వైఎస్ అనుచరులకు విజయమ్మ ఆహ్వానం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం! 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైస్ విజయమ్మ మరోసారి వార్తల్లో నిలిచారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న  హైదరాబాద్‌లో ఆమె ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను విజయమ్మ ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.  2009 సెప్టెంబరు 2 రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూల్ జిల్లా పావురాల గుట్టలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి పోవడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. అయితే ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.  ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనిది ఇప్పుడు విజయమ్మ  ఆహ్వానం పంపడం ఏంటనే చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్సార్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఆయన సంబంధాలున్నాయి. దీంతో గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన తెలంగాణ, ఏపీకి చెందిన నాయకులకు, ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా  విజయమ్మ ఆహ్వానాలు వెళుతున్నాయట. వైఎస్ మంత్రివర్గంతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయి. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కేఆర్ సురేష్ రెడ్డితో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులను విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా విజయమ్మ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణలో షర్మిల సొంత పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయమ్మ ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వైఎస్ఆర్ చనిపోయిన 12 ఏళ్ల తర్వాత ఈ సమావేశాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడే ఎందుకు పెట్టాలనుకుంటున్నారనే సందేహం అందరిలోనూ వస్తోంది. ఈ సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా ఇది కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ కోసమే పెట్టినట్టుగా అందరూ అనుమానిస్తున్నారు. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని ప్రారంభించగా.. కూతురుకు తల్లి వైఎస్ విజయమ్మ మద్దతుగా నిలిచారు. షర్మిల పార్టీ సభల్లో పాల్గొన్నారు.  తెలంగాణలో షర్మిల పార్టీలోకి కీలక నేతలు ఎవరూ రావడం లేదు. పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ విజయమ్మ ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని అనుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చర్చలు ఎలా ఉన్నా విజయమ్మ  ఆహ్వానాలపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. సమావేశం ముగిశాకే విజయమ్మ ఎజెండా ఏంటనేది తెలియనుంది.మొత్తానికి వైఎస్సార్ వర్ధింతి రోజున విజయమ్మ నిర్వహించబోతున్న సమావేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాత్రం ఆసక్తి రేపుతోంది. 

చంద్రబాబు పతనానికి కారణం చెప్పిన మోత్కుపల్లి..

తెలుగు దేశం పార్టీలో చాలా కాలం పని చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి... ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ ను ప్రశంసిస్తూ వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. దళిత బంధుపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతల తీరును తప్పుపడుతున్నారు నర్సింహులు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా, దళిత బంధుకు, సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఆదివారం తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు మోత్కుపల్లి నర్సింహులు. దీక్ష సందర్భంగా దళిత బంధు పథకంతో పాటు విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. తెలంగాణలో దళితబంధు పథకం.. వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.దళితుల సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్.. మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తెలుగు దేశం పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనమయ్యారని చెప్పారు. రేవంత్ జీవితమంతా మోసాలు, బ్లాక్ మెయిలింగే అని విమర్శించారు నర్సింహులు. ఆర్టీఐని వాడుకుని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. దళితులు కులవివక్షకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని చెప్పారు. గ్రామాల్లో దళితులు గతంలో రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోందన్నారు మోత్కుపల్లి. ఒక  పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మద్దతు ఇవ్వడం.. సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు నర్సింహులు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా పని చేసినా.. దళితుల కోసం ఎవరూ స్పందించలేదని చెప్పారు. దళితుల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అంతా అంటున్నారని తెలిపారు. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామని మోత్కుపల్లి స్పష్టం చేశారు. 

తెలుగుకి సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ.. భాషను నాశనం చేసేందుకే కంకణం..

తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు రామ్మూర్తి ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా ప్ర‌భుత్వం వ్యవహరిస్తోంద‌ని మండిప‌డ్డారు. వైసీపీ పాల‌న‌ నుంచి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడే ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుందని.. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. తెలుగునాట వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న ప్రపంచంలోని తెలుగువారందరికీ చంద్రబాబు, నారా లోకేశ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం గిడుగు రామ్మూర్తేనని చంద్రబాబు అన్నారు. ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని ఆయన విశ్వసించారని గుర్తుచేశారు.   గిడుగు రామ్మూర్తి కృషి వల్లే ఆ కాలంలో ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, రచన వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయని నారా లోకేశ్‌ అన్నారు.  తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం నుంచి.. పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్ర‌బాబు గుర్తు చేశారు.  

దేశ భాషలందు తెలుగు లెస్స.. తేనెకన్నా తీయనిది తెలుగు భాష

భాష అంటే ధ్వనుల గుంపు.  వర్ణం అంటే అక్షరం అక్షర అంటే నశించనిది. మాట గాలిలో కలిసి పోవచ్చు కానీ మాట సంకేతమైన అక్షరం మాత్రం చెరిగిపోదు. రంగులతో రాయటం వలన వర్ణం అని రంగులతో పూయటం వలన లిపి అని చెక్కటం గీకటం వలన లేఖం అని పేర్లు వచ్చాయని చరిత్ర చెబుతుంది. కాని మన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. అందుకే తెలుగు భాషను రక్షించుకోవడానికి వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.   నేడు దేశమంతటా వ్యాపించి ఉన్న అనేక లిపులకు మూలం బ్రాహ్మీలిపి అని కొందరు చిత్ర రూపం లోని మొహొంజొదారో లిపి అని మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు ఆంధ్ర అనే పదాలు పర్యాయపదాలు అయినప్పటికీ క్రీ.శ. 10 వ శతాబ్దం ముందు ఆంధ్ర అనే పదమే పురాణేతిహాసాలలో కనిపించేది నుండి క్రీ.శ.14 శతాబ్ది నుండి తెలుగు తెనుగు అనే పదాలు వాడుకలోకి వచ్చాయి.  ఆంధ్రాలో ఆర్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన సంస్కృత పదజాలం ఎక్కువ!  తెలుగు భాషకు మాతృక  ఐదువేల సంవత్సరాల కిందటి ద్రవిడ శాఖ రెండో భాగానికి చెందిన శాసనాల ఆధారంగా తీసుకుంటే మొదటి తెలుగు శాసనం  క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది అని చరిత్ర చెబుతోంది! సాహిత్య సంపద ఉన్న నాగరిక భాషలలో తెలుగుది అగ్రస్థానం. ఆరవ శతాబ్దినుండి తెలుగులో సాహిత్య మొదలైనట్లు అంచనా.  లిపి ఉన్నవి లేనివి కలిపి భారతదేశంలో ఉన్న భాషలు 1652 గుర్తింపు పొందినవి 22 ద్రవిడ కుటుంబానికి చెందిన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దక్షిణాది భాషలు కాగా ఇండో-ఆర్యన్ కుటుంబానికి చెందిన సంస్కృతం సహా పది భాషలు ఉత్తరాది భాషలు. ద్రావిడ భాషల్లో ప్రాచీనమైనది తమిళం అయినప్పటికీ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషను పద్య గద్య భాగాలుగా విభజించారు! నాటి ఆరవ శతాబ్ద గద్య రూపంలోని తెలుగు భాషకీ నేటి తెలుగు భాషకి వ్యత్యాసం చాలా ఉంది!  తొమ్మిదవ శతాబ్దంలో తెలుగు శాసనాలు రూపం మొదలైంది! ఉదా. అప్పట్లో పణ్డితుడు అనే వారు ఇప్పుడు పండితుడు అంటున్నారు.  తెలుగు కావ్య పరిమాణంలో కవిత్రయం నన్నయ తిక్కన ఎర్రన మహాభారతాన్ని రసరమ్యంగా హృదయానికి హత్తుకునేలా స్వేచ్ఛానువాదం తో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. భక్తుల గాధలను తత్వ బోధలు ఆరాధనా విధానాలు ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరిచి భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తి యోగాన్ని చాటే భాగవతాన్ని తెలుగులో రచించారు మహాకవి పోతన.  "దేశభాషలందు తెలుగు లెస్స" అని పలికి ఒక చేత ఖడ్గం మరో చేత కలం పట్టి తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలుగా (అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి మాదయ్యగారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు పింగళి సూరన రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు)  పేరొందిన ఎనిమిది మంది తెలుగు కవులను పోషించారు- విజయనగర సామ్రాజ్య రాజులు శ్రీ కృష్ణదేవ రాయలు. వికటకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంగితం జ్ఞానం హాస్యం కలగలిపిన వారి భాష అద్భుతం.  వ్యాకరణానికి ప్రామాణిక గ్రంధంగా బాలవ్యాకరణం రచించిన మహాకవి చిన్నయసూరి. కంచర్ల గోపన్న శ్రీరామునిపై 17వ శతాబ్దంలో రచించిన భక్తి "దాశరధీ శతకం".  సూటిగా సుత్తి లేకుండా తేటగా చెప్పిన "వేమన శతకం" మంచి మాటలు నేర్పే "సుమతీ శతకం" మానవునికి సంబంధించిన వివిధ గుణాలను వివరిస్తూ రచనలు చేసిన భర్తృహరి సుభాషితాలు. తెలుగు భాషలోని కచిక ప్రత్యేకత. మొదటి నుంచి చివర వరకు చదివితే రామాయణం వస్తుంది చివరి నుంచి మొదటి వరకు చదివితే మహాభారతం వస్తుంది.  తెలుగు సాహిత్యాన్ని శాసించిన విప్లవ కవి శ్రీశ్రీ కవితల్లో ప్రాస శ్లేష శ్రీ శ్రీ సొంతం.అష్టావధానం తెలుగుకి మాత్రమే సొంతం. కోడిపిల్ల అనే పాట వింటే ఊపు వస్తుంది అదే పల్లెటూరి జానపదం .. మునెయ్య ప్రసిద్ధి. వింటుంటే వినాలి వినాలనిపించేది.. చదువుతుంటే చదవాలనిపించేది.. మన కమ్మనైన తెలుగు భాష.  కాని ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు. అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. 

హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడంటే?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు విడుదలయ్యేది ఎప్పుడు? ఈ  ప్రశ్నలకు  ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ, ఇప్పుడు, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇంకా అట్టే కాలం, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన కోసం ఎంతో కాలం నిరీక్షించ వలసిన అవసరమ లేదని తెలుస్తోంది. హుజూరాబాద్ కు డిసెంబర్ 12 వరకు సమయం ఉన్నా, పొరుగు రాష్ట్రం ఏపీలో  సిట్టింగ్  శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేల్ స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివుంది. ఈనేపధ్యంలో బద్వేల్ తో పాటుగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా, సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  వచ్చే సంవత్సరం (2022)  ప్రారంభ నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఐదు రాష్టాలు సహా, దేశంలో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలు నిర్వహించాడంపై వారి వారి  అభిప్రాయాలను తెలియచేయాలని  కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలకు 15 రోజుల క్రితం  లేఖలు రాసింది.  ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగష్టు 30తో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2/3 తేదీలలో సమావేశమై ఒక నిర్ణయానికి రావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా ఆరు నెలల గడువు సమీపించిన లేదా ఒకే ఒక్క అసెంబ్లీ సీటు ఖాలేగా ఉన్న రాష్టాలలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా, ఉప ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టే ఆలోచనా, అవకాశం ఉన్నాయని అధికార వర్గాల సమాచారంగా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అదే జరిగితే, సెప్టెంబర్ 28తో గడువు ముగుస్తున్న  ఏపీలోని బుద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంతో పాటుగా, తెలంగాణలో ఖాళీగా ఉన ఏకైక స్థానం, హుజూరాబాద్ స్థానానికి  సెప్టెంబర్ 20 – 25 తేదీల మధ్య ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది అంటున్నారు.  అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల అభిప్రాయాలతో పాటుగా, కరోనా పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే క్షేత్ర స్థాయి నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.  అదలా ఉంటే, రానున్న రెండు నెలలు కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ చేఇసిన తాజా హెచ్చరికను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నికల సంఘం నిర్ణయం మరోలా ఉండే ఆకాశం లేక పోలేదని కూడా అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా, సెప్టెంబర్ మొదటి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు అనే విషయంలో చాల వరకు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజకీయంగా చూసినా, ఉప ఎన్నిక ఎంతగా శీఘ్రంగా జరిగితే, బీజేపీ గెలుపు అవకాశాలు అంతగా మెరుగవుతాయి. కాబట్టి, ‘కేంద్ర’ ఎన్నికల సంఘం, గత మూడు నెలలుగా సాగుతున్నా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రహసనానికి  సెప్టెంబర్ లోనే చుక్క పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఎన్టీఆర్ సక్సెస్ సీక్రెట్స్ చెప్పిన సీజేఐ జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 

దివంగత నందమూరి తారకరామారావు. తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. అటు సినిమా రంగం ఇటు రాజకీయ రంగాన్ని ఉపేశారాయన. రెండు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలిన ఎన్టీవోడు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంం చేపట్టారు. అంతేకాదు పాలనలో కొత్త ఒరవడి స్పష్టించి పేదల గుండెల్లో నిలిచిపోయారు. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని అంటారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆయన సాగించిన పాలన పేద ప్రజలకు వరమని చెబుతారు. ఇప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉన్నారంటే.. ఆయన వాళ్లతో ఎంతగా మమమేకమయ్యారో తెలుసుకోవచ్చు.  దేశంలో కాంగ్రెస్ హవా సాగుతున్న రోజుల్లో, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టడమే సంచలనమైతే... 9 నెల్లల్లోనే అధికారంలోకి రావడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం..  దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సినీ నేప‌థ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ మాత్రం అసలు విషయం చెప్పారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో  వర్చువల్ గా మాట్లాడిన జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ,ఆయన విజయ రహస్యానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి, ఆయ‌న తెలుగు భాషా ప్రావీణ్యానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.  ‘నందమూరి తారక రామారావుగారు అగ్రశ్రేణి సినీనటుడు కావ‌డం వ‌ల్లే ఆయన సులువుగా అధికారంలోకి వ‌చ్చార‌ని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుత ఉచ్ఛారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.  భాష గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఉదాహ‌ర‌ణ చెప్పారు. ప్ర‌జ‌ల్ని మాతృభాష ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో ఎన్టీఆర్ రాజ‌కీయ విజ‌యాన్ని ఆయ‌న ఉద‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇదే స‌మావేశంలో మాతృభాష విశిష్ట‌త గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని హెచ్చ‌రించారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని పిలుపునిచ్చారు. ఇంగ్లీషు మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ హిత‌వు ప‌లికారు.  

కేసీఆర్ మ‌దిలో బ్ర‌హ్మాస్త్రం!.. ద‌ళితుడిని సీఎం చేసే వ్యూహం!

