తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!

   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్విత రాజధాని నిర్మించడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు కనుక అంతవరకు విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడ తరలించేందుకు అక్కడ తగిన భవనాలను గుర్తించి సిద్దం చేయమని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల ఐటీ పార్కులో గల మేధా టవర్స్ భవన సముదాయాన్ని కూడా పరిశీలించమని ఆదేశించారు. బహుశః అక్కడ తన కార్యాలయాన్ని, సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారేమో.   అయితే ఎక్కడో రాష్ట్రానికి దూరంగా హైదరాబాదులో ఉండి పరిపాలించడమేమిటి? అని ఇంతవరకు విమర్శించినవారే ఇప్పుడు ప్రభుత్వం విజయవాడకు తరలి వచ్చేందుకు సిద్దమవుతుంటే, తెదేపా నేతలకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ఈ ఆలోచన చేశారని విమర్శిస్తున్నారు. అన్ని సౌకర్యాలుగల హైదరాబాదు నుండి మరో పదేళ్ళపాటు పాలన సాగించే అవకాశం ఉండగా, ఇంత హడావుడిగా విజయవాడకు ఎందుకు తరలివస్తున్నారు? అని కాంగ్రెస్ నేతలు బొత్స, రామచంద్రయ్యలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదనకు ఒక్క రాయలసీమ జిల్లాల ప్రజలు తప్ప వైకాపాతో సహా అందరూ ఆయన నిర్ణయాన్ని సమర్దించారు. ఒకవేళ అక్కడ రాజధాని ఏర్పాటు చేసేమాటయితే, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడికే తరలిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్వయంగా ఇదివరకు చెప్పారు. మరి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారంటే, ప్రభుత్వం తీసుకొన్న ఏ నిర్ణయాన్నయినా విమర్శించడమే ప్రతిపక్ష బాధ్యత, అప్పుడే ప్రజల తరపున పోరాడినట్లవుతుంది అనే ఒక అర్ధంలేని సిద్దాంతాన్ని నమ్మడం వలననే.   చంద్రబాబు విజయవాడ-గుంటూరు మద్యనే రాజధాని ఉంటుందని మొదటి నుండి చెపుతున్నారు. కానీ ఆయన తొందరపాటు ప్రదర్శించకుండా ముందు ప్రభుత్వంపై పూర్తి పట్టు పెంచుకొని, ఆ తరువాత విజయవాడకు తరలివెళ్ళడంలో సాధ్యాసాధ్యాలను, దానిలో కష్టనష్టాలను పూర్తిగా అవగాహన చేసుకొన్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నారని భావించవచ్చును. అందుకు ప్రతిపక్షాలు ఎన్ని పెడర్ధాలు, వక్ర బాష్యాలయినా చెప్పుకోవచ్చును. కానీ చంద్రబాబు తను మొదటి నుండి చెప్పిందే చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది.  ప్రభుత్వం విజయవాడకు తరలిరావడం వలన రాష్ట్రప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కొత్త రాజధాని నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించుకోవచ్చును. ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ ఇకపై రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ, జిల్లాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించే వీలుంటుంది. ప్రభుత్వం విజయవాడకు తరలివస్తే ఇటువంటివి అనేక ప్రయోజనాలు ఉండవచ్చును. కానీ ప్రభుత్వం హైదరాబాదు నుండి తరలివచ్చేస్తే అక్కడ స్థిరపడ్డ ఆంధ్రప్రజలు తీవ్ర అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బహుశః అందుకే ఇంతకాలం చంద్రబాబు నాయుడు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉండి ఉండవచ్చును. రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతున్న కొద్దీ నానాటికీ సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవని మొన్న కర్నూలులో జరిగిన ‘లక్ష గొంతుల పొలికేక’ ర్యాలీలు నిరూపించాయి.   ప్రభుత్వం ఎక్కడో అక్కడ త్వరగా స్థిరపడితే కానీ పరిపాలన గాడిన పడదు. సమస్యలు పరిష్కారం కావు. అభివృద్ధి కార్యక్రమాలు మొదలవవు. కనుక ఇప్పటికయినా చంద్రబాబు దైర్యంగా విజయవాడను తాత్కాలికంగానయినా రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చును.   అయితే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నాయకుడు ఇష్ట ప్రకారమే జరగదని, అందరూ ఎక్కడ కోరుకొంటే అక్కడే ఏర్పాటవుతుందని, అవసరమయితే దీనిపై లోతుగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్దం అని చంద్రబాబు ఇదివరకోసారి అన్నారు. ఆ ప్రకారం ఆయన అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొని ఉండి ఉంటే, నేడు ఈవిధంగా విమర్శలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఎందువలనో ఆయన ఆ పనిచేయలేదు.  

రాయలసీమ ప్రజలను రెచ్చగొడుతున్నదెవరు?

  రాజధాని కోసం కర్నూలు రాజధాని సాధన సమితి నేతృత్వంలో ప్రజలు ‘లక్ష గొంతుల పొలికేక’ పేరిట నిన్న కదం తొక్కారు. రాష్ట్రంలో వెనుకబడిన తమ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని లేకుంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తడం తధ్యమని నిన్న ర్యాలీలో పాల్గొన్న కొందరు నేతలు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాల గురించి అందరికీ తెలుసు. అటువంటి ప్రజలు నేడు తమ ప్రాంతంలో రాష్ట్ర రాజధానిని నిర్మించక పోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని చెపుతున్నారంటే నమ్మశక్యంగా లేదు.   రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతటి దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటోందో కళ్ళారా చూస్తూ కూడా వారు మళ్ళీ మరోమారు రాష్ట్ర విభజన కోరుకొంటున్నారంటే, అది వారి తీరని ఆవేదనకు అద్దం పడుతోందని భావించాల్సి ఉంటుంది లేదా కొందరు స్వార్ధ రాజకీయ నేతలు అధికారం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నట్లు అనుమానించవలసి వస్తుంది.   అధికారం కోసం అల్లలాడిపోతున్న కొందరు రాజకీయ నేతలు ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలోకి రాలేమని గ్రహించి విచ్చినకర పద్దతులు అవలంభిస్తే, అటువంటి వారిని ప్రజలే నిలదీయాలి. కొందరు నేతల స్వార్ధం కోసం దేశాన్ని, రాష్ట్రాలను ఈ విధంగా విభజించుకొంటూ పోయినట్లయితే చివరికి ఏమవుతుందని విజ్ఞులయిన ప్రజలే ఆలోచించుకోవాలి. రాష్ట్ర విభజన, రాజధాని కనీసం జిల్లా గురించి గురించి ఏమాత్రం అవగాహన లేని విద్యార్దులను సైతం ఇటువంటి ఆందోళనలో పాలుపంచుకొనేలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని ఆలోచిస్తే తెర వెనుక రాజకీయ హస్తాలున్నాయని అర్ధమవుతుంది.   రాష్ట్రవిభజనతో ఒకసారి చాలా దారుణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, స్వార్ధ రాజకీయ నాయకులకు, పార్టీల మాయమాటలు నమ్మి మళ్ళీ విభజనకు ఉద్యమిస్తే దానివలన నష్టపోయేది సామాన్య ప్రజలే తప్ప రాజకీయ నాయకులు కాదు. ఇది కళ్ళెదుట ప్రత్యక్షంగా కనబడుతున్న చరిత్ర.   ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులతో కూడిన ఒక వ్యవస్థ. కనుక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా తమతమ ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేసినట్లయితే మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందగలవు. కానీ ప్రజా ప్రతినిధులు తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోకుండా రాష్ట్రవిభజన జరగాలని కోరుకొంటే అది క్షమించరాని నేరం. అందువల్ల రాజధానిని ఎక్కడ నిర్మించినప్పటికీ ప్రజలందరూ తమ తమ జిల్లాల అభివృద్ధి జరిగేలా ప్రజాప్రతినిధులపై గట్టిగా నిరంతరం ఒత్తిడి తేవడమే మంచి పద్ధతి.

కేంద్రంపై పోరాటంలో తెలంగాణా ప్రభుత్వానికి భంగపాటు తప్పదా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలపాలంటే దానిలో కొన్ని సవరణలు చేయాలని ఆనాడు బీజేపీ పట్టుపట్టింది. కానీ నాటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కొన్ని హామీలు ఇవ్వడంతో ఆ బిల్లులో ఎటువంటి సవరణలు చేయకుండానే పార్లమెంటు ఆమోదం పొందేందుకు బీజేపీ మద్దతు ఇచ్చి సహకరించింది. అయితే ఆ సంగతి మరిచిపోయి హైదరాబాదు పరిధిలో గవర్నరుకు అధికారాలు కట్టబెడుతూ తెలంగాణా ప్రభుత్వానికి ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలుకు అదే ప్రధాన అవరోధం కానుందని, కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావాలంటే లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో సవరణలు చేయక తప్పదని మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు యస్. సుదర్శన్ రెడ్డి మరియు యన్. సంతోష్ హెగ్డేలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం కేంద్రప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసి స్టే పొందే వీలుంటుందని వారు స్పష్టం చేసారు.   అందువల్ల పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే కేంద్రప్రభుత్వం విభజన బిల్లుకు సవరణలు చేయవలసి ఉంటుంది. లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న ఎన్డీయే కూటమికి అదేమీ పెద్ద కష్టమయిన పని కాదు. అదేవిధంగా ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేకపోయినప్పటికీ, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ అండతో పోలవరం బిల్లును గట్తెక్కించినట్లే, అక్కడ కూడా ఈ సవరణలను ఆమోదింపజేయడం పెద్ద కష్టమయిన పనేమీ కాదు. అందువల్ల ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈవిషయంలో దానికి అక్కడా చుక్కెదురు కావచ్చును.   ఇక గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని పార్లమెంటులో నిరసించాలని కేసీఆర్ తన పార్టీ యంపీలను కోరారు. కానీ దానివలన సభ స్తంభింపజేయడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదని గతంలో పోలవరం వ్యవహారంలో రుజువయింది. తెరాస యంపీలు పార్లమెంటులో ఎంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అవసరమయితే కాంగ్రెస్, బీజేపీలు కలిసి విభజన బిల్లుకు సవరణలు చేయవచ్చును.   ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, వారి మద్దతుతో ఈ అంశంపై కేంద్రంతో పోరాడాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే మళ్ళీ అక్కడ కూడా తెలంగాణా ప్రభుత్వానికి ఇంచుమించు అటువంటి అనుభవమే ఎదురు కావచ్చును. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయన సమావేశానికి హాజరుకారు గనుక ఇక మిగిలినవారిలో ఎంతమంది ఆయన సమావేశాని వస్తారనేది ప్రశ్నే. ఎందువలన అంటే అనేక చిన్నా పెద్ద రాష్ట్రాలు తమ రాష్ట్రాభివృద్ధికి, వివిధ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రం సహాయసహకారాలు ఆశిస్తున్నాయి. అటువంటప్పుడు తమకు సంబందంలేని తెలంగాణా సమస్యలో తలదూర్చి, కేసీఆర్ మాటలకు తలొగ్గి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతాయని భావించలేము. ఒకవేళ నాలుగైదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ తో కలిసి వచ్చినా, వారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీయడం అసంభవమని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు.   కేసీఆర్ ఈ అంశాన్ని ఏవిధంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారో, కేంద్రప్రభుత్వం కూడా తను జారీ చేసిన ఉత్తర్వులు అమలును అంతే ప్రతిష్టాత్మకంగా భావించడం సహజం. కనుక తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో, పార్లమెంటులో, చివరికి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా భంగపాటు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక కేంద్రంపై పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దం?

  హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతలపై సర్వాధికారాలు గవర్నరుకు కట్టబెడుతూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్నితెలంగాణా ప్రభుత్వం వ్యతిరేఖించడం సహజమే. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కత్తెర వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. నిజానికి సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ చర్యను అందరూ ఖండించేవారే, కానీ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఈవిధంగా చేయాలని ముందే నిర్ణయం జరిగింది. అదే విషయాన్నీ విభజన బిల్లులో కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఆ బిల్లును ఆంద్ర యంపీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపుడు తెలంగాణా యంపీల మద్దతుతోనే పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ తరువాత ఆ ఖ్యాతిని స్వంతం చేసుకొనేందుకు తెరాస, కాంగ్రెస్ పార్టీలు పోటీలు పడిన విషయం కూడా అందరికీ తెలుసు.   తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు కేవలం ఈ ఒక్క అంశమే కాకుండా, తెలంగాణకు ఇబ్బంది కలిగించే పోలవరం, ఉమ్మడి రాజధాని, ఉన్నత విద్యా సంస్థలలో ఉమ్మడి ప్రవేశాలు, నీరు, విద్యుత్, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు వంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఆనాడు తెరాస అభ్యంతరాలు చెప్పినప్పటికీ, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చాలన్నట్లు వ్యవహరించడంతో, బిల్లులో పేర్కొన్న విధంగానే రాష్ట్ర విభజన జరిగింది. ఆ షరతులతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం చాలా ఘనంగా తెలంగాణా సంబురాలు నిర్వహించింది కూడా. అంటే ఆ బిల్లును తెరాస యధాతధంగా అంగీకరిస్తున్నట్లేనని భావించక తప్పదు. కానీ తెరాస తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిల్లులో ఉన్న ఈ ఇబ్బందికరమయిన అంశాలను వ్యతిరేఖించడం మొదలుపెట్టింది. తత్ఫలితంగా అటు కేంద్రంతో ఇటు పొరుగునున్న ఆంద్రప్రభుత్వంతో ఘర్షణ తప్పడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం, ఆంద్ర ప్రభుత్వాలే రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణా ప్రభుత్వ వాదన.   విభజన బిల్లులో పేర్కొన్న అనేక అంశాల పట్ల తెరాస మొదటే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసి, వాటిని తనకు అనుకూలంగా సవరించిన తరువాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి ఉండి ఉంటే నేడు ఇటువంటి సమస్యలు తలెత్తేవి కావు. ఇక గవర్నరుకు హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థపై సర్వాధికారాలు కట్టబెట్టడాన్ని తాము అంగీకరించబోమని తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల వలన సాధించేదేమీ ఉండబోదు.   ఇప్పటికే విభజన బిల్లులో పేర్కొన్న అనేక అంశాలతో విభేదిస్తూ తీసుకొన్న నిర్ణయాల వలన హైకోర్టు, సుప్రీం కోర్టులలో తెలంగాణా ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. పార్లమెంటు ఆమోదించిన విభజన బిల్లులో పేర్కొనబడిన ఈ అంశంపై కూడా తెలంగాణా ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్దమయితే ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చును. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం వేలు పెట్టడం ఎవరూ సమర్దించరు. కానీ, చట్టబద్దంగా చేసిన విభజన బిల్లులో వేలు పెట్టడాన్ని కూడా ఎవరూ సమర్దించబోరనే సంగతి గ్రహించి తదనుగుణంగా వ్యవహరిస్తే ఏ సమస్యలు ఉండవు.

చట్టాలతో అత్యాచారాలు అరికట్టడం సాధ్యమేనా?

  గతేడాది డిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం తరువాత దేశ వ్యాప్తంగా మొదలయిన నిరసనలకు జడిసి అప్పటి యూపీఏ ప్రభుత్వం మహిళా రక్షణ, బాలనేరస్థుల చట్టాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చేతులు దులుపుకొంది. అయితే వాటి వలన దేశంలో అత్యాచారాలు ఆగలేదు, కనీసం తగ్గలేదు కూడా. ఇక నిర్భయ కేసును విచారించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినప్పటికీ నిందితులుగా నిర్ధారించబడిన నులుగురిలో ఏ ఒక్కరికీ ఇంతవరకు కూడా శిక్షలు కూడా పడలేదు. వారిలో ఒకరు బాల నేరస్థుడయిన కారణంగా కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో బయటపడబోతున్నాడు. ఇటువంటి హేయమయిన నేరాలకు పాల్పడినవారిని మన న్యాయ వ్యవస్థ తక్షణమే కటినంగా శిక్షించలేని దుస్థితిలో ఉన్నందునే ఆనాటి నుండి దేశంలో మహిళలు, అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గత మూడు నెలల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సామూహిక అత్యాచారాలు, హత్యలు ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్నితల దించుకొనేలా చేస్తున్నాయి.   అందువల్ల ఇకనయినా ఈ అత్యాచారాలను అరికట్టాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బాలనేరస్థుల చట్టాలకు మరింత పదును పెట్టింది. మొన్న మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో బాలనేరస్థుల వయసును 18 నుండి 16కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. అందువల్ల ఇకపై ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న బాలనేరస్థులను యువకులుగానే పరిగణిస్తూ బాలనేరస్థుల కోర్టులు శిక్షలు విదించవచ్చును. బాలనేరస్థులను శిక్షించే వీలు కల్పిస్తూనే, సమాజంలో బాలలకు రక్షణ కల్పించే విధంగా మోడీ ప్రభుత్వం చట్టంలో కొన్ని సవరణలు చేసింది. బాలల చేత మద్యం, మత్తుమందులు రవాణా, వారిని మానసికంగా, శారీరకంగా వేధించడం వంటి చర్యలను నేరాలుగా గుర్తిస్తూ చట్టంలో సవరణలు చేసారు. అదేవిధంగా దేశంలో పుట్టగొడుగులు మాదిరి వెలుస్తున్న శిశు, బాలల సంక్షేమ కేంద్రాలన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద తగిన అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అనుమతులు లేకుండా నడుస్తున్న అటువంటి కేంద్రాలపై కేసులు నమోదు చేసి చట్టపరకారం చర్యలు తీసుకోబడతాయి.   అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ సమాజం ఆలోచనాధోరణిలో మార్పు రానంత కాలం ఈ అత్యాచారాలు కొనసాగుతూనే ఉంటాయి. అందువలన ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేసి దోషులను శిక్షించడంతోనే సరిపెట్టకుండా, ప్రాధమిక స్థాయి నుండే బాలలలో నైతిక విలువలు పెంపొందించే విధంగా మన విద్యా వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేయాలి. కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్న ఈ విపత్కాలంలో, కనీసం కళాశాలలో ‘నైతిక విలువలను కూడా ఒక సబ్జెక్టుగా భోదిస్తే కనీసం వచ్చే తరం మహిళలకయినా దేశంలో భద్రత ఏర్పడుతుంది.  

