వీడు మాములు దొంగ కాదు.. 

500 సంపాదించాలంటే రోజంతా కష్టపడాలి. కొంత మంది ఈజీ మనీ కోసం అలవాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు  ప్లాన్ వేసి అమలు చేసి చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ప్లాన్ వేస్తే  అమలు అవ్వాల్సిందే.. వాళ్ళ కన్ను పడితే ఏంటది బంగారం ఐన కరగాల్సిందే.. వాళ్ళు అనుకుంటే ఏ టైం లోనై బాధితుల చేత అరుపులు పెట్టించగలరు వల్లే చైన్ స్నాచర్. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల దొరికిపోతున్నారు. తాజాగా  గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్‌ను మలక్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి  ఏకంగా  రూ.2 లక్షల విలువ చేసే సొత్తును ఏడు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ ఎం.రమేశ్, అదనపు డీసీపీ కె.మురళీధర్, మలక్‌పేట్‌ ఏసీపీ ఎన్‌.వెంకటరమణలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఎల్‌బీనగర్, ఎన్టీఆర్‌ నగర్, ఫేస్‌-3 ఓ పత్రికలో వార్తా పంపిణీ విభాగంలో సహాయ మేనేజర్‌గా పని చేస్తున్న గంగపురం నరేందర్‌ ఈనెల 14న మలక్‌పేట్‌ వెళ్లారు. అక్కడ తన విధులు ముగించుకొని కాలినడకన ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రభుత్వ గర్ల్స్‌ జూనియర్‌ కళాశాలకు చేరుకున్నారు. సుమారు ఉదయం 7.20 నిమిషాలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి నరేందర్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని ఆస్మాన్‌ఘడ్‌ ప్రాంతం వైపు వెళ్లిపోయాడు. బాధితుడు మలక్‌పేట్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదేరోజు గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.   నిందితుడు డబీర్‌పుర షా కాలనీలో ఉండే ముదస్సిర్‌ అలియాస్‌ బిపాషా (21)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు పోలీసులు ఇతను బాల్యంలోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. కాచిగూడ రైల్వే పోలీసులకు దొరికిపోయాడు. రోడ్లపై సందుల్లో వెళుతూ.. ఒంటరిగా కనిపించే అమాయక ప్రజలను బెదిరించి సెల్‌ఫోన్లు, డబ్బులు లాక్కొనిపోతుంటాడు. ఆ తర్వాత రెయిన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విడుదలైన బిపాషా.. మళ్లీ ప్రణాళికను రచించాడు. తన ప్రణాళిక ప్రకారం 13న ఓ వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం తీసుకొని వెళ్లిపోయాడు. 14న రెయిన్‌బజార్, కాచిగూడ, సైదాబాద్, సరూర్‌నగర్, మాదన్నపేట్, మలక్‌పేట్‌ల్లో 7 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మలక్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, డీఐ డి.నానునాయక్‌ ఆధ్వర్యంలో ఎస్సై సైదులు తమ సిబ్బందితో కేసును పరిష్కరించారు. కమిషనర్‌ వీరిని అభినందించారు. ఎప్పటికైనా న్యాయమే గేలుస్తాది అని చెప్పినట్లు, దొంగతనం కూడా అంతే ఈరోజు దొరక్క పోవచ్చు కానీ ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే.. సో అలాంటి పనులు పక్కకు పెట్టి కస్టపడి పని చేస్తేనే మనకు బర్కతు ఉంటుంది.. అదే నాలుగు కాలాల పాటు మనతో ఉంటుంది. 

కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందా? ప్లాన్ చేసిందెవరు? 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే పార్టీల్లోని ప్రచారంలోకి దిగాయి. అంతేకాదు వ్యక్తిగత దూషణలు, సంచలన ఆరోపణలతో కాక రేపుతున్నారు లీడర్లు. హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తనను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించి కలకలం రేపారు. తనకు జరుగుతున్న కుట్రలకు సంబంధించి తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఈటల ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈటల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన గంగుల.. ఓటమి భయంతోనే సానుభూతి కోసం రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  తాజాగా ఈటల రాజేందర్ పై మరో సంచలన ఆరోపణలు చేశారు పౌడి కౌశిక్ రెడ్డి. 2018లో తనను హత్య చేసేందుకు ఈటల రాజేందర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. 2018 లో మర్రిపల్లి గుడా గ్రామంలో తనను చంపడానికి ప్రయత్నించారని చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో తాను ప్రచారం ముగించుకుని వస్తుండగా.. ఈ ప్లాన్ చేశారన్నారు కౌశిక్ రెడ్డి. తాను అప్రమత్తంగా ఉండటంతో తప్పించుకున్నానని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గతంలో హత్యా రాజకీయాలకు ఈటల పాల్పడ్డారని ఆరోపించారు.  టీఆర్ఎస్ మాజీ ఎంపిటిసి బలరాజును 2014 జనవరి 5 న నర్సింగ్‌పురా గ్రామంలో హత్య చేశారని చెప్పారు.  ఇక  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  బుధవారం ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంచలనం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులకు సమాధానాలు కూడా ఇవ్వకుండానే ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. 

ఫైజ‌ర్‌తో ప‌క్ష‌వాతం ఛాన్సెస్‌!.. మ‌న వ్యాక్సిన్లే బెట‌ర్‌..!

క‌రోనాకు మందు లేదు. వ్యాక్సిన్ ఒక్క‌టే త‌రుణోపాయం. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ‌. వ్యాక్సిన్ వేసుకున్నామ‌ని బిందాస్‌గా ఉండే ప‌రిస్థితి కూడా లేదు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల సామ‌ర్థ్యం సుమారు 75శాతం మాత్ర‌మే. అందుకే, టీకా త‌ర్వాత కూడా మాస్క్‌, శానిటైజ‌ర్‌, సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రి. అయితే, వ్యాక్సిన్ వేసుకుంటే జ్వ‌రం వ‌స్తుంద‌ని, టీకాతో త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వ‌స్తున్నాయ‌నే.. రెండు మూడు రోజుల తాత్కాలిక ఇబ్బందుల‌ను బూత‌ద్దంలో చూసి.. వ్యాక్సిన్ అంటే భ‌య‌ప‌డి.. టీకాలు తీసుకోవ‌డం లేదు. ఇండియాలో ఈ ధోర‌ణి అధికంగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగిన ద‌శ‌లో జ‌నాలు వ్యాక్సిన్ కోసం ఎగ‌బ‌డ్డారు. ఇప్పుడు కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. టీకా జోలికి వెళ్ల‌డం లేదు. మ‌రోవైపు, వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయ‌నే ప్ర‌చారం వారిని మ‌రింత భ‌య‌పెడుతోంది. తాజాగా, అలాంటి ఓ ఘ‌ట‌నే వ్యాక్సిన్‌పై మ‌రింత ఆందోళ‌న పెంచుతోంది.  కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ కంటే విదేశీ వ్యాక్సిన్లైన ఫైజ‌ర్‌, మెడెర్నాల సామ‌ర్థ్యం చాలా ఎక్కువ‌. దాదాపు 95శాతం కొవిడ్ నుంచి ర‌క్షిస్తున్నాయి ఆ టీకాలు. అందుకే భార‌తీయులు సైతం ఎప్పుడెప్పుడు ఆ విదేశీ టీకాలు అందుబాటులోకి వ‌స్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే, చాలా త‌క్కువ సంఖ్య‌లో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుండ‌టం విదేశీ వ్యాక్సిన్ల‌పై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. చాలా అరుదుగా హార్ట్ స్ట్రోక్స్‌, ప‌క్ష‌వాతం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆ వ్యాక్సిన్ల విష‌యంలో న‌మ్మ‌కం స‌డ‌లుతోంది. తాజాగా, ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది. ఈ ఘటన యూకేలో జ‌రిగింది. 61 ఏళ్ల వ్యక్తి తొలి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తన ముఖంలో ఎడమవైపు భాగంలో ఇబ్బంది వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేశారు. కోలుకున్న కొన్ని రోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆ వ్యాధి మరింత ముదిరింది. ఆహారం మింగాలన్నా, ఎడమ కన్ను మూయాలన్నా.. కష్టసాధ్యంగా మారింది. మరోసారి చికిత్స చేసిన వైద్యులు.. ఈ వ్యక్తికి అలా జరగడానికి ఫైజర్ వ్యాక్సినే కారణమని తేల్చారు.  ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్‌పై చేసిన ఓ అధ్యయనంలో బెల్స్ పాల్సీ వంటి సైడ్ ఎఫెక్టులు రావడం చాలా అరుదుగా సంభవిస్తుందని తేలింది. కేవలం 0.02శాతం మందిలో మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. అయినా, భ‌య‌ప‌డాల్సింది లేద‌ని.. ఇప్ప‌టికీ ప్ర‌పంచంలో ఫైజ‌ర్ వ్యాక్సినే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన క‌రోనా టీకా అని చెబుతున్నారు వైద్యులు. అయితే, మ‌న ఇండియ‌న్ మేడ్ కొవాగ్జిన్ కానీ, మ‌న‌కు అందుబాటులో ఉన్న కొవిషీల్డ్ వ‌ల్ల కానీ, ఇలాంటి ప్ర‌మాద‌క‌ర సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం లేవ‌ని.. భారతీయులంతా నిర‌భ్యంత‌రంగా వ్యాక్సిన్లు తీసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.   

