డ్రగ్స్ కేసులో రానా, రకుల్ కు నోటీసులు? కేటీఆర్ ఆందోళనగా ఉన్నారన్న రేవంత్..
posted on Aug 27, 2021 @ 9:09PM
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారా? ఆయన సన్నిహితులు కొందరు ప్రమాదంలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి. తన సన్నిహితులు ఇబ్బందుల్లో పడటంతో కేటీఆర్ కలవరపడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారని, ఆయన స్నేహితులకు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆయన సన్నిహితులకు నోటీసులు రావడంతో కేటీఆర్ భయపడుతున్నారన్నారు. గతంలో కేటీఆర్ గోవాకు వెళ్లి వచ్చారని, ఈ గోవా పర్యటన అధికారికమా.. అనధికారికమా అని రేవంత్ ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసులో తాను కూడా హైకోర్టులో ఈడీ, సీబీఐలను సవాల్ చేస్తూ పిల్ వేశానని, ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈడీ కౌంటర్ దాఖలు చేసిందని రేవంత్రెడ్డి వెల్లడించారు. మంత్రిగా కేటీఆర్ గోవా పర్యటనను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో విచారణ చేస్తామని ఈడీ, సీబీఐ అంటుంటే ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కష్టాల్లో పడిన కేటీఆర్ సన్నిహితులు ఎవరూ అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది.
నాలుగేండ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు సిని ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో తాజాగా ఈడీ దూకుడు పెంచడంతో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. ప్రముఖ సినీనటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. నాలుగేండ్ల కిందట తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో దగ్గుబాటి, రకుల్ పేర్లు లేవు. రానా ఇంతవరకు విచారణకు కూడా హాజరు కాలేదు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో హవాలా ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్ల జాబితాలో ఈ ఇద్దరిపేరు ఉన్నాయని తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో అనుమానితుల జాబితాలోనూ లేని వీళ్లకు ఈడీ సమన్లు జారీ చేసింది? అనేది మిస్టరీగా మారింది. కావాలనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇంతకాలం వారి పేర్లను దాచి పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను 2017 జూలైలో ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా దాదాపు 60 మందిని విచారించారు. అందులో సుమారు10 మందికి పైగా సినీ ప్రముఖులున్నారు. ఈ కేసు నెల రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగు సినీరంగాన్ని కుదిపేసింది. సినీ రంగ ప్రముఖులతో పాటు డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చిన మరి కొంతమంది రక్తం నమూనాలు, గోళ్లు, జుట్టు నమూనాలను కూడా తీసుకొని పరీక్షలకు పంపారు. ఆ తర్వాత ప్రభుత్వం కేసును పక్కన పెట్టింది. కేసులో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ను బదిలీ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాపై 12 కేసులు నమోదు చేసి 11 చార్జిషీట్లను దాఖలు చేసి చేతులు దులుపుకున్నది.
డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెట్టిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వాస్తవాలను వెలుగులోకి తెచ్చి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది రేవతి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తోపాటు సీబీఐ, ఎన్సీబీ, డీఆర్ఐల జోక్యాన్ని కోరారు. ఇదే అంశంపై రాష్ట్రపతికి కూడా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు నుంచి వివరాలను వెల్లడించాలని ఆదేశాలు వచ్చినా రాష్ట్ర అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈడీ బాలీవుడ్, శాండిల్వుడ్తోపాటు టాలీవుడ్పైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లు, అనుబంధ పత్రాలను పరిశీలించింది. అందులో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయా? లేదా? అనేది అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ ఎలెక్స్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది.