పులిమీద సవారి చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం

  డిల్లీలో మకాం వేసిన కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలు విభజన బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వారు అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వారి స్వరంలో, విధేయతలో ఇప్పుడు మార్పు చాల స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణా ప్రజలను సంయమనం కోల్పోవద్దని చెపుతున్న కేసీఆర్, ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే డిల్లీ నుండే యుద్ధం మొదలుపెడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణా ఇవ్వకపోతే శాంతి భద్రతల సమస్యలు తల్లెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక ఎంతో భాధ్యాయుతంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుతారని పేరున్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మరో అడుగు ముందుకు వేసి ‘తెలంగాణా ఇవ్వకపోతే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని’ హెచ్చరించడం చాలా విస్మయం కలిగిస్తుంది.   ఇంతకాలంగా సోనియాగాంధీ తెలంగాణా ప్రజల ఇంటి ఇలవేల్పు, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇస్తుంది, అంతా రాజ్యాంగ బద్దంగానే జరుగుతోందని, అని కాంగ్రెస్ అధిష్టానాన్ని వెనకేసుకువచ్చిన టీ-కాంగ్రెస్, తెరాస నేతలే ఇప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయడం చాలా ఆశ్చర్యకరం. అయితే ఇంతవరకు వచ్చిన తరువాత కూడా తెలంగాణా ఏర్పాటు కాదేమోననే వారి భయం, ఆవేదన, ఆక్రోశం వారిని ఆవిధంగా మాట్లాడేలాచేస్తోందని అర్ధం చేసుకోవచ్చును. కానీ వారి మాటలు జరుగబోయే విపరీత పరిణామాలకు స్పష్టమయిన సంకేతాలుగా కూడా భావించవలసి ఉంటుంది.    తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర విభజనకు పూనుకొని అటువంటి పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానినే నిందించవలసి ఉంటుంది. తెలంగాణా అంశంతో ఎన్నికలలో లబ్ది పొందాలని దురాలోచన చేసిన కాంగ్రెస్ అధిష్టానం, ఒకవేళ ఏ కారణంగానయినా పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేయలేకపోయినట్లయితే తెలంగాణాలో కూడా భూస్థాపితం కావడం ఖాయం. కానీ దానివల్ల ప్రజలకి ఎటువంటి నష్టమూ లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంది. కానీ దాని అనాలోచిత నిర్ణయాల వలన తెలంగాణాలో ముఖ్యంగా జంటనగరాలలో ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి, అది కేసీఆర్, కోదండరాం వంటి నేతలు హెచ్చరిస్తున్నట్లు ‘సివిల్ వార్’ కి దారితీసినట్లయితే, అందుకు ప్రజలే తీవ్రంగా బాధలు పడవలసి వస్తుంది. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలకు కేవలం ఆ పార్టీ నేతలే కాదు ప్రజలు కూడా భారిగా మూల్యం చెల్లించవలసివస్తుంది.   బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే ఈ సంగతి బాగా అర్ధమయ్యే ఉంటుంది. అందుకే అది లోలోన ఎంత భయపడుతున్నపటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బీజేపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణా బిల్లుని ఆమోదింపజేస్తానని చెపుతోంది. దానికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా. అందుకోసం అది ఎంతకయినా తెగించక తప్పదు. అవసరమయితే మిగిలిన తన యంపీలను, కేంద్రమంత్రులను కూడా రేపు సభ నుండి సస్పెండ్ చేయవచ్చు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం తిరిగి సరిదిద్దుకోలేని తప్పుని చేసింది. వెనక్కి మళ్లలేని పరిస్థితికి చేరుకొంది.   కానీ,ఇంత సంకట స్థితిలో కూడా అది తన సహజసిద్దమయిన అతి(చావు)తెలివి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఏ కారణంగానయినా బిల్లు ఆమోదింపజేయలేకపోతే, ఆ నెపం బీజేపీ మరియు సీమాంధ్ర యంపీల మీదకి నెట్టివేసి, తను ఇందులో నుండి క్షేమంగా బయటపడాలనే దురాలోచనతోనే బీజేపీ మద్దతు ఈయకపోయినా కూడా బిల్లుని ఆమోదింపజేస్తామని పదేపదే గట్టిగా చెపుతూ తను ఈ విషయంలో చాలా నిబద్దతతో ఉన్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం తెలుగు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం తను పులిమీద సవారి చేస్తున్నానే సంగతి మరిచిపోయింది.

లాస్ట్ బాల్ తో యూపీయే ప్రభుత్వం పడిపోనుందా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పిన ‘లాస్ట్ బాల్స్’ ని విభజన బిల్లుని ఆపే అస్త్రాలుగా భావించవచ్చును. ఏవిధంగా అంటే, ఉభయ సభలలో ఉన్న మొత్తం 25మంది సీమాంధ్ర యంపీలలో నిన్నకొందరు మాత్రమే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళగా మిగిలిన 11 మంది సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు వెనక్కి తగ్గి సస్పెండ్ వేటు తప్పించుకొన్నారు. సోమవారంనాడు లోక్ సభ మళ్ళీ సమావేశమయినప్పుడు వారందరూ సభ జరగకుండా అడ్డుపడటం ఖాయం.   యూపీయే ప్రభుత్వం ఇటీవల సభలో ప్రవేశపెట్టిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ను తప్పనిసరిగా సభచేత ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆమోదింపజేసుకోలేకపోయినట్లయితే, యూపీఏ ప్రభుత్వం పడిపోతుంది.  అందువల్ల సోమ, మంగళవారం రోజులలో ఎట్టిపరిస్థితుల్లో బడ్జెట్ ఆమోదింపజేయవలసి ఉంటుంది. కానీ, మిగిలిన సీమాంధ్ర మంత్రులు, యంపీలు సభలో చెప్పట్టే అందోళనల వలన సభ వాయిదాలు పడుతుంటే ఆ బిల్లు ఆమోదం పొందడం కష్టమవుతుంది. విభజన బిల్లుకి వ్యతిరేఖంగా సభలో ఇంత రాద్దాంతం జరిగినా మొండిగా దానిని సభలో ప్రవేశపెట్టడానికే కాంగ్రెస్ అధిష్టానం తన 14మంది యంపీలను సస్పెండ్ చేసుకోవలసి వచ్చిందని ప్రతిపక్షాలు, యావత్ మీడియా కూడా విమర్శలు గుప్పిస్తుంటే, ఇప్పుడు మిగిలిన వారిని కూడా సభ నుండి సస్పెండ్ చేసే దైర్యం చేయకపోవచ్చును. సభ జరగకుండా మళ్ళీ వాయిదాలు పడితే బడ్జెట్ ఆమోదం పొందం కష్టం. బడ్జెట్ ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం కనుక ఏదోవిధంగా సభ నిర్వహించి ఓట్-ఆన్-అకౌంట్ బిల్లుని తప్పనిసరిగా ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది.    ఒకవేళ దాన్ని ఆమోదింపజేసుకొన్నా, సభ వాయిదాలు పడుతుంటే మిగిలిన మూడు రోజులలో విభజన బిల్లుపై చర్చ, ఓటింగు జరిగే అవకాశం కూడా క్రమంగా కుచించుకు పోతుంది. బిల్లుని, బిల్లు ప్రవేశపెట్టిన తీరుని తీవ్రంగా ఆక్షేపిస్తున్న బీజేపీ మరియు ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడం ఖాయం. అవి చర్చ జరగాలని కోరితే దానిని స్పీకర్ తిరస్కరించలేరు. గనుక మిగిలిన రెండు మూడు రోజుల సమయంలో విభజన బిల్లుపై చర్చలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలతో బిల్లు ఆమోదం పొందకుండానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవచ్చును.   అందుకే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా బిల్లు ఆమోదం పొందుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేసారు. కానీ, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఇరువురూ కూడా బీజేపీ మద్దతు ఈయకపోయినా సరే ఈ బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపజేస్తామని గట్టిగా చెపుతున్నారు. అంటే మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేయడానికి సిద్దమవుతున్నట్లు భావించవలసి ఉంటుంది.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఇంకా లాస్ట్ బాల్స్ మిగిలే ఉన్నాయని ఒప్పుకోక తప్పదు మరి. కానీ ఆ లాస్ట్ బాల్ కాంగ్రెస్ అధిష్టానమే వేయబోతోందా? లేక సీమాంధ్ర నేతలతో కిరణ్ కుమార్ రెడ్డే వేయించి యూపీయే ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారా? అనేది మాత్రమే తేలవలసి ఉంది.ఏమయినప్పటికీ ఈ 'లాస్ట్ బాల్' రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. 

తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా?

  తెలంగాణా బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో అనే సంగతి నేడో రేపో ఇంక బయటపడనుంది. కాంగ్రెస్ అధిష్టానం సభలో సభ్యులను అదుపు చేయకుండా నాటకాలు ఆడుతోందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ, ఒకవేళ బిల్లుకి మద్దతు ఈయదలుచుకోకపోయినట్లయితే, ఇంతమంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తప్పు పడుతూ వాదనకు దిగవచ్చును. మద్దతు ఈయదలిస్తే ఇదే సాకుతో సభ నుండి వాకవుట్ చేసి పరోక్షంగా సహకరించవచ్చును.   కానీ, బిల్లు ఆమోదానికి సహకరిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుల ప్రసక్తి ఇక మరిచిపోవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీ బిల్లు ఆమోదానికి సహకరించినా దానివలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా వచ్చే లాభమేమీ ఉండబోదు. ఆ క్రెడిట్ అంతా తెరాస, కాంగ్రెస్ పార్టీలే పొందుతాయి తప్ప బీజేపీ కాదు. కనీసం అందుకు ప్రతిగా మరికొన్ని యంపీ, యం.యల్యే. సీట్లయినా పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇక అక్కడ తనంతట తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే లేదు.   అదీగాక బీజీపీ లక్ష్యం తెలంగాణాలో పార్టీని బలపరుచుకోవడం కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అందువల్ల బీజేపీకి సీమాంధ్రలో ఉన్న25యంపీ సీట్లు చాలా కీలకమయినవి. గనుక, కనుక, బీజేపీ సీమాంధ్రకు న్యాయం చేయలేదంటూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసినా చేయవచ్చును. లేదా బిల్లులో వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టి కాలయాపన చేసి బిల్లు ఆమోదం పొందకుండా చేయవచ్చును. అప్పుడు తెదేపా, వైకాపా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మద్దతు కూడా బీజేపీ ఆశించవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంటే, తెలంగాణా ఏర్పాటు కోసం తెరాస కూడా తప్పనిసరిగా బీజేపీకే మద్దతు ఈయక తప్పదు. అందువల్ల ఇప్పుడు బిల్లు ఆమోదం పొందకుండా బీజేపీ అడ్డుపడినందుకు,  బీజేపీ తాత్కాలికంగా తెలంగాణాలో నష్టపోవచ్చునేమో కానీ, కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసినందుకు అందుకు పూర్తి ప్రతిఫలం ఆశించవచ్చును.   కానీ, రాష్ట్ర విభజన చేయకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో కూడా తుడిచిపెట్టుకొని పోయే ప్రమాదం ఉంది గనుక ఎట్టిపరిస్థితుల్లో బిల్లుని ఏదోవిధంగా ఆమోదింపజేసేందుకే ప్రయత్నించవచ్చును. కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనానికి అంగీకరించనట్లయితే, బీజేపీ కోరిన విధంగా వ్యవహరిస్తూ బిల్లు ఆమోదింపజేయకుండా సమావేశాలు ముగించవచ్చును.   ఏమయినప్పటికీ, ఈ రాజకీయ చదరంగంలో రాష్ట్ర విభజన అంశం ఒక పావుగా మారిపోయింది. ఈ ఆటలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? విభజన జరుగుతుందా లేదా? అనే విషయాలు మరొక వారం రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతాయి.

కాంగ్రెస్ లో కొనసాగాలా? కొత్తపార్టీ పెట్టుకోవాలా?

  ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ సమైక్యంగా రాజినామాలు చేసి ప్రజలలోకి రానున్నారు. అయితే ఈమధ్య కాలంలో కొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తాము రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నామే తప్ప, పార్టీని కాదని గట్టిగా నొక్కి చెపుతుండటంతో వారందరూ రాజీనామాలు చేసిన తరువాత కూడా పార్టీలోనే కొనసాగుతారా? అనే అనుమానం కలుగుతోంది. కానీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఇంకా కాంగ్రెస్ లో కొనసాగడమూ కష్టమే కనుక వేరు కుంపటి పెట్టుకోవడం అనివార్యమనిపిస్తోంది. ఈ రెండు ఆప్షన్స్ లలో సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను పరిశీలిస్తే ‘కొత్త కుంపటి ఆప్షనే’ సాధ్యంగా, లాభసాటిగా కనిపిస్తోంది.   సీమాంధ్ర అంతటా కాంగ్రెస్ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వారు ఆ పార్టీలోనే కొనసాగడం చాలా రిస్కు తీసుకోవడమే అవుతుంది. ఇంతకాలంగా తమ పార్టీ ప్రజలను మోసగించిందని వారందరూ స్వయంగా ప్రజలకు చాటింపు వేసుకొన్న తరువాత, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో ఉన్న తమకు ఓటు వేయమని అడగడం కూడా కష్టమే. అందువల్ల కాంగ్రెస్ లో కొనసాగేందుకు చాలా బలమయిన కారణం, చాలా బలమయిన వాదన అవసరం.   వారు కాంగ్రెస్ లోనే కొనసాగాలంటే రేపు రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలోనే ఏదో ఒక వంకతో ఆమోదం పొందకుండా ఆగిపోవాలి. అప్పుడు వారందరూ రాష్ట్ర విభజన జరగకుండా బిల్లుని ఆపిన ఘనత తమదేనని చెప్పుకొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ చేత బహిష్కరణలకు గురయ్యి, పదవులను కూడా తృణప్రాయంగా వదులుకొన్నతమకే మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి తమ మద్దతుపైనే ప్రధానంగా ఆధారపడే తమ కాంగ్రెస్ అధిష్టానం కొమ్ములు వంచి మరీ లొంగదీసి శాశ్వితంగా రాష్ట్ర విభజనను ఆపేస్తామని హామీ ఇస్తారేమో!   ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం చాలా దురదృష్టకరమని, అందుకు తాము చాలా బాధపద్దామని ఆవేదన వ్యక్తం చేస్తూనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గొప్ప లౌకికవాద పార్టీ అని అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఓటువేసి గెలిపించుకొని ఈ దేశాన్ని మతతత్వ బీజేపీ నుండి, నరేంద్ర మోడీ నుండి కాపాడుకోవాలని కోరవచ్చును.   తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే, తప్పకుండా తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్న బీజేపీతో చేతులు కలుపుతున్న తేదేపాకు ఓటేస్తే, చంద్రబాబు ఎలాగు తెలంగాణా ఏర్పాటుకి అనుకూలమే గనుక, ఆ రెండు పార్టీలు కలిసి మళ్ళీ రాష్ట్ర విభజనకు పూనుకొంటే, ఇంతకాలం తాము చేసిన పోరాటం, త్యాగాలు వృధా అవుతాయని, సీమాంధ్ర ప్రజలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా మళ్ళీ ఉద్యమించవలసివస్తుందని చెప్పుకోవచ్చును.   అయితే, ఈ స్టోరీతో ప్రజలను నమ్మించడం, వారి ఓట్లను పొందడం చాలా కష్టం. పైగా ఈ ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాలని తీవ్రం కృషి చేస్తాయి గనుక, కాంగ్రెస్ పార్టీ గెలవడం కల్ల. అందువల్ల ఇప్పుడు రెండో ఆప్షనుకే మొగ్గు చూపవలసి వస్తుంది.   మూడు నెలల క్రిందటే రెండు మూడు పార్టీ పేర్లను ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషను కూడా చేయించుకొని, ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెట్టబోతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి, దానిపై నిరంతరం చర్చ జరిగేలా చేస్తూ ప్రజలలో దానిపట్ల ఆసక్తిని రేకెత్తించగలిగారు కనుక, దానిని చాలా సులువుగా ప్రజలలోకి తీసుకువెళ్ళవచ్చును. కొత్తపార్టీ పెట్టినట్లయితేనే ప్రజలలో నెలకొనిఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను తమకనుకూలంగా మలుచుకోవచ్చును. ఇంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానాని(నిర్ణయాని మాత్రమే)కి వ్యతిరేఖంగా చేసిన తమ పోరాటాలకు, చేసిన త్యాగాలను క్లెయిం చేసుకొని ప్రజల నుండి ఓట్లు రాబట్టుకోవడానికి వేరు కుంపటి పెట్టుకోవడమే మేలు.   ముఖ్యమంత్రి, ఆయన సహచరులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే (పదవీ కాలం ముగిసిపోయినందుకు కాదు సుమా!) తమ తమ పదవులకు రాజీనామాలు చేసి, కాంగ్రెస్ బోనులో నుండి సమైక్య సింహాలుగా బయటపడి, సమైక్యవాదంతో సమైక్యం కోసం సమైక్యపార్టీ పెడితే వారిని ప్రజలు నెత్తిన పెట్టుకొనే అవకాశం ఉంది. అశోక్ బాబు వంటివారు తమ ఉద్యోగులను, తద్వారా ప్రజలను ఇప్పటికే మానసికంగా సిద్దం చేసి కొత్తపార్టీకి అనువైన వాతావరణం సృష్టించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు కూడా! తాత్కాలికంగా వేరు కుంపటి పెట్టుకొని, పని పూర్తయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోయే సౌలభ్యం కూడా దీనీలో ఉంటుంది కనుక సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ లో కొనసాగి రిస్కు తీసుకోవడం అనవసరం. అందువల్ల వేరు కుంపటి పెట్టుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మరి మన ప్రియతమ నేతలు ఈ రెంటిలో ఏ ఆప్షన్ ఎంచుకొంటారో చూద్దాము.

విభజన బిల్లుపై బెడిసికొట్టిన కాంగ్రెస్ వ్యూహం

  రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సంతకం చేయడంతో ఇక బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించడమే తరువాయి అనుకొంటున్న తరుణంలో కధ ఊహించని విధంగా మలుపు తిరిగింది. రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి నిరాకరించడంతో బిల్లు తిరిగి రాష్ట్రపతి వద్దకు చేరింది.   కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అంతేగాక రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా ఒకవేళ బిల్లు ఆమోదం పొందలేకపోయినా, దానిని సజీవంగా ఉంచి ఎన్నికలలో బీజేపీ మద్దతు ఈయనందునే బిల్లుని ఆమోదించలేకపోయామని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటువేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే రాజ్యసభలో సజీవంగా ఉన్న బిల్లుని వెంటనే ఆమోదింపజేస్తామని ప్రజలకు నచ్చజెప్పుకొని ఓట్లు కోరవచ్చని దురాలోచన చేసింది.   కానీ, కేంద్రం దురాలోచన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరంతో బెడిసికొట్టింది. సంప్రదాయానికి వ్యతిరేఖంగా బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడుతున్నందున హమీద్ అన్సారీ న్యాయనిపుణుల సలహా కోరడంతో, అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని వారు తేల్చిచెప్పడంతో, ఆయన బిల్లుని కేంద్రానికి త్రిప్పి పంపేసారు.   ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడతామని ప్రకటించేసిన కేంద్రప్రభుత్వం తన ఎత్తు బెడిసికొట్టడంతో కంగుతింది. అందువల్ల రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టేందుకు ఇంకేమయినా అవకాశాలున్నాయో లేదో తెలుసుకొనేందుకు న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నారు. అలాగ వీలుకాకపోయినట్లయితే బిల్లుని లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకొని చర్చించుకొంటున్నారు.   కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి లోక్ సభలో తనకు తగినంత సభ్యుల బలం కాగితాలమీద కనిపిస్తున్నపటికీ, బిల్లును ఓటింగుకి పెడితే వారిలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారో తెలియదు. ఇదే అదునుగా బీజేపీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు బిల్లుపై చర్చకు పట్టుబట్టవచ్చును. అదే జరిగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. బిల్లు ఆమోదం పొందకుండా మురిగిపోతుంది. ఇది కేవలం కాంగ్రెస్ అధిష్టానం స్వయంకృతాపరాధమే అవుతుంది.

