ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బిగ్ షాక్.. ఏం జరగబోతుందో?
posted on Jul 21, 2021 @ 9:38PM
తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శిగా పని చేస్తూ స్వచ్చంద పదవి విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి సుధ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు రావడం చర్చగా మారింది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం ధూళికట్ట గ్రామంలో ‘స్వేరో’స్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా.. స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు ఓ ప్రతిజ్ఞ చేయించారు. ‘హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, శ్రాద్ధ కర్మలు పాటించమని, పిండదానాలు చేయబోమంటూ.. హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞలో స్వేరోస్ సభ్యులతో పాటు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటన తర్వాత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్రానికి కూడా కొందరు ఫిర్యాదు చేశారు. తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా ప్రవీణ్ కుమార్ మాత్రం బహిరంగంగా స్పందించలేదు.ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి.. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేశారంటూ కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మార్చి 16న ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కరీంనగర్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి. మరో న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ సహాయంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును బుధవారం విచారించిన న్యాయమూర్తి సాయిసుధ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు.