కరోనా నుంచి కోలుకున్నారా? అయితే .. ఇవి  మార్చండి..

ఒక్కొక్కప్పుడు చిన్న తప్పిదమే, పెద్ద ముప్పును తెచ్చి పెడుతుంది. కరోనా  ఫస్ట్ ఫేజ్ వెళ్ళిపోయిందని.. ఇక రాదన్న భరోసాతో మనం అందరం, మాస్క తీసేశాం, మూడడుగుల దూరం మరిచి పోయాం. చేతులు శుభ్రం చేసుకోవడం మానేశాం. మన కంటే ఘనులు మన నాయకులు ఏకంగా వేల మందితో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, కుంభ మేళాలు,ఒకటనేమిటి చేయకూడని పనులన్నీ చేసి   ఇప్పుడు చింతిస్తున్నాం. కన్నీళ్ళు పెట్టుకుని కుములి పోతున్నాం. చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకుంటే  ప్రయోజనం ఏముంటుంది? కన్నీళ్లు వృధా కావడం మినహా...   ఇపుడు కరోనా వచ్చి తగ్గిన వారికి , కరోనా మరోమారు రాదన్న భరోసా లేదని.. అలాంటి భరోసా అసలు వద్దని నిపుణులు అంటున్నారు. అంతే కాదు కరోనా వచ్చి తగ్గిన తర్వాత చేసే చిన్న తప్పులే పెద్ద చిక్కులు తెచ్చి పెడతాయని హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా కరోనా నుంచి బయట పడిన బాధితులు, ముందుగా చేయవలసింది ... అంతవరకు వాడిన టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ ... తక్షణమే మార్చేయడం. అదే బ్రష్ అదే టంగ్ క్లీనర్ వాడడం  కామన్’గా అందరూ చేస్తున్న తప్పు. కరోనా పేషెంట్ కోలుకున్నవెంటనే  టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవడం మరిచి పోరాదని  వైద్యులు చెపుతున్నారు. చూడడానికి చాలా చిన్న తప్పుగా కనిపిస్తుంది కానీ, ఈ చిన్న తప్పే, ఒక్కోసారి ఇంటిల్లిపాదినీ, కరోనా పాలిట పడేలా చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  శాస్త్రవేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం,  కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఏదైనా వస్తువుపై చేరినా లేక గాలిలో అయినా కొంత కాలం పాటు మరణించకుండా ఉంటోంది. దీని వల్ల చాలా మందికి కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్లు కోలుకోగానే టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు మరోసారి కరోనా బారిన పడకుండా ఉండటంతోపాటుగా.. ఒకే వాష్‌రూమ్ ఉపయోగించే కుటుంబ సభ్యులను కూడా కాపాడిన వారవుతారని చెప్తున్నారు. ముఖ్యంగా కరోనా సోకిన సమయంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మీద వైరస్ చేరుతుంది, అదే బ్రష్. టంగ్ క్లీనర్ వాడితే, వాటి మీద ఉన్న వైరస్ ఎగువ శ్వాసనాళలో చేరుతుంది. సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొత్త బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని, దాంతోపాటు మౌత్‌వాష్ వాడడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, కరోనా సోకితగ్గిన వారు ఉపయోగించిన టవల్స్, ఇతర వస్తువలను కూడా ఇతరులు వాడకపోవడం పోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా వైద్యుల సలహాను పాటించడమే మంచిదని చెప్తోంది. ఇవ్వన్నీ చినంగా కనిపించే పెద్ద ప్రమాదాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

జోగి రమేష్ కు త్వరలో కేబినెట్ బెర్త్! తిట్లే ఆయనకు పాజిటివ్? 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మే23తో రెండేళ్లు అవుతోంది. 2019 మే 23న జరిగిన ఎన్నికల కౌంటింగులో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్... కేబినెట్ కూర్పుపై కీలక ప్రకటన చేశారు. రెండేళ్ల తర్వాత మెజార్టీ మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. జగన్ చెప్పిన సమయం పూర్తి కావడంతో...  జగన్ కేబినెట్ విస్తరణపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత  విష్ణుకుమార్ రాజు.. మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ త్వరలో మంత్రి కాబోతున్నారని చెప్పారు విష్ణుకుమార్ రాజు. వైసీపీలో బాగా తిట్టగలిగిన వాళ్లకే పదవులు వస్తాయని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో టీడీపీ, బీజేపీపై జోగి రమేష్ తిట్లతో విరుచుకుపడుతున్నారని.. సో ఆయనకు కేబినెట్ లో బెర్తు ఖాయమంటూ విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. ఈ నెల 20న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ్యుడు జోగి రమేశ్.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామపై నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎంపీ రఘురామ రాజును తిట్టిన ఎమ్మెల్యే జోగు రమేష్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనను ఉదహరిస్తూ.. ఈసారి జరిగే ఏపీ క్యాబినెట్ విస్తరణలో జోగి రమేశ్ కు పదవి ఖాయమన్నారు బీజేపీ నేత  విష్ణుకుమార్ రాజు.  తెలుగు దేశం పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసే వారికి వైసీపీలో ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం మొదటి నుంచి ఉంది. సీఎం జగన్ కూడా అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తారని  చెబుతారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్వగ్రామంలో హల్చల్ చేసిన వైసీపీ శ్రీకాకుళం లోక్ సభ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కు .. కొన్ని రోజులకే పదవి వరించింది. దువ్వాడను ఎమ్మెల్సీగా పంపించారు సీఎం జగన్. అచ్చెన్నను టార్గెట్ చేయడం వల్లే దువ్వాడకు వెంటనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని వైసీపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్లు కూడా.. తమ పదవిని కాపాడుకునేందుకే టీడీపీని తిట్టడంలో పోటీ పడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా తమకు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ రాజును తిట్టిన జోగి రమేష్ ను సీఎం జగన్ కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చెప్పారు.  చంద్రబాబును తిట్టిన వారితో పాటు  కస్టడీలో ఎంపీ రఘురామ రాజును కొట్టినవారికి కూడా పదోన్నతులు లభిస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఒకవేళ రఘురామ జైలుకు వెళ్లుంటే మాత్రం అనుమానాస్పద స్థితిలో మరణించేవారని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. జగన్ అంటే తనకు గౌరవం అని, లేదంటే తనను కూడా లోపలేస్తారని చమత్కరించారు. రఘురామ ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.  

ఇటుక బ‌ట్టీ కూలీగా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌.. బ‌తుకు జ‌ట్కా బండి..

పుట్‌బాల్‌. ఇండియాలో అంత‌గా పాపులారిటీ లేని ఆట‌. అంత‌ర్జాతీయంగా మాత్రం ఫుల్ క్రేజ్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా డ‌బ్బు సంపాదించేది ఫుట్‌బాల్ ప్లేయ‌ర్సే. ఆ ఆట ఆడాలంటే అధిక శారీర‌క సామ‌ర్థ్యం ఉండాలి. ఇక  నైపుణ్యం అయితే ఓ రేంజ్‌లో అవ‌స‌రం. మెరుపులా ప‌రుగు పెట్టాలి. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు మ‌స్కా కొట్టి గోల్ కొట్టాలి. అలాంటి ప్రావీణ్యమే ఉన్న ఓ అంత‌ర్జాతీయ ఫుట్ బాలర్ అయిన ఓ అమ్మాయి.. మ‌న ద‌గ్గ‌రా ఉంది. ఆమె పేరు సంగీతా సోరెన్‌. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్ 17 పోటీల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు సీనియర్ జాతీయ జట్టుకూ పిలుపొచ్చింది. టీమ్ లో ఇక చేరడమే తరువాయి అన్న టైంలో.. లాక్ డౌన్ వచ్చిపడింది. ఆమె బ‌తుకు జ‌ట్కా బండి త‌ల‌కిందులు అయింది. లాక్ డౌన్ తో కుటుంబ భారం మొత్తం ఆమెపైనే పడింది.  జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా బాసమూది గ్రామం ఆమెది. ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకూ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆ ఉపాధి పోయింది. దీంతో కాళ్లతో బంతిని తన్ని గోల్ కొట్టాల్సిన ఆమె.. చేతుల‌తో ఇటుకలు మోస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తన కల అయిన ఫుట్ బాల్ ను వదిలేది లేదని, అప్పటి వరకు బతుకు బండి నడవడానికి పనిచేయక తప్పదని సంగీత అంటోంది. కూలీకి వెళ్లే ముందు.. రోజూ ఉద‌యం సమీపంలోని పొలాల్లో ఫుట్‌బాల్ ఆట‌ను సాధ‌న చేస్తూ.. ఆట‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటోంది.  గ‌తంలో సంగీత‌ సోరెన్‌ను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హేమంత్ సోరెన్ హామీ ఇచ్చినా.. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో తల్లితో కలిసి ధన్ బాద్ లోని ఓ ఇటుకల బట్టిలో కూలి ప‌ని చేస్తోంది. ప్రతి ప్లేయర్ కు మంచి ఆహారం, ప్రాక్టీస్ ముఖ్యమని, అలాంటి వాటిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని మండిప‌డుతోంది. అందుకే తన లాంటి ఆట‌గాళ్లంతా కూలీలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ సంగీత సోరెన్‌.

ఆనందయ్య మందుకు టీటీడీ సపోర్ట్! స్టెరాయిడ్స్ వల్లే కోటయ్యకు సీరియస్? 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కొవిడ్ ఆయుర్వేద మందుకు మద్దతు పెరుగుతోంది. ఆనందయ్య మందులో హానికారక పదార్థాలు లేవని ఆయుష్ శాఖ శనివారం క్లారిటీ ఇచ్చింది. తాజాగా తిరుపతి ఆయుర్వేద వైద్య కళశాల కూడా ఆనందయ్య మద్దతుకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. కృష్ణపట్నం వెళ్లిన తిరుపతి ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ల బృందం.. ఆనందయ్య కోవిడ్ మందు తయారీలో ఉపయోగించే మూలికలు, తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా అనందయ్య రూపొందించిన కరోనా మందుతో ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. కృష్ణపట్నం మందుకు పరిశోధక బృందాల నుంచి అనుమతులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై  కూడా ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు చర్చించారు. ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్, ఐసీఎంఆర్ అధ్యయనం సంస్థల నివేదికల కోసం చూస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య మందుపై సానుకూల నివేదికలు వస్తే, ఆ మందును ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారుచేస్తామని తెలిపారు. ఆ మేరకు ఆయుర్వేద ఫార్మసీ ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. శేషాచలం అడవుల్లో ఔషధం తయారీకి అవసరమైన వనమూలికలు విరివిగా లభ్యమవుతాయని ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడించారు. ఆనందయ్య మందును ఆయుష్, ఐసీఎంఆర్ పరిశోధకులు కరోనా మందు కాదని తేల్చినా, దాన్ని వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే మందుగా పరిశీలిస్తామని తెలిపారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదని అభిప్రాయపడ్డారు.ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైందని అన్నారు. ఇలాంటి మందులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోటయ్య స్టెరాయిడ్స్ వాడడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తెలిసిందని అన్నారు.   మరోవైపు కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య అన్నారు. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.  ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని, వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నానని, అమ్మేవారిని కట్టడి చేయాలని పోలీసులను ఆనందయ్య కోరారు. 

హరీష్ రావుకు అగ్ని పరీక్ష? కేటీఆర్ కోసం బలిపెడుతున్నారా?

  తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ఎలా ఉంటాయో, ఊహించడం ఆయన ప్రత్యర్దులకే కాదు, సన్నిహిత సహచరులకు కూడా ఒక పట్టాన అర్ధం కాదు. నరేంద్ర మొదలు ఈటల వరకు ఆయనకు సన్నిహితంగా మెలిగిన ఈ ఒక్కరికీ కూడా, ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు అర్థం కాలేదు. అందుకే అందరూ అలా చతికిల పడి పోయారు. ఇది చరిత్ర. ఇక నడుస్తున్న చరిత్రలోకి వస్తే ఇటీవల బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో చెక్ పెట్టే బాధ్యతను ముఖ్యంత్రి ముందు మంత్రి గంగులకు అప్పగించారు. ఇప్పడు ఆ ఆ బాధ్యతను హరీష్ రావుకు బదిలీ చేశారు ఈ బదిలీలోనూ కేసీఅర్ మాస్టర్ స్ట్రాటజీ దాగుందని, ఒక  విధంగా ఇది హరీష్ రావుకు  అగ్నిపరీక్ష అనుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. హరీష్ రావుకు కేసీఆర్’తో ఉన్నది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య రక్త బంధం కూడా వుంది. కేసీఆర్ రాజకీయ చాణక్యానికి కూడా హరీష్ నిజమైన వారసుడు అంటారు. అలాగే హరీష్ రావుకు ఈటలతో ఉన్నది కూడా కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదు, రాజకీయ స్నేహ బంధం. అంతే కాదు, భవిష్యత్ లో ఇద్దరూ కలిసి ప్రయాణం చేయవలసి ఉందని, అందుకు ఇద్దరూ సిద్ధమయ్యారనే చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెరాస వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది. నిజానికి, ఇద్దరూ నిన్న మొన్నటి  వరకు ఒకే పడవలో ప్రయాణించారు.  ఎవరో కాదు, ఈటల స్వయంగా, కేసీఆర్ అసలు లక్ష్యం హరీష్ అని చెప్పకనే చెప్పారు. అలాగే, తనతో పాటు హరీష్ కూడా అవమానాలకు గురయ్యారని, ఒకటి రెండు సందర్భాలలో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారని, కలిసి ఏడ్చిన సందర్భాలున్నాయని  కూడా ఈటల చెప్పినట్లు వార్తలొచ్చాయి.  తెరాసలో సాగుతున్నఈ రాజకీయ హైడ్రామాకు మూల కారణం ఈ ముగ్గురు కాదు.. కేటీఆర్ అనే  చర్చ జరుగుతోంది. కేటీఅర్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది కేసీఆర్ ఫామిలీలో ఒక వర్గం ఆకాంక్ష. ఈమేరకు కేసీఆర్ మీద వత్తిడి వస్తోందని, రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న విశ్లేషణ లేదా విమర్శ. నిజానికి ఇప్పటికే కేటీఆర్ పట్టాభిషేకానికి అటు రాజకీయ వర్గాలు, ఇటు మీడియా రెండు మూడు సందర్భాలలో ముహూర్తాలు కూడా కూడా పెట్టాయి. అయితే,అవేవీ నిజం కాలేదు. అలాగే, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’ అని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు వంటి వారు, బహిరంగ వేదిక నుంచి అదికూడా, కేటీఅర్ సమక్షంలోనే, ప్రకటించారు. అలాగే ఇతర నాయకులూ కూడా, ‘అయితే ఏంటి ? ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి’ అంటూ అధికార మార్పిడికి పచ్చ జెండా ఊపారు. అయినా, కారణాలు ఏవైనా, ‘వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే’ అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఇంతవరకు ముహూర్తం కుదరడం లేదు.  నిజానిజాలు ఎలా ఉన్నా కేటీఆర్ ను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేయడం వలన సమస్యలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని, ముఖ్యంగా కేటీఆర్’కు పగ్గాలు అప్పగిస్తే  పార్టీలో ముసలం తప్పదని కేసీఆర్ గ్రహించారని అంటున్నారు, అందుకే  ఒక వ్యూహం ప్రకారం ముందు, ఈటల, హరీష్ మధ్య దూరం పెంచే వ్యుహంతోనే కేసీఆర్.. హుజురాబాద్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి అల్టిమేట్’గా హరీశ్’ను బలహీన పరచడమే కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ వ్యూహాన్ని గమనించే ఈటల..  రాజీనామాకు, ఉప ఎన్నికకు తొందర పడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల గంగులతో జరిగిన జుగల్బందీ లో కూడా ఈటల.. ఇప్పుడే ఉప ఎన్నిక రాదని చెప్పారు. నిజానికి బంతి ఇప్పడు ఈటల కోర్టులో ఉంది. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. లేదంటే లేదు. అదే విధంగా, కేసఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హరీష్ రావు మామ చేయి వదలరని, ఆమేరకు ఆయన కేసీఆర్ కు మాటిచ్చారని అంటున్నారు. కేటీఆర్ సహా ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా, తదనంతర పరిణామాలకు  తన బాధ్యత ఉండదని కూడా హరీష్ ఎప్పుడోనే  స్పష్టం చేశారని చెబుతున్నారు.  అందుకే ముందు హరీష్’ను బలహీన పరిచి, ఆ తర్వాతనే కేటీఆర్’ను ముఖ్యంత్రి చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రస్తుత ఎపిసోడ్ నడుస్తోందని రాజకీయ వర్గాల సమాచారం. అయితే రాజకేయాల్లో  ఎప్పుడు ఏమి జరుగుతోందో ...  ఎవరికి  తెలుసు.. 

ఏ మందుకుంది సర్టిఫికేట్! ఆనందయ్యపై కుట్ర జరుగుతోందా? 