హుజురాబాద్ పై వరాల వర్షం.. గులాబీ బాస్ కు ఓటమి భయం? 

ఆరు నూరైనా ... నూరు ఆరైనా.. ఏది ఏమైనా హుజురాబాద్ ఉపఎన్నికలో తెరాస గెలిచి తీరాలి ... ఇందుకోసం ఏమి చేసినా ఓకే... ఎన్ని కోట్లు ఖర్చయినా అభ్యంతరం లేదు... ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మనసులో మాట ఇదేనా ... ఇందుకోసమేనా ఆయన అంతలా శ్రమిస్తోంది, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి  ఇది ముఖ్యమత్రి మనసులో మాట మాత్రమే కాదు, పార్టీ నాయకుల వద్ద ఆయన అంటున్న మాట కూడా ఇదే, అని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారు.అందుకే ఆయన ఓ వంక పార్టీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారు,మరో వంక ఈటలను ఎదుర్కునే అభ్యర్ధి కోసం వేట కొనసాగిస్తున్నారు. అలాగే, ఇంకో చేత్తో నియోజక వర్గం పై వరాల జల్లు కురిపిస్తున్నారు.  నిజంగా, హుజురాబాద్ లో పరిస్థితి ముఖ్యమంత్రినే కలవరానికి గురిచేసే విధంగా ఉందా... లేక ఇది కేసీఆర్ మార్క్  వ్యూహంలో భాగమా? అనే ప్రశ్న కుడా లేక పోలేదు. అయితే ఏందీ ఏమైనా ఒకే ఒక్క నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అంటే పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి హుజురాబాద్ ఉప ఎన్నికను, ఒక నియోజక వర్గానికి జరుగుతున్న ఎన్నికగా చూడడం లేదు, పార్టీ, కుటుంబ రాజకీయ భవిష్యత్తును తేల్చే .. మహా సంగ్రామంగా చూస్తున్నారు. ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి లెక్క తప్పింది. పరిస్థితి ఇంతవరకు వస్తుందని ఉహించలేదు. అయితే, ఈటల రాజేందర్ వ్యూహత్మకంగా హుజురాబాద్’లో పోటీ తనకు, కేసీఆర్‌కు మధ్యే అన్నట్లుగా  వాతావరణాన్ని మలచారు. నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో,ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోతే, అది కేసేఆర్ ఓటమిగా ముద్రపడుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాల ఓటమిగానూ ప్రచారం జరుగుతుంది.పార్టీ పతనానికి చివరి మెట్టు అదే అయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నాఋ. అంతే కాదు హుజురాబాద్ ఉపఎన్నిక రేపటి ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో నిర్ణయించే ఎన్నికగా కూడా భావిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారని, పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.  హుజురాబాద్ నియోజక వర్గంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారు.ఇప్పటికీ,నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీల్లో రూ.66.85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరాలోనే  పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిగాక నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోని 106 గ్రామపంచాయతీల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీణవంక మండలంలో రూ.23 కోట్లు, హుజూరాబాద్‌ మండలంలో రూ.15 కోట్లు, జమ్మికుంట మండలంలో రూ.7 కోట్లు, ఇల్లందకుంట మండలంలో రూ.10 కోట్లు, కమలాపూర్‌ మండలంలో రూ.45 కోట్లతో పనులను ప్రతిపాదించారు. ఇంత చేసిన తర్వాత కూడా గెలుపు మీద ధీమా లేక, దళిత బంధు, పథకం అమలుకు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. నిజానికి ఈ పథకాన్ని తీసుకోచ్చిందే హుజురాబాద్ కోసం.హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలో దళిత సామాజిక వర్గం ఓట్లు గణనీయ సంఖ్యలో (46వేల పై చిలుకు ) ఉన్నాయి. ఈ ఓట్లను గంప గుత్తగా కొల్ల కొట్టేందుకే ముఖ్యమంత్రి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. సరే, అధికార పార్టీ నాయకులు కరీంనగర్ సెంటిమెంట్’ను జత చేసే ప్రయత్నం చేస్తున్నా, జనాలకు మాత్రం ఇది ఉప ఎన్నికల పథకమే అని అర్థమైపోయింది.  అంతే కాకుండా, ఈ పథకం రాష్ట్ర బడ్జెట్ రూ. 1200 కోట్లు అయితే  పైలట్ ప్రాజెక్ట్ అమలుచేస్తున్న హుజురాబాద్ కే 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, పలు అనుమానాలకు తావిస్తోంది.   ఇదిలా ఉండగా ఈటల రాజీనామా తర్వాత ఒకే సారి అంతవరకు పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సంబంధించిన రూ.17.08 కోట్ల చెక్కులనూ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అది కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఒక్క హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలోనే పంపిణి చేశారు.ఇలా ఉరుకులు పరుగుల మీద నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారంటే, ఈఒక్క సీటుకు ముఖ్యమత్రి ఏంట్ ప్రధాన్యత ఇస్తున్నారో అర్థం చేస్కోవచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయితే, కేసీఆర్ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం అంటే, అది తమ గొయ్యి తామే తవ్వుకోవంతో సమానమనే మాట కూడా వినవస్తోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక గులాబీ బాస్ గుండెల్లో ఈటెలా సలుపుతోంది.

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేల జంప్!

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లకు పైగానే సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీ పదవుల విషయంలోనూ గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్లను కాదని పైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన యువ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్ పెద్దలు.. పంజాబ్ లోనూ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినా సిద్దూకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అయితే కాంగ్రెస్ కు కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేసింది బీజేపీ. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ.. హస్తం పార్టీకి భారీ షాక్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీని నిలువునా చీల్చింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  బీజేపీలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు తీరని నష్టమని చెబుతున్నారు.  గోవిందాస్‌ కొంతౌజమ్‌ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్‌ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ప్ర‌వీణ్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తోందా? అందుకే రాజీ..నామా?