అవును, మీరు చ‌దివింది త్వ‌ర‌లోనే నిజం కావొచ్చు. తెలంగాణ ముఖ్య‌మంత్రి పీఠంపై ద‌ళితుడిని కూర్చోబెట్టినా ఆశ్చ‌ర్యం లేదు..అంటున్నారు. సీఎం కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల గురించి బాగా తెలిసిన వారెవ‌రూ ఈ న్యూస్ విని అవాక్క‌వ‌రు. తెలంగాణ చాణ‌క్యుడి వ్యూహాలు అలానే ఉంటాయి మ‌రి. ఇప్పుడు ఆ ప‌ని చేయ‌డం అత్యంత అవ‌స‌రం కూడా మ‌రి. సీఎం కేసీఆర్‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉప్పెన‌లా ఎగుస్తోంది. ద‌ళిత బంధుతో కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచేందుకు సిద్ధ‌మైనా ఆయ‌న్ను ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు. కేసీఆర్ నిజంగా ఇస్తారా? అంద‌రికీ ఇస్తారా? హుజురాబాద్ ఎన్నిక‌లు ముగియ‌గానే బంధును బొంద‌పెట్టేస్తారా? ఇలా అనేక అనుమానాలు. అందుకు కార‌ణ‌మూ ఆయ‌నే. గ‌తంలో ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల భూమి ఇలా ద‌ళితుల‌ను నిలువునా ద‌గా చేసిన ఘ‌న చ‌రిత్ర. అందుకే, ద‌ళితుల కోసం ర‌క్తం ధార‌బోస్తానంటున్నా కేసీఆర్‌ను ద‌ళితుల‌తో స‌హా ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు..అంటున్నారు.  మ‌రి ఎలా? తాను ద‌ళిత ప‌క్ష‌పాతిన‌ని నిరూపించుకునేదెలా? 10 ల‌క్షలు ఇస్తానంటున్నా న‌మ్మట్లేదంటే ఇంకెలా? ఇలా ఆలోచిస్తున్న కేసీఆర్‌కు అద్భుత‌మైన ఆలోచ‌న వ‌చ్చిందట‌. త‌న‌పై వినిపిస్తున్న విమ‌ర్శ‌లు.. త‌న‌ను అనుమానిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు.. తిరుగులేని, ఎదురులేని.. బ్ర‌హ్మాస్త్రం లాంటి ఆలోచ‌న‌ ఆయ‌న మ‌దికి త‌ట్టింద‌ట‌. ఆ ఆయుధాన్ని ప్ర‌యోగించేందుకు త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.  కేసీఆర్ మ‌దికి తట్టిన ఆ బ్ర‌హ్మాస్త్రంలాంటి ఆలోచ‌న‌.. ద‌ళిత ముఖ్య‌మంత్రి. అవును, సీఎం సీటు నుంచి తాను వైదొలిగి.. త‌న స్థానంలో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ద‌ళితుడిని సీఎం చేస్తే.. ఇక త‌న‌పై ఉన్న ముఖ్య‌మైన‌ మ‌చ్చ‌ చెరిగిపోతుంది. ఈ రెండున్న‌రేళ్లు ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చొబెట్టి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు క‌డిగిన ముత్యంలా తాను మ‌రోసారి బ‌రిలో నిలవొచ్చ‌నేది ఆయ‌న ఆలోచ‌న‌తో కూడిన ఎత్తుగ‌డ వ్యూహం!  అయ్యో.. ముఖ్య‌మంత్రి పీఠం పోతే ఎలా? ప‌వ‌ర్ లేకుండా పెద్దాయ‌న ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల‌రా? అనే డౌట‌నుమానం అస్స‌లే అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. గ‌త యూపీఏ హ‌యాంలో ప్ర‌ధాని సీట్లో మ‌న్మోహ‌న్‌సింగ్ కూర్చున్నా.. ప‌వ‌ర్ అంతా యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ చేతిలోనే ఉన్న‌ట్టు.. ఆ ఫార్ములాను తెలంగాణ‌లోనూ ఈజీగా అప్లై చేసేయొచ్చ‌నేది ఆయ‌న ఐడియా. అలా అయితే ద‌ళితుడిని సీఎం చేసిన‌ట్టు ఉంటుంది.. అస‌లు ప‌వ‌ర్ ప‌దిలంగా త‌న ద‌గ్గ‌రే ఉంటుంది. త‌న‌పై ప‌డిన మ‌ర‌క వ‌దిలిపోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఉన్న అసూయ తొల‌గిపోతుంది. తాను ఎంచ‌క్కా ఫాంహౌజ్‌లోనే ఉంటూ రాష్ట్రాన్ని ప‌రోక్షంగా పాలించొచ్చు. బ్ర‌హ్మాస్త్రంలాంటి ఈ ఆలోచ‌న కేసీఆర్‌కు బ్ర‌హ్మాండంగా న‌చ్చేసింద‌ని.. ఇదే విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి.. వారిని ఒప్పించే పనిలో ఉన్నార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. డ‌మ్మీ సీఎం అయ్యే ఆ ద‌ళిత అదృష్ట‌వంతుడు ఎవ‌ర‌వుతారో...?

జేబుల్లో తీసుకెళ్లేలా టీన్లలో బీరు.. తాగండి-ఊగండిలా ఏపీ మద్య విధానం!

మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ నినాదం. జగన్మోహన్ రెడ్డి నినాదం.. ఇది చెబుతూనే 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు జగన్ సహా వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చాకా మాత్రం ఆ సంగతే మరిచిపోయారు. మాట తప్పడం.. మడమ తిప్పడమే జగన్మోహన్ రెడ్డి సిద్దాంతంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలన్నింటికి ఒక్కొక్కటిగా తూట్లు పొడుతుస్తున్నారు వైసీపీ అధినేత. మద్యపాన నిషేదం విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  రాష్ట్రంలోని పేద కుటుంబాల‌కు శాపంగా మారిన మ‌ద్యం అమ్మ‌కాల‌ను మేం అధికారంలోకి రాగానే విడ‌త‌ల వారీగా నియంత్రిస్తామని గతంలో జగన్ చెప్పారు. మ‌ద్యం ధ‌ర‌లు ముట్టుకుంటే.. షాక్ కొట్టే క‌రెంటు మాదిరిగా పెంచేస్తామన్నారు.  దీంతో సామాన్యుడు మ‌ద్యం జోలికిపోవాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకువ‌స్తామని ఎన్నిక‌ల‌కు ముందు ఊదరగొట్టారు జగన్ రెడ్డి. ఇప్పుడు మాత్రం ఆయ‌న వ్య‌వ‌హారం.. `ఇంకా తాగండి.. ఇంకా ఇంకా తాగండి`-అన్న‌ట్టుగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది మ‌ద్యం దుకాణాల‌ను ప్ర‌భుత్వ ప‌రం చేసి.. కొన్ని దుకాణాలు త‌గ్గించారు. అయితే.. సంక్షేమ పేరిట ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతుండ‌డంతో ఆదాయం లేక ఖ‌జానా ఖాళీ అయింది. దీంతో మ‌ద్య‌మే ప్ర‌భుత్వాని ప్ర‌ధాన ఆదాయంగా మారిపోయింది. దీంతో వివిధ రూపాల్లో  మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. ఇప్ప‌టికే.. ప‌ర్యాట‌కం పేరిట మాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో.. కూడా మాల్స్ పేరిట ఏసీ.. దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి చాల‌వ‌న్న‌ట్టుగా.. ఇకపై క్యాన్‌ బీర్లు, 90 ఎంఎల్‌ బుడ్డీలలో మద్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  జగన్ రెడ్డి సర్కార్ కొత్త విధానం ప్రకారం ఇకపై బీర్లు టిన్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. 650 ఎంఎల్‌, 350 ఎంఎల్‌ సీసాల్లో బీరు దొరుకుతోంది. తాజా నిర్ణయంతో జేబులో పట్టే టిన్లలో బీర్లు రానున్నాయి.  330 ఎంఎల్‌, 500 ఎంఎల్‌… ఇలా రెండు రకాల క్యాన్లలో బీరును అందుబాటులోకి తెస్తున్నారు. సీసాల్లో ఉన్న బీరును కొని బయట తాగడమే కష్టం. బరువుగా, పొడవాటి సీసాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. టిన్‌ బీర్లు అలా కాదు. చేతిలో ఇమిడిపోతాయి. స్టైల్‌గా ఉంటాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి, అంతే సులువుగా తాగేయవచ్చు. దీంతో ప్రయాణాల్లోనూ వీటితో బీర్లు లాగించవచ్చు. మద్యం అమ్మకాలు పెంచుకోవాడనికే ఇలా అమలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల నుంచి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ అనుమతిచ్చింది.  అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ పేర్కొంది. ప్రస్తుతం ఒక క్వార్టర్‌… అంటే 180 ఎంఎల్‌ సీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్‌ సీసాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్‌ సీసా కొనాలంటే వినియోగదారుడు కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్‌ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. ఇదంతా కూడా త‌మ వాగ్దానం మేర‌కు మద్యం వినియోగం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అసలు సంగతి మాత్రం ప‌రోక్షంగా మ‌ద్యం వినియోగాన్ని, అమ్మ‌కాలను పెంచుకోవడమే జగన్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. 

ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్! భారత్ సిరీస్ తీసుకొచ్చిన కేంద్రం

ఒకే దేశం ఒకే రేషన్, ఒకే దేశం ఒకే పన్ను ఇవి కేంద్ర సర్కార్ అవలంభిస్తున్న విధానాలు. ఇదే బాటలోనే మోడీ సర్కార్ కొత్తగా మరో పాలసీ తీసుకొచ్చింది. ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వ శాఖ కొత్త రిజిస్ట్రేషన్ పాలసీని ప్రకటించింది. ఇందుకోసం కొత్తగా భారత్ సిరీస్ BH)ను తీసుకొచ్చింది.  దీని ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది.   ఇప్పటివరకు దేశంలో ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం మరో రాష్ట్రంలో 12 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక వేళ ఉండాల్సి వస్తే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. అయితే కొత్తగా తీసుకొస్తున్న భారత్ సిరీస్ తో అలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి. భారత్ (BH) సిరీస్ లో రిజిస్టర్ చేసుకుంటే… దేశంలో ఎక్కడైనా వెహికిల్ ఉండొచ్చు.అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. రక్షణ శాఖలోని వివిధ డిపార్ట్ మెంట్స్ లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ చోట్ల ఆఫీస్ లు ఉన్న ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ‘బీహెచ్’ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించనుంది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే బీహెచ్ రిజిస్ట్రేషన్ ను చేసుకోవచ్చు.  రోడ్డు పన్నును మొదట రెండేళ్లకే కట్టొచ్చని లేదంటే వాహన గరిష్ట జీవితకాలమైన 15 ఏళ్లకుగానూ రెండేళ్ల చొప్పున మొత్తం ఒకేసారి చెల్లించే వెసులు బాటు ఇందులో ఉండనుంది. ఈ కొత్త విధానంతో ఉద్యోగ, వ్యాపార కారణాలతో వేరే రాష్ట్రానికి మారాల్సి వచ్చిన వారికి ఊరట లభించనున్నది. 

4వేల కోట్ల కుంభకోణం!.. కొడాలి నానిపై ఆరోప‌ణ‌లు.. జ‌గ‌న్ వాటా ఎంతంటే..!

ఏపీ మంత్రి కొడాలి నానిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు. ఏకంగా 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ విమ‌ర్శ‌లు. పేద‌ల క‌డుపు కొట్టి.. ప్ర‌భుత్వ ఖ‌జానాను కొల్ల‌గొట్టి.. వేల కోట్లు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లు. ఇందులో సీఎం జ‌గ‌న్‌కూ భారీగానే ముడుపులు అందుతున్నాయ‌నే అనుమానాలు. ఇలా ఏపీలో 4వేల కోట్ల బియ్యం కుంభ‌కోణం జ‌రిగిందంటూ.. అయినా ద‌ర్యాప్తు జ‌ర‌గ‌డం లేదంటూ.. టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు ఎంఎస్ రాజు వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకిచ్చే బియ్యం నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు కాసులు పిండుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆ బియ్యంస్కాం ఎలా జ‌రుగుతోందో స‌వివ‌రంగా విడ‌మ‌రిచి చెప్పారు టీడీపీ నేత‌ ఎంఎస్ రాజు.  రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సి ఉంటుంది. కానీ, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని 4 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయమని మండిప‌డ్డారు ఎంఎస్‌ రాజు.  మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలోనే ఈ దారునం బయటపడిందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇందులో జగన్ వాటా ఎంతో బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేశారు.  ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ రూ.40కి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు.   

జగన్ ను ఎదుర్కొనే బెస్ట్ ఆప్షన్ కిరణేనా? పీకే డెరైక్షన్ లో కాంగ్రెస్ బలపడేనా? 

ఏపీలో పాత పేర్లు కొత్తగా తెరమీదికొస్తున్నాయి. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్న జగన్ ను ఇంటిదారి పట్టించేందుకు కాంగ్రెస్ అనూహ్యమైన ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఉమ్మడి ఏపీ ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది. అయినా.. జగన్ ప్రజల్లోకి వెళ్లారు. అప్పటికే జగన్ మనసులోని మర్మాన్ని అర్దం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.... ఢిల్లీకి పూర్తిగా విధేయుడైన కిరణ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. జగన్ ను ఓ చూపు చూడాలని పురమాయించింది. ఆ పాత రికార్డే ఇప్పుడు కిరణ్ కు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  జగన్ పార్టీని చీలుస్తారనే భయంతో రాయలసీమకే చెందిన కిరణ్ ను అప్పట్లో అధిష్టానం బాగా వాడుకుంది. కిరణ్ ను సీఎం చేసి జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో.. తమ కుటుంబంలోనే విభేదాలు తీసుకురావటం జగన్ కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసి గెలిచారు. ఆ టైంలో సీఎంగా ఉన్న కిరణ్ తో ఎలాగైనా జగన్ ను కంట్రోల్ చేయాలని.. పార్టీకి నష్టం జరగకుండా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో కిరణ్ అన్ని పావులూ సక్సెస్ ఫుల్ గా వాడేశారు. కిరణ్ హయాంలోనే జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్టు కూడా జరిగింది. అందువల్లే జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ సహా.. కిరణ్ సైతం భావించారు. అయితే అనూహ్యంగా విజయమ్మ, షర్మిల కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ కూడా నిర్ణయించిన విషయం గమనించాలి. కిరణ్ సర్కారు గట్టెక్కి... బలం నిరూపించుకున్నాక 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పొందడం వేరే విషయం. హైకమాండ్ ఆదేశాలను అడుగడుగునా తు.చ. తప్పకుండా అమలు చేసిన వ్యక్తిగా కిరణ్ ఢిల్లీలో గుడ్ బుక్స్ లో ఉన్నారు.   రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-పవన్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ను వీడిన కిరణ్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయాలపై, సామాజికవర్గాల సమీకరణలపై కూలంకషంగా చర్చించారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంకును వెనక్కి రప్పించే అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కిరణ్ రాహుల్ కు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లినవారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువ ఉన్నాయని, తనకున్న క్లీన్ ఇమేజ్ తో పాత కేడర్ ను కచ్చితంగా పార్టీవైపు మళ్లిస్తానని కిరణ్ హామీ ఇచ్చినట్టు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.  తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలో కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి క్వాలిటీస్ గానీ, ఇమేజ్ గానీ కిరణ్ కే ఉన్నాయని హైకమాడ్ డిసైడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ఉన్న కిరణ్ కు.... జగన్ కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉందని, జగన్ లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా సరైన నిర్ణయాలు తీసుకోగలడని అంటున్నారు. నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ మీద టీడీపీ నేతలు పెద్దఎత్తులో విమర్శలు చేసినప్పుడు... జగన్ ను వెనకేసుకొచ్చింది కిరణే కావడం విశేషం. ఇలా కీలకమైన అన్ని అంశాల్లోనూ జగన్ లోతులు తెలిసిన వ్యక్తి కిరణేనని అధిష్టానం భావిస్తోంది. ఆ నమ్మకంతోనే కిరణ్ ను కీలకమైన పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టు చెబుతున్నారు.

