కరోనా కొత్త వేరియంట్.. ఇండియాకి ఇంకా రాలేద‌ట‌.. వ‌చ్చాక‌ ప‌రిస్థితేంటి?

C.1.2. క‌రోనా కొత్త వేరియంట్‌. ఈ పేరు చెబితేనే యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. ఆల్ఫా, డెల్టాల‌తోనే చ‌చ్చిపోతుంటే.. ఇక ఇంకో కొత్త వేరియంట్ విజృంభిస్తే ప‌రిస్థితి ఏంటంటూ బెంబేలెత్తిపోతోంది. ఈ కొత్త మ్యూటెంట్‌కు కొవిడ్ టీకాల‌నూ ఎదుర్కొనే సామ‌ర్థం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటుండ‌టంతో మ‌రింత డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో మొద‌ట గుర్తించగా.. ఇప్ప‌టికే చైనా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ త‌దిత‌ర దేశాల‌కు వ్యాపించిన‌ట్టు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింద‌ది. ఇప్పటి వరకు ఉన్న అన్ని వేరియంట్లతో పోలిస్తే C.1.2 మ‌రింత డేంజ‌ర‌స్ అని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టం క‌ల‌వ‌రం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండ‌టంతో స‌ర్వ‌త్రా ఆందోళన వ్యక్తమ‌వుతోంది. అయితే , ప్రస్తుతానికి ఈ రకం వేరియంట్ భారత్‌లోకి ఇంకా ప్రవేశించలేదని కేంద్రం వెల్లడించడం ఒక్క‌టే కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్ప‌టికింకా రాక‌పోయినా.. భ‌విష్య‌త్తులో వ‌స్తే? ఏంటి ప‌రిస్థితి? మ‌న దేశం ఈ కొత్త వేరియంట్‌ను ఫేస్ చేయ‌గ‌ల‌దా? దాని ముందు వ్యాక్సిన్లూ ప‌నికిరాక‌పోవ‌చ్చని అంటుంటే.. అది అంత ఖ‌త‌ర్నాకా? థ‌ర్డ్ వేవ్ దీనితోనేనా? అనే భ‌యాందోళ‌న‌లు.  మ‌రోవైపు.. దేశ‌వ్యాప్తంగా కొత్త కేసులు, మరణాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కేసుల సంఖ్య‌ 47వేలు దాటగా.. మరణాలు కూడా 500పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత ఇదే కావ‌డం ఆందోళ‌న‌క‌రం. అయితే, వీటిలో 70శాతం కేరళలోనే ఉండ‌టం ఆ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.  కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. అక్క‌డ‌ బుధవారం ఒక్కరోజే 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు కేర‌ళ‌ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,89,583 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.19శాతానికి పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

పావురాల‌గుట్టలో ఆ రోజు అస‌లేం జ‌రిగింది..? మిస్ట‌రీనా? క్లారిటీనా?

సెప్టెంబర్ 2, 2009. చిత్తూరు జిల్లాలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి హైద‌రాబాద్ నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి. అంతే. ఒక్క‌సారిగా అంతా ఉలిక్కిప‌డ్డారు. మొద‌ట అదేదో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ అనుకున్నారు. స‌మ‌యం గ‌డుస్తున్నా.. హెలికాప్ట‌ర్‌తో కాంటాక్ట్ దొర‌క్క‌పోవ‌డంతో అనుమానం మొద‌లైంది. అంత‌లోనే అది ఆందోళ‌న‌కు దారి తీసింది. దేశ‌మంతా ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయింది. కేంద్ర ప్ర‌భుత్వ‌మూ వెంట‌నే స్పందించింది. స్థానిక పోలీసులు, అధికారుల‌తో పాటు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. గంట‌ల త‌ర‌బ‌డి సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రిపారు.  ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. ఆ ప్రాంతం పావురాల‌గుట్ట‌. హెలికాప్ట‌ర్ కూలిన ప్ర‌మాదంలో నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో స‌హా మొత్తం ఐదుగురు మరణించారు.  వైఎస్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. యాక్సిడెంటల్‌గా జరిగిందా? లేదంటే ఎవరిదైనా హస్తముందా? జాతీయ స్థాయి కుట్ర దాగుందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు. సీబీఐ సైతం వైఎస్సార్ మ‌ర‌ణంపై విచార‌ణ జ‌రిపింది. అయితే వైఎస్‌ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు మాత్రం ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయి. డీజీసీఏ, సీబీఐతో పాటు మరో రెండు దర్యాప్తు సంస్థలు ఒకే విషయం వెల్లడించాయి. అప్ప‌టి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆ హెలికాప్టర్ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేసిన జేడీ లక్ష్మినారాయణ.. ఆ త‌ర్వాత ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చేసిన వ్యాఖ్య‌లు వైఎస్ మ‌ర‌ణంపై క్లారిటీ ఇచ్చాయి. ఇక‌, విచార‌ణ సంస్థ‌ల‌న్నీ అది ప్ర‌మాద‌మేన‌ని.. ఎలాంటి కుట్ర లేక‌పోవ‌చ్చ‌ని నివేదిక‌లు ఇచ్చాయి.  ఇక జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఏమ‌న్నారంటే.. అందరిలాగే తమకు కూడా కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలు వచ్చాయని.. ఆ ప్రమాదం యాక్సిడెంటల్‌గా జరిగిందా.. లేదంటే ఎవరైనా చేయించారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశామని తెలిపారు. ఆడియో విజువల్స్‌తో కూడిన ఓ రిపోర్ట్ రూపొందించి రిలీజ్ చేశామన్నారు. అది పూర్తిగా యాక్సిడెంటల్‌గా జరిగిందనే విషయం అందులో ప్రెజెంట్ చేశామని తెలిపారు. ఆ రోజు వాతావరణం సరిగా లేదన్నారు జేడీ. క్యుములో నింబస్ మేఘాలే వైఎస్ ప్ర‌యాణించిన‌ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని వివరించారు. ఆ మేఘాల్లో వాక్యూమ్ నిండి ఉంటుందని.. అవి హెలికాప్టర్‌ను లాగేస్తుంటాయని తెలిపారు. ఆ క్రమంలో మేఘాల్లోకి హెలికాప్టర్ ప్రవేశించిందని.. దాంతో హెలికాప్టర్ యాక్సిడెంటల్‌గా కూలిపోయిందని జేడీ ల‌క్ష్మినారాయ‌ణ వివ‌రించారు.  ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని.. బ్లాక్ బాక్స్‌లో రికార్డయిన సంభాషణలు విన్నామని.. అటు వాతావరణ శాఖ, సివిల్ ఏవియేషన్ నిపుణుల సాయంతో రిపోర్ట్ రూపొందించామని గ‌తంలో జేడీ చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా యాక్సిడెంటల్‌గా జరిగిన ప్రమాదమని తేల్చిందని గుర్తు చేశారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాద సమయంలో కో పైలెట్ కెప్టెన్ ఎంఎస్ రెడ్డి 'గో అరౌండ్' అంటూ బిగ్గరగా అరిచినట్లు బ్లాక్ బాక్స్‌లో రికార్డయిందని గుర్తు చేశారు జేడీ. గో అరౌండ్ అనేది ఎమర్జెన్సీ సమయంలో వాడే ఒక బటన్ అని.. అది నొక్కితే సడెన్‌గా హెలికాప్టర్ పైకి లేస్తుందని వివరించారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్‌లో వాడే ఫ్యూయల్, లూబ్రికెంట్స్‌ వాడకం ఒక్కసారిగా పెరిగి రెడ్ లైట్ వస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఆయన గో అరౌండ్ అని అరిచారని.. ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కితే హెలికాప్టర్ పైకి లేస్తుందని అలా చెప్పి ఉంటారని అన్నారు. ఒక్కోసారి హెలికాప్టర్లు ల్యాండయ్యే సమయంలో గేదెలు తదితర జంతువులు అడ్డొస్తే గో అరౌండ్ బటన్ నొక్కుతారని.. దాంతో హెలికాప్టర్ సడెన్‌గా దానంతట అదే పైకి వెళుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్య‌క్త‌మైన‌ప్పటికీ.. జరిగింది మాత్రం కేవ‌లం ప్ర‌మాద‌మేన‌ని అన్ని ద‌ర్యాప్తు సంస్థ‌లు పూర్తిస్థాయి ద‌ర్యాప్తు త‌ర్వాత వెల్ల‌డించిన విష‌యం. అయితే, వైఎస్సార్ మ‌ర‌ణాన్ని కొంద‌రు రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఆ త‌ర్వాత కాలంలో వైఎస్సార్ మ‌ర‌ణం.. పావురాల‌గుట్ట హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై వ‌చ్చిన అనుమానాల‌న్నీ క్ర‌మ‌క్ర‌మంగా క‌నుమ‌రుగ‌య్యాయి. వైఎస్సార్ మ‌ర‌ణించి 12 ఏళ్లు గ‌డుస్తోంది.

