆ ప్రభావం, మోడీ ప్రభావం మరియు ఆయనతో చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యం కూడా తేదేపాకు ప్రజలలో అనుకూలతను పెంచాయి. మంచి నాయకత్వ లక్షణాలు, కార్యదక్షత, అపార అనుభవం కలిగిన వారిరువురూ చేతులు కలపడం మరో సానుకూలాంశంగా మారింది. రాష్ట్రానికి మళ్ళీ కొత్త పునాదులు వేయవలసిన ఈ పరిస్థితుల్లో ఇవే అంశాలు తేదేపాకు ప్రత్యేకతను కలిగిస్తున్నాయి.   అదేవిధంగా వైకాపా కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలను, రెడ్డి, మైనార్టీ వర్గాలను పార్టీవైపు ఆకర్షించగలిగింది. గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా చేస్తున్న యాత్రల ద్వారా, వివిధ జిల్లాలలో స్థానిక నేతలను చాలా మందిని వైకాపా వైపు తిప్పుకొంటూ, పార్టీని జిల్లా స్థాయి నుండి బలోపేతం చేసుకోగలిగారు.   ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన అంశం ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోయి అప్పుడే దాదాపు ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా, జగన్ కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాల వలన నేటికీ ఆ సానుభూతిని అదే స్థాయిలో కాకపోయినా, ఇంకా బలంగానే నిలుపుకోగలగడం విశేషం. గనుక ఈ ఎన్నికలలో తప్పనిసరిగా ఆ అంశం వైకాపాకు కొంతమేర ప్రయోజనం కలిగించవచ్చును.   అదే విధంగా జగన్ చేసిన సమైక్యాంధ్ర పోరాటంలో నిజాయితీ లేకపోయినా అతనే అసలయిన సమైక్యవాది అని చాల మంది ప్రజలు నమ్మడం వైకాపాకు కలిసి వచ్చే అంశంగా మారవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు ఈ విషయంలో అతనికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, స్వయంక్రుతాపరాధం వల్ల ఆ పేరు పోగొట్టుకొని జగన్ ఆ స్థానం ఆక్రమించుకొనేందుకు అవకాశం కల్పించారు.   ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇరువురూ కూడా ఏపీయన్జీవోలను తమవైపు ఆకర్షించడంలో విఫలమవడంతో ఇదే అదునుగా జగన్ వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారిలో అశోక్ బాబు వంటి కొందరు ముఖ్యనేతలకి జగన్ గనుక టికెట్స్ ఇచ్చినట్లయితే, ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా కాకపోయినా చాల భారీగానే వైకాపా ఖాతాలో జామా అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బహుశః చంద్రబాబు నాయుడు కూడా ఉద్యోగ సంఘ నేతలకి టికెట్స్ ఇచ్చి పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీవైపు మొగ్గినా మిగిలిన పార్టీలకి ఆ లోటుని పూడ్చుకోవడం అంత తేలిక కాబోదు.   రెండు పార్టీలు ఇదే విధంగా సాగుతూ సమానంగా ఓట్లు చీల్చుకొంటే దానివల్ల వారే కాక ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం రెండు పార్టీలు సమనవుజ్జీలుగా కనబడుతున్నప్పటికీ, ఎన్నికలు దగ్గర పడే నాటికి అవి వేసే ఎత్తులు జిత్తులతో వాటిలో ఏదో ఒకటి కొంచెం ముందంజ వేయవచ్చును. అందువల్ల నిత్యం వెలువడుతున్న అనేక సర్వే నివేదికలు ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తుందని చెపుతున్నపటికీ, అసలు సంగతి మాత్రం చివరి వారంలోనే చూచాయగా తెలియవచ్చును.

చిరంజీవి శల్యసారధ్యంలో యుద్దానికి బయలుదేరిన రఘువీరుడు

  సీమాంధ్రలో నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం 4రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రజలు గుర్తుపట్టగల మొహాలు పార్టీలో ఒక్కటీ కనబడకపోవడంతో కాంగ్రెస్ చాలా ఆందోళనగా ఉంది. అందుకే ఇంతవరకు పార్టీ తరపున పోటీ చేయబోతున్నఅభ్యర్ధుల పేర్లను చూచాయగా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పరువు పూర్తిగా గోదాట్లో కలిసిపోక ముందే ఏదో ఒకటి చేయాలని గ్రహించిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తమ పార్టీలో ప్రజలందరూ ఖచ్చితంగా గుర్తుపట్టగల చిరంజీవినే మళ్ళీ ముందుంచుకొని ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్దపడ్డారు.   అభ్యర్ధుల టికెట్స్ ఖరారు చేసి బీ-ఫార్మ్స్ పంచవలసిన ఈ దశలో చిరంజీవి అభిమానులందరినీ కూడగట్టి వారికి పార్టీ కండువాలు కప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమం చెప్పట్టడం చూస్తే ప్రజలు కూడా ‘పాపం కాంగ్రెస్!’ అని దాని పరిస్థితికి జాలిపడుతున్నారు. అభిమానులకు పార్టీ కండువాలు కప్పే ఈ కార్యక్రమంలో మోడీ గురించి మాట్లాడవలసిన నాలుగు ముక్కలను రఘువీరారెడ్డి తన చెవిలో చెప్పినప్పటికీ, చిరంజీవి వాటిని సరిగ్గా వల్లె వేయలేక తడబడటం చూస్తే ఇంకా జాలి కలుగుతుంది. మోడీ ‘లేనిది ఉన్నట్లుగా’ సోషల్ నెట్ వర్క్, మీడియాలో ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొంటున్నారని చిరంజీవి స్పష్టం చేసారు. సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న ఆయన తన పార్టీ గురించి అభిమానులకు గట్టిగా చెప్పుకోకుండా మోడీ గురించి చెప్పడం విశేషమే. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి మొదలు సోనియా, రాహుల్ వరకు అందరికీ కూడా నరేంద్ర మోడీ సింహసప్నంలా తయ్యరయ్యారని చిరంజీవి ఆయన ప్రస్తావన తెచ్చి మరో మారు స్పష్టం చేసారు.   ఇక ఇటువంటి దైన్యస్థితిలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టవలసి వచ్చిన రఘువీరారెడ్డి బాధ పైకి చెప్పుకోలేనిది. తనకు ఇటువంటి దుస్థితిలో ఇటువంటి కీలక బాధ్యత కట్టబెట్టి, అగ్నిపరీక్ష పెడుతున్న అధిష్టానాన్ని ఏమీ అనలేక ఆ అక్కసు ప్రత్యర్ధులైన తెదేపా, వైకాపాల మీద వెళ్ళగక్కారు. గత 60 సం.లుగా తమ కాంగ్రెస్ పార్టీ నెహ్రు కుటుంబ సభ్యుల మోచేతి నీళ్ళే తాగుతోందన్న సంగతి మరిచిపోయిన ఆయన తెదేపా, వైకాపాలు రెండూ కుటుంబ పార్టీలని ఎద్దేవా చేసారు. “వైకాపా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి, తెదేపా వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రులు అవుతారు తప్ప వేరెవరో కాలేరు కదా!” అని అయన ఎద్దేవా చేసారు.   తెలంగాణాలో దళితులని, బీసీలను ముఖ్యమంత్రి చేయమని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్న ఆ రెండు పార్టీలు దమ్ముంటే సీమాంధ్రలో ఆపని చేసి చూపించాలని ఆయన సవాలు విసిరారు. ఆయన సవాలు బాగానే ఉంది. కానీ, అదే సలహా (సవాలు) ఆయన తన అధిష్టానానికి కూడా చేసి ఉండి ఉంటే బాగుండేది. ఈ ఎన్నికలలో గెలిస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సోనియాగాంధీ ఎంత తహతహలాడిపోతున్నారో అందరికీ తెలుసు. కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్ర విభజన చేసి తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలని చూసి కాంగ్రెస్ భంగపడి, ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధుల కూడా లేని దుస్థితిని ఎదుర్కొంటోంది. నెహ్రూ నుండి రాహుల్ వరకు సాగుతున్న కుటుంబ పాలనను, రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కూడా మరిచిపోయిన రఘువీరుడు ప్రత్యర్ధ పార్టీలకు ఇటువంటి సవాళ్ళు విసిరి తమ పార్టీని ఎందుకు మరింత నవ్వులు పాలుజేసుకొంటున్నారో ఆయనకే తెలియాలి.   ఈ మిగిలిన నాలుగు వారాల పుణ్యకాలం ముగిసిపోక ముందే కాంగ్రెస్ రధాన్ని శల్యసారధ్యం చేస్తున్నచిరంజీవి, ఆయనను ముందుంచుకొని ఎన్నికల యుద్ధంలో దిగే దుస్సాహసం చేస్తున్న రఘువీరుడు ఇద్దరూ కూడా శత్రుసేనల బలహీనతల గురించి మాట్లాడేముందు, ఈ యుద్దంలో పాల్గొనేందుకు అసలు తమ వెనుక ఎవరయినా వస్తున్నారో లేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, లేకుంటే ఎవరినయినా ఏర్పాటు చేసుకోవడం మేలేమో ఆలోచించాలి.