ఎయిడ్స్  కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం. అలాగే కరోనాకు కూడా ఇంతవరకు మందు లేదు. ఇదీ మందు అని, ఈ మందు వాడితే కరోనా ఖాయంగా తగ్గుతుందని ఏ శాస్త్రవేత్త, ఏ వైద్యుడు, నిర్ధారించలేదు. చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక నిర్ధారణకు రాలేదు. కరోనా సోకినా అనేక మంది లక్షలు లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకుని, చివరకు అయిన వారికి ఆఖరి చూపు భాగ్యం అయినా లేకుండా ఆసుపత్రి ఐసీయు నుంచి నేరుగా కాటికి చేరుతున్నారు. అదే కరోనాతో ఇంట్లోనే ఉండి వంటింటి వైద్యంతో బయటపడిన వారున్నారు.  నిజానికి కరోనా ఎక్కడ ఎలా పుట్టింది అనేదే ఇంతవరకు నిర్ధారణ కాలేదు. చైనా  వ్యూహాన్ కేంద్రంగా ఎంతో  కాలంగా చేస్తున్న జీవాయుధ పరోశోధనల ఫలితంగా కరోనా పుట్టిందా లేక సహజంగా ప్రకృతిలో చోటు చేసుకున్న పరిణామాల వలన ఈ మహమ్మారి పుట్టుకొచ్చిందా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా సమాధానం లేదు. ఇటీవల వరం పదిరోజుల క్రితం కూడా అమెరిక , బ్రిటన్ కు చెందిన శాస్త్ర వేత్తలు, వైద్యులు మూడు కరోన పుట్టుకను తేల్చండని ప్రపంచ ఆరోగ్య  సంస్థకు లేఖ రాశారు.  కొవిడ్ చికిత్సకు సంబంధించి ఏ ఒక్క మందులకు సంబంధించి ఎలాంటి పక్కా అవగాహన వైద్య ప్రపంచానికి లేదు. ఒక నిర్దిష్ట ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా చికిత్స జరిగిపోతోంది. వివిధ మందులు ప్రజల శరీరంపై ప్రయోగించి మానవ శరీరాలను ప్రయోగశాలగా మార్చేస్తున్నారు. ఇది అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. దివ్య ఔషధాలుగా పేర్కొన్న మందులు తెచ్చిపెట్టిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనేక మంది చనిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు  ‘రెమ్‌డెసివర్’ అనే మందు కొవిడ్ రోగికి పునర్జన్మనిచ్చే దివ్య ఔషధం, అని ప్రచారం జరిగింది. మార్కెట్లో మందు మాయమైంది. బ్లాకు మార్కెట్’లో వందల మందు వేలకు బెంగళూరు వంతో చోట్ల లక్షలకు అమ్ముడు పోయింది. మంత్రి కేటీఆర్, సోమూ సూద్ ట్విట్టర్  తెరిస్తే, ‘రెమ్‌డెసివర్’ రిక్వెస్ట్లు ... వారు తమ పలుకుబడిని ఉపయోగించి ఆ దివ్య ఔషదాన్ని ఇప్పించి పుణ్యం కట్టుకున్న సందర్బాలు అనేకం కనిపిస్తాయి. కానీ  ఇప్పుడు అదే రెమ్‌డెసివర్’ వల్లనే చాలామంది చనిపోయారని అదే వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.  కొవిడ్ చికిత్సలో అదే పనిగా వాడిన స్టెరాయిడ్స్, ‘సైడ్ ఎఫెక్ట్స్’ గా మరో ప్రాణాంతక వైరస్ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ పుట్టు కొచ్చాయి. ఎక్కువకాలం ఐసీయులో ఉంచడం, ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ వినియోగం కూడా బ్లాక్ ఫంగస్’కు కారణమంటున్నారు. దీంతో ఎలాగో  ప్రాణాలతో బయట పడ్డామని ఊపిరి తీసుకుంటున్న కొవిడ్ బాధితులు, బ్లాక్ ఫంగస్ భయంతో వణికి పోతున్నారు. ఇదనే కాదు కొవిడ్19వ్యాధికి వంటింటి చిట్కాల నుంచి వేలు లక్షలు, కోట్ల రూపాయల విలువచేసే అనేక చికిత్సలు జరుగు తున్నాయి. ఈ మందులు అన్నిటికీ, ఏ పరీక్షలు జరిపారో, ఎవరు అనుమతులు ఇచ్చారో, ఎవరికీ  తెలియదు. ప్రపంచాన్ని పక్కన పెట్టి  మన దేశం విషయాన్నే తీసుకున్నా రోజుకు నాలుగు వేల మంది కొవిడ్’తో కన్ను మూస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది పేరు మోసిన ఆసుపత్రులలో..  ఇంకా .ఎక్కువ పేరు మోసిన ఫార్మ కంపెనీలు తాయారు చేసిన మందులు వాడే, ప్రాణాలు వదిలారు. మరి ఇలా పోయిన, పోతున్న ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?ఇంతవరకు అసలు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాలేదు.  నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఓ సామాన్య ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య కరోనా చికిత్సకు ఒక దివ్యమైన ఔషదాన్నికనుగొని పైసా ఖర్చు లేకుండా వందల ప్రాణాలు కాపాడుతుంటే ఎక్కడలేని గద్దలు వాలి పోయాయి. ఆనందయ్య మందుకు,శాస్త్రీయతను ప్రశ్నిస్తున్నారు, సర్టిఫికేట్ ఏదని నిలదీస్తున్నారు. మొత్తానికి ఆనందయ్య  మందుకు మూత బిగించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. నిజానికి  ఒక్క ఆనందయ్య మాత్రమే కాదు, తమకు అవకాశం ఇస్తే మొక్కల ద్వారా కరోనాను అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయుర్వేద వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు అన్నింటినీ, డ్రగ్ మాఫియా , పొలిటికల్ మాఫియా మొగ్గలోనే తుంచేశాయి. అయితే ఆనందయ్య ఉదంతతో డ్రగ్ మాఫియా , పొలిటికల్ పవర్ మధ్య గల చీకటి బంధం వెలుగు చూసింది. ప్రపంచ మానవాళిని భయపెడుతూ అనేక మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారికి సంబంధించి అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇదొక శుభ పరిణామం. 

ఉక్కుశిబిరానికి నిప్పు.. మంట‌ల వెనుక‌ కుట్ర‌కోణం?

విశాఖ ఉక్కు కోసం ఉక్కు సంక‌ల్పంతో పోరాడుతున్నారు. ఒక‌టి, రెండు రోజులుగా కాదు.. ఏకంగా 100 రోజుల నుంచి అలుపెర‌గ‌ని ఉద్య‌మం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు, నిర్వాసితులు మొక్క‌వోని దీక్ష‌తో ఉద్య‌మిస్తున్నారు. జీవీఎంసీ కార్యాల‌యం ఎదుట.. గాంధీ విగ్ర‌హం ద‌గ్గ‌ర‌.. దీక్షా శిబిరం ఏర్పాటు చేసి.. అక్క‌డే తిష్ట‌వేసి.. స‌ర్కారు దిగొచ్చేదాకా.. త‌గ్గేదే లే అంటూ పోరాడుతున్నారు. నిత్యం ఆ దీక్షాశిబిరం కార్మికుల నినాదాల‌తో మారుమోగుతోంది. అలాంటి.. దీక్షాశిబిరం ఈ తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా అగ్నికి ఆహుతి అవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఉన్న‌ట్టుండి మంట‌లు. చూస్తుండ‌గానే శిబిరం అంతా వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్రికీల‌లు చెల‌రేగాయి. తెల్లవారుజాము కావ‌డంతో ఆ స‌మ‌యంలో కార్మికులెవ‌రూ దీక్షాశిబిరంలో లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. లేదంటే.. వారి ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యే అవ‌కాశం ఉండేది. క్ష‌ణాల్లోనే మంట‌లు ఎగిసి.. శిబిరం అంతా కాలి బూడిదైంది. ఆ వైపు నుంచి వెళ్తున్న వాకర్స్ మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు. అగ్నిప్రమాదంపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. శిబిరం ద‌గ్గ‌ర‌ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే  లేదని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. ఎండ‌ల తీవ్ర‌త‌ల‌కు అగ్ని రాజుకుందేమో అన‌టానికి లేదు. ఎందుకంటే ప్ర‌మాదం జ‌రిగింది తెల్ల‌వారుజామున కాబ‌ట్టి. ఆ స‌మ‌యంలో వాతావ‌ర‌ణం చ‌ల్లగా ఉంది. సో, ఎండ తీవ్ర‌త‌కు నిప్పు రాజుకునే ఛాన్సే లేదు. షార్ట్ స‌ర్క్యూట్ అయ్యే ప‌రిస్థితి కూడా లేదు. ఎందుకంటే.. అక్క‌డ పెద్ద‌గా విద్యుత్ ప‌రిక‌రాలు ఏమీ లేవు కాబ‌ట్టి. శిబిరంలో ఆ స‌మ‌యంలో మ‌నుషులెవ‌రూ లేనందునా.. ఏ బీడీ తాగితేనో... అగ్గిపెట్టె అంటిస్తుండ‌గానో.. స్టౌవ్ వెలిగిస్తుండ‌గానో.. అంటూ ప్ర‌మాదాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే అవ‌కాశం అస‌లే మాత్రం లేదు లేదంటున్నారు కార్మికులు. ఇదెవ‌రో కావాల‌నే చేసిన కుట్ర అని సూటిగా ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా దీక్ష చేయ‌డం ఇష్టం లేని వాళ్లెవ‌రో.. కావాల‌నే శిబిరానికి నిప్పు పెట్టుంటార‌ని ఆరోపిస్తున్నారు. కార్మికుల దీక్ష‌కు ప్ర‌జాసంఘాలు, క‌మ్యూనిస్టులు, టీడీపీ పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు నిస్తున్నాయి. మ‌రి, దీక్ష చేయ‌డం ఇష్టం లేని వాళ్లు ఇంకెవ‌రు ఉంటారు? ఈ అగ్నిప్ర‌మాదానికి కార‌ణం ఎవ‌రై ఉంటారు? అనే అనుమానం స్థానికుల నుంచి వ్య‌క్తం అవుతోంది. ఆ విష‌యం పోలీసులే తేల్చాలి?  