కాంగ్రెస్ భస్మాసుర హస్తం తన నెత్తినే పెట్టుకోబోతోందా?

  తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి రాష్ట్ర విభజన బిల్లుపై సంతకం చేసినందున, కేంద్రం ఈరోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. ఎన్నికలు తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించేవరకు ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల నిమిత్తం తాత్కాలిక ఏర్పాటుగా ఈ సమావేశాలలోనే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయవలసి ఉంటుంది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ పార్లమెంటు సమావేశాలలో కీలకమయిన ఈ రెండు బిల్లులతో బాటు మరో 38 ఇతర బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టాలనుకోవడం చూస్తే, కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై ఉభయ సభలలో ఎటువంటి చర్చ జరగకుండా ఆమోదింపజేసుకోనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తన పంతం నేరవేర్చుకోనేందుకు కోట్లాది తెలుగు ప్రజల భవితవ్యం నిర్దేశించే బిల్లుపై చర్చించకుండానే ఇంత తక్కువ వ్యవధిలో ఆమోదింపజేసుకోవాలనుకోవడం చాలా దురదృష్టకరం.   అయితే, సభలో బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలంగాణాలో ఆ పార్టీ భవితవ్యం ఇప్పుడు తన చేతుల్లో కాక తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు చేతులో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరించకపోతే, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. అయితే రానున్న ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితిలో, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఆయన ఎట్టి పరిస్థితుల్లో విలీనానికి అంగీకరించకపోవచ్చును. ఇక, ఈ ఎన్నికలలో తెలంగాణాలో తెరాస పూర్తి ఆధిక్యత పొందవచ్చని సర్వే రిపోర్ట్స్ ఘోషిస్తున్న ఈ తరుణంలో, కాంగ్రెస్ పార్టీకి తన విజయంలో భాగం పంచి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరిస్తారని ఊహించలేము.   అయితే ఇంతవరకు వచ్చిన తరువాత తెరాస కాంగ్రెస్ లో విలీనం అయినా అవకున్నా, పొత్తులకు అంగీకరించినా అంగీకరించక పోయినా తెలంగాణా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముందుకే వెళ్ళవలసిన పరిస్థితి చేజేతులా కల్పించుకొంది. బీజేపీ, సమాజ్ వాదీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, అన్నాడీఎంకే తదితర పార్టీలు తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయబోవని ఇప్పటికే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బహుశః అందుకేనెమో కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత బలం ఉన్న లోక్ సభను కాదని తనకు బలంలేని రాజ్యసభలో ముందుగా బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దపడుతోంది. ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఓడిపోతే ఆ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టి, తను తెలివిగా బయటపడేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తు వేస్తోందేమో!   కానీ, ఆవిధంగా చేసి కాంగ్రెస్ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టివేయగలదేమో కానీ ఎన్నికలలో తెలంగాణాలో ఎట్టిపరిస్థితుల్లో గెలవలేదు. పైగా పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేయలేని కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఎన్నికల పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అడియాసే అవుతుంది. ఆయన టీ-కాంగ్రెస్ నేతలను ఎన్నికలలో ఎండగట్టకుండా వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీకి అదే పదివేలు అని సంతోషపడవలసి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోబోతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితి కనిపిస్తోంది.   చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా నిలచి ఆదుకొన్న తెలుగు ప్రజలకు కృతజ్ఞత చూపకపోగా తనకు అధికారం వరంగా ఇచ్చిన వారి నెత్తినే తన భస్మాసుర హస్తం పెట్టాలని చూస్తోంది. కానీ, ఆ పురాణ కధలో జరిగినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తినే పెట్టుకొంటోందని స్పష్టమవుతోంది. దేశంలో వీస్తున్న మోడీ గాలులకు తోడు, ఈ రాష్ట్రవిభజన అంశంతో జాతీయ స్థాయిలో తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ బహుశః కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనేమో!

అశోక్ బాబు ఉద్యమాలు దేనికోసం చేస్తున్నట్లు?

  ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన వార్ రూమ్ సమావేశంలో సీమాంధ్ర యంపీలు మంత్రులు రాష్ట్ర విభజన పట్ల తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. వారితో జీ.ఓ.యం. చర్చల పేరిట రెండు రోజులు కాలక్షేపం చేసి, వారి డిమాండ్లకు తలొగ్గబోతున్నట్లు మీడియాకు లీకేజీలు ఇచ్చింది. కానీ చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అందునా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా కాంగ్రెస్ నేతలందరినీ వెంటబెట్టుకొని రాష్ట్ర విభజనకు నిరసనగా డిల్లీలో మౌనదీక్ష చేసారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అదేమి పట్టించుకోకుండా నిన్న విభజన బిల్లుని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.   రాష్ట్ర శాసనసభకు పంపిన ముసాయిదా బిల్లుని పార్లమెంటులో యదాతధంగా పంపినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన సవాలుని కూడా స్వీకరిస్తున్నట్లు, అదే బిల్లుని యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయకపోయినా, నేడో రేపో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటు వేసి బయటకి సాగనంపగానే, కొత్త పార్టీతో ప్రజలలోకి వెళ్ళడం మాత్రం దాదాపు ఖాయమేనని చెప్పవచ్చును.   ఆయన కనుసన్నలలో నడుస్తున్న ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించిన కార్యాచరణ కూడా అందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుంది. ముఖ్యమంత్రి వర్గానికి అవసరమయినప్పుడు, అవసరమయిన విధంగా ఉద్యమాలు చేస్తూ, ముఖ్యమంత్రి యొక్క విరోధులను ఎండగడుతూ అశోక బాబు ఆయనకి సహకరిస్తున్నారు. రాజకీయాలలోకి రావాలనే ఆకాంక్ష వెలిబుచ్చిన ఆయన, స్వయంగా కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రిని ఆయన సహచరులను అందులోకి ఆహ్వానించవచ్చును. లేదా ఆయనే ముఖ్యమంత్రి లేదా ఆయన సహచరులో పెట్టబోయే కొత్త పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితులను చూసి ఒకవేళ ఆయన వెనకడుగు వేసినప్పటికీ, ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ఇవ్వడం మాత్రం ఖాయం. అందువల్ల అశోక్ బాబు తన ఉద్యమాలతో రాష్ట్ర విభజనను ఆపలేకపోయినా ముఖ్యమంత్రి లేదా తానో లేదా మరొకరో స్థాపించబోయే కొత్త పార్టీకి అనువయిన వాతావరణం మాత్రం సిద్దం చేయగలరని చెప్పవచ్చును.   బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే రేపు 10వ తేదీ నుండి ఉద్యమం మరింత తీవ్రతరం చేసి, 17,18 తేదీలలో ఛలోడిల్లీ కార్యక్రమం చేప్పట్టి డిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ప్రకటించారు. జాతీయ పార్టీ నేతలందరినీ మరో మారు కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయమని కోరుతామని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి తదితర ప్రతి పక్షపార్టీల నేతలు జాతీయ పార్టీల నేతలను కలిసి బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయమని విజ్ఞప్తి చేసారు. వారిలో కొందరు అందుకు అంగీకరించారు. మరి కొందరు తమ పార్టీలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని తేల్చి చెప్పారు. మరి అటువంటప్పుడు అశోక్ బాబు వారిని కలిసి కొత్తగా చెప్పేదేముంటుంది? కోరేదేముంటుంది?   సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి రాష్ట్ర విభజనలో తమ అధిష్టానానికి సహకరిస్తుంటే, వారికి అశోక్ బాబు సహకరిస్తున్నారు. రాజకీయనాయకులు టికెట్లు, పదవుల కోసం ఎంతకయినా దిగజారగలరని కళ్ళెదుట జరుగుతున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. అటువంటి వారికి సహకరించేందుకు అశోక్ బాబు వంటి ఉద్యోగసంఘ నేతలు ఉద్యోగులను మళ్ళీ ఉద్యమాల బాట పట్టించాలనుకోవడం చాలా దారుణం.

మోడీ కాకపోతే చంద్రబాబుకి ప్రధాని అవకాశం?

  ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి చాలా ఆసక్తికరమయిన వార్త వెలువడింది. రానున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ 200 సీట్లు సాధించలేని పక్షంలో, ఎన్డీయే కూటమి మరియు ఇతర రాజకీయ పార్టీలందరికీ ఆమోదయోగ్యుడయిన చంద్రబాబు నాయడుని ప్రధాని అభ్యర్ధిగా నిలుపుదామని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి అనుకూల వాతావరణం ఉన్నందున బీజేపీ స్వయంగా 200 సీట్లకి పైగా సులువుగా గెలుచుకోగలదని వారు భావిస్తున్నారు. అయితే, అదే సమయంలో నరేంద్ర మోడీకి పార్టీలో, బయట, దేశంలో కూడా కొంత వ్యతిరేఖత ఉన్నసంగతిని దృష్టిలో పెట్టుకొన్న బీజేపీ అగ్రనేతలు ఒకవేళ తమ పార్టీ, కూటమి రానున్న ఎన్నికలలో పూర్తి ఆధిక్యత సాధించలేకపోయినట్లయితే, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు కాంగ్రెస్ చేతిలోకి జారిపోకుండా ఉండేందుకు అవసరమయితే మోడీకి బదులు అందరికి ఆమోద యోగ్యుడయిన చంద్రబాబుని తమ ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు కూడా వెనుకాడకూడదని భావిస్తున్నట్లు తాజా సమాచారం.   రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొనే యోచనలో ఉన్న బీజేపీ, ఒకవేళ మోడీ ప్రధానిగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి తగినంత మెజార్టీ సాధించలేకపోయినట్లయితే, దేశంలో అన్నిరాజకీయ పార్టీలతో మంచి పరిచయాలు, బలమయిన సంబంధాలు కల చంద్రబాబుని తమ అభ్యర్ధిగా ముందుకు తీసుకువచ్చి అధికారం తమ చేయి జారిపోకుండా చూసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. పైగా చంద్రబాబు కూడా నరేంద్ర మోడీ లాగే మంచి పాలన దక్షుడిగా పేరు ప్రఖ్యాతులున్నవారు గనుక, ఒకవేళ మోడీ కాకపోతే చంద్రబాబుని ప్రధానిగా ప్రతిపాదించినట్లయితే, అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం సులువవుతుంది. అంతే గాక కాంగ్రెస్ పార్టీని అది నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిని మళ్ళీ అధికారం చేజిక్కుంచుకోకుండా నిలువరించవచ్చును. ఈ వార్తను బీజేపీలో ఒక సీనియర్ నేత తమకు తెలియజేసినట్లు సదరు పత్రిక పేర్కొంది.   దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మారుమ్రోగిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి వార్త వెలువడటం చాలా ఆశ్చర్యాన్నే కాదు అనుమానం కూడా కలిగిస్తోంది. బీజేపీ రాష్ట్రంలో తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే ఫలితాలు తారుమారవుతాయని భయపడుతున్న ప్రత్యర్ధ పార్టీలు, ఆ బీజేపీ-తెదేపాల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నాయా? అనే అనుమానం కూడా కలుగుతోంది. దీనివలన ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం సాధ్యం కాకపోయినా, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయనే ఈ వార్త రాష్ట్రంలో తేదేపాకు తప్పకుండా చాలా మేలు చేకూరుస్తుంది. ఈసారి ఆయన మల్కాజ్ గిరీ లేదా హిందూపురం నుండి లోక్ సభకు పోటీ చేయవచ్చని ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. అందువల్ల ఒకవేళ చంద్రబాబు రానున్న ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేసినట్లయితే, ఆయనను బీజేపీ తన రెండో ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నిలబెట్టవచ్చనే ఈ వార్తలలో ఎంతో కొంత నిజముందని భావించవచ్చును. ఏమయినప్పటికీ, చంద్రబాబుకి ప్రధాని పదవికి అర్హుడని ఈ వార్తలు చెప్పకనే చెపుతున్నాయి. 

బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ “బీజేపీ గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముందుకు వస్తే, ఎన్నికల తరువాత దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది.” అని అన్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే షరతుపైనే జైలు నుండి విడుదల చేయబడ్డాడని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటే, ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి ఆరోపణలు అసత్యమని భావించినప్పటికీ, బీజేపీ ప్రస్తుతం తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినా, తాము అధికారంలోకి వస్తే ఇరుప్రాంతాలకి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తామని ముందే చెపుతున్నపుడు, రాష్ట్రాన్ని శాశ్వితంగా సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి మద్దతు ఇస్తానని ఏవిధంగా హామీ ఇస్తున్నారు? ఒకవేళ ఆయన కోరినట్లే బీజేపీ బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినట్లయితే, ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన చేయాలనుకొంటున్న ఆ పార్టీకి ఆయన మద్దతు ఇస్తారో ఇవ్వరో అనే సంగతి కూడా ఆయన ఇప్పుడే చెప్పగలిగితే, అయన హామీలో నిజాయితీ ఎంతో తెలుస్తుంది.   కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నాయని ఆయనకీ తెలుసు. మరి అటువంటప్పుడు ఈవిధంగా హామీ ఇవ్వడం చూస్తే ఆయన అటు బీజేపీని, ఇటు సీమాంధ్ర ప్రజలని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.   నిజానికి వైకాపా ఎప్పుడయితే తెలంగాణా వదులుకొని బయటపడిందో అప్పుడే అది మానసికంగా రాష్ట్ర విభజనకు అంగీకరించి సిద్దమయిందని అందరికీ తెలుసు. ఆపార్టీ చేస్తున్న సమైక్యవాదమంతా సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించి, జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికను నేరవేర్చుకోవడానికే తప్ప నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కాదని అందరికీ తెలుసు. తన తెలంగాణా శాఖను పణంగా పెట్టి మరీ వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర పోరాటం యొక్క పూర్తి ఫలితం పొందాలంటే, ఎన్నికలలోగా ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరిగితేనే సాధ్యం. తెలంగాణా ఏర్పాటునే పూర్తిగా వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర పోరాటం చేస్తున్న వైకాపాకు తెలంగాణాలో అడుగిడే పరిస్థితే లేదు. అటువంటప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని పోరాడవలసిన అవసరమే ఆపార్టీకి లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకు సహకరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు! గతంలో ఆయన, ఆయన తల్లి విజయమ్మ, షర్మిల ముగ్గురూ కూడా వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు హటాత్తుగా మనసు మార్చుకొని బీజేపీకి మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు. ఆయన ఆలోచనలలో ఎంత అపరిపక్వత, అస్పష్టత ఉందో ఇది తెలియజేస్తోంది.   రానున్న ఎన్నికలలో మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి గనుక, తన సీబీఐ కేసుల నుండి విముక్తి పొందేందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇస్తానని చెప్పడం మాత్రం అందరినీ మభ్యపెట్టడమే అవుతుంది.

కత్తి మీద సాములా మారిన తెలంగాణా బిల్లు

    రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక తాడోపేడో తేల్చుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం, తెరాస ఒకవైపు రాష్ట్రంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మరోవైపు నిలిచి తెలంగాణా బిల్లుపై అంతిమ పోరాటం మొదలుపెట్టాయి. ఇంతవరకు బిల్లుకి మద్దతు ఇస్తానని చెపుతున్న బీజేపీ కూడా సమయం దగ్గిర పడేకొద్దీ బిల్లుకి వ్యతిరేఖంగా మాట్లాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ కూడా బిల్లుని వ్యతిరేఖిస్తుండటం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది.   తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ వలన ఇంకా ఎంతమంది చివరి నిమిషంలో బిల్లుకి వ్యతిరేఖంగా మారుతారో తెలియదు. రాష్ట్ర విభజనకు న్యాయ, రాజ్యాంగపరంగా ఉన్నచిక్కులకు తోడు ఇప్పుడు ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా కూడా ఆటంకం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు రోజుల్లోనే తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా మొత్తం 8 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటన్నిటిపై కోర్టు ఈ శుక్రవారంనాడు విచారణ చెప్పట్టబోతోంది. ఒకవేళ కోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోన్నట్లయితే ఇక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా కష్టమవవచ్చును.     బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి శాసనసభ చేత చేయించిన తీర్మానం పసలేనిదని, దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావం పడబోదని చెప్పిన దిగ్విజయ్ సింగ్, అదే బిల్లుని ఎటువంటి సవరణలు చేయకుండా నేరుగా రాష్ట్రపతికి పంపే సాహసం కూడా చేయలేకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి మరియు జీ.ఓ.యం. సభ్యుడు అయిన జైరాం రమేష్ రాష్ట్ర శాసనసభకు పంపిన ముసాయిదా బిల్లుకి, పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లుకి ఏమీ తేడా లేదని చెప్పినప్పటికీ, ఈరోజు సమావేశమవుతున్న కేంద్రమంత్రుల బృందం (జీ.ఓ.యం.) తను స్వయంగా తయారు చేసి శాసనసభకు పంపిన బిల్లుకి అనేక సవరణలు చేసి ఆమోదించడం చూస్తే, ఆ ముసాయిదా బిల్లుని ఎంత లోపభూయిష్టంగా తయారు చేసి పంపిందో అర్ధమవుతోంది. రాష్ట్రశాసనసభ తిరస్కరించిన ఆ బిల్లుకి రిపేర్లు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టి మమ అనిపించేయాలని కేంద్రం ఆరాటపడుతోంది. దానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని టీ-కాంగ్రెస్ నేతలు మరియు కేసీఆర్ సమిష్టిగా కృషిచేస్తున్నారు.   వీటన్నిటికీ తోడు బిల్లుపై ప్రభావం చూపే మరో అంశం కూడా ఉంది. ఎన్నికల తరువాత ఏ కూటమి అధికారంలోకి వస్తుంది? దేనితో జత కట్టాలి?వంటి అంశాలు కూడా ఉత్తరభారతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావచ్చని ఆ పార్టీలు భావిస్తే అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసే సదరు పార్టీల నేతలు బీజీపీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించవచ్చును. ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అవి కూడా అదేవిధంగా వ్యవహరించి బీజేపీని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. అందువల్ల చివరి నిమిషం వరకు బిల్లుకి ఎక్కడ ఏవిధంగా ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. కనీసం బిల్లుని ప్రవేశపెట్టలనుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియదు. కానీ, ఇక చేయగలిగేదేమీ లేక మొండిగా ముందుకే నడిచేందుకు సిద్దమవుతోంది. ఏ కారణం చేతయినా పార్లమెంటులో బిల్లు ప్రవేశట్టలేకపోయినా, పెట్టి ఆమోదించలేకపోయినా కాంగ్రెస్ పని వ్రతం చెడినా ఫలితం దక్కనట్లు, రెంటికీ చెడిన రేవడిలా అవుతుంది.