తెదేపా-బీజేపీ పొత్తులపై తెరాస ఆక్రోశం ఎందుకు

  తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటే ఏదో ఘోర అనర్ధం జరిగిపోయినట్లు, ఏదో ప్రళయం రాబోతున్నట్లు అన్ని పార్టీలు వాటిపై తీవ్రంగా విరుచుకుపడటం చూస్తే, అవి వాటి పొత్తులను చూసి ఎంతగా భయపడుతున్నాయో అర్ధమవుతోంది. వాటి పొత్తుల వలన రాష్ట్రంలో పార్టీల బలాబలాలు మారడం తధ్యం. అది ఎన్నికల ఫలితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపడం కూడా అంతే ఖాయం గనుకనే అన్ని పార్టీలు వాటి పొత్తులు చూసి గగ్గోలు పెడుతున్నాయి.   ఇంతవరకు తెలంగాణాలో తనకు ఎదురేలేదని భావిస్తున్న కేసీఆర్ ఆ ధీమాతోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కాలదన్నుకొన్నారు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్, తెరాసలు ఒకదానితో మరొకటి పోటీ పడవలసి రావడమే కాకుండా మిగిలిన ఇతర పార్టీలతో, తెదేపా-బీజేపీ కూటమితో కూడా యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రం సాధించామనే కారణంగా కాంగ్రెస్, తెరాసలు తామే అధికారంలోకి రావడం ఖాయమని ఇంతవరకు గట్టి నమ్మకంతో ఉన్నాయి. కానీ ఇప్పుడు తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొని మరింత బలపడటంతో, ఈ బహుముఖ పోటీలో ఓట్లు చీలితే కాంగ్రెస్, తెరాసలు చెప్పుకొంటున్నట్లు మెజార్టీ సాధించి అధికారం చెప్పటడం సంగతి దేవుడెరుగు, కనీసం గౌరవప్రదమయిన ఓట్ల శాతం దక్కించుకొంటే చాలనుకొనే పరిస్థితి ఏర్పడింది.   కాంగ్రెస్ నేతలందరూ ఎప్పుడో ఒకప్పుడు పదవులు, అధికారం అనుభవించినవారే. అదేవిధంగా చాలా ఎన్నికలలో జయాపజయాలు చవిచూసినవారే. అందువల్ల వారిపై ఈ ఎన్నికలు, దాని ఫలితాలు పెద్దగా ప్రభావం చూపబోవనే చెప్పవచ్చును. అలాగని హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలందరూ ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డి పోరాడకమానరు. అయినప్పటికీ ఒకవేళ ఓడిపోయినా వారు ఓటమిని చాలా తేలికగానే జీర్ణించుకోగలరు.   కానీ మొట్టమొదటిసారిగా అధికారం చెప్పట్టాలని తహతహలాడిపోతున్న తెరాస నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమవుతుంది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకొని రంగంలోకి దిగడంతో వారి కలలు పగటి కలలుగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే అందరి కంటే తెరాస నేతలు తెదేపా-బీజేపీల పొత్తులపై కోపంతో చిందులు వేస్తున్నారు. కానీ, కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అవ్వాలనే అధికార కాంక్షతో, తమ కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే దురాశతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే అధికారంలో వాటా పంచి ఈయవలసి వస్తుందనే భయంతో ఆపార్టీతో పొత్తులు పెట్టుకోకుండా పెద్ద పొరపాటు చేసారు.   ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ పొత్తులు పెట్టుకోవచ్చని కేసీఆర్ కి తెలియకపోదు. అవి పొత్తులు పెట్టుకొంటే బలపడతాయని కూడా ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన అధికార దాహంతో ఒంటరిపోరుకే సిద్దమయ్యారు. నిజానికి తమకంటే ఎన్నోరెట్లు బలమయిన కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమయినా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమయిన క్యాడర్, బలమయిన నాయకులు, వారి ఆర్ధిక, అంగ బలం, తెరాసకున్న ఉద్యమ కీర్తి, ప్రజాధారణ అన్ని కలిస్తే కాంగ్రెస్-తెరాస కూటమి తెలంగాణాలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించి ఉండేది. కానీ, కేసీఆర్ దురాశకు పోయి, బలమయిన కాంగ్రెస్ పార్టీని కాలదన్నుకొని చేజేతులా ఈ పరిస్థితి కల్పించుకొన్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస ఓడిపోయినట్లయితే అందుకు ఆయనే పూర్తి బాద్యత వహించాల్సి ఉంటుంది. ఆయన తన శక్తిని, పరపతిని చాలా అతిగా ఊహించుకొంటున్నందున ఆయనలో ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారి చివరికి పార్టీకి కూడా చేటు తెచ్చే పరిస్థితి కల్పిస్తోంది. కనుక తెరాస తను చేసిన పొరపాటుకి చింతించడం మాని తెదేపా-బీజేపీ పొత్తులని చూసి అక్రోశించడం అవివేకం, హాస్యాస్పదం.