కలెక్టర్ల సదస్సుకు ఇంత ఆర్భాటం అవసరమా?

  ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ప్రధానోదేశ్యం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న ఏడు రంగాలపై లోతుగా చర్చించి, వాటి అభివృద్ధికి అవసరమయిన కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవడం. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, పర్యాటక, మానవవనరుల అభివృద్ధి, స్కిల్ డెవెలప్మెంట్, పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పధకాల అమలు వగైరా అంశాలపై ఈ సదస్సులో చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఉన్నతాధికారులు అందరూ పాల్గొంటున్న ఈ సదస్సులో అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ ప్రసంగించిన తరువాత వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు తమ శాఖలు చేప్పట్టిన, చేప్పట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పవర్ పాయింటు ప్రజంటేషన్ ఇస్తారు.   కీలకమయిన ఈ సదస్సును విజయవాడలో నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువలోనే ఉందనే సంకేతం పంపడం ఒక ఉద్దేశ్యం అయితే, నేటికీ చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు-విజయవాడ వద్దనే రాజధాని నిర్మించాలని భావిస్తునట్లు అర్ధమవుతోంది.   తీవ్ర ఆర్ధిక సమస్యలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం సరిగ్గా వారం రోజుల క్రితమే అన్ని ప్రభుత్వ శాఖలు తక్షణమే పొదుపు చర్యలు పాటించాలని ఆదేశిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అందువల్ల ఈ సదస్సు కూడా చాలా నిరాడంబరంగా నిర్వహించవచ్చని ఎవరయినా భావిస్తారు. కానీ ప్రభుత్వం చాలా అట్టహాసంగా నగరంలో ఉన్న ‘తాజ్ గెట్ వే’ స్టార్ హోటల్లో ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి వస్తున్న వీఐపీల కోసం నగరంలో ఉన్న మురళి ఫార్ట్యూన్, డీవీ మెనోర్, మినర్వా, ఐలాపురం వంటి స్టార్ హోటల్స్ లో ప్రత్యేక గదులు బుక్ చేసారు. వారందరి కోసం ప్రభుత్వం దాదాపు 500 వాహనాలను కూడా సిద్దంగా ఉంచింది. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఒకేసారి విజయవాడ తరలివస్తున్నారు కనుక సహజంగానే అందుకు తగ్గట్లు భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు, వాటి వలన నగరవాసులకు అవస్థలు తప్పవు. ఈవిధంగా ప్రభుత్వం తను స్వయంగా జారీ చేసిన పొదుపు మార్గదర్శకాలను తనే స్వయంగా తుంగలో తొక్కి ఇంత అట్టహాసంగా సదస్సు నిర్వహించడం వలన తన ఆదేశాలకు తనే విలువ లేకుండా చేసుకొంది.   ప్రభుత్వమే స్వయంగా ఇంత అట్టహాసంగా సదస్సు నిర్వహిస్తున్నందున, ఇక క్రింద స్థాయి అధికారులను, ఉద్యోగులను పొదుపు పాటించమని చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు సచివాలయంలో హుండీలు ఏర్పాటు చేసుకొనే దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఈవిధంగా ప్రతీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వాహించడం దేనికో పాలకులకే తెలియాలి. ఇంత అట్టహాసంగా నిర్వహించిన సదస్సు వలన పరిపాలనలో కానీ ప్రభుత్వ పనితీరులో గానీ గొప్ప మార్పులు వచ్చి వాటి వలన ప్రజలకు ఏమయినా మేలు జరుగుతుందో లేక ఇది కూడా మరొక నిరుపయోగమయిన సదస్సుగా మిగిలిపోతుందో చూడాలి. ప్రభుత్వోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా వెతుక్కోవలసిన పరిస్థితి ఉందని నిత్యం చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత భారీ ఖర్చుతో ఇంత ఆర్భాటంగా ఈ సదస్సు నిర్వహించడం సహజంగానే విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.  

కాంగ్రెస్, వైకాపాలకు ఆయుధంగా అందివచ్చిన రుణమాఫీ

  వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేయడం కుదరదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాఘురామ రాజన్ విస్పష్టంగా ప్రకటించారు. బ్యాంకులు మరియు వివిధ సంస్థల నుండి తాము సేకరించిన నివేదికల ప్రకారం ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు పేర్కొన్నట్లు రుణాలను రీ షెడ్యూల్ చేయవలసిన పరిస్తితులేవీ తమకు కనబడలేదని, ఒకవేళ రీ షెడ్యుల్ చేసినట్లయితే అది రైతులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని అందువలన రీ షెడ్యుల్ చేయదలచుకోలేదని గవర్నర్ రాజన్ ప్రకటించారు. కానీ ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు రుణాల మాఫీపై ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితిలో లేనందున అవి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాతో పోలిస్తే కొంచెం తక్కువ రుణభారం, మిగులు బడ్జెటు ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఒకేసారి రూ.10, 000 కోట్లు బ్యాంకులకు చెల్లించి మిగిలిన మొత్తాన్ని రెండు లేదా మూడు వాయిదాలలో చెల్లించాలని భావిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోటు బడ్జెటుతో బాటు మూడింతల ఋణ భారం, ఈ అంశంపై గట్టిగా నిలదీసేందుకు బలమయిన ప్రతిపక్షం కూడా ఉంది. అందువల్ల ఈ సమస్య మరింత జటిలంగా మారింది. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క అవినీతిలో తప్ప మిగిలిన అన్ని రంగాలలో అభివృద్ధి కుంటు పడింది. అందువల్ల మళ్ళీ పరిపాలన గాడిన పడి, అభివృద్ధి జరిగేంతవరకు ప్రభుత్వం ఈ ఆర్దికలోటును పూడ్చుకోవడం అసాధ్యం.   ఇక ఈ రుణమాఫీ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ది పొందుదామని చూస్తున్న ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మరొక సమస్య సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన వల్ల కోలుకోలేని విధంగా గట్టి దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ, అహంకారంతో, అతి విశ్వాసంతో అధికారాన్ని చేజార్చుకొని బాధపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఈ వ్యవసాయ రుణాల వ్యవహారం, మళ్ళీ రాజకీయంగా నిలద్రొక్కుకొనేందుకు మంచి ఆయుధంగా అందిరావడంతో, రెండు పార్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్న రైతులను కలుపుకొని ఉద్యమించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఒకవేళ రైతులు కూడా వాటితో కలిసి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టినట్లయితే, ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం తధ్యం.   ఇక ఈనెల 18నుండి రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. కనుక ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలలో గెలిచిన తరువాత విజయోత్సాహంతో ఉరకలు వేసిన తెదేపా ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవహారం వలన ఆత్మరక్షణలో పడినట్లయింది. మరొక రెండు నెలలలో ఈ రుణమాఫీ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రతిప్పాటి పుల్లారావు చెప్పడం, రైతులలో చాలా ఆందోళన రేకెత్తిస్తుంటే, కాంగ్రెస్, వైకాపాలకు అది మరొక ఆయుధంగా అందివచ్చింది. రైతుల ఆందోళనను ప్రతిపక్షాలు తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేయడం తధ్యం.   అందువల్ల ప్రభుత్వం తను ఎంచుకొన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్య నుండి వీలయినంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయడమే అన్ని విధాల మంచిది. లేకపోతే ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది.

చంద్రబాబు వెర్సస్ కేసీఆర్

  ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చెప్పట్టడంతో వారిరువురి పనితీరును, వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారిరువురిని ఒకరితో మరొకరిని పోల్చి చూసినపుడు చంద్రబాబు నాయుడు చాలా నిదానంగా ఆచితూచి వ్యవహరిస్తుంటే, కేసీఆర్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను ప్రకటించడంలో, అమలు చేయడంలో కూడా చాలా నిదానంగానే ముందుకు సాగుతున్నారు.   ఆంధ్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడుతూ కేసీఆర్ ముందుకు సాగుతుంటే, చంద్రబాబు మాత్రం చాలా సంయమనంతో వ్యవహరిస్తూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొందామని సామరస్య ధోరణి ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకొంటున్నారు. ఫీజు రీ-ఇంబర్స్ మెంటు విషయంలో కేసీఆర్ రాజీలేని ధోరణిని ప్రదర్శిస్తుంటే, దాని వల్ల ఇరు రాష్ట్రాల నడుమ ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు చంద్రబాబు చొరవ తీసుకొని 58:42 నిష్పత్తిలో ఫీజు చెల్లిద్దామని ప్రతిపాదన చేయడం, విద్యార్ధుల భవిష్యత్ కాపాడేందుకు అవసరమయితే మరో మెట్టు దిగేందుకు తాను సిద్దమని ప్రకటించడం ఆయన రాజనీతికి అద్దం పడుతోంది. ఆ ప్రతిపాదనను కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా ఈ విషయంలో కనీసం చర్చలకయినా చొరవ చూపకపోవడం గమనిస్తే ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలిలో ఉన్న తేడా అర్ధమవుతుంది.   చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో సయోధ్య పాటిస్తూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు డిల్లీలో రాష్ట్రం తరపున ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావును నియమించారు. కానీ, కేసీఆర్ మాత్రం కేంద్రంతో కూడా ఘర్షణ వైఖరి అవలంభించడమే కాకుండా, తెలంగాణా అభివృద్ధికి అసలు కేంద్రం మద్దతు అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రెండు నెలల వ్యవధిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుంటే, చంద్రబాబు కూడా మొదటిలో చాలా దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఆ తరువాత కొంచెం చల్లబడిపోయినట్లు కనబడుతున్నారు. బహుశః ప్రభుత్వం యొక్క ఆర్ధిక దుస్థితి ఆయనకు స్పీడుకు బ్రేకులు వేస్తుండవచ్చును.   కేసీఆర్ తెలంగాణా అభివృద్ధి, సంక్షేమ పధకాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిపాలనపరమయిన ఆడ్డంకులను ఒకటొకటిగా తొలగించి గాడి తప్పిన పాలనను తిరిగి గాడినపెట్టేందుకు కృషిచేస్తున్నారు. అక్షయపాత్ర వంటి హైదరాబాద్ కూడిన తెలంగాణా కేసీఆర్ కు వడ్డించిన విస్తరిలా దక్కితే, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆంద్రప్రభుత్వం చంద్రబాబుకి దక్కింది. ఇరు ప్రభుత్వాల ఆర్ధిక స్థితిలో ఉన్న ఈ తేడా బహుశః ముఖ్యమంత్రుల పనితీరులో ప్రతిఫలిస్తోందని చెప్పవచ్చును.

ఐటీ పాలసీలో చిన్న కంపెనీలపట్ల సవతి ప్రేమ ఏల?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాడిందే పాట అన్నట్లు, పాత నిర్ణయాలనే మరోమారు వల్లె వేశారు. గతంలో చెప్పిన అక్టోబర్ 2నుండి నిరంతర విద్యుత్ సరఫరా,వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్‌ సరఫరా, విజయవాడ, కాకినాడ, అనంతపురం, తిరుపతిలో ఐటీ హబ్‌లు, విశాఖలో మెగా ఐటీ పార్క్‌ ఏర్పాటు, విశాఖ, విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు, సింగిల్‌ విండో విధానం, మొక్కలు నాటే కార్యక్రమం వంటి విషయాలనే మళ్ళీ మరోమారు చెప్పారు. కానీ, ఐటీ శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది 5 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీలకు 60% రాయితీ ఇవ్వడం. సాధారణంగా మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి అతిపెద్ద ఐటీ కంపెనీలలో తప్ప చిన్న మధ్యస్థ స్థాయి ఐటీ కంపెనీలలో అంతమంది ఉద్యోగులు ఉండరు. అంటే ప్రభుత్వం అటువంటి పెద్ద సంస్థలకే ప్రాధాన్యం ఇస్తోంది తప్ప చిన్న కంపెనీల పట్ల దానికి ఆసక్తి లేదని ఈ పాలసీ ద్వారా స్పష్టమవుతోంది. అయితే అటువంటి యాంకర్ కంపెనీలను ఆకర్షించ గలిగితే, వాటిని అనుసరించి అనేక చిన్న, పెద్దా కంపెనీలు అనేకం వస్తాయనేది వాస్తవమే. అందువలన అటువంటి పెద్ద సంస్థలను ఆకర్షించేందుకు రాయితీలు ఇవ్వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. వచ్చే ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల ఐటీ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రాన్ని  సిలికాన్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ప్రభుత్వం, చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల కోసం ఈ పాలసీలో ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. నిజానికి ఒక పెద్ద సంస్థను ఆకర్షించడానికి ఈవిధంగా ప్రయాసపడటం కంటే, ప్రభుత్వం సహకారం అందిస్తే వందలకొద్దీ చిన్న మధ్యస్థ ఐటీ కంపెనీలు స్థాపించేందుకు రాష్ట్రంలో అనేకమంది పారిశ్రామిక వేత్తలు, యువ ఇంజనీర్లు సిద్దంగా ఉన్నారు. వారు తమ సంస్థలను కేవలం వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద పట్టణాలలోనే కాకుండా వెనుకబడిన జిల్లాలలో కూడా స్థాపించేందుకు సిద్దంగా ఉన్నారు. అటువంటి ఔత్సాహికులకు ప్రభుత్వం అండగా నిలిచి, వారికి తగిన వసతులు కల్పిస్తే ఐటీ పరిశ్రమ రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీల స్థాపన చాలా సులభం. వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టగలవు. కనుక ఆయా ప్రాంతాలలో ఉండే యువతకు వెంటనే ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి తక్షణమే ఆదాయవనరు ఏర్పడుతుంది. అదేవిధంగా యువతకు ఐటీ రంగంలో సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు విద్యాసంస్థలు ఏర్పడి వాటి ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుంది.   ఇక ప్రభుత్వం కొత్త ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో నడుస్తున్న ఐటీ కంపెనీల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని అనేక సంస్థలు వాపోతున్నాయి. వారిని తెలంగాణా ప్రభుత్వం ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ప్రభుత్వం వారిపట్ల ప్రత్యేకశ్రద్ధ వహించి వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తక్షణమే చెపడితే వాటిని కాపాడుకోవడమే కాకుండా, అది కొత్త సంస్థలకు మంచి సంకేతం అందజేసినట్లవుతుంది. ఇక ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచి నిర్ణయమే. కానీ ఈ రాయితీలు అందరికీ ముఖ్యంగా చిన్న మధ్యస్థ ఐటీ కంపెనీలకు వర్తింపజేయడం వల్ల రాష్ట్రంలో త్వరగా ఐటీ పరిశ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఐటీ రంగానికి పాలసీ ప్రకటించినప్పటికీ, చిన్న, మధ్యస్థ కంపెనీల యజమానులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వారి అవసరాల మేరకు తన పాలసీలో మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగినట్లయితే, ఆ పాలసీ మరింత అర్ధవంతంగా మారి, ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా పూర్తి ప్రయోజనం చేకూర్చగలదు.

చంద్రబాబు నాయుడు చొరవ అభినందనీయం

  ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై తెలంగాణా ప్రభుత్వం పెట్టిన స్థానిక మెలికతో ఇంజనీరింగ్ కౌన్సిలింగు చాలా గందరగోళంగా మారింది. ఆంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సిలింగుకు తెలంగాణా విద్యార్దులెవరూ వెళ్ళవద్దని స్వయంగా తెలంగాణా విద్యాశాఖ మంత్రే పిలుపునీయడంతో లక్షలాది విద్యార్ధులు అయోమయంలో పడ్డారు. తెలంగాణా ప్రభుత్వం 1956సం.ను స్థానికతకు ప్రతిపాదికగా తీసుకోవడంతో తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంధ్రా విద్యార్ధులే కాక, తెలంగాణా విద్యార్ధులు కూడా అయోమయంలో పడ్డారు. కౌన్సిలింగుకు వెళితే ఒక సమస్య వెళ్ళకపోతే మరొక సమస్య అన్నట్లు తయారయింది వారి పరిస్థితి.   తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యలను సామరస్య ధోరణితో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, ఆంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆంధ్రరాష్ట్ర మంత్రులు కూడా వారి విమర్శలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు. అయితే ఈ వివాదాల వలన లక్షలాది విద్యార్ధుల జీవితాలు అస్తవ్యస్తమవుతాయనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని, జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఇరు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ఖర్చు భరిద్దామని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి అంచనా ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం ఉంటుందని, దానిలో తమ ప్రభుత్వం 52శాతం భరించేందుకు సిద్దంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఆయన ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయం. తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈ సమస్యకు బహుశః ఇదే పరిష్కారం సూచించవచ్చును. అందువల్ల తెలంగాణా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొంటే అందరూ హర్షిస్తారు.

ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చిచ్చు

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య గిల్లి కజ్జాలకు అంతే కనబడటం లేదు. ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు రోజుకో కొత్త సమస్య సృష్టించుకొని డిల్లీలో పంచాయితీ పెట్టుకొంటూ, తెలుగు ప్రజల పరువు తీస్తున్నాయి. విద్యుత్, కృష్ణాజలాల పంపకాలు, స్థానికత, ఫీజ్ రీ-ఇంబర్స్మెంటు, ఆంద్ర వాహనాలపై పన్ను నేడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వివాదం, రేపు మరొకటి...ఎల్లుండి ఇంకొకటి...ఈ వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుండి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించగానే, దానిలో తాము పాలుపంచుకోబోమని, తెలంగాణాకు వేరేగా కౌన్సిలింగ్ నిర్వహించుకొంటామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగడాన్ని తెలంగాణా ప్రభుత్వం తప్పు పట్టింది. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణాలో ఉన్న కాలేజీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా అడ్మిషన్లు నిర్వహిస్తోందని తెలంగాణా విద్యాశాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో తెలంగాణా విద్యార్ధులు, కాలేజీలు పాలుపంచుకోవద్దని పిలుపునిచ్చారు కూడా. దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి తెలంగాణాలో స్థిరపడిన వారందరి భారం తమ ప్రభుత్వం ఎందుకు భరించాలి? అని ప్రశ్నించారు. విద్యార్ధుల స్థానికతను నిర్దేశించేందుకు తమ ప్రభుత్వం 1956సం.ను. ప్రామాణికంగా తీసుకొంది గనుక ఆ ప్రకారమే కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజ్ రీ ఇంబర్స్మెంటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందనే ఆయన ప్రశ్నకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే సమాధానం చెప్పవలసి ఉంటుంది.  ఇక ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు కూడా చాలా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశాలపై మరో పదేళ్ళ వరకు యదాతధ స్థితిని కొనసాగించాలని ఉంటే, తెలంగాణా ప్రభుత్వం అందుకు విరుద్దంగా స్థానికత అంశాన్ని లేవనెత్తి లక్షలాది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మంత్రి రావెల్ల కిషోర్ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఆంధ్రప్రాంత ప్రజలను, వారి పిల్లలను, తెలంగాణా ప్రభుత్వం సెకండ్ క్లాస్ సిటిజన్ల స్థాయికి దిగజార్చి వారి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేఖంగా తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. హైదరాబాద్ మరియు ఇతర జిల్లాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరు ప్రభుత్వాల వాదనలు చాలా తర్కబద్దంగానే ఉన్నాయి. కానీ వాటి వలన సమస్య పరిష్కారం కాకపోగా మరింత గందరగోళంగా మారుతోంది. తెలంగాణా ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించడానికి తమ వద్ద సరిపోయినంత మంది అధికారులు సిబ్బంది లేనందున కౌన్సిలింగ్ వాయిదా వేయమని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేసింది. కానీ తెలంగాణా మంత్రుల వాదనలు విన్నట్లయితే, ఆ విధంగా కౌన్సిలింగ్ వాయిదా కోరడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం అవుతోంది. స్థానికత ఆధారంగా ఆంద్ర, తెలంగాణా విద్యార్ధులను విభజించి కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలనే ఆలోచనతోనే గడువు కోరుతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణా ప్రభుత్వం తన విద్యార్థులకే ప్రయోజనం చేకూరాలని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు. ఏ ప్రభుత్వమయినా ఆ విధంగానే ఆలోచిస్తుంది. అయితే తెలంగాణాలో పుట్టి పెరిగి అక్కడే విద్యాబ్యాసం చేసిన ఆంద్ర విద్యార్ధుల బాగోగులు ఏ ప్రభుత్వం చూడాలి? అనే ప్రశ్నకు రెండు ప్రభుత్వాలు ఎదుటవారి వైపు వేలు చూపుతున్నాయి. రెండు ప్రభుత్వాలు వారి బాధ్యతను సమానంగా పంచుకోవడానికి సిద్దపడినట్లయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కానీ ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలను నడుపుతున్నతెదేపా, తెరాసల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా వాటి మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనబడటం లేదు. తత్ఫలితంగా ఆబోతుల పోరులో లేగ దూడలు నలిగిపోతున్నట్లు, ఇరు ప్రభుత్వాల మధ్య పోరులో లక్షలాది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితులు, ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఈ సమస్యలను, వివాదాలను సుప్రీంకోర్టు సైతం తీర్చలేదని అనిపిస్తోంది. అయితే ఇరు ప్రభుత్వాలు ఇదే యుద్దవైఖరి కొనసాగించినట్లయితే ఎవరూ ఊహించని అనర్ధాలకు దారి తీసినా ఆశ్చర్యం లేదు. 

చంద్రబాబు వెర్సస్ చంద్రశేఖర్

  జూన్2న ఆంద్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అదేరోజున కేసీఆర్, మరో వారం రోజుల తరువాత చంద్రబాబు నాయుడు తెలంగాణా, ఆంధ్రా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, అవసరాలు ఉన్నాయి. రెండూ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అందువల్ల సహజంగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాల, వాటి ముఖ్యమంత్రుల పనితీరును పోల్చిచూడటం జరుగుతుంది.     వారిరువురిలో చంద్రబాబు నాయుడుకి అపారమయిన పరిపాలనానుభావం ఉంది. మంచి కార్యదక్షుడనే పేరు కూడా ఉంది. అందువల్ల సహజంగానే కేసీఆర్ కంటే చంద్రబాబు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొని గత పదేళ్ళలో అసమర్ధ కాంగ్రెస్ పాలన వల్ల, ఉద్యమాల వల్ల, గాడి తప్పిన పాలనను ఆయన చక్కదిద్దుతారని రాష్ట్ర ప్రజలందరూ ఆశిస్తున్నారు. కానీ దాదాపు రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి కదలికలేకపోవడంతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు వేలెత్తి చూపే అవకాశం కలుగుతోంది. బహుశః ప్రభుత్వ సమయమంతా వ్యవసాయ రుణాలమాఫీ కోసం నిధుల అన్వేషణకి, ఈ అంశంపై కాంగ్రెస్, వైకాపాల విమర్శలను త్రిప్పి కొట్టడానికే సరిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆర్ధిక ప్రతిబంధకాల కారణంగా రాజధాని విషయంలో కూడా అడుగుముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడటంతో చివరికి ఈ అంశంపై కూడా ప్రతిపక్ష విమర్శలు ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలేవీ లేకపోవడమే కాక మిగులు బడ్జెట్ కూడా ఉన్నందున చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటూ వాటిని అంతే చురుకుగా అమలు చేస్తోంది. గత రెండు నెలల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండుసార్లు సమావేశమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలలో వ్యవసాయ రుణాలు, సుజల స్రవంతి, ఉద్యోగుల పదవీకాలం పెంపు, పెన్షన్ల పెంపు అనే నాలుగు ముఖ్యమయిన అంశాలపై మాత్రమే నిర్ణయం తీసుకొంటే, కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రెండు సమావేశాలలో దళితులకు వ్యవసాయ భూములు కేటాయింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కొత్త వాహనాల కొనుగోలుకు పోలీసు శాఖకు రూ.300 కోట్లు కేటాయింపు, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, కొత్తగా వివిధ బోర్డులు, కమీషన్ల ఏర్పాటు వంటి 50కి పైగా ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొని అప్పుడే వాటి అమలుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా మొదలుపెట్టేసారు. చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ కు పరిపాలనానుభావం లేనట్లే భావించవచ్చును. కానీ ఆయన అపార అనుభవజ్నుడిలా చకచకా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేసేలా ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తున్నారు. అంతేకాక అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ భూముల స్వాధీనం, ఫీజు రీ-ఇంబర్స్మెంట్ వంటి నిర్ణయాలపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్న చాలా దృడ చిత్తంతో వ్యవహరిస్తూన్నారనే ప్రశంసలు కూడా అందుకొంటున్నారు. కానీ రెండు నెలలు కావస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా కార్యాచరణలో దిగకుండ మీనమేషాలు లెక్కిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ చకచకా నిర్ణయాలు తీసుకొంటూ అందరినీ ఆకట్టుకొంటుంటే, చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వాల పనితీరుపై శ్వేతపత్రాలు విడుదల చేయడానికే పరిమితమయిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ వీలయినంత త్వరగా ప్రభుత్వం రాష్ట్రంలోకి తరలివచ్చి పని మోదలుపెట్టాలని ఆశిస్తుంటే, చంద్రబాబు వారానికి రెండు రోజులు జిల్లాల పర్యటనలు చేస్తూ సరిపెడుతున్నారు. వ్యవసాయ రుణాలమాఫీ, రాజధాని నిర్మాణం ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఆయా రంగాలలో నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి ఆ బాధ్యతలు అప్పగించి, చంద్రబాబు పూర్తిగా పాలనా వ్యవహరాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తే పరిస్థితులు క్రమంగా మెరుగుపడవచ్చును. అలాకాక ప్రభుత్వం ఇదే సందిగ్ధంలో ఇంకా కొనసాగినట్లయితే, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగక మానదు, విమర్శలు ఎదుర్కోక తప్పదు.

కాంగ్రెస్-తెదేపా పాలన బేరీజుకే శ్వేతపత్రాలు

    గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేసింది. కాంగ్రెస్ చెప్పుకొన్నట్లు ఒకవేళ అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదేమో. ప్రజలనెత్తిన ఇంత ఆర్దికభారం పడి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. కానీ అభివృద్ధి పేరిట నేతలు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని ఏవిధంగా భోం చేసారో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసపెట్టి విడుదలచేస్తున్న శ్వేతపత్రాల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపుతున్నారు.   నేటికీ చాలా మంది ప్రజలలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో గణనీయమయిన అభివృద్ధి జరిగిందనే బలమయిన అభిప్రాయం ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజన్న రాజ్యం ఓ స్వర్ణయుగమనట్లు ప్రచారం చేసుకొని ఎన్నికలలో గెలవాలని చూసారు. నిజంగా అది స్వర్ణయుగమే అయితే, ఆయన తరువాత అధికారం చేప్పట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల సమయానికే దాని ప్రభావం ఎందుకు కనిపించకుండా పోయింది? అప్పటి నుండే కరెంటు కష్టాలు, ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీల భారం, వ్యవసాయం కోసం రైతులు అప్పులపాలవడం ఎందుకు మొదలయింది? వేలకోట్ల ప్రజాధనం వెచ్చించి మొదలుపెట్టిన ప్రాజెక్టులు నేటికీ ఎందుకు పూర్తవలేదు? వంటి అనేక ప్రశ్నలకు ఈ శ్వేతపత్రాలు వివరణ ఇస్తున్నాయి.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖపై నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం పేరిట ప్రజాధనం ఏవిధంగా దోచుకోబడిందో వివరించారు. ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చయినప్పటికీ వాటి వలన ఒక్క ఎకరానికీ నీళ్ళు అందలేదు. కానీ ‘రాజుల సొమ్ము రాళ్ళ పాలన్నట్లు...ఆయన మొదలు పెట్టిన జలయజ్ఞం వల్ల ప్రజల సొమ్ము రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల పాలయిందని మాత్రం స్పష్టమయింది.   రాజశేఖర్ రెడ్డి హయంలో నేతలు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు నీటి అవసరాలు, నీటి ఉపలబ్దత, ప్రాధాన్యతలు, సాధ్యాసాధ్యాలు, ఆర్ధిక వనరులు, అనుమతులు వంటివేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కానీ అదంతా రైతన్నల సంక్షేమం కోసమేనని, తానే అపర భగీరదుడన్నట్లు ప్రచారం చేసుకొని ప్రజల కళ్ళకు గంతలు కట్టేరు. ఇదంతా గమనించినట్లయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి వేల కోట్లు ఖర్చయ్యే జలయజ్ఞం ఎందుకు ప్రారంభించారో అర్ధమవుతుంది. ఆనాడు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు నేడు ప్రజలు, రైతన్నలు చివరికి ప్రభుత్వం కూడా శిక్ష అనుభవిస్తోంది. నేటి ప్రభుత్వ ఆర్ధిక లోటు, రైతన్నల నెత్తిన అప్పులు, కరెంటు కష్టాలు అన్నీ కూడా గత ప్రభుత్వాల తప్పిదాలు, అవినీతి కారణంగా ఏర్పడినవే.   ఇదే విషయాలను చంద్రబాబు తన శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తూ, ఈ పరిస్థితులను చక్కదిద్ది మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం ఏమేమీ చేయబోతోందో కూడా ఈ సందర్భంగా వివరిస్తున్నారు. రానున్న ఐదేళ్ళ కాలంలో ప్రాధాన్యతను బట్టి అవసరమయిన ప్రాజెక్టులను ముందుగా పూర్తిచేసి పొలాలకు నీళ్ళు అందిస్తామని తెలిపారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన భూగర్భ జలవనరుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేయడానికి తమ ప్రభుత్వం రైతన్నలకు అన్నివిధాల సహాయ పడుతుందని తెలిపారు.   గత పదేళ్ళ కాంగ్రెస్ పాలన ఏవిధంగా సాగిందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు గనుక రానున్న ఐదేళ్ళ కాలంలో ఆయన హామీ ఇస్తున్న విధంగా అభివృద్ధి జరుగుతోందా లేదా అనే విషయాన్ని ప్రజలే స్వయంగా బేరీజు వేసుకోవచ్చును.

మళ్ళీ మొదటికొచ్చిన రుణాల మాఫీ వ్యవహారం?

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ముఖ్యమయిన సమస్యలతో సతమతమవుతోంది. 1.వ్యవసాయ రుణాల మాఫీ. 2. రాజధాని నిర్మాణం. రిజర్వు బ్యాంకు రుణాలను రీ-షెడ్యూల్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ప్రభుత్వం రుణాల మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ మళ్ళీ ఇప్పుడు రిజర్వు బ్యాంకు మరో కొత్త మెలికపెట్టింది. రుణాలను రీ-షెడ్యూల్ చేసేందుకు పంట నష్టం గురించి మరిన్ని వివరాలు కోరుతూ ఇరు ప్రభుత్వాలకు లేఖలు వ్రాయడంతో ఈ వ్యవహారంలో రిజర్వు బ్యాంకు వైఖరి అంతుపట్టడం లేదు. అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు కనుగొనక తప్పనిపరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం దుంగల అమ్మకం, ప్రభుత్వానికి చెందిన ఎర్రచందనం అడవులను, బెవేరేజ్ కార్పోరేషన్ ఆస్తులను తాకట్టు పెట్టడం వంటి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేస్తోంది. అయితే నేటికీ అటు రిజర్వు బ్యాంకు అధికారులతో, మరో వైపు కేంద్రంతో సహాయం కోసం సంప్రదింపులు చేస్తూనే ఉంది.   ఇటువంటి సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యవసాయ రుణాలు, రాజధాని అంశాలపై కేంద్ర వైఖరిని స్పష్టం చేసారు. పంట రుణాల మాఫీపై దేశంలో మిగిలిన రాష్ట్రాలకు అవలంభిస్తున్న పద్ధతి విధివిధానాలనే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తామని తెలియజేసారు. అంటే రుణాల మాఫీ వ్యవహారంలో ఇరు రాష్ట్రాలకు ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేదా మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేసినట్లే భావించవచ్చును. తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో కేంద్రం నుండి ఎటువంటి సహాయము ఆశించకపోయినా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా, మిత్రపక్షంగా ఉన్న తెదేపా ప్రభుత్వం మాత్రం కేంద్రం ఏదో విధంగా తనకు సహాయపడుతుందని ఆశిస్తునందున, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటన తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఒకవేళ రిజర్వు బ్యాంకు రుణాలు రీ-షెడ్యూల్ చేసేందుకు నిరాకరించినట్లయితే, ఇక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాల ద్వారా ఈ సమస్యను వీలయినంత పరిష్కరించుకోవలసి ఉంటుంది.   ఇక రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని వెంకయ్యనాయుడు కూడా మరోమారు స్పష్టం చేసారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా అన్ని హామీలను కేంద్రప్రభుత్వం నెరవేరుస్తుందని విస్పష్టంగా ప్రకటించారు. అంటే రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన నిధుల విడుదలలో ఎటువంటి సమస్య లేదని స్పష్టమవుతోంది.

అమ్మా సానియా.. ఏడ్వాల్సింది నువ్వు కాదమ్మా!

