యూపీ సీఎం యోగిపై పోటీ చేస్తానన్న మాజీ ఐపీఎస్ అరెస్ట్
posted on Aug 28, 2021 @ 10:56AM
ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్ను యూపీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్కు లక్నో కోర్టు వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది.
బీఎస్పీ ఎంపీ అతుల్రాయ్ తనపై అత్యాచారం చేశాడంటూ.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆగస్టు 16న 24 ఏండ్ల యువతి తన స్నేహితుడితో కలిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. యువతీ యువకులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు .24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.హిస్టరీ షీటర్ (నేర చరిత కలిగిన వ్యక్తి) అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించింది.
ఆత్మహత్యయత్నం చేసిన యువతి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. బాధితురాలిపై అపవాదు మోపి, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడంలో అమితాబ్ ఠాకూర్ పాత్ర ఉందని తేల్చింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు అమితాబ్ ఠాకూర్ను అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్ తన విధుల పట్ల నిబద్ధతతో పని చేయడం లేదని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనను తొలగించింది. అనంతరం తాను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తానని అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో ఠాకూర్తో కేంద్రం ఇటీవల నిర్బంధ పదవీ విరమణ చేయించింది. తానో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు అమితాబ్ ఠాకూర్ శుక్రవారం ఉదయమే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టు యూపీలో సంచలనంగా మారింది.