దేశం కోసం, పార్టీ కోసం త్యాగం చేసే నేతలు కావలెను

  తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఏ ఏ స్థానాలు ఏ పార్టీ తీసుకోబోతోందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఒకటి రెండు రోజుల్లో నియోజకవర్గాలను ప్రకటిస్తామని మాత్రమే చంద్రబాబు చెప్పారు.   పొత్తుల కారణంగా పార్టీలో టికెట్స్ ఆశిస్తున్న అభ్యర్ధులకు టికెట్స్ దక్కపోతే వారు తీవ్ర నిరాశ చెందడం సహజమేనని, అటువంటి వారిని తాను అనునయించి మళ్ళీ ఉభయ పార్టీల తరపున నిలబడుతున్న అభ్యర్ధులకు మద్దతు, సహకారం అందించేలా చూస్తానని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా బీజేపీ-ఆంధ్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు కూడా పొత్తుల విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని,పార్టీలో మిగిలినవారు కూడా కట్టుబడి ఉండాలని అన్నారు.   తెదేపాకు కూడా ఇదే సమస్య ఉంది. దానికీ అక్షరాల ఇదే పరిష్కారం వర్తిస్తుంది. అయితే ఇంతవరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తప్ప మరే ఇతర నాయకుడు ఈవిధమయిన భరోసా ఇవ్వకపోవడం గమనిస్తే, ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుకొంటున్నాయని అర్ధమవుతోంది.   ఒకవేళ రెండు పార్టీలు పొత్తుల ప్రకటనతో బాటు వారికి దక్కిన నియోజక వర్గాలను కూడా ప్రకటించేసి ఉంటే ఈ పాటికి ఆయా నియోజక వర్గాలలో (మిత్రపక్షం కోసం) టికెట్స్ పోగొట్టుకొంటున్న అభ్యర్ధులందరూ తమ పార్టీలపై తిరుగుబాటు జెండాలు ఎగురవేసి, వెంటనే వేరే పార్టీలలోకి మారిపోవడమో లేకపోతే స్వతంత్ర (తిరుగుబాటు) అభ్యర్ధులుగా నామినేషన్లు వేయడమో చేసేవారు. అయితే, నియోజక వర్గాలను ప్రకటించనంత మాత్రాన్న అభ్యర్ధులకు ఆ సంగతి తెలియదనుకోలేము. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్ల బేరసారాలు జరుగుతున్న దశలోనే ఏ పార్టీలో ఎవరి టికెట్స్ కి ఎసరు రాబోతోందో దాదాపు స్పష్టమయిపోయింది. అందుకే కోడెల శివప్రసాద రావు, వంటివారు ఆవేదన వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు కూడా వెనుకాడబోమని ప్రకటించేశారు. నాలుగేళ్ల క్రితమే మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు టికెట్ కు హామీ పొందిన మెదక్ యం.యల్యే. మైనంపల్లి హన్మంత రావు, ఇప్పుడు తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో తీవ్ర ఆగ్రహం చెంది, తేదేపాకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు.   ఇటువంటి సమస్యలు రెండు పార్టీలకు చాలా తీవ్రంగా ఉన్నందునే వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను ప్రకటించకుండా కేవలం పొత్తులు కుదుర్చుకొన్నట్లు మాత్రమే ప్రకటించాయి. నామినేషన్లు వేసే ఆఖరి రోజు (ఏప్రిల్ 9) వరకు కూడా తాత్సారం చేస్తూ, ఆఖరి నిమిషంలో ప్రకటించడం ద్వారా తిరుగుబాటు అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా నివారించాలనే ఆలోచన కూడా ఉంది. ఈలోగా ‘బుజ్జగింపుల ప్రక్రియ’ పూర్తి చేసి అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   అటువంటి వారికి కనీసం వేరే ఏదో నియోజక వర్గం నుండి టికెట్స్ కేటాయించి నచ్చజెప్పుకోగలిగితే పరువలేదు. కానీ, దేశం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం త్యాగాలు చేయమని కోరితే అందుకు ఎవరూ అంగీకరించబోరు. ఇప్పుడు ఈ అవకాశం వదులుకొంటే మళ్ళీ మరో ఐదేళ్ళ తరువాత కానీ ఇటువంటి అవకాశం రాదు. పదవులు, అధికారం లేనిదే క్షణం కూడా బ్రతకలేని నేతలను దేశం కోసం, పార్టీ కోసం త్యాగం చేయమంటే, వారు పార్టీలనే త్యాగం చేస్తారు తప్ప తమ టికెట్స్ ని కాదని హన్మంత రావు అప్పుడే నిరూపించారు. ఇక ఆ రెండు పార్టీలు ఈ సమస్య నుండి ఎలా బయటపడతాయో, ఆ పార్టీలలో నుండి ఎంతమంది బయటపడటారో మరొక రెండు రోజుల్లోనే తేలిపోనుంది.

తెలంగాణాలో పార్టీల బలాబలాలు

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి ఎన్నికలు గనుక సహజంగానే ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. దానిని కేసీఆర్ మరియు తెరాసలోని ఆయన కుటుంబ సభ్యులు తమ మాటలతో మరింత రగుల్చుతూ ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే నాలుగు అంశాలే అన్ని పార్టీల భవితవ్యం నిర్దేశించబోతున్నాయి. అందువలన ఒక్కో పార్టీ వీటిలో తమకు అనువుగా ఉన్నఅంశాలను హైలైట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించవచ్చును.   కాంగ్రెస్, తెదేపాలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులు లేరనే చెప్పవచ్చును. అయితే తెరాస ప్రధాన లక్ష్యం మెజార్టీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే గనుక బహుశః యంపీ స్థానాల కోసం మరీ అంతగా ఆరాటపడకపోవచ్చును. అలాగని పూర్తిగా వదులుకొంటుందని కాదు.   కాంగ్రెస్ మాత్రం వీలయినన్ని యంపీ స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతుంది. అందుకే పార్టీలో హేమాహేమీలనదగ్గ సిట్టింగ్ యంపీలకే మళ్ళీ స్థానాలు ఖరారు చేసింది. టీ-కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే రెండు అంశాలతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు అలవాటు ప్రకారం ఒకరి కాళ్ళు మరొకరు లాక్కొంటూ, తమ బంధు జనాలందరికీ అసెంబ్లీ టికెట్స్ ఇప్పించుకొనేందుకు నేటికీ కుస్తీలు పడుతూనే ఉన్నారు. వారు ఈ బలహీనతను జయించలేరు. జయించగలిగితే వారిని తట్టుకోవడం తెరాస వల్ల కూడా కాదు. ఏమయినప్పటికీ, అసెంబ్లీ స్థానాలకు బరిలో దిగనున్న టీ-కాంగ్రెస్ నేతలు ఏ రకంగా కూడా తెరాసకు తీసిపోరు. వారిలో చాలా మంది కేవలం తమ వ్యక్తిగత బలంతోనే గెలవగల సమర్ధులు. కానీ, అంతమంది హేమాహేమీలను కేసీఆర్ ఒక్కడే బలంగా డీ కొంటుంటే, వారిలో ఏ ఒక్కరూ కూడా అతనిని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించకపోగా డిల్లీలో టికెట్స్ కోసం పైరవీలు చేసుకొనేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల వారి అనైక్యతే తెరాసకు శ్రీ రామరక్ష అని చెప్పుకోవచ్చును.   ఇక తెదేపా తెలంగాణా పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే రెండు అంశాలతో తన ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకోవడం ఖాయమయితే, ఆ రెండు పార్టీలకు ఉన్న బలమయిన క్యాడర్, నేతల అండతో విడివిడిగా పోటీ చేస్తున్నకాంగ్రెస్, తెరాసలను నిలువరించగలవు. తెదేపా బీసీ మంత్రం పటిస్తూ, పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తే, బీజేపీ నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయవచ్చును.   బీజేపీ నేతలు ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణాలో విజయం సాధించగలమని అతిశయం ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి అంత సీను లేదు. టీ-కాంగ్రెస్,తెరాస, తెదేపాల బలాలతో పోలిస్తే ఆ పార్టీ తెలంగాణాలో నాలుగవ స్థానంలోనే ఉంది, ఉంటుంది కూడా. తమ పార్టీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చింది గనుక తెలంగాణా ప్రజలు తమకే ఓటేస్తారని అనుకొంటే అది ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. అందువల్ల రేపు ఎన్నికలలో ఆ పార్టీకి పడే ఓట్లన్నీకేవలం మోడీ మొహం చూసి వేసినవే అనుకోవచ్చును.   ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీ బాలా బలాలు ఇంచుమించు సరిసమానంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే తెలంగాణాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇది చాల నష్టం కలిగిస్తుంది. ఒకవేళ ఎన్నికలు సమీపించే సమయానికి ఈ పార్టీలలో ఏదో ఒకటి మరింత బలం పుంజుకొని రేసులో ముందుకు దూసుకుపోయినట్లయితే ఇటువంటి దుస్థితి నివారించవచ్చును.

