రాజకీయ మలుపులో రైతుల ఆందోళన! 6 నెలలుగా పోరాట దీక్ష..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్’తో రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు నెలలలో రైతుల ఆందోళన అనేక మలుపులు తిరిగింది. కొన్ని సందర్భాలలో హింసాత్మకంగా మారింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్ర కోట వద్ద జాతీయ జెండాను,ఆందోళనకారులు  తొలగించారు. అవమాన పరిచారు. అలాగే, ఆ రోజు సంయుక్త కిసాన్ మోర్చా’ అధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలోనూ  హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వ్యక్తి మరణించారు. ఢిల్లీ రైతుల ఆందోళన దేశంలోనే  కాదు అంతర్జాతీయంగానూ వివాదాలకు వేదికగా నిలిచింది. రైతుల ఆందోళన ముసుగులో దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్చా, రచ్చా చాలా జరిగింది.  రైతుల ఆందోళన ఆరు నెలలు  పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటిస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మోర్చా, బుధవారం దేశ వ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన, సమాజంలో  రోజు రోజుకు క్షీణించి పోతున్న సత్యం, అహింసల  పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి,  రైతులంతా నల్ల జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చింది. మరో వంక లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని, ఎక్కడా గుంపులుగా చేరకూడదని రైతులకు డిల్లీ పోలీసులు సూచించారు.  ఎండావానా ప్రకృతి వైపరీత్యాలనే కాకుండా, భయంకరంగా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనాను సైతం లెక్క చేయకుడా, రైతులు ఆరు నెలలుగా ఆందోళన కొనసాగడం, ఓ వంక ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి, రైతుల అన్దోఅలన శిబిరాలలో సకల సౌకర్యాలు, అన్ని ‘ఏర్పాట్లు’ జరిగిపోతున్నాయి. ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారు, ఎక్కడి  నుంచి  నిధుల ప్రవాహం వస్తోంది అనేది అంతుచిక్కని ప్రశ్న గానే మిగిలింది.    అందోళన ప్రపంభానికి ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతూనే ఉంది. రైతు చట్టాలకు సంఘాల నాయకులు సవరణలు సూచిస్తే పరిశీలించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. ఇంకో అడుగు ముందు కేసి, సంవత్సర కాలం పాటు చట్టాల అమలును నిలిపివేసేందుకు కూడా సిద్దమైంది. అయితే, రైతు సంఘాల సంఘటన,  ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ముఖ్య నేత రాకేష్ తికాయత్, ‘చట్టాల సంపూర్ణ రద్దు’ తప్ప ఇంకా దేనికీ అంగీకరించేది లేదని చెప్పారు.  మరో వంక, ఒకప్పుడు ఇవే చట్టాల కోసం, ముఖ్యంగా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతించాలని, అందుకు అవసరమైన చట్టాలు చేయాలని ఆందోళన చేసిన తికాయత్ ఇప్పడు, అవే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అలాగే, గతంలో ఇవే చట్టాలు తెస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రామిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఎందుకు యూ’ టర్న్ తీసుకున్నాయి? ఆలోచిస్తే, ఈ ఉద్యమం వెంక రైతుల ప్రయోజనాలు ఉన్నాయో లేవో కానీ, రాజకీయ ప్రయోజనాలు, ప్రణాళికలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.   వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తికాయత్ చరిస్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఇతర పార్టీలు ఒక వ్యుహంతోనే రైతుల ఆందోళనకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్ ‘లో తికాయత్ జాట్’ మంత్రం పనిచేస్తే, భవిష్యత్’లో జాట్ బెల్ట్ ( రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ,) లో ఆయన్ని అడ్డుపెట్టుకుని  రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో జాట్ల ప్రభావం ఉన్న 50 లోక్ సభ నియోజక వర్గాల్లో, తికాయత్ మంత్రం పనిచేస్తే కాంగ్రెస్’కు పునర్జీవనం వచ్చినట్లే అని  పార్టీ  పెద్దలు లెక్కలు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సమర్ధవంతంగా ఎదుర్కోవడం రాహుల్ గాంధీతో లేదా మరొకరితో అయ్యే పని కాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. అదీ గాక, మోడీ, బీజీపే వ్యతిరేక  శక్తులను ఏక చేసే శక్తి ఒక్క తికాయత్’ కే ఉందని, కాంగ్రెస్ వ్యూహ కర్తలు నిర్ణయానికి వచ్చి నట్లు తెసులుస్తోంది. ఈ నేపధ్యంలో తికాయత్ ఆందోళన రానున్న రోజుల్లో మరింత రాజకీయ రంగును పులుముకుంటుందని,తికాయత్’ను ఆశాజ్యోతిగా భావిస్తున్న బీజేపీ, మోడీ వ్యతిరేక శక్తులు ముందు ముందు, ఆయన సారధ్యంలో  పనిచేసినా ఆశ్చర్య పోనవసరం లేదని  విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీతో కాదు.. సొంత పార్టీపై ఈట‌ల క్లారిటీ.. త్వ‌ర‌లో రాజీనామా..