యువకుడిని కొట్టిన కలెక్టర్.. సస్పెండ్ చేసిన సీఎం

అతనో జిల్లా కలెక్టర్.. గౌరవప్రదమైన పదవిలో ఉన్న కలెక్టర్ ఓవరాక్షన్ చేశారు. విచకణారహితంగా ప్రవర్తించాడు. ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. యువకుడిపై కలెక్టర్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేసింది. దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో తప్పు తెలుసుకున్న కలెక్టర్ క్షమాపణ కోరారు. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోవడంతో .. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించారు. యువకుడిని కొట్టిన కలెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్న టైంలో బయటకు వచ్చిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా జిల్లా కలెక్టరే ఓ యువకుణ్ని కొట్టడం వివాదాస్పదమైంది. లాక్‌డౌన్ సమయంలో సూరజ్‌పూర్‌లో ఓ యువకుడు మందులు కొనుగోలు చేయడం కోసం బయటకొచ్చాడు. అతడితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ.. ఆ యువకుడి ఫోన్ తీసుకొని చూసి.. కాసేపట్లోనే ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. ఆ యువకుడు ఏవో పేపర్లు చూపిస్తుండగానే.. అతడి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా.. పక్కనే ఉన్న పోలీసులకు వీడి సంగతేంటో చూడండని ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించాడు. ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. కేంద్ర హోం శాఖ స్పందించింది. ఇంటర్‌ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ సెక్రటరీ సంజీవ్ గుప్తా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆ కలెక్టర్ చర్య హేయమైందన్నారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ చీఫ్ సెక్రటరీ దృష్టికి ఈ వ్యహారాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ మరింత హుందాగా ప్రవర్తించాల్సి ఉందన్న సంజీవ్ గుప్తా.. ఇది గోరా సాహిబ్ సిండ్రోమ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం పెద్దది అవుతుందని గమనించిన జిల్లా కలెక్టర్ ఆ యువకుడికి క్షమాపణలు చెప్పారు. జిల్లాలో కరోనా సమస్య తీవ్రంగా ఉందని.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. తనకు, తన తల్లిదండ్రులకు కూడా కోవిడ్ సోకిందన్న రణబీర్ శర్మ.. తాను కరోనా నుంచి కోలుకున్నానని.. కానీ తన తల్లికి ఇంకా తగ్గలేదని ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్న యువకుడు మైనర్ కాదని ఆయన వివరణ ఇచ్చారు. జిల్లా ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని.. ఎంతో అవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. కలెక్టర్ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రంగా స్పందించారు. సూరజ్‌పూర్ కలెక్టర్‌ రణబీర్ శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌‌లో వెల్లడించారు. ‘సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ ఒక యువకుడిపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. ఇది చాలా విచారకరం.. ఖండించదగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి చర్యను అస్సలు సహించం.. కలెక్టర్ రణబీర్ శర్మను తొలగించే ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని సీఎం అన్నారు. రణబీర్‌ను తప్పించిన సీఎం ఆయన స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్‌కుమార్ సింగ్‌ను నియమించారు.  కలెక్టర్ రణబీర్ శర్మ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరికత ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.

రావల్ కోల్ లో ముదిరాజ్ భూమి కబ్జా! మరో వివాదంలో ఈటల ఫ్యామిలీ

అప్పుడు ఈటల రాజేందర్... ఇప్పుడు ఈటల నితిన్ రెడ్డి... అప్పుడు మెదక్ జిల్లా అచ్చంపేట.. ఇప్పుడు మెదక్ జిల్లా రావల్ కోల్. అప్పుడు.. ఇప్పుడు భూకబ్జా ఆరోపణలే. ఆసైన్డ్ ల్యాండ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మెడకు మరో వివాదం చుట్టుకోంది. ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డిపై ఓ రైతు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశాడు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడ‌ని ఓ యువ‌కుడు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు  మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్‌ ముదిరాజ్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో మహేష్ పలు అంశాలను పేర్కొన్నాడు.బాధితుడు మహేష్‌ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. తక్షణమే దార్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ‌, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్‌ బుధవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.  తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ భూకబ్జా వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈటల రాజేందర్ మెదక్‌ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈటల రాజేందర్‌పై పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఈటల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఈటల రాజీనామా చేస్తే... అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలనే ప్రణాళికలు రచిస్తోంది టీఆర్‌ఎస్. స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఈటలకు మద్దతుగా నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం పలువురు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది.  తాజాగా ఈటల కుమారుడు కూడా భూ క‌బ్జాకు పాల్ప‌డ్డాడ‌ని ఫిర్యాదు రావ‌డం సంచలనంగా మారింది. ఈటల రాజేందర్ కొడుకుపై భూ కబ్జా  ఫిర్యాదు రావడం.. సీఎం విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి.  ముదిరాజు బిడ్డనైన తనను సీఎం కేసీఆర్ కావాలనే టార్గెట్ చేశారని పదే పదే ఆరోపిస్తున్నారు రాజేందర్. తనది ఆత్మగౌరవ పోరాటమని చెబుతున్నారు. తాజాగా ఈటల తనయుడిపై భూకబ్జా ఆరోపణలు చేసింది ముదిరాజ్ యువకుడే కావడం ఆసక్తిగా మారింది. ముదిరాజునని గొప్పగా చెప్పుకునే రాజేందర్... ముదిరాజ్ వ్యక్తి భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. పిట్ల మహేశ్ ముదిరాజ్ అంశం.. ఈటలకు కొంతగా ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు.  