ఇంకా భ్రమల్లోనే బ్రతుకుదామంటున్న కిరణ్

    కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని స్థాపించడంలో ఆలస్యం చేయడం, అందుకు ఆయన ఎంచుకొన్న సమయం ఒక పెద్ద తప్పు అయితే, అధికారికంగా రాష్ట్ర విభజన జరిగిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్న తరుణంలో కూడా తన పార్టీకి జై సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలంటే ప్రజలలో సమైక్య సెంటిమెంటుని రెచ్చగొట్టడమే అందుకు మార్గమని ఆయన దృడంగా విశ్వసించబట్టే ఆయన తన పార్టీకి ఆ పేరు పెట్టుకొన్నారు. ఆయన సమైక్యవాదమనే పునాదిపై తన పార్టీని స్థాపించుకొన్న కారణంగా నేడు సరిగ్గా అదే ఆయన పార్టీకి పెద్ద ప్రతిబందంగా మారింది.   సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మనస్పూర్తిగా కోరుకొన్న మాట నిజం. కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత నేటికీ వారు ఆ భ్రమలలో కొనసాగేందుకు సిద్దంగా లేరు. వారి అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని శిక్షించేదుకు వారు సిద్దంగా ఉన్నారు. కానీ, అదే సమయంలో ప్రజలందరూ కూడా ఒక సానుకూల యదార్ధ, దృక్పదంతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆలోచిస్తున్నారు. అయితే మూడేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన పార్టీలో ఉన్న ఉండవల్లి, హర్షకుమార్ వంటి రాజకీయ అనుభవజ్ఞులకు ఈ విషయం తెలియదని భావించలేము. కానీ, పార్టీ తీసుకొన్న స్టాండ్ కారణంగానే వారందరూ నేటికీ రాష్ట్రం విడిపోలేదని, తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి కలుపుతామని వితండ వాదనలు చేయవలసి వస్తోంది. ఆవిధంగా నేటికీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రజలలో తాము నవ్వుల పాలవుతున్నామనే సంగతిని కూడా విస్మరించవలసి రావడం నిజంగా దయనీయమే.   రాష్ట్ర విభజన వ్యవహారం సజావుగా పూర్తి కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ యంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు పోషించిన పాత్రల గురించి ప్రజలకు బాగానే జ్ఞాపకం ఉంది. అందుకే జైసపాకు, కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ఆదరణ కరువయింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేయాలి గనుక తాము చెప్పదలచుకొన్నవి ప్రజలకు చెప్పుకొంటున్నారు.   రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలు గుర్తించడానికి కాంగ్రెస్ అధిష్టానికి కళ్ళు చెవులు లేవా? ఉంటే అవి మూడుకు పోయాయా? అని ప్రశ్నించిన అదే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో గ్రహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆయన తీసుకొన్న సమైక్య స్టాండ్ ఆయన నోటికి తాళాలు వేస్తోందనుకొన్నా, ఇప్పుడు తనకు, ప్రజలకు కూడా శత్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టానాన్ని నోరు తెరిచి విమర్శించేందుకు నేటికీ జంకడం చూస్తే, మళ్ళీ ఏదో ఒకరోజు కాంగ్రెస్ గూటికే చేరే ఉద్దేశ్యం ఉంది గనుకనే ఆయన నోటికి తాళం బిగించుకొని పొదుపుగా విమర్శించవలసి వస్తోందని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను నొల్లుకోవాలని పార్టీ పెట్టుకొన్న ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీని నోరారా చీల్చిచెండాడి ఉంటే, దెబ్బ తిన్న సీమాంధ్ర ప్రజల మనసులకు స్వాంతన లభించి ఆయన పార్టీకి ఎంతో కొంత జనాధారణ పెంచి ఉండేది. కానీ, నేటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టాన దేవతల పట్ల అదే వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నందున ప్రజలను ఆకట్టుకోలేక పోవడమే గాక వారిలో తన పార్టీ పట్ల మరింత అనుమానాలు పెరిగేలా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు పార్టీ స్టాండ్ కారణంగా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని ప్రజలనుమభ్యపెట్టవలసి వస్తోంది.   ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడలేని ఆయన ఇప్పుడు ఏవిధంగా కలుపగలరు? అని ఆలోచిస్తే ఆయన చేస్తున్న వాదనలకు అర్ధం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఇప్పుడు నిజంగానే రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కలిపేందుకు సిద్దపడినా మానసికంగా విడిపోయి, తమ రాష్ట్రాలను పునర్నిర్మించుకొని ఇకనయినా సుఖంగా బ్రతకాలనుకొంటున్న రెండు రాష్ట్రాల ప్రజలు అందుకు అంగీకరించరు. ఆయన ప్రజలను మభ్యపెట్టేందుకు చెపుతున్న ఇటువంటి మాటల వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేకపోయినా, ఆయనలాగే సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకొంటున్న కేసీఆర్ వంటి వారికి ముఖ్యమంత్రి అయ్యేందుకు మంచి సాకుని అందజేయగలుగుతున్నాయి.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఎన్నికలలో కనీసం తనొక్కడయినా ఖచ్చితంగా గెలవాలనే కోరిక ఉండి ఉంటే కనీసం ఇప్పటి నుండయినా తన పందా మార్చుకొని ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే ఏమయినా ఫలితం ఉంటుంది. అలా కాక ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చివరికి ఆయనే ప్రజలలో నవ్వులపాలవుతారు.

తెదేపా వల్ల తెరాస అభద్రతాభావానికి గురవుతోందా?