తెలంగాణా బిల్లుకి రెండు ప్రధాన అవరోధాలు

  రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో, రాష్ట్ర రాజకీయ నేతలందరూ విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టడంతో, చివరికి ఇది ఏవిధంగా ముగుస్తుందనే ఉత్కంట ప్రజలందరిలో నెలకొంది. ఇప్పుడు రెండు ప్రధాన అంశాలు బిల్లు భవితవ్యం తేల్చనున్నాయి. మొదటిది బిల్లుకి న్యాయ, రాజ్యాంగపరమయిన చిక్కులు. రెండు పార్లమెంటులో బిల్లుకి మద్దతు కూడగట్టడం.   మొదటి సమస్యను కాంగ్రెస్ అధిష్టానంతో సహా అందరూ చాల తేలికగా కొట్టిపరేస్తున్నపటికీ, శాసనసభ చేత తిరస్కరించబడిన బిల్లుని ముందుకు తీసుకువెళ్ళడం కష్టమే. మొట్ట మొదట రాష్ట్రపతే దానిపై న్యాయ సలహా కోరవచ్చును. హోంశాఖ వివరణ కోరవచ్చును. అది సంతృప్తికరంగా లేకుంటే బిల్లుని త్రొక్కి పట్టవచ్చును లేదా బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను సవరణలను అన్నిటినీ సరిచేయమని కేంద్రానికి త్రిప్పి పంపవచ్చును.   రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేక మంది ప్రతిపక్ష నేతలు ఆయనను కలిసి బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నపుడు, ఆయన వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా లోపభూయిష్టమయిన బిల్లుపై ఆమోదముద్రవేసి కేంద్రానికి అందజేస్తారని భావించలేము. ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషను వేస్తామని ఇప్పటికే తెదేపా నేత సుజన చౌదరి ప్రకటించారు. వారేగాకుండా ఇంకా లగడపాటి రాజగోపాల్ వంటి వారు అనేకమంది కోర్టులో పిటిషన్లు వేయవచ్చును. గతంలో వారు కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు కేంద్రం అధికారికంగా రాష్ట్ర విభజన ప్రకటించినప్పుడు కోర్టుని ఆశ్రయించవచ్చని సూచించినందున ఇప్పుడు వారు వేసే పిటిషన్లను కోర్టు తప్పకుండా స్వీకరిస్తుంది. అంటే బిల్లుకి రాజ్యంగ, న్యాయపరమయిన అడ్డంకులు ఉన్నాయని స్పష్టమవుతోంది.   ఇక ఒకవేళ బిల్లు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పార్లమెంటుకి చేరుకోగలిగినట్లయితే, అమోదం పొందేందుకు బీజేపీ, ప్రతిపక్షాల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో వివిధ పార్టీల బలాబలాలు ఈవిధంగా ఉన్నాయి.   లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య:533, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంఖ్య:247. లోక్ సభలో బిల్లు అమోదంపొందానికి అవసరమయిన కనీస సభ్యుల సంఖ్య:267. అంటే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు మరో 20మంది ఇతర పార్టీల సభ్యుల మద్దతు అవసరం ఉంటుందన్నమాట. శివసేన (11), తృణమూల్ కాంగ్రెస్ (19), సమాజ్ వాది పార్టీ (22) బిల్లుకి మద్దతు ఈయబోమని స్పష్టం చేసాయి.   వీరిలో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి బయట నుండి మద్దతు ఇస్తోంది గనుక, ఆమేర అంటే 22 సభ్యుల మద్దతు తగ్గినట్లు భావించవచ్చును. అయితే సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ ప్రతిపాదించిన అనేక బిల్లులను కూడా గతంలో తీవ్రంగా వ్యతిరేఖించి, ఆఖరి నిమిషంలో మద్దతు ఈయడమో లేదా వాకవుట్ చేసి దానికి సహకరించడమో చేసింది. గనుక ఆ పార్టీ మాటలను విశ్వసించడం కష్టం.   ఇక కాంగ్రెస్ కు బయట నుండి మద్దతు ఇస్తున్న బీ.యస్.పీ. (21) చిన్న రాష్ట్రాలను కోరుకొంటోంది గనుక బిల్లుకి మద్దతు ఈయవచ్చును. ఒకప్పటి కాంగ్రెస్ మిత్రపక్షమయిన డీ.యం.కే. త్వరలో యూపీయే కూటమికి గుడ్ బై చెప్పలనుకొంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు బిల్లుకి మద్దతు ఇస్తాయో లేదో చివరి నిమిషం వరకు అనుమానమే. ఇక జయలలిత అధ్వర్యంలో నడుస్తున్న ఏ.ఐ.ఏడీ.యం.కే. (9) తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రాల కోసం వస్తున్నడిమాండ్స్ ను నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది గనుక, బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును. అయితే, లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ అధిష్టానం బిల్లుని ఏదోవిధంగా ఆమోదింపజేయగలదు. కానీ రాజ్యసభలో మాత్రం కష్టమవుతుంది.   ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య: 242. కాంగ్రెస్:72; బీజేపీ: 47. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 121 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీకి మరో 49 మంది సభ్యుల మద్దతు ఆవసరం. అంటే బీజేపీ మద్దతు తప్పనిసరి అన్నమాట. అందుకే బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో రకరకాలుగా మాట్లాడుతోంది. రాజ్యసభలో మిగిలిన 123 సభ్యులలో కాంగ్రెస్ పార్టీ మరో 49 మంది మద్దతు కూడా గట్టగలిగితేనే  అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందగలదు. కానీ,ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడా గట్టలేకనే బీజేపీ మద్దతు గురించి కాంగ్రెస్ పదేపదే మాట్లాడుతోందని గనుక రాజ్యసభలో బిల్లు ఆమోదం దాదాపు అసాధ్యమేనని స్పష్టమవుతోంది.

ప్రధాని పదవి కోసమే థర్డ్ ఫ్రంట్ స్థాపన

  ప్రధాన మంత్రి పదవిపై కన్నేసిన అనేక మంది ప్రాంతీయ పార్టీ నేతలలో బీహారు ముఖ్యమత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు. కానీ, తనకా అర్హత లేదని పైకి చెప్పుకొనే ఆయన, నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగానే తను కూడా బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నందున, తను కూడా మోడీలాగే ప్రధానమంత్రి పదవికి అన్నివిధాల అర్హుడనని ఆయన గట్టిగా భావిస్తుంటారు. నరేంద్ర మోడీని వ్యతిరేఖిస్తున్నసాకుతో ఆయన ఎన్డీయే కూటమి నుండి బయటపడిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకి దగ్గర కావాలని ప్రయత్నించారు. అందుకు కాంగ్రెస్ కూడా చాలా సానుకూలంగానే స్పందించింది. అయితే, అక్కడ ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీకే రిజర్వ్ చేయబడింది గనుక, యూపీయే కూటమిలో జేరినా నితీష్ కుమార్ కల నెరవేరే అవకాశం లేదు. అందుకే, కాంగ్రెస్ ఎన్ని సైగలు చేస్తున్నా, బహుమతులు అందజేసేందుకు సిద్దపడినా, నితీష్ కుమార్ యూపీయేతో మైల పాటిస్తూనే ఉన్నారు.   అయితే తన జీవితాశయమయిన ప్రధానమంత్రి పదవి పొందేందుకు ఆయన తన ప్రయత్నాలు మానుకోలేదు. ప్రస్తుతం దేశమంతటా కాంగ్రెస్, రాహుల్ గాంధీల పట్ల ప్రజలలో వ్యతిరేఖత కనబడుతుంటే, మరో వైపు మోడీ ప్రభంజనం వీస్తున్నపటికీ, ఆయనపట్ల కూడా అంతే సమానంగా దేశంలో వ్యతిరేఖత ఉంది. తాను మోడీని వ్యతిరేఖించి ఎన్డీయేలో నుండి బయటకి వచ్చేయడమే కాకుండా, ఆ తరువాత మోడీని గట్టిగా డ్డీ కొంటున్నందున, ప్రజలు, ప్రాంతీయ పార్టీ నేతలు అందరూ కూడా తననే రాహుల్, మోడీలకు ప్రత్యామ్నాయంగా భావిస్తారని, అందువల్ల తనే ప్రధానమంత్రి అవవచ్చని నితీష్ కుమార్ ఆశపడుతున్నారు. ప్రజలలో ఉన్నఈ సందిగ్దతను మూడో ఫ్రంట్ కి అనుకూలంగా మార్చుకోగలిగితే, తన కల నేరవేర్చుకోవచ్చని నితీష్ కుమార్ ఆశ. అందుకే ఆయన మూడో ఫ్రంట్ ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నవామపక్ష పార్టీలను ముందుంచుకొని పనులు మొదలు పెట్టారు. కాంగ్రెస్ , బీజేపీలకు వ్యతిరేకంగా భావసారూప్యత గల ప్రాంతీయ, జాతీయ పార్టీలతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.   అయితే, చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మూడో కూటమి ఏర్పరచి డిల్లీలో చక్రం తిప్పాలని దేశంలో చాలా ప్రాంతీయ పార్టీ నేతలు ఆశపడుతున్నప్పటికీ, వారు కూడా తమ తమ రాష్ట్రాలపై తమకున్న పట్టు, పరపతి కారణంగా అందరికంటే తామే ప్రధానమంత్రి పదవికి అర్హులమని భావిస్తుండటంతో మూడో ఫ్రంట్ స్థాపనకు ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. కానీ, మూడో ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత గురించి నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, జగన్మోహన్ రెడ్డి వంటి ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడటం మాత్రం మానలేదు.   దేశ ప్రజలలో ప్రస్తుతం నెలకొన్న ఈ సందిగ్దతను సద్వినియోగం చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పేయాలనే వారందరూ చాలా ఆశపడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పూర్తి మెజార్టీ పొందడం అసంభవమని వారందరికీ తెలుసు. కనీసం ఆ పేరుతో ప్రజల నుండి మరిన్ని ఎక్కువ సీట్లు దండుకోగలిగినా వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని కీలకమయిన కేంద్రమంత్రి పదవులు పొందవచ్చని వారి దురాశ. ఈ దురాశ, దురాలోచనల కారణంగానే మూడో ఫ్రంట్ ఏర్పాటు కాలేకపోతోంది. ఒకవేళ మూడో ఫ్రంట్ ఏర్పాటయినా కూడా దురాశతో కూడుకొన్న నేతలందరూ కలిసి దానిని కప్పల తక్కెడగా మార్చడం ఖాయం.

కాంగ్రెస్ లో తెరాస విలీనం కాకపోతే...