అన్న‌.. చెల్లి.. తల్లి.. వైఎస్‌ స‌మాధి సాక్షిగా ఏం మెసేజ్ ఇచ్చిన‌ట్టు?

వ‌స్తారా? రారా? అనుకున్నారు. క‌లుస్తారా? లేరా? అని చూశారు. జ‌యంతికి ఎవ‌రి దారి వారిదే. ఉద‌యం త‌ల్లి, చెల్లి.. సాయంత్రం అన్న‌. ఆనాడు తండ్రి స‌మాధి సాక్షిగా కుటుంబ విభేదాలు బ‌య‌ట‌పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల్లో అబాసుపాల‌య్యారు. అన్న జైలు కెళితే.. పార్టీ కోసం త‌ల్లి, చెల్లి అంత చేస్తే.. ఇప్పుడేంటి.. అంద‌ల‌మెక్కాక అన్న‌.. ఆ ఇద్ద‌రినీ దూరం పెట్టేశార‌ని.. వైఎస్సార్ అభిమానులే జ‌గ‌న్‌ను చీద‌రించుకున్నారు. అందుకే, జ‌యంతి రోజున అంత ర‌చ్చ జ‌రిగింది కాబ‌ట్టే.. ఇప్పుడు వ‌ర్థంతికి ఏం జ‌రుగుతుందోన‌ని అంతా ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. అన్ని క‌ళ్లూ ఇడుపుల‌పాయ వైపే చూశాయి.  సెప్టెంబ‌ర్ 2. ఆ రోజు రానే వ‌చ్చింది. ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వైఎస్సార్ 12వ వ‌ర్థంతికి ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ ఘాట్‌లో గంభీర వాతావ‌ర‌ణం క్రియేట్ అయింది. జ‌యంతి మాదిరి అన్నా, చెల్లి, త‌ల్లి.. వేరు వేరుగా వ‌స్తారా? ఒక తండ్రి బిడ్డ‌లుగా ఆ ఇద్ద‌రూ క‌లిసే నివాళులు అర్పిస్తారా? అని అంతా అటెన్ష‌న్‌. ఆ గ‌డియ వ‌చ్చే స‌రికి కాస్త క్లారిటీ.. మ‌రికాస్త క‌న్ఫ్యూజ‌న్ ఏర్ప‌డింది. మ‌ళ్లీ ఎటూ తేల‌కుండా.. అదే గ‌డిబిడి కొన‌సాగుతోంది. అన్న వ‌చ్చాడు. తల్లితో క‌లిసి చెల్లి కూడా వ‌చ్చింది. వైఎస్సార్‌కు నివాళి అర్పించేందుకు కుటుంబం అంతా త‌ర‌లివ‌చ్చారు. అది కూడా అంతా ఒకేసారి వ‌చ్చారు. త‌ల్లి, చెల్లి, అన్న‌.. ఆ ముగ్గురూ ప‌క్క ప‌క్క‌నే కూర్చుకున్నారు. మ‌త ప్రార్థ‌న‌లు జ‌రుగుతుండ‌గా.. మౌనంగా వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వ‌చ్చిన దారినే ఎవ‌రి మానాన వారు వెళ్లిపోయారు.  ఒక మాటా లేదు.. ఒక మంతీ లేదు.. ఒక న‌వ్వూ లేదు.. ఒక ప‌ల‌క‌రింపూ లేదు. ముగ్గురి ముఖాలూ మాడిపోయి ఉన్నాయ‌ని అంటున్నారు. బ‌హుషా వైఎస్సార్‌ వ‌ర్థంతి క‌దా.. ఆయ‌న జ్ఞాప‌కాల్లో విషాదంతో ఉండి ఉంటారు. మ‌రి, ఆ తండ్రి క‌న్న‌బిడ్డ‌లేగా.. తోడ‌బుట్టిన అన్నాచెల్లెల్లేగా.. బాగున్నావా.. అంటే ఏం పోయింది. ఓ న‌మ‌ష్కారం ప‌డేస్తే ఏ కిరీటం ప‌డిపోతుంది. త‌ల్లి సాక్షిగా.. తండ్రి స‌మాధి ముందు.. ఆ అన్నాచెల్లెల్ల జ‌గ‌డం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. వైఎస్ కుటుంబంలో పెద్ద గొడ‌వే జ‌రిగుంటుంద‌ని.. అందుకే మ‌రీ ప‌క్క ప‌క్క‌నే ఉన్నా.. ప‌ట్టించుకోనంత దూరం వారి మ‌ధ్య పెరిగిపోయింద‌ని అంటున్నారు. జ‌గ‌న‌న్న చెల్లికి పెద్ద ద్రోహ‌మే, భారీ అన్యాయ‌మే చేసుంటార‌ని చ‌ర్చించుకుంటున్నారు.  వైఎస్సార్‌ జ‌యంతి మాదిరి వేరు వేరుగా వ‌చ్చి అంద‌రినోటా ప‌డ‌కుండా.. ఒకేసారి వ‌చ్చి ఈసారికి మాత్రం కాస్త న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఫ్యామిలీ అంతా క‌నిపించి.. విభేదాల‌ను కాస్త క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు...అంటున్నారు. 

జాతీయ జంతువుగా గోవు?  చట్టం చేయాలన్న అలహాబాద్ హైకోర్టు 

హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోవు విషయంలో చాలా కాలంగా ఓ డిమాండ్ ఉంది. హిందువులకు పూజనీయమైన గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పలు సంస్థలు కోరుతున్నాయి. కొన్ని సంఘాలు ఇందుకోసం ఉద్యమాలు కూడా చేశాయి. తాజా గోవు విషయంలో ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని తెలిపింది.  గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది. సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతినే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన అలహాబాద్ ధర్మాసనం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. గోవును పూజించే వారికి, దానిపై ఆర్థికంగా ఆధారపడే వారికీ ఇది ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విజయమ్మ సమావేశం వెనుక ఆయనదే కీ రోల్? హాజరుకానున్న ఏపీ మంత్రి? 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయ్మమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంస్మరణ సభపైనే అందరి కన్ను పడింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ విజయమ్మ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 3 వందల మందికి విజయమ్మ నుంచి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ కలిసి పని చేసిన నేతలు, అధికారులు, జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మంత్రులుగా ఉన్నవాళ్లకు కూడా ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. దీంతో విజయమ్మ సమావేశానికి ఎవరెవరు వెళతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.  ఇక విజయమ్మ నిర్వహిస్తున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్ని ఒక వ్యక్తి పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలుస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం పేషీలో అడిషనల్ పీఎస్ గా వ్యవహరించిన శర్మే ఏర్పాట్లు చూస్తున్నారని చెబుతున్నారు. గతంలో వైఎస్ కార్యక్రమాలకు ఆయనే కర్త.. కర్మ.. క్రియ అనేవారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నవారిలో శర్మ.. సూరీడు.. చారి.. ప్రభాకర్ రెడ్డి.. జన్నత్ హుస్సేన్.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యులు. వైఎస్ పాల్గొనే ప్రతి కార్యక్రమం శర్మే ఫైనల్ చేసే వారని చెబుతారు. వైఎస్సార్ మరణం తర్వాత కూడా ఆయన కుటుంబంతో కలిసి ఉన్న అతి కొద్దిమందిలో శర్మ ఒకరు. అందుకే సమావేశ బాధ్యతలను శర్మకు విజయమ్మ అప్పగించారని తెలుస్తోంది.  వైఎస్సార్ సంస్మరణ సభను సక్సెస్ చేసేందుకు శర్మ తన పాత పరిచయాల్ని తిరగదోడుతున్నారని చెబుతున్నారు. సమావేశానికి ఎవరెవరిని పిలవాలి? వారికి సంబంధించిన వివరాలు.. కాంటాక్టులు అన్ని కూడా శర్మనే సేకరించినట్లు చెబుతున్నారు, కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఎవరితో నేరుగా ఫోన్లో మాట్లాడాలి? ఎవరికి మెసేజ్ లు పంపాలి? ఇలాంటివన్నివిషయాలు శర్మనే దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా విజయమ్మ ఆత్మీయ సమావేశంలో శర్మ కీలకభూమిక పోషిస్తున్నారని అంటున్నారు,  విజయమ్మ సమావేశానికి అప్పటి కేబినెట్ మంత్రులే కాకుండా గతంలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ హీరో నాగార్జున, దర్శకులు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ తదితరులకు ఆహ్వానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీకే బృందంలోని శిష్యురాలు షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది.

నార్కో అనాలిసిస్ పరీక్షకు అంగీకరించని సునీల్.. సీబీఐ ఏం చేయనుందో? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ , దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక  పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో కొన్ని రోజులుగా దూకుడుగా వెళుతున్న సీబీఐకి నిరాశ ఎదురైంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి  జమ్మలమడుగు కోర్టులో .. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని సీబీఐ  కోర్టును కోరింది. నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను న్యాయమూర్తి అడిగారు. అయితే నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో  సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు జమ్మలమడుగు కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నిబంధన కారణంగా సీబీఐకి వివేకా కేసులో నిరాశ ఎదురైంది. సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో సీబీఐ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది.  మరోవైపు సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో కేసులో చిక్కుముడి ఎలా వీడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇటీవలే వివేకా హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల నజరానా ప్రకటించింది సీబీఐ. దీంతో వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా కూతురు సునీతా రెడ్డి గతంలోనే కొందరు అనుమానితుల పేర్లను సీబీఐకి ఇచ్చింది. అందులో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది. ఇటీవలే అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసు విచారణలో జరుగుతున్న పరిణామాలతో ఈ కేసులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. 

తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళ యత్నం.. కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ రైతు డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దీంతో కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడున్నవారంతా మహిళను అడ్డుకుని డీజిల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి అనే మహిళకు ఆరెపల్లెలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే  ఆ భూమిని ఇతరుల పేరుమీద  మార్చారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భర్త యాదగిరి, కుమారుడు భానుతో కలిసి వచ్చిన ఆమె… పెట్రోల్‌ పోసి తహసీల్దారు ఆఫీసును తగలబెట్టేందుకు యత్నించింది.  తన భూములను ఇతరులకు రాసిచ్చారని మహిళ ఆరోపిచింది. కొండపాక తహశీల్దార్ తమను మోసం చేశారని మండిపడింది. లంచం తీసుకుని తమ భూమిని మరొకరి పేరుపై ఆన్ లైన్ చేశారని చెబుతోంది. తమ భూమిని మరొకరి పేరుతో రాయడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తహశీల్దార్ బెదిరిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది.  డీజిల్ బాటిల్ తో ఉన్న మహిళను గమనించిన తహసీల్దారు రామేశ్వర్‌ పోలీసులను అలెర్ట్ చేయడంతో కుకునూరుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను అడ్డుకున్నారు. భూ వివాదంపై కోర్టుకు వెళ్లాలని మహిళకు తహసీల్దారు సూచించారు. ఇకపై ఇక్కడ ఆందోళనకు చేయవద్దంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. 

'వ‌ధువు కావ‌లెను'.. షాపు ముందు బోర్డు.. విదేశాల నుంచీ ఫోన్లు..

ఇత‌ని పేరు ఉన్నికృష్ణ‌న్‌. వ‌య‌సు 33 ఏళ్లు. ఉండేది కేర‌ళ‌లో. చూట్టానికి బాగానే ఉంటాడు. సొంత షాపు కూడా ఉంది. అయినా, అత‌నికి పెళ్లి కావ‌డం లేదు. తెలిసిన వారికి, క‌లిసిన వారికి.. అంద‌రికీ త‌న‌కో సంబంధం చూడ‌మ‌ని చెబుతున్నాడు. అయినా, ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదు. చాలా కాలం వేచి చూసి.. ఇక విసుగెత్తి.. వేసారిపోతుండ‌గా.. అత‌నికో అద్బుత‌మైన ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ఐడియా త‌న జీవితాన్ని మార్చేస్తుంద‌ని అనుకున్నాడు. ఆ ప‌నితో తొంద‌ర‌లోనే త‌న పెళ్లి అయిపోతుంద‌ని భావిస్తున్నాడు. అయితే, ఇంకా పెళ్లైతే ఫిక్స్ కాలేదు కానీ.. అత‌గాడికి మాంచి పాపులారిటీ మాత్రం వ‌చ్చేసింది. సొంతూరు, రాష్ట్రం, దేశం అనే కాదు.. వివిద దేశాల్లోనూ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలిసి.. అత‌నికి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇంత‌కీ అత‌ను చేసిన ప‌నేంటంటే.... `వధువు కావలెను`.. అంటూ ఏ పేప‌ర్లోనో, మ్యాట్రిమోనీ సైట్‌లోనే ప్ర‌క‌ట‌న ఇవ్వ‌కుండా.. నేరుగా త‌న షాపు ముందు బోర్డు పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదంటూ.. ఆ బోర్డ్ పై తన ఫోన్ నంబర్ కూడా రాశాడు. షాపు కొచ్చిన వాళ్లంతా అది చూసి.. త‌మ‌కు తెలిసిన వారంద‌రికీ సంబంధం చూడ‌మ‌ని చెప్పేవాళ్ల‌ట‌. క‌స్ట‌మ‌ర్ల‌లో ఒక‌రు.. వ‌ధువు కావ‌లెను.. అనే బోర్డును ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే. ఉన్నికృష్ణన్ బోర్డు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అయింది. షేర్ల మీద షేర్లు కావ‌డంతో.. ఆ పోస్ట్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ బోర్డు మీద ఉన్న ఆయ‌న‌ నెంబ‌ర్‌కు.. తెలిసిన సంబంధం ఉందంటూ.. తెగ ఫోన్లు వ‌స్తున్నాయ‌ట‌. ఉన్ని క్రిష్ణ‌న్ వివ‌రాలు ఆరా తీస్తున్నార‌ట‌. కేర‌ళ‌తో పాటు వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి కూడా ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నార‌ట‌. సోష‌ల్ మీడియా పుణ్యాన‌.. త‌ను పెట్టిన బోర్డు కార‌ణంగా.. దెబ్బ‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా పెళ్లి సంబంధాలు వ‌చ్చి ప‌డుతుండ‌టంతో మ‌నోడు తెగ ఖుషీ అవుతున్నాడ‌ట‌. అయితే, అవన్నీ త‌న స్థాయికి మించిన మ్యాచెస్ కావ‌డంతో.. త‌న‌కు త‌గ్గ అమ్మాయి కోసం ఓపికగా అన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాడ‌ట‌.  `నేను గతంలో కూలి పని చేసేవాడిని. ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. నా తలలో కణతి ఉండటంతో గతంలో సర్జరీ జరిగింది. ఇప్పుడు కోలుకున్నా. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. ఎక్కడా సెట్ కాలేదు. అందుకే ఇలా బోర్డ్ పెట్టాను. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కొంత మంది మామూలుగా కాల్ చేసి `ఆల్ ది బెస్ట్` చెబుతున్నార`ని ఉన్నికృష్ణన్ అంటున్నాడు. 

ఏపీ కొత్త సీఎస్ ఎవరో? జగన్ బెయిల్ కేసుతో లింక్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం సెప్టెంబర్ ఆఖరుకు ముగుస్తుంది. నిజానికి గత జూన్ నెల చివరికే ఆయన రిటైర్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా సెప్టెంబర్ చివరికి ముగుస్తున్న నేపధ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ రాజకీయ,  మీడియా వర్గాలలో మొదలైంది.   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కావాలనుకుంటే, ఆయన ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించమని కేంద్రాన్ని కోరవచ్చును. కేంద్రం కూడా కాదనక పోవచ్చును. ఆవిధంగా  ఆదిత్యానాథ్ దాస్ మరో మూడు నెలలు. అంటే  డిసెంబర్ చివరి వరకు సీఎస్’గా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేద్రాన్ని మరో పొడిగింపు అడగక పోవచ్చని, అన్నీ అనుకూలిస్తే, 1988  బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పించే ఆలోచనలో ఆయన ఉన్నారని, అంతర్గత వర్గాల సమాచారం. తెలంగాణ క్యాడర్’కు  చెందిన ఆమెను జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం చాలా కష్టపడే రాష్ట్రానికి రప్పించుకున్నారు. అలాగే, చకచకా పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు శ్రీలక్షి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకు చురుకైన ఆఫీసర్’గా మంచి పేరుంది. అదే సమయంలో, జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ముద్దాయిగా, సీబీఐ విచారణ ఎదుర్కుంటున్నారు. జైలు జీవితం కూడా గడిపారు.   సాధారణ పరిస్థితులలో అయితే జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి లీగల్ ఇష్యూస్’ను అంతగా పట్టించుకోకపోవునేమో గానీ, రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్ రెడ్డి బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లో, తమకు అనుకూలమైన అధికారులను కీలక పదవులలో నియమించుకుని,  సాక్షాధారలను తారుమారు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కేసు విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వచ్చే వస్తుందని అంటున్నారు. ఈ తీర్పును బట్టి శ్రీ లక్షికి అవకాశం ఇవ్వడమా లేక  మరోకరిని సీఎస్’గా తీసుకోవడమా అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు.  ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఐఏఎస్ అధికారులలో మాజీ సీఎస్, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాదికారిగా ఉన్న నీలం సహానీ భర్త., అజయ్ సహానీ, అందరికంటే సీనియర్ అధికారి. ప్రస్తుతం డిపుటేషన్ మీద కేంద్ర సర్వీస్’లో ఉన్న ఆయన  సీఎస్  పోస్టు ఇస్తామంటే రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవలే ముఖ్యమంత్రి అభ్యర్ధన మేరకు స్టేట్ సర్వీస్ కు వచ్చిన 1985 బ్యాచ్’ ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రెడ్డి సుబ్రమణ్యం, సతీష్ చంద్ర కూడా సీనియర్ల జాబితాలో ఉన్నారు. ఎ అందరితో పాటుగా  1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు కూడా అధికార వర్గాల్లో వినవస్తోంది. అయితే శ్రీలక్ష్మి పదోన్నతికి అడ్డుగా నిలిచిన లీగల్ అవరోధాలు తొలిగి పోతే, ఆమెకే అవకాశం ఇస్తారు. కాదంటే, నీరభ్ కుమార్ ప్రసాద్ ను అదృష్టం వరించ వచ్చని సమాచారం.  అయితే సెప్టెంబర్ 15 న సీబీఐ కోర్టు జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే ..అప్పుడు కథ వేరుగా ఉంటుంది.