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఎన్నికల ప్రసంగాలలో తరచూ మనకి ‘అంద్రోళ్ళ పార్టీల’ పెత్తనం అక్కరలేదని చెపుతుండటం అందరూ గమనించే ఉంటారు. కానీ డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీల పట్ల గానీ ఆయన అటువంటి వ్యతిరేఖత ప్రదర్శించడం ఎన్నడూ చూడలేదు.   తెరాస పార్టీ ఇంతవరకు అవసరమయినప్పుడల్లా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొడుతూ నెట్టుకొస్తోంది తప్ప తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలలాగ పార్టీని గ్రామస్థాయి నుండి నిర్మించుకొని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయలేదు. అందువల్ల బలమయిన నేతలు విస్తృతమయిన క్యాడర్ కలిగి ఉన్న తెదేపాను చూసి తెరాస అభద్రతా భావానికి గురవడం సహజమే. అందుకే తనకు బలమయిన పోటీ ఇస్తున్న తెదేపా మీద ‘ఆంద్రోళ్ళ పార్టీ’ అని బలంగా ముద్ర వేసేందుకు కేసీఆర్ తరచూ ప్రయత్నిస్తుంటారు. ఆ పార్టీ నేత హరీష్ రావు “ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే తెలంగాణాలో తెదేపా దుఖాణం కట్టేసి వెళ్ళిపోతారా?” అని చంద్రబాబుని అడిగిన ప్రశ్నలో కూడా అదే రకమయిన అభద్రతా భావం కనబడుతోంది. తెరాస తాను అధికారంలోకి రావడం ఖాయమని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నపుడు, తెదేపాను చూసి ఎందుకు అంత కలవరపడుతున్నట్లు? కాంగ్రెస్, బీజేపీలను చూసి ఎందుకు భయపడటం లేదు? అని ప్రశ్నించుకొంటే చంద్రబాబు మరియు తెదేపా శక్తియుక్తుల మీద వారికి ఉన్న అపార నమ్మకమేనని చెప్పక తప్పదు.   తమ దెబ్బకి తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని విర్రవీగుతున్న తెరాస నేతలకి ఇటీవల తెలంగాణాలో తెదేపా నిర్వహించిన మూడు ప్రజాగర్జన సభలు విజయవంతం కావడం, చంద్రబాబు బీసి మంత్రానికి తమ వద్ద సరయిన జవాబు లేకపోవడం చాలా కలవరపరిచే అంశాలేనని చెప్పవచ్చును. రాష్ట్ర విభజనతో తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణా నుండి బిచాణా ఎత్తేస్తుందని, ఇక తమకు తిరుగే ఉండదని భావిస్తే, అందుకు విరుద్దంగా తెదేపా ఊహించనంత వేగంగా మళ్ళీ తెలంగాణాలో బలం పుంజుకోవడమే కాక తమ విజయావకాశాలను కూడా గండి కొట్టే స్థాయికి ఎదగడం తెరాస జీర్ణించుకోవడం కష్టమే.   ఇక కేసీఆర్ దురాశకు పోయి తన వెంటపడుతున్న కాంగ్రెస్ పార్టీని చ్చీ కొడుతూ దూరంగా పెడితే, అసలు తెదేపాతో పొత్తులకే అంగీకరించని బీజేపీ తెలంగాణా నేతలు పార్టీ జాతీయ అవసరాల దృష్ట్యా తెదేపాతో సర్దుకుపోయేందుకు అంగీకరించడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారు అయ్యాయి. దీనితో తెలంగాణాలో కూడా పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. తెదేపా-బీజేపీలు చేతులు కలిపి బలపడితే, కాంగ్రెస్, తెరాసలు విడిపోయి బలహీనపడ్డాయి. తెరాస నేతల అభద్రతా భావానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పవచ్చును.   ఇక తమవంటి ఒక ప్రాంతీయ పార్టీ తెదేపాని చూసి భయపడుతున్న తెరాస నేతలు తమకంటే ఎన్నో రెట్లు బలమయిన జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చూసి ఎందుకు భయపడటం లేదు అంటే, నేటికీ బీజేపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని, కనీసం తమకు గట్టి పోటీ కూడా ఇవ్వలేదనే భావనే తెరాస అలుసుకి కారణం. కానీ అది ఇప్పుడు తెదేపాతో చేతులు కలుపుతోంది గనుక ఇప్పుడు దానిని కూడా కేసీఆర్ తన లెక్కలోకి తీసుకోక తప్పదు.   ఇక టీ-కాంగ్రెస్ నేతలకు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రావాలనే తపన కంటే, తమకు తమ కుటుంబ సభ్యులకు టికెట్స్ సాధించుకోవడం పైనా, అధికారంలోకి రాలేమని తెలిసినా ముఖ్యమంత్రి కుర్చీకోసం తోటి నేతలతో సిగపట్లు పట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గనుక వారిని వారే ఓడించుకొంటారనే ధీమా కేసీఆర్ కి ఉన్నందునే ఆయన కాంగ్రెస్ ను చూసి కూడా ఎన్నడూ భయపడలేదు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు అందరూ మళ్ళీ ఒక్క త్రాటిపైకి తమను డ్డీ కొనాలని చూసినా వారిపై ప్రయోగించడానికి “తెలంగాణా సెంటిమెంటు” అనే బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది.   అయితే కాంగ్రెస్ పార్టీ మీద దివ్యంగా పనిచేసే ఆ బ్రహ్మాస్త్రం ‘ఆంధ్రోళ్ళ తెదేపా’ మీద ఎందుకు పనిచేయడం లేదు? అంటే తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెపుతున్న మాయమాటలను నమ్మకపోవడమేనని అనుకోవచ్చును. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మొదలు కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల వరకు కేసీఆర్ చేస్తున్న మాటల గారడీని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నిర్ద్వందంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వకపోయినా, ఆయన ఇప్పుడు తెలంగాణాలో తన పార్టీని పూర్తిగా బీసీలకే అప్పజెప్పడం, వారికే అధికారమని విస్పష్టంగా ప్రకటించడం, ముఖ్యంగా తాను కల్పించిన ఉపాధి, చేసిన అభివృద్ధి పనులు గురించి ప్రజలకు సమర్ధంగా చెప్పుకోవడం వలన తేదేపాకు ప్రజలలో క్రమంగా ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది.   కేసీఆర్ చేస్తున్న వేర్పాటు తెలంగాణావాదం వలన ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని వారికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో నయినా తెలంగాణాలో అయినా ప్రజలకు కావలసింది సుస్థిరమయిన పాలన, వేగంగా అభివృద్ధి, ఉపాధి, భద్రత, శాంతి వంటివే కోరుకొంటున్నారు కనుకనే వాటిని ఇవ్వగల నేతలకు, పార్టీలకే ప్రజలు పట్టం గడతారు తప్ప మాటల గారడీలు చేసే అనుభవం లేని నేతలకు కాదు. బహుశః ఈ అంశమే తేదేపాకు రెండు ప్రాంతాలలో కలిసి వస్తోంది. కానీ దీనిని తెదేపా ఎంత సమర్ధంగా వినియోగించుకొంటుందో తెలుసుకొనేందుకు ఎన్నికల ఫలితాలే గీటురాయిగా నిలుస్తాయి.

పొత్తుల్లో పెడధోరణి!

  దేశంలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. రాజకీయ నాయకులు ఇంకా దారుణంగా తయారయ్యారు. ఈ రెండు శక్తుల కాంబినేషన్‌లో నడుస్తున్న పొత్తుల ప్రక్రియ మరింత దారుణంగా తయారైంది. ఈసారి ఎన్నికలలో పొత్తుల ఎత్తులు, జిత్తుల్లో పొడచూపుతున్న పెడ ధోరణులు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగనట్టు వున్నాయి. పొత్తుల అంశాన్ని ఇంత కంగాళీ చేసి జనాన్ని లేనిపోని కన్ఫ్యూజన్‌కి గురి చేస్తున్నారు. ఈ అంశంలో ఏ పార్టీ మీద అమాయకపు ముద్ర వేయడానికి వీల్లేదు. తిలాపాపం తలా పిడికెడన్నట్టు అన్ని పార్టీలూ ఇందులో భాగస్వామిగానే వున్నాయి.   కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఐ తనకేదో ప్రజల్లో ఓట్లు తెగ పడిపోతాయన్నట్టుగా సీట్లు బేరమాడుతూ వుంటుంది. తాను గెలవనని తెలిసినా సీట్లు డిమాండ్ చేస్తూ వుంటుంది. తాను అడిగిన సీట్లు ఇవ్వకపోతే పొత్తు కటీఫ్ అంటుంది. తనతోపాటు కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకుంటే తనకి లాభం అని ఆశపడుతూ వుంటుంది. ఒకపక్క కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకదాన్నొకటి తిట్టుకుంటూ వుంటే, తాను మధ్యలో దూరి పరిష్కారం చేస్తానని లేనిపోని పెద్దరికాన్ని నెత్తిన వేసుకోవడానికి రెడీ అవుతుంది.   ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ విలీనం లేదు పొమ్మనడంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో పొత్తుల బేరం పెట్టింది. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నిరాశకి గురైంది. టీఆర్ఎస్ ఛీ కొడుతున్నా పొత్తు కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతూ వుంటుంది. కాంగ్రెస్ నాయకులు ఉదయాన్నే టీఆర్ఎస్‌ని తిడతారు. సాయంత్రం ఆ పార్టీతో పొత్తు వుంటే బాగుంటుందని ప్రశాంతంగా మాట్లాడతారు.   ఇక టీఆర్ఎస్ చూపంతా బీజేపీ పైనే. తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు కుదరకపోతే తాను ఆ ప్లేస్‌లో దూరేయాలని టీఆర్ఎస్ తహతహ. బీజేపీతో తెలుగుదేశం పొత్తు కుదిరితే అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు గురించి ఆలోచించాలని ప్రణాళిక. ఇక తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఒక పట్టాన తేలకుండా సాగుతూ చిరాకు తెప్పిస్తోంది. తెలుగుదేశం ఎంత తగ్గినా బీజేపీ ఓవర్ యాక్షన్ చేస్తోంది. కొంతమంది బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తు వుండదంటారు. మరికొందరు పొత్తు వుంటుందంటారు.   ఈ రెండుపార్టీల మధ్య పొత్తు కుదరకపోతే తాను రంగంలోకి దిగి బీజేపీని మంచి చేసుకోవాలని వైఎస్సార్సీపీ కాచుకుని కూర్చుంది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరదు గాక కుదరదంటూ తన మీడియా ద్వారా ఊదరగొట్టేస్తూ వుంటుంది. ఈ అయోమయ పరిస్థితికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో!

ఎన్నికలలో తెరాసకు పోటీ వద్దంటున్న కేసీఆర్

  మెదక్ జిల్లా అందోల్‌లో నిన్న జరిగిన తెరాస తెలంగాణా విజయోత్సవ సభలో మాటల మాంత్రికుడు కేసీఆర్ ఒకపక్క ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రాజేస్తూనే, తనకు అధికారం కట్టబెడితే ఒక్కరూపాయి కూడ అవినీతిలేని పాలన అందిస్తానని సరికొత్త పల్లవి అందుకొన్నారు. తెరాసను ‘ఇంటి పార్టీగా’ ప్రజలు స్వీకరించాలని కోరారు. తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే పరిపాలించుకొంటూ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకొంటున్నాయని, అందువల్ల తెలంగాణలోకూడా ఇంటి పార్టీ- తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఎంతో దైర్యంతో పోరాడి తెలంగాణా సాధించిన తానే తెలంగాణకు ‘కొత్త మేస్త్రిగా’ ‘సేవ’ చేసుకొంటానని విన్నవించుకొన్నారు.   ఇంతకాలంగా ఆంధ్రా పార్టీలు, ఆంద్ర నాయకులు కలిసి తెలంగాణా నీళ్ళను, భూములను, ప్రజలను కూడా దోచుకొన్నారని అందువలన తెలంగాణాలో ఇకపై ఆంధ్రా పార్టీలకు ‘నో ఎంట్రీ’ అని బోర్డు కూడా పెట్టేసారు. వాటికి కూడా ఉద్యోగులలాగే ఆప్షన్స్ లేవని, తెలంగాణా విడిచి వెళ్లిపోవల్సిందేనని ప్రకటించేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్ధులకు ‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య, రైతులకు రుణమాఫీ, గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్స్ తదితర అనేక హామీలు గుప్పించారు.   కేసీఆర్ ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ఇచ్చుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల బరిలో తమ పార్టీకి పోటీగా అసలు ప్రత్యర్ధులే ఉండకూడదని భావిస్తున్నట్లుంది. తెలంగాణాలో తమకంటే చాలా బలంగా ఉన్నకాంగ్రెస్ పార్టీకి అవినీతి ముద్ర, తెదేపాకు ఆంధ్రా పార్టీ ముద్రవేసేసి ప్రజలు ఓటేయడానికి అనర్హమయినవని ఆయనే డిసైడ్ చేసేసారు. పనిలోపనిగా తన తెరాసకు ‘ఇంటి పార్టీ ముద్ర’ గుద్దేసుకొని ఇది ప్రజల పార్టీయేనని నమ్మమని చెపుతున్నారు.   మొన్నటిదాకా దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తానే ‘తెలంగాణకు కొత్త మేస్త్రిగా’ సేవ చేసుకొంటానని చెపుతున్నారు. కేసీఆర్ తను చాలా గొప్ప త్యాగమూర్తిన్ని భావించవచ్చుగాక, కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు యంపీ, యం.యల్యే. కేంద్రమంత్రులుగా పనిచేసినప్పటికీ వారు తెలంగాణా రైతన్నలకు, నేతన్నలకు, బీడీ కార్మీకులకి, గల్ఫ్ బాధితులకి గానీ వారు చేసిందేమీ లేదు. అయినప్పటికీ తెలంగాణా ప్రజలు కూడా ఆయన నిజంగా త్యాగమూర్తేనని భావిస్తే ఆయన తన గురించి, తన పార్టీ గురించి ఇంతగా స్వోత్కర్ష చేసుకోనవసరం లేదు.   తెలంగాణా సాధనలో ఆయన పాత్రను, తెరాస పాత్రను ఎవరూ కూడా ప్రశ్నించలేరు. కానీ వారు అందుకు ఎంచుకొన్న విద్వేష ప్రచార మార్గం, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు, బలవంతపు వసూళ్ళు, పార్టీలో సాగుతున్న కుటుంబ పెత్తనం వలననే నేడు ఆయన ప్రజలను ఓట్ల కోసం ఈవిధంగా వేడుకోవలసి వస్తోంది. తెలంగాణా ఏర్పడితే కాపలా కుక్క పాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అధికారం పంచుకొంటామని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. అందుకోసమే మళ్ళీ ఆయన ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు ప్రజల హృదయాలలో విద్వేష భావాలు నింపుతూ స్వచ్చమయిన తెలంగాణా ప్రజల హృదయాలను కూడా కలుషితం చేస్తున్నారు.   ఇంత పదవీ లాలస కలిగి, మాట నిలకడలేని వ్యక్తి కేసీఆర్ నేటికీ ప్రజలను తన మాటకారితనంతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ తను అధికారంలో రావడం కోసం వేరే ఏ పార్టీలు పోటీలో ఉండకూడదనే దొరల అహంకారం, ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కావు. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకు తగ్గట్టుగా ఆయన తీరు మార్చుకొని ప్రజల వద్దకు వెళితే వారే ఆయనను నెత్తిన పెట్టుకొంటారు.

