భారత జాతీయ జెండాకు వందేళ్లు... పింగళి వెంకయ్యకు శతకోటి వందనాలు..
త్రివర్ణ పతాకం.. భారతదేశ జాతీయ జెండా. త్రివర్ణ పతకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. దేశ భక్తి ఎగిసిపడుతుంది. భారతమాతకు సెల్యూట్ చేస్తోంది. అంతటి త్రివర్ణపతాకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ లోని బెజవాడ. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య.. భారత జాతీయ జెండాను రూపొందించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. తర్వాత కొన్ని మార్పులు చేసి జూలై 22న అధికారింగా ఆమోదించారు. అంటే జాతీయ జాతీయ జెండాకు ఆమోదముద్ర పడి ఇవాళ్టికి వందేళ్లు.
1921 మార్చి 31వ తేదీన ఏపీ విజయవాడలోని నేటి బాపూ మ్యూజియంలో మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తన సహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనా తయారుచేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా రాట్నం చిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ పలు సూచనలు చేశారు.ఇలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయ పతాకం తయారు చేశారు.
1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్ కలాం అజాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ సూచనల ప్రకారం.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్ జాతీయ మహాసభ ఆమోదించింది. జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఆలోచనతో.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులుచేశారు. ఈ చారిత్రక ఘట్టాలకు పునాది పడింది విజయవాడలో కావటం మనకు గర్వకారణం.
భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు విజయనగర సామ్రాజ్యం మొదలుకుని మొఘలుల సామ్రాజ్యం వరకూ అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి. మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్ మీద బ్రిటన్ పాలన సాగేది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ జెండానే ఎక్కువగా వినియోగించేవారు.అప్పుడే ఆలోచన పడింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారతదేశాన్ని తన పరిపాలన కిందకు తీసుకువచ్చింది. అప్పుడే ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే భారతదేశానికి మొట్టమొదటిగా ఒక జాతీయ జెండా వచ్చింది. వాటి మీద బ్రిటిష్ సామ్రాజ్య జెండా 'యూనియన్ జాక్' తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివరలో భారతదేశంలో స్వాతంత్య్ర కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా ఆలోచనలు బలపడ్డాయి. ఆ మేరకు జెండా రూపకల్పనలు జరిగాయి.
భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పతాకాన్ని.. 1906 ఆగస్టు 7న ఇప్పటి కోల్కతాలోని పార్సీ బగాన్ కూడలిలో ఆవిష్కరించినట్లు చెప్తారు. అది కూడా త్రివర్ణ పతాకమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు ఉండేవి. పైన ఎనిమిది కమలం పువ్వులు, మధ్యలో 'వందే మాతరం' నినాదం కింద సూర్య, చంద్రుల బొమ్మలు ఉండేవి. రెండో జాతీయ పతాకాన్ని.. 1907లో దేశబహిష్కరానికి గురైన మేడం కామా తదితర విప్లవకారులు పారిస్లో ఆవిష్కరించారు. ఇది కూడా దాదాపు మొదటి పతాకం లాగానే ఉండేది. కాకపోతే పై భాగంలో కమలానికి బదులు.. ఇందులో సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలను చేర్చారు. ఈ పతాకాన్ని బెర్లిన్లో జరిగిన సోషలిస్ట్ సదస్సులోనూ ప్రదర్శించారు.
స్వాతంత్య్ర పోరాటం కీలక మలుపు తిరిగిన 1917లో మూడో జాతీయ పతాకం రూపొందింది. స్వపరిపాలన ఉద్యమం సందర్భంగా అనిబీసెంట్, లోకమాన్య తిలక్లు దీనిని ఆవిష్కరించారు. ఇందులో ఏడు ఎరుపు గీతలు, ఐదు ఆకుపచ్చ గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా పరిచివుంటాయి. వాటిపైన సప్తరుషుల చిహ్నంగా ఏడు నక్షత్రాలు.. ఒక వైపు మూలన బ్రిటన్ జాతీయ పతాకం, రెండో మూలన సూర్య, చంద్రుల చిహ్నాలు ఉన్నాయి.
స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1921లో బెజవాడలో సమావేశమైంది.ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి ఆ సదస్సులో గాంధీజీకి చూపారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా.. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరఖాను చేర్చాల్సిందిగా లాలా హన్స్రాజ్ సూచించారు. గాంధీజీ ఈ జెండాలోని ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు.. మిగతా మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని సూచించారు. ఈ పతాకాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉపయోగించారు. జాతీయ పతాకం చరిత్రలో 1931 మరో మైలురాయి. త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ సదస్సులో తీర్మానం చేశారు. ఎరుపు రంగును కాషాయ రంగుగా మార్చారు. అందులోని చరఖాను తొలగించి.. నేతాజీ సుభాశ్చంద్రబోస్ బ్రిటిష్ వారి మీద పోరాడటానికి స్థాపించిన భారత జాతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో తన జాతీయ జెండాగా ప్రదర్శించింది. 1947లో తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది.
1906లో కోల్కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు నిర్వహించారు. 'ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్'గా పిలిచే దాదాబాయి నౌరోజి సభకు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి వెంకయ్య కలత చెందారు. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో 'ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా' అనే ఆంగ్ల పుస్తకం రచించారు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు.. పింగళి 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది.
ఏప్రిల్ 13, 1936 నాటి ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.
వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.