అఫ్గన్పై అమెరికా డ్రోన్ అటాక్.. ప్రతీకార దాడిలో ఐసిస్ కీలక నేత హతం!
posted on Aug 28, 2021 @ 1:15PM
సూసైడ్ అటాక్తో 13 మంది అమెరికా సైనికులను చంపేశారు ముష్కర మూకలు. అఫ్గన్లో అగ్రరాజ్యానికి గట్టి సవాల్ విసిరారు ఐసిస్ ఉగ్రవాదులు. తాలిబన్ల ముసుగులో అమెరికాపై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. తమ సైనికులను కోల్పోయిన అమెరికా.. దెబ్బ తిన్న పులిలా తిరిగి అటాక్ చేసింది. ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఐసిస్ టార్గెట్గా అఫ్గనిస్తాన్లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ అటాక్తో ఐసిస్కు చెందిన కీలక నాయకుడిని హతమార్చినట్టు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర జరిగిన బాంబుదాడి సూత్రధారి అతనేనని తెలుస్తోంది. పక్కా నిఘా, శాటిలైట్ సమాచారం మేరకు.. ఆ పెద్ద తలకాయపై నేరుగా డ్రోన్ అటాక్ చేసింది అమెరికా.
మరోవైపు, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా పౌరులు సహా ఇతరుల తరలింపు కార్యక్రమం తుది దశకు చేరుకుంది. అయితే, మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ఆమోదించడంతో వేగంగా యాక్షన్లోకి దిగాయి అమెరికా బలగాలు.
గురువారం కాబుల్ విమానాశ్రయం బయట జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రకటించింది. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి, వేటాడుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లకు తెగబడిన ఐసిస్ మూకలపై దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. బైడెన్ ఆదేశించిన 24 గంటల్లోనే అమెరికా డ్రోన్ అటాక్తో ఐసిస్ కీలక నేతను హతమార్చడం యూఎస్ ఆర్మీ సత్తాకు నిదర్శనం.