తెదేపా-బీజేపీ పొత్తులపై అదే సందిగ్ధం

  తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన చర్చలు విఫలం అవడంతో సీను మళ్ళీ డిల్లీకి మారింది. టీ-బీజేపీ నేతలు తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న సంగతిని పసిగట్టిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇదే అదునుగా తాము బీజేపీతో జత కట్టేందుకే సిద్దంగా ఉన్నామని సంకేతాలు పంపడంతో, తెదేపా వెంటనే అప్రమత్తమయ్యి ఎర్రబెల్లి, రమణ, మోత్కుపల్లి తదితర నేతలను హుటాహుటిన డిల్లీకి పంపి నేరుగా బీజేపీ అగ్రనేతలతోనే చర్చలకు దిగింది. అదే సమయంలో తెదేపా సీనియర్ నేత ఒకరు బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వైకాపాతో ఉన్న అనుబంధం వల్లనే తెదేపాతో పొత్తులను కుదరనీయకుండా అడ్డుపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం, అందుకు ఆయన కూడా అంతే ధీటుగా జవాబీయడం జరిగింది. అయితే తెదేపా-బీజేపీ అధిష్టానాలు పొత్తులకు సానుకూలంగా ఉన్నపటికీ, కేవలం కిషన్ రెడ్డి మరి కొందరు నేతల అభ్యంతరాల కారణంగానే ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరడం లేదనే సంగతి సుస్పష్టం. అందువల్ల వారిమధ్య సీట్ల సర్దుబాటు అనేది కేవలం రెండో అంశమేనని చెప్పవచ్చును.   ఇక, బీజేపీ సీమాంద్రాలో చాలా బలహీనంగా ఉంది గనుకనే అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తుల కోసం ఇంకా ఆలోచిస్తోంది. లేకుంటే దానితో ఎప్పుడో తెగతెంపులు చేసుకొని తెలంగాణాలో తెరాసతో, సీమాంద్రాలో వైకాపాతో జత కట్టేది. కానీ మాట నిలకడలేని కేసీఆర్ వంటి వ్యక్తిని, కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే బీజేపీకే నష్టం. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి, దళితులకీ హ్యాండిచ్చిన్నట్లే, రేపు ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంటే బీజేపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ తో చేతులు కలపవచ్చును. అదేవిధంగా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీవైపే మ్రొగ్గు చూపవచ్చును. కనుక అటువంటివారిని నమ్ముకోవడం కంటే ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలవని తెదేపాతో జత కట్టడమే శ్రేయస్కరమని బీజేపీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కానీ కిషన్ రెడ్డి వంటి వారి భరోసాతో వాపును చూసి బలుపు అనుకొని, తెదేపాను కాదని తెరాస, వైకాపాలో పొత్తులు పెట్టుకొన్నా, అసలు ఎవరితోను పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి దిగినా బీజేపీయే ఎక్కువ నష్టపోవచ్చును.   తమతో చాలా సానుకూలంగా ఉన్న తెదేపాతోనే సీట్ల సర్దుబాటు చేసుకోలేనప్పుడు, ఎలాగయినా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడిపోతూ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చిన కేసీఆర్ తో పొత్తులు కుదుర్చుకోవడం అంత సులువేమీ కాదు. కానీ వైకాపాకు తెలంగాణపై పెద్దగా ఆసక్తి లేదు గనుక ఆ పార్టీతో పొత్తులు సాధ్యపడొచ్చేమో గానీ, తెలంగాణాను తీవ్రంగా వ్యతిరేకించిన ఆపార్టీతో కేవలం సీమాంధ్రలోనే పొత్తులు పెట్టుకొన్నప్పటికీ, ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీపై తప్పకుండా చూపినట్లయితే అప్పుడు బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలాగే రెంటికీ చెడిన రేవడిలా తయారవుతుంది.   ఇక తెదేపా వైపు నుండి చూసినట్లయితే, బీజేపీతో పొత్తుల వలన ఆపార్టీకి ప్రస్తుతం పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా, కాంగ్రెస్, తెరాస, వైకాపాలను మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకే బీజేపీతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరక పోయినట్లయితే రెండు ప్రాంతాలలో బహుముఖపోటీలు జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా ఎంతో కొంతమేర నష్టపోవడం తధ్యం. (తెలంగాణాలో) ఎన్నికలకి ఇంకా కేవలం 29రోజులు మాత్రమే మిగిలాయి. అయినా నేటికీ ఇంకా పొత్తులు ఖరారు చేసుకోలేకపోతే వాటికే నష్టం. బహుశః ఈరోజు సాయంత్రంలోగా వారి పొత్తుల కధ ఒక కొలిక్కివస్తుందేమో. రాకుంటే ఇక ఆ సంగతి ఆలోచించడానికి కూడా సమయం సరిపోదు.

జయనామ సంవత్సరంలో తెలుగుజాతి జయహో

  తెలుగు ప్రజలు ప్రాంతాల మధ్య విభజన రేఖ గీసుకొని విడిపోతున్నప్పటికీ, అందరూ నేడు ఉగాది పండుగ జరుపుకోవడం వారిమధ్య ఎన్నటికీ విడదీయలేని బంధాలున్నాయని తెలియజేస్తోంది. ఎన్నికల భేరి మ్రోగినప్పటి నుండి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడిపోతున్న ఆంధ్ర, తెలంగాణలలో వివిధ రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతున్న మాటలు గమనించినట్లయితే, కేవలం అటువంటి స్వార్ధ రాజకీయనాయకుల వలననే తెలుగు ప్రజల మధ్య నానాటికి దూరం పెరుగుతోంది తప్ప, నిజానికి రెండు ప్రాంతాల ప్రజల మధ్యన ఎటువంటి విద్వేషాలు లేవని స్పష్టమవుతోంది. ఇంతవరకు ఆంద్రా తెలంగాణా ఉద్యమాలలో విద్యార్ధులు, ఉద్యోగులు, సామాన్య తీవ్రంగా నష్టపోయారు. కానీ, ఆ ఫలాలు కొందరు ఉద్యోగ సంఘ నేతలకు, రాజకీయ నాయకులకే దక్కబోతున్నాయి. సదరు నేతలే మళ్ళీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రజల భావోద్వేగాలను వారి బలహీనతలుగా భావించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈ స్వార్ధ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ విద్వేష ప్రచారానికి లోనయితే నష్టపోయేది తామే తప్ప వారు కాదని గ్రహించి, తాము వారు భావిస్తున్నట్లుగా బలహీనులముకామని, అటువంటి ప్రయత్నాలు చేసే వారికి తగిన గుణపాటం చెప్పగలమని నిరూపించి తెలుగుజాతి ఔనత్యాన్ని కాపాడుకోవాలి.   ఇంతవరకు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసిన తెలుగు ప్రజలందరూ, ఇకపై ఇరుగుపొరుగులుగా మారి ఒకరికొకరు ప్రేమ పంచుకోవాలి. ఇంతకాలంగా ఇదే స్వార్ధ రాజకీయనేతలు రెండు ప్రాంతాలలో అధికారంలో, పదవులలో ఉన్నపటికీ వారు తమ ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, రాజకీయవ్యాపారాలు చేసుకొంటూ కేవలం తమను తాము అభివృద్ధి చేసుకోవడం ప్రజలందరూ గమనించే ఉంటారు. కనుక ఇకనైనా రెండు రాష్ట్రాలలో ప్రజలు ఈ మాటల మాంత్రికులను కాక నిజంగా తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేయగలవారినే ఎన్నుకోవలసి ఉంటుంది.   ప్రాంతాలు వేరయినా తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే. ఎవరు ఎక్కడ నివసిస్తున్నా వారందరూ తెలుగువారే.. మానవత్వం పరిమళించే భారతీయులే... ఈ జయనామ సం.లో తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుకొంటూ తెలుగువన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

అందుకే కిరణ్ విభజనను వ్యతిరేఖించారా?

