లోకేష్ డెడ్ లైన్ కి ఇంకా 10 రోజులే.. జగన్ రెడ్డి సర్కార్ కు పరీక్షే? 

ఆంధ్రప్రదేశ్ రాష్టం నేరాలు ఘోరాలకు నిలయంగా మారింది. హత్యలు నిత్యకృత్యంగా మారాయి. నిర్భయ చట్టం ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితులలో మహిళలలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, హత్యలు యధేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి. ఇటీవల వెలుగు చూసిన మంత్రులు, అధికార పార్టీ కీలక నేతలు అసభ్య సంభాషణ సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఈ వీడియోలు నిజమో కాదో, కానీ, సామాన్య జనం మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలే ఇలా బరితెగిస్తే  ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడని వాపోతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి  జనం ఛీ’ కొడుతున్నారు. తల దించుకుంటున్నారు.  రాష్ట్రంలో నడిరోడ్డు మీద పట్టపగలు హత్యలు జరిగిన పట్టించుకునే నాధుడు లేడు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూతవేటు దూరంలో సాముహిక హత్యాచారం జరిగినా, మరో నేరం జరిగినా, ఎవరూ పట్టించుకోరు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో శాంతి భద్రతలు దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్నాయని  అధికార  గణాంకాలే  తెలియచేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జరిగిన, జరుగున్న దాడులు, హత్యలకు లెక్కలు లేవు.   కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. అందుకే, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని 21 రోజుల్లో  శిక్షించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.అంతే కాదు ట్విటర్ వేదికగా కౌంట్ డౌన్  స్టార్ట్ చేశారు. ఏ రోజుకు ఆ రోజు గడువును గుర్తు చేస్తున్నారు.  ఇందులోభాగంగా  నారా లోకేష్ ట్వీట్ ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, కౌంట్ డౌన్ గుర్తు చేయడంతో పాటుగా, గట్టిగా వాతలు పెట్టారు.  రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ‘దిశ’ చట్టం తెచ్చామని, లక్షల రూపాయలు ఖర్చి పెట్టి సొంత పత్రికలో ప్రచారం చెసుకున్న ముఖ్యమంత్రి ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. అలాగే, ‘దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేశామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. దీని పై ముఖ్యమంత్రే వివరన ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో  ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు.  ఇక 10 రోజులే మిగిలాయి రమ్యని అంతం చేసిన క్రూరుడికి ఉరి ఎప్పుడు?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.  

స్టూడెంట్ హాస్ట‌ల్స్ బంద్‌.. పిల్ల‌ల క‌డుపుకొట్టిన కేసీఆర్ స‌ర్కార్‌..

క‌డుపు నిండితేనే చ‌క్క‌గా చ‌దువుకునేది. ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతుంటే ఎవ‌రికైనా చ‌దువు ఒంట‌బ‌డుతుందా? అస‌లే పేద విద్యార్థులు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని త‌ల్లిదండ్రులు. ఆలాంటి దుర్భ‌ర ఆర్థిక ప‌రిస్థితుల నుంచి డిగ్రీ దాకా రావ‌డ‌మే మ‌హాగొప్ప‌. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి.. తెలివితే డిగ్రీ సీటు సంపాదించిన అలాంటి వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డున ప‌డే దుస్థితి దాపురించింది. కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న అడ్డ‌గోలు నిర్ణ‌యంతో చ‌దువు అర్థాంత‌రంగా ముగించాల్సి వ‌స్తోంది.  అవును, కేసీఆర్ ప్ర‌భుత్వం విద్యార్థుల పొట్ట‌పై కొట్టింది. పిల్లల గూడు చెద‌ర‌గొట్టింది. ఈ విద్యాసంవ‌త్స‌రం తీసుకున్న ప‌నికిమాలిన నిర్ణ‌యంతో డిగ్రీ చ‌దువుకునే వాళ్లు ప‌స్తులు ఉండాల్సి వ‌స్తుంది. తాజాగా, హైద‌రాబాద్‌, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని నిజాం కాలేజీ, కోఠి మ‌హిళా క‌ళాశాల‌, సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప‌రిధిలోని డిగ్రీ విద్యార్థుల‌కు ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో అడ్మిష‌న్లు నిలిపేయాల‌ని ఓయూ నిర్ణ‌యించింది. ఈ యేడాది డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరే స్టూడెంట్స్‌కు ఇక‌పై హాస్ట‌ల్స్ ఇవ్వ‌రు. డిగ్రీ కాలేజీలో అడ్మిష‌న్ ఇస్తారు కానీ, హాస్ట‌ల్స్ మాత్రం ఇవ్వ‌మంటూ ప్ర‌క‌టించింది ఓయూ. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  ప్ర‌భుత్వ‌ డిగ్రీ కాలేజీలో చేరేది ఎవ‌రు? అత్యంత పేద విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. వారిలో చాలామందికి హైద‌రాబాద్ కొత్త కూడా. అలాంటిది ఇక‌పై కాలేజ్‌ హాస్ట‌ల్స్ ఇవ్వ‌మంటే.. వారంతా న‌గ‌రంలో ఎక్క‌డ ఉంటారు? ఎలా తింటారు? కాలేజీల‌కు ఎలా వ‌స్తారు? ప్ర‌స్తుత కొవిడ్ టైమ్‌లో ప్రైవేట్ హాస్ట‌ల్స్ కూడా న‌డ‌వ‌డం లేదు. ఉన్నా.. నెల‌కు 5వేలు పెట్టందే హాస్ట‌ల్‌లో ఉంచుకోరు. నెల‌కు ఐదువేలు పెట్ట‌డ‌మంటే ఆ పేద విద్యార్థుల‌కు ఎంత క‌ష్టం. నిజాం, కోఠి, సైఫాబాద్ కాలేజీలు ఖ‌రీదైన ఏరియాల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో అద్దె గ‌ది దొర‌క‌డం చానా క‌ష్టం. ఎక్క‌డో దూరంగా ఉన్నా.. రోజూ వ‌చ్చిపోవ‌డం ఇంకా క‌ష్టం. బాయ్స్ సంగ‌తి స‌రే.. కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినుల‌కు సైతం హాస్ట‌ల్స్ క్లోజ్ చేయ‌డం ఇంకెతం దారుణం? అమ్మాయిలు ఈ మ‌హాన‌గ‌రంలో ఎక్క‌డ ఉంటారు? తోడేళ్లు తిరుగుతున్న ఈ స‌మాజంలో వారి నుంచి కాచుకొని ఎక్క‌డ ఆశ్ర‌యం పొందుతారు? పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నుకోవ‌డ‌మే ఆ పిల్ల‌లు చేసిన పాప‌మా? పేద‌రిక‌మే వారి నేర‌మా? పాల‌కులు, అధికారులు ఇంత‌టి పాపానికి ఎందుకు తెగ‌బ‌డుతున్నారు. డిగ్రీ స్టూడెంట్స్‌కు హాస్ట‌ల్స్ ఇవ్వ‌మంటూ ఉత్త‌ర్వులు జారీ చేసి.. పేద‌ల‌ను చ‌దువుల నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు? కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ గొప్ప‌లు చెబుతున్న కేసీఆర్ స‌ర్కారు.. ఇలా పేద పిల్ల‌ల‌కు కూడు-గూడు చెద‌ర‌గొడితే ఏమొస్తుంది? ఏం సాధిద్దామ‌ని ఇలాంటి అర్థంప‌ర్థంలేని అడ్డ‌గోలు నిర్ణ‌యాలంటూ విద్యార్థి సంఘాలు విమ‌ర్శిస్తున్నాయి. వెంట‌నే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.   

అఫ్గ‌న్‌లో హిందువులు, సిక్కులు సేఫేనా? నెక్ట్స్ టార్గెట్ మ‌నోళ్లేనా?