పెళ్లిపీట‌ల‌పై శివాలెత్తిన వ‌ధువు.. పెళ్లికొడుకు చెంప చెళ్లు.. ఎందుకంటే...

మంట‌పంలో పెళ్లి జ‌రుగుతోంది. పీట‌ల‌పై పెళ్లికొడుకు పెళ్లికూతురు కూర్చున్నారు. పంతులు పెళ్లి మంత్రాలు చ‌దువుతున్నారు. అంత‌లోనే అనూహ్య ఘ‌ట‌న‌. పెళ్లికూతురికి పిచ్చి కోపం వ‌చ్చింది. ముందు మంత్రాలు చ‌దువుతున్న‌ పంతులు చెంప చెళ్లుమ‌నిపించింది. ఆ త‌ర్వాత పెళ్లికొడుకు చెంప వాయించింది. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో పెళ్లికొచ్చిన వారంతా అవాక్క‌య్యారు. అస‌లేం జ‌రిగిందో తెలుసుకొని అంతా ఆమెకే స‌పోర్ట్ చేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. ఆ పెళ్లికూతురుకు మ‌రింత మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇంత‌కీ పెళ్లివేదిక‌పై ఆ పంతులు, పెళ్లికొడుకు చేసిన త‌ప్పేంటి? ఆ వ‌ధువుకు అంత కోపం ఎందుకొచ్చింది? ఆ ఇద్ద‌రి చెంప‌లు ఎందుకు చెళ్లుమ‌నిపించింది? పెళ్లిమండపంలో వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉన్నారు. వారిచుట్టూ బంధువులు ఉన్నారు. పంతులు మంత్రాలు చ‌దువుతున్నారు. ఈ తంతు జ‌రుగుతుంటే వ‌ధువుకు ఏదో ఘాటైన‌ వాస‌న వ‌చ్చింది. ఏంటా అని కాస్త ఫోక‌స్ చేస్తే.. పంతులు గారు పొగాకు న‌ములుతున్నార‌ని గుర్తించింది. అంతే. ఆమె కోపం న‌షాళానికి పాకింది. ఫ‌ట్ మ‌నీ పంతులు చెంప వాయించింది. పెళ్లి చేయాల్సినోడివి ఇలా పొగాకు తిన‌డ‌మేంటంటూ ఇంకో రెండు గ‌ట్టిగా త‌గిలించ‌బోయింది. అంత‌లోనే ఆ పంతులు తేరుకున్నారు. నేనొక్క‌డినే గుల్కా తిన‌డం లేదు.. పెళ్లికొడుకు కూడా తింటున్నాడంటూ అత‌ని వైపు చూపించాడు. ఇంకేముంది. పెళ్లికొడుకు ప‌ని ఫ‌స‌క్‌. పంతులు గుట్కా తింటేనే ఒళ్లు మండిన ఆమెకు.. ఇక త‌న‌కు కాబోయే మొగుడు పెళ్లిపీట‌ల‌పైనే గుట్కా తింటున్నాడంటే ఊరుకుంటుందా? మ‌రింత ఆవేశంతో ఊగిపోయింది. ప‌క్క‌నున్న పెళ్లికొడుకును.. గుట్కా తింటావా అంటూ ట‌పీ ట‌పీ మ‌ని చెంప‌పై కొట్టింది. గుట్కా ఊంచేయ‌మంటూ గ‌ట్టిగా అదిరించింది. దెబ్బ‌కు ద‌డుసుకున్నాడు ఆ వ‌రుడు. భ‌యం భ‌యంగా పైకి లేచి.. తుప్ తుప్ మ‌ని గుట్కాను ఊంచేశాడు. ఆ వ‌రుడు భ‌యంతో వ‌ణికిపోవ‌డం చూసి చుట్టూ ఉన్న వారంతా తెగ న‌వ్వేశారు. పెళ్లికూతురు మాత్రం పీట‌ల‌పై కూర్చొని అంతే కోపంతో.. క‌ర్రెళ్ల చేస్తూ ఉండిపోయింది. ఆ తతంగం అంతా అక్క‌డున్న‌వారు వీడియో తీయ‌గా.. అది సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికూతురు చేసిన ప‌నికి అంతా ప్ర‌శంసిస్తున్నారు. పెళ్లిపీట‌ల‌పైనే గుల్కా తింటున్న పెళ్లికొడుకును కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.   

రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధి.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో అధికారులదే రాజ్యం!

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చారు. వ‌చ్చాక ఇక అర‌చ‌క‌మంటే ఏంటో చూపిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ప‌ప్పుబెల్లాలు పంచుతూ.. త‌న మ‌నుషుల‌కు మైన్లు, ఇసుక‌రీచులు దోచిపెడుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌ను విజ‌య‌సాయిరెడ్డికి రాసిచ్చేశారు. ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్తే.. కేసులు, అరెస్టుల‌తో నిర్బంధిస్తున్నారు. గుప్పెడు మ‌నుషుల‌ను సెలెక్ట్ చేసుకొని.. స‌ర్వం వారికే క‌ట్ట‌బెడుతున్నారు. అందుకే, అధికారులు సైతం ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా ఆ కొంద‌రు చెప్పిన‌ట్టే న‌డుచుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర రీజియ‌న్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. విజ‌య‌సాయి చెబితేనే  ఏ ప‌నైనా చేస్తున్నార‌ట‌. ఇక సీమ‌లో మంత్రి పెద్దారెడ్డిదే రాజ్యం. అందుకే దిగువ స్థాయి వైసీపీ నాయ‌కులూ జ‌గ‌న‌న్న పాల‌న‌కు బ‌లిప‌శువులు అవుతున్నారు. అధికార పార్టీ అనే పేరే కానీ.. అధికారులు సైతం త‌మ మాట వినక‌పోయేస‌రికి ప‌రువు పోయి అన్నీమూసుకొని ప‌డుంటున్నార‌ని అంటున్నారు.  తాజాగా, గుంటూరు కార్పొరేష‌న్ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆక్రమణల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరినే టార్గెట్ చేస్తూ పని చేస్తున్నారని మండిప‌డ్డారు. అధికారుల తీరుతో పలువురు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ప్ర‌త్య‌ర్థులే టార్గెట్‌గా కూల్చివేత‌ల హంగామా ఇన్నాళ్లూ విశాఖ‌లోనే చూశాం. ఎంపీ విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో జీవీఎమ్‌సీ అధికారులు టీడీపీ నేత‌ల ఆస్తుల‌ను అర్థ‌రాత్రి కూల్చేసిన ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇప్పుడా క‌ల్చ‌ర్ గుంటూరుకు సైతం పాకిన‌ట్టుంది. ప్ర‌తిప‌క్షాల‌నే కాదు స్వ‌ప‌క్షం ప్ర‌త్య‌ర్థుల‌నూ టార్గెట్ చేస్తూ అధికారుల అండ‌తో కూల్చివేత‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డం ఆస‌క్తిక‌రం. 

