అఫ్గ‌న్‌పై అమెరికా డ్రోన్ అటాక్‌.. ప్ర‌తీకార దాడిలో ఐసిస్ కీల‌క నేత హ‌తం!

సూసైడ్ అటాక్‌తో 13 మంది అమెరికా సైనికుల‌ను చంపేశారు ముష్క‌ర మూక‌లు. అఫ్గ‌న్‌లో అగ్ర‌రాజ్యానికి గ‌ట్టి స‌వాల్ విసిరారు ఐసిస్ ఉగ్ర‌వాదులు. తాలిబ‌న్ల ముసుగులో అమెరికాపై ఈ విధంగా ప్ర‌తీకారం తీర్చుకున్నారు. త‌మ సైనికుల‌ను కోల్పోయిన అమెరికా.. దెబ్బ తిన్న పులిలా తిరిగి అటాక్ చేసింది. ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని అధ్య‌క్షుడు బైడెన్ హెచ్చ‌రించిన కొన్ని గంట‌ల్లోనే ఐసిస్ టార్గెట్‌గా అఫ్గ‌నిస్తాన్‌లో డ్రోన్ దాడులు జ‌రిపింది. ఈ అటాక్‌తో ఐసిస్‌కు చెందిన కీల‌క నాయ‌కుడిని హ‌త‌మార్చిన‌ట్టు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర జ‌రిగిన బాంబుదాడి సూత్ర‌ధారి అత‌నేన‌ని తెలుస్తోంది. ప‌క్కా నిఘా, శాటిలైట్ స‌మాచారం మేర‌కు.. ఆ పెద్ద త‌ల‌కాయ‌పై నేరుగా డ్రోన్ అటాక్ చేసింది అమెరికా.  మ‌రోవైపు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులు సహా ఇతరుల తరలింపు కార్యక్రమం తుది దశకు చేరుకుంది. అయితే, మ‌రిన్ని ఉగ్రదాడులు జ‌రిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంట‌నే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ఆమోదించడంతో వేగంగా యాక్ష‌న్‌లోకి దిగాయి అమెరికా బ‌ల‌గాలు.   గురువారం కాబుల్‌ విమానాశ్రయం బ‌య‌ట‌ జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ ప్రకటించింది. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి, వేటాడుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు. పేలుళ్లకు తెగబడిన ఐసిస్ మూక‌ల‌పై దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. బైడెన్ ఆదేశించిన 24 గంట‌ల్లోనే అమెరికా డ్రోన్ అటాక్‌తో ఐసిస్ కీల‌క నేత‌ను హ‌త‌మార్చ‌డం యూఎస్ ఆర్మీ స‌త్తాకు నిద‌ర్శ‌నం.   

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 14 రోజుల‌ రిమాండ్‌.. చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లింపు..

అర్థ‌రాత్రి అరెస్ట్ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్నను కోర్టులో హాజ‌రుప‌రిచారు పోలీసులు. మ‌ల్ల‌న్న‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది ఉమేశ్ చంద్ర‌ అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ విష‌యం పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. చిలకలగూడా పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరారు. ప్ర‌స్తుతం మ‌ల్ల‌న్న‌ను చంచల్ గూడ జైల్‌కి తరలించారు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాన‌ని త‌న‌ను బెదిరించాడంటూ కొద్దిరోజుల క్రితం ఓ వ్య‌క్తి చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైట్‌పై గ‌తంలోనే కేసు న‌మోదు చేయ‌గా.. ప‌లుమార్లు స్టేష‌న్‌కి పిలిపించి విచారించారు. తాజాగా ఆయ‌నకు చెందిన క్యూ న్యూస్ కార్యాల‌యంతో పాట మ‌ల్ల‌న్న‌ ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వ‌హించారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి మ‌ల‌న్న‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌పై సైబ‌ర్‌క్రైమ్ స్టేష‌న్‌లో రెండు కేసులు, చిక్క‌డ‌ప‌ల్లి, జూబ్లీహిల్స్ పీఎస్‌ల‌లో ఒక్కో కేసు న‌మోదై ఉంది. ప‌లు కేసుల్లో ప‌దే ప‌దే  ఆయ‌న్ను పోలీస్ స్టేష‌న్ల‌కు పిలిపిస్తూ విచారించ‌డంపై ఆయ‌న ఇటీవ‌ల హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. త‌న‌ను పోలీసులు విచార‌ణ పేరుతో వేధిస్తున్నారంటూ జాతీయ బీసీ క‌మిష‌న్‌కు కూడా కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. శుక్ర‌వారం అర్థ‌రాత్రి పోలీసులు ఆయ‌న్ను స‌డెన్‌గా అరెస్ట్ చేసి శ‌నివారం కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.   

జ‌గ‌న్ స‌ర్కారుపై పెట్రోల్ బాంబ్.. మ‌హాధ‌ర్నాతో ప్ర‌జాగ్ర‌హం..

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీనేన‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం వెంట‌నే లీట‌ర్‌కు 30 రూపాయ‌లు ధ‌ర త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. విజయవాడ ధర్నా చౌక్ ద‌గ్గ‌ర‌ మహాధర్నా నిర్వహించారు. వైసీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త వ‌ల్లే పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ దాటింద‌ని బొండా ఉమ, గద్దె రామ్మోహన్ త‌దిత‌రులు విమ‌ర్శించారు. జ‌గ‌న్ స‌ర్కారు పన్నులు, రోడ్డు సెస్సులు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు పెట్రోల్‌ పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ర్యాలీకి పిలుపిచ్చిన బీటెక్‌ రవిని పోలీసులు ఇంటి ద‌గ్గ‌రే అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ బైక్‌ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాకరించారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు త‌దిత‌రులు కోటబొమ్మాళి రైతు బజార్‌ వరకు కాలి నడకన ర్యాలీ నిర్వ‌హించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో క్లాక్‌ టవర్ ద‌గ్గ‌ర టీడీపీ నాయకులు ధర్నా చేశారు. నరసరావుపేటలో ప్ర‌తిప‌క్ష‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నరసరావు పేట రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ముందు ముందు పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్ట‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.   

యూపీ సీఎం యోగిపై పోటీ చేస్తాన‌న్న మాజీ ఐపీఎస్ అరెస్ట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి  యోగి ఆదిత్య‌నాథ్‌పై పోటీ చేస్తాన‌ని మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్‌ను యూపీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్‌కు లక్నో కోర్టు వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది. బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ త‌న‌పై అత్యాచారం చేశాడంటూ.. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆగస్టు 16న 24 ఏండ్ల యువ‌తి త‌న స్నేహితుడితో క‌లిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. యువతీ యువకులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు .24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.హిస్టరీ షీటర్ (నేర చరిత కలిగిన వ్యక్తి) అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్‌రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించింది.  ఆత్మహత్యయత్నం చేసిన యువతి ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న క‌న్నుమూశారు. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. బాధితురాలిపై అపవాదు మోపి, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడంలో అమితాబ్ ఠాకూర్ పాత్ర ఉందని తేల్చింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు అమితాబ్‌ ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్ త‌న‌ విధుల ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేయ‌డం లేద‌ని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయ‌న‌ను తొల‌గించింది. అనంత‌రం తాను 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగిపై పోటీ చేస్తాన‌ని అమితాబ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. దీంతో ఠాకూర్‌తో కేంద్రం ఇటీవల నిర్బంధ పదవీ విరమణ చేయించింది.  తానో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు అమితాబ్ ఠాకూర్ శుక్రవారం ఉదయమే ప్రకటించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అరెస్టు యూపీలో సంచ‌ల‌నంగా మారింది.  

మంత్రి మల్లారెడ్డి భూ అక్రమణలు ఇవే? నిరూపించడానికి సిద్ధమన్న రేవంత్ 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. పీసీసీ నేతలు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను రాజీనామా చేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన సవాల్ పై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరోసారి మంత్రి అక్రమాలను బయటపెట్టారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మంత్రి యూనివర్సిటీ భూములు ఎక్కడి నుంచి వచ్చాయ్.. సీఎంఆర్ హాస్పిట్సల్ భూమి ఎక్కడిదనే విషయాలను బయటపెట్టారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం 1965 నాటికి గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 650లో మొత్తం 22 ఎకరాల 8 గుంటల భూమి ఉందని రేవంత్ తెలిపారు. 2001 నాటికి కూడా అదే 22 ఎకరాల భూమి ఉంది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మాత్రం 33 ఎకరాల 26 కుంటలకి పెరిగింది.  సర్వే నంబర్‌లో 22 ఎకరాలున్న భూమి అమాంతం 33 ఎకరాలకు ఎలా పెరిగిందని.. అదేమైనా కేసీఆర్ ముక్కా రోజూ కొంత పెరగడానికంటూ  ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 650 సర్వే నంబర్ లో 33 ఎకరాల్లో 16 ఎకరాలు మల్లా రెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది. దాన్ని ఆయన మల్లా రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడ్‌ ఇచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి. బావమరిదికి ఆస్తులుంటే నాకేం సంబంధమని చెప్పిన మల్లా రెడ్డికి గిఫ్ట్ డీడ్‌ కింద ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. బావ కళ్లలో ఆనందం కోసం బావమరిది ఇచ్చిండా అంటూ ఎద్దేవా చేశారు.  జవహర్ నగర్‌లోని సర్వే నంబర్ 488లో 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ క్రయవిక్రయాలు నిషేధించింది. ఇందుకు సంబంధించి అధికారులు పెట్టిన బోర్డుల ఫొటోలను కూడా రిలీజ్ చేశారు రేవంత్. ఇప్పుడదే భూమి రిజిస్ట్రేషన్లు జరిగి మల్లా రెడ్డి కోడలు షాలినీ రెడ్డి కొనుగోలు చేసినట్లు చూపుతున్నారని రేవంత్ చెప్పారు. అందులో సీఎంఆర్ హాస్పిటల్స్ కట్టారని తెలిపారు. మల్లా రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి షాలినీ రెడ్డి  పేరు మీదకు జవహర్‌నగర్ వైస్‌ చైర్మన్ పేరుతో ఉన్న భూమి  ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పదవులు ఇచ్చినందుకు లంచంగా ఆ భూమిని మింగేశారని రేవంత్ ఆరోపించారు. అసలు నిషేధిత భూమిగా అధికారులు పేర్కొన్న అదే భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయా చెప్పాలన్నారు .ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఐదేళ్ల నిషేధం విధించిందని రేవంత్ చెప్పారు. మరి అలాంటి కళాశాలని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని సీఎం కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. మేడ్చల్ పరిధిలో 50 ఎకరాల వెంచర్ వేసిన వ్యాపారులను మామూళ్ల కోసం బెదిరించిన ఆడియో టేపులు బయటికి వచ్చాయని.. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని కూడా మంత్రి మల్లా రెడ్డిపై ఆరోపణలు వచ్చాయని రేవంత్ అన్నారు. తన మంత్రివర్గంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేంది లేదని.. చివరికి తన కొడుకు, కూతురైనా ఊరుకునేది లేదని కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్యని పీకేసి.. భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేందర్‌ను బయటికి పంపించిన కేసీఆర్‌కి మల్లా రెడ్డి అవినీతి ఎందుకు కనపడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. దొంగగా ఉన్న మల్లా రెడ్డిని గజదొంగని చేసి పక్కన పెట్టుకున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.  

ప్రైవేట్ చేతుల్లోకి పీఎస్ఎల్వీ తయారీ! ఇస్రోపైనా కార్పొరేట్ల కన్ను? 

దేశంలో ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశమే కీలకలంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ కొన్ని రోజులుగా ప్రైవేట్ జపం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తోంది. బ్యాంకులను విలీనం చేసింది. దేశానికే తలమానికమైన ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ లోనూ  ప్రైవేట్ సంస్థలు ప్రవేశించాయి. ప్రపంచలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్లోలోకి వ్యాపార సంస్థలు ఎంటర్యయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి దిగ్గజ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. వచ్చే నాలుగేండ్లలో ప్రైవేటీకరించనున్న సంస్థల జాబితాను ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ప్రైవేటీకరణ జాబితాలో ఉందని తెలుస్తోంది.  ఇస్రో తలపెట్టిన అంతరిక్ష ప్రయోగాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొట్టమొదట వినిపించే పేరు .. పీఎస్ఎల్వీ . తిరుగులేని అంతరిక్ష వాహకనౌక . ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన శాటిలైట్లను తీసుకుని నింగి వైపు దూసుకెళ్లే వాహక నౌక ఇది . ఇన్ని సంవత్సరాల పాటు ఇస్రో సొంతంగా దీన్ని తయారు చేస్తూ వచ్చింది . ఇప్పుడు ఆ అధికారం ఇస్రో చేతుల్లో నుంచి జారిపోనుంది. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో.. పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి . పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ , ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియాలు రేసులో నిల్చాయి, ఈ రెండు కన్సార్టియాలతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( బీహెచ్ఈఎల్ ) సింగిల్ కంపెనీగా బిజ్ను దాఖలు చేశాయి. గుజరాత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన కంపెనీ అదాని గ్రూప్. దీని సారథ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది . ఈ రెండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్స్ దాఖలు చేసింది. గత నెల 30 వ తేదీ వరకు అదాని గ్రూప్ , ఎల్ అండ్ టీ , బీహెచ్ఈఎల్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలయ్యాయి. ఎవాల్యూషన్ పూర్తయిన తరువాత .. అర్హత సాధించిన కన్సార్టియాన్ని ఎంపిక చేస్తామని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ డీ తెలిపారు. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ పనులను దానికి అప్పగిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్వీ తయారీ ప్రక్రియ మొత్తం ఎండ్  టు  ఎండ్ ప్రైవేటు పరం కాబోతోండటం ఇదే తొలిసారి.  అదాని వంటి బడా పారిశ్రామికవేత్త ఇక అంతరిక్ష పరిశోధనల సెక్టార్ లో కూడా అడుగు పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు సర్వాత్రా వినిపిస్తోన్నాయి . కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పెట్టుబడుల ఉపసంహరణ విధానం పరిధిలోకి ఇస్రోను కూడా చేర్చడానికి దీన్ని తొలి అడుగుగా భావించే వారు కూడా ఉన్నారు. క్రమంగా ఇస్రో సైతం ప్రైవేటీకరణ దిశగా సాగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టు ఆహ్వానించడంతో తొలిదశలో కీలకమైన పీఎస్ఎల్వీ ప్రైవేటీకరణ పూర్తి అయినట్టేనని అంటున్నారు. 

బిగ్ బ్రేకింగ్‌.. అర్థ‌రాత్రి తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్ట్‌.. ప్ర‌శ్నిస్తే మూసేస్తారా?

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ‌బ్బుల కోసం బెదిరిస్తున్నార‌ని మ‌ల్ల‌న్న‌పై ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు అనంత‌రం తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను చిల‌క‌ల‌గూడ పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  గురువారం క్యూ న్యూస్ ఆఫీసు, మ‌ల్ల‌న్న ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు. ప‌లు కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం శుక్ర‌వారం అర్థ‌రాత్రి మ‌ల్ల‌న్న‌ను అరెస్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు పోలీసులు.  తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్ట్‌పై ప్ర‌జాస్వామ్య‌వాదులు మండిప‌డుతున్నారు. క్యూ న్యూస్ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నందుకే ఆయ‌న్ను అరెస్ట్ చేశారంటూ విమ‌ర్శిస్తున్నారు. మీడియాకు సంకెళ్లు వేయ‌డం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై రివేంజ్ తీర్చుకోవాల‌ని కేసీఆర్ స‌ర్కారు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు క్యూ న్యూస్‌పై దాడి చేసి నానా హంగామా సృష్టించారు పోలీసులు. తాజాగా ఓ వ్య‌క్తిని డ‌బ్బులు డిమాండ్ చేశార‌నే ఫిర్యాదుతో మ‌ల్ల‌న్న‌ను అరెస్ట్ చేయ‌డం క‌క్ష్య సాధింపు చ‌ర్య‌నే అంటున్నారు.  త‌న‌పై న‌మోద‌వుతున్న వ‌రుస పోలీస్ కేసుల‌పై ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించారు చింత‌పండు న‌వీన్‌. జాతీయ బీసీ క‌మిష‌న్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వం నుంచి,, పోలీసుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. క్యూ న్యూస్‌లో స‌ర్కారుపై విమర్శ‌లు మాత్రం ఆప‌లేదు మ‌ల్ల‌న్న‌. ధైర్యంగా ప్ర‌భుత్వ దుర్నీతిని నిత్యం ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. అందుకు ప్ర‌తీకారంగానే అన్న‌ట్టు.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఓ కేసులో అరెస్ట్ చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దొంగ‌ల్లా అర్థ‌రాత్రి మ‌ల్ల‌న్నను అరెస్టు చేయ‌డంపై ప్ర‌జాస్వామ్య‌వాదులు, జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు. స‌ర్కారు క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.  

డ్రగ్స్ కేసులో రానా, రకుల్ కు నోటీసులు? కేటీఆర్ ఆందోళనగా ఉన్నారన్న రేవంత్.. 

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారా? ఆయన సన్నిహితులు కొందరు ప్రమాదంలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి. తన సన్నిహితులు ఇబ్బందుల్లో పడటంతో కేటీఆర్ కలవరపడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్​ ఆందోళనగా ఉన్నారని, ఆయన స్నేహితులకు డ్రగ్స్​ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆయన సన్నిహితులకు నోటీసులు రావడంతో కేటీఆర్​ భయపడుతున్నారన్నారు. గతంలో కేటీఆర్​ గోవాకు వెళ్లి వచ్చారని, ఈ గోవా పర్యటన అధికారికమా.. అనధికారికమా అని రేవంత్ ప్రశ్నించారు.  డ్రగ్స్ కేసులో  తాను కూడా  హైకోర్టులో ఈడీ, సీబీఐలను సవాల్​ చేస్తూ పిల్​ వేశానని, ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈడీ కౌంటర్​ దాఖలు చేసిందని రేవంత్​రెడ్డి వెల్లడించారు. మంత్రిగా కేటీఆర్​ గోవా పర్యటనను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్​ కేసులో విచారణ చేస్తామని ఈడీ, సీబీఐ అంటుంటే ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కష్టాల్లో పడిన కేటీఆర్ సన్నిహితులు ఎవరూ అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది.  నాలుగేండ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు సిని ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో తాజాగా ఈడీ దూకుడు పెంచడంతో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. ప్రముఖ సినీనటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. నాలుగేండ్ల కిందట తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో దగ్గుబాటి, రకుల్ పేర్లు లేవు. రానా ఇంతవరకు విచారణకు కూడా హాజరు కాలేదు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో హవాలా ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్ల జాబితాలో ఈ ఇద్దరిపేరు ఉన్నాయని తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో  అనుమానితుల జాబితాలోనూ లేని వీళ్లకు ఈడీ సమన్లు జారీ చేసింది? అనేది మిస్టరీగా మారింది. కావాలనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఇంతకాలం వారి పేర్లను దాచి పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను 2017 జూలైలో ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా దాదాపు 60 మందిని విచారించారు. అందులో సుమారు10 మందికి పైగా సినీ ప్రముఖులున్నారు. ఈ కేసు నెల రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగు సినీరంగాన్ని కుదిపేసింది. సినీ రంగ ప్రముఖులతో పాటు డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చిన మరి కొంతమంది రక్తం నమూనాలు, గోళ్లు, జుట్టు నమూనాలను కూడా తీసుకొని పరీక్షలకు పంపారు. ఆ తర్వాత  ప్రభుత్వం కేసును పక్కన పెట్టింది. కేసులో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్‌ను బదిలీ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాపై 12 కేసులు నమోదు చేసి 11 చార్జిషీట్లను దాఖలు చేసి చేతులు దులుపుకున్నది. డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెట్టిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వాస్తవాలను వెలుగులోకి తెచ్చి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది రేవతి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తోపాటు సీబీఐ, ఎన్సీబీ, డీఆర్ఐల జోక్యాన్ని కోరారు. ఇదే అంశంపై రాష్ట్రపతికి కూడా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు నుంచి వివరాలను వెల్లడించాలని ఆదేశాలు వచ్చినా రాష్ట్ర అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈడీ బాలీవుడ్​, శాండిల్​వుడ్​తోపాటు టాలీవుడ్​పైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లు, అనుబంధ పత్రాలను పరిశీలించింది. అందులో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయా? లేదా? అనేది అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దక్షిణాఫ్రికాకు చెందిన  రాఫెల్ ఎలెక్స్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. 

షాకింగ్ న్యూస్‌.. అందుకేనా జ‌గ‌న్‌ సిమ్లా టూర్‌? వారితోనా సీక్రెట్ మీటింగ్స్‌?

పైపైన అంతా మామూలుగానే క‌నిపిస్తుంది. కానీ, లోలోన అంతుచిక్క‌ని మిస్ట‌రీ దాగుంటుంది. రాజ‌కీయాల్లో ఇది మ‌రింత ఖ‌త‌ర్నాక్‌గా సాగుతుంది. పైపైన‌ చూస్తే మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన‌ట్టే అనిపిస్తుంది. స‌ర‌దాగా గ‌డ‌ప‌టానికే అన్న‌ట్టు ఉంటుంది. కానీ, లోలోన ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాల‌కు శ్రీకారం ప‌డుతుంది. ఫోటోల్లో శాలువాలు, జ్ఞాపికలు మాత్ర‌మే  క‌నిపిస్తాయి. లోన విందు రాజ‌కీయం ఎవ‌రి కంటాప‌డ‌దు. ప్ర‌క‌ట‌న‌లో సేద తీర‌డానికేన‌ని ఉంటుంది. లోయ‌ల్లో జ‌రిగే ఫ్యామిలీ సీక్రెట్ మీటింగ్స్ సారాంశం బ‌య‌ట‌కు పొక్క‌దు. మంచులా అక్క‌డే క‌రిగిపోతుంది. కానీ.. ప్ర‌తీసారీ ఇలా మేట‌ర్ ర‌హ‌స్యంగానే ఉండ‌దు. ఇలా అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా స‌మాచారం అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంది. అదే ఈ షాకింగ్ న్యూస్‌.   పాయింట్ నెంబ‌ర్ 1 : గ‌త‌వారం కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. విందు రాజ‌కీయంలో కీల‌కాంశాలు చ‌ర్చించారు.  పాయింట్ నెంబ‌ర్ 2 : సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వారం రోజుల ప‌ర్య‌ట‌న కోసం సిమ్లా వెళ్లారు. కుటుంబంతో క‌లిసి మంచుకొండ‌ల్లో సేద తీరుతున్నారు. ఈ రెండూ పైపైన చూస్తే ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని అంశాలు అనిపించ‌వ‌చ్చు. ఇలానే ఉంటుంది రాజ‌కీయం. కానీ, ఈ రెండు ప‌రిణామాల‌కు చాలా చాలా లింక్ ఉంద‌ని తెలుస్తోంది. కిష‌న్‌రెడ్డితో మీటింగ్ త‌ర్వాతే జ‌గ‌న్ సిమ్లా టూర్ క‌న్ఫామ్ కావ‌డం కాక‌తాళీయం కానేక‌ద‌ని అంటున్నారు. ఆ రెండింటి లింకు లాగితే సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సిమ్లా టూర్ భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను అమాంతం మార్చేయ‌వ‌చ్చు. గ‌తంలో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా చేశారు కిష‌న్‌రెడ్డి. జ‌స్ట్.. కొన్ని వారాల కింద‌రే ఆ శాఖ నుంచి మారిపోయారు. ఇన్నాళ్లూ హోంమంత్రి అమిత్‌షాతో క‌లిసి ప‌నిచేశారు. ఆ శాఖ‌లో జ‌రుగుతున్న ప్ర‌తీ విష‌యం పాయింట్ టు పాయింట్ కిష‌న్‌రెడ్డికి తెలుసు. అదే తీరున సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల గుట్టు కూడా ఆయ‌న‌కు బాగానే తెలుసు. అందుకే భ‌విష్య‌త్‌లో జ‌రగబోయే అవ‌కాశం ఉన్న ప‌రిణామాల‌పై సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఆయన జోస్యం చెప్పార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ఫ్యూచ‌ర్‌ను తెరిచిన పుస్త‌కంలా చూపించార‌ట‌. కేంద్రం త‌ర‌ఫున‌ జ‌గ‌న్‌రెడ్డికి మ‌రెంతో కాలం స‌హాయస‌హకారాలు అందే ప‌రిస్థితి లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టే చెప్పార‌ట‌. గ‌తంలో ఎన్వీ ర‌మ‌ణ సీజేఐ కాకుండా అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేసి జ్యుడీషియ‌రీ విష‌యంలో ఎంత త‌ప్పిదం చేశారో కూడా గుర్తు చేశార‌ట‌. సీబీఐ, ఈడీ ఉచ్చు ఎంత గ‌ట్టిగా బిగిసిందో వివ‌రించార‌ట‌. విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ, చోక్సీల ఘటనలను జగన్ రెడ్డికి గుర్తు చేశారట.ఈడీ కేసుల తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో, వాళ్లు ఏం చేశారో పూసగుచ్చినట్లు చెప్పారట. అన్నీ సైలెంట్‌గా విన్న జ‌గ‌న్‌..ఆ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చించడానికే అప్ప‌టిక‌ప్పుడు సిమ్లా టూర్ ప్లాన్‌ వేశార‌ని అంటున్నారు. అది పేరుకే ఫ్యామిలీ ట్రిప్ కానీ.. అస‌లు సంగ‌తి వేరే ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం భార్య భార‌తి రెడ్డితో క‌లిసి సిమ్లాలో ఉన్నారు సీఎం జ‌గ‌న్‌. అయితే ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రేపేమాపో త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల సైతం సిమ్లాలో జ‌గ‌న్‌తో జాయిన్ అవుతార‌ని స‌మాచారం. కొన్ని రోజులుగా జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్నమీద కోపంతోనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారనే వాదన ఉంది. అదే సమయంలో అన్న చెల్లెలు లోలోపల సఖ్యతగానే ఉంటూ.. పైకి మాత్రం గొడవలు ఉన్నట్లుగా రాజకీయ డ్రామా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను కలిసేందుకు షర్మిల వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. త‌ల్లి, చెల్లి, భార్య‌కు త‌న భ‌విష్యత్ కార్య‌చ‌ర‌ణ వివ‌రించి.. వారితో మ‌రింత చ‌ర్చించి.. ఓ అవ‌గాహ‌న‌కు రావాల‌నే ఏపీ సీఎం జగన్ రెడ్డి.. స‌డెన్‌గా ఈ సిమ్లా టూర్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అక్ర‌మాస్తుల కేసులో త‌న‌కు  జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో.. అదే జరిగితే ఏం చేయాలనే దానిపై  కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మేధోమ‌ధ‌నం చేస్తార‌ట‌ జగన్. తన ఆస్తులు, వ్యాపారాల విషయంలోనూ చర్చలు జరుపుతారని అంటున్నారు. అన్ని అంశాల‌పై ఫ్యామిలీతో చ‌ర్చించి.. క్లారిటీ తెచ్చుకోవ‌డ‌మే జ‌గ‌న్‌రెడ్డి సిమ్లా టూర్ ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు. సిమ్లాలో జగన్ ఫ్యామిలికి పవర్ ప్లాంట్ లు ఉన్నాయని, వాటికి సంబంధించిన గెస్ట్ హౌజ్ లోనే ప్రస్తుతం జగన్ మకాం చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమచారం. మొత్తానికి ఫ్యామిలి ట్రిప్ అని చెబుతున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి సిమ్లా పర్యటన వెనుక పెద్ద కథే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  

ఓటమి భయంతో అసెంబ్లీ రద్దు చేస్తారా? కేసీఆర్ సిగ్నల్ ఇచ్చేశారా? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర తెరాస నాయకుల స్వరంలో మార్పు కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు సహా అందరి మాటలలోలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి  ప్రస్తావన వస్తోంది. రెండు రోజుల క్రితం, మంత్రి కేటీఆర్, హుజూరాబాద్’లో తెరాస ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ప్రభుత్వం కూలి పోదు .. గెలిచినా ఏమీ కాదు కేంద్రంలో అధికారంలోకి రాలేము, అంటూ పార్టీ ఓటమికి కూడా సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.  ఆర్థిక మంత్రి హరీష్ రావు, వీణవంక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో గెలిస్తే, ఏమి చేస్తారో చెప్పాలని, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఏడున్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏమీ చేయలేని ఈటల, గెలిచి ఎమ్మెల్యేగా ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.అదే నిజం అయితే, అందుకు సమాధానం చెప్పవలసింది ఈటల కాదు,కేసీఆర్ లేదా హరీష్ రావు సమాధానం చెప్పవలసి ఉంటుంది.ఈటల మంత్రిగా పనిచేసింది,ఏ బీజేపీ ప్రభుత్వంలోనో, ఏ కాంగ్రెస్ ప్రభుతంలోనో కాదు, తెరాస ప్రభుత్వంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. అంటే, తెరాస ప్రభుత్వంలో మంత్రులు కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితి ఉందని హరీష్ రావు అంగీకరించడమే అవుతుందని  తెరాస కార్యకర్తలే అంటున్నారు.  తెరాస నాయకత్వం మాటలలో వచ్చిన మార్పు, తడబాటుకు  హుజూరాబాద్’లో ఓటమి తప్పదనే సంకేతాలే కారణమా అంటే, అవుననే అంటున్నారు. అంతే కాదు, హుజూరాబాద్’లో ఓడిపోయినా తర్వాత ఎన్నికలకు వెళ్ళడం కంటే, ముందుగానే అసెంబ్లీ రద్దుచేసి ముందస్తుకు పోవడం ఉత్తమమనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి  చేస్తున్నట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈనేపధ్యంలోనే, మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్,  ముఖ్యమంత్రి కేసీఆర్ రేపే శాసన సభను రద్దు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని  చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న (గురువారం)  ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ  ప్రవీణ్ కుమార్,  హుజూరాబాద్’లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ధోకా లేదంటూనే, ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదనటంలోని అంతరార్ధం, అధికార పార్టీలోని  ఓటమి భయానికి సంకేతమని,  డోలాయమన పరిస్థితీని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.   నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలైంది. రేవంత్ రెడ్డి రోజురోజుకు దూకుడు పెంచుతూ జనంలోకి దూసుకు పోతున్నారు. చివరకు ముఖ్యమంత్రి దత్తత గ్రామం చింతల పల్లిలో దీక్ష చేపట్టి  నేరుగా కేసీఆర్’కే సవాలు విసిరారు. అంతే కాదు, ముఖ్యమంత్రి నియోజక వర్గం గజ్వేల్ పైనా ఆయన గురిపెట్టారు. ఈ నేపధ్యంలో, రోజులు గడిచే కొద్దీ రాజకీయ పరిస్థితి మరింత విషమిస్తుందని, అందుకే ముఖ్యమంత్రి మరోమారు, హుజూరాబాద్’ ఉప ఎన్నికకు ముందే అసెంబ్లీ రద్దు చేసే ఆలోచన చేస్తున్నారని తెరాస వర్గాల్లోనూ గత కొన్ని రోజులుగా వినవస్తోంది. ఇప్పడు  బీఎస్పీ నేత మాజీ ఐపీస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో, అనుమానాలకు మరింత బలం చేకూరిందని అంటున్నారు. అయితే, ఇంకా రెండు సంవత్సాల సమయం ఉండగా ముఖ్యమంత్రి  తొందరపాటు నిర్ణయం తీసుకుంటారా,అనే అనుమనాలు కూడా వ్యక్తకవుతున్నాయి. ఏదైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీ కి అగ్ని పరీక్షగా మారింది.

దొంగ మల్లారెడ్డి.. బండారం బ‌య‌ట‌పెట్టిన రేవంత్‌రెడ్డి..

మంత్రి మ‌ల్లారెడ్డి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. ఆ మ‌ర్నాడే మ‌ల్లారెడ్డిని కాంగ్రెస్‌వాదులు, రేవంత్ అభిమానులు కుమ్మేశారు. సోష‌ల్ మీడియాలో చీల్చిచెండాడారు. తాజాగా, రేవంత్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అంతా అటెన్ష‌న్‌. త‌న‌ను తిట్టిన మ‌ల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి కూడా తిట్ల‌తో చెల‌రేగిపోతార‌ని అంతా అనుకున్నారు. రేవంత్ ఏమంటారా.. అని అంతా చెవులు రిక్క‌రించి విన్నారు. మ‌ల్లారెడ్డి మాట‌ల‌కు మా కాంగ్రెస్ నేత‌లు బ‌దులిచ్చేశారుగా అంటూ సింపుల్‌గా చెప్పేశారు. కావాల‌నే అస‌లు విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే.. ఇలా తిట్లదండ‌కం అందుకున్నార‌ని ఆ ట్రాప్‌లో తాను ప‌డ‌బోనంటూ తేల్చేశారు. మంత్రి మ‌ల్లారెడ్డి భూ అక్ర‌మాల‌కు ఆధారాలు ఇవిగో అంటూ అస‌లు మేట‌ర్‌లోకి వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తిట్ల‌కు తిట్ల‌తోనే బ‌దులివ్వ‌కుండా ప‌రిణ‌తి క‌లిగిన నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరును అంతా అభినందిస్తున్నారు. రేవంత్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.  ఇక‌, మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆధారాల‌తో స‌హా ఏక‌రువు పెట్టారు పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌ చుట్టు పక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్‌డీడ్‌ చేయాల్సిందేనని.. కానీ, 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు. ఆ భూముల‌ గిఫ్ట్‌ డీడ్‌ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు.   ‘‘గుండ్ల పోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబరులో ఉన్న భూమి 22 ఎకరాల 20గుంటలు. తాజాగా ధరణి వివరాల ప్రకారం.. 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇది ఏమైనా కేసీఆర్‌ నాటి మొక్క పెరిగి పెద్దది అవడానికి? ఇందులో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్‌ పేరు మీద ఉంది. ఈ భూమిలోనే మల్లారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుపై గిఫ్ట్‌ డీడ్‌ పెట్టి, యూనివర్సిటీ అనుమతి తీసుకున్నారు. 2004లో ఇదే భూమిని గ్రామ పంచాయతీ లేఅవుట్‌లుగా అమ్మారు. ఆ తర్వాత మళ్లీ హెచ్‌ఎండీఏ పేరుతో ఇదే భూమిని లేఅవుట్‌లు వేసి విక్రయించారు. 650 సర్వే నెంబర్‌లో లేఔట్‌లు చేసి, రెండుసార్లు ప్లాట్లు అమ్మారు. అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత 22 ఎకరాలు కాస్తా.. 33 ఎకరాలు ఎలా అయింది? అందులో 16 ఎకరాలు శ్రీనివాస్‌రెడ్డికి ఎలా వచ్చింది? మీ మంత్రి వర్గంలో నీతి, నిజాయతీ కలిగిన వాళ్లుగా చెబుతున్న వీరు ఈ అక్రమాలు ఎలా చేశారో చెప్పాలి. అంతేకాదు, జవహర్‌నగర్‌లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత ఎలా భూమి బదిలీ అయ్యింది? గజ దొంగలను పక్కన పెట్టుకుని... కేటీఆర్ నీతులు చెబుతున్నారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌లో వందల కోట్ల దుర్వినియోగం చేసిందని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బయట పెట్టాలి. మల్లారెడ్డి విద్యా సంస్థలు... ఫోర్జరీ సర్టిఫికెట్‌లు పెట్టిన దొంగ మల్లారెడ్డి’’ అంటూ ఘాటుగా విమ‌ర్శించారు రేవంత్‌రెడ్డి. తాను బ‌య‌ట‌పెట్టిన ఆధారాల ఆధారంగా మంత్రి మ‌ల్లారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.   

తీన్మార్ మ‌ల్ల‌న్న కేసులో సంచ‌ల‌నం.. డీజీపీకి ఢిల్లీ నుంచి స‌మ‌న్లు!

కేసీఆర్‌ స‌ర్కారు మెయిన్ టార్గెట్స్‌ ముగ్గురే ముగ్గురు. ఫ‌స్ట్ టార్గెట్‌ కాంగ్రెస్‌-రేవంత్‌రెడ్డి. సెంక‌డ్ టార్గెట్ బీజేపీ-ఈట‌ల‌. థ‌ర్డ్ టార్గెట్ క్యూన్యూస్‌- తీన్మార్ మ‌ల్ల‌న్న‌. కేసీఆర్ లాంటి నేత‌కే ఇంత పెద్ద టార్గెట్ అయ్యారంటే  తీన్మార్ మ‌ల్ల‌న్న‌- క్యూ న్యూస్ ఆయ‌న్ను ఎంత‌గా డిస్ట‌ర్బ్ చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే, ఛాన్స్ దొరికితే మ‌ల్ల‌న్న‌ను, ఆయ‌న యూట్యూబ్ ఛానెల్‌ను మూసేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చూస్తోంద‌ని అంటారు. ఇటీవ‌ల ఓ యువ‌తి ఫిర్యాదుతో క్యూ న్యూస్ ఆఫీసుపై పోలీసులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లారు. పోలీస్ స్టేష‌న్ల‌కు ప‌దే ప‌దే ర‌ప్పించారు. తాజాగా, టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా విభాగం కంప్లైంట్‌తో మ‌రోసారి మ‌ల్ల‌న్న‌పై అటాక్ చేశారు కాప్స్‌. క్యూ న్యూస్ ఆఫీసుతో పాటు, తీన్మార్‌ మ‌ల్ల‌న్న ఇంటిపై కూడా దాడి చేసి సోదాలు చేశారు. వ‌రుస దాడుల‌తో విసిగిపోయిన మ‌ల్ల‌న్న‌.. ఇప్పుడు రివ‌ర్స్ అటాక్ స్టార్ట్ చేశాడు. ఇప్ప‌టికే హైకోర్టులో ఓ పిటిష‌న్ వేయ‌గా.. లేటెస్ట్‌గా జాతీయ బీసీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. తనపై వరుస కేసులను నమోదు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపిస్తున్నారు చింత‌పండు న‌వీన్‌. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఈ మేరకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లకు సమన్లు పంపారు. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 29 ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మల్లన్నను తెలంగాణ పోలీసులు అనవసర వేధింపులకు గురిచేస్తున్నార‌ని ఫిర్యాదు అందింద‌ని.. దీనిపై వివరణ ఇవ్వాలని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సమన్లలో కోరినట్లు తల్లోజు ఆచారి తెలిపారు. కమిషన్‌లో విచారణ కోసం డీజీపీ, సీపీలు స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో తెలుపుతూ నివేదికను ఈమెయిల్లో సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత ఫైల్స్, కేస్ డైరీ మొదలైన డాక్యుమెంట్లతో పాటు తాజా నివేదికతో రావాల‌ని ఆచారి కోరిన‌ట్టు స‌మాచారం. ఒకవేళ డీజీపీ పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరు కాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బి నిబంధన (8) ప్రకారం సివిల్ కోర్టు ఇచ్చిన అధికారాలను కమిషన్ ఉపయోగించవచ్చని.. హాజరు కోసం సమన్లు జారీ చేయవచ్చనని ఆచారి హెచ్చరించారు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని స్పష్టం చేశారని అంటున్నారు. బీసీ క‌మిష‌న్ జోక్యంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టు అయింది. త‌న‌పై పోలీసుల‌ను ఉసిగొల్పి భ‌య‌పెట్టాల‌ని చూస్తున్న కేసీఆర్ స‌ర్కారు బెదిరింపుల‌కు బెదిరేది లేద‌న్నారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఎలాంటి కుట్ర‌ల‌నైనా ధైర్యంగా ఎదుర్కొంటాన‌ని.. గోడ‌కు కొట్టిన బంతిలా ఎదురుదాడి చేస్తానంటూ స‌వాల్ విసురుతున్నారు చింత‌పండు న‌వీన్‌.  

మల్లన్న మాటల్లో తప్పేముంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

ఈటల రాజేందర్ రాజీనామా, తర్వాత పరిణామాలపై ఎక్కడా మాట్లాడలేదు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికపైనా స్పందించలేదు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దళిత దండోరా సభలలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా కౌంటర్ ఇవ్వలేదు కేటీఆర్. కాని సడెన్ గా రూట్ మార్చారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని కేటీఆర్ అన్నారు. చెంపమీద కొడతా అన్నందుకే  మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిందని చెప్పారు. కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా జర్నలిజం ముసుగులో కేసీఆర్ ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారంటూ పరోక్షంగా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని. ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా అని కేటీఆర్ అన్నారు.  రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కేటీఆర్. మంత్రి మల్లారెడ్డి కి జోష్ ఎక్కువ.. ఓ మాట అన్నారు తప్పేముంది అంటూ వెనకేసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేంటిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముందు మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి గజ్వేల్ సభ  గురించి మాట్లాడితే మంచిదన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు కొడంగల్ నుంచి తరిమితే.. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరి లో గెలిచాడని చెప్పారు. కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు ఏజెంట్ ను పీసీసీ చీఫ్ గా చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చంద్రబాబు మాటలు నమ్మి ఓటుకు నోటు దొంగ ను కాంగ్రెస్ నేతలు  పీసీసీ చేశారని చెప్పారు. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నడని కేటీఆర్ అన్నారు. చిలక మనదే అయినా మాట్లాడిస్తున్నది చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో  చెప్పాలన్నారు కేటీఆర్. ఇంకా ఏవైనా భూములు ఉంటే అమ్మడానికి చూస్తున్నారా అని సెటైర్ వేశారు. మేక్ ఇన్ ఇండియా అని సేల్ ఇండియా చేస్తున్నారని విమర్శించారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వీటి గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు.  పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి తెలుసుకుని.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెప్పాలని సంజయ్ కు సలహా ఇచ్చారు కేటీఆర్. 

లోకేష్ డెడ్ లైన్ కి ఇంకా 10 రోజులే.. జగన్ రెడ్డి సర్కార్ కు పరీక్షే? 

ఆంధ్రప్రదేశ్ రాష్టం నేరాలు ఘోరాలకు నిలయంగా మారింది. హత్యలు నిత్యకృత్యంగా మారాయి. నిర్భయ చట్టం ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితులలో మహిళలలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, హత్యలు యధేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి. ఇటీవల వెలుగు చూసిన మంత్రులు, అధికార పార్టీ కీలక నేతలు అసభ్య సంభాషణ సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఈ వీడియోలు నిజమో కాదో, కానీ, సామాన్య జనం మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలే ఇలా బరితెగిస్తే  ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడని వాపోతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి  జనం ఛీ’ కొడుతున్నారు. తల దించుకుంటున్నారు.  రాష్ట్రంలో నడిరోడ్డు మీద పట్టపగలు హత్యలు జరిగిన పట్టించుకునే నాధుడు లేడు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూతవేటు దూరంలో సాముహిక హత్యాచారం జరిగినా, మరో నేరం జరిగినా, ఎవరూ పట్టించుకోరు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో శాంతి భద్రతలు దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్నాయని  అధికార  గణాంకాలే  తెలియచేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జరిగిన, జరుగున్న దాడులు, హత్యలకు లెక్కలు లేవు.   కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. అందుకే, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని 21 రోజుల్లో  శిక్షించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.అంతే కాదు ట్విటర్ వేదికగా కౌంట్ డౌన్  స్టార్ట్ చేశారు. ఏ రోజుకు ఆ రోజు గడువును గుర్తు చేస్తున్నారు.  ఇందులోభాగంగా  నారా లోకేష్ ట్వీట్ ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, కౌంట్ డౌన్ గుర్తు చేయడంతో పాటుగా, గట్టిగా వాతలు పెట్టారు.  రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ‘దిశ’ చట్టం తెచ్చామని, లక్షల రూపాయలు ఖర్చి పెట్టి సొంత పత్రికలో ప్రచారం చెసుకున్న ముఖ్యమంత్రి ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. అలాగే, ‘దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేశామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. దీని పై ముఖ్యమంత్రే వివరన ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో  ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు.  ఇక 10 రోజులే మిగిలాయి రమ్యని అంతం చేసిన క్రూరుడికి ఉరి ఎప్పుడు?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.  

స్టూడెంట్ హాస్ట‌ల్స్ బంద్‌.. పిల్ల‌ల క‌డుపుకొట్టిన కేసీఆర్ స‌ర్కార్‌..

క‌డుపు నిండితేనే చ‌క్క‌గా చ‌దువుకునేది. ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతుంటే ఎవ‌రికైనా చ‌దువు ఒంట‌బ‌డుతుందా? అస‌లే పేద విద్యార్థులు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని త‌ల్లిదండ్రులు. ఆలాంటి దుర్భ‌ర ఆర్థిక ప‌రిస్థితుల నుంచి డిగ్రీ దాకా రావ‌డ‌మే మ‌హాగొప్ప‌. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి.. తెలివితే డిగ్రీ సీటు సంపాదించిన అలాంటి వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డున ప‌డే దుస్థితి దాపురించింది. కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న అడ్డ‌గోలు నిర్ణ‌యంతో చ‌దువు అర్థాంత‌రంగా ముగించాల్సి వ‌స్తోంది.  అవును, కేసీఆర్ ప్ర‌భుత్వం విద్యార్థుల పొట్ట‌పై కొట్టింది. పిల్లల గూడు చెద‌ర‌గొట్టింది. ఈ విద్యాసంవ‌త్స‌రం తీసుకున్న ప‌నికిమాలిన నిర్ణ‌యంతో డిగ్రీ చ‌దువుకునే వాళ్లు ప‌స్తులు ఉండాల్సి వ‌స్తుంది. తాజాగా, హైద‌రాబాద్‌, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని నిజాం కాలేజీ, కోఠి మ‌హిళా క‌ళాశాల‌, సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప‌రిధిలోని డిగ్రీ విద్యార్థుల‌కు ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో అడ్మిష‌న్లు నిలిపేయాల‌ని ఓయూ నిర్ణ‌యించింది. ఈ యేడాది డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరే స్టూడెంట్స్‌కు ఇక‌పై హాస్ట‌ల్స్ ఇవ్వ‌రు. డిగ్రీ కాలేజీలో అడ్మిష‌న్ ఇస్తారు కానీ, హాస్ట‌ల్స్ మాత్రం ఇవ్వ‌మంటూ ప్ర‌క‌టించింది ఓయూ. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  ప్ర‌భుత్వ‌ డిగ్రీ కాలేజీలో చేరేది ఎవ‌రు? అత్యంత పేద విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. వారిలో చాలామందికి హైద‌రాబాద్ కొత్త కూడా. అలాంటిది ఇక‌పై కాలేజ్‌ హాస్ట‌ల్స్ ఇవ్వ‌మంటే.. వారంతా న‌గ‌రంలో ఎక్క‌డ ఉంటారు? ఎలా తింటారు? కాలేజీల‌కు ఎలా వ‌స్తారు? ప్ర‌స్తుత కొవిడ్ టైమ్‌లో ప్రైవేట్ హాస్ట‌ల్స్ కూడా న‌డ‌వ‌డం లేదు. ఉన్నా.. నెల‌కు 5వేలు పెట్టందే హాస్ట‌ల్‌లో ఉంచుకోరు. నెల‌కు ఐదువేలు పెట్ట‌డ‌మంటే ఆ పేద విద్యార్థుల‌కు ఎంత క‌ష్టం. నిజాం, కోఠి, సైఫాబాద్ కాలేజీలు ఖ‌రీదైన ఏరియాల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో అద్దె గ‌ది దొర‌క‌డం చానా క‌ష్టం. ఎక్క‌డో దూరంగా ఉన్నా.. రోజూ వ‌చ్చిపోవ‌డం ఇంకా క‌ష్టం. బాయ్స్ సంగ‌తి స‌రే.. కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినుల‌కు సైతం హాస్ట‌ల్స్ క్లోజ్ చేయ‌డం ఇంకెతం దారుణం? అమ్మాయిలు ఈ మ‌హాన‌గ‌రంలో ఎక్క‌డ ఉంటారు? తోడేళ్లు తిరుగుతున్న ఈ స‌మాజంలో వారి నుంచి కాచుకొని ఎక్క‌డ ఆశ్ర‌యం పొందుతారు? పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నుకోవ‌డ‌మే ఆ పిల్ల‌లు చేసిన పాప‌మా? పేద‌రిక‌మే వారి నేర‌మా? పాల‌కులు, అధికారులు ఇంత‌టి పాపానికి ఎందుకు తెగ‌బ‌డుతున్నారు. డిగ్రీ స్టూడెంట్స్‌కు హాస్ట‌ల్స్ ఇవ్వ‌మంటూ ఉత్త‌ర్వులు జారీ చేసి.. పేద‌ల‌ను చ‌దువుల నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు? కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ గొప్ప‌లు చెబుతున్న కేసీఆర్ స‌ర్కారు.. ఇలా పేద పిల్ల‌ల‌కు కూడు-గూడు చెద‌ర‌గొడితే ఏమొస్తుంది? ఏం సాధిద్దామ‌ని ఇలాంటి అర్థంప‌ర్థంలేని అడ్డ‌గోలు నిర్ణ‌యాలంటూ విద్యార్థి సంఘాలు విమ‌ర్శిస్తున్నాయి. వెంట‌నే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.   

అఫ్గ‌న్‌లో హిందువులు, సిక్కులు సేఫేనా? నెక్ట్స్ టార్గెట్ మ‌నోళ్లేనా?

అఫ్గ‌నిస్తాన్ అదుపు త‌ప్పుతోంది. తాలిబ‌న్లకూ అదుపు చిక్క‌డం లేదు. ఎవ‌రు తాలిబ‌న్లో, ఎవ‌రు ఐఎస్ ఉగ్ర‌వాదులో అర్థం కాని క‌న్ఫూజ‌న్‌. కాబూల్ ఎయిర్‌పోర్టు ముందు జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో వంద మందికి పైగా బ‌లి తీసుకోవ‌డం అక్క‌డి దారుణ ప‌రిస్థితికి నిద‌ర్శ‌ణం. డ‌జ‌ను మంది అమెరికా సైనికుల‌తో పాటు అఫ్గ‌న్ పౌరులు, కొంద‌రు తాలిబ‌న్లు కూడా దుర్మ‌ర‌ణం పాల‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాలిబ‌న్ల ఇలాఖాలో తాలిబ‌న్ల‌నే చంపేంత సాహ‌సం చేశారంటే ఇక ముందుముందు మ‌రెన్ని దాడులు జ‌రుగుతాయో ఊహించ‌వ‌చ్చు.  కాబూల్‌లో జ‌రిగిన జంట పేలుళ్ల‌లో భార‌తీయులు తృటిలో త‌ప్పించుకున్న‌ట్టు స‌మాచారం. బాంబ్ బ్లాస్టింగ్స్‌ నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు కాబూల్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. స‌రిగ్గా పేలుళ్లు జ‌రిగిన ప్రాంతంలోనే వారంతా కొన్ని గంట‌ల పాటు వేచి ఉన్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో పేలుళ్ల‌పై హెచ్చ‌రిక‌లు రావ‌డంతో.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అల‌ర్ట్ చేయ‌డంతో.. వారంతా స్థానిక‌ గురుద్వారా కార్టె పర్వాన్‌కు తిరిగి వెళ్లిపోయార‌ని చెబుతున్నారు. ఆ భ‌య‌మే ముప్పు నుంచి త‌ప్పించింది. 160 మంది ప్రాణాల‌ను కాపాడింది. ఈ విషయం కాబుల్‌ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు గుర్నం సింగ్‌ తమకు చెప్పిన‌ట్టు అకాలీదళ్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజీందర్‌ సింగ్‌ సీర్సా తెలిపారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.   అయితే, అఫ్గ‌నిస్తాన్‌లోని సిక్కులు, హిందువుల ప‌రిస్థితి ఏమాత్రం బాగాలేద‌ని అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్‌ మూక‌ల నుంచే కాకుండా తాలిబ‌న్ల నుంచీ మ‌న‌వాళ్ల‌కి ప్ర‌మాదం పొంచిఉంద‌ని చెబుతున్నారు. తాజాగా, ఓ సిక్కు స‌మూహాన్ని విమానాశ్ర‌యంలోకి వెళ్ల‌నీయ‌కుండా తాలిబ‌న్లు అడ్డుకున్నారు. ఇటీవ‌ల ఓ హిందూ ఆల‌యంపై దాడులు చేశారు. ఆగ‌స్టు 31 వ‌ర‌కు విదేశీయుల‌పై ఎలాంటి దాడులు చేయ‌బోమంటూ ఇప్ప‌టికే తాలిబ‌న్లు ప్ర‌క‌టించినందున నెలాఖ‌రు వ‌ర‌కు తాలిబ‌న్ల నుంచి ఇండియ‌న్స్ సేఫ్ అనే చెప్పాలి. ఆ గ‌డువు ముగిస్తే.. ఫ‌స్ట్ టార్గెట్ సిక్కులు, హిందువుల‌నే అనుమానిస్తున్నారు. ఎందుకంటే, ఆగ‌స్టు 31 వ‌ర‌కూ అమెరికా, బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీయులు ఎవ‌రూ మిగ‌ల‌క‌పోవ‌చ్చు. భార‌త్ ఎంతగా చొర‌వ‌చూపుతున్న త‌ర‌లింపు ప్ర‌క్రియ మాత్రం స్లో గానే సాగుతోంద‌ని అంటున్నారు. స్వ‌త‌హాగా హిందూ ధ్వేషంతో ర‌గిలిపోయే ముష్క‌ర మూక‌లు.. డెడ్‌లైన్ ముగిశాక చెల‌రేగిపోతార‌ని ప్ర‌మాదాన్ని శంకిస్తున్నారు. అందుకే, పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ సిక్కులు, కొద్ది మంది ఉన్న హిందువులు ఆగ‌స్టు 31లోగా అఫ్గ‌నిస్తాన్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆరాట ప‌డుతున్నారు.   

పెళ్ళయితేనే పార్కులోకి ఎంట్రీ! జీహెచ్ఎంసీ తీరుపై లొల్లీ..

ఇందిరా పార్క్’కు వెలుతున్నారా? ఒక్క క్షణం ఆగండి ... మీ మ్యారేజ్ సర్టిఫికేట్ జేబులో పెట్టుకుని వెళ్ళండి ... లేదంటే లోపలకి రానీయరు. అదేంటి, పార్క్ కి పెళ్ళికి ఏమిటి సంబంధం అంటారా.. ఉంది.. పెళ్ళైన జంటలకే కాని, పెళ్లి కానీ జంటలకు పార్కులోకి అనుమతి లేదని, అధికారులు పార్క్ బయట పెద్ద బోర్డు పెట్టి మరీ చెప్పారు. ఆ విధంగా పార్క్’కు ప్రేమకు, పార్క్’కు పెళ్ళికి లింక్ పెట్టి ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ అని అధికారులు బోర్డు పెట్టారు.  అసలు, విషయం ఏమంటే పార్కులలో పెళ్ళికాని ప్రేమ జంటల ప్రవర్తన శృతితప్పి గీత దాటుతోందని పిల్లలతో వచ్చిన తల్లి తండ్రులు, సీనియర్ సిటిజన్స్ ఫిర్యాదు చేశారు. అలాగే, కొన్ని కొన్ని సందర్భాలలో కొట్లాటలు గొడవలు వంటి ఇతర సమస్యలు తలెత్తడంతో అధికారులు పెళ్ళికాని ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ .. అని బోర్డ్ పెట్టారు.  అయితే, అది  సోషల్ మీడియాలో వైరలై, అధికారులు ‘మోరల్ పోలీసింగ్’  పై  జనం విరుచుకు పడ్డారు. స్వేచ్చకు సంకెళ్ళు వేస్తారా? అంటూ  చీవాట్లు పెట్టారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దిగి వచ్చారు. కట్టిన బ్యానర్ విప్పేశారు. నగర మేయర్ విజయలక్ష్మి సహా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్రింది స్థాయి సిబ్బంది తెలియక చేసిన తప్పుగా చెప్పు కొచ్చారు. సంజాయిషీ ఇచ్చుకున్నారు. అలాగే, పెళ్ళికాని జంటలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారాలు విచారం కూడా వ్యక్తపరిచారు.  ఇంతవరకు అంతా బానే ఉంది. అయితే, బ్యానర్ విషయంలో అధికారులను అలర్ట్ చేసిన సామాజిక కార్యకర్త పేర్కొన్న విధంగా ఇలా బహిరంగ ప్రదేశాలలో ప్రవేశంపై అక్షలు రాజ్యాంగ విరుద్ధమా, కాదా అనేది న్యాయ నిపుణులు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న. నిజానికి, దేశంలో ఒక్క మన ఇందిరా పార్క్’లోనే కాదు, ఇంకా అనేక బహిరంగ ప్రదేశాలలోకి కూడా అందరినీ అనుమతించరు. ఆ మధ్య శబరిమల, శని సింగపూర్  ఆలయాలలోకి మహిళలను అనుమతించక పోవడంఫై  పెద్ద దుమారామే చెలరేగింది. న్యాయస్థానాల జోక్యంతో కానీ, ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ, అన్ని మతాల ప్రార్థనా స్థలాలో వివిధ రకాలఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.  ఆఫ్గానిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న నేపధ్యంలో ఆ దేశంలో మహిళల పై విధించిన ఆంక్షలు మన దేశంలోనూ చర్చకు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు, మేథావులు, రాజకీయ పార్టీలు, తాలిబాన్లు అమలు చేస్తున్న, షరియా చట్టాలను సైతం సమర్ధిస్తున్నారు. మన దేశంలో మాత్రం విచ్చలవిడి తనాన్ని కట్టడి చేసినా, మోరల్ పోలీసింగ్’ అంటూ విమర్శిస్తున్నారు.అయితే, ఏ సమాజంలో అయినా, సామాజిక  కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. ఉండాలి కూడా .. కానీ, కట్టుబాట్లు కట్లు తెంచుకో కూడదు. అలాగే, స్వేచ్చకు పరిధులు, పరిమితులు ఉంటాయి.  నిజానికి హైదరాబద్ నగరంలో మోరల్ పోలీసింగ్ కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సం రోజున.. ఒక్క ఇందిరా పార్క్ మాత్రమే కాదు, జీహెచ్ఎంసీ పరిధిలోనే అన్ని పార్కులలోకి  ప్రేమ జంటల ఎంట్రీపై  హైదరాబాద్ పోలీసులే ఆంక్షలు విధించారు. భజరంగ దళ్ వంటి సంస్థల మోరల్ పోలీసింగ్ కు చెక్  పెట్టేందుకే, నగర పోలీసులు ఆంక్షలు విధించవలసి వచ్చిందని అధికారులు అంటున్నారు. అయితే అదీ ఇదీ ఏదీ కూడా గీత దాటకుండా ఉంటేనే మంచింది. అందుకే పెద్దలు,  ‘అతి సర్వత్ర వర్జియేత్’ అంటారు. 

AP స్కూల్స్‌లో క‌రోనా బెల్స్‌.. స్టూడెంట్స్, పేరెంట్స్‌లో టెన్ష‌న్‌...

ఓవైపు స్కూళ్లు.. మ‌రోవైపు కొవిడ్ కేసులు.. సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టే కరోనాతో స‌హ‌జీవ‌నం చేసే రోజులు వ‌చ్చేసిన‌ట్టున్నాయి. వ‌ద్దు వ‌ద్దంటున్నా బ‌ల‌వంతంగా స్కూల్స్ రీఓపెన్ చేయ‌డంతో బ‌డుల‌కు వెళ్ల‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు వ‌చ్చాయి. సెకండ్ వేవ్ మ‌ధ్య‌లో ఉన్నామ‌ని కేంద్రం చెబుతోంది.. సెప్టెంబ‌ర్‌లోనే  థ‌ర్డ్ వేవ్ అంటూ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఇలాంటి భ‌యాందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఇటు స్టూడెంట్స్‌, అటు పేరెంట్స్ బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పుతున్నారు. స్కూల్‌కి వెళ్ల‌క‌పోతే వెన‌క‌బ‌డిపోతామేమోన‌నే భ‌యం. బ‌డికి వెళితే ఎక్క‌డ క‌రోనా కాటేస్తుందోన‌నే టెన్ష‌న్‌. ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అవ‌డం.. క‌రోనా కేసులు పెర‌గ‌డం.. బ‌డుల్లో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకేరోజు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం మాత్రం అంత సులువైన విష‌యం కాద‌ని మ‌రోసారి తేలిపోయింది. విద్యార్థులు వైర‌స్ బారిన ప‌డుతుండ‌టంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మ‌రింత పెరిగిపోతోంది. ప్రకాశం జిల్లా వీరేపల్లి, వెదుల్లచెరువు పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి, వట్లూరు జడ్పీ హైస్కూళ్లలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వ‌చ్చింది. కృష్ణా జిల్లా శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు కొవిడ్‌ క‌న్ఫామ్ అయింది. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. కరోనా కేసులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోననే ఆందోళనల మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను భ‌యం భ‌యంగానే బడులకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు ఆందోళనలతో విద్యా బోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు 85 శాతానికి చేరువైంది. పిల్ల‌ల సంఖ్య పెర‌గ‌డం.. క‌రోనా కేసులు మొద‌ల‌వ‌డం సర్వత్రా భయాందోళ రేపుతోంది.   

ఏప్రిల్ నుంచే పెంచిన ఆస్తి పన్ను వసూల్.. జనాలకు జగన్ సర్కార్ డబుల్ షాక్ 

ఏపీ సర్కార్ మళ్లీ మాట తప్పింది. సీఎం జగన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారు. ఆస్తిపన్నుపై ప్రజలకు భారీ షాకిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆస్తి పన్ను పెంపు ఉండబోదంటూ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఎన్నికలన్ని ముగియడంతో ఇప్పుడు దొంగ దెబ్బ కొట్టింది. గతంలో పెంచాలని నిర్ణయించిన మేరకు ఆస్తి పన్ను ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్ధానిక సంస్ధలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంతో ఆస్తి పన్ను పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఆస్తిపన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాని అమలు చేయలేదు. ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలపై  తీవ్ర అభ్యంతరాలు రావడంతో వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తిపన్ను పెంపుపై ఊహాగానాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పుడే కాదన్నట్లుగా చెప్పుకుంది.  కానీ సరైన సమయం చూసి పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది.  ఏప్రిల్ 1 నుంచే అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొదలైన నాటి నుంచే ఆస్తిపన్ను పెంపు వర్తిస్తుందని తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తానికి ఆస్తిపన్ను పెరిగినట్లు లెక్క. ఈ మేరకు పట్టణ స్ధానిక సంస్ధలైన నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా. ప్రభుత్వ తీరుతో పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి  పట్టణ స్ధానిక సంస్ధల్లో ఆస్తిపన్ను పెంపుపై ఆర్దిక సంవత్సరం ఆరంభంలోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. వీటి ఆధారంగా ప్రజలు పన్నుల చెల్లింపు పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్నుపెంచినట్లు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి రావడంతో ప్రభుత్వం మరో స్పెషల్ నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో గతంలో ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో జారీ చేసిన నోటీసుల ప్రకారం పన్ను చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగిలిన పన్ను చెల్లించేలా ఈ స్పెషల్ నోటీసుల జారీ ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నోటీసుల జారీ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను ఇప్పటివరకూ పట్టణ స్ధానిక సంస్ధల పరిధిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయా ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది.  గతంలో వార్షిక అద్దె విలువ ఆయా ఇళ్ల పరిస్ధితి, నమూనా ఆధారంగా నిర్ణయం అయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లో దానికి ఉన్న విలువ, రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా నిర్ణయం కాబోతోంది. అందుకే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పన్ను పెంపుతో పాటు దాన్ని మదింపు విధానం కూడా మారడం డబుల్ షాక్ కానుంది. దీంతో గతంతో పోలిస్తే భారీగా ఆస్తిపన్ను పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విధానం అమలైతే భవిష్యత్తులో పెరిగే రిజిస్ట్రేషన్ ధరలు, భూముల విలువలు కూడా కచ్చితంగా ఆస్తిపన్నును నిర్ణయించడం ఖాయంగా తెలుస్తోంది. ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు రాగానే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలు, స్వచ్చంద సంస్ధలు, ప్రజా సంఘాలు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. బయట కూడా ఆందోళనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ పన్నుల పెంపుపై ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీకి ఓటేస్తే గెలిచాక పన్నులు పెంచేస్తారని విపక్షాలు జనాన్ని అప్రమత్తం చేశాయి. అయినా ప్రజలు మాత్రం వైసీపీకే ఓటేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న జగన్ సర్కార్ ఆస్తిపన్ను పెంపుపై ప్రజలకు భారీ షాకిచ్చింది. గతంలో వరుస ఎన్నికలు జరగడం, వాటిలో గెలుపు వైసీపీ సర్కార్ కు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని దాచిపెట్టింది. ఇప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, పన్నులు పెంచినా వచ్చే ప్రజావ్యతిరేకతతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో ప్రభుత్వం అదను చూసి భారీ దెబ్బ కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోణంలో ఆస్తిపన్ను వాయిదా వేసి ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ నుంచే పెంపు వర్తిస్తుందని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఆస్తి పన్ను పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. తాజా నోటీసులపై మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.