ఈట‌ల తేల్చేశారు. బీజేపీలో చేర‌డం లేద‌ని తేల్చి చెప్పేశారు. ప‌నిలో ప‌నిగా.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తానంటూ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌ కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నారంటూ రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈట‌ల‌తో ప‌లువురు బీజేపీ నేత‌లు భేటీ అయ్యార‌ని.. ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ జాతీయ నేత ఒకరు హైదరాబాద్ వచ్చి ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా రాజేందర్ కలిసి చర్చించారనే ప్రచారం సాగుతోంది. అయితే, రాజేందర్‌ను కలిశారని జరుగుతున్న ప్రచారంపై  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు కిష‌న్‌రెడ్డి.  కిష‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఇక ఈట‌ల రాజేంద‌ర్ గులాబీ కండువ తీసేసి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మంటూ అంతా భావిస్తున్నారు. అయితే, బ‌య‌ట‌ ప్ర‌చారం ఇలా ఉంటే.. ఈట‌ల రాజ‌కీయ వ్యూహం మ‌రోలా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాను బీజేపీలో చేరుతానంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఏమాత్రం మంచిది కాద‌ని భావించారు. మ‌రింత ఆల‌స్యం చేస్తే.. అంతా అదే ఫిక్స్ అవుతార‌ని అనుకున్నారో ఏమో గానీ.. అలాంటిదేమీ లేదంటూ.. తాను బీజేపీలో చేరడం లేదంటూ ఘంటాప‌థంగా చెప్పేశారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. మద్దతు కోరేందుకే బీజేపీ నేతల్ని కలిశానని అన్నారు.  త‌న జెండా, అజెండా.. సెప‌రేటేన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. స్వ‌తంత్రంగానే ఉంటాన‌ని.. ఎవ‌రితోనూ క‌ల‌వ‌బోన‌ని చెప్పారు. అంటే.. త్వ‌ర‌లోనే కొత్త పార్టీ పెడ‌తార‌నేగా అర్థం? అవును, ఈట‌ల మాట‌లు కొత్త పార్టీ దిశ‌గా సంకేతాలు ఇచ్చాయి. బీసీ ఎజెండాగా ఈట‌ల టీఆర్ఎస్‌ను వీడి వేరుకుంప‌టి పెట్టుకుంటార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం ఉంది. ఆ అనుమానంతోనే ఈట‌ల‌ను కేబినెట్ నుంచి వెళ్ల‌గొట్టారు కేసీఆర్‌. కొత్త పార్టీ పెట్ట‌డ‌మంటే పాన్‌షాప్ పెట్టినంత ఈజీకాదంటూ ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. అయినా.. గులాబీ బాస్ కింద గులామ్‌గిరి చేయ‌డం ఇష్టం లేక‌.. గులాబీ జెండాకు మేము బానిస‌లం కాదంటూ.. రెబెల్ జెండా ఎగ‌రేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. మంత్రి ప‌ద‌విని కోల్పోయినా.. కేసుల‌పై కేసులు పెడుతున్నా.. కేడ‌ర్‌ను త‌న నుంచి దూరం చేస్తున్నా.. ఎక్క‌డా త‌గ్గ‌కుండా.. సైలెంట్‌గా త‌న‌ప‌ని తాను చేసుకుపోతున్నారు. కొత్త పార్టీ దిశ‌గా ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేశార‌ని.. తెలంగాణ‌లో అన్యాయానికి గురైన వ‌ర్గాల‌ను, నాయ‌కుల‌ను క‌లుపుకుని.. కేసీఆర్‌పై దండ‌యాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, తీన్మార్ మ‌ల్ల‌న్న లాంటి వాళ్లు ఈట‌ల‌కు ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారని స‌మాచారం.  కొత్త పార్టీ ఖాయ‌మ‌ని.. త‌న ఉనికిని హుజురాబాద్ ఉప ఎన్నిక‌తో బ‌లంగా చాటుకోవాల‌ని ఈట‌ల భావిస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తాన‌ని తాజాగా మ‌రోసారి ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. మళ్లీ హుజురాబాద్‌ నుంచి పోటీ చేసి త‌న స‌త్తా చాటుతాన‌ని.. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.  ఈట‌ల రాజీనామా చేస్తార‌ని తెలిసే.. ఉప ఎన్నిక వ‌స్తే ఎలాగైనా ఈట‌ల‌ను ఓడించాల‌నే సంక‌ల్పంతో అధికార పార్టీ త‌న బ‌లాన్ని, బ‌ల‌గాన్ని హుజురాబాద్‌పై ఉసిగొల్పింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఈట‌ల వ‌ర్గీయులంద‌రినీ న‌యానో, భ‌యానో దారికి తెచ్చుకుంటోంది. మంత్రులు హ‌రీశ్‌రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌ల‌కు ప్ర‌త్యేకంగా హుజురాబాద్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు కేసీఆర్‌. అయితే, ఎంత‌గా అధికార బ‌లం ప్ర‌యోగించినా.. త‌న‌ను ఏకాకిని చేసే ప్ర‌య‌త్నం చేసినా.. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లంతా త‌న‌వెంటే ఉన్నార‌నే ధీమా ఈట‌ల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తాను హుజురాబాద్ బ‌రిలో దిగుతాన‌ని.. త‌న‌కు మ‌ద్దతుగా నిల‌వాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల‌ను కోరుతూ.. ఆయా నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు ఈట‌ల‌. ఆ సంద‌ర్భంలోనే బీజేపీ నాయ‌కుల‌తోనూ మాట్లాడితే.. ఈట‌ల‌ బీజేపీలో చేరుతారంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు. కానీ, తాను బీజేపీలో చేరేది లేద‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే ఎమ్మెల్యే ప‌ద‌వికీ రాజీనామా చేస్తాన‌ని.. ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండా.. స్వ‌తంత్రంగా ఉంటాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ తేల్చి చెప్ప‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది.

జగన్‌రెడ్డి అమూల్ బేబీ.. ధూళిపాళ్ల‌కు లోకేష్ ప‌రామ‌ర్శ‌..

సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఓ అమూల్ బేబీ అంట టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్‌కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు లోకేశ్‌.  బెయిల్‌పై విడుదలైన ధూళిపాళ్ల నరేంద్రను లోకేశ్‌ పరామర్శించారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం త‌ప్పా? ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా? అని ప్రశ్నించారు.  దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీపై కక్ష సాధింపు దుర్మార్గమన్నారు లోకేశ్‌. అమరావతిలో లేని ఇన్సైడర్ ట్రేడింగ్ కుట్ర‌ను.. స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టారని.. అందుకే ఆయ‌న‌పై క‌క్ష కట్టార‌ని నారా లోకేశ్‌ మండిప‌డ్డారు.  ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ.. కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పెట్టిన అక్రమ కేసుల లిస్టును లోకేష్ చదివి వినిపించారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఇదే లాస్ట్ ఛాన్స్‌.. ఇక జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దేనా?

ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకెళ్లే ముఖ్య‌మంత్రిగా అప్ప‌ట్లో జ‌గ‌న్‌రెడ్డి ఫుల్ పాపుల‌ర్ అయ్యారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకోవ‌డంతో.. హ‌మ్మ‌య్యా అంటూ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. అయితే, ఆ సౌల‌భ్యం ఎన్నో రోజులు ఉండేలా లేదు. ఎంపీ ర‌ఘురామ రూపంలో జ‌గ‌న్‌రెడ్డి బెయిల్‌కి ఎస‌రు ప‌డే అవ‌కాశం ప‌క్కాగా క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. అయితే, జ‌గ‌న్ త‌ర‌ఫు లాయ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలు కోరుతూ.. విచార‌ణ‌ను సాధ్య‌మైనంత ఆల‌స్యం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  తాజాగా.. కౌంట‌ర్ దాఖ‌లుకు వ‌రుస‌గా గ‌డువు కోరుతుండ‌టంపై సీబీఐ కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. కౌంట‌ర్ దాఖ‌లుకు ఇదే చివ‌రి ఆవ‌కాశ‌మంటూ తేల్చి చెప్పేసింది.  జూన్ 1న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోతే నేరుగా విచార‌ణ‌న చేప‌డ‌తామ‌ని సీబీఐ కోర్టు స్ప‌ష్టం చేసింది. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు కేసు విచార‌ణ జూన్ 1కి వాయిదా ప‌డింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.  జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ  రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపగా.. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. 

ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌.. వెంట‌నే ఢిల్లీకి..

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లనున్నారు. డిశ్చార్జ్ త‌ర్వాత గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పేప‌ర్స్ స‌డ్మిట్ చేయ‌డానికి ప‌ది రోజుల స‌మ‌యం ఉండ‌టంతో.. ఆ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకున్నారు ర‌ఘురామ‌. ఆర్మీ హాస్పిట‌ల్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. మ‌రింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరుతార‌ని తెలుస్తోంది.    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది.  దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణరాజు నేరుగా దిల్లీ వెళ్లనున్నారు. ర‌ఘురామ‌ను మ‌రోసారి అదుపులోకి తీసుకునేందుకు ఏపీ సీఐడీ ఆర్మీ హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర కాపు కాసి ఉందంటూ ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో.. ర‌ఘురామ వెంట‌నే ఢిల్లీ వెళ్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 

మహిళను పాడుచేసిన.. యువజన కాంగ్రెస్ నాయకుడు.. 

ఓపెన్ చేస్తే.. అది గుంటూరు జిల్లా. నరసరావుపేట. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ. ఆమెకు పెళ్లి అయింది. కొద్దీకాలానికి తన భర్తతో విబేధాలు వచ్చాయి. అప్పటి నుండి ఆ  మహిళ భర్త నుండి దారంగా వచ్చి నరసరావుపేటలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యం లో తన  దగ్గరున్న 47 సవర్ల బంగారం ఉంది.. ఆ బంగారాన్ని  దాచిపెట్టమని చెప్పి ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు నమ్మి ఇచ్చింది. వాళ్ళు కూడా తీసుకునే తప్పుడు నమ్మకంగా ఉన్నారు. మనుషులు కదా. సామాన్యంగా మనుషులకు ఉన్న  దురాశ వాళ్ళ మెదళ్లలో పుట్టింది.. కొన్నీ కాలం తర్వాత ఆ మహిళ తన బంగారం తనకు కావాలని వాళ్ళను అడిగింది. ఆమె బంగారం అడగడంతో ఆ వ్యక్తులు ప్లేట్ ఫిరాయించారు. మొహం చాటు వేశారు. ఆమె ఎన్ని సార్లు అడిగిన ఫలితం లేదు. ఆ మహిళ ఎన్నిసార్లు అడిగినా వారు బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో చివరకి ఆ మహిళ ఆమెకు న్యాయం కావాలని.. ఆమె బంగారం ఆమె కు కావాలని, నరసరావుపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కట్ చేస్తే..  అదే సమయంలో పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకుడు అట్లూరి విజయకుమార్‌, మాజీ రౌడీషీటర్‌ గుజ్జర్లపూడి ఆనంద్‌ విజయ్‌కుమార్‌ అలియాస్‌ కన్నల్‌ ఆ ఒంటరి మహిళపై కన్ను వేశారు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నారు. పథకం వేశారు. తాము బంగారం ఇప్పిస్తామని ఆమెను నమ్మించారు. అప్పటికే నిస్సహాయక స్థితిలో ఉన్న ఆ మహిళ కసాయిని గొర్రె నమ్మినట్లు నమ్మింది. ఇంకా అంటే ఆమె పై అత్యాచారానికి తెరలేపారు ఆ దుండగులు. నగరం లో  శ్రీనివాసనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెను అక్కడ ఉంచారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, విజయకుమార్‌ అనుకున్నట్లు గానే అదే ఇంట్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు సోషల్‌మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ2 అయిన అట్లూరి విజయకుమార్‌ను నరసరరావుపేట టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ర‌హ‌స్యంగా ఆనంద‌య్య‌ మందు!.. పాల‌కుల కుట్రేనా? దాచేయ్‌.. దోచెయ్‌..

ఆనంద‌య్య‌. వారం రోజుల పాటూ మారుమోగిన పేరు. ఆయ‌న ఇచ్చే మందు.. క‌రోనా బాధితుల పాలిట సంజీవ‌నిలా ప‌ని చేస్తోంది. చూట్టానికి న‌ల్ల‌టి చిన్న‌ ప్యాకెట్‌.  ఆ చిన్న ప్యాకెట్‌లోనే ప్రాణాలు నిలిపే ఔష‌దం దాగుంది. చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న‌వాళ్లైనా.. కంట్లో నాలుగు చుక్క‌లు వేయ‌గానే నిమిషాల్లో లేచి కూర్చుంటున్నారు. ఆక్సిజ‌న్ స్థాయిలు అమాంతం ప‌డిపోయిన వాళ్లైనా.. ఆ మందుతో ఉన్న‌ప‌ళాన లేచి కూర్చొంటున్నారు. ఇక‌, క‌రోనా సోక‌క ముందే ఆ మందు తీసుకుంటే.. వైర‌స్‌ వారి ద‌రిదాపుల‌కు కూడా రావ‌డం లేదు. అది మందు కాదు.. మ‌హిమాన్వితం. నిజంగా అద్భుతం. ఆ అసాధ్యం ఆనంద‌య్య‌కే సాధ్యం. అందుకే ఆనంద‌య్య పేరు ఒక్క‌సారిగా యావ‌త్ దేశంలో మారిమోగుతోంది.  క‌ట్ చేస్తే, ఆనంద‌య్య క‌నిపించ‌డం లేదు. వారం రోజులుగా ఆయ‌న అడ్ర‌స్ లేడు. ఎక్క‌డున్నాడో తెలియ‌దు. ఏం చేస్తున్నాడో తెలియదు. చూద్దామ‌న్నా ఆనంద‌య్య ఆచూకీ తెలీటం లేదు. ఆయ‌న త‌యారు చేస్తున్న మందు పంపిణీని ప్ర‌భుత్వం ఆపేసింది. ఆయుష్‌, ఐసీఎమ్ఆర్ అనుమ‌తులు కావాలంటూ కండీష‌న్ పెట్టింది. ఆయూష్ సైతం ఆనంద‌య్య మందును ఓకే చేసింది. అన్ని ప‌రీక్ష‌ల్లోనూ పాజిటివ్ ఫ‌లితాలే వ‌చ్చాయి. అయినా, ఆనంద‌య్య బ‌య‌ట‌కు రావ‌డం లేదు, ఆయ‌న త‌యారు చేసే మందు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావ‌డం లేదు. మందు మాట స‌రే.. ముందు ఆ మ‌నిషి ఏమై పోయాడు? ఎక్క‌డున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇదే ఆస‌క్తిక‌రం.. అంత‌కు మించి అనుమానాస్ప‌దం.  ఆనంద‌య్య విష‌యంలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. ఆనంద‌య్య బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోవ‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉందంటున్నారు. పాల‌కులు ఆయ‌న్ను హైజాక్ చేశార‌ని చెబుతున్నారు. ఎవ‌రి కంటికి క‌న‌బ‌డ‌కుండా.. గ‌ప్‌చుప్‌గా ఆనంద‌య్య‌తో సీక్రెట్‌గా పెద్ద ఎత్తున‌ మందు తయారు చేయిస్తున్నార‌ట‌. కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్‌-బ్లాక్‌లో పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ప్రతి రోజు వేల మందికి సరిపడే మందుని అన‌ధికారికంగా త‌యారు చేయిస్తున్నార‌ని స‌మాచారం. బ‌కెట్ల కొద్దీ మందును.. ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు, కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల బంధువులు, బ‌డా పారిశ్రామిక వేత్త‌ల‌కు నిత్యం స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని చెబుతున్నారు. రాత్రి వేళ.. మూడో కంటికి క‌నిపించ‌కుండా కార్ల‌లో ప‌క్క రాష్ట్ర ప్ర‌ముఖుల‌కు, ఢిల్లీ పెద్ద‌ల‌కు సైతం త‌ర‌లిస్తున్నార‌ని అంటున్నారు. ఆ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా.. కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్ష‌న్ విధించి.. భారీగా పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేసి.. లోలోన మందు త‌యారీ, స‌ర‌ఫ‌రా చేసేస్తున్నార‌ట‌. త‌మ వారంద‌రికి ఆనంద‌య్య మందు అందాక‌.. ఇక స‌రిపోతుంది అనుకున్నాక‌.. అప్పుడు ఆనంద‌య్య‌ను, ఆయ‌న మందును బ‌య‌ట‌కు వ‌దులుతార‌ని తెలుస్తోంది.  ఆనంద‌య్య‌ను వివిధ ప్రాంతాల‌కు తీసుకొచ్చి మ‌రీ ర‌హ‌స్యంగా ఆయ‌న‌తో మందు త‌యారీ చేయిస్తున్నార‌ట‌. ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేస్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ జరిగింద‌ని వినికిడి. ఆనందయ్యని వంట మాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యే బంధువులకు కాదు.. ఆనంద‌య్య మందును పేదలకు పంచండంటూ టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని సోమిరెడ్డి ప్రశ్నించడం క‌ల‌క‌లం రేపింది. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. అనధికారికంగా నిర్బంధంలో మందు తయారు చేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించాల‌ని.. ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించాల‌ని.. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని సోమిరెడ్డి డిమాండ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఇండియాలో గూగుల్, ఫేస్ బుక్ ఓకే..  ట్విటర్‌ పై సస్పెన్స్? 

