24 న జగన్ బెయిల్ ఫై తీర్పు?
posted on Dec 21, 2012 @ 1:09PM
అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఫై కోర్టు ఈ నెల 24 న తీర్పు ఇవ్వనుంది. ఆయన స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్ ఫై వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ ఇంత క్రితం సిబిఐ కోర్టును ఆశ్రయించాడు. అక్కడ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో, హై కోర్టు ను ఆశ్రయించాడు.
సిబిఐ అధికారులకు విచారణలో సహకరిస్తున్నప్పటికి, జగన్ ను అసలు ఎందుకు అరెస్టు చేసారని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సిబిఐ విచారిస్తున్న ఏడు అంశాలలో ఇప్పటికే జగన్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నందున ఇక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్ న్యాయవాదులు వాదించారు.
అయితే, సిబిఐ వాదన మరోలా ఉంది. జగన్ తాము విచారిస్తున్న కేసుల్లో కీలక నిందితుడని, ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే సామర్ధ్యం గల వ్యక్తి అని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది. తమ క్లెయింట్ కు కనీసం షరతులతో కూడిన బెయిల్ అయినా మంజూరు చేయాలని జగన్ న్యాయవాదులు కోర్టును కోరారు.