  టెన్నిస్ స్టార్‌గా వెలిగిన సానియా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. జీవితంలో ఇంతకాలం ఎదుర్కోనన్ని విమర్శలు వారం రోజుల్లోనే ఎదుర్కొనేసరికి పాపం సానియాకి ఏడుపు వచ్చేసింది. తుది శ్వాస విడిచేవరకూ భారతీయురాలినే అనే భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేసి, తమ ఫ్యామిలీ హిస్టరీ పాఠాలు జనానికి చెప్పేసి, ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేసింది. సానియా ఏడుపు సీన్ చూసి కొంతమందికి బాధ కలిగి వుండొచ్చేమోగానీ, చాలామందికి సానియా ఏడుపు చూస్తే చిరాకేసింది.   ఏవమ్మా సానియా.. నాలుగైదు విమర్శలకే భోరున ఏడ్చేస్తున్నావ్.. నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వా? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహిళ ఎలా వుండాలి? ఎలాంటి సమస్య ఎదురైనా కొంగు నడుముకు కట్టి కదన రంగంలోకి దూకే తెలంగాణ మహిళలా వుండాలి. మరి నువ్వేమో చిన్న వివాదానికే బేర్‌మని ఏడ్చేశావు. బుర్రుమని ముక్కు చీదేశావు! నువ్వు ఏడ్చేశావు కదా అని సెంటిమెంట్ ఫీలైపోయి ఇక నిన్ను ఎవరూ విమర్శించర్లే అని నువ్వు అనుకుంటూ వుంటే నీ అంత అమాయకురాలు మరెవరూ వుండరు. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’ అనే హోదా  పొందినందుకు, కోటి రూపాయలు అప్పనంగా అందుకున్నందుకు నువ్వు ఎన్ని విమర్శలైనా భరించాల్సిందే. అయినా తెలంగాణ మహిళల నుంచి స్పూర్తిని తీసుకోవాల్సిన స్థితిలో వున్న నువ్వు తెలంగాణ మహిళలకి ఎలా స్ఫూర్తిగా నిలుస్తావు? అయినా నిన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడారా? నువ్వు పుట్టిన ఊరు గురించి, మెట్టిన దేశం గురించి, 1956 నిబంధన గురించీ అన్నీ నిజాలే మాట్లాడారు. ఉన్నమాట అంటే నీకు ఉలుకెందుకో అర్థంకావట్లేదు. అదిసరే, నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యావు కదా.. అసలు నీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నువ్వు కనీసం ‘జై తెలంగాణ’ అన్న దాఖలాలు ఏవైనా వున్నాయా? ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ట్రైచెయ్! ఏరకంగా నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వి అవుతావు? తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసనలు, ప్రదర్శనలు చేసి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్న మా తెలంగాణ ఆడపడుచులకు మించిన అర్హతలు తెలంగాణ అంబాసిడర్‌ కావడానికి నీకు ఏమి వున్నాయి? ఎవరో ఏదో పొలిటికల్ గేమ్‌ కోసం, ఓట్ల రాజకీయాల కోసం నీకు పదవి ఇస్తానని అంటే, నీకున్న అర్హతలేంటని వెనకాముందూ ఆలోచించకుండా వెళ్ళి కమిట్ అయిపోయావు. కోటి రూపాయల చెక్ ఇస్తే మొహమాటానికి కూడా వద్దనకుండా ఎగిరి గంతేసి తెచ్చుకున్నావు. నేను తెలంగాణ అమ్మాయినే అని టీవీ ఛానల్లో భోరున ఏడ్చేశావే...  మరి అలాంటప్పుడు నీ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడానికి నీకు కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావ్? ఇప్పటి వరకు టెన్నిస్ ద్వారా, ప్రకటనల్లో నటించడం ద్వారా కోట్లానుకోట్లు సంపాదించేశావు కదా.. అలాంటప్పుడు ఈ కోటి నాకు వద్దు నా తెలంగాణ కోసం ఫ్రీగా బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటానని ఒక్క మాట అనలేకపోయావా?! నువ్వు బ్యాంక్‌లో వేసి క్యాష్ చేసేసుకున్న చెక్ తాలూకు కోటి రూపాయలు ఎవరివో తెలుసా? తెలంగాణ ప్రజల కష్టార్జితమది.. తెలంగాణ ప్రజల చెమట బిందువులవి.. తమ చెమటబిందువులు మరొకరికి అత్తరులా మారిపోతే ఎవరికైనా కడుపు కాలుతుంది. ఆ కడుపు మంటని అర్థం చేసుకుని నువ్వే ఆ కోటి హుందాగా తిరిగి ఇచ్చేసి వుంటే తెలంగాణ ప్రజల్లో నీమీద గౌరవం పెరిగి వుండేది... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేశారన్న అభిప్రాయం కలిగి వుండేది. తద్వారా నువ్వు టీవీ ప్రోగ్రామ్‌లో భోరున ఏడ్చేయాల్సిన అవసరమూ వుండేది కాదు.. అందుకే.. అమ్మా సానియా.. ఇప్పుడు ఏడవాల్సింది నువ్వు కాదమ్మా... నిన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా భరించాల్సిన నా తెలంగాణ!   అవునుగానీ, నువ్వు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌వి కదా.. నిన్నగాక మొన్న మన తెలంగాణలోని మెదక్ జిల్లాలో స్కూలు బస్సుని రైలు ఢీకొని 16 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా 20 మంది చిన్నారులు చావుబతుకుల్లో వున్నారు. చాలా గొప్ప పదవిలో వున్న నువ్వు ఈ సంఘటన మీద నీ సంతాపంగానీ, సానుభూతిగానీ, వ్యక్తం చేశావా? పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులను గానీ, గాయపడిన పిల్లలను గానీ పరామర్శించావా? కనీసం ఒక్క కన్నీటి చుక్కైనా కార్చావా? ఇవేవీ చేయని నీకు ఆ పదవి ఎందుకు దండగ? పదవి అంటే డబ్బులు తీసుకోవడం కాదు.. బాధలు, బాధ్యతలు పంచుకోవడం! 

సానియా మీర్జా-తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్!!!

    టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఊహించిన దానికంటే ఎక్కువే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణా కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు ఏనాడు తెలంగాణా ఊసెత్తని ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడాన్ని తప్పుపడుతున్నారు. కానీ సానియా మీర్జా మాత్రం తను పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొన్నప్పటికీ, చివరి శ్వాసవరకు భారతీయురాలిగానే ఉంటానని, తన తండ్రి తాత ముత్తాతలు అందరూ హైదరబాదులో స్థిరపడి నిజాం కాలం నుండి అక్కడే పనిచేస్తున్నారని ఆమె తన భారతీయత, స్థానికతపై వివరణ ఇచ్చుకొన్నారు. అందువల్ల తనను విమర్శిస్తున్న రాజకీయ నేతలు ఇటువంటి వివాదాలపై గాక దేశానికి పనికివచ్చే పనిమీద దృష్టిపెడితే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు.   నిజమే! సానియా భారతీయత, స్థానికతపై వివాదం అనవసరం. ఆమె దేశం గర్వించదగ్గ అత్యత్తమ టెన్నిస్ క్రీడాకారిణి అనడంలో కూడా ఎటువంటి సందేహమూ లేదు. దీనిపై మత రాజకీయాలు చేయడం కూడా చాలా తప్పు. అందువల్ల ఆమె తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియుక్తులవడానికి అర్హురాలేనా కాదా అనే అంశంపై మాత్రమే చర్చిస్తే బాగుంటుంది.   ఆమె హైదరాబాదులో పెరిగి అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగినప్పటికీ ఏనాడు కూడా తెలంగాణతో మమేకం అయిన సందర్భం లేదు. ఆమెను ఎప్పుడూ ప్రజలు, ప్రభుత్వాలు గౌరవించడమే తప్ప ఆమె ప్రజలకు, దేశానికి చేసింది ఏమీ లేదు. ఆమె 2003లో హైదరాబాదులో సానియామీర్జా టెన్నిస్ అకాడమీ స్థాపించారు. గ్రామాలలో, పట్టణాలలో ఉన్న బాలలకు, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణా సౌకర్యాలను కల్పించి వారిని అత్యుతమ క్రీడాకారులుగా తీర్చిదిద్డుతూ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నానని చెప్పుకొంటున్న సానియా మీర్జా ఆ అకాడమీ ద్వారా కూడా బాగానే సంపాదించుకొన్నారు. ఎందుకంటే టెన్నిస్ అనేది నిరుపేదలు, సామాన్య మధ్యతరగతి ఆడగలిగే ఆట కాదు. ఆ ఆటలో శిక్షణ పొందాలంటే ఆర్ధిక స్తోమతు ఉన్నవారు లేదా ఏదయినా వ్యాపార సంస్థ స్పాన్సర్ చేస్తున్న వారికి మాత్రమే టెన్నిస్ రాకెట్ పట్టుకొనే భాగ్యం కలుగుతుంది. అందువల్ల సానియా మీర్జా స్థాపించిన టెన్నిస్ అకాడమీ ద్వారా ఆమె వ్యాపారమే చేస్తున్నారో లేక దేశసేవే చేస్తున్నారో సులభంగా అర్ధం అవుతుంది. దానిని ఆమె దేశసేవగా భావిస్తే భావించుకోవచ్చును. అదే దేశసేవ అయితే ఆవిధంగా రాష్ట్రంలో, దేశంలో చాలా మందే దేశసేవ చేస్తున్నారు.   ఇక దేశం తరపున ఆడటం ఎవరికయినా గర్వ కారణమే! కానీ ఆ అవకాశం ఆమె వంటి ఏ కొద్ది మందికో దక్కుతుంది. కారణం క్రీడల్లో రాణించేందుకు నేడు కేవలం నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆర్ధిక స్తోమత లేదా స్పాన్సర్లు, రాజకీయ పలుకుబడి వంటివనేకం ఉండాలి. అవ్వన్నీ ఉన్నవారే క్రీడల్లో పైకి ఎదగగలుగుతారు. మిగిలిన వారు సినిమాలాలో హీరో, హీరోయిన్ల వెనుక నర్తించే జూనియర్ ఆర్టిస్టుల్లాగే అనామకులుగా మిగిలిపోతారు. కానీ దానర్ధం వారందరికీ దేశభక్తి లేదనీ కాదు. దేశం తరపున ఆడాలనే కోరిక లేదని కాదు. అందువల్ల దేశం తరపున అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నవారే దేశభక్తులు, గొప్ప క్రీడాకారులు, కేవలం వారివల్లనే దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందనే దురాభిప్రాయం తొలగించుకొని చూసినట్లయితే, ఆమె కంటే ఎక్కువగా దేశానికి, తెలంగాణా రాష్ట్రానికి సేవలు అందిస్తున్న వారు చాలా మందే కళ్ళకు కనబడతారు. మరుగునపడి ఉన్న అటువంటి మాణిక్యాలను గుర్తించి వారికి ఇటువంటి ప్రోత్సాహకాలు అందిస్తే అందరూ హర్షిస్తారు. కానీ సానియా మీర్జా అంతర్జాతీయ క్రీడాకారిణి గనుక, ఆమెకు కోటి రూపాయలు బహుమానంగా ఇస్తే ఆమె ఇంతకాలం చేయనిది ఇప్పుడు కొత్తగా ఏదో మేలు చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏమయినప్పటికీ అడగకుండా కోటి రూపాయలు బహుమానంగా ఇస్తుంటే ఎవరయినా ఆమెలాగే మాట్లాడుతారు. అందువల్ల ఆమెను తప్పుపట్టడం కూడా అనవసరం.