  రాష్ట్ర విభజన బిల్లుని ఉభయసభలు మూజువాణి ఓటుతో తిరస్కరించిన తరువాత కొన్ని న్యూస్ ఛానళ్ళు ఆవిషయాన్ని ప్రకటిస్తూ, ఇందుకు కారణమయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యసింహమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని వారిమాటగా చెప్పాయి. ఆయన మొదటి నుండి కూడా బిల్లుపై సభలో తప్పనిసరిగా ఓటింగ్ జరుగుతుందని, బిల్లుని తాము ఓడిస్తామని చెప్పినట్లుగానే చేయడంతో సీమాంధ్రలో ఆయనకు ఆదరణ పెరిగి ఉండవచ్చును.   కానీ, ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను వీధి రాజకీయాల కోసమో, తన రాజకీయ భవిష్యత్ కోసమో ఇదంతా చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొనే ఈవిధంగా చేశానని అన్నారు. కానీ, తను కొత్తపార్టీ పెట్టబోతున్నారో లేదో అనే విషయం తేల్చి చెప్పకుండా, అందరితో మాట్లాడిన తరువాత తగు నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.   కానీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు చూపుతున్న అచంచలమయిన విశ్వాసం చూస్తే, అసలు ఆయన పార్టీ వీడకపోవచ్చనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగి వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం ఆయనే స్వయంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించుకోవాలంటే తప్పనిసరిగా అందుకు చాలా బలమయిన కారణం అవసరం ఉంటుంది. శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లునిఅడ్డుకొన్న ఈ సమైక్య సింహం ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తమ రాజకీయ ప్రత్యర్ధులను చీల్చి చెండాడాలంటే, రాష్ట్ర విభజన బిల్లుని ఏదో ఒక కారణంతో, ఏదో ఒక దశలో నిలిపివేయవలసి ఉంటుంది. ఆవిధంగా చేసినట్లయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయగలరు.   కానీ దిగ్విజయ్ సింగ్ వంటి వారు ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తామని గట్టిగా చెపుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చేందుకు సిద్దపడినప్పటికీ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఒకవేళ తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోయినట్లయితే, తెలంగాణా ఇచ్చినా, ఇవ్వకున్నావచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ గెలవలేదు. మరి అటువంటప్పుడు, తెలంగాణా ఇచ్చి రెంటికి చెడిన రేవడిగా మారే బదులు ఇవ్వకుండా వదిలేస్తే, తన సమైక్యసింహం సీమాంధ్రలో పార్టీకి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయగలదు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉంటే, అప్పుడు కేసీఆర్ కూడా ఎలాగు తనకే మద్దతు ఈయక తప్పదు. అదేవిధంగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీ పుంజుకొన్నట్లయితే, అక్కడి నుండి కూడా భారీగా మద్దతు దొరుకుతుంది.   ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజన జరుగకపోయినట్లయితేనే సీమాంధ్రలో సమైక్య సెంటిమెంటు చాలా బలంగా పనిచేస్తుంది గనుక గనుక, తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సాకుతో రాష్ట్ర విభజన చేయకుండా తప్పుకొంటే, కాంగ్రెస్ సమైక్య సింహాలన్నీ కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ తరపునే పోరాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొంటాయి. బహుశః అందుకే కొత్త పార్టీకి ముహూర్తం ఇంకా ఖరారు చేసుకోలేకపోతున్నారేమో!   ఇక ముప్పై లోక్ సభ స్థానాలకు వలేస్తున్నమరో సమైక్య సింహం జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా-బీజేపీలను చీల్చి చెండాడి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీ (కాంగ్రెస్) కే మద్దతు ఇస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు గనుక హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఆఖరు నిమిషంలో తెలంగాణా ప్రజలకి, తన నేతలకి హ్యండిచ్చినా ఆశ్చర్యం లేదు.

ఈ అపరిచితుడు ఎవరివాడు

  సినిమాలలో హీరోలో హీరోయిన్లో ద్విపాత్రాభినయం చేస్తుంటే ప్రేక్షకులు చాలా ముచ్చటగా చూస్తారు. గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ హీరోలకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఒక కాంగ్రెస్ నేతగా, తిరుగుబాటు నేతగా ఎంతో గొప్పగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రాష్ట్ర విభజన సస్పెన్స్ సీరియల్ మొదలయిన నాటి నుండి తిరుగుబాటుదారుడుగా పాత్రను పోషిస్తున్న ఆయన దానిని చాలా చక్కగా రక్తి కట్టించారు. ఆయనలో తెలంగాణా నేతలు, ప్రజలు ఒక గొప్ప విలన్నిచూస్తే, సీమాంధ్ర ప్రజలు ఆయనలో ఒక గొప్ప హీరోని చూసారు. అంటే ఆయన చేస్తున్న డబుల్ రోల్ కి అదనంగా ఇది డబుల్ షేడ్స్ ఉన్నఅపరిచితుడి పాత్ర వంటిదన్నమాట. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం “ఆయన విలన్ కాదు, విధేయుడే” అని పనిగట్టుకొని ప్రచారం మొదలుపెట్టేసరికి సీమాంధ్ర ప్రజలు కూడా “ఇంతకీ ఆయన హీరోనా లేక విలనా?” అనే డైలెమాలో పడ్డారంటే ఆయన తన పాత్రను ఎంత బాగా రక్తి కట్టించారో అర్ధం చేసుకోవచ్చును.   ఈ హై సస్పెన్స్ సీరియల్ దాదాపు క్లైమాక్స్ కి వచ్చేవరకు ఆయన రెండు షేడ్స్ ఉన్నఅపరిచితుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోతూ రెండు ప్రాంతాల ప్రజలు, నేతల నుండి ఏదో రూపంలో శభాషీలు అందుకొంటున్నారు. అయితే మధ్య మధ్యలో డిల్లీ వెళ్ళి వస్తూ కాంగ్రెస్ వాది పాత్ర కూడా పోషిస్తున్నప్పటికీ, ఈ అపరిచితుడి పాత్రనే ఎక్కువ హైలైట్ అయింది.   ఇక సీరియల్లో క్లైమాక్స్ సన్నివేశం దగ్గిరపడుతున్న కొద్దీ, అసలు సిసలయిన కాంగ్రెస్ వాది పాత్ర కూడా తెరమీదకి వచ్చేసింది. గత ఐదు నెలలుగా ఆయనలోని కాంగ్రెస్ వాది, ప్రజల కోసం తిరుగుబాటు చేస్తున్నముఖ్యమంత్రి పాత్రలు చాలా మానసిక సంఘర్షణ అనుభవించినట్లు ఆయన నిండు శాసనసభలో చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అందరి కళ్ళు చమర్చాయిట!   ఆయన కాంగ్రెస్ విధేయుడని దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, చాకోవంటి వారు మొదటి నుండి ఎంత మొత్తుకొంటున్నా పట్టించుకోని జనాలు, నిన్నఆయన స్వయంగా పార్టీ రాజ్యసభ అభ్యర్ధులను వెంటబెట్టుకొని వెళ్లి వారిచేత దగ్గిరుండి నామినేషన్లు వేయించిన తరువాత ఇక నమ్మక తప్పలేదు. మహా మహా నటులు సైతం ఆయనలా ఒకే సమయంలో ఒక కంట కన్నీరు(పార్టీ కోసం), మరో కంట (పార్టీపై) ఆగ్రహం ప్రదర్శించలేరంటే అతిశయోక్తి కాదు.   టీ-కాంగ్రెస్ నేతలు, బొత్ససత్యనారాయణ, చిరంజీవి వంటివారు ఇంతకాలంగా అధిష్టానానికి ఒట్టి చెక్క భజన తప్ప మరేమీ చేయలేదు. కానీ పార్టీకి విధేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డి, తిరుగుబాటుదారుడనే ముద్ర వల్ల తీరని మనోవేదన అనుభవిస్తూనే అధిష్టానం కోసం, అధిష్టానం చూపించిన రాజ్యసభ సభ్యులను దగ్గరుండి గెలిపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే మానసిక సంఘర్షణలో ఆయన మనసు ఎంతగా కుమిలిపోతోందో కేవలం ఆయనకీ, అధిష్టానానికే తెలుసు.   అలాగని ఆయన తను పోషిస్తున్న అపరిచితుడు పాత్రకు క్లైమాక్స్ సీన్లో కూడా అన్యాయం చేయాలని అనుకోలేదు. అందుకే, ఆయన లోపభూయిష్టమయిన తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేసి, దానిని సభలో ఓడించి, వెనక్కి త్రిప్పి పంపేయాలని కమిటయిపోయారు. బిల్లుపై చర్చించడానికి మరో మూడు వారాలు సమయం కావాలని రాష్ట్రపతికి లేఖ వ్రాయడమే కాక, ఆయనకు హోంశాఖ పంపినది ‘నిజమయిన ఒరిజినల్ బిల్లు’ కాదని, అది కేవలం ముసాయిదా బిల్లు మాత్రమేనని, హోంశాఖ రాష్ట్ర శాసనసభను, కేంద్రాన్ని, చివరికి రాష్ట్రపతిని కూడా మోసం చేసిందని చాలా అవేశపడిపోయారు. ‘లా ఒక్కింతయూ తెలియని జైరాం రమేష్ వంటి కేంద్రం మంత్రుల బృందంలో సభ్యులు “ముసాయిదా బిల్లునే అసలయిన బిల్లని కూడా పిలుస్తారని, దీనిలో ఒరిజినల్, డూప్లికేట్ అని వేరేగా ఉండవని” అవాకులు చవాకులు వాగడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి తన మూడో కన్నుకూడా తెరిచేసి, “సరే! మాకు పంపిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టి చూపండి! నేను రాజకీయ సన్యాసం చేస్తానని” బిల్ మే సవాల్ విసిరారు.   ఇక రేపటితో ఈ మెగా సస్పెన్స్ సీరియల్లో ఆంధ్రా అధ్యాయం పూర్తయి డిల్లీ అధ్యాయం మొదలవుతుంది. కనుక, పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నదుకు మనసులో ఎంతగా కుమిలిపోతున్నా, రేపటి నుండి పూర్తిగా తిరుగుబాటుదారుడి పాత్రనే పోషించవచ్చును. చాలా బాధ కలుగుతోంది. చాలా బాధ కలుగుతోంది. అయినా తప్పదు. ప్రజల కోసం, భవిష్యత్ కోసం భరించక తప్పదు.

ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఫలించేనా

  మొన్నటి వరకు టీ-బిల్లు ఇక చర్చ జరగదనుకొంటున్న సమయంలో అర్ధవంతమయిన చర్చ మొదలయింది. సభ్యులందరూ బిల్లుపై, రాష్ట్ర విభజనపై తమతమ అభిప్రాయాలను చెపుతూ సజావుగా చర్చ కొనసాగిస్తున్నారు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుకి వ్యతిరేఖంగా సభలో సుదీర్ఘమయిన వాదన చేసిన తరువాత లోపభూయిష్టమయిన ఆ బిల్లుపై ఇక చర్చ అనవసరమని, అందువల్ల దానిని సభ తిరస్కరించి వెనక్కి త్రిప్పి పంపాలని కోరుతూ సభాపతి నాదెండ్ల మనోహర్ కు నోటీసు ఇచ్చారు. దానితో సభలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి.   లోపభూయిష్టమయిన బిల్లును సభ తిరస్కరించాలని, వెనక్కి త్రిప్పి పంపాలని కోరిన ఆయనే మళ్ళీ బిల్లుపై మరింత మంది తమ అభిప్రాయాలను తెలుపవలసి ఉంది గనుక, చర్చ కొనసాగించేందుకు మూడు వారాల సమయం కోరుతూ రాష్ట్రపతికి లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవిధంగా ఆయన అదనపు సమయం కోరడం చూస్తే, బిల్లుని మరింత కాలం శాసనసభలో అట్టేబెట్టి కాలయాపన చేసి సకాలంలో పార్లమెంటుకి చేరకుండా నిరోధించడానికేనని అర్ధం అవుతోంది. అంటే, ఒకవైపు వీలయితే బిల్లుని సభచేత తిరస్కరింపజేసి బిల్లుకి రాజ్యాంగపరంగా అడ్డంకులు సృష్టించడం ద్వారా లేదా అదనపు సమయం పొంది కాలయాపన చేయడం ద్వారా బిల్లు పార్లమెంటులో ప్రవేశాపెట్టబడకుండా అడ్డుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన రెండు ప్రయత్నాలు సఫలం అవుతాయానే నమ్మకం లేదు.   సభాపతి నాదెండ్ల మనోహర్ నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో మాట్లాడుతూ సభానాయకుడుగా ముఖ్యమంత్రి కోరుతున్న విధంగా సభలో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టవలసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. కానీ, సభలో బిల్లుపై చర్చకు తప్ప ఎటువంటి తీర్మానాలకు తాము సహకరించమని తెరాస సభ్యులు ఇప్పటికే స్పష్టం చేసారు. అందువల్ల ఈ రెండు రోజుల్లో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యమే. ప్రవేశపెట్టాలంటే ముందుగా తెలంగాణా సభ్యులందరినీ సభ నుండి సస్పెండ్ చేయవలసి ఉంటుంది. అలాచేస్తే అప్రజాస్వామికమవుతుంది గనుక, వారిని సస్పెండ్ చేయడంవీలుకాదు, అదేవిధంగా వారు సభలో ఉన్నంతసేపు బిల్లుకి వ్యతిరేకంగా ఎటువంటి తీర్మానం చేయడం కూడా వీలుకాదు.   ఇక అదనపు గడువు కోరుతూ ముఖ్యమంత్రి రాష్ట్రపతికి లేఖకు కూడా సానుకూలమయిన స్పందన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, ‘బిల్లుని సకాలంలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేవలం వారం రోజులు అదనపు సమయం మాత్రమే ఇస్తున్నట్లు’ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంటే, ఇక ఇంతకంటే అదనపు సమయం ఇవ్వడం వీలుపడదని ఆయన స్పష్టంగా ముందే సూచించినట్లయింది.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం కూడా సఫలం కాదని అర్ధమవుతోంది. ఇక సభాపతి తెలంగాణా సభ్యుల అభ్యంతరాలను, నినాదాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కోరిన విధంగా బిల్లుకి వ్యతిరేఖంగా సభలో తీర్మానం ప్రవేశాపెట్టడమొకటే ఇక మిగిలుంది. అదయినా సాధ్యపడుతుందని భావించలేము. అందువల్ల రేపు గడువు ముగిసిన తరువాత టీ-బిల్లు యధాతధంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ.

ఉట్టికెగరలేనమ్మ...

  ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి ఎగురుతానన్నట్లు, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ‘మెరుపు సమ్మెలు చేస్తాం, లక్షల మందితో శాసనసభను దిగ్బందిస్తాం’ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన ఏపీ ఎన్జీవో ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు, ఇప్పుడు ఫిబ్రవరి 11, 12, 13 తేదిల్లో ఛలోడిల్లీ అంటూ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.   ఏపీఎన్జీవో ఉద్యోగులు మొదట నిరవధిక సమ్మె మొదలుపెట్టినప్పుడు ఎవరూ ఆయన చిత్తశుద్ధిని శంఖించలేదు. ఆయన హైదరాబాదులో లక్షమందికి పైగా ఉద్యోగులతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించినప్పుడు, అందరూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. ఈ ఉద్యమం సందర్భంగా ఆయన అనేక మంది మంత్రులను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, జాతీయ నాయకులను తరచూ కలుస్తుండటంతో క్రమంగా ఆయన ఆలోచన ధోరణిలో మార్పు రాసాగింది. వారి సహకారంతో ఆయన అనేక సభలు, సమావేశాలు అవలీలగా నిర్వహించిన తరువాత అధికారంలో ఉన్నరుచి, శక్తి ఏమిటో ఆయనకు బాగా అర్ధమయినట్లుంది. అప్పుడే తాను కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే కోరికను ఆయన బయటపెట్టుకొన్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ, లక్షలాది ఉద్యోగులు చేసిన త్యాగాలకి, పడిన కష్ట నష్టాలకి ఆయన వ్యక్తిగతంగా ప్రతిఫలం ఆశించడమే అక్షేపనీయం.   ఇక ఆయన ఉద్యమానికి బ్రేకులు వేసి నడుపుతున్నతీరు కూడా ఆయన చిత్తశుద్దిని శంకించేదిగానే ఉంది. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొంటానని లక్షలాది మంది ఉద్యోగులను సమ్మెబాట పట్టించి, రాష్ట్రాన్ని దాదాపు స్థంభింపజేసిన అశోక్ బాబు, అకస్మాత్తుగా ఉద్యోగుల సమ్మెను విరమింపజేసి, అంతకాలంగా ఉద్యోగులు చేసిన ఉద్యమానికి విలువ లేకుండా చేసారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు దాని అంతు తేల్చుతానని చెపుతూ డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియను సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరించారు. ఆ తరువాత బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ముందు చెప్పినట్లుగా ఏ మెరుపు సమ్మెలు చేయలేదు పైగా శాసనసభ్యులందరూ బిల్లుపై చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన హుకుంలు కూడా జారీ చేసారు. ఇక త్వరలో బిల్లు తిరిగి సజావుగా డిల్లీకి వెళ్ళిపోతోంది గనుక, ఇంతవరకు దానికి సహకరించిన తాము డిల్లీ వరకు దానిని సాగనంపి వస్తామని ముహూర్తాలు కూడా ప్రకటిస్తున్నారిప్పుడు. అయితే బిల్లు రాష్ట్రంలో ఉండగా ఏమీ చేయలేని ఆయన, డిల్లీ వెళ్లి ఏవిధంగా అడ్డుకొంటారో ఆయనే చెప్పాలి. ఇదెలా ఉందంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.   ప్రొఫెసర్.కోదండ రామ్, స్వామీ గౌడ్ వంటి ఉద్యోగులు తెలంగాణా పోరాటాలను, ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఏవిధంగా రాజకీయంగా పైకి ఎదిగారో అదేవిధంగా అశోక్ బాబు కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికీ అశోక్ బాబుకి ఉన్నతేడా ఏమిటంటే, నేడు కాకపోతే రేపయినా వారి పోరాటాల వలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడవచ్చును. కానీ, టీ-బిల్లు పార్లమెంటు గుమ్మం ఎక్కిన తరువాత కూడా ఇంకా సమైక్యాంధ్ర కోసం పోరాడతామని చెపుతూ ఆయన ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో ప్రజలకు, ఉద్యోగులకు కూడా బాగా తెలుసు. ఆయనకు రాజకీయంగా పైకి ఎదగాలనే కోరికే ఉంటే, అందుకు ఎన్నికలు రానే వస్తున్నాయి. ఆయన నిరభ్యంతరంగా అందులో పోటీ చేసుకోవచ్చును. గెలిస్తే మంత్రో, ముఖ్యమంత్రో కావచ్చును కూడా. అప్పుడు ఆయనను ఈవిధంగా విమర్శించేవారు కూడా ఉండరు. కానీ, ఇంకా సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని ప్రజల, ఉద్యోగుల భావోద్వేగాలతో ఆడుకొందామని ప్రయత్నిస్తే, ఏదో ఒకరోజు వారి చేతిలోనే భంగపాటు తప్పదు. ప్రజలలో రాజకీయ చైతన్యం ఇంతగా పెరిగిన తరువాత, ప్రసార మాధ్యమాలలో ప్రతీ రాజకీయ అంశంపై సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు రాజకీయ పరిశీలకులు, నిపుణులు విశ్లేషించి చెపుతున్నపుడు కూడా, ప్రజలకు, ఉద్యోగులకు ఈ రాజకీయాలు, తమ ఆలోచనలు అర్ధం కావని అశోక్ బాబు వంటి వారు భావిస్తే అది వారికే నష్టం.

బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేసి పంపినట్లయితే

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుని తిరస్కరిస్తూ దానిని వెనక్కి త్రిప్పిపంపాలని రూల్.77 క్రింద సభాపతి నాదెండ్ల మనోహర్ కు నోటీసు అందజేశారు. రేపు బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయ్యి దీనిపై ఒక నిర్ణయం తీసుకొనవచ్చును.   ఒకవేళ శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి సీమాంధ్ర శాసనసభ్యులందరూ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించి రాష్ట్రపతికి పంపగలిగినట్లయితే, గతంలోనే కొంతమంది బిల్లుపై సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినందున, ఇప్పుడు ఆయన శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసినట్లయితే, న్యాయపరమయిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గనుక బిల్లుపై రాష్ట్ర శాసనసభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రాన్నిపూర్తి వివరాలు, సంజాయిషీ కోరవచ్చును. లేదా పూర్తి వివరాలతో కూడిన బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపమని కేంద్రాన్నిఆదేశించవచ్చును.    రాజ్యాంగం ప్రకారం నడుచుకొనే రాష్ట్రపతి శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపుతారని భావించలేము. తెలంగాణా బిల్లుపై రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎటువంటి సమస్య ఉండబోదని దిగ్విజయ్ సింగ్ శలవిస్తున్నపటికీ, అటువంటి బిల్లుని రాష్ట్రపతి నిరభ్యంతరంగా ఆమోదిస్తారని కానీ, దానికి పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇస్తుందని గానీ నమ్మకం లేదు. ఈలోగా బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు పడితే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చేపార్లమెంటు సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. తెలంగాణా ఏర్పాటు కూడా అసంభవమే అవుతుంది. అందువల్ల శాసనసభలో తెలంగాణా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం ప్రవేశపెట్టనీయకుండా గట్టిగా అడ్డుకోవచ్చును, ఆ ప్రయత్నంలో వారు సభలో ఆందోళన చేసి సభను స్తంభింపజేయవవచ్చును.   సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులలో బొత్ససత్యనారాయణ వంటి అధిష్టానానికి విదేయులయినవారు కూడా టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటువేస్తామని మొదటి నుండి చెపుతున్నపటికీ, ఎంతమంది ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారనేది సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే తేలుతుంది. ఇక మొదటి నుండి బిల్లుపై ఓటింగుకి పట్టుబడుతున్నవైకాపా సభ్యులు, ముఖ్యమంత్రిని సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గా అవతరింపజేసే ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారో లేదో? అనుమానమే.   ఈ లెక్కలన్నీ సరిచూసుకొని సభలో ఆంధ్ర-తెలంగాణా సభ్యుల బలాబలాలు సరిసమానమయ్యేట్లు ఉంటే, తెలంగాణా శాసనసభ్యులు కూడా ఈ తీర్మానం సభలో ప్రవేశపెట్టడానికి అంగీకరించవచ్చును. సభలో బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా సగం సగం మంది ఓటు వేసినట్లయితే, రాష్ట్రపతి కూడా నిరభ్యంతరంగా బిల్లుపై అమోధముద్ర వేసి కేంద్రానికి పంపేయవచ్చును. ఆ తరువాత బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా? అనేది కేంద్రం సమస్య తప్ప దానితో రాష్ట్రపతికి ఎటువంటి సంబంధం ఉండదు.   కానీ సభలో తీర్మానం పెట్టడం జరిగితే, సీమాంధ్ర నేతలందరూ బిల్లుని వ్యతిరేఖిస్తూ ఓటువేసే అవకాశాలే ఎక్కువ గనుక, బహుశః రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు శాసనసభలో బిల్లుపై ఎటువంటి చర్చ జరుగనీయకుండా తెలంగాణా సభ్యులందరూ అడ్డుపడవచ్చును. వారినందరినీ సభ నుండి సస్పెండ్ చేసి మిగిలినవారు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపితే, ఆ తీర్మానానికి రాష్ట్రపతి విలువీయకుండా బిల్లును యధాతధంగా కేంద్రానికి పంపేసే అవకాశం ఉంది. గనుక, సభాపతి తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయకపోవచ్చును. అంటే రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు ఇక సభలో రచ్చరచ్చే! తెలంగాణా సభ్యులందరూ కలిసి బిల్లుపై చర్చ ముగిసినట్లు సభలో రేపు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.   కేంద్రం రాష్ట్ర విభజన అంశం భుజానకెత్తుకొన్నపటినుండి నేటి వరకు కూడా ప్రతీ దశలో కూడా చాలా సందేహాత్మకంగా సస్పెన్స్ తోనే కొనసాగుతూ ఇంతవరకు వచ్చింది. బహుశః ఈ అనుమానాలు, ఊహాగానాలు, సస్పెన్స్ అన్నీ కూడా కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఓటింగ్ జరిగేవరకు కూడా తప్పకపోవచ్చును.

లోక్ సత్తాకి గెలిచే సత్తా ఉందా?

  గత ఎన్నికలతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన లోక్ సత్తా పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సీటు కూకట్ పల్లి నుండి గెలవగలిగింది. 16 సీట్లు గెలిచిన చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ చేతికి అప్పజెప్పేసి మంత్రి పదవులతో తృప్తి పడ్డారు. కానీ ఒకే ఒక్క సీటు గెలిచిన లోక్ సత్తా ఎలాగో నిలద్రోక్కుకొని నేటికీ తన సత్తా చూపేందుకు ఉవ్విళ్ళూరుతోనే ఉంది. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగా ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే తన 25 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. తాను మళ్ళీ కూకట్ పల్లి నుండే పోటీ చేస్తానని తెలిపారు. తమ పార్టీ ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తులు కూడా పెట్టుకోదని ప్రకటించారు.   ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ, కురుక్షేత్ర యుద్ధానికి తీసిపోని రీతిలో సాగనున్న వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, వైకాపాలను తట్టుకొని ఆయన పార్టీ అభ్యర్ధులు గెలవగలరా? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంటుంది. గత ఎన్నికల తరువాత నుండి నేటి వరకు ఉన్న సమయాన్నిసద్వినియోగపరచుకొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు గట్టిగా చేసినట్లు కనబడలేదు. అంతే కాదు, ప్రజా సమస్యలపై పోరాటంలో కూడా లోక్ సత్తా మిగిలిన పార్టీల కంటే బాగా వెనుకబడిపోయింది. ఈ ఐదేళ్ళ కాలంలో పార్టీని బలోపేతం చేసుకొని, రెండవ శ్రేణి నాయకులను ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు జేపీ ప్రోత్సహించి ఉండి ఉంటే, ఈపాటికి పార్టీలోచాలా మంది బలమయిన నాయకులు తయారయ్యేవారు. కానీ, అలాజరగకపోవడం వలన, పార్టీలో ఆయన తప్ప ప్రజలకు పెద్దగా పరిచయమయిన మొహాలు కనబడటం లేదు.   అదేవిధంగా, రాష్ట్ర విభజన విషయంలో జేపీ ఒకసారి సమైక్యమని, మరొకసారి విభజనే మేలని వాదించడంతో అటు తెలంగాణాలో, ఇటు సీమాంధ్రలో కూడా ప్రజల మన్ననలు పొందలేకపోయారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో జయప్రకాశ్ నారాయణ చాలా దైర్యంచేసి ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భావసారూప్యత గల ఆమాద్మీపార్టీతో ఆయన ఎన్నికల పొత్తులకు ప్రయత్నించినా అతి విశ్వాసంతో ముందుకు సాగుతున్న ఆమాద్మీ ఆయన ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.   ఈ నేపధ్యంలో ఆయన వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరుకి సిద్దమవుతున్నారు. లోక్ సత్తా ఎన్నికలలో పోటీ చేసినా పెద్ద పార్టీలను, కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలను తట్టుకొని గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చును.ఈ పార్టీలన్నీకలిసి గత ఎన్నికలలోలాగే ఓట్లను చీల్చి ప్రధాన పార్టీలకు నష్టం కలిగించడం కూడా ఖాయమని చెప్పవచ్చును.

రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ అధిష్టానానికి ఇజ్జత్ కి సవాల్

  కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రస్తుతం ఉన్నబలం ప్రకారం వచ్చేనెల 7న జరగనున్నరాజ్యసభ ఎన్నికలలో నలుగురు అభ్యర్ధులను అవలీలగా గెలిపించుకోగలదు. కానీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్ధులను బరిలో నిలబెట్టాలనే ఆలోచన చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఈ ఎన్నికలు ‘ఇజ్జత్ కి సవాల్’గా మారనున్నాయి. ఇటీవల షో-కాజ్ నోటీసు అందుకొన్న జేసీ.దివాకర్ రెడ్డి బరిలో దిగి తన తడాఖ చూపిస్తానని ప్రకటించగా, మొదటి నుండి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నవారిలో ఒకరయిన గంటా శ్రీనివాసరావు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.   అధిష్టానానికి విధేయులయిన సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులని తీసివేయగా, మిగిలిన వారి మద్దతుతో ఇద్దరు సభ్యులను గెలిపించుకోవడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాబోదు. ఈ తిరుగుబాటు సభ్యులు కనీసం ఒక్కరిని గెలిపించుకొన్నా అది అధిష్టానానికి చెంపదెబ్బ అవుతుంది. అందువల్లనే ఈ రోజు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిల్లీకి పిలిపించుకొని మాట్లాడ బోతున్నారు. అయితే కొత్తపార్టీ పెట్టే ఊపులో ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి, తన బలం నిరూపించుకోవడానికి వచ్చిన ఈ సువర్ణావకాశాన్నిఎట్టి పరిస్థితులలో వదులుకోకపోవచ్చును. గనుక అధిష్టానానికి, బొత్సకు కూడా ఈ ఎన్నికలు కత్తిమీద సాము వంటివేనని చెప్పవచ్చును.   కానీ, కేవలం రెండే రెండు రాజ్యసభ సీట్లకోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు ప్రతిపక్షాల మద్దతు కోసం వోల్వో బస్సుల వంటి భారీ బహుమతులను పంచిపెట్టేందుకు కూడా సిద్దపడటం గమనిస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కోట్లు ఖర్చు చేసి శాసనసభకో, లోక్ సభకోపోటీ చేసి భంగపడటం కంటే, నలబై మంది శాసనసభ్యుల మద్దతు కూడ గట్టుకొని ఈవిధంగా రాజ్యసభకు వెళ్ళిపోవడమే మేలని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందువల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రెండు సీట్ల కోసం చాల మంది యధాశక్తిన పైరవీలు చేసుకొంటున్నారు.   ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి అనుచరులు అందరూ కలిసి, ప్రతిపక్షాల మద్దతు తీసుకోనయినా సరే తమ ఇద్దరు అభ్యర్ధులను గెలిపించుకొనే ప్రయత్నం చేయవచ్చును. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తన ఇద్దరు అభ్యర్ధులను ఏవిధంగా గెలిపించుకొంటుందో, తనకు వ్యతిరేఖంగా అభ్యర్ధులను నిలబెట్టి మద్దతు ఇస్తున్నసీమాంధ్ర సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనే సాహసం చేస్తుందో లేదో మరొక వారం రోజుల్లో తేలిపోతుంది.