సురేఖ సై అంటే రేవంత్ స్కెచ్ పారినట్టే.. గులాబీ బాస్ కు గుబులే? 

పీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి... హుజూరాబాద్ లో సైతం దిమ్మతిరిగిపోయే భారీ స్కెచ్ కు రూపకల్పన చేశారు. కులాల ఈక్వేషన్లతో గెలుపును ఖాయం చేసుకునే సులభమైన మార్గంలో పయనిస్తున్న కేసీఆర్ కు.. రేవంత్ కూడా అదే దారిలో పయనించి బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. ఫలితంగా... ఇప్పటివరకూ ఈటల గెలుపు ఖాయం అన్న అభిప్రాయాలు స్థానికంగా చెలామణిలో ఉండగా... కొండా సురేఖ రూపంలో రేవంత్ వేసే ఎత్తుతో టీఆర్ఎస్ కు మరింత భారీ గండి పడటం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఒప్పిస్తే రెండు బలమైన బీసీ సామాజికవర్గాల ఓట్లు కచ్చితంగా వన్ సైడ్ అవుతాయన్న అంచనాలున్నాయి. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి సామాజికవర్గం కాగా... ఆమె భ‌ర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజికర్గానికి చెందిన నాయకుడు. ఇవి రెండూ కూడా బీసీల్లో బలమైనవే కావడం గమనించాల్సిన అంశం. ఈ రెండు సామాజికవ‌ర్గాలకు కలిపి హుజూరాబాద్ లో యాబై వేల‌ పైచిలుకు ఓట‌ర్లు ఉండ‌టంతో ఆ రెండు వర్గాల ప్రజలనూ ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని రేవంత్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. స‌హ‌జంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే దూకుడు, కొండా దంపతుల‌కు ఉండే ఆర్ధిక వ‌నరులు, టీఆర్ఎస్ నుంచి కొండా దంప‌తులు అవ‌మాన భారంతో బ‌య‌టికి వ‌చ్చారనే సెంటిమెంట్... ఇలా అనేకమైన కీలకాంశాలు కాంగ్రెస్ గెలుపుకు తప్పకుండా దోహదడతాయని రేవంత్ భావిస్తున్నారు.  అటు కేసీఆర్... దాదాపు 45 వేల ఎస్సీ ఓట్లను టార్గెట్ చేసి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు కలిపి మొత్తం 1500 కోట్లు విడుదల కూడా చేశారు. పలువురు లబ్ధిదారులను గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేశారు. దీంతో ఎస్సీల ఓట్లు కచ్చితంగా పడతాయని, గెలుపుకు మినిమమ్ గ్యారెంటీ ఎస్సీల ఓట్లేనని కేసీఆర్ అండ్ కో ధీమాగా ఉంది. అయితే రేవంత్ వేసే స్కెచ్ కు కొండా ఒప్పుకుంటే పద్మశాలి, మున్నూరుకాపు ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశాలుంటాయని ఆశిస్తున్నారు. దళితబంధుకు సమాంతరంగా బీసీ బంధు, ప్రజాబంధు, వివిధ కులాలవారీగా బంధు పథకాలకోసం డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో రేవంత్ వ్యూహం కచ్చితంగా ఎంతోకొంత వర్కవుట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   కౌశిక్ రెడ్డి నమ్మించి కాంగ్రెస్ ను నట్టేట ముంచే ప్రయత్నం చేశాడు కాబట్టి... ఆయన్ని జాయిన్ చేసుకున్న కేసీఆర్ కు అంతకుమించిన నష్టం చేసి చూపించాలని రేవంత్ కసిగా ఉన్నారు. అందుకే ఫైర్ బ్రాండ్ గా పేరున్న సురేఖతో పోటీ కోసం మంతనాలు సాగిస్తున్నారని, ఆమె కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నా కూడా... కేసీఆర్ కు తగిన గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో పోటీకి మొగ్గు చూపే అవకాశం ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొండా మురళి దంపతులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే రాజకీయంగా ఎంతో బలంగా ఎదిగారు. సురేఖ గతంలో శాయంపేట, ప‌ర‌కాల నియోజకవర్గం నుంచి, వ‌రంగ‌ల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా హుజూరాబాద్ తో క‌లిసే ఉండడం విశేషం. 2008లో హ‌న్మ‌కొండ పార్ల‌మెంట్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన అనుభ‌వం కొండా సురేఖ‌కు ఉంది. అప్పుడు క‌మ‌లాపూర్ అసెంబ్లీ హ‌న్మ‌కొండ పార్లమెంట్ ప‌రిధిలోనే ఉండేది. ఇక పాత వ‌రంగ‌ల్ లోనూ చుట్టు ప‌క్క‌ల కూడా కొండా దంప‌తుల‌కు సొంతంగా అభిమానులు, బలమైన క్యాడ‌ర్ కూడా ఉంది.  అయితే ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డం ద్వారా ఇటు ప‌ర‌కాల‌, అటు వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని కొండా దంప‌తులు ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో వ‌రంగ‌ల్ లో పోటీ చేసి గెలిచినా కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల క్యాడ‌ర్ పూర్తిగా చెల్లాచెదుర‌ై మ‌ళ్లీ కొండా ప‌ర‌కాల రాదనే ప్ర‌చారం వ‌ల్ల ప‌ట్టు కోల్పాయ‌మని కొండా దంపతులు భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ నియోజ‌వ‌ర్గాల్లో కూడా త‌మ క్యాడ‌ర్ ను కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఆలోచ‌న‌ కూడా చేస్తున్నట్టు సమాచారం. కానీ హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, హుజూరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ల‌తో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌డానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్న‌ట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇంత‌క‌న్నా బంప‌ర్ ఆఫ‌ర్ కాంగ్రెస్ నుంచి ఇంకేముంటుంద‌ని రేవంత్ చెప్ప‌డంతో హుజూరాబాద్ లో పోటీ చేసే విష‌యంపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారు పోటీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. రెడ్ సిగ్నల్ వేస్తారా అన్నది తేలాలంటే ఇంకాస్త టైమ్ పడుతుందంటున్నారు.  ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌లు, స‌భ‌ల ద్వారా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతుండటం, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ను అభ్య‌ర్ధిగా నిర్ణ‌యించి ప్ర‌చారం చేస్తుండంతో వెంట‌నే కాంగ్రెస్ కూడా అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సిన అవసరం ఏర్ప‌డింది. మ‌రి రేవంత్ కొండా దంపతుల్ని ఒప్పిస్తారా... సురేఖ ధైర్యం చేస్తారా అనేది చూడాలి.