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులను బలంగా అణచివేశారు. అంతేగాక చాలా నిరంకుశ పోకడలు ప్రదర్శిస్తూ తన క్యాబినెట్ సహచరులతో కూడా సంప్రదించకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకొనేవారు. తన నిర్ణయాలను ప్రశ్నించిన శంకర్ రావు, డా.డీయల్.రవీంద్ర రెడ్డి వంటి వారిని నిర్దాక్షిణ్యంగా పదవుల నుండి తప్పించి వారిని పార్టీలో ఏకాకులుగా చేసి పగ తీర్చుకొన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఆయన ప్రత్యర్దులెవరూ ఆయనకు వ్యతిరేఖంగా మాట్లాడే సాహసించలేకపోయారు. బహుశః అందువల్లే ఆయన పార్టీ వీడే సమయానికి ఆయన వెనుక పదిమంది కాంగ్రెస్ నేతలు కూడా కనబడలేదు. ఆయన పార్టీ నుండి బయటపడి స్వంత కుంపటి పెట్టుకొన్న తరువాత, అంతవరకు ఆయనపై రగిలిపోతున్న కాంగ్రెస్ లో మిగిలిన నేతలందరూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.   ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించే మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మరొక అడుగు ముందుకు వేసి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ప్రజల కోసం కాక పార్టీలో తమవంటి బీసీ వ్యక్తులు ఉన్నత పదవులు పొందకుండా ఉండేందుకే ఆయన విభజనను వ్యతిరేఖించారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులవంటి కీలక పదవులను ఆశిస్తున్న బీసీ నేతలు రఘువీర, బొత్స తదితరులకు దక్కే అవకాశం ఉంది గనుకనే ఆయన విభజనను అంత తీవ్రంగా వ్యతిరేఖించారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న డొక్కా ఇటువంటి ఆరోపణలు చేయడం పెద్ద విచిత్రం కాకపోయినా, ఆయన చేసిన ఆరోపణలతో కిరణ్ పోరాటంలో మరో కొత్త కోణాన్ని బయటపెట్టారు.   ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో అధికారమంతా రెడ్డి కులస్థుల చేతిలోనే ఎక్కువగా ఉంది. కనుక అదే కులానికి చెందిన కిరణ్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు అయిష్థత చూపడం అసహజమేమీ కాదు. కానీ అది కూడా ఒక కారణమయితే కావచ్చునేమో కానీ అందుకోసమే ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖించారనే డొక్కా వాదనలలో పసలేదు. ఒకవేళ ఆయన ఎవరికయినా పదవులు దక్కకుండా అడ్డుపడదలిస్తే అందుకు ఇంత పోరాటం అవసరం లేదు. నేరుగా డిల్లీ వెళ్లి అధిష్టానం దగ్గిర తనపలుకుబడిని ఉపయోగించి దామోదర రాజనరసింహకు హోంమంత్రి పదవి దక్కకుండా ఏవిధంగా అడ్డుపడ్డారో అదేవిధంగా విభజన తరువాత కూడా చేయగలిగేవారు.   కానీ, ఆయన చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో పనిచేస్తూ, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తూనే, పార్టీ వ్యూహంలో భాగంగానే దానిని వ్యతిరేఖిస్తున్నట్లు నటిస్తూ పార్టీ వ్యతిరేఖ ఓట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో జామా చేసేందుకే ఆయన అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీ పెట్టారు. ఆయన రాష్ట్ర విభజనలో అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టడమనేది వేరే సంగతి.   అందువలన డొక్కా వంటివారు కిరణ్ గురించి నోరు జారేముందు కొంత ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన పార్టీ ఆదేశాలమేరకే వేరు కుంపటి పెట్టుకొన్నారు గనుక ఎన్నికల తరువాత మళ్ళీ దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేక అధిష్టానం మళ్ళీ ఆయనకీ కీలక పదవి ఏదో కట్టబెడితే అప్పుడు ఆయన డొక్కా వంటి వారిని కూడా ఆయన శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం.

కొలిక్కి రాని సీట్ల సర్దుబాట్లు

  తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాట్ల చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో వాటి మధ్య ఎన్నికల పొత్తులు కూడా ఇంకా ఖరారు కాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా పొత్తుల సంగతి తేల్చుకోలేక తమ అభ్యర్ధులను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడితే అది ఇరుపార్టీలకీ కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆలోచనతో నేరుగా చంద్రబాబుతోనే చర్చలు జరిపేందుకు బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తుకు సముఖంగా లేనప్పటికీ, పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా బీజేపీ తెదేపాతో పోత్తులకు సిద్దపడుతోంది.   తెలంగాణాలో 45 అసెంబ్లీ సీట్లు, 8 లోక్ సభ సీట్లు ఇవ్వాలని, సీమాంధ్రలో 25 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ సీట్లు ఇవ్వాలని కావాలని బీజేపీ కోరుతుంటే, తెదేపా మాత్రం తెలంగాణలో 24/6 సీట్లు, సీమాంధ్రలో 8/3 సీట్లు ఇవ్వడానికి మాత్రమే సిద్దంగా ఉంది. ఇవికాక విశాఖ, విజయవాడ, మల్కాజ్ గిరీ మరికొన్ని ముఖ్యమయిన నియోజకవర్గాలలో రెండు పార్టీలకు బలమయిన అభ్యర్ధులు ఉన్నందున ఆ సీట్లు తమకే కావాలని ఇరు పార్టీలు గట్టిగా పట్టుబడుతుండటంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.   అందువల్ల ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలలో మిగిలిన సీట్ల విషయంలో కొంచెం పట్టువిడుపులు ప్రదర్శించి రెండు పార్టీలు రాజీకి వచ్చినా, ముఖ్యమయిన నాలుగయిదు స్థానాల విషయంలో రాజీపడలేకపోతే మధ్యే మార్గంగా ఆ స్థానాలలో వేర్వేరుగా పోటీ చేసినా చేయవచ్చును. కానీ, ఇది ప్రజలకు, ఉభయ పార్టీల కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపి అయోమయానికి గురిచేసే అవకాశం ఉంది. అంతేగాక వారిని విమర్శించేందుకు వారి ప్రత్యర్ధులకు కూడా మంచి అవకాశం కల్పిస్తుంది గనుక రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుకే గట్టిగా ప్రయత్నించవచ్చును. కానీ, ఒకవేళ అలా వీలు కాకపోతే ఆ నాలుగయిదు స్థానాలలో వేర్వేరుగా పోటీ చేసినా చేయవచ్చును. ఏది ఏమయినప్పటికీ రెండు పార్టీలు ఏదోవిధంగా పొత్తులు కుదుర్చుకోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చును.