బోర్డ‌ర్‌లో బాధ‌లు.. మ‌ళ్లీ అదే తీరు? తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా?

తెలంగాణ పోలీసుల తీరుతో స‌రిహ‌ద్దులు దాటే ఏపీ వాసులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఉన్న‌ట్టుండి.. స‌డెన్‌గా బోర్డ‌ర్ మూసేసి.. తెలంగాణ‌లోకి ఏపీ వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా.. ప‌ర్మిష‌న్ లేదంటూ వాహ‌నాద‌రుల‌కు ప‌రేషాన్ చేస్తున్నారు ఖాకీలు. అంబులెన్సులు, ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌ను మాత్రం వ‌దిలేస్తున్నారు. స‌రుకు ర‌వాణా వెహికిల్స్‌ను కూడా తెలంగాణ‌లోకి రానీయ‌డం లేదు పోలీసులు. దీంతో.. ఏపీ-తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. ఈ పాస్ ఉంటేనే పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను కూడా నిలిపివేస్తున్నారు. పోలీసులు వాహనాలను నిలిపివేస్తుండటంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.  తెలంగాణలో పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు కఠినం చేశారు. ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. అయితే అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అనుమతి నిరాకరించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్లో అప్లై చేసుకున్న ల‌క్ష‌లాది మందికి ఈ-పాస్‌లు మంజూరు చేశామ‌ని పోలీస్ అధికారులు తెలిపారు. అత్య‌వ‌స‌రం ఉన్న‌వారికి మాత్రమే ఈ-పాస్‌లు ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ-పాస్ చూపిస్తేనే తెలంగాణ‌లోకి అనుమ‌తిస్తామంటూ.. మిగ‌తా వాహ‌నాల‌కు ఆపేస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల వాహనాలు భారీగా నిలచిపోయాయి.  తెలంగాణా సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పొందుగుల స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర‌ వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠిచార్జి చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖలా మారిందన్నారు. తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా? అని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సీఎంలు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదన్నారు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. సమస్య ఇలాగే పునరావృతమవుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చ‌రించారు అచ్చెన్నాయుడు. 

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు.. పోలీసులు అల‌ర్ట్‌..

హ‌లో. పోలీస్ కంట్రోల్ రూమా? సీఎం ఇంట్లో బాంబు పెట్టాం. కాసేప‌ట్లో పేలిపోతుంది జాగ్ర‌త్త‌. అని చెప్పేసి ఫోన్ క‌ట్ చేశాడు అగంత‌కుడు. ఇక అంతే. పోలీసులు ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాంబు స్క్వాడ్‌ నిపుణులు, పోలీసు జాగిలాల‌తో సీఎం ఇంటికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అణువ‌ణువూ గాలించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు క‌నిపించ‌లేదు. హ‌మ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్‌ కాల్‌ అని తేల్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ చేపట్టారు.  బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌తో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఇంట్లో క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యవహారంపై తేనాంపేట పోలీసులు కేసు నమోదుచేసి, సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్‌ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడని గుర్తించిన పోలీసులు హెచ్చరించి వదిలివేశారు.  ఎగ్మూర్‌లో ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫోన్‌ చేసిన అపరిచిత వ్యకి, ఆళ్వార్‌పేట చిత్తరంజన్‌ వీధిలోని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు, మరి కొద్దిసేపట్లో పేలనుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్‌ (26) అనే యువకుడు ఈ చర్యకు పాల్పడ్డాడని గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భువనేశ్వర్‌ను విచారించి అతడికి మతిస్థిమితం లేదని తెలుసుకొని, అతడి తల్లిదండ్రులను పిలిపించి, మళ్లీ అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపారు.  పోలీసుల విచార‌ణ‌లో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలూ వెలుగుచూశాయి. మ‌తిస్థిమితం లేని భువనేశ్వర్‌.. గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజినీకాంత్‌, విజయ్‌, అజిత్‌ తదితరుల ఇళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్‌ చేసినట్టు పోలీసుల విచారణలో తేల‌డంతో పోలీసులు అవాక్క‌య్యారు. 

రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్.. ఇక కుస్తీ ఫ‌స‌క్‌?

స్టార్ ఆట‌గాడు. ఒలంపిక్ మెడ‌ల్ సాధించిన మొన‌గాడు. అయితేనేం.. విచ‌క్ష‌ణ కోల్పోయాడు. క్ష‌ణికావేశంలో ఉన్మాదిగా మారాడు. బ‌లం చూపించాల్సింది బ‌రిలో మాత్ర‌మేన‌ని మ‌రిచాడు. బ‌రి బ‌య‌ట బ‌లుపు ప్ర‌ద‌ర్శించాడు. స్నేహితుల‌తో క‌లిసి.. మ‌రో రెజ్ల‌ర్‌పై దాడి చేశాడు. దెబ్బ‌లు తాళ‌లేక ఆ రెజ్ల‌ర్ చ‌నిపోయాడు. కుస్తీ యోధుడు సుశీల్ కుమార్‌పై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. రెండు వారాలుగా అత‌ను ప‌రారీలో ఉన్నాడు. తాజాగా.. పోలీసులు సుశీల్‌ను అరెస్ట్ చేశారు.   మర్డర్‌ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో సుశీల్‌తోపాటు అతడి ప్రధాన అనుచరుడు అజయ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకొంది. 15 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రసాల్‌ స్టేడియంలో 23 ఏళ్ల యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో 37 ఏళ్ల సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తప్పించుకొని తిరుగుతున్న అతడిపై లుక్‌ అవుట్‌ నోటీసు కూడా జారీ చేశారు. సీనియర్‌ రెజ్లర్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష, అతడి అనుచరుడు అజయ్‌ కుమార్‌ సమాచారం చెబితే రూ. 50 వేలను బహుమతిగా ఇస్తామ‌ని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, ముందస్తు బెయిల్‌ కోసం సుశీల్‌ చేసుకొన్న దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా, రెజ్ల‌ర్‌ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఆయ‌న రెజ్లింగ్ కెరియ‌ర్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. హ‌త్య కేసులో శిక్ష ప‌డితే.. ఇక కుస్తీకి స్వ‌స్తి ప‌ల‌కాల్సిందే. క్ష‌ణికావేశంలో దాడి చేసి ఓ నిండు ప్రాణం తీసినందుకు ఫలితం అనుభ‌వించాల్సిందే. జీవితాంతం జైల్లో మ‌గ్గాల్సిందే. అందుకే అంటారు.. త‌న కోప‌మే త‌న శ‌త్రువు.