వాలంటీర్లా.. బానిసలా? జగనన్న గొప్పలు చెప్పుకునేది ఇందుకేనా?

ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ  వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాలంటరీ వ్యవస్థతో బాపూజీ కలలను సాకారం చేశామంటూ  కోట్లాది రూపాయలు కుమ్మరించి దేశమంతా ప్రచారం చేసుకున్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధి.. స‌మాజ సేవ‌కులుగా ప‌నిచేయాల‌న్న మ‌హోన్న‌త లక్ష్యంతో వ‌లంటీర్ వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. అంతేకాదు త‌మ వేత‌నాల‌ను పెంచాల‌న్న వాలంటీర్ల డిమాండ్ తో వారంద‌రికీ లేఖ‌లు రాసిన జ‌గ‌న్‌.. వారి సేవ‌ల‌ను ఆకాశానికెత్తారు. వారిది కేవ‌లం సేవేన‌ని, వారికి ఇచ్చేది గౌర‌వ వేత‌నమేన‌ని ప్ర‌క‌టించి వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఉన్న‌తిని మ‌రింత‌గా పెంచారు.  సీఎం జగన్ తీరు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో అసలు సంగతి మరోలా ఉంది. ఏపీలో వాలంటీర్లపై అధికార పార్టీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు.  తమకు సెల్యూట్ కొట్టలేదని కొందరు, తాము చెప్పినట్లు చేయడం లేదని మరికొందరు వాలంటీర్లపై ప్రతాపం చూపిస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊస్టింగ్ అంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాల‌కు వేగ‌లేక చాలా మంది  వాలంటీర్లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. ఇది భరించలేక కొందరు ఉద్యోగం మానేశారు కూడా. కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ప్రజా ప్రతినిధులను చూస్తూ తాము ఏం తక్కువ అనుకున్నారో ఏమో ఉన్నతాధికారులు కూడా వాలంటీర్లపై ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు.  ఇటీవలే  అనంత‌పురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే వాలంటీర్ల అవినీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే.. తాజాగా గుంటూరు జిల్లాలో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ లేడీ వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట మునిసిపాలిటీలో వార్డు వాలంటీర్ గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌పై అక్క‌డి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ రామ‌చంద్రారెడ్డి చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అంతేకాకుండా మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఐదు నిమిషాలు లోప‌లేసి ఉతికిస్తానంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌ర‌స‌రావుపేట‌లోని నిమ్మ‌తోట ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మ‌హిళ వాలంటీర్ గా ప‌నిచేస్తోంది. విధి నిర్వ‌హ‌ణ‌లో మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్న తొలి న‌లుగురు వ‌లంటీర్ల‌లోనూ ఆమె స్థానం సంపాదించింది. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కార‌ణంగా ఆమె ఇటీవ‌ల కొన్ని రోజుల పాటు సెల‌వు పెట్టిందట‌. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ.. వార్డు స‌చివాలయంలోని అడ్మిన్ ఆమెపై ప‌గ‌బ‌ట్టేశారు. విధులు స‌రిగా నిర్వ‌ర్తించ‌డం లేద‌ని నిత్యం నిందిస్తూనే ఉన్నాడు. అయినా ఆ వేధింపుల‌ను భ‌రిస్తూనే ప‌నిచేస్తున్న ఆమెకు.. ఓ మ‌ధ్యాహ్నం క‌మిష‌న‌ర్ రామ‌చంద్రారెడ్డి నుంచి ఫోన్ వ‌చ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంట‌నే క‌మిష‌న‌ర్ ఆమెను బెదిరింపుల‌పై బెదిరింపుల‌కు దిగుతూ ఎక్క‌డున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? ప‌నిచేస్తున్నావా?.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యం క‌దా.. ఇంటిలో ఉన్న త‌న పిల్ల‌ల‌కు భోజ‌నం పెడ‌దామ‌ని ఇంటికొచ్చాను సార్ అంటూ ఆమె స‌మాధానం చెప్పినా.. ఆయ‌న‌గారు శాంతించ‌లేదు. ఉన్న‌ప‌ళంగా వార్డులోకి రావాలంటూ హుకుం జారీ చేశారు. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వార్డులోకి వెళ్లిన ఆమెకు క‌మిష‌న‌ర్ క‌నిపించ‌లేదు. సార్ వార్డులోకి వ‌చ్చాను అంటూ ఆమె కాల్ చేస్తే.. క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి రావాలంటూ చెప్పారు. ఆమె ప‌రుగు ప‌రుగున కార్యాల‌యానికి వెళ్ల‌గా.. అక్క‌డా క‌మిష‌న‌ర్ లేర‌ట‌. ఆమె అక్క‌డికి చేరుకున్న అర‌గంట‌కు అక్క‌డికి వ‌చ్చిన క‌మిష‌న‌క‌ర్‌.. ఆమెపై త‌న‌దైన దురహంకారంతో విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డున్నావ్‌? ఇలా చేస్తే 5 నిమిషాల్లో లోప‌లేయించి ఉతికిస్తా.. అంటూ చిందులు తొక్కారు. తానేం చేశానంటూ ఆ లేడీ వ‌లంటీర్ వివ‌ర‌ణ ఇచ్చే యత్నం చేయ‌గా.. ముఖానికి ఉన్న మాస్కును విసురుగా తీస్తూ ఆమెపైకి దాడికి వ‌చ్చేలా ఉరుమిఉరిమి చూసి గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తూ.. ఇక్క‌డ అవ‌స‌రం లేదు అంటూ వెళ్లిపోయారు. ఈ మొత్తం దృశ్యాల‌ను ఆమె ప‌క్కనే ఉన్న ఓ వ్య‌క్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి  సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. బాధితురాలు కూడా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏక‌రువు పెడుతూ మ‌రో వీడియోను విడుద‌ల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి. వాలంటీర్లపై అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటున్నది ఇందుకేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాలంటీర్లను బానిసలుగా చూడటమే గొప్పతనమా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వారిది కేవ‌లం సేవేన‌ని, వారికి ఇచ్చేది గౌర‌వ వేత‌నమేన‌ని ప్రకటించిన ముఖ్యమంత్రి.. వాళ్లను వేధిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఎంందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.

చిక్కులో ఏపీ హోంమంత్రి! పదవి ఊస్టింగేనా? 

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత చిక్కుల్లో పడ్డారు. షెడ్యూల్డ్‌ కులాల హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆమెపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లో విచారణ జరపాలని గుంటూరు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను ఆదేశించింది. జాతీయ కమిషన్ ఆదేశాలతో జరుగుతున్న విచారణలో సుచరితకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఆమె పదవికి ఎసరు వచ్చినట్లే. గతంలో ఇలాంటి కేసుల్లో చాలా మంది తమ పదవులు కోల్పోయారు. అందుకే హోంమంత్రి మేకతోటి సుచరితపై విచారణకు ఆదేశించడంతో వైసీపీలో కలవరం మొదలైందని చెబుతున్నారు.  కేసు  వివరాల్లోకి వెళితే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మేకతోటి సుచరిత.. తాను జీసస్ ను ప్రార్ధిస్తానని చెప్పారు. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ జాతీయ ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదుచేసింది. సుచరిత మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను జతచేసి జూన్‌లో ఫిర్యాదు చేసింది. సుచరిత ఎస్సీ కాదని ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నట్లు ఫోరం ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్.. మేకతోటి సుచరితపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతం వాళ్ళు క్రిష్టియానిటి లోకి మారినా వెంటనే వాళ్ళు బీసీ క్యాటరిగిలోకి మారిపోతారు. రిజర్వుడు క్యాటగిరిలోని వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటే అప్పటివరకు ఉన్న తమ మతాన్ని వదులుకోవాల్సిందే. క్రిస్తియానిటిలోకి మారిన తర్వాత కూడా అంతకుముందున్న రిజర్వేషన్ ఫలాలను  ఇంకా అందుకుంటుంటే అది తప్పవుతుంది. ఈ విషయంలోనే సుచరితపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. మాజీ కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై సివిల్‌ సర్వీసెస్‌ కమిషన్‌కు ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులధ్రువీకరణ విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.  గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి వివాదమే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాయకరావుపేట ఎస్సీ ఎంఎల్ఏ  వంగలపూడి అనితను చంద్రబాబునాయుడు మెంబర్ గా నియమించారు. ఆమె నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆమె క్రిస్తియన్ అనే ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. తాను ఎప్పుడూ జీసస్ నే ప్రారధిస్తుంటానని A ఇంటర్వ్యూల్లో అనిత చెప్పున్నారు. చెప్పటమే కాదు తన బ్యాగులో నుండి బైబిల్ ను తీసి ఇంటర్వ్యూలో చూపించారు.  ఆ విడియోను వైరల్ చేశారు. జీసస్ ను ప్రార్థించే వ్యక్తిని టీటీడీ ట్రస్టు బోర్డులో చంద్రబాబు మెంబర్ గా ఎలా నియమిస్తారని హిందూ సంఘాలు ప్రశ్నించాయి. దీంతో వంగలపూడి అనిత టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా తప్పించారు అప్పటి సీఎం చంద్రబాబు.  అనిత విషయంలో గోల చేసిన హిందూ సంఘాలు మేకతోటి సుచరిత విషయంలోనూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఆధారాలు సమర్పించబోతున్నాయి. దీంతోహోంమంత్రి మేకతోటి సుచరిత పదవికి గండం వచ్చిందనే చర్చ జరుగుతోంది.  

అటు మల్లారెడ్డి.. ఇటు మోత్కుపల్లి! రేవంత్ పైకి పాత మిత్రులను ఉసిగొల్పుతున్నారా? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. గతంలో తమపై రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసినా గులాబీ లీడర్లు స్పందించేవారు కాదు. కాని తాజాగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా వరుసగా టీఆర్ఎస్ నేతలు బయటికి వస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మరోసారి  రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు  మంత్రి మల్లారెడ్డి. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు.  తెలుగు దేశం పార్టీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారని చెప్పారు. అప్పటి నుంచి  రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆరోపించారు.   తనపై రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపైనా స్పందించారు మల్లారెడ్డి. 2012లో మెడికల్ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించినట్లుతెలిపారు. తన కాలేజీ హాస్టల్స్ లో దాదాపు 7వేల మంది విద్యార్థినులు ఉంటున్నారన్నారు మల్లారెడ్డి. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి రేవంత్ రెడ్డి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని మల్లారెడ్డి చెప్పారు.  మరోవైపు రేవంత్ రెడ్డికి పోటీగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఒక రోజు దీక్షను చేపట్టబోతున్నారు నర్సింహులు. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి ఇటీవలే ఆ పార్టీకి రిజైన్ చేశారు. కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధును స్వాగతిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను పొగుడుతున్నారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా నర్సింహులు దీక్షకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మోత్కుపల్లి అన్నారు. దళితుల సాధికారత కోసం సభలు, సమావేశాలను నిర్వహించడం, గిరిజన ఆత్మగౌరవ దీక్షలను నిర్వహించడం వంటివి చేస్తుండటం తనకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు.  పుట్టుకతోనే దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి.. ఆయన స్వగ్రామంలో దళితుల మధ్య భోజనాలు, నిద్రలు చేయగలరా? అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ చెప్పగలరా? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం చాలా గొప్పదని... అలాంటి పథకానికి తూట్లు పొడిచేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ముందు వరుసలో నిలుచోబెట్టి రాజకీయాలు చేయడం, దళితుల మీద ప్రేమను ఒలకబోస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రోజున బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షను చేపట్టనున్నానని చెప్పారు. ఉదయం లిబర్టీ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాకు నివాళి అర్పించి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి దీక్షలో కూర్చుంటానని తెలిపారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు అందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన వారే. అందుకే తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిపైకి పాత టీడీపీ నేతలను సీఎం కేసీఆర్ ఉసిగొల్పుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. 

ప్రజా సంగ్రామ యాత్ర షురూ.. కేసీఆర్‌పై సంగ్రామానికి బండి సంజయ్ అడుగులు..

తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పున‌కు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో శ్రీకారం. ప్ర‌జ‌ల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర. ఎంఐఎం ఆగ‌డాల‌ను బ‌రించ‌లేక పాతబస్తీని వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ పిలుపునిచ్చారు. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి సాక్షిగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు బండి సంజ‌య్‌. ఈ సందర్భంగా చార్మినార్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.  ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్‌ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఒక్కో నిరుద్యోగికి లక్ష చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం బాకీ ఉంది. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్‌ అటకెక్కించారు. ‘దళిత బంధు’ పేరుతో దళితులను.. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారు’’ అని బండి సంజయ్ మండిప‌డ్డారు. ఎస్టీలకు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.  ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో పాల్గొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి సైతం కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలి. అక్రమాలు, అవినీతి, అప్పుల పాలన పోవాలి. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలి. టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమం ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలపై పాలన సాగిస్తోంది. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోంది’’ అని కిషన్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ చుగ్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని కె.లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కారు, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని ల‌క్ష్మ‌న్ ఆరోపించారు.     

బండి సంజ‌య్ స‌భ‌తో ఉద్రిక్త‌త‌.. బీజేపీ వ‌ర్సెస్ పోలీస్‌..

చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం నుంచి ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. అమ్మ‌వారికి పూజ‌లు చేసి, ఆశీర్వాదం తీసుకొని పాద‌యాత్ర ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌. యాత్ర ఆరంభం సంద‌ర్భంగా చార్మినార్ ద‌గ్గ‌ర నిర్వ‌హించిన స‌భ‌లో ఉద్రిక్త‌త త‌లెత్తింది. చార్మినార్ ద‌గ్గ‌ర హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కెమెరాను పోలీసులు అడ్డుకున్నారు. డ్రోన్ కెమెరాల‌కు ప‌ర్మిష‌న్ లేదంటూ అడ్డుకోవ‌డంతో వివాదం త‌లెత్తింది. డ్రోన్ కెమెరాను తీసుకెళుతున్న‌ పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కేడ‌ర్‌, పోలీసుల మ‌ధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటు చేసుకుంది.  ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జ‌రగ‌డంతో.. బండి సంజయ్ పోలీసుల‌కు ప‌లుమార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఉప‌యోగం లేకుండా పోయింది. పోలీసులు డ్రోన్ కెమెరాను స్టేష‌న్‌కు త‌ర‌లించడంతో బీజేపీ నాయ‌కులు ఖాకీల‌తో మంత‌నాలు ప్రారంభించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో బీజేపీ నేత మంత్రి శ్రీనివాసులు మాట్లాడారు. చార్మినార్ పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా గుమికూడ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.