ఛీ అన్న కార్పొరేట్.. చేరదీసిన సీఎం! భారత హాకీకి ఆయనే గాడ్ ఫాదర్..
posted on Aug 7, 2021 @ 3:54PM
టోక్యో ఒలంపిక్స్ హాకీలో 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం వచ్చింది. పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించింది. జర్మనీతో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కెప్టెన్ మన్ ప్రీత్ సేన భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. 41 ఏళ్ల క్రితం మాస్కో ఒలంపిక్స్ లో హాకీలో ఇండియాకు మెడల్ వచ్చింది. మహిళల జట్టు కూడా అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సెమీపైనల్ చేరింది. చివరికి కాంస్య పతక పోరులో మహిళల జట్టు ఓడిపోయినా.. యావత్ భారతావని మనసులు గెలుచుకుంది. పతక పోరులో ఓటమి తర్వాల విలపిస్తున్న ప్లేయర్లను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఓదార్చారు. నిజానికి ఏసారి ఎలాంటి ఆశలు లేకుండానే భారత హాకీ బృందం టోక్సో వెళ్లింది. అందుకే హాకీ టీమ్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పతకం రావడంతో అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.. కీర్తిస్తున్నారు.
భారత హకీ జట్టు మెడల్ సాధించడంలో అసలు హీరో మాత్రం మరొకరు ఉన్నారు. తెర వెనక హాకీ జట్టుకు సపోర్ట్ చేసింది.. ప్రోత్సహించింది ఆయనే. ఆయనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. దేశం మొత్తం పట్టించుకోని వేళ ఆయన ఇచ్చిన 100 కోట్లే ఈ రోజు హాకీ జట్టు విజయానికి కారణం అయ్యాయి.
అసలు విషయంలోకి వస్తే.. భారత హాకీ జట్టు పేవలమైన ప్రదర్శన కారణంగా అప్పటి వరకు స్పాన్సర్ షిఫ్ గా ఉన్న సహారా కంపెనీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2018 సంవత్సరంతో పురుషుల, మహిళల జట్టుతో ఉన్న అన్ని కాంట్రాక్టులను రద్దు చేసుకుంది సహారా కంపెనీ. దీంతో స్పాన్సర్ షిప్ కోసం భారత హాకీ ఫెడరేషన్ ఎన్నో కార్పొరేట్ కంపెనీలను సాయం కోరింది. కాని ఎవరూ ముందుకు రాలేదు. హాకీ జట్టు గెలిచేది లేదూ చచ్చేదీ లేదు.. అనవసరం డబ్బులు బొక్క అంటూ పట్టించుకోలేదు. హాకీ మ్యాచ్ లు చూసేది ఎవరు అంటూ ఎగతాళి చేశాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు.
సరిగ్గా ఇక్కడే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎంటర్ అయ్యారు. హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు కుర్చుకున్నారు. 2023 వరకు ఒడిశా ప్రభుత్వం భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా ఉంది. భారతీయ క్రీడ ఏదీ అంటే హాకీ.. అలాంటి జాతీయ క్రీడకు కంపెనీలు ముందుకు రాకపోవటం అతన్ని కలిచివేసింది. దీనికి మించి.. మంచి హాకీ ప్లేయర్ నవీన్ పట్నాయక్. చిన్నతనంలో హాకీ ఆడేవారు. డూన్ స్కూల్ లో చదివే రోజుల్లో హాకీ జట్టుకు గోల్ కీపర్ గా ఉన్నారు. ఇప్పటికీ రెగ్యులర్ గా హాకీ మ్యాచులు చూస్తూ ఉంటారు సీఎం నవీన్ పట్నాయక్. క్రికెట్ కంటే హాకీనే ఇష్టం అంటారు ఆయన హాకీపై అతనికి ఉన్న మక్కువతోనే.. ఒడిశా ప్రభుత్వం తరపున భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు.100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించటానికి అవసరం నిధులు సమకూర్చారు నవీన్ పట్నాయక్. 2023 సంవత్సరం వరకు భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు అవసరం అయిన అన్ని ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చారు. అతను ఆ రోజు ఆదుకోకపోయి ఉంటే ఇవాళ భారత జట్టు ఇంతలా ప్రదర్శన ఇచ్చేదా.. ప్రాక్టీస్ చేసేదా.. పతకం వచ్చేదా. మెడల్ రాగాలనే కార్పొరేట్ సంస్థల మళ్లీ రూట్ మార్చాయి. భారత హాకీ జట్టును ఆకాశానికెత్తుతున్నాయి తన బ్రాండ్ల ప్రమోషన్ కోసం కోట్లు కుమ్మరించేదుకు సిద్ధమవుతున్నాయి. సో.. ఇప్పుడు చెప్పండి భారత హాకీ జట్టుకు అసలైన గాడ్ ఫాదర్ ఎవరో..