నీలం సాహ్ని అవుటేనా? జగన్ ఖాతాలో మరో వికెటా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖాతాలో మరో వికెట్ పడనుందా? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గండంలో ఉన్నారా? జగన్ కోసం అత్యుత్సాహంగా వ్యవరించినందుకు పదవి కోల్పోబోతున్నారా? అంటే ఏపీ రాజకీయ వర్గాలు, రాజ్యాంగ నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో గత ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇవ్వడం, ఎస్ఈసీ నుంచి ఉద్దేశించి ధర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఏపీ ఎస్ఈసీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఎస్ఈసీకి పదవి గండం ఉందనే చర్చ జరుగుతోంది.  ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది  రేగు మహేశ్వర్‌ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు...ప్రతివాదులు ఏపీ గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషనర్‌  పదవి చేపట్టేందుకు.. పదవీ విరమణ చేసిన తరువాత కనీసం మూడేళ్ల గడువు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా  ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం జరిగిందని పిటిషనర్‌ తెలిపారు.  నీలం సాహ్ని గత ఏడాది డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసింది. అయితే ఆమె పదవి విరమణ చేయకముందే ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలానికే 2021 మార్చి 28న  నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్‌ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, అధికరణ 243(కె) మేరకు నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషనర్ కోరారు. వ్యాజ్యం పరిష్కారమయ్యేంతవరకు ఎన్నికల కమిషనర్‌ గా నీలం సాహ్నీ విధులు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవాలని తన పిటిషన్ లో పేర్కోన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలో సుప్రీంకోర్టు సూచనలను అనుసరించాలి.. వాటి గురించి సుప్రీంకోర్టు మార్చి 12న మరోసారి స్పష్టం కూడా చేసింది.. కానీ ఏపీ ఎస్ఈసీ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషనర్ రేగు మహేశ్వర్ రావు చెబుతున్నారు.  నిబంధనలను ఏవిధంగా పాటించలేదో కోర్టుముందుంచామని  తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ  తీర్పు సమయంలో ఎస్ఈసీ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. ఎస్ఈసీగా ఆమె పదవీ బాధ్యతలను చేపట్టిన వారం రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం పది రోజుల వ్యవధిలోనే పోలింగ్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ కు, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని, సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కారంటూ ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను రద్దు చేసింది.తాజాగా ఆమె నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం సాహ్నీకి గండం ఉందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మెప్పు కోసం ఆమె తొందర పడి నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. అదే ఇప్పుడు ఇబ్బందిగా మారిందని, పదవి కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 

కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప‌రిజ్ఞానం బదిలీ చేయం.. సొంతంగా తయారు చేశామన్న భారత్ బయోటెక్ 

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. యుద్ద ప్రాతిపదికన టీకాలు వేయాలని ప్రభుత్వాలు చూస్తున్నా... వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. డిమాండ్ కు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను ఆపేశాయి. దేశంలో వ్యాక్సినేషన్ మొదలై.. నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు 20 కోట్ల డోసులు కూడా ఇవ్వలేకపోయారు. ఏప్రిల్ తో పోల్చితే మేలో మరింత స్లోగా సాగుతోంది. శనివారం దేశ వ్యాప్తంగా కేవలం 16 లక్షల కొవిడ్ డోసులు మాత్రమే ఇచ్చారనే కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలే చెబుతున్నాయి. వ్యాక్సిన్ కొరత తీరాలంటే దేశంలో ప్రస్తుతం తయారవుతున్న టీకా ప‌రిజ్ఞానం ఇతర ఫార్మా సంస్థలకు బదిలీ చేయాలనే డిమాండ్ వస్తేంది. ముఖ్యంగా పూర్తిగా దేశీయంగా తయారైన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని కొందరు సీఎంలు కేంద్రాన్నికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి ప‌రిజ్ఞానాన్ని తీసుకున్నందు వల్ల..కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానాన్నిఇతర సంస్థలకు బదిలీ చేసి టీకాలను పెద్ద ఎత్తున తయారు చేయాలని కోరారు.  వ్యాక్సిన్ ప‌రిజ్ఞానం బదిలీ చేయాలన్న వార్తలపై భారత్‌ బయోటెక్‌ స్పందించింది. వాగ్జిన్ అభివృద్ధి చేయ‌డానికి వాడిన వ్యాక్సిన్ ప‌రిజ్ఞానం మొత్తం భారత్‌ బయోటెక్‌దేన‌ని ఆ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్లా చెప్పారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డానికి తాము భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి ప‌రిజ్ఞానాన్ని ఏమీ తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ రెండు సంస్థ‌ల సహకారంతోనే భారత్‌ బయోటెక్‌  కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింద‌ని, ఆ పరిజ్ఞానాన్ని మరిన్ని ఔషధ కంపెనీలకూ బదిలీ చేయాలని ఇటీవ‌ల కొంద‌రు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఇత‌ర‌ ఫార్మా సంస్థ‌ల‌కు కొవాగ్జిన్‌ పేటెంట్లతో పాటు తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ చాలా క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌క్రియ అని చెప్పారు సుచిత్ర ఎల్లా.  కరోనా స్ట్రెయిన్‌ను సేకరించి వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌కు అందించడం, అలాగే కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో మాత్రమే ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ స‌హ‌క‌రిస్తాయ‌ని సుచిత్ర ఎల్లా చెప్పారు. పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలు జరిపేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే కేవ‌లం  ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ రెండు సంస్థ‌ల నుంచి కరోనా స్ట్రెయిన్ అందిన అనంతరం వ్యాక్సిన్ త‌యారీలో మొత్తం పనిని తామే చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం పూర్తిస్థాయిలో త‌మ సంస్థ‌ నిధుల‌నే వాడామ‌ని తెలిపారు. సొంత ల్యాబ్‌లలో స్ట్రెయిన్‌ను పరీక్షించామ‌ని, అలాగే, వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించే వ‌ర‌కు త‌మ సంస్థే సొంతంగా ప‌నులు చేసుకుంద‌ని చెప్పారు.  చిన్నారుల‌పై కొవాగ్జిన్‌ ప్రయోగ పరీక్షలు వ‌చ్చేనెల‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని సుచిత్ర ఎల్లా  తెలిపారు. 

