మంత్రి మల్లారెడ్డి భూ అక్రమణలు ఇవే? నిరూపించడానికి సిద్ధమన్న రేవంత్
posted on Aug 28, 2021 @ 10:44AM
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. పీసీసీ నేతలు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను రాజీనామా చేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన సవాల్ పై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరోసారి మంత్రి అక్రమాలను బయటపెట్టారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మంత్రి యూనివర్సిటీ భూములు ఎక్కడి నుంచి వచ్చాయ్.. సీఎంఆర్ హాస్పిట్సల్ భూమి ఎక్కడిదనే విషయాలను బయటపెట్టారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం 1965 నాటికి గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 650లో మొత్తం 22 ఎకరాల 8 గుంటల భూమి ఉందని రేవంత్ తెలిపారు. 2001 నాటికి కూడా అదే 22 ఎకరాల భూమి ఉంది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో మాత్రం 33 ఎకరాల 26 కుంటలకి పెరిగింది. సర్వే నంబర్లో 22 ఎకరాలున్న భూమి అమాంతం 33 ఎకరాలకు ఎలా పెరిగిందని.. అదేమైనా కేసీఆర్ ముక్కా రోజూ కొంత పెరగడానికంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 650 సర్వే నంబర్ లో 33 ఎకరాల్లో 16 ఎకరాలు మల్లా రెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది. దాన్ని ఆయన మల్లా రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి. బావమరిదికి ఆస్తులుంటే నాకేం సంబంధమని చెప్పిన మల్లా రెడ్డికి గిఫ్ట్ డీడ్ కింద ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. బావ కళ్లలో ఆనందం కోసం బావమరిది ఇచ్చిండా అంటూ ఎద్దేవా చేశారు.
జవహర్ నగర్లోని సర్వే నంబర్ 488లో 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ క్రయవిక్రయాలు నిషేధించింది. ఇందుకు సంబంధించి అధికారులు పెట్టిన బోర్డుల ఫొటోలను కూడా రిలీజ్ చేశారు రేవంత్. ఇప్పుడదే భూమి రిజిస్ట్రేషన్లు జరిగి మల్లా రెడ్డి కోడలు షాలినీ రెడ్డి కొనుగోలు చేసినట్లు చూపుతున్నారని రేవంత్ చెప్పారు. అందులో సీఎంఆర్ హాస్పిటల్స్ కట్టారని తెలిపారు. మల్లా రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి షాలినీ రెడ్డి పేరు మీదకు జవహర్నగర్ వైస్ చైర్మన్ పేరుతో ఉన్న భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పదవులు ఇచ్చినందుకు లంచంగా ఆ భూమిని మింగేశారని రేవంత్ ఆరోపించారు. అసలు నిషేధిత భూమిగా అధికారులు పేర్కొన్న అదే భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయా చెప్పాలన్నారు .ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఐదేళ్ల నిషేధం విధించిందని రేవంత్ చెప్పారు. మరి అలాంటి కళాశాలని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని సీఎం కేసీఆర్ను రేవంత్ నిలదీశారు.
మేడ్చల్ పరిధిలో 50 ఎకరాల వెంచర్ వేసిన వ్యాపారులను మామూళ్ల కోసం బెదిరించిన ఆడియో టేపులు బయటికి వచ్చాయని.. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని కూడా మంత్రి మల్లా రెడ్డిపై ఆరోపణలు వచ్చాయని రేవంత్ అన్నారు. తన మంత్రివర్గంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేంది లేదని.. చివరికి తన కొడుకు, కూతురైనా ఊరుకునేది లేదని కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్యని పీకేసి.. భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేందర్ను బయటికి పంపించిన కేసీఆర్కి మల్లా రెడ్డి అవినీతి ఎందుకు కనపడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. దొంగగా ఉన్న మల్లా రెడ్డిని గజదొంగని చేసి పక్కన పెట్టుకున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.