వైఎస్ ఫ్యామిలీలో జగన్ రెడ్డి ఏక్ నిరంజన్?

సెప్టెంబర్ 2 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన వైఎస్సార్, 2009 సెప్టెంబర్ 2 న హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. అంటే ఆయన చనిపోయి పుష్కర కాలం పూర్తయింది. ఈ 12 ఏళ్ల కాలంలో రాష్ట్ర రాజకీయాలోనే కాదు, దేశ రాజకీయాలలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయ స్థితిగతులు మారిపోయాయి.ఈ మార్పులు చేర్పులలో  వైఎస్సార్ ఫ్యామిలీ రాజకీయంగా, ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కుంది. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా వైఎస్ కుటుంబం మొత్తం ఒకటిగానే ఉంది. కష్ట నష్టాలను ఉమ్మడిగానే అనుభవించింది.  వైఎస్ కుమారడు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు, సిబిఐ విచారణ కార్యాలయం (దిల్ కుష్ గెస్ట్ హౌస్) వద్ద జగన్ తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిల,భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఫుట్ పాత్ మీద కూర్చుని అర్థరాత్రి వరకు ధర్నా చేసిన దృశ్యాలు ఇంకా కాళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు. అయినా లోటస్ పాండ్ వద్ద ధర్నాను కొనసాగించి, వైఎస్ కుటుంబం అంతా ఒకటిగా పోరాటం కొనసాగించింది. ఇక జగన్ రెడ్డి అరెస్ట్ కారణంగా ఆగిపోయిన పాదయాత్రను, అన్న వదిలిన బాణం నేనేంటూ షర్మిల కొనసాగించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని సజీవంగా ఉంచడమే కాకుండా, అన్న జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేశారు. అలాంటిది ఇప్పుడు  వైఎస్ ఫామిలీ రెండుగా చీలిపోయిందా అంటే అవుననే అనవలసి వస్తోంది. కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పీఠమెక్కి కూర్చున్న జగన్ రెడ్డి, మెల్ల మెల్లగా తల్లీ చెల్లిని దూరం పెడుతూ వచ్చారు.  ఆస్తుల తగువులో, రాజకీయ విభేదాలు, వివాదాలు. కారణం ఏదైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అటు తల్లితోనూ,ఇటు చేల్లితోనూ కూడా దూరం పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వైఎస్ ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి మధ్య అగాధం ఏర్పడింది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో, ఎవరు, ఎందుకు చేయించారో గానీ, ఆ ఉదంతంతో వివేకా కుటుంబానికి జగన్ రెడ్డి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ‘ఆ ఇద్దరే’ హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక జగన్ సోదరి షర్మిల పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారు. తెలంగాణ కోడలినంటూ తెలంగాణలో  వైఎస్సార్ టీపీ పేరిట సొంత రాజకీయ వేదిక ఏర్పరచుకున్నారు. ‘రాజన్న రాజ్యం’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో రాజీలేని పోరాటమ చేస్తామని ప్రకటించుకున్నారు. షర్మిల రాజకీయలను కాసేపు పక్కన పెడితే వైఎస్ కుటుంబ కలహాలు రోజురోజుకు మరింతగా ముదురు పాకాన పడుతున్నాయి. జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, అమ్మా, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి  వారుగా ఇడుపులపాయలోని  వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా చాలా జగ్రత్తగా టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇలా కన్న తండ్రికి నివాళులు అర్పించడంలోనూ ఎవరిదారి వారిది అన్నట్లుగా వ్యవహరించారు. ఇది ఇద్దరి మధ్య తగవు ఎంత దూరం వెళ్లిందో చెప్పకనే చెప్పింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా వైరం ఎందుకు పెరిగింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని చిక్కు ప్రశ్నగానే మిగిలింది.  సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇటుపుల పాయలో అదే సీన్ రిపీట్ అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.  వైఎస్ సతీమణి విజయమ్మ, ఇన్నేళ్ళలో తొలిసారిగా, హైదరాబాద్ (నోవాటెల్ హోటల్‌) లో వైఎస్ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. అంతే కాదు, కాంగ్రెస్’లో మిగిలిన వైఎస్ మంత్రి వర్గ సహచరులు, అనుచరులతో పాటుగా తెరాస, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన వైఎస్ సహచర,మిత్రులు అందరినీ, వర్దంది సభకు రండని స్వయంగా ఆహ్వానించారు. అయితే, ఈ సభకు ఎవరొస్తారు, ఎవరురారు అనే విషయాన్ని పక్కన పెడితే,వర్ధంతి సభ ఉద్దేశం ఏమిటి, ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు,ప్రస్తుతానికి వెయ్యి డాలర్ల ప్రశ్న.  అయితే వర్ధంతి సభ ద్వారా జగన్ రెడ్డికి గట్టి వార్నింగ్  ఇవ్వడంతో పాటుగా, షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమమం చేసేందుకే విజయమ్మ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించి,వైసీపీ సంబంధాలను తెన్చుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో కొందరు పరిశీలకులు ఆమె అడుగులు మళ్ళీ కాంగ్రెస్ వైపు పడుతున్నాయా అన్న అనుమానాలను కూడా  వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డితో దూరం పెరగడంతో పాటుగా షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఎదురవుతున్న వడిదుడుకులకు సమాధానంగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్డమయ్యారనే సందేహాలు వ్యక్తమమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా  విజయమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ జరగవచ్చని, అందుకు అటు నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఫామిలీలో జగన్ రెడ్డి ఒంటరి అయ్యారనే  విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 

జగన్ సర్కార్ కు డబుల్ షాక్.. అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్

అంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకే రోజు జగన్ రెడ్డికి హైకోర్టులో రెండు షాకులు తగిలాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించారు. అయితే వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు లాయర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. అయినా ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ  తదుపరి చర్యలను నిలిపివేస్తూ రైతులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక గూంటూరు జిల్లాలోని సంగం డెయిరీ అంశంలోనూ జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. ఈ అంశంపై దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంగం డెయిరీకి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెలువరించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.  దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. డెయిరీ కేసులో హైకోర్టు తీర్పును టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన సర్కారుకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ధూళిపాళ్ల అన్నారు.  

జ‌గ‌న్ గాలి తీసేసిన ప‌వ‌న్‌.. స్టాలిన్‌ను చూసి నేర్చుకో సీఎం!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. పార్ట్ టైమ్ పాలిటిక్స్‌తో ఫుల్ బిజీగా ఉంటున్న హీరో. ఈ మ‌ధ్య మ‌రీ అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయాలు మాట్లాడుతున్నారు. లేదంటే, త‌న సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. వ‌కీల్‌సాబ్ మాంచి హిట్ కొట్ట‌డంతో.. మరింత జోరు, హుషారు పెంచేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి మాగ్జిమ‌మ్ సినిమాల‌న్నీ తీసేసి.. ఆ డ‌బ్బును పార్టీ ప‌టిష్ట‌త కోసం ఖ‌ర్చు చేయాల‌నేది ఆయ‌న ప్ర‌ణాళిక‌. అయితే, అన్నాళ్లూ పొలిటిక‌ల్‌గా సైలెంట్‌గా ఉంటే ఎట్టా? ప్ర‌జ‌లు ఆయ‌న్ను మ‌ర్చిపోరూ? అందుకే, తాను రాజ‌కీయాల్లో ఇంకా యాక్టివ్‌గానే ఉన్నానని చాటేలా.. అడ‌పాద‌డ‌పా స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో మెరుపు తీగ‌లా ఇలా వ‌చ్చి అలా మాయ‌మైపోయారు. అంతే. మ‌ళ్లీ అప్ప‌టినుంచీ ప‌త్తా లేకుండా పోయారు. బ‌హుషా క‌రోనా కేసుల మూలంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారో.. లేక‌, సినిమాల‌తో బిజీగా ఉన్నారో.. ఏమో గానీ.. తాజాగా, ఏపీలో రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంతో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. అడుగుకో గుంత‌.. గ‌జానికో గొయ్యి.. జ‌గ‌న‌న్న స్కీమ్ సూప‌ర్ అంటూ సినిమాటిక్ డైలాగ్స్‌తో సెటైర్లు వేశారు.  ఎలాగూ యాక్టివ్ అయ్యాం క‌దా.. ప‌నిలో ప‌నిగా దేశంలో కూడా ఏం జ‌రుగుతోందోన‌ని ఓ లుక్కేసిన‌ట్టున్నారు. ఆ పొలిటిక‌ల్ స‌ర్ఫింగ్‌లో జ‌న‌సేనాని కంటిని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తెగ అట్రాక్ట్ చేసినట్టున్నారు. ముఖ్య‌మంత్రిగా స్టాలిన్ పాల‌నా విధానాల‌కు ఫుల్ ఫిదా అయిపోయారు ప‌వ‌న్‌క‌ల్యాన్‌. ఏపీలో చంద్ర‌బాబు ముద్ర ఉండ‌కూడ‌ద‌నేలా అమ‌రావ‌తిని నాశ‌నం చేసే త‌ర‌హాలో కాకుండా.. త‌మిళ‌నాడు ఏలిన గ‌త అన్నాడీఎంకే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, జ‌య‌ల‌లిత బొమ్మ‌ల‌తో కూడిన వాట‌ర్ అమ్మ క్యాంటిన్‌, అమ్మ వాట‌ర్ బాటిల్స్‌, అమ్మ ఫోటోలు ఉన్న స్కూల్‌బ్యాగ్స్ పంప‌కాన్ని.. య‌ధాత‌థంగా కొన‌సాగించ‌డం.. చూసి ప‌వ‌న్‌కల్యాణ్ బాగా ఇంప్రెస్ అయిన‌ట్టున్నారు. ఏపీలో మాదిరి ప్ర‌తిప‌క్షాల‌పై కేసులు, అరెస్టుల‌తో రివేంజ్ పాలిటిక్స్ చేయ‌కుండా, విప‌క్ష నేత‌ల‌ను పిలిచి మాట్లాడ‌టం, వారికి ప్ర‌భుత్వ క‌మిటీల్లో ప్రాధాన్యం ఇవ్వ‌డం.. తెలుసుకొని జ‌న‌సేనాని అబ్బుర‌ప‌డ్డార‌ట‌. అందుకే, ఆ మాత్రం లేట్ చేయ‌కుండా.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ.. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో ఓ చ‌క్క‌టి ట్వీట్ చేశారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.  ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు జ‌న‌సేనాని.  ఈ ట్వీట్ చూసి నెటిజ‌న్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ల‌క్ష‌ణ‌మైనా ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తండ్రి డెడ్‌బాడీ సాక్షిగా రాజ‌కీయం చేసిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ఒక్క ఛాన్స్ అంటూ పెద్ద రాజ‌కీయ‌మే చేశారంటున్నారు. అంద‌ల‌మెక్కాక కూడా అడ్డ‌గోలు రాజ‌కీయం మానుకోలేద‌ని మండిప‌డుతున్నారు. కేవ‌లం చంద్ర‌బాబు బొమ్మ ఉంద‌నే కార‌ణంగానే.. అన్న క్యాంటీన్ల‌కు అర్థాంత‌రంగా తాళాలు వేసేసి.. పేద‌ల నోటి కాడి కూడును ఎత్త‌కొట్టార‌ని.. అదే త‌మిళ‌నాడులో అమ్మ క్యాంటిన్ల‌ను య‌ధావిధిగా కొన‌సాగిస్తూ సీఎం స్టాలిన్ ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొంటున్నార‌ని.. వారిద్ద‌రినీ పోల్చి చూస్తున్నారు. అలాంటి చ‌ర్య‌ల వ‌ల్లే.. ఇండియా టుడే నిర్వ‌హించిన మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో సీఎం స్టాలిన్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సొంతం చేసుకుంటే.. అదే స‌ర్వేలో అడ్డ‌గోలు నిర్ణయాల‌తో అరాచ‌కంగా పాలిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ 11వ స్థానానికి ప‌త‌న‌మై.. కేవ‌లం 6శాతం ప్ర‌జ‌ల అభిమానం మాత్ర‌మే చూర‌గొన్నార‌ని గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్‌లో సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌తీ ఒక్క కామెంట్‌.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్‌ను త‌ప్పుబ‌ట్టేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్స్‌. అదే స‌మ‌యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ కూడా రైజ్ చేస్తున్నారు.. త‌మిళ‌నాట‌ అంత మంచి పాల‌న అందిస్తున్న డీఎంకే స‌ర్కారుకు వ్య‌తిరేఖంగా ప‌ని చేస్తున్న బీజేపీకి జ‌న‌సేన‌ ఎలా మ‌ద్ద‌తిస్తోంద‌ని ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిక‌రం.   

నాలుగు దిక్కులా ద‌ళిత బంధు.. కేసీఆర్ టార్గెట్ ఆ న‌లుగురేనా?