భారత్ లో గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ పై బ్యాన్ పడనుందా? కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు చివరి రోజు వరకు స్పందించకపోవడంతో... ఆ రెండు సంస్థలపై నిషేదం విధిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా సస్పెన్స్ వీడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఐటీ మార్గదర్శకాలను పాటించడానికి సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ నిబంధనలు అమలు దిశగా తమ కసరత్తు ఆరంభించామని పేర్కొన్నాయి. దీంతో ఆ రెండు సంస్థలకు ఇండియాలో లైన్ క్లియరైంది.  భారత దేశంలో బుధవారం (మే 26) నుంచి కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్‌ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఐటీ మార్గదర్శకాలు అమలు ప్రక్రియపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు గురించి ఫేస్‌బుక్‌ వివరించలేదు. ‘‘మార్గదర్శకాలను అమలు చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. మా సామర్థ్యాలను మెరుగు పర్చుకుంటాం. అయితే... కొన్ని అంశాలపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ భావాలు వ్యక్తంజేసుకునే వేదికగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటాం’’ అని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  అటు గూగుల్‌ కూడా ఈ నిబంధనలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సంస్థ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం.. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి... ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం’’ అని తెలిపింది. కేంద్రంతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్న ట్విటర్‌ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన తెలపలేదు. ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘కూ’ గతవారమే తాము భారత ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ పాటించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ‘కూ’కు 60 లక్షల మంది వినియోగదారులున్నారు.  సోషల్ మీడియా, ఓటీటీ వేదికల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలు వెలువరించింది. అప్పటి నుంచే ఇవి అమల్లోకి వచ్చినా ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, కూ వంటి దిగ్గజ సంస్థలకు మూడు నెలల సమయం ఇవ్వగా.. గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ సంస్థలన్నీ కొత్త నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటికి రక్షణ కవచంగా ఉన్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుంది. సామాజిక మాధ్యమాలు, న్యూస్ వెబ్‌సైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం... దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు స్పష్టంగా తెలియజేయాలి. ఫేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్ట్ పెడితే వారిపై క్రిమినల్‌ లేదా ఇతరత్రా చర్యలకు ఆస్కారం ఉండేది. ఫేస్‌బుక్‌కు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ  కొత్త నిబంధనల్లో ఆ వెసులుబాటు తొలగించారు. క్రిమినల్‌ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఈ నిబంధనల అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కోరినా కేంద్రం మాత్రం స్పందించలేదు. 

విశాఖ వాసులకు మే నెల గండం?

మే నెల అంటే మండు ఎండాకాలం. భానుడు భగభగమండే సమయం. మే నెల వచ్చిందంటే ప్రస్తుతం విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు. అయితే వాళ్లు భయపడుతున్నది భానుడి ప్రతాపానికి కాదు..  ఏ ఫ్యాక్టరీలో మంటలు వస్తాయోమనన్న భయంతో హడలిపోతున్నారు. ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల వచ్చే పొగతో అల్లాడిపోతున్నారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. గత సంవత్సరం మే నెలలోనే ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది చనిపోగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన స్టెరైన్ గ్యాస్.. కొన్ని నెలల వరకు విశాఖ వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ఘటన ఇంకా మరవకముందే.. ఈసారి కూడా మే నెలలోనే హెచ్‌పీసీఎల్‌ లో మంటలు వచ్చాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా కంపెనీ నుంచి దట్టమైన పొగలు.. ఆ వెంటనే ఆకాశానికి ఎగుస్తూ మంటలు వ్యాపించాయి. దీంతో మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఈ మంటలు పది కిలోమీటర్ల దూరానున్న విశాఖపట్నం వరకు కనిపించాయి.పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో సమీప ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనతో అంతా ప్రాణ భయంతో వణికిపోయారు.  విశాఖపట్నంలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. హెచ్‌పీసీఎల్‌లో క్రూడాయల్‌ శుద్ధి చేసే యూనిట్‌-3లో మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదమేనని అంతా భావించారు. అయితే అధికారులు తక్షణమే స్పందించడం, ఆ యూనిట్‌కు క్రూడాయిల్‌ సరఫరా నిలిపివేయడం, ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్మడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. మూడో యూనిట్‌కు క్రూడాయల్‌ను సరఫరా చేసే ఓవర్‌హెడ్‌ పైపులైనులో లీకేజీ వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. ఈ లీకేజీల వల్ల రెండుచోట్ల మంటలు చెలరేగాయి. ప్రధానంగా చమురుతో వ్యవహారం నడిపే సంస్థలో ప్రధాన పైపులైన్‌కే లీకేజీ ఏర్పడింది అంటే...నిర్లక్ష్యం వహించారని చెప్పక తప్పదు. దానిని తరచూ తనిఖీ చేయాల్సిన యంత్రాంగం ఏమైంది?, రోజువారీ తనిఖీల్లో భాగంగా పరీక్షించారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.  విశాఖ పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.హిందూస్థాన్‌ షిప్‌యార్డులో క్రేన్‌ పనితీరు పరిశీలిస్తుండగా విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. రెండు వారాల క్రితం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో విదేశాల నుంచి తుక్కు తెచ్చే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి పరవాడ మండలం భరణికం గ్రామంలో అనన్య ఫార్మా కంపెనీలో లిక్విడ్‌ అమోనియం గ్యాస్‌ లీకై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కంపెనీని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయించి, విచారణకు ఆదేశించారు.  ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి సంబంధించి హైపవర్‌ కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. అలాగే స్టీల్‌ప్లాంటులో ఏమి జరిగినా బయటకు పొక్కనివ్వరు. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి ఆ తరువాత దానిని పక్కన పెట్టేస్తున్నారు. దాదాపుగా రూ.20 వేల కోట్ల వ్యయంతో కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపడుతున్న హెచ్‌పీసీఎల్‌లో రోజూ వేయి మందికి తక్కువ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రమాదం జరిగిన యూనిట్‌లో కూడా 100 మంది వరకు విధుల్లో ఉన్నారు. సైరన్‌ మోగడం వల్ల వారంతా అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకున్నారు. లేదంటే...కొందరు బలి అయిపోయి ఉండేవారు.  పరిశ్రమల్లో భద్రత వ్యవహారాలు పరిశీలించే ఇన్‌స్పెక్టరీస్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ ఆర్గనైజేషన్‌), బాయిలర్స్‌ విభాగం వంటివి పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను సకాలంలో తనిఖీ చేయలేకపోతున్నాయి. ఎవరికి వారు నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ, భద్రతకు తగిన జాగ్రత్తులు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ కొన్ని సంస్థలు వాటిని పెడచెవిన పెడుతున్నాయి. నిపుణులు, అనుభవజ్ఞులైన వారిని పెట్టుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, అరకొర పరిజ్ఞానం కలిగిన వారితో కీలకమైన, ప్రమాదకర యంత్రాల వద్ద పనులు చేయిస్తున్నాయి. అటువంటిచోట్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌లో మంగళవారం జరిగిన ప్రమాదానికి కూడా నిపుణులు ఆ యూనిట్‌లో లేకపోవడమే కారణమని కార్మికులు చెబుతున్నారు. ఆ యూనిట్‌లో క్రూడాయిల్‌ శుద్ధి ప్రక్రియలో పొగలు, మంటలు వస్తుంటాయి. వాటిని నిపుణులు చాకచక్యంగా అదుపు చేసుకుంటూ పనిచేస్తారు. మంగళవారం సీనియర్లు లేకపోవడంతో ఇటీవలె విధుల్లో చేరిన వారికి ఆ బాధ్యత అప్పగించారని, వారు పొగలు వచ్చినప్పుడు సరిగ్గా వ్యవహరించకపోవడంతో అవి మంటలుగా మారి ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. కరోనా సమంలో పరిశ్రమలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అధికారులు  పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.  అధికారులు ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ప్లాంటు, షిప్‌యార్డు, ఫార్మా సిటీ వంటి భారీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే విచారణకు ఆదేశించినా, ఆ తరువాత నివేదిక బయటకు రాకుండా, ఎటువంటి చర్యలు లేకుండా కాలం గడిపేస్తున్నారు. అధికారులతో తీరుతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణభయంతో వణికిపోతూనే ఉన్నారు. ఇక మే నెల వచ్చిందంటే చాలు వణికిపోతున్నారు విశాఖ వాసులు. 

ప్రభుత్వ టీచర్ కి రూ. 20 వేలు ఫైన్ ఎందుకో తెలుసా..?

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెట్లను పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.. ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు కూడా చెట్లు నాటండి అని తోటి నటీనటులకు ఛాలెంజ్ చేస్తున్నారు.. ఆ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు కూడా చెట్లను నాటుతున్నారు. ఇంతకీ ఈ చెట్ల గోల ఏంటని అనుకుంటున్నారా.. మీరే చూడండి.  కొత్త మంది చెట్లను నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఆ నరికేసిన వాళ్ళు ఏ అక్షరం రానివాళ్లు అయితే పరవాలేదు.. బడిలో పిల్లలు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చెట్లను నరికాడు.. తెలియనివాడు తప్పు చేస్తే క్షమించొచ్చు.. మరి తప్పు చెయ్యొద్దని బుద్దులు చెప్పే బడి పంతులు ఇలాంటి పనిచేస్తే ఎలా చెప్పండి.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం క్రింద మహాశక్తి నగర్, వీధి నెం. 2 లో 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. దీనిపై హరితాహారం పర్యవేక్షకుడు ఐలయ్య ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఉపాధ్యాయుడిపై కమిషనర్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లడుతూ.. సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా ఇలా చేయడం తగదని వ్యాఖ్యానించారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కమిషనర్ మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయనకు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. చెట్టును అనుమతి లేకుండా కొట్టేసినందుకు గానూ మున్సిపల్ కమిషనర్ ఈ జరిమానా విధించారు. పర్యావరణ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు గానూ టీచర్ మరో 50 చెట్లు నాటాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

అదానీ పరమైన గంగవరం పోర్టు

విశాఖ గంగవరం పోర్టు అదానీ గ్రూప్ వశమైంది. గంగవరం పోర్టులోని  మెజారిటీ వాటాను దక్కించుకున్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎ్‌సఈజెడ్‌).. ఇప్పుడా పోర్టును తమ సంస్థలో విలీనం చేసుకోనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.10 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్‌కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. దీంతోగంగవరం పోర్టు లిమిటెడ్‌లో  89.6 శాతం వాటా అదానీల చేతికి వచ్చినట్లైంది.  గంగవరం పోర్టులోని మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా అదానీ గ్రూప్ సొంతం చేసుకునేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదించింది. స్పందించిన ప్రభుత్వం వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పోర్టును ఏపీ సెజ్‌లో విలీనానికి కూడా అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటి నివేదిక తర్వాత... ఏపీ వాటా కూడా కొనుగోలు చేసి గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకోనుంది అదానీ గ్రూప్  గంగవరం పోర్టు చెల్లించిన మూలధనం రూ.51.7 కోట్లు. ఇందులో 58.1వాటా డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం,  31.5 శాతం వాటా వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో ఉంది. మిగిలిన 10.4వాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. మార్చి 3న గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను అమెరికా పీఈ కంపెనీ వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి కొనుగోలు చేసిందిఅదానీ పోర్ట్స్‌.  తర్వాత  58.1 శాతం వాటాను ప్రమోటర్లు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.3,604 కోట్లు వెచ్చించింది.  ఒక్కో షేరుకు రూ.120 చెల్లించి వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటాను అదానీ పోర్టు కొనుగోలు చేసింది. అదే ధరకు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి 30 కోట్ల షేర్లను (58.1) సొంతం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.  పశ్చిమ తీరప్రాంత కంపెనీగానే పరిమితం కాకుండా.. దేశ వ్యాప్త కార్గో యుటిలిటీ కంపెనీగా ఎదగాలని అదానీ పోర్ట్సు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే గంగవరం పోర్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు అదానీల చేతిలో ఉంది. తాజాగా గంగవరం పోర్టు కూడా సొంతం అయింది. ఈ రెండు పోర్టులతో కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది. దాదాపు రూ.12,000 కోట్లకు కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్‌ 75 శాతం వాటాను  కొనుగోలు చేసింది. 2025 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచుకోవాలన్నది అదానీ పోర్ట్సు లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తీరంలో విశాఖపట్నం పోర్టుకు తర్వాత వ్యూహాత్మకంగా గంగవరం పోర్టు ఉంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నాన్‌- మేజర్‌ పోర్టు. ప్రస్తుతం 9 బెర్త్‌లతో పని చేస్తున్న పోర్టు స్థాపిత సామర్థ్యం 64 ఎంఎంటీ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు). అన్ని వాతావరణ పరిస్థితుల్లో కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతోపాటు డీప్‌ వాటర్‌, మల్టీపర్పస్‌ ఓడరేవు ఇది. 2 లక్షల డెడ్‌వెయిటేజ్‌ టన్నుల (డీడబ్ల్యూటీ) నౌకలు కూడా పోర్టులోకి వచ్చే సదుపాయం ఉంది. 1,800 ఎకరాల స్థలం కలిగిన ఈ పోర్టును 250 ఎంఎంటీపీఏ సామర్థ్యానికి పెంచాలన్నది అసలు ప్రణాళిక. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి. బాక్సైట్‌, చక్కెర, అల్యూమినా, ఉక్కు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. తూర్పు, దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లోని ఎనిమిదికి పైగా రాష్ట్రాలకు ఇది ఇంటర్‌ల్యాండ్‌ గేట్‌ వే పోర్టు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ భోజనానికి బ్రేక్.. వైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గం 

అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు.. అధికార వైసీపీ నేతల వ్యవహారం. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు అండగా నిలవడంలోప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార వైసీపీ నేతలైతే పత్తా లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. కరోనా సోకి  తీవ్ర కష్టాల్లో ఉన్నా కనీస సాయం కూడా చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. తాము సాయం చేయకపోగా.. స్వచ్చందంగా సేవ చేస్తున్న సంస్థలను కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  తాజాగా వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచితంగా వ్యవహరించారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవచేస్తున్న వారిపై ఎమ్మెల్యే కన్నెర్ర జేశారు. రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసులు వెళ్లి భోజనం పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. భోజనం పంపిణీ చేస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై పేద ప్రజలు, స్థానికుల అసహనం వ్యక్తం చేశారు.  కరోనా కష్టాల్లో కనిపించకుండా పోయిన వైసీపీ నేతలు... ఇతరుల సాయం చేయకుండా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ వైఫల్యం భయటపడుతుందనే భయంతోనే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు భోజనం పెట్టకుండా అపేయించడం ఏంటని మండిపడుతున్నారు. 

కరోనాతో సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా సోకి రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య  మృతి చెందారు. గత పదిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు కలెక్టర్.. మంగళవారం ఉదయం చనిపోయారు. నల్గొండ జిల్లాకు చెందిన అంజయ్య... ఆ జిల్లాలో ఆర్డీవోగా, ఆర్వోగా, డీఆర్డీఏ పీవోగా పని చేశారు. అదనపు కలెక్టగా ప్రమోషన్ వచ్చాక కొంత కాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్నారు. అంజయ్య మృతితో సిరిసిల్ల జిల్లా ఉద్యోగులు విషాదం మునిగిపోయారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య  మృతి బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. మంచి అధికారిని కోల్పోయామని మంత్రి కేటీఆర్ అంజయ్య మృతిపట్ల  సంతాపం  ప్రకటించారు.  కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్ది కాలంలోనే జిల్లాలో విస్తృత  సేవలు అందించారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ సౌమ్యుడుగా అందరి మనస్సుల్లో స్థానం సంపాదించారన్నారు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో పని చేశారని గుర్తు చేశారు. ఒక మంచి అధికారిగా అర్జీదారులకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన అదనపు కలెక్టర్ అంజయ్య మరణించడం జిల్లాకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు మనోదైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అడిషనల్ కలెక్టర్ అంజయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ . రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందన్నారు.  కలెక్టర్.   కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఆయన లేరనే వార్త నమ్మలేకపొతున్నామని విచారం వ్యక్తం చేశారు. అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారని చెప్పారు.

ఈటలను కలిస్తే తప్పేంటి! రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్ 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజేందర్ తో బీజేపీ నేతలు సమావేశమయ్యారని, ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ నేత ఒకరు హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా రాజేందర్ కలిసి చర్చించారనే ప్రచారం సాగుతోంది.   రాజేందర్ తనను కలిశారని జరుగుతున్న ప్రచారంపై  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటలతో కలసి 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ తో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఈటలను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను.. తనను కూడా  కలుస్తానని ఈటల తనతో అన్నారన్నారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు.  తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమేనని భావిస్తున్నారు. 

మ‌ద్యం సేల్స్‌ ఢ‌మాల్‌.. ప్ర‌భుత్వం ప‌రేషాన్‌!