అఫ్గ‌నిస్తాన్ అదుపు త‌ప్పుతోంది. తాలిబ‌న్లకూ అదుపు చిక్క‌డం లేదు. ఎవ‌రు తాలిబ‌న్లో, ఎవ‌రు ఐఎస్ ఉగ్ర‌వాదులో అర్థం కాని క‌న్ఫూజ‌న్‌. కాబూల్ ఎయిర్‌పోర్టు ముందు జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో వంద మందికి పైగా బ‌లి తీసుకోవ‌డం అక్క‌డి దారుణ ప‌రిస్థితికి నిద‌ర్శ‌ణం. డ‌జ‌ను మంది అమెరికా సైనికుల‌తో పాటు అఫ్గ‌న్ పౌరులు, కొంద‌రు తాలిబ‌న్లు కూడా దుర్మ‌ర‌ణం పాల‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాలిబ‌న్ల ఇలాఖాలో తాలిబ‌న్ల‌నే చంపేంత సాహ‌సం చేశారంటే ఇక ముందుముందు మ‌రెన్ని దాడులు జ‌రుగుతాయో ఊహించ‌వ‌చ్చు.  కాబూల్‌లో జ‌రిగిన జంట పేలుళ్ల‌లో భార‌తీయులు తృటిలో త‌ప్పించుకున్న‌ట్టు స‌మాచారం. బాంబ్ బ్లాస్టింగ్స్‌ నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు కాబూల్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. స‌రిగ్గా పేలుళ్లు జ‌రిగిన ప్రాంతంలోనే వారంతా కొన్ని గంట‌ల పాటు వేచి ఉన్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో పేలుళ్ల‌పై హెచ్చ‌రిక‌లు రావ‌డంతో.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అల‌ర్ట్ చేయ‌డంతో.. వారంతా స్థానిక‌ గురుద్వారా కార్టె పర్వాన్‌కు తిరిగి వెళ్లిపోయార‌ని చెబుతున్నారు. ఆ భ‌య‌మే ముప్పు నుంచి త‌ప్పించింది. 160 మంది ప్రాణాల‌ను కాపాడింది. ఈ విషయం కాబుల్‌ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు గుర్నం సింగ్‌ తమకు చెప్పిన‌ట్టు అకాలీదళ్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజీందర్‌ సింగ్‌ సీర్సా తెలిపారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.   అయితే, అఫ్గ‌నిస్తాన్‌లోని సిక్కులు, హిందువుల ప‌రిస్థితి ఏమాత్రం బాగాలేద‌ని అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్‌ మూక‌ల నుంచే కాకుండా తాలిబ‌న్ల నుంచీ మ‌న‌వాళ్ల‌కి ప్ర‌మాదం పొంచిఉంద‌ని చెబుతున్నారు. తాజాగా, ఓ సిక్కు స‌మూహాన్ని విమానాశ్ర‌యంలోకి వెళ్ల‌నీయ‌కుండా తాలిబ‌న్లు అడ్డుకున్నారు. ఇటీవ‌ల ఓ హిందూ ఆల‌యంపై దాడులు చేశారు. ఆగ‌స్టు 31 వ‌ర‌కు విదేశీయుల‌పై ఎలాంటి దాడులు చేయ‌బోమంటూ ఇప్ప‌టికే తాలిబ‌న్లు ప్ర‌క‌టించినందున నెలాఖ‌రు వ‌ర‌కు తాలిబ‌న్ల నుంచి ఇండియ‌న్స్ సేఫ్ అనే చెప్పాలి. ఆ గ‌డువు ముగిస్తే.. ఫ‌స్ట్ టార్గెట్ సిక్కులు, హిందువుల‌నే అనుమానిస్తున్నారు. ఎందుకంటే, ఆగ‌స్టు 31 వ‌ర‌కూ అమెరికా, బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీయులు ఎవ‌రూ మిగ‌ల‌క‌పోవ‌చ్చు. భార‌త్ ఎంతగా చొర‌వ‌చూపుతున్న త‌ర‌లింపు ప్ర‌క్రియ మాత్రం స్లో గానే సాగుతోంద‌ని అంటున్నారు. స్వ‌త‌హాగా హిందూ ధ్వేషంతో ర‌గిలిపోయే ముష్క‌ర మూక‌లు.. డెడ్‌లైన్ ముగిశాక చెల‌రేగిపోతార‌ని ప్ర‌మాదాన్ని శంకిస్తున్నారు. అందుకే, పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ సిక్కులు, కొద్ది మంది ఉన్న హిందువులు ఆగ‌స్టు 31లోగా అఫ్గ‌నిస్తాన్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆరాట ప‌డుతున్నారు.   

పెళ్ళయితేనే పార్కులోకి ఎంట్రీ! జీహెచ్ఎంసీ తీరుపై లొల్లీ..

ఇందిరా పార్క్’కు వెలుతున్నారా? ఒక్క క్షణం ఆగండి ... మీ మ్యారేజ్ సర్టిఫికేట్ జేబులో పెట్టుకుని వెళ్ళండి ... లేదంటే లోపలకి రానీయరు. అదేంటి, పార్క్ కి పెళ్ళికి ఏమిటి సంబంధం అంటారా.. ఉంది.. పెళ్ళైన జంటలకే కాని, పెళ్లి కానీ జంటలకు పార్కులోకి అనుమతి లేదని, అధికారులు పార్క్ బయట పెద్ద బోర్డు పెట్టి మరీ చెప్పారు. ఆ విధంగా పార్క్’కు ప్రేమకు, పార్క్’కు పెళ్ళికి లింక్ పెట్టి ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ అని అధికారులు బోర్డు పెట్టారు.  అసలు, విషయం ఏమంటే పార్కులలో పెళ్ళికాని ప్రేమ జంటల ప్రవర్తన శృతితప్పి గీత దాటుతోందని పిల్లలతో వచ్చిన తల్లి తండ్రులు, సీనియర్ సిటిజన్స్ ఫిర్యాదు చేశారు. అలాగే, కొన్ని కొన్ని సందర్భాలలో కొట్లాటలు గొడవలు వంటి ఇతర సమస్యలు తలెత్తడంతో అధికారులు పెళ్ళికాని ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ .. అని బోర్డ్ పెట్టారు.  అయితే, అది  సోషల్ మీడియాలో వైరలై, అధికారులు ‘మోరల్ పోలీసింగ్’  పై  జనం విరుచుకు పడ్డారు. స్వేచ్చకు సంకెళ్ళు వేస్తారా? అంటూ  చీవాట్లు పెట్టారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దిగి వచ్చారు. కట్టిన బ్యానర్ విప్పేశారు. నగర మేయర్ విజయలక్ష్మి సహా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్రింది స్థాయి సిబ్బంది తెలియక చేసిన తప్పుగా చెప్పు కొచ్చారు. సంజాయిషీ ఇచ్చుకున్నారు. అలాగే, పెళ్ళికాని జంటలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారాలు విచారం కూడా వ్యక్తపరిచారు.  ఇంతవరకు అంతా బానే ఉంది. అయితే, బ్యానర్ విషయంలో అధికారులను అలర్ట్ చేసిన సామాజిక కార్యకర్త పేర్కొన్న విధంగా ఇలా బహిరంగ ప్రదేశాలలో ప్రవేశంపై అక్షలు రాజ్యాంగ విరుద్ధమా, కాదా అనేది న్యాయ నిపుణులు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న. నిజానికి, దేశంలో ఒక్క మన ఇందిరా పార్క్’లోనే కాదు, ఇంకా అనేక బహిరంగ ప్రదేశాలలోకి కూడా అందరినీ అనుమతించరు. ఆ మధ్య శబరిమల, శని సింగపూర్  ఆలయాలలోకి మహిళలను అనుమతించక పోవడంఫై  పెద్ద దుమారామే చెలరేగింది. న్యాయస్థానాల జోక్యంతో కానీ, ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ, అన్ని మతాల ప్రార్థనా స్థలాలో వివిధ రకాలఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.  ఆఫ్గానిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న నేపధ్యంలో ఆ దేశంలో మహిళల పై విధించిన ఆంక్షలు మన దేశంలోనూ చర్చకు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు, మేథావులు, రాజకీయ పార్టీలు, తాలిబాన్లు అమలు చేస్తున్న, షరియా చట్టాలను సైతం సమర్ధిస్తున్నారు. మన దేశంలో మాత్రం విచ్చలవిడి తనాన్ని కట్టడి చేసినా, మోరల్ పోలీసింగ్’ అంటూ విమర్శిస్తున్నారు.అయితే, ఏ సమాజంలో అయినా, సామాజిక  కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. ఉండాలి కూడా .. కానీ, కట్టుబాట్లు కట్లు తెంచుకో కూడదు. అలాగే, స్వేచ్చకు పరిధులు, పరిమితులు ఉంటాయి.  నిజానికి హైదరాబద్ నగరంలో మోరల్ పోలీసింగ్ కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సం రోజున.. ఒక్క ఇందిరా పార్క్ మాత్రమే కాదు, జీహెచ్ఎంసీ పరిధిలోనే అన్ని పార్కులలోకి  ప్రేమ జంటల ఎంట్రీపై  హైదరాబాద్ పోలీసులే ఆంక్షలు విధించారు. భజరంగ దళ్ వంటి సంస్థల మోరల్ పోలీసింగ్ కు చెక్  పెట్టేందుకే, నగర పోలీసులు ఆంక్షలు విధించవలసి వచ్చిందని అధికారులు అంటున్నారు. అయితే అదీ ఇదీ ఏదీ కూడా గీత దాటకుండా ఉంటేనే మంచింది. అందుకే పెద్దలు,  ‘అతి సర్వత్ర వర్జియేత్’ అంటారు. 

AP స్కూల్స్‌లో క‌రోనా బెల్స్‌.. స్టూడెంట్స్, పేరెంట్స్‌లో టెన్ష‌న్‌...

ఓవైపు స్కూళ్లు.. మ‌రోవైపు కొవిడ్ కేసులు.. సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టే కరోనాతో స‌హ‌జీవ‌నం చేసే రోజులు వ‌చ్చేసిన‌ట్టున్నాయి. వ‌ద్దు వ‌ద్దంటున్నా బ‌ల‌వంతంగా స్కూల్స్ రీఓపెన్ చేయ‌డంతో బ‌డుల‌కు వెళ్ల‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు వ‌చ్చాయి. సెకండ్ వేవ్ మ‌ధ్య‌లో ఉన్నామ‌ని కేంద్రం చెబుతోంది.. సెప్టెంబ‌ర్‌లోనే  థ‌ర్డ్ వేవ్ అంటూ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఇలాంటి భ‌యాందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఇటు స్టూడెంట్స్‌, అటు పేరెంట్స్ బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పుతున్నారు. స్కూల్‌కి వెళ్ల‌క‌పోతే వెన‌క‌బ‌డిపోతామేమోన‌నే భ‌యం. బ‌డికి వెళితే ఎక్క‌డ క‌రోనా కాటేస్తుందోన‌నే టెన్ష‌న్‌. ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అవ‌డం.. క‌రోనా కేసులు పెర‌గ‌డం.. బ‌డుల్లో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకేరోజు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం మాత్రం అంత సులువైన విష‌యం కాద‌ని మ‌రోసారి తేలిపోయింది. విద్యార్థులు వైర‌స్ బారిన ప‌డుతుండ‌టంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మ‌రింత పెరిగిపోతోంది. ప్రకాశం జిల్లా వీరేపల్లి, వెదుల్లచెరువు పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి, వట్లూరు జడ్పీ హైస్కూళ్లలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వ‌చ్చింది. కృష్ణా జిల్లా శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు కొవిడ్‌ క‌న్ఫామ్ అయింది. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. కరోనా కేసులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోననే ఆందోళనల మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను భ‌యం భ‌యంగానే బడులకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు ఆందోళనలతో విద్యా బోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు 85 శాతానికి చేరువైంది. పిల్ల‌ల సంఖ్య పెర‌గ‌డం.. క‌రోనా కేసులు మొద‌ల‌వ‌డం సర్వత్రా భయాందోళ రేపుతోంది.   

ఏప్రిల్ నుంచే పెంచిన ఆస్తి పన్ను వసూల్.. జనాలకు జగన్ సర్కార్ డబుల్ షాక్ 

ఏపీ సర్కార్ మళ్లీ మాట తప్పింది. సీఎం జగన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారు. ఆస్తిపన్నుపై ప్రజలకు భారీ షాకిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆస్తి పన్ను పెంపు ఉండబోదంటూ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఎన్నికలన్ని ముగియడంతో ఇప్పుడు దొంగ దెబ్బ కొట్టింది. గతంలో పెంచాలని నిర్ణయించిన మేరకు ఆస్తి పన్ను ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్ధానిక సంస్ధలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంతో ఆస్తి పన్ను పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఆస్తిపన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాని అమలు చేయలేదు. ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలపై  తీవ్ర అభ్యంతరాలు రావడంతో వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తిపన్ను పెంపుపై ఊహాగానాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పుడే కాదన్నట్లుగా చెప్పుకుంది.  కానీ సరైన సమయం చూసి పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది.  ఏప్రిల్ 1 నుంచే అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొదలైన నాటి నుంచే ఆస్తిపన్ను పెంపు వర్తిస్తుందని తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తానికి ఆస్తిపన్ను పెరిగినట్లు లెక్క. ఈ మేరకు పట్టణ స్ధానిక సంస్ధలైన నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా. ప్రభుత్వ తీరుతో పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి  పట్టణ స్ధానిక సంస్ధల్లో ఆస్తిపన్ను పెంపుపై ఆర్దిక సంవత్సరం ఆరంభంలోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. వీటి ఆధారంగా ప్రజలు పన్నుల చెల్లింపు పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్నుపెంచినట్లు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి రావడంతో ప్రభుత్వం మరో స్పెషల్ నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో గతంలో ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో జారీ చేసిన నోటీసుల ప్రకారం పన్ను చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగిలిన పన్ను చెల్లించేలా ఈ స్పెషల్ నోటీసుల జారీ ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నోటీసుల జారీ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను ఇప్పటివరకూ పట్టణ స్ధానిక సంస్ధల పరిధిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయా ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది.  గతంలో వార్షిక అద్దె విలువ ఆయా ఇళ్ల పరిస్ధితి, నమూనా ఆధారంగా నిర్ణయం అయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లో దానికి ఉన్న విలువ, రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా నిర్ణయం కాబోతోంది. అందుకే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పన్ను పెంపుతో పాటు దాన్ని మదింపు విధానం కూడా మారడం డబుల్ షాక్ కానుంది. దీంతో గతంతో పోలిస్తే భారీగా ఆస్తిపన్ను పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విధానం అమలైతే భవిష్యత్తులో పెరిగే రిజిస్ట్రేషన్ ధరలు, భూముల విలువలు కూడా కచ్చితంగా ఆస్తిపన్నును నిర్ణయించడం ఖాయంగా తెలుస్తోంది. ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు రాగానే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలు, స్వచ్చంద సంస్ధలు, ప్రజా సంఘాలు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. బయట కూడా ఆందోళనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ పన్నుల పెంపుపై ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీకి ఓటేస్తే గెలిచాక పన్నులు పెంచేస్తారని విపక్షాలు జనాన్ని అప్రమత్తం చేశాయి. అయినా ప్రజలు మాత్రం వైసీపీకే ఓటేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న జగన్ సర్కార్ ఆస్తిపన్ను పెంపుపై ప్రజలకు భారీ షాకిచ్చింది. గతంలో వరుస ఎన్నికలు జరగడం, వాటిలో గెలుపు వైసీపీ సర్కార్ కు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని దాచిపెట్టింది. ఇప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, పన్నులు పెంచినా వచ్చే ప్రజావ్యతిరేకతతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో ప్రభుత్వం అదను చూసి భారీ దెబ్బ కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోణంలో ఆస్తిపన్ను వాయిదా వేసి ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ నుంచే పెంపు వర్తిస్తుందని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఆస్తి పన్ను పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. తాజా నోటీసులపై మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. 

బీ కాషియస్.. హైదరాబాద్ బిర్యానీలో మార్పొస్తోంది

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చే ఏ జాతీయ నాయకుడైనా తెలంగాణకో, హైదరాబాద్ కో వచ్చాడంటే తప్పనిసరిగా హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేసి తీరతాడు. శాకాహార నేతల సంగతి పక్కన పెడితే మాంసాహారప్రియులకు మాత్రం ఇకపై వర్రీ తప్పదంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీలో మార్పు మొదలవుతుందంటున్నారు. ఇప్పటివరకూ మన హైదరాబాద్ బిర్యానీ మేకర్స్ మెయింటెయిన్ చేసిన క్వాలిటీ క్రమంగా సన్నగిల్లే రోజులు వచ్చేశాయంటున్నారు. మరికొద్ది రోజులు పోతే హైదరాబాద్ బిర్యానీ అసలు టేస్ట్ దొరకడం కష్టమంటున్నారు. దీనిక్కారణం.... ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించాక కేవలం, ఉద్యోగ, ఉపాధి, టూరిజం రంగాల్లోనే కాక మిగతా రంగాల్లో కూడా దాని ప్రభావం నేరుగా పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  మన హైదరాబాద్ బిర్యానీలో వాడే పదార్ధాలేంటో తెలిస్తే బిర్యానీ క్వాలిటీ ఎందుకు మారుతుందో అర్థమవుతుంది. బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్‌లే ప్రధానమైన పదార్థాలు. అయితే ఆ వంటకు అద్భుతమైన రుచి రావడంలో మాత్రం డ్రై ఫ్రూట్స్‌దే కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్‌, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని ఎలా ఉపయోగిస్తారనేదే బిర్యానీ రుచికి కీలకం. హైదరాబాద్ బిర్యానీకి ఆ రుచి రావడానికి కారణం ఈ డ్రైఫ్రూట్స్. మనకు బిర్యానీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ లో చాలా వరకూ ఆఫ్ఘన్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఈ తాలిబన్ రాక్షస పాలనతో అవి మనకు దొరికే పరిస్థితి లేదు. దొరికినా విపరీతమైన ఖరీదుగా మారిపోయాయి. హైదరాబాద్ బిర్యానీలో వాడే ఈ డ్రైఫ్రూట్స్ కి ఉన్న డిమాండ్ కారణంగా కొందరు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన పౌరులు నగరంలో డ్రైఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు. వారు అక్కడ నుంచి వీటిని తీసుకు వచ్చి ఇక్కడ హోటళ్లకు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ భయానక పరిస్థితిలో వారు అక్కడికి వెళ్లడం లేదా అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురావడం జరిగేపని కాదు.ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో అన్నీ స్తంభించిపోయాయి. రవాణా సౌకర్యాలు పూర్తిగా లేకుండా పోయాయి. ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ తో దౌత్య సంబంధాలు బాగా ఉండేవి. ఇప్పుడు తాలిబన్ రాకతో ఇది మారిపోయింది. భారత్ కు తాలిబన్ కు మధ్య చాలా అంతరం ఉంది. ఉగ్రవాద ముద్ర ఉన్న తాలిబన్లతో చేతులు కలిపే పరిస్థితి భారత్ కు లేదు. దీంతో ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఆ ఎఫెక్ట్ మన బిర్యానీపై నేరుగా పడబోతోంది.  డ్రైఫ్రూట్స్ దొరక్కపోతే చేసేదేమీ లేదని నగరంలోని హోటల్ వ్యాపారులు అంటున్నారు.  అసలే కరోనా దెబ్బకు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది అనుకుంటే.. ఇదే సమయంలో తాలిబాన్ దెబ్బ పడింది అని హోటల్ నిర్వాహకులు ముఖ్యంగా బిర్యానీ హోటల్స్ వారు వాపోతున్నారు. పరిస్థితులు చక్కబడే సూచనలు కనబడటం లేదనీ.. చాలా కాలం ఈ సంక్షోభం కొనసాగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. బిర్యానీ తయారీలో రుచికి వాడే డ్రై ఫ్రూట్స్ కు ప్రత్యామ్నాయం లేదని అందువల్ల అవి లేకుండానే బిర్యానీ తయారు చేసే పరిస్థితి వచ్చిందనీ వారంటున్నారు. దీంతో బిర్యానీ రుచి తగ్గుతుందని చెబుతున్నారు. అందువల్ల హైదరాబాద్ బిర్యానీ ప్రియులందరూ... ఆ వంట అసలు టేస్ట్ మారకముందే ఆఖరుసారిగా ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడున్న డ్రైఫ్రూట్స్ నిల్వలు ఉన్నంతవరకే అసలు టేస్ట్ కొనసాగుతుంది. ఆ సరుకులు అయిపోయాక... క్వాలిటీ పడిపోక తప్పదన్న ఆదుర్దా బిర్యానీ ప్రియుల్లో వ్యక్తమవుతోంది.  

తిరుమల శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం.. ప్రత్యేకతలు ఇవే? 

తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఉంటుంది.  భక్తుల కోసం మరో కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. వెంకన్న భక్తులకు సంప్రదాయ భోజనం అందిస్తోంది. తిరుమలలో ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేసి.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలుత మీడియా ప్రతినిధులకు, టీటీడీ సిబ్బందికి వడ్డించారు. 8 రోజుల పాటు పరిశీలన చేసి తర్వాత ఏయే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి, ఓ భోజనం ఎంతకు విక్రయించాలనే అంశాలపై టీటీడీ నిర్ణయానికి రానుంది. సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.  సంప్రదాయ భోజనంగా రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్‌ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వడ్డించారు. సేంద్రియ ఆహారం విశిష్ఠత తెలిసేలా కాస్ట్‌ టూ కాస్ట్‌ పద్ధతిలో భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. తొలిరోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్‌ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. సంప్రదాయ భోజనం స్వీకరించిన అధికారులు, సిబ్బంది.. వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పారు.  ఈ సంప్రదాయ భోజనం ప్రత్యేకత ఏమంటే.. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన వస్తువులతోనే వీటిని సిద్ధం చేస్తారు. అయితే.. దీన్ని ఉచితంగా అందించరు. కాస్ట్ టు కాస్ట్.. అంటే ఈ మీల్ ను తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో.. అంత ఖర్చును వసూలు చేస్తారు. తిరుమలలో ఇప్పటికే ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. దీనికి మంచి పేరు ఉంది. ఉచితంగా అందించే భోజనంలో వడ్డించే వస్తువుల సంఖ్య తక్కువే అయినా.. దాని రుచి చాలాబాగుండటంతో.. చాలామంది భక్తులు తప్పనిసరిగా స్వామి వారి ఉచిత భోజనాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. దీని భారం అంతకంతకూ ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. సరికొత్తగా టీటీడీ సంప్రదాయ భోజనం కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఉచితంగా అందిస్తూ.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో దీన్ని పడిన రేటుకు అమ్ముతారని చెబుతున్నారు. సంప్రదాయ భోజనంలో వ్యాధి నిరోధకతను పెంచే పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్యం మీద అవగాహన అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఈ కాన్సెప్టు అందరిని ఆకర్షించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

దళిత బంధు అందరికి లేనట్టేనా? కేసీఆర్ చెప్పినవన్ని ఉత్తమాటలేనా?

దళిత బంధు పథకాన్ని దళితులందరికి వర్తింప చేస్తాం.. మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తాం.. తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో దాదాపు 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి.. వీళ్లందిరికి దళిత బంధు అమలు చేయాలంటే లక్షా 70 వేల కోట్లు అవసరం.. ఇదేమి పెద్ద లెక్క కాదు.. నాలుగైదు ఏండ్లలో అందిరికి ఇచ్చేస్తాం.. ఇదీ దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. అంతేకాదు దళిత ఉద్యోగ కుటుంబాలకు కూడా పథకం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రకటనతో దళితులంతా సంతోషంలో మునిగిపోయారు. తమ దశ మారబోతుందనే ఆశలో ఉన్నారు.  అయితే ప్రస్తుతం దళిత బంధు స్కీమ్ సీన్ మాత్రం మరోలా కనిపిస్తోంది.  కేసీఆర్ చెప్పిన మాటలకు..  క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యచరణకు పొంతన ఉండడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దళిత బంధు పథకానికి అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం , హుజురాబాద్ లో అధికారులు సర్వే నిర్వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హుజూరాబాద్ కు మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధును అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రభుత్వం రూపొందించింది. వాటి ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఆ విధి విధానాల ప్రకారమే ఇప్పుడు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ తదితర శాఖల సిబ్బంది హుజూరాబాద్లో సర్వే చేపట్టనున్నారు. మొత్తం 48 ప్రశ్నలకు సమాధానాలను దళితల నుంచి రాబట్టనున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.  హుజురాబాద్ లో నిర్వహిస్తున్న సర్వే ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దశల వారీగా రాష్ట్రమంతటా దళిత కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తున్నప్పుడు..  మళ్లీ ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఈ కొత్త మెళిక ఎందుకు పెట్టారనే విషయం అంతుపట్టకుండా ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తెలంగాణలో నివాసం ఉన్న కుటుంబాలు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి విభాగం జీవో నంబర్ 5 ప్రకారం దళిత కమ్యూనిటీకి చెందివారు మాత్రమే అర్హులు. ఆ కుటుంబం వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు పట్టణాల్లో రూ.2.50 లక్షలు మించకూడదు. ఆ కుటుంబానికి రెండున్నర ఎకరాల మాగాణీ లేదా మెట్టతో కలిపి మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉండకూడదు. ఆ కుటుంబంలో ఎవరికీ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. రిటైర్డ్ ఉద్యోగులూ ఉండకూడదు. కుటుంబం మొత్తానికి మించి పది గుంటలకు మించి నివాస స్థలం ఉండకూడదు. వ్యక్తిగతంగా ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు. సర్వేలో ఈ విషయాలతో పాటు ఇంట్లో ఏమేమీ వస్తువులున్నాయి ఇప్పటికే ఏమైనా ప్రభుత్వ పథకాలు అందాయా? ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? లాంటి పూర్తి విషయాలను సేకరించనున్నారు. దీంతో హుజూరాబాద్లోని దళిత కుటుంబాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గాన్ని చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలందరికీ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఏమంటారనే ఆసక్తి నెలకొంది. 

కొవిషీల్డ్‌పై కేంద్రం రివ‌ర్స్‌గేర్‌.. డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధి త‌గ్గించే ప్ర‌య‌త్నం..

మొద‌ట నెల రోజులు అన్నారు. ఆ త‌ర్వాత 6 నుంచి 8 వారాల‌కు పెంచారు. అక్క‌డితో స‌రిపెట్ట‌లేదు. మ‌ళ్లీ రివైజ్ చేశారు. ఈసారి 12 నుంచి 16 వారాలు చేసేసింది. ఇలా కొవిషీల్డ్ రెండు డోసుల మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం ఆడిన.. ఎంతెంత దూరం.. ఇంకొంత దూరం ఆట దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌ల పాలైంది. వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగానే కేంద్రం ఇలా వ్య‌వ‌ధి పెంచి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ఏకంగా కొవాగ్జిన్ త‌యారుచేసే సీర‌మ్ సంస్థ య‌జ‌మాని సైతం రెండు డోసుల మ‌ధ్య గ్యాప్ రెండు నెల‌లు ఉంటే చాల‌ని.. టీకాల కొర‌త వ‌ల్లే కేంద్రం వ్య‌వ‌ధి పెంచేసిందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. దీంతో.. కొవిషీల్డ్ డోసుల‌ విష‌యంలో మోదీ స‌ర్కారు ప‌రువంతా పోయిన‌ట్టైంది. దీంతో.. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. తాజాగా, డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని త‌గ్గించే ఆలోచ‌న చేస్తోంది.  బ్రిటన్‌లో చేపట్టిన నివేదికల ఆధారంగా కొవిషీల్డ్‌ రెండో డోసు గడువును పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కానీ, బ్రిటన్‌ మాత్రం రెండు డోసుల మధ్య గడువును తగ్గిస్తూ నాలుగు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ కూడా వీటిని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84 రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు. కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి తగ్గింపును ఇప్పటికే పరిశీలిస్తున్నామని.. వీటిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) నిపుణులతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  డోసుల మధ్య గడువు పెంచడం వల్ల ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతాయ‌ని గ‌తంలో కేంద్ర కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్ అభిప్రాయ‌ప‌డింది. తాజాగా కొత్త వేరియంట్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ గడువుపై పునసమీక్షించనున్న కేంద్రం.. వ్యవధిని తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ గెలిస్తే ద‌ళితుడే సీఎం.. రేవంత్‌రెడ్డికి కోమ‌టిరెడ్డి చెక్‌?

కాంగ్రెస్‌ను ఎవ‌రూ ఓడించ‌లేరు. కాంగ్రెస్‌వాదులే కాంగ్రెస్‌ను ఓడిస్తారు అనేది నానుడి. అది నిజ‌మే అన్న‌ట్టు గ‌తంలో ఎన్నో ప‌రిణామాలు జ‌రిగాయి. తాజాగా, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. మాట‌ల‌తో చేత‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండెత్తుతున్నారు రేవంత్‌. ద‌ళిత‌-గిరిజ‌న దండోరాలు, దీక్ష‌ల‌తో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను బ‌హుజ‌న భ‌వ‌న్ చేస్తానంటూ స‌వాల్ విసురుతున్నారు. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం. హ‌స్తం పార్టీపై ప్ర‌జ‌ల్లో మునుప‌టి ఆస‌క్తి. రేవంత్‌రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మ‌రి. అందుకే కాంగ్రెస్‌లో మ‌రింత‌ జోరు క‌నిపిస్తోంది. ఈ స్పీడ్ ఇలానే  కొన‌సాగితే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీదే అధికార‌మ‌ని అంతా అనుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్‌దే గెలుప‌ని భావిస్తున్నారు. మ‌రి, కాంగ్రెస్ ప‌వ‌ర్‌లోకి వ‌స్తే..? సీఎం అయ్యేది ఎవ‌రు? ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించేది ఎవ‌రు? అంటే.. ఇంకెవ‌రు? రేవంత్‌రెడ్డినే అనేది కాంగ్రెస్‌వాదుల‌ మాట‌. సీఎం సీటుకు అన్ని అర్హ‌త‌లు ఉన్న లీడ‌ర్ రేవంత్‌రెడ్డినే. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేది ఆయ‌నే కాబ‌ట్టి.. ముఖ్య‌మంత్రి స్థానం కూడా రేవంత్‌కే ద‌క్కాల‌నేది కేడ‌ర్ డిమాండ్‌.  అయితే, ఇంకా ఆలీ లేదు సూలూ లేదు.. అప్పుడే రేవంత్‌రెడ్డికి మోకాలొడ్డుతున్నారు కాంగ్రెస్‌ సీనియ‌ర్లు. రేవంత్‌రెడ్డిపై మొద‌టి నుంచీ చిట‌ప‌ట‌లు పేలుస్తూనే ఉన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. రేవంత్‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి రాగానే.. డ‌బ్బులిచ్చి కొనుక్కున్నారంటూ కిరికిరి స్టార్ట్ చేశారు. భువ‌న‌గిరిలో స‌భ పెడ‌తానంటే.. తాను బిజీ అంటూ స‌భ‌నే లేకుండా చేశారు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. తాజాగా రేవంత్‌రెడ్డి భ‌విష్య‌త్‌కు, అధిష్టించ‌బోయే ముఖ్య‌మంత్రి పీఠానికి చెక్ పెట్టేలా వ్యూహాత్మ‌కంగా డైలాగులు వ‌దులుతున్నారు. "తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు." ఈ డైలాగ్ విన‌డానికి సింపుల్‌గా ఉన్నా దాని వెనుక పెద్ద మ‌ర్మ‌మే దాగుందంటున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ రేవంత్‌రెడ్డికే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ విష‌యం గ్ర‌హించే.. హ‌స్తం పార్టీ అధికారంలోకి వ‌స్తే ద‌ళితుడే ముఖ్య‌మంత్రి అవుతారంటూ కోమ‌టిరెడ్డి మైండ్‌గేమ్ స్టార్ట్ చేశార‌ని అంటున్నారు. సీఎం రేసులో రేవంత్‌రెడ్డి పేరు లేకుండా చేసేందుకే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఇలాంటి కామెంట్లు చేసుంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.  లేదంటే, కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ద‌ళితుడు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వాళ్లే ముఖ్య‌మంత్రి అవుతార‌ని కోమ‌టిరెడ్డి ఎలా ప్ర‌క‌టిస్తారు? అలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయాలంటే కాంగ్రెస్ అధిష్టానం చేయాలికానీ.. కోమ‌టిరెడ్డి ఎవ‌రు అలా అన‌డానికి? అది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మా? లేక‌, పార్టీ స్టాండా? పార్టీ విధాన‌మే అయితే ఆ విష‌యం పీసీసీ చీఫ్ ప్ర‌క‌టించాలి కానీ, ఓ ఎంపీ అయిన కోమ‌టిరెడ్డి ఎలా అనౌన్స్ చేస్తారు? ఇదంతా వెంక‌ట్‌రెడ్డి ఒంటెత్తు పోక‌డ‌లేన‌ని.. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు విరుద్ధ‌మ‌ని.. కాంగ్రెస్ వాదులే మండిప‌డుతున్నారు. రేవంత్‌రెడ్డి ముంద‌రికాళ్ల‌కు బంధాలు వేయ‌డానికే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఇలా ద‌ళిత ముఖ్య‌మంత్రి నినాదాన్ని ప్ర‌చారం చేస్తున్నారంటూ పార్టీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. రేవంత్‌రెడ్డి విష‌యంలో ప‌దే ప‌దే హ‌ద్దు మీరుతున్న కోమ‌టిరెడ్డిని పార్టీ ఎలా కంట్రోల్‌ చేస్తుందో చూడాలి....  

రేవంత్ రెడ్డికి పీకే ఫుల్ సపోర్ట్.. కేసీఆర్ కు ఇక తీన్మారేనా? 

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు దూసుకు పెంచడంతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ హుజురాబాద్ పై ఫోకస్ చేస్తూనే... ఆ పార్టీ సీనియర్ నేతలు యాత్రలతో జనంలో వెళ్లేలా ప్లాన్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేసి రాజకీయ వేడి రాజేశారు. ఇదిలా ఉండగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. మల్లారెడ్డి లక్ష్యంగా హస్తం నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవలే బీఎస్పీలో చేరిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పీకే.. మంత్రి మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గురించి.. మంత్రి మల్లారెడ్డి వాడే భాష ఏంటని ఆయన నిలదీశారు. గౌరవ స్థానంలో ఉండే మంత్రి తొడగొట్టి మాట్లాడుతారా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నోటితో చెప్పలేనంత భాషను మీడియా సాక్షిగా మాట్లాడుతున్న మల్లారెడ్డి.. తన డీమ్డ్ యూనివర్శిటీలో ఇదే భాష నేర్పుతారా? అంటూ విరుచుకుపడ్డారు ప్రవీణ్ కుమార్. దళిత ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డిని బహిష్కరించాలని పిలుపిచ్చారు. మీకు ఈ దుర్గార్మమైన భాష ఎవరు నేర్పించారు. ఎవరి ధైర్యంతో ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు పీకే.  బండి సంజయ్ భాష కూడా సరిగ్గా లేదన్నారు ప్రవీణ్ కుమార్. ఆయనను దూషించిన నేత భాష కూడా సరిగ్గా లేదన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు యూనివర్శిటీలు సాంక్షన్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలో అధికార పార్టీ ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేమీలేదు. పోయేదేమీ లేదని చెప్పారు. రేపటికి రేపు మంత్రి వర్గాన్ని సీఎం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు ప్రవీణ్ కుమార్. వేల కోట్లు హుజురాబాద్ లో కుమ్మరించి ఈటలను ఓడించి..ఎవరికి పాఠం చెప్పాలనుకుంటున్నారని అన్నారు.  ఈ డబ్బులన్నీ ఎవరివి? మా బిడ్డలు చెల్లించిన డబ్బులవి..  మీ పార్టీలో ఎవరైనా తోక  జాడిస్తే వారిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేసిన అవినీతిని బయటపెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుబ్బాకలో లాగే.. హుజురాబాద్ లో కూడా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు.  బీఎస్పీ  మీటింగ్ కు కరెంట్ కట్ చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక మీ ఫామ్ హౌస్ కు కరెంట్ కట్ చేస్తామంటూ ఘాటుగా మాట్లాడారు ప్రవీణ్ కుమార్.ఉద్యోగం రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసేడులో నిరుద్యోగి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని, బహుజన రాజ్యంలో భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ముడేళ్లుగా ఏ జిల్లా ఏ జోన్ లోకి వెళ్లాలో తేల్చలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాంటి కాలయాపనే చేస్తారా? అన్నారు. 2022 దాకా నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు ప్రవీణ్ కుమార్.  కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల సమస్యలు తీరలేదన్నారు ప్రవీణ్ కుమార్. కోటి ఎకరాల సాగులోకి వస్తాయన్నారు.. కానీ భూములు కోల్పోయిన వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల అవినీతి, దోపిడి జరిగిందని ఆరోపించారు.అవినీతి పాలవుతున్న సొమ్మునంతా చదువుల కోసం ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అత్యున్నత అవకాశాలు పొందేలా యువతను తీర్చిదిద్దుతామని పీకే చెప్పారు. ఏనుగు గుర్తుకే ఓటేస్తామని అందరూ కుటుంబసభ్యులతో, బంధువులతో ప్రమాణం చేయించాలన్నారు ప్రవీణ్ కుమార్. ప్రతి ఇంటి గోడపై ఏనుగు గుర్తు గీయించుకోవాలన్నారు.  కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కిపోతారా? తేల్చుకోవాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

కొమ్ముకాసే ఖాకీల‌పై సీజేఐ సంచలన కామెంట్లు.. జ‌గ‌న్ స‌ర్కారుకూ వ‌ర్తిస్తుందా?

పోలీసులంటే అధికార పార్టీకి దాసులు అన్న‌ట్టుగా మారిపోయాయి ప‌రిస్థితులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. కొంద‌రు ఖాకీలు ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటారు. మ‌రికొంద‌రు కొన్ని పార్టీల మ‌నుషులుగా ముద్ర‌ప‌డి పోయారు. అంద‌ల‌మెక్క‌గానే  త‌మ వారిని మంచి పొజిష‌న్ల‌లో నియ‌మిస్తుంటారు పాల‌కులు. గ‌త ప్ర‌భుత్వ అధికారుల‌ను అధఃపాతాళానికి తొక్కేస్తుంటారు. ఇలా పోలీస్ వ్య‌వ‌స్థ‌ను త‌మ గుప్పిట్లో పెట్టుకొని.. ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లకు దిగుతుంటారు. ఏపీలో ఈ ధోర‌ణి మ‌రింత తీవ్రంగా ఉందనే ఆరోప‌ణ ఉంది. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాగానే.. చంద్ర‌బాబు మ‌నిషంటూ అప్ప‌టి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును ఎలా వేధిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఇక సీఐడీ చీఫ్‌గా త‌న మ‌నిషి సునీల్‌కుమార్‌ను నియ‌మించుకొని.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై కేసులు, కుట్ర‌ల‌కు తెగ‌బ‌డుతున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. సొంత‌పార్టీ ఎంపీ ర‌ఘురామ అరెస్ట్‌, క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారంటూ పోలీసుల తీరు బాగా వివాదాస్ప‌ద‌మైంది. ఇప్ప‌టికే ఏపీ పోలీసులు డ‌జ‌నుకుపైగా టీడీపీ నేత‌ల‌పై కేసులు పెట్ట‌డం.. ప‌లువురిని అరెస్ట్ చేసి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డం లాంటి చ‌ర్య‌లపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ప‌సుపు చొక్కా వేసుకున్నా.. సైకిల్ ప‌ట్టుకున్నా.. కేసులు పెట్టేంత‌లా పోలీసులు అధికార వైసీపీకి కొమ్ముకాస్తున్నార‌నే ఆరోప‌ణ బ‌లంగా ఉంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే.. తాజాగా సుప్రీంకోర్టు సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఇలాంటి పోలీసుల తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ పోలీసుల‌ను ఉద్దేశించి కాక‌పోయినా.. సీజేఐ స్టేట్‌మెంట్స్ అన్నిరాష్ట్రాల ఖాకీల‌కు హెచ్చ‌రిక‌లా, సూచ‌న‌లా ఉన్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.... అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుతో ఏసీబీ, ఆర్థిక నేరాల విభాగం ఆయన నివాసంలో సోదాలు చేసి.. రాజద్రోహంతో పాటు ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు కేసులు న‌మోదు చేశారు. ఈ కేసుల‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.  దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు జస్టిస్ రమణ. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అని.. దీనిని ఆపాలన్నారు జ‌స్టిస్ ర‌మ‌ణ‌. గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది.  సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులకు స‌రిగ్గా స‌రిపోతాయ‌ని అంటున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌క స్థానాల్లో ఉన్న పోలీస్‌ అధికారుల‌పై కులం, వ‌ర్గం ముద్ర వేసి అప్రాధాన్య పోస్టులకు మార్చేశార‌ని అంటున్నారు. అప్ప‌టి ఐబీ చీఫ్ ఏబీతో ఓ ఆట ఆడుకుంటున్నార‌ని గుర్తు చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం మారితే ప్ర‌స్తుత సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు ఇదే గ‌తి ప‌డుతుంద‌ని అంతా అంటున్నారు. ఇలా పార్టీలు మారిన‌ప్పుడ‌ల్లా.. పోలీసుల తీరు మార‌డం ఏమాత్రం స‌రికాద‌ని.. సీజేఐ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. అందుకే, ఖాకీలు అధికార పార్టీకి కొమ్ముకాయ‌డం మానుకొని.. నిస్ప‌క్ష‌పాతంగా న‌డుచుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. 

పోలీసు అధికారులను వేధించడమేంటీ! సీజేఐ వ్యాఖ్యలపై ఏపీలో చర్చ.. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల తీరు, ప్రభుత్వాల వైఖరిపై ఈసారి ఆయన తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు.. తర్వాత కాలంలో  ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. దేశంలో  ఇలాంటి పరిస్థితులు ఉండటం చాలా విచారకరమన్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాల్సి ఉందన్నారు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ.  సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మౌఖికంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.  గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది. సింగ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారిమన్, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ), ఆర్థిక నేరాల విభాగం ఆయనపై జూన్ 29న కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో జూలై 1న సోదాలు చేసి, ఆయనపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు.  సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులను ప్రస్తావించినట్లయిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బాధితుల్లో ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మరో ఉన్నతాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారనే టాక్ ఉంది. నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఏబీ వేంకటేశ్వర రావు కేసులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఏపీలో నెలకొన్న పరిణామాలను ఉదహరిస్తూనే సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ న్యాయ వర్గాల్లోనూ సాగుతోంది. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ర‌ఘురామ ఫుల్‌ స‌పోర్ట్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌ను కాపాడాలంటూ రిక్వెస్ట్..

సీఎం జ‌గ‌న్‌ను, వైసీపీ స‌ర్కారును, సాక్షి మీడియాను ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌డం లేదు ఎంపీ ర‌ఘురామ‌. ఏ1 జ‌గ‌న్‌, ఏ2 విజ‌య‌సాయిరెడ్డిల బెయిల్ ర‌ద్దు అయ్యే వ‌ర‌కూ వ‌దిలేలా లేరు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌, విజ‌య‌సాయిల‌పై కేసులు వేసిన ర‌ఘురామ‌.. ఇప్పుడిక సాక్షి మీడియాపైనా పిటిష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. హోల్‌సేల్‌గా జ‌గ‌న్ అండ్ కో కు చెక్ పెట్టేలా పావులు క‌దుపుతున్నారు.  సీఎం జగన్మోహన్‌రెడ్డిపై తాను వేసిన పిటిషన్ రద్దు అని సాక్షిలో ముందే వార్త రాశారని త‌ప్పుబ‌ట్టారు ర‌ఘురామ‌. ఆ వార్త‌ల వెనుక ఏముందో విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును సంప్రదించాలని న్యాయ నిపుణులకు తెలిపానన్నారు. సాక్షి క్లిపింగ్ కూడా న్యాయమూర్తికి పంపించడం జరిగిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.  అటు త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు దిగిన ఎంపీ మోపిదేవిపైనా విరుచుకుప‌డ్డారు ర‌ఘురామ‌. "నేను ఎవరో ఆడిస్తే ఆడుతున్నానని మోపిదేవి అంటున్నారు. 18 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న వారు చెప్తే నేను వింటానా? నేను ఎర్రివాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని నేను గెలిశాను అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్న మీరెందుకు ఓడిపోయారు. జగన్ బొమ్మ మీకు పని చేయలేదా? మన నాయకుడి బొమ్మతోనే కాదు నేను నా బొమ్మతో కూడా నెగ్గాను. పలు కేసుల్లో నింధితుడిగా ఉండి మీరు నాపై కామెంట్ చేయడం మంచిది కాదు." అంటూ స‌హ‌చ‌ర ఎంపీ మోపిదేవిపై మండిప‌డ్డారు ర‌ఘురామ‌.   అటు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాపై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టారు ర‌ఘురామ‌. పవన్ కళ్యాణ్ న‌టించిన వకీల్‌సాబ్ సినిమా సందర్భంలో మన ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఒక అగ్ర నటుడిపై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకుంటే ఎలా? థియేటర్ల రేట్లను మనం ఫిక్స్ చేస్తే ఎలా నడుస్తాయి. లాభం రాకున్నా సినిమా థియేటర్లను నడుపుతున్నారు. రాష్టంలో టికెట్ల రేట్లకు కారణం ఎవరో డిస్టిబ్యూటర్లు ఆలోచించాలి. ప్రభుత్వం రూ.50కి దొరికే మద్యాన్ని రూ.250కి అమ్ముతోంది. 150 రూపాయల మద్యాన్ని 250 చేస్తే కొనుకుంటున్నారు. మరి 150 సినిమా టికెట్ కొనలేరా? సినీ ప్రముఖులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలి. సినీ పరిశ్రమను కాపాడండి. హీరోలను హీరోలుగానే ఉండనివ్వండి.’’ అని రఘురామకృష్ణంరాజు సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సూచించారు.  తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్ల రేట్లను తగ్గించలేదని గుర్తు చేశారు రఘురామ. "ఆలోచించండి సీఎం జగన్మోహన్ రెడ్డి. పక్కా రాష్టాలు చేయని పనిని మీరు ఎందుకు చేస్తున్నారు. సినిమా ప్రేమికుడిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను సినిమ పరిశ్రమను కాపాడండి" అని అన్నారు.   "గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10శాతం వాటా ఉంది. ప్రభుత్వం వాటా ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. గంగవరం పోర్టుపై ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ప్రభుత్వంలో మనకు ఇబ్బందులు తప్పవు. ఒక్కసారి ఆలోచించండి. సమయవనం పాటించండి. పోలీసులు  కావాలని ప్రభుత్వాల మెప్పుకోసం పని చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు." అని రఘురామ కృష్ణరాజు అన్నారు.   

ఏపీలో వినాయ‌క చ‌వితి సెల‌వు ర‌ద్దు.. హిందు పండ‌గ‌పై జ‌గ‌న్ స‌ర్కారు కుట్ర‌నా?

స‌ర్వ విఘ్నాలు తొల‌గించే దేవుడు వినాయ‌కుడు. అలాంటిది ఆ వినాయ‌కుడి పండుగ‌కే విఘ్నాలు ఎదురైతే? అంత‌కంటే పాపం ఇంకేమైనా ఉంటుందా? ఇంత‌కీ అది పాప‌మా? కావాల‌నే చేస్తున్న ద్రోహ‌మా? ఓ వ‌ర్గంపై జ‌రుగుతున్న కుట్ర‌లా? ఇలా అనేక అనుమానాలు. అందులోనూ, ఇలాంటి ప‌రిస్థితులు ఏపీలోనే జ‌రుగుతుండ‌టం మ‌రింత అనుమానాస్ప‌దం. రెండేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. మ‌త మార్పిడిలు పెద్ద ఎత్తున చేప‌డుతున్నార‌నే ఆరోప‌ణ ఉంది. ఓ వ‌ర్గానికి అధిక ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇస్తున్నార‌నే ప్ర‌చార‌మూ ఉంది. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ ప‌త్రిక.. ది ఆర్గ‌నైజ‌ర్ సైతం జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న‌ మ‌త విధానాల‌పై తీవ్రంగా మండిప‌డింది. ఏపీలో హిందుత్వంపై జ‌రుగుతున్న కుట్ర‌ల‌కు వ్య‌తిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. ఇంత హంగామా జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మ‌రో బ‌రితెగింపు నిర్ణయానికి పాల్ప‌డటం మ‌రింత దారుణం. వినాయ‌క చ‌వితి పండుగ‌కు ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు సెల‌వును ర‌ద్దు చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  వినాయ చ‌వితి చిన్నాచిత‌కా పండ‌గేమీ కాదు. దేశవ్యాప్తంగా జ‌రుపుకునే అతిపెద్ద ఫెస్టివ‌ల్‌. ఊరూరా గ‌ణ‌ప‌తి మండ‌పాలు ఏర్పాటు చేసి న‌వ‌రాత్రులు పూజిస్తారు. పోటాపోటీగా వినాయ‌క విగ్ర‌హాలు ప్ర‌తిష్టించి.. అట్ట‌హాసంగా, ఆర్బాటంగా పండ‌గ వేడుక‌లు నిర్వ‌హిస్తారు. ముంబై గ‌ణేష్ ఉత్స‌వాలు, హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ విగ్ర‌హం ఎంతో ఖ్యాతి గాంచాయి. ఏపీలోనూ వినాయ‌క చ‌వితి వేడుక‌లు భారీగా జ‌రుగుతాయి. అలాంటిది.. ఇంత పెద్ద పండ‌గ‌కి.. ఏపీ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు సెల‌వు ఇవ్వ‌క‌పోవ‌డం ఏంటి? ఏటేటా ఇస్తూ వ‌స్తున్న హాలిడేను.. ఈసారి ర‌ద్దు చేయ‌డం ఎందుకు? దీని వెనుక ఏదైనా దురుద్దేశ్యం ఉందా అని అనుమానిస్తున్నారు హిందుత్వ‌వాదులు.  ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం సెలవు ఇవ్వాలి. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. ప‌క్క రాష్ట్ర‌మైన‌ తెలంగాణ స‌ర్కారు ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు.  బుధవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఆ లేఖ‌కు తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ను కూడా జత చేసింది. బ్యాంకు యూనియన్స్ రాసిన లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా, వినాయ‌క చ‌వితికి సెల‌వు కావాల‌ని వేడుకోవ‌డం ఏంటి? ఎప్పుడు ఇచ్చిన‌ట్టుగానే హాలిడే ఇవ్వొచ్చుగా? అభ్యంత‌రం దేనికి? ఉద్యోగులు అడిగే వ‌ర‌కు ఎందుకొచ్చింది? జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇలాంటి అనుమానాల‌కు తావిచ్చే నిర్ణ‌యాలు ఎందుకు తీసుకుంటోంది? విష‌యం ముదిరి వివాదం కాక‌మునుపే ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి బ్యాంకుల‌కు వినాయ‌క చ‌వితి సెల‌వు మంజూరు చేస్తే మంచిది. లేదంటే....

పంజాబ్ లో కాంగ్రెస్ VS కాంగ్రెస్.. రాహుల్ టీమ్ చేతులెత్తేసినట్టేనా..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిజానికి, సింగ్- సిద్ధూల మధ్య ఏనాడూ సయోధ్యత లేదు. నాలుగేళ్ళ క్రితం అమరిందర్ సింగ్ మంత్రి వర్గం నుంచి సిద్ధూ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి, ఇద్దరి మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. ముఖ్యంగా సిద్దూ వర్గం ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ టార్గెట్’గా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం పై, పీసీసీ హోదాలో సిద్ధూ విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.   కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ,పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పలు సందర్భాలలో ఇద్దరి మధ్య సయోధ్యత కుదిర్చేందుకు, ప్రయత్నించారు. చివరకు ఉప్పు – నిప్పుల ఉన్న ఇద్దరినీ కలిపి ఉంచేందుకు, అమరిందర్ సింగ్ అభ్యంతరం చెప్పినా, పట్టించుకోకుండా సిద్దూని పీసీసీ అధ్యక్షునిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిస్థానం ఏమి ఆశించి సిద్దూకు బాధ్యతలు అప్పగించిందో ఏమో, కానీ,ఇద్దరి ద్దరూ, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని నిరూపిస్తున్నారు.  సిద్దూ వర్గానికి చెందిన నలుగురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్’ను తక్షణం తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరిందర్ సింగే, పార్టీ కెప్టెన్’ని సిద్దూ టీమ్’కి తేల్చి చెప్పింది. అంతే కాదు. పార్టీని ఐక్యంగా ఉంచవలసిన బాధ్యత పీసీసే చీఫ్’గా సిద్దూపై ఉంటుందని, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరిష్ రావత్ గుర్తు చేశారు. అయితే, సిద్దూ పీసీసీ బాధ్యతలు చేపట్టి తర్వాత , దూకుడు మరింతగా పెంచారని, ఎన్నికలకు ముందే  ‘ముఖ్యమంత్రిని  తొలిగించే వ్యూహంతో పావులు కదుపుతున్నారని, అమరిందర్ సింగ్ వర్గం ఆరోపిస్తోంది. సిద్దూ పీసేసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎందుకు ఉపందుకున్నాయో, అధిష్టానం ఆలోచించి, దిద్దుబాటు చర్యలు, తీసుకోవాలని, ముక్ష్యమంత్రి సతీమణి, కాంగ్ర్ఫెస్స్ పార్టీ ఎంపీ ప్రణీత్ కౌర్ సూచించారు.  దిద్దుబాటు చర్యలు అంటే సిద్దూను పీసీసీ పావి నుంచి తప్పించాలని, ఆమె చెప్పకనే చెప్పారు. ఇలా ముఖ్యమంత్రిని కుర్చీదించాలని సిద్దూ వర్గం, సిద్దూను కుర్చీదించాలని అమరిందర్ వర్గం డిమాండ్  చేస్తూండడంతో కాంగ్రెస్ అధిష్టానం  తల పట్టుకుంటోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందేందుకు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అత్యవసరంగా భావిస్తున్న సమయంలో ఇద్దరు అగ్ర నేతల మధ్య తగవు పోరాటంగా మారడం ఆందోళన కలిగించే అంశంగానే చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ అంటున్నారు.

ఆస్తుల ఆమ్మకం కాంగ్రెస్ చేతికి బ్రహ్మస్త్రమా! మోడీ గ్రాఫ్ తగ్గినా మార్చుకోలేరా.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం  విపక్షాలకు మరో పదునైన అస్త్రాన్ని అందించిందా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్, ప్రకటించిన, జాతీయ మానెటైజేష‌న్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ’) ఇప్పటికే దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్న మోడీ ప్రతిష్టను మరింతగా దిగజారుస్తుందా? జనవరిలో 66 శాతంగా వెలిగిపోయిన మోడీ గ్రాఫ్, కొవిడ్ కాలమ్లో ఆర్థిక వ్యవస్థ మిస్ మేనేజిమెంట్ పుణ్యాణ, ఏకంగా ఒకేసారి 26 శాతానికి పడిపోయిన మోడీ ఇమేజిని ఎన్ఎంపీ మరింత డ్యామేజి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు.  నిజానికి మోడీ తమ  కార్పొరేట్  మిత్రుల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, కాంగ్రెస్ అగ్ర నేత్ర రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అయినా, ఎందుకనో దేశ ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు. కానీ, ఇప్పుడు, మోడీ ప్రభుత్వం రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వ అస్తులను కుదువ పెట్టి/విక్రయించి లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల ఉపసంహరణ ద్వారా  ఆరు లక్షల కోట్ల రూపాయలు సంకుర్చుకునేందుకు, జాతీయ మానెటైజేష‌న్ పైప్‌లైన్ ప్రణాళికను ప్రకటించడంతో రాహుల్ గాంధీ ఆరోపణలకు బలం చేకూరింది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ము కాస్తోందన్నఆరోపణలలో నిజముందని జనం నమ్ముతున్నారు.  ప్రభుత్వం అందించిన అస్త్రాన్ని అందుకుని, ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కార్’ పై కత్తులు దూస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో, ప్రభుత్వాలు అభివృద్ది చేసిన ప్ర‌తిష్టాత్మ‌క ఆస్తుల‌ను మోడీ ప్రభుత్వం తెగ‌న‌మ్ముతోందని, విపక్షాలు ద్వజ మెత్తుతున్నాయి. కొద్ది మంది కార్పొరేట్ల‌కు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలని రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. కోట్లాదిమంది పౌరులకు ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే అదే సమయంలో ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని, రాహుల్ , చిదంబరం స్పష్టం చేశారు.  మరోవంక బీజేపీ ఎదురుదాడికి సిద్దమైంది.  అమేథిలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని, కమల దళం రంగంలోకి దింపింది.దేశంలో ప్రైవేటీకరణ, మోనిటైజేషన్  శ్రీకారం చుట్టిందే  కాంగ్రెస్ పార్టీ  అంటూ  రాహుల్  గాంధీ ఆత్మవంచనకు పాల్పడుతున్నారని,ఆమె ఆరోపించారు. నిజమే, దేశంలో  రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ పీవీ, మన్మోహన్ జోడీతో ప్రారంభమైంది. మన్మోహన్ సింగ్ చిదంబరం జోడీ దాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. మన్మోహన్ పీఎం గా, చిదంబరం దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణ మొదలైంది, అలాగే, ముంబై పూణే జాతీయ రహదారి మోనిటైజేషన్’కూడా మన్మోహన్, చిదంబరం హయాంలోనే జరిగింది. దేశ రాజధాని  ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రైవేటు పరం చేసింది కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే.. ఇవి గాక, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు ఇతరత్రా రంగాల్లోనూ ప్రైవేటీకరణకు ఎంట్రీ పాస్ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమే.  కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం అందుకు మూల్యం కూడా చెల్లించింది. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పుల మెట్లు ఎక్కే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయం అంటే సామాన్య ప్రజలు, సొంత ఆస్తుల అమ్మకంగా భావిస్తారు. బాధ పడతారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం.అందుకే, మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను భారీ మూల్యం చెల్లించడమే కాదు, రాజకీయంగా బీజేపీకి అంతకు మించిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.

రాజకీయ నేర సంబంధాలకు ముగింపు లేదా? సుప్రీం సీరియస్ తో సీన్ మారేనా.. 

రాజకీయ నేర సంబందాల గురించి మన దేశంలో జరిగినంత చర్చ బహుశా మరే దేశంలోనూ జరిగి ఉండదేమో,కానీ, రాజకీయ నేర సంబందాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 78 మంది సభ్యులుంటే, అందులో 33 మీద, అంటే 42 శాతం మంది మత్రులపై క్రిమినల్ కేసులున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్  రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అందులో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే, దేశం మొత్తంలో 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై, క్రిమినల్ కేసులున్నాయి. ఇవ్వన్నీ కూడా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫ్ఫిడవిట్ల పరిశీలించిన నిర్ధారించిన నిజాలు. ఇలా, చట్టసభల సభ్యుల నేర చరిత బరువు పెరిగిపోవడానికి ఇంకా కారణలు ఉంటే ఉండవచ్చును, కానీ, నేర విచారణలో , న్యాయ విచారణలో  జరుగతున్న జాప్యం ఒక  మూల కారణం. ఏడీఆర్నివేదిక ప్రకారం, ఎంపీలపై నమోదైన కేసుల సగటు పెండింగ్ వయసు ఏడేళ్ళు, ఎమ్మెల్యేల కేసుల పెండింగ్ వయసు ఆరేళ్ళు. ఇంకా ఆసక్తికర విషయం, తొమ్మిది మంది ఎంపీ, ఎమ్మెల్యేలలపై 25 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్’లో ఉన్నాయి.   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అయితే, ఇంచుమున్చుగా దశాబ్ద కాలంగా ఆలా సాగుతూనే ఉన్నాయి. ఓడజనుకు పైగా చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయన్ని  సీబీఐ 2012 మే 25 న తొలిసారి అరెస్ట్ చేసింది. ఓ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యేవరకు కనీసం వారానికో సారి, కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదో ఒక సాకున కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు పొండుతున్నారు. ఇక బైలు రద్దు కోరుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు దాఖలు చేసిన, పిటీషన్విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వస్తుందని అంటున్నారు. అయితే, ఈ కుసు నడత తీరును గమనిస్తే అప్పటికైనా తుడు తీర్పు వస్తుందా అనే విషయంలో ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.   ఈ నేపధ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబదించిన సీబీఐ, ఈడీ కేసుల సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు.  అయితే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అగ్రాహం ఆవేదన వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు.న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఎప్పుడో దశాబ్దం ముందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఉపాధ్యాయ్ తమ పిటీషన్ లో కోరారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని  కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే. అయితే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో తెలియకుండా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అసలు సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి ... ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కితేనే కాని, చిక్కు ముడి వీడదు ... అంత వరకు  రాజకీయ నేర సంబంధాలు ముగింపులేని టీవీ సీరియల్  లాగా నడుస్తూనే ఉంటుంది.