ఆర్‌.ఎస్.ప్ర‌వీణ్‌కుమార్ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ గురుకులాల‌కు మ‌హ‌ర్ద‌శ తీసుకొచ్చిన ఆయ‌న స‌డెన్‌గా ఆ ప‌ద‌వి నుంచి ఎందుకు వైదొలుగుతున్నార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఏకంగా ఖాకీ యూనిఫామే విప్పేయ‌డానికి కార‌ణం ఏంటి? ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో 9 ఏళ్లుగా క‌ద‌ల‌కుండా మెద‌ల‌కుండా ఒకే పోస్ట్‌లో ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు ఆక‌స్మికంగా ఏ ఇబ్బంది వ‌చ్చింద‌ని ఆ బాధ్య‌త‌ల‌ను వ‌దిలేసి వెళ్లిపోతున్నారు. ఏకంగా స‌ర్వీస్‌కే సెల‌వు ఎందుకు ప్ర‌క‌టించారు? రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశ్య‌మా? టీఆర్ఎస్‌లో చేరిపోతారా? హుజురాబాద్ నుంచి బ‌రిలో దిగుతారా? ద‌ళిత బంధు బాధ్య‌త‌లు చేప‌డ‌తారా? లేక‌, తానే సొంతంగా పార్టీ పెట్టేసుకుంటారా? స్వేరోస్‌ను రాజ‌కీయంగా డెవ‌ల‌ప్ చేస్తారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి విశ్లేష‌ణ‌లు... అయితే, ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ఐపీఎస్ నుంచి వైదొల‌గ‌డం వెనుక ఓ బ‌లమైన కార‌ణం ఉంద‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. అది పెను ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉండ‌టం.. త‌న ముంద‌రి కాళ్ల‌కు క‌ళ్లాలు ప‌డ‌తాయ‌ని భావించ‌డం వ‌ల్లే ఆయ‌న వాలంట‌రీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌ల‌తో పాటు ఫిర్యాదులూ అందాయ‌ని.. ఆ కేసులో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వేగంగా పావులు క‌దులుతున్నాయ‌ని.. ఆ విష‌యం తెలిసే ప్ర‌వీణ్‌కుమార్ అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే ఇలా రాజీనామా అస్త్రాన్ని సంధించార‌ని అంటున్నారు. ఆ సంఘ‌ట‌న గురించి అంద‌రికీ తెలిసిందే అయినా.. ఆ త‌ర్వాత ఇన్నాళ్ల‌కి ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ మొద‌లయ్యాయ‌ని తెలుస్తోంది.  ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా ఉంటూ స్వేరోస్ సంస్థ‌ను న‌డిపిస్తుండ‌టం.. ఐపీఎస్‌గా ఉంటూ హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా భీమ్ ప్ర‌తిజ్ఞ చేయ‌డం.. స్వేరోస్ సంస్థ‌కు భారీగా నిధులు వ‌స్తున్న‌ట్టు, అందులోనూ ఫారిన్ ఫండ్స్ వెల్లువెత్తుతున్న‌ట్టు.. త‌దిత‌ర ఆరోప‌ణ‌ల‌తో ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ మీద చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ‌కు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా స్పందించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌వీణ్‌కుమార్‌పై వ‌చ్చిన ఫిర్యాదుపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సెంట్ర‌ల్ హోంమినిస్ట్రీ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ మేర‌కు.. ఓ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. ఈ విష‌యం తెలిసే.. ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ముంద‌స్తుగా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అంటున్నారు. ప‌ద‌విలో ఉంటే ఇలాంటి ఆటంకాలు త‌ప్ప‌వ‌ని.. ఐపీఎస్‌ను వ‌దిలేస్తే మ‌రింత స్వేచ్ఛ‌గా త‌న ల‌క్ష్య సాధ‌న కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని భావించి ఉంటార‌ని అంటున్నారు. తెలంగాణ స‌ర్కారు ఎప్ప‌టిలానే త‌న‌కు స‌హ‌క‌రిస్తే టీఆర్ఎస్‌లో చేరే అవ‌కాశం లేక‌పోలేద‌ని.. లేదంటే, స్వేరోస్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉంటార‌ని.. అవ‌స‌ర‌మైతే సొంతంగా రాజ‌కీయ పార్టీనీ ప్రారంభించే ఛాన్సెస్ ఉన్నాయ‌ని చెబుతున్నారు. డ్యూటీలో ఉండ‌గానే, నిబంధ‌న‌ల చ‌ట్రంలో ఉండే.. స్వేరోస్ పేరుతో అంత చేసిన ప్ర‌వీణ్‌కుమార్‌.. ఇప్పుడిక ఖాకీ చొక్కా విప్పేస్తే...? మ‌రింత ఖ‌త‌ర్నాక్ అవుతార‌న‌డంలో డౌటే అవ‌స‌రం లేదంటున్నారు.   

కూతుర్ని తల్లి చేసిన తండ్రి.. 

ఈ ప్రపంచంలో కనిపించే దేవుళ్ళు అమ్మానాన్న. పిల్లలకు అమ్మానాన్న అంటే నాలుగు అక్షరాలా పదాలే కాదు.. వంద ఏళ్ళ నిండు జీవితం కూడా.  పిల్లల చేతి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సిన వాడు ఫాదర్. కానీ తల్లిదండ్రులే పిల్లల జీవితాలపై నిప్పులు వేస్తున్నారు. తాజాగా  హైదారబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కామంతో కన్నకూతురునే త్రాచు పామై  కాటేశాడు. ఏకంగా  తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. భార్య, భర్తలు ఇద్దరూ చెరో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె(16), కొడుకు(14) ఉన్నారు. అయితే, సొంతూరిలో చదువును మానేసిన బాలిక.. తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇక్కడే వారితో ఉంటోంది. అయితే, కామంతో కన్నూమిన్నూ కానని ఆ నీచుడు.. కన్న కూతురుపైనే కన్నేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకున్నాడు  అందుకు అందుకు పధకం వేశాడు. ఆ పధకం అమలు చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాడు.   ఈ క్రమంలో భార్య ఇళ్లలో పనికి వెళ్లగానే.. అతని పధకం అమలు చేయడానికి అవకాశం దొరికింది. కూతురుకుని అన్నంలో నిద్రమాత్రలు కలిపి వడ్డించేవాడు. అలా ఆ బాలిక మత్తులోకి జారుకోగానే.. ఈ నీచుడు ఆమెపై ఒక మృగం లా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా అనేకసార్లు జరుగగా.. నిద్రమత్తులో ఉన్న బాలికకు అదే తెలియకుండాపోయింది. అక్కడితో ఆ నీచుడు ఆగక ఇటీవల నేరుగానే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించేవాడు. అయితే, ఇటీవల బాలిక గర్భవతి అని తేలడంతో.. ఆమె తల్లి నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ తల్లికి వివరించింది. భర్త చేసిన పనికి రగిలిపోయిన ఆ తల్లి.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన.. 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌..

ఈ ప్రపంచం మోసం అనే మాట మీద నడుస్తుంది. ఒకడు బతకాలి అంటే మరొకడ్ని మోసం చేయాలి. ఒక దేశం ఎదగాలంటే మరొక దేశాన్ని నాశనం చెయ్యాలి. అందుకు కొందరు ఎంచుకున్న మార్గమే యువతను డ్రగ్స్ కి అలవాటు చేయడం. ఇక ముఖ్య విషయానికి వస్తే ఎప్పుడు  లేని విదంగా ఈ మధ్య కాలంలో మన దేశంలోకి డ్రగ్స్ తరలిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌, సౌదీ అరేబియా, జాంబియా.. లాంటి  వివిధ దేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్‌ని భారత్‌కు తరలిస్తున్నారు. ఐతే ఆ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఎన్ని ఎత్తులు వేసిన చివరికి పోలీసుల చేత్తోలో చిత్తూ అవుతున్నారు. ఎయిర్‌పోర్టులోనే దొరికిపోతున్నారు. తాజాగా మరోసారి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ పట్టుబడింది. హైదారాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు సిసి కెమెరాలకంటే ఎక్కువగా పని చేస్తున్నారు. వాళ్ళు  నిత్యం ఎంతో పగడ్భంధీగా తనిఖీలు చేసినా, అధికారుల కళ్ళు కప్పి  డ్రగ్స్‌ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్ తో ఉందని అనుమానించిన పోలీసులు ఆమె దగ్గరి నుంచి 3.2 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుంచి ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దోహా మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది ఓ మహిళ. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ముందస్తు సమాచారంతో డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు బ్యాగ్‌ను అధికారులు తనిఖీ చేయగా, అందులో 3.2 కేజీల హెరాయన్‌ ను గుర్తించారు. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు డిఆర్‌ఐ అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌ విలువ 21 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతుండగా, అటు డ్రగ్స్‌ని కూడా పెద్ద ఎత్తునా తరలించడం ఆందోళనకు గురి చేస్తోంది. బంగారం అక్రమ రవాణా చేసేవారు కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ఎలక ఎన్ని ఎత్తులు వేసిన పిల్లికి చిక్కాల్సిందే అన్నట్లు స్మగ్లర్లు ఎంత అతితెలివితో గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడ్డా, కస్టమ్స్‌ అధికారులకు మాత్రం దొరికిపోతున్నారు. ఇటు డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసేవారిపై అధికారులకు ముందస్తుగానే సమాచారం రావడంతో అలర్ట్‌ అవుతున్నారు. నిందితులు ఎయిర్‌పోర్టులోకి అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

అంతరిక్ష యాత్రకు జెఫ్‌ బెజోస్‌.. 100 కి.మీ ఎత్తుకు న్యూ షెపర్డ్‌! 

అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి కీలకమైన మరో అడుగు పడబోతోంది. దిగ్గజ సంస్థ ‘ఆమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర మంగళవారం జరగనుంది. 20 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్‌ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకువస్తుంది. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్‌ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్‌ డీమన్‌ ఈ అంతరిక్ష యాత్ర చేయనున్నారు. రోదసిలోకి వెళ్లనున్న అతి పిన్న, పెద్ద వయస్కులు వీరు.  అంతరిక్ష పర్యటకానికి సంబంధించి వర్జిన్‌ గెలాక్టిక్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 12న చేపట్టిన అంతరిక్ష యాత్ర తొలి అడుగు కాగా, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ టూర్ రెండోది కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు బెజోస్ బృందం యాత్ర మొదలుకానుంది. బ్రాన్సన్‌, శిరీష బండ్ల బృందం వెళ్లిన స్పేస్‌ఫ్లైట్‌ను పైలట్లు నడిపారు. కానీ, బెజోస్‌ యాత్ర పూర్తిగా ఆటోమేటిక్‌. దీన్ని నడపడానికి పైలట్లు అవసరం లేదు. పైలట్లు లేకుండా పూర్తిగా సామాన్య పౌరులతో చేపట్టే తొలి రోదసియాత్రగా ఇది నిలవబోతోంది. పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఒక సుదూర ప్రదేశం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. బెజోస్‌ బృందం 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్‌ రేఖ దాటి భూమి అందాలను వీక్షించి తిరిగి రానున్నారు.   స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెఫర్డ్‌’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ అస్ట్రోనాట్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఆరియన్‌ కార్నెల్‌ ప్రకటించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్‌ అలాన్‌ షెఫర్డ్‌ పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ తమ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ తరహాలో దీనిని నిర్మించారు. అయితే, పరిసరాలను 360 డిగ్రీల కోణంలో చూసేలా క్య్రూ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ నిట్టనిలువగా టేకాఫ్‌ అవుతుంది. అలాగే, నిట్టనిలువుగానే ల్యాండ్‌ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్రకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్‌ ఎవరూ ఇందులో లేరు. న్యూషెపర్డ్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసిన ఇంజనీర్ల బృందంలో.. మహారాష్ట్రకు చెందిన సంజల్‌ గవాండే (30) కూడా ఉన్నారు. బ్లూఆరిజిన్‌ కంపెనీలో సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె పుట్టిపెరిగిందంతా మహారాష్ట్రలోని కల్యాణ్‌ నగరంలో. ఆమె తండ్రి అశోక్‌. కల్యాణ్‌-డోంబివిలి మునిసిపల్‌ విభాగం విశ్రాంత ఉద్యోగి. తల్లి సురేఖ రిటైర్డ్‌ ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగి. ముంబై వర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ పూర్తిచేసిన ఆమె..మిషిగన్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అనంతరం విస్కాన్సిన్‌లో మెర్క్యురీ మెరైన్‌ అనే సంస్థలో పనిచేశారు. తర్వాత టొయోటా రేసింగ్‌ డెవల్‌పమెంట్‌లో పనిచేశారు. 2016లో పైలట్‌ లైసెన్స్‌ పొందిన తర్వాత.. నాసాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. కానీ, పౌరసత్వ సమస్యల వల్ల ఆమెకు నాసాలో ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె బ్లూఆరిజిన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసి సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. 

పార్లమెంట్ లో పెగాసస్ సెగలు.. మోడీ టార్గెట్ గా విపక్షాల ఉమ్మడి పోరు

దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన పెగాసస్ ప్రకంపనలు పార్లమెంట్ ను షేక్ చేస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ సహా మూడు వందల మంది ఫోన్లపై నిఘా పెట్టారన్న ఆరోపణలను విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. సోమవారం పార్లమెంట్ లో ఆందోళన చేసిన ప్రతిపక్షాలు.. దీనిపై మరింతగా పోరాడాలని నిర్ణయించాయి. మంగళవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. ఫోన్లపై నిఘా పెట్టడం దారుణమంటున్న విపక్షాలు.. ప్రధాని మోడీని బాధ్యత వహించాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  తాజాగా ‘పెగాసస్‌’ హ్యాకింగ్‌ బాధితుల జాబితాలో మరికొందరి పేర్లు బయటపడ్డాయి. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, వివిధరాష్ట్రాల్లో బీజేపీకి గెలుపును దూరం చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఫోన్లు, ప్రహ్లాద్‌ పటేల్‌ సన్నిహితులకు చెందిన 18నంబర్లు కూడా హ్యాక్‌ అయ్యాయని ‘ద వైర్‌’ వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ అశోక్‌ లావాసా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌ దీప్‌ కాంగ్‌, ఎన్నికల వాచ్‌డాగ్‌ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌)’ వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ చోఖర్‌.. ఇలా చాలా మంది పెగాసస్‌ నిఘా నీడన ఉన్నారని పేర్కొంది. ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యాయో కూడా తెలిపింది.  తమను విమర్శించేవారిపై నరేంద్ర మోడీ సర్కారు నిఘా పెట్టిందని.. ఇందుకోసం ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎ్‌సవో రూపొందించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ను ఉపయోగించిందని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి, చర్య తీసుకునేందుకు ఉపయోగించాల్సిన ఈ నిఘా పరికరాల్ని  ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మానవహక్కుల సంఘాలపై ప్రయోగించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్టులు జోవాన్నాస్లేటర్‌, నీహా మహిష్‌ తమ కథనంలో పేర్కొన్నారు. ఇక ద వైర్  కథనం ప్రకారం.. రాహుల్‌ గాంధీపై 2018 మే,జూన్‌ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా నిఘా పెట్టారు. రాహుల్‌ ఉపయోగించిన రెండు నంబర్లతో పాటు ఆయన స్నేహితుల్లో ఐదుగురికి, పార్టీ విషయాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసే ఇద్దరు సహాయకులు అలంకార్‌ సవాయ్‌, సచిన్‌రావుకు సంబంధించిన తొమ్మిది నంబర్లపై నిఘా పెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌కిశోర్‌ ఫోన్‌ను పెగాసస్‌ స్పై వేర్‌ ద్వారా హ్యాక్‌ చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ నిర్వహించిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిం ది.  2019ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘన కేసులో ప్రధాని మోడీకి.. అప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోడా క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై అసమ్మతి వ్యక్తం చేయడం ద్వారా అశోక్‌ లావాసా వార్తల్లోకి వచ్చారు. అప్పుడే ఆయన ఫోన్‌పై పెగాసస్‌ ద్వారా నిఘా పెట్టారు. ఇటీవలే కొత్తగా మోడీ కేబినెట్‌లో ఐటీ, రైల్వే శాఖల బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఫోన్‌ కూడా 2017లో హ్యాకింగ్‌కు గురైంది. అప్పుడు ఆయన గుజరాత్‌లో మూడు కంపెనీలకు డైరెక్టర్‌. టెక్నాలజీకి సంబంధించి మోడీ నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన స్టాఫర్‌కు, ఆమె బంధువులకు చెందిన 11 నంబర్లపై 2019 ఏప్రిల్‌లో (ఆరోపణలు చేసిన సమయంలో) పెగాసస్‌ నిఘా ఉన్నట్టు ‘ద వైర్‌’ వెల్లడించింది. ప్రముఖ వైరాలజిస్టు గగన్‌ కాంగ్‌ ఫోన్‌ను 2018లో కేరళను నిఫా వైరస్‌ కుదిపేస్తున్నప్పుడు హ్యాక్‌ చేశారట.

కారు పార్టీనా? కొత్త పార్టీనా? ప్ర‌వీణ్‌కుమార్ దారెటు?

ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్‌. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌. ఆయ‌న రిజైన్ చేయ‌డం క‌న్నా.. నెక్స్ట్ ఏంటి? అనేదే మ‌రింత ఇంట్రెస్టింగ్‌. ప్ర‌వీణ్‌కుమార్ ఎందుకు రాజీనామా చేశారు? ఆ త‌ర్వాత ఏం చేయ‌బోతున్నారు? టీఆర్ఎస్‌లో చేర‌బోతున్నారా? హుజురాబాద్‌లో పోటీ చేస్తారా? లేక‌, సొంత‌పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేస్తారా? ఇవే ఇప్పుడు చ‌ర్చ‌లో ఉన్న అంశాలు. వీటిలో అన్నిటికీ అనుకూల అంశాలున్నా.. ఇందులో ఏది జ‌ర‌గ‌బోతుంద‌నేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 26 ఏళ్లుగా ఐపీఎస్‌. పోలీస్ డిపార్ట్‌మెంట్ డైన‌మిక్ ఆఫీస‌ర్‌. 9 ఏళ్ల నుంచి గురుకులాల కార్య‌ద‌ర్శిగా హ‌ల్‌చ‌ల్‌. ప్ర‌వీణ్‌కుమార్ కెరీర్ అంతా సంచ‌ల‌న‌మే. ఆలంపూర్‌లో పుట్టి.. హార్వ‌ర్డ్‌లో చ‌దివి.. స్వేరేస్ స్థాపించి.. చేసిన ప్ర‌తీప‌నిలో త‌న‌దైన ముద్ర వేశారు. అలాంటి అధికారి, స‌డెన్‌గా ఆ బాధ్య‌త‌ల నుంచి ఊరికే వైదొల‌గ‌రు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ఉంటారు. అదేంట‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. పూలే, అంబేద్క‌ర్‌, కాన్షీరాం చూపిన‌ మార్గంలో న‌డుస్తాన‌ని, పేద‌లకు పీడితుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అంటే, అది రాజ‌కీయ ఎజెండానా? సేవా మార్గ‌మా? అనేది ఆస‌క్తిక‌రం. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆయ‌న ప‌ద‌విని వీడేలా చేసింద‌ని.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశ‌మే ఎక్కువ‌ని అంటున్నారు.   ఇటీవ‌ల స్వేరోస్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన భీమ్ ప్ర‌తిజ్ఞ వివాదాస్ప‌ద‌మైంది. హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. అది బీజేపీ వ‌ర్సెస్ ద‌ళిత సంఘాల ట‌ర్న్ కూడా తీసుకుంది. ఓ ద‌శ‌లో బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్‌పై దాడికి యత్నించారు స్వేరోస్ స‌భ్యులు. ఆ స‌మ‌యంలో ప్ర‌వీణ్‌కుమార్ వ్యూహాత్మ‌క మౌనం పాటించి.. ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా ప్ర‌వ‌ర్తించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. స్వేరోస్‌ను క‌ట్ట‌డి చేయ‌క‌పోవ‌డం, దాడుల‌నూ ఖండించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. ఈ ప‌రిణామ‌మే ఆయ‌న‌ను రెచ్చ‌గొట్టింద‌ని.. ఐపీఎస్ అధికారిగా ఉంటే త‌న చేతులు క‌ట్టేసిన‌ట్టు, ప‌రిమితుల్లో ఉండాల్సి ఉంటుంద‌ని.. త‌న సుదీర్ఘ‌-విస్తృత ల‌క్ష్యం నెర‌వేరాలంటే ఐపీఎస్ కంటే మెరుగైన వేదిక అవ‌స‌రమ‌ని భావించే.. ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ ఓకే.. మ‌రి ఇప్పుడిక ప్ర‌వీణ్‌కుమార్ ముందున్న మార్గ‌మేంటి? ఆయ‌న వ్యూహ‌మేంటి? ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ వెనుక ఉన్న‌ది కేసీఆరే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. బీజేపీ వ‌ర్సెస్ స్వేరోస్ ఎపిసోడ్‌లో ప్ర‌భుత్వం ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా.. మౌనంగా, మ‌ద్ద‌తు ఇచ్చార‌ని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే ఆయ‌న రాజీనామా చేశార‌ని, హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తారంటూ గుస‌గుస‌లు భారీగానే వినిపిస్తున్నాయి. గ‌తంలో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ ఎస్పీగా ప‌నిచేయ‌డం, హుజురాబాద్‌లో ద‌ళితుల ఓట్లు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టంతో ఈ వాద‌న‌కు కాస్త బ‌లం చేకూరుతోంది. ఇటీవ‌ల బీజేపీతో స్వేరోస్‌కు ఏర్ప‌డిన శ‌త్రుత్వంతో.. హుజురాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఢీకొట్ట‌డానికి ప్ర‌వీణ్‌కుమార్‌ను అస్త్రంగా ప్ర‌యోగిస్తార‌నేది ఓ వాద‌న‌. ఒకవేళ ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేయ‌క‌పోయినా.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ బాధ్యతలను ప్రవీణ్ కుమార్‌కు అప్పగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని కూడా చెబుతున్నారు. ఏలాగైనా ప్ర‌వీణ్‌కుమార్ ఇమేజ్‌ టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డేలా కేసీఆర్ పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు.  అయితే, అభ్యుద‌య భావ‌జాలం, పేద‌లు-పీడితుల అభివృద్ధి కోసం విస్తృత ల‌క్ష్యం ఏర్ప‌ర‌చుకున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. ఏ హుజురాబాద్‌కో, టీఆర్ఎస్‌లో ప‌రిమిత‌మ‌య్యే ర‌కం కాదని ఆయ‌న స‌న్నిహితుల మాట‌. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. స్వేరో సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. లక్షలాది మంది స్వేరో సైన్యంలో ఉన్నారు. చదువుకున్నవారు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా స్వేరోలుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వేరో సంస్థలో పనిచేస్తున్న సైన్యాన్ని సమీకరించి కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తద్వారా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. ఆయన రాజకీయ పార్టీ నెలకొల్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యావత్ దళిత సంఘాలన్నీ ఆ పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు.  తెలంగాణ‌లో ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ తీన్మార్ న‌డుస్తోంది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు రాజ‌కీయ మైదానంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉన్న‌వి చాల‌వ‌న్న‌ట్టు.. కొత్త‌గా ష‌ర్మిల సైతం దుకాణం తెరిచారు. అన్న‌లానే ఒక్క‌ఛాన్స్ కోసం ఆరాట‌ప‌డుతున్నారు. ఇప్పుడిక ప్ర‌వీణ్‌కుమార్ సైతం కొత్త పార్టీ పెడితే.. ద‌ళిత వ‌ర్గాల‌కు ప్ర‌తినిధిగా నిలిస్తే.. తెలంగాణ రాజ‌కీయం ఆస‌క్తిక‌ర ట‌ర్న్ తీసుకునే అవ‌కాశ‌ముంది. ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల భూమి హామీని తుంగ‌లో తొక్కిన కేసీఆర్ స‌ర్కారుపై ద‌ళితులంతా తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికే.. కొత్త‌గా 'ద‌ళిత బంధు' పథ‌కానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్‌. ప్ర‌స్తుతం ద‌ళితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలురుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాక‌తో మ‌రింత ఉత్సాహం పెరిగింది. ఇలాంటి స‌మ‌యంలో.. ద‌ళితుల‌కు రోల్ మోడ‌ల్ లాంటి ప్ర‌వీణ్ కుమార్ పార్టీ పెడితే.. ఆ వ‌ర్గ‌మంతా కాంగ్రెస్ నుంచి ప్ర‌వీణ్‌కుమార్ వైపు మ‌ళ్ల‌డం ఖాయం. అంటే, ప్ర‌వీణ్‌కుమార్ వేయ‌బోయే అడుగులు.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి ప్ర‌తీకూలంగా మారుతాయ‌ని అంటున్నారు. ఇలా ఎలా చూసినా.. ప్ర‌వీణ్‌కుమార్ రాజ‌కీయ జెండా ఎత్తితే.. అది కేసీఆర్‌కే అనుకూలమ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ష‌ర్మిల సైతం కేసీఆర్ ఇషారాతోనే రేవంత్ టార్గెట్‌గా పార్టీ పెట్టారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ సైతం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే..? తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రిన్ని సంచ‌ల‌నాలకు తెర‌లేచే అవ‌కాశాలు ఎక్కువే.

ఇన్ సైడెడ్ ట్రేడింగ్ కేసు అవుట్.. ఇప్పుడేమంటారో జగన్!  

ఆఖరి అవకాశం కూడా ఆవిరై పోయింది. ఏదో ఒకటి చేయాలని.. ఏదేదో చేసేయాలని తొందరపడి కూసేసిన జగనన్నకు, ఆయన అడుగులో అడుగు వేసే అధికారులకు.. చప్పట్లు కొట్టే నేతలకు ..అందరికీ రీసౌండ్ వచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. హైకోర్టు చెప్పిందే కరెక్టని..ఇంకా చెప్పడానికి ఏమీ లేదని.. అసలు భూములు అమ్మినవారెవరూ ఫిర్యాదు చేయకుండా ఇస్ సైడెడ్ ట్రిడింగ్ అని కేసు ఎలా పెట్టారని ప్రశ్నించింది. అలా ఇన్ సైడెడ్ ట్రేడింగ్ ఇప్పటికైతే ముగిసిపోయింది. ఇప్పటికైతే అని ఎందుకంటే... జగన్ సార్ మరో పేరుతో మళ్లీ తప్పకుండా ప్రయత్నిస్తారు కాబట్టి. ఇక సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టేశాక పదే పదే ఇన్ సైడెడ్ ట్రేడింగ్ అని అరవలేరు. న్యాయస్ధానాల్లో నిలబడవని తెలిసినా అత్యుత్సాహంతో, పట్టలేని ఫ్రస్టేషన్ తో కేసులు పెట్టారు. కనీసం కేసులు పెట్టకపోయినా.. ఆరోపణలు అలాగే చేస్తూ ఉండే అవకాశం ఉండదేని..ఇప్పుడది కూడా లేకుండా చేశారని వైసీపీలోనే కొందరు తిట్టుకుంటున్నారు.అమరావతి అనేది ఒక స్కామ్ అని జగన్ ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం కూడా చేయక ముందే చెప్పిన డైలాగ్. అమరావతి అంటే కేవలం చంద్రబాబు ఆయన అనుయాయూలు ఇన్ సైడెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికే పెట్టిన ప్రాజెక్ట్ అని ఊరూరా చెప్పి... ఇతర ప్రాంతాల్లో చాలామందిని నమ్మించారు జగన్. అంతే కాదు.. ఇక్కడ కట్టిన కట్టడాలు కూడా గ్రాఫిక్సే అని ఊదరగొట్టి ఇంకొంతమందిని నమ్మించారు. ఇప్పుడు ఆ కట్టడాలను అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టేశారు. అసలు అమరావతినే నరకంలోకి తోసేశారు. అమరావతి భూముల అమ్మకంలో లబ్ది పొందారనే ఆరోపణలతో టీడీపీ అధినేత, నేతలు అందరినీ ఇరుకున పెట్టాలని చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికీ దళితుల భూములు బినామీ పేర్లతో కొట్టేశారనే ఆరోపణల వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. అది ప్రస్తుతానికి సీఐడీ చేతిలో ఉంది. అదింకా కోర్టు దాకా రాలేదు. ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబునే అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కాని అది కుదరలేదు. ఇక్కడ కూడా న్యాయస్థానమే అడ్డుకుంది. అంతెందుకు ఇదే ఆరోపణలను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా చేసి..అమరావతిలో ఆయన లబ్ది పొందినట్లు చిత్రించి...ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని కూడా తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు ఈ కేసు కొట్టివేతతో ఎటూ  పాలుపోని పరిస్ధితి జగన్ సర్కార్ కు ఏర్పడింది. ఏ కేసు తీసుకున్నా..ఏది చేసినా..టీడీపీ నేతలను ఇరికించలేకపోతున్నామనే ఆక్రోశం వారిలో కనపడుతోంది. ఇంకా ఏపీ ఫైబర్ నెట్ కేసు ఒకటి కొత్తగా మొదలైంది. ఈ కేసు ద్వారా లోకేష్ ను అరెస్ట్ చేయాలనేది వ్యూహం. ఇది మరి ఎంతవరకు అవుతుందో చూడాలి.

పార్టీ నేతలకు సరే.. నిరుద్యోగుల మాటేంటి? జగన్ ను నిలదీసిన పవన్.. 

ఉద్యోగ కల్పనపై జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జాబ్ క్యాలెండర్ పై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని జగన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు పవన్.  సీఎం‌ చెప్పిన మాటకి ఆచరణకు పొంతనే లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలిస్తానన్న జగన్ మాట నమ్మి 30 లక్షల మంది వైసీపీని గెలిపించారని జనసేనాని చెప్పారు. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుబట్టారు.మోసపోయాం, వంచనకు గురయ్యామనే ఆవేదన యువతలో ఉందని తెలిపారు.  లక్షల మంది యువత ఉద్యోగాల కోసం‌ ఎదురు చూస్తున్నారని పవన్ తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులను దగా చేశారని, వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు దండగ పదవులు ఇచ్చారని విమర్శించారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు కూడా సృష్టించి ఉపాధి కల్పించినప్పుడు, మీరిచ్చిన మాట ప్రకారం 2.30 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరు? అని జగన్ ను నిలదీశారు పవన్ కల్యాణ్. వైసీపీ రాజకీయ నిరుద్యోగులపై చూపినంత ఉత్సాహం, చొరవ తమపై ఎందుకు చూపరని ప్రశ్నించారు.   

రాజ్యసభ లాబీలో విజయసాయి.. ఇది బ్లాక్ మెయిలింగ్ సుమీ..?

పార్లమెంట్లో వైసీపీ ఎంపీల ఆందోళన రాజకీయ వర్గాలను కాస్త ఆశ్చర్యంలో పడేసింది. లోక్ సభలో పోలవరం బడ్జెట్ కోసం.. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకు ఎంపీలు డిమాండ్ చేశారు. మొన్నటివరకు బిజెపికి అన్నివిధాలా సహకరించిన వైసీపీ ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. మరోవైపు బిజెపికి పూర్తి మెజారిటీ ఉండగా హోదా అడగటం తప్ప మనమేమీ చేయలేమని సాక్షాత్తు దేవుడి స్క్రిప్టు చదివిన జగన్ గారే చెప్పారు. మరేంటి చెప్మా? అసలు రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఆందోళన చేయాలనేది వైసీపీ ప్లాన్ కాగా... రాష్ట్ర సమస్యలపై ఆందోళన చేయరు గాని.. దీనిపై చేస్తారా అనే ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ సమాధానమా అన్నట్లు ఉంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ నెల 26న సీబీఐ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇస్తే గిస్తే బెయిల్ రద్దనే ఇవ్వాలని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మరి అది నిజమే అయితే ...జగన్ సార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లినా అక్కడ స్టే ఆర్డర్ రాకపోతే.. పదవికి రాజీనామా చేసి లోపలికి వెళ్లక తప్పదు. అందుకే జలవివాదం రేపారనే వాదనలు కూడా వచ్చాయి. కాకపోతే కేంద్రం సడెన్ గెజిట్ నోటిఫికేషన్ ఏపీ, తెలంగాణ ఇద్దరికీ షాకిచ్చింది. మరోవైపు టీడీపీ నేతలను జైలుకు పంపటానికి చేసే ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇవన్నీ చూసినప్పుడే డౌటొచ్చిందంటున్నారు కొందరు.మరోవైపు రఘురామపై పెట్టింది రాజద్రోహం కేసు. అదిప్పుడు సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఆ రాజద్రోహం సెక్షన్ ఎత్తేయాలంటున్నారు. ..కాబట్టి..ఈ కేసు నిలబడదనే కామెంట్లు వినపడుతున్నాయి.  అటు రఘురామ విషయంలోనూ.. ఇటు సీబీఐ కోర్టులో ఆయన వేసిన పిటిషన్ విషయంలోనూ బిజెపి చేతులెత్తేసినందుకే.. వైసీపీ ఈ నిరసన తెలియచేస్తుందనేది కొందరి అనుమానం. అంటే బ్లాక్ మెయిలింగ్. మీరు మా విషయం పట్టించుకోకపోతే..మేం మీ గురించి పట్టించుకోవాల్సి వస్తుందని ఒక రకంగా అర్ధమయ్యేలా చెప్పారనుకోవాలి. అంటే జగన్ సార్ ను సేవ్ చేస్తే.. ఓకె.. లేదంటే మేం మిమ్మల్నీ బద్ నామ్ చేస్తామనేది దాని సారాంశం. వైసీపీ పోరుబాట వెనక రహస్యం ఇదేనని రాజకీయ వర్గాల్లో వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది. 26వ తేదీకి సరిగ్గా మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో ఏమైనా జరిగితే... పార్లమెంట్ సమావేశాల్లో ఇక వైసీపీ నోరెత్తదు. లేదు కుదరదు లాంటి మాటలు బిజెపి నేతలు చెబితే మాత్రం..ఈ ఆందోళన రకరకాలుగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుందని కొంతమంది భావిస్తున్నారు. మరి బిజెపి వ్యూహమేంటో తెలిస్తే గాని ... ఈ కథ ఎటు వెళుతుందో తెలియదు.  

కేసీఆర్ వ్యతిరేకులంతా ఏకమయ్యారా! ఈట‌ల‌దే  గెలుపా..?  గులాబీలో గుబులు అందుకేనా? 

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. కుదిరితే తాను, కుద‌ర‌క‌పోతే త‌న భార్య జ‌మున‌.. ఇద్ద‌రిలో ఒక‌రు హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉండనున్నారు. ఉప ఎన్నికలో త‌న గెలుపుతో అధికారంలోకి వ‌చ్చేది లేదు.. మ‌రోసారి మంత్రి అయ్యేదీ కుద‌ర‌దు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఓ మూల‌న కూర్చోవాల్సి ఉంటుంద‌నే క్లారిటీ ఈటలకు ఉంది. అయినా.. ఎమ్మెల్యే ప‌ద‌వి కోసం ఆయ‌న అంత‌లా ఎందుకు పోరాడుతున్నారో అంద‌రికీ తెలుసు. తన గెలుపు.. సీఎం కేసీఆర్‌కు చెంప‌పెట్టు కావాల‌నేది ఆయ‌న ప‌ట్టుద‌ల‌. హుజురాబాద్‌లో గెలిచి.. కేసీఆర్‌కు త‌గిన‌ గుణ‌పాఠం చెప్పాల‌నేది ఆయ‌న ప‌గ‌, ప్ర‌తీకారం. తానేదో రాజ్య‌మేలాల‌ని కాకుండా.. బానిస భ‌వ‌న్‌గా మారిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లు కొట్టాల‌నేది ఆయ‌న సంక‌ల్పం. అందుకే, ఈట‌ల దంప‌తులు హుజురాబాద్‌లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరుగుతున్నారు. 23 రోజుల పాటు.. 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల మేర పాద‌యాత్ర‌తో.. 'ప్ర‌జా జీవ‌న యాత్ర' పేరుతో ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.  హుజురాబాద్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మార్చేస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. పాద‌యాత్ర నిర్ణ‌యం అందులో భాగ‌మే. తాజాగా, త‌న బ‌దులు త‌న భార్య జ‌మునారెడ్డిని బీజేపీ త‌ర‌ఫున పోటీ చేయించాల‌ని చూస్తున్నారు. అందుకు క‌మ‌లం పార్టీ సైతం సై అన‌డంతో.. బ‌హుషా హుజురాబాద్ బ‌రిలో నిలిచేది జ‌మున‌నే కావొచ్చంటున్నారు. ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ ఫైట్‌ను కాస్తా.. జ‌మున వ‌ర్సెస్ టీఆర్ఎస్‌గా మార్చేస్తున్నారు. అటు, అధికార‌ప‌క్షం సైతం వ్యూహాత్మ‌కంగా దాడి చేస్తోంది. హుజురాబాద్ ఎన్నిక‌లు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే పోరు కాద‌ని.. పార్టీల మ‌ధ్య జ‌రిగే వార్ అంటూ కేటీఆర్ ఓట‌ర్ల‌ను క‌న్ఫ్యూజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్‌గా పోరు సాగితే.. ఈట‌ల‌కే అడ్వాంటేజ్ ఎక్కువ‌. అయ్యో పాపం.. అన్నేళ్లు పార్టీలో ఉన్న ఈట‌ల‌ను అన్యాయంగా బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టార‌నే సానుభూతి ఆయ‌న‌కు బాగా క‌లిసొస్తుంది. అందుకే, ఈట‌ల‌కు ఆ అద‌న‌పు ప్ర‌యోజ‌నం ద‌క్క‌కుండా చేసేందుకే, ఇది రెండు పార్టీల మ‌ధ్య జ‌రిగే సంగ్రామంగా మాట‌ల గ్యార‌డీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  కేసీఆర్ వేసే ఎత్తుగ‌డ‌ల‌కు విపక్షాలు సైతం అదే స్థాయిలో విరుగుడు మంత్రం ప్ర‌యోగిస్తున్నాయి. ఈ ఒక్క‌సారికి తాము ఓడినా ప‌ర్లేదు.. ఈట‌ల గెల‌వాలంటూ అన్నిపార్టీలు, అన్నివ‌ర్గాలు ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌హ‌క‌రిస్తున్నాయని అంటున్నారు. ఈట‌ల బీజేపీ నుంచి పోటీ చేసినా.. పార్టీని చూడ‌కుండా.. ఈట‌ల‌ను చూసి.. ఆయ‌న కేసీఆర్‌పై తిరగ‌బ‌డిన ధోర‌ణి చూసి.. అంతా ఆయ‌న‌కే త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త‌తో ఉన్న అన్నివ‌ర్గాలు ప్ర‌జ‌లు, నాయ‌కులు, ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మ‌కారులు.. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని.. ఈట‌ల‌ను గెలిపించుకొని.. గులాబీ బాస్‌కు బుద్ధి చెప్పాల‌ని త‌మ‌వంతుగా అంతా ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.  కాంగ్రెస్ సైతం హుజురాబాద్ విష‌యంలో ప‌ట్టుద‌ల‌కు పోకుండా.. ఎలాగూ త‌మ‌ది కాని ఆ సీటుపై ప‌ట్టుద‌ల‌కు పోకుండా.. ప‌రోక్షంగా ఈట‌ల గెలిచేలా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కారులు,  కోదండ‌రాం సార్ సైతం ఈట‌ల‌కే జై కొడుతున్నారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి సైతం ఈట‌ల గెలుపున‌కే కృషి చేస్తానంటున్నారు. ఇలా.. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ జ‌రుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఉద్య‌మ‌కారులు, ప్ర‌జాసంఘాలు, ప్ర‌జాస్వామ్య‌వాదులు త‌దిత‌ర వేరు వేరు వ‌ర్గాల‌న్నీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి.. ఒక్క‌మాట మీద నిల‌బ‌డి.. ఒకే ఒక్క‌డు ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించి.. కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. ఈటల కుటుంబం బీజేపీ త‌ర‌ఫునే పోటీ చేసినా.. ఇక్క‌డ పార్టీని కాకుండా కేండిడేట్‌ను చూసి.. కేసీఆర్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి అంతా సిద్ద‌మ‌వుతున్నారని తెలుస్తోంది. హుజురాబాద్ బీజేపీ అభ్య‌ర్థిగా రాజేంద‌ర్ పోటీ చేసినా, లేదంటే జ‌మునారెడ్డి బ‌రిలో నిలిచినా.. ఈట‌ల ఫ్యామిలీనే గెలిపించాల‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు పుట్టేలా.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన మెసేజ్ ఇచ్చి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారంతా.. అదే జరిగితే హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఝలక్ తగలవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసే గులాబీ నేతలు గుబులు పడుతున్నారని అంటున్నారు. మండలానికో మంత్రిని ఇంచార్జ్ గా నియమించారని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ ఏం చేసినా.... కేసీఆర్ వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైతే మాత్రం హుజురాబాద్ వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 

నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ  నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది.

నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, నిత్యాజీవితంలో జరిగిన సంఘటన. ఈ మాటలు చెపుతూ ఒక వ్యక్తి  తాను ప్రేమించిన ప్రియురాలి కోసం నిండు ప్రాణం తీసుకున్నాడు. ఆ టైం లో అమ్మానాన్న ఎవరు గుర్తుకు రానట్లు ఉన్నారు ఆతనికి. అయినా నేటి తరం యువత వెనక ముందు ఆలోచించకుండా క్షణకాలంలో ప్రేమ అనే చిన్న విషయం కోసం తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు యువత. తాజాగా హైదరాబాద్‌లో అమీర్‌పేట్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. సహజంగా  తెలిసి తెలియని వయసు వాళ్ళు ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఐతే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్  సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షోస్ట్ చేశాడు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్‌ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్‌ (29) అమీర్‌పేట్‌లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడే ప్రభుత్వం ఉద్యోగానికై ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం ఓ అమ్మాయితో ప్రేమలో పడేట్టు చేసింది  సుధాకర్ ను. అయితే, సుధాకర్ ప్రేమకు ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు. నా చావుతో అయినా నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటావు’ అంటూ ఆ వీడియోలో తన ప్రేమను వ్యక్తపరిచాడు. పాపం అతను చనిపోయాక అతని ప్రాణం, అతని ప్రేమ రెండు తిరిగిరావని తెలుసుకోలేకపోయాడు.  అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుధాకర్.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, స్నేహితులు గదికి వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తీయలేదు. దాంతో అనుమానం వచ్చి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లారు. గదిలో సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని సుధాకర్ మృతదేహాన్ని కిందకు దించారు. సుధాకర్ తీసుకున్న సెల్పీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం అవడం కారణంగానే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.          

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం.. స్వచ్ఛంద పదవీ విరమణ

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వాలంటరీగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని  ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది.  ఇటీవలే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు భీమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఈయన సమక్షంలోనే జరిగింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. హిందూ దేవతలను కించపరిచేలా  ఈ  ప్రతిజ్ఞ చేశారని విమర్శలొచ్చాయి. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వాలంటరీగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  వాలంటరీగా పదవీ విరమణ విషయమై  ప్రజలకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కృతజ్తలు తెలిపారు. వ్యక్తిగత కారణాల రిత్యా విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.రెండు పేజీల లేఖను ప్రజలకు రాశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ లేఖలో అనేక విషయాలను వెల్లడించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విడుదల చేసిన లేఖ కింద ఇస్తున్నాం..

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి భూముల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై జగన్ రెడ్డి సర్కార్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ప్రభుత్వం చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తిరస్కరించింది. జస్టిస్ వినీత్ శరన్ ,జస్టిస్ దినేశ్ మహేశ్వరి ద్విసభ్య బెంచ్ ముందు అమరావతి భూముల కేసు వాదనలు ముగియడంతో.. ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు వెల్లడించింది.  అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదార్లకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ధ్రువీకరించాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నట్టు తెలుస్తోందని దవే ఏపీ ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారిన తర్వాతే ఫిర్యాదులు అందాయని దవే స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలతో ప్రతివాదుల తరఫు న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని  ప్రతివాది తరఫు న్యాయవాది ఖుర్షీద్ స్పష్టం చేశారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఏముందని అన్నారు. అసలు ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదని చెప్పారు. ఇద్దరి మధ్య వ్యవహారంలో మోసం జరిగిందా? లేదా? అనే అంశాలు ఈ చట్టం పరిధిలోకి రావని వివరించారు. రాజధాని ఎక్కడన్న అంశం 2014 అక్టోబరు నుంచి మీడియాలో వచ్చిందని ఖుర్షీద్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 14 గ్రామాల్లో 30 వేల ఎకరాల పరిధిలో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని వివరించారు.  2014 డిసెంబరు 30న రాజధానిపై అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఖుర్షీద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారని స్పష్టం చేశారు. మరో ప్రతివాది తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆరేళ్ల తర్వాత భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. అంతేతప్ప భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానికులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న అంశం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తెలుస్తుందని దివాన్ వివరించారు. ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం సెక్షన్-55 వర్తించదని అన్నారు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందని సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. 

తెలుగు తల్లికి మరో అవమానం.. జగన్ సర్కార్ పై జనాగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో లేక ఉద్దేశ పూర్వకంగానే, తెలుగు భాష, తెలుగు సంస్కృతీ చుట్టూ వివాదాలు రాజేస్తున్నారో గానీ, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని చిన్న చూపు చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే, తెలుగు భాషను, తెలుగు జాతి ఔనత్యాన్ని సజీవ సమాధి చేసేకుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  కొద్ది రోజుల క్రితం జగన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగు భాషకు, సంస్కృత భాషను జోడించి, తెలుగు అకాడమీ పేరును  తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చి ఒక వివాదాన్ని రాజేసింది. ఆ సమస్య అలా ఉండగానే ఇప్పుడు కొత్తగా సాహిత్య, సంగీత, నృత్య, లలిత కళలు, చరిత్ర అకాడమీలకు ఆయా రంగాలకు సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి తెర తీసింది. ఈ నేపధ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి  మండలి బుద్ధ ప్రసాద్ జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందో.. కుట్రపూరితంగానో  తెలుగును అవమానిస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  నిజం బుద్ధ ప్రసాద్ అన్నట్లుగా, ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుంది. అందులోనూ  తెలుగు భాషకు,తెలుగు జాతికి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపు గౌరవం ఉన్నాయి. కృష్ణ దేవరాయలు మొదలు ఎందరో రారాజులు, చక్రవర్తులు తెలుగు భాషను, తెలుగు వారికి సొంతమైన  సమున్నత సాంస్కృతిక ఔన్నత్యాన్ని వేనోళ్ళ కొనియాడారు.  ఈ నేఅపధ్యంలోనే భారతీయ కళలు, సాహిత్యాన్ని పరిపోషించేందుకు స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అనేక అకాడమీలను నెలకొల్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాటలో అడుగులు వేశాయి.ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ భాష, సంస్కృతీ అభివృద్ధి, పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.  అవిభక్త ఆంధ్ర ప్రదేశ్’లో బహుభాషా కోవిదుడు పీవీ నరసింహ రావు తెలుగు భాష, తెలుగు సంస్కృతీ అభివృద్ధికి, అకాడమీలకు అంకురార్పణ చేశారు.అప్పటి నుంచి వచ్చిపోయిన ప్రభుత్వాలు అన్నీ అకాడమీలకు ఆయా రంగాల్లోని నిష్ణాతులను అధ్యక్షులుగా నియమింఛి సంబధిత కళల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో  సాహిత్య అకాడమీకి డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, సంగీత అకాడమీకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమీకి నటరాజ రామకృష్ణ, లలిత కళా అకాడమీకి పీటీ రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయా రంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అందుకు విరుద్దంగా  ఆయా రంగాలతో సంబంధం లేని వారిని నియమించి తెలుగు భాషనే కాదు, తెలుగు కళలను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అగౌరవపరిచారని తెలుగు అభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ నియామకాలు, తెలుగు భాష, జాతి పట్ల ముఖ్యమంత్రికి అయన ప్రభుత్వానికి  ఉన్న  చులకన  భావనను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే, మండలి బుద్ధా ప్రసాద్, తెలుగు భాషా సంస్కృతుల విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటూ ఉంటే  చూస్తూ కూర్చోవడం వల్ల జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతుందని ఆవేదనతో కూడిన హెచ్చరిక చేశారు .  భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని నిలుపుకోవటం మనందరి కర్తవ్యం. ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు అందరూ స్పందించాల్సిన సమయమిదని బుద్ధ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వమే తెలుగు భాష, సంస్కృతులను తుదముట్టించే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలకు తావిచ్చినప్పుడు,రక్షించుకోవలసిన బాధ్యత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిపై ఉందని అంటున్నారు..తెలుగు తల్లి  ముద్దుబిడ్డలు.