ఆనందయ్య మందుతో హానీ లేదు.. ఆయుష్ శాఖ క్లారిటీ

కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందు తయారీలో హానికర పదార్థాలు లేవని ఆయుష్ శాఖ కమిషనర్ రాములు చెప్పారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు.  ఆనందయ్య ఇస్తున్నది ఆయుర్వేద మందు కాదని, అది నాటువైద్యమని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది. దీనిని వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో రెండు రోజులపాటు కృష్ణపట్నంలో పర్యటించిన వైద్యబృందం ఆనందయ్య మందును పరిశీలించింది. అక్కడికి వెళ్లడానికి ముందే ఆనందయ్య కరోనా మందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు, ఆనందయ్య ఇచ్చిన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆనందయ్య ఇచ్చేది నాటు మందుగా గుర్తించినట్టు రాములు తెలిపారు. ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు ఆయుష్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు. కాగా, తన పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని రాములు తెలిపారు.  ఆనందయ్య మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు చెప్పారు. 

తుపాను గుప్పిట్లో తూర్పు తీరం.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు గండం

దేశంలో మరో గండం ముంచుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌక్తే తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుపాను ముప్పు దూసుకువస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని శనివారం అల్పపీడనం ప్రాంతం ఏర్పడింది. తుపాను ఏర్పడడానికి అల్పపీడన ప్రాంతం తొలి దశ. అయితే, అల్పపీడనాలన్నీ తుపాన్లగా మారే అవకాశం లేదు. కాని తాజాగా ఏర్పడిన అల్పపీడనం మార్చి 23 ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత అది ఉత్తర-వాయవ్య దశలో కదులుతూ 24 నాటికి తుపానుగా మారుతుందని,  ఆ తర్వాత 24 గంటల్లో అది అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది. రాబోయే తుపానుకు ‘యాస్’ పేరు నామకరణం చేశారు. యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య ఈ నెల 26న దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్‌ సమీపంలోని ఉత్తర బంగాళాఖాతానికి, దాని పక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు 26న ఉదయం చేరుకుంటుందని వివరించింది. అదే రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్ దాని పక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.   యాస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ పై ఉండనుంది. బెంగాల్- ఒడిషా మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాలకు గండం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోను భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ యాస్ తుపాను బీభత్సం స్పష్టించనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. ఈనెల 30న కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోకి గతంలో కంటే ముందే నైరుతి రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈసారి దేశమంతా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 

10 వేలు దాటిన కరోనా మరణాలు.. బ్లాక్ ఫంగస్ కేసుల్లోనూ ఏపీ టాప్

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న దేశాన్ని  బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి సోకుతూ వారి ప్రాణాలకు ముప్పు తీసుకొస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం శుక్రవారం (మే 21) నాటికి దేశవ్యాప్తంగా 8848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 58.66 శాతం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం భయాందోళనలకు కారణమవుతోంది. కరోనా కేసులతో పాటు  బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో భారీగా నమోదవుతున్నాయి.  ఇప్పటివరకు గుజరాత్‌లో అత్యధికంగా 2281 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 2000 మందికి వచ్చింది. 910 మంది బ్లాక్ ఫంగస్ కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో మూడో స్థానంలో ఉంది.  తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (720), రాజస్థాన్ (700), కర్ణాటక (500) ఉన్నాయి. కరోనా చికిత్సలో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ వ్యాధి సోకిన వారికి `అంపోటెరిసిన్-బి` ఔషధాన్ని వాడుతున్నారు. ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.గత  24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. రోజువారీ కేసుల విషయానికొస్తే... 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. 

కవలలను బలి తీసుకున్న జిల్లాల విభజన!

తెలంగాణలో జిల్లాల విభజన జరిగి మూడేండ్లు కావస్తున్నా పాలన మాత్రం కొలిక్కి రావడం లేదు. జిల్లాల విభజనతో వచ్చిన సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల విభజన తెచ్చి తంటాతో కరీంనగర్ లో దారుణం జరిగింది. కవల పిల్లలు చనిపోవడానికి కారణమైంది.  ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట తల్లికి గర్భశోకం కలిగింది. కవలల్లో  మూడు రోజుల క్రితం పురుటిలోనే కన్నుమూసింది ఓ బిడ్డ. మృత్యువుతో పోరాడి మరో మగ శిశువు శనివారం చనిపోయింది.  బెజ్జంకి మండలం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. జిల్లాల విభజన తర్వాత సిద్దిపేట జిల్లాలోకి వచ్చింది. బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన గర్బిణి.. ప్రసవం కోసం గత సోమవారం కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వెళ్లింది. అయితే వేరే జిల్లా వాళ్లకు ఇక్కడ చూడమని చెప్పి సిద్ధిపేట జిల్లాకు వెళ్లాలని అక్కడి డాక్టర్లు తిప్పి పంపారని బంధువుల ఆరోపణ. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తే గజ్వేల్ వెళ్లాలని చెప్పారట. గజ్వేల్ వెళ్తే హైదరాబాద్ వెళ్లాలని అక్కడి వైద్యుల సూచించారట.ఎక్కడికి వెళ్లినా ఎవరూ చేర్చుకోకపోవడంతో బాధిత గర్భిణి తిరిగి కరీంనగర్ వచ్చేసింది.  కరీంనగర్ డాక్టర్లను ప్రాదేయపడటంతో మూడు రోజుల క్రితం ఆమెకు అడ్మిషన్ ఇచ్చారు. అయితే అప్పటికే తల్లి గర్భంలో ఉన్న కవలల్లో ఆడశిశువు కడుపులోనే మృతి చెందింది. శనివారం మగశిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. తమ జిల్లా పరిధి కాదంటూ ప్రసవం కోసం వచ్చిన మహిళ తిప్పి పంపించడం దుమారం రేపుతోంది. గర్భిణిని చేర్చుకోకుండా తిప్పిన కరీంనగర్, గజ్వేల్, సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కవలల  మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ వద్దు! ప్రధాని మోడీకి జగన్ లేఖ

కొవిడ్ వ్యాక్సినేషన్ పై దేశంలో గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్ కోసం జనాలు ఎగబడుతుండగా.. ప్రభుత్వాలు మాత్రం స్టాక్ లేదంటూ వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కార్ వ్యాక్సినేషన్ పై విఫలమైందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించలేకపోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు ఇస్తోందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తున్నాయని, ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నాయని ప్రధానికి సీఎం  జగన్ తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని ఆందోళన వెలిబుచ్చారు. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. ఒకవైపు కొరత అంటున్నారు... మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు ఎలా ఇస్తారు? అని జగన్మోహన్ రెడ్డి ఆక్రోశించారు. వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అంశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి సూచించారు.