మండు వేస‌విలో చ‌ల్ల‌టి బీరు గొంతులో జారుతుంటే ఆ కిక్కే వేర‌ప్పా.. అనేది మందుబాబుల మాట‌. అందుకే, ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు తెలుగురాష్ట్రాల్లో బీర్ల అమ్మ‌కాలు రాకెట్‌లా దూసుకుపోతుంటాయి. వ‌చ్చిన స్టాక్ వ‌చ్చిన‌ట్టే అమ్ముడైపోతుంటుంది. ఒక్క బీర్లు అనే కాదు.. బ్రాందీ, విస్కీల సేల్స్ కూడా స‌ర్రున ఎగ‌బాకుతుంటుంది. అయితే.. లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూల కార‌ణంగా ఈ ఏడాది మ‌ద్యం సేల్స్ భారీగా ప‌డిపోయాయి. స‌ర్కారు ఖ‌జానాకు పెద్ద చిల్లే ప‌డింది.  ఉద‌యం ఆరు గంట‌ల‌కే వైన్స్ ఓపెన్ చేస్తున్నారు. పాల ప్యాకెట్ల‌కు పోటీగా లిక్క‌ర్ అమ్మ‌కాలు సాగిపోతున్నాయి. మ‌ద్యం షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు. ఇంకేం.. ఫుల్లు సేల్సు అనిపిస్తుంటుంది. పైపైన చూస్తే.. అలానే క‌నిపించినా.. లెక్క‌లేస్తే మాత్రం లిక్క‌ర్ సేల్స్.. బీరు చ‌ల్ల‌ద‌నం త‌గ్గిన‌ట్టు త‌గ్గిపోతున్నాయి. వైన్స్‌ అమ్మ‌కాలంతా సాయంత్రం, రాత్రి వేళ‌లోనే జ‌రుగుతుంటుంది. లాక్‌డౌన్‌తో పెంద‌లాడే స‌రుకు స‌ర్దేస్తుండ‌టంతో మ‌ద్యం అమ్మ‌కాలు మ‌స‌క‌బారుతున్నాయి. ఆ మేర‌కు ప్ర‌భుత్వానికి భారీగా రాబ‌డి త‌గ్గిపోయింది.  ఆంధ్రప్రదేశ్‌లో వైన్స్ సేల్స్‌ మ‌రీ వెల‌వెల‌పోతున్నాయి. షాపుల సంఖ్య తగ్గించడమో.. కర్ఫ్యూ ప్రభావమో తెలియదుగానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాల సమయాలను తగ్గించడంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు.. ఏపీలో బీరు, లిక్కర్‌ కలిపి మొత్తం 21,31,558 కేసుల విక్రయాలు జరిగాయి. మే నెల వ‌చ్చే స‌రికి.. 1వ తేదీ నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. ఆ లెక్క‌న‌ మద్యం అమ్మకాలు 21.45 శాతం తగ్గినట్లు తేలింది. ఈసారి వేసవిలో బీరు జోరు బాగా త‌గ్గింది. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున కేవలం 13,423 బీరు కేసులే విక్రయించారు. దీంతో బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. బ్రాందీ, విస్కీ వంటి లిక్కర్‌ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 కేసుల లిక్కర్ విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. లిక్కర్‌ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.  ఇక మే నెలలో మద్యంపై వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది. ఏప్రిల్‌లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు ఆదాయం వచ్చింది. అదే మే నెలలో అయితే 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మద్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం అమ్మకాల తగ్గుదలను పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనేది ప్రభుత్వ వర్గాల మాట‌.   

ఆన్‌లైన్ క్లాస్‌లో అస‌భ్య వేషాలు.. ట‌వ‌ల్ చుట్టుకొని పాఠాలు.. టీచ‌ర్ అరెస్ట్‌..

స్కూల్ మాట మ‌ర్చిపోయి చాలా రోజుల‌వుతోంది. ఇప్పుడంతా ఆన్‌లైన్ క్లాసెస్‌. ఎవ‌రు చెబుతున్నారో.. ఏం చెబుతున్నారో.. ఎవ‌రు వింటున్నారో.. అస‌లేం అర్థంకాని ప‌రిస్థితి. ఏ మొబైల్‌ఫోనో, లాప్‌టాపో ప‌ట్టుకొని.. ఓ రూమ్‌లో కూర్చొని పాఠాలు వింటున్న‌ట్టు యాక్ట్ చేస్తున్నారు పిల్ల‌లు. పెద్ద‌లు సైతం వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే అద‌నుగా.. ఓ టీచ‌ర్ పాఠాలు చెప్ప‌డానికి బ‌దులు.. వెకిలి వేశాలు వేయ‌డం స్టార్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో అస‌భ్య‌ కంటెంట్‌ను పంపించ‌డం, బ్యాడ్ మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆల‌స్యంగా విష‌యం వెలుగు చూడ‌టంతో పోలీస్ కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.   ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించిన 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ లో ఈ దారుణం జరిగింది. అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. పోస్కో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను కాపాడే చట్టం) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ క్లాసుల్లో అసభ్య కంటెంట్‌తో పాటు కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదులో తెలిపారు. ఆయన గురించి స్కూల్‌ యాజమాన్యానికి ముందే తెలిసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్టూడెంట్స్‌ ఆరోపించారు. ఈ ఉదంతం.. డీఎంకే ఎంపీ కనిమొళి దృష్టికి రావ‌డంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ టీచ‌ర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని ఆమె అన్నారు. విద్యార్థుల ఫిర్యాదుపై తగు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఎంపీ కనిమొళి స్పందించిన వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అత‌ని దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని త‌మ‌ను తాము స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక‌పై ఇలాంటి అంశాలపై తాము చాలా సీరియస్ గా ఉంటామని తెలిపింది. విద్యార్థుల మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది.

ఎమ్మెల్యే బంధువులకు కాదు.. పేదలకు పంచండి! 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే మందు చేయించుకుంటుంటే జిల్లా మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు. కనీసం కృష్ణపట్నం వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అనధికారికంగా నిర్బంధంలో తయారుచేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.  టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశం కృష్ణపట్నంలో టీడీపీ బృందం పర్యటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,  పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివప్రసాద్ తదితరులు ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన భార్యతో మాట్లాడి వచ్చారు. ఆనందయ్య ఆధ్వర్యంలో సాఫీగా జరిగిపోతున్న ఆయుర్వేదం మందు పంపిణీని ఈ నెల 17న ఆపివేశారని ఈ సందర్భంగా సోమిరెడ్డి ఆరోపించారు. మళ్లీ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించడంతో 40 వేల మంది వరకు వచ్చారని...గొడవ చోటుచేసుకుని లాఠీచార్జీకి దారితీసిందని చెప్పారు.  ఆయుర్వేదం మందుకు మొదట ఐసీఎంఆర్ అనుమతి కావాలన్నారు..తర్వాత అవసరం లేదనన్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఆయుష్ బృందం  ఆనందయ్య ఆయుర్వేదానికి ఓకే చెప్పినా..  ఇప్పుడు మళ్లీ కేంద్ర బృందం నుంచి అనుమతులు రావాలంటున్నారని అన్నారు. అనుమతుల పేరుతో ఆనందయ్య మందును పేదలకు మాత్రం పంపిణీ చేయించకుండా అడ్డంకులు పెట్టారని మండిపడ్డారు.  ఇది కృష్ణపట్నం గ్రామానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదని జాతీయ స్థాయి అంశమని సోమిరెడ్డి అన్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్న దేవుడు ఆనందయ్య అని చెప్పారు. ఆనందయ్యకు మద్దతుగా విద్యార్థులు పోరాడాలని సోమిరెడ్డి పిలుపిచ్చారు. ఎమ్మెల్యేని కాదని ఆనందయ్య ఊరుకు వచ్చే దమ్ము మంత్రులు, ఎస్పీలకు లేదన్నారు. హెల్త్ మినిస్టర్ కు అసలు ఓపికే లేదన్నారు. అనధికారికంగా తయారుచేయించుకుని చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని ముఖ్యమంత్రిని కోరింది టీడీపీ బృందం ప్రత్యేక ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు మధ్య టైమ్ స్లాట్ ప్రకారం అందరికీ మందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. 

భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి.. ప్రియుడికోసం పోలీస్ స్టేషన్ కి.. 

మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి ఈ రెండు ఎప్పుడు,ఎలా, ఎవరితో జరుగుతాయో తెలీదు. యువతీ యువకుల్లో  ప్రేమ పుట్టాం సహజం. కానీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లకు ప్రేమ పుట్టడం కూడా సహజం అని అంటుంది సుజాత.. అలా అని పెళ్లి అయినా వాళ్లకు ప్రేమ పుటుతోందని కాదు. ఆ వారి నిర్ణయాల వాళ్ళ ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఆలోచించాలి. అయినా నేటి  జనాలు  ప్రేమ ముసుగులో చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ ముసుగులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. భాద్యతగా పిల్లల జీవితాలను సక్కదిద్దాల్సిన వాళ్ళు, భాద్యత మరిచి, వారి సొంత సొంత ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారు.  అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ..?  ఓపెన్ చేస్తే.. అది తెలంగాణ. వనపర్తి జిల్లా. అమరచింత మండలం.  ఆమె పేరు  సుజాత. ఆమెకు పెళ్లి అయింది. భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే, అమరచింతలో వారు ఉండే కాలనీకి చెందిన రాకేశ్​అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడి కోసం ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి నెల రోజుల కింద రాకేశ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది.  కట్ చేస్తే.. ఇద్దరు  భార్యాభర్తలమని చెప్పి వరంగల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు తీవ్రంగా గాలించాయి. చివరికి వరంగల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఈనెల 21న రాకేశ్ కుటుంబ సభ్యులు వరంగల్ వెళ్లి.. ఇద్దరిని ఒప్పించి అమరచింతకు తీసుకువచ్చారు. భర్త ఇంటి వద్ద సుజాతను వదిలేశారు. అక్కడితో ఆగని సుజాత తన ప్రియుడితోనే చావైనా బతుకైనా అని చెప్పి చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. సుజాత సోమవారం అమరచింత పోలీస్స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపింది. తాను ప్రియుడు రాకేశ్‌తోనే ఉంటానని స్టేషన్ ముందు బైఠాయించింది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. రాకేశ్‌పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని, రాకేశ్‌ను ఎక్కడ దాచి పెట్టారో చెప్పాలని పోలీసులను కోరింది. ఈ మేరకు వినతి పత్రం పోలీసులకు ఇచ్చింది. అతని మొబైల్ కూడాఅందుబాటులో లేకుండా చేశారని ఆరోపించింది. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.  

యువ‌కుడి కొట్టిన మ‌రో క‌లెక్ట‌ర్‌.. ఈ పెద్దోళ్ల‌కి ఏమైంది?

పోలీసులు కొట్ట‌డం కామ‌న్‌. ఖాకీలు కొడితే జ‌నాలు సైతం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అదే క‌లెక్ట‌ర్ కొడితే మాత్రం. సీన్ సితార్ అయిపోతుంది. వెంట‌నే ముఖ్య‌మంత్రి సైతం స్పందిస్తారు. వెంట‌నే క‌లెక్ట‌ర్‌పై యాక్ష‌న్ తీసుకుంటారు. ఇటీవ‌ల ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అలానే జ‌రిగింది. లాక్‌డౌన్ టైమ్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడి సెల్‌ఫోన్ ప‌గ‌ల‌గొట్టి.. అత‌డి చెంప చెల్లుమ‌నిపించిన క‌లెక్ట‌ర్‌ను స‌స్పెండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తాజాగా, మ‌రో అద‌న‌పు క‌లెక్ట‌ర్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఎప్ప‌టిలానే విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ స‌మ‌యంలో చెప్పుల షాప్ తెరిచిన ఓ యువ‌కుడిపై  షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. షాప్ ఎందుకు తెరిచావంటూ.. ఆగ్ర‌హంతో ఆ యువ‌కుడి త‌ల‌పై ఒక్క‌టిచ్చారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆ షాపు పిల్లాడిని కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇక అంతే. ఆ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌ను కామెంట్ల‌తో ఆటాడుకున్నారు నెటిజ‌న్లు.  క‌ట్ చేస్తే.. ఆ విష‌యం ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వ‌ర‌కూ చేరింది. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని మంత్రి తెలిపారు.  క‌లెక్ట‌ర్ అంటే వైట్ కాల‌ర్ జాబ్‌. ఎంచ‌క్కా ఏసీ ఛాంబ‌ర్‌లో కూర్చొని పాలించ‌డం వారి విధి. అధికారుల‌తో స‌రైన రీతిలో ప‌ని చేయిస్తూ.. జిల్లా అభివృద్ధికి పాటుప‌డ‌టం వారి క‌ర్త‌వ్యం. అందుకే, క‌లెక్ట‌ర్లు చాలామంది ప్ర‌శాంతంగా క‌నిపిస్తారు. వారిలో కోపం క‌నిపించ‌డం చాలా అరుదు. అదే క‌లెక్ట‌ర్‌ రోడ్డు మీద‌కు వ‌స్తే.. తేడా వ‌చ్చేస్తోంది. క‌ళ్ల ముందు త‌ప్పు క‌నిపిస్తే.. వారిలో శాంతం న‌శిస్తోంది. లాక్‌డౌన్ అని చెప్పినా.. షాపులు తెర‌వ‌ద్దు అని సూచించినా.. అన‌వ‌స‌రంగా బ‌య‌టకు రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసినా.. ప్ర‌జ‌లు రూల్స్ పాటించ‌డం లేదు. అందుకే క‌రోనా ఏమాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. కాబ‌ట్టే.. రోడ్డు మీద‌క వ‌చ్చిన ఆ యువ‌కుడిని చూసి ఛ‌త్తీస్‌గ‌ఢ్ క‌లెక్ట‌ర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు అనే వారు ఉన్నారు. కోపం వ‌స్తే మాట‌ల‌తో మంద‌లించాలి కానీ, ఖ‌రీదైన‌ సెల్‌ఫోన్ ప‌గ‌ల‌గొట్ట‌డం, చెంప మీద కొట్ట‌డం ఏంట‌ని మ‌రికొంద‌రు మండిప‌డుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ అలానే జ‌రిగింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను గాలికి వ‌దిద‌లేసి.. చెప్పుల షాపు తెర‌చిన యువ‌కుడికి అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఒక్క‌టిచ్చారు. అదేమంత త‌ప్పు కాద‌నేది మ‌రికొంద‌రి మాట‌. ఇలా ఎవ‌రి వాద‌న వారిదే.