రుణాలమాఫీపై ధర్నాలు చేస్తే రాజకీయ మైలేజీ వస్తుందా?

  బహుశః వారం రోజుల క్రితమే వైకాపా అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలతో సహా మొత్తం అన్ని రుణాలను తీర్చడానికి తాను ప్రభుత్వానికి దానిని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో నెల రోజులు గడువు ఇస్తున్నానని, ఆ తరువాత ప్రజలతో కలిసి తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కానీ మంత్రివర్గం అన్ని రకాల రుణాలను మాఫీ చేయడానికి ఆమోదముద్ర వేసిన తరువాత కూడా జగన్ ఇంత హటాత్తుగా ఎందుకు ధర్నాలు, ర్యాలీలకు సిద్దం అవడం చూస్తుంటే, మరో నెల రోజులు ఆగలేకనో లేక ఆగినట్లయితే ఈలోగానే రిజర్వు బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేసి, రైతులకు మళ్ళీ కొత్త రుణాలు మంజూరు చేసినట్లయితే తనకు ఈ అంశంపై ఉద్యమించి మైలేజీ పొందే అవకాశం లేకుండా పోతుందనే భయం చేతనో, తను విదించిన నెలరోజుల గడువును పక్కనబెట్టి, రేపటి నుండే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేప్పట్టాలని తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపు ఇచ్చారు.   ఈ మూడు రోజుల కార్యక్రమంలో ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపినిచ్చారు. భూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెదేపా ఇప్పుడు అధికారం చెప్పట్టాక పంట రుణాల మాఫీ గురించి తేల్చకుండా రోజులు దొర్లించేస్తోందని, దానికి నిరసనగా మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేప్పట్టేందుకు తనతో వామపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణాలో రైతులు ఏవిధంగా ఉద్యమించి అక్కడి ప్రభుత్వాన్ని మెడలు వంచి రుణాలు మాఫీ చేయించుకొన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ధర్నాలు ర్యాలీలు చేసి ప్రభుత్వం మెడలువంచి రుణమాఫీ చేయించుకొందామని జగన్ హితబోధ చేసారు.   తెలంగాణాలో రైతుల రుణమాఫీ గురించి జగన్ మాట్లాడటం బహుశః ఇదే మొదటిసారి కావచ్చును. కానీ ఆంద్రప్రదేశ్ రైతుల రుణమాఫీ గురించి మాత్రం చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుండే జగన్ మాట్లాడుతున్నారు. ఇదంతా రైతుల సంక్షేమం కోసమే అయితే వారు కూడా చాలా సంతోషించేవారు. కానీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తరువాత కూడా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, ముఖ్యంగా తనకు అధికారం దక్కకుండా చేసిన తన శత్రువు చంద్రబాబు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అన్నీ రాజకీయ మైలేజీ కోసం జగన్ పడుతున్న తిప్పలే తప్ప మరొకటి కావు.   మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు అంటే మరొక ఐదేళ్ళ పాటు పార్టీపై పట్టు జారిపోకుండా చూసుకోవడానికి, పార్టీలో నేతలు చెయ్యి జారి పోకుండా చూసుకోవడానికీ, తమ భవిష్యత్ ఏమిటో తెలియక స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలనీ, కార్యకర్తలనీ బిజీగా ఉంచడానికీ ఈ మాత్రం హడావుడి తప్పదు మరి.

న్యాయవ్యవస్థలో అన్యాయాలపై మార్కండేయాస్త్రం

  దేశానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అది రాజకీయ ఒత్తిళ్లకు, అవినీతికి దూరంగా ఉంటుందని ప్రజల నమ్మకం. కానీ ఏకంగా ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు-ఆర్.సి. లహోటి, వైకె సబర్వాల్ మరియు కేజి బాలకృష్ణన్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని సుప్రీం కోర్టుకే చెందిన మాజీ జడ్జి మార్కండేయ కట్జూ ఆరోపించడం, వారిలో లాహోటీ అవినీతి మరకలు అంటుకొన్న న్యాయమూర్తిని పదవిలో కొనసాగించారని ఆరోపించడంతో న్యాయవ్యవస్థ కూడా ఈ రొంపిలో చిక్కుకొంది.   మార్కండేయ కట్జూ కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి తన వద్ద బలమయిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెపుతూ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.సి లహోటీకి సంధించిన ఆరు ప్రశ్నలు గమనిస్తే ఆ ఆరోపణలను నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ప్రధాన న్యాయమూర్తులే కట్జూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. అంతేగాక ఈ ఆరోపణలలో నిజానిజాలను సుప్రీంకోర్టు తక్షణమే విచారించి దోషులెవరో తేల్చి, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు వారిని కటినంగా శిక్షించి, చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పునరుద్దరించాలి. లేకుంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న అపార నమ్మకం,  గౌరవం సడలే ప్రమాదం ఉంది.    అయితే ఇన్నేళ్ళు మౌనంగా ఊరుకొని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తునారనే ప్రశ్నకు మార్కండేయ కట్జూ టక్కున మహేష్ బాబులా, ఎప్పుడు ప్రశ్నించామన్నది పాయింటు కాదు... ఆ ప్రశ్న సరయినదా కాదా? అన్నదే పాయింటు అని సమాధానం చెప్పి తన విమర్శకుల నోళ్ళు మూయించేరు. అయితే వ్యవహారంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీయంకే తీరు చూస్తుంటే ‘గుమ్మడి కాయల దొంగ అంటే..భుజాలు తడుముకొన్నట్లుంది. కట్జూ ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తుంటే, ఈ భాగోతాలన్నీ తమ యూపీఏ హయాంలోనే జరిగాయి గనుక, కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకే కట్జూ ‘ఈ టైమింగ్’ ఎంచుకొన్నారని, ఆయన వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేస్తోంది. ఇది సమస్యను పక్కదారి పట్టించడానికే చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. గత పదేళ్లలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం చాలా సార్లు చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడినపుడు స్వయంగా సుప్రీంకోర్టే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి కాంగ్రెస్ మరిచిపోవచ్చునేమో కానీ ప్రజలు మరిచిపోరు. దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన యూపీఏ ప్రభుత్వం న్యాయవ్యవస్థను, చివరికి సర్వోన్నత న్యాయ స్థానానికి కూడా ఈ అవినీతి జబ్బును అంటించి దాని పరువు ప్రతిష్టలు కూడా మంటగలిపినట్లు మార్కండేయ కట్జూ ఆరోపణలు దృవీకరిస్తున్నాయి.   ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవచ్చును. చేసిన పనికి సిగ్గుపడక పోవచ్చును. దానివలన కాంగ్రెస్ పార్టీ కొత్తగా కోల్పోయేదేమీ లేదు. ఆ పార్టీ పరువు ప్రతిష్టలు, ప్రజలలో గౌరవం అన్నీ ఇప్పటికే చాలా వరకు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ దేశంలోసర్వోన్నత న్యాయవ్యవస్థపై ఇటువంటి మచ్చపడటం ఉపేక్షించవలసిన విషయం కాదు. అందువల్ల సుప్రీంకోర్టే తగుచర్యలు చేప్పట్టి కట్జూ ఆరోపణలతో మసకబారిన తన ప్రతిష్టను పునరుద్దరించుకోవలసిన నైతిక బాద్యత ఉంది.    

Right to Die with Diginity

                    "Killing terminally ill people” the expression used by a Health Minister for the care of a billion population, referring to euthanasia may not have a parallel in callousness it conveys. One is simply aghast that the most sensitive issues in euthanasia of life and death, the state of mind of a person who decides to die with dignity under the most horrendous pain and distress and the most agonized desire, under extreme stress,of the dearest loved ones to uphold that great dignity to let them take the last journey , is being dealt with such insensitivity . Clinical and technical interpretations by a medical practitioners and a lawyers should be kept in their professional spheres and not hurt the feelings of the general public. Traditionally, most people in India for centuries have grown up with a somewhat fatalistic mindset that births, life and death are completely in God's hands, and we are only puppets in His hands. Sadly it even boils down to deaths in accidents and disasters being ' weighed ' up in monetary value ; as evidenced in the alacrity of Ministers offering monetary reliefs to the next of kin with great pomposity and pretended care after such disasters , and doing little else . Country wide discussions and public debate and the widest publicity on the TV and in the Press will wake up the general public to the necessity of legalizing “the Right to die with dignity '' . No doubt a lot of most atrocious thoughts like the recent outbursts reported on some Ministers and legislature playing down rapes and assaults on women as just peccadillos of the Country's youths . Except in responsible, enlightened societies and groups, only bedlams can be expected in public debates . It will in any case generate a general awareness Bold decisions have to made for legal sanction with the strongest and explicit safeguards to obviate even a single case is not mismanaged.     In the ultimate analysis, religious. Moral and social compulsions are insignificant to uphold a person's conscious right, to die with dignity or the loved ones' agonized decision on someone slipped beyond the ability to express himself or herself. Consensus in the issue of most people in the Country with the fatalistic attitude of everything .