ద‌ళిత‌బంధు. పులి మీద స్వారీలాంటి ఆ ప‌థ‌కం కేసీఆర్‌ను గ‌ట్టు దాటిస్తుందో.. గుటుక్కున మింగేస్తుందో.. అనే డౌటు. ఖ‌జానా ఖాళీ అయి భూములు అమ్ముకుంటున్న దుస్థితిలో కూడా ల‌క్ష‌న్న‌ర కోట్ల‌తో నాలుగేళ్ల‌లో ఎస్సీలంద‌రికీ ద‌ళిత‌బంధు ఇచ్చి తీరుతానంటున్నారు. ఆయ‌న అంటున్నారే కానీ.. మాట మీద నిల‌బ‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఎవ‌రికీ లేదు. కేసీఆర్ చ‌రిత్ర అలాంటిది మ‌రి. కేవ‌లం హుజురాబాద్‌లో గ‌ట్టెక్క‌డానికే.. ఈట‌ల రాజేంద‌ర్‌ను దెబ్బ‌కొట్ట‌డానికే.. ద‌ళిత‌బంధు తీసుకొచ్చార‌నేది అంద‌రి అనుమానం. అందుకే, ముందు త‌న ద‌త్త‌గ్రామం వాసాల‌మ‌ర్రిలో మ‌మ అనిపించి.. ఆ త‌ర్వాతే హుజురాబాద్‌లో అట్ట‌హాసంగా ప్రారంభించేశారు. పెద్ద రాగమే తీసి.. 15వంద‌ల‌ కోట్లు జ‌మ చేసి.. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 25 మందికి మాత్ర‌మే ద‌ళిత‌బంధు ఇచ్చారు. ల‌బ్దిదారుల ఎంపిక పేరుతో కావాల‌నే ఆల‌స్యం చేస్తున్నార‌ని.. ఉప‌ ఎన్నిక‌లు అయ్యేవ‌ర‌కూ ఇలానే లాగుతార‌ని.. ఆ త‌ర్వాత అట‌కెక్కించేస్తారంటూ ప్ర‌తిప‌క్షం ప్ర‌చారం చేస్తోంది. దీంతో.. ఉలిక్కిప‌డిన సీఎం కేసీఆర్‌.. ద‌ళిత‌బంధు అమ‌లులో మ‌రో ఎత్తుగ‌డ‌కు వ్యూహ‌ర‌చ‌న చేశారు. వ‌న్‌షాట్‌.. ఫోర్ బ‌ర్డ్స్ అనేలా.. తెలంగాణ న‌లుదిక్కులా ద‌ళిత‌బంధు పేరు మారుమోగేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ఇప్ప‌టికే హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధు మొద‌లైపోగా.. తాజాగా మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళిత బంధును స్టార్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. ఆ నాలుగు మండ‌లాల‌ను వ్యూహాత్మ‌కంగా ఎంపిక చేసుకున్నార‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర‌, ద‌క్షిణ దిశ‌ల్లో.. ఒక్కో దిక్కులో ఒక్కో మండ‌లాన్ని ఎంపిక చేసి.. రాష్ట్ర‌మంతా ద‌ళిత‌బంధుపై ఒకేసారి చ‌ర్చ జ‌రిగేలా పావులు క‌దిపార‌ని అంటున్నారు. ఇన్నాళ్లూ కేవ‌లం హుజురాబాద్‌లోనే పైలెట్ ప్రాజెక్టుగా ద‌ళిత‌బంధు అమ‌లు అని చెప్ప‌డంతా.. ఆ, అయితే మ‌న‌కు కాదులే.. మ‌న జిల్లా దాకా వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే..  అన్న‌ట్టు మిగ‌తా ప్రాంతాల వారు ఆ ప‌థ‌కాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాజ‌కీయ ర‌చ్చ త‌ప్ప‌.. ద‌ళిత‌బంధు బాగోగుల‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌ట్లేదు. ఈ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్.. వెంట‌నే మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళిత‌బంధు అమ‌లు నిర్ణ‌యం తీసేసుకున్నారు. కీల‌క‌మైన నాలుగు ఉమ్మ‌డి జిల్లాలే టార్గెట్‌గా అమ‌లుకు శ్రీకారం చుట్టారు. ఇప్ప‌ట్లో త‌మ‌వ‌ర‌కూ రాద‌నుకున్న ప‌థ‌కం.. హ‌ఠాత్తుగా త‌మ ఉమ్మ‌డి జిల్లాలో అమ‌ల‌వుతోంద‌నే స‌రికి అంతా అల‌ర్ట్ అవుతార‌ని.. ద‌ళిత‌బంధుపై ఆరా తీస్తార‌ని.. మ‌రింత అస‌క్తి క‌న‌బ‌రుస్తార‌నేది కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌...అంటున్నారు. అయితే, ఇలాంటి మాస్ట‌ర్ ప్లాన్‌తో పాటు మ‌రో ఖ‌త‌ర్నాక్ పొలిటిక‌ల్ స్కెచ్ కూడా దాగుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ రాజ‌కీయ ఎత్తుగ‌డ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉందంటున్నారు.  హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎదుర్కోడానికే ద‌ళిత‌బంధు తీసుకొచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి విమ‌ర్శ‌ల‌తో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్.. ద‌ళిత‌బంధు క్రెడిట్‌ కేసీఆర్‌కు ఏమాత్రం ద‌క్క‌కుండా చేసే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేస్తున్నాయి. బీజేపీ కంటే హ‌స్తం నేత‌లే ద‌ళిత‌బంధుపై మ‌రింత దూకుడుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏకంగా ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల‌తో, దీక్ష‌ల‌తో దుమ్మురేపుతున్నారు. అటు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ త‌మ త‌మ ఏరియాల్లో సొంతంగా ద‌ళిత దీక్ష‌లు చేస్తున్నారు. ద‌ళిత నేత భ‌ట్టి.. ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ కేసీఆర్‌ను మాట‌ల‌తో కుమ్మేస్తున్నారు. అందుకే, బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్న ఇలాంటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నోళ్లు మూయించేందుకే.. వ్యూహాత్మ‌కంగా ఆయా జిల్లాల్లోని మండ‌లాల‌ను ఎంచుకొని ద‌ళిత బంధును అమ‌లు చేసేలా సీఎం కేసీఆర్ పావులు క‌దిపార‌ని అంటున్నారు.  ఆ నాలుగు మండ‌లాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం ఒక‌టి. ఆ అచ్చంపేట‌లోని కొండారెడ్డిప‌ల్లినే రేవంత్‌రెడ్డి సొంతూరు. అందుకే, కావాల‌నే రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని మండ‌లాన్ని ఎంపిక చేశార‌ని చెబుతున్నారు. ఓవైపు రేవంత్‌రెడ్డి ద‌ళిత‌బంధు మోస‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే.. అదే స‌మ‌యంలో ఆయ‌న జిల్లాలోనే ద‌ళిత‌బంధు అమ‌లు చేసి చూపించి.. రేవంత్‌రెడ్డిని కార్న‌ర్ చేయాల‌నేది కేసీఆర్ ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంది.  ఇక రేవంత్‌రెడ్డి త‌ర్వాత ద‌ళిత‌బంధుపై అంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్సే. మా నియోజ‌క‌వ‌ర్గంలోనూ ద‌ళిత‌బంధు ఇస్తే.. తాము వెంట‌నే తమ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా. రాజ‌గోపాల్‌రెడ్డి,, వెంక‌ట్‌రెడ్డిలు ద‌ళిత‌ల‌కు మ‌ద్ద‌తుగా దీక్ష‌లు కూడా చేశారు. వాళ్లు ఇంత స్ట్రాంగ్‌గా పోరాడుతుంటే ప్ర‌జ‌లు నిజ‌మే అనుకునే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి.. వారి దూకుడుకు చెక్ పెట్టేలా.. వారి అడ్డా అయిన ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని తిర్మ‌ల‌గిరి మండ‌లంలో ద‌ళిత‌బంధుకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. కోమ‌టిరెడ్డి ఇలాఖాలోనే ద‌ళిత‌బంధు అమలు చేసి చూపించి.. వారి నోటికి క‌ళ్లెం వేయాల‌నేది కేసీఆర్ స్కెచ్ అంటున్నారు. ఇక‌, ద‌ళితుల కోసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్‌ నిర్వ‌హించిన‌ స‌మావేశానికి హాజ‌రై.. సీఎంతో కాస్త స‌ఖ్య‌త‌గా ఉంటూ.. సొంత‌పార్టీలోనే విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్న భ‌ట్టి విక్ర‌మార్క మ‌ద్ద‌తుకు కృత‌జ్ఞ‌త‌గానా అన్న‌ట్టు.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ధిర‌లోని చింత‌కాని మండ‌లాన్ని సైతం ద‌ళిత‌బంధు అమ‌లుకు ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.  ఇక‌, హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధుతో ఇటు ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడైన బండి సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌లోనూ ద‌ళితుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కొత్త‌గా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంను ద‌ళిత‌బంధు కోసం ఎంపిక చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌, ఎంపీ అర్వింద్‌తో పాటు.. అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుతం రేవంత్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న మ‌ధుయాష్కీగౌడ్‌కూ చెక్ పెట్టేలా.. ఆ మండ‌లాన్ని ఎంచుకున్నార‌ని అంటున్నారు.  ఇలా.. ఒకేసారి నాలుగు దిక్కుల్లోని నాలుగు మండ‌లాల్లో ద‌ళిత‌బంధును అమలు చేసి.. తెలంగాణ వ్యాప్తంగా ద‌ళిత‌బంధుపై చ‌ర్చ జ‌రిగేలా చేయ‌డంతో పాటు... న‌లుగురు కీల‌క నేత‌ల నోటికి చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, కేసీఆర్ వ్యూహాలు ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి మ‌రి...

అడుగుకో గుంత, గజానికో గొయ్యి! జగనన్న స్కీమ్ సూపర్ అన్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని సమస్యలే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో పాలనంతా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు కనీస అవసరాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ వైపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న జనాలు.. నరకకూపంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ మరిన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఏపీలో రోడ్లు ఎక్కడచూసినా గుంతలమయమే, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయి. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. రోడ్ల దుస్తితిపై విపక్షాలు ఎంతగా మొత్తుకున్నా , నిరసనలు తెలిపినా ప్రభుత్వంలో చలనం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారయిందని.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా పరిస్థితి ఉందని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని... ఈ రోడ్లు దెబ్బతిన్నా బాగు చేయడం లేదని దుయ్యబట్టారు. రోడ్లను బాగు చేయమని అడిగితే పోలీసులతో లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు ఏపీలో  ఉన్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.రోడ్డు బాగోలేదు, ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.  నివర్ తుపాను సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైందని అన్నారు. నిలువెత్తు గోతులతో ఉన్న ఆ దారిలో ఒక ట్రాక్టర్ తిరగబడిపోయిందని చెప్పారు. గర్భిణి స్త్రీతో వెళ్తున్న ఆటో కూడా తిరగబడిపోయిందని తెలిపారు. రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధికి చెప్పినా మార్పు రాలేదని చెప్పారు. కరోనా పరిస్థితులు ఉన్నాయనో, ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనో ఇంత కాలం ఆగామని... కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోందని... నోరు తెరిచి అడిగిన వారిపై పోలీసుల సాయంతో కేసులు పెట్టించే పరిస్థితి వచ్చిందని పవన్ మండిపడ్డారు.  రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే... అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని చెప్పారు

తెలుగుజాతి త‌ల‌రాత మార్చిన సీఎం @ 25 ఏళ్లు..

1995, సెప్టెంబ‌ర్ 1. చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు. మారిన‌ తెలుగుజాతి త‌ల‌రాత‌కు తొలి అడుగు ప‌డిన రోజు. తెలుగోడి కీర్తిప‌తాకం ప్ర‌పంచ య‌వ‌నిక‌పై రెప‌రెప‌లాడేందుకు అంకురం ప‌డిన రోజు. మ‌న పిల్ల‌లను సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తీర్చిదిద్ది అమెరికాకు వంతెన వేసిన రోజు. స‌రికొత్త హైద‌రాబాద్ నిర్మాణానికి బీజం ప‌డిన రోజు. ప్ర‌భుత్వ ప‌నితీరు మారిన రోజు. పేద‌ల చెంత‌కే ప్ర‌భుత్వం వ‌చ్చిన రోజు. అస‌లైన ప్ర‌జారంజ‌క‌ పాల‌నకు శ్రీకారం ప‌డిన రోజు. ఆ రోజు ఈ రోజు. సెప్టెంబ‌ర్ 1.  1995లో నారా చంద్ర‌బాబు నాయుడు తొలిసారి ముఖ్య‌మంత్రిగా పద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన సుభ‌దినం. ఆ రోజు జ‌రిగిన ఆ కీల‌క‌ఘ‌ట్టం తెలుగుజాతి చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని ఆ స‌మ‌యానికి ఎవ‌రూ ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, కాల‌చ‌క్రం అందుకు సాక్షిగా నిలిచి.. చంద్ర‌బాబు పాల‌నా చ‌రిత్ర‌ను సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకుంది. ఇప్ప‌టికీ రెండు తెలుగురాష్ట్రాల్లో చంద్ర‌బాబు అంటే పీక కోసుకునేంత అభిమానులు కోకొల్ల‌లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కానే కాదు. ప్ర‌స్తుత‌ ఏపీ, తెలంగాణ‌లోని ఏ మారుమూల తాండాల‌కో, గిరిజ‌న గూడేల‌కో వెళ్లినా.. అక్క‌డ మీకో సీబీఎన్ ఫ్యాన్ త‌ప్ప‌క క‌నిపిస్తాడు. చంద్ర‌బాబు వ‌ల్లే మా బిడ్డ అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడ‌ని చెప్పే తండ్రులు, చంద్ర‌బాబు హ‌యాంలోనే మా అబ్బాయికి టీచ‌ర్ జాబ్ వ‌చ్చింద‌ని సంతోషించే త‌ల్లులు తెలుగురాష్ట్రాల్లో ల‌క్ష‌ల్లో ఉంటారు. చంద్ర‌బాబు జ‌మానాలోనే తాము తొలిసారి గ్యాస్ సిలిండెర్‌తో వంట చేసుకున్నామ‌ని చెప్పే పేద‌లు..  చంద్ర‌బాబు వ‌ల్లే తాము డ్వాక్రా గ్రూపుల‌తో డ‌బ్బులు పోగేసుకొని త‌మ కుటుంబాల‌ను బాగుప‌రుచుకున్నామంటూ ఆనంద‌భాష్పాలు కార్చే మ‌హిళ‌లు తెలుగునేల‌పై ఏ మూల‌కు వెళ్లినా తార‌స‌ప‌డ‌తారు. ఈ రోడ్ 'జ‌న్మ‌భూమి'లో భాగంగా వేసింద‌ని.. ఆ స్కూల్ చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టించింద‌ని.. ఇలా తెలుగురాష్ట్రాల్లో చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను ఎవ‌రూ తుడిపేయ‌లేరు. ఇలాంటి రాష్ట్ర గ‌తిని మార్చిన చంద్ర‌బాబు పాల‌న‌కు ఇవాళే అంకురార్ప‌ణ జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 1.. చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన రోజు. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించార‌నే అప‌వాదుతోనే అంద‌ల‌మెక్కారు చంద్ర‌బాబు. అది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కాద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను, టీడీపీని ఓ మ‌హిళ క‌బంధ హ‌స్తాల నుంచి విడుద‌ల చేసిన రోజంటారు తెలుగు త‌మ్ముళ్లు. ఎన్టీఆర్‌లా ఛ‌ర్మిష్మా లేదు. ఆయ‌న అన‌ర్గ‌ళ వాగ్దాటీ లేదు. అయినా, చిర‌కాలంలోనే ఎన్టీఆర్‌ను మ‌రిపించారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే అంత‌కుమించి.. ప‌ని చేసి చూపించారు.  ఆ బ‌క్క ప‌ల‌చ‌ని మ‌నిషి.. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు ప‌ట్టిన ద‌శాబ్దాల బూజును, దుమ్మును ఒక్క‌సారిగా దులిపేశారు. అస‌లైన వ‌ర్క్ క‌ల్చ‌ర్‌ను తీసుకొచ్చారు. ప‌ని అంటే ఎలా చేయాలో.. ప‌నితీరు ఎలా ఉంటుంందో రుచి చూపించారు. మేం ప్ర‌భుత్వ ఉద్యోగులం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరంటూ తోలుమందం ఉద్యోగుల‌ కొవ్వు క‌రిగించేశారు. ఫైళ్ల వారోత్సవాల‌తో.. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లో గుట్ట‌లుగా పేరుకుపోయిన ఫైళ్లను ప‌రుగులు పెట్టించారు. ఆక‌స్మిక త‌నిఖీల‌తో అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు. సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు, ఏ ఆఫీసుకు చెకింగ్‌కు వ‌స్తారో తెలీక‌.. నిత్యం అల‌ర్ట్‌గా ఉండేవారు ఆఫీస‌ర్లు. అంత‌కుముందు ఆఫీసులోనే నిద్ర‌పోయే క‌ల్చ‌ర్ ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఆ త‌ర్వాత మిల‌ట‌రీ ఆఫీసుల్లా ఎనీటైమ్‌ అల‌ర్ట్‌గా ఉండేలా చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే. బ‌ద్ద‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్‌ను.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేలా చేయ‌గ‌లిగారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాన్ని మ‌రింత ద‌గ్గ‌ర చేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఉద్యోగుల మైండ్ సెట్ మార్చిన.. మాస్ట‌ర్ మైండ్ సీబీఎన్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ‘పని చేసే ముఖ్యమంత్రి’ గా పేరుగాంచారు చంద్ర‌బాబు. తుఫాన్లు, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో 24 గంటల్లోనే చేరుకొని.. ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించి.. సంక్షోభ స‌మ‌యాల్లో సమర్థత చాటుకొన్నారు. సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన‌ ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత ‘జన్మభూమి’గా మారి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌నే మార్చేసింది. అంద‌రికీ శ్ర‌మ విలువ తెలిసేలా చేసింది. అభివృద్ధిలో అంద‌రినీ భాగ‌స్వామ్యం చేసింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు.. ప్రజలు క‌లిసిక‌ట్టుగా శ్రమదానంతో సాధించుకొని.. చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు చెప్పుకునేవారు. ఎన్నారైల‌నూ జ‌న్మ‌భూమిలో భాగ‌స్వామ్యం చేసి.. మాతృభూమి బాగుకోసం మేముసైత‌మంటూ త‌ర‌లివ‌చ్చేలా చేశారు. పచ్చదనం-పరిశుభ్రత.. చంద్ర‌బాబు మ‌దిలో మొలిచిన ఆలోచ‌నే.  చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు, అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకాన్ని ఉద్యమంలా నడిపించిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’ తో గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు ఏపీని సందర్శించేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగసిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చంద్ర‌బాబు డ్వాక్రా గ్రూపుల‌తో ఎంత‌టి ఘ‌న చ‌రిత్ర సృష్టించారో తెలుస్తోంది.  తెలుగువారికి ఐటీని ప‌రిచ‌యం చేసి.. మ‌న జాతి త‌ల‌రాత మార్చేసిన ఘ‌నుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు. హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌గా చేసింది చంద్ర‌బాబే. కంప్యూట‌ర్‌ను వాడిన తొలి ముఖ్య‌మంత్రీ చంద్ర‌బాబే. ఆనాటి హైటెక్‌సిటీతోనే ఈనాడు ఇంటింటికో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారు. వేలాది ఇంజినీరింగ్ కాలేజీల‌తో ల‌క్ష‌లాది ఐటీ నిపుణుల‌ను త‌యారు చేశారు. అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌నే హైద‌రాబాద్ ర‌ప్పించారు. అందుకే చంద్ర‌బాబును అప్ప‌ట్లో దేశ ప్ర‌ముఖులంతా 'సీఎం' అని కాకుండా 'సీఈవో' అని పిలిచేవారు.  సంస్క‌ర‌ణ‌ల‌తో ఏపీని ప‌రుగులు పెట్టించారు సీఎం చంద్ర‌బాబు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌కు రుణాలివ్వరాదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు. అయితే, విద్యుత్‌ రంగంలో సంస్క‌ర‌ణ‌లు స‌త్ఫ‌లితాల‌నిచ్చినా.. ఛార్జీల పెంపు విమర్శ‌లపాలైంది. దళిత వ‌ర్గానికి చెందిన బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, శ్రీమతి ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేసి.. దళితులకు స‌ముచిత గౌరవాన్ని క‌ల్పించింది అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే.  ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, వైఎస్సార్‌, కేసీఆర్‌, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ఇలా తెలుగు నేల‌ను ఎంత‌మంది ముఖ్య‌మంత్రులు పాలించినా.. వారందిలోకెళ్లా చంద్ర‌బాబు పాల‌నే తెలుగుజాతి త‌ల‌రాత‌ని బాగా మార్చేసింద‌ని అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రెండుసార్లు సీఎంగా, న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా.. చంద్ర‌బాబు పేరు తెలుగునేల‌పై సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించబ‌డి ఉంటుంది.. తెలుగు హృద‌యాల్లో చిర‌ర‌కాలం నిలిచి ఉంటుంది. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా.. అమ‌రావ‌తిని క‌నుమ‌రుగు చేసేలాంటి కుతంత్రాలు న‌డిపినా.. చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను అంత ఈజీగా మాయం చేయ‌లేరు. ఎవ‌రు హైద‌రాబాద్ వెళ్లినా.. హైటెక్ సిటీని చూసినా.. ఏ ఫ్లైఓవ‌ర్ల‌పై ప్ర‌యాణించినా.. రైతు బ‌జారుకెళ్లినా.. ఎవ‌రు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా.. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దివినా.. ఏ 'మీ సేవ' కార్యాల‌యానికి వెళ్లినా.. ఎక్క‌డ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా.. అవ‌న్నీ చంద్ర‌బాబు పాల‌న‌ అనే మ‌హావృక్షానికి కాసిన తియ్య‌ని ఫ‌లాలే. అందుకే, తెలుగుజాతి ఉన్నంత కాలం చంద్ర‌బాబు పేరు, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పాల‌న‌ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే, 1995, సెప్టెంబ‌ర్ 1.. ఓ చారిత్ర‌క‌దినం. గ్ర‌హ‌ణం చాయ‌లు వీడ‌గానే మ‌ళ్లీ చంద్రోద‌యం ఖాయం.

జైలులో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష!

చంచల్ గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ దీక్షకు దిగారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో చిలుకలగూడ పోలీసులు శుక్రవారం అర్దరాత్రి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. తీన్మార్ మల్లన్నకు  కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. తీన్మార్ మల్లన్న 7 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టేసింది. పిటిషన్  విచారణ సందర్భంగా తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర తన వాదనలు విన్పించారు. ఇప్పటికే ఈ కేసులో తీన్మార్ మల్లన్నతో పాటు.. 19 మంది సాక్షులను విచారించారని..ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. మల్లన్నను కస్టడీకి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తెలెత్తే అవకాశం ఉందని.. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలతో  ఏకీభవించిన కోర్టు.. కష్టడీ  పిటిషన్ ను తిరస్కరించింది.దీంతో మల్లన్న తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు.  మలన్నకు బుధవారం బెయిల్ వస్తుందని అంతా భావిస్తుండగా పోలీసులు మరో ఎత్తు వేశారని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసుల తీరుపై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. తీన్మార్ మ‌ల్లన్నను జైలులో ఉంచేందుకే పోలీసులు ఇలా చేస్తున్నార‌నే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు తీన్మార్ మల్లన్నను జైల్లో ఉంచాలనే కుట్ర పన్నుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్ర‌భుత్వం వ్య‌హ‌రిస్తున్న తీరుపై తీన్మార్ మల్లన్న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

తమిళనాడులో జగనన్న పరువు పాయే! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పు లేనిదే ప్రభుత్వానికి గడవని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వాలన్న రుణం తీసుకోవాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎడాపెడా అడ్డగోలుగా ఖర్చులు చేస్తున్న జగన్ సర్కార్.. ఖజానా నింపుకోవడానికి ఆస్తి పన్నును భారీగా పెంచింది. దీనిపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.   ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలతో వినియోగదారులు భగ్గుమంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై అధిక పన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. దక్షిణాదిలో ఏపీలో పెట్రోల్, డిజిల్ రేట్లు ఎక్కువ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లలో లీటర్ కు నాలుగు నుంచి 8 రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. కేంద్ర సర్కార్ తో పాటు జగన్ రెడ్డి సర్కార్ భారీగా ట్సాక్స్ పెంచడంతో ఏపీలో వాహనదారులపై అధిక భారం పడుతోంది. వాహనదారులకు కొంత ఊరట కల్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ లీటర్ కు మూడు రూపాయలు తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పెంచుకుంటూనే పోతోంది.  జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఏపీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా.. పక్క రాష్ట్రాల్లోనూ ఏపీ పరువు పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి. తమిళనాడులో ఏపీ కంటే లీటర్ పెట్రోల్ రేటు ధర ఏకంగా 8 రూపాయలు తక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ ను రోడ్డున పడేస్తోంది. తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర ఏపీ పరువు పోయేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఏపీతో పోల్చుతూ ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయంటూ పెట్రోల్ బంకుల దగ్గర బోర్టులు పెట్టారు. ఏపీలో లీటర్ పెట్రోల్ రేటు 108 రూపాయల 78 పైసలు కాగా ఇక్కడ 100 రూపాయల 89 పైసలేనంటూ కొన్ని బంకుల దగ్గర బోర్డులు కనిపిస్తున్నాయి.  తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్న బోర్డులను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్ సర్కార్ తీరుకు ఈ బోర్టులు నిదర్శనంటూ పోస్టులు పెట్టారు. జగనన్న క్రేజీ తమిళనాడులో పెరిగిపోయిందంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఏపీతో పోల్చితే తమ దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువంటూ తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర పెట్టిన బోర్డులు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయానే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

రూట్ మార్చిన కేసీఆర్.. మరో నాలుగు నియోజకవర్గాల్లో దళిత బంధు

దళిత బంధు పథకంపై వ్యూహం మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధును ప్రతిష్టాత్మకంగా చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా వాళ్లు ఎంచుకున్న యూనిట్లను అందించారు. మిగితా వారికి అందించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత వాడల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే ఉప ఎన్నిక ఉన్నందు వల్లే హుజురాబాద్ లో దళిత బంధును అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక తర్వాత ఆపేస్తారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవడంతో.. జనాల నుంచి ఇవే అనుమానాలు వస్తున్నాయి.  దళిత బంధుపై జనాల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఉప ఎన్నిక కోసమే తెచ్చారనే ప్రచారంతో తమకు నష్టం కల్గుతుందనే భావించారట గులాబీ బాస్. అందుకే వ్యూహం మార్చారు. దళితబంధు  పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ  భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని నిర్ణయించారు.  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని  మండలం....సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని  తిర్మలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.

ఎమ్మెల్యేలతో జగన్ ఫేస్ టు ఫేస్.. అందుకోసమేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 నెలలు పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నా.. పార్టీపై ఆయన ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ ను కలవలేకపోతున్నారు. కొందరు మంత్రులకు కూడా సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలుస్తోంది. కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయలను పార్టీ సమన్వయకర్తలు సీఎంకు వివరించారుట. దీంతో  పార్టీపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన జగన్.. త్వరలో సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. పార్టీలో ప్రక్షాళనతో పాటు కేబినెట్ విస్తరణకు జగన్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. జగన్ తో సమావేశానికి రావాలటూ ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు, ఎమ్మెల్యేలతో  ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారట జగన్. ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే  ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.   ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు. వాటి నివేదికలను సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో జరిగే సమావేశాల్లో.. నియోజకవర్గానికి సంంబధించిన సర్వే వివరాలను వాళ్ల ముందు ఉంచనున్నారట. సర్వేల ఆధారంగానే  ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. వన్ టు వన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం.  ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారని తెలుస్తోంది.  ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు చేయడంతో పాటు పని తీరు బాగున్న వారికి  ప్రమోషన్ దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.  సీఎం-ఎమ్మెల్యేల ఫేస్ టు ఫేస్ సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు, మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారని చెబుతున్నారు.  ఎమ్మెల్యేలతో జరిగే భేటీల్లోనే కేబినెట్ అవకాశాలపైన మనసులో మాట చెప్పనున్నారట ముఖ్యమంత్రి. కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావాహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.   ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు ఇప్పటికే దాదాపుగా  పూర్తయిందని తెలుస్తోంది. ఈ సమీక్షల్లో ఆశావాహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.  పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం. అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది జగన్ భావిస్తున్నారట. ఈ లోగానే ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించటం పైన ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది.  దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది.  ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది. దీంతో  ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారని చెబుతున్నారు.